• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: fuel politics

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెట్రోలు ధరలు : రావణదేశంలో 89, సీత పుట్టింట్లో 100, రామరాజ్యంలో 120 !

28 Thursday Apr 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీ గారికి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి.ఆమ్‌ ఆద్మీ ఢిల్లీ సర్కార్‌ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా ? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్దితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను, కొన్ని రాష్ట్రాలు వాట్‌ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్థంభింప చేశాయి. ఇవన్నీ దేశ లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రు.118.14, పాట్నాలో రు.116.23, బెంగలూరులో రు.111.09, లక్నోలో రు.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా ? గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్‌ 25న పెట్రోలు రేటు రు.373, అదే మన కరెన్సీలోకిి మార్చితే రు.80.39.సీతాదేవి పుట్టిన నేపాల్లో రు.100 ఉంది.మన రామరాజ్యంలో రు.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రు.61.41, బంగ్లాదేశ్‌లో రు.79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.


పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్‌ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి ? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ కూడా జారీ చేసింది ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్‌ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ది పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ? ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.


ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రు.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రు.25,89,388 కోట్లు ? కాంగ్రెస్‌ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత ? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత ? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?


ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది.2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రు.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రు.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్‌ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్‌ మొత్తం రు.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం.2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రు.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రు.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రు.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్‌ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు ఐదువేల కోట్లు గుజరాత్‌లకు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు.బిజెపి ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.


ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్టీసికీ చిల్లర ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్‌ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు,రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి. ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్టీసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్టీసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులు బాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్టీసి లేదా మరొక రాష్ట్ర సంస్ధకైనా, రిటైల్‌ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి. ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరు కాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు 85లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని,ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది. మిగతా రాష్ట్రాల ఆర్టీసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజిలు పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షలు – అమెరికా అసలు లక్ష్యం ఇంధన మార్కెట్‌ కబ్జా !

05 Tuesday Apr 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

fuel politics, Narendra Modi, oil, Sanctions on Russia, US crude to India, US imperialism


ఎం కోటేశ్వరరావు


” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !


మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్‌ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?


నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.


ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్‌ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్‌ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్‌ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్‌ డ్యూటీ లేదా సెస్‌ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.


ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.


ఏప్రిల్‌ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్‌ పీపాల విడుదలకు బైడెన్‌ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్‌ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్‌ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్‌ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.


రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్‌ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్‌ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.


మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్‌ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్‌, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్‌ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.


మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్‌ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్‌ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.


తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్‌ పొపోవ్‌ ఏప్రిల్‌ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్‌ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్‌ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్‌ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్‌ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపికి చమురు సెగ : ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం – చమురుపై మూడేండ్లు పన్నులు పెంచం !

09 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


బిజెపికి చమురు సెగ తగిలింది. తమను గెలిపిస్తే ఏడాదికి ప్రతి ఇంటికి మూడు గాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మూడు సంవత్సరాల పాటు చమురుపై పన్నులు పెంచబోమని గోవా బిజెపి ఓటర్లకు వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తే లీటరు పెట్రోలు ధర రు.80కి మించి పెరగనివ్వం అని వాగ్దానం చేసింది.దీని మీద బిజెపి మానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో వాహనాలకు అమర్చే ఇంజన్లను ఇథనాల్‌తో నడిపించవచ్చని, అది లీటరు ధర రు.62కు మించదని, అందువలన కాంగ్రెస్‌ రు.80 పరిమితి విధించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతపరమ రహస్యం తెలిసిన పెద్దలు తామే ఆ ముక్క వాగ్దానంగా చెప్పవచ్చు, అంత సంతోషకరమైన వార్తను కేంద్రమే ఒక ప్రకటనగా చేయవచ్చు. ఇంక బిజెపి పెద్దలు గోవాలో అమెరికా ప్రమాణాలతో కూడిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా సెలవిచ్చారు.


అమెరికా – ఇరాన్‌ మధ్య అణుచర్చలు జరుగుతాయనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.సఫలమైతే మరికొంత తగ్గవచ్చు, విఫలమైతే పెరగవచ్చు. అంటే అమెరికా చర్యలు అంతర్జాతీయ మార్కెట్‌ మీద ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నా అమెరికాకు పెద్దగా పట్టదు, అదే ఇరాన్‌ జరిపితే దానికి నొప్పి ఏమిటి ? ఏ దేశాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదా ? దాని రాజకీయం, లబ్ది కోసం ప్రపంచమంతా బలి కావాలా ? అలాంటి అమెరికా తోకపట్టుకొని మనం పోవాలా ?


గత ఏడు సంవత్సరాలలో తొలిసారిగా ఫిబ్రవరి ఏడున బ్రెంట్‌ రకం ముడిచమురు 94 డాలర్లను తాకింది(దానికి ఒక డాలరు తక్కువగా మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధర ఉంటుంది) అమెరికా-ఇరాన్‌ పరోక్షంగా చర్చలను ప్రారంభించనున్నాయి.దీంతో బుధవారం నాడు 90.6 డాలర్ల వద్ద మార్కెట్‌ ఉంది. గతంలో అంగీకరించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన కారణంగా తాను అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాన్ని సాకుగా తీసుకొని మన దేశంతో సహా ఎవరూ ఇరాన్‌ చమురు కొనుగోలు చేయకూడని అమెరికా ఆంక్షలు విధించింది. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు మనం తలొగ్గి మిత్రదేశమైన ఇరాన్‌ నుంచి చమురుకొనుగోలు నిలిపివేశాము. ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను అమెరికా తొలగించటంతో ధరలు పరిమితంగా తగ్గాయి. చమురుకు డిమాండ్‌ పెరుగుతున్నందున ఇది తాత్కాలికమే అని చెబుతున్నారు.


గతంలో ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధరలను సౌదీ అరేబియా స్వల్పంగా తగ్గించినపుడు చూశారా నరేంద్రమోడీ పలుకుబడి అంటూ డబ్బాకొట్టారు. ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు సౌదీ ప్రకటించింది. నోరు మూతపడింది. నిజానికి గతంలో కూడా ఒక్క మన దేశానికే కాదు, ఇతర ఆసియా దేశాలకూ తగ్గించింది. ఇప్పుడు గిరాకీ ఉంది కనుక ఎంతైనా కొనుగోలు చేయక తప్పదు. వెనెజులా కూడా మనకు మిత్రదేశమే.దాని దాడికి దిగిన అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి కూడా మనం చమురు కొనుగోలు నిలిపివేశాము. పేరుకు స్వతంత్ర దేశం ఆచరణలో అమెరికా అడుగులకు మడుగులొత్తటం.వెనెజులా బదులు మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి మెక్సికో కోత పెట్టింది.గతేడాది రోజుకు 98వేల పీపాలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దాన్ని 15వేలకు తగ్గించారు. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధానంలో భాగంగా ఈ చర్యతీసుకున్నట్లు చెబుతున్నారు. మనకు చమురును విక్రయించే దేశాలు సమంజసమైన ధరలకు చమురు సరఫరా చేయాలని కోరుతున్నట్లు మన చమురుశాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలి ఫిబ్రవరి ఏడున రాజ్యసభలో చెప్పారు. గతంలో ఇరాన్‌ మనకు రవాణా రాయితీతో పాటు, ప్రపంచంలో ఎక్కడా చెల్లని మన రూపాయిలను తీసుకొనేందుకు కూడా ఇరాన్‌ వీలు కల్పించింది. ఇప్పుడు దానితో పరోక్షంగా వైరం తెచ్చుకున్నాం. జర కాస్త చూసి ధరవేసుకోండి అంటూ ఇతర దేశాలను బతిమాలుకుంటున్నాం.

మనం దిగుమతి చేసుకొనే చమురు ధర డిసెంబరు ఒకటిన 71.32 డాలర్లు ఉండగా జనవరి 31న 89.41డాలర్లని మరోమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచకుండా నిలిపివేశారు.ఎన్నికలు ముగియగానే ఈ మొత్తాలను వసూలు చేసే విధంగా ధరలను పెంచనున్నారు.
అనేక దేశాల్లో చమురు ధరల పెరుగుల సెగతగలటం ప్రారంభమైంది.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కనిపిస్తోంది.న్యూజిలాండ్‌లో ఏడాది కాలంలో 30శాతం చమురు ధరలు పెరిగాయి.ద్రవ్యోల్బణం 5.9శాతానికి పెరగటంలో చమురు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కాలుష్యనివారణలో భాగంగా పెట్రోలు మీద లీటరుకు ఎనిమిది నుంచి 16సెంట్ల వరకు పన్ను విధిస్తున్నారు. ఐరోపా యునియన్‌ దేశాల్లో జీవన వ్యయం పెరిగిపోతోంది. దాంతో జనం పొదుపు చర్యలకు పూనుకున్నారు. దానికి పెట్రోలు టూరిజం అని ముద్దుపేరు పెట్టారు. తన జనం మీద భారం తగ్గించాలని పోలెండ్‌ సర్కార్‌ చమురు, గాస్‌ మీద పన్ను తగ్గించింది. దాంతో లీటరుకు 25 నుంచి 35సెంట్ల భారం తగ్గింది. ఐతే ఈ చర్య ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇరుగుపొరుగుదేశాలైన హంగరీ, జర్మనీ, స్లోవేకియా, చెక్‌ తదితర దేశాల వారందరూ పెద్ద కాన్లతో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో కొరత ఏర్పడింది. ఎవరూ 60లీటర్ల కాన్లు నాలుగుకు మించి విడిగా తీసుకుపోకూడదంటూ రోడ్ల మీద తనిఖీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.స్లోవాక్‌లు సరిహద్దుదాటి వచ్చి 50లీటర్ల కారు టాంకు నింపుకుంటే దూరాన్ని బట్టి 10 నుంచి 18 యురోలు మిగుల్చుకుంటున్నారు. పోలెండ్‌లో ఇతర సరకులపై కూడా పన్ను తగ్గించటంతో పెట్రోలు, డీజిలుతో పాటు సరకులను కూడాకొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అనేక చోట్ల చమురు, గాస్‌ బంకులు సరఫరా లేక మూసివేస్తున్నారు. పోలెండ్‌తో ఇతర దేశాల్లోని సరిహద్దు సమీప బంకుల వారు పెట్రోలు టూరిజంతో భారీగా నష్టపోతున్నారు. వారి వద్ద కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.(మన దేశంలో ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను తగ్గించటంతో ఢిల్లీ పరిధిలోని బంకులకూ అదే పరిస్దితి ఎదురైంది. ఢిల్లీ నుంచి సమీపంలోని రాష్ట్రాల బంకుల్లో కొనుగోలు లేదా ఇతర మార్గాల్లో సమకూర్చుకోవటంతో కేజరీవాల్‌ కూడా పన్ను తగ్గించాల్సి వచ్చింది)


చమురు, గాస్‌, విద్యుత్‌ ధరల పెరుగుదల ఐరోపా దేశాల పర్యాటక రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.బ్రిటన్‌లో ఏప్రిల్‌ నాటికి 54శాతం వరకు ఇంధన బిల్లులు పెరగవచ్చని అంచనా. కార్లలో విహార యాత్రలకు వచ్చే కుటుంబాలకు ఒక టాంకు పెట్రోలు నింపుకునేందుకు గతంలో 60యురోలు చెల్లించాల్సి వస్తే ఇప్పుడు 85కు పెరిగాయి, అందువలన ప్రయాణ దూరాలపై కూడా పరిమితులు విధించుకుంటున్నారు. మార్చి ఏడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి, ఆ మరుసటి రోజునుంచే ధరల పెరుగుదల ప్రారంభం కానుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ముడి చమురు 15 డాలర్లు తగ్గింది – పైసా కూడా తగ్గని పెట్రోలు, చమురు ధర !

04 Saturday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, sharp fall in global oil rates


ఎం కోటేశ్వరరావు


2021నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు నాలుగవ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు,డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు నరేంద్రమోడీ సర్కార్‌ను మెచ్చుకోవాలనే వారితో కాసేపు ఏకీభవిద్దాం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు ఇదే స్ధితిని కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆవిధంగా ముందుకు పోయి జనం మీద ప్రేమను పొంగి పొర్లించి మురికి గంగను చేర్చి ప్రక్షాళన జరిపించినా ముక్కు మీద వేలేసుకోవద్దు. ఇది తెరముందు మనకు కనిపిస్తున్నదృశ్యం. తెరవెనుక ఏం జరుగుతోందో ముందు చూద్దాం. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. పాలకుల ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్న రకం పీపా ధర నెల సగటు 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగింది. ఐనా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర రు.91.17, ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గిన మొత్తం 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు కదా ! మోడీ మాయాజాలం అన్నది అంగీకరించాల్సిందే. బవిరి గడ్డాలను చూసి నీతి నిజాయితీలు ఉంటాయని నమ్మే రోజులు కావివి !


ఇక వచ్చే ఏడాది జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని గతంలో ఆ పెద్దమనిషి మాదిరి పన్నులు పెంచకపోయినా వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. ఆ తరువాత జరుగుతున్నదేమిటి ? అదే జనాలు తెలుసుకోవలసింది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో చమురు ధరలను 28 సార్లు సవరించారు. ఆ నెలలో ముడిచమురు సగటు ధర 82.11 డాలర్లు, నవంబరు నెలలో అది 80.64డాలర్లకు తగ్గింది.దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నెల రోజులుగా తమ ధరలను ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం అక్టోబరులో పక్కాగా అమలు చేశారు, నవంబరులో ఏమైంది ? విశ్వగురువు నరేంద్రమోడీని అడిగేందుకు విలేకర్లకు అవకాశం ఇవ్వరు, ఆ పెద్దమనిషి నోరు విప్పరు ? అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది.


అక్టోబరు 25న గరిష్టంగా మన కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.నవంబరు 10న 84.07 డాలర్ల తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.మొత్తం మీద పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. చంబల్‌ బందిపోట్లు ఆప్రాంత ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోలు కొనే సర్‌ గోచిపాత రాయుడి మొదలు అత్యంత పేదలైన అంబానీ, అదానీల వరకు అందరినీ సమంగా చూస్తోంది. చంబల్‌ దోపిడీ పెద్దదా ఇది పెద్దదా ? ప్రకటిత ధరల విధానం ఏమైంది ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే, రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ? మరో విధంగా, అదే ఓట్ల రూపంలో బిజెపికి లబ్ది కలిగించేందుకు చూస్తున్నాయి. ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా పాలక పార్టీకి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు అవి వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. అసలు భారీ మొత్తాల్లో సెస్‌లు పెంచిన కేంద్రాన్ని వదలి బిజెపి రాష్ట్రాల్లో రాజకీయం చేస్తోంది.


ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు అమ్ముకొనే వారు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెస్తారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది.


వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకుంటున్నట్లుగా ముడి చమురు ధరలు తగ్గిన మేరకు జనాలకు తగ్గించకుండా కేంద్రం ధరల రూపంలో దండుకుంటోంది. వచ్చే రోజుల్లో రెండు మూడు పరిణామాలు జరగవచ్చు. ఒకటి ముడి చమురు ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గినా గత నెల రోజుల మాదిరి ధరలను తగ్గించకపోవచ్చు.పెరిగితే ఇప్పుడు వచ్చిన లాభాలు కంపెనీల వద్ద ఉంటాయి గనుక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధరలను కొనసాగించవచ్చు. మొత్తంగా నవంబరు-ఏప్రిల్‌ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఎక్కువ ఉందనుకోండి, ఎన్నికలు ముగిసిన తరువాత ఆమేరకు అసలు ఫాయిదాలను వడ్డీతో సహా వసూలు చేసినట్లు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. మొత్తం మీద రాజకీయ-వాణిజ్య లాభనష్టాలను చూసుకుంటే ధరలను అదుపులో ఉంచితే కొందరినైనా మోసపుచ్చితే పాలకపార్టీకి ఎంతో కొంత రాజకీయ లబ్ది కలుగుతుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. జనాల జేబు గుల్ల మామూలుగానే ఉంటుంది. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఇతర కారణాలతో బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

10 Wednesday Nov 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, fuel politics, K. Chandrashekar Rao, KCR, telugudesam, YS jagan


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: