• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Pinarai Vijayan

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్ధలో దొంగబంగారం కేసు నిందితురాలు – పక్కా బిజెపి ప్రతినిధిగా కేరళ గవర్నర్‌ !

18 Friday Feb 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్‌ పార్క్‌ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్‌ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌ కృష్ణ కుమార్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.


హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కెజి వేణుగోపాల్‌ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.


కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్‌ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్‌ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్‌ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.


శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్‌ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్‌ గోబాక్‌ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్‌ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్‌ అవమానంగా భావించి భరించలేకపోయారు.


మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్‌ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్‌ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్‌ ప్రసంగంపై సంతకం చేశారు.


గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్‌ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్‌ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బిజెపిలో చేరారని, గవర్నర్‌ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్‌ సొమ్ము ఖాన్‌ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్‌ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్‌- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత విడి సతీషన్‌ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్‌ పని చేస్తున్నారని విమర్శించారు.


దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్‌(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్‌ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్‌ దేవ్‌ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ గనుక కేరళగా మారితే మతం పేరుతో హత్యలుండవు – యోగికి పినరయి విజయన్‌ చురక !

10 Thursday Feb 2022

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, Pinarai Vijayan, UP CM, UP election 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల్లో ఎవరి గొప్ప గురించి వారు చెప్పుకోవటం ఒక పద్దతి. అలాగాక ఇతర రాష్ట్రాలను కెలికితే ఏమౌతుంది. కరోనాతో మరణించిన వారి శవాలను గంగలో నెట్టి వేయించిన ఘనత ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మూటగట్టుకున్న అంశం తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి ప్రతిపక్షాలకు గనుక అధికారమిస్తే ఒక బెంగాల్‌, ఒక కాశ్మీరుగా, ఒక కేరళగా ఉత్తర ప్రదేశ్‌ మారిపోతుంది గనుక ఓటరులారా తిరిగి బిజెపికే పట్టం కట్టండని ఒక వీడియో ప్రకటనలో యోగి ఆదిత్యనాధ్‌ పేర్కొన్నారు.


ఏ రాష్ట్రం ఏ రంగంలో ఎంత ప్రగతి సాధించిందో ఇటీవలనే కేంద్ర నీతి అయోగ్‌ ప్రకటించిన సంగతి ఎన్నికల్లో ఎదురీదుతున్న యోగి మరచిపోయి ఉంటారు.బహుముఖ దారిద్య్ర సూచిక(ఎంపిఐ)లో 0.71శాతంతో కేరళ ప్రధమ స్ధానంలో ఉంది. మరి యోగి పాలనలో ఉత్తర ప్రదేశ్‌ ఎక్కడ ఉంది? బీహార్‌ 51.91, ఝార్ఖండ్‌ 42.16, ఉత్తర ప్రదేశ్‌ 37.79శాతంతో అడుగునుంచి మూడవ స్ధానంలో ఉంది. అందుకే కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంటనే సమాధానమిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ గనుక కేరళగా మారితే జనాలకు మంచి విద్య, ఆరోగ్య సేవలు, సాంఘిక సంక్షేమం అందుతుందని తిప్పికొట్టారు. అంతే కాదు జీవన ప్రమాణాలు, సామరస్యపూరిత సమాజం ఉంటుంది కనుక మతం, కులం పేరుతో జనాలు హత్యలకు గురికారని, ఉత్తర ప్రదేశ్‌ జనాలు కూడా అదే కోరుకుంటున్నారని కూడా అన్నారు.


యోగి ఆదిత్యనాధ్‌ తన వీడియో ప్రకటనలో చెప్పిందేమిటి ? ” నా ఆందోళన ఏమిటంటే ఈ జనాలు(ప్రతిపక్షాలు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.వారు చెబుతున్నట్లుగా మీరు అధికారమిస్తే ఏమౌతుంది. నా ఐదేండ్ల కష్టమంతా వృధా అవుతుంది. ఉత్తర ప్రదేశ్‌ కాస్తా కాశ్మీరు, బెంగాల్‌,కేరళగా మారటానికి ఎంతో సమయం పట్టదు. మీ మంచి జీవనానికి మీ ఓటే హామీ. ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అద్భుతాలు జరిగాయి” అంటూ ఆరునిమిషాల వీడియోలో తన పాలన ఘనత గురించి చెప్పుకున్నారు.


నీతి అయోగ్‌ నివేదికలో అలాంటి అద్భుతం ఏమిటో చూశాము. ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు-పురోగమన భారత్‌ పేరుతో నివేదిక రూపొందించారు. దాన్ని నీతి అయోగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బాంకు 2019-20 సమాచారం మేరకు విశ్లేషించాయి. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణా మొదటి మూడు స్ధానాల్లో ఉన్నాయి.చివరన 19వ స్ధానంలో ఉత్తర ప్రదేశ్‌ ఉంది. కేరళకు 82.2, ఉత్తర ప్రదేశ్‌కు 30.57 మార్కులు వచ్చాయి. ఇక నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం 2018-20 సంవత్సరాల్లో కేరళలో 921 హత్యలు జరిగాయి. ఇది ప్రతిలక్ష మందికి 0.9శాతం కాగా జాతీయ సగటు 2.2గా ఉంది. దీనిలో కూడా ఉత్తర ప్రదేశే అలగ్రస్ధానంలో ఉంది. మాదక ద్రవ్యాల కేసుల్లో పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌ తరువాత స్దానం ఉత్తర ప్రదేశ్‌దే.


దేశంలో సంచలనం కలిగించిన లఖింపూర్‌ ఖేరీ మారణకాండలో ప్రధాన నిందితుడైన( కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ) ఆశిష్‌ మిశ్రాకు ఎన్నికల తొలిదశ పోలింగ్‌ రోజే బెయిలు లభించింది. జనవరి 18న తీర్పును రిజర్వుచేసినట్లు ప్రకటించిన అలహాబాద్‌ హైకోర్టు గురువారం(ఫిబ్రవరి 10) నాడు వెల్లడించింది. గతేడాది అక్టోబరు మూడున కార్లతో తొక్కించి నలుగురు రైతులను దారుణంగా హత్యగావించిన అంశం తెలిసిందే. తదనంతరం రైతుల ఆగ్రహానికి ముగ్గురు బిజెపి దుండగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం జరిగినపుడు తన కుమారుడు అక్కడ లేడని కేంద్రమంత్రి బుకాయించారు. ప్రభుత్వం మాత్రం సంఘటన దురదృష్టకరం అని పేర్కొన్నది. అక్టోబరు 9న నిందితులను అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన కొన్ని కేసులలో సాక్షులను హతమార్చిన ఉదంతాల నేపధ్యంలో లఖింపూర్‌ ఖేరీ ఉదంత సాక్షులకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా అనివార్యమై యోగి సర్కార్‌ సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ప్రత్యేక దర్యాప్తు బౄందాన్ని ఏర్పాటు చేసింది.తొలుత కుట్రదారుగా కేంద్ర మంత్రి పేరును చేర్చిన సిట్‌ తరువాత దాన్ని తొలగించి మంత్రి బావమరిది వీరేంద్ర శుక్లా పేరు చేర్చింది. మంత్రికుమారుడి దారుణానికి బలైన జగదీప్‌ సింగ్‌ తండ్రి నచత్తర్‌ సింగ్‌ తాను కేంద్ర మంత్రి మీద వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ఎస్‌పి, కాంగ్రెస్‌లను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీల కోరికను తిరస్కరించారు. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తుతుందనే భయంతో ఇంతవరకు ఎక్కడా కేంద్ర మంత్రిని బిజెపి ప్రచారానికి పంపలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ : రచ్చకీడ్చిన కేరళ గవర్నర్‌, బిజెపి – కాంగ్రెస్‌లో చిచ్చు !

02 Sunday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

D.Litt to President row, governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, Ramesh Chennithala


ఎం కోటేశ్వరరావు


రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్‌ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్‌ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్‌ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇవ్వాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్‌ సిఎల్‌పి మాజీ నేత రమేష్‌ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్‌ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్‌ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్‌ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్‌ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్‌ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.


కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్‌ రవీంద్రన్‌ పునర్నియాకాన్ని గవర్నర్‌ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్‌ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్‌ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్‌ చెప్పాలి, కానీ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్‌ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్‌ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్‌ గౌరడాక్టరేట్‌ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్‌ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందిస్తూ గవర్నర్‌ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్‌ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్‌ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్‌ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.


రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్‌ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్‌ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు.


షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దొంగ బంగారం కేసు : కేరళ సర్కారు మీద కుట్రకు బిజెపి తెరలేపిందా ?

23 Thursday Jul 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Kerala Gold Smuggling Case, Kerala LDF, NIA, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు
రాజకీయాలకు – నైతిక సూత్రాలకు సంబంధం లేదని ఇటాలియన్‌ దౌత్యవేత్త మాకియవెల్లీ ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేరళలో పట్టుబడిన దొంగబంగారం కేసును ఆసరా చేసుకొని సిపిఐ(ఎం) నాయకత్వలోని కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, బిజెపి అనైతిక రాజకీయాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది.
దుబాయిలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఇ) కాన్సులేట్‌ కార్యాలయం నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి దౌత్య సిబ్బంది ఉపయోగించే ఒక సంచిలో పంపిన దొంగబంగారం కేసును దర్యాప్తు జరిపించాలని కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ఎలాంటి శషభిషలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ దర్యాప్తు పూర్తిగాక ముందే విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) అధికారులు వెల్లడిస్తున్న సమాచారం, సిపిఎంను వ్యతిరేకిస్తున్నశక్తులు చేస్తున్న ప్రచార, ఆందోళనల తీరు తెన్నులు కొన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఎవరూ కోరకుండానే పట్టుబడింది విమానాశ్రయంలో కనుక అది కేంద్ర పరిధిలో ఉంటుంది కనుక కేరళ సర్కారు వెంటనే లేఖ రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయలేదంటూ కాంగ్రెసు, బిజెపి పార్టీలు వింత వాదనను ముందుకు తెచ్చాయి. విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు తమ ఎత్తుగడలతో ఆ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయా లేక ఎదురు తన్ని తామే దెబ్బ తింటాయా ? ఒక వైపు కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతూ కేరళలో కూడా కొత్త సమస్యను సృష్టిస్తుంటే దాన్ని కూడా కట్టడి చేసేందుకు దాని మీద కేంద్రీకరించిన ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు దొంగబంగారం రాజకీయాలు, మరో వైపు కరోనా కట్టడి పోరు !
దొంగబంగారం ఎలా బయట పడింది !
జూన్‌ 30వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయానికి దుబాయి నుంచి వచ్చిన దౌత్యవేత్తల సంచి ఏముంది అనే అంశంపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి చిరునామాదారులకు విడుదల చేయకుండా నిలిపివేశారు.
జూలై ఒకటవ తేదీన కేరళ ఐటి శాఖలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న స్వప్న సురేష్‌ అనే మహిళ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి తాను తిరువనంతపురం యుఏయి కాన్సులేట్‌ కార్యాలయ కాన్సులర్‌ కార్యదర్శిని అని, సదరు సంచిని విడుదల చేయాలని కోరింది. అధికారులు అంగీకరించలేదు.
రెండవ తేదీన కస్టమ్స్‌ అధికారులకు పలు చోట్ల నుంచి సదరు సంచిని వదలి పెట్టాలని ఫోన్లద్వారా వత్తిడి వచ్చింది. అయినా తిరస్కరించి ఎవరి పేరుతో అయితే సంచి వచ్చిందో వారు వచ్చి తీసుకుపోవాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ సిబ్బంది స్పష్టం చేశారు.అయితే కాన్సులేట్‌ కార్యాలయంలో గతంలో పిఆర్‌ఓగా పని చేసిన సరిత్‌ కుమార్‌ అరబ్బు వేషంతో ఉన్న ఒక వ్యక్తితో కలసి వచ్చి సంచిని తమకు అందచేయాలని వత్తిడి చేసినా అధికారులు అంగీకరించలేదు.
మూడవ తేదీన కాన్సులేట్‌ అధికారులను పిలిపించేందుకు కస్టమ్స్‌ అధికారులు అనుమతి తీసుకున్నారు.
నాలుగవ తేదీన సదరు సంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపివేయాలంటూ ఒక లేఖ కస్టమ్స్‌ అధికారులకు అందింది. అయితే ఐదవ తేదీన ఆ సంచిలో ఏముందో తనిఖీ చేయాలని నిర్ణయించినందున ఆ సమయంలో అక్కడకు ఒక ప్రతినిధిని పంపాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ అధికారులు వర్తమానం పంపారు.
ఐదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని హైకమిషనర్‌ కార్యాలయ సీనియర్‌ అధికారి సమక్షంలో కస్టమ్స్‌ సిబ్బంది సంచి తనిఖీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆ సంచి ఎవరి పేరుతో వచ్చిందో యుఏయి కార్యాలయంలోని సదరు అధికారి కూడా ఉన్నారు. దానిలో 14.8 కోట్ల రూపాయల విలువ చేసే 30కిలోల బంగారం ఉంది. బంగారంతో తమకు సంబంధం లేదని, తమకు పంపింది కాదని కాన్సులేట్‌ అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 3.15 సమయంలో అంతకు ముందు సంప్రదించిన స్వప్న సురేష్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ తతంగం అంతా సాయంత్రం ఆరుగంటలవరకు జరిగింది. మాజీ పిఆర్‌ఓ సరిత్‌ను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
ఏడవ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, ఐటి కార్యదర్శి అయిన ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌కు దొంగబంగారం కేసులో అనుమానితులతో సంబంధాలున్నాయనే అనుమానంతో బాధ్యతల నుంచి సిఎం కార్యాలయం తప్పించింది.
తొమ్మిదవ తేదీన జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) విచారణను చేపట్టింది. స్వప్న సురేష్‌ మాట్లాడిన ఆడియో మీడియాలో ప్రసారమైంది. పదవ తేదీన నలుగురు అనుమానితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పదకొండవ తేదీన రెండవ నిందితురాలు స్వప్న సురేష్‌, నాలుగవ నిందితుడు సందీప్‌ నాయర్‌ను బెంగళూరులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నకిలీ సర్టిఫికెట్‌తో స్వప్న సురేష్‌ ఐటిశాఖలో చేరిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పన్నెండవ తేదీన స్వప్న, సందీప్‌ నాయర్‌ అరెస్టును ప్రకటించిన ఎన్‌ఐఏ వారిని కరోనా సంరక్షణ కేంద్రాలకు తరలించింది.
పద్నాలుగవ తేదీన దర్యాప్తు అధికారులు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు. కస్టమ్స్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొదటి నిందితుడు సరిత్‌ కుమార్‌ ఈ బంగారం విషయంలో శివశంకర్‌కు ఎలాంటి సంబంధం లేదని అయితే ఆయన నివాసంలో బంగారం గురించి తాము మాట్లాడినట్లు వెల్లడించాడని వార్తలు వచ్చాయి.
పదిహేనవ తేదీన ఐటి పార్కుల మార్కెటింగ్‌ మరియు కార్యకలాపాల డైరెక్టర్‌ అరుణ్‌ బాల చంద్రన్‌ను బాధ్యతల నుంచి ఐటి శాఖ తొలగించింది.శివశంకర్‌ను ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది.
పదహారవ తేదీన తిరువనంతపురం యుఏఇ కాన్సలేట్‌ అధికారి రషీద్‌ అల్‌ సలామీ దేశం వదలి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతని పేరుమీదే బంగారం ఉన్న సంచి వచ్చింది.
కనిపించకుండా పోయినా కాన్సులేట్‌ కార్యాలయ గన్‌మన్‌ చేతికి గాయాలతో 17వ తేదీన కనిపించాడు. ఐటి శాఖలో స్వప్న సురేష్‌ చేరటంలో శివశంకర్‌ పాత్ర ఉన్నట్లు అతనికి జారీ చేసిన సస్పెన్షన్‌ నోటీసులో పేర్కొన్నారు. పందొమ్మిదవ తేదీన కేసులోని మూడవ నిందితుడైన ఫైజల్‌ ఫరీద్‌ను దుబారులో అరెస్టు చేశారు.

ముఖ్య మంత్రి మీద ఆరోపణలేమిటి ? నిందితులు-వారికి తోడ్పడిన వారి కథేమిటి ?


ఐటిశాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. ఆ శాఖ అధికారి సిఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా కూడా ఉన్నాడు, అతని ప్రమేయంతోనే స్వప్న సురేష్‌ను ఐటి శాఖలో నియమించారు కనుక ముఖ్యమంత్రి నియమించినట్లుగా భావించి ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు యుగళగీతాలు పాడుతూ రోడ్లెక్కుతున్నారు.
కేరళలో జనం టీవీ ఛానల్‌ బిజెపికి చెందినది. దాని వార్తల సమన్వయకర్త మరియు సంపాదకుడు అయిన అనిల్‌ నంబియార్‌ దొంగ బంగారం ఉదంతంలో నిందితులైన స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడైంది. వారు పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో ఉన్న సంబంధాలతో సహకరించినట్లు మీద విమర్శలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసిన రోజునే నిందితులు పరారయ్యారు. స్వప్న సురేష్‌ -అనిల్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను ఎన్‌ఐఏ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం సదరు జనం టీవీ సంపాదకుడు అనిల్‌ నంబియార్‌కు కేంద్ర మంత్రి వి మురళీధరన్‌, బిజెపి నేత కె సురేంద్రన్‌, కర్ణాటక బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నట్లు బయటకు వచ్చింది. తిరువనంత పురం నుంచి బయటపడిన స్వప్న-సందీప్‌ బెంగళూరు వెళ్లబోయే ముందు వర్కల లోని హిందూ ఐక్యవేది నేతకు చెందిన రిసార్టుకు వెళ్లారు. జూలై ఐదవ తేదీన బంగారం సంచిలో ఏముందో తెరిచి చూసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ప్రారంభం కావటానికి కొద్ది సేపటికి ముందు అంటే మధ్యాహ్నం 12.42 నిమిషాలకు అనిల్‌ నంబియార్‌ నుంచి స్వప్నకు ఫోన్‌ వచ్చింది, 262 సెకండ్లు మాట్లాడుకున్నారు. అంతకు ముందు అనిల్‌- సందీప్‌ మధ్య కూడా ఫోన్‌ సంభాషణలు చోటు చేసుకున్నట్లు నమోదైంది. దీన్ని బట్టి బంగారం దొంగరవాణా గురించి అనిల్‌కు ముందే తెలుసు అని భావిస్తున్నారు.
దొంగబంగారం వార్త మీడియాలో గుప్పుమన్న తరువాత అనిల్‌ నంబియర్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో స్వప్నకు తాను ఫోన్‌ చేసినట్లు అంగీకరిస్తూ వార్తల అదనపు సమాచారం కోసం కాంటాక్టు చేశానని చెప్పాడు. సాధారణంగా మీడియా సంస్ధలలో సంపాదకులకు బదులు విలేకరులే వివరణలకోసం ప్రయత్నిస్తారు. సంపాదకుడు అనిల్‌ నంబియారే రంగంలోకి దిగారు అనుకుంటే దానికి అనుగుణ్యంగా జనం టీవీలో వార్తలే దర్శనమివ్వలేదని వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు ముస్లిం లీగ్‌ కార్యకర్తలను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇంకా మరి కొందరి కోసం గాలిస్తున్నారు.


నిందితులకు బిజెపితో సంబంధాలు !
వివిధ పార్టీల నేతలతో పలువురు కలుస్తున్న సందర్భాలను బట్టి కలిసే వారు చేసిన నేరాలతో పార్టీల నేతలకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం కొన్ని సందర్భాలలో వాస్తవ విరుద్దం కూడా కావచ్చు. ఈ కేసులో స్వప్న సురేష్‌ అనే మహిళ పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని, అరెస్టయిన మాజీ పిఆర్‌ఓ సరిత్‌ పూర్వాశ్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌లో సభ్యుడని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. స్వప్న సురేష్‌ వివరాల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం ఆమె పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని తలిదండ్రులు హిందువులని ఉంది. భర్త పేరు, ఇతర వివరాలు లేవు. ఒక వేళ ఆమె మతాంతర వివాహం చేసుకొని పేరు మార్చుకొని ఉండవచ్చు. ఇక సరిత్‌ పూర్వాశ్రమంలో ఏ సంస్ధతో ఉన్నాడని కాదు, వర్తమానంలో ఎవరితో ఉన్నారన్నది ముఖ్యం.
మరో నిందితుడు సందీప్‌ నాయర్‌కు బిజెపికి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు నమ్మబలుకుతున్నారు. ఆ పార్టీనేత కుమనమ్‌ రాజశేఖరన్‌తో కలసి ఉన్న ఫొటో బయటకు రాగానే అనేక మందితో తమ నేత కలుస్తారని, అంత మాత్రాన వారితో సంబంధం ఉన్నట్లు కాదని, సందీప్‌ ఎవరో తెలియదని బిజెపి సమర్ధించుకుంది.అయితే తన కుమారుడు బిజెపిలో చురుకైన కార్యకర్త అని సందీప్‌ తల్లి చెప్పింది ( జూలై 11వ తేదీ టెలిగ్రాఫ్‌) విదేశాంగ శాఖ సహాయ మంత్రి, కేరళ బిజెపి నేత వి. మురళీధరన్‌ బంగారం ఉన్న సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది కాదని చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం మంత్రికి ఏమి వచ్చింది. కస్టమ్స్‌ క్లియరింగ్‌ ఏజంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడి హౌదాలో ఆ సంచి విడుదల గురించి కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడినట్లు హరిరాజ్‌ అనే వ్యక్తి చెప్పాడు. అతని ఫేస్‌బుక్‌లో నరేంద్రమోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానిగా చెప్పుకున్నాడు, తనకు బిఎంఎస్‌ లేదా బిజెపితో సంబంధం లేదని కూడా చెప్పుకున్నాడు. వచ్చిన సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది అయితే హరిరాజ్‌కు సంబంధం ఏమిటి ? అతని సిఫార్సుల అవసరం ఎందుకు ఉంటుంది? ఏ దౌత్యవేత్త తరఫున దాన్ని విడుదల చేయాలని అడిగినట్లు ? ఒక వేళ దౌత్యవేత్తది కానట్లయితే, దాని మీద చిరునామా దౌత్యకార్యాలయ అధికారి పేరు ఎందుకు ఉంది? ఎవరి కోరిక మీద హరిరాజ్‌ జోక్యం చేసుకున్నట్లు ?
విమానాశ్రయ సిసిటీవీలో చిత్రాలను పరిశీలించినపుడు గతంలో కూడా అనేక సార్లు స్వప్న సురేష్‌ విమానాశ్రయంలో కనిపించినట్లు బిజెపినేతలు చెబుతున్నారు ? వాస్తవం కూడా కావచ్చు, విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, అక్కడ భద్రత, తనిఖీ బాధ్యత కేంద్రానిదే, అలాంటపుడు ఆమె మీద అంతకు ముందు ఎందుకు అనుమానం రాలేదు ? ఇలా ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తాయి. స్వప్న సురేష్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారితో సంబంధాలున్నాయనే ఒక్క అంశం తప్ప ఈ కేసులో సిఎం లేదా కార్యాలయానికి ఉన్న సంబంధాల గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
బిజెపి నేతల ప్రకటనలు, వారు వీధులకు ఎక్కుతున్న తీరు తెన్నులను చూస్తే అనుమానాలు తలెత్తటం సహజం. కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, సిపిఎం నేతలను ఎక్కడ ఇరికించాలా అని అవకాశం కోసం బిజెపి ఎదురు చూస్తున్నదనేది బహిరంగ రహస్యం. రాజ్యాంగ వ్యవస్ధలు, సిబిఐ, ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) వంటి సంస్దలు, వ్యవస్ధలను దుర్వినియోగ పరచి ప్రత్యర్ధి పార్టీలు, ప్రభుత్వాలను బదనామ్‌ చేయటంలో యాభై సంవత్సరాలలో కాంగ్రెస్‌ ఎంత అపవాదు మూటకట్టుకుందో బిజెపి తొలి ఐదేళ్లలోనే అంతకంటే ఎక్కువ సంపాదించుకుంది. ఇప్పుడు ఎన్‌ఐఏను కూడా దుర్వినియోగ పరచి ఏదో విధంగా కేరళ ప్రభుత్వాన్ని, పాలక పార్టీలను ఇరుకున పెట్టేందుకు బంగారం అవకాశాన్ని వినియోగించుకుంటుందా అని కూడా ఆలోచించాల్సి వుంది. ఎందుకంటే బిజెపి నేతల మాటలే అందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ ఒక్క కేరళలోనే జరుగుతున్నట్లు, అది దేశ భద్రతకు ముప్పు అనీ, ఉగ్రవాదులకు డబ్బు అందచేసేందుకు వినియోగిస్తున్నారని, హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది కనుక దీని మూలాలు అక్కడ కూడా ఉన్నాయని, దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే లక్ష్యంతో బంగారాన్ని అక్రమంగా తీసుకు వస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
ఉగ్రవాదులు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వారి ఉనికి, కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతూ ప్రమాదకరంగా పరిణమించి గతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన వాటిలో కేరళ ఎన్నడూ లేదు. బంగారాన్ని ఉగ్రవాదుల కోసమే వినియోగిస్తున్నారనే నిర్ధారణకు గతంలో మన నిఘా సంస్ధలు ఎలాంటి నిర్దారణలకు రాలేదు. వారికి నిధుల అందచేసే పద్దతులలో అది కూడా ఒక అంశం కావచ్చు. దొంగ బంగారం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయ చూస్తున్నారన్న ప్రచారం వెనుక అతిశయోక్తి, ఇతర అంశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌, చైనా రిజర్వుబ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే మన దేశంలో ప్రయివేటు వ్యక్తుల వద్ద ఇరవై వేల టన్నుల బంగారం ఎక్కువగా ఉంది అన్నది ఒక అంచనా. బంగారం మీద మన దేశంలో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం, దేశంలో డిమాండ్‌ బాగా ఉంటున్న కారణంగా అధికారికంగా దిగుమతి చేసుకుంటున్నదానిలో మూడవ వంతు అక్రమంగా వస్తున్నట్లు చెబుతున్నారు. కెనడాకు చెందిన ఇంపాక్ట్‌ అనే సంస్ధ గత ఏడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. ఏటా వెయ్యి టన్నుల వరకు వినియోగిస్తుండగా దానిలో 800-900 టన్నులు దిగుమతి అవుతోందని, 200 టన్నుల మేరకు అక్రమంగా వస్తున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ఎవరైనా బంగారం దిగుమతి చేసుకుంటే 12.5శాతం కస్టమ్స్‌ సుంకం, మూడు శాతం జిఎస్‌టి చెల్లించాలి, దిగుమతి చేసుకున్నదానితో ఆభరణాలు తయారు చేస్తే మరో ఐదుశాతం అదనపు జిఎస్‌టి చెల్లించాలి.
ఒక కిలోబంగారాన్ని అక్రమ పద్దతుల ద్వారా రప్పించుకుంటే ఆరు లక్షల రూపాయల మేర లాభం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నందున అక్రమ రవాణా లాభసాటిగా ఉంటోంది. ఆఫ్రికాలోని గ్రేట్‌ లేక్స్‌ ప్రాంతం నుంచి బంగారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. మన దేశంలోకి వస్తున్న అక్రమ బంగారంలో 75శాతం యుఏఇ నుంచి వస్తోందని ఇంపాక్ట్‌ నివేదిక అంచనా. అందువలన అక్కడ మన భారత గూఢచారులు ఏమి చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, భూటాన్‌ నుంచి కూడా బంగారం అక్రమంగా వస్తున్నట్లు గుర్తించారు.
దౌత్యవేత్తల సంచుల ద్వారా బంగారాన్ని గత ఏడాది కాలంలో 250 కిలోల వరకు తరలించి ఉంటారని ఎన్‌ఐఎ అధికారులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారుల అంచనా 20 సంచుల ద్వారా 180కిలోలు ఉండవచ్చని ఒక వార్త. వ్యక్తిగత లబ్ది కోసమా లేక దేశాన్ని అస్ధిరం కావించేందుకు బంగారాన్ని తరలిస్తున్నారా అనే కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఎన్‌ఐఏ నలుగురిని, కస్టమ్స్‌ సిబ్బంది 13మందిని ఇంతవరకు పట్టుకున్నారు.(సంఖ్యలో మార్పులు ఉండవచ్చు)
ప్రపంచంలోనే బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగే దేశాల్లో మనది ఒకటి. అది ఎలా జరుగుతోందో గత ఏడాది నవంబరులోనే ఇంపాక్ట్‌ సంస్ధ తన నివేదికలో వెల్లడించినా మన కేంద్ర అధికారులు, నిఘా సంస్ధలు యుఏయి-దుబాయి మీద కేంద్రీకరించలేదన్నది స్పష్టం. ఒకటి శుద్ధి చేసిన బంగారం, రెండవది పాక్షికంగా శుద్ధిచేసిన బంగారు కడ్డీలు, బిస్కట్ల రూపంలో రవాణా అవుతోంది. మన దేశానికి చెందిన బంగారు వర్తకులు ఆఫ్రికాలోని తూర్పు ఆఫ్రికా టాంజానియా, ఉగాండాల నుంచి సేకరించి టాంజానియాలోని మవాంజా నుంచి దుబాయి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మన దేశం వస్తోంది. ఉగాండా నుంచి సమీర్‌ భీమ్‌జీ అనే వ్యాపారి తరచూ భారత్‌ను సందర్శిస్తున్నట్లు అతనికి ప్రత్యక్షంగా భారత్‌తో బంగారం వ్యాపార లావాదేవీలు ఉన్నాయో లేదో తెలియదు గానీ ఉగాండాలోని ముగ్గురు ప్రముఖ ఎగుమతిదారుల్లో ఒకడని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం గుర్తించింది. అయితే ముంబాయి స్మగ్లర్‌ ఒకడు సమీర్‌ అక్రమవ్యాపారి అని నిర్ధారించినట్లు ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది.2016లో ఉగాండా అధికారులు జరిపిన దాడిలో అతని ఇంటిలో51.3కిలోల బంగారం దొరికింది. అతనికి మన దేశానికి చెందిన బంగారు రాజుగా పేరు పడిన ప్రధ్వీరాజ్‌ కొఠారీకి సంబంధాలు ఉన్నట్లు మన దేశ అధికారులకు సైతం తెలుసు.
మన దేశంలో బంగారు శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు 2013లో నాటి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిన కారణంగా 2012లో శుద్ధి చేయని బంగారం దిగుమతి 23 టన్నులు ఉండగా 2015 నాటికి 229 టన్నులకు పెరిగింది. శుద్ధి చేయని బంగారం పేరుతో పరిశుద్దమైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే అసలు ఆయా దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతోంది, అసలు ఉత్పత్తి జరుగుతోందా లేదా, ఎగుమతి చేయగలదా లేదా అని కూడా తెలుసుకోకుండా మన దేశం కొన్ని దేశాల నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు 2014-17 మధ్య మన దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి 100.63 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది, నిజానికి అదేశానికి అంత ఎగుమతి చేసే స్ధాయి లేదు.


ఇత్తడి రద్దు పేరుతో 4,500 కిలోల బంగారం దిగుమతి !
మన నిఘా అధికారులు నిద్రపోవటం లేదా కుమ్మక్కు కారణంగా ఇత్తడి రద్దు పేరుతో 2017 ఫిబ్రవరి నుంచి 2019 మార్చినెల వరకు 4,500 కిలోల బంగారాన్ని కంటెయినర్ల ద్వారా అక్రమంగా రవాణా చేశారని మళయాళ మాతృభూమి పత్రిక 2019 నవంబరు 24న ఒక వార్తను ప్రచురించింది. ఎక్స్‌రే యంత్రాలు కూడా వాటిని పసిగట్టలేని విధంగా దాన్ని తరలించారు.షార్జా పారిశ్రామిక ప్రాంతం నుంచి భారత్‌కు చేరింది. ఈ రవాణా వెనుక నిసార్‌ అలియార్‌ అనే వ్యక్తి ఉన్నాడు.అతనికి షార్జాలో గోడవున్లు ఉన్నాయి.అధికారుల కన్ను గప్పేందుకు అక్కడ బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి దానికి నల్లని రంగు పూసేవారు, ఇత్తడి రద్దు మధ్య దానిని ప్రత్యేకంగా అమర్చి కంటెయినర్లకు ఎక్కించి నట్లు ఆ పత్రిక రాసింది.ఆ బంగారాన్ని గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో ఉన్న బ్లూ సీ మెటల్స్‌ కంపెనీ పేరు మీద రప్పించేవారు, జామ్‌ నగర్‌ చేరిన తరువాత దానిని శుద్ది చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేవారు. కేరళలోని పెరుంబవూర్‌కు చెందిన బంగారు చక్రవర్తులుగా పేరు మోసిన వ్యక్తులు మధ్యవర్తులుగా బంగారాన్ని సరఫరా చేసేవారు. గత ఏడాది మార్చి 29న నిసార్‌ అలియార్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డిఆర్‌ఐ) వారు 185కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. దాంతో బంగారం స్మగ్లింగ్‌ సంబంధాలు అనేకం బయటకు వచ్చాయి.
దేశంలో 2016కు ముందు రెండున్నర సంవత్సరాలలో రెండువేల కోట్ల రూపాయల విలువగల ఏడువేల కిలోల బంగారాన్ని అక్రమంగా చేరవేసినట్లు అదే ఏడాది సెప్టెంబరు 26న డిఆర్‌ఐ ఢిల్లీ జోనల్‌ విభాగం గుర్తించింది. గౌహతి నుంచి 617 సందర్భాలలో ఢిల్లీకి బంగారాన్ని విమానాల్లో తరలించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ బంగారం మయన్మార్‌ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రతి ఏటా అనేక చోట్ల ఇలాంటి ఉదంతాలు బయటపడటం అధికారులు నేరగాండ్లను అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. 2015 మార్చినెలలో సిలిగురిలో 87కిలోలు, మరుసటి ఏడాది ఆగస్టులో కొల్‌కతాలో 58 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఉదంతాల్లో నిమగమైన ముఠా మొత్తం 200 కోట్ల రూపాయల విలువైన 700 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలింది. ఒక ఉదంతంలో సిలిగురి నుంచి మణిపూర్‌కు తరలిస్తున్న ఐదుకోట్ల రూపాయలకు సమానమైన ఏడున్నరలక్షల డాలర.్లను కనుగొన్నారు.ఈ సొమ్ముతో మయన్మార్‌లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు .274 టన్నుల బంగారం అక్రమంగా తరలించారని అంచనా వేసిన అధికారులు కఠిన చర్యలు తీసుకున్న తరువాత గత ఏడాది కొంతమేర తగ్గింది.
బిజెపి నేతలు ముందుకు తెస్తున్న తర్కం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారి నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్‌కు పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. కనుక సిఎంకు వారితో సంబంధం ఉంది. ఇదే తర్కాన్ని మిగతా దొంగబంగారం కేసులకు కూడా వర్తింప చేస్తే మొత్తంగా బిజెపి నేతలకే చుట్టుకుంటుంది. కస్టమ్స్‌ శాఖ, ఇతర కేంద్ర సంస్దల వైఫల్యం కారణంగానే దేశంలోకి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది కనుక నరేంద్రమోడీ లేదా ఆ శాఖలను చూసే మంత్రులు అధికారులను చూసీ చూడనట్లు వ్యవహరించమని ఆదేశించారని అనుకోవాలా ? దుబాయి అక్రమ రవాణా కేంద్రమని కేంద్రానికి తెలియదా ? దౌత్యవేత్తల సంచుల్లో లేదా తనిఖీకి అవకాశం లేనందున స్వయంగా వారే తరలించినా బాధ్యత ఎవరిది ? ఏ రాష్ట్రంలో దొంగబంగారం లేదా మరొక అక్రమం జరిగితే ఆ రాష్ట్రాల పాలకులకు సంబంధం ఉందంటే మిగిలిన కేసుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదు ? దొరికింది విమానాశ్రయంలో, అదుపులోకి తీసుకున్నది కస్టమ్స్‌ అధికారులు, నిందితులు దొరికింది బిజెపి పాలనలోని బెంగళూరులో, ఆ పార్టీ కార్యకర్తలకూ సంబంధం ఉంది, ఒకడిని అరెస్టు చేశారు. అందువలన అసలు రాజీనామా చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం అధిపతిగా నరేంద్రమోడీ నైతికంగా ఆపని చేయాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: