• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Mike Pompeo

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత : అమెరికా-చైనా యుద్దానికి దారి తీస్తుందా !

14 Tuesday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#South China Sea, Mike Pompeo, south china sea conflict, War Drills In South China Sea


ఎం కోటేశ్వరరావు
దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చా రాకపోకల పేరుతో అమెరికా యుద్ధానికి తలపడుతుందా? అమెరికా నౌకా దళాన్ని ఎదుర్కొనేందుకు చైనా అనివార్యంగా సాయుధ సమీకరణకు పూనుకోవాల్సి వస్తోందా ? ఇది ఏ కొత్త పరిణామాలకు నాంది కానుంది ? భారత్‌కు మద్దతుగా అమెరికా సైనిక బలగాలను తరలించిందా ? ఆ ప్రాంతంలో తలెత్తిన పరిణామాల ఫలితంగా వెలువడుతున్న అనేక ఊహాగానాలలో ఇవి కొన్ని మాత్రమే.
అమెరికాకు అగ్రాధిపత్యం అన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. నవంబరులో ఎన్నికలంటూ జరిగితే తనకే అధికార పీఠం మరోసారి దక్కాలని కోరుతున్న ట్రంప్‌ ఓట్లకోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకూ మరింతగా అమెరికాను చుట్టుముడుతోంది. మిన్నువిరిగి మీద పడ్డా తాను ముఖతొడుగు ధరించేది లేదని ఇన్నాళ్లూ భీష్మించుకున్న ట్రంప్‌ ఆపని కూడా చేసి జనాల కళ్లు కప్పేందుకు పూనుకున్నారు. దక్షిణ చైనా సముద్రం, ఆ ప్రాంతంలో ఉన్న సంపదలన్నీ తనవే అని చైనా బెదిరింపులకు దిగిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈనెల పదమూడవ తేదీన ఒక ప్రకటనలో ఆరోపించాడు. తన తీరం నుంచి పన్నెండు నాటికల్‌ మైళ్లు(22కిలోమీటర్లు) దూరానికి ఆవల ఉన్నవాటి మీద అధికారం తనదే అని చైనా అంటే కుదరదని, మలేషియాకు దగ్గరగా చైనాకు 1,852 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేమ్స్‌ షావోల్‌ వంటి ప్రాంతాలు కూడా తనవే అని చైనా అంటోందని పాంపియో ఆరోపించాడు.
వాస్తవాలను, సముద్ర అంతర్జాతీయ చట్టాలను అమెరికా వక్రీకరిస్తోందని, పరిస్దితిని బూతద్దంలో చూపుతోందని చైనా విమర్శించింది. ఆ ప్రాంత దేశాలతో వివాదాలను నేరుగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనేందుకు చైనా సిద్దంగా ఉన్నదని, వాటిలో అమెరికా లేదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని తెలిపింది.
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ ఆ ప్రాంత దేశాల ప్రయోజనాల పేరుతో అమెరికా తన యుద్ద నావలను దక్షిణ చైనా సముద్రంలోకి దింపి రెచ్చగొట్టేందుకు పూనుకుంది. దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా తన ప్రయత్నాలను తాను చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే రెండు విమాన వాహక యుద్ద నౌకలు ఉన్నాయి. మూడవది దారిలో ఉంది. ఇవిగాక నాలుగు యుద్ద నౌకలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఆ సముద్రంలోని పార్సెల్‌, స్పార్టలే దీవుల ప్రాంతంలో చైనా కృత్రిమ దీవులను నిర్మించి తరచూ పెద్ద ఎత్తున తన నౌకా దళ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలో తమ మిత్రదేశాల నౌకలు స్వేచ్చగా తిరిగేందుకు మద్దతుగా, ప్రాంతీయ భద్రత కోసమే తమ యుద్ద నౌకలు ఉన్నాయి తప్ప వేరే కాదని అమెరికా చెప్పుకుంటోంది. అమెరికా విమానవాహక, ఇతర యుద్ద నౌకల సంచారం తమ ప్రజావిముక్తి సైన్యానికి(చైనా మిలిటరీ) సంతోషం గలిగించేదేనని, క్షిపణులను కూల్చివేసే విమాన వాహక నౌకలతో సహా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చైనా వ్యాఖ్యానించింది.ఈ ప్రాంతానికి చెందని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని దేశాలు బల ప్రదర్శన చేస్తున్నాయని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం నుంచి నౌకలు, వైమానిక మార్గాల ద్వారా ఏటా ఐదులక్షల కోట్లడాలర్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.
జూన్‌ నెలలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. (జపాన్‌కు అధికారికంగా మిలిటరీ లేనప్పటికీ ఆత్మ రక్షణ దళాల పేరుతో ఉన్న వాటిని సాయుధం గావిస్తున్నది. ఏక్షణంలో అయినా పూర్తి మిలిటరీగా మార్చేందుకు వీలుగా ఉంది.)ఈనెల ఒకటి నుంచి ఐదు వరకు వార్షిక విన్యాసాల్లో భాగంగా చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిన గ్జిషా(పార్సెల్‌) దీవుల చుట్టూ అమెరికా యుద్ద నౌకలు తిరుగుతున్నాయి. ఈ దీవులు, స్పార్టలే దీవులలో తమకూ వాటా ఉందని వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పైన్స్‌, మలేషియా కూడా చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాల గురించి తాము దౌత్య పరమైన నిరసన తెలిపినట్లు ఈనెల రెండున వియత్నాం వెల్లడించింది. ఒక వేళ మిలిటరీ మధ్య ఘర్షణలు ప్రారంభమైతే అమెరికాకు మద్దతుగా జపాన్‌, ఆస్ట్రేలియా వస్తాయని, తమతో ఉన్న సంబంధాల రీత్యా వియత్నాం పాల్గొనకపోవచ్చని అయితే, తన అమెరికా సేనల రాకపోకలకు తమ సముద్ర ప్రాంతాన్ని అనుమతించవచ్చని చైనా అంచనా వేస్తోంది. ఏ దేశమూ పూర్తి విజయం సాధించలేదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. చైనా తన భద్రత, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సమతూకాన్ని పునరుద్దరించేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోందని కూడా తెలిపారు. కృత్రిమ దీవులలో కొద్ది వారాల క్రితమే రెండు పరిశోధనా కేంద్రాలను వాటికి మద్దతుగా రక్షణ, మిలిటరీ ఏర్పాట్లు కూడా చేసింది. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు పనేమిటి అన్న ప్రశ్నకు మేము ఇక్కడ ఉన్నాం లేదా చైనా నౌకలను అడ్డుకొనేందుకు అని చెప్పటమే అని సింగపూర్‌కు చెందిన నిపుణుడు ఇయాన్‌ స్టోరే వ్యాఖ్యానించాడు.తమ యుద్ద నౌకలు నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నాయి అన్నది వెల్లడి కాకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంది. అయితే మలేషియా తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల దూరంలో అవి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిని ఆస్ట్రేలియా ఫ్రైగేట్‌ పరమటా అనుసరిస్తున్నది. ముందుగా రూపొందించిన పధకం ప్రకారమే ఏడాది క్రితం నుంచి అది అమెరికా నౌకలను అనుసరిస్తున్నదని ఆస్ట్రేలియా మాజీ రక్షణ అధికారి జెన్నింగ్స్‌ చెప్పారు. ఆ ప్రాంతం మీద తమకు హక్కు ఉన్నట్లు మలేసియా, చైనా, వియత్నాం వాదిస్తున్నాయి. అమెరికా విమాన వాహక నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచే తిరుగుతున్నది, అయితే కరోనా వైరస్‌ కారణంగా ఒక నావికుడు మరణించటం, వందలాది మంది బాధితులుగా మారటంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇతర అమెరికా యుద్ద నౌకల పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది.
గాల్వాన్‌ లోయలో భారత-చైనా మిలటరీ వివాదం తరువాత భారత్‌కు మద్దతుగా తాముంటామని అమెరికా ముందుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నావలు దానిలో భాగమే అన్నట్లుగా ఒక భాగం మీడియా చిత్రించింది. నిజానికి వాటికీ గాల్వాన్‌ లోయ వివాదానికి సంబంధం లేదు. అయితే ఆసియాలో ప్రాంతీయ శక్తిగా రూపొందాలంటే చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ ముందుకు రావాలని అప్పుడు అమెరికా మద్దతు ఇస్తుందని, ఇందుకు గాను అమెరికా సాయం, సాంకేతిక పరిజ్ఞానం పొందితేనే సాధ్యమని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేసే ఒక అమెరికన్‌ సంస్ధ డైరెక్టర్‌ అపర్ణా పాండే రెండు వారాల క్రితమే సలహా ఇచ్చారు.
రెండవ ప్రపంచయుద్ద సమయంలో చైనా అత్యంత బలహీనమైన మిలిటరీతో ఉన్నది. జపాన్‌ దురాక్రమణనే అది ఎదిరించలేకపోయింది. ఇంతవరకు సముద్రంలో అమెరికా-చైనా నౌకా యుద్దంలో తారసిల్లిన ఉదంతం లేదు.అమెరికా ఒక మిలిటరీ శక్తిగా ఇప్పటికీ అగ్రస్ధానంలో ఉన్నప్పటికీ ప్రాంతీయ యుద్దాలలో దానికి చావుదెబ్బలు తగిలాయి తప్ప విజయాలేమీ లేవు. కొరియా యుద్దంలో చైనా సత్తా ఏమిటో అమెరికాకు తెలిసి వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఎంతో బలపడిన చైనాతో ఇప్పుడు తలపడుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత దశాబ్దిలో చైనా వైమానిక, నౌకాదళంలో చోటు చేసుకున్న మార్పులు, బలం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు పెద్దగా యుద్ద అనుభవం లేదు, అందువలన దానికి బలం ఉన్నా తామే పైచేయి సాధిస్తామని అమెరికా అనుకుంటోంది. అమెరికా పెద్ద ఆర్దిక శక్తిగా ఉన్నా వేల మైళ్ల దూరం నుంచి చైనాను ఎదుర్కొని తమను ఆదుకొంటుందని ఆసియా ప్రాంత దేశాలు భావించటం లేదు. అందువల్లనే అటుచైనా ఇటు అమెరికా వైపు మొగ్గేందుకు జంకుతున్నాయని చెప్పాలి. దానికి తోడు అనేక దేశాలతో ఇటీవలి కాలంలో చైనా కుదుర్చుకున్న ఒప్పందాలు, మిలిటరీ కేంద్రాల ఏర్పాటును చూసిన తరువాత అమెరికాను నమ్మి ప్రస్తుతానికైతే ఘర్షణ పడేందుకు సిద్దంగా లేవు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఎన్ని యుద్ద నావలను దించిందో దాని ధీటుగా చైనా బలగాలు కూడా ఉన్నాయని, పరిస్ధితి ఎంత పోటా పోటీగా ఉందంటే ఒక సందర్భంలో చైనా నావకు అత్యంత సమీపానికి అమెరికా నావ వచ్చినపుడు రెండువైపులా ఎంతో సంయమనం పాటించినట్లు ఒక చైనా మిలిటరీ అధికారి వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కూడా అమెరికా రెచ్చగొడుతున్న తీరును దాని తెగింపుకు నిదర్శనమని చైనా భావిస్తోంది. మన దేశంతో చైనా సరిహద్దు వివాదం ప్రారంభంగాక ముందే ఏప్రిల్‌, మే నెలల్లోనే దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికన్‌ నౌకల రాక ప్రారంభమైంది. సాధారణంగా కొన్ని నెలల ఏర్పాట్ల తరువాత గానీ అలాంటివి చోటు చేసుకోవు. అయితే ఈ నౌకల రాక నేపధ్యంలోనే మే నెలలో చైనాాభారత సరిహద్దు వివాదం చెలరేగటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది సమాధానం లేని సందేహమనే చెప్పాలి.
అమెరికాాచైనా మధ్య పెరుగుతున్న వివాదం వివాదాస్పద దీవుల విషయంలో తాము చైనా మీద వత్తిడి తీసుకురాగలమని, ఆ పరిస్ధితి తమకు ప్రయోజనకరమే అని కొన్ని దేశాలు భావించవచ్చు గానీ అదే సమయంలో అవి యుద్దాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాపితంగా కరోనా తెచ్చిన ఆర్ధిక సంక్షోభ భయం కూడా దీనికి తోడవుతున్నది కనుక అంతగా ఉత్సాహంగా లేవు. ప్రస్తుత పరిస్ధితుల్లో యుద్దం తమకు లాభమా నష్టదాయకమా అన్న అమెరికా యుద్ద పరిశ్రమల అంచనాను బట్టి కూడా పరిణామాలు ఉంటాయి. కరోనా వైరస్‌ సమస్యతో తీవ్ర ఆర్ధిక వడిదుడుకులకు గురైన చైనా అనివార్యమై అమెరికాను ఎదుర్కొనేందుకు తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది తప్ప యుద్ధానికి అది కూడా సిద్దం కాదనే చెప్పాలి.
సంచలనాత్మక కథనాలతో వీక్షకులను, పాఠకులను పెంచుకొనేందుకు మీడియా రాస్తున్న, చూపుతున్న కథనాలు, కొందరి విశ్లేషణలను చూస్తే ముంగిట యుద్దం ఉన్నదా అనే భ్రమ కలుగుతోంది. ఇప్పుడున్న స్ధితిలో కరోనా, దానితో కలసి వస్తున్న ఆర్ధిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ప్రతి దేశ పౌరుడూ ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటారని అనుకోజాలం. అలాంటి యుద్దోన్మాదం, ఉన్మాదులను సమాజం సహించదు. ట్రంప్‌ సర్కార్‌ ఎంతగా రెచ్చగొట్టినా అది అధ్యక్ష ఎన్నికల లబ్ది కోసమే అన్నది బలమైన అభిప్రాయం, అందువలన ప్రస్తుతం యుద్దం వచ్చే అవకాశాలు పరిమితమే అని చెప్పవచ్చు.యుద్ద భేరీలు, నాదాలు చేసినంత మాత్రాన, మీడియా రెచ్చగొట్టుళ్లతో యుద్ధాలు జరగవు. అవన్నీ ఎత్తుగడల్లో భాగం కూడా కావచ్చు. అయితే సామ్రాజ్యవాద దేశాల తీరుతెన్నులను చూస్తే తాము సంక్షోభంలో పడినపుడు దాన్ని జనం మీద, ఇతర దేశాల మీద నెట్టివేసేందుకు యుద్ధాలకు పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. అందువలన అమెరికా ఆంతర్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత్‌, ప్రపంచానికి ముప్పు ఎవరి నుంచి ?

28 Sunday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Alliance Between United States and India, cut troops in Germany, Diego Garcia, Mauritius, Mike Pompeo, NATO, Threat to India from whom


ఎం కోటేశ్వరరావు
చైనా విస్తరణ వాదం వర్తమానకాల సవాలు అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పాడు, దాన్ని ఎదుర్కొనేందుకు తమ వనరులను సమీకరిస్తామని అన్నాడు.జర్మన్‌ మార్షల్‌ ఫండ్‌ బ్రసెల్స్‌ ఫోరమ్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి భారత్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రాలకు ముప్పు ఉందని పాంపియో వ్యాఖ్యానించాడు. ఈ నేపధ్యంలో భారత్‌కు అమెరికా సైన్యం బాసటగా నిలవనున్నదని మీడియా వ్యాఖ్యానాలు చేసింది. ” చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌, ఆగేయాసియాకు అమెరికా మిలిటరీ తరలింపు: పాంపియో ” ఒక ఆంగ్ల దినపత్రిక శీర్షిక. ఈ వార్తలు వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఇంకేముంది అమెరికా సైన్యం భారత్‌కు మద్దతుగా వస్తున్నట్లు, చైనాను అడ్డుకొనేందుకు సిద్దపడటం, అంతా అయిపోయినట్లు దాని మంచి చెడ్డలను చర్చిస్తున్నారు.
భారత్‌ లేదా ప్రపంచానికి అసలు ముప్పు ఎవరి నుంచి ఉంది? చైనా నుంచా ? అమెరికా నుంచా ? విస్తరణ వాదం అంటే ఏమిటి ? రెండవ ప్రపంచ యుద్దంలో పరాజిత జర్మనీ లేదా విజేత సోవియట్‌ యూనియన్‌ గానీ ఒక వేళ దాడి చేస్తే పరస్పరం సహకరించుకుందామంటూ 1947 మార్చి నాలుగున ఫ్రాన్స్‌-బ్రిటన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తరువాత తమ పరిసర దేశాలతో దాన్ని వెస్టరన్‌ యూనియన్‌గా విస్తరించారు.1949 ఏప్రిల్‌ నాలుగున మరికొన్ని ఐరోపా దేశాలు, అమెరికా, కెనడాలకు విస్తరించి నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో)గా మార్పు చేశారు. ఏ జర్మనీ నుంచి ముప్పు అని ఒప్పందం ప్రారంభమైందో ఆ జర్మనీయే 1955లో నాటోలో చేరింది. ఏ సోవియట్‌ యూనియన్‌ అయితే దాడి చేస్తుందనే ప్రచారం చేశారో అది ఏ ఒక్కదేశం మీద కూడా దాడి చేయలేదు.1991లో సోవియట్‌ సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత దాని రిపబ్లిక్‌లు స్వతంత్రదేశాలుగా ప్రకటించుకున్నాయి. సోవియట్‌తో ప్రచ్చన యుద్దంలో తామే విజేతలమని అమెరికన్లు ప్రకటించుకున్న తరువాత నాటో కూటమిని రద్దు చేయాలి. ముప్పు అనుకున్న సోవియట్‌ అసలు ఉనికిలోనే లేదు. అలాంటపుడు ఐరోపాకు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లు ? రద్దు చేయకపోగా ఇతర దేశాల్లో మిలిటరీ జోక్యానికి పూనుకుంది. అనేక దేశాలకు విస్తరింప చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో చేస్తున్న మిలిటరీ ఖర్చులో 70శాతం ఈ కూటమి ఖర్చే ఉంది. ప్రస్తుతం ప్రపంచానికి అది ముప్పుగా పరిణమించింది అంటే అతిశయోక్తి కాదు.1990దశకం నుంచి అనేక దేశాల మీద అమెరికన్లు, దాని మిత్రదేశాలు ఏదో ఒక వంకతో చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. ఇక విస్తరణ వాదం గురించి చెప్పాల్సి వస్తే 1949 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు విస్తరించారు,పన్నెండు నుంచి 30దేశాలకు సభ్య రాజ్యాలు పెరిగాయి. ఇంకా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా చేరిన దేశం ఉత్తర మాసిడోనియా. అనేక దేశాలు నాటో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి శత్రువు ఎవరో, ఎవరి నుంచి రక్షణ పొందటానికో అగమ్యగోచరం.
ఇప్పుడు జర్మనీలో ఉన్న సైన్యాలను తగ్గించి భారత్‌, ఆగేయాసియాకు తరలిస్తామని పాంపియో చెబుతున్నాడు. అసలు చైనా విస్తరణ వాదం అనేది ఒక ఊహాజనితం, కుట్ర సిద్ధాంతాలలో భాగం. జర్మనీ నుంచి సైన్యాల తగ్గింపు-భారత్‌కు తరలింపు అన్నది లడఖ్‌ ఉదంతాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొంద చూసే అమెరికా యత్నం తప్ప మరొకటి కాదు. భారత్‌-చైనాల మధ్య తాజా సరిహద్దు ఉదంతాలు జరగటానికి ఎంతో ముందే అమెరికా ఆ నిర్ణయానికి వచ్చింది. భారత్‌కు మేలు చేసేందుకే ఇది అన్నట్లు ఇప్పుడు ఫోజు పెడుతోంది.
జర్మనీలో 35వేల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు. వారిని 25వేలకు కుదిస్తామని అమెరికా చెప్పింది. నాటో నుంచి తాము వైదొలుగుతామని గత ఎన్నికల్లో చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.నాటో నిర్వహణకు అయ్యేఖర్చును తామే ఎందుకు భరించాలని ప్రశ్నించి అదే ట్రంప్‌ వివాదపడిన విషయం తెలిసిందే. అదిరించో బెదిరించో ఖర్చును ఐరోపా దేశాల మీద నెట్టి తమ చేతికి మట్టి అంటకుండా నాయకత్వ స్ధానంలో ఉండాలన్నది అమెరికా ఎత్తుగడ. తనకు లాభం లేదనుకున్న అనేక ప్రపంచ సంస్ధలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది.నాటో నుంచి వైదొలుగుతామని బెదిరించటం తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయటం లేదు. అమెరికా గనుక అంత పని చేస్తే నాటో బలహీనపడి రష్యాకు ఉపయోగపడుతుందని నిపుణులు హెచ్చరించటమే దీనికి కారణం.
నాటోకు చెల్లింపులు చేయటాన్ని జర్మనీ ఒక అపరాధంగా భావిస్తోంది, ఐరోపా దేశాలు తమ రక్షణకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టుకోవాలి, జర్మనీ వైఖరిని మార్చుకోనట్లయితే అక్కడి నుంచి సైన్యాలను తగ్గించాలన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ట్రంప్‌ చెప్పాడు. అమెరికా సైన్యాలు ఐరోపాలో అట్లాంటిక్‌ దేశాల భద్రత కోసం ఉన్నాయి తప్ప జర్మనీని రక్షించటానికి కాదని అమెరికాలో జర్మనీ రాయబారి ఎమిలీ హార్బర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిజానికి జర్మనీలో అమెరికన్‌ సైన్యాల మోహరింపు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర చోట్లకు వేగంగా తరలించటానికి అనువుగా ఉండటం తప్ప జర్మనీకో మరో ఐరోపా దేశానికో ముప్పు కారణం కాదు. నాటో సభ్యరాజ్యాలు తమ జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని రక్షణకు ఖర్చు పెట్టాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంటే దాని సైనికులు, ఆయుధాలకు ఐరోపా దేశాలు చెల్లించాలన్నది అసలు విషయం.
జర్మనీతో అమెరికాకు వాణిజ్య పేచీ కూడా ఉంది. వాణిజ్యం విషయంలో అమెరికాను జర్మనీ చాలా చెడ్డగా చూస్తోంది, చర్చలు జరుపుతున్నాం గానీ సంతృప్తికరంగా లేవు. వారి వలన అమెరికాకు కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి, నాటో విషయంలో మా మనసు గాయపడింది. మా సైనికులు చేసే ఖర్చుతో జర్మనీ లబ్ది పొందుతోందని ట్రంప్‌ రుసరుసలాడాడు. తాము రక్షణ కోసం జిడిపిలో 3.42శాతం ఖర్చు చేస్తుంటే జర్మనీ కేవలం 1.8శాతమే కేటాయిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా విమర్శించాడు. నాటో బడ్జెట్‌లో అమెరికా, జర్మనీ 16శాతం చొప్పున భరిస్తున్నాయి. ఈనేపధ్యంలోనే అమెరికన్‌ సైనికుల ఖర్చును భరించే మరో దేశం కోసం ట్రంప్‌ చూస్తున్నాడన్నది స్పష్టం. అది మన దేశం అవుతుందా ? మరొక ఆగేయాసియా దేశం అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే అమెరికాను మన భుజాల మీద ఎక్కించుకొనేందుకు మన పాలకవర్గం సిద్దం కాదు. దానితో చేతులు కలిపి లబ్ది పొందాలని చూస్తున్నదే తప్ప లొంగిపోయి అది విసిరే ఎంగిలి మెతుకులు తినాలని అనుకోవటం లేదు. ఈ వైఖరి నుంచి వైదొలిగే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అమెరికా సైన్యాలు మన గడ్డమీద తిష్టవేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
ప్రపంచంలోని 150దేశాలలో లక్షా 70వేల మంది అమెరికన్‌ సైనికులు విధులలో ఉన్నారు. వారిలో గరిష్టంగా జపాన్‌లో 55వేలు, దక్షిణ కొరియాలో 26, జర్మనీలో 35, ఇటలీలో పన్నెండు, బ్రిటన్‌లో పదివేల మంది ఉన్నారు. మైక్‌ పాంపియో చీకట్లో బాణం వేశాడు. జర్మనీ నుంచి తగ్గించదలచిన తొమ్మిదిన్నరవేల మందిని ఎక్కడకు తరలించాలన్నది ఇంకా తేలాల్సి ఉంది. జర్మనీతో రాజీ కుదిరితే వారిని అక్కడే కొనసాగించవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నేడు ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దాన్నే విస్తరణవాదంగా అమెరికా, దాని అడుగుజాడల్లో నడిచే దేశాలు చిత్రిస్తున్నాయి. ఈ పేరుతోనే గడచిన మూడు సంవత్సరాలలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన బల ప్రదర్శలో భాగంగా మూడు విమాన వాహక, ఇతర యుద్ద నౌకలను అమెరికా మోహరించింది. వాటిని చూపి మనతో సహా అనేక దాని మిత్ర దేశాలకు మీ వెనుక మేమున్నాం చైనా మీదకు మీరు దూకండి అని అమెరికా సందేశాలు పంపుతోంది. దానికి ప్రతిగా చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది. వాణిజ్య పరంగా పెట్టుబడులు, ఒప్పందాలు తప్ప చైనా మిలిటరీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే అది అనేక చోట్ల నిర్మిస్తున్న రేవులు వాణిజ్యంతో పాటు మిలిటరీని ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయని అమెరికా, దాన్ని అనుసరించే వారు చెబుతున్నారు. కానీ వారు 150దేశాల్లో అమెరికా మిలిటరీ లేదా దాని సైనిక కేంద్రాలు ఎందుకు ఉన్నాయో చెప్పరు.
ప్రస్తుతం అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలంటే నావికులు నడిపే 390, నావికులు లేకుండా కంప్యూటర్లద్వారా నడిచే మరో 45 నౌకలు కావాల్సి ఉంటుందని ఒక సంస్ధ అంచనా వేసింది. దీనికి గాను ప్రస్తుతం అమెరికా వద్ద మొత్తం 294 మాత్రమే ఉన్నాయని, 2030 నాటికి వాటిని 355కు పెంచుకొనేందుకు అమెరికన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని 2016లోనే అమెరికా ప్రకటించింది. ఆ తరువాత మన మిలిటరీతో సంబంధాలను గణనీయంగా మెరుగుపరుకుంది, తొలిసారిగా మన త్రివిధ దళాలతో సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. విశాఖ నుంచి కాకినాడ వరకు అమెరికా నావికా దళం ప్రయాణించింది. ఒక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇవన్నీ చైనాను ఎదుర్కొనే అమెరికా వ్యూహంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. గతంలో అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ పేరుతో ఉన్న మిలిటరీకి తాజాగా ఇండో -పసిఫిక్‌ కమాండ్‌ అని మార్చారు. ఇవన్నీ భారత్‌ను తనతో తీసుకుపోయే వ్యూహంలో భాగమే. ప్రపంచ పోలీసుగా అమెరికా తనకు తానే బాధ్యత తీసుకొని పెత్తనం చెలాయించ చూడటం ప్రపంచానికే ముప్పు. దానితో జతకట్టిన దేశాలకూ ముప్పే. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్న సామెత తెలిసిందే.
తాజా విషయాన్ని చూద్దాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి దూరం 2,800 కిలోమీటర్లు అయితే మారిషస్‌కు చెందిన చాగోస్‌ దీవుల నుంచి కన్యాకుమారి దూరం కేవలం 1,722 కిలోమీటర్లు మాత్రమే. హిందూ మహాసముద్రంలోని ఈ దీవుల్లో ఒకటైన డిగోగార్షియాలో అమెరికా నావికా దళ కేంద్రం ఉంది. ఈప్రాంతాన్ని ఆక్రమించిన ఫ్రెంచి వారు తరువాత బ్రిటన్‌కు అప్పగించారు.వారు సంయుక్త భాగస్వామ్యం పేరుతో అమెరికాకు అప్పగిస్తే అక్కడ వారు సైనిక కేంద్రాన్ని నెలకొల్పారు. అది మన రక్షణకు ముప్పు అని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది.యావత్‌ ప్రపంచంలో తమది అత్యంత ప్రజాస్వామిక దేశమని బ్రిటన్‌ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అత్యంత అప్రజాస్వామికంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన వలసగా చేసుకుంది. చాగోస్‌ దీవులను బ్రిటన్‌ 2019 నవంబరులోగా మారిషస్‌కు అప్పగించి అక్కడి నుంచి తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. బ్రిటన్‌ దాన్ని ధిక్కరించింది.
1968లో బ్రిటన్‌ నుంచి మారిషస్‌ స్వాతంత్య్రం పొందింది. అయితే తాము మారిషస్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని గ్రహించిన బ్రిటన్‌ తనకు అధికారం లేకపోయినా చాగోస్‌ దీవుల సముదాయంలో పెద్దదైన డిగోగార్షియా, దానిపక్కనే ఉన్న మరికొన్నిటినీ ఒక మిలిటరీ కేంద్రంగా వినియోగించుకొనేందుకు అనుమతిస్తూ అమెరికాకు కౌలుకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దీవులను తమకు అప్పగించాలని మారిషస్‌ డిమాండ్‌ చేస్తూనే ఉన్నా అపర ప్రజాస్వామిక దేశాలైన బ్రిటన్‌, అమెరికా దాన్ని ఖాతరు చేయలేదు.2019 ఫిబ్రవరి 25న వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. తరువాత మే 22న ఐక్యరాజ్యసమితి 116-6ఓట్ల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి బ్రిటన్‌ ఆ దీవులను ఖాళీ చేయాలని ఆదేశించింది. అమెరికా, బ్రిటన్‌ తిరస్కరించాయి. తమ మధ్య కుదిరిన ద్విపక్ష వ్యవహారాల మీద నిర్ణయం చేసేందుకు అంతర్జాతీయ కోర్టు, ఐరాసకు అధికారం లేదని వాదించాయి.
స్వాతంత్య్ర సమయంలో అధికారానికి రానున్న మారిషస్‌ నేత శివసాగర్‌ రామ్‌గులామ్‌ను బ్రిటన్‌ బ్లాక్‌మెయిల్‌ చేసింది, చాగోస్‌ దీవుల గురించి మాట్లాడవద్దని బెదిరించింది.1965లో తాము చేసుకున్న ఒప్పందం చట్టబద్దమే అని సముద్ర చట్టాల ట్రిబ్యునల్‌ 2015లో నిర్ధారించిందని బ్రిటన్‌ వాదిస్తోంది. అయితే ఆ ట్రిబ్యునల్‌ వాదనను ప్రపంచ కోర్టు కొట్టివేసింది. ఐక్యరాజ్యసమితి 1514 తీర్మానాన్ని ఆ ఒప్పందం ఉల్లంఘించిందని కోర్టు పేర్కొన్నది. ఈ ఒప్పందం 2036వరకు అమల్లో ఉంటుంది. మారిషస్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ దీవుల్లో నివాసం ఉంటున్న దాదాపు 1,500 చాగోసియన్లను బలవంతంగా మారిషస్‌, షెషల్స్‌కు తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము చాగోస్‌ దీవులను సందర్శిస్తామని మారిషస్‌ ప్రకటించింది. అది బ్రిటన్‌ ప్రాంతమని, అక్కడ పర్యటించాలనుకోవటం రెచ్చగొట్టటమే అని, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ అమెరికా బెదిరించింది. దాంతో మారిషస్‌ రాయబారి ఒక ప్రకటన చేస్తూ 2036లో డిగోగార్సియా దీవి ఒప్పందాన్ని బ్రిటన్‌ పునరుద్దరించలేదని, అయితే తాము అమెరికాకు 99 ఏండ్లకు కౌలుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆ దీవుల్లో వారిని మారిషస్‌ మీద రెచ్చగొట్టేందుకు బ్రిటన్‌-అమెరికా డబ్బు ఆశచూపుతూ విభజించి పాలించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి.
చైనా విషయానికి వస్తే అది ఏ మిలిటరీ కూటమిలోనూ సభ్య దేశం కాదు. 1962లో అది మనతో చేసిన యుద్దం తప్ప అంతకు ముందు, తరువాత కమ్యూనిస్టు చైనా సైన్యానికి యుద్దం చేసిన అనుభవం కూడా లేదు. చైనాతో పోలిస్తే మన మిలిటరీ ఖర్చు తక్కువ, మొత్తంగా చూస్తే బలాబలాల రీత్యా చైనాదే పైచేయి అయినప్పటికీ పాకిస్ధాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా అనుభవం రీత్యా మనమే మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు జరగని మన సరిహద్దుల్లో ఒక్క ఉదంతం కారణంగానే రెండు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశాలు లేవు. అటూ లేదా మన వైపు నుంచి గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అనువైన వాతావరణం కూడా లేదు. అయితే కరోనా, అంతకు ముందునుంచి ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం నుంచి బాధ్యతను ఇతరుల మీదకు నెట్టివేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి తోడు నవంబరులో జరిగే ఎన్నికలలో లబ్ది పొందేందుకు ట్రంప్‌ అనేక ఎత్తులు వేస్తున్నాడు. వాటిలో మనం చిక్కుకోరాదు.
చాగోస్‌ దీవులను బ్రిటన్‌ ”త్యాగం ” చేస్తే చైనా ఆక్రమిస్తుందని బ్రిటన్‌లో కొందరు రెచ్చగొడుతున్నారు. ముత్యాల హారం పేరుతో చైనా అమలు చేస్తున్న వ్యూహంలో భాగంగా హిందూ మహా సముద్రంలో అనేక చోట్ల అది వాణిజ్య, మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చిత్రిస్తున్నారు. మరోసారి బ్రిటన్‌ ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలంటే చాగోస్‌ దీవులను కలిగి ఉండాల్సిందేనని చెబుతున్నారు. మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండాల మీద నాటో కూటమి ఆధిపత్యం సాధించాలంటే డిగోగార్షియా, ఇతర దీవులు బ్రిటన్‌ ఆధీనంలోనే ఉండాలని వాదిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి ముప్పు పరిగణిస్తున్నారో వేరే చెప్పాలా ?(చైనా ముత్యాల హారం వ్యూహం గురించి మరోసారి చెప్పుకుందాం) మైక్‌ పాంపియో చెప్పినట్లు జర్మనీ నుంచి లేదా నేరుగా అమెరికా నుంచే సైనికులను తరలించాల్సి వస్తే మారిషస్‌ నోరు మూయించి నావికా దళ కేంద్రంగా ఉన్న డిగోగార్షియాలో అవసరమైన మార్పులు చేసి మిలిటరీని అక్కడ పెట్టేందుకు అవకాశం ఉంది. అది జరగాలన్నా ఏర్పాట్లకు కొంత సమయం పడుతుంది. అది చైనాకే ముప్పు అనుకుంటే పొరపాటు, అమెరికా రెండంచుల పదును ఉన్న కత్తి వంటిది. తన ప్రయోజనాలే దానికి ముఖ్యం. ఎటు నుంచి అయినా ఎవరిని అయినా దెబ్బతీయగలదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: