• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Rupee Fall

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ-1

03 Monday Sep 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, Indian currency, Narendra Modi, Rupee, Rupee Fall

Image result for Rupee value : narendra modi  cartoons

ఎం కోటేశ్వరరావు

ఈ మధ్య కిరాయి ప్రచార యంత్రాంగం పడిపోతున్న రూపాయిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా మార్చేందుకు పూనుకుంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మోడీని ధన్యుడిని చేయాలన్న తాపత్రయంలో వారున్నారు. మన కంటే కొన్ని కరెన్సీల విలువలు ఎక్కువగా పడిపోతున్నాయి. మన కరెన్సీ విలువ కూడా పెరిగింది అయితే కొన్ని కరెన్సీల విలువలు ఇంకా పెరిగాయి అంటూ కొన్ని అంకెలను ప్రచారంలో పెట్టారు. తెనాలి రామకృష్ణుడు నియోగులను ఎలాగైనా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా అంకెలు కూడా అలాంటివే.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గరిష్టంగా పతనమైన రూపాయి విలువను తాజాగా పడిపోయిన విలువను పోల్చి పెద్దగా పడిందేమీ లేదని జనానికి చెప్పదలచుకున్నారు.2013 ఆగస్టు 31న 65.70రులకు పడిపోయింది. 2018ఆగస్టు 30న విలువ 70.74ను చూపి తేడా ఐదు రూపాయలే కదా అన్నట్లుగా చిత్రిస్తున్నారు. 2009 మార్చి ఆరున రు.51.69 కనిష్టంగా వున్నది తరువాత క్రమంగా పడిపోతూ 2011 ఆగస్టు ఒకటిన 44.05 గరిష్ట స్ధాయికి చేరింది, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పైన చెప్పుకున్న 65.70కి పతనమైంది. ఆ తరువాత మోడీ ఏలుబడికి వచ్చే నాటికి 2014 మే 25న 58.52కు పెరిగింది. అప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు కనీసం ఆస్ధాయిని ఒక్క రోజు కూడా చేరుకోలేదు, క్రమంగా పెరుగుతూ సోమవారం నాడు (సెప్టెంబరు 3న) 71.21గా ముగిసి మరో రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఎవరైనా కాదనగలరా చెప్పండి. కావాలంటే క్రింది లింక్‌లో గ్రాఫ్‌ను చూడండి. మోడీ భక్తుల బండారం బయట పడుతుంది.https://www.poundsterlinglive.com/bank-of-england-spot/historical-spot-exchange-rates/usd/USD-to-INR

Image result for Rupee value cartoons

మన కరెన్సీ విలువ కూడా పెరిగింది, మన కంటే డాలరు విలువ ఇంకా పెరిగింది. ఇది అతితెలివితో కూడిన వాదన.మన కరెన్సీ విలువ మరొక కరెన్సీతో పోల్చితే పెరిగింది లేదా తగ్గింది అంటే అర్ధం ఏమిటి? వుభయులము పరస్పరం కరెన్సీలను కొనుగోలు చేసి ఆ మేరకు చెల్లించే వప్పందం వున్నపుడు పాకిస్ధాన్‌-మనమ ధ్య లావాదేవీలు జరిగితే ఏం జరుగుతుంది. మన దేశం నుంచి వంద రూపాయల విలువ గల వస్తువును పాకిస్ధాన్‌ కొంటే గతేడాది సెప్టెంబరు 28న పాక్‌ కొనుగోలు దారులు మనకు వారి కరెన్సీ 162 రూపాయలు చెల్లించాలి.అదే ఈ ఏడాది జూలై 28న 188 అయింది, ఈ నెల రెండున 173 అయింది. అంటే జూలై 28తో పోల్చితే సెప్టెంబరు రెండుకు పాక్‌ కరెన్సీ విలువ(మనతో పోల్చుకుంటే) పెరిగినట్లు. మనం పాకిస్ధాన్‌ నుంచి వంద రూపాయల వస్తువు కొంటే జూలై 26న 53 రూపాయలు ఇస్తే సరిపోయింది, అదే వస్తువుకు మనం సెప్టెంబరు 2న 58 చెల్లించాల్సి వచ్చింది. అంటే పాక్‌ కరెన్సీతో మన రూపాయి విలువ పడిపోయింది. అదే మన మధ్య డాలర్ల మార్పిడి జరిగిందను కోండి. మన దగ్గర వుంటే వాటిని లేదా మార్కెట్లో కొని చెల్లించాలి. ఆగస్టు ఆరున మనం పాక్‌ నుంచి ఒక డాలరుకు ఒక పెన్ను దిగుమతి చేసుకుంటే మనం ఆరోజున్న మార్కెట్‌ రేటు ప్రకారం రు.68.46 పెట్టి ఒక డాలరు కొని పాక్‌ వ్యాపారికి ఇచ్చాము. అదే పెన్నును సెప్టెంబరు మూడున కొంటే సెప్టెంబరు రెండున డాలరుకు రు.71.21చెల్లించాల్సి వచ్చింది. డాలర్లలో ఏ దేశానికైనా అదే రీతిలో చెల్లించాలి. అమెరికా మన నుంచి ఒక చాక్లెట్‌ దిగుమతి చేసుకుంటే ఆగస్టు 3న 0.015 డాలర్లు చెల్లించాలి. ఒక నెల తరువాత సెప్టెంబరు మూడున ఆ మొత్తం 0.014కు పడిపోయింది. అంటే మన కరెన్సీ విలువ తగ్గింది, అమెరికా విలువ పెరిగింది.

త్వరలో మనల్ని చైనాను అధిగమించేట్లు నడిపిస్తామని మోడీ బృందం నమ్మిస్తున్నది. మంచిదే, అంతకంటే కావాల్సింది ఏముంది. మనం చైనాతో సహా అన్ని దేశాలకు మేకిన్‌ ఇండియా పేరుతో వస్తువులను ఎగుమతి చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అదానీ లేదా అంబానీ దుకాణం నుంచి ఒక కిలో కందిపప్పు ఒక రూపాయికి ఎగుమతి చేశామనుకోండి( మోడీ ప్రత్యేక ఎగుమతి సబ్సిడీ అందచేస్తున్నారు అనుకోవాలి మరి) మనకు చైనా తన కరెన్సీలో ఆగస్టు 3న 0.1యువాన్లు చెల్లించింది. అదే సెప్టెంబరు రెండున 0.096 యువాన్లకు తగ్గిపోయింది. దీనర్ధం మన కరెన్సీ విలువ తగ్గిపోయింది, అమెరికా, ఇతరులతో మన సంఘపరివార్‌ తదితరులు దెబ్బతీయాలని చూస్తున్న చైనా కరెన్సీ విలువ పెరిగింది.

Image result for Rupee value cartoons

మన కంటే అధ్వాన్నం అయిన పాకిస్ధాన్‌తోనే మన కరెన్సీ దిగజారింది, మోడీ భక్తులు చెబుతున్న మన కరెన్సీ పెరుగుదల అంటే దాని కంటే అధ్వాన్న దేశంతో అనుకోవాలి. ఆశలు చైనాను దెబ్బతీయటం, ఆచరణ వూరూ పేరులేని దేశాలతో పోల్చుకొని సంబర పడటం ! ఏమి సామర్ధ్యం, ఏమి దేశభక్తి బాబూ ఇది !! ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారో ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయితో కనిపించని దెబ్బలు కొడుతున్న నరేంద్ర మోడీ

31 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

Demonetisation, Narendra Modi, RBI Report on Demonitisation, Rupee Fall

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విదేశీ అప్పు- నరేంద్రమోడీ భక్తుల తిప్పలు !

08 Sunday Jul 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India’s External Debt, RBI, Rupee Fall, value of the rupee

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అల్లుడికి బుద్ది చెప్పి మామ అంతకంటే పెద్ద తప్పు చేసినట్లు !

25 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP U TURN, Narendra Modi, Rupee, Rupee Fall, UPA

ఎం కోటేశ్వరరావు

‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించండి. గురువారం(24వ తేదీ) మోడీ తన ఘన చరిత్రలో ఒక రికార్డును బద్దలు చేశారు. 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. మరి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారు ?http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html 2013 ఆగస్టు 19న, అప్పటికే రూపాయి విలువ పతన అవుతున్నది, దాని గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో చేసిన విమర్శ అది.మరి ఇపుడేమంటారు ? ఈ నెలాఖరులో మనసులోని మాటలో అయినా ఏదైనా చెబుతారేమో చూద్దాం ! అంతకు ఒక నెల రోజుల ముందు రూపాయి విలువ రు.60.15కు పతనమైన సమయంలో లాయరూ, ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.http://www.firstpost.com/politics/bjp-blames-upas–gross-mismanagement-for-rupee-fall-946409.html ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

     ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. ఇప్పుడు మన ప్రధాని వయస్సు 66, రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.44 వుంది. ఇంతగా పతనం కావటానికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారు ? యుపిఏ కంటే ఏ భిన్న విధానాలు అనుసరించిన కారణంగా ఈ పతనం సంభవించింది. త్వరలో 70 రూపాయలకు చేరనున్నదని విశ్లేషకులు ఎందుకు జోశ్యం చెబుతున్నట్లు ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు. బిజెపి పెద్ద పార్టీగా రావటం ఖాయమని, సంపూర్ణ మెజారిటీకి 40 స్థానాలు తగ్గితే మిత్ర పక్షాలపై ఆధార పడాల్సి వుంటుందని ఎన్నికల జోశ్యాలు పేర్కొన్నాయి. వాటిని అధిగమించి బిజెపి ఒక్కటే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆ సమయానికి 2013 ఆగస్టు 28తో పోల్చుకుంటే రూపాయి విలువ 13శాతం పెరిగింది.

    రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నుంచి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యం కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది? కారణాలేమిటి ?

    నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

   ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. నరేంద్రమోడీ సర్కార్‌ విధానం ఏమిటి ?

   1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

    గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా వివిధ కారణాలతో రికార్డు స్దాయిలో నవంబరు 11వ తేదీతో ముగిసిన వారంలో 368 బిలియన్‌ డాలర్లు వున్నాయి. అయినప్పటికీ 2013 నాటి మాదిరి రూపాయి విలువ పతనమౌతోంది. ఎందుకిలా జరుగుతోంది?

    రూపాయి పతనమైతే మనకు కలిగే లాభ నష్టాలు ఏమిటి ? మన దేశంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసే సమయంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల పెరుగుదల తగ్గుదల వుంటుందని ప్రభుత్వం జనానికి చెప్పింది. ఈ విధానం ప్రకారం పీపా వంద డాలర్లు వున్నప్పటి కంటే సగానికి సగం ధర తగ్గినందున మన దేశంలో పెట్రోలు ధర కూడా సగానికి తగ్గాలి. ఎందుకు తగ్గలేదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? చమురుపై కేంద్ర సుంకాన్ని మోడీ సర్కార్‌ లీటరుకు పన్నెండు రూపాయల వరకు పెంచింది. దీనికి తోడు రూపాయి పతనంపై గుడ్లప్పగించి చూస్తుండటంతో దిగుమతి చేసుకొనే పెట్రోలు ధర పెరిగింది.

    మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

     నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2014లో 382 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యం వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

   విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?

Image result for On Rupee Fall: modi u turn

    ఏతా వాతా తేలేదేమంటే మన కరెన్సీ విలువ పతనాన్ని అలాగే కొనసాగనిస్తే అది మనకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అసలే అంతంతమాత్రంగా మన జీవితాలను మరింత దిగజార్చుతుంది. మోడీ మహాశయుడి అచ్చే దినాలకోసం ఎదురు చూస్తున్న జనానికి ఆకస్మికంగా బ్యాంకుల ముందు పడిగాపులు పడే చచ్చే దినాలు దాపురించాయి. రాబోయే రోజుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవటం ఒక సమస్యగా మారే అవకాశం వుంది. ఇప్పుడు రూపాయి మరింతగా పతనమైతే తట్టల్లో డబ్బులు తీసుకు వెళ్లి బుట్టల్లో సరకులు తెచ్చుకొనే రోజులు వస్తాయి. మన సరకులను విదేశాల వారు చౌకగా కొనుక్కుపోతారు. వారిలో పాకిస్తాను వారు కూడా వుంటారని కాషాయ దేశభక్తులు గ్రహించాలి.ఎంకి పెళ్లి సుబ్సిచావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: