• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: pavan kalyan

జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !

06 Tuesday Apr 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

AP BJP, AP ZP elections, chandrababu naidu, Jana Sena, pavan kalyan, Tirupati lok sabha by election, YS jagan


ఎం కోటేశ్వరరావు


మామూలుగా ఒక ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల మాదిరి ప్రాధాన్యతను సంతరించుకోదు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే, లేదా అంతకు ముందు ఎన్నికలో మెజారిటీ స్వల్పంగా ఉంటే తప్ప ప్రతిపక్షం గెలిచే పరిస్ధితి ఉండదు. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎలా చూడాలి ? దాని పర్యవసానాలు ఏమిటి ? ఏప్రిల్‌ 8న జరగాల్సిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి ఎన్నిక జరిగే 17వ తేదీ లోగా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికలోపు జరపాలనే అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోనరెడ్డి, నూతన ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి కోర్టులో పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల నిర్వహణ గురించి సవాలు చేస్తూ తెలుగుదేశం, జనసేన,బిజెపి, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా వైరస్‌ కారణంగా వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ పార్టీలు సవాలు చేశాయి. కమిషనర్‌ ప్రకటనకు ముందే ఎన్నికల తేదీల గురించి వార్తలు వచ్చాయని, సుప్రీం కోర్టు చెప్పినట్లుగా నాలుగు వారాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోలేదని అభ్యంతరం తెలిపాయి. దీన్ని విచారించిన కోర్టు ఈనెల 15వ తేదీన ఎన్నికల కమిషనరు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. పిటీషన్లు దాఖలు చేసిన పార్టీలు కోరుతున్నట్లు కొత్త నోటిఫికేషన్‌కు హైకోర్టు అదేశించే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, నామినేషన్లు వేసిన వారు కోర్టుకు ఎక్కుతారు. మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషనరు, వైసిపి లేదా మరొకరు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఈ నెల 8న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. కోర్టు స్టే ఎత్తివేసి ఎన్నికలకు దారి సుగమం చేసినా నెల రోజుల పాటు ప్రవర్తనా నియమావళిని అమలుకు ఆదేశిస్తే మే నెలలో మాత్రమే జరిగే అవకాశం ఉంది.అప్పటికి తిరుపతి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.


తిరుపతి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు నెల్లూరు జిల్లాలో, మూడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వైసిపి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడింటిలో మూడు షెడ్యూలు కులాల రిజర్వుడు నియోజకవర్గాలు. మొత్తం ఓటర్లు 15,74,161. గత(2019) ఎన్నికలలో 13,16,473(79.76శాతం) పోలయ్యాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ×××× ఓట్లు ×××× శాతం
వైసిపి ××× 7,22,877 ×× 55.03
టిడిపి ××× 4,94,501 ×× 37.65
నోటా ××× 25,781 ×× 1.96
కాంగ్రెస్‌ ×× 24,039 ×× 1.83
బిఎస్‌పి ×× 20,971 ×× 1.60
బిజెపి ×× 16,125 ×× 1.22
వైసిపి మెజారిటీ 2,28,376 కాగా, బిఎస్‌పిని జనసేన బలపరించింది. తాజా ఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా గుర్తింపు పొందిన పార్టీలలో వైసిపి, తెదే, కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం పోటీచేస్తున్నాయి. మిగిలిన వారందరూ గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్దులు.


గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసిపి సాధించిన విజయం, దానికి వచ్చిన ఓట్ల ప్రాతిపదికన చూస్తే అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప తిరుపతి లోక్‌సభ స్ధానాన్ని తిరిగి అది గెలుచుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినందున ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్‌ వచ్చిందని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మున్సిపల్‌ ఎన్నికలలో వైసిపికి 52.63, తెలుగుదేశం పార్టీకి 30.73, జనసేనకు 4.67, బిజెపికి 2.41శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన 49.95 శాతంతో పోలిస్తే ఓటింగ్‌ పెద్దగా పెరిగినట్లు భావించలేము. నవరత్నాల గురించి ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారానికి ఓట్ల పెరుగుదలకు పొంతన కుదరటం లేదు. తిరుపతి ఎన్నికలో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసిపి తన యావత్‌ శక్తిని ఉపయోగించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. గతం కంటే మెజారిటీ తెచ్చుకొని తమకు రాజకీయంగా రాష్ట్రంలో ఎదురు లేదని ప్రదర్శించుకోవటం, తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరచటం, మతం పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా మీ ఆటలను సాగనివ్వం అని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సందేశం ఇవ్వటం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉంది.2019 ఎన్నికలలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు తీసుకు రావాలని మంత్రులు, ఎంఎల్‌ఏలను జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఓటింగ్‌ శాతం , మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మీద వత్తిడి పెరగటం ఖాయం.


ఇక తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలలో దానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినా ఓటింగ్‌ శాతం గణనీయంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 39.17శాతం వస్తే మున్సిపల్‌ ఎన్నికలలో 30.73శాతం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల వైసిపికి ఏకగ్రీవాలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఓట్ల శాతం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే బలం ఉంటుందని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నిక ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు ప్రతీకగా భావించవచ్చు. విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలుపుకున్నా కార్యకర్తలను నిలుపుకోవచ్చు. రాజకీయ పోరు కొనసాగించవచ్చు. జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చేసిన నిర్ణయం దిగువ స్దాయిలో అంతగా జీర్ణం కాలేదు. తాజాగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఏదో ఒకసాకుతో కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి కూడా ఆ నిర్ణయం ఉండవచ్చు.


జనసేన-బిజెపి కూటమి విషయానికి వస్తే బిజెపి కంటే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్టచుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతాయి. మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌ తీరు తెన్నుల ప్రకారం రెండు పార్టీలకు వచ్చిన 7.18 శాతం కంటే తిరుపతిలో ఎక్కువ వస్తేనే ఆ రెండు పార్టీల పరువు నిలుస్తుంది. లేనట్లయితే బిజెపికి కొత్తగా పోయే పరువేమీ ఉండదు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా సమర్ధించుకుంటారన్న ప్రశ్న ముందుకు రానుంది. ప్రశ్నిస్తా అంటూ బయలు దేరిన పవన్‌ కల్యాణ్‌కు ప్రశ్నలేమీ లేకపోగా ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హౌదా, ఇతర అన్యాయాల గురించి మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుడా ఏమి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు.


ఇక బిజెపి విషయానికి వస్తే పర్యవసానాలు తక్కువేమీ కాదు. పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఉన్నా ఓట్ల సంఖ్య పెరగపోతే దాని పరువు పోవటమే కాదు, జనసేనాని మద్దతు చిత్తశుద్ది గురించి అది సందేహాలను లేవనెత్తవచ్చు. తిరుపతి ఆపద మొక్కుల్లో భాగంగా జనసేనాని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించింది. అంతే కాదు భగవద్దీత పార్టీ కావాలా బైబిల్‌ పార్టీ కావాలా అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చింది. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా తిరుపతి వెంకటేశ్వరుడు అంతర్జాతీయ దేవుళ్లలో ఒకరు. అక్కడ హిందూమతానికి అపచారం, అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున చేసింది. ఇక్కడ డిపాజిట్లు రాకపోయినా, గణనీయంగా ఓట్లు సంపాదించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు దాని మత రాజకీయాలకు గోరీ కట్టారనే అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశ వ్యాపితంగా కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు.ఇప్పటికే కేరళలో శబరిమల వివాదంతో ఓట్లు పొందాలని చూసి గత లోక్‌సభ ఎన్నికల్లో భంగపడిన బిజెపికి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరగనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మిగిలిన అభ్యర్దులలో నవతరం పార్టీ పేరుతో పోటీ చేస్తున్న అభ్యర్ధికి గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు ఉన్న కారణంగా జనసేన మద్దతుదారులు సదరు అభ్యర్ధికి ఓటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బిజెపి-జనసేనలకు పోలింగ్‌ ముందకు వరకు ఇది ఒక సాకుగా ఉపయోగపడవచ్చు తప్ప ఓటర్ల విజ్ఞతను ప్ర శ్నించటమే అవుతుంది. నిజంగా జనసేన మద్దతుదారులు బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలాంటి ప్రశ్న ఉదయించదు. ఇష్టం లేని వారు గ్లాసు గుర్తుకు ఓటేయవచ్చు. ఇక్కడ సిపిఎం పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పలేము. తమ విధానాల ప్రచారం కోసమే ఈ పోటీ అని చెప్పవచ్చు. అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినప్పటికీ నైతికంగా ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.2014 ఎన్నికలలో ఈ స్ధానంలో పోటీ చేసిన సిపిఎంకు 11,168 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ఏదో విధంగా పరీక్ష పెడుతోంది, పర్యవసానాలకు సిద్దం కావాలని చెబుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమరావతి నిర్మాణం- బొత్స శల్యసారధ్యం !

01 Sunday Sep 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan

Image result for amaravati capital

ఎం కోటేశ్వరరావు

మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.

తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్‌ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.

గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.

అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్‌ కమిషన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్‌ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్‌ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?

అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్‌ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.

అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్‌ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్‌ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్‌ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్‌ సర్కార్‌ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్‌ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.

రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్‌ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్‌ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్‌ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్‌ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్‌ రాజధానిగా డెహ్రాడూన్‌ వుంది. గుజరాత్‌లో పెద్ద నగరం అహమ్మదాబాద్‌ వున్నప్పటికీ గాంధీనగర్‌ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్‌ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్‌, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.

Image result for amaravati capital

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్‌ కల్యాణ్‌ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?

రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ- చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయ క్రీడలో అమాయక ఆంధ్రులు

01 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Narendra Modi, pavan kalyan, special status, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి బహిరంగ లేఖ

13 Wednesday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 2 Comments

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, jana sena party, pavan kalyan, special status to Andhra pradesh

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి

    మీ అభిమాని ఎం కోటేశ్వరరావు  వ్రాయు బహిరంగ లేఖ. అన్నా ఇలా రాస్తున్నందుకు మీరు అన్యధా భావించవలదు. ఎంతో బిజీగా వుంటారు కనుక లేఖలను మీరు చూసే అవకాశం వుండదు. మీ సిబ్బంది కూడా అభిమానుల లేఖలన్నింటినీ పూర్తిగా చదువుతారో లేదో అనే అనుమానంతో ఇలా రాయాల్సి వస్తోంది. మీరేమీ అనుకోరని అనుకుంటున్నా.

    మీ అభిమానులందరం రాజా గబ్బర్‌ సింగ్‌ కోసం ఎదురు చూస్తూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా చూస్తూ ఆనందిస్తున్నాం. అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. మీ (మా) సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా వివిధ టీవీ చానల్స్‌ , పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించి ఖుషీ కలిగించి అభిమానులలో వున్న అనుమానాలను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా లేస్తే మనిషిని కాను అన్న కుంటి మల్లయ్య మాదిరి మీ పీకె మాటలు తప్ప ఇంతవరకు పీకిందేమీ లేదని అంటుంటే ఎంత గుడ్డి అభిమానులమైనా అడ్డగోలుగా మిమ్మల్ని సమర్ధించలేక, కాదని ఖండించలేక చచ్చిపోతున్నాము. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీకు తెలుసు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎవరు ఏమి అన్నా పడాల్సిన పరిస్థితి.ఎన్నికలలో మీ పోటీ ప్రకటన తరువాత ఇప్పటిదాకా మనకు అత్తారింటికి దారేదో చూపిన మీ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తన పదవికి మార్గమేదో వెతుక్కుంటున్నాడని కొంత మంది వ్యంగ్యంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడని వాడెవడు, అదేపని మా పీకే చేస్తే తప్పేమిటి అని ఎదురుదాడి చేస్తున్నాం. ఇంకా అవసరమైతే వుధృతం చేస్తాం మీరు ఫికరు పడకండి.

   గతంలో తెలుగు దేశం పార్టీ వారు తాము పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో అధికారానికి వచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. అదొక పెద్ద గొప్పేంటి మే మసలు అధికారానికి వచ్చిన తరువాతే పార్టీ పెట్టామని(జనతా) మరొకరు బదులిచ్చారు. మన ప్రత్యేకత ఏమిటన్నా ? మీరు గత అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారు. ఇది చాలా చిత్రంగా వుందన్నా.

    ఈ మధ్య కాలం ఐదు సంవత్సరాలో ఏం పీకారంటే ఏం చెప్పాలన్నా ! ఎన్నికలపుడు చెప్పుకోవటానికి ఏదైనా వుండాలి కదన్నా. జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించితే మంచిది. అన్నా మనలో మాట, హైదరాబాదులో వున్నన్ని రోజులు మరొకచోట ఎక్కడా జీవించలేదని మీరు ఒక మాట అన్నారు. ఇంతకీ మన పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోనా ? ఒక్క ఏపిలోనేనా ? వైఎస్‌ఆర్‌ సిపి, తెలుగుదేశం పార్టీ పాట్లు చూసిన తరువాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నా.

     ఏపికి ప్రత్యేక హోదా ఇతర విషయాల గురించి మీకింకా గుర్తుందని చెప్పినందుకు ఒకవైపు సంతోషంగా వున్నా మరో వైపు మాత్రం విచారంగా వుందన్నా. పేదరాసి పెద్దమ్మ కథలలో చెప్పే రాజహంస ఎంతో అందంగా వుంటుంది గానీ దానిని ఎవరూ చూసిన వారు లేరన్నా, ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అంటున్నారు. అది రాదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి పదే పదే అడుగుతారు ఒకసారి చెబితే అర్ధం కాదా అంటూ కేంద్ర మంత్రులు విసుక్కుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తద్దినం రోజు తప్ప మిగతా రోజులలో విస్మరించే మాదిరి పట్టించుకోవటం లేదు. జనం కూడా దాని గురించి మరిచి పోయి అంతకంటే మంచి రోజులు వస్తాయని సర్దుకు పోతున్న రోజులలో అదింకా గుర్తుందని మీరెందుకన్నా చెప్పటం.మీరేమైనా అనుకోండి ఇది అశుభ సూచకం అన్నా. జనానికి పట్టని దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నిబంధనలు మారిన కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని అందరికీ అర్ధమైనా మీ పీకెకు అర్ధం కాలేదా, కాదా అని ఎవరైనా అడిగితే మీరేమో గానీ మేం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నా. ఇంతవరకు లేదు అని కేంద్రం చెప్పలేదు కనుక మాట్లాడటం లేదుతప్ప మరొకటి కాదని మీరు చెప్పారు.

     అన్నా ! కాదని కేంద్రం ఎప్పుడు చెప్పేను మీరు ఎప్పుడు నోరు విప్పేను ! అది జరిగేది కాదన్నా ! ఆంధ్రప్రదేశ్‌ అంటే కేవలం ప్రత్యేక హోదా ఒక్కటే కాదన్నా. జనానికి సంబంధించిన సమస్యలు అనేకం వున్నాయి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అని ఎన్నో పుస్తకాలు చదివిన మీకు మేం చెప్పాలా అన్నా ! రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీరు చెప్పిన నిబద్దతగా వుండే కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతావి ఏనాడన్నా ఫలానిది చేయం అని ఎప్పుడైనా చెప్పాయా అన్నా ? మీకెందుకన్నా ఆ పార్టీల మీద అంత భ్రమ ? లేదు తమ్ముడూ నిజం చెప్పాలంటే మన దగ్గర చెప్పేందుకు ఇప్పుడేమీ లేదు, ఏం చెప్పాలో ఎటు పోవాలో తెలియటం లేదు అందుకే అలా చెప్పి కాలం గడుపుదాం అంటే అభిమానులంగా మేం సరే అనక చస్తామా అన్నా ? అన్నో ! అసలు విషయం మరొకటి వుంది !

    ఇంటర్వ్యూలలో మీకు ఖర్చులు ఎక్కువని, తగినంత ఆదాయంలేక రోజులు గడవటం కష్టంగా వుందని చెప్పారు. పార్టీ కోసం కూడా డబ్బు లేదన్నారు. డబ్బులేనోడు డుబ్బుకు కొరగాడని తెలియనిదేముందన్నా ! అలా అయితే మన పార్టీ వెనుక ఎవరు చేరతారన్నా ? లేదా మీరు చెప్పినట్లు చెప్పిన దానికి కట్టుబడి వుండే కమ్యూనిస్టు పార్టీల మాదిరి సమస్యలపై పని చేసి జనం దగ్గరకన్నా వెళ్లాలి. మీరది చెయ్యరు ఇది చెయ్యకుండా డబ్బు లేదంటే కష్టం అన్నా. తమ్ముడు తనోడు కావచ్చు కాని న్యాయం న్యాయమే అన్నట్లుగా చిరంజీవి మా అన్న కావచ్చు గానీ ఆయన కాంగ్రెస్‌లో వున్న కారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించను అని చెప్పారు. అదేంటన్నా ఆలూలేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే దారులు మూసేస్తే ఎలా ? ఏ పార్టీ వాసన అంటని వీర భోగ వసంతరాయుళ్లు మన పార్టీకి దొరుకుతారంటావా అన్నా ? మీ దగ్గర డబ్బూ లేక మీ అన్న వంటి వారిని దరిచేరనీయక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానంటే జనం నమ్మరేమో అన్నా. ఎందుకంటే గతంలో లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పై ఎన్నికలలో కేంద్రంలో పదవి చేపట్టటం నా లక్ష్యం అని చెప్పారు. చివరకు లోక్‌సత్తా దుకాణాన్నే ఎత్తివేశారు. మన పార్టీ పరిస్ధితి అలాకాకుండా చూడండన్నా, ఒకవేళ అదే జరిగితే మీరు తిరిగి సినిమాల్లోకి పోతారు, మేం ఏం కావాలో అలోచించండన్నా ? రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన తరువాత ఇంక సినిమాలు చేయను అంటున్నారు, వినటానికి బాగానే వున్నా అలాంటి ప్రకటనలు మంచివి కాదేమో, అటూ ఇటూ కాకుండా పోతారేమో చూసుకోండన్నా ?

    ఇక పోటీ విషయానికి వస్తే స్వంతంగా చేస్తారా? బిజెపితో కలుస్తారా ? తెలుగుదేశంతో దోస్తీ చేస్తారా అని వూహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో మీకు కులముద్ర వేసి కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగు దేశం, బిజెపికి మీరు అలాగే వుపయోగపడ్డారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు పార్టీల ఫిరాయింపులు, ఎత్తులు, జిత్తులు చూస్తుంటే కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. తోక, తోరెలు అధికార, ప్రతిపక్ష పార్టీలవైపు సమీకరణయ్యారని, తోకా లమద్దతు ఎవరు పొందితే వారికి వచ్చేసారి అధికారం ఖాయం అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు.(తోక అంటే తోటి కమ్మ, తోరె అంటే తోటి రెడ్డి, తోకా అంటే తోటి కాపు, ఇలా ప్రతి కులానికి ఒక సాంకేతిక నామం) రాబోయే ఎన్నికలలో సినిమా రంగాన్ని కూడా తమవైపు తిప్పుకొనేందుకు పార్టీల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి అన్నా. చివరిగా మరొక విషయం అన్నా. ప్రతి ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య రష్యాలోని సైబీరియానుంచి వలస పక్షులు వచ్చి వెళతాయి. అలాగే ఎన్నికలపుడు మాత్రమే కనిపించేవారిని ఎన్నికల పక్షులని పిలుస్తారన్నా. మీరు ఆ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అవసరం అన్నా. వుంటా మరి మరోసారి మరో లేఖ రాస్తా

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: