ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్ పోస్ట్ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్బర్గ్ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్బర్గ్ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్ విలువ 120 బిలియన్ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్ బెర్గ్ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్ గాస్ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.
ఐరోపాలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్ క్వాడ్(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.
భారత్తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్ ఒక బిలియన్ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్ నడిపే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్ఆర్సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్ ఓటమి కోసం డెమోక్రటిక్ పార్టీకి సోరస్ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్ సెల్లింగ్ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్ మార్కెట్ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.
హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్లో 1930లో జన్మించిన సోరస్ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్ చేరుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్ ట్రంప్ అంటే అసలు పడదు. ట్రంప్-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.
సోరస్ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్ సెల్లింగ్ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్ బాంకు షేర్లను అలాగే షార్ట్ సెల్లింగ్ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్ ప్రభుత్వం పౌండ్ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?