• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Donald Trump India tour

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కోడి కత్తి కాదు తెలుగువారికి డోనాల్డ్‌ ట్రంప్‌ ” కోడి కాలు, పాల ” కేసులు ముఖ్యం ?

23 Sunday Feb 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Dairy Farmers, Donald Trump India tour, Poultry Industry

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus

ఎం కోటేశ్వరరావు
కేంద్రంతో సంబంధం, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు ఏమైందో మీకు తెలుసా ! నాకూ తెలియదు, అలాంటి సంచలనాత్మక కేసులు ఎన్నో మరుగునపడ్డాయి, దాని వలన రాజకీయ వ్యాపారులకు తప్ప జనానికి నష్టం లేదు. కానీ కోడి కాలు, పాల కేసు అలాంటిది కాదు. రెండు రాష్ట్రాల్లోని పాడి, కోళ్ల పరిశ్రమను, వాటి మీద ఆధారపడిన వారినీ దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వచ్చిన ఆహ్వానాన్ని, సంతోషంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విందులో కోడి కాలు, పెరుగు లేకుండా ఉండదు. విందును ఆరగించబోయే ముందు తనకు వడ్డించి కోడి కాలు, పెరుగు స్వదేశీయా, అమెరికాదా అని కెసిఆర్‌ కనీసం సందేహిస్తారా ? అందని ద్రాక్ష పుల్లన అలాగే ఆహ్వానం రాలేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డికి అది గొప్ప విందేమీ కాదు. కనీసం ఆయన అయినా కోడి కత్తి కేసుతో పాటు కోడి కాలు, పాల కేసులను పట్టించుకుంటారా ?
ఒకటి కొంటే రెండు ఉచితంగా ఇస్తాం అన్నట్లుగా అమెరికా సర్కార్‌ మన దేశంతో ”కోడి కాళ్ల ” బేరం ఆడుతోంది. లేకుంటే మన కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తోంది. గతంలో మా కాళ్లు మాకున్నాయి మీ కాళ్లు అక్కర లేదంటూ మన సర్కార్‌ నిషేధం విధించింది. అప్పటి నుంచి వత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు విజయవంతమైనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు అంటూ జపం చేసిన కాషాయ స్వదేశీ జాగరణ మంచ్‌ మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏమైందో తెలియదు. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 17 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులులో ఉంది. మన దేశంతో ఉన్న ఆ వాణిజ్య లోటును అమెరికా పూడ్చుకోవాలంటే తనకు అవసరం లేని వాటిని మన మీద రుద్ది లబ్దిపొందాలని చూస్తోంది.
అమెరికా జనం కోడి కాళ్లను తినరు. అందువలన అక్కడి కోల్ట్‌ స్టోరేజీల్లో అవి పెద్ద ఎత్తున నిల్వలుండిపోయాయి. వాటిని మన మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తే మన దేశంలోని వేలాది కోళ్ల ఫారాలు మూతపడతాయి. వాటితో పాటు అనుబంధ రంగాలలో కనీసం 40లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ కారణంగానే గత పాలకులు వాటి మీద నిషేధం విధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగలించుకున్న నరేంద్రమోడీ ట్రంప్‌ను పడేయాల్సింది పోయి తానే పడిపోయారు. కోడి కాళ్ల దిగుమతులపై ఉన్న పన్ను మొత్తాన్ని వంద నుంచి 25శాతానికి తగ్గించి దిగుమతులకు వీలు కల్పిస్తామని ఆమోదం తెలపగా, కాదు పదిశాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ తెలిపింది. ఇది నిజానికి స్పందన తెలుసుకొనేందుకు వదిలిన లీకు వార్త తప్ప మరొకటి కాదు. దీని మీద మన దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో అబ్బే అలాంటిదేమీ లేని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ట్రంప్‌ రాక సందర్భంగా లేదా తరువాత అయినా దానికి అంగీకారం తెలపవచ్చని భావిస్తున్నారు.
కోడి కాళ్ల దిగుమతులపై అమెరికా కోరిన విధంగా పన్ను తగ్గిస్తే అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. బ్రెజిల్‌ వంటి ఇతర అనేక దేశాల నుంచి చౌకగా దిగుమతులు వెల్లువెత్తుతాయి. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయా రైతులు కూడా ప్రభావితం అవుతారు. నాటు కోళ్లను పెంచే సామాన్య గృహస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా అమెరికా మన మీద తెస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా 2007 మన ప్రభుత్వం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫ్లూ సమస్య తొలగిన తరువాత కూడా అది కొనసాగింది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది.2014లో అమెరికా కేసు గెలిచింది. 2017లో కోడి కాళ్ల దిగుమతులను మోడీ సర్కార్‌ అనుమతించింది. మన దేశమే కోళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాంటిది అమెరికా నుంచి దిగుమతులను పరిశ్రమ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రస్తుతం వందశాతం పన్ను ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కోడి కాళ్ల దిగుమతుల కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. అమెరికా తన వద్ద ఉన్న నిల్వలను వదిలించుకొనేందుకు కారుచౌకగా ఎగుమతులు చేసేందుకు పూనుకుంది. మన దేశంలో కోడి కాళ్లు ఆయా సీజన్లనుబట్టి కిలో రూ.150 నుంచి 250 వరకు ధరలు పలుకుతున్నాయి. అమెరికా నుంచి పది హేను రూపాయలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అక్కడి వాస్తవ ధరకంటే తక్కువ చూపి సబ్సిడీలతో ఎగుమతులు చేస్తారు. అందువలన మన దేశం దిగుమతి పన్ను వంద కాదు మూడు వందల శాతం వేసినా మన మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో కోడి కాళ్ల సగటు బరువు 70 నుంచి 90 గ్రాములుంటాయి. అదే అమెరికా కాళ్ల సగటు 160 నుంచి 180 గ్రాములు.
ఇక పాలు, పాల ఉత్పత్తుల విషయానికి వస్తే అమెరికా గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి దిగిన కారణంగా అమెరికా ఉత్పత్తుల మీద చైనా 20శాతం, మెక్సికో 28శాతం చొప్పున దిగుమతి పన్ను పెంచాయి. దాంతో ఉత్పత్తుల నిల్వలు పెరిగిపోతున్నాయి. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అమెరికా గోదాముల్లో 1.4బిలియన్‌ పౌండ్ల(పౌను అరకిలోకు సమానం) జున్ను నిల్వలు మిగిలిపోయాయి. ఇక పాలపొడి సంగతి సరేసరి. మరోవైపు న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ నుంచి పోటీ పెరుగుతోంది. 2023వరకు ఈ పన్నులు కొనసాగితే అమెరికా పాల రైతులు 12.2బిలియన్‌ డాలర్లు నష్టపోతారు. ఈ కారణంగా తన ఉత్పత్తులను మన మీద రుద్దేందుకు అమెరికా పూనుకుంది.2018లో అమెరికా పాల ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరిచేందుకు మోడీ సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదించింది. అది అమల్లోకి వస్తే దాదాపు ఎనిమిది కోట్ల మంది మన రైతులు ప్రభావితులౌతారు.

Image result for trump , india ,poultry and milk products cartoons
మొహమాటానికి పోతే…. ఏదో అయిందన్నది ఒక ముతక సామెత. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం పలికి నరేంద్రమోడీ అదే ఇబ్బందులను కొని తెచ్చుకున్నారా ? గత ఏడాది హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన నరేంద్రమోడీ పనిలో పనిగా మీరు ఒకసారి మా దేశానికి రండి అని ట్రంప్‌కు ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి డంగై పోయిన ట్రంప్‌తో వీళ్లదేముంది, మీరు ఊహించలేరు, మాదేశం వచ్చినపుడు మిలియన్ల మంది మీకు దారిపొడవునా స్వాగతం పలుకుతారు చూడండి అని నరేంద్రమోడీ గొప్పగా చెప్పి ఉండాలి. లేకపోతే మిలియన్ల మంది నాకోసం వస్తారని మోడీ చెప్పారు, వారు 50 నుంచి 70లక్షల మంది వరకు ఉంటారని మోడీ చెప్పారు అని ఒకసారి, అరవై నుంచి కోటి మంది వరకు వస్తారని మోడీ చెప్పినట్లుగా మరోసారి అమెరికాలో ట్రంప్‌ ప్రకటించారు. అది మన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. రేపు మూడో కుర్ర భార్య, మొదటి భార్య కూతురు, అల్లుడితో సహా వస్తున్న ట్రంప్‌ జనాన్ని చూసి ఎంత మంది ఉంటారని తన వాళ్లను ప్రశ్నించకమానరు. మీ స్వాగతం గురించి మీ మోడీ చెప్పినవన్నీ జుమ్లా(ఏదో అవసరానికి అలా చెబుతాం)యే. మిలియన్ల మంది ఎక్కడా కనిపించలేదు, భారత్‌ మనలను సరిగా చూసుకోవటం లేదు, మోడీ అలాంటి వ్యక్తి కాదు అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా అవమానించారో, ఇంత తక్కువ సంఖ్యలో జనమా, ఇది వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం కలిగించదా అని భార్య, కూతురు, అల్లుడు నిషఉ్టరాలాడకపోరు. ట్రంప్‌ను చూసేందుకు గుజరాత్‌లో ఎంత మంది వచ్చిందీ కొందరు విలేకర్లయినా నిజాలను రాయకుండా ఉండరు కదా ! స్వాగతం పలికే జన సంఖ్య గురించి మోడీ ఆంగ్లం ట్రంప్‌కు అర్ధం కాలేదో లేక మోడీయే ట్రంప్‌కు అర్ధమయ్యే రీతిలో చెప్పలేదో ఏం జరిగిందో చెప్పటానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు గనుక దీన్ని వదలివేద్దాం.

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus
డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలేవీ ఉండవు అని అమెరికా అధికారులు మరింత స్పష్టంగా చెప్పారు. అలాంటపుడు ట్రంప్‌ ఎందుకు వస్తున్నట్లు ? మన ప్రధాని ఎందుకు ఆహ్వానించినట్లు ? ఈ ఏడాది నవంబరు 3న జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా కార్పొరేట్లకు గరిష్ట లబ్ది చేకూర్చేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంతో సహా అన్ని దేశాలపై వత్తిడి పెంచుతున్నారు. దీనికి నరేంద్రమోడీ లొంగుతారా ? లేకపోతే మన దేశం మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా తెస్తున్న వత్తిడి మరింత పెరుగుతుంది. మరి మన మోడీ తట్టుకొని నిలుస్తారా, దేశపిత వంటి మెరమెచ్చు మాటలకు జావగారి లొంగిపోతారా, కోట్లాది మంది రైతాంగ జీవితాలను ఫణంగా పెడతారా ?అమెరికాకే అగ్రస్ధానం అన్న ట్రంప్‌ వైఖరికి అనుగుణ్యంగానే ఈ పర్యటన సాగనున్నట్లు స్పష్టమై పోయింది. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పే మన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు రాజీపడుతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్ట్‌ ట్రంప్‌ భారత్‌ రాక : ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

20 Thursday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald Trump India tour, Namastee Trump, Naredra Modi

Image result for donald trump india tour : who are patriots and who are not

ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24,25 తేదీలలో మన దేశ పర్యటన జరపనున్నారు. ఆ పెద్ద మనిషి రాకను నిరసిస్తూ తాము ప్రదర్శనలు జరుపుతామని వామపక్షాలు ప్రకటించాయి. ట్రంప్‌ రాక సందర్భంగా గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం(కేంద్ర పెద్దల ఆదేశాలతోనే అన్నది స్పష్టం) చేస్తున్న హడావుడి చూస్తుంటే మన దేశం బ్రిటీష్‌ రాజరికంలో మాదిరి ఇప్పుడు అమెరికా బానిసత్వంలోకి పోయిందా అనిపిస్తోంది. అంతర్జాతీయంగా మీడియాలో ఇప్పటికే అపహాస్యం ప్రారంభమైంది. ఇంత చేసి సాధించేదేమిటి అన్నది అపూర్వచింతామణి ప్రశ్న. సమాధానం చెప్పకపోతే తలలు తెగవు గానీ, గత ఆరు సంవత్సరాలలో మోడీ గారు ఖరీదైన కోట్లు తొడుక్కొని విదేశాలు తిరటం తప్ప సాధించిందేమీ లేదు కనుక, ట్రంప్‌ రాకతో అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.
డోనాల్డ్‌ ట్రంప్‌ రాకను సిపిఎంతో సహా వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌ రాకకోసం ఎందుకు తహతహలాడుతున్నారు అన్నది ప్రశ్న. ట్రంప్‌ను ఆహ్వానించే వారు ఇప్పుడు అసలు సిసలు దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు లేదా చలామణి అవుతున్నారు. వ్యతిరేకించే వారిని దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే వారిగా, దేశద్రోహులుగా సామాజిక మాధ్యమంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ భక్తులో తటస్దులు ఆలోచించాలి.
తన భారత పర్యటన గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ విలేకర్లతో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీతో పాటు మన దేశ గౌరవాన్ని గంగలో కలిపాయి. ట్రంప్‌ నోటి వెంట వెలువడిన ఆణిముత్యాల సారాంశం ఇలా ఉంది. ” వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల భారత్‌ సరిగా వ్యవహరించలేదు. నరేంద్రమోడీ ఎంతో మంచి వ్యక్తి గనుక పర్యటన పట్ల ఆసక్తితో ఉన్నా. భవిష్యత్‌ కోసం భారత్‌తో ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటాం. అది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందా అన్నది తెలియదు. ఈ పర్యటనలో ఒప్పందం ఉండకపోవచ్చు.నేను మోడీని ఎంతగానో ఇష్టపడుతున్నా. విమానాశ్రయం నుంచి కార్యక్రమాలు జరిగే ప్రాంతం, స్టేడియంలో 70లక్షల మంది పాల్గొంటారని నరేంద్రమోడీ నాతో చెప్పారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం నిర్మాణం జరుగుతున్నదని అనుకుంటున్నాను. అందువలన అది ఎంతో ఉత్సుకత కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఖుషీగా గడపవచ్చు”.
మన దేశంలో పర్యటించే ఒక విదేశీ నేత ఇలా మాట్లాడటం అహంకారానికి సూచిక. మన దేశంలో స్ధానికంగా ఒక నేత పర్యటిస్తుంటే మద్దతుదారులు ఎంతెంత మంది జనాన్ని సమీకరిస్తారో ముందుగానే సదరు నేతకు చెప్పినట్లుగా మన ప్రధాని స్వయంగా ట్రంప్‌తో మీ కార్యక్రమానికి 70లక్షల మందిని సమీకరిస్తా, బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పటం సిగ్గుగా లేదూ ! అందుకే ట్రంప్‌ మన దేశం వస్తే కమ్యూనిస్టులకు పోయేదేమిటి ? ఎందుకు వ్యతిరేకించాలి అని సామాజిక మాధ్యమంలో లేవనెత్తుతున్న ప్రశ్నలను నిజమే కదా అని భావిస్తున్న తటస్దులు కమ్యూనిస్టుల వ్యతిరేకతకంటే బిజెపి పాలకుల బానిసబుద్ది మన దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించాలి. అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో అమెరికన్లు శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో, ఎందరిని బలిచేస్తారో తెలియదు. అందువలన అలాంటి వాటిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సహజంగానే వ్యతిరేకిస్తారు? మన దేశానికి, మన రైతాంగం, కార్మికుల ప్రయోజనాలకు అమెరికన్లు ముప్పు తేవటం లేదా ? లేక వాటిని చూసేందుకు మనం తిరస్కరిస్తున్నామా ? అసలవి సమస్యలుగా కనిపించటం లేదా ? వాటిని వివరంగా చర్చించబోయే ముందు క్లుప్తంగా ట్రంప్‌ పర్యటన వివరాలను చూద్దాం.

Image result for donald trump india tour : who are patriots and who are not
గతేడాది అమెరికాలో హౌడీ మోడీ సభ సందర్భంగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ను మన దేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఈనెల 24న వస్తున్న ట్రంప్‌ దంపతులకు అహమ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోడీ స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరం రోడ్‌ షో నిర్వహిస్తారు. సబర్మతి ఆశ్రమం దగ్గర మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. తరువాత వల్లభారు పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మూడున్నరకు అహమ్మదాబాద్‌ నుంచి బయలు దేరి ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ సందర్శన, తరువాత ఢిల్లీ వెళతారు. రెండవ రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ దంపతులు స్వాగతం పలుకుతారు. తరువాత రాజఘాట్‌లో మహాత్మాగాంధీకి మరోసారి నివాళి అర్పిస్తారు. తరువాత హైదరాబాద్‌ హౌస్‌లో అధికారిక చర్చలు జరుగుతాయి.ఆ సమయంలో ట్రంప్‌ సతీమణి మెలానియా ఢిల్లీలోని ఒక పాఠశాలను సందర్శిస్తారు. మూడు గంటలకు అమెరికా రాయబార కార్యాలయంలో ముఖ్య వాణిజ్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు, తరువాత పది గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణమౌతారు.
గుజరాత్‌లో కొద్ది గంటలు మాత్రమే గడిపే ట్రంప్‌ దంపతుల కోసం సర్కార్‌ పదివేల మంది పోలీసులను, వందల మంది అధికారులను దింపుతోంది. నిన్నటి వరకు బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన పత్రిక సామ్నా మోడీ చేస్తున్న హడావుడిని బానిస మనస్తత్వంగా వర్ణించింది. రోడ్ల మీద ఉండే పాన్‌ దుకాణాల మూత మొదలు, వీధి కుక్కల పట్టివేత, పేదరికం, పేదలు కనపడకుండా అహమ్మదాబాదులో కొన్ని చోట్ల గోడల నిర్మాణం, కొన్ని చోట్ల కుటుంబాల తొలగింపు వంటిచర్యలకు ప్రభుత్వం పాల్పడింది. కొద్ది గంటల పాటు ట్రంప్‌ దంపతులకు మురికివాడలు కనపడకుండా చేసేందుకు అహమ్మదాబాదులో దాదాపు వందకోట్ల రూపాయలు తగలేసి గోడ కట్టిన మన నిర్వాకాన్ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? అహమ్మదాబాద్‌ విమానాశ్రయానికి అరవైకి పైగా అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు రోజూ ఉంటాయి. కేవలం పది విమానాలను మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటిని ఇతర ప్రాంతాలకు మరల్చేందుకు నిర్ణయించారు. స్టేడియంకు జనాలను తరలించేందుకు 2,200 బస్సులు ఏర్పాటు చేశారు. రోడ్డు పొడవునా దోమలు లేకుండా చేసేందుకు ఫాగింగ్‌ యంత్రాలను అమర్చారు. రోడ్ల మీద లక్ష మొక్కలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ట్రంప్‌కు జయజయ ధ్వానాలు పలికేందుకు రోడ్ల మీద ఇరవై ఎనిమిది వేదికలను ఏర్పాటు చేశారు.
గతేడాది సెప్టెంబరులో నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపి హౌడీ మోడీ పేరుతో భారత సంతతి వారిని సమీకరించి మన దేశం ఎంతో బాగుందని ఎనిమిది సార్లు ఎనిమిది భాషల్లో చెప్పి, ట్రంప్‌ను తాను పొగిడి, ప్రతిగా దేశ పిత అని ట్రంప్‌ చేత పొగిడించుకొని కౌగిలింతలతో తిరిగి వచ్చారు తప్ప సాధించిందేమిటి? మన ఎగుమతుల పెంపుదలకు ఎలాంటి ఒప్పందం నాడు లేదు, ఇది రాసిన సమయానికి వచ్చిన వార్తలను బట్టి ఇప్పడూ లేదు. అసలు కీలకమైన అమెరికా వాణిజ్య ప్రతినిధే ట్రంప్‌తో రావటం లేదు. ఇప్పుడు పరస్పరం ఎలా పొగుడు కుంటారో దేశం చూడనుంది. అసలు ట్రంప్‌ పర్యటనను ఎందుకు వ్యతిరేకించాలి ?
అలీన దేశంగా ఉన్న భారత్‌ను తమ చంకనెక్కించుకొని తన ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మన దేశానికి భద్రతా రీత్యా, ఆర్ధికంగా మోయలేని భారాలను మోపుతుంది. ఇరుగుపొరుగుదేశాలతో శతృత్వాలను పెంచుతుంది. ఈ రోజు మన ప్రాధాన్యత యావత్‌ దేశ జనాభా అవసరాలు తీరే విధంగా ఆర్ధిక వ్యవస్దను అభివృద్ధి చేయటానికి ఉండాలి తప్ప ఇరుగుపొరుగుదేశాలతో మిలిటరీ ఉద్రిక్తతల నడుమ మన సంపదలన్నీ అమెరికా లేదా మరొక దేశ ఆయుధాలకొనుగోలుకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగుదేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాతో చెలిమి ఏ విధంగానూ మనకు ఉపయోగపడదు.పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలకోసం మన దేశాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో తన మిలిటరీ వ్యూహంలోకి అమెరికా లాగుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో తన భారాన్ని మన మీద మోపేందుకు మన భుజం మీద తుపాకిని పెట్టి చైనాను కాల్చేందుకు ప్రయత్నిస్తోంది. తనకు అవసరం లేని, ఇతర దేశాలకు కూడా విక్రయిస్తున్న ఆయుధాలను మనకు కట్టబెట్టటం తద్వారా మన మిలిటరీ భవిష్యత్‌ను తన చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాకే అగ్రస్ధానం అనే పద్దతుల్లో ముందుకు పోతున్న అమెరికా మనలను ఎలా ముందుకుపోనిస్తోందో అందరూ ఆలోచించాలి.
మన దేశం చైనాతో అయినా మరొక దేశంతో అయినా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే అభివృద్ధి మీద కేంద్రీకరించాలి. అమెరికన్లు చైనాను శత్రుదేశంగా పరిగణించటం వేరు, వారు వారు చూసుకుంటారు, వారి తరఫున మనలను కూడా అదే విధంగా వ్యవహరించాలని చూడటం మనకు ఏమాత్రం మంచిది కాదు. అనేక ప్రాంతాలలో గతంలో అమెరికా తన సైన్యాలను దించి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనేది, ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలు ఆ పని చేయాలని వత్తిడి చేస్తోంది. అమెరికా ఆయుధాలకు మార్కెట్‌గా మారేందుకు, ఇరుగుపొరుగుదేశాలను శత్రువులుగా చేసుకోవటం మనకు అవసరమా ?
2018 నుంచి అమెరికన్లు చైనా మీద వత్తిడి తెచ్చి తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారు తప్ప మన దేశం నుంచి దిగుమతులకు పూనుకోవటం లేదు. మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు, దానికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై పన్నులు పెంచాల్సి వచ్చింది. మనమేదో పత్తి రైతులకు కనీస మద్దతు ధరల రూపంలో సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్దలో మన మీద దావా వేసింది అమెరికా. 2019 జనవరి-సెప్టెంబరు మాసాల మధ్య ఉభయ దేశాల వాణిజ్య వృద్ధి రేటు 8.4 నుంచి 4.5శాతానికి పడిపోయింది. రెండు దేశాల మధ్య సేవలు, వస్తువుల వాణిజ్య నిష్పత్తి 62:38శాతం ఉండగా చైనాతో వస్తువుల శాతమే ఎక్కువగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలంటే తలసరి ఆదాయం 12,375 డాలర్లు ఉండాలి, మన దేశంలో రెండువేల డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటికీ మనలను అభివృద్ధి చెందిన తరగతి దేశాలతో జమకట్టిన ట్రంప్‌ సర్కార్‌ కొద్ధి రోజుల క్రితమే మనకు ఆరు రకాల సబ్సిడీలు దక్కకుండా చేసింది. ఆర్ధికంగా కొన్ని వందల కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగించింది. ఒక వైపు మన పరిస్ధితి ఇంట్లో ఈగల మోతగా ఉంటే అమెరికా ఈ పల్లకీ మోత కారణంగా అనేక దేశాలు మనలను సతాయించుకు తింటాయి. అలాంటి ట్రంప్‌ మనకు మిత్రుడా ?
ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనావళిలో సాధారణ ప్రాధాన్యత వ్యవస్ధ(జిఎస్‌పి) ప్రకారం రాయితీలు పొందుతున్న మనకు అభివృద్ది చెందుతున్న దేశ లబ్దిదారు(డిబిసి) హౌదాను అమెరికా రద్దు చేసింది. పర్యవసానంగా మన ఎగుమతులకు ఇస్తున్న వందలాది కోట్ల రూపాయల సబ్సిడీలు పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల నియంత్రణ వంటి అంశాలపై అమెరికా పాల ఉత్పత్తిదారులు, ఆధునిక వైద్య సాంకేతిక అసోసియేషన్‌ వంటి సంస్ధల వత్తిడి మేరకు ఇలా జరిగింది. జిఎస్‌పి రద్దు వలన ప్రధానంగా ప్రభావితులవుతున్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. దీనివలన మన ఎగుమతులతో పాటు కార్మికుల వేతనాలు కూడా పడిపోతాయి. నిరుద్యోగమూ పెరుగుతుంది. మనకు జిఎస్‌పి రద్దు చేసిన ట్రంప్‌ బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, కాంబోడియా, దక్షిణాఫ్రికాలకు కొనసాగిస్తున్నాడు. అంటే ఈ దేశాల నుంచి మనకు పోటీ పెరిగినట్లే, దాన్ని తట్టుకొనేందుకు ఆయా సంస్ధలకు సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్ధితికి నెట్టిన వ్యక్తిని మనం ఆహ్వానించటమా ?
ప్రపంచ వాణిజ్య సంస్దలో వివాదాల తీర్పులపై అప్పీలు చేసుకొనేందుకు ఒక సంస్ధ ఉంది. దానిలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ఉద్యోగ విరమణ చేశారు. కొత్త వారిని నియమించకుండా ట్రంప్‌ సర్కార్‌ అడ్డుకుంటున్న కారణంగా అది పని చేయటం లేదు.గతేడాది డిసెంబరు నుంచి అప్పీళ్లను చేపట్టలేదు. వాటిలో మనదేశానికి చెందినవి కూడా ఉన్నాయి. మన దేశం ఎంఇఐఎస్‌ పధకం ద్వారా, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఇజెడ్‌లు, సెజ్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోట్‌ కాపిటల్‌ గూడ్స్‌ వంటి వాటి ద్వారా చేసే ఎగుమతులు, వాటికి రాయితీలు ఇవ్వటాన్ని అమెరికా సవాలు చేసింది, వాటి కారణంగా తమ కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన కమిటీ అవన్నీ నిబంధనలకు విరుద్దమని ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని తేల్చింది.2017లోనే తమ సబ్సిడీలు పరిమితిని దాటాయని అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా తాము సబ్సిడీలు ఇవ్వవచ్చని మన దేశం ఆ నివేదికను సవాలు చేసింది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు అమెరికా పరిగణించటం వెనుక ఇలాంటి రాయితీలను రద్దు చేయించే ఎత్తుగడ స్పష్టంగా ఉంది.ఇలాంటి సర్కార్‌ నేత ట్రంప్‌ మన భాగస్వామి ఎలా అవుతాడు ?

Image result for donald trump india tour : who are patriots and who are not
మన దేశం నిబంధనల మేరకు ఇస్తున్న సబ్సిడీలను అభ్యంతర పెడుతున్న అమెరికా మరోవైపు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు అక్రమం అని ప్రపంచ వాణిజ్య సంస్ద పదే పదే చెబుతున్నా, తీర్పులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయటం లేదు. భారతీయ స్టీలు పైపుల తయారీదార్లకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నారనే పేరుతో కొన్ని రకాల పైపుల దిగుమతులపై 2012లో అమెరికా 300శాతం పన్ను విధించింది. అది అక్రమం అని 2014లో డబ్ల్యుటిఓ తీర్పు చెప్పింది. అయినా అమెరికా ఖాతరు చేయలేదు. గతేడాది కొన్ని మార్పులు చేసినప్పటికీ అమెరికా వైఖరిని తప్పుపట్టినా అదే పరిస్ధితి కొనసాగుతోంది. తమ 28వస్తువులపై భారత్‌ దిగుమతి పన్నులు పెంచిందంటూ అమెరికా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డబ్ల్యుటిఓలో మన దేశానికి సంబంధించి 14వివాదాలు ఉన్నాయి. పప్పుధాన్యాల దిగుమతులపై మన దేశం విధించిన నిషేధాన్ని అమెరికాతో సహా అనేక దేశాలు వివాదాస్పదం కావిస్తున్నాయి. ఇలాంటి దేశాల నేతలను నమ్మటం, వారిని కౌగలించుకోవటం ఏమిటి ? ఇలాంటి ట్రంప్‌ను వ్యతిరేకించటం దేశ ద్రోహమా లేక ఆహ్వానించి ఎర్రతివాచీ పరచటం దేశద్రోహమా ? ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: