• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Kerala UDF

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చివరిక్షణంలో ప్రత్యర్ధుల ప్రచార బాంబు : పినరయి విజయన్‌ హెచ్చరిక !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala UDF, Narendra Modi, Priyanka gandhi, propaganda bomb in last minute


ఎం కోటేశ్వరరావు


సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రచార బాంబు ప్రయోగం కేరళ ఓటర్ల మీద జరగబోతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాసరగోడ్‌ ఎన్నికల సభలో హెచ్చరించారు. అదేమిటి ? ఎలా ఉండబోతున్నది అనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విజయన్ను ప్రశ్నించాలని, విజయన్‌ కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ కోరారు. కొంత మంది రాబోయే రోజుల్లో పెద్ద బాంబు పేలబోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి బాంబులనైనా ఎదుర్కొనేందుకు మన నేల సిద్దంగా ఉందని, అలాంటి ప్రచారాల ఉద్దేశ్యం ఏమిటో జనానికి తెలుసునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవాల ముందు ఎంత పెద్ద అబద్దమైనా నిలవదని, నిజాలేమిటో బయటకు వచ్చేంత వరకే అలాంటివి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో అబద్దాలను ప్రచారంలోకి తెస్తే జవాబు చెప్పేందుకు అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారని, సమాధానం చెప్పేందుకు తగిన వ్యవధి ఉండదు, అబద్దాలు మనల్నేమీ చేయకపోయినప్పటికీ , వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వాటి పట్ల ఎల్‌డిఎఫ్‌ కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్‌ కోరారు.


ప్రచార బాంబు ఏమై ఉంటుంది అన్న చర్చ అంశాల సారాంశం ఇలా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్దలు దొంగబంగారం, డాలర్ల కేసుల్లో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల మేరకు ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు. విచారణకు హాజరు కావాలని ఎన్నికలకు ముందు రోజు నోటీసులు జారీ చేయవచ్చు. వామపక్ష సంఘటన నేతల కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని కంపెనీలపై ఐటి, ఇతర దాడులు జరగవచ్చు. పెరియ ప్రాంతంలో జరిగిన జంట హత్యల కేసులో సిబిఐ సంచలనాత్మకంగా ఆరోపణలు చేయవచ్చు. ఇలా పరిపరి విధాల చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ అగ్రనేతలు, కార్యకర్తలు కుటుంబాల ఆత్మీయ సమావేశాలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమంలో ముమ్మరంగా నిమగమయ్యారు. ఏప్రిల్‌ ఆరవ తేదీ పోలింగ్‌ కనుక రెండు రోజుల ముందుగా బహిరంగ ప్రచార కార్యక్రమం ముగియనున్నది.


ముఖ్యమంత్రి చెబుతున్న బాంబు ఆ పార్టీలోనే పేల నున్నదని, కన్నూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను విజయన్‌ పక్కన పెట్టారని వారి కోసమైనా ఇడి అధికారులు విజయన్‌ను విచారించాలని, ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అన్నారు. ఇడి కనుక విజయన్ను ప్ర శ్నించకపోతే మోడీ-అమిత్‌ షా తమ ప్రతిష్టను కోల్పోతారని చెప్పారు.

నీమమ్‌లో తెరిచిన బిజెపి ఖాతా మూత !


గత ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గంలో విజయం ద్వారా బిజెపి తెరిచిన ఖాతా ఈసారి మూసివేయక తప్పదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గతం కంటే ఎల్‌డిఎఫ్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా వివాదాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులుగా తయారయ్యారన్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్ధలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్దంగా లేవని, వారు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అభివృద్ది గురించి జనానికి తెలుసునని, ఏప్రిల్‌ ఆరవ తేదీన తగిన జవాబు ఇస్తారని చెప్పారు. పినరయి విజయన్‌తో కేరళలో సిపిఎం అధికారం కుప్పకూలుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే త్రిపుర, బెంగాల్లో దాని ఖాతాను మూసివేశామని త్వరలో కేరళలో కూడా అదే జరుగుతుందన్నారు. దొంగబంగారం కేసులో అనుచితంగా వ్యవహరించిన ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కేసు నమోదు చేశామని, అప్రూవర్‌గా మారిన సందీప్‌ నాయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ పోలీసులు రాష్ట్ర హైకోర్టును కోరారు. ఇడి అధికారి రాధాకృష్ణన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను వ్యక్తిగతంగా వ్యహరించటం లేదని అందువలన తనపై నమోదు చేసిన కేసును తిరస్కరించాలని కోరారు.

దొంగ ఓట్లకు హైకోర్టు తెర – రమేష్‌ చెన్నితల నోటికి మూత !

దొంగ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చేసిన ఫిర్యాదులకు హైకోర్టు తెరవేసింది. అలాంటి ఓటర్లు ఎవరైనా వస్తే వారి ఫొటో, అఫిడవిట్‌ తీసుకొని నమోదు చేయాలని, వారి వేలు మీద వేసిన సిరా ఎండిపోయిన తరువాతే వారిని పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పోనివ్వాలని హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి ఓట్ల గురించి తీసుకోదలచిన చర్యల వివరాలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ తరుణంలో ఓటర్ల జాబితాలను సవరించటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. అలాంటి ఓటర్ల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రకటిస్తామని రమేష్‌ చెన్నితల చెప్పారు. కోర్టు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. రమేష్‌ చెన్నితల ఫిర్యాదు మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ఎన్నికల కమిషన్‌ చర్యకు హైకోర్టు అడ్డుకట్టవేసింది. విద్యార్దులు, ఇతరులకు ప్రత్యేక కోటా కింద బియ్యం పంపిణీ చేయవచ్చని, అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో కూడా రమేష్‌ చెన్నితలకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రధాని చౌకబారు ప్రచారం-క్రైస్తవ ఓటర్ల సంతుష్టీకరణ యత్నం !

ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారం సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి క్రైస్తవ ఓటర్లను సంతుష్టీకరించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. కొంత వెండి కోసం యూదులు ఏసు ప్రభువుకు ద్రోహం చేశారని అలాగే బంగారం కోసం ఎల్‌డిఎఫ్‌ జనాన్ని మోసం చేసిందని నరేంద్రమోడీ చెప్పారు. ఒక ఐదు సంవత్సరాలు యుడిఎఫ్‌, మరొక ఐదు సంవత్సరాలు ఎల్‌డిఎఫ్‌ రాష్ట్రాన్ని దోచుకొనే విధంగా పంచుకున్నారని ఇప్పుడు బిజెపి వచ్చినందున అదింకేమాత్రం సాగదని మోడీ అన్నారు. పాలక్కాడ్‌లో పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ శ్రీధరన్‌ అధికారం కావాలనుకుంటే రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో చేరి ఉండేవారన్నారు. శబరిమల సమస్య రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినవని , వాటిని కాపాడేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అరెస్టయ్యారని, ఆ సమయంలో యుడిఎఫ్‌ మౌనంగా ఉందని నరేంద్రమోడీ ఆరోపించారు. అనేకసార్లు వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నదని, దాని నాయకులనేక మంది గూండాల మాదిరి వ్యవహరించారని, బిజెపి అధికారానికి వస్తే వాటన్నింటికీ తెరపడుతుందని ప్రధాని అన్నారు.
కేరళలో తాము అధికారానికి వస్తే నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేదవారికి అందచేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నలభై ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రాజకీయాల్లోకి రాని కారణాన్ని వివరిస్తూ అందరు గృహిణుల్లాగే తాను కూడా పిల్లల సంరక్షణ, ఇల్లు, వంట కోసం ఇంటికే పరిమితం అయ్యానని అన్నారు. నేను ఎప్పుడూ వంట చేయలేదని ఇల్లు శుభ్రం చేయలేదని అనుకోవచ్చు, కానీ నేనా పని చేశానని నమ్మండి అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే అధికారంలో ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి చౌకబారు ప్రచారం – గడ్డి పెట్టిన వరదల హీరో !

కేరళలో సంభవించిన అసాధారణ వరదల సమయంలో అనేక మందిని రక్షించిన మత్స్యకారుడు జైసాల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇంటికి వచ్చిన బిజెపి అభ్యర్ది సత్తార్‌ హాజీ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నందుకు అభినందించాలనుకుంటున్నామని చెపితే అంగీకరించగా వారి పార్టీ కండువా కప్పి ఫొటో తీసుకున్నారని, తాను చేసిన దానికి గతంలో అనేక పార్టీలు, సంస్దలు తనను అభినందించాయని, దానిలో భాగంగానే ఇది అనుకున్నాను తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారానికి దాన్ని వినియోగించుకుంటారని తాను భావించలేదన్నారు. బిజెపిలో చేరేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. తాను సిపిఎం అభిమానినని, ఆ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తానని చెప్పారు. తన పడవ ద్వారా వరద బాధితులను రక్షించిన వీడియో పెద్ద సంచలనం కలిగించి జైసాల్‌కు ఎంతో పేరు తెచ్చింది. తాజా ఎన్నికల్లో తిరురంగడి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ది నియాల్‌ పులికలకమ్‌కు ధరావత్తు సొమ్ము చెల్లించి జైసాల్‌ తన అభిమానాన్ని ప్రదర్శించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మలబార్‌ తీరంలో ” ఎర్ర ” సునామీ – కాంగ్రెస్‌ గగ్గోలు – మీడియాపై ఇసికి ఫిర్యాదు !

22 Monday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#" Red " Tsunami in Malabar, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


మలబార్‌ అంటే తెలుగు ప్రాంతాలలోని పెద్ద తరాలకు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టుల అణచివేతకు వచ్చిన నాటి కాంగ్రెస్‌ పాలకులు పంపిన రిజర్వు పోలీసులే. అది గత చరిత్ర . ఇప్పుడు మలబార్‌లోని నాలుగు జిల్లాలైన కాసరగోడ్‌, కన్నూరు,వైనాడ్‌,కోజికోడ్‌ జిల్లాలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎర్ర సునామీతో కాంగ్రెస్‌ కొట్టుకుపోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ జిల్లాల్లో 27 సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 4, బిజెపికి ఒకటి దక్కనుందని కేరళలోని అగ్రశ్రేణి మీడియా సంస్ద మళయాల మనోరమ-విఎంఆర్‌ సర్వే పేర్కొన్నది. నాలుగు భాగాల సర్వేలో తొలి విడత వివరాలను ఆదివారం రాత్రి నుంచి వెల్లడించటం ప్రారంభించింది. ఫిబ్రవరి 15 మార్చి 15 మధ్య సేకరించిన అభిప్రాయాల మేరకు తమ విశ్లేషణ ఉన్నదని తెలిపింది. కోజికోడ్‌, వైనాడ్‌ జిల్లాల్లో అన్ని సీట్లు ఎల్‌డిఎఫ్‌కు రానున్నాయని, యుడిఎఫ్‌ అనేక సిట్టింగ్‌ సీట్లను కోల్పోనున్నదని పేర్కొన్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న మంజేశ్వరం ఆ పార్టీకి దక్కనున్నదని తెలిపింది. ప్రస్తుతం అక్కడ ముస్లింలీగు ప్రాతినిధ్యం వహిస్తోంది. మలబార్‌ అంటే మళయాలీలు నివసించే కొండ ప్రాంతమని అర్దం.బ్రిటీష్‌ వారి పాలనలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆ ప్రాంతాన్ని మలబార్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కోస్తా ఆంధ్ర జిల్లాలో దానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఆ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రత్యేక పోలీసు దళాన్ని ఆంధ్ర ప్రాంతానికి రప్పించి దాడులను చేయించింది, వందలాది మందిని హతమార్చింది. పాత తరాలు నేటికీ వాటి దమనకాండను తలుచుకుంటాయి.


ఎల్‌డిఎఫ్‌కు సిపిఎం నేత ఎంఎ బేబీ హెచ్చరిక !


ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నమాట నిజం. ఇప్పుడు వెలువడుతున్న అనుకూలమైన సర్వేలు మనలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇంకేముంది విజయం దక్కినట్లే అని అతివిశ్వాసానికి పోయి కార్యకర్తలు పాలుమాలుతారేమో అన్న ఆందోళన కలుగుతోంది, అలాంటి వైఖరి ఉండవద్దు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ కార్యకర్తలను హెచ్చరించారు.


ప్రతిపక్ష స్ధానం కోసం కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పోటీ !


ఎన్నికల సర్వేల పట్ల తమకు విశ్వాసం లేదని అయినా అన్ని సర్వేలు ఎల్‌డిఎఫ్‌ గెలవనున్నట్లు చెబుతున్నాయని తామైతే ఏ సర్వే నివేదిక కోసమూ ఎదురు చూడటం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ సైతం రాష్ట్రంలో వామపక్ష పాలన కొనసాగుతుందని జోశ్యం చెప్పారని గుర్తు చేశారు. సర్వేలను చూసి కాంగ్రెస్‌ కళవళ పడుతున్నదని, వచ్చే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరుండాలో తేల్చుకొనేందుకు వివాద పడుతున్నారని చమత్కరించారు.


మీడియా సర్వేలతో కాంగ్రెస్‌ గగ్గోలు !


కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల నిత్యం ప్రభుత్వం మీద ఏదో ఒక బట్టకాల్చివేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా దొంగ ఓట్లను చేర్చించారనే ఆరోపణలు ప్రారంభించారు. తాజాగా మీడియా సంస్దల మీద అక్కసు వెళ్ల గక్కుతున్నారు. సర్వేల పేరుతో ఎల్‌డిఎఫ్‌ గెలవనుంది అంటూ యుడిఎఫ్‌ ఓటమికి మీడియా పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిజానికి అదే మీడియా సహకారం, ప్రోత్సాహంతో స్ధానిక సంస్దల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై ఎంత విష ప్రచారం చేశారో, దాన్ని ఓటర్లు ఎలా తిప్పికొట్టారో తెలిసిందే. తటస్ధం, పక్షపాతరహితంగా కనిపించే మీడియా అల్పబుద్దితో వ్యవహరిస్తోందని రమేష్‌ చెన్నితల ఆరోపించారు. తమను సిపిఎమ్మే నాశనం చేయలేకపోయిందని, మీడియా సర్వేలు కూడా ఆపని చేయలేవన్నారు. బెదిరింపులు, వాణిజ్య ప్రకటనలతో సిపిఎం మీడియాను బెదిరిస్తోందన్నారు. మీడియా సర్వేలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు చెన్నితల సోమవారం నాడు ఒక ఫిర్యాదును అందచేశారు. స్వేచ్చ, న్యాయంగా జరగాల్సిన ఎన్నికలను దెబ్బతీసేందుకు సర్వేలను వెల్లడిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో కీలకమైన తరుణంలో ఇలాంటి సర్వేల ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తున్నారని, తప్పుడు సమాచారంతో తీవ్రంగా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.


ఓట్లమ్ముకొనే కాంగ్రెస్‌ నేతలు !


2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి ఓట్లను అమ్ముకున్నదని ఆ ఎన్నికల్లో యుడిఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన జెడి(యు) నేత వి. సురేంద్రన్‌ పిళ్లే చెప్పారు. తాను 1984 నుంచి యుడిఎఫ్‌ను గమనిస్తున్నానని కొన్ని సీట్ల కోసం యుడిఎఫ్‌ కొందరిని బలపశువులుగా వాడుకున్నదని వారిలో తానొకరినని చెప్పారు.భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయిస్తామని యుడిఎఫ్‌ చెబుతుందని అక్కడ ఓట్లను అమ్ముకుంటుందని అన్నారు. నీమమ్‌లో గతసారి గెలిచిన బిజెపి ఓ రాజగోపాల్‌ స్వయంగా ఈ అంశాలను చెప్పారన్నారు. ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ది కూడా దీన్ని గమనించాలని, ఆయనకు అన్నీ తెలుసు అన్నారు. ఓట్ల అమ్మకం వెనుక ఉన్న కొందరు నేతల గురించి తెలుసునని, త్రిముఖ పోటీలో సిపిఎంకు అవకాశాలు ఉన్నాయన్నారు.


మాకు గనుక అప్పుడు తెలివి ఉంటేనా…… అంటున్న కాంగ్రెస్‌ ఎంపీ !


కరోనా నిబంధనల కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో తమ కార్యకర్తలు ప్రేక్షకులుగా మిగిలిపోయారని , కానీ డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తెలివి తేటలతో కరోనా సమయంలో చురుకుగా ఉన్నారని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ కె.సుధాకరన్‌ అన్నారు. సిపిఎం తన కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి ఆహారకిట్లు, పెన్షన్లు, ఔషధాలను అందించిందని, ఈ కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ చురుకుగా ఉన్నదని, పౌరులకు సాయం చేసిందని అన్నారు.మహిళల పట్ల చిన్న చూపినందుకు నిరసగా, ముఠా తగాదాలతో విసిగిపోయి నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షురాలు, ఏఐసిసి సభ్యురాలు కె సి రోజా కుట్టి ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.


హైకోర్టులో బిజెపికి ఎదురు దెబ్బ ! అధికారానికొస్తే లవ్‌ జీహాద్‌ బిల్లు తెస్తారట !


తెలిచేరి, గురువాయూర్‌ నియోజకవర్గాలలో నామినేషన్ల తిరస్కరణకు గురైన ఉదంతంలో బిజెపికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున రిటర్నింగ్‌ అధికారుల నిర్ణయాన్ని మార్చలేమని సోమవారం నాడు కోర్టు పేర్కొన్నది. మరో ఉదంతంలో ఒక నియోజకవర్గంలో సిపిఎం బలపరుస్తున్న ఒక అభ్యర్ధి సులేమాన్‌ హాజీ దుబారులోని తన రెండవ భార్య గురించి వివరాలు పేర్కొనలేదుకనుక నామినేషన్‌ అంగీకరించరాదన్న అభ్యంతరాన్ని రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. న్యాయనిపుణుల సలహా తీసుకొన్న తరువాత నిలిపివేసిన నామినేషన్‌ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు.
తాము అధికారానికి వస్తే కేరళలో లవ్‌ జీహాద్‌ బిల్లు తీసుకువస్తామని బిజెపి కేంద్రమంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. తిరువనంతపురంలో సోమవారం నాడు ఎల్‌డిఎఫ్‌పై ఆరోపణల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ విషయాలన్నింటినీ తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని చెప్పారు.క్రైస్తవ మత పెద్దలను సంతుష్టీకరించి వారి మద్దతు పొందేందుకు బిజెపి నేత ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. కేరళలో క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్‌ జీహాద్‌ జరుగుతోందని గత ఏడాది సిరియన్‌-మలబార్‌ చర్చి పెద్దలు చేసిన ఆరోపణలను సదానంద గౌడ ప్రస్తావించటమే దీనికి నిదర్శనం. ముస్లింలు – క్రైస్తవుల మధ్య తంపులు పెట్టి క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్నది బిజెపి ఎత్తుగడ. ఇప్పటికే జాకోబిన్‌ చర్చి వివాదంలో తలదూర్చి ఒక వర్గాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుంది. కర్ణాటకకు చెందిన బిజెపినేతల సారధ్యంలో కేరళ బిజెపి నేతలు ఇటీవల అనేక మంది బిషప్పులను కలసి మద్దతు ఇమ్మని కోరిన విషయం బహిరంగమే. కొందరు క్రైస్తవ పెద్దలు బిజెపికి మద్దతు ప్రకటించారు కూడా !


బిసిలకు కాంగ్రెస్‌ మొండిచేయి-రెట్టింపు సీట్లిచ్చిన సిపిఎం !


కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు చేసిన కులపరమైన దూషణ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ వెనుకబడిన తరగతులకు మొండి చేయి చూపిందని అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణలో మీడియా పేర్కొన్నది.వెనుకబడిన తరగతులలో ఎజవాలకు 28, ఇతర వెనుకబడిన తరగతులకు 18 మొత్తంగా 46 సీట్లను ఎల్‌డిఎఫ్‌ కేటాయించింది. అదే యుడిఎఫ్‌ 14ఎజవా, 12 ఇతర వెనుకబడిన తరగతులకు కేటాయించింది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి 55 స్దానాలలో ఎజవాలకు 43, ఇతర వెనుకబడిన తరగతులకు 12 కేటాయించింది. కేరళ కౌముది పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ సామాజిక తరగతులకు మూడు ఫ్రంట్‌లు కేటాయించిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఫ్రంట్‌ ×× బిసి ×× నాయర్లు×× ముస్లిం×× క్రైస్తవ
ఎల్‌డిఎఫ్‌ ×× 46 ×× 28 ×× 29 ×× 21
యుడిఎఫ్‌ ×× 26 ×× 28 ×× 39 ×× 28
ఎన్‌డిఏ ××× 55 ×× 45 ×× 3 ×× 6


యుడిఎఫ్‌లో ముస్లింలకు కేటాయించిన 39లో ముస్లిం లీగుకు చెందిన వారు 26, కాంగ్రెస్‌ 12, ఎల్‌డిఎఫ్‌లోని 29 మందిలో సిపిఎం నుంచి 21 మంది ఉన్నారు. నాయర్లలో కాంగ్రెస్‌ 28, సిపిఎం 15, బిజెపి 44 మంది ఉన్నారు. బిజెపిని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ బలపరుస్తున్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే గణనీయ సంఖ్యలో ఆ సామాజిక తరగతికి పెద్దపీట వేశారు. క్రైస్తవుల నుంచి కాంగ్రెస్‌ 18, సిపిఎం నుంచి 8 మంది ఉన్నారు.ఎల్‌డిఎఫ్‌ భాగస్వామ్యపక్షమైన కేరళ కాంగ్రెస్‌ పది స్ధానాలను కేటాయించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగులేని ఎల్‌డిఎఫ్‌ – తాజా సర్వే సైతం నిర్ధారణ !

21 Sunday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF, LDF is going to win


ఎం కోటేశ్వరరావు


గతంలో వెల్లడైన సర్వేలు, తాజాగా వెల్లడైన మాతృభూమి సర్వే కూడా ఎల్‌డిఎఫ్‌ విజయాన్ని నిర్ధారించిందని అయితే కార్యకర్తలెవరూ ఆదమరిచి ఉండరాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌డిఎఫ్‌కు 75-83, యుడిఎఫ్‌కు 56-64 మధ్య, బిజెపికి రెండు వస్తాయని మాతృభూమి సి ఓటర్‌ సర్వే తాజాగా పేర్కొన్నది. అన్ని సర్వేల సారం ఎల్‌డిఎఫ్‌ కొనసాగింపేనని, సిపిఎం చెప్పింది నిజమని వెల్లడిస్తున్నాయని, అయితే గట్టిపోటీ జరగనున్నందున కార్యకర్తలు జాగరూకులై ఉండాలని బాలకృష్ణన్‌ చెప్పారు.
కేరళ విభాగం పని తీరుపట్ల కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో ఎల్‌డిఎఫ్‌ ఎంతో ముందున్నదని కాంగ్రెస్‌ కిలోమీటర్ల దూరం వెనుక ఉందని, చేస్తున్న ప్రచారం కూడా క్రమశిక్షణతో లేదని పద్దతి ప్రకారం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(మణి) బయటకు పోవటాన్ని తీవ్రంగా పరిగణించలేదని, పది సీట్లలో పోటీ చేస్తూ మిగిలిన జోసెఫ్‌ వర్గానికి పోటీ చేసేందుకు అసలు గుర్తే లేకపోయినా పట్టించుకోలేదని మండిపడింది. గత మూడు ఎన్నికల్లోనూ పార్టీకి 40సీట్లకు మించి రాలేదని, ఈ సారి 50 వస్తాయని ఏవిధంగా చెబుతున్నారని అడిగింది. ఎల్‌డిఎఫ్‌ కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంటే దానికి ధీటుగా పార్టీ సమాధానం లేదని పేర్కొన్నట్లు వెల్లడైంది.ఫిరాయింపుల నిరోధక చట్టం వేటును తప్పించుకొనేందుకు నామినేషన్లు దాఖలు చేసే ముందు జోసెఫ్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఏలు పిజె జోసెఫ్‌, మనోజ్‌ జోసెఫ్‌ ఎంఎల్‌ఏలుగా రాజీనామా చేశారు.

శబరిమల వివాదాన్ని ముందుకు తెచ్చే యత్నం !


ప్రస్తుతం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్న శబరిమల అయ్యప్ప దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ సమస్యపై లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి రెండూ ప్రయత్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్నే తీసుకువస్తామని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ సమస్య ప్రస్తావనే లేకుండా అంతకు ముందు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రణాళికను వెల్లడించింది. ” మతశక్తులను ప్రతిఘటించేందుకు,ఓడించేందుకు దైవం పట్ల విశ్వాసం ఉన్నవారు కూడా ఒక ఐక్య సంఘటనగా ముందుకు రావాలి. అన్ని మతాల విశ్వాసుల నమ్మకాలను రక్షించేందుకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అన్ని చర్యలూ తీసుకుంటుంది.ఏ మతం పట్ల విశ్వాసం లేని వారు కూడా ప్రశాంతంగా జీవించేందుకు వీలుకల్పిస్తుంది. ” అని పేర్కొన్నది. తమ ప్రభుత్వం పట్ల విశ్వాసులు ఎలాంటి సందేహాలను పెట్టుకోనవసరం లేదని, శబరిమల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత దాని అమలు గురించి అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదే పదే ప్రభుత్వ, సిపిఎం వైఖరినీ స్పష్టం చేస్తున్నారు. సమస్య సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ అంశం అసలు చర్చనీయాంశమే కాదన్నారు. ఇది రాస్తున్న సమయానికి బిజెపి ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అయితే దాని అజెండా బహిరంగమే కనుక శబరిమల అంశం లేకుండా ఉండదన్నది స్పష్టం. బిజెపికి మద్దతు ఇస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ శబరిమల అంశాన్ని ఎన్నికల్లో ముందుకు తెచ్చే యత్నాల్లో భాగంగా రాజధాని తిరువనంతపురంలో నామజపం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా నామజపం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హింసాకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం జరిగిన ఉదంతాలు తనతో సహా అందరినీ బాధించాయని, జరిగి ఉండాల్సింది కాదని దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన వ్యాఖ్యలను రచ్చ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయి. సంక్షేమ-అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో అమలు జరపనున్న కార్యక్రమాలతో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం !


కమ్యూనిస్టులను రెచ్చగొట్టటం, ప్రతిఘటిస్తే తమపై దాడులు చేశారంటూ యాగీ చేయటం కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఎత్తుగడల్లో భాగం అన్నది విమర్శ. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా అమలు జరిపేందుకు పూనుకున్నారు. తిరువాన్కూర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి తిరస్కరించిన సిపి రామస్వామి అయ్యర్‌ చర్యకు నిరసనగా జరిగిన పోరు పున్నప్ర-వయలార్‌ పోరాటంగా ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. నైజాం సంస్ధానంలో దోపిడీ నుంచి విముక్తికోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడితే అదే సమయంలో కేరళలో 1946లో సంస్దాన విలీనం కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన పోరులో వెయ్యిమందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం మరణించారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అలప్పూజలో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు. దాన్ని సిపిఎం-సిపిఐ రెండూ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అలప్పూజ బిజెపి అభ్యర్ధి సందీప్‌ వాచస్పతి అక్కడికి వెళ్లి అంజలి ఘటించారు. కమ్యూనిస్టు అమరజీవులను గౌరవిస్తూ ఎవరైనా ఆపని చేస్తే అభ్యంతరం లేదు. కానీ భారతమాతాకి జై అనే నినాదాలతో కమ్యూనిస్టుల నాయకత్వాన పోరు పేరుతో అమాయక దళితుల, వెనుకబడిన తరగతుల వారి ప్రాణాలను బలిపెట్టారని, కమ్యూనిస్టునేతలు పారిపోయి అతి పెద్ద ద్రోహం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులను రెచ్చగొట్టేందుకు తప్ప మరొకందుకు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి కుట్రను గ్రహించిన కార్యకర్తలు ఎంతో సంయమనం పాటించారని అభినందించారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి మనోభావాలను బిజెపి గాయపరచిందని అన్నారు. స్మారక కేంద్రంలోకి అక్రమంగా చొరబడ్డారని సిపిఎం విమర్శించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్ధి చర్యకు నిరసనగా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన జరుపుతుండగా వారిని రెచ్చగొట్టేందుకు పక్కనే ఉన్న మరొక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ది అనూప్‌ అంటోని పనిగట్టుకొని ప్రదర్శనవైపు రాగా కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దాన్ని తనపై దాడిగా చిత్రిస్తూ ఆసుపత్రిలో చేరటం వంటి నాటకానికి తెరలేపారని విమర్శలు వచ్చాయి. ఆంటోని కారు బానెట్‌ను కొందరు కొట్టారు తప్ప అతని మీద భౌతికదాడి జరగలేదని పోలీసులు ప్రకటించారు.

పినరయి విజయన్‌ ప్రచార తీరే వేరు !


ఎన్నికలలో పినరయి విజయన్‌ ప్రచార తీరు ఎందరినో ఆకర్షిస్తున్నది. రాజకీయంగా వ్యతిరేకించే మీడియా కూడా దాన్ని గుర్తించింది. విజయన్‌ కొన్ని సెకండ్ల పాటు ఒక సారి తన చేతి వాచ్‌ను చూశారంటే కార్యక్రమం ప్రారంభం లేదా ముగిసినట్లే లెక్క. పత్రికా గోష్టి అయినా, మరొక కార్యక్రమం అయినా నిర్ణీత ప్రకారం ముగియాల్సిందే.ప్రారంభం కూడా అంతే. పత్రికా గోష్టికి 45నిమిషాలు,దానిలో ప్రశ్నలు, సమాధానాలకు పదిహేను నిమిషాలు, ఎన్నికల ప్రసంగం 45నిమిషాల్లో ముగియాల్సిందే. నలభైమూడు నిమిషాలు అభివృద్ధి, ఇతర అంశాలను మాట్లాడిన తరువాత చివరి రెండు నిమిషాల్లో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులకు ఓటు ఎందుకు వేయాలో అభ్యర్ధిస్తారు. విజయన్‌ ప్రాంగణంలోకి రాగానే నినాదాలు, ఈలలు మోతలతో హౌరెత్తుతుంది. వేదిక మీదకు వస్తుండా అప్పటికే ఉన్న నేతలు గౌరవ సూచకంగా లేచి నిలుచుంటారు. వెంటనే ఒక చిన్న పాప వచ్చి గులాబి పువ్వు అంద చేసిన తరువాత పిడికిలి బిగించి అభివాదం చేస్తుంది. ముళ్లు ఏవైనా ఉంటే గుచ్చుకోకుండా విజయన్‌ దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. విజయన్‌కు ప్రత్యేకంగా ఒక మైక్‌ను అమరుస్తారు, దాన్నే తరువాత సభలకూ తీసుకువెళతారు. సభికులు ఎంతో క్రమశిక్షణగా కూర్చుని వుపన్యాసాలను వింటారు. అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఉదయం ఒక విషయం చెబితే సాయంత్రం బిజెపి నేతలు వాటినే చెబుతారు. బిజెపి నేతలు ఉదయం చెప్పిన వాటిని కాంగ్రెస్‌ నేతలు సాయంత్రం చెబుతారు, రెండు పార్టీలు పరస్పరం ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెండు పార్టీల తీరుతెన్నులను వర్ణించారు.

మూడు చోట్ల బిజెపికి నామినేషన్ల ఎదురుదెబ్బ !


మూడు నియోజకవర్గాలలో బిజెపికి నామినేషన్ల సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక తలసెరి, గురువాయూర్‌, దేవీకుళంలో సరిగా లేని కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. మూడు చోట్లా డమ్మీ అభ్యర్దులు లేకపోవటం లేదా వారి నామినేషన్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామంపై పార్టీ కేంద్ర నేతలకు ఏ కారణం చెప్పాలా అని తలలు పట్టుకుంటున్నారు. కన్నూరు జిల్లాలో గత ఎన్నికల్లో తలసెరిలో 22వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఈనెల 25న అక్కడ అమిత్‌ షా సభ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అసలు అభ్యర్దే లేకపోవటంతో ఏమి చెయ్యాలో తోచని స్ధితిలో పడ్డారు.తలసెరి నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలుత సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన విఆర్‌ కృష్ణయ్యర్‌ సిపిఐ తరఫున 1957, 1960లో గెలిచారు. అప్పటి నుంచి మధ్యలో ఒకసారి సిపిఐ అభ్యర్ధి తప్ప ఇంతవరకు సిపిఎం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి ఇకె నయనార్‌, ఐదుసార్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియర్‌ బాలకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో సక్రమంగా నామినేషన్లు వేసిన బిజెపి తలసెరీలో తప్పులతడగా వేయటం వెనుక కాంగ్రెస్‌తో కుమ్మక్కును వెల్లడిస్తున్నదని సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ చెప్పారు. దేవీకుళంలో బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు సీటు ఇవ్వగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధిని బలపరచాలని బిజెపి నిర్ణయించింది. తలసెరి, గురువాయూర్‌ సీట్ల గురించి హైకోర్టుకు ఎక్కింది.

ప్రత్యర్ధుల వలలో పడవద్దు -సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎల్‌డిఎఫ్‌ సూచన !


ప్రత్యర్ధి పార్టీలు, వ్యక్తులు రెచ్చగొట్టేందుకు పూనుకుంటారని అందువలన వారికి సమాధానం ఇచ్చే పేరుతో వారి వలలో చిక్కుకోవద్దని ఎల్‌డిఎఫ్‌ తన సామాజిక మాధ్యమ కార్యకర్తలకు సూచింది. ప్రత్యర్ధులపై దూషణలకు పాల్పడవద్దని, అసలు వారి గురించి పట్టించుకోవద్దని, ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను గుళికలుగా విడగొట్టి సులభంగా, వెంటనే చదువుకొనే విధంగా తయారు చేసి ప్రచారం చేయాలని పేర్కొన్నది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ నీమమ్‌ నియోజకవర్గంలో పోటీ చేయకుండా పుతపల్లికే పరిమితం కావాలని కొందరు కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన విషయం తెలిసిందే. దాని మీద ఊమెన్‌ చాందీ ఇంటి మీది పెంకులను మరమ్మతు చేసేందుకు యుడిఎఫ్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తూ పెట్టిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాని ఎల్‌డిఎఫ్‌ కోరింది. అలాగే పున్నప్ర-వయలార్‌ కమ్యూనిస్టు అమరజీవుల స్మారకకేంద్రంలో ప్రవేశించిన బిజెపి అభ్యర్ధి జనం, కార్యకర్తల మనోభావాలను గాయపరచినప్పటికీ అతగాడిని తూలనాడుతూ కొందరు పోస్టులు పెట్టటం మంచిది కాదని, ప్రత్యర్ధుల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.

మైనారిటీ మతాల సంతుష్టీకరణ పనిలో బిజెపి !


మైనారిటీ మతాల వారికి పూర్తి మద్దతు ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెప్పారు. జాకోబిన్‌ చర్చి వివాదంలో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, దగ్గరిదారులు లేవని అయితే ఆర్దోడాక్స్‌ వర్గానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ముస్లింలీగు, బిజెపి కుమ్మక్కయిన మాట నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పడవేశాయి. ఆయనను విమర్శించలేని-సమర్ధించలేని స్దితిలో పడిపోయారు. తాను మాట్లాడే మాటలు వాటి విలువ ఏమిటో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో రాజగోపాల్‌ తెలుసుకోవటం లేదని బిజెపి సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ వినియోగించటాన్ని ముకుందన్‌ తప్పుపట్టారు. సురేంద్రన్‌ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగలేదు. హెలికాప్టర్‌ వినియోగాన్ని కార్యకర్తలు మెచ్చరు అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాంగ్రెస్‌, ముస్లింలీగుతో కుమ్మక్కు నిజమే : బిజెపి ఎంఎల్‌ఏ రాజగోపాల్

18 Thursday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Pinarayi Vijayan, BJP, Co-le- b unholy alliance, Kerala LDF, Kerala UDF, RSS

‌
ఎం కోటేశ్వరరావు


సిపిఎంను ఓడించేందుకు తాము గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ముస్లింలీగుతో చేతులు కలిపిన మాట నిజమే అని కేరళలో ప్రధమ బిజెపి ఎంఎల్‌ఏ,91 సంవత్సరాల సీనియర్‌నేత ఓ రాజగోపాల్‌ వెల్లడించారు. గతంలో ఇదే విషయాన్ని సిపిఐ(ఎం) అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు బిజెపి నేత నోటి నుంచి ఆ విషయం వెల్లడి కావటంతో మూడు పార్టీలు ఇరకాటంలో పడ్డాయని చెప్పవచ్చు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆరోపణ గురించి స్పందించాలని ఒక టీవీ ఛానల్‌ అడిగినపుడు రాజగోపాల్‌ గతం గురించి చెప్పారు.గతంలో అనేక సందర్భాలలో కొన్ని స్ధానాలలో మూడు పార్టీలు సహకరించుకోవటం బహిరంగ అంశమే. మూడు పార్టీలు కలసి వ్యవహరించపోయినా సిపిఎం ఓటమికి గాను బిజెపికి ఓట్లు పడేందుకు ఒకరికొకరు సహకరించుకున్నారు,ఒత్తపాలెం, మంజేశ్వరం వంటి నియోజకవర్గాలు వాటిలో ఉన్నాయి. ఆ మేరకు బిజెపికి లబ్ది చేకూరిందని రాజగోపాల్‌ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసని, అలా లబ్దిపొందటం తప్పుకానేకాదని కూడా ఉద్ఘాటించారు. నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ది కె మురళీధరన్‌ బలమైన అభ్యర్ధి అని కూడా వ్యాఖ్యానించి పార్టీని, అక్కడ పోటీ చేస్తున్న కుమనం రాజశేఖర్‌ను కూడా ఇబ్బందిలోకి నెట్టారు. బిజెపి ప్రధాన శత్రువు కాదని గతంలో ముస్లిం లీగు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గుర్తు చేశారు. బిజెపికి లబ్ది చేకూర్చేవిధంగా లీగు-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయన్నారు. గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అదేవిధంగా జతకట్టారని అవవిత్ర కూటమిని ఓ రాజగోపాల్‌ నిర్దారించారని విజయన్‌ చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా తొలుత ప్రకటించింది ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే అన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా నిరసన తెలపాలని తాము కోరగా కాంగ్రెస్‌, లీగు తిరస్కరించాయని చెప్పారు. రాజగోపాల్‌ చెప్పిన అంశంపై బిజెపి, ముస్లిం లీగు, కాంగ్రెస్‌ మౌనందాల్చాయి.


ఓ రాజగోపాల్‌ చెప్పిన అంశాలతో దిక్కుతోచని బిజెపి సరికొత్త అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. బిజెపి-సిపిఎం కలసి పని చేయటం అందరికీ తెలిసిందేనని, ఇదేమీ కొత్తకాదని, తమ పార్టీనేత కెజి మరార్‌ గతంలో ఉడుమ నియోజకవర్గంలో పోటీ చేసినపుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ ప్రధాన ఏజంట్‌గా మరార్‌ తరఫున పని చేశారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ పచ్చి అవాస్తవాలను చెప్పారు. 1977లో మరార్‌ ఉడుమలో పోటీ చేశారు. అప్పటికి అసలు బిజెపి పుట్టనేలేదు. జనతా పార్టీ అభ్యర్దిగా మరార్‌ పోటీ చేశారు. ఆ సమయంలో జనతా పార్టీలో ఎవరున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా అత్యవసర పరిస్దితిని వ్యతిరేకించిన వారితో కూడిన ఆ పార్టీని సిపిఎం బలపరిచింది. అదే సమయంలో సిపిఎంను కూడా జనతా పార్టీ బలపరిచింది. 1977లో పినరయి విజయన్‌ వేరే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు.అందువలన మరార్‌కు ప్రధాన ఏజంట్‌గా ఉండే అవకాశమే లేదు. జనతా పార్టీలో అంతకు బిజెపి పూర్వరూపంగా ఉన్న జనసంఫ్‌ు తన మతతత్వ అజెండాను పక్కన పెట్టి విలీనమైన అంశం తెలిసిందే. తరువాత మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వ వివాదం తలెత్తినపుడు తాము జనతా పార్టీకంటే ఆర్‌ఎస్‌ఎస్‌కే విధేయులమని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నడూ ఎక్కడా ఏ రూపంలోనూ బిజెపిని సిపిఎం బలపరచలేదు.


నాలుగు నియోజకవర్గాలలో సిపిఎం-బిజెపి కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆధారం లేని ఆరోపణను ఆ సంస్ద నేతలే ఖండించారు. ప్రాంత కార్యవాV్‌ా గోపాలన్‌కుట్టి మాట్లాడుతూ బాలశంకర్‌ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించిన విషయం తనకు తెలియదని, దాని మీద ఎలాంటి వ్యాఖ్య చేయనని, అతని వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా కొద్దికాలమే బాలశంకర్‌ పని చేశారని, ఆ మాటకు వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు కాని వారు కూడా సంపాదకులుగా పని చేశారని అన్నారు. బాలశంకర్‌ చెబుతున్న నాలుగు నియోజకవర్గాలలో ఇప్పుడు సిపిఎం ప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అందువలన బిజెపితో కుమ్మక్కు ఆరోపణకు అర్ధం లేదని సిపిఎం నేతలు చెప్పారు.


ధర్మదోమ్‌పై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీకి ఎవరిని నిలపాలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌ ఎట్టకేలకు అభ్యర్దిని ఖరారు చేసింది. తొలుత అక్కడ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్ది దేవరాజన్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్‌ సూచింది. అయితే ప శ్చిమబెంగాల్లో సిపిఎం నాయకత్వంలోని ఉన్న ఫ్రంట్‌లో ఉన్న తాము ఇక్కడ కాంగ్రెస్‌తో ఉన్నప్పటికీ విజయన్‌ మీద పోటీ చేసేందుకు తాము సుముఖంగా లేమని ఆ పార్టీ చెప్పటంతో కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. ఎవరిని నిలపాలా అని తర్జనభర్జన పడుతున్నది. కాలేజీ రోజుల నుంచి విజయన్‌కు ప్రత్యర్ధిగా ఉన్న కన్నూరు ఎంపీ సుధాకరన్‌ను పోటీకి నిలపాలని పార్టీ అధిష్టానం సూచించింది. అయితే వత్తిడి చేయవద్దని, పూర్తిగా అంగీకారమైతేనే ఖరారు చేయాలని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీమమ్‌, ధర్మదోమ్‌లో బలమైన అభ్యర్దులను దింపటం ద్వారా తాము బిజెపి-సిపిఎంలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ.అధిష్టానం గట్టిగా కోరితే పరిశీలిస్తానని సుధాకరన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తానుకానట్లయితే తన అనుచరుడు రఘునాధ్‌ను పోటీకి నిలపాలని ప్రతిపాదిస్తున్నారని మీడియా పేర్కొన్నది. చివరికి అదే జరిగింది. తాను ధర్మదోమ్‌లో పోటీ చేస్తే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుందని, ఐదు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు వీలుండదని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అక్కడ పోటీ చేయటం కుదరదని ఎంతో ముందుగానే నిర్ణయించి ఉంటే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉండేవాడినని కూడా చెప్పారు.


తాను ఎవరి ముందు అయినా ఎలాంటి అభిప్రాయాలనైనా వ్యక్తం చేయగల ధైర్యం ఉందని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ తమ పార్టీనేతలకు సవాలు విసిరారు. అభ్యర్ధుల ఎంపికలో సుధాకరన్‌ ఆశాభంగం చెందినట్లున్నారు, ఆయనకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితి తెలియదని సిఎల్‌పి నేత రమేష్‌ చెన్నితల చేసి వ్యాఖ్యాల మీద సుధాకరన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ ఒక లెక్కలోది కాదని, ఆయన మీద పోటీ చేస్తానని తాను సీటును కోరలేదని, తనను ఎవరూ అడగనూ లేదన్నారు. ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు, పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్దమే అన్నారు. పార్టీ అభ్యర్ధుల ఎంపిక మీద తనకు సంతృప్తి లేదని, దీనికి తాను ఎవరినీ నిందించటం లేదని చెప్పారు. సుధాకరన్‌ చేసిన వ్యాఖ్యల మీద తాను స్పందించదలచ లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. సీట్ల ఎంపిక ఉమ్మడిగానే జరిగిందని, గెలుపు అవకాశాలనే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్‌సిపిలో చేరిన పిసి చాకో కన్నూరు ఎంపీ సుధాకరన్‌తో సహా అనేక మంది పార్టీ నుంచి వెలుపలికి వెళ్లే విషయాలను తనతో చర్చించారని అన్నారు. తాను ఎల్‌డిఎఫ్‌ తరఫున రాష్ట్రవ్యాపితంగా ప్రచారం చేస్తానన్నారు. తానసలు ఇటీవల చాకోతో మాట్లాడలేదని సుధాకరన్‌ వివరణ ఇచ్చారు.


మహిళలకు ఓడిపోయే సీట్లిచ్చిన యుడిఎఫ్‌ !


మహిళలకు యుడిఎఫ్‌ ప్రకటించిన పది స్ధానాలలో గతంలో ఎనిమిదింటిలో ఓడిపోయినవే ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్‌డిఎఫ్‌ కేటాయించిన 15 స్ధానాలకు గాను పది గెలిచిన స్ధానాలు ఉన్నాయి. ఐదింటిలొ ఓడిపోయిన రెండు చోట్ల ఏడువేలలోపే తేడా ఉంది. ప్రస్తుతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్దానాలో యుడిఎఫ్‌ ఈసారి వారికి మొండి చేయి చూపింది. మహిళలకు కేటాయించిన వాటిలో ఆరు చోట్ల గత ఎన్నికల్లో యుడిఎఫ్‌ పది నుంచి 43వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. స్దానిక సంస్దల ఎన్నికలలో మహిళలకు 50 శాతం స్దానాలను రిజర్వు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికలలో గెలిచిన వారిలో 54శాతం మంది మహిళలు ఉండటం విశేషం. జమాయతుల్‌ ఉలేమా మహిళల పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నది. పాతిక సంవత్సరాల తరువాత ముస్లిం లీగు పోటీ చేస్తున్న 27 స్దానాలలో ఒకదానిలో మహిళను నిలిపింది.


శబరిమలను వివాదంగా ముందుకు తెచ్చే యత్నం !


శబరిమల దేవాలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అమలు జరిపింది తప్ప మరొకటి కాదని, దాని గురించి దేవాదాయశాఖ మంత్రి ఎందుకు విచారం ప్రకటించారో తనకు తెలియదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును అమలు జరపక ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. శబరిమల సమస్య మీద ముఖ్యమంత్రి తన వైఖరి ఏమిటో వెల్లడించాలని బిజెపికి మద్దతు ఇస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో కోరింది. భక్తులకు తెలుసుకొనే హక్కుందని పేర్కొన్నది. శబరిమల సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దాని తీర్పు వెలువడిన తరువాత అందరితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి విజయన్‌ గతంలోనే ప్రకటించినప్పటికీ ఎన్నికలలో దాన్నొక సమస్యగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సుధాకరన్‌(సిపిఐ) పోటీ చేస్తున్న కజకోట్టమ్‌ నియోజకవర్గంలో బిజెపి అసంతృప్త నేత శోభా సురేంద్రన్‌ పోటీలో ఉన్నారు.
శబరిమల వివాదం ముగిసిన అంశమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్‌ చెప్పారు. ఈ వివాదాన్ని తమ మంత్రి లేవనెత్తలేదని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండటం కనీస మర్యాద అని ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్నవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిపిఐ నుంచి వెళ్లిపోయి బిజెపి అభ్యర్దులుగా మారిన వారి గురించి అడగ్గా సీటురాని వా రు అలా చేస్తున్నారని బిజెపికి అభ్యర్దులే దొరకని స్ధితి అన్నారు.


ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన కేరళ కాంగ్రెస్‌(టి) తమ పార్టీని యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్‌(జె)లో విలీనం చేసినట్లు ఆ పార్టీనేత పిసి థామస్‌ ప్రకటించారు. అయితే అతని చుట్టూ కొంత మంది వ్యక్తులు తప్ప జనం లేరని ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత జోస్‌ మణి వ్యాఖ్యానించారు.బిజెపితో సంబంధాలను ఏర్పాటు చేసేందుకే యుడిఎఫ్‌లో చేరినట్లు మణి చెప్పారు. అసలు ఆ పార్టీకి రిజిస్ట్రేషన్‌ కూడా లేదని అన్నారు.నిజమైన కేరళ కాంగ్రెస్‌ ఏదో గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనమే తేల్చారని అన్నారు. త్రిపురలో బిజెపి, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాదిరి కేరళలో ఈ ఎన్నికల్లో 70 స్ధానాలు వస్తాయని బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ జోశ్యం చెప్పారు.
కేరళ నుంచి రాజ్యసభకు ఏప్రిల్‌ 12న మూడు స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో యుడిఎఫ్‌కు రెండు, ఎల్‌డిఎఫ్‌కు ఒకటి ఉన్నాయి. ఇప్పుడున్న బలాబలా ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు రెండు, యుడిఎఫ్‌కు ఒక స్దానం దక్కనుంది. యుడిఎఫ్‌లోని ముస్లింలీగు తన స్ధానానికి తిరిగి ప్రస్తుత అభ్యర్దినే ప్రకటించింది. రెండో స్ధానంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు. ఎల్‌డిఎఫ్‌ తరఫున ప్రస్తుతం ఆలిండియా కిసాన్‌ సభలో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న విజూ కృష్ణన్‌తో పాటు సిపిఎం సానుభూతి పరుడు చెరియన్‌ ఫిలిప్పును ఎంపిక చేయవచ్చని వార్తలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళ ఎన్నికల దృశ్యం – ఆర్‌ఎస్‌ఎస్‌ క్రమశిక్షణ బండారం !

17 Wednesday Mar 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

#Kerala Election scene, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF, RSS discipline hypocrisy exposed


ఎం కోటేశ్వరరావు


కేరళలో అధికారం కోసం పోటీ పడే ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ అభ్యర్ధుల గురించి కసరత్తు చేశాయంటే అర్ధం ఉంది. బిజెపి, దాని మిత్రపక్షాలు కూడా అదే ఫోజు పెట్టటం పెద్ద ప్రహసనం. తీరా జరిగిందేమిటి ? ఒక 31 సంవత్సరాల యువకుడు టీవీ చూస్తుండగా బిజెపి అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. దానిలో తన పేరు రాగానే ఒక్కసారి తనను తానే నమ్మలేకపోయాడు. స్ధానిక బిజెపి నేతలు, చుట్టుపక్కల వారు అతనికోసం వాకబు చేశారు. నేనేమిటి బిజెపి తరఫున పోటీ చేయటం ఏమిటి ? కనీసం ఆ పార్టీ సానుభూతి పరుడిని కూడా కాదు, నన్ను కనీసం సంప్రదించకుండా నా పేరు ప్రకటించటం ఏమిటని అతను ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని మీడియాతో కూడా చెప్పాడు. అతని పేరు మణికందన్‌, ఎంబిఏ డిగ్రీ కలిగి ఉద్యోగం చేస్తున్న ఒక గిరిజన యువకుడు.అతని పేరును వైనాడ్‌ జిల్లా మనంతనవాడి నియోజకవర్గ అభ్యర్ధిగా ప్రకటించారు. బిజెపి కసరత్తు బండారం ఏమిటో ఈ ఉదంతం బయట పెట్టింది. ఎవ్వరేమనుకుంటే మాకేటి సిగ్గు అంటే ఇదే కదా !

ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్‌-బిజెపి మచ్చ: పినరయి విజయన్‌

ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లేదా కార్యకర్తల క్రమశిక్షణ బండారం ఏమిటో కూడా ఈ ఎన్నికలు బయట పెట్టాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఆర్గనైజర్‌ పత్రిక మాజీ సంపాదకుడు, బిజెపి జాతీయ శిక్షణా విభాగపు సహకన్వీనర్‌, ఆర్‌ బాలశంకర్‌కు అలపూజ జిల్లా చంగన్నూరు నియోజక సీటు ఇస్తామని బిజెపి చెప్పిందట.ఢిల్లీలో ఎక్కువ కాలం గడిపే బాలశంకర్‌ జనవరిలో రాష్ట్రానికి వచ్చి నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారభించారు. నరేంద్రమోడీ, అమిత్‌ షా చెప్పిన మేరకే తాను వచ్చానని మద్దతుదారులను కలిసినపుడు చెప్పారు. తీరా ఆ జిల్లా అధ్యక్షుడిని అక్కడ నిలిపారు. దానితో అగ్గిమీద గుగ్గిలంలా లేచిన బాలశంకర్‌ వీర శంకర్‌గా మారి ఇలాంటి నాయకత్వం ఉంటే కేరళలో మరో 30సంవత్సరాలున్నా పార్టీ అధికారంలోకి రాదు అని చిందులేశాడు. హిందూ, క్రైస్తవ మత సంస్ధల మద్దతు ఉంది, గెలిచే అవకాశాలున్నప్పటికీ పార్టీ నాయకత్వం సిపిఎంతో లాలూచీ పడి తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌-సిపిఎం కుమ్మక్కయినట్లు బిజెపి చెబుతుంటే దాన్నే కాస్త మార్చి వెరైటీగా చెప్పారు. తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేయటంలో అందెవేసిన చేతులు చివరికి తమ పార్టీకే దాన్ని వర్తింప చేశాయి. రెండు చోట్ల పోటీ చేస్తున్న బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్ను ఒక చోట గెలిపించే విధంగా ,దాని బదులు చంగన్నూరులో సిపిఎంను గెలిపించే విధంగా కుమ్మక్కు అయ్యారని అరోపించారు. సీటు రాని కారణంగా ఆశాభంగం చెందిన బాలశంకర్‌ ఇతర నేతల వంటి వ్యక్తి కాదని అతన్ని రెచ్చగొట్టవద్దని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ వ్యాఖ్యానించారు. బాలశంకర్‌కు గెలిచేంత సీను ఉంటే అధిష్టానం సీటు ఇచ్చే ఉండేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. బాలశంకర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో పెరిగిన వ్యక్తిగనుక తక్కువగా చూడవద్దని, అతనికి సీటు రాలేదు గనుక బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారని నీమమ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి కె. మురళీ ధరన్‌ అన్నారు.
కాంగ్రెస్‌-బిజెపిలు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజాస్వామ్యం ఒక అమ్మకపు సరకుగా మారింది. కాంగ్రెస్‌ను ఒక సాధనంగా చేసుకొని బిజెపి గోవా, పుదుచ్చేరి, త్రిపురవంటి చోట్ల ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నది. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు బిజెపిలో చేరే దశకు ఆ పార్టీ చేరుకుంది. నీమమ్‌లో బిజెపికి వచ్చిన ఓట్లు ఏమయ్యాయి ? ఆ రెండు పార్టీల కుమ్మక్కుకు ఇది నిదర్శనం కాదా. అక్కడ కాంగ్రెస్‌ కొత్త అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఏం జరుగుతుందో చూద్దాం. మాకు ఎలాంటి ఆందోళనా లేదు అని విజయన్‌ అన్నారు. గతంలో కూడా బిజెపి సురేంద్రన్‌ రెండు చోట్ల పోటీచేశారని గుర్తు చేశారు. ఎల్‌డిఎఫ్‌ రెండో సారి అధికారంలోకి రావాలంటే బిజెపికి కొన్ని సీట్లు ఉండాలని అందుకే ఈ కుమ్మక్కని కాంగ్రెస్‌నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ ఆరోపించారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు టోకున బిజెపికి అమ్ముడు పోతున్న నేపధ్యంలో తమకు కేరళలో 35 సీట్లు వస్తే చాలని బిజెపి నేత సురేంద్రన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం మీద బాలశంకర్‌ తమ పార్టీ మీద ధ్వజమెత్తి సంచలనం సృష్టించారు. క్రమశిక్షణ గల సంస్దగా ఆర్‌ఎస్‌ఎస్‌, దాని ఉత్పత్తిగా బిజెపిలో ఉన్న నేతల బండారం ఏమిటో ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అధికారం వచ్చే అవకాశం ఏమాత్రం లేని చోటే ఇలా ఉంటే ఏలుబడి ఉన్న చోట ఎలా కొట్లాడుకుంటారో ఊహించుకోవలసిందే.

పగెలుస్తాననే విశ్వాసం లేదు- ఏదో ప్రధాని అడిగారు కనుక పోటీలో ఉన్నా – నటుడు సురేష్‌ గోపి !

ఎన్నికలలో పోటీ చేయాలని నాకు ఇప్పటికీ లేదు. గెలుస్తాననే విశ్వాసం కూడా లేదు. పార్టీ నేతలు బలవంతం చేసి మూడు నియోజకవర్గాల పేర్లు చెప్పి ఏదో ఒకదానిని ఎంచుకోమంటే త్రిసూర్‌ అన్నాను. ప్రధాని నరేంద్రమోడీ అడిగారు గనుక పార్టీకి నిబద్దుడైన కార్యకర్తగా పోటీచేస్తున్నా అని సిని నటుడు సురేష్‌ గోపి చెప్పారు. స్వల్ప అస్వస్తత తరువాత ఆసుపత్రి నుంచి విడుదలైన గోపి విలేకర్లతో మాట్లాడారు. ముందు నాకు ఆరోగ్యం ముఖ్యం, విశ్రాంతి కావాలి, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు వీలుగా కోవాలి. తరువాతనే ప్రచారం చేస్తా అని చెప్పారు. బలవంతంగా లేదా బెదరించి ఇలాంటి వారిని ఎందరిని పోటీలోకి దింపుతున్నారో కదా !తాను కోరుకున్న సీటు ఇవ్వకపోతే అసలు పోటీ చేయను అని బిజెపి మహిళా నేత శోభా సురేంద్రన్‌ పార్టీని బెదిరించారు. దాంతో చివరకు ఆమె కోరుకున్న సీటునే ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఉన్నట్లు మీడియా కథలు అల్లిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. అయితే రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండానే అధిష్టానం ఆమెకు సీటు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రోజు శోభ మాట్లాడుతూ సీనియర్‌ నేతలు రాజగోపాల్‌, కుమనం రాజశేఖర్‌లకు ఇవ్వని బహుమతిని రాష్ట్ర అధ్యక్షుడు సరేంద్రన్‌కు ఇచ్చారు. రెండు చోట్ల పోటీ చేస్తున్న సురేంద్రన్‌కు ఇది సువర్ణ అవకాశమని, రెండు చోట్లా గెలవాలని కోరుకుంటున్నా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శోభ గనుక పోటీలో ఉండేట్లయితే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు వచ్చిన వార్తలను కె.సురేంద్రన్‌ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో ఎన్నికల్లో హెలికాప్టర్లలో తిరుగుతుంటే తాను పార్టీ సమకూర్చిన డబ్బుతో హెలికాప్టర్‌ ద్వారా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.

విద్యారంగంలో కేరళ వెనుకబడిందన్న త్రిపుర బిజెపి సిఎం !

త్రిపుర ముఖ్యమంత్రి, బిజెపి నేత విప్లవ కుమార్‌ దేవ్‌ బిజెపి ఎన్నికల ప్రచారంలో విద్యాపరంగా కేరళ వెనుకబడిపోయిందని చెప్పారు. కేంద్ర పధకాలను వేగంగా అమలు జరుపుతున్న కారణంగా త్రిపుర అభివృద్ధిలో కేరళ కంటే ముందున్నదని చెప్పుకున్నారు. అసలు ఒక్క స్దానం కూడా లేకుండా అధికారానికి ఎలా రాగలదో బిజెపి త్రిపురలో చూపిందని, ఇక్కడ ఒక సీటు ఉన్నందున అధికారంలోకి రావటం ఒక సమస్య కాదన్నారు. కమ్యూనిస్టుల పాలనలో కేరళకు ఒరిగిందేమీ లేదన్నారు.
తిరువనంతపురం పట్టణంలోని నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ స్వయంగా పోటీకి దిగింది.గతంలో బిజెపి ఓ రాజగోపాల్‌తో కుమ్మక్కయి జెడియుకు సీటిచ్చి తన ఓట్లను బదలాయించి గెలుపుకు తోడ్పిడిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు, ఎంపీ అయిన మురళీధరన్‌ను పోటీకి నిలిపింది. బిజెపికి అతను గట్టి పోటీదారు అని బిజెపి ఎంఎల్‌ఏ ఓ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు.తాను పోటీలో లేకున్నా పార్టీ అభ్యర్ది కుమనమ్‌ రాజశేఖర్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా అని చెప్పారు. నీమమ్‌లో చూపిన ధైర్యాన్ని ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న ధర్మదోమ్‌లో ఎందుకు చూపలేకపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ప్రశ్నించారు.

విజయన్‌పై పోటీకి పిరికి బారిన కన్నూరు ఎంపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ తిరస్కారం !

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీ చేసేందుకు కన్నూరు ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె సుధాకరన్‌ వెన్ను చూపారు. అనేక మంది నేతలు, కార్యకర్తలు సుధాకరన్‌ అయితేనే విజయన్‌కు గట్టి పోటీ అని చెప్పగా తాను అందరి కోరికలను తీర్చలేనని అన్నారు. గట్టి పోటీ పెట్టవచ్చుకదా అని విలేకర్లు అడిగితే ఇదేమీ కుస్తీపోటీ కాదు, ఎన్నిక అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధి ఈసారి ముందుకు రాలేదు. దీంతో కాంగ్రెస్‌ తన మిత్రపక్షమైన ఫార్వర్డ్‌బ్లాక్‌ పోటీ చేసేందుకు ఆ స్ధానాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే తమ అభ్యర్ధి అక్కడ పోటీలో ఉండరని ఆ పార్టీ ప్రకటించటంతో కాంగ్రెస్‌ అభ్యర్ధివేటలో పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ విజయన్‌ 57శాతం ఓట్లు తెచ్చుకొని ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌ తన అభ్యర్దిని చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉంది.

సిపిఐకి రాజీనామా చేసి బిజెపి కూటమిలో పోటీ !

సిపిఐలో సీటు రాకపోవటంతో అలపూజ జిల్లాలో గతంలో జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన తంపి మెట్టుతార ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి కూటమిలోని బిజెడిఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కేరళలో సిపిఎంకు బి టీమ్‌గా సిపిఐ పని చేస్తున్నదని ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదులను పార్టీ పట్టించుకోనందున రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌డిఏలోని పిసి ధామస్‌ కాంగ్రెస్‌ ఆ కూటమికి గుడ్‌బై చెప్పి యుడిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌(జె)లో చేరారు. గతంలో నాలుగు సీట్లు ఇచ్చిన బిజెపి ఈ సారి ఒక్క స్దానం కూడా ఇవ్వకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాలుగు సార్లు ఎంపీగా పని చేసిన, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడైన పిసి చాకో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను ఎన్‌సిపిలో చేరి ఎల్‌డిఎఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ను కలిసి చెప్పారు. కేరళలో కాంగ్రెస్‌(ఐ), కాంగ్రెస్‌ (ఏ) వాటిని సమన్వయపరిచే కమిటీ తప్ప అసలు కాంగ్రెసే లేదని చాకో వ్యంగ్యబాణాలు వదిలారు.
తనకు సీటు ఇవ్వనుందుకు నిరసగా గుండు చేయించుకొని నిరసన తెలిపి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన లతికా సురేష్‌ కొట్టాయం జిల్లాలో యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షం కేరళ కాంగ్రెస్‌(జె) పోటీ చేస్తున్న ఎట్టుమనూర్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దగనున్నారు. పావు గుండు నరేంద్రమోడీ, మరో పావు రాష్ట్రప్రభుత్వం, సగం గుండును పార్టీ తనకు సీటు ఇవ్వనందుకు నిరసగా చేయించుకున్నట్లు ఆమె చెప్పారు.

ఆహారకిట్‌ ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వలేదు – బిజెపికి విజయన్‌ ప్రశ్న !

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఆహార కిట్‌ కేంద్రం సరఫరా చేసిందే అని బిజెపి నేతలు ప్రచారం చేయటాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. అదే నిజమైతే అన్ని రాష్ట్రాలలో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు.ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం వాటిని అందచేసింది, అదేమీ పెద్ద విషయం కూడా కాదు, ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ అందించాం. దాన్ని గురించి ప్రచారం కూడా చేయలేదు. అయితే కాంగ్రెస్‌, బిజెపికి చెందిన కొంత మంది ఇప్పుడు కిట్‌లోని సరకులన్నీ కేంద్రం ఇచ్చినవే అని తామే ఇచ్చినట్లు విజయన్‌ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. నిజంగా కేంద్రమే ఇస్తే మిగతా చోట్ల ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని విజయన్‌ అన్నారు.
కేరళ ప్రభుత్వం కరోనా సాయంగా ప్రతినెలా అందచేస్తున్న ఆహార కిట్‌లో 17 నిత్యావసర వస్తువులు ఉన్నాయి.1. కిలో పంచదార, 2. పావు కిలో తేయాకు, 3.కిలో ఉప్పు, 4. కిలో పెసలు, 5. కిలో సెనగపప్పు, 6.పావుకిలో కందిపప్పు, 7.అరకిలో కొబ్బరి నూనె, 8.కిలో సన్‌ఫ్లవర్‌ నూనె, 9.రెండు కిలోల గోధుమ పిండి, 10.కిలో బొంబాయి రవ్వ, 11.కిలో మినప పప్పు, 12. వందగ్రాములు కారం, 13.వందగ్రాముల ధనియాల పొడి, 14.వంద గ్రాములు పసుపు, 15.వందగ్రాముల మెంతి పొడి, 16.వందగ్రాముల ఆవాలు, 17. రెండు సబ్బులు ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపికి తీవ్ర ఆశాభంగం కలిగించిన అయ్యప్ప !

12 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Kerala elections 2021, #Pinarayi Vijayan, Ayyappa-Pandalam palace, BJP-Kerala, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: