• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Kerala LDF

హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !

20 Friday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Haj quota, Kerala CPI(M), Kerala LDF, Narendra Modi, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు హజ్‌ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ నుంచి హాజ్‌ యాత్రకు భారత్‌ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్‌ హాజ్‌ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్‌ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్‌ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్‌ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్‌ సభలో హజ్‌ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్‌ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.


అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్‌ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్‌ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్‌ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్‌ సంజాయిషి ఇచ్చుకున్నారు.


మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌
కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్‌ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్‌ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్‌ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్‌ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్‌ అహంకారంతో మాట్లాడారు.


ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమా థామస్‌, మాజీ సిఎం ఊమెన్‌ చాందీ తదితర కాంగ్రెస్‌ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్‌ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్‌ జోసెఫ్‌ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.


పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్‌ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్‌, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.


సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్‌ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్‌ షెజిన్‌, జోస్నా మేరీ జోసెఫ్‌ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్‌ జీహాద్‌ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్‌ కన్నోత్‌ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్‌,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్‌ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్‌ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్‌ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్‌ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్‌ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

12 Thursday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala LDF, Thrikkakara by-election, UDF Kerala


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్ధలో దొంగబంగారం కేసు నిందితురాలు – పక్కా బిజెపి ప్రతినిధిగా కేరళ గవర్నర్‌ !

18 Friday Feb 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్‌ పార్క్‌ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్‌ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌ కృష్ణ కుమార్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.


హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కెజి వేణుగోపాల్‌ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.


కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్‌ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్‌ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్‌ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.


శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్‌ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్‌ గోబాక్‌ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్‌ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్‌ అవమానంగా భావించి భరించలేకపోయారు.


మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్‌ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్‌ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్‌ ప్రసంగంపై సంతకం చేశారు.


గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్‌ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్‌ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బిజెపిలో చేరారని, గవర్నర్‌ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్‌ సొమ్ము ఖాన్‌ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్‌ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్‌- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత విడి సతీషన్‌ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్‌ పని చేస్తున్నారని విమర్శించారు.


దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్‌(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్‌ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్‌ దేవ్‌ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ : రచ్చకీడ్చిన కేరళ గవర్నర్‌, బిజెపి – కాంగ్రెస్‌లో చిచ్చు !

02 Sunday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

D.Litt to President row, governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, Ramesh Chennithala


ఎం కోటేశ్వరరావు


రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్‌ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్‌ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్‌ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇవ్వాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్‌ సిఎల్‌పి మాజీ నేత రమేష్‌ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్‌ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్‌ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్‌ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్‌ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్‌ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.


కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్‌ రవీంద్రన్‌ పునర్నియాకాన్ని గవర్నర్‌ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్‌ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్‌ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్‌ చెప్పాలి, కానీ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్‌ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్‌ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్‌ గౌరడాక్టరేట్‌ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్‌ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందిస్తూ గవర్నర్‌ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్‌ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్‌ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్‌ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.


రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్‌ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్‌ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు.


షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మైనారిటీ స్కాలర్‌ షిప్‌ల సమస్య : కేరళ ప్రభుత్వ సూత్రబద్దవైఖరి !

19 Monday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP-Kerala, Kerala LDF, Kerala Minority Scholarship issue, Muslim League, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

25 Friday Jun 2021

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, COVID- 19 pandemic, excess corona death trends, Kerala Corona Deaths, Kerala LDF


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు దేవుళ్ల వరాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala Congress Blame Game, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


తామేం చేసినా, ఏం మాట్లాడినా జనం గతం మాదిరి అధికారం అప్పగించక తప్పుదు అన్నట్లు వ్యవహరించిన కేరళ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఓటమికి మీరు బాధ్యులంటే కాదు మీరే అనే కీచులాటలకు దిగారు. అధికారం ఖాయం అన్న ఆశతో మీతో పాటు ఐదేండ్లు ఎదురు చూశాము, మీ తీరు తెన్నులతో మరో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఎలా కూర్చోవాలి, అసలు ఆ తరువాతైనా అధికారానికి వస్తామా అన్నది అనుమానమే అన్నట్లుగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు మధనపడుతున్నాయి. పైపై మెరుగులు కాదు సమూల ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి వత్తిడి వస్తోంది. ఇరవై మంది ప్రస్తుత ఎంఎల్‌ఏలను నిలిపితే ముగ్గురే ఓడిపోయారు, కొత్త ముఖాల పేరుతో 50 మందిని రంగంలోకి రప్పిస్తే గెలిచింది ఇద్దరే , ఎందుకీ పని చేశారు అని అడుగుతున్నారు. ఓటమికి అందరూ బాధ్యులే అయితే నన్ను ఒక్కడినే బలిచేసి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు పూనుకుంటారా అని ముళ్లపల్లి రామచంద్రన్‌ ఆగ్రహించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కోరితే రాజీనామాకు సిద్దం, అదే విషయం చెప్పాను అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడేమో దానికి బాధ్యత నాది అని ఎవరూ చెప్పలేదు, ఇప్పుడేమో అంతా మీరే చేశారు అన్నట్లు ప్రతివారూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర నాయకత్వం ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకుంది, అందువలన ప్రతివారూ దీనికి బాధ్యులే, నన్ను అవమానించి పార్టీ నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కష్టకాలంలో పార్టీ వదలి వెళ్లాననే అభిప్రాయం రాకుండా ఉన్నాను, పార్టీ అధినాయకత్వం అనుమతిస్తే వెంటనే రాజీనామా చేస్తా అన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌కు వ్యతిరేకంగా తిరువనంత పురంలో బ్యానర్లు వెలిశాయి. ఆయన ఎప్పుడూ నిద్రపోతున్నట్లు ఉంటారని, అలాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా పనికిరారని హిబి ఇడెన్‌ అనే నేత ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఠా తగాదాలే ఓటమికి ముఖ్యకారణమని కేరళ కాంగ్రెస్‌ నేత పిజె జోసెఫ్‌ విమర్శించారు. ముళ్లపల్లి రామచంద్రన్‌, రమేష్‌ చెన్నితల ఇద్దరినీ ఆ పదవుల నుంచి తప్పించి కొత్త వారిని ఎన్నుకోవాలని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ చొరవతో జరిగిన ఒక సమావేశంలో ఒక వర్గం అభిప్రాయంపడింది.
పిసిసి అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతను మార్చాల్సిందే అయితే అది ఉన్నవారిని బలవంతంగా తొలగించారనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని పార్టీ నాయకత్వం చూస్తోంది. కరోనా వలన ఎల్‌డిఎఫ్‌కు లబ్ది చేకూరింది, అందువలన పార్టీ ఓటమికి ఎవరినీ నిందించనవసరం లేదని కన్నూరు ఎంపీ కె సుధాకరన్‌ చెప్పారు. కరోనా కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చురుకుగా పనిచేయలేకపోయారు. కానీ అలాంటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ సృష్టిలో సిపిఎం విజయవంతమైంది.వారి మాదిరి ఏ పార్టీ జనానికి మద్దతు ఇవ్వలేదు, అది ఈ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిందని సుధాకరన్‌ చెప్పారు. ప్రతిపక్ష నేతగా రమేష్‌ చెన్నితల బాగా పని చేశారని, అయితే దాన్ని పార్టీ వినియోగించుకోలేకపోయిందన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని అనేక మంది సుధాకరన్ను కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ అంతరించదని యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన నీమమ్‌ నియోజకవర్గంలో మూడవ స్దానంలో నిలిచిన కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు వి మురళీధరన్‌ చెప్పారు. తమ ఓట్లశాతం పెరిగిందని, అయితే బిజెపి ఓట్ల శాతం తగ్గిపోవటం పట్ల ముఖ్యమంత్రి విజయన్‌ ఎక్కువ ఆందోళన వ్యక్తం చేశారని అరోపించారు.యుడిఎఫ్‌ను అంతం చేసేందుకు ఒక సాధనంగా బిజెపిని ఉపయోగించుకుంటున్నారని చెప్పుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ బిజెపి ఎదిగేది లేదన్నారు. యుడిఎఫ్‌లో రెండవ పెద్ద పార్టీ అయిన ముస్లింలీగులో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవటానికి నాయకత్వమే కారణమని, కొందరు నేతలు వారిలో వారు పదవులను పంచుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వటం లేదని ధ్వజమెత్తుతున్నారు. బలమైన స్దానాల్లో ఓటమి కారణాలు వెల్లడించాలని కోరుతున్నారు.

బిజెపి కూటమిలోనూ కీచులాటలు !


ఉన్న ఒక్క సీటు పోగొట్టుకోవటంతో పాటు ఓట్లు కూడా గణనీయంగా తగ్గిన ఎన్‌డిఏ కూటమిలోనూ కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఎన్‌డిఏ రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న భారత ధర్మ జనసేన (బిడిజెఎస్‌) తుషార్‌ వెల్లపల్లి రాజీనామాకు సిద్దపడినట్లు, బిజెపితో కొనసాగాలా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు. కేంద్ర ప్రభుత్వ బోర్డులు, కమిటీలలో తమకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్న వాగ్దానాన్ని బిజెపి నిలబెట్టుకోలేదని, తాము పోటీ చేసిన చోట బిజెపి నేతలు ప్రచారం చేయలేదు, కార్యకర్తలు ఓట్లుకూడా వేయలేదని ఆ పార్టీ చెబుతోంది. ఒకవేళ బిడిజెస్‌ ఎన్‌డిఏ నుంచి బయటకుపోయి ఎల్‌డిఎఫ్‌లో చేరినా తమకు జరిగే నష్టం ఏమీ లేదని బిజెపి నేత ఒకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక పేర్కొన్నది.

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు వరాలు !

అసెంబ్లీ ఎన్నికల సమయంలో శబరిమల అయ్యప్ప, ఇతర దైవ సంబంధ అంశాలను ముందుకు తెచ్చి కాంగ్రెస్‌, బిజెపి తీవ్రంగా ప్రయత్నించాయి. పోలింగ్‌ జరుగుతుండగా నాయర్‌ సర్వీసు సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయ్యప్ప శాపం తగిలిన ప్రభుత్వం రెండవ సారి అధికారానికి రాదని, జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అయ్యప్ప ఇతర దేవుళ్లందరూ ఎల్‌డిఎఫ్‌తో ఉన్నారని ఫలితాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. పుణ్యక్షేత్రాలుగా, ప్రాంతాలుగా పేరున్న తొమ్మిది పట్టణాలు లేదా నియోజకవర్గాలు, ప్రతిపక్ష కూటమికి కంచుకోటలుగా భావించిన చోట కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు పెద్ద మెజారిటీలతో విజయాలు సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శబరిమల ప్రాంతం ఉన్న కొన్ని నియోజకవర్గంలో యుడిఎఫ్‌ గెలిచింది. అయితే శాసనసభ్యుడి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో 23 సంవత్సరాల తరువాత సిపిఎం గెలిచింది. తిరిగి తాజా ఎన్నికలలో ఎనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయ్యప్ప పేరుతో పాగా వేయాలని చూసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడ మూడవ స్ధానంలో నిలిచారు. త్రిసూర్‌లో వడక్కున్హా పేరుతో ఉన్న శివాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గతసారి సిపిఐ గెలిచి, ఈ సారి కూడా విజయం సాధించింది. సినిమా హీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమార్తె పద్మజ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. సురేష్‌ గోపి మూడవ స్ధానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రార్ధనా స్ధలాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన అనంత పద్మనాభ స్వామి ఉన్న తిరువనంతపురంలోని నియోజకవర్గంలో దీర్ఘకాలం తరువాత కాంగ్రెస్‌ను ఓడించి సిపిఎం విజయం సాధించింది. ఇక్కడ కూడా బిజెపికి మూడవ స్ధానమే. ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయూర్‌లో యుడిఎఫ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ పోటీ చేశారు. అక్కడ బిజెపి నామినేషన్‌ చెల్లకపోవటంతో ఆయన విజయం సాధించాలని సురేష్‌ గోపి బహిరంగంగానే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇక్కడ కూడా ఎల్‌డిఎఫ్‌ గెలిచింది. వైకోం మహదేవ దేవాలయం, శ్రీ కురుంబ భగవతి వంటి ప్రముఖ క్షేత్రాలలో కూడా ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది.
ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రలో భాగంగానే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ కాంగ్రెస్‌-బజెపిలతో చేతులు కలిపారని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ దేశాభిమాని పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.మతపరమైన చీలిక తెచ్చే విధంగా ఆయన ప్రకటనలు చేశారని విమర్శించారు. తాము ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకం కాదని తన మాటలను వక్రీకరించారని సుకుమారన్‌ నాయర్‌ ఆరోపించారు. అయితే నాయర్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌, బిజెపి సమర్ధించాయి.
కొన్ని సంస్ధలు ఎన్నికల అనంతరం జరిపిన సర్వేల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మతాలలో ఉన్న పేదలు, బడుగు జీవులు ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేసినట్లు తేలింది. కొన్ని చోట్ల గతం కంటే ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు ఎక్కువగా ఓటు చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులు అత్యధికులు కమ్యూనిస్టులకు ఓటు వేశారు.

ఇరవైన విజయన్‌ ప్రమాణస్వీకారం !

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ముగిసిన తరువాతనే ఈనెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడ నుంది ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు పూర్తి స్ధాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. పదిహేడవ తేదీన ఎల్‌డిఎఫ్‌ సమావేశం పద్దెనిమిదిన సిపిఎం కార్యదర్శివర్గ సమావేశం, పందొమ్మిదవ తేదీన మంత్రివర్గ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రికి తీర్మానం అందచేత, ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.ఈలోగా వివిధ పార్టీలకు కేటాయించే మంత్రుల సంఖ్య, శాఖల కేటాయింపులో మార్పుల గురించి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రద్దయిన మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగాక 19 మంది మంత్రులు ఉన్నారు. ఈ సారి ఒక ఎంఎల్‌ఏ ఉన్న పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే మంత్రుల సంఖ్య 21కి పెరగవచ్చు.గతంలో యుడిఎఫ్‌ మంత్రివర్గంలో 21 మంది మంత్రులు ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: