• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: iran

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వుత్తర కొరియాతో ఒప్పందం ఓకే, ఇరాన్‌ మాటేమిటి ట్రంప్‌ !

13 Wednesday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

denuke deal with north korea, Donald trump, iran, Kim Jong-un, kim-trump meet, North Korean leader Kim Jong-un, nuclear threat

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండియా-ఇరాన్‌-చైనా సంబంధాలు

25 Wednesday May 2016

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chabahar, China, INDIA, india- iran-china relations, iran, port of Chabahar, Silk Road Train

సత్య

  గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలతో ఎక్కువగా ఎందుకు కాలం గడుపుతున్నారంటే వెంకయ్య నాయుడి వంటి శిష్య గణం విదేశీ పెట్టుబడుల కోసం అని వెనుకా ముందు చూసుకోకుండా చెప్పారు. మూడో సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు ప్రధాని ఇరాన్‌ పర్యటన జరిపారు. ఈ సందర్బంగా వచ్చిన వార్తలేమిటి అక్కడ ఒక రేవును అభివృద్ధి చేయటంతో పాటు రానున్న రోజులలో 20 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావాలని, వాటితో దేశాన్ని బాగు చేస్తామని చెబుతున్న పాలకులు మరోవైపు దేశం వెలుపలికి పెట్టుబడులను తరలించటం ఏమిటి ?

    దీనికి గాను జనానికి చెబుతున్నది ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించాలంటే పాక్‌ భూ భాగం గుండా వెళ్లాలని, ఆ దేశం మనకు ఇబ్బందులు కలిగించకుండా వుండాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని, అందుకు గాను గుజరాత్‌లో కాండ్లా రేవు నుంచి ఇరాన్‌లోని చబహార్‌ రేవుకు దగ్గరకు దగ్గర, తలనొప్పిలేని మార్గం అవుతుందని, దీనికి తోడు ఇరాన్‌ నుంచి మధ్య ఆసియా ద్వారా రష్యా వరకు రైలు మార్గంతో సరకు రవాణా సులభం అవుతుందని చెబుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు, ఇతరులతో తలనొప్పిలేని మార్గాలను వెతుక్కోవటం కూడా మంచిదే. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇబ్బంది లేదు, తప్పులేదు, చేయదలచుకున్నదేదో చేసుకోక పొరుగుదేశాల గురించి నోటి దూల ఎందుకు ?

     అమెరికా కనుసన్నలలో నడుస్తున్న మనం ఇరాన్‌కు దూరంగా జరిగిన సమయంలో చైనా ఆ స్ధానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌కు తొలి సిల్కు రైలును విజయవంతంగా నడిపింది. చైనా తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లోని ఇవు నుంచి ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 10,399 కిలోమీటర్ల దూరాన్ని కజకస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల గుండా ప్రయాణించి 14 రోజుల్లో రైలు 32 కంటెయినర్ల సరకును చేర్చింది. అదే సముద్రమార్గం ద్వారా చైనా షాంఘై నుంచి ఇరాన్‌ రేవు బందర్‌ అబ్బాస్‌కు ఓడ చేరుకొనేందుకు 45 రోజులు పడుతుంది. రెండు దేశాల మధ్య 2003-13 మధ్య వాణిజ్యం నాలుగు నుంచి 53 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ఈ మొత్తాన్ని 600 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని జనవరిలో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ పర్యటన సందర్భంగా వుభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరాన్‌తో మన వాణిజ్యం ప్రత్యక్షంగా 14 బిలియన్‌ డాలర్లు, మూడవ పక్ష దేశం ద్వారా చేసిందానితో కలిపితే 30 బిలియన్‌ డాలర్లకు మించి లేదు. చైనా నుంచి యూరేసియా ప్రాంతానికి రైలు ద్వారా సరకు రవాణా ఇరాన్‌కు ఆదాయం తెచ్చిపెడుతుంది. తన రైలు మార్గాన్ని వినియోగించుకున్నందుకు సరకు రవాణా సంస్ధలు చెల్లిస్తాయి. చైనాలోని ఇవు నుంచి స్పెయిన్‌లో మాడ్రిడ్‌ వరకు 13వేల కిలోమీటర్ల దూరం వరకు సరకు రవాణాకు అవకాశం వుంది. ఈ పూర్వరంగంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు చబహార్‌ రేవు ఒప్పందం అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇరాన్‌ తనకు ప్రయోజనం వున్న ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరుపుకుంటుందని గుర్తించాలి.

     మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన పారిశ్రామికవేత్తలు చబహార్‌లో అభివృద్ధి చేసేది పిచ్చుక గూడు అంత చిన్నది అనుకుంటే దానికి 100 కిలోమీటర్ల దగ్గరలోని పాకిస్థాన్‌ రేవు గ్వడార్‌ ప్రాంతంలో చైనా ఏకంగా పెద్ద రాజప్రాసాదమే ఏర్పాటు చేస్తున్నదట. నరేంద్ర మోడీ నిర్ణయం గురించి సంతోషం పట్టలేని ఒక తెలుగు పత్రిక ఈ ప్రాంతంలో హెచ్చుతున్న చైనా ప్రాబల్యానికి ఇది కళ్లెం వేసే నిర్ణయం అని జబ్బలు చరుచుకుంది. పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసే కారిడార్‌లో పెట్టుబడులు 46 బిలియన్‌ డాలర్లు అయితే చబహార్‌లో మనం పెట్టేది 50 కోట్ల డాలర్లని ఒక ఆంగ్ల పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది. అదే చబహార్‌ రేవు ఆధారంగా అక్కడ చైనా ఒక పెద్ద పారిశ్రామిక పట్టణాన్నే ఏర్పాటు చేసేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.

    చబహార్‌ రేవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పలుకుబడి పెంచుకోవాలని 2003లోనే వాజ్‌పేయి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకాలం ఎందుకు ముందుకు పోలేదు? స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక కాలవ తవ్వాలన్నా బ్రిటీష్‌ రాణీగారి అనుమతి కావాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశం ఏం చేయాలన్నా అమెరికా అనుమతి కావాలంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అని చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇరాన్‌తో మనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు. ఎక్కడా మార్కెట్ల కోసం పోటీ పడలేదు, తగాదా లేదు. అమెరికా-ఇరాన్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం. ఇరాన్‌లోని చమురు మొత్తాన్ని స్వాహా చేయాలన్నది అమెరికా కల. దాన్ని ఇరానియన్లు అడ్డుకున్నారు. దాంతో ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందనే పేరుతో దానిపై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించింది అమెరికా. మన పాలకులు అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దాని వెనుకే నడుస్తున్నారు కనుక మనమూ ఇంతకాలం ఇరాన్‌కు దూరంగా వుండి అమెరికన్లను సంతోషపరిచాము. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికన్లు రాజీకి వచ్చారు కనుక, ఇప్పుడు మనమూ మైత్రి గురించి కవిత్వం చెబుతున్నాము. వెన్నెముకలేని విదేశాంగ విధానం, అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చౌకగా చమురు ఇస్తామని ఇరాన్‌ ముందుకు వచ్చినా అయ్యగారికి కోపం వస్తుందన్నట్లుగా తీసుకోలేదు.

    మా దేశంలో పరిశ్రమలు పెట్టండహో అని ప్రపంచమంతా తిరిగి రా రమ్మంటున్నాము. కానీ మన పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో ఇరాన్‌లో పరిశ్రమలు పెడతారట. నీరు పల్లమెరుగు- పెట్టుబడి లాభాలనెరుగు అని కొత్త సామెతను చెప్పుకోవాలేమో. పెట్టుబడి తనకు లాభాలు ఇచ్చే దేశ మాతలు లేదా పితలకు తప్ప స్వదేశ మాతా, పితలకు జై అనదు. అదేమీ చిత్రమో గానీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరిగిన కొద్దీ మన ఎగుమతులు, దేశంలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు నానాటికీ పడిపోతున్నాయి. పదిహేడు వుపరంగాలతో కూడిన వస్తూత్పత్తి రంగంలో 2013 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో వచ్చిన ఎఫ్‌డిఐ 8.8 బిలియన్‌ డాలర్లయితే అదే కాలంలో 2014లో 6.8, 2015లో 4.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే ఇదే సమయంలో సేవారంగం, ఐటిలో ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే పెట్టుబడులు మన మౌలిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇతర రంగాలకు వచ్చేవి లాభాలు దండుకొని తెల్లవారేసరికి మాయం అవుతాయి. గతేడాది మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో కేవలం 16శాతమే వస్తూత్పత్తి రంగానివి, ఇదే చైనాలో 43శాతం వున్నాయి. అందుకే అది ప్రపంచంలో ఎక్కడ బడితే అక్కడ తన పలుకుబడిని పెంచుకొనేందుకు అమెరికా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర కార్యాచరణతో ముందుకు పోతున్నది, తన పారిశ్రామిక వుత్పత్తులకు మార్కెట్లను నిలబెట్టుకోవటమే కాదు, విస్తరించుకుంటున్నది. మరి మన పరిస్ధితి వున్న ఎగుమతులే గత 17 నెలలుగా పడిపోతున్నాయి. మార్కెట్లు లేకుండా స్వంత కార్యాచరణ, విధానాలు లేకుండా అమెరికా,ఐరోపా దేశాలకు జూనియర్‌ భాగస్వామిగా మారితే , అవే చైనా ధాటికి నిలవలేక విలవిల్లాడుతుంటే మనం ఎన్ని చబహార్‌లను అభివృద్ధి చేసినా ఫలితం వుంటుందా ?

    చైనా ఆర్ధిక వ్యవస్ధ గురించి అనేక మంది భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంత మంది అక్కడ సోషలిస్టు వ్యవస్థలేదని అంటారు, మరికొందరు ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణంలో వుందని వ్యాఖ్యానిస్తారు. బ్రిటన్‌ నుంచి హాంకాంగ్‌, పోర్చుగీసు నుంచి మకావో దీవులను తిరిగి తన పాలన కిందకు తెచ్చుకున్న సమయంలో చైనా ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు అంటే 2049 వరకు అక్కడ వున్న వ్యవస్ధలను యధావిధిగా కొనసాగించేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకే ఒకే దేశం-రెండు వ్యవస్ధలున్న దేశంగా చైనా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, ఇతర ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వుంది. ఇదొక నూతన ప్రయోగం. అది అనుసరించిన ప్రజానుకూల సంస్కరణల ఫలితంగా పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో వేగంగా పురోగమిస్తోంది.అగ్రశ్రేణి పెట్టుబడిదారీ దేశాలతో వున్న ఆర్ధిక సంబంధాల రీత్యా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నది తప్ప పెట్టుబడిదారీ విధానం 2008 నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద మాంద్యానికి అది దూరంగా వుంది.

   చబహార్‌ రేవు అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకోవటాన్ని గొప్ప అంశంగా చిత్రిస్తున్నారు. దీని వలన లాభం ఎవరికి అన్నది ప్రశ్న. చైనా కూడా అలాంటి ఒప్పందాలనే కుదుర్చుకుంటున్నది, అంతకంటే ఎక్కువ పెట్టుబడులే పెడుతున్నది. కొంత మంది వ్యాఖ్యాతలు చెబుతున్నదాని ప్రకారం అక్కడ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే వుందనుకుందాం. అలాంటపుడు ఇలాంటి ఒప్పందాల వలన కలిగే లాభం ఏదైనా వుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది, ఆ మొత్తాన్ని చైనా సర్కార్‌ జనానికే ఖర్చు పెడుతుంది. మరి మన దేశం కుదుర్చుకొనే ఒప్పందాల వలన వచ్చే లాభం ఎవరికి జేబుల్లోకి పోతుంది. అంబానీ, అదానీ అండ్‌కోలకే కదా ? మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు వచ్చిన లాభాలను తిరిగి ఇక్కడ పెట్టుబడులుగా పెట్టకుండా బయటకు తరలిస్తున్నాయని విమర్శిస్తున్నాం, ఇప్పుడు అదే పని మన దేశ కార్పొరేట్‌ సంస్ధలు కూడా చేస్తున్నట్లే కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: