• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: RSS Double game

ఇప్తార్‌ విందు: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మవంచన

01 Friday Jul 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

BJP, iftar party, mrm, Narendra Modi, RMM, RSS, RSS Double game, RSS Duplicity, RSS game, RSS-BJP

సత్య

     పాపం ఆర్‌ఎస్‌ఎస్‌ ! తన కార్యక్రమాన్ని తానే బహిరంగంగా సమర్ధించుకోలేక భయపడుతోంది. ఒకనాడు తాము చేసిన విమర్శలు లేదా ఆరోపణలే మరోరోజు తమను రచ్చకీడుస్తాయని బహుశా ఆలోచించి వుండదు. పక్షం రోజుల క్రితం తన మైనారిటీ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్‌(ఆర్‌ఎంఎం) ద్వారా జూలై రెండున మన దేశంలోని ఇస్లామిక్‌ దేశాల రాయబారులతో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులను, ఇతరప్రముఖులను ఆహ్వానించి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రధాన స్రవంతి మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ స్వభావం, మైనారిటీ సంతుష్టీకరణ గురించి పెద్దగా చర్చ జరగలేదుగానీ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలే నడుములు విరిగి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని అనుకున్నదో ఏమో తొలిసారిగా ఇప్తార్‌ విందు ఇవ్వకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్‌ వదలి వేసిన ఇప్తార్‌ విందులను ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి ప్రారంభించిందనే రీతిలో వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా మెజారిటీ హిందువులలో పలుచనవుతామని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, యుపి తదితర రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో హిందువులలో దాని ప్రభావం ఎలా వుంటుందో అన్న గుంజాటన, జూన్‌ 25న కాశ్మీర్‌లో పాక్‌ వుగ్రవాదుల దాడి వంటి వుదంతాలతో పాక్‌ రాయబారిని ఆహ్వానించి ఇప్తార్‌ విందు ఇవ్వటం నష్టదాయకమని పునరాలోచించి అబ్బే అసలు మేము అలాంటి కార్యక్రమమే తలపెట్టలేదంటూ పక్షం రోజుల తరువాత జూన్‌ 30న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. వేరే సంస్ధ పెట్టుకున్న కార్యక్రమాన్ని తాము ఎందుకు వ్యతిరేకించాలని ఎదురు ప్రశ్నించింది.

     మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకొనేందుకు మైనారిటీ వ్యతిరేకతను పురికొల్పటం దాని పధకాలలో ఒకటి. బిజెపి , దాని పూర్వ రూపమైన జనసంఘం తప్ప కాంగ్రెస్‌, వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్నాయని పదేపదే ప్రచారం చేసి కొంత మేరకు విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో జయప్రదమైంది. ఇప్తార్‌ విందులు ఇవ్వటం, పర్యటనల సందర్భంగా మతపరమైన కేంద్రాలను సందర్శించటం వంటి చర్యలను అది తప్పుపట్టింది. ఓట్ల కోసం వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తాను రాజకీయంగా బలహీనపడినట్లు పసిగట్టిన ఇందిరా గాంధీ ఇలాంటి కార్యక్రమాలకు తొలిసారిగా పెద్ద ఎత్తున తెరతీశారు. తరువాత కాలంలో ఇతర పార్టీలు కూడా ఒక్క మైనారిటీలే కాదు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు పోటీగా మెజారిటీ ఓట్లను పోగొట్టుకోకుండా వుండేందుకు కూడా ప్రయత్నించాయన్నదానిలో రెండవ మాట లేదు. దేవాలయాల భూములను ఇతర మతాల పేదలైన కౌలుదార్లు సాగు చేయకూడదని, ఎవరైనా వుంటే వైదొలగాలని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, హాజ్‌ యాత్రలకు ఇచ్చే రాయితీలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వంటి క్షేత్రాల సందర్శనకు రాయితీలు ఇస్తామని ప్రకటించటాన్ని ఏమనాలి ? కాంగ్రెస్‌ బాబరీ మసీదు తాళాలను తీయటం, షాబానో కేసులో సవరణలు, బాబరీ మసీదును కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోవటం వంటి వన్నీ వాటిలో భాగమే. అందుకే కుహనా లౌకికవాదులంటూ సైద్దాంతిక దాడి చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి అవకాశాలు దొరికాయి.

  అంతర్జాతీయంగా నరేంద్రమోడీపై వున్న మైనారిటీ వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలని సంఘపరివార్‌ ఆలోచిస్తున్నది. మిగతా పార్టీలు ఓట్లకోసమే మైనారిటీ పధకాలను ప్రకటిస్తే తాము ఓట్ల దృష్టితో గాక మైనారిటీల సంక్షేమం కోసమే పధకాలను ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నామని, అందుకోసం గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశాం చూడమంటూ ప్రచారానికి దిగింది. అసోం వంటి చోట్ల మైనారిటీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎల్లకాలం సాగదు కనుక గణనీయ సంఖ్యలో వున్న మైనారిటీలను ‘సంతృప్తి పరచటం లేదా సంతుష్టీకరణ’ చేయటం ద్వారా వారిని పక్కా వ్యతిరేకులుగా మారకుండా చూసుకొనేందుకు పూనుకుంది. అనేక మంది ప్రముఖులు ఇప్తార్‌ విందులకు హజరు అవుతున్నారు. కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ పాల్గొన్న ఒక చిత్రం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

    మన దేశంలో ముస్లిం పాలనకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర వుంది. వారి ప్రవేశం నుంచి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందులు ప్రారంభమయ్యాయి. మహమ్మద్‌ ప్రవక్త తన వుపవాసాన్ని మూడు ఖర్జూరాలు తిని ముగించేవారట. అయితే ప్రస్తుతం ఇప్తార్‌ విందులు ఖర్జూరాలకే పరిమితం కాలేదు, ఆయా దేశాలలో వున్న ఆహార అలవాట్లతో పాటు ఎన్నిరకాలు వడ్డిస్తే అంత గొప్పగా పరిగణించే రోజులు వచ్చాయి. సామూహికంగా జరిగే ఈ క్రతువుకు హాజరు కావటం కాకపోవటం అనేది మత విశ్వాసాలకు సంబంధం లేదు. హిందువుల పండగలను ముస్లింలు జరుపుకోవటం ఎలా జరుగుతోందో ఇప్తార్‌ విందులకు వుపవాసం పాటించని హిందువులు, ఇతర మతాల వారు కూడా హాజరుకావటం అన్నది ఒక సామాజిక మర్యాద, అంశంగా మారిపోయింది. వాటిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదాస్పదం కావించింది. ఒక పార్టీ ఇచ్చిన విందుకారణంగా ముస్లింలందరూ అదే పార్టీకి ఓటు వేస్తారనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి వుండదు. అదే అయితే వినాయకచవితి, దసరా వంటి హిందువుల పండుగల సందర్బంగా బిజెపి నేతలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంత మాత్రాన హిందువులందరూ వారికి ఓటు వేయటం లేదు. జర్మనీలో హిట్లర్‌ యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే లాభం వుంటుందని భావించినట్లే మన దేశంలో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు భావిస్తున్నాయి. అందుకే ఈ రచ్చ.

 అధికారంలో వున్నపుడు మతం, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటంలో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించిందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి అంతకంటే ఎక్కువగా చేస్తోందనటంలో అతిశయోక్తి కాదు. వారణాసిలో ఒక హిందూమత కార్యక్రమానికి ప్రధాని హాజరుకావటం, దానిని ప్రత్యక్ష ప్రసారం చేయటం రాజకీయ లబ్ది పొందటంలో భాగం కాదా ? ఇరుగు పొరుగు దేశాలను సందర్శించినపుడు ప్రధాని మతపరమైన పూజలు నిర్వహించటం కూడా ప్రచారంలో ఒక భాగంగా మార్చివేశారు. సినీ హీరో షారూఖ్‌ ఖాన్‌ను పాక్‌ వుగ్రవాది హఫీజ్‌తో పోల్చిన హిందూమత పూజారి లేదా యోగి, పచ్చి ముస్లిం వ్యతిరేకి అయిన ఆదిత్యనాధ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

    ఇలాంటివి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. వివిధ కారణాలతో అనేక దేశాలలో జరిగాయి, జరుగుతున్నాయి. ముస్లిం దండయాత్రలకు గురైన సోమనాధ దేవాలయాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించారు.దేవాలయ నిర్మాణం జరపండిగాని దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించండి తప్ప ప్రభుత్వ నిధులు వద్దని చెప్పిన మహాత్మాగాంధీ సూచనను నాటి పాలకులు పట్టించుకోలేదు. 1971లో అంతర్యుద్ధం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పట్టణంలో పాక్‌ సైన్యం ధ్వంసం చేసిన రమణ కాళీ మందిరం స్ధానంలో జాతీయ దేవాలయం(ప్రభుత్వ) కట్టించాలని అక్కడి మైనారిటీ హిందువులు చేసిన వినతి లేదా డిమాండ్‌కు తలొగ్గిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఢాకేశ్వరీ పేరుతో ఆలయ నిర్మాణం చేయటమే గాక దానిని జాతీయ ఆలయంగా కూడా ప్రకటించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి మైనారిటీ హిందువుల కోరిక మేరకు హోలీ, దీపావళిని జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది. కెనడాలో పెద్ద సంఖ్యలో వున్న సిక్కు మైనారిటీల కారణంగా వైశాఖీ పూర్ణిమను జరుపుకోవాలని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

    ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ద ఆర్‌ఎంఎం పార్లమెంట్‌ భవనంలో జరప తలపెట్టిన ఇప్తార్‌ పార్టీకి మొత్తం 140 దేశాల ప్రతినిధులతో పాటు మోడీ మంత్రివర్గ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కూడా హాజరౌతారని గొప్పగా ప్రకటించారు.దీని గురించి ఆర్‌ఎంఎంకు మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ ఇంద్రేష్‌ కుమార్‌ మీడియాతో స్వయంగా మాట్లాడారు. దీనిని ఒక రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఏర్పాటు చేసినదిగా చూడవద్దని కూడా చెప్పారు. భారత్‌లో అన్ని మతాల వారు సహజీవనం చేస్తున్నారని ప్రపంచానికి తెలిపేందుకు వుద్ధేశించినట్లు తెలిపారు.ఈ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని చెప్పటం ఎలా వుందంటే బిజెపి వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో వుండవచ్చు, దానికీ తమకూ సంబంధం లేదని బుకాయించటం వంటిదే.

     ఆర్‌ఎంఎం అధిపతి మహమ్మద్‌ అఫ్జల్‌ ఈ విందు గురించి చెబుతూ భారత్‌లో ముస్లింలు శాంతి లేదా సంతోషంగా లేరని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, ముస్లింలకు మోడీ ప్రభుత్వం మంచి చేస్తున్నదని చెప్పటానికే ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైన ప్రపంచ సౌహార్ద్ర నూతన అధ్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, దీనిని రాజకీయమైందని చిత్రిస్తారు, సరిగ్గా ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే దీనిని నిర్వహిస్తున్నాం అని అరటి పండు వలచి చెప్పినట్లు వివరించారు.http://indiatoday.intoday.in/story/rss-tries-to-shed-pro-hindu-image-invites-140-countries-to-iftar-party/1/695911.html

   ముస్లింలను సంతృప్తిపరుస్తున్నారని కాంగ్రెస్‌, ఇతర పార్టీలను ఇప్పటి వరకు విమర్శిస్తూ, ఖండిస్తూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నదని బిజెపి మిత్రపక్షమైన శివసేన నాయకుడు మనీషా క్యాండే ధ్వజమెత్తారు.’ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ చెబుతుంటుంది,ఇప్తార్‌ విందుల వంటి వాటిని కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఖండిస్తుంది,అలాంటిది ఇప్పుడు అదే ఆపని చేస్తోంది. దాని అసలు భావజాలం నుంచి పూర్తిగా వైదొలిగింది, ఒకవైపు ఘర్‌ వాపసీ గురించి చెబుతారు మరోవైపు ఇప్తార్‌ విందులు ఇస్తారు, దీని ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ గందరగోళంలో వున్నదని వారే వెల్లడించుకుంటున్నారు అని క్యాండే పేర్కొన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడి తరువాత దానిని కాదని చెప్పిన విషయం తెలిసిందే. చరిత్రలో దాని ఆత్మవంచన, పరవంచన ఖాతాలో ఇప్పుడు ఇప్తార్‌ విందు మరొకటి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత మాతపై రెండు ఫత్వాలు

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, bharat-mata-ki-jai-row, BJP, Bjp nationalism, MIM, Narendra Modi, RSS, RSS Double game

చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు.

ఎం కోటేశ్వరరావు

    భారత మాతపై రెండు ఫత్వాలు జారీ అయ్యాయి. మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు ఎవరు చేసినా ఇవి రెండూ ఇప్పటికే సమాజంలో వున్న చీలికలు, అపోహలను మరింత గట్టిపరుస్తాయి. దేశానికి నష్టదాయకం. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి జాతీయ సమావేశంలో వికాస మంత్రాన్ని జపిస్తే అదే సమావేశంలో పార్టీ మాత్రం దాని కంటే భారత మాతకు జై అనని వారు రాజ్యాంగాన్ని గౌరవించనివారిగా పరిగణించబడతారు అంటే దేశద్రోహుల కిందే లెక్క అన్న విడగొట్టే తీర్మానం చేసింది. దీన్నే మరో విధంగా ఆ పార్టీకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఫత్వా జారీ చేసింది. దీనంతటికీ కారణం భారత మాతాకీ జై అనే నినాదాన్ని దేశభక్తిగా యువతరానికి బోధించాల్సిన అవసరం వుందని బిజెపి మాతృమూర్తి సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగత్‌ చిచ్చు రాజేశారు. దానికి ప్రతిగా మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాను అలా నినదించను అని ప్రకటించి ఆజ్యం పోశారు. చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు. అధిపతి చెప్పిన తరువాత అనుచర గణం వూరికే ఎలా వుంటుంది? ఏకంగా బిజెపి సమావేశంలో తీర్మానం చేసింది. ఇదే సమయంలో హైదరాబాదుకు చెందిన అల్‌ మహద్‌ అల్‌ అలాలీ అల్‌ ఇస్లామీ, జామియా నిజామియా అనే మత సంస్థలు దీనికి ప్రతిగా భారత మాతకు జై అనటానికి ముస్లింలకు అనుమతి లేదని ఒక ఫత్వా జారీచేశాయి. దేశాన్ని ఒక మాతగా కొలవటానికి లేదని అవి పేర్కొన్నాయి. ప్రతి ముస్లిం తన దేశాన్ని ప్రేమిస్తారు, అందుకోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఇది వేరే విషయం, పూజించాల్సి వచ్చినపుడు అల్లాను తప్ప మరొకరిని ఇస్లాం అంగీకరించదని, రెండింటినీ కలగా పులగం చేయవద్దని ఆ సంస్ధలు చెబుతున్నాయి. భారత్‌కు జై, జై హింద్‌, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అనటానికి తమకు ఇబ్బంది లేదని భారత మాత అంటే ఒక దేవతకు ప్రతిరూపంగా వున్నందున తాము జై కొట్టలేమని ముస్లిం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్‌(అమృతసర్‌)కు చెందిన సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కూడా సిక్కులు ఏ రూపంలోనూ మహిళలను పూజించరని అందువలన తాము భారత మాతాకి జై అనేది లేదని ప్రకటించారు. ‘దీని గురించి నేను వ్యాఖ్యానించాలనుకోవటం లేదు, ఇదొక వృధా వివాదం’ అని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ విలేకర్లు అడిగిన దానికి బదులిస్తూ బుధవారం నాడు అహమ్మదాబాద్‌లో వ్యాఖ్యానించారు. భారత మాతాకీ జై అని ప్రతి ఒక్కరూ అనే విధంగా, గోవధను రాజ్యాంగంలో చేర్చాలని యధాప్రకారం బాబా రాందేవ్‌ డిమాండ్‌ చేశారు.

   హిందువుల అభ్యున్నతి కోసం (అది చెప్పే హిందూ అంటే భారత్‌ , భారత్‌ అంటే హిందూ అనే వ్యాఖ్యానానికి అర్ధం అదే) పని చేస్తున్నట్లు చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ విరుద్ధ ముఖాలను ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు ? నరేంద్రమోడీ అంటే ‘గుజరాత్‌ మోడల’్‌ తప్ప రాజ్యాంగం గురించి అంతగా తెలిసిన వ్యక్తి కాదనుకోవచ్చు, మరి అరుణ్‌జైట్లీ వంటి సుప్రసిద్ద లాయర్లు వుండి కూడా అలాంటి తీర్మానాలు ఎందుకు చేయిస్తున్నట్లు ? నిద్ర పోయే వారిని లేపవచ్చు తప్ప నటించే వారిని లేపలేము అన్నట్లే ఇదంతా ఒక పధకం ప్రకారమే జరుగుతోందని అనేక మంది భావించటంలో ఆశ్చర్యం లేదు. భారత మాతకు జై అనేందుకు నిరాకరించిన మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ పార్టీ సభ్యుడిని వర్తమాన సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. చట్ట సభలు చేసిన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించటానికి వీలు లేదనే తీర్పులు వెలువడుతున్న తరుణంలో అది కోర్టు పరిధిలోకి రాదు. కానీ బయట ఎవరైనా భారత మాతకు జై అనను అంటే అలాంటి వారిపై చర్య తీసుకోవటం కుదరదు, ఎవరైనా అలాంటి పిచ్చిపనిచేస్తే అది కోర్టులో చెల్లదు.ఎందుకంటే మన రాజ్యాంగంలో భారత్‌ అనే పదం వుంది తప్ప భారతమాత లేదు.అయినా సరే బిజెపి తన తీర్మానంలో ఇలా పేర్కొన్నది.’మన రాజ్యాంగం ఇండియాను భారత్‌ అని కూడా వర్ణించింది.భారత్‌ విజయం గురించి నినదించకపోవటం మన రాజ్యాంగాన్నే అగౌరవపరచటంతో సమానం’ అని పేర్కొన్నది. భారత స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, రాజ్యాంగంతో గాని ఎలాంటి బీరకాయ పీచు సంబంధం కూడా లేని బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్దంగా వ్యవహరించటంలో ఆశ్చర్యం ఏముంది ?

   నినాదాలు చేయటం ద్వారా జాతీయ వాదాన్ని తయారు చేయలేమని వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సోలీ సోరాబ్జీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆయనే మరొక విషయాన్ని కూడా తెలిపారు. విజయ్‌ ఇమ్మాన్యుయెల్‌-కేరళ రాష్ట్ర వివాదంలో 1986లో మైలురాయిగా పేర్కొన దగిన తీర్పును సుప్రీం కోర్టు జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి ఇచ్చారు.యెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ తెగకు చెందిన వారు జాతీయ గీతం పాడేటపుడు గౌరవసూచకంగా లేచి నిలబడతారు తప్ప దానిని పాడకూడదని అందువలన తాము జాతీయ గీతాన్ని పాడలేదని విద్యార్ధులు చేసిన వాదనపై వివాదం కోర్టుకు ఎక్కింది.ఆ విద్యార్ధుల చర్యను సమర్ధిస్తూ ‘ మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తున్నది, మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తున్నది, మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తున్నది, మనం దాన్ని నీరు గార్చవద్దు’ అని న్యాయమూర్తి చిన్నప రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారంటూ సహనాన్ని స్పష్టంగా నిర్ధారించిన తీర్పు అని సొరాబ్జి వ్యాఖ్యానించారు.

   సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం రాజ్యాంగంపై బిజెపి పూర్తిగా తప్పుడు వైఖరి తీసుకున్నది అని వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్ధి కేసునే వుదాహరిస్తూ జాతీయ గీతాన్ని పాడనందుకు విద్యార్ధులను స్కూలు నుంచి బహిష్కరించారు. వారు దేశం లేదా జాతీయ పతాకం పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించలేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.అందువలన వర్తమాన వివాద పూర్వరంగంలో ఒక వ్యక్తి ఎవరైనా ఇతర విధాలుగా దేశాన్ని అగౌరవపరిస్తే తప్ప కొన్ని నినాదాలను నేను చేయను అంటే అది మొత్తంగా అగౌరవ పరిచినట్లు కాదని సుందరం చెప్పారు. దేన్నయినా నినదించాలా లేదా అనేది అతనికి లేదా ఆమెకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ప్రకారం భారత మాతాకీ జై అని నినదించకపోవటం దేశాన్ని అగౌరవపరచటంగా నేను అంగీకరించను, ఇదంతా పూర్తిగా అనవసరమైన చీలికలను సృష్టిస్తున్నది. ఎవరైనా దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని అగౌరవ పరిస్థే చర్య తీసుకోవాలని నేను కూడా నమ్ముతాను, ప్రస్తుతం అలాంటిదేమీ నాకు కనిపించటంలేదు.అలాంటి చర్యలు చీలికలను మరింత గట్టిపరుస్తాయి అని సుందరం అన్నారు.

   ‘ రాజ్యాంగ ప్రకారం భారత మాతాకు జై అని జనం అనాల్సిన అవసరం లేదు,ఎక్కడా దాని గురించి చర్చించలేదు. బిజెపి తీర్మానం తప్పుడు వ్యాఖ్యానం. ఇండియా అంటే భారత్‌ అని మాత్రమే రాజ్యంగం చెప్పింది.అది భారత మాత గురించి పేర్కొనలేదు. కాబట్టి అలాంటి నినాదం చేయటం ప్రతి పౌరుడి ప్రాధమిక విధి కాదు,మనం అందరం దేశాన్ని ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ దానిని మన మీద రాసుకొని తిరగము’ అని మరో సీనియర్‌ న్యాయవాది కామినీ జైస్వాల్‌ అన్నారు.’ బిజెపి వారు అనవసరంగా ఒక వివాదాన్ని సృష్టించారు. ఎవరూ కోరుకోని దానిని వారు సృష్టించబోతున్నారు. వారు జనాన్ని విభజించేందుకు పూనుకున్నారు, ఈ సమస్యలను రేకెత్తించకూడదు’ అని కూడా ఆమె చెప్పారు.మహా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పూర్తిగా తప్పుడు నిర్ణయం, ఎవరైనా దానిని సవాలు చేయాలి’ అని కూడా అన్నారు.

    ముంబైకి చెందిన న్యాయవాది అబ్దుల్‌ మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ ‘ ఈ సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు బిజెపి అలాగే మజ్లిస్‌ రెండూ తప్పు చేస్తున్నాయి. రాజకీయాలు చేస్తున్నారు. నా వరకు భారత మాతాకి జై అనటం ఒక సమస్య కాదు. ఆ నినాదమిస్తే ఏం హాని జరుగుతుంది.అసెంబ్లీ నుంచి వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేయటం అతి ప్రతిస్పందన అనుకుంటున్నాను. నినదించటం తప్పుకాదని నమ్ముతున్నట్లు నేను అతనితో టీవీ చర్చలో కూడా చెప్పాను, అయితే బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ వత్తిడి చేసిన కారణంగా తానా పనిచేయనని అతను అన్నాడు. దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసి వుండాల్సింది’ అన్నారు.

   ‘మజ్లిస్‌ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించేది కాదని నేను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయదలచాను. వారి చర్యలతో వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు.ఈ సమస్యను అనవసరంగా రేకెత్తించారని నేను కూడా భావిస్తున్నాను. హైదరాబాదుకు చెందిన ఒక మత పెద్ద భారత మాతాకి జై అనటాన్ని అభ్యంతర పెట్టినట్లు నేను చదివాను. గత అరవై సంవత్సరాలుగా వారికి సమస్య లేదు. ఇప్పటికీ వారికి భారత్‌ లేదా జై అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సమస్య ఎక్కడంటే మాత లేదా తల్లి అని చెప్పటంలోనే. మాతృదేశం అన్న భావనలో ఇప్పుడు తప్పేమిటి ? భారత మాత అంటే మదర్‌ ఇండియా వంటిదే. కానీ ఒక ముస్లిం మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మదర్‌ ఇండియా అవార్డు వచ్చిన సినిమా, దానిలో మరొక ముస్లిం అయిన నర్గీస్‌ దత్‌ ప్రధాన పోత్ర పోషించారు, దానితో ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ అసలు సమస్య ప్రతిసారీ ముస్లింలు తమ విదేయత, దేశభక్తిని నిరూపించుకోవటంలో అలసి పోయారు. అందుకోసం వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని మెమెన్‌ స్పష్టం చేశారు. మరొక సుప్రీం కోర్టు లాయర్‌ రాజు రామచంద్రన్‌ కూడా జాతీయ గీతాన్ని ఆలపించకపోవటం అనుమతించదగినదే అని కేరళ విద్యార్ధుల కేసు స్పష్టం చేసింది. కొంత మంది డిమాండ్‌ చేసినంత మాత్రాన ఒక నినాదాన్ని పలకనంత మాత్రాన అది రాజ్యాంగాన్ని అగౌరవపరచినట్లు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ‘తన తీర్మానంలో బిజెపి ఈ విధంగా ప్రస్తావించటం దురదృష్టకరం, ఒక న్యాయవాదిగా నాకు అరుణ్‌ జైట్లీ అంటే గౌరవం వుంది, పార్టీ తీర్మానంలో రాజ్యాంగాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానం చేయటాన్ని నిరోధించేందుకు ఆయన అయినా ప్రయత్నించి వుండాల్సింది’ అని మరో సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.

   భారత మాతాకీ జై అన్న నినాదం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ముందే స్వాతంత్య్ర వుద్యమంతో ముడిపడి వున్నదని, భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఆ నినాదాలతోనే వురి కంబం ఎక్కారు, ఇప్పుడు ఆ నినాదం గురించి చర్చించటమే ఒక విద్రోహం అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తన పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యా నించారు. నిజమే ఆంగ్లేయులు మన దేశాన్ని అక్రమించినందున దాస్యవిముక్తి చేయటానికి అనేక మంది దేశ భక్తులు జాతీయ వాదంలో భాగంగా అనేక నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం. అదే భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని కూడా అన్నారు. మరి దాన్ని నినదించాలని సంఘపరివార్‌ లేదా బిజెపి ఎందుకు కోరటం లేదు. అన్నింటి కంటే భగత్‌ సింగ్‌ ఆ నినాదం చేస్తున్న తరుణంలో సంఘపరివార్‌ నేత సావర్కర్‌ ఆంగ్లమాతాకు జై అని నినాదాలు ఇస్తామని,తెల్ల దొరలకు సేవలు చేసుకుంటామని, బొలో స్వాతంత్య్ర భారత్‌కు జై అనే నినాదం మా నోట వెంట రానివ్వబోమని జైలు నుంచి బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన పచ్చినిజాన్ని కాదంటారా ? ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనటానికి ఏ మతానికి లేదా మరొకరికి అభ్యంతరం లేదు దాన్ని వదలి పెట్టి వివాదాస్పద అంశాలనే ఎందుకు అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నట్లు ?

  వందేమాతరం అన్నందుకు నాడు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్ర సమర యోధులను జైల్లో పెట్టారు. ఇదే నినాదాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో అసందర్భంగా చేసినందుకు రాజీవ్‌ యాదవ్‌ అనే లాయర్‌ను న్యాయమూర్తులు మందలించటంతో అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. అంటే దీని అర్ధం జడ్జీలకు దేశభక్తి లేదనా ? జాతీయ వాదులు కాదనా ? వందేమాతర గీతం, నినాదం ఒక వివాదాస్పద అంశం. స్వాతంత్య్ర వుద్యమ కాలంలోనే ముస్లింలు, సిక్కులు దానిని పాడేందుకు నిరాకరించారు.అంత మాత్రాన స్వాతంత్య్ర వుద్యమం వారిని దేశద్రోహులుగా లేక జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు. అక్కున చేర్చుకుంది. ఎందరో ముస్లింలు, సిక్కులు వందేమాతరం అనకుండానే తమ తమ పద్దతుల్లో స్వాతంత్య్ర వుద్యమంలో ఎన్నో త్యాగాలు చేయలేదా ? వారు దేశభక్తులు కాలేదా ?

   బిజెపి కనుక దేశభక్తి, జాతీయ వాదాలపై చట్టాలను సవరించి వాటిని గతం నుంచి వర్తింపచేయాలని గనుక నిర్ణయిస్తే జనగనమణ గీత రచయిత రవీంద్రనాధ ఠాగూర్‌ కూడా దేశద్రోహి వర్గీకరణకిందికే వస్తారు. ఒక గీతం జాతిని ఐక్య పరచాలి తప్ప విడదీయకూడదంటూ వందేమాతర గీతాన్ని రవీంద్రుడు తిరస్కరించారు. ‘ఈ అంశంపై బెంగాలీ హిందువులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు, కానీ ఇది ఒక్క హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు. రెండు వైపులా బలమైన భావనలు వున్నాయి. సమతుల్యమైన న్యాయం అవసరం. మన రాజకీయ లక్ష్యాల వుద్యమంలో మనం శాంతి, ఐక్యత, మంచితనం కోరుకుంటున్నాం, ఒక వర్గం చేసిన డిమాండ్లకు ప్రతిగా మరొక వర్గం చేసే డిమాండ్లతో అంతంలేని ఎదురుబొదురు బలప్రదర్శనలు తగదు.’అని రవీంద్రుడు సుభాస్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో సూచించారు. చివరకు కాంగ్రెస్‌ వందేమాతర గీతంలో హిందూ దేవత దుర్గకు సంబంధించిన భాగాలు మినహా మిగతా భాగాన్ని ఆమోదించింది. చివరకు మన రాజ్యాంగసభలో కూడా ఇది వివాదాస్పదమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగసభకు అధ్యక్షత వహించిన బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జనగన మణను జాతీయ గీతంగానూ , స్వాతంత్య్ర వుద్యమంలో చారిత్రక పాత్ర వహించిన వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ దానికి కూడా జాతీయ పాటగా సమాన స్థాయిని కల్పించాలని అంతిమంగా ఆ వివాదానికి స్వస్తి పలికారు.

   తరువాత 2006లో వందేమాతరం 125వ వార్షికోత్సవం సందర్భంగా దానిని విధిగా ఆలపించాలా లేదా అన్న వివాదం ఏర్పడింది.ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సిక్కులు దానిని ఆలపించవద్దని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి(ఎస్‌జిపిసి) కోరింది. వందేమాతరం గీతాలాపన స్వచ్చందం తప్ప విధికాదని పార్లమెంట్‌లో 2006 ఆగస్టు 22న ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్బంగా అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా విధిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బిజెపి సమర్ధించిందని, అయితే విధిగా చేయనవసరం లేదని నాడు వాజ్‌పేయి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఆ నాడు పేర్కొన్నది.

  అందువలన ఇప్పుడు భారత మాతాకి జై అనటమే దేశభక్తికి, జాతీయతకు నిదర్శనం, చిహ్నమని బిజెపి వత్తిడి చేయటం దాని అజెండా ప్రకారం దేశం నడవాలని ఏకపక్షంగా నిర్ణయించటం నిరంకుశ ధోరణులకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. తమ ప్రధాని మేకిండియా నినాదమిచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతానంటుంటే బిజెపి మాత్రం బ్రేకిండియా నినాదాలతో దేశాన్ని విచ్చిన్నం చేయ చూస్తున్నది. ఎవరిది కుహనా జాతీయ వాదం,ఎవరు దేశభక్తులు? ఏది అభివృద్ధి పధం ? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం? దీన్నా నరేంద్రమోడీకి ఓటు వేసి జనం కోరుకున్నది ?

గమనిక: ఈ వ్యాసంలోని న్యాయవాదుల అభిప్రాయాలు ది వైర్‌.ఇన్‌లోని గౌరవ్‌ వివేక్‌ భట్నాగర్‌ వ్యాసం నుంచి స్వీకరించబడినవి. రచయితకు కృతజ్ఞతలు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రిజర్వేషన్లపై పిర్రగిల్లి జోలపాట

22 Tuesday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Ambedkar, BR Ambedkar, Narendra Modi, Reservations, RSS, RSS Double game

సత్య

   తెలుగు వారందరికీ సుపరిచితమైన ఒక చక్కటి సామెత ,అదే పిర్ర గిల్లి జోల పాడటం గురించి వేరే చెప్పనవసరం లేదు. ‘దేశ భక్త ‘నరేంద్రమోడీ మనకు మరోసారి దానిని గుర్తు చేశారు.( కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యలో బిజెపి నేతల పేర్లకు ముందు దేశభక్త పదం తగిలించినందుకు మన వూరి దేశ భక్త కొండా వెంకటప్పయ్య కూడా పరివార్‌ బాపతా అని అనుకొనే ప్రమాదంలో పడవేశావని ఒక మిత్రుడు చేసిన మందలింపుతో కూడిన విమర్శ సరైనదే) న్యూఢిల్లీలో సోమవారం నాడు అంబేద్కర్‌ స్మారక వుపన్యాసం చేసిన ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల విధానంలో ఎలాంటి మార్పు లేదని, ఒక వేళ అంబేద్కరే తిరిగి వచ్చినా దానిని మార్చలేరని, ఆయన ముందు మనమెంత అని మోడీ ప్రశ్నించారు. తామంటే గిట్టని వారు రిజర్వేషన్లపై తన ప్రభుత్వ విధానాల గురించి ఆవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ఇదే మాదిరి ప్రచారం చేశారని, తమ పార్టీ మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా వంటి రాష్ట్రాలలో అధికారంలో వున్నప్పటికీ ఎన్నడైనా రిజర్వేషన్ల విధానం మార్చేందుకు ప్రయత్నించిందా అని అమాయకంగా అడిగారు. నిజమే ! అనేక సమస్యలపై అడిగినా నోరు విప్పని ప్రధాని తనంతట తానుగా దీని గురించి చెప్పటానికి ఏ పార్టీ ప్రచారం చేసిన అసత్యమేమిటో చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.అన్నింటికీ మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంఘపరివార్‌ అధినేత మోహన్‌ భగవత్‌ మాటలపై ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పటం సంతోషమే. కానీ వాటిపై పార్టీ వైఖరి ఏమిటి ?

    రిజర్వేషన్ల గురించి తాజాగా వార్తలలోకి ఎక్కింది అపర సాంస్కృతిక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే. నాగపూర్‌లో జరిగిన సమావేశాల సందర్భంగా ఆ సంస్ధ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషీ విలేకర్ల సమావేశంలో రిజర్వేషన్లపై చేసిన ప్రస్తావనతో స్పందన వచ్చింది తప్ప మరొకటి కాదు.ఒక్క రిజర్వేషన్లే కాదు, అనేక అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయటం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. గతేడాది బీహార్‌ ఎన్నికలకు ముందు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ తమ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు ఎవరికి, ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయించేందుకు రాజకీయేతర కమిటి నిర్ణయించాలని చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు సురేష్‌ భయ్యాజీ కూడా మరో రూపంలో దానినే పునరుద్ఘాటించారంటే జనం దానిని ఎలా స్వీకరించాలి. ఫిబ్రవరి నెలలో కొల్‌కతా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశం ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ‘అనేక మంది రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఎవరు అర్హులో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయటం అవసరం అని నేను భావిస్తున్నాను.అ కమిటీ రాజకీయ రహితమైనదిగా వుండాలి, తద్వారా స్వప్రయోజనాలకు పాల్పడకుండా చూడవచ్చు, సమాజంలో ఏ తరగతిని ముందుకు తీసుకురావాలి, వారికి ఎంతకాలం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నదాని గురించి ఒక నిర్ణీత కాల పరిమితి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఆ కమిటీకి దానిని అమలు జరిపే అధికారాలు ఇవ్వాలి’ అని మోహన్‌ భగవత్‌ చెప్పారు. ‘అదే సమయంలో కేవలం ఒక కులంలో పుట్టిన కారణంగా అవకాశం దొరకకుండా వుండకూడదు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు వుండాలి. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు వుండాలి. కేవలం పుట్టుక కారణంగానే రిజర్వేషన్‌ పొందేట్లయితే ఆ పరిస్తితి ఎంతకాలం వుంటుందో అంతకాలం రిజర్వేషన్లు వుంటాయి అని కూడా భగవత్‌ చెప్పారు.

    బీహార్‌ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగటంతో తమ నేత వర్తమాన రిజర్వేషన్‌ కోటా గురించి మాట్లాడలేదని, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని పొందాలన్నది వుద్దేశ్యమని ఆర్‌ఎస్‌ఎస్‌ సంజాయిషీ ఇచ్చుకుంది. భగవత్‌ వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని బిజెపి ప్రకటించుకుంది. చిత్రమేమంటే ఆ భగవత్‌ సమక్షంలోనే బిజెపి కేంద్ర మంత్రులందరూ నిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం గురించి సమీక్ష జరిపారు.అదే భగవత్‌ ఆ తరువాత అఖిల భారతీయ వాల్మీకి మహాసభలో మాట్లాడుతూ సమాజంలో అన్ని తరగతుల అభ్యున్నతి గురించి తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌కు రిజర్వేషన్లు ఒక సమస్య కాదని, తమ సంస్ధ హిందువుల అభ్యున్నతికోసం పాటు పడుతుందని చెప్పారు.(డిఎన్‌ఏ అక్టోబరు 26,2015)

    రాజకీయ ప్రయోజనాల కోసం, మెజారిటీ పౌరుల ఓటు బ్యాంకు ఏర్పాటు, వారిని సంతృప్తి పరచేందుకు రిజర్వేషన్లపై భిన్న స్వరంతో మాట్లాడటం తరువాత అబ్బే అబ్బే లేదనటం పదే పదే జరుగుతోంది.హర్యానాలో జాట్లు రిజర్వేషన్ల కోసం హింసాత్మక ఆందోళనకు పూనుకుంటే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది బిజెపి. బీహార్‌ ఎన్నికలలో బిజెపి మిత్ర పక్షంగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వాదనను సమర్ధించారు. భవిష్యత్‌ ఎన్నికలలో తాను, తన కుమారుడు జనరల్‌ సీట్లలో పోటీ చేసి ఇతరులకు రిజర్వుడు సీట్లలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అటువంటి ప్రకటన బిజెపి, దాని మిత్రపక్షాలలోని నేతలందరూ ఒక వరవడిగా అమలు జరిపి ఇతర పార్టీల నేతలకు మార్గదర్శనం చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంగిట్లో వున్నాయి, బిజెపి సాధారణ సీట్లలో ఎంత మంది దళితులు, గిరిజనులకు అలాగే ముస్లింలకు సీట్లు ఇచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తిని అమలులోకి తెస్తుందో నిరూపించుకొనే తరుణమిది.

   ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ వ్యాఖ్యలు ఎక్కడ తమ అవకాశాలను దెబ్బతీస్తాయోనన్న భయంతో నరేంద్ర మోడీ అంబేద్కర్‌ స్మారక వుపన్యాస అవకాశాన్ని వుపయోగించుకొని నష్ట నివారణకు ప్రయత్నించారు తప్ప మరొకటి కాదు. రిజర్వేషన్లపై సమీక్ష జరపాలన్నది మోహన్‌ భగవత్‌ ఏదో అనాలోచితంగా చెప్పింది కాదు. 1981, 1985లో రెండు సార్లు అఖిలభారత ప్రతినిధి సభ, కార్యకారీ మండలి సమావేశాలలో రిజర్వేషన్లను సమీక్షించాలని ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానాలు చేసి డిమాండ్‌ చేసింది. వాటిని రద్దు చేసుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఎలాంటి కొత్త తీర్మానాలు చేయలేదు కనుక మోహన భగవత్‌ పాత తీర్మానాల సారాంశాన్ని పునరుద్ఘాటించారు. అందువలన సమీక్ష జరగాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వైఖరి సరైనదో, ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పూ వుండదని చెబుతున్న మోడీ వైఖరి సరైనదో స్పష్టం చేయాలి. తామంతా పరివార్‌ కుటుంబమేనని సగర్వంగా అందరూ చెప్పుకుంటున్నారు గనుక ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రెండూ తమ వైఖరిని చెప్పాలి. దాగుడు మూతలకు తెరదించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ‘పాలనా దక్షుడే కాదు మహా నటుడు’

24 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Narendra Modi, Rohith Vemula, RSS, RSS Double game, Subramany swamy, University of Hyderabad (UoH), Vemula Rohit

Snapshot of the front page of The Telegraph, January 23, 2016.

courtesy : The Telegraph

ఎం కోటేశ్వరరావు

ప్రధాని నరేంద్రమోడీ ! గొప్ప ‘పాలనా దక్షుడు’, అంతకంటే ఆయనో ‘మహానటుడు’ అన్నది హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి వేముల రోహిత్‌ మరణించిన ఐదు రోజుల వరకూ చాలా మంది గుర్తించలేదు. అన్నింటి కంటే ఆయన వెనుక వున్న మేథో చెరువు(మాయా బజార్‌ సినిమాలో ఘటోద్గజుడు చెప్పినట్లు ఎవరూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయి వేయండిరా వీడికో వీరతాడు అన్నట్లు థింక్‌ టాంక్‌కు నా అర్ధం)లో వున్న వ్యూహకర్తలు ఇంకా తెలివి గల వారు. ఆయనెంతటి పాలనా దక్షుడు కాకపోతే ముఖ్యమంత్రిగా తన పదమూడు సంవత్సరాల, తన విధానాల కొనసాగింపు వారసురాలి రెండు సంవత్సరాలు వెరసి 15 ఏళ్లలో గుజరాత్‌ నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్లకు నీరు అందించాల్సి వుండగా ఇప్పటి వరకు లక్షా 17వేల 026 హెక్టార్లకు అందించగలిగినా, ప్రధాన కాలవలు పూర్తయి, పొలాలకు నీరందించాల్సిన పిల్లకాలవల తవ్వకం 21శాతం పూర్తి కావటమంటే 35 సంవత్సరాల నర్మదా ప్రాజెక్టు చరిత్రలో సాధించిన ‘ఘనత ‘కాకపోతే మరేమిటి? అంతేనా నీటిలో పరిశ్రమలకు కేటాయించిన 0.20 ఎంఎఎఫ్‌(మిలియన్‌ యాకర్‌ ఫీట్‌)కు గాను ఇప్పటికే 0.25 కేటాయించటం మామూలు విషయమా? వ్యవసాయం కంటే పరిశ్రమలకు పెద్ద పీట వేసినట్లు కాదూ !!

ఇక నటుడిగా నరేంద్రమోడీ గురించి చెప్పాలంటే ఆయనొక మట్టిలో మాణిక్యం. తెలుగు సినిమాల్లో పేద పాత్రలు వేసేటపుడు కూడా చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటే మన హీరో, హీరోయిన్ల గ్లామర్‌ ఎక్కడ తగ్గిపోతుందో అని పట్టుబట్టలను చింపి వేయటమో , కలల్లో అందమైన దుస్తులతో కూడిన దృశ్యాలను చూపటమో చేసినట్లుగా నరేంద్రమోడీ సందర్బానికి తగినట్లు దుస్తులు మార్చటంలో పేరు మోశారంటే నటుడు కాకపోతే సాధ్య మౌతుందా ? ఆయన తనదైన బ్రాండ్‌ కుర్తాను ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వదిలిన విషయం తెలిసినదే.ఏంజెలా మెర్కెల్‌ పర్యటన సందర్బంగా ఆమె ఏ రంగు కోటు వేసుకుందో అదే రంగు కోటును తాను ధరించటం, మరొక సందర్బంలో ఒకే రోజు నాలుగు కార్యక్రమాలకు నాలుగు దుస్తులు మార్చిన ఘనత మోడీ వంటి సామాన్యుడు, టీ అమ్మిన వారికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.ఏదో సమయానికి కనపడిన దుస్తులు వేసుకుంటాను తప్ప తనకు దుస్తుల డిజైనర్‌ ఎవరూ లేరని అదీ నేటితరం విద్యార్ధులతో చెప్పటం ఒక మహానటుడికి తప్ప మరొకరికి ఎలా సాధ్యం ? నరేంద్రమోడీ హావభావాల గురించి తాజాగా కొల్‌కతా నుంచి వెలువుడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక సచిత్రంగా వెల్లడించింది. వరుసగా సోమ, మంగళ,బుధ, గురువారాలలో వివిధ కార్యక్రమాలలో ఎంతో వుల్లాసంగా, వుత్సాహంగా కనిపించిన ప్రధాని శుక్రవారం నాటికి లక్నోలో తీవ్ర విచార సాగరంలో మునిగి పోయారు. రోహిత్‌ మరణం గురించి (ఐదురోజుల తరువాత) బొటబొటా కన్నీరు కార్చారు.అదీ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో, కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన తరువాత కూడా అలా చేయకపోతే ఎలా ! ఈ సందర్బంలో కూడా మా భారతి అంటూ రోహిత్‌ తల్లిని సంబోధించారు. రాధిక అన్న ఆమె పేరును పలకటానికి కూడా ఇచ్చగించలేదా ? సంఘపరివార్‌ ప్రచారక్‌లు ప్రతిదానికీ భారత్‌, భారతి అనే పదాలను ముందు, వెనుకా తగిలించటంలో పెద్ద శిక్షణే పొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తాను గొప్ప జాతీయ వాదినని ప్రదర్శించుకొనేందుకు తాను ఏర్పాటు చేసిన అనేక సంస్ధలకు వాటిని తగిలించింది. భారతీయ జన సంఘ్‌, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌,అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌, విద్యాభారతి, విజ్ఞాన భారతి, సంస్కార భారతి ఇలా….ఒక ప్రచార్‌క్‌గా పనిచేసేందుకు కట్టుకున్న భార్యనే వదిలేసిన నరేంద్రమోడీ జీవితకాలమంతా చేసే ప్రసంగాలలో భారత్‌, భారతి అని పదే పదే పలికి చివరికి రోహిత్‌ తల్లిని కూడా మా భారతి అన్నారేమో . మా మోడీ ఆ ఆర్ధంతోకాదు భారత మాత ఒక బిడ్డను కోల్పోయింది అన్నారని ఎవరైనా టీకా తాత్పర్యం చెప్పవచ్చు. ఏదైతే ఏమైంది వదిలేయండి, మొసలి కన్నీరు ఎవరికి కావాలి?

కులుబర్గి, దాద్రి వుదంతాల తరువాత కూడా నరేంద్రమోడీ ఏమీ నేర్చుకోలేదా ? ఆయన మేథో చెరువులోని కప్పలు అంతకు ముందు రాసిన స్ట్రిప్టులను కాపీ చేసి యధాతధంగా ఎప్పటి కప్పుడు అందిస్తున్నాయా? ఏమో అలాగే కనిపిస్తోంది. వారు మోడీ ప్రతిష్ట పెంచేందుకు చేస్తున్న సాయం, పడుతున్న కష్టం ఏమిటో తెలియదుగానీ దేశ పౌరులకు చేస్తున్న మేలుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. కులుబర్గి హత్యా వుదంతంలో కొంత మంది మేథావులను అయినా కదిలించగలిగారు, దేశంలో అసహన ధోరణుల గురించి తెలియని వారికి తెలియచెప్పారు.తమ పండగ సందర్బంగా గొడ్డు మాంసం తిన్న ముస్లిం కుటుంబం ఆవు మాంసం తింటున్నారంటూ దాడి చేసిన దాద్రి ఘటనలో కుటుంబ యజమానిని చంపివేసిన సందర్బంగా చాలా రోజుల వరకు మోడీ నోరు తెరవకుండా వ్యూహం రచించి ఆయనపై భ్రమలు పెంచుకున్న నయా వుదారవాద ముస్లింలలో సైతం పునరాలోచన కలిగించటంలో మోడీ తెరవెనుక మేథావులు జయప్రదమయ్యారు. ఇప్పుడు కూడా దళిత విద్యార్ధి రోహిత్‌ విషయంలో కూడా దానినే అమలు జరిపి బిజెపి దళిత మోర్చా కూడా భరించలేని పరిస్ధితిని తెచ్చి మొత్తం దళితులను, ఇతర బలహీన వర్గాలకు ఎంతో జ్ఞానోదయం కలిగించారు. నూటికి నూరు శాతానికి కలగదు అది వేరే విషయం.

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న సంఘటన జనానికి సామూహిక చైతన్యం కలిగించి పెను మార్పులకు నాంది పలికిన వుదంతాలు చాలా వున్నాయి. రష్యాలో జనానికి జార్‌ ప్రభువుపై అసంతృప్తి వున్నప్పటికీ మరోవైపు ఎక్కడో నమ్మకం కూడా వుంది. అందుకే 1905లో జపాన్‌లో యుద్ధం సందర్భంగా లెనిన్‌ తదితరులు తిరుగుబాటుకు ప్రయత్నిస్తుండగా ఫాదర్‌ గోపన్‌ నాయకత్వంలో జార్‌కు తమ కోర్కెలను విన్నవించుకొనేందుకు వెళ్లిన జనంపై జార్‌ సైన్యం జరిపిన మారణ కాండ రష్యన్‌ విప్లవాన్ని వేగవంతం చేసింది. లెనిన్‌ తదితరులు జార్‌ను నమ్మవద్దని చేసిన హెచ్చరికలను జనం ఖాతరు చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జపాన్‌ ఓడిపోయి సలాంగొట్టిన స్ధితిలో హిరోషిమా,నాగసాకీలపై అమెరికన్లు అణుబాంబులు వేసి ప్రపంచాన్ని అణ్వాయుధ పోటీకి నెట్టి వనరులను ఎంత వృధా చేయటానికి కారకురాలైందో తెలిసిందే. అలాగే మోడీ ఆయన పరివారం ఇలాంటిది అని ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు, మధ్యలో మరికొందరు చెప్పినా ఆ , వారు రాజకీయం చేస్తున్నారు, అలాగే చెబుతారులే అని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు నిజమే అని కనీసం అంతరంగంలో అయినా అనుకుంటున్నారు. సమయం వచ్చినపుడు తామేం చేయగలరో నిర్ణయించుకోవటానికి అది చాలు.

నిజానికి కలుబుర్గి, దాద్రి, రోహిత్‌ వుదంతాలపై నరేంద్రమోడీ స్పందన సంఘపరివార్‌ వ్యవహారశైలికి అనుగుణంగానే వుంది. ముందు ఆత్మ సమర్ధన, ప్రత్యర్దులపై ఎదురు దాడికి దిగువ స్థాయి సైన్యాన్ని వినియోగిస్తారు.అది వికటించిన తరువాత నష్ట నివారణ చర్యలలో భాగంగా ఏదో ఒక మొక్కుబడి ప్రకటన చేయిస్తారు. కులుబర్గి హత్యను ఖండించకుండా కేంద్ర సాహిత్య అకాడమీపై వత్తిడి తెచ్చింది, అడ్డుకున్నదీ మోడీ సర్కారే. చివరికి అవార్డు వాపసీ వత్తిడితో ఒక ప్రకటన చేయించారు, తరువాత దాద్రి హత్యతో కేంద్రానికి సంబంధం ఏమిటని ఎదురుదాడి చేశారు. తిన్నది గోవు మాంసం కాదని తెలిసి కూడా జర్మన్‌ నాజీ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సమర్ధించుకోవటమేగాక గోవును చంపిన వారిని చంపివేయమని వేదాలు కూడా చెప్పాయంటూ స్వయంగా సంఘపరివార్‌ అధికార పత్రికలో రాశారు. తరువాత ఘనమైన నరేంద్రమోడీతో నోరు విప్పించారు. ఇప్పుడు రోహిత్‌ వుదంతంలో కూడా అదే జరిగింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎబివిపి పలుకుబడి ఏమిటో ప్రదర్శితం కావాలంటే దానిని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేసి మావారి జోలికి వస్తే మా తడాఖా చూపుతాం అని చెప్పేందుకే ఇద్దరు కేంద్రమంత్రులతో వత్తిడి తెప్పించి తమ నైజాన్ని ప్రదర్శించారు.అది వికటించటంతో దాన్ని తప్పుదారి పట్టించేందుకు, విశ్వవిద్యాలయ అధికారులపై కేంద్ర మంత్రులు తెచ్చిన వత్తిడి, జోక్యం విషయాన్ని మరుగుపరిచేందుకు కాషాయ పరివారం ఎన్ని పాట్లు పడిందో, పడుతోందో దేశమంతా చూసింది. అతను దళితుడు కాదు బిసి అంటూ ప్రారంభించి చెప్పని అబద్దం లేదు. పరివార్‌ సంస్ధ ఏబివిపి నాయకుడిని కొట్టారని, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కూడా కట్టుకధే అని పోలీసులే స్వయంగా కోర్టుకు తెలిపారు. మధ్యలో తాను జోక్యం చేసుకోకపోతే అసంపూర్ణంగా వుంటుందనుకున్నారేమో సుబ్రమణ్య స్వామి అందుకున్నారు. బహుశా నరేంద్రమోడీ స్క్రిప్ట్‌ రైటర్స్‌ దృష్టిలో ఈ పాత్ర లేదేమో ? సరిగ్గా మోడీతో లక్నోలో రోహిత్‌ మరణంపై విచార కన్నీరు కార్పించే సమయంలోనే సుబ్రమణ్యస్వామి తన ట్వీట్ల ద్వారా రోహిత్‌ మరణంపై కమ్యూనిస్టులు, వారికి విశ్వాసపాత్రంగా వుండే కుక్కలు మాత్రమే నిరసన అనే ఆందోళన డ్రామా ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌ విశ ్వరూపంలో ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ. ఇంకా చూడాల్సింది చాలా వుంది. హిట్లర్‌ పోయినా హిట్లరిజాన్ని సమర్ధించే, ఆచరించే వారసులు పుట్టుకు వస్తున్నట్లే ఇంత జరిగినా ఎవరైనా తామింకా పరివార్‌ సంస్ధలను, కార్యకలాపాలను సమర్ధిస్తామంటే చేసేదేముంది .ఇది స్వేచ్ఛా భారతావని !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిందీలో కుల నిర్మూలనతో సహా 11 అంబేద్కర్‌ రచనలు నిలిపివేసిన మోడీ సర్కార్‌

16 Saturday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Annihilation of Caste, Narendra Modi sarkar, RSS, RSS Double game

అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపగలరా ? అంబేద్కర్‌ భావాలను అడ్డుకోగలరా ?

ఎం కోటేశ్వరరావు

      నిన్నగాక మొన్న పార్లమెంట్‌లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళి అర్పించారు. తియ్యటి మాటలు చెప్పారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం హిందీలో ప్రచురించిన అంబేద్కర్‌ రచనల సంపుటాలలో ఆయన తన జీవిత కాలం దేనికోసమైతే పోరాడారో ఆ అంశానికి సంబంధించి రాసిన ‘కుల నిర్మూలన,’ హిందూయిజపు వైరుధ్యాలు’ అనే ముఖ్యమైన వాటితో సహా పదకొండు పుస్తకాలను మినహాయించి మిగతా వాటిని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ పుస్తకాలను అచ్చువేయించారు. వాటిలో మినహాయించిన పుస్తకాల గురించి ఇండియా టుడే గ్రూప్‌ ప్రచురణల మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేసిన దిలీప్‌ మండల్‌ రౌండ్‌ టేబుల్‌ ఇండియాలో తాజాగా రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో కులము- వార్తా మాధ్యమం మధ్య వున్న సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. కుల నిర్మూలన అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అంబేద్కర్‌ మినహా మరొకరు కాదు. అలాంటి ముఖ్యమైన వాటిని మినహాయించటం వుపస్థ మినహా కన్యాదాన వంటిదే. పూనా ఒప్పందం, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, గాంధీతో చర్చల వంటి అంశాలున్న పుస్తకాలు ప్రచురణలలో లేవని దిలీప్‌ వెల్లడించారు.’ఎవరో ‘ దీని గురించి చెప్పకుండా ఈ పని జరిగివుండదని ఆ ఎవరో మోడీ సర్కార్‌ తప్ప మరొకరు కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు లేకుండా అంబేద్కర్‌ రచనలను విక్రయిస్తున్నారని వాటిని ఎప్పుడు ప్రచురిస్తారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల పుస్తకాల ప్రచురణ మరింత సంక్లిష్టం అవుతుందంటూ వాటి ప్రచురణ హక్కులను కలిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రాన్ని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ తీసుకోలేదని వెల్లడించారు.

      అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని తెలిసి కూడా అలాంటి ప్రయత్నం చేసే ప్రబుద్ధులు వుంటారనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఓట్లకోసం అంబేద్కర్‌ పేరును పదే పదే ప్రస్తావించటానికి బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను అభినందించారని, ఆయన హిందూరాష్ట్రకు సైతం వ్యతిరేకం కాదని చిత్రించేందుకు పూనుకున్నారు. అయితే ఆయన భావాలు వారి హిందూత్వ ఎజండాకు, మను ధర్మ శాస్త్రానికి కొరుకుడు పడనివి. మను ధర్మశాస్త్రానికి ప్రతినిధి , మారు పేరు బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అన్నది కొందరి అభిప్రాయం. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆ తిరోగమన భావజాలానికి లోనైన వారు బ్రాహ్మణులు లేదా ఇతర అగ్రకులాలనబడే వారే కాదు, ఆ మనువాదానికి తరతరాలుగా బలై అంటరాని వారిగా, దూరంగా వుంచబడుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా దాన్నే భుజాన వేసుకొని మోస్తున్నారు. తమ వర్గాలకు తామే ద్రోహం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. అందువలన అంబేద్కర్‌ భజన చేస్తూనే ఆయన భావాల వ్యాప్తిని విస్తారమైన హిందీ ప్రాంతంలో అడ్డుకోవాలన్న దుర, దూరాలోచనలు తప్ప వేేరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్వాకంపై అంబేద్కర్‌ అభిమానులు, పురోగామి, ప్రజాతంత్రశక్తులు వత్తిడి తెస్తే తప్ప ఆ పుస్తకాలు వెలుగుకు నోచుకోవు. అలాగే మహారాష్ట్రలో వున్న ప్రభుత్వం కూడా బిజెపిదే కనుక ఆంగ్ల పుస్తకాల ప్రచురణకు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని లేదా తానే వాటిని ప్రచురించాలని వత్తిడి చేయటం మినహా మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అంబేద్కర్‌ను పొగుడుతూనే రిజర్వేషన్లకు వ్యతిరేకత-కాషాయ దళాల డబుల్‌ గేమ్‌

05 Thursday Nov 2015

Posted by raomk in Current Affairs, Social Inclusion

≈ Leave a comment

Tags

అంబేద్కర్, Reservations, RSS Double game

అతి పెద్ద విగ్రహాలను పోత పోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వేదాలు, వుపనిషత్తులు తదితర పురాతన సంస్కృత గ్రంధాల నుంచి వెలికి తీయకుండా కమ్యూనిస్టు చైనాకు అప్పగించటం సిగ్గు చేటు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ఇచ్చిన మేకిన్‌ ఇండియాపిలుపును స్వయంగా వుల్లంఘంచారు.

తాము తొంభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో వున్నామని, ప్రతిదానికీ తమను బాధ్యులను చేసి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ అమాయపు ఫోజు పెడుతూ ఎదురుదాడికి దిగింది.చరిత్రను వక్రీకరించటంలో అవాస్తవాలను ప్రచారంలో పెట్టటంలో జర్మన్‌ గోబెల్స్‌ 2జి(రెండవ తరం) అనుకుంటే వీరు 5జిగా ఎదిగి పోయారు. తమకు లేని చరిత్రను సృష్టించుకొనేందుకు ప్రయత్నించటం, చరిత్ర పక్కన పెట్టిన వారికి పెద్ద పీట వేయటం, నూతన తరాన్ని అవాస్తలతో నమ్మించచూసే యత్నమిది. వేదాల్లో అన్నీ వున్నాయి, విమానాల మొదలు అధునిక వైద్య శాస్త్రం సాధించిన విజయాల వరకూ అన్ని మన పురాతన శాస్త్రవేత్తలు కనుగొన్నవే అని, అవన్నీ సంస్కృతంలో నిక్షిప్తం చేయబడ్డాయని ఇటీవలి కాలంలో వేద విజ్ఞానం పేరుతో వూదరగొడుతున్నారు. ఆవును చంపిన వారిని అంతమొందించాలని వేదాలు చెప్పాయంటూ ఇప్పుడే తాము వెలికి తీసినట్లుగా తమ పత్రికల్లో రాసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అతి పెద్ద విగ్రహాలను పోత పోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వేదాలు, వుపనిషత్తులు తదితర పురాతన సంస్కృత గ్రంధాల నుంచి వెలికి తీయకుండా కమ్యూనిస్టు చైనాకు అప్పగించటం సిగ్గు చేటు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ఇచ్చిన మేకిన్‌ ఇండియాపిలుపును స్వయంగా వుల్లంఘంచారు. అంతే కాదు, డిజిటల్‌ ఇండియా పధకానికి మన వేదాలు, పురాణాలనుంచి టెక్నాలజీని వెలికి తీయకుండా ‘కిరస్తానీ’ దేశమైన అమెరికాలోని సంస్ధలను దేబిరిస్తుంటే ప్రపంచం నవ్వుతోంది. ఇలాంటి విషయాలలో చేతగాని కాషాయసేన అంబేద్కర్‌ గురించి కొత్త విషయాలు కనుగొన్నామనే పేరుతో ఆయన విస్వసనీయతను దెబ్బతీసేందుకు పూనుకుంది.

ప్రపంచంలోనే అతి పెద్దదిగా సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని తయారు చేయించటం అంటే జాతిపిత మహాత్మాగాంధీని, ఇతర జాతీయ నాయకులను కించపరచటం తప్ప మరొకటి కాదు. ఆయనకు ఎందుకు వీరు పెద్ద పీట వేస్తున్నారు? పటేల్‌ మితవాది, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరే సాహసం చేయలేదు తప్ప అది కోరుకున్న హిందుత్వ లక్షణాలు ఆయనలో వున్నాయి. రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పెద్దలలో ప్రముఖుడు. అలాంటి పెద్ద మనిషికి చరిత్రలో తగిన న్యాయం జరగలేదనే సాకుతో కాషాయ దళాలు తమ ఎజండాను ముందుకు తీసుకుపోతున్నాయి.బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సలాం కొట్టిన నేతల నాయకత్వంలో నడిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి లేని చరిత్రను, గొప్పదనాన్ని ఆపాదించేందుకు పూనకుంది. అలాంటి సంస్ధ చేసే ప్రచారం ఎదురుతన్నుతుంది తప్ప మరొకటి కాదు.మహాత్ముడికి పోటీగా మరో మహాత్ముడిని తయారు చేసేందుకు పూనుకోవటం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని బయలు దేరిన విశ్వామిత్రుడి పరిస్దితే పటేల్‌ విషయంలో కాషాయదళానికి ఎదురువుతుందని వేరే చెప్పనవసరం లేదు.

రాజకీయాలతో నిమిత్తం లేని వ్యక్తులను ఒక కమిటీగా నియమించి రిజర్వేషన్లను సమీక్షించాలని 1980 దశకంలో ఆమోదించిన ఒక తీర్మానంలో ఆ సంస్ధ కోరింది. దానికి ఇప్పటికీ అది కట్టుబడే వుంది. దానినే మోహన్‌ భగత్‌ తన మాటల్లో పునరుద్ఘాటించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ కాదు. అయితే అందుకు ఎంచుకున్న సమయానికి వున్న ప్రాధాన్యతను గమనించాలి.

 

సర్దార్‌ పటేల్‌కు అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టటంతో పాటు , ఆయన శత జయంతిని జాతీయ ఐక్యతా దినంగా బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా దాని మంత్రుల వ్యవహారాలు దాని మాటలు, చేతలకు వున్న తేడాను వెల్లడిస్తున్నాయి. మరోవైపు దళితుల ఓట్ల కోసం అంబేద్కర్‌కు కేవలం ముంబైలో పెద్ద స్మారక కేంద్రానికి మోడీ శంకుస్దాపన చేశారు.నిజానికి ఈ రోజు ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాల హృదయాలలో వున్న స్థానంతో పోల్చితే ఇలాంటి స్మారక కేంద్రాలు పెద్ద లెక్కలోనివి కావు. ఆయన 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ కోరుకున్న కుల నిర్మూలన లేదా వివక్ష నిర్మూలనకు, దళితుల ఆర్ధిక అభ్యున్నతికి తీసుకున్న చర్యలేమిటి అన్నది ప్రశ్న. ‘మన సమాజం నుంచి షెడ్యూలు కులాలను మొత్తంగా తుడిచివేయాలి. అది జరిగితే ఎవరినైతే అంటరానిగా పరిగణిస్తున్నారో వారు మన మధ్య కూర్చున్నపుడు వారి గురించి మరిచిపోతాము. ఇప్పుడు మనం మరోసారి దానిని ప్రారంభించాలి. ఇందువలన మనం తరగతుల గురించి మరిచిపోయి ఒక్కరిగా, ఐక్యంగా నిలబడాలి’ అని సర్దార్‌ పటేల్‌ రిజర్వేషన్ల సమస్య వచ్చినపుడు మరో రూపంలో వ్యతిరేతను తెలియ చేశారు. నిజానికి ఇలాంటి కబుర్లు శంకరాచర్య దగ్గర నుంచి అందరూ చెప్పినవే. రోజు రోజుకూ అంటరానితనం పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే అంబేద్కర్‌ తన చివరి రోజుల్లో విసిగి పోయి బౌద్దాన్ని ఆశ్రయించారు.ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఏర్పడిన 1925 నుంచి హిందూ ఐక్యత గురించి చెబుతూనే వుంది.

ఒకవైపు అంబేద్కర్‌ను పొగుడుతూనే మరోవైపు ఆయనకు మారుపేరుగా వున్న రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోందంటేనే దాని నయవంచన అర్ధం అవుతోంది. రిజర్వేషన్లను సమీక్షించాలని మోహన్‌భగత్‌ చెప్పిన అంశాలు లౌకికవాదుల పత్రికలో రాలేదు. పక్కా తమ అధికార పత్రిక పాంచజన్య వాటిని ప్రచురించింది. వారు భగత్‌ మాటలను వక్రీకరించే అవకాశం లేదు. అయితే దాని ఆధారంగా వార్తలు రాసిన వారు వక్రీకరించారని ఎదురుదాడికి దిగారు. రాజకీయాలతో నిమిత్తం లేని వ్యక్తులను ఒక కమిటీగా నియమించి రిజర్వేషన్లను సమీక్షించాలని 1980 దశకంలో ఆమోదించిన ఒక తీర్మానంలో ఆ సంస్ధ కోరింది. దానికి ఇప్పటికీ అది కట్టుబడే వుంది. దానినే మోహన్‌ భగత్‌ తన మాటల్లో పునరుద్ఘాటించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ కాదు. అయితే అందుకు ఎంచుకున్న సమయానికి వున్న ప్రాధాన్యతను గమనించాలి. దళితులు, ఇతర బలహీనవర్గాలందరూ ఇప్పటికే తమ బుట్టలో పడ్డారని,గుజరాత్‌లో హర్దిక్‌ పటేల్‌కు అగ్రవర్ణాలుగా వున్న వారి బీహార్‌లో కూడా ఆ తరగతుల ఓట్లను ఆకర్షించాలంటే రిజర్వేషన్ల వ్యతిరేక సందేశం పంపాలన్న ఒక ఎత్తుగడలో అది భాగం తప్ప వేరు కాదు. అయితే అది ఎదురుతన్నినట్లు అర్ధం కావటంతో ప్లేటు ఫిరాయించారు. కాషాయ దళాల చరిత్రను చూసినపుడు ఎక్కడ కళేబరాలు వుంటే అక్కడకు వాలే గద్దల మాదిరి ఎక్కడ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే అక్కడ వీరు ప్రత్యక్షం అవుతారు. మండల్‌ సిఫార్సుల వ్యతిరేక ఆందోళనలో ముందున్నారు. తరువాత జరిగిన ఎన్నికలలో మండలమో కమండలమో తేల్చుకోవాలనే నినాదంతో ఎన్నికల్లో పాల్గొన్న చరిత్ర దాచేస్తే దాగదు. మతం మారిన దళితులకు రిజర్వేషన్లను వర్తింప చేయరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచారకుల సభ 1961లోనే ఒక తీర్మానంలో డిమాండ్‌ చేసింది. అలా చేస్తే అది జాతీయ ఐక్యతకు ముప్పని పేర్కొన్నది. నయా బౌద్దులకు మాదిరి తమకూ రిజర్వేషన్లను వర్తింపచేయాలని క్రైస్తవులు కోరినపడు రాజ్యాంగ నిర్మాతలు హిందూ సమాజంలో కుల ప్రాతిపదికన చూపుతున్న వివక్షను రూపు మాపేందుకే రిజర్వేషన్లు పెట్టారు తప్ప మత ప్రాతిపదికన కాదని, ఒక వేళ అలా ఇస్తే అది దళితుల ప్రయోజనాలకే దెబ్బ అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: