• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: emmanuel macron

ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికల్లో బలం పెంచుకున్న ఫాసిస్టు నేషనల్‌ పార్టీ !

27 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, Far Right, French Left, marine le pen



ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు(ఏప్రిల్‌ 24) జరిగిన తుది విడత ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ విజయం సాధించాడు. ప్రత్యర్ధి పచ్చిమితవాది లేదా ఫాసిస్టుగా పిలుస్తున్న మారినే లీపెన్‌ 41.5శాతం ఓట్లు తెచ్చుకోగా మక్రాన్‌కు 58.5శాతం వచ్చాయి. గత (2017)ఎన్నికల్లో పదకొండు మంది తొలి దఫా ఎన్నిక పోటీ పడగా తొలి నలుగురికి 24.01 నుంచి 19.58శాతం మధ్య రాగా మిగిలిన వారెవరికీ ఒక అంకెకు మించి ఓట్లు రాలేదు. తాజా ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ పడగా మక్రాన్‌కు 27.85, మారినే లీపెన్‌కు 23.15, వామపక్ష మెలాంచన్‌కు 21.95శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన వారందరూ ఒక అంకెతోనే సరిపెట్టుకున్నారు. ఫ్రెంచి నిబంధనల ప్రకారం తొలి రెండు స్దానాల్లో ఉన్న వారు తుదివిడతలో పోటీపడాల్సి ఉంది. అర్హత కోల్పోయిన పార్టీల మద్దతుదారులు తుది విడత ఎవరో ఒకరిని ఎంచుకొని ఓటు వేస్తారు. 2022 ఎన్నికల్లో, అంతకు ముందు కూడా మక్రాన్‌, లీపెన్‌లే తుది విడత పోటీ పడ్డారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఉన్నంతలో తక్కువ హాని చేసే వారిని ఎన్నుకుందామనే వైఖరిని ఇతర పార్టీలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా పోటీ చేసిన ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష , హరిత పార్టీలు కూడా మక్రాన్‌కు మద్దతు ప్రకటించాయి. లీపెన్‌కు మితవాదశక్తులు బాసటగా నిలిచాయి.


తొలి విడత కమ్యూనిస్టు పార్టీ పోటీకి దిగకుండా దానికి వచ్చిన 2.28శాతం ఓట్లను మెలాంచన్‌కు బదలాయించి ఉంటే 24,13 శాతంతో రెండవ స్దానంలో ఉండి తుది విడత మక్రాన్‌తో పోటీ జరిగేదని, మితవాద-వామపక్ష శక్తుల పోటీగా నిలిచేదని కొందరు పేర్కొన్నారు.ఇదే సూత్రం పచ్చి మితవాద పార్టీలకూ వర్తిస్తుంది. ఎరిక్‌ జుమౌర్‌ అనే పచ్చి మితవాదికి 7.07శాతం వచ్చాయి, ఆ రెండు పార్టీలు కలిసినా వారే మొదటి స్ధానంలో ఉండేవారు. గ్రీన్స్‌, మరో వామపక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లను కూడా కలుపు కుంటే మొత్తం 30శాతం వరకు ఉన్నాయి. వామపక్షశక్తుల మధ్యరాజకీయ విబేధాల కారణంగానే ఎవరికి వారు తమ వైఖరిని ఓటర్ల ముందుంచి పోటీ చేశాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే పోటీ మక్రాన్‌-వామపక్ష అభ్యర్ధి మధ్య జరిగినా గెలుపు మక్రాన్‌దే అన్నది స్పష్టం. మితవాద, పచ్చిమితవాద శక్తులు అధికారం కోసం కుమ్ములాడుకోవటం తప్ప వారి విధానాల్లో పెద్ద తేడాలేమీ లేవు. మక్రాన్‌ ఐరోపా సమాఖ్యలో ఉండాలనే వైఖరి, లీపెన్‌ దానికి భిన్నమైన విధానం కలిగి ఉన్నారు తప్ప దేశ ఆర్ధిక విధానాల్లో వారి మధ్యపెద్ద తేడాలేమీ లేవు.


తనకు వామపక్ష అభిమానులు ఓటు వేశారని తెలుసునని, వారు లీపెన్‌న్ను అడ్డుకున్నారని ఫలితాల అనంతరం చెప్పిన మక్రాన్‌ తనకు ఓటు వేసిన వారందరూ తన మద్దతుదారులు కాదని కూడా చెప్పారు. తాను ప్రకటించిన విధానాలకే కట్టుబడి ఉంటాను తప్ప వామపక్ష అభిమానులు తనకు ఓటేసినంత మాత్రాన ఆ శక్తులు ముందుకు తెచ్చిన విధానాలను తాను అమలు జరపాల్సిన అవసరం లేదనే సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. మక్రాన్‌కు ఓటు వేసినంత మాత్రాన అతగాడి విధానాల మీద భ్రమలుండి కాదని, ఇద్దరు శత్రువులలో ఉన్నంతలో తక్కువ హాని చేసే వారినే ఎంచుకొని వేశామని, తమ ఉద్యమాలకు ఎలాంటి విరామం ఉండదని కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాల మక్రాన్‌ ఏలుబడిని చూసినపుడు ఒకశాతం ధనికులకు మాత్రమే తగిన ప్రతినిధిగా, 99శాతం మందిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన పెద్దమనిషిగా దర్శనమిచ్చాడు. కొత్తగా ఉపాధి లేకపోగా ఉన్న కార్మికులను సులభంగా వదిలించుకొనేందుకు యజమానులకు వీలు కల్పించాడు. ఫలితంగా తక్కువ వేతనాలకు పని చేస్తారా ఉద్యోగాల నుంచి ఊడగొట్టమంటారా అంటూ ఓనర్లు ఉన్నవారికి, కొత్తగా తీసుకున్న వారికి వేతనాలను తగ్గించారు. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులను తగ్గించాడు, ఆ మేరకు సామాన్యుల సంక్షేమ పధకాలకు కోత పెట్టాడు. దానికి తోడు మిలిటరీ ఖర్చును కూడా పెంచాడు.దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు 35శాతం మంది దివాలా తీసినట్లు అంచనా.ప్రస్తుతం 1,07,000 దివాలా కేసులు నడుస్తున్నాయి. ఈ పరిణామాలను చూసిన తరువాత మక్రాన్‌ విధానాల మీద అనేక మందికి భ్రమలు తొలిగి అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు, లేదా ఖాళీ బాలట్‌ పత్రాలను వేశారు.


గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఉన్న పార్టీ ప్రస్తుతం నేషనల్‌ రాలీ పార్టీగా పేరు మార్చుకుంది. తాజా అభ్యర్ధి మారినే లీపెన్‌ తండ్రి జీన్‌ మారీ లీపెన్‌ తొలిసారిగా 2002 ఎన్నికల్లో పోటీ చేసి 18శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో కూతురు మారినే లీపెన్‌ 33.9శాతానికి, తాజాగా 41.5శాతానికి పెంచుకుంది.ఈ పరిణామాన్ని తన గెలుపుగా భావిస్తున్నాను తప్ప ఓడినట్లు భావించటం లేదని, జనానికి ఒక ఆశాభావం కల్పించినట్లు ఆమె అన్నారు. ఫ్రాన్స్‌లోకి వలస కార్మికులను అనుమతించరాదని, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతూ నేషనల్‌ పార్టీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. మక్రాన్‌తో పోలిస్తే ఈ పార్టీ కార్పొరేట్లకు మరింతగా అనుకూలమని, అయితే ఈ సారి ఎన్నికల్లో దేశంలో పెరిగిన ద్రవ్యోణం, ధరలు, జీవన వ్యయం, పన్నుల అంశాలను కూడా ప్రచార అంశం చేసింది. ఇది కూడా ఓట్లు పెరిగేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు.పెన్షన్‌ చెల్లింపులను తప్పించుకొనేందుకు ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతానని మాక్రాన్‌ చెబితే 62 సంవత్సరాలకు మించకూడదని నేషనల్‌ పార్టీ పేర్కొన్నది. అంతే కాదు, దిగజారిన ఆర్ధిక పరిస్ధితులను గమనంలో ఉంచుకొని తాము వస్తే చమురు మీద పన్నులు తగ్గిస్తామని,ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల కోసం కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. తాము విస్మరణకు గురైనట్లు భావిస్తున్న వారు ఈ నినాదాలకు ఆకర్షితులైనట్లు భావిస్తున్నారు. పలు చోట్ల స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేసినప్పటికీ జాతీయంగా అధికారానికి వచ్చే స్ధితి లేనందున వారు కూడా మక్రాన్‌ లేదా నేషనల్‌ పార్టీలవైపు మొగ్గుతున్నారు.
ఈ ఎన్నికలను కూడా అమెరికా మీడియా ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముడిపెట్టేందుకు ప్రయత్నించింది.గతంలోను, ఇటీవల తమ ప్రచారానికి అవసరమైన రుణాలను రష్యన్‌ బాంకుల నుంచి తీసుకోవటం వంటి ఉదంతాలు, గతంలో పుతిన్‌కు నేషనల్‌ పార్టీ మద్దతు ప్రకటించిన వాటిని పట్టుకొని ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలు నాటో వ్యతిరేక-పుతిన్‌ అనుకూల మారినె లీపెన్‌ వైఖరిపై తీర్పుగా ఉంటాయని చిత్రించింది.

అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన అనుభవాలు, ఫలితాలను గమనంలోకి తీసుకున్న వామపక్ష శక్తులు జూన్‌లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఓట్లు చీలకుండా చూడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాయి. అటువంటి సర్దుబాటు కుదిరితే కొన్ని చోట్ల వాటికి మొత్తంగా 30శాతం ఓట్లు ఉండటం, స్ధానికంగా జరిగే ఎన్నికలు గనుక ఇతర పార్టీలకు ఓటు చేసిన వాటి అభిమానులు తిరిగి వామపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉన్నందున మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. తొలి దఫా ఎన్నికల్లో వామపక్షాలకు వచ్చిన ఓట్లను చెదరకుండా చూస్తే మక్రాన్‌ – మారినె లీపెన్‌ ప్రాతినిధ్యం వహించే శక్తులను దెబ్బతీయ గలమని అధ్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఫాబియన్‌ రౌసెల్‌ చెప్పాడు. మే దినోత్సవ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా వామపక్ష ఐక్యతాయత్నాలకు శ్రీకారంచుడతామని అన్నాడు. మక్రాన్‌ గెలిచినంత మాత్రాన అతని విధానాలకు మద్దతు ఇచ్చినట్లు కాదని అలాగే నేషనల్‌ పార్టీ ఓడినంత మాత్రాన పచ్చి మితవాద శక్తుల ప్రమాదం తప్పినట్లు కాదని అన్నాడు. వామపక్ష నేత మెలాంచన్‌ కూడా ఐక్యతాయత్నాలను ప్రారంభించాడు. గతంలో అధికారాన్ని చలాయించిన సోషలిస్టులు కూడా సుముఖంగానే ఉన్నట్లు వార్తలు. మితవాద శక్తులు కూడా పెరిగిన ఓట్లశాతంతో పార్లమెంటులో మెజారిటీ సాధించాలని ముందుకు పోతున్నారు. కార్మికవర్గానికి ముప్పు ముంచుకువస్తున్నదని కార్మిక సంఘం సిజిటి ముందే హెచ్చరించింది. పార్లమెంటులో ఈ రెండు శక్తులది పై చేయికాకుండా చూడాలని 66శాతం మంది ఓటర్లు పేర్కొన్నట్లు ఒక సర్వే వెల్లడించింది.మరొక సర్వేలో కూడా అదే తేలింది.


ఒక నాటో సభ్యదేశంగా ఫ్రాన్సు కూడా రష్యా మీద ఆంక్షలను సమర్ధించినప్పటికీ అమెరికా,బ్రిటన్‌ అనుసరించే వైఖరితో పూర్తి ఏకీభావం లేదు. ఆ ప్రభావం తన మీద పడకుండా చూసుకొనేందుకు మక్రాన్‌ ప్రయత్నించాడు. ఇప్పుడు ఎన్నిక ముగిసింది కనుక అమెరికాతో కలసి శత్రుపూరితంగా ముందుకు పోతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. జూన్‌లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోవటం కూడా అవసరమే కనుక అవి ముగిసే వరకు వైఖరిలో మార్పు ఉండదు. ప్రతిపక్షాలకు మెజారిటీ వస్తే ఇబ్బందుల్లో పడతాడు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ఇప్పటికే ఇతర పశ్చిమ దేశాలతో పాటు ఫ్రాన్సు మీద కూడా పడింది. అది కొనసాగితే కార్మికవర్గ ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. తీవ్ర అసంతృప్తి కారణంగానే తొలి దఫా ఎన్నికల్లో 73.69శాతం మంది ఓట్లు వేయగా తుది దఫా 71.99శాతం మాత్రమే పోలైనట్లు భావిస్తున్నారు.


మక్రాన్‌ గెలిచినందుకు సంతోషం వెలువడినా లీపెన్‌కు ఆ స్దాయిలో ఓట్లు రావటం ఆందోళన కలిగించే పరిణామంగా కూడా అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ఉచ్చు బిగుస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. గత ఐదు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా(72శాతం) పొల్గన్న తొలి ఎన్నిక ఇది. మక్రాన్‌ కార్మిక వ్యతిరేక వైఖరి, లీపెన్‌ మితవాద విధానాలు ఎవరికి ఓటు వేసినా ఉపయోగం ఏముందనే నిర్లిప్తత కారణంగా ఓటర్లు ఉత్సాహం చూపటంలేదని ఓటింగ్‌కు ముందే అభిప్రాయ సేకరణ సర్వేల్లో వెల్లడైంది. ఉదారవాదిగా పేరున్న మక్రాన్‌ మితవాదిగా మారుతుండగా, పచ్చిమితవాది మారినే లీపెన్‌ ప్రజల మనిషిగా కనిపించేందుకు పూనుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్లు కొందరు వ్యాఖ్యానించారు. గతంలో ఆమెను ఒక దయ్యంగా వర్ణించిన మీడియా ఇప్పుడు ఆమెను ఒక కలుపుగోలు, సాధారణ మహిళగా పేర్కొంటున్నది. మక్రాన్‌ అనుసరించిన విధానే పచ్చిమితవాద లీపెన్‌కు ఆదరణ పెరిగేందుకు తోడ్పడిందని భావిస్తున్నారు. ఇది ఐరోపాకే కాదు, ప్రపంచ మొత్తానికి ఆందోళన కలిగించే అంశమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాలో బలవంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక బోధన – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాల చీలిక !

13 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

emmanuel macron, Fabien Roussel, french communist party, French elections 2022


ఎం కోటేశ్వరరావు


అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను బలవంతంగా రుద్దుతున్నారు. మితవాద రిపబ్లికన్‌ పార్టీ ఏలుబడిలో ఉన్న అరిజోనా రాష్ట్రంలోని హైస్కూళ్లలో స్వేచ్చ, ప్రజాస్వామ్య అమెరికన్‌ ప్రమాణాలతో సంఘర్షిస్తున్న కమ్యూనిజం, నిరంకుశత్వం ప్రమాదకారి అనే పాఠాలు చదవకుండా విద్యార్ధులకు డిగ్రీలు ఇవ్వకూడదని ప్రతిపాదించారు. వియత్నాం నుంచి పారిపోయి వచ్చిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక కుటుంబానికి చెందిన అసెంబ్లీ సభ్యుడు క్వాంగ్‌ గుయన్‌ ఈ బిల్లును విద్యా కమిటీలో పెట్టి ఆమోదం పొందాడు. దీన్ని అసెంబ్లీలో ఆమోదిస్తే అమలు చేస్తారు. పౌర విద్య ముసుగులో సోషలిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించే ఇలాంటి బిల్లునే గతేడాది ఫ్లోరిడా రాష్ట్రంలో కూడా ఆమోదించారు. అరిజోనాలో జరిగే పరీక్షల్లో కమ్యూనిజం-నియంతృత్వాన్ని పోలుస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా అమలు జరపాలా అని చర్చిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ భావజాలాల గురించి పాఠాలు ఉన్నాయని, శాసనసభ్యులు పాఠశాల సిలబస్‌ను నిర్ణయించటం ఒక ప్రమాదకర సంప్రదాయం అవుతుందని అనేక మంది విమర్శిస్తున్నారు.


అలబామా రాష్ట్రంలోని సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ కె-12 విద్యార్దుల కోసం రూపొందించిన పాఠాలు అమెరికాను మౌలికంగా సోషలిస్టు సమాజంగా మార్చివేసేందుకు ఉద్దేశించినవంటూ, వాటిని పూర్తిగా తొలగించాలని ఒక పత్రికలో సంపాదకలేఖ ప్రచురితమైంది. తన కుటుంబం రష్యా నుంచి వచ్చిందని, అమెరికాలో కమ్యూనిజం పెరుగుదలను చూస్తున్నానని దానిలో ఉంది. ” నాలుగు సంవత్సరాల పాటు పిల్లలకు బోధించే అవకాశం నాకు ఇవ్వండి, నేను నాటే విత్తనాలను ఎవరూ తొలగించలేరు-వ్లదిమిర్‌ లెనిన్‌, ” పాఠ్యపుస్తకాలను అదుపు చేసేందుకు నాకు అవకాశమిస్తే దేశాన్నే అదుపులోకి తెస్తాను-అడాల్ఫ్‌ హిట్లర్‌, ” ప్రయివేటు ఆస్ధి, స్వేచ్చ విడదీయరానివి-జార్జి వాషింగ్‌టన్‌ చెప్పారంటూ మీకు స్వేచ్చ కావాలా నిరంకుశత్వం కావాలో తేల్చుకోవాలంటూ రెచ్చగొడుతూ ఆ లేఖ ప్రచురితమైంది.


ఏప్రిల్‌ పదవ తేదీన ఫ్రెంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసిన వారిలో సగానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వారు గెలుస్తారు. లేనట్లయితే 24వ తేదీన ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. 2017లో జరిగిన ఎన్నికలలో తొలి ఇద్దరికి 24.1, 21.3, మూడు,నాలుగు స్ధానాల్లో ఉన్నవారికి 20.1, 19.58శాతాల చొప్పున వచ్చాయి. మొదటి స్ధానంలో ఉన్న ఇమ్మాన్యుయల్‌ మక్రాన్‌ రెండవ రౌండులో 66.1శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి కూడా మక్రాన్‌ పోటీ పడుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జీన్‌ లక్‌ మెలెంచన్‌ 19.58శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో ఉన్నాడు.ఈ సారి ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా ఫాబియన్‌ రౌసెల్‌ రంగంలో ఉన్నారు.


” ఫ్రాన్స్‌కు మంచి రోజులు ” అనే నినాదంతో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలలో కమ్యూనిస్టులు పోటీ చేయటం ఇదే ప్రధమం. గత రెండు ఎన్నికల్లో పార్టీ మెలెంచన్‌కు మద్దతు ఇచ్చింది. సోవియట్‌ పతనం తరువాత బలహీన పడిన పార్టీలలో ఫ్రెంచి పార్టీ ఒకటి. ఐనప్పటికీ పారిస్‌, దాని శివార్లలోని పలు మున్సిపాలిటీలలో వరుసగా కమ్యూనిస్టులు గెలుస్తున్నారు. జనంతో ఉండటమే దీనికి కారణం. జాతీయ అసెంబ్లీలోని 577కు గాను 12, ఎగువసభ సెనెట్‌లోని 348 స్ధానాలకు 14 సీట్లు కమ్యూనిస్టులకు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న రౌసెల్‌కు మీడియా సర్వేల ప్రకారం మూడు-నాలుగు శాతం మంది మద్దతు ఇస్తున్నారు. ఇంకా పెరగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర వామపక్ష పార్టీలు, శక్తులు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించాయి. అనేక పార్టీలు మార్పు గురించి చాలాకాలంగా చెబుతున్నప్పటికీ అలాంటిదేమీ కనిపించటం లేదని ఈ సారి సంభవించనున్నదని రౌసెల్‌ అన్నాడు. కరోనా కాలంలో ప్రభుత్వ సొమ్మును జనానికి బదులు బహుళజాతి గుత్త సంస్ధలకు అప్పగించారన్నారు. పెద్ద బాంకులన్నింటినీ, ఇంధన కంపెనీలు టోటల్‌, ఎంగీలను జాతీయం చేయాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.

అసంతృప్తితో ఉన్న యువ ఓటర్లను మెలెంచన్‌ ప్రజాకర్షక నినాదాలు లేదా పచ్చి మితవాది మారినె లీపెన్‌కు మద్దతుదార్లుగా మారిన వారందరినీ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు, తిరిగి వారి హృదయాలను చూరగొనటమే తమ ప్రధాన సవాలని రౌసెల్‌ ప్రచార సారధి, పారిస్‌ ఉప మేయర్‌ ఇయాన్‌ రోసాట్‌ చెప్పాడు. దేశమంతటా స్ధానిక సంస్దల్లో 600 మంది కమ్యూనిస్టు మేయర్లు, వేలాది మంది కౌన్సిలర్లు అధికారంలో ఉన్నారు. వారందరూ ఉత్సాహంగా రంగంలో దిగవచ్చని వార్తలు. ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ఎల్‌ హ్యూమనైట్‌ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావటాన్ని చూస్తే మరోమారు కమ్యూనిస్టుల పట్ల జనంలో వ్యామోహం కనిపిస్తున్నట్లు చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకుడు,ఫాప్‌ పరిశోధనా సంస్ధ అధిపతి ఫ్రెడరిక్‌ డాబీ అన్నాడు. భావజాలాన్ని తిరస్కరించే వారు కూడా కమ్యూనిస్టులు సభ్యతగా, మాటకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తారని అన్నాడు. ఏవియన్‌ అనే పట్టణంలో ప్రతి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టులు గెలుస్తారని, 2017 ఎన్నికల్లో అక్కడ మితవాద నేత మారినే లీపెన్‌కు గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఈ సారి కమ్యూనిస్టు పార్టీ స్వయంగా పోటీ చేస్తున్నందున పార్టీకే ఓటు వేస్తారనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.


ప్రస్తుతం వామపక్ష భావాలు కలిగిన వారు ఏడుగురు పోటీ చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో జరిగిన ప్రాతీయ ఎన్నికల్లో వామక్షాలన్నింటికీీ కలిపి 26.4శాతం ఓట్లు ఉన్నాయని ఒక విశ్లేషణ.రెండవ దఫా గ్రీన్స్‌, సోషలిస్టుల మధ్య ఐక్యత కారణంగా పదమూడు మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ మండళ్లలో ఐదు చోట్ల గెలిచారు.వామపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగా జాతీయ ఎన్నికల్లో మితవాద అభ్యర్ధులకు అవకాశం వస్తోంది.2012 ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ అభ్యర్ది ఫ్రాంకోయిస్‌ హౌలాండేకు తొలి విడత 28.6శాతం ఓట్లు వచ్చి తుది పోటీలో గెలిచాడు. అదే పార్టీ గత ఎన్నికల్లో తొలి విడత కేవలం ఐదు శాతం ఓట్లు తెచ్చుకొని తుది పోటీకి అర్హతను కూడా కోల్పోయింది. ఆ ఓట్లు వామపక్ష అభ్యర్ధికి వేసి ఉంటే పోటీ వేరుగా ఉండేది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మక్రాన్‌ ఏర్పాటు చేసిన ఎన్‌ మార్చ్‌ పార్టీలో 85 మంది ఎంపీలు చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో వామపక్షాలు ఒకే అభ్యర్ధిని నిలిపి ఉంటే పోటీ రసవత్తరంగా ఉండేది. గత ఎన్నికల మాదిరే ఇద్దరూ మితవాదులే పోటీలో మిగిలితే పెద్ద మితవాదికి బదులు చిన్న మితవాదిని బలపరచటం తప్ప వామపక్షాలు, ఇతర ఓటర్లకు మరొక అవకాశం లేదు. పచ్చి మితవాదుల్లో కూడా ఐక్యత లేదు. ఎరిక్‌ జెమ్మర్‌, వారినే లీపెన్‌ అనే ఇద్దరు పోటీపడుతున్నారు. వామపక్ష నేత మెలంచన్‌కు తొలి రౌండులో ఈ సారి పదిశాతం, పారిస్‌ నగర మేయర్‌ సోషలిస్టు పార్టీ నాయకురాలు హిడాల్గోకు మూదుశాతం వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ధనిక దేశాలను ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఊపివేస్తున్న తరుణంలో జరుగుతున్న ఫ్రెంచి ఎన్నికలలో మక్రాన్‌ ఎదురీదుతున్నట్లే చెప్పవచ్చు. ఒక మితవాది స్ధానంలో పచ్చి మితవాదిని ఎన్నుకుంటారా లేక గతం మాదిరే తిరిగి మక్రాన్‌కే పట్టం కడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పోలీసు రాజ్యం దిశగా ఫ్రాన్సు- స్వేచ్చ కోసం వీధుల్లోకి జనం !

01 Tuesday Dec 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

emmanuel macron, France towards police state, french communist party, Peoples March of Freedom


ఎం కోటేశ్వరరావు
పోలీసు చర్యలను చిత్రీకరించటాన్ని నేరంగా పరిగణిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం చేసిన బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం నాడు ఫ్రాన్సులో దేశవ్యాపితంగా స్వేచ్చకోసం అనే నినాదంతో వంద చోట్లకు పైగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. రాజధాని పారిస్‌లో జరిగిన ప్రదర్శనలో ప్రభుత్వం తగ్గించి చెప్పిన సంఖ్య ప్రకారమే 46వేల మంది పాల్గొన్నారు. సాధారణంగా దానికి కొన్ని రెట్లు ఎక్కువ మంది ఉంటారని తెలిసిందే. దేశవ్యాపితంగా కేవలం లక్షా 33వేల మంది మాత్రమే పాల్గొన్నట్లు పోలీసులు ప్రకటించగా ఐదు లక్షల మంది ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ భద్రతా చట్టం (గ్లోబల్‌ సెక్యూరిటీ లా) పేరుతో ముందుకు తెచ్చిన అంశాల ప్రకారం పోలీసుల దౌర్జన్యాలను చిత్రీకరించిన పౌరులు, మీడియాను శిక్షించే అవకాశం ఉంటుందని తెలిసిందే. పారిస్‌లో పోలీసులు జరిపిన దాడిలో ఎఎఫ్‌పి వార్తా సంస్ధకు ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్న 24 సంవత్సరాల సిరియన్‌ యువకుడు అమీర్‌ అల్‌ హలబీ పోలీసు దెబ్బల కారణంగా తలమీద గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇతనితో పాటు ఉన్న మరో జర్నలిస్టు గాబ్రియెల్‌ ఎజార్డ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులమని గుర్తించే అవకాశం ఉన్నా, జర్నలిస్టులమని కేకలు వేస్తున్నప్పటికీ పోలీసులు ఖాతరు చేయలేదని చెప్పాడు. ఈ బిల్లు తమను జైళ్లపాలు చేసేందుకు, పోలీసుల దుర్మార్గాలను జనానికి తెలియకుండా నిరోధించేందుకు తీసుకు వచ్చినట్లు జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. కరోనా పేరుతో ప్రదర్శనలకు అనుమతి లేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే శుక్రవారం నాడు కోర్టు వాటిని కొట్టివేసి ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. అనిశ్చితి మధ్య ఇంత పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావటం అక్కడి పరిస్ధితి తీవ్రతను తెలుపుతోంది. రెండు ఉదంతాల్లో పోలీసుల తీరు దీనికి కారణంగా చెబుతున్నారు.
గత సోమవారం నాడు జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు జనవరిలో ఎగువ సభ ఆమోదం పొందాల్సి ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఒక పోలీసు అధికారి ముఖం కనిపించే విధంగా చిత్రీకరించిన ఫొటో,వీడియోలను ప్రదర్శిస్తే 45వేల యూరోల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో లేనప్పటికీ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలను కలిగి ఉండేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, అనుమతితో నిమిత్తం లేకుండా నిరసనకారులను చిత్రీకరించేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగించేందుకు చట్టసవరణ అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లును ఆమోదించక ముందే పోలీసులు రెండు ఉదంతాల్లో ప్రవర్తించిన తీరు తీవ్ర నిరసనలకు దారి తీసింది. ఫ్రాన్స్‌లో రాజకీయ ఆశ్రయం కోరుతూ పారిస్‌ నగరంలో గుడారాల్లో ఉన్న నిర్వాసితులపై పోలీసులు దాడి చేశారు. మైకేల్‌ జక్లెర్‌ అనే ఆఫ్రికన్‌ జాతీయుడైన సంగీత చిత్ర నిర్మాతను అతని రికార్డింగు స్టూడియోలో ప్రవేశించిన పోలీసులు 20నిమిషాల పాటు కొట్టటం, నల్లజాతి మురికి వాడంటూ నిందించటం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆ దృశ్యాల వీడియోను రెండు కోట్ల మంది వీక్షించారు. పైగా అతను తమనే కొట్టాడంటూ పోలీసులు తప్పుడు కేసు పెట్టి రెండు రోజుల పాటు జైల్లో వేశారు. అయితే అతనిపై దాడి దృశ్యాలు వెలుగులోకి రావటంతో వదలిపెట్టక తప్పలేదు.
అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంలో పోలీసుల దుర్మార్గానికి వెల్లడైన వ్యతిరేకత, అదే విధంగా ఫ్రాన్స్‌లోనే పసుపు రంగు చొక్కాలతో నిరసన తెలిపిన వారి మీద పోలీసులు జరిపిన దాడుల పట్ల పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారు ఏమి చేసినప్పటికీ కేసులు నమోదు చేయకుండా రక్షణ కల్పించేందుకు తాజా బిల్లును మక్రాన్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది.పచ్చరంగు చొక్కాలతో నిరసన తెలిపిన వారి కండ్ల మీద కాల్పులు జరపటం, కొట్టటం,ఇతర శరీర భాగాలను చిత్ర హింసలకు గురిచేయటం వంటి దారుణాలకు పాల్పడినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఒక్క పోలీసు మీద కూడా చర్యలు లేవు. వాటికి బదులు పోలీసులకు ప్రశంశగా పతకాలను ప్రభుత్వం ప్రకటించటం జనానికి మరింత ఆగ్రహం కల్పించింది. ఎనభై సంవత్సరాల వయస్సున్న ఒక వృద్ధురాలిపై బాష్పవాయు గోళాన్ని విసిరి ఆమె చావుకు, అదే విధంగా ఒక సంగీత కచ్చేరిపై దాడి చేసినపుడు ఒక యువకుడు నీళ్లలో మునిగి మరణంచటానికి కారకుడైన పోలీసు దళ అధికారి అలాంటి పతకాలు పొందిన వారిలో ఉన్నాడు. సంగీత చిత్ర నిర్మాత జక్లెర్‌పై దాడితో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని స్వయంగా అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించినప్పటికీ పోలీసులకు అపరిమిత అధికారాలను ఇవ్వటంతో జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నలుగురిని సస్పెండ్‌ చేయటం, పోలీసు అత్యాచారాలపై విచారణకు ఆదేశించినప్పటికీ వారి మీద చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం జనానికి లేదు.
సోమవారం రాత్రి పోలీసులు జరిపిన దాడుల దృశ్యాలను మంగళవారం ఉదయం చూసి తాను దిగ్భ్రాంతి చెందినట్లు పోలీసు మంత్రి ప్రకటించగా అవధులు లేని వంచన అని అధ్యక్షుడు మక్రాన్‌కు ఉపన్యాసాలు రాసి ఇచ్చిన మాజీ రచయిత వర్ణించాడు.చిత్రం ఏమిటంటే అదే రోజు మధ్యాహ్నం పోలీసులకు రక్షణ కల్పించే బిల్లును పార్లమెంటు దిగువ సభలో ఆమోదించారు.పోలీసు దుశ్చర్యల గురించి తాము వ్యక్తం చేసిన దానికి-బిల్లు ఆమోదానికి సంబంధం లేదని చెప్పటం విశేషం. ఈ బిల్లును తీసుకువచ్చే ముందు హింసాకాండ మీద గుత్తాధిపత్యం అనే పేరుతో తీసిన ఒక డాక్యుమెంటరీ సినిమాలో పోలీసు దాడులను చిత్రించారు. పోలీసులు-ప్రదర్శకుల మధ్య జరిగిన ఉదంతాలను సెల్‌ఫోన్ల ద్వారా తీసిన దృశ్యాలను దీనిలో వినియోగించటం విశేషం. కొత్త బిల్లు ప్రకారం ఈ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదు.
నేతిబీరలో నెయ్యి వంటి సోషలిస్టు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసులకు అధికారాలను ఎక్కువగా ఇచ్చి ఉద్యమాలను అణచివేసింది. ఇప్పుడదే పార్టీ పోలీసులకు అధికారాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తోంది.ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ గతంలో సోషలిస్టు పార్టీలో పని చేశాడు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేస్తూ 2017 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతకు ముందు సంవత్సరం రాజీనామా చేసి ఎన్‌ మార్చ్‌(ముందడుగు) అనే పార్టీని ఏర్పాటు చేశాడు. దీనిలో వామపక్షంగా వర్ణితమయ్యే సోషలిస్టు పార్టీ, మితవాద పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ నుంచి అసంతృప్తి జీవులను చేరదీసి మధ్యేవాద పార్టీ పేరుతో రంగంలోకి వచ్చాడు.నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఉన్న పచ్చి మితవాద పార్టీ నాయకురాలు మారినే లీపెన్‌ మీద 2017 ఎన్నికల్లో మక్రాన్‌ ఘనవిజయం సాధించాడు. అప్పటి నుంచి కార్మికవర్గం పెద్ద ఎత్తున తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నది. పసుపు చొక్కాల పేరుతో వినూత్న రీతిలో ఆందోళనలు తలెత్తాయి. కరోనా కారణంగా ఉద్యమాలు పెద్దగా జరగపోయినా ఇటీవలి కాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.
2022లో తిరిగి ఎన్నికలు( ఇంకా 18నెలలు) జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలలో పచ్చి మితవాద నేషనల్‌ పార్టీ తిరిగి పెద్ద సవాలు విసరనున్నదనే వాతావరణం ఉంది. అయితే తాను సోషలిస్టునని ఇప్పటికీ చెప్పుకొనే మక్రాన్‌ ఇటీవలి కాలంలో మితవాద శక్తులను సంతుష్టీకరించి వారి ఓట్లను పొందే యత్నాలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తద్వారా మారినే లీపెన్‌ విజయానికి అతగాడు బాటలు వేస్తున్నట్లే అని కొందరు పేర్కొన్నారు. మితవాదులు అసలైన మితవాదులకు మద్దతు ఇస్తారు, మక్రాన్ను నకిలి మితవాదిగా పరిగణిస్తారని చెబుతున్నారు. గత ఎన్నికలలో రెండవ సారి జరిగిన ముఖాముఖీ పోటీలో మక్రాన్‌కు 65శాతం, లీపెన్‌కు 35శాతం వచ్చాయి. మాజీ బ్యాంకర్‌ అయిన మక్రాన్‌ తన అర్ధశాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక వ్యవస్ధను సరి చేస్తారని అనేక మంది కలలు కన్నారు. ప్రస్తుతం కరోనా రెండవ సారి విజృంభిస్తుండటం, తొలిసారి వచ్చినపుడే పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలటం, మరోవైపు మితవాదుల మద్దతు ఉన్న కార్పొరేట్ల వత్తిడి మక్రాన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడులతో ఇతర అనేక దేశాధినేతల మాదిరే ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారనే విమర్శలు మక్రాన్‌పై వచ్చాయి. ఉగ్రవాదాన్ని అణచేపేరుతో తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామిక హక్కులకు ముప్పు తెస్తున్నాయి. ఈ పరిణామం గురించి గతంలో మక్రాన్‌కు మద్దతు ఇచ్చిన 33 మంది ప్రముఖులు ఒక బహిరంగలేఖ రాశారు. ఈ దాడిని అనుమతించటం నయా ఫాసిస్టు తీవ్రవాదుల కలలను సాకారం చేయటమే, దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చటమే అని వారు పేర్కొన్నారు.ఈ చర్యలను అన్నిరకాల మితవాదులు బలపరిచారు. వలసల పేరుతో ముస్లింలను అనుమతిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. పారిస్‌ నగరశివార్లలో ఒక టీచరు తల నరికివేయటం, తరువాత ఒక చర్చిలో మూడు కత్తిపోటు ఘటనలు జరిగాయి. వీటిని చూపి ముస్లిం వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొడుతున్నారు. పోలీసులకే కాదు మిలిటరీకి కూడా రక్షణ చర్యలను వర్తింప చేయాలని నేషనల్‌ పార్టీ కోరుతోంది.
అధ్యక్షుడు మక్రాన్‌ పాలనా కాలంలో పోలీసు దాడులు పెరిగినట్లు అధికారిక వివరాలే వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,448 మంది ప్రదర్శకులు గాయపడ్డారు.19,071 ఎల్‌బిడిలను పేల్చారు.చిన్న చిన్న ఇనుప(పిల్లెట్స్‌) గుండ్లతో తయారు చేసిన తుపాకి గుండ్లు పేల్చారు.1,428 భాష్పవాయు గోళాలను వినియోగించారు. ఈ దాడుల్లో 344 మంది తలలకు గాయాలయ్యాయి, 29 మందికి కండ్లకు గాయాలు, ఐదుగురికి చేతుల గాయాలయ్యాయి. గతంలో ప్రదర్శనల సమయంలో పోలీసులు కాపలాకాయటం గురించి ఎక్కువగా కేంద్రీకరించే వారు ఇటీవలి కాలంలో ప్రదర్శకులను అవసరమైతే అడ్డుకోవాలన్న వైఖరి కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో గాయాలైనట్లు భావిస్తున్నారు. ఇది పోలీసుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఈ నేపధ్యంలో వారిని కాపాడేందుకు పోలీసుల ముఖాలు కనిపించే విధంగా దృశ్యాల చిత్రీకరణను నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం బిల్లును తెచ్చింది.
నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలకు వ్యతిరేకంగా గౌరవ ప్రదమైన ప్రవర్తనను కోరుతూ డిసెంబరు ఐదు నుంచి 11వ తేదీ వరకు ప్రజాసమీకరణ వారాన్ని పాటిస్తున్నట్లు ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కరోనా ఆరోగ్య సంక్షోభాన్ని ముందుకు తెచ్చింది. దాని నివారణకు కుటుంబవనరులన్నింటినీ ఖర్చు చేయాల్సి వచ్చింది. పదహారు శాతం ఆదాయం పడిపోయింది. ఎనభై లక్షల మంది ఆహార సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. డెబ్బయి లక్షల మందికి ఉపాధి పోవటం లేదా స్ధిరమైన ఉపాధి కరువైంది, మూడు లక్షల మంది స్త్రీ-పురుషులు గృహాలను కోల్పోయారు అని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. మరోవైపున ఐదు వందల బడా కంపెనీల ఆదాయాలు గత ఏడాది కంటే పెరిగాయి, డివిడెండ్ల రూపంలో 30బిలియన్ల యూరోలు చెల్లించాయి. ఇది కార్మికుల సొమ్ము తప్ప మరొకటి కాదు. కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఇలా జరిగిందని తెలిపింది. సంక్షోభానికి జనం, కార్మికులు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదని అందువలన ఈ విధానాలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించేందుకు నిర్ణయించినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపధ్యం, నిరంకుశ విధానాలను మరింతగా రుద్దుతున్న నేపధ్యంలో ఫ్రాన్స్‌లో రానున్నది పోరాటాల కాలం అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫ్రెంచి ‘పసుపు చొక్కాల’ ప్రతిఘటనతో ‘ఆకుపచ్చ’ పన్ను వాయిదా !

05 Wednesday Dec 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

emmanuel macron, France’s Yellow Vest Protests, Macron's taxes, Yellow Vest Protests

Image result for france yellow vest protests : green tax deferred

ఎం కోటేశ్వరరావు

పరిమితికి మించి బరువులెత్తిన నావ గడ్డిపోచను కూడా ఓపలేదు. జనం కూడా అంతేనా ? కాకపోతే కుటుంబానికి నెలకు పది యూరోలు లేదా 14 డాలర్ల అదనపు భారం(మన రూపాయల్లో 850) మోపే చమురు పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ నవంబరు 17 నుంచి ఫ్రాన్స్‌లో జనం వీధులకెక్కటం, అధ్యక్షుడు మక్రాన్‌కు ముచ్చెమటలు పట్టించటాన్ని ఏమనాలి? 2013, సెప్టెంబరు 16న హిందూస్తాన్‌ పెట్రోలియం(హెచ్‌పిసిఎల్‌) ప్రకటించిన వివరాల ప్రకారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.76.10. 2018 డిసెంబరు నాలుగవ తేదీన రు.71.78లు. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 117.58 డాలర్లు నేడు 60డాలర్లకు అటూ ఇటూగా వుంది. అంతర్జాతీయ ధర సగం పడిపోయినా ఆ దామాషాలో మన దగ్గర తగ్గకపోయినా మనకు చీమకుట్టినట్లు కూడా లేదు. దీన్ని బట్టి దేన్నయినా తట్టుకోగలిగిన విధంగా మన(చర్మాలు)ం తయారైనట్లు అనుకోవాలి. మోపిన భారాన్ని మనం భుజం మార్చుకోకుండా భరిస్తుంటే, వేయబోయే బరువు ప్రకటనతో ముందే ఫ్రెంచి జనాలు ఆందోళన ప్రారంభించారు. అంటే వారికి ఇంకే మాత్రం తట్టుకొనే శక్తి లేదన్నది స్పష్టం. ఆందోళనల్లో పాల్గంటున్నవారంతా నిరుద్యోగులు కాదు, ఇప్పటికే నెలలో 20వ తేదీ దాటితే జేబులు, ఇంట్లో ఫ్రిజ్‌లు ఖాళీ అవుతున్నాయి, ఇప్పుడు ఇదొకటా అంటూ పర్యావరణ పరిరక్షణ పేరుతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించిన ‘ఆకుపచ్చ’ పన్నుకు వ్యతిరేకంగా ‘పచ్చ చొక్కా’ యూనిఫారాలతో మూడువారాలుగా నిరసన తెలుపుతున్నవారిలో గణనీయ భాగం చిరుద్యోగులు కావటం విశేషం. పార్టీలు లేవు, నాయకులు అంతకంటే లేరు, ఎవరికి వారే కార్యకర్తలుగా భావించి వీధుల్లోకి వచ్చారు.

ఇప్పటి వరకు వివిధ సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కొందరు తిరగబడ్డారు, దెబ్బలు తిన్నారు, పోలీసులకు దెబ్బ రుచి చూపారు.డీజిల్‌ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన వుద్యమం కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది.సాధారణంగా పట్టణాలలో ప్రారంభమయ్యే ఆందోళనలు మెల్లగా పల్లెలకు పాకుతాయి. దీనికి విరుద్దంగా ఈ ఆందోళన గ్రామాలతో మొదలైంది. ఎందుకంటే పట్టణవాసులతో పోలిస్తే పల్లెటూరి వారు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. మన దేశంలో ఒకపుడు ఇంటికి విద్యుత్‌ వుంటే, తరువాత టీవీ, ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ వుంటే సంక్షేమ పధకాలకు అనర్హులని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాన్స్‌లో కూడా గ్రామీణ, చిన్న పట్టణాలలో సంక్షేమ పధకాలకు అనర్హులైన వారు, వచ్చే ఆదాయాలతో అస్తుబిస్తుగా గడుపుతూ ఇంకే మాత్రం భారం భరించలేని వారు ఆందోళనకు ఆద్యులయ్యారు. ఒక నాయకుడు లేదా ఒక పార్టీ ఇచ్చిన పిలుపు కాదిది, సామాజిక మాధ్యమంలో అభిప్రాయాలు కలిసిన వారి స్పందన. మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడు అన్న సామెత మాదిరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే ఒక ప్రతిభాశాలిగా ఏడాదిన్నర క్రితం పరిగణించిన అధ్యక్షుడు మాక్రాన్‌ను జనం ఇప్పుడు అన్నింటికీ అతనే కారణం అంటున్నారు. సంస్కరణల పేరుతో ధనికుల మీద సంపద పన్ను తగ్గించాడు. కార్మిక చట్టాలను మరింతగా నీరుగార్చాడు, చమురు భారాలు మోపటం వంటి వాటిని జనం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

పది సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌లో మోటారు వాహన చట్టానికి తెచ్చిన సవరణ ప్రకారం బండ్లను నడిపే వారు విధిగా కాంతి పడినపుడు వెలుగు నిచ్చే పచ్చచొక్కాలను ధరించాలి.(మన దగ్గర రాత్రుళ్లు పనిచేసే మునిసిపల్‌ కార్మికులు వేసుకొనే వెలుగుపడితే మెరిసే జాకెట్ల మాదిరి) ఇప్పుడు వాటితోనే పన్ను భారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళన రాజధాని పారిస్‌లో హింసాత్మకంగా మారి మరో మలుపు తిరిగాయి. తొలుత పెంచిన పన్ను తగ్గించాలన్న డిమాండ్‌కు ఇప్పుడు పన్నులు పోగా నెలకు కనీసవేతనం 1350 డాలర్లు వుండేట్లుగా నిర్ణయించాలన్న డిమాండ్‌ తోడైంది. కొందరు పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికలు జరపాలని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని కూడా నినాదాలు వినిపించారు. పాలకపార్టీ, ప్రభుత్వ నేతల బలహీనత వెల్లడైన తరువాత ఆ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఆందోళనను పక్కదారి పట్టించేందుకు, వక్రీకరించే ఎత్తుగడల్లో భాగంగా ఆందోళనల కారణంగా జరుగుతున్న నష్టం అంటూ మీడియా బూతద్దంలో చూపుతున్నది.ఈ ఆందోళనకు 73-84శాతం మధ్య జనం మద్దతు తెలిపారు. ఆందోళనకారులు రోడ్ల దిగ్బంధన సమయంలో ముగ్గురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటంతో సహజంగానే హింసాకాండను కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనతో దిక్కుతోచని సర్కార్‌ తొలుత చర్చలు జరిపేందుకు విముఖత చూపినా శనివారం నాడు జరిగిన హింసాత్మక ఘటనల తరువాత మాట్లాడేందుకు ముందుకు వచ్చింది. వుపశమన చర్యలను ప్రకటిస్తామని ప్రకటించింది. పద్దెనిమిది నెలల తరువాత మక్రాన్‌కు ప్రజావ్యతిరేకత అనూహ్యరూపంలో ఎదురైంది.

Image result for france yellow vest protests : green tax deferred

గత రెండు సంవత్సరాలలో డీజిల్‌ ధరలు 14 మరియు 22శాతాల చొప్పున 36శాతం పెంచారు. దీనిలో ప్రపంచ మార్కెట్లో పెరిగిన చమురు ధరల వాటాతో పాటు స్ధానికంగా పెంచిన పన్నుల మొత్తం కూడా కలిసింది.ఈ ఏడాది ఒక లీటరు డీజిల్‌ మీద 7.6సెంట్లు, పెట్రోలు మీద 3.9సెంట్లు పెంచారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పన్నులను మరో 6.5, 2.9శాతాలను జనవరి ఒకటి నుంచి పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పెంపుదలలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరల కంటే పన్ను భారమే ఎక్కువగా వుందని, దాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబరులో ఒక పౌరబృందం ఇంటర్నెట్‌లో ఒక పిటీషన్‌ తయారు చేసి సంతకాల సేకరణ వుద్యమాన్ని ప్రారంభించింది. జనాన్ని మభ్యపెట్టేందుకు అధ్యక్షుడు మక్రాన్‌ నవంబరు ప్రారంభంలో ఒక ప్రకటన చేస్తూ ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.పర్యావరణం దెబ్బతినటానికి ప్రధాన కారణం లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారుల వైఖరి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొందరు పర్యావరణ పరిరక్షణను ముందుకు తెస్తూ మక్రాన్‌ సర్కార్‌ తీసుకున్న చర్యల సమర్ధనకు దిగుతున్నారు.కాలుష్యానికి కారణమయ్యే డీజిల్‌ మోటార్‌ వాహనాల తయారీకి రాయితీలు ఇచ్చి మరీ ప్రోత్సహించిన వాటిలో ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకటి. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి అపరిమిత సంపదలు కూడబెట్టుకున్న కంపెనీలు, ఇతర ధనికుల మీద అధిక పన్నులు విధించి దామాషా ప్రకారం సామాన్యుల మీద కూడా విధిస్తే అదొక తీరు. పెట్టుబడిదారుల లాభాల వేటకు బలైందీ కార్మికవర్గమే, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదీ కార్మికవర్గమే.

ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల ఆందోళన సమీప ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్‌లో ప్రతిధ్వనించింది. నవంబరు 17న ఫ్రాన్స్‌లో దాదాపు మూడులక్షల మంది వివిధ ప్రాంతాలలో రోడ్డు దిగ్బంధనంతో ప్రత్యక్ష ఆందోళన ప్రారంభమైంది. ప్రతిశనివారం పెద్ద ఎత్తున సమీకరణలు జరుగుతున్నాయి.డిసెంబరు ఒకటిన తొలిసారిగా మక్రాన్‌ రాజీనామా డిమాండ్‌ ముందుకు వచ్చింది.గతనెల 21న ఫ్రెంచి పాలనలోని రీయూనియన్‌ దీవిలో హింసాకాండ చెలరేగటంతో సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. బెల్జియంలో అనేక పెట్రోలు బంకుల వద్ద నిరసనలు చెలరేగాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోని అనేక నగరాల్లో పసుపు చొక్కాలతో ప్రదర్శనలు చేశారు. అయితే ఇటలీలో ప్రభుత్వ వ్యతిరేకతకు బదులు తమ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న ఐరోపాయూనియన్‌కు వ్యతిరేకంగా పసుపు చొక్కాలతో నిరసన తెలుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Related image

గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పొదుపు పేరుతో తీసుకున్న ప్రజావ్యతిరేక చర్యల కారణంగా ప్రస్తుతం మక్రాన్‌ పలుకుబడి 26శాతానికి పడిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ లేదా ర్యాలీ పార్టీ పోటాపోటీగా తయారవుతుందని అంచనా. గత పది సంవత్సరాలలో ఫ్రెంచి రాజకీయాలలో ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ లేదా నేత మరోసారి గెలిచింది లేదు. రోడ్డుదాటటమే తరువాయి, నేను అధికారానికి రావటమే తరువాయి నీకు ఒక వుద్యోగం సిద్ధంగా వుంటుంది అన్నంతగా భ్రమలు కల్పించిన మక్రాన్‌ ఏడాదిన్నరలోనే యువత, మధ్యతరగతి ఆశలను ఏడాదిన్నరలోనే దెబ్బతీశాడు. తొలిసారిగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. గత నాలుగు దశాబ్దాల కాలంలో అన్ని ధనిక దేశాల మాదిరే ఫ్రాన్స్‌లో కూడా నూతన ఆర్ధిక విధానాలకు మూల్యం చెల్లించింది కార్మికవర్గమూ, మధ్యతరగతి వారే అంటే మొత్తంగా సమాజమే దెబ్బతిన్నది. విజయవంతమైందని చెప్పుకొనే ప్రపంచీకరణ నమూనా వారిని దెబ్బతీసింది. సంపదలు పెరుగుతూనే వున్నాయి. వాటితో పాటు నిరుద్యోగం, అభద్రత, దారిద్య్రమూ పెరుగుతున్నాయి. పట్టణీకరణ జరిగిన ఐరోపాలో పెద్ద నగరాల్లోనే పెట్టుబడులు దానికి అనుగుణంగా వుపాధి అవకాశాలుండగా గ్రామీణ, చిన్న పట్టణాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన సర్వత్రా వెల్లడి అవుతున్నది. తదుపరి ఐరోపాలో కూడా అదే జరగనుంది. మధనం ప్రారంభమైంది. సోషల్‌డెమోక్రటిక్‌ పార్టీలు, మితవాద పార్టీలు జనాన్ని ఇంతకాలం మభ్యపెట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు మితవాదానికి గురైదెబ్బతిన్నాయి. పచ్చిమితవాద శక్తులు తాత్కాలికంగా అయినా జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి. ఫ్రెంచి పచ్చచొక్కాల వుద్యమానికి కొన్ని పరిమితులు వున్నాయి.వాటిని అధిగమించి మరింత ముందుకు పోకుండా చూసేందుకు పన్ను పెంపుదలను ఆరునెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆందోళనకూ అంతేవిరామం వస్తుంది. అసంఘటితంగా వున్న వారు ఇచ్చిన పిలుపుకే ఇంత స్పందన వస్తే రానున్న రోజుల్లో ప్రతిఘటన మరింత సంఘటితంగా వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. పసుపు చొక్కాల వుద్యమం ఒక విధంగా భారాలు మోపే ప్రభుత్వానికి, దానికి తగిన ప్రతిఘటన చూపని ప్రతిపక్షాలకూ ఒక పెద్ద హెచ్చరిక. కోడి కూయనంత మాత్రాన సూర్యోదయం ఆగనట్లే, వుద్యమాలు కూడా ఆగవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫ్రెంచి నూతన అధ్యక్షుడి ముందు పెను సవాళ్లు !

08 Monday May 2017

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

emmanuel macron, french president, marine le pen, new french president

ఎం కోటేశ్వరరావు

పాలకవర్గాలు కోరుకున్న, పచ్చి మితవాద మారినె లీపెన్‌ ఓడిపోవాలంటే అని వార్యంగా ఓటు చేయటం తప్ప అక్కడి మితవాద వ్యతిరేక శక్తులకు మరొక ప్రత్యామ్నాయం లేని కారణంగా బాంకరు అయిన ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఆదివారం నాడు జరిగిన తుది ఎన్నికలలో భారీ మెజారిటీతో ఫ్రెంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాంప్రదాయ గాలిస్టు, సోషలిస్టు పార్టీలను పక్కన పెట్టి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా ఫ్రెంచి ఓటర్లు మూడో పార్టీకి అవకాశమిచ్చారు. నువ్వుగాకపోతే నేను, నేను గాకపోతే నువ్వు అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా నీకిది, నాకది అన్నట్లుగా పంచుకొనే రాజకీయాలకు కాలం చెల్లనుందా అనే ఆలోచనకు ఈ ఎన్నికలు తావిచ్చాయి. ఇదొక మంచి పరిణామమే తప్ప అలాంటిదేదో జరనుందని ముందే కోయిల రాగాలు కూయనవసరం లేదు.

ఫ్రాన్స్‌లో పచ్చి మితవాద నాజీశక్తులకు ప్రాతినిధ్యం వహించే మారినె లీపెన్‌ ఓడిపోయినంత మాత్రాన జనాకర్షక నినాదాలకు కాలం చెల్లినట్లు కాదు. గత ఆరునెలల్లో ఐరోపాలో జరిగిన ఎన్నికలలో పచ్చి మితవాదులుగా వర్ణితమైన శక్తులు ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌లో ఓడిపోయాయి. ఇది సంతోషకరమే అయినప్పటికీ అసలు అలాంటి శక్తులు అధికారానికి పోటీ పడేంతగా బలం ఎలా సంపాదించుకోగలిగాయి అన్నది ఆందోళన కలిగించే అంశం. అమెరికా నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవాలంటే వుమ్మడిగా వుండటం తప్ప మరొక మార్గం లేదనే ఆలోచన నుంచి పుట్టిందే ఐరోపా యూనియన్‌. దానిలో వుండి నలుగురితో లాభాలను పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ లబ్ది పొందవచ్చనే అభిప్రాయం వున్న పాలకవర్గ శక్తులు తొలి నుంచీ ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వున్నాయి. ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలా లేదా అనే అంశంపై బ్రిటన్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరిపితే 52శాతం మంది అనుకూలంగా ఓటు చేసిన విషయం తెలిసిందే. సకలరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా ఐరోపా యూనియన్‌తో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చేసిన ప్రచారం వాస్తవం కాదని తేలిపోయింది. ప్రపంచ ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం, గ్రీసు వంటి దేశాలు రుణ వూబిలో కూరుకుపోవటం, ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పొదుపు చర్యలే మార్గమనే పేరుతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న అనేక సంక్షేమ పధకాల కుదింపు, రద్దు, అదనపు భారాలను మోపటం వంటి చర్యలతో కార్మికవర్గానికి ఐరోపా యూనియన్‌ ప్రయోగంపై విశ్వాసం తగ్గటం ప్రారంభమైంది. యూనియన్‌ కొనసాగాలనే శక్తులు జనానికి భరోసా కల్పించే పరిస్ధితి లేదు.ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వచ్చింతరువాత మరింత సమర్ధవంతంగా తమ విధానాలను అమలు జరపాలంటే తిరిగి ప్రజల మద్దతు కోరటం అవసరమనే పేరుతో పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ వున్నప్పటికీ బ్రిటన్‌ మితవాద టోరీ పార్టీ మధ్యంతర ఎన్నికలకు గాను పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలలో ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావటమే తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అనే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా బలపడతాయనే ధోరణి వ్యక్తమౌతోంది.

ఫ్రాన్స్‌లో ఒక నాడు రాజకీయ పండితులు కొట్టిపారవేసిన నేషనల్‌ ఫ్రంట్‌ అనే పచ్చిమితవాద నాజీశక్తి అధ్యక్ష పదవికి పోటీపడటమే కాదు 34శాతం వరకు ఓట్లు తెచ్చుకొనే శక్తిగా ఎదిగింది. నాజీశక్తి అని ప్రచారం కావటం వలన ఓటర్లను అంతగా ఆకట్టుకోవటం లేదని గ్రహించి తాము మారామని చెప్పుకొనేందుకు ప్రయత్నించింది, దాని స్ధాపకుడైన మారిన్‌ లీపెన్‌ను ఆయన కుమార్తె అయిన మారినే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఆదివారం నాడు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఓటమని అంగీకరిస్తూ నేషనల్‌ ఫ్రంట్‌ను మరింత బలమైన శక్తిగా తిరిగి రూపొందించేందుకు ప్రయత్నించాలని మద్దతుదార్లకు పిలుపు నిచ్చింది. అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం, తదితర సమస్యలకు వలస వస్తున్న కార్మికులు, ముస్లింలు కారణమనే ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది.

అనేక దేశాలలో పొదుపు, సంస్కరణల పేరుతో సంక్షేమ చర్యలకు కోత, కార్మికవర్గంపై భారాలను మోపుతున్న పూర్వరంగంలో అనేక దేశాలలో వామపక్ష శక్తులు ఐరోపా యూనియన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. నేతి బీరలో నెయ్యి వంటి ఐరోపాలోని సోషలిస్టు పార్టీలు 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభ సమస్యలను పరిష్కరించటంలో మిగతా మితవాద పార్టీలకంటే తామేమీ ప్రత్యేకం కాదని రుజువు చేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో తుది విడత పోటీకే అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. గతేడాది హార్వర్డ్‌ కెన్నడీ స్కూలు వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం 1960 దశకంలో ఆరుశాతానికి అటూ ఇటూగా ఓట్లు తెచ్చుకున్న ఐరోపా జనాకర్షక నినాద మితవాద పార్టీలు వర్తమాన దశాబ్దంలో 13శాతానికి పెంచుకున్నాయి. ఇదే కాలంలో కొన్ని ఓట్లు తప్ప సీట్లు ఏమీ లేని వామపక్ష పార్టీలు దాదాపు పదిశాతం లోపుగా ఓట్లను పెంచుకున్నాయని పేర్కొన్నది. ఫ్రాన్స్‌ తొలివిడత పోటీలో వామపక్ష అభ్యర్ధి మెలంచన్‌ 20శాతం వరకు ఓట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నాది మితవాదం, వామపక్ష మార్గం కాదు మూడవ మార్గం అని చెప్పుకున్న ఇమ్మాన్యుయేలన మక్రాను ముందు తీవ్రమైన సవాళ్లే వున్నాయి. ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట అనే ధోరణిలో ధనిక దేశాలన్నీ వ్యవహరిస్తున్నాయి. అందరికంటే పెద్దన్న అమెరికా అయితే ఐరోపాలో పెద్దన్న జర్మనీని దాటి ప్రపంచమార్కెట్లో ఫ్రెంచి కంపెనీలు తమ వాటా సంగతి తేల్చుకోవాల్సి వుంది. రాజకీయంగా అటు నాజీలు, సాంప్రదాయ మితవాదులు, ఆచరణలో వారి కంటే భిన్నమైన విధానాలు లేని సోషలిస్టు పార్టీ, వాటి రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న కమ్యూనిస్టు పార్టీతో కూడిన వామపక్ష సంఘటన నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంది.గతానికి భిన్నంగా తన మూడవ మార్గం ఏమిటో రుజువు చేసుకోవాలి. ఫ్రెంచి పాలకవర్గం ఎదుర్కొంటున్న సంక్షోభం వ్యవస్తాపరమైంది తప్ప కార్పొరేటు కంపెనీల అంతర్గత సమస్య కాదు.

పెట్టుబడిదారీ విధానం తన సంక్షోభాల నుంచి బయట పడేందుకు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను వెతుకుతోంది.ప్రస్తుతం నయా వుదారవాద విధానం అమలు చేస్తోంది. అది ఇంత త్వరగా విఫలం అవుతుందని ఎవరూ వూహించలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని పెట్టుబడిదారులు ఇంకా తయారు చేసుకోలేదు, ప్రస్తుతం అదే వారి పెద్ద సమస్య. నూతన అధ్యక్షుడు, ఆయన ఏడాది వయస్సున్న ఎన్‌ మార్చ్‌, ఫార్వర్డు, ముందుకు పోదాం, ఆగే చలో పార్టీకి తొలి సవాలు వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలు. తుది విడత అధ్యక్ష ఎన్నికలలో 1969 తరువాత రికార్డు స్ధాయిలో నాలుగో వంతు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా వున్నారు. వీరుగాక ఖాళీ ఓట్లు, ఇద్దరికీ వేసి చెల్లకుండా చేసిన ఓట్లు మరో తొమ్మిది శాతం వున్నాయి. తొలి విడతలో ఇలాంటి ఓట్లు కేవలం రెండు శాతం మాత్రమే. అంటే మొత్తంగా చూస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు మక్రాన్‌ లేదా మారీ లీపెన్‌ అంటే వ్యతిరేకత కలిగి వున్నట్లు చెప్పవచ్చు. వీరంతా పార్లమెంట్‌ ఎన్నికలలో ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సి వుంది.

ఆదివారం నాటి వరకు అధికారంలో వున్న సోషలిస్టు పార్టీ ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు సామాన్యమైనవి కాదు. లక్షా 20వేల ప్రభుత్వ రంగ వుద్యోగాల రద్దు, 70శాతం మంది వ్యతిరేకించిన కార్మిక చట్టాల సవరణ బిల్లు ప్రభుత్వం, పార్లమెంట్‌ ముందు వున్నాయి. పార్లమెంట్‌ ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా అధ్యక్షుడిగా తన అధికారాన్ని వుపయోగించి నిరంకుశంగా అమలు జరుపుతారా ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

ఆర్ధిక మాంద్యాన్ని, పదిశాతం నిరుద్యోగులను గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా తెచ్చుకున్నారు. వుపాధి వున్నవారిలో 85శాతం మంది తాత్కాలిక వుద్యోగులే. యువతలో 23శాతం నిరుద్యోగులు. అన్నింటికీ మించి ప్రధాన ప్రత్యర్దిగా వున్న ఫాసిస్టు నేషనల్‌ ఫ్రంట్‌ రాబోయే రోజుల్లో మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత అసంతృప్తికి గురైతే మరోసారి యువజన, విద్యార్ధి వుద్యమాలకు ఫ్రాన్స్‌ కేంద్రంగా మారనుంది. అవి ఏశక్తుల చేతుల్లోకి పోతాయనేది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫ్రెంచి తొలి విడత ఎన్నికలు-సంప్రదాయ పార్టీలకు చెంప దెబ్బ

25 Tuesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

emmanuel macron, french communist party, french left party, french national front, French presidential election, French presidential election results round 1, jean luc melenchon, marine le pen, pcf, traditional parties

Image result for emmanuel macron epouse

తనకంటే 25 ఏండ్ల పెద్ద అయిన  భార్య బ్రిగిట్టితో 39 ఏండ్ల ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లు ఆ పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు గానీ గత యాభై సంవత్సరాలుగా అధికారంలో వుంటున్న రెండు పార్టీలను తుది విడత పోటీకి కూడా అనర్హులను గావించి తొలిసారిగా కొత్త వారిని ఎన్నుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. పోటీ చేసిన పది మంది అభ్యర్దులలో ఏ ఒక్కరికీ మెజారిటీ ఓట్లు రాకపోవటంతో తొలిరెండు స్ధానాలలో వున్న ఇద్దరు అభ్యర్ధుల మధ్య మే నెల ఏడవ తేదీన మరోసారి ఓటింగ్‌ జరగనుంది. ఈ ఫలితాలు వెలువడిన తరువాత ఫ్రెంచి, ఐరోపా స్టాక్‌ మార్కెట్ల సూచీలు పెరగటం, అనేక మంది విశ్లేషకులు హర్షం వెలిబుచ్చటాన్ని బట్టి , ప్రత్యర్ధిగా పచ్చి మితవాది వున్న కారణంగా మొదటి స్ధానంలో వుండి, మధ్యేవాదిగా వర్ణితమైన ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ తుది విడత ఓటింగ్‌లో విజేతగా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపా కమిషన్‌ పదవులలో వున్న వారు ఎన్నికల సమయంలో ఒక అభ్యర్ధికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయటం, వ్యాఖ్యానించటం వుండదు. ఈ సారి దీనికి విరుద్ధంగా ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ప్రధమ స్ధానంలో వున్నందుకు అభినందించటమే గాక తుది విడత కూడా విజయం సాధించాలని, మారీ లీపెన్‌ గెలిస్తే ఐరోపా యూనియన్‌ను నాశనం చేస్తారని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌ ప్రకటించారు. పోటీకి అర్హత సాధించటంలో విఫలమైన మితవాద రిపబ్లికన్‌, సోషలిస్టు పార్టీ కూడా మే ఏడవ తేదీ ఎన్నికలలో బలపరుస్తామని ప్రకటించాయి. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మితవాది లీపెన్‌ గెలిచే అవకాశాలు లేవు.ఈ ఎన్నికలలో వామపక్ష సంఘటన అభ్యర్ధి జీన్‌లక్‌ మెలంచన్‌ తుది విడత అధ్యక్ష పదవి పోటీలో వుంటారని భావించిన వామపక్ష అభిమానులు ఆశించిన విధంగా ఓటింగ్‌ లేకపోవటంతో ఒకింత ఆశాభంగానికి గురికావటం సహజం. ఫలితాల సరళిపై కమ్యూనిస్టు పార్టీ నేత పిరే లారెంట్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకోవటం ఫ్రాన్స్‌లోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా వామపక్ష అభిమానులలో ఆశలు పెంచే అంశం.రెండు, మూడు, నాలుగు స్ధానాలలో నిలిచిన అభ్యర్ధుల మధ్య వ్యత్యాసం రెండుశాతం కంటే తక్కువగా వుండటాన్ని బట్టి పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో వూహించవచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా వున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌( ఇఎంఎ) 24.01, లీపెన్‌(ఎఫ్‌ఎన్‌) 21.3, ఫిలన్‌(ఎల్‌ఆర్‌) 20.01,మెలంచన్‌ (ఎల్‌ఎఫ్‌) 19.58, హమన్‌ ( పిఎస్‌) 6.36, డ్యూపాంట్‌ ఇగ్నన్‌(డిఎల్‌ఎఫ్‌) 4.7,లాసాలే (ఆర్‌) 1.21,పౌటు (ఎన్‌పిఏ) 1.09 మరో ముగ్గురికి 0.92,0.64,0.18 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ప్రాధాన్యత, విశేషాలను క్లుప్తంగా చూద్దాం.

Image result for marine le pen

మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌  మారినే లీపెన్‌

1965 నుంచి 2012 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో సోషలిస్టు పార్టీ మూడు సార్లు, పలు పేర్లు మార్చుకున్న మితవాద పార్టీ ఆరుసార్లు అధికారానికి వచ్చింది. ఈ సారి ఆ రెండు పార్టీలకు చెందిన అభ్యర్ధులలో ఒక్కరు కూడా పోటీకి అర్హమైన సంఖ్యలో ఓట్లను సంపాదించుకోలేకపోయారు.అధికారానికి వచ్చి రెండవ సారి కూడా అధికారాన్ని కోరకుండా పోటీకి దూరంగా వున్న వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు హోలాండే చరిత్రకెక్కారు. ఆయన బదులు పోటీ చేసిన సోషలిస్టు పార్టీ (పిఎస్‌) అభ్యర్ధి హమన్‌ ఐదవ స్ధానంలో నిలిచారు. గత ఎన్నికలలో ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఫ్రాంకోయిస్‌ హాలాండే తొలి విడత 28.63 శాతం ఓట్లతో ప్రధమ స్ధానంలో నిలిచారు. అంతకు ముందు ఎన్నికలలో 25.87శాతంతో రెండవ స్ధానంలో వున్నారు. ఐరోపాలో సోషలిస్టు పార్టీలుగా వున్న శక్తులు మితవాద శక్తులకు భిన్నంగా వ్యవహరించకపోవటం, నయా వుదారవాద విధానాలలో భాగంగా అంతకు ముందు అమలులో వున్న సంక్షేమ పధకాలకు కోతలు పెట్టటంలో మితవాద శక్తులకు భిన్నంగా సోషలిస్టులు వ్యవహరించకపోవటంతో కార్మికవర్గం ఆ పార్టీలకు క్రమంగా దూరం అవుతోంది.ఇదే సమయంలో ప్రత్యామ్నాయశక్తులు రూపొందలేదు.

ఇక సాంప్రదాయక మితవాద శక్తులకు ప్రాతినిధ్యం వహించే యుఎంపి ఈ ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ(ఎల్‌ఆర్‌)గా పేరు మార్చుకొని పోటీ చేసి 19.9శాతం ఓట్లతో మూడవ స్ధానంలో నిలిచింది. గత ఎన్నికలలో 27.18శాతం ఓట్లతో రెండవ స్ధానం, 2007లో 31.18శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచింది.

ఫ్రెంచి రాజకీయ రంగంలో మితవాదులు, అతివాదులిద్దరినీ ఏకం చేస్తాను నేను ఏ భావజాలానికి చెందిన వాడిని కాదు, తనది మూడవ మార్గం అంటూ ఏడాది క్రితం ‘ముందుకు పోదాం’ పేరుతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ప్రభుత్వ వుద్యోగి, మాజీ విత్త మంత్రి, ఐరోపా యూనియను కొనసాగాలని కోరుకొనే బ్యాంకరు అయిన ఇమ్మాన్యుయెల్‌ మక్రానన ప్రజారంజక నినాదాలతో, ప్రభుత్వ వ్యతిరేక వుపన్యాసాలతో ఓటర్ల ముందుకు వచ్చాడు. సోషలిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభిన ఇతగాడు హోలాండు ప్రభుత్వంలో విత్త మంత్రిగా కూడా పని చేశాడు. హోలాండే ప్రభుత్వం ప్రజల నుంచి దూరం కావటాన్ని గమనించి గతేడాది ఆగస్టులో రాజీనామా చేసి అంతకు ముందే తాను ఏర్పాటు చేసిన ‘ముందుకు పోదాం’ పేరుతో రంగంలోకి దిగాడు. ఏడాది కూడా గడవక ముందే అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్దమయ్యాడు. కొంత మంది విశ్లేషకులు ఇతడిని వుదారవాది అని పిలిస్తే మరి కొందరు సోషల్‌ డెమాక్రాట్‌ అన్నారు. సోషలిస్టు పార్టీలో వున్న సమయంలో దాని లోని మితవాదులను బలపరిచాడు.

గతేడాది సోషలిస్టు పార్టీ నుంచి రాజీనామా చేసిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సోషలిస్టును కాదు అని చెప్పాల్సిందిగా నా నిజాయితీ నన్ను వత్తిడి చేసింది, వామపక్ష(సోషలిస్టు పార్టీని కూడా వామపక్షం అని పిలుస్తారు) ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకున్నానంటే ఇతరుల మాదిరి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్నాను ‘ అన్నాడు. ఫ్రాన్స్‌లో యూరో అనుకూల ఏకైక రాజకీయ పార్టీ తమదే అని స్పష్టీకరించాడు. ఆర్ధికంగా నయా వుదారవాద విధానాలను కొనసాగించాలని కోరే ఇతగాడు రాజకీయంగా అమెరికా అనుకూల వైఖరిని వివిధ సందర్భాలలో వెల్లడించాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించేందుకు వ్యతిరేకి. సిరియా విషయంలో అమెరికాను అనుసరిస్తాడు. ఈ కారణంగానే అతను ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిగా ముందు వరుసలో వుండటంతో ఫ్రెంచి, ఐరోపా, ప్రపంచ పెట్టుబడిదారులందరూ హర్షం వెలిబుచ్చారు. స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీశాయి. రెండవ విడత ఎన్నికలలో తమ ఓట్లు మాక్రాన్‌కే వేస్తామని వెంటనే రిపబ్లికన్‌ పార్టీ, సోషలిస్టు పార్టీల అభ్యర్ధులిద్దరూ ప్రకటించారు. వామపక్ష సంఘటన ఇంకా ప్రకటించలేదు. వామపక్ష, కమ్యూనిస్టు మద్దతుదారులు పచ్చి మితవాది మారినే లీపెన్‌కు ఓటు వేసే అవకాశం లేదు కనుక ప్రపంచ మీడియా మొత్తం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ కాబోయే ఫ్రెంచి అధ్యక్షుడు అన్న రీతిలో వార్తలు ఇచ్చాయి. కొందరు విశ్లేషకులు లీ పెన్‌ గెలుపు అవకాశాల గురించి కూడా చర్చించారు.

ఫ్రెంచి రాజకీయాలలో పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ ఎదుగుదల ఒక ముఖ్యాంశం.అల్జీరియాకు స్వాతంత్య్రం ఇవ్వటం, దానిపై ఆధిపత్యాన్ని వదులుకోవటం ఇష్టం లేని పచ్చి మితవాదుల బృందానికి చెందిన వ్యక్తి మారీ లీపెన్‌. అల్జీరియా ఫ్రాన్స్‌లో భాగమే అనే అవగాహనను వదులుకుంటున్నట్లు ఫ్రెంచి మితవాద పార్టీ అధ్యక్షుడు డీగాల్‌ ప్రకటించిన పూర్వరంగలో లీపెన్‌ తదితరులు 1972లో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దానికి లీ పెన్‌ నాయకుడయ్యాడు. 1973 పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసిన ఈ పార్టీకి దేశం మొత్తం మీద కేవలం 0.5శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. పారిస్‌లోని లీపెన్‌ నియోజకవర్గంలో ఐదుశాతం వచ్చాయి. ఇటువంటి పార్టీ 1981 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయటానికి తగిన అర్హతను కూడా సంపాదించలేకపోయింది. 1984 ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో 11శాతం ఓట్లు పది సీట్లు సంపాదించి ఫ్రెంచి రాజకీయాలలో సంచలనం సృష్టించింది.1988 అధ్యక్ష ఎన్నికలలో లీ పెన్‌ ఫ్రెంచి ప్రయోజనాలు ముందు అనే ప్రచారంతో పోటీ చేసి 14.4 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మూడవ ప్రధాన పార్టీగా అవతరించింది. 2002 అధ్యక్ష ఎన్నికలలో అనూహ్యంగా 16.86 శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్ధానంతో తొలిసారిగా లీపెన్‌ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.2007 ఎన్నికలలో 10.44 శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో, 2012లో 17.9 శాతంతో మూడవ స్ధానంలో తాజా ఎన్నికలలో 21.3 శాతంతో రెండవ స్ధానంలోకి నేషనల్‌ ఫ్రంట్‌ అవతరించింది. మారి లీపెన్‌ కుమార్తె మారినే లీపెన్‌ 2012 ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేశారు. మారీ లీపెన్‌ వివాదాస్పద, నేర చరిత్ర, వదరుబోతు తనం కారణంగా నేషనల్‌ ఫ్రంట్‌ను అభిమానించేవారికంటే వ్యతిరేకించే వారు ఎక్కువయ్యారు. ఈ పూర్వరంగంలో 2015లో ఒక ప్రత్యేక సమావేశంలో లీ పెన్‌ను ఆయన కుమార్తె స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఐరోపా యూనియన్‌ నుంచి ఫ్రాన్స్‌కు విముక్తి కలిగించటమే తన లక్ష్యమని ఆమె తన ప్రచార అస్త్రంగా చేసుకుంది.

Image result for jean luc melenchon

వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన  మెలెంచన్‌

ఈ ఎన్నికలలో మూడవ స్ధానంలో రిపబ్లికన్‌ పార్టీ వుండగా స్వల్ప తేడాతో నాలుగవ స్ధానంలో వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన జీన్‌ లూ మెలెంచన్‌ వున్నారు. ఆయన 19.58శాతం ఓట్లు సాధించటం ఈ ఎన్నికల ప్రత్యేకతలలో ఒకటి. ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పార్లమెంట్‌ ఎన్నికలలో గరిష్టంగా 28శాతం సంపాదించగా అధ్యక్ష ఎన్నికలలో 1969 ఎన్నికలలో ఆ పార్టీ గరిష్టంగా 21.7శాతం ఓట్లు సాధించింది. ఆ దశకంలో అక్కడ జరిగిన యువజన-విద్యార్ధి వుద్యమాల పూర్వరంగంలో ఈ ఫలితం వచ్చింది. తరువాత 1981ఎన్నికలలో 15.35 శాతం వచ్చాయి తరువాత క్రమంగా తగ్గుతూ 2007 ఎన్నికలలో 1.93శాతానికి పడిపోయాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో 1989-2014 మధ్య 7.7-5.9 శాతం మధ్య ఓట్లు వచ్చాయి. ఫ్రెంచి పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా దాదాపు అదే ప్రతిబింబించింది. 2012 ఎన్నికలలో మెలెంచన్‌ వామపక్ష ఫ్రంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి 11 శాతం తెచ్చుకున్నారు. తాజా ఎన్నికలలో ఒక దశలో మొదటి రెండు స్ధానాలలో వుంటారా అన్నట్లుగా ప్రచారం జరిగింది. అభిప్రాయ సేకరణలో తొలి నలుగురు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవటంతో తొలిసారిగా ప్రాన్స్‌లో తీవ్ర మితవాద, సమరశీల వామపక్ష అభ్యర్ధి మధ్య పోటీ వుంటుందా అన్న వాతావరణం వచ్చింది. ఆ కారణంగానే మెలెంచన్‌ గనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే తాము ఫ్రాన్స్‌ నుంచి పెట్టుబడులతో సహా వెళ్లిపోతామని కొందరు పెట్టుబడిదారులు ఎన్నికల ముందు బెదిరింపులకు దిగారు. సోషలిస్టు పార్టీలో తీవ్ర వామపక్ష వాదిగా వున్న మెలెంచన్‌ ఆ పార్టీ విధానాలతో విబేధించి 2008లో దాన్నుంచి విడివడి వామపక్ష పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామిగా వున్న వామపక్ష సంఘటన అభ్యర్ధిగా గత రెండు ఎన్నికలలో పోటీ చేశారు. అయితే మీడియా ఆయనను కమ్యూనిస్టుగా వర్ణించింది తప్ప ఆయనేనాడూ కమ్యూనిస్టుపార్టీలో పని చేయలేదు. కార్మికుల పని గంటలను వారానికి 35 నుంచి 32కు తగ్గించాలని,నెలకు 33వేల యూరోలు దాటిన వారి ఆదాయాన్ని బట్టి పన్ను రేటును 100శాతానికి పెంచాలని, వుద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రభుత్వ ఖర్చును పెంచాలని, మెలెంచన్‌ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నాటో నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలని, రష్యాతో సఖ్యతగా వుండాలని,మితవాదులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వున్న విధానాలను ఐరోపా యూనియన్‌ సంస్కరించని పక్షంలో యూనియన్‌ నుంచి వైదొలగాలని అన్నారు. ఆయన ప్రచార తీరును చూసి మితవాద పత్రిక లీ ఫిగారో ‘ఫ్రెంచి ఛావెజ్‌ ‘ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద పారిశ్రామిక సంస్ధ మెడెఫ్‌ ప్రతినిధి పిరే గాటెజ్‌ మాట్లాడుతూ ఆర్ధిక విధ్వంసం-ఆర్ధిక గందరగోళం మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వుంటుందని, లీపెన్‌-మెలెంచన్‌ మధ్య పోటీ పరిస్ధితి గురించి వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల గురించి కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో చేసిన వ్యాఖ్యలలోని కొన్ని అంశాలు ఇలా వున్నాయి.’ తొలి విడద ఎన్నికల ఫలితాలు దేశంలోని తీవ్ర పరిస్ధితికి నిదర్శనం. జీన్‌ లక్‌ మెలాంచన్‌ దాదాపు 20శాతం ఓట్లు తెచ్చుకోవటం భవిష్యత్‌పై నూతన ఆశలను రేకెత్తిస్తోంది. నూతన సమాజం కోసం గొంతెత్తిన లక్షల మంది పోరాటం కొనసాగుతుంది. వారి ఆకాంక్ష ఇంకా పెరగనుంది.పట్టణాలలో మంచి ఫలితాలు వచ్చాయి. ఫ్రెంచి రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.మానవాళి విముక్తి అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పని చేస్తున్నది.తక్షణ కర్తవ్యంగా మే ఏడున జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష పదవికి మారినె లీపెన్‌ ఎన్నిక కాకుండా అడ్డుకోవటం. అంటే దీని అర్ధం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ మంత్రిగా వున్నపుడు ఆయన అమలు జరిపిన వుదారవాద, సామాజిక వ్యతిరేక కార్యక్రమానికి మద్దతు పలికినట్లు కాదు, వాటికి వ్యతిరేకంగా రేపు కూడా పోరాడుతాము.అధ్యక్ష ఎన్నికలలో రెండవ దఫా ఎన్నికలతో ఎదురైన పరిస్ధితులలో జూన్‌ 11,18 తేదీలలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తొలి విడత ఎన్నికలలో సాధించిన ఓట్లను బట్టి ప్రజా ప్రయోజనాలకు బద్దులై వుండే కమ్యూనిస్టుపార్టీ, వామపక్ష సంఘటనలోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకోవాల్సి వుంది.’ అని పేర్కొన్నది.

ఫ్రెంచి రాజకీయాలలో మఖలో పుట్టి పుబ్బలో అంతరించింది అన్నట్లుగా అనేక పార్టీలు పుట్టి ఒకటి రెండు ఎన్నికలలో పోటీ చేసి తరువాత కనుమరుగు కావటం ఒక ధోరణిగా వుంది. అలాంటి కోవకే చెందిన ముందుకు పోదాం (ఎన్‌ మార్చ్‌) అనే పార్టీ సాంప్రదాయ పార్టీలను తోసి రాజని తొలిసారిగా ఏకంగా అధికారానికి వచ్చే బలాన్ని సంపాదించుకోవటం ఒక నూతన పరిణామం. ఐరోపాలోని అనేక దేశాలలో నెలకొన్న రెండు పార్టీల వ్యవస్ధలకు కాలం చెల్లనుందా అనేందుకు ఇది సూచన. అదే జరిగితే సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు వేగవంతమౌతాయి. ఫ్రాన్స్‌లో మితవాద నినాదాలు, రాజకీయాలతో నేషనల్‌ ఫ్రంట్‌ బలం పుంజుకోవటంతో పాటు వామపక్ష పార్టీ క్రమంగా బలం పెంచుకోవటం కూడా ఒక ముఖ్య పరిణామమే.

2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పూర్వరంగంలో మితవాద శక్తులు జాతీయవాదం ముసుగులో ప్రపంచీకరణను వ్యతిరేకించటం, దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారులకు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కోరటం, ప్రజలపై భారాలు మోపే విధానాలకు మద్దతు పలకటం అనేక దేశాలలో వెల్లడౌతున్న కొత్త పరిణామం. ఐరోపా యూనియన్‌ నుంచి విడివడి తన పలుకుబడి, పూర్వపు సంబంధాలతో తమ దేశ పెట్టుబడిదారులకు మేలు చేయగలమనే ధీమాతో బ్రిటన్‌ పాలకవర్గం ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐరోపా యూనియన్‌లో ప్రస్తుతం జర్మనీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తన ఆర్ధిక బలంతో మిగతాసభ్య దేశాలతో వాణిజ్య మిగులు సాధించిన జర్మన్లపై మిగతా దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. మే ఏడున జరిగే ఎన్నికలలో అందరూ వూహిస్తున్నట్లు కొత్త పార్టీ నేత ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఎన్నికై తన విధానాలను ప్రకటించిన తరువాత మరింత స్పష్టత వస్తుంది. అయితే స్టాక్‌ మార్కెట్‌ సంబరాలను బట్టి కార్పొరేట్‌ శక్తులకు అనుకూల వైఖరి తీసుకుంటారని, పెను మార్పులేమీ వుండవని కొందరు విశ్లేషకుల అంచనాలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. అదే జరిగితే ఆగ్రహం, నిరాశా నిస్పృలతో వున్న ఫ్రెంచి యువత ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: