Tags
Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune
ఎంకెఆర్
అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్-ఎంగెల్స్ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్ సిలబస్ ప్రాజెక్టు(ఒపిఎస్) కింద నూతన సిలబస్ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్ వాచ్ డాట్ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ఆడమ్ స్మిత్ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్ ఫ్రైడ్ మాన్ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27
విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు
అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్ పింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.
భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.
నార్మన్ బెతూన్పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట
ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్ బెతూన్, భారత్ నుంచి ద్వారకా నాధ్ శాంతారామ్ కొట్నీస్(డిఎన్ కొట్నిస్) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెవ్ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్ బెతూన్ మెడల్ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్ తన ఇస్స్టాగ్రామ్ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్ ట్రుడెవ్ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్ బెతూన్ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.
1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్ బెతూన్కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్ బెతూన్ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.
జపాన్ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్ అనే పత్రిక అధిపతి పీటర్ వర్తింగ్టన్ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.
కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?
హాంకాంగ్ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.
కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు
అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్బాల్ ఆటగాడు కోలిన్ కయోపెర్నిక్ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్బాల్ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్ బాల్ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్-అమెరికన్లు కయో పెర్నిక్పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్.
అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్ అనే బేస్బాల్ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.
చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్ స్పీకర్
ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్ స్పీకర్ ఇస్మాయిల్ కర్మాన్ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అభ్యర్ధనను క్యూబా సర్కార్ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్ వాదిస్తారు. కొలంబస్ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.