• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: India GDP

మోడినోమిక్స్‌ 2023 : దేశానికి కావాల్సిందేమిటి ? బిజెపి నేతలు ఇస్తామంటున్నదేమిటి ?

13 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

10 trillion dollar economy, Amith shah, BJP, China, India Exports, India GDP, India imports from China, love jihad, Narendra Modi Failures, Ram Mandir, RSS, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


2019లో నరేంద్రమోడీ ఒక పిలుపునిచ్చారు. 2024 మార్చి నాటికి(లోక్‌సభ ఎన్నికల తరుణం) దేశ జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు దాన్నే ఊరిస్తూ జనంలో చర్చ జరగాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. అనుకోని పరిణామాలు ఎదురు కావటంతో మిగతా కబుర్ల మాదిరే ఇప్పుడు మోడీ కూడా దీని గురించి కూడా మాట్లాడటం లేదు. కొత్త ” కతలు ” తప్ప ఒకసారి చెప్పినదానిని మరోసారి చెప్పి బోరు కొట్టించే అలవాటు లేదు కదా ! ఆ తరువాత మోడీ మౌనం, ఆర్థిక సలహాదారులు 2027కి సాధిస్తాం అన్నారు, ఐఎంఎఫ్‌ 2029 అని చెప్పి కాదు కాదు లెక్క తప్పింది 2027కే అని చెప్పింది. పొలిటీషిియన్‌ అన్నతరువాత ఒపీనియన్స్‌ మారుస్తుండాలని గిరీశం చెప్పినట్లుగానే ఆ సంస్థ కూడా పరిస్థితిని బట్టి మా అంచనా తప్పిందంటూ మరోసారి మార్చదని చెప్పలేము. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి. తాజాగా ఐదు లక్షల డాలర్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పాత పాట పాడితే బోరు కొడుతుంది కనుక కొత్త పల్లవి అందుకున్నారు.


ఈ మధ్య దేశ జిడిపి గురించి కొత్త గీతాలు వినిపిస్తున్నారు. మిత్రోం అంటూ శ్రావ్యమైన గళం నుంచి జిడిపి గానం ఎక్కడా వినపడటం లేదు, కనపడటం లేదు. పది లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పెరుగుతున్న భారత్‌ అంటూ సిఇబిఆర్‌ అనే సంస్థ తాజాగా ఒక విశ్లేషణ చేసింది. దాని ప్రకారం 2035 నాటికి పది లక్షల డాలర్లకు చేరుతుందని చెప్పింది. ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు పడితే తదుపరి ఒక లక్ష డాలర్లను జత చేసేందుకు ఏడు సంవత్సరాలు, ఆ తరువాత మూడవ లక్షకు ఐదు సంవత్సరాలు (2019) పట్టిందని, ప్రస్తుతం 3.1లక్షల కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొన్నది. ప్రస్తుత వేగాన్ని చూస్తే రానున్న 14-15 సంవత్సరాల్లో ప్రతి రెండేళ్లకు ఒక లక్ష కోట్ల డాలర్ల వంతున జిడిపి పెరుగుతుందని అంచనా వేసింది.


తెలుగు నాట అంత్య కంటే ఆది నిషఉ్ఠరమే మేలని భావించేవారు ఏదైనా చెప్పే ముందు అంటే అన్నారని తెగ గింజుకుంటారు గానీ అని ప్రారంభిస్తారు. పట్టణాల్లో పదిశాతం, దేశ సగటు 8.3శాతం నిరుద్యోగం ఉందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 2022 డిసెంబరులో 40.48 శాతం పెరిగిందని సిఎంఐఇ పేర్కొన్నది. దేశ జిడిపి ఎంత పెరిగింది, ఎన్ని పెట్టుబడులను ఆకర్షించారు అన్నది ఒక అంశమైతే దాని వలన జనాలకు ఒరిగిందేమిటి అన్నది ప్రశ్న. సంపద పెరిగి కొందరి చేతుల్లో పోగుపడితే ఫలితం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల(పిఎల్‌ఐ) పధకాన్ని అమలు జరుపుతున్నది. కరోనా కాలంలో ఫార్మా రంగంలోకి పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరగలేదు. లక్ష్యాన్ని మించి 107శాతం పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరిగింది 13శాతమే. ఇక మన దేశం నుంచి సెల్‌ఫోన్ల ఎగుమతులు పెద్దగా పెరిగినట్లు అది తమ ఘనతగా చెప్పుకుంటున్న చోట అనుకున్నదానిలో వచ్చిన పెట్టుబడి 38శాతం కాగా ఉపాధి పెరిగింది కేవలం నాలుగు శాతమే. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పెట్టుబడులు 4.89శాతం కాగా పెరిగిన ఉపాధి 0.39శాతమే. (ఇండియా కేబుల్‌ విశ్లేషణ 2022 నవంబరు 14) అందుకే పెట్టుబడులు వచ్చి ఉపాధి రహిత వృద్ధి జరిగితే జిడిపి పెరిగినా జనానికి వచ్చేదేమీ ఉండదు.


అందుకే ఈ అంశాల గురించి జుమ్లా కబుర్లు చెబితే జనం నమ్మరు గనుక బిజెపి నేతలు కొత్త కబుర్లు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి గురించి కొత్త రికార్డులు నమోదౌతున్నా, వీటిని గురించి పట్టించుకోకుండా ఇతర అంశాల గురించి మాట్లాడేవారిని ఏమనాలి ? 2024 జనవరి ఒకటి నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం సిద్దం అవుతుందని ఆ రోజునే దర్శనం చేసుకొనేందుకు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా చెబుతారు. గతంలో కాశీని చూసేందుకు ఏడాదికి కోటి మంది వచ్చే వారని, కాశీ విశ్వనాధ్‌ ధామ్‌ అభివృద్ధి తరువాత ఒక్క గత శ్రావణమాసంలోనే కోటి మంది వచ్చారని, అదే మాదిరి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైన తరువాత పది రెట్లు పెరుగుతారని, ఆధ్యాత్మిక టూరిజాన్ని వృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ సిఎం ఆదిత్య నాధ్‌ ఊరిస్తున్నారు. లక్షల కొలది ఉద్యోగాలను సృష్టిస్తామని, అందుకు గాను ఫలానా పధకాలు ఫలానా తేదీలోగా ఉనికిలోకి వస్తాయని చెప్పాల్సిన వారు పూజలు పునస్కారాలు, దేవుళ్ల సందర్శనకు వసతులు కల్పిస్తామంటున్నారు. రోడ్లు, మురుగు కాలవల వంటి అల్ప అంశాలను వదలి లవ్‌ జీహాద్‌ మీద కేంద్రీకరించాలని కర్ణాటకలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ నిరంజన్‌ సెలవిస్తారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే పండ్లు కాస్తాయి. వీరంతా దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌ కబుర్లు ఎక్కడా వినిపించటం లేదిప్పుడు, ఎందుకంటారు ? ఆధ్యాత్మిక టూరిజం గురించి ఒక వైపు కబుర్లు చెబుతూ మరోవైపు ఝార్కండ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఆధ్యాత్మిక టూరిజాన్ని సంఘపరివార్‌ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి సర్కార్‌ లేదు. ఇరవై నాలుగుమంది జైన తీర్ధంకరులలో ఒకరైన( 23వ) పార్శ్వనాధ్‌ గిర్ధ్‌ జిల్లాలోని షిఖర్జీ పర్వతంపై మోక్షం పొందినట్లు చెబుతారు. జైనులకు అదొక పుణ్యస్థలం. ఆ ప్రాంతంలో టూరిజం వద్దని జైనులు అంటున్నారు, దానికి బిజెపి మద్దతు ఇస్తున్నది.అయోధ్యలో వారే అమలు చేస్తారు, మరొక చోట వద్దంటారు. రాజకీయంగాకపోతే ఏమిటి ?


రానున్న ఏడు సంవత్సరాల్లో 7లక్షల కోట్లకు చేరనున్న జిడిపి అంటూ మరొక వార్త. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పిన అంశాల ఆధారంగా వచ్చింది. 2023 మార్చి ఆఖరుకు మన జిడిపి 3.5లక్షల డాలర్లు ఉంటుందని, వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఇది అసాధ్యం కాదని మర్చంట్స్‌ ఛాంబర్‌ (ఎంసిసిఐ) సమావేశంలో నాగేశ్వరన్‌ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. అందువలన ఎంత పెరిగితే ఏమి లాభం ! దేశంలోని పది మంది ధనికుల చేతుల్లో దేశ జిడిపిలో 11శాతం విలువగల సంపద ఉంది. ఫిన్‌బోల్డ్‌ అనే సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం ప్రకారం 2022 డిసెంబరు నాటికి పది మంది సంపద 387 బిలియన్‌ డాలర్లు లేదా రు.31.64లక్షల కోట్లు. దేశ జిడిపి అక్టోబరు నాటికి 3.47 లక్షల కోట్ల డాలర్లని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది, దీనిలో 11.16శాతం పది మంది చేతిలో ఉంది. తొలి ఐదు స్థానాల్లో ఉన్నవారి వివరాలు దిగువన చూడవచ్చు.
ధనికుడి పేరు ×××× సంపద బి.డాలర్లు
గౌతమ్‌ అదానీ ××× 132.79
ముఖేష్‌ అంబానీ ×× 96.5
సైరస్‌ పూనావాలా×× 24.88
శివ నాడార్‌ ××××× 22.58
దమాని(డి మార్ట్‌) ×× 21.25
సంపదలు ఇలా కొద్ది మంది వద్ద పోగుపడుతూ ఉంటే దేశ ఆర్థిక, సామాజిక వృద్ధి కుంటుపడుతుందని, అనేక అనర్ధాలకు దారితీస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నా సంపదలు పోగుపడటాన్ని మన పాలకులు అనుమతిస్తున్నారు.ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంపదల అంతరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. సంపదలు ఇలా పెరగటానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. సంపద పెరిగిన కొద్దీ పన్నులు పెంచాల్సి ఉండగా తగ్గించటం వాటిలో ఒకటి. ఉపాధి లేకపోవటం, ఉన్నవారికి కూడా వేతనాలు తక్కువగా ఉండటం, సామాజిక భద్రత లేకపోవటం, విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించటం వంటి అంశాలన్నీ సంపదల అసమానతలను పెంచుతున్నాయి. వాటిని తగ్గించేందుకు చేసిందేమీ లేదు.


వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అనే కితాబుకు భారత్‌ దూరం అన్నది మరొక వార్త. దేశంలో డిమాండ్‌ తగ్గిన కారణంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7శాతానికి తగ్గుతుందని ప్రభుత్వమే పేర్కొన్నది. ఈ కారణంగా వేగంగా వృద్ది చెందున్న భారత్‌ అనే పేరుకు దూరం కానుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే తక్కువగా ఆర్‌బిఐ 6.8శాతమే ఉంటుందని చెప్పింది. గతేడాది 8.7శాతం ఉంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో 7.6 శాతం ఉంటుదని అంచనా వేస్తున్నందున అది మొదటి స్థానంలో ఉంటుంది.ద్రవ్యోల్బణం కారణంగా వర్తమాన సంవత్సరంలో నిజవేతనాల్లో పెరుగుదల లేకపోవటం లేదా కొన్ని నెలల్లో తిరోగమనంలో కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు బిజెపి నేతలెవరూ ఏం చేసేదీ చెప్పరు.


ఆర్థికవేత్తలు లేదా వారు పని చేస్తున్న సంస్థలు వేసే అంచనాలు, చెప్పే జోశ్యాల తీరు తెన్నులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అమెరికాలోని కార్నెగీ సంస్థ 2009లో ఒక అంచనాను ప్రపంచం ముందుంచింది. దాని ప్రకారం 2009లో 1.1లక్షల కోట్లడాలర్లుగా ఉన్న భారత జిడిపి 2050 నాటికి 17.8 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అదే కాలంలో చైనా జిడిపి 3.3 నుంచి 45.6లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండవ స్థానంలో ఉండే అమెరికాలో 39లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. పైన పేర్కొన్న సిఇబిఆర్‌ సంస్థ అంచనా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక లక్ష కోట్ల డాలర్ల జిడిపి పెరుగుతుందనుకుంటే ఆ ప్రకారం చూసినా 2035 తరువాత పదిహేను సంవత్సరాలో ఏడులక్షల కోట్లు పెరిగితే దీని అంచనా ప్రకారం కూడా 17-18లక్షల కోట్లకు పరిమితం అవుతుంది. ఇక ముకేష్‌ అంబానీ పండిట్‌ దీన దయాళ్‌ ఇంథన విశ్వవిద్యాలయ సభలో చెప్పినదాని ప్రకారం 2047 నాటికి( నూరేళ్ల స్వాతంత్య్రం) ఇప్పుడున్న 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40లక్షల కోట్లకు పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆసియా ధనికుడు గౌతమ్‌ అదానీ 2050 నాటికి 30లక్షల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పన్నెండు – పద్దెనిమిది నెలలకు ఒక లక్ష కోట్ల వంతున పెరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ప్రముఖులు ఇంత తేడాగా ఎలా చెబుతారు ?


ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రదేశంగా ఎదుగుతుందని, చైనా జనాభా ఇప్పుడున్న 140 కోట్ల నుంచి 130 కోట్లకు తగ్గుతుందని చెబుతున్నారు.( ఈ ఏడాదే చైనాను వెనక్కు నెట్టి మన దేశం పెద్ద దేశంగా మారనుంది) పని చేసే శక్తి కలిగిన జనాభా భారత్‌లో పెరుగుతున్నందున ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా తెగతెంపులు చేసుకోనున్నాయని, తరువాత సరఫరా గొలుసులో చైనా లేకపోతే భారత్‌ లబ్దిపొందుతుందని చెబుతున్నారు. ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారు చేయటాన్ని దానికి రుజువుగా చూపుతున్నారు. నరేంద్రమోడీ జి20 బాధ్యతలు చేపట్టినందున అమెరికా, చైనా, భారత్‌ మూడు ధృవాల ప్రపంచ వ్యవస్థకు ఈ ఏడాది నాంది అవుతుందని కొందరు చెప్పటం ప్రారంభించారు.(2024లోక్‌సభ ఎన్నికలకు జి20 సారధ్యాన్ని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చేస్తున్న యత్నాలను చూసి మెప్పు పొందేందుకు కూడా అలా చెప్పవచ్చు.)


మన ఎగుమతులు తగ్గటం, దిగుమతులు పెరగటంతో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్న అంశం పాలకులకు పట్టినట్లు లేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2022లో మన వస్తు దిగుమతులు 54.7శాతం పెరిగి 610 బి.డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో 494 బి.డాలర్లు కాగా అదే కాలంతో గతేడాది 381బి.డాలర్లు మాత్రమే. ఇక వాణిజ్యలోటు ఏప్రిల్‌-నవంబరు మధ్య 115.39 నుంచి 198.35 బి.డాలర్లకు చేరింది. ఈ ఏడాది 700బి.డాలర్లు దాటవచ్చని అంచనా.దాన్ని బట్టి లోటు ఎంత ఉండేది అప్పుడే చెప్పలేము. స్వయం సమృద్ధి – ఆత్మనిర్భరత, ఎగుమతి- దిగుమతులు ఉపాధి కల్పన ఫలితాల గురించి చెప్పకుండా జనాలకు రామాలయం గురించి అమిత్‌ షా చెబుతున్నారు.

చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. లావాదేవీల్లో సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు పాటించాలి తప్ప, మన దేశానికి చైనాకు ఎగుమతులు-దిగుమతుల కోటా గురించి ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలేమీ లేవు. చైనాకు ధీటుగా ఐఫోన్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెబుతున్న వారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర వస్తువులను నిలిపివేసి ఇక్కడే ఎందుకు తయారు చేయటం లేదు ? విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు ? స్వదేశీ జాగరణ మంచ్‌ ఇటీవల ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు. చైనా నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ ఏటా తన రికార్డులను తానే బద్దలు కొడుతుంటే ఏమి చేస్తున్నట్లు ? చైనా యాప్‌ల రద్దు హడావుడి చేస్తే సరిపోతుందా ? మన ఉపాధిని ఫణంగా పెట్టే దిగుమతి లాబీకి ఎందుకు లొంగిపోతున్నట్లు ? 2021-22లో తొలి ఎనిమిది నెలల్లో అక్కడి నుంచి 59.17 బి.డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 67.92 బి.డాలర్లకు పెంచారు . చైనా వస్తువులు నాసిరకం అని ప్రచారం చేస్తారు, అదే నిజమైతే అలాంటి వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసి మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చైనాకు ఎందుకు కట్టబెడుతున్నట్లు ? మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులకు పదో ఏడు వస్తున్నది. వాటి అమలుకు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడలేదే ! వాటి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ప్రభావం : రూపాయి ఉల్లాస లాభం 328, వైఫల్య నష్టం 2,420 పైసలు !

31 Saturday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్‌ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్‌ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్‌, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్‌ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.


డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్‌ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్‌ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్‌ డాలర్‌ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్‌ పెసో,చైనా యువాన్‌, దక్షిణ కొరియా వాన్‌, మలేసియా రింగిట్‌, థాయిలాండ్‌ బట్‌ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్‌ జర్నల్‌ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్‌ ఎన్‌ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్‌ 8.6, ఆస్ట్రేలియా డాలర్‌ 6.5,దక్షిణ కొరియా వాన్‌ 5.5 శాతం చొప్పున క్షీణించింది.


2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్‌ పుతిన్‌, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్‌ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్‌ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్‌ షేర్వాణీ అందర్‌ పరేషానీగా ఉంది.


మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.


నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్‌ ఖాతా అంటారు) 36.4 బిలియన్‌ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.


డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.


ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.


కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్‌ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్‌ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆందోళన కలిగిస్తున్న ఆర్ధిక రంగం – జాడలేని మోడినోమిక్స్‌, పారని మంత్ర దండం !

07 Friday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Economic worries, India GDP, Manmohan Singh, Manmohanomics, modinomics, Narendra Modi Failures, RSS, Rupee Fall, UNCTAD, World Bank


ఎం కోటేశ్వరరావు


మన దేశ ఆర్ధిక పురోగతి గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న జోశ్యాలు గందర గోళం, ఆందోళన కలిగిస్తున్నాయి. మన్మోహానోమిక్స్‌ నుంచి మోడినోమిక్స్‌కు దేశం మారిందని గతంలో అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. మోడినోమిక్స్‌ అంటే నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానం. అనేక మంది పండితులు 2014 నుంచి అమలు జరుగుతున్నది మోడినోమిక్స్‌ అని తేల్చారు. పత్రికలు చదివే పాఠకులు, టీవీలు చూసే వీక్షకులు సంవత్సరం అంటే ఏదీ అని గందరగోళపడుతున్న అంశం మరొకటి. సంస్థలన్నీ ఒకే విధంగా చెప్పటం లేదు. కొన్ని కాలండర్‌(జనవరి నుంచి డిసెంబరు వరకు) మరికొన్ని ఆర్ధిక సంవత్సరం( ఒక ఏడాదిఏప్రిల్‌ నుంచి తదుపరి ఏడాది మార్చి వరకు) అని పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చుగానీ ”అసలు విషయం ”లో పెద్ద తేడా ఉండదు.


వర్తమానానికి వస్తే ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌(అంక్టాడ్‌) తాజాగా ప్రకటించినదాని ప్రకారం మన దేశ వృద్ధి రేటు కాలండర్‌ సంవత్సరం 2022లో 5.7శాతం, 2023లో4.7 ఉంటుందని ప్రకటించింది. ఆ తరువాత ప్రపంచబాంకు ఆర్ధిక సంవత్సరం 2023(2022-23)లో వృద్ధి రేటు 6.5శాతంఉంటుందని ప్రకటించింది. ఏ సంస్థ చెప్పినా వృద్ధి రేటు ఎంత అంటే సవరించిన ప్రతిసారీ తగ్గించి చెప్పటం తప్ప స్థిరత్వం కనిపించటం లేదు, ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం.అక్టోబరు ఏడవ తేదీన రూపాయి విలువ రు.82.63కు దిగజారి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.


2022 ఆగస్టు ఒకటిన లోక్‌సభకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021-22లో వాస్తవ జిడిపి వృద్ది రేటు 8.7శాతమని, కరోనాకు ముందున్న అర్ధిక స్థితికి పూర్తిగా దేశం కోలుకున్నదని, 2019-20 వాస్తవ జిడిపి వృద్ది కంటే 1.5శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఇక్కడే ఒక తిరకాసుంది.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 29న ప్రకటించిన వివరాల ప్రకారం 2019-20 జిడిపి గురించి తొలుత వేసిన అంచనాలన్నింటినీ సవరించి చివరకు వృద్ధి రేటు నాలుగు శాతమని ఖరారు చేశారు. అది కూడా కొత్త సంవత్సరంలో పది నెలల తరువాత అని గమనించాలి. దీని ప్రకారం ఒకటిన్నర శాతం ఎక్కువ అంటే 5.5 కానీ పార్లమెంటుకు 8.7 శాతమని ఎలా చెప్పారు. అంటే ఇది అంచనా మాత్రమే. దీన్ని కచ్చితంగా సవరిస్తారు. 2020-21లో 6.6శాతం తిరోగమనంలో( మైనస్‌) ఉన్నట్లు ప్రభుత్వం ఖరారు చేసింది.


దేశాన్ని సాధారణ పరిస్థితికి తిరిగి తీసుకు వచ్చామని చెబుతున్నారు. కనుకనే జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి దేశాన్ని పైకి లాగామన్నారు. అంతకంటే కావాల్సిందేముంది. మనం దిగుమతి చేసుకొనే లేదా ఎగుమతి చేసే వస్తువులకు సరఫరా వ్యవస్థల అంతరాయాల్లేవు. గాల్వన్‌ ఉదంతాల పేరుతో కాషాయ దళాలు తాట తీస్తాం,తోలు వలుస్తా అన్న పవర్‌స్టార్‌ మాదిరి ఎంతగా రెచ్చగొట్టినా చైనా మనకు వస్తువులను విక్రయిస్తూనే ఉంది. చైనాతో గత రికార్డులను బద్దలు కొట్టి నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులు చేసుకున్నట్లు తిరుగులేని ఆధారాలుగా అంకెలున్నాయి. రష్యా నుంచి రికార్డులు సృష్టిస్తూ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు జనానికి కొనుగోలు శక్తిని పెంచిన కారణంగానే పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నట్లు పాలకపార్టీ పెద్దలు వర్ణిస్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం ! ఉత్పాదకతతో ముడి పేరుతో ప్రభుత్వం వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? లేక అదంతా అమిత్‌ షా మార్కు జుమ్లానా ! కార్పొరేట్‌లకు పన్ను తగ్గింపు, ఇతర నజరానాల వలన ఖజానాకు కచ్చితంగా రాబడి తగ్గుతుంది. దాన్ని పూడ్చుకొనేందుకు కొన్ని వస్తువుల మీద జిఎస్‌టి పెంచుతున్నారు. ఇక అప్పుల సంగతి సరేసరి. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల ఏలుబడి చివరిలో రు.55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2022 నాటికి 136లక్షల కోట్లకు పెంచారు. 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఇదంతా అభివృద్ది కోసమే అంటున్నారు, ఇంత చేస్తున్నా వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నట్లు ? అడిగినా సమాధానం చెప్పేదెవరు ?వివిధ సూచికల్లో ఎక్కడో వెనుక లేదా దిగజారటం తప్ప మెరుగుపడింది లేదు.


నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు కొందరు పండితులు మోడినోమిక్స్‌ అంటూ కొత్త అర్ధాలు చెప్పేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2004 నుంచి 2020 వరకు దేశ వార్షిక జిడిపి వృద్ధిరేటు 6.8 శాతం ఉంది. మంత్రదండం ఉందని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో 2014 నుంచి 2020వరకు వార్షిక సగటు కూడా 6.8శాతమే ఉంది. మన్మోహన్‌ ఏలుబడి సగటు కూడా అంతే. మోడీ పాలన పది సంవత్సరాల సగటు తగ్గటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక గృహస్తులు చేసిన ఖర్చును చూస్తే 2004-14 మధ్య జిడిపిలో 10.56శాతం ఉండగా, 2014-20లో 10.61 శాతం ఉంది. ప్రభుత్వ ఖర్చును చూస్తే ఈ కాలంలో 56.54-59.23 శాతాలుగా ఉంది. ఇక చేసిన అప్పులను చూస్తే మాక్రో ట్రెండ్స్‌.నెట్‌ సమాచారం ప్రకారం దేశం వెలిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల బరిలో దిగిన వాజ్‌పాయి ఏలుబడిలో 1998లో జిడిపిలో 50.32 శాతంగా ఉన్న అప్పు 2004 నాటికి 62.59శాతానికి పెరిగింది. అది తరువాత మన్మోహన్‌ సింగ్‌ కాలంలో 2013 నాటికి 50.31 శాతానికి తగ్గింది. స్టాటిస్టా సంస్థ సమాచారం మేరకు 2017లో 69.68 శాతం ఉన్న అప్పు 2020లో 90.06 శాతానికి పెరిగింది.2021 నుంచి 2027 వరకు 86.76 నుంచి 84.18 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. గతంలో రిజర్వు బాంకు పేర్కొన్న ప్రకారం మన పరిస్థితుల్లో దేశ అప్పు జిడిపిలో 61శాతం లోపుగా ఉండాలని పేర్కొన్నది. అప్పులను తగ్గించిన మన్మోహన్‌ కాలంలో, విపరీతంగా పెంచిన మోడీ ఏలుబడిలోనూ సగటు వృద్ధి రేటు ఒకే విధంగా ఉంది.అభివృద్ది కోసమే అప్పులైతే తెచ్చిన అప్పులకు అనుగుణ్యంగా ఖర్చు పెరగలేదు.తేడా ఏమిటంటే మన్మోహనామిక్స్‌ పదేండ్ల కాలంలో మూడు సార్లు అంతకు ముందు సంవత్సరాల కంటే వృద్ధి రేటు తగ్గితే మోడినోమిక్స్‌లో ఏడు సంవత్సరాల్లోనే నాలుగేండ్లు తిరోగమనంలో పడింది. ఎందుకిలా ?


ఇదేమీ సమాధానం లేని అపూర్వ చింతామణి లేదా నువ్వు ఎవరు ప్రశ్న కాదు. జిడిపి ఖర్చులో ఫిక్స్‌డ్‌ గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌ అంటే సులభంగా చెప్పుకోవాలంటే పెట్టుబడి 2004-14 సంవత్సరాల్లో 33.38 శాతం ఉండగా అది అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధిని తెచ్చినట్లు చెప్పుకుంటున్న 2014-2020 మధ్య (కరోనాకు ముందే సుమా) 28.88 శాతానికి పడిపోయింది. పిండి కొద్దీ రొట్టె, పెట్టుబడి కొద్దీ వృద్ధి, కబుర్లతో కడుపునిండదు. వివిధ సంస్థలు మన జిడిపి గురించి వేసిన అంచనాలు- సవరించటంలో అంత తేడా ఎందుకు ఉంటోంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా నరేంద్రమోడీ దగ్గర మంత్ర దండం ఉందని అవి కూడా నమ్మినట్లా ? అంచనాలే గనుక పిసినారి తనం ఎందుకు మోడీని సంతోష పెడదామని అనుకున్నట్లా ? వివిధ సంస్థలు గతంలో వేసిన, తాజాగా సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థ పేరు ×××× గతంలో చెప్పినది×× తాజా అంచనా
ప్రపంచ బాంకు ×× 8.7 ××× 6.5
ఎస్‌ అండ్‌ పి ×××× 00. ××× 7.3
ఫిచ్‌ రేటింగ్స్‌ ×××× 7.8 ××× 7.0
ఇండియా రేటింగ్స్‌×× 7.0 ××× 6.9
ఓయిసిడి ×××× 00 ××× 7.0
అంక్టాడ్‌ ×××× 00 ××× 5.7
ఏడిబి ×××× 7.5 ××× 7.0
ఐఎంఎఫ్‌ ×××× 8.2 ××× 7.4
నొమురా ×××× 5.4 ××× 4.7
ఫిక్కి ×××× 7.4 ××× 7.0
ఎస్‌బిఐ ×××× 7.5 ××× 6.8
క్రిసిల్‌ ×××× 7.8 ××× 7.3
ఆర్‌బిఐ ×××× 7.2 ××× 7.0
ప్రపంచ ఆర్ధిక పురోగతి మందగించటం, దేశంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వలన మన ఎగుమతులకు, ఇతరంగా దెబ్బ అని అందరూ చెబుతుంటే ఆ పరిస్థితి మన దేశానికి సానుకూలమని, ముడి చమురు,ఇతర వస్తువుల ధరలు, పారిశ్రామిక లోహాలు, ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2-7.4 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. అంకెలతో జనంలో గందరగోళం, ఆందోళనకరంగా పరిణామాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

5జి వశీకరణ మంత్రం : మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, జోడీగా కార్పొరేట్‌ మహా మాంత్రికుడు ముకేష్‌ అంబానీ !

04 Tuesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, GDP growth, India GDP, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌ గురించి చెప్పాలి. సార్‌ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్‌ డ్రైవర్‌ను సార్‌ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్‌ మజాక్‌ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్‌ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్‌,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసిండో బాలన్స్‌ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !


మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్‌ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.


ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.


బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?


ఇక అరవై ఐదేండ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్‌లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్‌ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.


ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ కంపెనీ జపాన్‌లో ఒకటవ తరం సెల్‌ఫోన్‌ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్‌ 2జిని, 2001లో జపాన్‌ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్‌ఫోన్‌తో పశ్చిమ బెంగాల్‌ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్‌తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్‌కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.


మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.


2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్‌ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.


5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్‌ సర్వీసు సెంటర్స్‌(సిఎస్‌సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?


జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్‌ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్‌ చేసిన కాబ్‌ డ్రైవర్‌కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి గోల్‌ మాల్‌ గోవిందాలు : ఆర్ధిక రంగ అంకెలతో జనాన్ని ఆడుకుంటున్నారు !

06 Tuesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, BJP, India GDP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, Per Capita Income in the India, UK GDP


ఎం కోటేశ్వరరావు


గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి.రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం కలిగినవే అయినా నేరుగా జనాన్ని తాకేవి కాదు గనుక అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయనేతలు, అందునా అధికారంలో ఉన్నవారు అంకెలతో గారడీలు చేస్తూ జనాలను ఆడుకుంటున్నారు. కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం.


బ్రిటన్ను వెనక్కు నెట్టి మన దేశం జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి వచ్చిందని కొంత మంది సంతోషం ప్రకటిస్తున్నారు, మంచిదే. వెనుకటికి ఎవరో మాది 101 అరకల వ్యవసాయం తెలుసా అని మీసాలు మెలివేశాడట. మాది అంటున్నావు ఎవరెవరిది అని అడిగితే మా భూస్వామికి వంద, నాటి ఒకటి అన్నాడట. అలాగే మరొకడు మా ఇంటి పక్కనే ముకేష్‌ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడట.ఆ చెప్పిన వాడి ఇల్లు చిరిగిన ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన గుడారం వంటిది కాగా అంబానీ ఇల్లు 27అంతస్తులు, మూడు హెలిపాడ్లు కలిగి ఉంది. కరోనాకు ముందు కేవలం పది బిలియన్‌ డాలర్ల సంపద కలిగి అదానీ ఇప్పుడు 141 బి.డాలర్లకు చేరిందని తాజా వార్త.పేద వాడి ప్లాస్టిక్‌ పాక, వీధుల్లో అడుక్కొనే బిచ్చగాండ్ల రాబడి అంబానీ ఇల్లు, అదానీ సంపదలు అన్నింటినీ కలిపే దేశ జిడిపిగా పరిగణిస్తారు. దీన్ని నరేంద్రమోడీ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా కొందరు వర్ణిస్తున్నారు. అంకెలను ఎవరూ తారు మారు చేయలేరు గానీ ఎవరి భాష్యం వారు చెప్పవచ్చు. నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు ఒకట్లను కలిపితే అని, రెండును రెండుతో హెచ్చవేస్తేఅని, కాదు కలిపితే అనీ చెప్పవచ్చు. ఏప్రిల్‌-జూన్‌ మూడు మాసాల జిడిపిని లెక్కలోకి తీసుకుంటే మన దేశానిది 823 బిలియన్‌ డాలర్లుండగా బ్రిటన్‌లో 763బి.డాలర్లని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అదే సంస్థ జనవరి-మార్చి మాసాల్లో మనది 864, బ్రిటన్‌లో 813 బి.డాలర్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నది. అంటే గడచిన మూడు నెలల్లో మన జిడిపి 41బి.డాలర్లు తగ్గింది.బ్రిటన్‌తో పోల్చుకొని సంతోష పడాలా మన తీరు తెన్నులను చూసి విచారపడాలా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.


ఇవన్నీ డాలరు లెక్కల్లో చెబుతున్న అంకెలు. ఈ కాలంలో మన కరెన్సీ, బ్రిటన్‌ పౌండ్‌ విలువ కూడా డాలరుతో పోలిస్తే తగ్గింది కనుక రెండు దేశాల జిడిపి తగ్గినట్లు ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. కనుక ఈ అంకెలను చూపి విరగబాటును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మన కరెన్సీ విలువ మరింత తగ్గి, బ్రిటన్‌ పౌండ్‌ విలువ పెరిగినా లేక తారుమారైనా భౌతిక సంపదలతో నిమిత్తం లేకుండానే విలువలు మారతాయి.ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2022 చివరినాటికి బ్రిటన్‌ జిడిపి 3.38 లక్షల కోట్ల డాలర్లుగా, మనది 3.54లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ మాత్రానికే సంబరాలు చేసుకుంటే ఎలా ! అదే ఐఎంఎఫ్‌, దాని కవల సోదరి ప్రపంచబాంక్‌ మన దేశం గురించి చెప్పిన ఇతర అంకెల గురించి ఇలాంటి సంబరాలు చేసుకున్నామా ? ఐదో స్థానానికి చేరినందుకు సంతోషపడితే తలసరి జిడిపిలో మనం 159వ స్థానంలో ఉన్నామని, పక్కనే ఉన్న శ్రీలంక 148లో ఉందని ఎంత మందికి తెలుసు. 2021లో అదే బ్రిటన్‌ 47,334 డాలర్లుండగా మనది 2,277 డాలర్లు, చైనాలో 12,556 డాలర్లుంది.


కనీసం చైనా స్థాయికి చేరాలంటే ఇప్పుడున్న జిడిపి ఐదున్నర రెట్లు పెరగాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ గారిని తన మంత్రదండంతో పెంచమనండి. కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అనే పాత సామెత తెలిసిందే. మన జిడిపి తొలి త్రైమాసికంలో రెండంకెల 13.5శాతం పెరుగుదల ఉన్నా ఏడాది చివరకు అది ఒక అంకెకు పడిపోతుందని రిజర్వుబాంకే చెప్పింది. ఒకవైపు అది 6 లేదా ఆరున్నర శాతం అని కొందరు చెబుతుంటే ఎస్‌బిఐ 6.7 నుంచి 7.7శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. అప్పుడు విచార ప్రదర్శనలకు దిగుతామా ? మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు, ఉండవచ్చు, గతంలో మన కంటే తక్కువ ఉన్న స్థితి నుంచి జిడిపిలో మనల్ని వెనక్కు నెట్టి చైనా ఎలా ముందుకు పోతోందని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో మనకు పోలిక ఎందుకని తప్పించుకుంటారు. ఇంకా పొడిగిస్తే మనది ప్రజాస్వామ్యం వారిది నిరంకుశత్వం అని చెబుతారు. చైనాలో ఉన్నది నిరంకుశమో కాదో కాసేపు పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్దతుల్లో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నామో తర్కానికి నిలిచే సమాధానం చెప్పాలి. మన దేశంలోకి రానున్న పెట్టుబడులు వాటి మంచి చెడ్డల గురించి చెబితే ఒకటి, దాని కంటే చైనా నుంచి తరలివచ్చే పెట్టుబడులు, సంస్థల గురించి కొందరు ఎక్కువగా చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే కొన్ని వియత్నాం లేదా మరొక చోటికో వెళుతున్నట్లు వార్తలు తప్ప మన దేశానికి ఎన్ని వచ్చాయో ఎవరినైనా చెప్పమనండి.


జిడిపి గురించి గొప్పలు చెబుతున్నవారు ఆగస్టు చివరివారంలో మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రెండేళ్ల నాటి కనిష్ట స్థాయికి ఎందుకు తగ్గినట్లో చెప్పాలి. ఆగస్టు 26తో ముగిసిన వారంలో నిల్వలు 561 బి.డాలర్లకు తగ్గాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభం తరువాత 27 వారాలకు 21 వారాల్లో తగ్గుదల నమోదైంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే 80బి.డాలర్లు తగ్గాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో జడిపి వృద్ది రేటు 16.2 శాతం వరకు ఉంటుందని ఆర్‌బిఐ చెప్పగా 13.5శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 20.1శాతం నమోదైంది. అంటే పురోగమనంలో ఉన్నట్లా తిరోగమనంలో ఉన్నట్లా ? ఇది ఒక అంకెల గారడీ. వచ్చే రోజుల్లో మన జిడిపి పెరిగి 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్ను వెనక్కు నెట్టి మూడవ స్థానంలోకి వెళుతుందని ఎస్‌బిఐ చెప్పింది. దానికి ఎస్‌బిఐ చెబుతున్నదేమిటి ? చైనాలో కొత్త పెట్టుబడులు మందగిస్తాయని, ఆ మేరకు మన దేశంలో పెరుగుతాయని చెబుతూ చైనాలో జరుగుతున్నదానిలో ఐదో వంతు ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు చెప్పిన యాపిల్‌ కంపెనీ ప్రకటన ఆశాభావానికి దోహదం చేస్తున్నట్లు చెప్పింది. అదే కంపెనీ ఐపాడ్‌ల ఉత్పత్తిని వియత్నాంకు తరలించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.యాపిల్‌ కంపెనీ బ్రెజిల్‌,భారత్‌లో తలపెట్టిన ఉత్పత్తులు స్థానిక అవసరాలకు తప్ప ఎగుమతుల కోసం కాదని ఆగస్టు ఏడవ తేదీన లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక రాసింది.


మన దిగుమతులు పెరిగి దానికి అనుగుణంగా ఎగుమతులు లేక వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు జిడిపి ఐదవ స్థానానికి ఎదుగుదల వార్తలతో పాటే ప్రభుత్వం వెల్లడించింది. ఇన్వెంటియా డాట్‌కామ్‌ విశ్లేషణ ప్రకారం 2022 ఏప్రిల్‌-ఆగస్టు నెలల్లో మన ఎగుమతులు 192.59 బి.డాలర్లు కాగా దిగుమతులు 317.81 కాగా లోటు 125.22 బి.డాలర్లు. గతేడాది ఇదే నెలల లోటు 53.78 బి.డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టుతో పోల్చితే లోటు 13.81 నుంచి 28.68 బి.డాలర్లకు పెరిగింది. ఎగుమతులు0.8శాతం తగ్గగా దిగుమతులు 31శాతం పెరిగాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన ఎగుమతులు పెరిగి మన జనానికి పని కల్పించే ఎగుమతులు పెరగకుండా మనలను నిరుద్యోగులుగా మార్చే దిగుమతులు పెరుగుతున్నపుడు జిడిపి పెరుగుదలతో సామాన్యులకు ఒరిగేదేమిటి ? సంతోషించే వారు దీనికేమి చెబుతారు.2001 నుంచి చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న కారణంగా 2018 నాటికి అమెరికాలో 40లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఇదే కాలంలో చైనాతో అమెరికా వాణిజ్య లోటు 83 నుంచి 420 బి.డాలర్లకు పెరిగింది. దిగుమతులు పెరిగితే మన పరిస్థితి ఇంతే కదా !


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నది తెలిసిందే. ఇది సుమతీ శతకంలోనిది. రచయిత బద్దెన లేదా భద్రభూపాలుడు అని చెబుతారు. సదరు శతకకారుడు ఇప్పుడు బతికి ఉంటే దీన్ని రాజకీయపార్టీలకు వర్తింప చేసి ఉండేవాడు. గతంలో కాంగ్రెస్‌ పాలనా కాలంలో డాలరుతో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి పెద్దలు మౌనంగా ఉంటే అదొక దారి. దానికి బదులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మన కరెన్సీ పతనం కాలేదు, డాలరు విలువ పెరిగితే మనమేం చేస్తాం, ఇతర కరెన్సీలతో పోల్చి చూడండి మనది బలపడింది అని చెబుతున్నారు.గతంలో మన్మోహన్‌ సింగు ఏలుబడిలో ఇదే జరిగినపుడు కూడా జరిగింది అదే కదా ! అప్పుడు ఎందుకు విమర్శించినట్లు ? మన కరెన్సీ బలపడితే లేదా దిగజారితే తలెత్తే పరిణామాలు ఏమిటన్నది గీటురాయి. ముందుగా మన బలపడిందని చెబుతున్న మన కరెన్సీ, ఇతర వాటిని చూద్దాం. ఒక రూపాయికి వివిధ కరెన్సీల మారకపు విలువ.
దేశం ××××× సంవత్సరం,నెల, తేదీ ×× విలువ ×××××సంవత్సరం,నెల, తేదీ××× విలువ
బంగ్లాదేశ్‌ ××× 2021.9.04 ×××××× 1.16649××× 2022.9.4 ××××××× 1.7507
పాకిస్తాన్‌ ××× 2022.3.08 ×××××× 2.3235 ××× 2022.9.3 ××××××× 2.19289
శ్రీలంక ××× 2022.3.08 ×××××× 2.9515 ××× 2022.9.3 ××××××× 4.5166
చైనా ××× 2022.3.08 ×××××× 0.082244 ×× 2022.9.3 ××××××× 0.086548
రష్యా ××× 2022.3.08 ×××××× 1.6893 ××× 2022.9.3 ××××××× 0.75604
ఐరోపా ××× 2022.3.08 ×××××× 0.011933 ××× 2022.9.3 ××××××× 0.012603
అమెరికా ××× 2022.3.08 ×××××× 0.013004 ××× 2022.9.3 ××××××× 0.012544
పై వివరాలను గమనించినపుడు బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, చైనా, ఐరోపా కరెన్సీలతో పోల్చినపుడు మన రూపాయి కాస్త బలపడింది. రష్యా, అమెరికా డాలరుతో పోలిస్తే బలహీనపడింది.ఏ దేశ కరెన్సీ అయినా బలపడితే దాని ఎగుమతులకు దెబ్బ, కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. మన కరెన్సీ విలువ పతనం అవుతున్నా ఆ మేరకు మన ఎగుమతులు పెరగటం లేదు, రెండింటికీ చెడ్డ రేవడిలా మారాము.


మన నరేంద్రమోడీ ఘనత కారణంగా రష్యా మనకు తక్కువ ధరలకు అదీ మన రూపాయలు తీసుకొని చమురు విక్రయిస్తున్నదని ప్రచారం చేస్తున్నారు. అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ధిక్కరించి తమకు మద్దతు ఇస్తున్నవారికి వారి చమురు కొనుగోలు చేస్తున్న చైనాతో ఇతర అనేక దేశాలకు కూడా తక్కువ ధరలకే ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభానికి ముందు మనం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు నామమాత్రం. ఇప్పుడు అక్కడి నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాము.భారత్‌ నాటి సోవియట్‌, తరువాత రష్యాతో రూపాయి-రూబుల్‌ సంబంధాలు కొనసాగాయి, ఇప్పుడేదో కొత్తగా మొదలైనట్లు చెప్పటం వాస్తవదూరం.2019లో రెండు దేశాల వాణిజ్యంలో సగం డాలర్లలో చెల్లించాము, అది 2021లో 38.3శాతానికి తగ్గి 53.4శాతం రూబుళ్లలో చెల్లించాము. ఇక వర్తమానానికి వస్తే మన చమురు దిగుమతుల్లో కేవలం 0.2శాతంగా ఉన్న రష్యా చమురు ఆరునెలల్లో ఇప్పుడు పదిశాతానికి చేరింది. రూపాయి-రూబుల్‌ లావాదేవీలతో ఆర్‌బిఐకి విదేశీమారక ద్రవ్యం పదహారు శాతానికి పైగా మిగిలింది. అసలే మన డాలర్లు దేశం వదలి పోతున్న తరుణంలో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. ఇక మన దిగుమతులు చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి డాలర్లలో చెల్లిస్తే మనకు కలిగే లబ్ది ఏమీ ఉండదు, అదే యువాన్‌ – రూపాయి లావాదేవీలు జరిగితే స్వల్పంగా మన కరెన్సీ విలువ పెరిగినందున కొంతమేరకు లబ్ది ఉంటుంది. కానీ చైనాకు మన ఎగుమతులు తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఇప్పుడు రూపాయితో పోల్చితే రూబుల్‌ విలువ కూడా పెరిగినట్లు పై వివరాలను చూస్తే తెలుస్తుంది. మీ డాలరు విలువ పెరిగింది తప్ప మా రూపాయి తగ్గలేదని చెబుతున్న బిజెపి నేతలు తమ పిల్లల విదేశీ విద్యకు అవసరమైన డాలర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి లేదా జనం అడగాలి. మనం వాడే సెల్‌ఫోన్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర పరికరాల ధరలు ఎంత పెరిగాయో ఎవరికి వారు తెలుసుకోవచ్చు.2021లో 57బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్‌ వస్తువులను దిగుమతి చేసుకున్నాము.


మన దేశం డాలర్లు చెల్లించి విదేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది.2014 ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 పక్షం రోజుల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 99.52 డాలర్లు, ఆ రోజుల్లో సగటున మన కరెన్సీ మారకపు విలువ డాలరుకు రు.60.54, ఈ రేటున ఒక పీపాకు మనం చెల్లించిన మొత్తం రు.6,020.94, అదే చమురుకు 2022 జూలై 27 నుంచి ఆగస్టు 26వరకు సగటున పీపాను 98.18 డాలర్లకు కొనుగోలు చేశాము, దీనికి గాను మన రూపాయల్లో డాలరుకు రు.79.52 చొప్పున పీపాకు రు.7,807.27 చెల్లించాము. 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పినట్లు మన కరెన్సీ విలువను డాలరుతో మారకం రు.40కి పెంచే సామర్ధ్యాన్ని నరేంద్రమోడీ లేదా ప్రభుత్వం గానీ ప్రదర్శించి ఉంటే మనకు ఇప్పుడు ముడిచమురు పీపా రు.3,927.20కే వచ్చేది, ధరల పెరుగుదల ఆమేరకు తగ్గి జనానికి ఎంతో భారం తగ్గేది. నిజంగా మోడీ చెప్పిన అచ్చేదిన్‌ వచ్చి ఉండేవి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విమర్శలను స్వీకరించే స్ధితిలో మోడీ సర్కార్‌ లేదు -రాహుల్‌ బజాజ్‌ !

01 Sunday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India economy 2019, India fiscal deficit, India GDP, Modi govt, Narendra Modi, Rahul Bajaj, We are not able to openly criticise Modi govt

Image result for Rahul Bajaj

ఎం కోటేశ్వరరావు
‘యుపిఏ 2 కాలంలో మనం ఎవరిని అయినా తిట్టగలిగేవారం. మీరు మంచి పని చేస్తున్నారు, అయితే మేము మిమ్మల్ని బహిరంగంగా విమర్శించాలి అనుకుంటే మీరు దాని స్వభావాన్ని గ్రహిస్తారన్న విశ్వాసం లేదు. నేను చెప్పింది తప్పు కావచ్చు గానీ ప్రతివారు అలా భావిస్తున్నారు. భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పార్లమెంట్‌లో గాడ్సే గురించి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీని కాల్చి చంపినవాడు ఒక ఉగ్రవాది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా…..నాకు తెలియదు. గాడ్సే దేశభక్తుడని మేనెలలో ప్రజ్ఞ వర్ణించారు. దాని మీద ఆమెను క్షమించటం తనకు ఎంతో కష్టమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కానీ తరువాత ఆమెను రక్షణ శాఖ కమిటీలోకి తీసుకువచ్చారు.’

పైన పేర్కొన్న వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన వారు కాదు, నరేంద్రమోడీ వ్యతిరేకి అంతకంటే కాదు. రాజకీయవేత్త కాదు, కమ్యూనిస్టు అసలే కాదు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌. పోనీ ఆయనేమైనా ఎక్కడో అన్నారా అంటే అదేమీ కాదు.అనేక మంది దృష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కంటే బలవంతుడని భావించే హౌంమంత్రి అమిత్‌ షా, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలోనే బహిరంగ వేదిక మీద చేసిన వ్యాఖ్యలవి. ముంబైలో నవంబరు 30న జరిగిన ఎకనమిక్‌ టైమ్స్‌ 2019 అవార్డుల ప్రదానోత్సవ సభలో రాహుల్‌ బజాజ్‌ చేసిన క్తుప్త ప్రసంగంలోని ముఖ్యాంశాలవి. ఎవరూ భయపడనవసరం లేదు, ప్రజ్ఞ చెప్పిన దానిని ఖండించాము అని వేదిక మీద ఉన్న అమిత్‌ షా చెప్పిన మాటలను నమ్మేందుకు ఎవరైనా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని ఉన్నారా ?
ఇదే రాహుల్‌ బజాజ్‌ జూలై చివరి వారంలో తమ కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, గత మూడు నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి పడిపోతున్నదని ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వెల్లడిస్తోంది. డిమాండ్‌ లేకుండా ప్రయివేటు పెట్టుబడులు ఉండవు, అలాంటపుడు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం నుంచి ఊడిపడదు. అన్ని ప్రభుత్వాల మాదిరి వారు(మోడీ సర్కార్‌) చిరునవ్వు ముఖాన్ని చూపుతారు, కానీ వాస్తవం, వాస్తవమే’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇవి రాహుల్‌ బజాజ్‌ వ్యక్తిగత అభిప్రాయమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే బొంబాయి క్లబ్‌ కార్పొరేట్ల మనోగతం !
నిద్రపోతున్న వారిని లేపగలం గానీ నిద్ర నటిస్తున్నవారిని లేపగలమా ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంత నిర్ధారణగా మరొకరికి తెలియదు. అంతర్గతంగా ఏమి జరుగుతోందో కేంద్ర ప్రభుత్వానికి తెలిసినంతగా మరొకరికి ముందుగా తెలిసే అవకాశం లేదు. మోడీ సర్కార్‌, దాన్ని నిరంతరం కాపాడే ఉన్నత అధికార యంత్రాంగం గత కొద్ది సంవత్సరాలుగా అనేక విషయాలను మూసిపెడుతోంది. అవి పాచిపోయి వాసన కొట్టిన తరువాతే బయటకు వస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ తన చుట్టూ తనకు తాన తందానా అనే వారినే నియమించుకున్నారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అర్ధశాస్త్రం తెలియదన్నారు. అమెరికన్‌ పత్రిక హఫ్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారు నిజమైన అభివృద్ది రేటు 4.8శాతం అంటున్నారు, నేను 1.5శాతమే అంటున్నాను అన్నారు.(ఈ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రెండవ త్రైమాసిక అభివృద్ధి రేటు 4.5శాతమే) మీరు చూస్తే గనుక మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తే నిర్మలా సీతారామన్‌ మైక్‌ను అధికారులకు ఇస్తారు. ఈ రోజు దేశంలో ఉన్న సమస్య ఏమిటి డిమాండ్‌ లేకపోవటం తప్ప సరఫరా లేమి కాదు, కానీ ఆమె కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఇస్తున్నారు. వారు వాటిని తీసుకొని తమ రుణాలను తీర్చుకుంటారు, గతంలో కూడా అదే చేశారు. వాస్తవాలను ప్రధానికి చెప్పేందుకు ఆయన సలహాదారులు కూడా భయపడతారు. ప్రధానికేమీ దాని గురించి తెలియదు అద్భుతమైన ప్రగతి ఉందని చెబుతారు.
మాంద్యమా కాదా అన్నది కాదు అసలు నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధిక వ్యవస్ధలోపమేమిటో తెలియదనేందుకు అరకొర చర్యలు తీసుకుంటున్న తీరే నిదర్శనం అని ఆర్ధికవేత్త, 14వ ఆర్ధిక సంఘం సభ్యుడైన సుదీప్త మండల్‌ వ్యాఖ్యానించారు.అసలైన సమస్య డిమాండ్‌ వైపు ఉంది అన్నారు. ఆరునెలల ఆర్ధిక సమీక్ష నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అభివృద్ధి రేటు 4.9శాతానికి మించదు అన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలన్నీ సరఫరా వైపున ఉండే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్ధలు, రియలెస్టేట్‌ వంటి వాటికి రాయితీలు ఇవ్వటమే. డిమాండ్‌ను పెంచే జనం చేతుల్లో డబ్బు ఉండాలి అని సుదీప్త చెప్పారు.
డిమాండ్‌కు సంబంధించినవే ఉపాధి, వినిమయ అంశాలు. నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయి 6.1శాతానికి నిరుద్యోగం పెరిగిందన్న నివేదికను ఎన్నికల ముందు విడుదల కాకుండా తొక్కిపెట్టింది మోడీ సర్కార్‌. ఎన్నికల తరువాత వినిమయం తగ్గిపోయిందన్న నివేదిక తప్పుల తడక అంటూ దాన్ని కూడా మూసిపెట్టింది. అవి రెండూ తిరుగులేని పక్కా నివేదికలని ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో అభివృద్ధి రేటు 4.75శాతంగా నమోదై నిర్దారించింది, ఇది ఆరేండ్ల కనిష్టం.
కల్లు కుండను కొట్టేయటానికి ప్రయత్నిస్తూ దొరికి పోయిన వాడిని తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని అసలు విషయం దాచిన మాదిరి వ్యవహరిస్తున్నారు. ఆటో రంగంలో మాంద్యం ఎందుకంటే కుర్రవారు స్వంతకార్ల బదులు అద్దె కార్లవైపు మళ్లారని చెప్పటం అంటే దూడగడ్డి వ్యవహారమే. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. తొలి మూడు మాసాలు అలాగే ఉంటుంది, రెండవ త్రైమాస ఫలితాలు చూడండి అన్నారు. తీరా అది 4.5కు దిగజారింది. ఇప్పుడు డిసెంబరు ఫలితాలు చూడండి అంటున్నారు.
ఈ పతనానికి కారణాలు ఏమిటి? అసలు సమస్యను అంగీకరించేందుకు మోడీ సర్కార్‌ సిద్దంగా లేదు. పెట్టుబడుల గురించి మోడీ హడావుడి ఏడాదికేడాది పెరుగుతోంటే వాస్తవంలో 2015-16 నుంచి దేశంలో నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు క్రమంగా తగ్గుతున్నాయి.2006-07 నుంచి 2010-11 వరకు ప్రతి ఏటా సగటున 25లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తరువాత దిగజారుడు ప్రారంభమై 2013-14లో పదిలక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. తరువాత రెండు సంవత్సరాలలో 21, 20లక్షల కోట్లకు పెరిగాయి. 2015-16 తరువాత క్రమంగా తగ్గుతూ 2018-19లో 10.7లక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే కొన్ని లక్షల కోట్లుగా కనిపించవచ్చుగానీ అవన్నీ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు దోహదం చేసేవి కాదు. ఉదాహరణకు 2018-19లో జెట్‌ ఎయిర్‌వేస్‌ బోయింగ్‌ కంపెనీ నుంచి లక్షా 31వేల కోట్లతో 150 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. తీరా దాన్ని రద్దు చేసుకుంది. అందువలన అంతిమంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏ మేరకు కార్యరూపం దాల్చేది చెప్పలేము. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం 1.83లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని బిజినెస్‌ టుడే అక్టోబరు ఏడవ తేదీన పేర్కొన్నది. ఇది 15 సంవత్సరాల కనిష్ట రికార్డు.

ఏటేటా ప్రభుత్వ పెట్టుబడులు దిగజారుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి కార్పొరేట్లకు రాయితీలు, ద్రవ్యలోటును పూడ్చుకోవటం తప్ప వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడులుగా పెట్టటం లేదు.2015-16లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించగా అది 2017-18లో 5.3లక్షల కోట్లకు, మరుసటి సంవత్సరానికి మూడు లక్షల కోట్లకు తగ్గిపోయాయి.
1991 నుంచి అమలు చేస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించివేస్తున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చే రాయితీలు ఏదో ఒక రూపంలో పెరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలకు ముందు జిడిపిలో 12.7శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రస్తుతం ఏడుశాతానికి తగ్గాయని ప్రపంచ బ్యాంకు సమాచారం వెల్లడించింది.

అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి వినియోగ ఆధారిత వ్యవస్ధగా మన దేశాన్ని మార్చివేసేందుకు ప్రపంచ, దేశీయ కార్పొరేట్‌ శక్తులు చేసిన యత్నం విజయవంతమైంది. అందుకే పరిమితంగా ఉన్న ధనిక మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు వారికి దిగువన ఉన్న వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టే విధానాలను ముందుకు తెచ్చారు. ఇప్పటికీ ధనికుల కొనుగోలు డిమాండ్‌లో మార్పు ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు. ప్రతి ఒక్కరూ గ్రామీణ వినియోగం తగ్గిందనే చెబుతున్నారు. మెజారిటీ జనం అక్కడే ఉన్నారు, వారి ఆదాయాలు పరిమితం కనుక వినియోగమూ పరిమితమే. మునిగే పడవకు గడ్డి పోచకూడా భారమే అన్నట్లుగా వారు ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో ఏ చిన్న ప్రతికూల పరిణామం జరిగినా వినియోగం పడిపోతుంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం పరిష్కారం కాని కారణంగానే అది వినియోగం మీద ప్రభావం చూపి పారిశ్రామిక రంగాన్ని కూడా పడకేసేట్లు చేసింది. ఇది మన జనాభా పొదుపును హరించి వేస్తున్నది. పెట్టుబడికి వినియోగించే పొదుపు రేటు జిడిపిలో కొద్ధి సంవత్సరాల క్రితం సగటున 33.8శాతం ఉండగా 2019 ఆర్ధిక సంవత్సరంలో అది 29.3శాతానికి పడిపోయింది.ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారి తీస్తోంది. ద్రవ్యలోటు పెరగటం జనం మీద ఖర్చు చేసే సంక్షేమ పధకాలకు కోత పెట్టటం లేదా అప్పులు తీసుకోవటం, అధికంగా కరెన్సీ నోట్ల ముద్రణకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం. అందుకే ద్రవ్యలోటు పెరిగింది అంటే తొలి దెబ్బ సామాన్యుల మీదనే పడుతోంది. దేశంలో ద్రవ్యలోటు పెరుగుదల గురించి తెలిసే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పారి శామిక రంగాలకు పన్ను రాయితీలను ఇచ్చింది.
మన బడ్జెట్‌ అంచనాల ప్రకారం 2020 మార్చి నెల ఆఖరుకు ద్రవ్యలోటు ఏడులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అది అక్టోబరు నాటికే అంటే ఏడునెలల కాలంలోనే 7.2లక్షల కోట్లకు(102.4శాతానికి) చేరింది.పన్ను ఆదాయం 6.83లక్షల కోట్లు అయితే ఖర్చు 16.55లక్షల కోట్లకు చేరింది. ముందే చెప్పుకున్నట్లు జిడిపి వృద్ధి రేటు తగ్గటం పన్ను ఆదాయాలు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. అంటే లోటు మరింతగా పెరగటం లేదా బడ్జెట్‌కోతలకు దారి తీస్తుంది. మరొక మార్గం బంగారు బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం.
సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాన్ని వదిలించుకోవాలన్నది మన దేశం మీద ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన ఒక ముఖ్యమైన షరతు. దాన్ని బయటకు చెబితే జనంలో వ్యతిరేకత వస్తుందనే భయంతో నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ సంస్దలను వదిలించుకోవాలనే ప్రచారం మొదలు పెట్టారు. జనానికి కూడా నిజమే అనిపించింది. ఆక్రమంలో ప్రభుత్వరంగం పతనం కావటానికి చేయాల్సిందంతా చేసి ఆ పేరుతో కారుచౌకగా ఆ శితులకు కట్టబెడుతున్నారు. ప్రయివేటు టెలికాం సంస్ధలు ఐదవ తరం టెక్నాలజీలోకి మారటం గురించి ఆలోచిస్తుంటే ప్రభుత్వ బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూడవ తరం టెక్నాలజీకే పరిమితం చేసే చర్యలు తీసుకోవటం దానిలో భాగమే. ప్రభుత్వంలోని చమురు సంస్ధలు లాభాలు ఆర్జిస్తున్నాయి, అయినప్పటికీ వాటిని(బిపిసిఎల్‌) అమ్మివేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వ్యాపారాలకు దూరంగా ఉండాలి కనుక అమ్మివేస్తున్నాం, అది కూడా ప్రయివేటు రంగానికే అని బిజెపి సర్కార్‌ చెబుతోంది. ఇంక నాటకాలు ఆడేందుకు ఏమాత్రం అవకాశం లేదు కనుక అసలు విషయాలు చెబుతున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : అంకెల గారడీ, ఎదురుదాడులు !

20 Wednesday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aravind Subrahmanyam, India Data Crisis, India GDP, jugglery of numbers, narendra modi government, narendra modi offensive attacks, offensive attacks

Image result for narendra modi offensive attacks
(ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 2 ముగింపు భాగం)
ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాది అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన గురించి పార్లమెంట్‌లో మాట్లాడారు. పిఎఫ్‌ పధకంలో ఎంత మంది చేరిందీ, వైద్యులు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్ల గురించి అంకెలు చెబుతూ ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన చేయకపోతే అవన్నీ ఎలా సాధ్యమని ఎదురుదాడి చేశారు. తరువాత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కూడా అదే కబుర్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడైంది. నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించి నిరుద్యోగశాతం 6.1కి చేరిందన్నది దాని సారం. అయితే తాము కల్పించిన ఉద్యోగాలన్నీ లెక్కల్లోకి చేరలేదని, తప్పుడు లెక్కలని పకోడీ బండి పెట్టుకోవటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వెల్లడైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వాస్తవం కాదని బుకాయించిన సర్కార్‌ అనంతరం అదే నివేదికను వాస్తవమైనదిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.2శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబరులో 8.5కు చేరింది.
నిరుద్యోగం లేదా ఉద్యోగాల కల్పన గురించి ప్రధాని, బిజెపి నేతలు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 2017 సెప్టెంబరు-2018నవంబరు మధ్య తొలిసారిగా కోటీ ఎనభై లక్షల మంది ప్రావిడెంట్‌ ఫండ్‌కు తమ వాటాను జమచేయటం ప్రారంభించారని వారిలో 65లక్షల మంది 28ఏండ్ల లోపు వారేనని, వారందరికీ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన కారణంగానే అది జరిగిందని, అదే విధంగా 2014 మార్చి నుంచి 2018 అక్టోబరు వరకు కోటీ ఇరవై లక్షల మంది నూతన పెన్షన్‌ పధకంలో నమోదైనట్లు కూడా మోడీ చెప్పారు.
ఇక్కడ మోడీ మహాశయుడు నాణానికి ఒక వైపును మాత్రమే చూపారు. రెండో వైపు చూద్దాం. ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌లో ఈ లెక్కలన్నీ పెడుతున్నారు. మోడీ గారు కోటీ 79లక్షల నమోదు కాలంలోనే కోటీ 39లక్షల మంది ఈ పధకం నుంచి తప్పుకున్నారు. 33లక్షల మంది గతంలో చేరి తప్పుకొని తిరిగి చేరిన వారు ఉన్నారు. అంటే నిఖరంగా నిలిచిన వారు 73లక్షల మందే. తప్పుకున్నవారందరూ నిరుద్యోగం సైన్యంలో చేరినట్లా లేక ఉద్యోగవిరమణ చేసినట్లా ? ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికుల పేరుతో యజమానులకు మేలుచేసే సబ్సిడీ పధకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహ యోజన. దాని ప్రకారం తమ పధకం ప్రారంభం నాటికే ఉన్న సిబ్బంది గాకుండా తరువాత కొత్తగా చేరిన సిబ్బందిని ప్రావిడెంట్‌ పధకంలో చేర్చితే వారి ఖాతాలకు యజమానులు చెల్లించాల్సిన సొమ్మును మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా పదిహేను వేల రూపాయల లోపు వేతన ఉన్న వారికి మాత్రమే. అందువలన అనేక యజమానులు దాన్ని వినియోగించుకొని అప్పటికే ఉద్యోగాల్లో వున్నా పిఎఫ్‌ పధకంలో చేర్చని వారిని కొత్తవారిగా చేర్పించి వుండవచ్చు. అందువలన ఒక్కసారిగా ఉద్యోగాలు పెరిగినట్లు చిత్రిస్తున్నారు.
అంకెలతో జనాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహయోజన పధకం ప్రారంభమైన 2016 నుంచి 2019 నవంబరు 18 వరకు విస్తరించిన జౌళి రంగ కార్మికులతో సహా లబ్ది పొందిన వారు కోటీ 24 లక్షల 33వేల 819 మంది. లబ్ది పొందిన సంస్ధల సంఖ్య లక్షా 53వేల 574. ఇందుకు గాను ప్రభుత్వం యజమానుల వాటాగా చెల్లించిన సొమ్ము 6,887 కోట్ల రూపాయలు. సగటున ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో వేసిన సొమ్ము రూ.5,539. మరి ఈ లెక్కలను మోడీ గారు కాదంటారా తప్పంటారా ?
మోడీ గారు మరో లెక్క చెప్పారు. అదేమంటే 2014 నుంచి కొత్తగా 36లక్షల కొత్త వాణిజ్య ట్రక్కులు,27లక్షల ఆటోలు, కోటీ 50లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయం జరిగిందని, తద్వారా రవాణా రంగంలో కోటీ 25లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు వివరించారు. ఇక్కడ చూడాల్సింది, పాతవాహనాలు ఎన్ని వినియోగం నుంచి తప్పుకున్నాయి. కొత్తవాహనాలకు కొత్త ఉద్యోగులే వచ్చారనుకుందాం, వారిలో ఎవరూ అంతకు ముందు ఎక్కడా ఏ పనీ చేయటం లేదా కొత్త వాహనాల మీద అప్పటికే పని చేస్తున్నవారు గాక కొత్తవారు ఉద్యోగాల్లో చేరినట్లు రుజువులు ఏమిటి?
టూరిజం రంగంలో కొత్త హౌటళ్లకు అనుమతులు 50శాతం పెరిగాయని, దీని వలన మరో కోటీ 50లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోడీ చెప్పారు. దీనికి కూడా రవాణా రంగం మాదిరే అధికారుల అంచనా లెక్కలు తప్ప ఆధారాలేమీ లేవు.
తొలిసారిగా ముద్ర రుణపధకం కింద నాలుగు కోట్ల 25లక్షల మంది రుణాలు పొందారని, అయితే ఉపాధి వివరాలు లేవని మోడీ చెప్పారు. అంటే రుణాలు తీసుకున్నవారందరికీ ఉపాధి చూపినట్లే అనుకోవాలనా ? ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 15.59 కోట్ల మందికి ఇచ్చిన రుణాల మొత్తం రెండులక్షల 75వేల కోట్లు, అంటే సగటున ఇచ్చిన మొత్తం రు 17,582, దీనితో వచ్చే ఉపాధి ఎంత అన్నది ప్రశ్న.

Image result for narendra modi offensive attacks
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతున్నది. ప్రధాని నరేంద్రమోడీకి ఇన్ని వివరాలు తెలిసినపుడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) లేదా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అవెందుకు ప్రతిబింబించటం లేదు. లెక్కలు సరిగా వేయటం లేదంటున్నారు. ఐదున్నర సంవత్సరాల పాలనలో లెక్కల విధానాన్ని కూడా సరి చేసి సరైన లెక్కలు చెప్పటంలో మోడీ సర్కార్‌ విఫలమైనట్లు అంగీకరించటమే కదా ! లేదూ సరైన లెక్కల విధానాన్ని అమల్లోకి తెచ్చేంత వరకు ఆ సంస్ధ రూపొందించిన వాటిని ఎందుకు అంగీకరించటం లేదు ? ప్రతి సారీ వివాదం ఎందుకు రేపుతున్నట్లు ? మోడీ సర్కార్‌ కోసం ఎన్‌ఎస్‌ఓ కొత్త పద్దతినేమీ ప్రవేశపెట్టలేదు కదా, అంతకు ముందున్నదాని కొనసాగింపే కదా ? పోనీ నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు? అవి సరైనవే అయితే నిరుద్యోగం పెరగటం, వినిమయశక్తి తగ్గటం వంటి వివరాలు తప్పుడు లెక్కలు ఎలా అవుతాయి ?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఆచరణ సంగతి పక్కన పెడదాం. రైతుల ఆదాయం ఎంత అన్నది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా ? రైతుల పరిస్ధితి గురించి శ్వేతపత్రం ఏమైనా ప్రకటించిందా అంటే లేదు. ప్రభుత్వ సంస్ధలు చెబుతున్న లెక్కలు తప్పు, వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు అంటున్నారు. స్వచ్చ భారత్‌ లేదా బహిరంగ మలవిసర్జన నిరోధ పధకం కింద మరుగుదొడ్ల గురించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాటిలో ఎన్నింటిని వినియోగిస్తున్నారు అన్న అంశంపై తయారు చేసిన విశ్లేషణ నివేదికను మాత్రం బయట పెట్టకుండా తొక్కి పెట్టారు.
మరుగుదొడ్ల నివేదిక సర్వేను ఎందుకు మూసిపెట్టారు ? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ మన దేశంలో ఇప్పుడు ఎక్కడా బహిరంగ మలవిసర్జన లేదని అంతర్జాతీయ సమాజానికి చెప్పేశారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా చిత్రించారు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అహమ్మదాబాద్‌ సబర్మతి నదీ తీరంలో ఇరవై వేల గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేశారు. ఇంత హడావుడి చేసిన తరువాత అధికారిక నివేదికను విడుదల చేస్తే మోడీ గారి గాలి తీసినట్లు అవుతుంది. దేశంలో మరుగుదొడ్లు 75శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, వాటిలో 80శాతం మాత్రమే వినియోగంలో ఉన్నట్లు సదరు ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 76వ నివేదికకోసం 2018 జూలై నుంచి డిసెంబరు మధ్య సర్వే చేశారు. దానిలో చేర్చిన ప్రశ్నావళి మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిసారిగా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఉంటే దాన్ని వినియోగిస్తున్నారా ? వినియోగించకపోతే కారణాలేమిటి ? అని అడిగారు. ఈ నివేదిక సర్వేలో 75శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నట్లు తేలింది. సర్వే ముగిసిన డిసెంబరు తరువాత కేవలం తొమ్మిది నెలల కాలంలో మిగిలిన 25శాతం మరుగుదొడ్లు కట్టటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది కనుక మోడీ సర్కార్‌ దీన్ని తొక్కి పెట్టిందన్నది స్పష్టం. ఇదే నివేదికను తరువాత ఎప్పుడో జనం మరచిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల అనంతరం నిరుద్యోగ నివేదిక మాదిరి విడుదల చేస్తారా ?

Image result for narendra modi offensive attacks
ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి రేటు ఏడు వాస్తవం కాదని, నాలుగున్నరశాతానికి మించదని ప్రధాని ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణ్యం , అభివృద్ధి అంకెలకు ఉపాధి కల్పనకు పొసగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అరవింద సుబ్రమణ్యం గణించిన తీరులో లోపాలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం. అవెలా తప్పో ఇంతవరకు మోడీ సర్కార్‌ ఎందుకు అసలు గుట్టు విప్పి చెప్పలేదు, అడ్డుకున్నదెవరు ? ప్రతి అంశానికి సమాధానం చెబుతామని రంకెలు వేశారు, ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుబడిన అంకెలు సుబ్రమణ్యం చెప్పిందే సరైనవని నిర్ధారించటం లేదా ? మోడీ స్వయంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యవలన జిడిపి వృద్ధిరేటు 6.7 నుంచి 8.2శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే అంతకు ముందు వేసిన అంచనాలను సవరించింది. కానీ ఆచరణలో ఆ చర్య వృద్దిని దెబ్బతీసిందని రుజువు చేసింది. అంటే కొందరి బుర్రల్లో తలెత్తిన ఆలోచనల మేరకు చేసిన అంకెల గారడీ తప్ప ప్రాతిపదిక లేదు లేదా తప్పుడు ప్రాతిపదికన అంకెలను సవరించారన్నది స్పష్టం. అభివృద్ది సూచికల తయారీకి తీసుకొనే అంశాలైన కార్ల అమ్మకాలు, విమానాల్లో సరకు రవాణా, కొనుగోలు శక్తి తదితర అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వృద్ది గురించి అతి అంచనాలు వేసినట్లు రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.
దేశంలో ఆర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉందా మాంద్యంలో ఉందా అనే పండిత చర్చను కాసేపు పక్కన పెడితే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్దలు ఎంత సామర్ధ్యంతో పని చేస్తున్నాయి, అంచనాల మేరకు విద్యుత్‌ ఎందుకు అమ్ముడు పోవటం లేదంటే పరిశ్రమలు, వాణిజ్యం కొత్తగా రాకపోవటమే అన్నది స్పష్టం. అందుకే విద్యుత్‌ కంపెనీల దివాళా. ఈ పూర్వరంగంలో సమాచారం వెలువడుతున్న అనుమానాలు మన అధికారయంత్రాంగం, పాలకుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయని గుర్తించాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: