ఎం కోటేశ్వరరావు
దేశంలో ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశలకు సిద్ధం అవుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమబెంగాల్లో నాలుగు దశల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఓటర్లను అనేక చోట్ల అధికార తృణమూల్ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిపురలో తొలి దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గంలో వందలాది పోలింగ్ కేంద్రాలలో సిపిఎం ఏజంట్లను రాకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు, రిగ్గింగుకు పాల్పడ్డారు. రెండవ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారటంతో ఎన్నికల కమిషన్ మొత్తం నియోజకవర్గ పోలింగ్నే మరొక రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకరి అప్రజాస్వామిక చర్యల గురించి ఒకరు రోజూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బిజెపి, తృణమూల్ రెండూ ఒకే విధమైన చర్యలకు పాల్పడుతున్నాయి. దేశంలో బిజెపిని విమర్శించే పార్టీలు త్రిపుర గురించి మాట్లాడలేదు. అలాగే మమతాబెనర్జీని తమతో కలుపుకొని కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలు పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య ఖూనీ గురించి నోరెత్తటం లేదు. గతంలో సిపిఎ పాలనలో సైంటిఫిక్ రిగ్గింగ్ అంటూ అన్సైంటిఫిక్ వాదనలు, ప్రచారం చేసిన వారు ఇప్పుడు పల్లెత్తు మాట్లాడటం లేదంటే నాడు పని గట్టుకొని ప్రచారం చేసిన వారు తప్ప నిజమైన ప్రజాస్వామిక వాదులు కాదన్నది స్పష్టం. ఓటర్లను పోలింగ్ బూత్లకు రానివ్వలేదన్న విమర్శలు, ఆరోపణలు వామపక్ష ప్రభుత్వ హయాంలో రాలేదు.
పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానం కాదు. అసలు తమ ఓటు తాము వేసుకొనే స్చేచ్చను ఓటర్లకు ఇస్తారా అన్నది అసలు సమస్య. ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు-త ణమూల్ కండబలం మధ్య పోటీగా వుంది. మూడు దశల పోలింగ్లో వెల్లువెత్తిన ఆరోపణలు మిగిలిన నాలుగు దశల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. అభ్యర్ధులను ప్రచారం చేసుకోనివ్వరు,(స్ధానిక సంస్ధల్లో అయితే అసలు నామినేషన్లనే వేయనివ్వలేదు) అనుమానం వచ్చిన ఓటర్లను బూత్లకు రానివ్వరు, వచ్చిన వారు అధికార త ణమూల్కు ఓటేయలేదని అనుమానం వస్తే చావచితక కొడతారు అన్న విమర్శలు వచ్చాయి. అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి పడేవిధంగా, జాబితాలో వున్న వారి కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని, ఇలా రకరకాలుగా ఎన్నికల ఓటింగ్ యంత్రాల మీద విమర్శలు చేస్తున్న వారు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ పూర్వరంగంలో అక్కడ ఏ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా, ఓటర్లను కదిలించినా, వాస్తవాలను వివరించినా ఫలితం ఏమిటి, అసలు ఎన్నికలను బహిష్కరిస్తే పోలా అనే వారు వుండవచ్చు. అలా వూరందరికీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు మమతాబెనర్జీ అధికారానికి రావటానికి దోహదం చేసిన వారిలో వున్నారంటే వులిక్కిపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వారే వైఖరి తీసుకున్నారో తెలియదు. ఏ పిలుపు ఇచ్చినా పట్టించుకొనే వారు వుండరు.
అత్యవసర పరిస్ధితికి ముందు 1971లో కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేసింది. తాము విజయం సాధిస్తామన్న నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్నిచోట్లా సామూహిక రిగ్గింగ్కు పాల్పడింది. ఆ నాడు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేదు. కమ్యూనిస్టులనే కదా తొక్కేసింది అన్నట్లుగా వున్నాయి. తరువాత అదే కాంగ్రెస్ సిపిఎంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల(సిపిఐ ఆ నాడు కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు ఇస్తున్న కారణంగా దాన్ని మినహా) నేతలందరినీ అత్యవసర పరిస్ధితి పేరుతో జైల్లో పెట్టింది. ఇప్పుడు మమతాబెనర్జీ అకృత్యాలను విమర్శించని పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చుగానీ, ప్రజాస్వామిక ప్రక్రియకు తలపెట్టిన హాని గురించి ఎందుకు పట్టించుకోవు? అవి కూడా తమకు ప్రాబల్యం వున్న ప్రాంతాలలో అలాంటి పనులు చేసిన చరిత్ర కలిగినవే, వర్గ రీత్యా ఒకే తానులో ముక్కలు కనుకే అలా వ్యవహరిస్తున్నాయి.
పైన పేర్కొన్న పరిమితుల పూర్వరంగంలో అక్కడి ఎన్నికల తీరు తెన్నులను చూద్దాం. రాష్ట్రమంతటా అలాంటి పరిస్ధితి వున్నప్పటికీ అనేక చోట్ల తృణమూల్ను వ్యతిరేకించే శక్తులు కూడా వున్నాయి. కనుకనే వామపక్షాలు, ఇతరులకు ఆ మేరకైనా ఓట్లు వస్తున్నాయి. దేశమంతటినీ గతంలో ఆకర్షించిన నియోజకవర్గాలలో జాదవ్పూర్ ఒకటి.లోక్సభ స్పీకర్గా పని చేసిన సోమనాధ్ చటర్జీని ఓడించి మమతాబెనర్జీ జెయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ త ణమూల్ అభ్యర్ధిగా సినీ నటి మిమి చక్రవర్తి పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున కొల్కతా మాజీ మేయర్ వికాస్ రంజన్ భట్టాచార్య, ఇటీవల త ణమూల్ నుంచి వుద్వాసనకు గురైన మాజీ ఎంపీ అనుపమ్ హజ్రా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కొల్కతా నగరంలో కొంత భాగం, గ్రామీణ ప్రాంతాలతో నిండి వున్న ఈ నియోజకవర్గంలోని జాదవ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2011లో మినహా 1967 నుంచి సిపిఎం అభ్యర్దులే ఎన్నిక అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిపిఎం నే సుజన్ చక్రవర్తి ఎంఎల్ఏగా వున్నారు. త ణమూల్-సిపిఎం మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందనే అభిప్రాయం వెల్లడైంది. లాయర్ అయిన భట్టాచార్య నియోజకవర్గంలో అనేక కేసులలో ముఖ్యంగా వివిధ చిట్ఫండ్ మోసాల కేసుల్లో వందలాది మంది తరఫున ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వాదించి వారి సొమ్మును వెనక్కు ఇప్పించిన వుదంతాలు వున్నాయి. పోటీ తీవ్రంగా వున్నప్పటికీ రోజు రోజుకూ సులభం అవుతోందని భట్టాచార్య అంటున్నారు. రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియని సినీనటి మిమి గురించి అనేక మంది పెదవి విరుస్తున్నారు. సిపిఎం అభ్యర్ధి మంచి వాడైనప్పటికీ తగిన సంస్దాగత పట్టులేదని కొందరు అభిప్రాయపడ్డారు. 2011 ఎన్నికల్లో ఓటమి తరువాత సిపిఎంకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మార్పు కోసం ఓటు వేయాలని జనానికి వున్నప్పటికీ త ణమూల్ గూండాలు వారిని అనుమతించే అవకాశాలు లేవని ఓటర్లు భయపడుతున్నారని వికాస్ రంజన్ భట్టాచార్య అన్నారు.
మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కదా అన్న ప్రశ్నలకు బిజెపి అభ్యర్ధి హజ్రా మాట్లాడుతూ టిఎంసి అభ్యర్ధిని మిమి చక్రవర్తి ఎక్కడో జల్పాయిగురికి చెందిన వారు, ఆమెకూడా వెలుపలి వ్యక్తే కదా, అయినా నియోజకవర్గ ఓటర్లు బిజెపితోనే వున్నారు. త ణమూల్ నేరగాండ్లు, సంఘవ్యతిరేకశక్తులకు నిలయంగా మారినందునే తాను బిజెపిలో చేరానని, వారు నాపై బురద చల్లుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలోని భంగోర్ అసెంబ్లీ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్ రజాక్ మొల్లా ప్రస్తుతం మమతా మంత్రి వర్గ సభ్యుడు. గత రెండు సంవత్సరాలలో కావలసినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడీ మాజీ సిపిఎం నేత. ప్రస్తుతం త ణమూల్ అభ్యర్ధి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. చివరి దశలో పోలింగ్కు ఇంకా సమయం వుంది కనుక తరువాత రంగంలోకి వచ్చేది లేనిదీ తెలియదు. సింగూరులో పరిశ్రమలకు భూమి సేకరించటాన్ని వ్యతిరేకించిన త ణమూల్కు భంగోర్లో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే పరిస్ధితి ఎదురైంది. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను వ్యతిరేకించిన వారిపై 2017లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్ధానిక త ణమూల్ ఎంఎల్ఏగా గతంలో పనిచేసిన అరబుల్ ఇస్లాం తన అనుచరులతో బెదిరించి భూములు స్వాధీనం చేసుకున్నాడు. త ణమూల్ గూండాయిజానికి పేరుమోసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చిన భారీ మెజారిటీ త ణమూల్ గెలుపును నిర్ధేశించింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.
ఒక్క జాదవ్పూరే కాదు, ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ల అభీష్టం మేరకు ఓట్లు వేసుకొనే స్వేచ్చాపూరిత వాతావరణం లేదన్నది సర్వత్రా వెల్లడౌతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు త ణమూల్ ధన, కండబలాన్ని వుపయోగించి తన స్ధానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పుడేఇపుపడే కింది స్ధాయి క్యాడర్, సానుభూతి పరుల్లో భయం వదులుతున్న స్ధితిలో సిపిఎం, మొత్తంగా వామపక్ష సంఘటన తిరిగి తన మద్దతుదార్లను కూడగట్టుకొని పోయిన స్ధానాలను తిరిగి సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పన్నెండు సంవత్సరాల తరువాత నందిగ్రామ్లో సిపిఎం తన కార్యాలయాన్ని తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ పట్ల జనంలో తొలుగుతున్న భ్రమలు, ప్రతిఘటనకు ఇదొక సూచిక అయినప్పటికీ ఇంకా దాని గూండాయిజం ఏమాత్రం తగ్గలేదన్నది నాలుగు దశల ఎన్నికలు నిరూపించాయి. తాము ఇరవైకి పైగా స్ధానాలు సంపాదించగలమనే వూహల్లో బిజెపి నేతలు వున్నారు. గతంలో తాను సాధించిన వాటిని అయినా నిలబెట్టుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. త ణమూల్ కాంగ్రెస్-బిజెపి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటి మధ్య అంతర్గత ఒప్పందం వుందన్నది వామపక్షాల విమర్శ. త ణమూల్, బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలు గెలిచిన సీట్లలో పరస్పరం పోటీ నివారించుకోవాలని, ఆమేరకు కాంగ్రెస్ గెలిచిన సీట్లలో తాము పోటీ చేయబోమని, తమ స్ధానాల్లో అదే విధంగా స్పందించాలని సిపిఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ అందుకు అంగీకరించకుండా సిపిఎం గెలిచిన స్ధానాల్లో పోటీకి దిగింది. అయినప్పటికీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్ధానాలలో వామపక్ష సంఘటన పోటీ చేయకుండా 42కుగాను 38 చోట్లకే పరిమితం అయింది.
మాల్డా అంటే కాంగ్రెస్ కంచుకోట. ఏబిఏ ఘనీఖాన్ చౌదరి పాతికేండ్లకు పైగా ఎంపీగా వున్నారు. తరువాత ఆయన వారసులే ఎన్నిక అవుతున్నారు. 2006లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయనే వేస్తున్నట్లుగా ఓటర్ల వైఖరి వుంటుంది. ఘనీఖాన్ చౌదరి సోదరుడు మాల్డా దక్షిణంలో తిరిగి పోటీచేస్తుండగా సిపిఎం తన అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. మాల్డా వుత్తరం నుంచి గెలిచిన ఘనీఖాన్ మేనకోడలు జనవరిలో కాంగ్రెస్ నుంచి త ణమూల్కు ఫిరాయించారు. బిజెపిని ఓడించాలంటే త ణమూల్ పార్టీ అవసరమని దానిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఆమెపై ఘనీఖాన్ కుటుంబం నుంచే మరొకరు రంగంలో వున్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలో ముర్షిదాబాద్, జాంగీపూర్ నియోజకవర్గాలున్నాయి. జాంగీపూర్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండుసార్లు, తరువాత ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ రెండుసార్లు ఎన్నికయ్యారు. గత రెండు ఎన్నికలలో అభిజిత్ మెజారిటీ 2012లో 2,536, 2014లో 8,161 మాత్రమే. రెండు సార్లూ సిపిఎం అభ్యర్ధి రెండవ స్ధానంలో వచ్చారు.ఈ సారి కూడా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. ఈ నియోకవర్గంలో సిపిఎం 1977-1999 మధ్య ఏడుసార్లు గెలిచింది. మరోనియోజకవర్గం ముర్షిదాబాద్, సిపిఎం సిటింగ్ అభ్యర్ధి బద్రుద్దోజా ఖాన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రముఖుడైన హుమాయున్ కబీర్ బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధి అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్, త ణమూల్ పోటీ చేస్తున్నాయి. మరో నియోజకవర్గం బెరహంపూర్ ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్కు సిపిఎం మద్దతు ఇస్తున్నది. అధిర్ అనుచరుడిగా వున్న అపూర్వ సర్కార్ కాంగ్రెస్ నుంచి త ణమూల్లో చేరి అభ్యర్ధి అయ్యారు.
బిజెపి మతతత్వ రాజకీయాల ప్రయోగ కేంద్రంగా మారిన అసన్సోల్,దుర్గాపూర్, బర్ద్వాన్ ప్రాంతంలో బిజెపి అసన్సోల్ నియోజకవర్గంలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతుల పేర్లతో ప్రదర్శనలు జరిపి బలపడింది. త ణమూల్ కాంగ్రెస్లోని ముఠాతగాదాల కారణంగా ఒక వర్గం మద్దతు ఇచ్చిన కారణంగానే ఇక్కడ బిజెపి అభ్యర్ధి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న బాబూలాల్ సుప్రియో విజయం సాధించారు. ఈసారి రెండు వర్గాల మధ్య రాజీగా సినీ నటి మున్మున్ సేన్ రంగ ప్రవేశం చేశారు. బిజెపి మరో నియోజకవర్గం డార్జిలింగ్. ఇక్కడ ఎస్ఎస్ ఆహ్లూవాలియా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఇక్కడ కూడా మత ప్రాతిపదికన చీల్చేందుకు బిజెపి ప్రయత్నించింది. గత లోక్సభ ఎన్నికల్లో 17.02శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పదిశాతానికి పడిపోయింది. అయినప్పటికీ తానే త ణమూల్కు ప్రత్యామ్నాయం అని సగం సీట్లు గెలుస్తామని మీడియా ప్రచారదన్నుతో చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం సీట్లు
త ణమూల్ కాంగ్రెస్ 39.05 34
వామపక్ష సంఘటన 29.71 2
బిజెపి 17.02 2
కాంగ్రెస్ 9.58 4
2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం, సీట్లు
త ణమూల్ 44.9 211
సిపిఎం 19.8 26
కాంగ్రెస్ 12.3 44
బిజెపి 10.2 3
ఫార్వర్డ్బ్లాక్ 2.8 2
సిపిఐ 1.5 1
ఆర్ఎస్పి 1.7 3
జెఎంఎం 0.5 3
ఇండి ్ 0 1