• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: RSS Outfits anti china feets

వాజ్‌పేయిని అవమానిస్తున్న బిజెపి-సిక్కింను భారత్‌ ఆక్రమించిందా !

11 Saturday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

AB Vajpayee, Five fingers of Tibet, RSS Outfits anti china feets, Sikkim, Sikkim annexation facts, Tibet


ఎం కోటేశ్వరరావు
టిబెట్‌ దలైలామా : అమెరికా వదిలించుకుంది-భారత్‌ తగిలించుకుంది ! అనే శీర్షికతో నేను రాసిన విశ్లేషణ మీద సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ శక్తులు తూలనాడాయి. వారికి ఏకత, శీలము, సభ్యతలపై ఇచ్చిన ”శిక్షణ ” అలాంటిది మరి. వారు తిడుతున్నది నన్ను కాదు వారి గౌరవనీయ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయిని అని తెలియని అజ్ఞానంతో ఉన్నారని చెప్పాలి. టిబెట్‌ స్వయం పాలిత ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూ 2003లో ప్రధాని వాజ్‌పాయి-చైనా ప్రధాని వెన్‌ జియాబావో ఒప్పందం మీద సంతకాలు చేశారని తెలుసా ! అని గుర్తు చేసిన తరువాత ఎవరు చేసినా తప్పే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అనేక దేశాలలో ఉన్న పరిస్ధితులకు అనుగుణ్యంగా స్వయం పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. టిబెట్‌తో సహా ఐదు స్వయం పాలిత ప్రాంతాలు చైనాలో ఉండగా, మన దేశంలో త్రిపుర స్వయంపాలిత గిరిజ ప్రాంతం, గూర్ఖాలాండ్‌(డార్జిలింగ్‌) వంటివి పది ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం టిబెట్‌ను లాంఛనంగా చైనాకు చెందినదిగా గుర్తిస్తే, అదే ఒప్పందంలో సిక్కిం మన దేశంలో అంతర్భాగమని చైనా గుర్తించిన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, దాన్ని తురుపు ముక్కగా వాడుకోవాలని బిజెపి మేథావి శేషాద్రి చారి సలహా ఇవ్వటాన్ని, ఐదు వేళ్ల పేరుతో సిక్కింను స్వాధీనం చేసుకొనేందుకు చైనా పూనుకొన్నదని ప్రచారం చేయటాన్ని ఏమనాలి. సదరు పెద్ద మనిషి 2003లో వాజ్‌పాయి ప్రధానిగా చైనాతో ఒప్పందం చేసుకున్నపుడు ఆర్‌ఎసెస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా ఉన్నారు. ఆయనకు వాస్తవాలేమిటో తెలియవా ? ఎవరి పాటకు అనుగుణ్యంగా వారు ఈ నృత్యం చేస్తున్నట్లు ? వాజ్‌పారు అంత అమాయకంగా, సంఘపరివార్‌ అనుమతి లేకుండానే చైనాతో ఒప్పందం చేసుకున్నారని భావించాలా ? ఒక వేళ అనుమతి లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వాజ్‌పాయి ఒప్పందాన్ని ఆనాడే బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? తిరగదోడాలనుకుంటే దానికి కారణాలేమిటో చెప్పి ఆ పని చేయవచ్చు. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీకి ఇదొక లెక్కా !
వాజ్‌పేయి చైనా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత గడ్డమీద టిబెట్‌ నుంచి పారిపోయి వచ్చిన వారు సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టంగా ఉంది. అదే ఒప్పందంలో బౌద్ద దలైలామా (టిబెట్‌ అధినేతగా కాదు ) స్ధితి యథాతధంగా కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఆ కారణంగానే దలైలామా మన దేశంలో ఇప్పటికీ ఉండగలుగుతున్నారు.టిబెట్‌లో ఏమి జరిగిందో పైన పేర్కొన్న వ్యాసంలో వివరించిన కారణంగా ఇంతకు మించి చెప్పనవసరం లేదు. టిబెట్‌ చైనాలోని స్వయం పాలిత ప్రాంతం అంటే దాని అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోకూడదని అర్ధమంటూ కొందరు స్వయం సేవకులు విపరీత టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. అదే సూత్రం మన దేశంలోని స్వయం పాలిత ప్రాంతాలకూ వర్తిస్తుందా ? నిర్ధిష్ట అంశాలకు సంబంధించి ఆయా ప్రాంతాల పాలక మండళ్లకు ఆయా దేశాల రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇచ్చారు. వాటిలో ఆయా రాష్ట్రాల లేదా కేంద్ర ప్రభుత్వం రోజువారీ జోక్యం చేసుకోకూడదు, దాని అర్ధం అక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం, ఇతర అవాంఛనీయ పరిణామాలు జరిగినా జోక్యం చేసుకోకూడదని కాదు.
టిబెట్‌ చరిత్రను చూసినపుడు చైనా పాలకులకు సామంత రాజ్యంగా లేదా స్వయంపాలిత ప్రాంతంగా ఉండటం తప్ప ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదు. సిక్కిం విషయం అలా కాదు. అది బ్రిటీష్‌ వారు మన దేశాన్ని, ఆక్రమించే సమయానికే స్వతంత్ర రాజ్యంగా ఉంది. అంతకు ముందు నుంచే సిక్కిం పాలకులకు నేపాల్‌, భూటాన్‌ రాజులతో వైరం ఉంది. దాంతో నేపాల్‌ నుంచి రక్షణ పొందేందుకు గాను సిక్కిం రాజు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకొని దాని రక్షణ దేశంగా ఉండేందుకు అంగీకరించారు. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి వెళ్లిపోయిన సమయంలో సిక్కిం స్వతంత్ర రాజ్యం. అయితే మన నాయకులు ఇతర సంస్ధానాలను విలీనం చేసుకున్న సమయంలో సిక్కింను కూడా విలీనం కమ్మని అడిగారు. అక్కడి రాజు అంగీకరించలేదు. దాంతో 1950లో భారత రక్షిత రాజ్యం లేదా సామంత రాజ్యంగా ఉండేట్లు ఒప్పందం కుదిరింది.
1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశ సహకారంతో చైనాకు వ్యతిరేకంగా సిఐఏ కార్యకలాపాలు ప్రారంభించింది. 1964లో చైనా తొలి అణుపరీక్ష జరిపింది. దాంతో చైనా మీద నిఘావేయాలని నిర్ణయించిన అమెరికన్‌ సిఐఏ మన ప్రభుత్వాన్ని సంప్రదించింది. చైనా మీద ఉన్న కోపంతో అది మన ప్రయోజనాలకూ నష్టమే అనే ముందు చూపు లేకుండా అంగీకరించింది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో అధికారి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లి ఆధ్వర్యంలో సిఐఏ అధికారులతో కలసి హిమాలయాల్లోని నందదేవి శిఖరం మీద అణుశక్తితో పని చేసే ఒక గూఢచార పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఎలా అమర్చాలో 1965 జూన్‌ 23న అమెరికాలోని అలాస్కా మౌంట్‌ మెకెన్లీ శిఖరం మీద ట్రయల్‌ వేసి తరువాత నందదేవి మీద పెట్టేందుకు తీసుకుపోయారు. అయితే వాతావరణం అనుకూలించకపోవటంతో దాన్ని అక్కడే వదలి వెనక్కు వచ్చారు. తరువాత దాన్ని అమర్చేందుకు 1966లో వెళ్లినపుడు ఎక్కడుందో కనపడలేదు, 1967లో కూడా వెతికారు, చివరకు 1968లో దాని మీద ఆశవదులుకున్నారు. ఉష్ణోగ్రతను ఎక్కువగా వెలువరించే పరికరం మంచులో కూరుకుపోయినపుడు రాయి తగిలేంతవరకు లోపలికి పోతూనే ఉంటుందని, ఆ అణుపరికరం వంద సంవత్సరాలు ప్రభావం చూపుతుందని, అది రిషి గంగలో కలిస్తే నీరు కలుషితమై జనం మరణించే అవకాశం కూడా ఉందని అయితే, ప్రధాన గంగా జలాల్లో కలిస్తే నీరు కలుషితం అవుతుంది, కొందరు ఇబ్బంది పడవచ్చు తప్ప ప్రాణాలు తీస్తుందని తాను అనుకోవటం లేదని ఢిల్లీలో నివసిస్తున్న 88 ఏండ్ల నాటి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ చెప్పినట్లు 2018 ఆగస్టు పదిన ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇప్పటికీ దాన్ని వెతికితే ఉపయోగమే అని, ఇదంతా తాము దేశం కోసమే చేశామని సింగ్‌ చెప్పారు. ఉత్తరా ఖండ్‌ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వచ్చి నీటి కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరికరాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ రాసింది. ఇక్కడ దీని ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే అమెరికా సిఐఏ సిక్కింలో పాగా వేసి మన దేశం, చైనాను రెండింటినీ దెబ్బతీసేందుకు కూడా పధకం వేసింది.
హౌప్‌ కోక్‌ అనే కుర్రదాన్ని సిక్కిం పన్నెండవ రాజు(చోగ్యాల్‌) పాల్డెన్‌ తొండుప్‌ నామగ్యాల్‌కు ఎరగా వేసి, చివరికి 1963లో వివాహం చేసి సిక్కిం యువరాణిగా ప్రకటించారు.డార్జిలింగ్‌లోని ఒక హౌటల్‌లో హౌప్‌ కలిసే నాటికి చోగ్యాల్‌ వయస్సు 36, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది, భార్యతో విడాకులు తీసుకొని ఉన్నాడు. వివాహమైన తరువాత తన సిఐఏ బంధు గణాన్ని హౌప్‌ సిక్కింకు రప్పించింది. భారత రక్షిత రాజ్యాలుగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను స్వతంత్ర రాజ్యాలుగా మార్చేందుకు పూనుకున్నారు.1971లో భూటాన్‌ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం జరిగింది. పోరాడుతున్న వారికి మద్దతుగా మన దేశం మిలిటరీని దించింది. దాంతో పాకిస్ధాన్‌కు మద్దతుగా తమ సప్తమ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా బెదిరించింది. ఈ పరిణామం తరువాత మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పాక్‌ మిలిటరీతో తలపడి బంగ్లా విముక్తికి చేయాల్సింది చేసింది. ఈ పూర్వరంగంలో సిక్కింలో సిఐఏ కార్యకలాపాలు, సిక్కిం కూడా స్వతంత్ర రాజ్యంగా ఐక్యరాజ్యసమితిలో చేరితే అక్కడ అమెరికన్లు తిష్టవేసి మనకు ప్రమాదకరంగా మారతారనే ముందు చూపుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న చర్యలతో సిక్కింలో రాజుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. వారి వెనుక మన ”రా” గూఢచారులు ఉన్నారు. సిక్కింలో రాజు బౌద్దమతస్ధుడు. మెజారిటీ జనాభా నేపాలీ హిందువుల వారసులు. రాజు తమ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం ఉండటాన్ని ఆసరాగా తీసుకొని సిక్కిం విలీనానికి 1971లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ 1975వరకు అది సాధ్యం కాలేదు.
ప్రజల వత్తిడికి తట్టుకోలేక 1974 ఏప్రిల్‌ సిక్కిం రాజు పార్లమెంట్‌ ఎన్నికలు జరిపాడు. వాటిలో మన దేశంతో స్నేహాన్ని కోరుకొనే సిక్కిం జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తీర్పును ఆమోదించేందుకు రాజు తిరస్కరించి అణచివేతకు పూనుకున్నాడు.అయితే మేనెలలో పార్లమెంట్‌ ఒక చట్టాన్ని చేసి భారత్‌తో మరింత సన్నిహితంగా ఉండాలని తీర్మానించింది. తరువాత జూలై నెలలో సిక్కిం కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. దాని ప్రకారం సిక్కిం భారత్‌లో ఒక రాష్ట్రంగా చేరేందుకు వీలు కలిగింది. మన దేశ వత్తిడితో రాజు దాన్ని ఆమోదించకతప్పలేదు.సెప్టెంబరు నాలుగున మన పార్లమెంట్‌ సిక్కింను సహ రాష్ట్రంగా ఆమోదిస్తూ ఒక తీర్మానం చేసింది. అదే వారంలో సిక్కిం రాజు దీని మీద ప్రజాభిప్రాయాన్ని కోరాడు.1975 మార్చినెల ఐదున సిక్కిం పార్లమెంట్‌ మరోసారి భారత్‌తో అనుసంధానాన్ని కోరింది. తిరిగి రాజు ప్రజాభిప్రాయాన్ని కోరాడు. మన దేశంతో విలీనాన్ని కోరుకొనే నేతలను హత్య చేయించేందుకు రాజు ఆదేశించినట్లు ఉప్పందటంతో ఏప్రిల్‌ తొమ్మిదిన మన మిలిటరీ గ్యాంగ్‌టక్‌లో ప్రవేశించి అక్కడి సాయుధ దళాలను నిరాయుధులను గావించి, రాజును గృహనిర్బంధంలో ఉంచింది.ఏప్రిల్‌ 14న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.55 శాతం మంది భారత్‌లో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో నాటి సిక్కిం ముఖ్యమంత్రి భారత ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిని పంపుతూ విలీనానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 26న మన పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించి సిక్కింను 22 రాష్ట్రంగా ఆమోదించింది. మే 15న రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి సిక్కింలో రాజరికానికి స్వస్తి పలికారు. సిక్కిం ప్రజాభిప్రాయం సక్రమంగా జరగలేదని, భారత్‌ దాన్ని ఆక్రమించుకుందని కొందరు విమర్శించారు. తరువాత ప్రధాన మంత్రి అయిన మొరార్జీ దేశారు సిక్కిం విలీనం అనైతికం, అన్యాయం అని వ్యాఖ్యానించారు. అయితే వ్యవహారం మొత్తం సిక్కింలోనూ, మనదేశంలోనూ చట్టబద్దంగానే జరిగింది. నాడు ఇందిరగాంధీ ఆపని చేయనట్లయితే సిక్కిం ఒక స్వతంత్ర రాజ్యంగా అమెరికా చేతిలోకి పోయి ఉండేది. మన నెత్తిమీద కూర్చొని మనకూ అటు చైనాకూ ముప్పు తెచ్చి ఉండేదన్నది జగమెరిగిన సత్యం.
అయితే మన దేశంతో నాడున్న విబేధాల నేపధ్యంలో భారత్‌ చర్యను చైనా తప్పు పట్టింది. సిక్కిం విలీనాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.2003లో జరిగిన భారత్‌-చైనా ఒప్పందాల ప్రకారం సిక్కింను భారత ప్రాంతంగా చైనా గుర్తించింది. అదింకేమాత్రం రెండు దేశాల మధ్య వివాదాస్పదం కాదని చైనా ప్రధాని వెన్‌ జియాబావో 2005లో ప్రకటించాడు. ఆ ఒప్పందంలోనే టిబెట్‌ను చైనా అంతర్భాగంగా మన దేశం గుర్తించింది. ఇప్పుడు బిజెపి నేతలు కొందరు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, ఐదువేళ్ల ఆక్రమణ అంటూ ప్రచారం చేయటం, దలైలామా పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం వలన ప్రయోజనం ఉందా ? ఎవరి తరఫున ఎవరికోసం పని చేస్తున్నట్లు ? సద్దుమణిగిన వివాదాన్ని తిరిగి రేపటం, మిగిలి ఉన్న వివాదం మరింత సంక్లిష్టం కావటానికి దోహదం చేయదా ? కాశ్మీర్‌ సమస్యపై తనకు పాకిస్ధాన్‌ మిత్రదేశంగా ఉన్నపుడు ఒక వైఖరి, ఇప్పుడు మన దేశం తన కౌగిల్లోకి వచ్చింది కనుక మరొక వైఖరితో వ్యవహరిస్తున్నది అమెరికా. టిబెట్‌ విషయంలో కూడా తమకు చైనా దగ్గర అవుతుంది అనుకున్నపుడు దాన్ని వదలివేసింది. ఎప్పుడైతే చైనాయే తనకు ఏకు మేకైందని గ్రహించిందో అప్పటి నుంచి పరోక్షంగా టిబెట్‌, ఇతర అంశాల మీద అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అందువలన దాని పాటకు అనుగుణ్యంగా మనం నృత్యం చేయటమా ? చైనాతో సహా అనేక అంశాలపై స్వతంత్ర వైఖరిని అనుసరించటమా అన్నది తేల్చుకోవాలి. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అవుతున్నామో అదే సమయంలో పాకిస్ధాన్‌ చైనాకు దగ్గర అయింది. అందువలన కాశ్మీరు, ఇతర వ్యవహారాల గురించి చైనాలో మార్పులు ఉంటున్నాయి. చైనా వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకున్నా, మన వ్యవహారాల్లో చైనా అదే తప్పు చేసినా వివాదాలు పరిష్కారం గావు. అలా రావణాకాష్టంలా మండుతూనే ఉంటే తాము లబ్ది పొందవచ్చన్న అమెరికా గుంటకాడ నక్కలా కూర్చుంది. దానికి అవకాశం ఇద్దామా ? విజ్ఞులు ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా పెట్టుబడులపై కాషాయ దళాల ఆత్మవంచన, పరవంచన ?

04 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, china boycott, chinese investments, RSS Outfits anti china, RSS Outfits anti china feets, saffron brigade hypocrisy

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా వ్యతిరేక ‘దేశభక్తులూ ‘ దీని కేమంటారు ?

23 Wednesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, China, china boycott, RSS Outfits anti china, RSS Outfits anti china feets

సత్య

    డబ్లు నల్లదీ తెల్లదీ వుంటుందా ? వుండదు. పన్ను కట్టకుండా తప్పించుకొనేందుకు లెక్కలలో చూపనిదానిని నల్లధనం అంటున్నాం. అలాగే కమ్యూనిస్టు చిచ్చుబుడ్లు, కానివారి చిచ్చుబుడ్లు వుంటాయా ? వుండవు. మొన్న దీపావళి సందర్భంగా చైనా బాణ సంచా కాల్చటం దేశద్రోహ చర్యగానూ, కాల్చకపోవటం దేశభక్తిగానూ అన్ని రకాల మీడియాలో రాతలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలన్నీ జై భజరంగ భళీ అంటూ వీధుల కెక్కి చైనా వస్తువులను దగ్దం చేయటం, వాటిని నిషేధించాలంటూ వీరంగం వేయటాన్ని చూశాము. అలా చేయటమే దేశభక్తిగా ప్రచారం చేశారు. అనేక మంది నిజమే అనుకొని వాట్సప్‌ గ్రూపులలో అలాంటి సందేశాలు పెట్టారు. తెల్లవారే సరికి చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసి దేశభక్తిని చాటుకోవాలని వుపదేశాలు చేశారు. ఇదంతా మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తీవ్రవాదులకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తున్నదని, దానికి చైనా మద్దతు ఇస్తున్న కారణంగా చైనాను వ్యతిరేకించాలనే వాదనలను ముందుకు తెచ్చారు. ఇంకా కొందరైతే చైనాను నాశనం చేసేందుకు గాను మన పురాణాలు, సంస్కృత గ్రంధాలు, వేదాలలో గట్టి శాపాలు ఏమైనా వున్నాయోమో వెతికితీసేందుకు కూడా ప్రయత్నించారంటే అతిశయోక్తికాదు. ‘దేశభక్తి ‘ అంతగా పెరిగిపోయింది మరి !

   ఎంత వారలైనా కాంత దాసులే అని చెప్పారు. దాని సంగతి ఏమోగాని ఈ రోజుల్లో డాలర్ల ముందు మోకరిల్లేందుకు ఎంతకైనా తెగించేవారు వున్నారు. అమెరికా అంతటి కమ్యూనిస్టు వ్యతిరేకే తాను కట్టుకున్న మడిని విప్పి గట్టున పెట్టి చైనా వెంటపడింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున వుంటుందా ? చైనా వ్యతిరేకతను విపరీతంగా రెచ్చగొట్టిన సంఘపరివార్‌ నాయకత్వం కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. అమెరికా ఒక వైపున కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే మరోవైపున చైనా, వియత్నాం, క్యూబా వంటి కమ్యూనిస్టు దేశాలతో సంబంధాలను పెంపొందించుకుంది. ఇప్పుడు మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే గేమ్‌ ఆడుతోంది.

    మన పురాణాలలో ‘సరసింహుడు’ వున్నట్లే చైనా పురాణాలలో రెక్కలున్న భయంకర సర్పం వుంది.దాన్ని ‘డ్రాగన్‌ ‘ అంటున్నారు. అది మనలను కబళించి వేస్తున్నదని చెప్పిన వారికి ఇప్పుడు దేవతగా మారిపోయిందట.http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-china-dragon-now-angel-for-indian-startups/55522378 నిక్కర్‌ నుంచి పాంట్స్‌కు మారినంత సులభంగా, ఇది కూడా వేదాల్లో వుంది, దీన్ని కూడా వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అన్నట్లుగా కాషాయ తాలిబాన్లు సమర్ధిస్తున్నారు. ఎందుకంటే వ్యతిరేకించినట్లు , నరేంద్రమోడీ దిష్టి బొమ్మలు తగుల బెట్టినట్లుగానీ ఎక్కడా వార్తలేమీ కనిపించటం లేదు. కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా జాడ లేదు.ఎంత అవకాశవాదం !

    నేడు ఎవరి దగ్గర డాలరు వుంటే వారి హవా నడుస్తోంది. చివరకు అమెరికా వాడు కూడా తనకు డాలర్లు కావాలంటే చైనా దగ్గర అప్పుతీసుకొనే దుస్ధితిలో పడిపోయాడు. చైనా కంపెనీలు ఇప్పుడు డాలర్లను పట్టుకొని ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులకు అవకాశం వుంటే అక్కడకు వెళుతున్నాయి. వాటిలో ప్రయివేటువి, ప్రభుత్వ రంగానికి చెందినవీ వున్నాయి. ఎందుకంటే 2050 వరకు ఒకే దేశం రెండు వ్యవస్ధలు అన్న విధానానికి అనుగుణంగా చైనా ప్రధాన భూభాగంలో ప్రయివేటు పెట్టుబడులు పెట్టటానికి, హాంకాంగ్‌, మకావూ ప్రాంతాలు విలీన సమయానికి అక్కడ వున్న ప్రయివేటు పెట్టుబడులు కొనసాగటానికి అనుమతించేందుకు విధానపరంగానే నిర్ణయించింది. పెట్టుబడి ప్రధాన లక్షణం లాభం. అది ఎక్కడ వుంటే అక్కడకు ప్రవహిస్తుంది. అది కమ్యూనిస్టు దేశమా, వ్యతిరేక దేశమా, బిజెపి ఏలుబడిలో వుందా, కాంగ్రెస్‌ పాలనా అన్నదానితో నిమిత్తం లేదు. ఎకనమిక్‌ టైమ్స్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం దివ్యాంక్‌ తురాఖియా ఏర్పాటు చేసిన మీడియా.నెట్‌ అనే మన దేశ కంపెనీని 90 కోట్ల డాలర్లకు బీజింగ్‌ మిటెనో కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ కంపెనీ కొనుగోలు చేసింది. అలీబాబా కంపెనీ పేటిమ్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టింది. దిదీ చుక్సింగ్‌ అనే కంపెనీ ఓలా టాక్సీ కంపెనీలో భాగస్వామిగా చేరింది. ఇలా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వాములుగా వుండేందుకు ముందుకు వస్తున్నాయి. దీని వలన లాభమా నష్టమా అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ భక్తులు సమాధానం చెప్పాలి. ముందే చెప్పుకున్నట్లు చైనా అయినా మరొక దేశ కంపెనీ పెట్టుబడులు పెట్టినా లాభాలు ఎవరికి చెందుతాయన్నదే గీటు రాయిగా వుండాలి. చైనాలో విదేశీ పెట్టుబడులు, లేదా ప్రయివేటు రంగంపై అక్కడి ప్రభుత్వానికి పూర్తి పట్టువుంది. వాటి వలన వస్తున్న లాభాలలో గణనీయ వాటా అక్కడి జనానికి చేరుతున్నది. మన దేశంలో చైనా ప్రభుత్వ రంగ సంస్ధలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వాటి మీద వచ్చే లాభాలు చైనా ప్రజలకు చేరతాయి.మన దేశంలో అటువంటి విధానాలు, పరిస్ధితి వుందా ? పెట్టుబడిదారీ విధానాలు అనుసరిస్తున్నంత కాలం సంస్కరణలతో వచ్చే లాభాలు పెట్టుబడిదారులకు తప్ప సామాన్యులకు కాదని గత పాతికేండ్ల మన దేశం అనుభవం రుజువు చేసింది. చైనాలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది.

     చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. మనకు చైనా వ్యతిరేకమైతే అక్కడి కంపెనీలు మన దేశంలో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి ? చంద్రబాబు నాయుడు వంటి వారు చైనా వెళ్లి బుల్లెట్‌ రైలు ఎక్కి మన దేశంలో కూడా అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టమని ఎందుకు కోరుతున్నారు ? మన దేశానికి చైనా వ్యతిరేకమైతే ప్రధాని నరేంద్రమోడీ ఆ విషయాన్ని ఎందుకు బహిరంగంగా దేశ పౌరులకు తెలియచెప్పటం లేదు? చైనా నుంచి దిగుమతులు మాత్రమే నష్టదాయకమని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోందా ? అన్ని దేశాల దిగుమతులు నష్టం అని చెబుతోందా ? ఏటేటా చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి ? దిగుమతి చేసుకొనే వారందరూ దేశ ద్రోహులేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేక చిందులు !-సరిహద్దుల్లో భారత్‌, చైనా మిలిటరీ విన్యాసాలు !

23 Sunday Oct 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

anti china, military exercise in Ladakh, RSS Outfits anti china, RSS Outfits anti china feets, Sino-Indian joint military exercise in Ladakh

సత్య

    అర  నుంచి ఇటీవలనే పొడుగు లాగూలకు మారిన ఖాకీ వాలాలు వీధులు, ఇంటర్నెట్‌ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక చిందులు వేస్తున్నారు. వాటి బదులు మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ మేకిన్‌ ఇండియా ‘ పిలుపు మేరకు ఒక చిన్న వస్తువునైనా తయారు చేసి కసితో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తే వారి ‘దేశ భక్తి ‘ మరింత ఇనుమడించి వుండేది. ఏం చేయాలనేది ఎవరిష్టం వారిది కనుక వీరంగం వేసే వారిని వదిలేద్దాం. గత వారంలో మన సైనికులు సరిహద్దులలో చైనా సైన్యంతో కలిసి మన భూభాగంపై సంయ్తు విన్యాసాలు చేశారు. అదీ యురీ సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు దాడి జరిపి మన సైనికుల ప్రాణాలు బలిగొనటం, ఆ విషయంలో మనకు గాక పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని పెద్ద ఎత్తున ‘ ప్రచారం’ జరిపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగంలో చైనా మిలిటరీతో కలసి విన్యాసాలు జరిపినట్లు మన సైన్యమే అధికారికంగా ప్రకటించింది. తేడా ఏమిటంటే సర్జికల్‌ దాడులకు మాదిరి సైన్యంగానీ లేదా అంతకు మించి యుద్ధం చేస్తున్న మన మీడియా గానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు గనుక సైన్యానికి ఎలాంటి వుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. కానీ మీడియా విషయానికి వస్తే దాని రేటింగ్‌ పెరగదని మార్కెటింగ్‌ విభాగం చెబితే ఎంత పెద్ద వార్తనైనా పక్కన పడేస్తుంది సంపాదక విభాగం, ఎందుకంటే మీడియాను నడిపేది సంపాదకులు కాదు, బిజినెస్‌ మేనేజర్‌, డబ్బు సంపాదించే విభాగాలే.

  అసలు కంటే కొసరు హడావుడి ఎక్కువ చేస్తుందన్న విధంగా మన ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ సైని కమాండర్లు మాత్రం బాణా సంచాలకు మినహా మిగిలిన పెద్ద వస్తువుల దిగుమతికి మినహాయింపులు ప్రకటిస్తుంటే దిగువ సైన్యం మాత్రం వీరంగం వేయటం ఇంకా కొనసాగిస్తూనే వుంది. నిజానికి బాణ సంచా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధం వుంది. దాన్ని సక్రమంగా అమలు జరపకపోవటమే దేశ ద్రోహం. చైనా మిలిటరీతో కలసి మనం జమ్మూలో విన్యాసాలు జరపటం దేశ భక్తా, ద్రోహమా లేక చైనా అనుకూలమా ? పిల్లలను స్టెరాయిడ్లతో వుద్రేక పరిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి మరి ?

    అణు సరఫరా గ్రూపులో మన సభ్యత్వానికి చైనా మోకాలు అడ్డిందని, పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నది అనే విషయాలపై అనేక మంది తమ రచనలలో ఖండన మండనలు జరుపుతున్న సమయంలో వాటిని పట్టించుకోకుండా మిలిటరీ విన్యాసాలు కొనసాగించటం విశేషమే. సర్జికల్‌ దాడులకు రాజకీయ నాయకత్వం అనుమతి ఇచ్చిందని, దానికి తాము ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పెరగటమే కారణమని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇప్పటికే ప్రకటించారు కనుక ఈ విన్యాసాల గురించి ఏం చెబుతారు ? అనుమతించినట్లా లేదా ?

    సాధారణంగా రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు అనగానే మూడో దేశాన్ని భయపెట్టటానికో, బెదిరించటానికో అన్నది సాధారణంగా అందరూ అనుకుంటారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదుల మిలిటరీ ప్రమేయం వున్నపుడు అందులో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ చైనాతో మన వారు జరిపింది మరొక దేశాన్ని బెదిరించటానికో మరొకందుకో కాదు. ప్రకృతి ప్రళయాలు సంభవించినపుడు సరిహద్దులలోని జనాన్ని ఎలా ఆదుకోవాలో నేర్పేందుకు, నేర్చుకునే లక్ష్యంతో చేసినవి ఇవి. సరిహద్దులలో భూ కంపం వచ్చినపుడు ఒక గ్రామంలోని వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై విన్యాసాలు రోజంతా సాగాయి. వైద్య సహాయంతో సహా జనాన్ని రక్షించేచర్యలు తీసుకోవటంలో పెద్ద విజయం సాధించామని, వుభయ సైనికుల మధ్య విశ్వాసం,సహకారం మరింతగా పెరిగాయని మన మిలిటరీ ప్రకటించింది. సరిహద్దులలో శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కూడా వీటిని తలపెట్టినట్లు పేర్కొన్నది. లడక్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఫిబ్రవరి ఆరున జరిపిన విన్యాసాల కొనసాగింపుగా ఇది కొనసాగింది. ‘చేతిలో చేయి ‘ అన్న కార్యక్రమాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగానే నవంబరు 15-27 మధ్య మన మిలిటరీ దక్షిణాది ప్రధాన కార్యాలయం వున్న పూనేలో మన సైన్యంతో కలిసి చైనా సైన్యం వుగ్రవాద వ్యతిరేక చర్యలపై విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది చైనాలోని ఏనాన్‌ రాష్ట్రంలోని చెంగ్‌డూ మిలిటరీ ఏరియాలో మన దేశం నుంచి వెళ్లిన నాగా రెజిమెంట్‌ సైనికులు చైనీయులతో కలసి ఇలాంటి విన్యాసాలే జరిపి వచ్చారు.

    ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో పాటు భారత్‌ను కూడా తనవైపు లాక్కునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవి కానసాగటాన్ని గమనించాలి. ప్రస్తుతం చైనా ఆధీనంలో వున్న కొంత లడఖ్‌ ప్రాంతం మనదే అని మన దేశం, మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ మాదని చైనా వాదిస్తున్న విషయం తెలిసినదే. 1962లో వుభయ దేశాల మిలిటరీ యుద్ధానికి తలపడిన ప్రాంతంలోనే ఇప్పుడు చేయి చేయి కలిపి రెండు మిలిటరీలు విన్యాసాలు చేశాయి. సరిహద్దు వ్యవహారాలపై తగు పద్దతుల్లో వ్యవహరించేందుకు వుభయ సరిహద్దు సేనల మధ్య జరిగే సాధారణ విన్యాసాలు తప్ప మూడో దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ కూడా అక్టోబరు 19న జరిపిన విన్యాసాల గురించి ప్రకటించింది. కాశ్మీర్‌ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే తమ వైఖరిలో కూడా ఎలాంటి మార్పు లేదని రాతపూర్వక వివరణలో చైనా స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలు కనుక మంచో చెడో మన రెండు దేశాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరపటం ద్వారా వుభయుల మధ్య అనుమానాలు తొలగిపోవటానికి దారి తీస్తుంది. కానీ గతేడాది అమెరికా, జపాన్‌ సైన్యంతో కలసి మలబార్‌ విన్యాసాలు జరపటం, ఈ ఏడాది మన దేశంలోని వుత్తరాఖండ్‌లో అమెరికా మిలిటరీతో కలసి మన సైన్యం విన్యాసాలు జరపనుండటం గురించి కొంత మందిలో అనుమానాలు లేకపోలేదు. ఎవరి అనుమానాలు, ఎవరి అభిప్రాయాలు వారికి వున్నా ఇటీవలి కాలంలో మిలిటరీ విన్యాసాలు అనేవి ఒక బల ప్రదర్శన, దౌత్య ఎత్తుగడలలో భాగంగా జరుగుతున్నాయి. అన్నీ శాంతియుత ప్రయోజనాలకే అని చెప్పలేము, అదే విధంగా యుద్ధ చర్యలలో భాగమని అనలేము. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే మనం ఇతరులతో కలసి విన్యాసాలు జరుపుతున్నట్లే ఇతరులు కూడా జరుపుతారు. వ్యతిరేకించాల్సి వస్తే అన్నింటి పట్ల ఒకే వైఖరిని తీసుకోవాలి. మనం చేసేదే సరైనది, ఇతరులు చేసేది మనకు వ్యతిరేకం అనుకుంటేనే తేడాలు వస్తాయి. ఇదే సమయంలో మన భద్రతా చర్యలు మనం తీసుకోకతప్పదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: