• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: India foreign policy under narendra modi

విశ్వగురువా… వినదగునెవ్వరు చెప్పిన !

15 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్‌ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్‌ అలయన్స్‌) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.


కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.


స్టేట్స్‌మన్‌ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్‌ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్‌. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్‌ సింగ్‌, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్‌)కు దారి తీసింది.అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్‌ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.


ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్‌ దిమ్‌, అతని సోదరుడు నగో దిన్‌ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్‌ వాన్‌ థీవ్‌ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్‌ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్‌ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్‌ మార్క్‌ క్లార్క్‌ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్‌ ఫెర్డినాండ్‌ మార్కోస్‌ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్‌ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్‌ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్‌ డి న్యూసమ్‌ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)

అష్రాఫ్‌ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్‌ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్‌ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్‌) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్‌-ఈస్ట్‌ ఆసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌), బాగ్దాద్‌ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్‌ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్‌ 715బిలియన్‌ డాలర్లుగా బైడెన్‌ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్‌ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్‌ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.


సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్‌ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్‌ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్‌ షింగర్‌ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్‌-చైనీస్‌ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ అభిప్రాయపడ్డాడు. కాబూల్‌ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్‌ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.


అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్‌ సముద్రం – బాల్టిక్‌ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్‌ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్‌ 400 బిలియన్‌ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్‌ అధిపతి ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.


కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం -2 : పెరుగుతున్న మతోన్మాద ముప్పు !

09 Monday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

75th India Independence Day, India foreign policy under narendra modi, India independence @75, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్‌ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్‌ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.


మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?


బ్రిటీష్‌ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్‌ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్‌ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్‌ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్‌-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్‌ -పాక్‌ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్‌ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?


ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్‌ బయోటెక్‌ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్‌ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.


ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.


విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్‌ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్‌ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్‌, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


అలాంటి అమెరికాతో కలసి మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్‌ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్‌ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.


రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్‌ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్‌ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్‌ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్‌ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్‌ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.


తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్‌ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.


ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !

మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/
https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా ఆదేశాలు, ఆర్ధిక విధానాలతో స్వాతంత్య్రానికి ముప్పు !

03 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

economic policies, India foreign policy under narendra modi, Indian independence, modi foreign policy, US dictats

Image result for threat to india's independence

ఎం కోటేశ్వరరావు

డెబ్బయి రెండవ స్వాతంత్య్రవేడుకలకు దేశం సిద్దం అవుతోంది, మరోసారి అధికారానికి వచ్చి 75వ వేడుకలను కూడా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారు. తన ప్రసంగంలో వుండాల్సిన అంశాల మీద సలహాలు ఇవ్వాలని కోరారు. జనాభిప్రాయానికి తలొగ్గే పాలకుడిగా కనపడే ప్రచార ఎత్తుగడలో భాగమిది. మూకదాడుల గురించి దేశ అత్యున్నత న్యాయస్ధానం ఒక చట్టాన్ని రూపొందించండని చెప్పటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అయినా ఈ సమస్యపై మన ప్రధాని మౌనంగానే వున్నారు. అలాంటి పెద్దమనిషి సామాన్య జనం చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటారంటే నమ్మటమెలా ? వంచనగాకపోతే నిత్యం జనంతో వున్నామని చెప్పుకొనే నేతలకు జనాభిప్రాయాలేమిటో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదేమిటి?

ఐదవసారి ఎర్రకోట మీద మువ్వన్నెల జండా ఎగురవేయబోతున్న ప్రధాని ముందు ఒక పెద్ద ప్రశ్న వుంది. నిజానికి అది యావత్తు దేశ ప్రజల ముందున్న సవాలు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా వున్న మన విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నది ఎవరు అన్నదే ఈ స్వాతంత్య్రదినోత్సవ ప్రత్యేకత అని చెప్పవచ్చు. వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవవేడుకల ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన ప్రభుత్వం ఆహ్వానించింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన కొన్ని వార్తలు ఈ ఆహ్వాన ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా ఆంక్షలకు తలగ్గకపోతే చెల్లించే మూల్యం భారీగా వుంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన మన దేశం 2030 నాటికి మూడవ స్ధానానికి చేరుకోనున్నదని వార్తలు వచ్చాయి. ఆ బాటలో వున్న మనం భారీ మూల్యం చెల్లించాల్సినంత దుర్బలంగా వున్నామా? అమెరికా అడుగుల్లో నడవటం స్వాతంత్య్రపిపాసకులకు మింగుడు పడని అంశమే. ఒక చిన్న దేశం విధిలేక ఒక పెత్తందారు అడుగులకు మడుగులొత్తిందంటే అర్ధం చేసుకోగలం కానీ జనాభారీత్యా, ఘనమైన గతంతో వున్న మనదేశం అమెరికా కనుసన్నలలో నడుస్తోందంటే మన ఆత్మగౌరవం ఏమైనట్లు? నరేంద్రమోడీ లేదా ఎన్‌డిఏ పక్షాలకు ఇవేవీ తెలియకనే ట్రంప్‌కు ఆహ్వానం పలికారా? పాండవుల పక్షాన నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ధుర్యోధనుడితో ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జున జూచితి అని చెప్పినట్లుగా అన్నీ తెలిసే మోడీ సర్కార్‌ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచేందుకు నిర్ణయించింది అనుకోవాలి. దేశభక్తులమని చెప్పుకొనే వారు చేయాల్సినపనేనా ఇది?

చైనా మన పొరుగుదేశం. రెండు దేశాల మీద బ్రిటీష్‌ పాలకులు పెత్తనం చేశారు. వాస్తవంలో ఏ ప్రాంతం ఎవరికింద వుంది అన్నది చూడకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిహద్దుగీతలు గీసిన కారణంగా చైనాతో తలెత్తిన సరిహద్దు పంచాయతీలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశాన్ని బ్రిటీషోడు విడదీసినపుడు మనవైపు మొగ్గిన కాశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని పాకిస్ధాన్‌ ఆక్రమించుకుంది, దాన్నొక విముక్తి ప్రాంతంగా, స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఆ సమస్య కారణంగా దానితో సంబంధాలు సజావుగా లేవు. తరువాత కాలంలో అమెరికా ప్రోద్బలంతో కాశ్మీర్‌ వేర్పాటు వాదులను రెచ్చగొట్టటం, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి దుర్మార్గాలకు పాల్పడటం వంటి చర్యలు తెలిసినవే. నిత్యం సరిహద్దుల్లో పోరుకు బదులు వాటిని వారూ మనం పరిష్కరించుకోవాలి. మిగతా ప్రపంచ దేశాలతో మనకు ఎలాంటి పేచీలు లేవు. స్నేహసంబంధాలే వున్నాయి, ఇప్పుడు అమెరికా వాడు వాటిని దెబ్బతీసేందుకు పూనుకోవటం ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?

మనకు ఒక స్వతంత్ర విధానం వుంది, గతంలో సోవియట్‌ లేదా అమెరికా కూటమిలోకో మొగ్గు చూపకుండా అలీన విధానం అవలంభించాం. దాని మేరకు మన రక్షణ అవసరాల రీత్యా అణ్వాయుధాలను తయారు చేస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసేందుకు ఇంతకాల నిరాకరించాం, ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది.దీనిపై సంతకం చేయని వాటిలో మనతో పాటు పాకిస్ధాన్‌,ఇజ్రాయెల్‌, 2011లో స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌ వున్నాయి. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు శాంతియుత అవసరాలకు అణుశక్తిని వినియోగించవచ్చు తప్ప అణ్వాయుధాలను తయారు చేయటానికి లేదు.

ఇరాన్‌తో ఆరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అంతవరకు పరిమితమైతే అదొకదారి, ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించింది. దానితో వ్యాపారలావాదేవీలు జరిపేవారికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నది. పంచాయతీ వుంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇతర దేశాల మీద కూడా తన ఆంక్షలు అమలు జరుగుతాయని చెప్పటం పెద్దన్న వైఖరి తప్ప ప్రజాస్వామ్యపూరితం కాదు. ఇరాన్‌తో మన సంబంధాలు ఈనాటివి కాదు. దాని అవసరాల నిమిత్తమే కావచ్చు మిగతా చమురు సరఫరా దేశాలేవీ ఇవ్వని రాయితీలను అది మనకు ఇస్తోంది, కొంత మేరకు మన రూపాయి చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇది మనకూ ప్రయోజనమే కనుక మన ఇంధన అవసరాలలలో ఎక్కువభాగం అక్కడి నుంచే పొందుతున్నాము. ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్‌తో సంబంధాలున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి. గతంలో కూడా ఆంక్షలున్నప్పటికీ టర్కీ బ్యాంకుల ద్వారా మనం సొమ్ము చెల్లించి చమురు దిగుమతి చేసుకొనే వారం. ఇప్పుడు అలాంటివి కూడా కుదరదని ట్రంప్‌ తెగేసి చెప్పాడు. గతంలో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో రెండు దేశాలూ సమాన భాగస్వాములు అంటూ వూదరగొట్టిన అమెరికన్లు ఇప్పుడు మనల్ని పాలేర్లకింద జమడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for us diktats to india

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే వాటితో తమకు సంబంధం లేదని, ఏ దేశంపై అయినా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆంక్షలు మూడోపక్ష దేశాలకూ వర్తిస్తాయని వెల్లడించగానే నెల రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌ బదులు నవంబరు నుంచి మరొక దేశం నుంచి చమురు దిగుమతి ఏర్పాట్లు చేసుకోవాలని మన చమురు మంత్రిత్వశాఖ చమురుశుద్ధి కర్మాగారాలకు లేఖ రాసింది. తాము చెల్లింపులు జరపలేమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇది అమెరికా వత్తిడికి లొంగటం కాదా ? మన అలీన విధానం ఏమైనట్లు? ఈ పూర్వరంగంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలను విధిస్తామన్న అమెరికా బెదిరింపుకు భారత్‌ ఎలా స్పందించాలన్న ప్రశ్నకు అమెరికాకు తలొగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ చెప్పారు.’ ఇదొక ప్రధాన ఆర్ధిక సమస్య గాక విదేశాంగ విధానపరమైన నిర్ణయం కూడా ఇమిడి వుంది. గతం కంటే మరింత కఠినంగా అమలు జరుపుతామని అమెరికా స్పష్టంగా చెప్పటం కనిపిస్తోంది, దీని అర్ధం మినహాయింపులు పరిమితంగా వుంటాయి. అదే జరిగితే మనం చమురుకోసం ఇతర వనరులను చూసుకోవాలి, అమెరికా చెప్పింది వినకపోతే మూల్యం చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతి అంతర్జాతీయ వ్యవస్ధలో డాలరు ప్రవేశిస్తోంది, అది ఒక్క వ్యాపారానికే పరిమితం కావటం లేదు ఒక చెల్లింపు సంవిధానంగానూ ద్రవ్య మార్కెట్లలో ఒక సాధనంగా మారింది, దానికి అనుగుణంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.’ అన్నారు.

ఏ దేశపెత్తనానికి తలొగ్గం అని చెప్పుకొనే ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దమనిషి చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికాకు రాత పూర్వకంగా ఇంతవరకు ఇవ్వలేదు తప్ప ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించింది. దీని అర్ధం ఏమిటి? మరోవైపు అమెరికా ఆంక్షలను తాము ఖాతరు చేయబోమని చైనా, టర్కీ ప్రకటించాయి.తామే అసలైన జాతీయవాదులం, దేశభక్తులం అని చెప్పుకుంటున్న బిజెపికి ఈ పరిణామం పెద్ద పరీక్ష. అలీన విధానం, స్వతంత్ర వైఖరినుంచి వైదొలగి అమెరికా వైపు మొగ్గుచూపటమే. ఆగస్టు ఆరవ తేదీ నుంచి అమెరికా ఆంక్షల తొలి చర్యలు అమలులోకి వస్తాయి. వీటి వలన మనకు ఎలాంటి ఇబ్బందులు రావు, చమురు లావాదేవీలపై ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీ నుంచి వర్తిస్తాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న మనం ఇరాన్‌తో సంబంధాలు వదులుకొంటే మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అమెరికా వత్తిడికి లొంగితే ప్రపంచంలో మనపరువు గంగలో కలుస్తుంది. మనతో భాగస్వామ్యానికి మిగతా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

భారత ఇబ్బందులను తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలు నిలిచిపోతాయని, భారత సర్వసత్తాక నిర్ణయ హక్కును తాము గౌరవిస్తామని ఇరాన్‌ రాయబారి ప్రకటించారు. అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రాకపోగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీహాలీ న్యూఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశమై ఇరాన్‌తో సంబంధాలను సవరించుకోవాలని ఆదేశం మాదిరి మాట్లాడి వెళ్లారు. అంతకు ముందే తమ ఆంక్షలలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా ప్రకటించింది. ఒక దేశాధినేతతో అమెరికా వ్యవహరించే తీరిది. అయితే అమెరికా బెదిరింపు పని చేసిందనేందుకు నిదర్శనమా అన్నట్లు జూన్‌లో ఇరాన్‌ నుంచి మన చమురు దిగుమతులు 16శాతం తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మన చమురు దిగుమతులు రెట్టింపు అయ్యాయి. రూపాయలతో కొంత మేరకు కొనే చమురును ఇప్పుడు పెరిగిన డాలర్లతో కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

మన రక్షణ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మనం ఎవరి దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఏ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలనేది మన సర్వసత్తాక హక్కు. దీనిలో కూడా అమెరికా జోక్యం చేసుకొంటోంది. తన చట్టాలు, నిర్ణయాలను సర్వవ్యాపితంగా రుద్దాలని, అమలు చేయాలని చూస్తోంది. మన అవసరాలకు తగినవిగా రష్యా తయారీ ఎస్‌-400 గగన రక్షణ క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణ శాఖ నిర్ణయించింది. రష్యా మీద తాము ఆంక్షలను విధించిన కారణంగా రష్యాలో తయారయ్యే ఆయుధాలను కొనుగోలు చేసిన వారికి అవి వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. తమకు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, చట్టాలు వర్తిసాయి తప్ప అమెరికావి కాదని మన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ అమెరికాకు చెప్పినప్పటికీ వాటి కొనుగోలుకు మనల్ని నిరోధించే విధంగా అమెరికా వత్తిడి చేయటం మానుకోలేదు. ఒకేసారి 400 కిలోమీటర్ల పరిధిలోని 36 లక్ష్యాలను చేరుకోగలిగిన అధునాతన పరికరాలివి. మన విదేశాంగ విధానంలో జోక్యం చేసుకొనేందుకు, వత్తిడి చేసేందుకు, భారాలు మోపేందుకు ఇతర దేశాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఎందుకీ పరిస్ధితి ఏర్పడింది. అమెరికాకు దాసోహం అన్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బూట్లలో కాళ్లు పెట్టి బిజెపి నరేంద్రమోడీ నడుస్తున్నారు. రష్యా క్షిపణి వ్యవస్ధల కొనుగోలు వ్యవహారంలో వెనక్కు తగ్గితే అది మన రక్షణకే ముప్పు, అందువలన వాటి కొనుగోలుకే కట్టుబడి వుండటంతో తమ ఆంక్షలను మన దేశానికి మినహాయింపు నిచ్చేందుకు అమెరికా పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. మిగతా విషయాలలో మన సర్కార్‌ అంతగట్టిగా మన వైఖరికి ఎందుకు కట్టుబడి వుండదు ?

దేశాన్ని దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడింది, తప్పిదాలు చేసిందనే విమర్శను తప్పుపట్టాల్సిన పనిలేదు. తిరుగులేని వాస్తవం, అందుకు ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు హోదా కూడా లేని పార్టీగా దిగజారి భారీ రాజకీయ మూల్యం చెల్లించింది. పాలనలో అలాంటి పార్టీ ప్రభావం, రూపురేఖలను పూర్తిగా చెరిపివేయాలనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలేమిటి అన్నది జనం ముందున్న ప్రశ్న. వాటిలో ఒకటి ప్రణాళికా సంఘం, విధానాలను రద్దు చేయటం. గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా అభివృద్ధిలో ప్రణాళికా విధానం కీలకమైనది అని రుజువైంది.ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం పనికిరానిదిగా తయారైంది అంటూ దానిని రద్దు చేసి నీతి ఆయోగ్‌ పేరుతో రూపాంతరం చెందుతున్న భారత్‌ కోసం జాతీయ సంస్ధ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా)ను 2015 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు. ఇది పదిహేను సంవత్సరాల మార్గం, ఏడు సంవత్సరాల దృష్టి, వ్యూహం, కార్యాచరణతో పని చేస్తుంది. అంటే ఐదేండ్లకు బదులు ఏడు సంవత్సరాల ప్రణాళిక అనుకోవాలా? రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి, ప్రభుత్వాలు మారటానికి అవకాశం వున్నపుడు పేరు ఏది పెట్టినా ఏడు సంవత్సరాల ప్రణాళికలంటే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. మధ్యలో మార్చుకోకూడదా అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు.

1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో అమలు చేస్తున్న విధానాలు ప్రణాళికలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే కొన్ని కార్యక్రమాలుగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఒక్కొక్క బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. వుదాహరణకు పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్ధల ఏర్పాటు, మెరుగుపరచటంపోయి వాటిని ప్రయివేటు రంగానికి వదలి వేశారు. ఆ విధానాలలో భాగంగానే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేశారు. ఈ కారణంగానే ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప ఇతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా వుండటం వలన గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఒకటీ అరా కొత్తగా స్ధాపించటం తప్ప ఆ రంగంలోనూ పరిమితం చేశారు. వ్యవసాయ రంగంలో గణనీయంగా తగ్గించిన కారణంగా పరిశోధన, అభివృద్ధి లేకుండా పోయింది. బహుళజాతి గుత్త సంస్ధలు వ్యవసాయరంగంలో ప్రవేశించి విత్తన రంగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.పర్యవసానంగా విత్తన ధరలు పెరిగాయి. ఎరువులపై ధరల నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిమితం చేసి దానినే అందచేస్తున్నారు. దీనిలో కొత్త పద్దతుల్లో అక్రమాలకు తెరలేవటం అందరికీ తెలిసిందే.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత కాలంలో కార్మికవర్గ రక్షణ కోసం రూపొందించిన అనేక చట్టాలను నీరుగార్చటం, అమలుకు నోచుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించటం వంటి విషయాలు తెలిసిందే. మొత్తం శ్రమ జీవులందరికీ సామాజిక భద్రత కల్పించాల్సిన ప్ర భుత్వాలు వున్న వారికి వర్తింపచేస్తున్న వాటిని రద్దు చేశాయి. నూతన పెన్షన్‌ పధకం(ఎన్‌పిఎస్‌) పేరుతో 2004 తరువాత చేరిన వారికి పాత పద్దతిలో వుపయోగకరమైన పెన్షన్‌ రద్దు చేశారు. దానిని రూపొందించిన ఖ్యాతి వాజ్‌పేయి నాయకత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వానిదైతే దానిని తు.చ తప్ప కుండా అమలు జరిపిన చరిత్ర తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రాలలో అధికారంలో వున్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల గురించి తెలిసిందే. నూతన పెన్షన్‌ పధకాన్ని రద్దు చేసి పాతదాన్ని పునరుద్దరించాలని వుద్యోగులు పోరుబాట పట్టారు. ఒక్క వామపక్షాలు తప్ప మిగతా పార్టీలేవీ దాని గురించి పట్టించుకోవటం లేదంటే ఆమోదం, అమలుకు అంగీకరించినట్లే.

Image result for us diktats to india

మన దేశంలో వునికిలోకి వచ్చిన ప్రతి చట్టం వెనుక ఆయా తరగతులు జరిపిన వుద్యమాల వత్తిడి, త్యాగాలు వున్నాయి. వ్యాపార సులభతరం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి పాలిత రాజస్ధాన్‌ పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి స్వాతంత్య్ర పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. ఇలాంటి వన్నీ బ్రిటీష్‌ వలసదారులు చేశారంటే అర్ధం వుంది, స్వతంత్ర భారత్‌లో చేయటం అంటే పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్మికోద్యమం చేసిన త్యాగాలన్నీ వృధా అయినట్లే. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన అపర ప్రజాస్వామిక నడత ఘనత బిజెపి ఖాతాలో చేరింది. అంబేద్కరిస్టులు లేదా దళిత అస్ధిత్వవాదులు చేసే ప్రకారం ఈ దేశంలో కార్మికులందరూ దళితులే. అంటే వారి అవగాహన ప్రకారం కార్మిక రంగంలో చేస్తున్న మార్పులన్నీ దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.ఇదా స్వాతంత్య్రం ! అది ఎవరికి వుపయోగపడుతోంది?

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇదేదో నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైందని కాదు, ఆయన ఏలుబడిలో వేగం పెరిగింది. దానికి నిదర్శనం సులభతర వాణిజ్యంలో మన స్దానం పైకి ఎగబాకటమే. తన ప్రభుత్వ ఘన విజయాలలో అదొకటని మోడీ సర్కార్‌ చెబుతోంది. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌. స్వాతంత్య్రానికి ముందు మనం ఏ లక్ష్యాల కోసం పోరాడాము, తరువాత ఇప్పటి వరకు వాటికి మనం ఎంతవరకు కట్టుబడి వున్నాము, లక్ష్యాలు, గత ఆచరణ నుంచి కూడా ఇప్పుడు మనం వైదొలగుతున్న తీరు మన స్వాతంత్య్రాన్ని ఏమి చేయనున్నది అని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలోనే కాదు ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. నాడు బ్రిటీష్‌ తెల్లదొరల దుర్వివిధానాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే ఆ స్వాతంత్య్రానికి, సర్వసత్తాక అధికారానికి ముప్పు తెస్తున్న నేటి అమెరికన్‌ దొరల వత్తిడికి లంగిపోతున్న నల్లదొరల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పరిరక్షణకోసం మరోమారు వుద్యమించాల్సిన పరిస్ధితి ఏర్పడలేదా ? ఆలోచించిండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికన్‌ ధృతరాష్ట్ర కౌగిలి దిశగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ !

30 Wednesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

american dhritarashtra embrace, dhritarashtra embrace, India Foreign Policy, India foreign policy under narendra modi, modi foreign policy

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: