• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: fake news

నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !

18 Saturday Mar 2023

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Asle Toje, BJP, BJP Propaganda, fake news, godi media, Narendra Modi, Nobel peace prize, PM Modi


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ – ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా(ఫేక్‌), వక్రీకరణ సమాచారం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా నరేంద్రమోడీని అపహాస్యం పాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బిబిసి లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్‌ శాంతి బహుమతికి నరేంద్రమోడీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్‌ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది.రామ రామ తానసలు అలా చెప్పలేదని టోజె ఖండించాడు. అది ఫేక్‌ వార్త అని దానికి శక్తి లేదా ప్రాణ వాయువును అందించవద్దని అన్నాడు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించే ప్రబుద్దుల మాదిరి మోడీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఎవరో ఒక కొత్త రిపోర్టరు లేదా సబ్‌ ఎడిటర్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా వ్యవహరించాయి.


నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను 5 దశాబ్దాల పాటు వెల్లడించకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోడీ ప్రధాన పోటీదారు అని చెప్పాడంటే వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అసలు గతంలో పోటీ పడుతున్నారంటూ ఎవరి గురించీ అలాంటి వార్తలు రాలేదు.ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు.టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్‌ కమిటీ ఉపనేత హౌదాలో ఢిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌(ఐసిఎఫ్‌) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు.” ఒక కుహనా వార్త ట్వీట్‌ను చేశారు.దాన్ని కుహనా వార్తగా చూడాలి. ఇక్కడకు భారత రాజకీయాలు, అభివృద్ది గురించి మాట్లాడటానికి వచ్చాను.కుహనా వార్త గురించి చర్చించకూడదు లేదా దానికి శక్తి లేదా ప్రాణవాయువును అందించాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్‌లో రాసినట్లుగా నేనేమీ చెప్పలేదని విస్పష్టంగా చెబుతున్నాను.” అన్నాడు.


అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్‌ విలేకరితో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ సంక్షోభంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక సానుకూల వైఖరితో స్పందించారు.అణ్వాయుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు.వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్‌ పుతిన్‌కు చెప్పారు.ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.” అని చెప్పాడు.ఫేక్‌న్యూస్‌ను వండి వార్చింది టైమ్స్‌ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. నరేంద్రమోడీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు.దీంతో మోడీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. టైమ్స్‌నౌ ఛానల్‌తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఐసిఎఫ్‌ చైర్మన్‌ వైభవ్‌ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుడుగా చిత్రించారన్నారు.టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు.పధకం ప్రకారం చేసి ఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్‌ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్‌ హౌటల్లో ఉన్నానని, టైమ్స్‌ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోడీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్‌ ఛానల్‌ యాంకర్‌ మోడీ-బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి, ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి ” అన్నాడు తప్ప మోడీ పోటీదారనో మరొకటో చెప్పలేదు.నోబెల్‌ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా వాటిలో 212 మంది వ్యక్తులు, 93 సంస్థలవి ఉన్నాయి. అసలు నరేంద్రమోడీ నామినేషన్‌ ఉన్నదో లేదో కూడా తెలియదు.


మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారం చేసే ఫేక్‌ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్‌ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్‌ టిప్‌ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్‌ రాజకీయవేత్త అమీర్‌ లియాకత్‌ హుసేన్‌ డాన్స్‌ చేసినట్లు ఒక వీడియో వైరలైంది.నిజానికి అతను సొహాయిబ్‌ షుకూర్‌ అనే డాన్స్‌మాస్టర్‌. టైమ్స్‌ నౌ, నవభారత్‌ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్‌ కుమార్‌ దాస్‌ నీట్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరా చూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన రాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడి కాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్‌ ఛానల్‌ శ్రీ లంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం 500 వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పని చేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.


అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్‌, టీవీ9, ఇండియాటీవి,ఆసియానెట్‌, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి.నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి.నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. జెసిబి ట్రాక్టర్‌ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్‌ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జింపింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణం అరెస్టయిన మాజీ మంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారం చేశాయి.పీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడు వార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి.


అసలు గమనించాల్సిందేమంటే ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి చేసిన కృషి ఏమిటి అన్నది ప్రశ్న. తటస్థంగా ఉండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడిన వారిలో మోడీ ఒకరు తప్ప నివారణకు ఇతరుల కంటే భిన్నంగా చేసిందేమీ లేదు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో విశ్వగురువు, ప్రపంచ నేత అని ఎవరెన్ని చెప్పినా ఏ అంశంలోనూ నిర్దిష్టపాత్రను పోషించి ఒక అంశాన్ని కొలిక్కితెచ్చిన ఉదంతం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా రెండూ మనకు మిత్రదేశాలే. అలాంటి స్థితిలో అమెరికా బెదిరింపులు, వత్తిడికి లొంగి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అంటే అమెరికా వైపు నిలిచినట్లు సందేశమిచ్చాము. ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసినా మన దేశం వైపు నుంచి చేసిందేమీ లేదు. చిత్రం ఏమంటే ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే అమెరికా సానుకూలంగా స్పందించింది. ఆరు రోజుల తరువాత మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ సమస్యల పరిష్కార చర్చలకు మన దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని ముక్తసరిగా మాట్లాడారు.ఇరాన్‌-సౌదీ ఒప్పందం కుదరటానికి చైనా నిర్వహించిన పాత్ర చివరి క్షణం వరకు ప్రపంచానికి బహిరంగంగా తెలియదు. ఇలాంటి చొరవ తొమ్మిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ వైపు నుంచి ఎక్కడా లేదు. మన దేశంలోని జాతీయ టీవీలు, పత్రికలకు దీని గురించి తెలియదని అనుకోగలమా ? ప్రపంచ శాంతికి నరేంద్రమోడీ ఏమి చేశారని నోబెల్‌ బహుమతి వస్తుందని అలాంటి కుహనా వార్తలకు తావిచ్చినట్లు ?ఎవరినైనా ప్రభావితం చేయగల నరేంద్రమోడీ నోబెల్‌ కమిటీని పైరవీ చేసి బహుమతి తెచ్చుకోగల సమర్థత ఉందని జర్నలిస్టులు నిజంగా నమ్ముతున్నారా ? నోబెల్‌ కమిటీ ఉపనేత గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అంశాన్ని ప్రపంచ మీడియా మూసిపెడుతుందా ? విశ్వగురువుగా చెబుతున్న నరేంద్రమోడీకి ప్రపంచంలో ఎంత పరువు తక్కువ ? ప్రపంచ నేతలకు ఈ వార్తలు చేరకుండా ఉంటాయా ? భారత్‌ గురించి విదేశీ మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు మోడీ మద్దతుదార్లు ఊరూవాడా నానా యాగీ చేస్తున్నారు. తమ నేత పరువు తీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

18 Wednesday May 2022

Posted by raomk in CHINA, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain IRD, fake news, Indonesian Communist Party (PKI)., Propaganda War, UK black propaganda


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కట్టు కథలు. పిట్ట కథలు, అతిశయోక్తులు !

09 Monday Aug 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

fake news, fake stories, RSS Propaganda


ఎం కోటేశ్వరరావు


మన జీవితాలు ఎలా తయారయ్యాయంటే రోజుకు ఒక కుహనా వార్త లేదా వక్రీకరణ అంశం లేకుండా గడవని పరిస్ధితి. నరేంద్రమోడీ గారు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి చైనాను మించి పోవాలని చెప్పారు. దానికి బదులు కొద్ది పెట్టుబడితో పుంఖాను పుంఖాలుగా కుహనా వార్తలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇటీవలి కాలంలో పుట్టుకువచ్చాయి. మంచి వార్తలు రాసే వారికి జీతాలు సరిగా ఉండవు గానీ వక్రీకరణ వార్తలు, వీడియోలు తయారు చేసే వారికి ఎలాంటి సమస్యలూ లేవు. కరోనాతో అనేక మీడియా సంస్దలు సిబ్బందిని తొలగించాయి గానీ కుహనా వార్తల తయారీ ఇంకా పెరిగింది. లేని గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా కట్టు కధలు అల్లటం, పిట్టకథలు చెప్పటం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు, పట్టభద్రులు పెరిగిపోయిన తరువాత ఇక చెప్పనవసరం లేదు. చెబుతున్న కథలు కూడా కాపీ, పేర్లు మారతాయంతే ! కొందరికి అభిమానులుగా ఉన్న వారు నిజానిజాలను నిర్దారించుకోకుండా వారి గురించిన అతిశయోక్తులను తాము నమ్మటమే కాకుండా ఇతరులకూ పంపిణీ చేస్తుంటారు. కొన్నింటిని పరిశీలించుదాం.


వియత్నాంలోని హౌచిమిన్‌ సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారన్నది వాటిలో ఒకటి. వియత్నాం ఒక చిన్న దేశం. జపాన్‌, ఫ్రెంచి, అమెరికన్‌ సామ్రాజ్యవాదులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాగించి తమ గడ్డమీది నుంచి పారదోలిన వీరగడ్డ. అంత పెద్ద దేశం మీద మీరు ఎలా విజయం సాధించారు అని ఒక విలేకరి అడిగితే మాకు ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ద పద్దతి ఉపయోగపడింది అని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడట. నేను గొప్ప రాజైన శివాజీ వ్యక్తిత్వం,చర్యల గురించి చదివాను, యుద్దతంత్రం నన్ను ఎంతో ఉత్తేజపరించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించాం, విజయం సిద్దించింది. అలాంటి రాజు గనుక మా దేశంలో జన్మించి ఉంటే ప్రపంచాన్ని ఏలి ఉండేవారం.
శివాజీకి నివాళిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నది ఒక పిట్టకధ. తన సమాధిరాయి మీద శివాజీ మహరాజ్‌ గురించి రాయించుకున్నాడని కూడా కథలు చెప్పారు. తరువాత కొన్నేండ్లకు వియత్నాం మహిళా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఎర్ర కోట, మహాత్మాగాంధీ సమాధులను సందర్శించినపుడు శివాజీ సమాధి ఎక్కడ అని అడిగారట. కంగారు పడిన అధికారులు మహారాష్ట్రలోని రైగఢ్‌లో ఉందని చెప్పగా తాను అక్కడికి వెళ్లాలని చెప్పినట్లు, తరువాత సమాధిని సందర్శించి అక్కడి మట్టి తీసుకొని తన బ్రీఫ్‌కేసులో వేసుకున్నట్లు, విలేకర్లు ఎందుకా మట్టి అని అడగ్గా తమ దేశమట్టిలో దాన్ని కలుపుతానని, అలా చేస్తే శివాజీ వంటి ధైర్యవంతులు అక్కడ పుడతారని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ విలేకరి రాసినట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమంటే అమెరికా మీద యుద్దం ముగిసిన తరువాత ముగిసిన తరువాత వియత్నాం విదేశాంగ మంత్రిగా మహిళలెవరూ పని చేయలేదు. అమెరికా దురాక్రమణలో ఉన్న దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన తిరుగుబాటు ప్రభుత్వంలో 1969-76 మధ్య కాలంలో గుయెన్‌ తీ దిన్‌ అనే కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అన్నింటికీ మించిన పెద్ద అబద్దం ఏమంటే హౌచిమిన్‌ సిటీలో ఉన్నట్లు చెబుతున్న విగ్రహం అసలు శివాజీది కాదు. వియత్నాం మాజీ రాజు ట్రాన్‌ నగాన్‌ హన్‌ విగ్రహమది.


మరొక కధలో శివాజీతో పాటు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ పేరు చేర్చి ప్రచారం చేశారు. రెండు కథల్లోను రాసిన మరొక అంశం ఏమంటే వియత్నాం అధ్యక్షుడు తాను మరణించిన తరువాత తన సమాధి మీద ” ఇతడు శివాజీ, రాణాప్రతాప్‌ ఆరాధకుడు ” అని రాయించాలని ఆదేశిస్తే అలాగే చేశారట ఇక్కడ మనం గమనించాల్సింది. శివాజీ, రాణా ప్రతాప్‌ సింగ్‌లు వియత్నాం కమ్యూనిస్టులకు ఉత్తేజమిచ్చారని చెప్పటం కట్టుకధలు తప్ప మరొకటి కాదు. భారత చరిత్ర గురించి అధ్యయనం చేసిన పండితులు ఒకరిద్దరికి ఆ పేర్లు తగిలి ఉండవచ్చు తప్ప కమ్యూనిస్టు పార్టీకి ఉత్తేజమిచ్చేంత సీన్‌ లేదు.వియత్నామీయులకు ఉత్తేజమిచ్చింది మార్క్సిజం-లెనినిజం, సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప శివాజీ, రాణాలు కాదు. వారి నుంచి మన దేశంలోని వారే ఉత్తేజం పొందలేదు. అదే జరిగి ఉంటే మొగలాయీల పాలనకు, తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవారు. అదేమీ లేదు.


శివాజీ, రాణా ప్రతాప్‌ కథలను ప్రచారం చేసింది కాషాయ దళాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని కాపీకొట్టిన వారు వారి పేర్ల బదులు అంబేద్కర్‌ పేరు చేర్చి మరొక కథను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అదెలా ఉందో చూడండి. ” వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. అది అమెరికా లాంటి బలమైన దేశం మెడలు వంచింది.దాదాపు 20 సంవత్సరాల వరకు జరిగిన యుద్ధంలో అమెరికా పరాజయం చెందింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత వియత్నాం దేశాధ్యక్షున్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.ప్రశ్న అందరికీ విదితమే, మీరు యుద్ధం ఎలా గెలిచారు? అమెరికాను ఎలా తలవంచేలా చేశారు.కాని,ఆ ప్రశ్న కు ఇచ్చిన జవాబు మీరు వింటే కేవలం ఆశ్చర్యమే కాదు. మీ గుండె గర్వం తో నిండి పోతుంది.ఇచ్చిన జవాబును మీరు చదవండి. దేశాలన్నీంటిలోకీ అమెరికా చాల బలమైన దేశాన్ని ఓడించుటకు భారతదేశానికి చెందిన ఒక గొప్ప మహా నేత చరిత్ర ను చదివాను.ఆయన జీవితం యొక్క ప్రేరణను ఆచరించి నేను సులభంగా విజయాన్ని సాధించాను.ఎవరు ఆ గొప్ప నాయకుడు అని జర్నలిస్ట్‌ అడిగాడు.


”మిత్రులారా! ఇది నేను చదినప్పటినుండి నా గుండె గర్వంతో ఉప్పొంగినది. అలాగే మీ గుండె కూడ గర్వంతో నిండి పోతుంది. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు.ఆయనే భారతదేశ మహానాయకుడు భీంరావ్‌ అంబేద్కర్‌. ఆయన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నారు. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే సమయంలో తన కళ్ళలో వీరత్వం మెరిసిసింది.అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మా దేశంలో పుట్టిఉంటే నేను ప్రపంచాన్నే పాలించేవాన్ని అన్నారు.కొన్ని సంవత్సరాలకు ఆ దేశాధ్యక్షుడు మరణించిన తరువాత తన సమాధి పై ఏం రాయించుకున్నాడో తెలుసా! ”ఈ సమాధి ఒక భీంరావ్‌ అంబేద్కర్‌ శిష్యుని సమాధి అని”. కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన కు వచ్చాడు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మొదట ఎర్రకోట తరువాత గాంధీ సమాధి చూపించారు. ఇదంతా చూచిన తరువాత ఆ మంత్రి మహానీయ భీంరావ్‌ అంబేద్కర్‌ సమాధిó ఎక్కడ అని అడిగాడు.అప్పుడు భారత అధికారి ఆశ్చర్య పోయి ముంబై లోని దాదర్‌లో ఉన్న చైత్య భూమి అని చెప్పాడు.ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ముంబై వెళ్ళారు.అక్కడ బాబాసాహేబ్‌ సమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద కొంత మట్టిని తిసుకుని బ్యాగ్‌ లో నింపుకున్నాడు.ఓ విలేకరి ఆ మట్టి గురించి అడగగా ఆ మంత్రి ఇలా అన్నారు.”ఈ మట్టి బాబాసాహేబ్‌ పాదాల వద్ద ఉన్నది. ఈ మట్టిని నాదేశ మట్టితో కలుపుతాను ,దీనితో నాదేశంలో ఇలాంటి నాయకుడు జన్మిస్తాడని ఆశిస్తున్నాను.బాబాసాహేబ్‌ భీం రావ్‌ అంబేద్కర్‌ కేవలం భారత దేశానికే కాకుండా సమస్త విశ్వానికే గర్వ కారణం.” ఈ కథ ఇప్పుడు వాట్సాప్‌లలో తిరుగుతున్నది. అంబేద్కర్‌ ఒక సంస్కర్తగా దేశ చరిత్రలో ఆయన స్దానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతిశయోక్తులు చెప్పటం ద్వారా సాధించేదేమిటి ? కాపీ కథ ఆయనకు గౌరవం పెంచుతుందని భావిస్తున్నారా ?


ఇక అతిశయోక్తులు, ఘనతల చెప్పుకోవటాలు సరేసరే ! ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి రోజువారీ అంశాల గురించి చర్చ జరుపుతుంది. దాని నిబంధనల ప్రకారం శాశ్వత, రెండు సంవత్సరాల పాటు సభ్యులుగా ఉండే దేశాలలో నెలకు ఒకరు చొప్పున అధ్యక్షత వహిస్తుంటారు. సాధారణంగా ఐరాసలో శాశ్వత అధికారులుగా ఉన్న ఆయా దేశాల ప్రతినిధులే ఆ పని చేస్తారు. ఆగస్టు నెల అధ్యక్ష పదవి మన దేశానికి వచ్చింది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వంతులను నిర్ణయిస్తారు. ఇదేదో ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడికి నిదర్శనం అన్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. భద్రతా మండలికి మన దేశం ఎన్నిక కావటం మొదటిసారి కాదు, ఎన్నికైన ప్రతిసారీ మనవంతు వచ్చినపుడు ఆ బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టిఎస్‌ తిరుమూర్తి మన శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మోడీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న హర్దీప్‌ సింగ్‌ పూరీ రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరొకటి తొలిసారిగా ఒక భారత ప్రధాని భద్రతా మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారంటూ అదొక ఘనతగా ప్రచారం చేస్తున్నారు. భద్రతా మండలిలో ప్రతినెలా వివిధ అంశాల మీద బహిరంగ చర్చలు జరుగుతుంటాయి. భద్రతా మండలి సభ్యదేశాల అధిపతులు లేదా ప్రతినిధులు వాటిలోప్రత్యక్షంగా పాల్గొంటారు, కాని దేశాల వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పిస్తారు. అలాంటి నెలవారీ కార్యక్రమంగా ఈనెలలో సముద్రయాన భద్రత అంశం గురించి చర్చిస్తున్నారు. దానికి మన ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మంది దేశాధినేతలు పాల్గొంటారో తెలియదు. ఇదొక గోష్టి వ్యవహారం తప్ప అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. పెగాసస్‌ భూతంతో అనేక అంశాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీకి ఈ గోష్టి ప్రపంచ మీడియాలో చోటు కల్పిస్తుంది. ఇలాంటి వాటిని గొప్పగా చెప్పుకోవటమా లేదా అన్నది ఎవరి అభిరుచి వారిది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కల్పిత వార్తలతో జనాలకు కహానీలు చెబుతున్న మీడియా !

03 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#media lies on China, fake news, fake stories in media, media lies, Trump lies

ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.


మే, జూన్‌ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.


అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.


రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్‌ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్‌ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్‌ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.


ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్‌ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్‌ టీవీ అవమానించింది.
టైమ్స్‌ నౌ ఛానల్‌ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్‌ జియాంగ్‌ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్‌ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్‌ వెబ్‌ సైట్‌ వెల్లడించింది.


ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్‌ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్‌ న్యూస్‌ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్‌ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.


మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్‌ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్‌ న్యూస్‌) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.


జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్‌ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. గాల్వన్‌ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్‌ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్‌ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్‌ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్‌ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్‌ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్‌ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్‌ చల్‌ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్‌ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్‌ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్‌ వెబ్‌సైట్‌ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.


ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్‌ పత్రిక ట్రంప్‌ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్‌ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్‌ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్‌, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.


ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్‌ న్యూస్‌ అనే ఒక వెబ్‌సైట్‌ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్‌ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్‌ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్‌, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్‌ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్‌ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్‌ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్‌ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.


డోనాల్ట్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?


ఈ నేపధ్యంలో చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

27 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chinese global times survey, fake news, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫేక్‌ న్యూస్‌ బాధితులు సీత-రాముడు- లక్ష్మణుడు !

04 Saturday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Conspiracy theory, Coronavirus fake news, fake news

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కల్పిత వార్తల సంవత్సరంగా ముగిసిన 2016 !

31 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

2016 year of fake news, fake news, fake news stories, Misinformer, whatsapp

సత్య

    నిజం నాలుగు వేసే లోగా అవాస్తవం అరవైై అంగల దూరం ప్రయాణిస్తున్న కాలమిది. ప్రపంచవ్యాపితంగా కల్పిత, నకిలీ వార్తలు ప్రచారం, వేగం రోజు రోజుకూ పుంజుకుంటోంది. అలాంటి వాటిని సృష్టించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా రంగంలోకి వస్తున్నాయన్నది నమ్మలేని నిజం. ఒక వస్తువు చివరి వినియోగదారుడికి చేరక ముందే దాని నకిలీ తిష్టవేస్తున్నట్లుగానే నిజమైన వార్తలతో పాటు కల్పిత వార్తలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవటం వర్తమాన వ్యాపారాలలో ఒకటిగా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నిలకు ముందు నుంచీ మన దేశంలో ఈ వ్యాపారం తామరతంపరగా పెరిగింది. ఒక సాంస్కృతిక సంస్ధ ముసుగులో పని చేస్తున్న వారు ఒక పెద్ద కల్పిత, నకిలీ, పుకార్ల కర్మాగారాన్నే పెట్టారు. దానికి అనుబంధంగా అనేక చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పారు. వందల మందిని నియమించి కోట్లాది రూపాయల వేతనాలతో నడుపుతున్నారు. తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు, తమ పట్ల విమర్శనాత్మక వైఖరిని కలిగి వున్న జర్నలిస్టులు, మేథావులు, ఇతరులను అన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలతో, ఇతర విధాలుగా దెబ్బతీయటం నిత్య కార్యక్రమం. వీటి బండారాన్ని జనం తెలుసుకొనే సమయానికి అవి చేయాల్సిన పని, ప్రయోజనం, హాని చేస్తాయి. ఒక వార్త నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొనే అవకాశం, తీరిక అందరికీ వుండదనే బలహీనతను వాటి సృష్టి కర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. తాము నమ్మిన వార్త అవాస్తవమని తెలుసుకున్నవారు నిజమైన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మరు. ప్రతిదానినీ అనుమానిస్తూ వుంటారు. స్వార్ధశక్తులకు కావాల్సింది కూడా అదే. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, సారా, కులం, మతం, మీడియాలో డబ్బిచ్చి వార్తలు రాయించుకోవటం వంటి ప్రలోభాలతో పాటు కల్పిత వార్తలు కూడా ఒకటిగా చేరాయని 2016 మరింతగా నిరూపించింది. అందుకే ఒక సంస్థ ముగిసిన ఏటిని అబద్దాల సంవత్సరంగా ప్రకటించింది.

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచంలో కల్పిత వార్తలకు మన దేశం ఒక ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. దేశంలో 16కోట్ల వాట్సాప్‌లుంటే నెలకు వంద కోట్ల సార్లు వినియోగిస్తున్నారని అంచనా. ఫేస్‌ బుక్‌ ఖాతాలున్నవారు 15 కోట్లు, ట్విటర్‌లో 2.2కోట్ల మంది వున్నారని చెబుతున్నారు. వీటి ప్రభావం ఎంతగా వుందంటే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారు కూడా తామెక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో సోషల్‌ మీడియాలో ప్రచారంలో పెడుతున్న చెత్తను స్వీకరించి పాఠకులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం. గతేడాది జనాన్ని బురిడీ కొట్టించిన అనేక వార్తలలో కొన్నింటిని చూద్దాం.

    ‘నరేంద్రమోడీని ప్రపంచ వుత్తమ ప్రధానిగా యునెస్కో ప్రకటించింది’ ఇదొక కల్పిత వార్త.జూన్‌ నెలలో వాట్సాప్‌ గ్రూపులలో ప్రారంభమై ఇతర సోషల్‌ మీడియాలో చెలరేగింది. ఐక్యరాజ్యసమితి గానీ, దాని ఆధ్వర్యంలో నడిచే యునెస్కో వంటి సంస్ధలుగా గానీ అలాంటి అవార్డులు ఇవ్వవు, అయినా సరే అది ఇంకా తిరుగుతూనే వుంది. అలాగే జనగణమనను కూడా వుత్తమ జాతీయ గీతంగా అదే సంస్ధ ప్రకటించిందన్న తప్పుడు వార్త గురించి కూడా తెలిసిందే. ఇది 2008 నుంచి తిరుగుతోంది. ఒకసారి అందుకున్నవారికి అనేక సార్లు వచ్చి వుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులకు తోడు రెండువేల రూపాయల నోటు వచ్చి చిల్లర సమస్యను జత చేసి మరింత చికాకు కల్పించటాన్ని అందరం చూశాము. సరిగ్గా ఈ సమయంలోనే మన రెండు వేల రూపాయల నోటు ప్రపంచంలో అత్యంత వుత్తమ కరెన్సీ అని యునెస్కో కితాబు ఇచ్చిందనే సమాచారం వాట్సాప్‌ జనాలను వూపేసింది. ఇప్పటికింకా మీకు రాకపోతే త్వరలో వస్తుంది. ఇలాంటి వాటిని నిజమని నమ్మి ఇతరులకు చేరవేసే మన వాట్సాప్‌ గ్రూపు వినియోగదారుల తెలివితక్కువ తనం గురించి బిబిసి ప్రపంచానికంతటికీ తెలియచేసింది.

   ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను పెంచేందుకు రంగంలోకి దించిన మరొక వార్త రెండువేల రూపాయల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారన్నది. న్యూఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్ధులు దేశ వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారంటూ సృష్టించిన కల్పిత వీడియోలను పదే పదే ప్రచారం చేసిన జీ న్యూస్‌లోని బిజెపి భక్తుడైన సీనియర్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరి రెండువేల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారనే తప్పుడు కధనాన్ని కూడా జీ న్యూస్‌లో ప్రసారం, ప్రచారం చేశాడు. ఆ నోటును వుపగ్రహాలు కనుగొంటాయని, 120మీటర్ల లోతున భూ గర్బంలో దాచినా సిగ్నల్స్‌ ద్వారా పట్టుకోవచ్చునని ఇదంతా నరేంద్రమోడీ ఘనత అనే అర్ధం వచ్చేట్లుగా కట్టుకధలు చెప్పాడు. దాంతో మిగతా ఛానల్స్‌ కూడా దానిని కాపీ చేశాయి, కొత్త అంశాలను కలిపి చెప్పాయి. 15 ప్రోటాన్స్‌, 17 న్యూట్రాన్స్‌ వున్న రేడియో యాక్టివ్‌ ఐసోటోప్‌లు కొత్త నోట్లలో వున్నాయని కూడా ప్రచారం చేశారు. నిజమే అని వాట్సాప్‌ వీరులు ఎలా వ్యాపింప చేసిందీ చూశాము. నరేంద్రమోడీ, బిజెపి భక్తులు దానిని పెద్ద ఎత్తున వ్యాపింప చేశారు. చివరికది అవాస్తవమని తేలింది. మోడీ సర్కార్‌ నుంచి ప్రశంసలు లేదా ప్రతిఫలం పొందేందుకు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ కూడా కల్పిత వార్తలను తయారు చేసి దేశం మీదకు వదిలింది. తన వుద్యోగి ఒకడిని సామాన్యుడి మాదిరి ఒక టీస్టాల్లో నిలబెట్టి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పించింది. సామాజిక మీడియాలో కొంత మంది అతనిని గుర్తు పట్టి బండారాన్ని బయటపెట్టటంతో ఆ వార్తా సంస్ధ పరువు మురికి గంగలో కలిసింది.

    వాట్సాప్‌లోని ఫొటోలను ఐస్‌ వుగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం వున్నందున వెంటనే వాటిని తొలగించాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ పేరుతో ప్రచారం జరిగింది. ఒక 20-25 రోజుల పాటు ఫొటోలు పెట్ట వద్దని ఈ లోగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ సిఇఓ చెప్పినట్లుగా దాని కొనసాగింపుగా మరో పుకారు షికారు చేసింది. పది రూపాయల నాణాన్ని రిజర్వు బ్యాంకు రద్దు చేసిందన్న ప్రచారం కూడా ఈ కాలంలోనే వాట్సాప్‌లో తిరిగింది. అనేక చోట్ల దుకాణదారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరించారు. నిరాకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది.

   తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత కుమార్తె అని, అమెరికాలో రహస్యంగా జీవిస్తోందంటూ ఒక ఫొటో వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో తిరిగింది. అయితే అది అవాస్తవమని, ఆ యువతి ఆస్ట్రేలియాలో వుంటోందని, జయలలితకు సంబంధం లేదని తరువాత తేలింది. జయలలిత మరణించిన తరువాత దీనిని సృష్టించారు.

    మన దేశానికి దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల సముద్రతీరం, పుష్కలంగా వుప్పు తయారీకి అవకాశం వున్నప్పటికీ దేశంలో వుప్పు కొరత ఏర్పడిందన్న వాట్సాప్‌ మెసేజ్‌ రాగానే నిజమనుకొని జనం ఎగబడి కిలో వుప్పును మూడు, నాలుగు వందల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయటాన్ని చూశాము. కాన్పూరులో వుప్పుకోసం ఒక దుకాణాన్ని లూటీ చేసేందుకు ఎగబడిన జనాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఒక మహిళ మరణించింది. తన నోట్ల రద్దు చర్యతో దెబ్బతిన్నవారే ఈ పుకార్లు పుట్టించారని నరేంద్రమోడీ ఆరోపించారు.

    ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలుపుతూ భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక వటవృక్షంలా తయారై దేశాన్ని, జనాన్ని ఎదగనివ్వలేదంటూ మన దేశంలో బిబిసి విలేకరిగా పనిచేసిన మార్క్‌తులీ వ్యాఖ్యానించారంటూ ఒక నకిలీ వార్తను పుట్టించారు. తానలాంటి వ్యాఖ్య చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

    అంతర్జాతీయ విషయాలకు వస్తే డిసెంబరు నెలలో వచ్చిన ఒక వార్త పాకిస్ధాన్‌ మంత్రి ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేయటానికి దారి తీసింది. ఏదో ఒక సాకుతో పాకిస్తాన్‌ గనుక సిరియాకు సైన్యాన్ని పంపితే తాము పాక్‌పై అణుదాడి చేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి బెదిరించినట్లు ఒక వార్త వచ్చింది. అది ఎంత వరకు నిజమో తేల్చుకోకుండానే పాక్‌ మంత్రి ఆసిఫ్‌ ట్విటర్‌ ద్వారా ఒక ప్రకటన చేస్తూ తమ దేశం కూడా అణ్వస్త్ర దేశమే అని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు. తరువాత ఇజ్రాయెల్‌ మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని వెల్లడైంది. నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కల్పిత వార్తల తయారీ కేంద్రాలు, కార్మికులు ఓవర్‌టైమ్‌ పని చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే పొలైటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ 2016ను అబద్దాల సంవత్సరంగా వర్ణించింది. కల్పిత వార్తలను తామరతంపరగా తయారు చేయటమే కాదు, వాటిని జనం నమ్మటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అమెరికా ఎన్నికలకు మూడునెలల ముందు కాలంలో ఓ ఇరవై కల్పిత వార్తలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. వాటిపై వ్యాఖ్యలు, ఇష్టపడిన(లైక్‌), పంచుకున్న (షేర్‌) వారి సంఖ్య 8.71 మిలియన్లని తేలింది. ఇదే సమయంలో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికలుగా పరిగణనలో వున్న వాటిలో వచ్చిన 20 ముఖ్య వార్తలపై స్పందించిన వారు 7.36 మిలియన్ల మంది మాత్రమే వున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో కల్పిత వార్తలు ఎంతగా ప్రాచుర్యంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

     అమెరికా అధ్యక్షుడిగా పచ్చిమితవాది డోనాల్డ్‌ ట్రంప్‌ గెలవటంలో కల్పిత వార్తలు కూడా ముఖ్య పాత్ర వహించాయంటే అతిశయోక్తి కాదు. దీనిని గుర్తించే వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న ఎన్నికలలో ఓటర్లు కల్పిత వార్తల బారిన పడకుండా చూసేందుకు కల్పిత వార్తల నుంచి రక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ కేంద్రం అలాంటి వార్తల గురించి ఓటర్లను విద్యావంతులను గావిస్తుందట. ముఖ్యంగా రష్యన్‌, టర్కిష్‌ భాష మాట్లాడే జర్మన్‌ పౌరులు ఈ కల్పిత వార్తల బారిన ఎక్కువగా పడే అవకాశం వుందని భావిస్తున్నారు. కల్పిత వార్తలుగా తేలిన వాటిని తమ వేదికలపై నుంచి తొలగించని సామాజిక మీడియా సంస్ధలకు జరిమానా విధించాలని జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యులు ఇప్పటికే డిమాండ్‌ చేశారు. ఫ్రాన్స్‌లో కూడా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కల్పిత వార్తల ధాటి పెరగవచ్చని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.

     మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి కల్పిత వార్తలను తయారు చేస్తున్నారు. వలస వచ్చిన శరణార్ధి బెర్లిన్‌ నగరంలో 13 సంవత్సరాల రష్యన్‌ జాతికి చెందిన ఒక బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఇంకేముంది రష్యాలోని ముస్లిం వ్యతిరేక మితవాద శక్తులు చెలరేగిపోయి అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ దెబ్బకు తట్టుకోలేని రష్యన్‌ ప్రభుత్వం ఈ వుదంతాన్ని మూసిపెట్టేందుకు జర్మన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించేవరకు వెళ్లింది.

    అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణ సెల్లార్‌లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ అనుచరులు బాలలతో ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక వార్తను వదిలారు. అది నిజమే అని నమ్మిన ఒక వ్యక్తి అక్కడి బాలలను రక్షించేందుకు వచ్చి పీజా కేంద్రంలో కాల్పులు జరిపాడు. అయితే ఎవరూ గాయపడలేదు. తీరా అక్కడ సెల్లార్‌ లేదు, వ్యభిచార కేంద్రం లేదని తెలుసుకొని పోలీసులకు లొంగి పోయాడు. హిల్లరీ క్లింటన్‌ ఐఎస్‌ తీవ్రవాదులకు నిధులు అందచేసినట్లు, డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ బలపరిచినట్లు , షరియా చట్టాన్ని ఫ్లోరిడా రాష్ట్రంలో అమలు జరపాలని డెమోక్రటిక్‌ పార్టీ కోరినట్లు కల్పిత వార్తలు వచ్చాయి. ఇవన్నీ రిపబ్లికన్‌ పార్టీ వారు డబ్బిచ్చి ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు చేసిన అవాంఛనీయ వ్యవహారాలని వేరే చెప్పనవసరం లేదు.

     కల్పిత వార్తల తయారీకి వాటితో లబ్ది పొందే వారి నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు వాటిని చదివే, చూసే పాఠకులను ఆకర్షించేందుకు ఆ వార్తలలో పెట్టే ప్రకటనల ద్వారా కూడా తయారీదారులు, వాటిని జనానికి పంచే 180 కోట్ల వినియోగదారులున్న ఫేస్‌బుక్‌, తదితర వెబ్‌సైట్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది.అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ శివార్లలో కల్పిత వార్తల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జెస్టిన్‌ కోలెర్‌ తాను ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా నెలకు పది నుంచి 30వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు అంగీకరించాడు. అమెరికా ఎన్నికలలో కల్పిత వార్తలతో డబ్బు సంపాదిస్తున్నవారిని గమనించిన తరువాత పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లలో ఒకటైన జార్జియాకు చెందిన ఒక కంప్యూటర్‌ విద్యార్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా కల్పిత వార్తలు తయారు చేస్తే బాగా గిట్టుబాటు అవుతోందని గ్రహించి ఆమేరకు అందుకు పూనుకోగా ఒక నెలలో తనకు గరిష్టంగా ఆరువేల డాలర్లు వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. కల్పిత వార్తల వేదికగా మారినట్లు తీవ్ర విమర్శలు రావటంతో గూగుల్‌, ఫేస్‌బుక్‌ యాజమాన్యం వాటి నివారణకు తాము కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

     సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియా తీరుతెన్నులను పరిశీలిస్తున్నవారు 2017లో కూడా ప్రజలపై కల్పిత వార్తల దాడి ఎక్కువగానే వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో వాటి నిరోధం, జనానికి చైతన్యం కలిగించే చర్యలపై కూడా దృష్టి సారించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కల్పిత వార్తలు- కట్టు కధలతో హిల్లరీకి దెబ్బ- మోడీకి లబ్ది

11 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News

 

Image result for  Hillary Clinton ,pizzagate

సత్య

    ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్‌, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.

   మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్‌ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !

    మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్‌ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్‌ పాంగ్‌ రెస్టారెంట్‌లోని సెల్లార్‌లో చిన్న పిల్లలతో సెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్‌ జాన్‌ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్‌ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్‌ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్‌ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్‌ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్‌ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్‌ మేనేజర్‌ మధ్య జరిగిన ఇమెయిల్‌ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్‌సైట్‌ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్‌ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్‌ మేనేజర్‌ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.

    చిత్రం ఏమిటంటే పీజాగేట్‌ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్‌బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్‌ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.

    మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్‌ మాడిసన్‌ వాల్చ్‌ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్‌ రాకెట్‌ నడిచిందన్న సెల్లార్‌ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్‌ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్‌లో గనుక సెల్లార్‌ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్‌ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.

     ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.

Image result for narendra modi fake news, fake photos

ఈ ఫొటో గురించి ఫేస్‌బుక్‌ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్‌ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: