• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Joe Biden

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా హస్తం నిజానిజాలేమిటి : అదానీని మోస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ” ఆర్గనైజర్‌ ” కట్టుకథలు, పిట్టకతలు !

09 Thursday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, China, Donald trump, Explosive BBC documentary, Hindenburg Controversy, HINDENBURG RESEARCH, Joe Biden, Narendra Modi Failures, Propaganda War, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అనేక మందిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పక్కా నిజాలే చెబుతారు, సత్యహరిశ్చంద్రుడి తరువాత కారణజన్ములు వీరే అన్నట్లు నమ్ముతున్న కొన్ని సంస్థలకు చెందిన వారు పచ్చి అబద్దాలను అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నారు ? వారికా తెగింపు ఎలా వచ్చింది ? అన్నింటికీ మించి మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారు అన్నది బ్రహ్మపదార్ధంగా ఉంది. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ గురించి, అతని కంపెనీల మీద వచ్చిన ఆరోపణలను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో జరిగిన కుంభకోణాల పునశ్చరణతో దేశాన్ని ముందుకు నడిపించగలరా ? అదానీ కంపెనీలపై వచ్చిన విమర్శలతో ప్రపంచంలో మన మీద విశ్వసనీయత సడలిందని ప్రధాని గుర్తించలేదా ? లేక నటిస్తున్నారా ? అదానీ కంపెనీలపై విచారణ జరిపి అక్రమాలేం లేవు అని తేలిస్తే మన ప్రతిష్ట ఇంకా పెరగేది కదా ! ప్రతిపక్షాలు కోరిన విచారణ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు. అంటే అదానీ కంపెనీలకు మద్దతు ఇచ్చినట్లేనా ! ఆ ముక్కే సూటిగా ఎందుకు చెప్పలేదు. పాత కుంభకోణాలను ముందుకు తెచ్చి అదానీ కంపెనీల అక్రమాలను మూసిపెట్టాలని చూస్తే కుదురుతుందా ? ఇలా ఎన్నో కొత్త ప్రశ్నలు. ప్రతిపక్షాల కంటే తనను తానే ఇరుకున పెట్టుకుంటున్నారా అని నిజంగా మోడీని నమ్మినవారు కూడా ఆలోచిస్తున్న స్థితి ? మక్కువ పడ్డ మగువ కోసం రాజ్యాలనే పోగొట్టుకున్న రాజుల కథలు విన్నాం. ఒక కంపెనీకోసం నరేంద్రమోడీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు?


అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ సంస్థ.ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్యకు పాల్పడితే తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన నరేంద్రమోడీ పుతిన్‌తోనూ జో బైడెన్‌తోనూ మాట్లాడి సర్దుబాటు చేసేందుకు చూశారు. అమెరికా నరేంద్రమోడీకి జిగినీ దోస్తు. తన కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ వదలిన క్షిపణి మన దేశం మీద జరిగిన దాడిగా అదానీ వర్ణించారు. ఉక్రెయిను మీద చూపిన శ్రద్దలో వందో వంతైనా లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మన మదుపర్ల మీద ఎందుకు లేదు అన్నది మోడీ అభిమానులకు సైతం అంతుచిక్కని ప్రశ్న. అమెరికానే మన కాళ్ల దగ్గరకు తెస్తున్న మోడీ అన్న వందిమాగధుల గురించి తెలిసిందే. మిత్రోం లేదా ఏ మోయి జో బైడెనూ మీకు నేను కావాలా వద్దా కావాలనుకుంటే హిండెన్‌బర్గ్‌ మా మీద చేసిన దాడి గురించి చప్పుడు(మాట్లాడవు) చెయ్యవేమిటి అని ఫోన్‌ చేసి అడుగుతారేమో అని ఎదురు చూసిన వారికి ఇప్పటి వరకు నిరాశేమిగిలింది.మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్నట్లుగా జనం భావించక ముందే మోడీ స్పందిస్తారా ? ఇది సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి ప్రశ్నగా మారుతుందా ?


హిండెన్‌బర్గ్‌కు ముందు దేశంలోని ఏ సంస్థ లేదా పార్టీ కూడా అదానీ కంపెనీల మీద అలాంటి అంశాలను ముందుకు తేలేదు. ఆరోపణలు చేయలేదు. అది 129 పేజీలలో చెప్పిన అంశాల మీద అదానీ 413 పేజీల వివరణ ఇచ్చారు. ఆ ఒక్కటి మినహా అన్నట్లుగా కీలకమైన అంశాలను వదలి ఇతర గాలిపోగేశారని చెబుతున్నారు. అందుకే దీని మీద నిగ్గుదేల్చాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీసినా మహామౌనమునిగా పేరుతెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అవి నిజమనో కాదనో, అదానీ పరమపునీతుడనో ఏదో ఒకటి చెప్పమంటే మిన్నువిరిగి మీద పడినా నోరు విప్ప అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంటు సమయం, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అవుతున్నా, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనా ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీకి పట్టలేదు.


గుజరాత్‌కు చెందిన స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం గురించి దర్యాప్తు జరిపేందుకు 2001లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటి(జెపిసి)ని వేసింది. గుజరాత్‌లోని సహకార బాంకులను ముంచినందున అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సారధి నరేంద్రమోడీకి దెబ్బతగులుతుందని భావించిన కారణంగా అనివార్యమై ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. ఆ కుంభకోణం వందల కోట్లలోనే ఉంది. కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కుమ్మక్కై కేతన్‌ పరేఖ్‌ ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణమది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. ఇప్పుడు అదానీ కంపెనీల వాటా ధరలను కూడా అదే విధంగా లేని విలువను పెంచారన్నదే ప్రధాన ఆరోపణ. నాటి జెపిసి విచారణ జరిపి కుంభకోణం వాస్తవమని తేల్చింది. ఇప్పుడు కూడా అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద అలాంటి కమిటీని వేసేందుకు మోడీ ఎందుకు అంగీకరించటం లేదన్నది ప్రశ్న. నిజం కాదనైనా తేల్చి అదానీ మీద పడిన మచ్చను తొలగించవచ్చు కదా ! వాజ్‌పాయిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు ? దారినపోయే దానయ్య ఒకడు ఏదో అన్నాడని రాముడు సీత పవిత్రతను లోకానికి నిరూపించేందుకు అగ్నిప్రవేశం చేయించిన ఆదర్శవంతుడంటూ గొప్పగా చెప్పే బిజెపి పెద్దలు అదానీ గురించి విచారణకు ఎందుకు జంకుతున్నారు ? రాముడి ఆదర్శం ఓట్లు దండ్లుకొనేందుకు చెప్పుకోవటం తప్ప దాని స్ఫూర్తిని అనుసరించరా ? అదానీ అగ్నిప్రవేశం గురించి ఎవరూ అడగటం లేదుగా !


మరోవైపున నరేంద్రమోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార్‌ కాషాయ దళాలు అదానీని సమర్ధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం కట్టుకథలు, పిట్టకతలు చెబుతున్నాయి. జనానికి నిర్ధారించే ఆలోచన, అవకాశాలు ఉండవని కాబోలు పచ్చి అవాస్తవాలను వండి వారుస్తున్నాయి. మన దేశ చరిత్రలో ఒక పారిశ్రామిక, వ్యాపార సంస్థ మీద వచ్చిన తీవ్ర ఆరోపణలు విచారించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటం, సాంస్కృతిక సంస్థ ముసుగువేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధనకు దిగటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. డాక్టర్‌ సునీల్‌ గుప్తా అనే పెద్దమనిషి 2023 ఫిబ్రవరి ఆరవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” లో హిండెన్‌బర్గ్‌ వివాదం అంటూ ఒక విశ్లేషణ రాసి అదానీకి కితాబునిచ్చారు. అది భారత్‌ మీద జరిపిన కుట్రగా వర్ణించారు. బిబిసి విదేశీ, అది చెప్పినదానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, దాని విశ్వసనీయత ఏమిటి? హిండెన్‌బర్గ్‌ ఒక విదేశీ సంస్థ దాని నిజాయితీ ఏమిటీ అంటూ అనేక మంది ఒక తర్కాన్ని ముందుకు తీసుకువచ్చారు. వారంతా సంఘపరివార్‌కు చెందిన వారు లేదా దాని మాటలను గుడ్డిగా విశ్వసించే వారు అన్నది తెలిసిందే. నిజమే, ఏ సంస్థనూ ఎవరూ ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం స్వచ్చతను కొలిచేందుకు కారట్ల ప్రమాణాలు ఉన్నాయి. ఏ సంస్థకూ దాని స్వచ్చతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలేమీ లేవు. కానీ ఆర్గనైజర్‌ విశ్లేషకులు దవోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక మీద భారత ఆర్థిక రంగం మహా గొప్పగా ఉందని బాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గవర్నర్‌ పొగిడారని, అదే సమావేశంలో ఉన్న నోకియా సిఇఓ, ఎరిక్స్‌న్‌ అధిపతి తదితర అగ్రశ్రేణి ప్రపంచ సిఇఓలు నిజమే అన్నారన, సిఎన్‌బిసితో అనేక ప్రముఖ మీడియా సంస్థలు దేశ ఆర్థిక పురోగతి, వచ్చే రోజుల్లో సాధించనున్న విజయాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మరి ఈ సంస్థలు, సిఇఓలకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ? రిలయన్స్‌, టాటాల వంటి సంస్థలతో పాటు అదానీ కంపెనీలు దేశ వృద్దిలో భాగస్వాములౌతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న 2014లో ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎలా ఎదిగారు, వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నటాటా వంటి వారికి సాధ్యం కానిది అదానీకి ఎలా వచ్చింది, ఎందుకు రాలేదు అన్నది చెప్పాలి.


హిండెన్‌బర్గ్‌ అదానీ కంపెనీ మీద విడుదల చేసిన నివేదికను దేశం మీద దాడిగా చిత్రించటం అంటే గతంలో ఇందిరే ఇండియా- ఇండియా అంటే ఇందిర అన్న కాంగ్రెస్‌ నేత డికె బారువా భజనను గుర్తుకు తెస్తున్నది. అదానీయే ఇండియా-ఇండియా అంటే అదానీ అనటమే. ఇదే హిండెన్‌బర్గ్‌ గతంలో అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్‌ అనే సంస్థ గురించి కూడా పరిశోధన నివేదికను వెలువరించటంతో ఆ కంపెనీ వాటాల ధర కుప్పకూలింది. అంటే అది అమెరికా మీద దాడి, మాతృ దేశానికి ద్రోహం చేసినట్లా ? దాని వెనుక ఎవరున్నారు ? తీరా తరువాత తేలిందేమిటి నికోలా కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణైంది. అందువలన నడమంత్రపు సిరి వచ్చిన ఏ కంపెనీని ఎవరూ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ విలువలు-వలువల గురించి చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎందుకు కొమ్ముకాస్తున్నట్లు ? గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన బిబిసి చెప్పిందాన్ని నమ్మాల్సిన అవసరం లేదని వాదిస్తున్నవారు అదే బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్టు పత్రిక రాసిందాన్ని నమ్మి తన విశ్లేషణలో దాన్ని ఉటంకించి అదానీ తప్పు చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎలా సమర్ధించుకుంటుంది ? తమకు అనుకూలంగా ఉంటే విదేశీ కితాబు ఫర్వాలేదా ? విమర్శిస్తే దేశం మీద దాడా ?ఎకానమిస్టు చెప్పిందాన్ని వారు నమ్మే వేద ప్రమాణంగా తీసుకుంటారా ? నిజాన్ని నిగ్గుతేల్చమన్న డిమాండ్‌ను అంగీకరించటానికి నోరెందుకు రాదు.ఆత్మవంచన, పర వంచన, రెండునాలికలతో మాట్లాడటం తప్ప మరొకటికాదు.


ఎవడు కొడితే మైండు బ్లాకై దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు అన్నట్లు హిండెన్‌బర్గ్‌ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన వారు ఎవరేేం మాట్లాడుతున్నారో పొంతన లేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఆర్గనైజర్‌ పత్రికలో 2023 ఫిబ్రవరి 4వ తేదీన వెబ్‌డెస్క్‌ పేరుతో సరికొత్త కథనాన్ని వండి వడ్డించారు.దానిలోని అంశాలను కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విజయ గజేరా, ద హాకీఎక్స్‌ అనే వారి ట్వీట్ల ఆధారంగా యధార్ధ సిక్కా దాన్ని పేర్చినట్లు పేర్కొన్నారు.అసలు వారెవరు ? వారి ట్వీట్లకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ?


ఆర్గనైజర్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ” బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ థారులాండ్‌ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ చేసిన కుట్రను పోలి ఉంది. వాస్తవంగా అదానీ కంపెనీలపై దాడి జనవరి 25న హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత ప్రారంభం కాలేదు. ఒక ఆస్ట్రేలియన్‌ ఎన్‌జివో నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ 2016-17లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాల్సిన ఎన్‌జిఓ అదాని వాచ్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకం అని చెప్పినప్పటికీ దానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదానీకి సంబంధం లేని అంశాలను కూడా ప్రచురిస్తోంది. రవీష్‌ కుమార్‌ ఎన్‌డిటివీని వదిలితే దానికేమిటి పని ? ఒక పర్యావరణ ఎన్‌జిఓకు బిబిసి డాక్యుమెంటరీ మీద ట్వీట్‌ను సమర్ధించాల్సిన అవసరం ఏమిటి ? ఎన్‌ఎఫ్‌ఐ అనే భారత్‌ ఎన్‌జివో జార్జిసోరస్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాక్‌ఫెల్లర్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీల నుంచి నిధులు పొందుతున్నది. అజీమ్‌ ప్రేమ్‌ జీ ఏర్పాటు చేసిన ఎన్‌జిఓ ఐపిఎస్‌ఎంఎఫ్‌ ఆల్ట్‌ న్యూస్‌, ద వైర్‌, ద కారవాన్‌, ది న్యూస్‌ మినిట్‌ తదితర సంస్థలకు నిధులు ఇస్తున్నది. సిపిఐ(ఎం) నేత సీతారామ్‌ ఏచూరి భార్య సీమా చిస్తీ ఎన్‌ఎఫ్‌ఐకి మీడియా ఫెలోషిప్‌ సలహాదారు. ఆమె ద వైర్‌ ఎడిటర్‌. వైర్‌కు సోరోస్‌, ఫోర్డ్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, రాక్‌ఫెల్లర్‌, ఓమిడియార్‌తో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. 2017లో అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి వైర్‌ ఐదు కథనాలను రాసింది.


డిజిపబ్‌ పేరుతో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లతో ఒక గ్రూపును ధన్యా రాజేంద్రన్‌ ఏర్పాటు చేశారు. దీనికి న్యూస్‌క్లిక్‌ ప్రబీర్‌ పురకాయస్థ ఉపాధ్యక్షుడు.దీనిలోని సైట్లన్నింటికీ ఐపిఎస్‌ఎంఎఫ్‌ నిధులు ఇస్తుంది.ఈ సైట్లతో ప్రమేయం ఉన్న వారందరి ఖాతాలను చూస్తే సమన్వయంతో అదాని మీద దాడిచేసిన ట్వీట్లను చూడవచ్చు. విదేశీ ఎన్‌జివోలు, దేశంలోని వారి భాగస్వాముల నుంచి నిధులు, శిక్షిణను పొందిన వీరంతా దేశంలోని జాతీయ వాదులు లేదా సంస్థల మీద దాడి చేస్తారు. అదానీ, అంబానీల మీదనే వీరు దాడి చేస్తారు. టాటా, ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, వాద్రా లేదా ఇతరుల మీద ఎందుకు చేయరు ? ” ఆర్గనైజర్‌ కథనం ఇలా సాగింది.


ఆర్గనైజర్‌ బాధ అదానీ కంపెనీలను విమర్శించినందుకైతే అంతవరకు పరిమితం కావాలి. కానీ ఇతరుల మీద దాడి ఎందుకు చేయరు అని ప్రశ్నించటం ఏమిటి ? ఒక సాంస్కృతిక సంస్థ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుంది. అది నడిపే పత్రికకు ఇతర అంశాలెందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హిండెన్‌బర్గ్‌ నివేదిక మీద 413పేజీల వివరణ ఇచ్చిన అదానీ తన మీద దేశంలోని కొన్ని వెబ్‌సైట్‌లు నిజంగా దాడి చేస్తుంటే ఇంతవరకు ఒక్క నివేదికా విడుదల చేయలేదేం ? కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు అదానీకి లేని దురద ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌కు ఎందుకు ? అతని కంపెనీలనుంచి ఎంత ముట్టిందేమిటి ? దాని రాతలో పేర్కొన్న సంస్థలు అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు.అమెరికాలోని అనేక సంస్థలు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటపుడు వాటి గురించి నరేంద్రమోడీ గతంలో బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు, ఇప్పుడు జో బైడెన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? జాతీయవాదుల మీద ఆ సంస్థల నిధులతో కొందరు దాడి చేస్తుంటే అసలు సిసలు జాతీయవాదినని చెప్పుకొనే నరేంద్రమోడీ మన దేశంలో వాటి కార్యకలాపాలను ఎందుకు అదుపు చేయరు ? ఈ అంశాలన్నింటినీ ఆర్గనైజర్‌ ఎందుకు ప్రశ్నించదు ?


సుమీత్‌ మెహతా, వినయకుమార్‌ సింగ్‌ ద్వయం 2023 ఫిబ్రవరి 25న ఆర్గనైజర్‌లో ఒక విశ్లేషణ రాసింది. అదానీ నివేదిక, బిబిసి డాక్యుమెంటరీ కూడా చైనా కుట్రే అన్నది సారం. తమిళనాడులోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారం మూసివేత వెనుక, ఢిల్లీ శివార్లలో రైతులు ఉద్యమించిన సందర్భంగా జరిగిన రిలయన్స్‌ జియో టవర్ల ధ్వంసం వెనుకా ఉన్నది కూడా చైనా అని ఎందుకంటే దాని 5జి టెలికాం పరికరాలను నిషేధించి రిలయన్స్‌కు ప్రాధాన్యమివ్వటమే చైనా కోపానికి కారణమని సూత్రీకరించారు. భారత కంపెనీల మీద అనుమానాలు రేకెత్తించటం తద్వారా ఆర్థికరంగాన్ని దెబ్బతీయటం,భారత కంపెనీలు నిధులు సేకరించకుండా అడ్డుకోవటం దాగి ఉందన్నారు. స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీ వివాదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మూసివేత కోరిన సంస్థల వెనుక చైనా ఉన్నదని, తన వద్ద ఉన్న రాగి నిల్వలను అమ్ముకొనేందుకే ఆపని చేసిందని ఆరోపించారు. అసలు విషయ ఏమంటే ఆ కర్మాగార మూసివేతకు ముందు 2017లో మన దేశం నుంచి చైనా 210 కోట్ల డాలర్ల విలువ గల రాగిని దిగుమతి చేసుకుంది.(ఐబిఇఎఫ్‌, 2021 సెప్టెంబరు 20).2021లో చైనా పది దేశాల నుంచి రాగి, రాగి ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా గరిష్టంగా చిలీ నుంచి 19.4శాతం(7.3 బి.డాలర్లు) కాగా తొమ్మిదవ స్థానంలో ఉన్న మన దేశం నుంచి 3.28శాతం(1.18 బి.డాలర్లు) ఉంది. అదే విధంగా చైనా దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నది. వాటిలో కొరియాకు 31శాతం ఉంది. చైనా దిగుమతుల విలువ 2,738 కోట్ల డాలర్లు కాగా ఎగుమతుల విలువ 24.23 కోట్ల డాలర్లు మాత్రమే.(ట్రెండ్‌ ఎకానమీ డాట్‌కామ్‌ ప్రచురణ తేదీ 2022నవంబరు 14) అందువలన చైనా దగ్గర ఉన్న రాగిని అమ్ముకొనేందుకు స్టెరిలైట్‌ మీద కుట్ర చేసిందనటం పచ్చి అవాస్తం. ఇది ఒక్కటి చాలు ఆర్గనైజర్‌ అబద్దాలకు, వక్రీకరణలకు ఇది పక్కానిదర్శనం.

భారత కంపెనీలు చైనా సంస్థలకు పోటీ ఇస్తున్నందున చైనా హిండెన్‌బర్గ్‌, బిబిసి వంటి వాటి వెనుక ఉండి దాడులు చేయిస్తున్నదని చెబుతున్నారు. ఏ రంగంలో మన దేశం చైనాతో పోటీ పడుతున్నదో చెప్పగలరా ?ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవు కోసం ప్రయత్నించినా చైనాకు దక్కుతుందా ? అసలు చైనా అలాంటి ప్రయత్నం చేసినట్లు దానికి అదానీ అడ్డుపడినట్లు ఏ ఆధారంతో చెబుతున్నారు. హైఫా రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని ఇజ్రాయల్‌, అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే కుదురుతుందా ?


అలాంటి చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటూ రికార్డులను బద్దలు కొడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ను ఇంతవరకు ఆర్గనైజర్‌ ఎన్నడైనా ప్రశ్నించిందా ? మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నట్లు ? నిజంగా చైనా కుట్రలు పన్నుతుంటే మన ప్రభుత్వం వాటిని నిజమని నమ్మితే మన ప్రభుత్వం చైనాకు నిరసన తెలుపుతూ కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు, పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించటం లేదు ? గాల్వన్‌ ఉదంతం తరువాత ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత దేశభక్తి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రతిదాన్నీ చైనా మీదకు నెట్టివేస్తే జనం గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్నట్లున్నారు. తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వక్రీకరణలు, తప్పుడు రాతలతో కొందరిని కొంత కాలం మోసపుచ్చగలరు తప్ప అందరినీ ఎల్లకాలం మభ్య పెట్టలేరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !

08 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BALLOON MANEUVERS, China's balloon over America, Joe Biden, Joseph Stalin, spying history, surveillance balloon


ఎం కోటేశ్వరరావు


తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. జనవరి 28న బెలూన్ను అమెరికా గుర్తించింది. అమెరికా గగనతలంలోని ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు స్వంత యుద్ద విమానాన్ని విని యోగించటం ఇదే ప్రధమం.


ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది.దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం !


ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిని చిత్రాల సంగతి తెలిసిందే. ఆగ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.


ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.


వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హౌవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్దించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి.

స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది.అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్‌ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు.యుద్ద విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.


పరస్పర విశ్వాసం లేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ.మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్‌-చైనా యుద్దం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.


సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్‌ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్‌ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్‌ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్‌ కూల్చివేత, మంత్రి బ్లింకన్‌ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.


చైనా బెలూన్‌ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులను నిలువ చేసే 150 సిలోస్‌( పురులు లేదా పాతర్ల వంటివి ) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్‌ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు.వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన.రేడియో, సెల్యులర్‌, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా ? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి.చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం,బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త్రాలు- హెచ్చరికగా చైనా మిలిటరీ విన్యాసాలు !

28 Wednesday Dec 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

AUKUS, china communist party, Joe Biden, PLA actions, PLA Eastern Theater Command, Quadrilateral Security Dialogue, Taiwan independence, Taiwan Next propaganda, US imperialism, US-CHINA TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

23 Wednesday Nov 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Kim Jong-un, North Korea’s missile tests, Pyongyang, US imperialism, yankees


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

21 Monday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, AB Vajpayee, BJP, Immunity, Joe Biden, journalist Jamal Khashoggi, Narendra Modi Failures, RSS, Saudi Crown Prince Mohammed bin Salman


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

2022 అమెరికా పార్లమెంటు ఎన్నికలు : ఫాసిస్టు శక్తులకు ఎదురు దెబ్బ – పురోగామి శక్తులకు హెచ్చరిక !

16 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, fascist ideology, Joe Biden, MAGA Republicans, US 2022 midterm elections

ఎం కోటేశ్వరరావు


నవంబరు ఎనిమిదిన అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్‌ , లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువ సభలో 435 స్థానాలకు గాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్‌ పదవి దక్కుతుంది.తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువ సభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్‌ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్‌ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమాక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది. కనుక అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఇక 50 గవర్నర్‌ పదవులకు గాను ఎన్నికలు జరిగిన 36 చోట్ల రిపబ్లికన్లు రెండు కోల్పోయి 25 రాష్ట్రాలను కైవసం చేసుకోగా, డెమోక్రాట్లు అదనంగా రెండు తెచ్చుకొని 24 చోట్ల పాగావేశారు. మరొక ఫలితం తేలాల్సి ఉంది.


ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్‌ వెంటనే చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్‌ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్‌ చెప్పాడు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్‌ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్‌ పార్టీకి 220, రిపబ్లికన్‌ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్‌ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేళ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. ఈ కారణంగానే లెక్కింపు పూర్తిగాక ముందే అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడటం మొదలు పెట్టాడు. రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు నేను సిద్దపడ్డాను, రిపబ్లికన్లు నాతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు.


పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఉగ్రవాదాన్ని సమర్ధించిన అనేక మంది ” మాగా ( మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ ) ” రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీని డోనాల్డ్‌ ట్రంప్‌, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్‌ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం డెమోక్రాట్ల రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. రిపబ్లికన్‌ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.


ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలనిఎఎఫ్‌ఎల్‌-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్‌ షులర్‌ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్ధారిస్తుందని అందువలన కార్మికులు లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్‌ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్‌ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్‌ చెప్పారు. ఈ శక్తులు ఓడటం వారి పట్ల అమెరికా ఓటర్లలో ఉన్న ఆందోళన, అడ్డుకోవాలనే తపనకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఆర్థిక సవాళ్లు, గాస్‌, ఆహార అధిక ధరలు రిపబ్లికన్లవైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల అజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు.యువత, మహిళలు, ఆఫ్రికన్‌-అమెరికన్లు, మొత్తంగా కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు, ఓటింగ్‌కు ముందుకు వచ్చిన కారణంగానే రిపబ్లికన్లకు చాలా మేరకు అడ్డుకట్ట పడింది. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్దులలో 300 మందికి ట్రంప్‌ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు. బైడెన్‌ గెలుపును తాను గుర్తించనని ప్రకటించిన ట్రంప్‌ తన మాగా మద్దతుదార్లను ఉసిగొల్పి 2021 జనవరి ఆరున పార్లమెంటు భవనంపై దాడి చేయించిన సంగతి తెలిసిందే. వీరిని ఫాసిస్టులుగా వర్ణిస్తారు.


ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలో ఖర్చు అంశంలో కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్‌ సీక్రెట్స్‌ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రు.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. bుార్టీల అభ్యర్ధుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలౌతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. రకరకాల పేర్లతో ఖర్చు చేస్తారు. జనాభాలో కేవలం 0.0003 శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పదిశాతం డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా. జార్జి సోరస్‌ 12.8 కోట్ల డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98శాతం వరకు గెలిచినట్లు తేలింది. ప్రారంభంలో చేసే ఖర్చును బట్టి ఫలితాలను ఊహించుకోవచ్చు.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతి లేదు. బాలట్‌ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్‌ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది.మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బాలట్‌ మాదిరి ఏ ఓటరైనా వేయ వచ్చు. ఇమెయిల్‌ ద్వారా ఓటు వేసి తరువాత బాలట్‌ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా కౌంటీలో ఈ ఏడాది 2,90,000 పోస్టల్‌ బాలట్లు వచ్చాయి. వాటి మీద ఉన్న సంతకాలు నిజమైనవా కాదా అన్నది సరి చూసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా వచ్చే పోస్టల్‌ బాలట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. నెవడాలో పోలింగ్‌ ముగిసిన నాలుగు రోజుల తరువాత వచ్చే పోస్టల్‌ బాలట్‌ను తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల అక్రమాలకు అమెరికా అతీతమేమీ కాదు. గతంలో అలాంటి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల రాష్ట్రాల అసెంబ్లీల సెగ్మెంట్ల సరిహద్దులను అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా మార్చివేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండనవసరం లేదు, ప్రతి రాష్ట్రం తనదైన నిబంధనలు రూపొందించుకోవచ్చు.


వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చిమితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్‌ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్‌ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండువంతుల సీట్లు తెచ్చుకున్నారు.డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈ సారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. 2020 అధక్ష ఎన్నికల లెక్కింపు సందర్భంగా కుట్ర వార్తలు వచ్చాయి. తొలుత రిపబ్లికన్లకు ఎక్కువగా పడినట్లు భావిస్తున్న బాలట్‌ బాక్సులు రావటం, తరువాత డెమోక్రాట్లకు పడిన బాక్సులు రావటంతో అనుమానాలు తలెత్తాయి. కొన్ని వారాల ముందే పోస్టల్‌ బాలట్స్‌ వేయవచ్చు గానీ, వాటిని ముందుగా లెక్కించటానికి వీలులేదు.కొన్ని చోట్ల పోస్టల్‌ బాలట్లే ఎక్కువ. జార్జియాలో 50శాతం ఓట్లు రానట్లయితే, ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నవారి మధ్య రెండోసారి ఎన్నిక జరుపుతారు. అక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు డిసెంబరు 6న ఎన్నికలు జరుగుతాయి. అలాస్కా రాష్ట్రంలో పార్టీలకు గుర్తింపు లేదు. పార్టీలు కాండిడేట్లను నిలిపినా వారు స్వతంత్రులుగానే ఉంటారు. ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్నివారాలైనా పట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్‌లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలల్లో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు.1900 సంవత్సరం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ రాష్ట్రాల చట్టసభల్లో మెజారిటీ సాధించింది.


రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మికవర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయ కూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది.ఆ మెజారిటీని ఆసరా చేసుకొని బైడెన్‌, కుటుంబ సభ్యులు, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల మీద విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి తమ అజెండాను ముందుకు తీసుకుపోవచ్చు. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. ట్రంప్‌ పిలుపుతో పార్లమెంటు మీద దాడిచేసిన ఉదంతంలో ట్రంప్‌, పార్టీ వారి మీద ఉన్నకేసులను నీరుగార్చేందుకు పూనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారంలో బైడెన్‌ ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు లేకుండా పురోగామి అజెండాను అమలు జరిపే అవకాశం ఉండదు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండుశాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్ధికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. పాఠశాల కమిటీల్లో రాజకీయాలను చొప్పించిన వారిని, తిరోగామి భావాలు, పుస్తకాలను రుద్దేందుకు, ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన వారిని వారిని ఓడించారు. అమెరికాలో ఎవరు గెలిచినా తమ ప్రయోజనాల రక్షణకు కార్మికులకు పోరుబాట తప్ప మరొక మార్గం లేదు. ఫాసిస్టు, పచ్చిమితవాద శక్తులు ఓటమి చెందటం తాత్కాలిక ఊరటతప్ప పరిష్కారం కాదు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌హ‌త‌హ‌..  శ‌ర‌వేగంగా మారుతున్న పరిస్థితులు

25 Tuesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

American hegemony, Joe Biden, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌పై తాజా వివాదం 3 : ఉలిపికట్టె అమెరికా – సంయమనం పాటిస్తున్న చైనా !

17 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, Joe Biden, Taiwan Matters, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


తైవాన్‌ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్‌ పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్‌ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్‌, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందుపాతరలను తొలగించటంలో విజయవంతమైనట్లు వార్తలు. సముద్రాల్లో పైన తేలే వాటితో పాటు నీటిలో ఉండే మందుపాతరలు కూడా ఉంటాయి. పేరుకు రెండే పాల్గొన్నా వాటికి మద్దతుగా అనేక నౌకలు ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది.తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.


మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న.గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా,జపాన్‌, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్‌ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూనుకుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆకసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్‌ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్‌ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.


దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్‌ రీగన్‌ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొనటంతో పాటు ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్‌ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్‌ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.


పైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం,ఆయుధ కార్పొరేట్‌ సంస్థల నిధులతో నడిచే సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ చైనా పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది.దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది.వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఏ) ప్రపంచంలో భూమి మీద నుంచి ప్రయోగించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాలక్షిపణులను దెబ్బతీసే సత్తాలేదు అనుకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవని ఆ పత్రంలో పేర్కొన్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థలను ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్‌-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్‌-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్‌ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.


చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్‌ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.


చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ.2019 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అది పెద్దది చైనా మిలటరీ.ఇరవై లక్షల మంది సైనికులున్నారు. తైవాన్‌ వద్ద 1.7లక్షల మంది ఉన్నారు. చైనా వద్ద ఐదు లక్షల మంది రిజర్వు సైనికులుంటే తైవాన్‌ వద్ద మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు. పారామిలిటరీ దళాలు చైనా వద్ద 6.24లక్షలు కాగా తైవాన్‌ వద్ద కేవలం 11,500 మంది మాత్రమే. చైనా వద్ద 5,250 టాంకులుండగా తైవాన్‌ వద్ద 1,110, చైనా సాయుధశకటాలు 35వేల కాగా తైవాన్‌ వద్ద 3,472 ఉన్నాయి. చైనా వద్ద విమానాలు 3,285 కాగా, వాటిలో జట్‌లు 1,200, స్పెషల్‌ బాంబర్లు 450, రవాణాకు 286 ఉండగా, తైవాన్‌ వద్ద 741 విమానాలు వాటిలో జట్‌లు 288, 19 రవాణా విమానాలున్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 79, తైవాన్‌ వద్ద నాలుగు, చిన్నా పెద్ద మిలటరీ ఓడలు చైనా వద్ద 777 ఉండగా తైవాన్‌ 117 ఉన్నాయి. చైనా వద్ద తొమ్మిది అణు జలాంతర్గాములు, ఆరు ఖండాంతర క్షిపణి జలాంతర్గాములుండగా తైవాన్‌ వద్ద ఒక్కటి కూడా లేదు. చైనా వద్ద డీజిలుతో నడిచే జలాంతర్గాములు 56 ఉండగా తైవాన్‌ వద్ద రెండున్నాయి.


చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోఏది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబుదారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలిపెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: