• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Rupee Fall

నరేంద్రమోడీ ప్రభావం : రూపాయి ఉల్లాస లాభం 328, వైఫల్య నష్టం 2,420 పైసలు !

31 Saturday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్‌ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్‌ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్‌, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్‌ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.


డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్‌ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్‌ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్‌ డాలర్‌ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్‌ పెసో,చైనా యువాన్‌, దక్షిణ కొరియా వాన్‌, మలేసియా రింగిట్‌, థాయిలాండ్‌ బట్‌ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్‌ జర్నల్‌ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్‌ ఎన్‌ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్‌ 8.6, ఆస్ట్రేలియా డాలర్‌ 6.5,దక్షిణ కొరియా వాన్‌ 5.5 శాతం చొప్పున క్షీణించింది.


2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్‌ పుతిన్‌, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్‌ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్‌ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్‌ షేర్వాణీ అందర్‌ పరేషానీగా ఉంది.


మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.


నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్‌ ఖాతా అంటారు) 36.4 బిలియన్‌ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.


డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.


ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.


కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్‌ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్‌ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కనిపించని సురక్షిత హస్తం : పిడుగులు, ఉరుములతో డాలర్‌ – భయంతో వణుకుతున్న రూపాయి !

08 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India Exports, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, rupee value


ఎం కోటేశ్వరరావు


” ప్రబల డాలర్‌ ఉరుములతో శాంతి లేని భారత రూపాయి ” అనే శీర్షికతో అక్టోబరు ఏడవ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. శనివారం నాడు రూపాయివిలువ 82.82గా ఉన్నట్లు ఎక్సేంజ్‌ రేట్స్‌ అనే వెబ్‌సైట్‌ చూపింది. ఇలా రికార్డుల మీద రికార్డులు నమోదవుతుండటంతో గతంలో సిఎంగా ఉన్నపుడు రూపాయివిలువ పతనం గురించి నిర్దాక్షిణ్యంగా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను తూర్పారపట్టినది గుర్తుకు వచ్చి ఇప్పుడు నరేంద్రమోడీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండాలి లేదా దానికి విరుద్దంగా ప్రశాంతంగా ఉండి ఉంటారు. కానీ దేశం, జనం అలా ఉండలేరే !


సెప్టెంబరు 30తో ముగిసిన వారంలో దేశ విదేశీమారక నిల్వలు 532.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితంతో పోల్చితే 110బి.డాలర్లు తక్కువ. 2008 సంక్షోభ తరుణంలో 20శాతం నిల్వలు తగ్గాయి. ఇప్పుడు కొందరు దాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర మాంద్య ముప్పు పొంచి ఉండటంతో డబ్బున్నవారందరూ ఇతర కరెన్సీల్లో ఉన్న ఆస్తులన్ని అమ్మి డాలర్లలో దాచుకోవటం మంచిదని కొందరు, బంగారంలో మంచిదని మరికొందరు వాటి వైపు పరుగుతీస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించేదే ! అన్నీ ప్రతికూల వార్తలే !!


కేంద్ర ప్రభుత్వం జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 వైపు పరుగు పెడుతోంది. అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. చైనా యువాన్‌తో కూడా మన కరెన్సీ గత ఐదు సంవత్సరాల్లో రు. 9.8 నుంచి 11.64కు పతనమైంది. మరి ఇదెలా జరిగింది?


అమెరికా ఫెడరల్‌ రిజర్వు మరొక శాతం వడ్డీ రేటు పెంచవచ్చని ముందే సూచించింది. అదే జరిగితే దేశం నుంచి డాలర్లు మరింతగా వెనక్కు పోతాయి. రూపాయి పతనం కొనసాగుతుంది. ఇప్పటికే అంచనాలకు మించిన వేగంతో దిగజారింది. ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మరింతగా తెగనమ్మవచ్చు. ఎగుమతులు తగ్గటం దిగుమతులు పెరగటం, వాణిజ్యలోటు పెరుగుదలకు దారితీస్తోంది. రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో పాల్గ్గొన్న ఆర్ధికవేత్తలు, విశ్లేషకులెవరూ సమీప భవిష్యత్‌లో రూపాయి విలువ పెరిగే అవకాశం లేదని, 82కు దిగజారవచ్చని చెప్పగా శనివారం నాడు 83కు చేరువలో ఉంది. డిసెంబరు నాటికి 82-84 మధ్య కదలాడవచ్చని కొందరు చెప్పారు. ఒక వేళ కోలు కుంటే ఆరు నెలల్లో 81.30కి ఏడాదిలో 80.50కి పెరగవచ్చన్నారు. వర్దమాన దేశాల కరెన్సీ విలువ పెరగాలంటే పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచాలని ఎక్కువ మంది చెప్పారు. అదే జరిగితే పారిశ్రామిక, వాణిజ్య, నిర్మాణ రంగాలు పడకేస్తాయి. ఇప్పటి వరకు విదేశీ వత్తిళ్లకు విదేశీమారక నిల్వలు గురైతే ఇక వడ్డీ రేట్లు కూడా తోడు కానున్నాయి. అక్టోబరులో మన కరెన్సీ విలువ రు.80.17-82.65 మధ్య ఉంటుందని గతనెలలో స్పెక్యులేటర్లు చెప్పగా,అది మొదటి పది రోజుల్లోనే తప్పింది. ఆకస్మికంగా 80.80కి దిగజారవచ్చని చెప్పారు, అది కూడా జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం అక్టోబరు మూడు నుంచి ఏడువరకు రుణ మార్కెట్‌ నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడుల మొత్తం రు.2,948 కోట్లు కాగా, స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఎఫ్‌పిఐ మొత్తాలు రు.2,440 కోట్లు. సెప్టెంబరు నెలలో వెళ్లిన మొత్తం రు.7,624 కోట్లు తప్ప వచ్చినవేమీ లేవు. వర్తమాన సంవత్సరంలో మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లిన మొత్తం రు.1,72,891 కోట్లు.


మన ఇరుగు పొరుగు దేశాల గురించి తమకు అవసరమైనపుడు పోల్చుకొనే కాషాయ దళాల గురించి తెలిసిందే. ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిన వారంలో ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరెన్సీగా పాకిస్తాన్‌ రూపీ ఉన్నట్లు ఇండియా అబ్రాడ్‌ న్యూస్‌ సర్వీస్‌(ఐఎఎన్‌ఎస్‌) శనివారం నాడు ఒక వార్తనిచ్చింది. ఐదు పని దినాల్లో డాలరుకు రు. 219.92కు చేరి 3.9శాతం బలపడింది. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనా దీనికి కారణంగా పేర్కొన్నారు. పదకొండు రోజులుగా అది బలపడుతూనే ఉంది. జూలై నెలలో రికార్డు కనిష్టంగా 240 నమోదైంది. పాకిస్తాన్‌ దివాలా అంచున ఉన్నట్లు అప్పుడు చెప్పారు.పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న కారణంగా కరెన్సీ కోలుకుందని విశ్లేషకులు చెప్పారు. అక్టోబరు చివరి నాటికి 200కు పెరగవచ్చని ఆర్ధిక మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు.దిగుమతులు తగ్గుతుండటం, రానున్న రోజుల్లో 2.3 నుంచి 2.5 బిలియన్‌ డాలర్లవరకు ఏడిబి రుణం ఇవ్వనుందనే వార్తలు పాక్‌ కరెన్సీ విలువ పెరుగుదలకు దోహదం చేస్తోంది. సెప్టెంబరు 20న మన ఒక రూపాయి 2.99 పాకిస్తాన్‌ రూపీకి సమానంగా ఉండగా అక్టోబరు 8వ తేదీకి 2.67కు బలపడింది.


మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో రూపాయి ప్రభుత్వ చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్రమోడీ ఇంతవరకు తన పాలనలో పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా బిజెపి ఎంపీ, మాజీ మంత్రి జయంత్‌ సిన్హా( యశ్వంత సిన్హా కుమారుడు) గతంలో మన కరెన్సీ ఒక్కటే పతనమైందని, ఇప్పుడు మన కంటే ఇతర ప్రధాన కరెన్సీలన్నీ పడిపోతున్నట్లు చెబుతూ గతానికి ఇప్పటికీ పోలికే లేదని సమర్ధించుకున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే వాదనలు చేశారు. కొందరు విశ్లేషకులు కూడా అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదనే వాదనలు ముందుకు తెచ్చారు. కాసేపు అది నిజమే అని అంగీకరిద్దాం. అదో తుత్తి అన్నట్లుగా ఉండటం తప్ప మనకు ఒరిగేదేమిటి ? గతంలో ఇతర కరెన్సీలతో కూడా పతనమైనందున మనకు జరిగిన భారీ ఆర్ధిక నష్టం ఎంతో, ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో విలువ పెరిగినందువలన వచ్చిన లాభం ఏమిటో బిజెపి పెద్దలు వివరిస్తే వారి వాదనల డొల్లతనం వెల్లడవుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నందున మనకు వస్తువులను అమ్మేవారు డాలర్లను తప్ప మరొక కరెన్సీ తీసుకోరు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ? దీనికి కూడా కాంగ్రెస్‌, నెహ్రూ పాలనే కారణమంటారా ?


మా నరేంద్రమోడీ విశ్వగురు పీఠం ఎక్కారు , అందునా పుతిన్‌ -జెలెనెస్కీ మధ్య రాజీకోసం కేంద్రీకరించారు . రూపాయి పతనం గురించి చూసుకోమని నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు గనుక దీన్ని పట్టించుకోలేదు గానీ, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తరువాత రూపాయి విలువ పెంచటం చిటికెలో పని అని మోడీ మద్దతుదారులు అంటే అనవచ్చు. కాసేపు వారిని సంతుష్టీకరించేందుకు నిజమే అనుకుందాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ స్థానిక వస్తువులనే కొనాలని నినాదమిచ్చిన మోడీ గారు మిగతా దేశాల కరెన్సీలు ఏ గంగలో కలిస్తే మన కెందుకు ముందు లోకల్‌ రూపాయిని రక్షించాలి కదా అని ఎవరైనా అంటే ఉడుక్కోకూడదు మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆందోళన కలిగిస్తున్న ఆర్ధిక రంగం – జాడలేని మోడినోమిక్స్‌, పారని మంత్ర దండం !

07 Friday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Economic worries, India GDP, Manmohan Singh, Manmohanomics, modinomics, Narendra Modi Failures, RSS, Rupee Fall, UNCTAD, World Bank


ఎం కోటేశ్వరరావు


మన దేశ ఆర్ధిక పురోగతి గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న జోశ్యాలు గందర గోళం, ఆందోళన కలిగిస్తున్నాయి. మన్మోహానోమిక్స్‌ నుంచి మోడినోమిక్స్‌కు దేశం మారిందని గతంలో అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. మోడినోమిక్స్‌ అంటే నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానం. అనేక మంది పండితులు 2014 నుంచి అమలు జరుగుతున్నది మోడినోమిక్స్‌ అని తేల్చారు. పత్రికలు చదివే పాఠకులు, టీవీలు చూసే వీక్షకులు సంవత్సరం అంటే ఏదీ అని గందరగోళపడుతున్న అంశం మరొకటి. సంస్థలన్నీ ఒకే విధంగా చెప్పటం లేదు. కొన్ని కాలండర్‌(జనవరి నుంచి డిసెంబరు వరకు) మరికొన్ని ఆర్ధిక సంవత్సరం( ఒక ఏడాదిఏప్రిల్‌ నుంచి తదుపరి ఏడాది మార్చి వరకు) అని పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చుగానీ ”అసలు విషయం ”లో పెద్ద తేడా ఉండదు.


వర్తమానానికి వస్తే ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌(అంక్టాడ్‌) తాజాగా ప్రకటించినదాని ప్రకారం మన దేశ వృద్ధి రేటు కాలండర్‌ సంవత్సరం 2022లో 5.7శాతం, 2023లో4.7 ఉంటుందని ప్రకటించింది. ఆ తరువాత ప్రపంచబాంకు ఆర్ధిక సంవత్సరం 2023(2022-23)లో వృద్ధి రేటు 6.5శాతంఉంటుందని ప్రకటించింది. ఏ సంస్థ చెప్పినా వృద్ధి రేటు ఎంత అంటే సవరించిన ప్రతిసారీ తగ్గించి చెప్పటం తప్ప స్థిరత్వం కనిపించటం లేదు, ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం.అక్టోబరు ఏడవ తేదీన రూపాయి విలువ రు.82.63కు దిగజారి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.


2022 ఆగస్టు ఒకటిన లోక్‌సభకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021-22లో వాస్తవ జిడిపి వృద్ది రేటు 8.7శాతమని, కరోనాకు ముందున్న అర్ధిక స్థితికి పూర్తిగా దేశం కోలుకున్నదని, 2019-20 వాస్తవ జిడిపి వృద్ది కంటే 1.5శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఇక్కడే ఒక తిరకాసుంది.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 29న ప్రకటించిన వివరాల ప్రకారం 2019-20 జిడిపి గురించి తొలుత వేసిన అంచనాలన్నింటినీ సవరించి చివరకు వృద్ధి రేటు నాలుగు శాతమని ఖరారు చేశారు. అది కూడా కొత్త సంవత్సరంలో పది నెలల తరువాత అని గమనించాలి. దీని ప్రకారం ఒకటిన్నర శాతం ఎక్కువ అంటే 5.5 కానీ పార్లమెంటుకు 8.7 శాతమని ఎలా చెప్పారు. అంటే ఇది అంచనా మాత్రమే. దీన్ని కచ్చితంగా సవరిస్తారు. 2020-21లో 6.6శాతం తిరోగమనంలో( మైనస్‌) ఉన్నట్లు ప్రభుత్వం ఖరారు చేసింది.


దేశాన్ని సాధారణ పరిస్థితికి తిరిగి తీసుకు వచ్చామని చెబుతున్నారు. కనుకనే జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి దేశాన్ని పైకి లాగామన్నారు. అంతకంటే కావాల్సిందేముంది. మనం దిగుమతి చేసుకొనే లేదా ఎగుమతి చేసే వస్తువులకు సరఫరా వ్యవస్థల అంతరాయాల్లేవు. గాల్వన్‌ ఉదంతాల పేరుతో కాషాయ దళాలు తాట తీస్తాం,తోలు వలుస్తా అన్న పవర్‌స్టార్‌ మాదిరి ఎంతగా రెచ్చగొట్టినా చైనా మనకు వస్తువులను విక్రయిస్తూనే ఉంది. చైనాతో గత రికార్డులను బద్దలు కొట్టి నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులు చేసుకున్నట్లు తిరుగులేని ఆధారాలుగా అంకెలున్నాయి. రష్యా నుంచి రికార్డులు సృష్టిస్తూ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు జనానికి కొనుగోలు శక్తిని పెంచిన కారణంగానే పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నట్లు పాలకపార్టీ పెద్దలు వర్ణిస్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం ! ఉత్పాదకతతో ముడి పేరుతో ప్రభుత్వం వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? లేక అదంతా అమిత్‌ షా మార్కు జుమ్లానా ! కార్పొరేట్‌లకు పన్ను తగ్గింపు, ఇతర నజరానాల వలన ఖజానాకు కచ్చితంగా రాబడి తగ్గుతుంది. దాన్ని పూడ్చుకొనేందుకు కొన్ని వస్తువుల మీద జిఎస్‌టి పెంచుతున్నారు. ఇక అప్పుల సంగతి సరేసరి. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల ఏలుబడి చివరిలో రు.55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2022 నాటికి 136లక్షల కోట్లకు పెంచారు. 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఇదంతా అభివృద్ది కోసమే అంటున్నారు, ఇంత చేస్తున్నా వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నట్లు ? అడిగినా సమాధానం చెప్పేదెవరు ?వివిధ సూచికల్లో ఎక్కడో వెనుక లేదా దిగజారటం తప్ప మెరుగుపడింది లేదు.


నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు కొందరు పండితులు మోడినోమిక్స్‌ అంటూ కొత్త అర్ధాలు చెప్పేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2004 నుంచి 2020 వరకు దేశ వార్షిక జిడిపి వృద్ధిరేటు 6.8 శాతం ఉంది. మంత్రదండం ఉందని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో 2014 నుంచి 2020వరకు వార్షిక సగటు కూడా 6.8శాతమే ఉంది. మన్మోహన్‌ ఏలుబడి సగటు కూడా అంతే. మోడీ పాలన పది సంవత్సరాల సగటు తగ్గటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక గృహస్తులు చేసిన ఖర్చును చూస్తే 2004-14 మధ్య జిడిపిలో 10.56శాతం ఉండగా, 2014-20లో 10.61 శాతం ఉంది. ప్రభుత్వ ఖర్చును చూస్తే ఈ కాలంలో 56.54-59.23 శాతాలుగా ఉంది. ఇక చేసిన అప్పులను చూస్తే మాక్రో ట్రెండ్స్‌.నెట్‌ సమాచారం ప్రకారం దేశం వెలిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల బరిలో దిగిన వాజ్‌పాయి ఏలుబడిలో 1998లో జిడిపిలో 50.32 శాతంగా ఉన్న అప్పు 2004 నాటికి 62.59శాతానికి పెరిగింది. అది తరువాత మన్మోహన్‌ సింగ్‌ కాలంలో 2013 నాటికి 50.31 శాతానికి తగ్గింది. స్టాటిస్టా సంస్థ సమాచారం మేరకు 2017లో 69.68 శాతం ఉన్న అప్పు 2020లో 90.06 శాతానికి పెరిగింది.2021 నుంచి 2027 వరకు 86.76 నుంచి 84.18 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. గతంలో రిజర్వు బాంకు పేర్కొన్న ప్రకారం మన పరిస్థితుల్లో దేశ అప్పు జిడిపిలో 61శాతం లోపుగా ఉండాలని పేర్కొన్నది. అప్పులను తగ్గించిన మన్మోహన్‌ కాలంలో, విపరీతంగా పెంచిన మోడీ ఏలుబడిలోనూ సగటు వృద్ధి రేటు ఒకే విధంగా ఉంది.అభివృద్ది కోసమే అప్పులైతే తెచ్చిన అప్పులకు అనుగుణ్యంగా ఖర్చు పెరగలేదు.తేడా ఏమిటంటే మన్మోహనామిక్స్‌ పదేండ్ల కాలంలో మూడు సార్లు అంతకు ముందు సంవత్సరాల కంటే వృద్ధి రేటు తగ్గితే మోడినోమిక్స్‌లో ఏడు సంవత్సరాల్లోనే నాలుగేండ్లు తిరోగమనంలో పడింది. ఎందుకిలా ?


ఇదేమీ సమాధానం లేని అపూర్వ చింతామణి లేదా నువ్వు ఎవరు ప్రశ్న కాదు. జిడిపి ఖర్చులో ఫిక్స్‌డ్‌ గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌ అంటే సులభంగా చెప్పుకోవాలంటే పెట్టుబడి 2004-14 సంవత్సరాల్లో 33.38 శాతం ఉండగా అది అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధిని తెచ్చినట్లు చెప్పుకుంటున్న 2014-2020 మధ్య (కరోనాకు ముందే సుమా) 28.88 శాతానికి పడిపోయింది. పిండి కొద్దీ రొట్టె, పెట్టుబడి కొద్దీ వృద్ధి, కబుర్లతో కడుపునిండదు. వివిధ సంస్థలు మన జిడిపి గురించి వేసిన అంచనాలు- సవరించటంలో అంత తేడా ఎందుకు ఉంటోంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా నరేంద్రమోడీ దగ్గర మంత్ర దండం ఉందని అవి కూడా నమ్మినట్లా ? అంచనాలే గనుక పిసినారి తనం ఎందుకు మోడీని సంతోష పెడదామని అనుకున్నట్లా ? వివిధ సంస్థలు గతంలో వేసిన, తాజాగా సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థ పేరు ×××× గతంలో చెప్పినది×× తాజా అంచనా
ప్రపంచ బాంకు ×× 8.7 ××× 6.5
ఎస్‌ అండ్‌ పి ×××× 00. ××× 7.3
ఫిచ్‌ రేటింగ్స్‌ ×××× 7.8 ××× 7.0
ఇండియా రేటింగ్స్‌×× 7.0 ××× 6.9
ఓయిసిడి ×××× 00 ××× 7.0
అంక్టాడ్‌ ×××× 00 ××× 5.7
ఏడిబి ×××× 7.5 ××× 7.0
ఐఎంఎఫ్‌ ×××× 8.2 ××× 7.4
నొమురా ×××× 5.4 ××× 4.7
ఫిక్కి ×××× 7.4 ××× 7.0
ఎస్‌బిఐ ×××× 7.5 ××× 6.8
క్రిసిల్‌ ×××× 7.8 ××× 7.3
ఆర్‌బిఐ ×××× 7.2 ××× 7.0
ప్రపంచ ఆర్ధిక పురోగతి మందగించటం, దేశంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వలన మన ఎగుమతులకు, ఇతరంగా దెబ్బ అని అందరూ చెబుతుంటే ఆ పరిస్థితి మన దేశానికి సానుకూలమని, ముడి చమురు,ఇతర వస్తువుల ధరలు, పారిశ్రామిక లోహాలు, ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2-7.4 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. అంకెలతో జనంలో గందరగోళం, ఆందోళనకరంగా పరిణామాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పాపాయి విల విల – డాలరు నిల్వలు వెల వెల ! నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి!!

25 Sunday Sep 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు


చైనాను వెనక్కు నెట్టి అమెరికాతో పోటీ పడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోగల సమర్ధుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. దాని వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా వారి మనోభావాలను గౌరవిద్దాం, అదే సమయంలో ప్రపంచం, దేశంలో జరుగుతున్నదాన్ని గురించి కూడా చెప్పుకుందాం. వారు వింటారా లేదా అన్నది వారికే వదలివేద్దాం. శుక్రవారం నాడు (2022 సెప్టెంబరు 23) ప్రధాని నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. లండన్‌లోని ఎక్సేంజ్‌ రేట్స్‌ . ఓఆర్‌జి.యుకె సమాచారం ప్రకారం శుక్రవారం నాడు మన దేశంలో రాత్రి ఎనిమిది గంటలు, లండన్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలపుడు డాలరుకు రూపాయి విలువ రు.81.4101గా ఉంది.( అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం రేట్లు మారుతూ ఉంటాయి .) సహజంగా ఏ దేశంలో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం-ముగింపు సమయాల్లో ఎంత ఉంటుందో ఆ రోజుకు ముగింపు విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మన దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రు.81.11 ఉంది. అంతకు ముందు 81.23కు పతనమైంది. శనివారం నాడు లండన్‌లో తెల్లవారు ఝామున 3.20కి (మన దగ్గర 7.50) రు.81.2485 దగ్గర ఉంది. రానున్న మూడు నాలుగు నెలల్లో అది రు.82- 83 మధ్య ఉంటుందని, తరువాత 85-86కు దిగజారవచ్చని కొందరి అంచనా.

తరలిపోతున్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు నిలిచినా, తిరిగి వచ్చినా రు.81-82 దగ్గర స్థిరపడవచ్చని, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మిగిలిన రోజుల్లో 79-83 మధ్య ఉండవచ్చని, పరిపరి విధాల ఎవరి జోశ్యం వారిది. ఎవరు చెప్పినా 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పిన రు.38-48కి పెరగటం గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. ఆర్‌బిఐ ఇప్పటికే రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్‌బిఐ 80బి.డాలర్లను విక్రయి ంచిందని, రూపాయి పతనమైతే దాన్ని వదలివేయటం తప్ప ఆర్‌బిఐకి మరొక మార్గం లేదని కొందరు చెబుతున్నారు. గత ఏడు నెలల కాలంలో గురువారం నాడు ఒక్కరోజే 83పైసలు పతనమైంది. ఎవరేం చెప్పినప్పటికీ ప్రపంచీకరణతో బంధం వేసుకున్నందున మన చేతుల్లో అనేక అంశాలు ఉండవు. ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పినా అయితే లేదా కాకుంటే అన్న జాగ్రత్తలతో చెప్పేవే తప్ప మరొకటి కాదు. కొద్ది వారాలుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినందున కొంత మేర ఒకవైపు ఊరట కలుగుతున్నది.మరోవైపు కరెన్సీ విలువ పతనంతో హరించుకుపోతున్నది.


ఆర్‌బిఐ శుక్రవారం నాడు విడుదల చేసిన సమాచారం ప్రకారం గత ఏడు వారాలుగా వరుసగా మన విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోతూ సెప్టెంబరు 16 నాటికి 545.652 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.2020 అక్టోబరు రెండవ తేదీ తరువాత ఇంత తక్కువగా ఎన్నడూ లేవు. తగ్గటానికి కరెన్సీ మారకపు విలువలో మార్పులు కొంత మేరకు కారణం కాగా రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కొందరి అభిప్రాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నెలలో రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ 35 బి.డాలర్లను, ఈ మొత్తంలో జూలై నెలలో 19బి.డాలర్లను విక్రయించింది. సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఒక్క రోజే రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు వార్తలు. 2021 సెప్టెంబరు మూడవ తేదీన 642.45బి.డాలర్లు మన దగ్గర ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లటం, మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరగటంతో పాటు మన కరెన్సీ విలువ తగ్గినందువలన కూడా డాలరు నిల్వ కరిగిపోతున్నది.


ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రూపాయికి ఏం జరిగితే అది జరుగుతుందని(పాత సినిమాల్లో డాక్టర్లు ఇక ఆ దేవుడిదే భారం అన్నట్లు) వదలి పెట్టటం తప్ప అక్టోబరు-మార్చి నెలల్లో ఆర్‌బిఐ అరకొర తప్ప తీసుకొనే పెద్ద రక్షణ చర్య లేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న జోక్యం ఫలితాలనివ్వలేదని పతన తీరు సూచిస్తున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెబుతున్న మొత్తంలో అన్నీ డాలర్లే ఉండవు. ఆర్‌బిఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్న 545.652 బిలియన్‌ డాలర్లలో నగదు 484.901 బి.డాలర్లు కాగా బంగారం రూపంలో 38.186, ఎస్‌డిఆర్లు 17.686, ఐఎంఎఫ్‌ వద్ద 4.880బి.డాలర్లు ఉన్నాయి . ప్రస్తుతం దిగుమతులు-ఎగుమతుల అంతరం పెరిగి జిడిపిలో 4శాతానికి కరెంటు ఖాతాలోటు పెరిగినా మొత్తం నిల్వలు 510 బి.డాలర్లకు తగ్గవచ్చని, 2013 మే నెలలో ఉన్న 300 బి.డాలర్లతో పోలిస్తే పరిస్థితి మెరుగేనని కొందరి అభిప్రాయం. పది సంవత్సరాల క్రిందట ఆ నిల్వలు 4.1నెలల దిగుమతులకు సరిపోగా ఇప్పుడున్న నిల్వలు 8.9 నెలలకు వస్తాయని అంచనా. రూపాయి విలువ పతనమైతే మన దేశం నుంచి డాలర్లు వెలుపలికి పోతే విదేశాల్లో ఉన్న మన జాతీయులు డాలర్లను మన దేశానికి పంపుతారు. వాటికి గతం కంటే ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను క్రమంగా తగ్గించటమే తప్ప స్థిరంగా ఉంటుందని ఏ సంస్థా చెప్పటం లేదు. ప్రస్తుతం ఏడు శాతంగా చెబుతున్నారు, వచ్చే ఏడాది 6.4శాతానికి తగ్గుతుందని అంచనా. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను ఇంకా పెంచనుందనే వార్తల పూర్వరంగంలో వృద్ధి రేటు ఇంకా తగ్గేందుకే అవకాశం ఉంది. డాలరు రేటు పెరిగింది తప్ప మన కరెన్సీ విలువ తగ్గలేదని కొందరు వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద అమెరికా కూటమి దేశాలు అనేక ఆంక్షలు విధించినా దాని కరెన్సీ రూబుల్‌ విలువ పెరిగింది. మన జిడిపి ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంటే దాని జిడిపి పదకొండవదిగా ఉంది. అలాంటపుడు మన కరెన్సీ విలువ ఎందుకు పెరగలేదు ? జపాన్‌ ఎన్‌ విలువ పెరిగింది, దక్షిణ కొరియా కరెన్సీ వన్‌ పెరిగింది. అందువలన పతనమైన వాటితో చూపి మనదీ అలాగే ఉందని చెబుతామా, మెరుగ్గా ఉన్నవాటితో పోల్చుకుంటామా ? మనకు పతనం కావటమా, పెరగటమా ఏది లాభం. దిగుమతులు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మందికి పెరగటం లాభం. ఎగుమతులు తక్కువగా ఉన్నందున కొందరికి తగ్గటం లాభం.


మన కరెన్సీతో దిగుమతులు చేసుకొనేందుకు కొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.దీంతో డాలర్లకు గిరాకీ తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప మనకు కలిగే లబ్ది ఏముంటుంది. ఏ దేశమైనా డాలరుతో పోల్చి దాని బదులు దాని విలువకు సమానమైన రూపాయలు అడుగుతుంది తప్ప రోజు రోజుకు దిగజారుతున్న మన కరెన్సీని స్థిర విలువకు ఎవరూ అంగీకరించరు. మనం ఇతర దేశాల కరెన్సీ తీసుకున్నప్పటికీ ప్రాతిపదిక అదే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు గనుక అక్కడ పెట్టుబడులు పెట్టినా లేదా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినా మదుపుదార్లకు లాభం కనుక ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా చేరుతున్నాయి. వడ్డీ రేటు తగ్గితే అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే దేశాలకు తిరిగి దారిపడతాయి . మన ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచటం వెనుక మతలబు ఇదే. అయి తే అది మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు, రుణాలు తీసుకొని ఇండ్లు, వాహనాలు కొనుగోలు చేసిన వారి మీద అదనపు భారం మోపుతుంది. డాలర్లు కొని విదేశాల్లో చదువుకొనే వారికి, టూర్లకు వెళ్లే వారికి భారం పెరుగుతుంది. మంచి పనితీరును కనపరచిన ఎనిమిది కరెన్సీలలో మనది ఒకటని విశ్లేషణలు వెల్లడించాయి.దాన్ని పట్టుకొని మన సామర్ధ్యానికి భంగం కలగలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. నిజం కావచ్చు, దాని వలన మనకు ఒరిగేదేమిటి ? కేసుపోతేనేం గానీ మన ప్లీడరు భలేవాదించాడు అన్నట్లుగా ఉంది.


ప్రపంచంలో తమ వద్ద డిపాజిట్‌ చేసిన మదుపుదార్లకు బాంకులు వడ్డీ చెల్లించటం తెలిసిందే. కానీ ఐదు దేశాల్లోని బాంకులు తమ వద్ద డబ్బుదాచుకున్న వారి నుంచి ఎదురు వడ్డీ వసూలు చేస్తున్నాయి, వినటానికి చిత్రంగా ఉన్న అది నిజం. పెట్టుబడిదారులు ఏది చేసినా తమ లాభాలకే అన్నది గ్రహిస్తే ఇది కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. బహిరంగ మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల కంటే మన దేశంలో బాంకుల వడ్డీ రేటు తక్కువ. పెట్టుబడిదార్లకు చవకగా రుణాలు కావాలంటే బాంకులు కావాలి. వాటి దగ్గర డిపాజిట్లు ఉండాలి కనుక మన బాంకులు డిమాండ్‌ను బట్టి వడ్డీ రేట్లను ఖరారు చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు అక్కడి వారికి లబ్ది చేకూర్చేందుకే. వడ్డీ తక్కువ ఉంటే వారి వస్తువుల తయారీ ఖర్చు తక్కువగా ఉండి ప్రపంచ మార్కెట్లో పోటీ పడవచ్చు.ఐదు దేశాల బాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారే అవి నిర్ణయించిన మేరకు ఎదురు వడ్డీ చెల్లించాలి. డబ్బు వచ్చేకొద్దీ అవి కూడా రేట్లు మారుస్తూ ఉంటాయి. ఎదురు వడ్డీ స్విడ్జర్లాండ్‌లో 0.75, డెన్మార్క్‌ 0.60, జపాన్‌ 0.1, స్వీడన్‌ 0.25, స్పెయిన్‌0.0 శాతం ఉంది. అనేక ఐరోపా ధనిక దేశాల్లో వడ్డీ రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఇలా ఎందుకు అంటే పొదుపు వద్దు- ఖర్చే ముద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా కార్పొరేట్ల వస్తువులు, సేవలకు గిరాకీ ఉండేది, లాభాలు వచ్చేది. జపాన్‌లో ఎలాంటి వడ్డీ లేకుండా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, బాంకులు రుణాలు ఇస్తాయి. డాలరు దెబ్బకు జపాన్‌ ఎన్‌ కూడా ప్రభావితమైంది. దాంతో 1998 తరువాత తొలిసారిగా గతవారంలో జపాన్‌ రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగి తమ కరెన్సీ విలువ పడిపోకుండా, పెరిగేందుకు జోక్యం చేసుకుంది.2011లో ఎన్‌ విలువ పెరగటంతో తగ్గేందుకు లేదా స్థిరంగా ఉండేందుకు చూసింది. ఎగుడు దిగుడులు సహజం, ఇబ్బందులు, పతనాలు తాత్కాలికం అంటూ కొందరి నోట ఉపశమనాలు వినిపిస్తున్నాయి , మంచిదే అంతకంటే కావాల్సింది ఏముంది ? అందుకోసం సమర్ధుడైన నరేంద్రమోడీ చేస్తున్నదేమిటి అన్నదే ప్రశ్న.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిత్రాలు చేయరో శివుడో శివుడా : ఎస్కలేటర్‌ మీద డాలర్‌ – వెంటిలేటర్‌ మీద రూపాయి

17 Sunday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, RSS, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


మన కరెన్సీ రూపాయి ఏ రోజు ఎంత పతనం అవుతుందో తెలియని స్థితిలో ఉన్నాము. వచ్చే వారం (జూలై 18-24)లో రు.80.50కి పతనం కావచ్చని కొందరి అంచనా. అంతేనా లేక బలపడుతుందా, ఇంకా దిగజారుతుందా అంటే నోరు విప్పి ప్రధాని నరేంద్రమోడీ గారే చెప్పాలి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పుకుందాం. పురాతన చరిత్ర కలిగిన కరెన్సీలలో మన రూపాయి కూడా ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దిలోనే నాణాన్ని విడుదల చేసినట్లు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 340-290 కాలంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో ప్రధాన మంత్రిగా ఉన్న చాణుక్యుడు రాసిన అర్ధశాస్త్రంలో స్వర్ణ రూప, సీస రూప, తామ్ర రూప నాణాలతో పాటు రూపయ రూప అంటూ వెండినాణెం గురించి కూడా ప్రస్తావన ఉంది. తరువాత కాలంలో ఉన్న కరెన్సీ లేదా ద్రవ్య వ్యవస్థల గురించి అంత స్పష్టంగా లేదు. షేర్‌ షా సూరి పాలన 1540-45లో 178 గ్రెయిన్స్‌( తేలికైన గింజలు) లేదా 11.53 గ్రాముల బరువుతో వెండి నాణాలను ప్రమాణికంగా తయారు చేయించి దానికి రుపియా అని కూడా పేరు పెట్టారు. ఇప్పుడు ఒక డాలరుకు ఇన్ని రూపాయలు అన్నట్లుగా బాబరు కాలంలో 50 ఇత్తడి నాణాలకు రెండు వెండి నాణాలు సమంగా ఉండేవి.బ్రిటీష్‌ వారు అధికారానికి వచ్చే వరకు ఇవి కొనసాగాయి. బ్రిటీషు వారి ఏలుబడిలో మన రూపాయి పతనం తొలిసారిగా 1873లో జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా, అమెరికాలో తీవ్ర ఆర్ధిక మాంద్యం సంభవించింది.ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. అమెరికా, అనేక ఐరోపా వలస దేశాలలో వెండి నిల్వలను కనుగొనటం కూడా దీని కారణాలలో ఒకటి. విస్తారంగా దొరుకుతున్న కారణంగా దీని విలువ తగ్గి బంగారానికి గిరాకీ ఏర్పడింది.దాంతో అప్పటి నుంచి బంగారం ప్రామాణికంగా విదేశీ లావాదేవీలు నడిచాయి.


ఇక వర్తమానానికి వస్తే 1947ఆగస్టు 15న మన రూపాయి ఒక డాలరుకు సమంగా ఉన్నట్లు సమాచారం, ఏడాది సగటు రు.3.50 గా, 4.16గా ఉందని రెండు రకాల సమాచారం. కొనుగోలు, అమ్మకం ధరల్లో తేడా కూడా ఈ గందరగోళానికి కారణం కావచ్చు. ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. అప్పటి నుంచి మధ్యలో తగ్గినా, పెరిగినా మొత్తం మీద ఈ నెలలో రు.79.99కి పడిపోయింది. ఇక రూపాయి పతనం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం,హాస్య భరితమైన రచనలు, ట్విటరైట్ల జోకుల తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూడండి. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నా ఈ పరిస్థితికి కారణం మనం(జనం) కాదు గనుక విషాదంలో వినోదం మాదిరిగా చూద్దాం.
” ఎస్కలేటర్‌ మీద డాలర్‌ , వెంటిలేటర్‌ మీద రూపాయి, ఐసియులో దేశం.. దేవుడు రక్షించుగాక ”
” రూపాయి పడుతున్నదంటున్నారు ఎక్కడో చెప్పండి నేను వెతికి తెచ్చుకుంటా ”
” హమ్మయ్య ఎట్టకేలకు జరిగింది….. దశాబ్దాల తరువాత పెట్రోలు కంటే ఇప్పుడు బీరు చౌక. ఇంక మనం కొత్త నినాదం ఇవ్వవచ్చు జస్ట్‌ డ్రింక్‌ డోంట్‌ డ్రైవ్‌ ( తాగండి తప్ప బండి నడపొద్దు) ”
” రూపాయి-డాలరు బంధం పటిష్టత గురించి డాలరుతో చర్చలకు భారత్‌ సిద్దం ”
” రూపాయి పని తీరు ఎంత దారుణంగా ఉందో చైనా వారు గనుక తెలుసుకుంటే వారు అరుణాచల్‌ ప్రదేశ్‌ జోలికి రారని అనుకుంటున్నా ”
” భగవంతుడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే డాలర్‌, యూరో మాదిరి లోదుస్తుల బ్రాండ్‌గా రూపాయి లేదు. ఒక వేళ ఉంటే అది జారిపోతున్నపుడు యావత్‌ దేశ రూపం కనిపించేది ”
” డిస్నీలాండ్‌ కొత్త రైడ్‌ను ప్రారంభిస్తోంది. దానిలో ఎంతో ఎత్తు నుంచి కొద్ది సెకండ్లలోనే మీరు కిందికి జారిపోవచ్చు. దానికి వారు భారత రూపాయి అనే పేరు పెట్టబోతున్నారు ”
” రూపాయి సీనియర్‌ సిటిజన్‌గా మారినందుకు అభినందనలు ”
” రూపాయి పైకి వెళ్లేది ఒకే ఒక్కసారి అది టాస్‌ వేసినపుడు ”
” రూపాయిని రక్షించాలంటే ఒకే మార్గం ఉంది, డాలరుకు రాఖీ కట్టి రక్షించమని అడగాలి ”
” మీరు గనుక జీవితంలో ఓడినట్లు విచారపడుతుంటే ఒక్కసారి రూపాయిని చూడండి ”
” న్యూటన్‌ గనుక ఇప్పుడు బతికి ఉంటే గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి రూపాయి పతన ప్రాతిపదిక మీద కొత్తగా చెప్పి ఉండేవాడు. ఆపిల్‌ పండ్లు మెల్లగా పడి ఉండేవి ”


వాషింగ్టన్‌ పోస్ట్‌ డాట్‌కామ్‌ నివేదిక ప్రకారం ” రూపాయి చిహ్నం ప్రారంభం ఒక అశుభ దినాన జరిగిందని దేశంలోని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. చిహ్నంలోని అడ్డగీత రూపాయి నాలుక చీరేస్తా అన్నట్లుగా కనిపిస్తోంది ” అన్నారు.ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్‌ దారువాలా రూపాయి చిహ్న రూపకల్పనలో లోపం ఉందనటాన్ని అంగీకరించలేదు.” నవంబరు నుంచి గురుడి స్థితిని బట్టి అదృష్టం, అంతులేని సంపదల యోగం బలంగా ఉంది. డాలరు మీద రూపాయి బలపడుతుంది, షేర్‌ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది, ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను ఎంతగానో అభిమానించే ప్రధాన మంత్రి శని ప్రభావంలో ఉన్నారు. శని అంటే వృద్ది నెమ్మదిగా ఉంటుంది, ఆలశ్యం అవుతుంది, కుంభకోణాలు బయటికి వస్తున్నాయి. రోజుకు రోజుకు డాలరుతో రూపాయి బలహీనపడుతుంది. నవంబరు నుంచి ప్రధాని తారాబలం కూడా మెరుగుపడుతుంది.” రూపాయి చిహ్నాన్ని రూపొందించిన ధర్మలింగం ఉదయకుమార్‌ విమర్శల నుంచి పట్టించుకోలేదు.” నేను రూపాయి చిహ్నాన్ని రూపొందించినపుడు పరిస్థితులు వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆర్ధిక వ్యవహారాల గురించి వ్యాఖ్యానించేందుకు తగిన వాడిని కాదు.చిహ్న రూపకల్పన గురించి అడిగితే చెబుతా ” అన్నారు.


భారత క్రికెట్‌ కంట్రోలు బోర్డు ఆధిపతిగా ఉన్న ఎన్‌ శ్రీనివాసన్‌ తన జ్యోతిష్కుడి సమక్షంలో ప్రపంచ నేతలను సవాలు చేశారు.” వచ్చే వారం నాటికి రూపాయి స్థిరపడని పక్షంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం కాకుండా చూసేందుకు ఒక ఏడాది పాటు భారత టీము అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బిసిసిఐ నిరోధిస్తుంది.ఐతే మేము ఐపిఎల్‌లో ఆడతాము, హిందీ వ్యాఖ్యానంతో వాటిని కేవలం దూరదర్శన్‌ మాత్రమే ప్రసారం చేయాలి. విదేశాలు తమ దేశాల్లో ఐపిఎల్‌ను ప్రసారం చేయాలంటే ఇప్పుడు మేము చెల్లిస్తున్నదానికి పది రెట్లు మాకు చెల్లించాలి. స్వదేశంలో కూడా క్రికెట్‌ ఆడవద్దని మేము శ్రీలంకను కూడా కోరతాము. ఐపిఎల్‌తో సహా ఏ రకమైన క్రికెట్‌ ఆడవద్దని మన మంచి దోస్తులైన దక్షిణాఫ్రికాను కూడా కోరతాము. మన ఆర్ధిక వ్యవస్థ స్థిరపడేవరకు ప్రపంచమంతటి నుంచి క్రెకెటర్లు భారత్‌ రావాల్సిందే, ఎక్కడా ఏ విధమైన ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకూడదు.” అని శ్రీనివాసన్‌ అన్నారు.


బిసిసిఐ అభిజ్ఞవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం రూపాయి పతనం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ బాటింగ్‌ సగటును దాటే అవకాశం ఉందనే భయం కూడా ఉంది.రూపాయి వేగాన్ని సచిన్‌ టెండూల్కర్‌ కూడా అధిగమించలేదు. ఒక నాడు తన కెరీర్‌ను కాపాడుకొనేందుకు రాహుల్‌ ద్రావిడ్‌ వికెట్‌ కీపింగ్‌ చేపట్టాడు. రూపాయిలో మార్పులు రావాలని కూడా ద్రావిడ్‌ చెప్పాడు. బహుశా నోట్లు గుండ్రంగాను, నాణాలను చతురస్రంగా మార్చాలని కావచ్చునని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. రూపాయికి ఒక విలువను నిర్ణయించలేమని శ్రీశాంత్‌ ట్వీటాడు. బిసిసిఐ సాంకేతిక కమిటీ సభ్యుడు రవిశాస్త్రి వివరణ ఇస్తూ మరొక ఐపిఎల్‌ నిర్వహణ లేదా కేవలం భారత్‌లోనే క్రికెటర్లు ఆడేవిధంగా చూడాలి. తద్వారా విదేశీ పెట్టుబడిదార్లను దేశానికి ఆకర్షించాలి. ఇది గిరాకీ-సరఫరా ఆట, మనం గిరాకీని సృష్టించాలి.”
రాయల్‌ ఛాలెంజర్స్‌ అధిపతి డాక్టర్‌ విజయ మాల్య నిలిపివేసిన కింగ్‌ఫిషర్‌ జెట్‌ ఒకదానిలో కూర్చొని శ్రీనివాసన్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ను కూడా ఆదుకోవాలని బిసిసిని కోరాడు. ఆర్‌సిబి మరియు సిఎస్‌కె మామూలుగా అయితే ప్రత్యర్దులు, కానీ చూస్తే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రీనివాసన్‌ ఆ భేటీ తరువాత విలేకర్లతో చెప్పింది వేరేగా ఉంది. మా ఇద్దరికీ పనికిరాని కొడుకులున్నారు, కాబట్టి మాకు చక్కగా కుదిరిందన్నాడు. రూపాయి తిరిగి బలపడుతుందా అని తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది కనుక ప్రముఖ రాజకీయనేతలు, క్రికెటర్లు, ప్రపంచ నేతలతో తన న్యూస్‌ అవర్‌ కార్యక్రమంలో చర్చించేందుకు ఆర్నాబ్‌ గోస్వామి ఏర్పాట్లు చేసుకున్నాడు.


భక్తోం, మిత్రో ఆగ్రహించకండి, విశ్వగురువుగా ప్రపంచంలో నీరాజనాలు అందుకుంటున్న మన ప్రధాని ఎంతైనా నరేంద్రమోడీ, పాలన గురించి ఇలా జోకులేస్తారా, వాటిని మీరు మా ముందు పెడతారా అని కోప్పడకండి. పైన పేర్కొన్న జోకులన్నీ 2013లో యుపిఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ మీద వేసినవిగా గమనించాలి. ఇప్పుడు జోక్స్‌ వేయాలన్నా, షేర్‌ చేయాలన్నా ఎక్కడ కేసులు నమోదై ఇబ్బందులు పడతామో అన్న భయం వలన కావచ్చు అంతగా రావటం లేదు. పూర్వం రాజు గారు నవ్వితే నవ్వాలి లేదా తనను నవ్వించమని అడిగితే నవ్వించాలి తప్ప ఏదీ మనంతట మనం చేయకూడదు. రాజు గారు నవ్వేంత వరకు ఎదురు చూడాల్సిందే మరి. తొమ్మిదేండ్ల క్రితం రూపాయి మాదిరి ఇప్పుడూ ఉంది. కరోనాలో చూసిన పాతసినిమాలే చూసినట్లు ఇప్పుడు పాత జోకులతోనే సరిపెట్టుకుందాం.రోజులు బాగుంటే కొత్త జోకులు వస్తాయి.


”యుపిఏ ఏర్పడినపుడు రూపాయి-డాలరు నిష్పత్తి రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా ఉంది, ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గరగా ఉంది, మన్మోహన్‌ సింగ్‌ వయస్సును తాకుతుందేమో అన్నది మా అనుమానం” అని బిజెపి నేత రవిశంకర ప్రసాద్‌ ప్రసాద్‌ 2014కు ముందు జోక్‌ చేశారు. కాలం కలసి రాక ఇప్పుడు ఆ పెద్ద మనిషి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. లాయరు గనుక తిరిగి కోర్టులకు వెళుతున్నారో లేదో తెలియదు. చైనాతో వంద బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరపాలని మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చటంలో మన ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించారు.తొమ్మిదేండ్ల క్రితం రవిశంకర ప్రసాద్‌ చెప్పినట్లు సోనియా గాంధీ వయస్సు 67(ఇప్పుడు 75)ను దాటించారు. ఊపు చూస్తుంటే మన్మోహన్‌ సింగ్‌ వయస్సు80(ఇప్పుడు 89)కు చేరారు. తరువాత తన రాజకీయ గురువైన ఎల్‌కె అద్వానీ 85(ఇప్పుడు 94) గారికి దక్షిణ సమర్పించినా ఆశ్చర్యం లేదు. ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పతనం : వంచనకూ ఒక హద్దుంటుంది :నరేంద్రమోడి , ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా మిత్రోం !

04 Monday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, Joe Biden, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


” గతంలో భారత ప్రధానులు అమెరికా అధ్యక్షులను కలుసుకొనేందుకు వారి దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన ప్రధాని దగ్గరకు వస్తున్నారు. అదే నరేంద్రమోడీ గొప్పతనం ” ఇది ఇటీవలి జి7 దేశాల సమావేశం తరువాత సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక పోస్టులోని అంశం. నిజమే ఆ దృశ్యాన్ని చూసి యావత్‌ నరేంద్రమోడీ భక్త జనులు ఆనందపారవశ్యంతో ఆ బొమ్మ ముందు పొర్లు దండాలు కూడా పెట్టి ఉండవచ్చు. ఎవరిష్టం వారిది. ప్రపంచ నేతలతో అందునా అమెరికా నేతలతో కౌగలించుకొనే చనువు మన ప్రధానికి ఉంది గనుక మరొకటి కూడా జరిగి ఉండవచ్చు. ” ఏమిటి మోడీ గారు మా డోనాల్డ్‌ ట్రంప్‌నైతే కౌగలించుకొని చెట్టపట్టాలు వేసుకొని మరీ మధుర భాషణలు జరిపారు. నన్ను చూసి కూడా చూడనట్లు అటు తిరిగి మాట్లాడుతున్నారేం ” అంటూ వెనుక నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నరేంద్రమోడీ భుజం తట్టి మరీ పలకరించి ఉండవచ్చుగా ! వసుదేవుడు అంతటి వాడు తన పని జరిపించుకొనేందుకు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న పురాణ కధ చదివాము. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో తన అవసరం కోసం గత ఐదునెలల్లో బెదిరింపులు-బుజ్జగింపులతో మన దేశాన్ని తనవైపు తిప్పుకొనేందుకు అమెరికా చూస్తున్నదనేది కూడా జగమెరిగినదే. దానిలో భాగంగా కూడా జో బైడెన్‌ వెనుక నుంచి తట్టి మరీ నరేంద్రమోడీని పలుకరించి ఉండవచ్చు మీ వైఖరిని మార్చుకున్నారా అని అడిగి ఉండవచ్చు. అవసరం వారిది కదా ! ఏదైనా దాన్ని వదలివేద్దాం, దీనితో దేశానికి ఒరిగిందేమిటి, జనాలకు దక్కిందేమిటి ?


నరేంద్రమోడీని విశ్వగురువుగా మన జనాలకు చూపేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి వారి సలహాలతో మద్దతుదారులు ఇలాంటివి ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. గతంలో చాయవాలా బ్రాండ్‌,ఎన్నికల సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి కూర్చోబెట్టటం, బిజెపి నేతలు టీ అమ్మటం వంటి జిమ్మిక్కులన్నీ దానిలో భాగమే కదా ! చాయవాలా తరువాత చౌకీదారు బ్రాండ్‌తో ముందుకు వచ్చారని తెలిసిందే ! ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి చేస్తున్నదేమిటి ? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం ? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా జనానికి మతిమరుపు వచ్చినా అవసరం గనుక చెప్పుకోక తప్పదు. భజన తప్ప మరొకటి మాకు పట్టదని భక్తులు అంటారా ? వారిని వదలివేద్దాం ! తమ అవసరాల కోసం నరేంద్రమోడీని విదేశాలు – కార్పొరేట్‌లు మునగచెట్టు ఎక్కించవచ్చు, మీడియాలో గొప్పతనాన్ని గుప్పించవచ్చు. దానికి అనుగుణంగానే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ మోడీ గారు సుభాషితాలను వల్లిస్తున్నారు. ఒకటి మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి జనాన్ని ఆకట్టుకోవటంలో నరేంద్రమోడీకి ప్రస్తుతం దేశంలో మరొకరు సాటిరారు. అందునా వేషం-భాషల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.


” యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి ” 2013 నవంబరు 21న పిటిఐ వార్తకు శీర్షిక. ” ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది.( ఆరోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు)” ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ” యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం ” అన్నారు.


రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది.” ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం, కానీ జరిగిందేమీ లేదు. ” అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.


2018 సెప్టెంబరు మూడున ద క్వింట్‌ పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణ ” రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువు ా ప్రాణాలతో పోరాడు తోంది ” అని 2013లో నరేంద్రమోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి, సెప్టెంబరు మూడున తొలిసారిగా రు. 71.11గా ఉంది అంటూ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్రమోడీ గట్టిగా ఇలా చెప్పారు.” నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు అది ఇంతవేగంగా పతనం కాకూడదు.ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది” అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ” ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.” బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ ” ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్నిగురించీ చెప్పటం లేదు.” అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌డిటీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ” ఈ పతనం(2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.” గార్గ్‌ మాటల తరువాత ” వంచనకూ ఒక హద్దు ఉంటుంది ” అన్న నరేంద్రమోడీ చెప్పిన ఒక మాటను చూపి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్రమోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో !


. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, ఇప్పుడు 79 దాటింది. పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు ? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా ?


2022 జూలై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాట నుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్రమోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31నాటికి 633.6 బి.డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బి.డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి.2022లో 95.6 బి.డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు పతనం మంచి రోజుల్లో భాగమే అని బిజెపినేతలైనా చెప్పాలి కదా మిత్రోం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

13 Monday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, WAR

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Narendra Modi Failures, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ-1

03 Monday Sep 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, Indian currency, Narendra Modi, Rupee, Rupee Fall

Image result for Rupee value : narendra modi  cartoons

ఎం కోటేశ్వరరావు

ఈ మధ్య కిరాయి ప్రచార యంత్రాంగం పడిపోతున్న రూపాయిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా మార్చేందుకు పూనుకుంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మోడీని ధన్యుడిని చేయాలన్న తాపత్రయంలో వారున్నారు. మన కంటే కొన్ని కరెన్సీల విలువలు ఎక్కువగా పడిపోతున్నాయి. మన కరెన్సీ విలువ కూడా పెరిగింది అయితే కొన్ని కరెన్సీల విలువలు ఇంకా పెరిగాయి అంటూ కొన్ని అంకెలను ప్రచారంలో పెట్టారు. తెనాలి రామకృష్ణుడు నియోగులను ఎలాగైనా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా అంకెలు కూడా అలాంటివే.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గరిష్టంగా పతనమైన రూపాయి విలువను తాజాగా పడిపోయిన విలువను పోల్చి పెద్దగా పడిందేమీ లేదని జనానికి చెప్పదలచుకున్నారు.2013 ఆగస్టు 31న 65.70రులకు పడిపోయింది. 2018ఆగస్టు 30న విలువ 70.74ను చూపి తేడా ఐదు రూపాయలే కదా అన్నట్లుగా చిత్రిస్తున్నారు. 2009 మార్చి ఆరున రు.51.69 కనిష్టంగా వున్నది తరువాత క్రమంగా పడిపోతూ 2011 ఆగస్టు ఒకటిన 44.05 గరిష్ట స్ధాయికి చేరింది, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పైన చెప్పుకున్న 65.70కి పతనమైంది. ఆ తరువాత మోడీ ఏలుబడికి వచ్చే నాటికి 2014 మే 25న 58.52కు పెరిగింది. అప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు కనీసం ఆస్ధాయిని ఒక్క రోజు కూడా చేరుకోలేదు, క్రమంగా పెరుగుతూ సోమవారం నాడు (సెప్టెంబరు 3న) 71.21గా ముగిసి మరో రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఎవరైనా కాదనగలరా చెప్పండి. కావాలంటే క్రింది లింక్‌లో గ్రాఫ్‌ను చూడండి. మోడీ భక్తుల బండారం బయట పడుతుంది.https://www.poundsterlinglive.com/bank-of-england-spot/historical-spot-exchange-rates/usd/USD-to-INR

Image result for Rupee value cartoons

మన కరెన్సీ విలువ కూడా పెరిగింది, మన కంటే డాలరు విలువ ఇంకా పెరిగింది. ఇది అతితెలివితో కూడిన వాదన.మన కరెన్సీ విలువ మరొక కరెన్సీతో పోల్చితే పెరిగింది లేదా తగ్గింది అంటే అర్ధం ఏమిటి? వుభయులము పరస్పరం కరెన్సీలను కొనుగోలు చేసి ఆ మేరకు చెల్లించే వప్పందం వున్నపుడు పాకిస్ధాన్‌-మనమ ధ్య లావాదేవీలు జరిగితే ఏం జరుగుతుంది. మన దేశం నుంచి వంద రూపాయల విలువ గల వస్తువును పాకిస్ధాన్‌ కొంటే గతేడాది సెప్టెంబరు 28న పాక్‌ కొనుగోలు దారులు మనకు వారి కరెన్సీ 162 రూపాయలు చెల్లించాలి.అదే ఈ ఏడాది జూలై 28న 188 అయింది, ఈ నెల రెండున 173 అయింది. అంటే జూలై 28తో పోల్చితే సెప్టెంబరు రెండుకు పాక్‌ కరెన్సీ విలువ(మనతో పోల్చుకుంటే) పెరిగినట్లు. మనం పాకిస్ధాన్‌ నుంచి వంద రూపాయల వస్తువు కొంటే జూలై 26న 53 రూపాయలు ఇస్తే సరిపోయింది, అదే వస్తువుకు మనం సెప్టెంబరు 2న 58 చెల్లించాల్సి వచ్చింది. అంటే పాక్‌ కరెన్సీతో మన రూపాయి విలువ పడిపోయింది. అదే మన మధ్య డాలర్ల మార్పిడి జరిగిందను కోండి. మన దగ్గర వుంటే వాటిని లేదా మార్కెట్లో కొని చెల్లించాలి. ఆగస్టు ఆరున మనం పాక్‌ నుంచి ఒక డాలరుకు ఒక పెన్ను దిగుమతి చేసుకుంటే మనం ఆరోజున్న మార్కెట్‌ రేటు ప్రకారం రు.68.46 పెట్టి ఒక డాలరు కొని పాక్‌ వ్యాపారికి ఇచ్చాము. అదే పెన్నును సెప్టెంబరు మూడున కొంటే సెప్టెంబరు రెండున డాలరుకు రు.71.21చెల్లించాల్సి వచ్చింది. డాలర్లలో ఏ దేశానికైనా అదే రీతిలో చెల్లించాలి. అమెరికా మన నుంచి ఒక చాక్లెట్‌ దిగుమతి చేసుకుంటే ఆగస్టు 3న 0.015 డాలర్లు చెల్లించాలి. ఒక నెల తరువాత సెప్టెంబరు మూడున ఆ మొత్తం 0.014కు పడిపోయింది. అంటే మన కరెన్సీ విలువ తగ్గింది, అమెరికా విలువ పెరిగింది.

త్వరలో మనల్ని చైనాను అధిగమించేట్లు నడిపిస్తామని మోడీ బృందం నమ్మిస్తున్నది. మంచిదే, అంతకంటే కావాల్సింది ఏముంది. మనం చైనాతో సహా అన్ని దేశాలకు మేకిన్‌ ఇండియా పేరుతో వస్తువులను ఎగుమతి చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అదానీ లేదా అంబానీ దుకాణం నుంచి ఒక కిలో కందిపప్పు ఒక రూపాయికి ఎగుమతి చేశామనుకోండి( మోడీ ప్రత్యేక ఎగుమతి సబ్సిడీ అందచేస్తున్నారు అనుకోవాలి మరి) మనకు చైనా తన కరెన్సీలో ఆగస్టు 3న 0.1యువాన్లు చెల్లించింది. అదే సెప్టెంబరు రెండున 0.096 యువాన్లకు తగ్గిపోయింది. దీనర్ధం మన కరెన్సీ విలువ తగ్గిపోయింది, అమెరికా, ఇతరులతో మన సంఘపరివార్‌ తదితరులు దెబ్బతీయాలని చూస్తున్న చైనా కరెన్సీ విలువ పెరిగింది.

Image result for Rupee value cartoons

మన కంటే అధ్వాన్నం అయిన పాకిస్ధాన్‌తోనే మన కరెన్సీ దిగజారింది, మోడీ భక్తులు చెబుతున్న మన కరెన్సీ పెరుగుదల అంటే దాని కంటే అధ్వాన్న దేశంతో అనుకోవాలి. ఆశలు చైనాను దెబ్బతీయటం, ఆచరణ వూరూ పేరులేని దేశాలతో పోల్చుకొని సంబర పడటం ! ఏమి సామర్ధ్యం, ఏమి దేశభక్తి బాబూ ఇది !! ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారో ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: