• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: journalism

జీ హుజూర్‌ జర్నలిస్టులు, భజనలో టీవీ ఛానళ్లు !

22 Monday Jan 2018

Posted by raomk in BJP, Current Affairs, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

his master's voice tv channels and journalists, journalism, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

బహుశా ప్రపంచంలో ఏ ప్రధాని లేదా అధ్యక్షుడి ఖాతాలోను గతంలో లేని వర్తమాన, భవిష్యత్‌లో కూడా లేని అరుదైన రికార్డును ఇప్పటికే నరేంద్రమోడీ స్వంతం చేసుకున్నారు. ఇక మిగిలిన పదవీ కాలంలో కూడా ఇదే వూపును కొనసాగిస్తే పదవీ కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా జర్నలిస్టులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించని తొలి దేశాధినేతగా చరిత్రకెక్కనున్నారు. ఆ రహస్యం ఏమిటో, మోడీ ఎందుకంత పంతం పట్టారో ఇంతవరకు ఏ పరిశోధనాత్మక జర్నలిస్టూ కనిపెట్టలేకపోయారు. ఈ మధ్య జీ న్యూస్‌ మరియు టైమ్స్‌ నౌ టీవీ ఛానల్స్‌ వారు ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టుగా ఇంటర్వ్యూలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరి నుంచి ఇంకా నేర్చుకుంటూనే వున్నాను. తొలిసారిగా ఎలా చేయకూడదో గతంలో ఆర్నాబ్‌ గోస్వామి, ఇప్పుడు ఈ రెండు ఛానల్స్‌ ప్రతినిధుల నుంచి నేర్చుకోవటం ప్రారంభించాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎందరు నూతన మార్గదర్శకులౌతారో చూడాలి.

తానొవ్వక ఇతరుల నొప్పింపక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా సదరు ఛానళ్ల సీనియర్‌ జర్నలిస్టులు ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నలు అడిగిన తీరు చూసియావత్‌ జర్నలిస్టు లోకం నివ్వెరపోతోంది. ఒక పార్టీనేతకు మరొక పార్టీనేత సంధించే ప్రశ్నలు దెబ్బలాడినట్లే వుంటాయి. కానీ ఒక జర్నలిస్టు అవే అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు తమ వృత్తి నైపుణ్యాన్ని వినియోగించి అడగటం వేరు. రెండు ప్రముఖ చానల్స్‌ సీనియర్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు లాలూచీ వ్యవహారంగా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇంటర్వ్యూల ప్రత్యేకత ఏమంటే వారు కొత్త విషయాలనేమీ రాబట్టలేదు. మోడీ చెప్పినవాటిలో కొత్త విషయాలేమీ లేవు. మరి దీని గురించి చెప్పుకోవాల్సినంత ప్రత్యేకత ఏమిటి ?

ఎవరైనా అధికారంలోనో లేక యజమానులుగానో వున్న పెద్దలు ఒక పెద్ద పర్యటన జరిపినపుడో, ఒక సభలో పాల్గొని వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే భక్తజనులు, భజనపరులు ఇతరులతో పోల్చి మీకు వారికి అసలు పోలికే వుండదు, మీరెక్కడ వారెక్కడ మీరు గనుక ఈ పర్యటన చేయగలిగారు అంటూ మునగ చెట్టు ఎక్కిస్తారు. ఈ రెండు ఛానళ్ల విలేకర్లు అలాంటి దృశ్యాలను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. అధికారంలో వున్నవారితో పాకేజ్‌లు కుదిరితే, లేదా యాజమాన్యాలు ఇతర కారణాలతో పాలకులతో సత్సంబంధాలు కొనసాగించదలచుకుంటే ఎలాంటి ప్రశ్నలు వెలువడుతాయో అవి ఒక్కోసారి ఎంత హాస్యభరితంగా వుంటాయో, జనం ఎదుర్కొంటున్న, ఆవేదన పడుతున్న, అందరికీ తెలిసిన పాలకులకు ఇబ్బంది కలిగించే అంశాలను కార్పొరేట్‌ మీడియా ఎలా విస్మరిస్తుందో తెలుసుకొనేందుకు ఆ ప్రశ్నలు ఎలా వున్నాయో చూడండి. నెతన్యాహు పర్యటన గురించి ప్రస్తావించారు గానీ దేశాన్ని కుదిపివేసిన సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల విమర్శల గురించి ఏ ఛానల్‌ వారికీ అడగాలని తోచకపోవటం విచిత్రం. ఇలాంటి వారు కూడా విలేకర్లుగా వుంటారా అని బయటి వారి ఆలోచనకు తావిచ్చారు. జీ న్యూస్‌ సుధీర్‌ చౌదరి ప్రశ్నలు ఇలా వున్నాయి.
.https://www.youtube.com/watch?v=2sqUgua0npA

1. మీరు ప్రధాని అయిన 2014 ఇప్పుడు 2018 మధ్య మీరు అంతర్జాతీయ సమ్మేళనాలకు వెళ్లినపుడు భారత స్థితి గురించి తేడా ఏమైనా గమనించారా ?

2.దవోస్‌ లేదా సార్క్‌, లేదా జి20 వంటి సమావేశాలను మేము ఇంతకు ముందు చూశాము.అదంతా దౌత్యపరమైన కసరత్తులా వుండేది. మన నేతలు వెళతారు, దౌత్యపరమైన కసరత్తు, ఒక ఫొటో తీయించుకుంటారు. మిమ్మల్ని తీసుకుంటే దాన్ని మీ విమర్శకులు ఇష్టపడరనుకోండి. అది స్నేహబంధంలాగా వుంటుంది. వారిని మీరు హత్తుకుంటారు, వారి భుజాలపై మీరు చేతులు వేసి మాట్లాడతారు, తరువాత ఫొటోలు వుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని జనాలు మీపై దాడికూడా చేస్తారనుకోండి. కాని అది మీ తరహా దౌత్యశైలి, దాంతో మీరు వెంటనే స్నేహితుల్ని చేసుకుంటారు. వుదాహరణకు నెతన్యాహునే చూడండి. మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని చూస్తే మేం ఇద్దరు జిగిని దోస్తులం కలసి సినిమా చూసినట్లుగా వుంది. కాబట్టి మీది అనితరసాధ్యమైన దౌత్యశౌలి, ఈ దేశానికి చెందిన వ్యక్తి కాదు, మీ భాష మాట్లాడరు, బహుశా మీరు ఎంతో కాలం నుంచి తెలిసిన వారు కూడా కాదు, అబ్బబ్బ అలాంటి వ్యక్తితో మీరు అంత త్వరగా ఎలా కలసి పోగలిగారు?

3.మీరు అధికారానికి వచ్చిన తరువాత జిడిపి అభివృద్ధి రేటు విషయంలో ఒక నూతన సాంప్రదాయం ప్రారంభించారు. అదెలా ముందుకు పోతోంది. నాకిప్పుడు గుర్తుకు వస్తోంది,అసలు దీనికి ముందు మూడు నాలుగు సంవత్సరాలక్రితం జనానికి జిడిపి అభివృద్ధి రేటు అంటే ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు జనాలు సెన్సెక్స్‌(స్టాక్‌మార్కెట్‌ సూచీ)ను అనుసరిస్తున్న మాదిరి ప్రతి మూడు నెలలకు అది పైకి కిందికీ ఎలా కదులుతోంది అని చూస్తున్నారు. దాని ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు వాగ్దానం చేసిన మాదిరి అది లేనట్లయితే వెంటనే దాడులు ప్రారంభం అవుతాయి, ఇదొక నూతన సాంప్రదాయం కాదా ?

4. ఈ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు నేను ఎంతో పరిశోధన చేస్తున్నపుడు ఈ నూతన ప్రపంచ వ్యవస్ధ గురించి ఆలోచిస్తున్నాను. అసలేమిటీ నూతన ప్రపంచ వ్యవస్ధ? దాంతో నేనొక కొత్త విషయాన్ని కనుగొన్నాను. అదేమంటే దాన్ని పిటిఎం-పుతిన్‌ ట్రంప్‌ మోడీ అని పిలవొచ్చు, అదే నూతన ప్రపంచ వ్యవస్ధ.

5.కొన్ని సందర్భాలలో జనాలు పని చేస్తున్నపుడు వారి వుత్సాహాన్ని కోల్పోతారు. మీరు 2014లో ప్రదర్శించినట్లే ఎంతో వుత్సాహం నేడు కూడా వుందా ? ఇది 2018,

6. మీరు సరైన దారిలోనే వున్నారని అనుకుంటున్నారా ?

7.మీరు ఒక పకీరులా (సర్వసంగ పరిత్యాగి) జీవిస్తున్నారు, మిమల్ని మీరు ఒక పకీరుగా పిలుచుకోండి మీ కుటుంబం కూడా ఎంతో పెద్దది, 125కోట్ల జనం. మీరింత వరకు సెలవు తీసుకోలేదు.విదేశాలకు వెళ్లినపుడు మీరు రాత్రిపూటే ప్రయాణం చేస్తారు, కాబట్టి మీరు మధ్యలో ఆగరు, మీరు విమానంలోనే నిద్రపోతారని విన్నాను. మీకీ వయస్సులో అంతశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇతరులెవరైనా ఈ వయస్సులో దీన్ని కనీసం వూహించలేరు కూడా. ఒక భారత యువకుడు సిగ్గుపడే విధంగా ఈ రోజు మీశక్తి కనిపిస్తోంది.

టైమ్స్‌ నౌ జర్నలిస్టులు రాహులు శివశంకర్‌, నవికా కుమార్‌ ప్రశ్నలు ఇలా వున్నాయి.

http://www.timesnownews.com/india/video/narendra-modi-full-interview-full-transcript-watch-times-now-prime-minister-modi-interview-bharatiya-janata-party-congress-mukt-india-corruption-free/1910491.

1.ప్రధాన మంత్రిగారూ అధికారంలో మూడున్నర సంవత్సరాల తరువాత మీ గతాన్ని ఎలా చూసుకుంటారు. ఎంతో జరిగింది, మీరు మొత్తంగా సాధించినవి ఏమిటి ? మిగిలిపోయినవి ఏమిటి ?

2.గత రెండు దశాబ్దాలలో దవోస్‌ వెళుతున్న ఈ దేశ తొలి ప్రధాని మీరు, మరియు ప్లీనరీలో మీరు మాట్లాడబోతున్నారు. ఏ ప్రధానీ ఇంతకు ముందు ఇలా చేయలేదు, ఎవరూ ప్లీనరీలో మాట్లాడలేదు. గతేడాది ప్లీనరిలో చైనా మాట్లాడింది, ఈ ఏడాది మీరు మాట్లాడబోతున్నారు, మీ ప్రయాణం రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నది, భారత అభివృద్ధి గాధలో ఏ భాగాన్ని మీరు దవోస్‌ సభ ముందుంచబోతున్నారు.

3.1991నుంచి ఇంతవరకు మన దేశ ఏ ప్రధాన మంత్రీ వేదికమీద ఆశీనులయ్యే అవకాశాన్ని పొందలేదు, ఎందుకిలా జరిగింది?

4. ప్రధాన మంత్రిగారూ మీరు సంపూర్ణ ప్రధాని. ప్రధాన మంత్రిగారూ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞప్తికి తేదలచాను, అది 2017 అక్టోబరు, ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టీన్‌ లాగార్డే ఇలా చెప్పారు.’మేము స్వల్పంగా భారత స్ధాయిని తగ్గించాము, అయితే గతకొద్ది సంవత్సరాలుగా అమలు జరిపిన వ్యవస్ధీకృత సర్దుబాట్ల(సంస్కరణల) కారణంగా భారత్‌ మధ్య, దీర్ఘ కాలిక అభివృద్ధి బాటలో వున్నదని మేము నమ్ముతున్నాము’ ప్రపంచ ఆర్ధిక సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వంటివి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటి విషయంలో సంతృప్తి చెందితే ఎందుకని మన దేశంలోని వారు నోట్ల రద్దు, జిఎస్‌టితో సంతృప్తి చెందటం లేదు.

5. ప్రధాన మంత్రిగారూ విదేశాల్లో భారత ప్రతిష్టను మెరుగుపరచేందుకు ప్ర యత్నిస్తున్నారు, కానీ కొంత మంది మన నాయకులు విదేశాలకు వెళ్లినపుడు భారతీయ సంతతివారితో మాట్లాడుతూ ఆ చెప్పే విషయాలన్నీ దేశంలో పని చేయటం లేదు అని చెబుతున్నారు, ప్రతిదీ దిగజారుతున్నందున విదేశాల్లో వున్న భారతీయులు స్వదేశానికి రావాలని చెబుతున్నారు. అలాంటి వారికి మీరేం చెబుతారు.

6.మోడీ గారూ , ఒక మోడీ సిద్ధాంతం వునికిలోకి వచ్చింది, ఎవరైతే ఇటీవల న్యూఢిల్లీని సందర్శించారో మీ మంచి స్నేహితుడు బెంజమిన్‌ నెతన్యాహు మోడీ సిద్ధాంతాన్ని బలపరిచారు. వుగ్రవాదం పట్ల మీ వైఖరికి ఆయన మద్దతిచ్చారు.టైమ్స్‌ నౌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వుగ్రవాదం పట్ల మీ తీరు ఒక గట్టిశక్తి అయిన దేశవైఖరి మాదిరిగా వుందని చెప్పారు. ఆయన మోడీ సిద్దాంతాన్ని, ధృడమైన అధికారాన్ని బలపరిచారు. సుతారమైన అధికారంతో వుగ్రవాద సమస్యను ఎదుర్కోలేమని ఆయన చెప్పారు. మీరు ఆ ధృఢవైఖరినే కొనసాగిస్తారా ?

ఇంతకంటే ప్రహసనాలు ఏముంటాయి ? ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే జర్నలిస్టులను చూసిన వారికి ఈ ఇంటర్వ్యూ చేసిన వారు కనిపిస్తే హయిగా నవ్వుకొనేందుకు వీలు కలుగుతుంది. హాస్య, వ్యంగ్యోక్తులకు మంచి ముడిసరకును అందించినందుకు ఆ జర్నలిస్టులకు యావత్‌ జర్నలిస్టు, రచయితలు, కళాలోకం ఎంతైనా రుణపడి వుంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరువు నష్టం కేసులతో మీడియా నోరు నొక్కే దుష్టయత్నం !

15 Tuesday Aug 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Attack on media, attacks on journalists, bully, defamation cases on media, EPW, free speech, journalism, Media, Samiksha trust, silence, SLAP

ఎం కోటేశ్వరరావు

భావ ప్రకటనా స్వేచ్చ మానవులకు పుట్టుకతో వచ్చిన హక్కు. భూమ్మీద పడగానే గాలి పీల్చుకోవటంతో కేరు మంటూ ప్రారంభమయ్యే స్వేచ్చా గళం తిరిగి అంతిమంగా శ్వాస తీసుకోవటం ఆగినపుడే మూతపడుతుంది. అలాంటి పుట్టుకతో వచ్చిన హక్కును హరించేందుకు మధ్యలో ఎవరు ప్రయత్నించినా దానిని ఏదో ఒక రూపంలో ప్రతిఘటించటమే సజీవ మానవ లక్షణం.

కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం……… హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయ్‌ అన్నీ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అలాగే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి నియంతలు,పోలీసులు, గూండాలు, కార్పొరేట్లు కావేవీ మినహాయింపు, ఏదీ తక్కువ కాదు అని చెప్పుకోవాల్సిన రోజులచ్చాయి. నియంతలు ఏదో ఒకసాకుతో లంగని మీడియా సంస్ధలను పూర్తిగా మూతవేయించటానికి ప్రయత్నిస్తారు. గూండాలు పశుబలాన్ని వుపయోగిస్తే, పోలీసులు, కార్పొరేట్లు చట్టాలను రక్షణగా తీసుకొని స్వేచ్చ, ప్రజాస్వామ్యాన్ని హరించటానికి ప్రయత్నిస్తాయి.

ఇటీవలి కాలంలో అధికార రాజకీయాలు నడిపే శక్తులు తమకు లంగని రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా వారిని తమ దారికి దారికి తెచ్చుకోవటం ఒక ముఖ్యపరిణామం. దాని ఫలితమే ఎవరు ఏ పార్టీ తరఫున ఎన్నికవుతారో, ఏక్షణంలో పార్టీ మారతారో తెలియని స్ధితి. కార్పొరేట్‌ సంస్ధలు ఒక దశలో స్వయంగా మీడియా సంస్ధలను ప్రారంభించటం ఒక పరిణామమైతే, తమ ప్రయోజనాలకు సహకరించని ఇతర వాటిని ఆర్ధికంగా దెబ్బతీయటం రాజకీయాలలో మాదిరి మరో సరికొత్త కొత్త ధోరణి. అది సంస్ధలకే పరిమితం కాలేదు, వ్యక్తులకు, శక్తులకు, మీడియాయేతర సంస్ధలను కూడా తమ దారికి తెచ్చుకొనేందుకు పైన పేర్కొన్న శక్తులన్నీ పూనుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వుపాధి,వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ గ్రామం, పరిసర ప్రాంతాల జనం వుద్యమిస్తే వారిని అణచివేసేందుకు సంబంధిత పారిశ్రామికవేత్తలు గూండాలు, పోలీసులు, అధికారయంత్రాంగం, మంత్రులు, వాణిజ్యమీడియాను ఎలా వుపయోగించుకున్నదీ ప్రత్యక్షంగా చూశాము. వారి కుమ్మక్కును బహిర్గతం చేసేందుకు కొందరు జర్నలిస్టులు సిద్ధంగా వున్నా మీడియా యాజమాన్యాలు వారి నోరు నొక్కుతున్నాయి. వాస్తవాలకు మీడియాలో చోటు కల్పించటం లేదు.

వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించేందుకుాతద్వారా తాము లబ్ది పొందేందుకు అధికారంలో వున్న పార్టీలు, వారి చెప్పుచేతల్లో పనిచేసే అధికార గణం నిబంధనలను ఎలా కావాలనుకుంటే అలా మార్చటం, తమకు అనువైన టీకాతాత్పర్యాలు చెప్పటం చూశాము. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో చెరువులు తవ్వాలనే పేరుతో తమకు ఓటు వేయని దళితుల భూములను ఆక్రమించేందుకు, వ్యవసాయానికి పనికిరాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఒక శత్రుదేశంపై దాడి మాదిరి జనాన్ని బయటకు రానివ్వకుండా చేసి, పెద్ద సంఖ్యలో యంత్రాలను ప్రయోగించి ఎలా తవ్వించిందీ లోకం చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !

ప్రధాని నరేంద్రమోడీ, బిజెపికి అత్యంత సన్నిహితుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త అదానీ. అతని గ్రూపు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు మార్చిన నిబంధనలు, పన్నుఎగవేత తీరుతెన్నుల గురించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఇపిడబ్ల్యు) జూన్‌ నెలలో రెండు పరిశోధనాత్మక విశ్లేషణలను ప్రచురించింది. వాటిని వెబ్‌ నుంచి వెంటనే వుపసంహరించని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని అదానీ గ్రూపు లాయర్‌ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా సంపాదకుడు పరంజయ గుహ థాకూర్దా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసి సమాధానం పంపారు. ఈలోగా ఆ పత్రికను నడుపుతున్న సమీక్షా ట్రస్టు పాలకవర్గం వెంటనే ఆవిశ్లేషణలను తొలగించాలని ఆదేశించటంతో దానికి నిరసనగా పరంజయ్‌ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆ పత్రిక యాజమాన్య ట్రస్టు గురించి ఎంతో వున్నతంగా వూహించుకున్న అనేక మంది హతాశులై పత్రిక ప్రతిష్టను పునరుద్దరించాలని ఒక బహిరంగ లేఖ రాశారు. భారతీయ మీడియాలో ఇలాంటి పరిణామం బహుశా ఇదే ప్రధమం. అనేక సంస్ధల యాజమాన్యాలు పాలేర్లను మార్చినట్లు సంపాదకులను మార్చటం చూశాము. అయితే అవన్నీ తెరవెనుక పరిణామాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇపిడబ్ల్యు వుదంతం అలాంటి కాదు, అలా జరగలేదు.

కార్పొరేట్ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించిన సంస్ధలు, వ్యక్తులు, శక్తులు, వాటిని బయట పెట్టిన జర్నలిస్టులను కేసులు ముఖ్యంగా భారీ మొత్తాల ప్రమేయం వున్న పరువు నష్టం, తదితర కేసులతో వేధించటం ప్రపంచవ్యాపితంగా జరుగుతోంది. కార్పొరేట్‌ సంస్ధలు ఎప్పుడైతే దేశ రాజకీయాలను శాసించేంత బలంగా తయారయ్యాయో ఆ పరిణామం మన దేశంలో కూడా వేగవంతమైంది. ఆంగ్లంలో స్ట్రాటజిక్‌ లా సూట్‌ ఎగైనెస్ట్‌ పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ అనేదాన్ని పొట్టిగా ‘స్లాప్‌’ అంటున్నారు. జన భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక న్యాయపరమైన దావా అని తెలుగులో చెప్పవచ్చు. ఇలాంటి దావాలు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నదానిని కార్పొరేట్‌ సంస్ధలు పట్టించుకోవు. తమను వుతికి ఆరవేస్తున్నవారిని ముందుకు పోకుండా చేయటమే ప్రధాన లక్ష్యం. అందుకు గాను పెద్ద మొత్తం పరువు పరిహారాన్ని కోరటం, క్రిమినల్‌ కేసులు పెట్టటం ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదులకు డబ్బులిచ్చి కోర్టులలో పోరాడటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు కనుక ఇలాంటి బెదిరింపులు ప్రతి దేశంలో సర్వసాధారణమయ్యాయి. గ్రీన్‌పీస్‌ అనే సంస్ధ నోరు మూయించటానికి ఒక కేసులో 30కోట్లు, మరోకేసులో 70లక్షల డాలర్ల పరిహారానికి కేసులు నమోదు చేశారు. ‘స్లాప్‌’ కేసులు బనాయించకుండా చూసేందుకు పరిమిత దేశాలు మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులు పెరిగిపోతూనే వున్నాయి.

పశ్చిమ గోదావరిలో ఒక నాడు ఒక సన్నకారు రైతుగా వుండి తరువాత కాలంలో ఆఫ్రికాలో, మన దేశంలోని బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్ధగా ఎదిగిన కరుటూరి గ్లోబల్‌ యాజమాన్య కార్యకలాపాల గురించి కేయ ఆచార్య అనే ఒక పర్యావరణ జర్నలిస్టు రాసిన వ్యాసాన్ని ఇంటర్‌ ప్రెస్‌ సర్వీసు(ఐపిఎస్‌) ప్రచురించింది. దాని వలన కలిగిన తమ పరువు నష్టంగా వందకోట్ల రూపాయలు చెల్లించాలని 2014 ఆగస్టు ఐదున ఆ సంస్ధ ఎండీ శాయి రామకృష్ణ కరటూరి ఒక నోటీసు పంపారు. కంపెనీ తూర్పు ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు భారత్‌లోని గులాబి సాగుపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆ జర్నలిస్టు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఆమెకు నోటీసు అందగానే ఆ విశ్లేషణను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఐపిఎస్‌ సంస్ధ వెంటనే ఒక ప్రకటన చేసింది. జర్నలిస్టు రాసిన విశ్లేషణలోని అంశాలను, వార్తా వనరు గురించి నిర్ధారించుకొనేందుకు గాను ఆ వ్యాసాన్ని పక్కన పెడుతున్నామని, తమ సంస్ధ నుంచి వార్తలను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు దానిని ఏ రూపంలోనూ తిరిగి ప్రచురించవద్దని దానిలో పేర్కొన్నది. ఈ నోటీసు తనను బెదిరించేందుకు మాత్రమే కాదని భవిష్యత్‌లో ఆఫ్రికాలో కరుటూరి కంపెనీ కార్యకలాపాల జోలికి పోకుండా మౌనం వహించేందుకు కూడా వుద్దేశించిందని శ్రేయ ఆచార్య పేర్కొన్నారు.

కాలం చెల్లిన పరువు నష్టం చట్టాలను ఇంకా మన దేశంలో కొనసాగించటం స్వేచ్చా గళాలను అణచివేయటానికి సాధనాలుగా చేసుకొనేందుకు అనుమతించటం దారుణం. పరువు నష్టం కేసుల వివరాలను పరిశీలిస్తే బెదిరించటానికే వాటిని వుపయోగిస్తున్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తం పరిహారం కోరుతూ జర్నలిస్టులకు నోటీసు పంపితే రాసిన వాటిని వెనక్కు తీసుకోవటమో లేదా తదుపరి రాయకుండా చేయటమో జరుగుతోందని తేలింది. తాజా వుదంతం ఇపిడబ్ల్యు సంపాదకుడు పరంజయ గుహ థాకూర్ధా విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. పరంజయ్‌ గుహ, సుబీర్‌ ఘోష్‌, జ్యోతిర్మయ్‌ చౌదరి ‘గ్యాస్‌ వార్స్‌-క్రోనీ కాపిటలిజం అండ్‌ అంబానీస్‌’ అనే పేరుతో పుస్తకం రాశారు. దానిలో సహజవాయు ధర నిర్ణయంలో జరిగిన అక్రమాలను వివరించారు. ఆ పుస్తకం వెలువడగానే ఆ పుస్తకాన్ని రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దానిని వెబ్‌సైట్‌నుంచి తొలగించాలని, విక్రయాలు, ముద్రణలను నిలిపివేయాలని లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అంబానీ సోదరులు నోటీసులు జారీ చేశారు. రచయితలు కూడా వాటికి లీగల్‌గానే సమాధానాలు పంపారు. తరువాత అంబానీల వైపు నుంచి ఎలాంటి కదలికలు లేవు. ఇలాంటి వాటికి తాము భయపడలేదని రచయితలలో ఒకరైన ఘోష్‌ వ్యాఖ్యానించారు.తమను బెదిరించటానికి, వేధించటానికే ఈ నోటీసులు జారీ చేశారని థాకూర్ధా వ్యాఖ్యానించారు.

సహారా గ్రూపు అధిపతి సుబ్రతారాయ్‌ కూడా సహారా: అన్‌ టోల్డ్‌ స్టోరీ పేరుతో మింట్‌ పత్రిక డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా వున్న తమల్‌ బందోపాధ్యాయ, పుస్తక ప్రచురణ సంస్ధ జైకో పబ్లిషింగ్‌ హౌస్‌పై రెండువందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశాడు. సహారా సంస్ధ లావాదేవీలు, అది ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి దానిలో వివరించారు. దాని విడుదలపై కొల్‌కతా హైకోర్టు స్టే విధించింది. తరువాత వుభయ పక్షాలూ కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఆపుస్తకంలో పరువుకు భంగం కలిగించే అంశాలున్నాయని, సహారా సంస్ధ వాటి గురించి సంతోషంగా లేదనే ప్రకటన కూడా పుస్తకంలో ప్రచురించేట్లు, పుస్తక ప్రచురణ, విడుదలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. ఒక వ్యక్తిగా అలాంటి పెద్ద సంస్ధలతో పోరాడటం కష్టమని, తనకు మింట్‌ యాజమాన్య మద్దతు వున్న కారణంగానే పోరాడగలిగానని, అన్నింటికంటే తనకు మీడియా ఎంతగానో మద్దతు ఇచ్చిందని, అయినా తన ఆరోగ్యం దెబ్బతిన్నదని రచయిత తమల్‌ బందోపాధ్యాయ చెప్పారు. ఇలాంటి నోటీసులు నిజాయితీగా వార్తలు అందించటాన్ని అడ్డుకొనేందుకే అన్నది వాస్తవం అన్నారు. మింట్‌ పత్రికను ప్రచురిస్తున్న హిందుస్తాన్‌ టైమ్స్‌ సంస్ధపై రిలయన్స్‌ పవర్‌ కూడా మింట్‌ ప్రచురించిన వార్తపై దావా వేసింది. సెబీతో సహారా కంపెనీ వివాదంపై వార్తలు రాసినందుకు మింట్‌ పత్రిక సంపాదకుడిపై ఆ కంపెనీ పాట్నాలో ఒక పరువు నష్టం దావా వేసింది.

ఒక సంస్ధ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వార్త లేదా వ్యాఖ్య ప్రచురితం లేదా ప్రసారమైనపుడు అభ్యంతరకరమైన అంశాలుంటే ముందుగా వాటికి సంబంధించిన వివరణలు లేదా ఖండనలు ఇవ్వాలి. వాటిని మీడియా విస్మరించినపుడు ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి అక్కడ కూడా న్యాయం జరగలేదని అనిపిస్తే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకొనేందుకు ఎవరికైనా హక్కుంటుంది. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. గూండాలు, మాఫియా, ప్రజాప్రతినిధులు లేదా వారి అనుయాయులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికదాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా వెనుతీయటం లేదు. పోలీసులు కూడా అత్యధిక సందర్భాలలో వారితో కుమ్మక్కయి జర్నలిస్టులపై ప్రతి కేసులు బనాయించటం లేదా కొన్ని సందర్భాలలో అయితే రౌడీషీట్లను కూడా తెరిచే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్‌ శక్తులు తమ డబ్బు మదంతో భారీ మొత్తాలకు పరువు నష్టం కేసులు వేస్తూ మీడియా సంస్ధలు, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు పూనుకోవటం ఏడుపదుల మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు పట్టిన దుర్గతి. ఈ స్ధితిలో ఏం చెయ్యాలి అనే సమస్య ఒక్క జర్నలిస్టులకే కాదు యావత్‌ సమాజం ముందున్నది.

ఇపిడబ్ల్యు వుదంతానికి వస్తే అసలు వాస్తవాలేమిటన్నది బయటకు రావాల్సి వుంది. కేవలం ఒక లాయర్‌ నోటీసుకే యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవటం అనూహ్యం. ఇప్పటి వరకు వెల్లడైన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అనేక కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అదానీ లీగల్‌ నోటీసు ట్రస్టును వుద్ధేశించిందని అయితే దాని గురించి తమకు తెలపకుండానే ట్రస్టు తరఫున సమాధానం ఇస్తున్నట్లు పేర్కొన్నారని, అది ఏకపక్షంగా నిర్ణయమని విశ్వాసాన్ని వుల్లంఘించారని సమీక్ష ట్రస్టు ప్రకటించింది. జరిగిందేమిటో తమకు తెలపకుండానే లీగల్‌ నోటీసు, సమాధాన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపింది. వాటితో పాటు అదానీ కంపెనీల గురించిన రాసిన ఆర్టికల్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపింది. ఆ తరువాత పరంజయ్‌ రాజీనామా చేశారని, దానిని ట్రస్టు సమావేశం అంగీకరించినట్లు తెలిపారు. లీగల్‌ నోటీసు గురించి అనుమతి తీసుకోకుండా సమాధానం ఇవ్వటం తన పొరపాటేనని అంగీకరించానని, జరిగిందానిని పూర్తిగా ట్రస్టు సభ్యులు వెల్లడించటం లేదని రాజీనామా చేసిన పరంజయ్‌ చెబుతున్నారు.

జరిగిందాని గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అదానీ గ్రూపు లాయర్లు పేర్కొన్న వ్యాసాన్ని తొలగించాలని ట్రస్టు కోరిందీ లేనిదీ స్పష్టం కావాల్సి వుంది. అదానీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందా అన్నదొక వ్యాసం, అదానీ కంపెనీకి ఐదువందల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టిన విధాన లోపం గురించి మరొక వ్యాసంలో పేర్కొన్నారు.రెండవ వ్యాసాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని ట్రస్టు సభ్యులు కోరారన్న అంశంపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. తొలగించమని కోరటానికి గల కారణాలను ట్రస్టు వెల్లడించలేదు.అదే సమయంలో తామెవరి వత్తిడికి ఎన్నడూ లంగలేదని పేర్కొన్నారు. పరంజయ్‌ రాసిన వ్యాసంలో గుర్తుతెలియని వనరులు చెప్పిన ఆధారాలు లేని అనేక కట్టుకథలు వున్నాయని, వాటి ఆధారంగా నిర్ధారణలు చేశారని ట్రస్టు సభ్యులు ఆరోపించారు. కొద్ది రోజుల తరువాత ట్రస్టు సభ్యుల పేరుతో వెలువడిన ప్రకటనలో ఇపిడబ్ల్యు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఆ వ్యాసాలు లేవని, వాటిపై సమీక్ష కూడా సవ్యంగా జరగలేదని పేర్కొనటం గమనించాల్సిన అంశం.

ట్రస్టు సభ్యులతో జరిగిన సమావేశంలో లీగల్‌ నోటీసు అంటే ఒక లాయర్‌ నుంచి వచ్చిందే తప్ప కోర్టులో క్రిమినల్‌ కేసు నుంచి కాదని తాను వివరించానని, దానికి కూడా ట్రస్టు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా లీగల్‌ నోటీసుకు సమాధానం పంపటం పొరపాటేనని గ్రహించానని అందుకు క్షమాపణ కూడా చెప్పానని పరంజయ్‌ చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన దానిని పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. తన పేరుతో వ్యాసాలు రాయవద్దని ట్రస్టీ సభ్యులు చెప్పారని, ఏవైతే సంపాదకుడి విధులు, పాత్ర వుంటుందో అవే వుండే విధంగా ఒక సహసంపాదకుడిని కూడా నియమిస్తామని చెప్పారని, తక్షణమే వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ తొలగించి వెళ్లాలని కోరినట్లు చెప్పారు. తాను ఇతరులతో కలసి రాసిన విశ్లేషణలో ప్రతి వ్యాక్యానికి కట్టుబడి వుంటానని, అందుకు తగిన ఆధార పత్రాలు తన వద్ద వున్నాయని చెప్పానని, తాను రాసిన దానికి సాక్ష్యాల గురించి ట్రస్టీలు అసలు అడగలేదనిఅయినప్పటికీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సిందేనంటూ తాను చెప్పిందానిని పట్టించుకోలేదన్నారు. ట్రస్టీలకు ఆధారాలపై ఆసక్తి లేదన్నారు. ఒక ట్రస్టీ అయితే ఆ వ్యాసాన్ని తానింకా చదవలేదని కూడా చెప్పారని, వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ను తొలగించిన తరువాతే బయటకు వెళ్లాలని తనతో చెప్పారని కూడా పరంజయ్‌ చెబుతున్నారు. దాంతో తాను ు రాజీనామా చేస్తానని చెప్పానని, ముంబైలో సంపాదకుడికి ఇచ్చే ఫ్లాట్‌ను ఖాళీ చేయటానికి కొద్ది రోజులు గడువిస్తారా అని అడగ్గా జూలై ఆఖరు నుంచి రాజీనామా అమలులోకి వస్తున్నట్లు పరిగణిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారని అయితే తక్షణమే తాను రాజీనామా చేసినట్లు పరిగణించాలని కోరినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు ఆ పత్రిక తీరు తెన్నులను పరిశీలించినపుడు దాని సంపాదకుడి ఎన్నిక మిగతా వాణిజ్య పత్రికల మాదిరిగా జరగదని తెలిసిందే. వివిధ రంగాలలో పరిణితులైన ట్రస్టు సభ్యులు పూర్వపరాలను ఒకటికి రెండుమార్లు పరిశీలించి నిపుణులు, నిబద్ధత కలిగిన వారినే సంపాదకులుగా ఎంపిక చేశారు. గతంలో పని చేసిన వారందరూ వున్నంతలో వున్నత ప్రమాణాలు, విలువలను కాపాడారు కనుకనే ఆ పత్రికకు ఒక విస్వసనీయత ఏర్పడింది.ఆ రీత్యా చూసినపుడు పరంజయ్‌ గుహ థాకూర్ధాను కూడా ఆ ప్రమాణాల మేరకే ఎంపిక చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ముందే చెప్పుకున్నట్లు రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్ధకు సైతం వెరవ కుండా దాని అక్రమాలను బయట పెట్టిన చరిత్ర వుంది. అలాంటి వ్యక్తి అదానీ సంస్ధల గురించి అదీ అదానీకి నరేంద్రమోడీతో వున్న సంబంధాలు తెలిసి కూడా ఆషామాషీగా గాలి వార్తలను పోగేసి కధనాలు రాశారని, తమ విశ్వాసాన్ని వమ్ము చేశారని అంటే నమ్మటం కష్టం. ఒక అంశంపై పరిశోధన చేసిన జర్నలిస్టుకు కొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం కూడా వచ్చి వుండవచ్చు. ఇపిడబ్ల్యు పత్రికలో అటువంటి వార్తలు రాశారంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు ఆ వార్తల గురించి అదానీ సంస్ధ లేదా ప్రభుత్వ ప్రమేయం కూడా వుంది కనుక ఆయా శాఖల స్పందన ఏమిటన్నది కూడా పరిశీలించకుండానే పరంజయ్‌ ఇతరులతో కలసి రాసిన వార్తలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని పేర్కొనటం ట్రస్టు సభ్యులపై అనుమానాలను పెంచేదే తప్ప వేరు కాదు. ప్రజల ఖజానాకు చేరవలసిన వందల కోట్ల రూపాయలను ఒక సంస్ధ అక్రమపద్దతుల్లో ఎగవేసిందని రాస్తే దానికి తగిన ఆధారాలను చూపాల్సిన బాధ్యత ఆ జర్నలిస్టుకు వుంటుంది. అది వాస్తవం కాదని అనే వారు సంస్ధ అయినా ప్రభుత్వశాఖలైనా అది ఎలా అవాస్తవమో జనానికి తెలియచేయాల్సిన బాధ్యత వారిపై కూడా వుంది. పరంజయ్‌, ఆయన సహరచయితలు రాసిన అంశాలు ప్రయివేటు లావాదేవీలకు సంబంధించినవి కావు. చట్ట సమీక్షకు లోబడినవే.

చట్ట సభలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున ఒకసారి జనంలోకి వెళ్లిన అంశాన్ని స్పీకర్‌ తన విచక్షణాధికారాన్ని వుపయోగించి రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంతే తప్ప దాన్ని జనంలో ప్రచారం చేయకుండా నిరోధించలేరు.అలాగే ఇపిడబ్ల్యు పత్రికలో ఆ వ్యాసాలు ప్రచురితమై పాఠకులకు చేరాయి. వెబ్‌సైట్‌లో తొలగించినంత మాత్రాన జనానికి అందకుండా పోవు. వైర్‌ వంటి వెబ్‌సైట్లు వెంటనే ఆ వ్యాసాలను పునర్ముద్రించాయి. వాటికి కూడా ఇపిడబ్ల్యుకు ఇచ్చిన మాదిరే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామంటూ సదరు వెబ్‌సైట్‌ ఆ రెండు విశ్లేషణలను ఇప్పటికీ పాఠకులకు అందుబాటులో వుంచింది. సమీక్ష ట్రస్టు చర్యతో ఆ వ్యాసాల్లో అసలేమి వున్నదనే ఆసక్తి పాఠకుల్లో మరింతగా పెరిగి వాటికి ప్రాచుర్యాన్ని పెంచాయి. అనేక మీడియా సంస్ధలు అదానీకి భయపడుతూనే రేఖా మాత్రంగా అయినా వాటిల్లో ఏముందో చెప్పకుండా వార్తలను ఇవ్వలేవు. జరిగిన అక్రమాల సారాన్ని కొద్ది వాక్యాలలో అయినా చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందో అని ఆ వార్తలను నిషేధించినా సామాజిక మాధ్యమంలో అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ కంపెనీలను కూడా ఆదాని మేనేజ్‌ చేసి వారిని సంతృప్తి పరిస్తే తప్ప చర్చించేందుకు అవకాశాలు ఎన్నో వున్నాయి.

ఈ పరిణామం నిస్సందేహంగా దేశంలోని జర్నలిస్టుల ముందు ఒక సవాలు విసురుతోంది. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన అంశాలు జనానికి తెలియకుండా అడ్డుకోవటాన్ని సహిస్తే అసలు జర్నలిజానికి అర్ధం ఏమిటి? అలాంటి వాటిని ఎలా జనానికి తెలియచెప్పాలి. బ్రిటీష్‌ వారి కాలంలో వారికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలను ఎలా అణచివేసిందీ, ఒక పేరుతో వున్న దానిని అచ్చుకాకుండా చేస్తే మరొక పేరుతో ఎలా జనంలోకి తెచ్చిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్ధితులు పునరావృతం కానున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య మీడియాపై జనంలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నప్పటికీ నిజం కాకపోతే ఎలా అచ్చువేస్తారులే అనుకునే జనం ఇంకా వున్నారు. అందుకే వాస్తవాలను మరుగుపరచి కట్టుకథలు పిట్టకధలతో జనాన్ని నమ్మించగలుగుతున్నాయి.

ఇపిడబ్ల్యు వంటి ట్రస్టు మీద మేధావి వర్గంలో ఇప్పటి వరకు వున్న అభిప్రాయం వేరు ఇక ముందు అలాంటిది వుండదనే విషయాన్ని సమీక్ష ట్రస్టు గుర్తించాలి. పూర్వపు విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే అసలు వాస్తవాలేమిటనే విషయాన్ని అది జనం ముందుంచాలి. తన సంపాదకుడు రాసిన విశ్లేషణకు ఆధారాలు చూపలేకపోతే అప్పుడు అతన్ని రాజీనామా చేయమనటమో లేకపోతే ఏకపక్షంగా తొలగించటమో చేసి తమ పత్రిక చేసిన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకరించి వుంటే ఇపిడబ్ల్యు గౌరవం మరింత పెరిగి వుండేది. సంపాదకుడు చెప్పిన అంశాలపై ముందుగా ట్రస్టు అంతర్గత విచారణ జరిపి, పరి శోధనాత్మక వార్తకు వున్న ఆధారాలేమిటో అంతర్గతంగా పరిశీలించిన తరువాత చర్య తీసుకోవటం ఒక పద్దతి అదేమీ లేదు, ఆ వ్యాసాలను ఎందుకు వుపసంహరించారో అధికారికంగా వివరణ లేదు కనుకనే యాజమాన్యం బయటివారి వత్తిడికి లంగిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనేక మంది మేధావుల అభిప్రాయాలు, మనోభావాలను మన్నించి పారదర్శకంగా వ్యవహరిస్తే నీలినీడలు పటాపంచలవుతాయి. ఒక విస్వసనీయ పత్రికగా ఇపిడబ్ల్యు ముందుకు పోతుంది. లేకుంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో బడా మీడియా పాలవర్గతొత్తుగా మారి వాటి భజన చేస్తున్న సమయంలో వికీలీక్స్‌ వునికిలోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదుల బండారాన్ని వుతికి ఆరేస్తుందని, దాని గుట్టుమట్టులన్నీ బయటపెడుతుందని ఎవరైనా వూహించారా? ఆ సంస్ధ నిర్వాహకులకు అమెరికా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఆధారాలు అందించబట్టే అది సాధ్యమైంది. అలాంటి వారు ప్రతి దేశంలోనూ వుంటారు. చరిత్రలో హేతుబద్దంగా ప్రశ్నించిన చార్వాకులను నాటి పాలకవర్గం నాశనం చేసింది. వారిని భౌతికంగా అంతమొందించారు తప్ప వారి భావజాలాన్ని అణచివేయలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇపిడబ్ల్యు నిర్వహించిన పాత్రను కొనసాగించేందుకు మరొక పత్రిక ఆవిర్భవించకుండా వుంటుందా ? ఏటికి ఎదురీదటమే బతికి వున్న చేపల స్వభావం. చచ్చిన చేపలే వాలునబడి కొట్టుకుపోతాయి. దేశంలో జర్నలిజం, జర్నలిస్టుల కర్తవ్యం కూడా బతికిన చేపల మాదిరి ఎదురీదటమే !

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జర్నలిస్టుల ముసుగులో పోలీసులు- మీడియాలో కట్టు కథలు !

27 Tuesday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.

ఎం కోటేశ్వరరావు

     జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.

   దర్యాప్తు సమాయాలలో ఎఫ్‌బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్‌ జనరల్‌ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !

    రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్‌ మోకింగ్‌ బర్డ్‌ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్‌బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్‌బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.

    2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్‌ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్‌ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్‌ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్‌ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్‌ ప్రెస్‌ (మన పిటిఐ, యుఎన్‌ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్‌ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్‌ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్‌సైట్‌ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఎఫ్‌బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్‌బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్‌బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.

   దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్‌ ఎఫ్‌బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ప్రీడమ్‌ ఆఫ్‌ ద ప్రెస్‌ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్‌బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్‌బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.

     ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమినీ జీటుంగ్‌ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్‌ జర్నలిస్టు డాక్టర్‌ యుడో అల్‌ కొటే రష్యాకు చెందిన ఆర్‌టి న్యూస్‌ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్‌, అమెరికన్‌ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్‌ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్‌ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్‌ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్‌ జర్నలిస్టు వెల్లడించారు.

   కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్‌ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్‌ లేయాన్‌ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్‌, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్‌ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్‌ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్‌ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.

    కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్‌ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్‌లో ఒక కొటేషన్‌, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్‌ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్‌కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్‌ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్‌ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.

     మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్‌లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.

     అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్‌లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్‌ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.

    మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్‌, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్‌సైట్‌ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.

    మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.

    అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?

    మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్‌ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్‌ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్‌ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.

గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: