• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: #Kerala elections 2021

ఎల్‌డిఎఫ్‌కు అధికారం ఖాయం అన్న 16కు పదిహేను సర్వేలు !

26 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP, Kerala Assembly Elections pre-poll surveys, Kerala LDF, Kerala pre-poll surveys, UDF


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి ప్రచారం పర్వం వేడెక్కుతున్నది. రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, మరోదఫా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారంలోకి రావటంగా ఉన్న రాజకీయ ఆనవాయితీకి తొలిసారిగా ఈ సారి తెరపడనున్నది. ఈ నేపధ్యంలో దీన్ని సహించలేని హిందూత్వ, క్రైస్తవ మత శక్తులు మరోసారి తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ముందుకు తెస్తున్నాయి. ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. శబరిమల దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో ఎవరైనా దాన్ని ప్రచార అంశంగా ముందుకు తెస్తే సమస్యలను ఎదుర్కొంటారు. వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారం చేపట్టనున్నదంటూ ఇప్పటి వరకు జరిగిన పదహారు సర్వేలలో ఒకటి మాత్రమే ఏ కూటమికీ మెజారిటీ దక్కదని చెప్పగా మిగిలిన వన్నీ ఎల్‌డిఎఫ్‌కు మెజారిటీ సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. వీటిలో మొదటిది గత ఏడాది జూలైలో జరగ్గా మిగిలినవన్నీ ఈ ఏడాదిలోనే జరిగాయి. మొత్తం 140 సీట్లకు గాను అధికారం దక్కాలంటే 71 స్దానాలు తెచ్చుకోవాలి. పదహారు సర్వేల సగటు ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 76.3 సీట్లు గరిష్ట సగటు 82 రానున్నాయి. మెజారిటీలలో కనిష్టంగా 72 కాగా గరిష్టంగా 91 ఉన్నాయి. బిజెపి కూటమికి రెండు సర్వేలు 3-7 మధ్య వస్తాయని పేర్కొనగా మిగిలినవన్నీ ఒకటి రెండుగా తెలిపాయి.ఒక సర్వే మూడు వస్తాయని పేర్కొన్నది. గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్ధలలో పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఎల్‌డిఎఫ్‌కు 101 వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వెలువడింది. హంగ్‌ అని పేర్కొన్న సర్వే కూడా 68-78 మధ్య వస్తాయని పేర్కొన్నది.


ఈ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను మొత్తం 957 మంది పోటీలో ఉన్నారు. ఫ్రంట్‌లు, పార్టీల వారీగా పోటీ చేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)లో పది పార్టీలున్నాయి. సిపిఐ(ఎం) మరియు అది బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు 86, సిపిఐ 25, కేరళ కాంగ్రెస్‌(ఎం) 12, జనతాదళ్‌ (సెక్యులర్‌) 4, ఎన్‌సిపి 3, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ 3, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ 3, కాంగ్రెస్‌(సెక్యులర్‌) 1, కాంగ్రెస్‌(బి) 1, జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ 1. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 93,ముస్లిం లీగు 27, కేరళ కాంగ్రెస్‌ 10, ఆర్‌ఎస్‌పి 5, నేషనలిస్టు కాంగ్రెస్‌(కేరళ) 2, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) 1,సిఎంపి 1,ఆర్‌ఎంపిఐ 1. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఏ) బిజెపి 115, భారత ధర్మ జనసేన 21, అన్నాడిఎంకె 2, కామరాజ్‌ కాంగ్రెస్‌ 1, జనాధిపత్య రాష్ట్రీయ సభ 1, డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ 1. ఈ కూటమిలో కామరాజ్‌ కాంగ్రెస్‌, జనాధిపత్య రాష్ట్రీయ పార్టీలు రెండూ బిజెపి గుర్తుమీదే పోటీ చేస్తున్నాయి.


శబరిమలై వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నాయర్‌ సర్వీసు సొసైటీ(ఎఎస్‌ఎస్‌) ఒక వైపు నుంచి మరో వైపు నుంచి లాటిన్‌ కాథలిక్‌ చర్చి పెద్దలు ఎన్నికల్లో తామేంటో చూపుతామంటూ ఎల్‌డిఎఫ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శబరిమల వివాదం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నప్పటికీ హిందూత్వశక్తులు దాన్ని ఏదో ఒక రూపంలో ఎన్నికల అంశంగా చేసేందుకు పూనుకున్నాయి. విజయన్‌ ప్రభుత్వం జాలర్లకు హాని చేసేందుకు ప్రయత్నించిందంటూ వ్యతిరేకంగా ఓటు వేయాలన్న సందేశాలను చర్చి నేతలు ఇచ్చారు. ఈ సంస్దల యత్నాలు ఫలించబోవనే ధీమా ఎల్‌డిఎఫ్‌లో వ్యక్తమైంది. క్రైస్తవులు ప్రధానశక్తిగా ఉన్న కేరళ కాంగ్రెస్‌(ఎం) ఈ సారి ఎల్‌డిఎఫ్‌లో చేరటం మతశక్తులకు మింగుడు పడటం లేదు. మరోవైపు కొందరు బిజెపికి మద్దతు ఇస్తుండటంతో సామాన్య క్రైస్తవులలో మతాధికారులు ఇచ్చే పిలుపులకు పెద్దగా స్పందన కానరావటం లేదు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో సర్వేలు ఎల్‌డిఎఫ్‌ మెజారిటీనే సూచిస్తున్నాయి.


ఏకె ఆంటోని ముఖ్యమంత్రి విజయన్‌ పాద సేవ చేయాలి !


ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీద విరుచుకుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఏకె ఆంటోని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సిపిఎం నేత, మంత్రి ఎంఎం మణి ప్రశ్నించారు. కరోనా సమయంలో గనుక కాంగ్రెసే అధికారంలో ఉంటే ఎందరో పౌరులు మరణించి ఉండేవారని అన్నారు. తమ స్వంత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నా బిజెపి గురించి నోరెత్తని ఆంటోనికి వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించని ఆంటోని ముఖ్యమంత్రికి పాదసేవ చేయాలన్నారు. ఏ పార్టీకి ఎందరు నాయర్లను కేటాయించాలనే పంపిణీ హక్కులు ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమార్‌ నాయర్‌కు లేదని, ఆయన వాంఛలకు అనుగుణ్యంగా కొంత మంది ఓటు వేయవచ్చుగానీ మెజారిటీ నాయర్లు ఎల్‌డిఎఫ్‌ మద్దతుదార్లుగా ఉన్నారన్నారు.


బిజెపి ఓట్లు కావాలంటున్న చెన్నితల – వద్దు అంటున్న మరో కాంగ్రెస్‌ నేత !


బిజెపితో సహా తాము ఎవరి ఓట్లనూ వద్దు అనటం లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ప్రకటించగా తమకు బిజెపి ఓట్లు అవసరం లేదని యుడిఎఫ్‌ కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ చెప్పారు. కన్నూరు జిల్లా తలసెరిలో గానీ మరోచోట గాని తమకు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓట్లు అవసరం లేదని పదే పదే చెప్పామని, వెల్ఫేర్‌ పార్టీ(ముస్లిం మతతత్వ)తో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఎన్నికల జాబితా గురించి ఆరోపణలను కొనసాగిస్తున్న రమేష్‌ చెన్నితల తాజాగా మరొక చౌకబారు ఆరోపణను ఇసికి ఫిర్యాదుగా పంపారు. ఓటు వేసిన తరువాత వేలు మీద వేసే సిరాగుర్తును చెరిపివేసే రసాయనాలను అధికారపక్షం పంపిణీ చేసిందన్నది దాని సారం. ఆరోపణకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం కోరగా కొన్ని కేంద్రాల నుంచి తనకు ఫిర్యాదులందాయని చెన్నితల చెప్పారు. పలుచోట్ల దొంగ ఓట్లు చేర్పించారని సిపిఎం మీద రమేష్‌ చెన్నితల చేస్తున్న ఆరోపణలు ఆయనకే ఎదురు తగులుతున్నాయి. పెరుంబవూరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ఎల్దోస్‌ కున్నపల్లి, ఆయన భార్య మరియమ్మకు రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. కైపమంగళం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి సుబిన్‌కు మూడు చోట్ల ఓట్లు, గుర్తింపు కార్డులు ఉన్నట్లు బయటపెట్టిన సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు ఎంఎల్‌ఎ, ఆయన భార్యకు రెండు చోట్ల ఉండటం గురించి ఏమి చెబుతారంటూ దీన్ని ఒక ప్రచార అంశంగా ముందుకు తెచ్చారు. రమేష్‌ చెన్నితల ఒక మహిళకు ఐదు చోట్ల ఓట్లు ఉండటాన్ని ఉదాహరణగా మీడియా ముందు చెప్పారు. అయితే సదరు మహిళ తాను కాంగ్రెస్‌ కార్యకర్తను అని చెప్పటంతో చెన్నితల నోట్లో వెలక్కాయపడింది.

ఇడిపై కేసు గురించి కేంద్ర బిజెపి మంత్రి గగ్గోలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర ఎల్‌డిఎఫ్‌ నేతలను దొంగబంగారం కేసులో ఇరికించేందుకు నిందితులను బెదిరించి తప్పుడు ప్రకటనలు చేయించిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానినే కోర్టుకు అఫిడవిట్‌గా సమర్పించి ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు తనచేత బలవంతంగా ప్రకటన చేయించారని, ఇడి అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో తప్పుడు కేసు పెట్టిన ఇడి అధికారులపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాన్ని ఎత్తివేయాలని ఇడి చేసిన వినతిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతంపై విచారణ న్యాయవిచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇడిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు, కేసు పెట్టటం ఏమిటంటూ కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ గగ్గోలు పెట్టారు. ఇది దేశంలో ఒక వింత అన్నారు.


దొంగబంగారం కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌ను ఇడి అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకోవటాన్ని తాము విన్నామని ఆమెకు రక్షణగా ఉన్న ఇద్దరు కేరళ మహిళా పోలీసులు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయించింది. స్వప్న సురేష్‌కు రక్షణగా ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 12,13 తేదీలలో విధి నిర్వహణలో భాగంగా తాను స్వప్న వద్ద ఉన్నపుడు ఇడి అధికారులు ఆమెను బెదిరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని నమోదు చేయటాన్ని తాను విన్నానని ఆ పోలీసు అధికారిణి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచారు. దాన్నే ఒక న్యాయమూర్తి ముందు నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచికి న్యాయ విభాగం సలహా ఇచ్చింది.తమకు వ్యతిరేకంగా పోలీసు అదికారిణి ఫిర్యాదు, వాంగ్మూలం రాజకీయవత్తిడితో చేస్తున్నట్లు ఇడి ఆరోపించింది.


కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధుల సంస్ధ(కెఐఐఎఫ్‌బి)పై ఆదాయపన్నుశాఖ దాడి చేయటం దాదాగిరి తప్ప మరొకటి కాదని ఆర్ధిక మంత్రి థామస్‌ ఐజాక్‌ వర్ణించారు. అన్ని నిబంధనలను, చట్టాలను పాటిస్తున్న ఆ సంస్ధపై దాడులు చేయటం ద్వారా ఎలాంటి నష్టం చేయజాలరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో నిర్మించిన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్ధలను జనం చూస్తున్నారని, దాన్ని దెబ్బతీస్తుంటే రాష్ట్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే సంస్దను ఏర్పాటు చేశాము, రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. దాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌-కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ అడిగిన సమాచారం, పత్రాలను గతంలోనే సమర్పించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు మరోసారి దాడి చేయటం తప్ప మరొకటి కాదని చెప్పారు.ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లటానికి ఎవరు హక్కు ఇచ్చారని, దీని వెనుక కేంద్ర మంత్రుల ప్రోద్బలం తప్ప అధికారులదేమీ లేదన్నారు.


విజయాలతో మామా-అల్లుడు చరిత్రను సృష్టిస్తారా !


అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌ విజయం సాధిస్తే కేరళ అసెంబ్లీ చరిత్రలో అదొక రికార్డు అవుతుంది. విజయన్‌ అల్లుడు రియాజ్‌ అన్న విషయం తెలిసిందే. విజయన్‌ కన్నూరు జిల్లాలో పోటీ చేస్తుండగా రియాజ్‌ కోజికోడ్‌ జిల్లాలో పోటీచేస్తున్నారు. ఈ ఉదంతాన్ని మరికొన్ని చోట్ల జరుగుతున్న పోటీలలో బంధువులు పోటీ చేయటాన్ని చూపి సిపిఎంలో కూడా కుటుంబ పెత్తనం, వారసత్వం చోటు చేసుకున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనికి ప్రాధాన్యత తప్ప బంధుత్వాలకు కాదు అన్న విషయం తెలిసిందే. అనేక కుటుంబాలలో సభ్యులందరూ పార్టీ పనిలో పూర్తి కాలం పని చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రియాజ్‌ విషయానికి వస్తే విజయన్‌ అల్లుడు గాక ముందే 2009 ఎన్నికల్లోనే సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈనెల 28న ముఖ్యమంత్రి కోజికోడ్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఐదు కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొంటారు. వాటిలో రియాజ్‌ పోటీ చేసే బైపూరు ప్రత్యేకంగా లేదు. దానితో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రచారాన్ని కోజికోడ్‌లోనే ఏర్పాటు చేశారు. రియాజ్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


బంధుగణం పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ వారే ఎక్కువగా ఉన్నారు. ఒక కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ కుమారులు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా దివంగత స్వతంత్ర ఎంఎల్‌ఏ కుమారుడు ఒకరు స్వతంత్ర అభ్యర్ధిగా ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమారుడు,ఎంపీ అయిన మురళీధరన్‌, కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉన్నారు.ఎన్‌సిపి మాజీ మంత్రి సోదరుడు, ఎల్‌డిఎఫ్‌ కన్వీనరు విజయరాఘవన్‌ సతీమణి బిందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనింజన్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులుగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్‌ నేత దిగంగత మణి కుమారుడు జోస్‌ మణి ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తుండగా ఆయన బావమరిది, మాజీ అయ్యేఎస్‌ అధికారి జోసెఫ్‌ యుడిఎఫ్‌ అభ్యర్ధిగా వేరేచోట ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఒక మాజీ స్పీకర్‌ కుమారుడు కూడా యుడిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరోసారి ఎల్‌డిఎఫ్‌దే అధికారం : మనోరమ, టైమ్స్‌ నౌ సర్వేల వెల్లడి

25 Thursday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala elections 2021, Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Kerala LDF, Manorama-VMR


ఎం కోటేశ్వరరావు


ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ-విఎంఆర్‌ సర్వే , టైమ్స్‌ నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి. మనోరమ ఫిబ్రవరి 15-మార్చి 15వ తేదీల మధ్య జరిపిన సర్వే ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 77, గరిష్టంగా 82 రానున్నాయని వెల్లడించారు. ఇదే విధంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 54-59, బిజెపికి మూడు, ఇతరులకు ఒకటి వస్తాయని పేర్కొన్నది. ఎల్‌డిఎఫ్‌కు 43.65, యుడిఎఫ్‌కు 37.37, బిజెపి కూటమికి 16.46, ఇతరులకు 2.52శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రిగా తగిన వ్యక్తిగా 39శాతం మంది పినరయి విజయన్‌కు ఓటు వేయగా తరువాతి స్ధానాలలో ఊమెన్‌ చాందీ (కాంగ్రెస్‌) 26, కెకే శైలజ(సిపిఎం), రమేష్‌ చెన్నితల(కాంగ్రెస్‌) 11, కె సురేంద్రన్‌(బిజెపి) ఐదు, వి.మురళీధరన్‌(బిజెపి) మూడు శాతం చొప్పున ఉన్నారు. తిరువనంతపురం జిల్లాలో పద్నాలుగు స్ధానాలుండగా 12 ఎల్‌డిఎఫ్‌ గెలుస్తుందని, రెండు బిజెకి రావచ్చని, కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదని సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న రెండింటిలో ఒకటి గత ఎన్నికల్లో గెలిచిన నీమమ్‌ స్ధానం ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కె. మురళీధరన్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తూ బిజెపి-కాంగ్రెస్‌ కుమ్మక్కు అనే ముద్రను తొలగించుకొనేందుకు చూస్తున్నారు. ఇక్కడ బిజెపికి 41.3శాతం, సిపిఎంకు 41.2 వస్తాయని సర్వేలో తేలింది. అయితే సర్వే సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరన్నది ఖరారు కాలేదు. బలమైన మురళీధరన్‌ను ఎంపిక చేసినందున దాని ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నది. ఇలాంటి తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. బిజెపి గెలుస్తుందని అంచనా వేసిన మరొక నియోజకవర్గం తిరువనంతపురం.గతంలో ఇక్కడ యుడిఎఫ్‌ గెలిచింది. ప్రస్తుతం బిజెపి 32.5, సిపిఎం 30.4, కాంగ్రెస్‌కు 25.2శాతం వస్తాయని పేర్కొన్నది.


ఈ సర్వే సమయంలో, తరువాత జరిగిన పరిణామాలన్నీ ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం మంజేశ్వరం నియోజక వర్గంలో బిజెపికి విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలు దానికి ఎదురు తగిలి ముస్లిం లీగుకు ఉపయోగపడతాయని తాజాగా మనోరమ విశ్లేషణ పేర్కొన్నది. ఈ నియోజకవర్గంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. కాసరగోడ్‌ జిల్లాలో కర్ణాటకు దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గంలో 53శాతం ఓటర్లు ముస్లింలే ఉన్నారు. కర్ణాటక నుంచి వస్తున్న బిజెపి నేతలందరూ కేవలం హిందూ ఓటర్లనే కలుస్తూ బిజెపిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తుండటంలో మిగిలిన వారు బిజెపిని ఓడించేందుకు సంఘటితం అవుతున్నారు.గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్లతో బిజెపి సురేంద్రన్‌ ఓడిపోయారు. మరోసారి ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించనున్నదనే వాతావరణం ఎల్లెడలా ఉండటం, మీడియా సర్వేలు కూడా దానినే నిర్ధారించటంతో ఓటర్లు ముస్లింలీగు వైపు మొగ్గుతారా లేక సిపిఎం వైపు చూస్తారా అన్నది ప్రశ్నార్దకంగా మారింది.గత ఏడు దఫాలుగా ఈ నియోజకవర్గంలో బిజెపి రెండవ స్దానంలో వస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయటం వరుసగా ఇది మూడవసారి, ఇక్కడ గెలిచే నమ్మకం లేకపోవటంతో పత్తానంతిట్ట జిల్లాలోని కొన్ని నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మంజేశ్వరంలో పదివేల మెజారిటీతో గెలుస్తానని సురేంద్రన్‌ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలీగ్‌ సభ్యుడు బంగారు ఆభరణాల కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నారు. ఈ కుంభకోణంలో బాధితులు అత్యధికులు ముస్లింలే. దీంతో ఆ పార్టీ నేతలు సమర్ధించలేని స్ధితిలో పడిపోయారు. దీంతో వేరొకరిని నిలిపారు. సిపిఎంకు ఆదరణ పెరగవచ్చని భావిస్తున్నారు. టైమ్స్‌ నౌ సర్వే వివరాలు కూడా తాజాగా వెలువడ్డాయి. దాని విశ్లేషణ ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు 77, యుడిఎఫ్‌కు 62, బిజెపికి ఒక స్ధానం వస్తుందని పేర్కొన్నారు.


ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : విఎస్‌ అచ్యుతానందన్

‌
రానున్న ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ తిరిగి విజయం సాధించనున్నదని మాజీ ముఖ్యమంత్రి, 97 సంవత్సరాల సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం వరదలు, ఓఖి, నిఫా, కరోనా వైరస్‌లను తట్టుకున్నదని చెప్పారు. విజయన్‌ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల గురించి చెబుతూ తన మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని, ఏకంగా ఒక కమిటీని కూడా వేశారని గుర్తు చేశారు. వచ్చిన ఆరోపణల మీద కేంద్ర సంస్ధలు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వమే కోరిన విషయాన్ని చెబుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి దర్యాప్తు సంస్దలను వినియోగిస్తున్నారని అన్నారు. విజయం సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి వామపక్ష ప్రజాతంత్రశక్తులు ఎంత చురుకుగా ఉన్నాయో సంఘవ్యతిరేక శక్తులు కూడా అదే విధంగా ఉన్నాయని అన్నారు. కేరళలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, దేశాన్ని అమ్మివేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయ పార్టీల పని తీరుతెన్నులు మారిపోయాయని, గతంలో ఇచ్చిన నినాదాలు ఇప్పుడు పని చేయవన్నారు. ఎప్పటికైనా రాజకీయనేతలకు మౌలిక విలువలు, త్యాగం, నిజాయితీ ముఖ్యమని వాటిని కాపాడుకొంటూ పని చేయటం ద్వారా వామపక్ష శక్తులు ముందుకు పోతాయని అన్నారు.


ఇడి మీద కేసుల ఎత్తివేతకు కోర్టు తిరస్కారం !


ముఖ్యమంత్రి, ఇతర అధికారపక్ష నేతలకు వ్యతిరేకంగా బంగారం స్మగ్గింగ్‌ కేసులో ఒక నిందితుడితో బలవంతంగా ప్రకటన చేయించటం, దాన్ని కోర్టులో సమర్పించిన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కేసును ఎత్తివేయాలని, దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని ఇడి చేసిన అభ్యర్ధనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పని చేస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తీరు తెన్నుల గురించి ప్రజలూ, ప్రభుత్వమూ గమనిస్తున్న విషయాన్ని ఆ సంస్ధ కూడా గుర్తించటం అవసరం అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు. అసలు వారెందుకు అలా ఎందుకు వ్యహరిస్తున్నారో మీరైనా తెలుసుకోండని విలేకర్లతో అన్నారు. దీని మీద సొసైటీ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ తాము సమదూరం పాటిస్తున్నామని, శబరిమల ఆలయం మీద ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నామని, పదిశాతం ఇబిసి రిజర్వేషన్లు అమలు జరపాలని, సంస్ధ నేత మన్మాత్‌ పద్మనాభన్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా చెప్పారు. కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్‌, ఇతర మతశక్తులతో కలసి సాగించిన ఆందోళనలో పద్మనాభన్‌ ఒక ముఖ్యపాత్రధారిగా ఉన్నారు.


ముదిమది తప్పిన మాజీ సిఎం ఎకె ఆంటోని వ్యాఖ్యలు !

ఏడాది తరువాత తిరువనంతపురంలోని కాంగ్రెస్‌ కార్యాలయ మెట్లెక్కిన మాజీ ముఖ్యమంత్రి ఏ కె ఆంటోని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ఆయనకు గర్వం ఎక్కువ, హిందువులు, ఇతర సామాజిక తరగతులను తప్పుదారి పట్టించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో కూడా ఆయనను అదుపు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. విజయన్‌ ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రతి సర్వేలోనూ వెల్లడి అవుతోంది. రెండో సారి అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే రెండు ప్రధాన మీడియా సంస్ధలైన మాతృభూమి, మళయాల మనోరమ తమ సర్వేల్లో వెల్లడించిన నేపధ్యంలో గందరగోళ పడిన ఆంటోని సహజంగానే తమ కార్యకర్తల మనోనిబ్బరాన్నికాపాడుకొనేందుకు పూనుకున్నట్లు స్పష్టం అయింది. తమ భవిష్యత్‌ బాగుండాలంటే విజయన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వవద్దని తాను నిజమైన కమ్యూనిస్టులను కోరుతున్నట్లు ఆంటోని చెప్పారు. ఇంతకాలంగా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. ఇప్పుడు పాడిందే పాడరా అన్నట్లు అంటోని కూడా పునశ్చరణ చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


మాకు బిజెపి ఓట్లు కావాలి : కాంగ్రెస్‌ నేత చెన్నితల !


బిజెపి అభ్యర్దులు లేని గురువాయూర్‌, తెలిచేరి నియోజకవర్గాలలో తమకు బిజెపి ఓట్లు కావాలని అంటాం తప్ప వద్దు అనేది లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రకరకాల కారణాల వలన వేర్వేరు పార్టీలకు ఓటు వేస్తారు, అందువలన ఫలానా పార్టీ వారి ఓట్లు వద్దు అనేది లేదన్నారు. కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కులో భాగంగానే ఈ నియోజకవర్గాలలో బిజెపి సరిగా నామినేషన్లు దాఖలు చేయలేదని, అన్ని చోట్లా సక్రమంగా వేసిన వారు ఇక్కడ ఎలా విఫలం అవుతారని సిపిఎం ప్రశ్నిస్తోంది. ఓటర్ల జాబితాల్లో అక్రమాల గురించి తాను ఐదు సార్లు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసినా స్పందించలేదని, అందువలన ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లున్న వారిని ఓటింగ్‌కు అనుమతించరాదని కోరుతూ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల హైకోర్టును ఆశ్రయించారు.
కొడంగనల్లూరు నియోజకవర్గంలో యుడిఎఫ్‌ అభ్యర్ధి శోభా సుబీన్‌కు రెండు నియోజకవర్గాలలో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సిపిఎం కార్యకర్తలు గుర్తింపు కార్డులతో సహా వివరాలను మీడియాకు అందచేశారు. ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు ఓటేసేందుకు అర్హత లేదంటున్న రమేష్‌ చెన్నితల తమ అభ్యర్ధి అసలు పోటీకి ఎలా అర్హుడో చెప్పాలని ప్రశ్నించారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న విషయం, ఎలా జరిగిందో తనకసలు తెలియనే తెలియదని సుబీన్‌ చెబుతున్నారు. ఒక వేళ ఎన్నికల సిబ్బంది తప్పు చేస్తే వారే దాన్ని సరిదిద్దాలని సుబీన్‌ అన్నారు. అదే సూత్రం ఇతర చోట్ల వర్తించదా అని రమేష్‌ చెన్నితలను సిపిఎం ప్రశ్నిస్తోంది.


గురువాయూర్‌ అనుకున్నా , నేత త్రిసూర్‌ అన్నారు: సురేష్‌ గోపి


తాను గురువాయూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని అయితే పార్టీ నేత (నరేంద్రమోడీ) త్రిసూర్‌ లేనా హరు అన్నారు, దాన్ని మన్నించి ఇక్కడ పోటీ చేస్తున్నా , ఇక్కడ ఓటర్లేమో త్రిసూర్‌ను మీకే ఇస్తున్నాం అని చెబుతున్నారని ప్రముఖ నటుడు సురేష్‌ గోపి చెప్పుకున్నారు. గురువాయూర్‌లో నామినేషన్‌ పత్రాలు సరిగా వేయని కారణంగా అసలు అక్కడ బిజెపికి అభ్యర్దే లేకుండా పోయారు.ఈ ఎన్నికల్లో శబరిమల ఒక అంశం కాదని అయితే మనోభావాలు ఉన్నాయని అన్నారు. వామపక్షాలు గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయి. వాటిని నిలిపివేయాలని కోరుతున్నా కాని అది అసాధ్యమని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. మరోవైపు శబరిమల గురించి చర్చించకూడదని కమిషన్‌ చెబుతోంది. పౌరుల విశ్వాసాలు, సంప్రదాయాలను కాపాడాలంటే శబరిమల గురించి చర్చించాలని అన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేస్తున్న క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మాట్లాడుతూ శబరిమల ఒక ప్రధాన ప్రచారఅంశమని చెప్పారు.


ఉగ్రవాదుల ఓట్లు వద్దంటున్న ఎంఎల్‌ఏ !


గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన వారిలో కొందరు మత ఉగ్రవాదులు ఉన్నారని తరువాత తనకు తెలిసిందని ఈ ఎన్నికల్లో వారి ఓట్లు తనకు వద్దని కొట్టాయం జిల్లాలో పూంజార్‌ నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తున్న పిసి జార్జి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఎరాట్టుపేట అనే ప్రాంతంలో కొందరు జార్జి ప్రచారాన్ని అపహాస్యం చేయటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాంటి వారి ఓట్లతో తాను ఎంఎల్‌ఏ కావాలనుకోవటం లేదని మీడియాతో చెప్పారు.
తమకు అధికారమిస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు ఐదేసి ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అలాగే వృద్దాప్య పెన్షన్‌గా మూడున్నరవేల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు జరపని ఈ పధకాలను కేరళలో ఎలా అమలు జరుపుతారంటూ నెటిజన్లు స్పందించారు. ఒక వైపు కేంద్రంలో ఉన్న సర్కార్‌ ఉన్న గ్యాస్‌ సబ్సిడీనే ఎత్తివేస్తుంటే వీరు ఆరు సిలిండర్లు ఉచితం అంటే కేరళీయులు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.శబరిమలలో ఆచారాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని వాగ్దానం చేసింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగులేని ఎల్‌డిఎఫ్‌ – తాజా సర్వే సైతం నిర్ధారణ !

21 Sunday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF, LDF is going to win


ఎం కోటేశ్వరరావు


గతంలో వెల్లడైన సర్వేలు, తాజాగా వెల్లడైన మాతృభూమి సర్వే కూడా ఎల్‌డిఎఫ్‌ విజయాన్ని నిర్ధారించిందని అయితే కార్యకర్తలెవరూ ఆదమరిచి ఉండరాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌డిఎఫ్‌కు 75-83, యుడిఎఫ్‌కు 56-64 మధ్య, బిజెపికి రెండు వస్తాయని మాతృభూమి సి ఓటర్‌ సర్వే తాజాగా పేర్కొన్నది. అన్ని సర్వేల సారం ఎల్‌డిఎఫ్‌ కొనసాగింపేనని, సిపిఎం చెప్పింది నిజమని వెల్లడిస్తున్నాయని, అయితే గట్టిపోటీ జరగనున్నందున కార్యకర్తలు జాగరూకులై ఉండాలని బాలకృష్ణన్‌ చెప్పారు.
కేరళ విభాగం పని తీరుపట్ల కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో ఎల్‌డిఎఫ్‌ ఎంతో ముందున్నదని కాంగ్రెస్‌ కిలోమీటర్ల దూరం వెనుక ఉందని, చేస్తున్న ప్రచారం కూడా క్రమశిక్షణతో లేదని పద్దతి ప్రకారం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(మణి) బయటకు పోవటాన్ని తీవ్రంగా పరిగణించలేదని, పది సీట్లలో పోటీ చేస్తూ మిగిలిన జోసెఫ్‌ వర్గానికి పోటీ చేసేందుకు అసలు గుర్తే లేకపోయినా పట్టించుకోలేదని మండిపడింది. గత మూడు ఎన్నికల్లోనూ పార్టీకి 40సీట్లకు మించి రాలేదని, ఈ సారి 50 వస్తాయని ఏవిధంగా చెబుతున్నారని అడిగింది. ఎల్‌డిఎఫ్‌ కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంటే దానికి ధీటుగా పార్టీ సమాధానం లేదని పేర్కొన్నట్లు వెల్లడైంది.ఫిరాయింపుల నిరోధక చట్టం వేటును తప్పించుకొనేందుకు నామినేషన్లు దాఖలు చేసే ముందు జోసెఫ్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఏలు పిజె జోసెఫ్‌, మనోజ్‌ జోసెఫ్‌ ఎంఎల్‌ఏలుగా రాజీనామా చేశారు.

శబరిమల వివాదాన్ని ముందుకు తెచ్చే యత్నం !


ప్రస్తుతం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్న శబరిమల అయ్యప్ప దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ సమస్యపై లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి రెండూ ప్రయత్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్నే తీసుకువస్తామని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ సమస్య ప్రస్తావనే లేకుండా అంతకు ముందు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రణాళికను వెల్లడించింది. ” మతశక్తులను ప్రతిఘటించేందుకు,ఓడించేందుకు దైవం పట్ల విశ్వాసం ఉన్నవారు కూడా ఒక ఐక్య సంఘటనగా ముందుకు రావాలి. అన్ని మతాల విశ్వాసుల నమ్మకాలను రక్షించేందుకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అన్ని చర్యలూ తీసుకుంటుంది.ఏ మతం పట్ల విశ్వాసం లేని వారు కూడా ప్రశాంతంగా జీవించేందుకు వీలుకల్పిస్తుంది. ” అని పేర్కొన్నది. తమ ప్రభుత్వం పట్ల విశ్వాసులు ఎలాంటి సందేహాలను పెట్టుకోనవసరం లేదని, శబరిమల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత దాని అమలు గురించి అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదే పదే ప్రభుత్వ, సిపిఎం వైఖరినీ స్పష్టం చేస్తున్నారు. సమస్య సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ అంశం అసలు చర్చనీయాంశమే కాదన్నారు. ఇది రాస్తున్న సమయానికి బిజెపి ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అయితే దాని అజెండా బహిరంగమే కనుక శబరిమల అంశం లేకుండా ఉండదన్నది స్పష్టం. బిజెపికి మద్దతు ఇస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ శబరిమల అంశాన్ని ఎన్నికల్లో ముందుకు తెచ్చే యత్నాల్లో భాగంగా రాజధాని తిరువనంతపురంలో నామజపం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా నామజపం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హింసాకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం జరిగిన ఉదంతాలు తనతో సహా అందరినీ బాధించాయని, జరిగి ఉండాల్సింది కాదని దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన వ్యాఖ్యలను రచ్చ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయి. సంక్షేమ-అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో అమలు జరపనున్న కార్యక్రమాలతో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం !


కమ్యూనిస్టులను రెచ్చగొట్టటం, ప్రతిఘటిస్తే తమపై దాడులు చేశారంటూ యాగీ చేయటం కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఎత్తుగడల్లో భాగం అన్నది విమర్శ. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా అమలు జరిపేందుకు పూనుకున్నారు. తిరువాన్కూర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి తిరస్కరించిన సిపి రామస్వామి అయ్యర్‌ చర్యకు నిరసనగా జరిగిన పోరు పున్నప్ర-వయలార్‌ పోరాటంగా ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. నైజాం సంస్ధానంలో దోపిడీ నుంచి విముక్తికోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడితే అదే సమయంలో కేరళలో 1946లో సంస్దాన విలీనం కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన పోరులో వెయ్యిమందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం మరణించారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అలప్పూజలో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు. దాన్ని సిపిఎం-సిపిఐ రెండూ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అలప్పూజ బిజెపి అభ్యర్ధి సందీప్‌ వాచస్పతి అక్కడికి వెళ్లి అంజలి ఘటించారు. కమ్యూనిస్టు అమరజీవులను గౌరవిస్తూ ఎవరైనా ఆపని చేస్తే అభ్యంతరం లేదు. కానీ భారతమాతాకి జై అనే నినాదాలతో కమ్యూనిస్టుల నాయకత్వాన పోరు పేరుతో అమాయక దళితుల, వెనుకబడిన తరగతుల వారి ప్రాణాలను బలిపెట్టారని, కమ్యూనిస్టునేతలు పారిపోయి అతి పెద్ద ద్రోహం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులను రెచ్చగొట్టేందుకు తప్ప మరొకందుకు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి కుట్రను గ్రహించిన కార్యకర్తలు ఎంతో సంయమనం పాటించారని అభినందించారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి మనోభావాలను బిజెపి గాయపరచిందని అన్నారు. స్మారక కేంద్రంలోకి అక్రమంగా చొరబడ్డారని సిపిఎం విమర్శించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్ధి చర్యకు నిరసనగా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన జరుపుతుండగా వారిని రెచ్చగొట్టేందుకు పక్కనే ఉన్న మరొక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ది అనూప్‌ అంటోని పనిగట్టుకొని ప్రదర్శనవైపు రాగా కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దాన్ని తనపై దాడిగా చిత్రిస్తూ ఆసుపత్రిలో చేరటం వంటి నాటకానికి తెరలేపారని విమర్శలు వచ్చాయి. ఆంటోని కారు బానెట్‌ను కొందరు కొట్టారు తప్ప అతని మీద భౌతికదాడి జరగలేదని పోలీసులు ప్రకటించారు.

పినరయి విజయన్‌ ప్రచార తీరే వేరు !


ఎన్నికలలో పినరయి విజయన్‌ ప్రచార తీరు ఎందరినో ఆకర్షిస్తున్నది. రాజకీయంగా వ్యతిరేకించే మీడియా కూడా దాన్ని గుర్తించింది. విజయన్‌ కొన్ని సెకండ్ల పాటు ఒక సారి తన చేతి వాచ్‌ను చూశారంటే కార్యక్రమం ప్రారంభం లేదా ముగిసినట్లే లెక్క. పత్రికా గోష్టి అయినా, మరొక కార్యక్రమం అయినా నిర్ణీత ప్రకారం ముగియాల్సిందే.ప్రారంభం కూడా అంతే. పత్రికా గోష్టికి 45నిమిషాలు,దానిలో ప్రశ్నలు, సమాధానాలకు పదిహేను నిమిషాలు, ఎన్నికల ప్రసంగం 45నిమిషాల్లో ముగియాల్సిందే. నలభైమూడు నిమిషాలు అభివృద్ధి, ఇతర అంశాలను మాట్లాడిన తరువాత చివరి రెండు నిమిషాల్లో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులకు ఓటు ఎందుకు వేయాలో అభ్యర్ధిస్తారు. విజయన్‌ ప్రాంగణంలోకి రాగానే నినాదాలు, ఈలలు మోతలతో హౌరెత్తుతుంది. వేదిక మీదకు వస్తుండా అప్పటికే ఉన్న నేతలు గౌరవ సూచకంగా లేచి నిలుచుంటారు. వెంటనే ఒక చిన్న పాప వచ్చి గులాబి పువ్వు అంద చేసిన తరువాత పిడికిలి బిగించి అభివాదం చేస్తుంది. ముళ్లు ఏవైనా ఉంటే గుచ్చుకోకుండా విజయన్‌ దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. విజయన్‌కు ప్రత్యేకంగా ఒక మైక్‌ను అమరుస్తారు, దాన్నే తరువాత సభలకూ తీసుకువెళతారు. సభికులు ఎంతో క్రమశిక్షణగా కూర్చుని వుపన్యాసాలను వింటారు. అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఉదయం ఒక విషయం చెబితే సాయంత్రం బిజెపి నేతలు వాటినే చెబుతారు. బిజెపి నేతలు ఉదయం చెప్పిన వాటిని కాంగ్రెస్‌ నేతలు సాయంత్రం చెబుతారు, రెండు పార్టీలు పరస్పరం ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెండు పార్టీల తీరుతెన్నులను వర్ణించారు.

మూడు చోట్ల బిజెపికి నామినేషన్ల ఎదురుదెబ్బ !


మూడు నియోజకవర్గాలలో బిజెపికి నామినేషన్ల సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక తలసెరి, గురువాయూర్‌, దేవీకుళంలో సరిగా లేని కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. మూడు చోట్లా డమ్మీ అభ్యర్దులు లేకపోవటం లేదా వారి నామినేషన్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామంపై పార్టీ కేంద్ర నేతలకు ఏ కారణం చెప్పాలా అని తలలు పట్టుకుంటున్నారు. కన్నూరు జిల్లాలో గత ఎన్నికల్లో తలసెరిలో 22వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఈనెల 25న అక్కడ అమిత్‌ షా సభ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అసలు అభ్యర్దే లేకపోవటంతో ఏమి చెయ్యాలో తోచని స్ధితిలో పడ్డారు.తలసెరి నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలుత సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన విఆర్‌ కృష్ణయ్యర్‌ సిపిఐ తరఫున 1957, 1960లో గెలిచారు. అప్పటి నుంచి మధ్యలో ఒకసారి సిపిఐ అభ్యర్ధి తప్ప ఇంతవరకు సిపిఎం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి ఇకె నయనార్‌, ఐదుసార్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియర్‌ బాలకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో సక్రమంగా నామినేషన్లు వేసిన బిజెపి తలసెరీలో తప్పులతడగా వేయటం వెనుక కాంగ్రెస్‌తో కుమ్మక్కును వెల్లడిస్తున్నదని సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ చెప్పారు. దేవీకుళంలో బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు సీటు ఇవ్వగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధిని బలపరచాలని బిజెపి నిర్ణయించింది. తలసెరి, గురువాయూర్‌ సీట్ల గురించి హైకోర్టుకు ఎక్కింది.

ప్రత్యర్ధుల వలలో పడవద్దు -సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎల్‌డిఎఫ్‌ సూచన !


ప్రత్యర్ధి పార్టీలు, వ్యక్తులు రెచ్చగొట్టేందుకు పూనుకుంటారని అందువలన వారికి సమాధానం ఇచ్చే పేరుతో వారి వలలో చిక్కుకోవద్దని ఎల్‌డిఎఫ్‌ తన సామాజిక మాధ్యమ కార్యకర్తలకు సూచింది. ప్రత్యర్ధులపై దూషణలకు పాల్పడవద్దని, అసలు వారి గురించి పట్టించుకోవద్దని, ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను గుళికలుగా విడగొట్టి సులభంగా, వెంటనే చదువుకొనే విధంగా తయారు చేసి ప్రచారం చేయాలని పేర్కొన్నది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ నీమమ్‌ నియోజకవర్గంలో పోటీ చేయకుండా పుతపల్లికే పరిమితం కావాలని కొందరు కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన విషయం తెలిసిందే. దాని మీద ఊమెన్‌ చాందీ ఇంటి మీది పెంకులను మరమ్మతు చేసేందుకు యుడిఎఫ్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తూ పెట్టిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాని ఎల్‌డిఎఫ్‌ కోరింది. అలాగే పున్నప్ర-వయలార్‌ కమ్యూనిస్టు అమరజీవుల స్మారకకేంద్రంలో ప్రవేశించిన బిజెపి అభ్యర్ధి జనం, కార్యకర్తల మనోభావాలను గాయపరచినప్పటికీ అతగాడిని తూలనాడుతూ కొందరు పోస్టులు పెట్టటం మంచిది కాదని, ప్రత్యర్ధుల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.

మైనారిటీ మతాల సంతుష్టీకరణ పనిలో బిజెపి !


మైనారిటీ మతాల వారికి పూర్తి మద్దతు ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెప్పారు. జాకోబిన్‌ చర్చి వివాదంలో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, దగ్గరిదారులు లేవని అయితే ఆర్దోడాక్స్‌ వర్గానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ముస్లింలీగు, బిజెపి కుమ్మక్కయిన మాట నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పడవేశాయి. ఆయనను విమర్శించలేని-సమర్ధించలేని స్దితిలో పడిపోయారు. తాను మాట్లాడే మాటలు వాటి విలువ ఏమిటో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో రాజగోపాల్‌ తెలుసుకోవటం లేదని బిజెపి సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ వినియోగించటాన్ని ముకుందన్‌ తప్పుపట్టారు. సురేంద్రన్‌ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగలేదు. హెలికాప్టర్‌ వినియోగాన్ని కార్యకర్తలు మెచ్చరు అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపికి తీవ్ర ఆశాభంగం కలిగించిన అయ్యప్ప !

12 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Kerala elections 2021, #Pinarayi Vijayan, Ayyappa-Pandalam palace, BJP-Kerala, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళామే హమ్‌ దేఖేంగే !

06 Saturday Mar 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP-Kerala, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: