• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: RUSSIA

రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

01 Wednesday Feb 2023

Posted by raomk in Germany, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Abrams tanks to Ukraine, Germany, Leopard II tank, NATO, RUSSIA, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ(45 ) పుట్టిన రోజు సందర్భంగా జనవరి 25న అమెరికా, జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు ఆధునిక టాంకులను అందచేస్తామని ప్రకటించాయి.ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు ఫిబ్రవరి 24నాటికి ఏడాది పూర్తి అవుతుంది. ఉక్రెయిన్‌-రష్యాలను కూర్చోబెట్టి రెండు దేశాల్లో ఉన్న భయ, సందేహాలను పోగొట్టి వివాదాన్ని పరిష్కరించి ప్రశాంతతను చేకూర్చాల్సిందిపోయి మరింత ఆజ్యం పోసేందుకు పూనుకున్నాయి. టాంకులను ఎప్పుడైతే ఇస్తామని చెప్పిన వెంటనే తమకు జెట్‌ యుద్ద విమానాలు కావాలని ఉక్రెయిన్‌ కోరటం గమనించాల్సిన అంశం. సంక్షోభంలో ఇదొక ప్రమాదకర కొత్త మలుపు. నిజానికి ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని చెప్పవచ్చు. సమీప భవిష్యత్‌లో దీన్ని ముగించే బదులు ఏ పరిణామాలకు దీన్ని తీసుకుపోతాయో అన్న ఆందోళన కలుగుతోంది.


తమ వద్ద ఉన్న అబ్రామ్‌ టాంకులను ఇస్తామని అమెరికా, లెపర్డ్‌(చిరుత పులి) రకం టాంకులను ఇస్తామని జర్మనీ కొద్ది తేడాతో ఒకే రోజు ప్రకటించాయి. జర్మనీ ఆ రకం టాంకులను ఇప్పటికే అనేక నాటో దేశాలకు సరఫరా చేసింది. ఒప్పందం ప్రకారం వాటిని మరో దేశానికి విక్రయించాలంటే జర్మనీ అనుమతి అవసరం. గత రెండు మూడు నెలలుగా ఆ మేరకు కొన్ని దేశాలు వత్తిడి తెస్తున్నాయి. తామే వాటిని ఉక్రెయిన్‌ ఇచ్చేందుకు అంగీకరించినందున మిగతా దేశాలకు సైతం అనుమతి ఇచ్చింది. అబ్రామ్‌ రకం టాంకులను అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించేశాడు. దీని వెనుక అమెరికా దుష్ట పన్నాగం గురించిన హెచ్చరికలు వినిపించాయి. జర్మనీలోని యుద్ద, ఆయుధ లాబీలను కూడగట్టుకొని అమెరికా వేసిన ఎత్తుగడలో భాగంగా జర్మనీ కూడా టాంకులను అందించేందుకు సిద్దపడిందన్నది ఒక కథనం. ఐరోపాలో తమ పెత్తనాన్ని సుస్థిరం గావించుకొనేందుకు జర్మన్‌ పాలకవర్గ పూనికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నది మరొక కథనం. జర్మనీని ముందుకు తోస్తే ఒక వేళ రష్యా ప్రతిదాడికి దిగితే తొలి దెబ్బ పడేది జర్మనీ మీదనే కనుక తన చేతికి మట్టి అంటకుండా ఐరోపాలో పెత్తనాన్ని పటిష్టపరుచుకొనేందుకు అమెరికాకు వీలుకలుగుతుంది.


సినిమాల్లో కథను రక్తి కట్టించేందుకు నాటకీయ మలుపులు తిప్పుతారు. పశ్చిమ దేశాల తీరు మొదటి నుంచీ అలాగే ఉంది. సైనిక చర్య ప్రారంభం కాగానే రష్యాతో రాజీ చర్చలంటూ తొలి అంకానికి తెరలేపారు.పరిష్కారానికి తాము మద్దతు ఇస్తున్నామంటూ సానుకూల వచనాలు పలికారు. తరువాత పడనీయకుండా కొత్త కొత్త డిమాండ్లను ముందుకు తెస్తూ సాగదీశారు.చివరకు మాటా మంతీ లేని స్థితికి నెట్టారు. ఆ తరువాత రష్యాను ఎదుర్కొనేందుకు తమకు తోడ్పడాలంటూ జెలెనెస్కీ చేసిన ప్రతిపాదనలన్నింటినీ అవి రష్యాతో వైరాన్ని పెంచేవిగా ఉన్నవంటూ ముందు పశ్చిమ దేశాలు తిరస్కరించటం తరువాత ఆకస్మికంగా మారు మనస్సు పుచ్చుకున్నట్లుగా అనివార్యమైనందున అంగీకరించాల్సి వచ్చిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాయి. దాన్లో భాగంగా నాటో దేశాలు వేలాది ఎటిజిఎం( నిర్దేశిత టాంకు విధ్వంసక క్షిపణులు), మాన్‌పాడ్స్‌(భుజాల మీద మోసుకుపోతూ విమానాలు, హెలికాప్టర్ల మీద దాడి చేసేవి)ను ఉక్రెయిన్‌కు అందచేశారు. ఇప్పుడు భారీ టాంకులను, వాటిని నడిపేందుకు అవసరమైన ఇంథనాన్ని అందచేసేందుకు కూడా నిర్ణయించాయి. ఆ ప్రకటనలు ఇంకా జనం నోళ్లలో నాను తుండగానే తమకు జెట్‌ విమానాలిచ్చి పుతిన్‌ సేనలను ఎదుర్కొనేందుకు తోడ్పడాలని ఉక్రెయిన్‌ వినతులు ప్రారంభించింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ వద్ద ఉన్న సోవియట్‌ కాలం నాటి టాంకులు, విమానాలు నిండుకుంటున్నందున కొత్త వాటిని సమకూర్చుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతిఘటనంతా పశ్చిమ దేశాల సరకు, సరంజామాతోనే. నాటో కూటమికి చెందిన మిలిటరీ ప్రత్యక్షంగా పాల్గొనదు తప్ప ఆయుధాలన్నీ దాదాపు వారివే.


తదుపరి పెద్ద తమకు పెద్ద ఆటంకం ఫైటర్‌ జెట్స్‌ మాత్రమే అని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి సలహాదారు యూరీ శాక్‌ చెప్పాడు. నాలుగవ తరం ఆధునిక విమానాలను సాధ్యమైనంత త్వరలో పొందేందుకు చేయాల్సిందంతా చేస్తాము అన్నాడు. వాటిలో అమెరికా ఎఫ్‌16తో సహా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. ” తొలుత వారు మాకు భారీ ఫిరంగులు ఇవ్వాలను కోలేదు, తరువాత ఇచ్చారు. హిమార్స్‌ వ్యవస్థలను కూడా ఇవ్వాలనుకోలేదు, తరువాత ఇచ్చారు, టాంకులు కూడా అంతే ఇప్పుడు ఇస్తామని చెప్పారు. అణ్వాయుధాలు తప్ప మేం పొందలేనిది ఏదీ లేదు ” అని శాక్‌ చెప్పాడంటే పశ్చిమ దేశాల పథకం గురించి తెలియదని అనుకోలేము. తమ గగన తలంలోకి రష్యా చొరబడకుండా ఉండేందుకు తమకు విమానాలు కావాలని గతేడాదే జెలెనెస్కీ అమెరికా కాగ్రెస్‌ను కోరాడు. ఆ కోర్కెను అంగీకరించటమంటే అది నాటో కూటమి రష్యాతో ప్రత్యక్షంగా తలపడటంతో సమానం కనుక మరీ ఎక్కువగా ఆ డిమాండ్‌ను ముందుకు తీసుకురావద్దని గతంలో సలహా ఇచ్చినట్లు వార్తలు. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించటమంటే వాటిని కూడా అందచేసేందుకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్దం చేస్తున్నారనే అనుకోవాలి. అందుకు గాను ప్రచార యంత్రాంగాన్ని ఒక విధంగా ఇప్పటికే రంగంలోకి దించారు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు తగ్గటం వెనుక భారీ దాడులకు సిద్దం కావటమే అంటూ కథనాలు రాశారు.


మరో దేశానికి మారణాయుధాలు అందిస్తే అమెరికా సమాజంలో వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉంది.దాన్ని నివారించేందుకు ముందుగానే అమెరికా రాజకీయ నేతలు కూడా సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అంతకు ముందే రష్యాను ఒక బూచిగా చూపుతున్న సంగతి తెలిసిందే.” వారికేమి కావాలో తెలుసుకొనేందుకు కీవ్‌ (ఉక్రెయిన్‌) నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం.మరిన్ని ఆయుధాలు కావాలని కోరుతున్న ఉక్రేనియన్లను కూడా మనం తప్పు పట్టలేము.యుద్ద విమానాల గురించి వారు మాట్లాడటం ఇదే మొదటి సారి కాదు. దాని గురించి చేసేందుకు నా వద్ద ఎలాంటి ప్రకటనలు లేవు. ” అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి జాన్‌ కిర్బీ చెప్పాడు. అంటే తరువాత వీలు చూసుకొని రష్యా ఏకపక్ష దురాక్రమణ కారణంగా ఇవ్వటం మినహా తమకు మరొక మార్గం లేదని పెంటగన్‌ చెప్పేందుకు చూస్తున్నదనుకోవాలి.టాంకులు ఉక్రెయిన్‌ ప్రాంతాలను కాపాడటం తప్ప రష్యాకు ముప్పుతెచ్చేందుకు కాదని అమెరికా విదేశాంగ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ చెప్పాడు. పుతిన్‌ సేనలు ఎప్పుడు వెనక్కు పోతే పోరు ఆ మరునాడే ఆగుతుందన్నాడు. ప్రపంచాన్ని నమ్మించే వంచన కబుర్లు తప్ప ఇవి మరొకటి కాదు.తమ ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇచ్చి, నాటోను విస్తరించబోమని, ఉక్రెయిన్ను తమ పక్కలో బల్లెంగా మార్చబోమని నాటో కూటమి హామీ ఇస్తే సైనిక చర్యను వెంటనే ఆపివేస్తామని ప్రారంభంలోనే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.


జర్మనీ తొలుత 14 చిరుత రకం టాంకులు ఇస్తామని చెబితే అమెరికా 31 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తరువాత వాటిని ఇంకా పెంచుతారు. ఇవిగాక ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న ఇతర ఐరోపా దేశాలు కూడా తమ వద్ద ఉన్న చిరుతలను అందచేస్తామని ప్రకటిస్తున్నాయి. పశ్చిమ దేశాలు ఇప్పటి వరకు ఇచ్చిన సాయంతో పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టామని, అనేక విజయాలను సాధించినట్లు చేసిన ప్రచారం గురించి తెలిసిందే. నిజానికి అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పుడు భారీ టాంకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? విమానాలను ఎందుకు కోరుతున్నట్లు ? పోనీ ఇవ్వనున్న టాంకుల సామర్ధ్యం ఏమిటి అన్న చర్చను జరిపేందుకు పశ్చిమ దేశాల మీడియా సిద్దం కావటం లేదు.టాంకులు ఇవ్వటాన్ని చారిత్రాత్మకం అని జర్మనీ వర్ణించటమే కాదు ఆట తీరునే మార్చివేస్తుందని చెప్పుకుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి పశ్చిమ దేశాల నేతలు, వారికి వంత పాడే మీడియా విశ్లేషకులు అదే కబుర్లు చెబుతున్నారు, ఇదిగో పుతిన్‌ పతనం అదిగో రష్యా వెనుకడుగు అని అంటూనే ఉన్నారు. ఇలాంటి టక్కు టమారాలను చాలా చూశాం టాంకుల అందచేత ఒక విధ్వంసకర పధకం, టాంకుల గురించి అతివర్ణన అంటూ రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ కొట్టిపారవేశాడు.


రష్యాతో పోరుకు జర్మన్‌ టాంకులు ఇవ్వటం చారిత్రక తప్పిదం అవుతుందని జర్మన్‌ పార్లమెంటులోని వామపక్ష పార్టీ ప్రతినిధి సెవిమ్‌ డగడెలెన్‌ రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.ఆమె పార్లమెంటు రక్షణ, విదేశాంగ కమిటీలలో, నాటో పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఆ విశ్లేషణ సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌కు టాంకులు ఇచ్చినప్పటికీ రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ దాడుల్లో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలు జర్మనీ మిలిటరీ మరోసారి తమ దేశం మీద దాడికి తెరలేపిందనే భావిస్తారు. జర్మనీ చరిత్రను తాజా చర్చలో ఎవరూ ముందుకు తీసుకురావటం లేదు. జర్మనీ టాంకుల సరఫరాతో ఉక్రెయిన్‌పై దాడికి రష్యాలో పెద్ద ఎత్తున సానుకూల ప్రజాభిప్రాయం వెల్లువెత్తవచ్చు. దీనికి స్వయంగా జర్మన్‌ ఛాన్సలర్‌, సోషల్‌డెమోక్రటిక్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. టాంకుల సరఫరా ప్రాధాన్యతను నొక్కి చెప్పేందుకు జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా అవసరమైతే పోరు జరుగుతున్న ఖార్‌కివ్‌ ప్రాంతానికి కూడా వెళతామని చెప్పారు.ఆయుధ సరఫరా, శిక్షణ పేరుతో చివరికి జర్మనీ కూడా పోరులో భాగస్వామి కాగల అవకాశం ఉందని పార్లమెంటు పరిశోధనా సేవల విభాగం పేర్కొన్నది. ఇతర నాటో దేశాలు జర్మనీ మీద వత్తిడి తెస్తున్నాయి. తాము భారీ టాంకులను ఇస్తున్నట్లు బ్రిటన్‌ చెప్పటం, తమ వద్ద ఉన్న జర్మన్‌ టాంకులను అందచేయాలని నిర్ణయించినట్లు పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడా ఏకపక్షంగా ప్రకటించటం దానిలో భాగమే. ఈ పరిణామాల వలన జర్మన్‌-రష్యా సంబంధాలు దెబ్బతింటాయి. అది బహిరంగ పోరుకు దారి తీసి ఇతర దేశాలు లబ్దిపొందేందుకు తోడ్పడుతుంది.


బెర్లిన్ను కేంద్రంగా మార్చి ఐరోపా పరిష్కారం అంటూ రష్యాతో పోరుకు అమెరికా ఎందుకు జర్మన్లను ముందుకు నెడుతున్నట్లు ? దీనికి సంబంధించి అమెరికన్లు చేస్తున్న వాదనలు సాకు మాత్రమే అన్నారు.అమెరికా మిలిటరీ సామర్ధ్యం నిర్వహణ సమస్యలవంటి వాటితోపాటు చైనాను ఎదుర్కొనేందుకు అవసరమని చెప్పటం విశ్వసనీయమైంది కాదు. రష్యా ఎదురుదాడికి దిగితే తొలి దెబ్బ తగిలేది జర్మనీకే అని అమెరికా భావిస్తుండవచ్చు. తద్వారా జర్మనీ-రష్యా మధ్య శాశ్వతంగా సహకారం ఉండకూడదన్న అమెరికా దీర్ఘకాలికవ్యూహాత్మక లక్ష్యంలో భాగం కావచ్చు. పశ్చిమ దేశాల టాంకులు గనుక రంగంలోకి దిగితే అణ్వాయుధాలను తీస్తే ముందుగా వేసేది జర్మనీ మీదనే. మిత్ర దేశాన్ని ఒక సామంత దేశంగా పరిగణించి దాన్ని బలిచేసే ఎత్తుగడ ఉంది. మరోవైపున చైనాకు వ్యతిరేకంగా జపాన్ను కూడా అమెరికా అదే విధంగా ముందుకు నెడుతోంది. ఈ పూర్వరంగంలో యుద్దోన్మాదులను నిలువరించేందుకు జర్మనీ తన విదేశాంగ విధానానికి నూతన వ్యూహం అవసరం. ముగ్గురు జర్మన్‌ పార్లమెంటు సభ్యుల పేర్లు ప్రస్తావించి వారు అమెరికా కార్పొరేట్లు, ఆయుధడీలర్లు, అమెరికాయుద్ద యంత్రాంగ సేవలో ఉన్నారా అని ప్రశ్నించారు. అదే గనుక నిజమైతే అది వినాశనానికి దారితీస్తుందని వామపక్ష నేత హెచ్చరించారు. ఒకసారి గనుక జర్మనీ టాంకులను అందచేస్తే అది మరిన్ని అస్త్రాల అందచేతకు తలుపులు తెరిచినట్లు అవుతుంది, ఇప్పటికే కొందరు ఫైటర్‌ జెట్ల గురించి చెబుతున్నారు, తరువాత క్షిపణులు, అవి పనిచేయకపోతే చివరికి మన సైనికులను పంపుతారని అన్నారు. పరిపరి విధాలుగా వెలువడుతున్న ఈ అంశాలు మరింత స్పష్టం కావాల్సి ఉంది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు ప్రపంచ శాంతికి, ప్రజలకు ముప్పుతెచ్చేవిగా ఉన్నట్లు చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెద్దన్న జో బైడెన్‌ చివాట్లు పెట్టినా చీమకుట్టినట్లు లేని చిన్నన్న నరేంద్రమోడీ !

24 Thursday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Biden shaky comment, BJP, Joe Biden, Narendra Modi, RSS, RUSSIA, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా మా నరేంద్రమోడీ ఉన్నారు కనుక సరిపోయింది. మన దేశం రష్యాను చూసి వణుకుతున్నదని అమెరికా అధినేత జో బైడెన్‌ అన్నాడు, అదే మరొకరు ఆ పదవిలో ఉండి ఉంటే భారత్‌ బట్టలు తడుపుకుంటున్నదని అనే వాడు అని ఒక బిజెపి మిత్రుడు చలోక్తి విసిరారు.నిజమే అనిపించింది. వారే కాదు, ఇప్పటికీ చాలా మంది నిజంగానే మోడీ గొప్పతనం గురించి అలాగే అనుకుంటున్నారు. దేశాన్ని అంతమాట అన్నా అని మోడీ మౌనం పాటించటాన్ని చూస్తే ఒక వేళ అంతమాట అన్నా మాట్లాడి ఉండేవారు కాదన్నది కూడా నిజమే కదా ! నిజానికి వణుతున్నదని అన్నా ఆత్మగౌరవం గలవారికి అభ్యంతరకరమే, అవమానంగా భావిస్తారు, అదేమీ గౌరవ ప్రదమైన వ్యాఖ్య కాదు. సరే, నరేంద్రమోడీ గారికి ఆ మాత్రం తట్టదా ? మహానుభావులైన పెద్దల మౌనానికి పలు అర్ధాలుంటాయి మరి. ఎందుకొచ్చిన తంటా అంటారు ? ….” మోడీ ఏది చేసినా దేశం కోసమే ” అంటున్నారు కదా భక్తులు, మనమూ అందాం !


ఇదిగో ట్రంపూ కాశ్మీరు సమస్యలో కాస్త మధ్యవర్తిగా ఉండి ఒకదారి చూపకూడదూ, బాబ్బాబూ నీ పుణ్యం ఊరికే పోదులే అని నరేంద్రమోడీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగా చెప్పిన అంశం తెలిసిందే.2019 జూలై 22న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాషింగ్టన్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్నాడు. ఆ సందర్భంగా ఖాన్‌తో కలసి ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడాడు. భారత ఉపఖండంలో శాంతి స్దాపనకు అమెరికా పోషించాల్సిన పాత్ర ఏదైనా ఉందా అని ఇద్దరు నేతలను ఉద్దేశించి ఒక విలేకరి అడిగాడు. శాంతి చర్చల కోసం మేం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముందు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపాలంటూ భారత్‌ మావైపుకు బంతిని తోసి చర్చల పునరుద్దరణకు అంగీకరించటం లేదు, ట్రంప్‌ ఆ క్రమాన్ని ముందుకు నెట్టగలరని ఇమ్రాన్‌ చెప్పాడు. వెంటనే ట్రంప్‌ మాట్లాడుతూ ఒసాకా జి20 సమావేశాలలో రెండు వారాల క్రితం నేను మోడీతో భేటీ జరిపినపుడు కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం లేదా తీర్పరి పాత్ర వహించమని నన్ను అడిగారు, మీరు కోరుకుంటే నేనా పని చేస్తా అన్నాడు. దీని మీద అబ్బే అలాంటిదేమీ జరగలేదని అధికారులు చెప్పారు తప్ప నరేంద్రమోడీ నోరు విప్పలేదు.


రెండవ సారి ఎన్నికల్లో పోటీ చేస్తూ 2020 అక్టోబరు 22న చర్చలో ట్రంప్‌ మాట్లాడాడు. పర్యావరణంపై 2016పారిస్‌ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవటం సరైనదే అని సమర్ధించుకున్నాడు. అది వారిష్టం అని సరిపెట్టుకుందాం, కానీ ఆ సందర్భంగా చైనా, భారత దేశాల్లో గాలిని చూడండి ఎంత రోతగా ఉంటుందో అలాంటి దేశాలకు ఆ ఒప్పందం ఉపయోగం అని నోరుపారవేసుకున్నాడు. అంతకు ముందు నెలలోనే హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ సభలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తామెంత దగ్గరో అని ప్రవాసభారతీయుల ముందు ఒయ్యారాలను ఒలికించారు. అప్పుడు అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ ఓటర్లను ప్రభావితం చేశారు. అలాంటి ట్రంప్‌ దేశాన్ని అవమానించినా నరేంద్రమోడీ నోరు విప్పలేదు.చిత్రం ఏమంటే ప్రభుత్వం కూడా నోరుమెదపలేదు.
తాజాగా రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని జో బైడెన్‌ అన్నా అదే మౌనం. చైనాను దెబ్బతీసే తమ దీర్ఘకాలిక పధకంలో భారత్‌ కీలక పాత్రపోషించాలని కోరుకుంటున్నది అమెరికా. బైడెన్‌ ప్రకటనతో నరేంద్రమోడీని ఇరుకున పెట్టినట్లయిందని, మరీ తెగేదాకా లాగకూడదనీ కావచ్చు. మరుసటి రోజు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకర్లతో మాట్లాడుతూ నష్ట నివారణకు ప్రయత్నించాడు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) పధకంలో భారత్‌ తమకు అనివార్యభాగస్వామి అంటూ ఉబ్బేశాడు. రష్యాతో చారిత్రాత్మక రక్షణ సంబంధం ఉన్నప్పటికీ భారత్‌ను తమ భాగస్వామిగా ఎంచుకొనేందుకు అదేమీ ఆటంకం కాలేదన్నాడు. పాతికేళ్లుగానో ఇంకా ఎక్కువో మా రెండు దేశాల మధ్య రక్షణ మరియు భద్రత సంబంధాలు మరింతగా పెరిగాయి, ఉమ్మడి ప్రయోజనాలలో భారత్‌ ఎంచుకున్న భాగస్వాములం మేము అన్నాడు. అంతకు ముందు రోజు జో బైడెన్‌ అమెరికన్‌ కార్పరేట్ల సిఇఓలతో మాట్లాడుతూ చతుష్టయ దేశాల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి మన వైఖరిని చెప్పనవసరం లేదు. ఒక్క భారత్‌ తప్ప, అది కొంతమటుకు వణుకుతోంది, జపాన్‌ ఎంతో గట్టిగా ఉంది, అదే విధంగా ఆస్ట్రేలియా, నాటో, పసిఫిక్‌ ప్రాంతంలో మేమంతా గట్టిగా ఉన్నాం అన్నాడు.


అమెరికా నేతలు ఇన్ని మాట్లాడుతున్నా నరేంద్రమోడీ మౌనం దాల్చటం భారత ప్రతిష్టకే భంగం. మూడు రోజులు దాటినా ఎలాంటి స్పందన లేదు. దీని గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం.రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని బైడెన్‌ అనటం ”ఒక చిన్న చివాటు( మందలింపు)” అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి చిదానంద రాజఘట్ట ఒక విశ్లేషణలో వర్ణించారు.( అంతేగా మరి ఇష్టమైన వారు చావు దెబ్బలు కొట్టినా అబ్బే ప్రేమతో కొట్టిన తియ్యని దెబ్బ అనిపిస్తుంది.) దానిలోనే వ్యూహాత్మక వ్యవహారాల వ్యాఖ్యాత బ్రహ్మ చెల్లానే చెప్పిన మాటలను ఉటంకించారు. ” ఇక్కడొక వైరుధ్యం ఉంది. పూర్తి స్ధాయి యుద్ద ముప్పుతో సహా చైనా సరిహద్దు దురాక్రమణను భారత్‌ ఎదుర్కొంటున్న సమయంలో ఆ దురాక్రమణ గురించి బైడెన్‌ తన నోరు విప్పడు.ఇంతే కాదు రెచ్చగొట్టేందుకు స్వయంగా తోడ్పడి ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్దం గురించి భారత స్పందనను వణుకుతున్నదిగా మందబుద్ది బైడెన్‌ వర్ణించాడు.” అని చెల్లానే పేర్కొన్కారు. ” భారత్‌ మీద బైడెన్‌ చేసింది అవాంఛనీయ వ్యాఖ్య.ప్రచ్చన్న యుద్దం ముగిసిన తరువాత రష్యా మీద అమెరికా విధానం ఊగిసలాడే పునాదుల మీద పడిపోనున్న కట్టడంలా ఉంది. ఇప్పుడది కూలిపోతున్నది.నాటోలోకి ఉక్రెయిన్ను రప్పించే అమెరికా అవివేకానికిి భారత్‌ ఎందుకు మూల్యం చెల్లించాలి ? అమెరికా ఆంక్షలు మనలను దెబ్బతీస్తున్నాయి వారిని మనం బలపరచాలా ” అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ అన్నారు.


మౌనం గురించి మన దేశంలో పెద్ద చర్చే నడిచింది. మన్మోహన్‌ సింగ్‌ను మౌన ముని అన్నారు. సింగ్‌ ఎందుకు మాట్లాడలేదంటే రిమోట్‌ కంట్రోల్లో ఉన్నారు గనుక అని కొందరు చెప్పారు. మరి నరేంద్ర మోడీ అలాకాదే ! ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా పెద్ద మౌన మునిలా ఉంటున్నారు. తన సేనలను ఉసిగొల్పుతారు. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడితే మోడీ మంచి వారే మంత్రులకే నోరుకుదరటం లేదు అనిపిస్తారు. అదొక ఎత్తుగడ అన్నది స్పష్టం. అంతర్జాతీయంగా పరువుపోతున్న అంశాలే కాదు, దేశీయంగానూ ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా అనేక అంశాలపై మౌనం. బిజెపి నేతలకు మన్మోహన్‌ సింగ్‌కు మౌనముని అని పేరు పెట్టి నిందించారు. అది తనకూ వర్తిస్తుందని తెలిసినా ఆ వైఖరికి తనకు నష్టం కంటే లాభాన్నే కలిగిస్తుందని భావిస్తున్నారు. తాను మీడియాకు జవాబుదారీ కాదు, ఏదైనా ఉంటే జనానికే చెబుతా అనే సందేశాన్ని జనంలో చొప్పించేందుకు విలేకర్లతో మాట్లాడటమే మానుకున్నారు.నిపుణులు రూపొందించిన కొన్ని పధకాల్లో భాగంగా చేసిన అనేక విన్యాసాలను దేశం చూసింది. ఎంపిక చేసిన విలేకర్లతో, ఎంపిక చేసిన ప్రశ్నలతో ఎంపిక చేసిన పద్దతిలో మాట్లాడటం కూడా దానిలో భాగమే. అంతే కాదు, ప్రధాని నరేంద్రమోడీ పనిలో ఉన్నారు. అనవసర ప్రశ్నలతో విలేకర్లు దాన్ని చెడగొట్టవద్దు అనే సందేశం ఇస్తున్నారు. మోడీ స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడాదికి సగటున 22 సార్లు విలేకర్లతో మాట్లాడితే జోబైడెన్‌ ఇంతరకు 15నెలల కాలంలో 11 సార్లు మాట్లాడాడు. ఇవి అధికారిక సమావేశాలు, ఇతరత్రా వేరే సందర్భాలలో మాట్లాడిన వాటిని కలిపితే ఎక్కువే ఉంటాయి వారు పనీపాటా లేక విలేకర్లతో మాట్లాడుతున్నారా ? ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఏ దేశంలోనూ ఇలాంటి ప్రజాప్రతినిధి ఇంతవరకు లేరంటే అతిశయోక్తి కాదు.


2021 సెప్టెంబరులో నరేంద్రమోడీ వాషింగ్టన్‌లో జోబైడెన్‌తో భేటీ జరిపారు. ఆ సందర్భంగా విలేకర్లు వచ్చారు. అమెరికా విలేకర్ల కంటే భారతీయ విలేకరులే మెరుగు అని బైడెన్‌ అన్నాడు. అంతేకాదు మోడీవైపు చూస్తూ మీకు అంగీకారమైతే మనం వారి ప్రశ్నలకు మన సమాధానం చెప్పనవసరం లేదు, ఎందుకంటే వారు ఒక అంశం గురించి అడగరు అన్నాడు.ప్రధాని నరేంద్రమోడీని పక్కన కూర్చో పెట్టుకొని తమ మీడియాను కించపరిచాడు. అసలు మోడీగారు ప్రధానిగా ఉన్నంతవరకు మీడియాతో మాట్లాడనని భారత, గోమాతల మీద ఒట్టు వేసిన లేదా ఆత్మసాక్షిగా శపధం చేసిన సంగతి బైడెన్‌కు తెలిసి ఉండదు. దేశం వణుకుతున్నదని అంటే ఎందుకు స్పందించటం లేని ప్రశ్నించుకొనే వారికి విసుగు పుట్టి ఆలోచించటం మానుకోవాలే తప్ప మోడీ మాట్లాడరని తేలిపోయింది. అమెరికా రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలా అని ఎవరైనా అనవచ్చు, ఇక్కడ రెచ్చిపోవటం కాదు, మనకూ 56అంగుళాల ఛాతీ ఉందన్న సందేశం అన్నవారికి ఇవ్వాలా వద్దా ? ఇక్కడ వైపరీత్యం ఏమంటే సంఘపరివార్‌ బిజెపితో సహా దాని అనుబంధ సంస్దలేవీ మాట్లాడలేదు. వాటికి పెద్దన్న జో బైడెన్‌ అంటే వణుకుపుడుతోందా అని సందేహం కలిగితే తప్పుకాదు కదా !
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ – పొసగని రంగనాయకమ్మ సూత్రీకరణలు !

04 Friday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joseph v Stalin, Lenin, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా చెలగాటం భారత్‌కు ప్రాణ సంకటం : రూపాయి పతనం, చమురు, గాస్‌ ధరల పెరుగుదల !

23 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Fuel Price in India, India economy, Narendra Modi, RUSSIA, Russia-Ukraine tensions Impact on India, Ukraine war


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలోని యుద్దోన్మాద దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాద ప్రతికూల పర్యవసానాలు అనేక దేశాలను కలవరపెడుతున్నాయి.వాటిలో మన దేశం ఒకటి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన దేశం సరైన వైఖరినే వెల్లడించింది. ఈ వివాదం వలన తలెత్తే ఆర్ధిక ఇబ్బందుల గురించి మంత్రులు లేదా పాలకపార్టీల నేతలెవరూ నోరు విప్పటం లేదు. కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం పడకూడదనే. ఎంతకాలం మౌనవ్రతం పాటిస్తారు.మార్చి ఏడవతేదీతో ఆఖరు దశ పోలింగ్‌ ముగుస్తుంది, పదవ తేదీన ఫలితాలు వెలువడతాయి. వాటితో నిమిత్తం లేకుండానే గత నవంబరు నాలుగు నుంచి ఉన్న చమురు ధరల స్ధంభన ఎత్తివేసి సుప్రభాత చమురు ధరల పెరపుదలకు తిరిగి శ్రీకారం చుడతారు. ఇతర పర్యవసానాలు దాని వెంటే ఉంటాయి.


అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 99.5 డాలర్లు దాటి 2014 తరువాత కొత్త రికార్డు స్దాపించింది. ఆర్ధిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఒక డాలరుకు 75కు అటూ ఇటూగా ఉన్న విలువ రు.80కి పడిపోవచ్చని చెబుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటే సహజవాయు, నిత్యావసర వస్తువులు, లోహాలు, ఇతర వస్తువుల ధరలు మన దేశంలో కూడా పెరుగుతాయని చెబుతున్నారు. జెపి మోర్గాన్‌ చెబుతున్నదాని ప్రకారం 150 డాలర్ల వరకు ముడిచమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే ప్రపంచ జిడిపి వృద్ది రేటు కేవలం 0.9శాతానికి పడిపోతుంది. మన దేశ టోకు ధరల సూచికలో చమురు సంబంధిత ఉత్పత్తులు తొమ్మిదిశాతం ఉంటాయి. చమురుధరలు పెరిగితే ద్రవ్యోల్బణం 0.9శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపున కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ మరింత పెరుగుతుంది. ఎరువులు, వంటగాస్‌ ధరలను పెంచనట్లైతే ఆ మేరకు అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం భరిస్తుందా జనం మీదే మోపుతుందా అన్నది చూడాల్సి ఉంది. మన దిగుమతుల్లో ఒక్క చమురే నాలుగోవంతు ఉన్నందున దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మోటారు వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన పల్లాడియం అనే లోహపు ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది, ఇప్పుడు మరింతగా పెరగటం, లభ్యత సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు నాటికి రెండు సార్లు వడ్డీ రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. గతేడాది ధరల పెరుగుదలను అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఐదు, పది వంతున సెస్‌లను తగ్గించగా కొన్ని రాష్ట్రాల్లో వాట్‌ను తగ్గించారు. అప్పటికీ ఇప్పటికీ చమురు ధరల పెరుగుదల తేడా చాలా ఉంది. సెస్‌లను మరింతగా తగ్గించకపోతే ధరల పెరుగుదలను అరికట్టలేరు.


మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఎక్కువ భాగం తేలిక రకం ముడిచమురును మాత్రమే శుద్ది చేస్తాయి. రష్యా చమురు సాంద్రత ఎక్కువ కనుక మనం పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నాము. ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయినా మన దిగుమతుల్లో ఒకశాతమే కనుక ఇబ్బంది లేదు. మన అవసరాల్లో 63.4శాతం పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాము. చమురు ధరల పెరుగుదలే అసలు సమస్య.బుధవారం నాడు ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం 97.19 డాలర్లు ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో రష్యా వాటా 11-12శాతాలుగా ఉంది. దీనిలో 60శాతం చమురును ఆంక్షలను ఖాతరు చేయని చైనా, బెలారస్‌, మరికొన్ని దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.రోజుకు మూడు మిలియన్‌ పీపాల మేరకు ఆంక్షల కారణంగా సరఫరా ఉండదు. దీని వలన చమురు ధర 110 డాలర్లకు పెరుగుతుందని జోశ్యం చెబుతున్నారు.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోనుందన్న వార్తలు వాస్తవరూపం దాల్చితే ఒకటిన్నర మిలియన్‌ పీపాల చమురు అందుబాటులోకి వస్తుంది. ఐనప్పటికీ ఈ ఏడాదిలో ఎక్కువ భాగం వంద డాలర్లకంటే తగ్గదని అంటున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్ధితి విషమిస్తే 120 డాలర్లు కావచ్చు. ఏడాదికి ప్రస్తుతం 25లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జిని రష్యా నుంచి మన గెయిల్‌ దిగుమతి చేసుకుంటున్నది. ప్రస్తుతం రష్యా చమురు కంపెనీల్లో మన దేశం నుంచి 13.63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. అమెరికా, ఐరోపా ఆంక్షలు మనకూ వర్తింప చేస్తే మన సర్కార్‌ వాటికి లొంగిపోతే వాటి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న. గతంలో క్షిపణి వ్యవస్దలను కొనుగోలు చేయరాదన్న అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా కొనుగోలు చేశాము. ఇదే ఇరాన్‌ చమురు అంశంలో మోడీ సర్కార్‌ లొంగిపోయి కొనుగోలు నిలిపివేసింది.


ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరంలో మన చమురు డిమాండ్‌ 214.5 మిలియన్‌ టన్నులని అంచనా. ఇది గతేడాది కంటే 5.5శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పంచదార, ఆహారధాన్యాలు, ఇతరంగా బయో ఇంధనాన్ని భారీగా తయారు చేసి దిగుమతుల భారాన్ని తగ్గించాలని చూస్తున్నది. ధరలు పెరిగితే దాని వలన కలిగే ఆదా కూడా హరించుకుపోతుంది.2022-23లో మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉండవచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. జోశ్యాలు చెబుతున్నట్లు వంద లేదా 90 డాలర్లు ఉన్నా మన బడ్జెట్‌ అంకెలన్నీ మారిపోతాయి, లేదా జనం మీద భారాలు పెరుగుతాయి. మన దేశం నుంచి ఐరోపాకు ఎగుమతులు చేసే కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా తగ్గటాన్ని బట్టి ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మన టీ ఎగుమతుల్లో 18శాతం రష్యాకే జరుగుతున్నాయి.


ప్రస్తుతం రష్యా సోషలిస్టు దేశం కాదు, పెట్టుబడిదారీ విధానానికి మారింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా మనం అమెరికాకు దగ్గర లేదా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు చూపుతున్న తహ తహ గతంలో ఎన్నడూ లేదు. ముందే చెప్పుకున్నట్లు ఇరాన్‌, వెనెజులా చమురు కొనుగోలు అంశంలో అమెరికా వత్తిడికి లొంగిన మోడీ సర్కార్‌ ఎస్‌-400 క్షిపణి వ్యవస్దలపై ఆంక్షలను ఖాతరు చేయలేదు. గతంలో సోవియట్‌ కాలంలో, తరువాత రష్యా ఆయుధాలే మనకు ఆలంబన. ఇప్పుడు వాటిని పూర్తిగా మాని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచరణాత్మక సమస్యలు అడ్డుపడుతున్నాయి. అమెరికా తనకు పనికిరాని, ఇతర దేశాలకూ అమ్మే వాటినే మనకూ విక్రయిస్తోంది. ఎస్‌-400 వంటి క్షిపణి వ్యవస్దలు అమెరికా దగ్గర లేక కాదు, ఇవ్వటం ఇష్టం లేకనే. రష్యన్‌ ఆయుధ ఎగుమతుల్లో మనం 23శాతం దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో కొత్తవాటితో పాటు పాతవాటికి విడిభాగాలూ ఉన్నాయి. రెండు దేశాల సంబంధాలు కేవలం అమ్మకందారు-కొనుగోలు దారు మాదిరిగాక బ్రహ్మౌస్‌ వంటి ఖండాంతర క్షిపణులను రెండు దేశాలూ కలసి తయారు చేస్తున్నాయి. గతంలో మన ఇస్రోకు క్రయోజెనిక్‌ ఇంజన్ల సాంకేతిక పరిజ్ఞానం అందచేసినట్లుగానే ఇప్పుడు ఐదవ తరం ఫైటర్‌ విమానాల రూపకల్పన, వృద్ది, బహుముఖ కార్యకలాపాలకు పనికి వచ్చే విమానాల మీద కూడా రెండు దేశాలూ పని చేస్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు అమెరికాతో లేవు. ఐనా దేశభక్తులం అని నామాలు పెట్టుకున్న కొందరు అమెరికాతో అంటకాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా వైపు మనసు లాగుతున్నా రష్యా వైపు మాట్లాడకపోయినా తటస్ధత పాటిస్తున్నది మన దేశం. ఈ వైఖరిని వచ్చే రోజుల్లో అమెరికా తప్పు పట్టినా ఆశ్చర్యం లేదు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలపాలన్న ఎత్తుగడ కారణంగానే అమెరికా కాస్త తగ్గి వ్యవహరిస్తున్నది.


ప్రపంచీకరణతో ప్రపంచం ఒక గ్రామంగా మారిందని చెప్పుకుంటున్నాము. ఒక ప్రాంతంలో తలెత్తే తీవ్ర సమస్యలు మొత్తం గ్రామాన్ని ఏదో విధంగా ప్రభావితం చేయకుండా ఎలా ఉంటాయి. వసుధైక కుటుంబం అని అందరూ చెబుతున్నా ఎవరి రాజకీయాలు వారు చేయటం, స్వప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న రోజులివి. ఐరోపాలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రతిదేశాన్ని ఉలిక్కిపడేట్లు చేశాయి. వీటి ప్రభావాలు చమురు ధర వంటి తక్షణ పర్యవసానాలకు దారితీస్తే పరోక్షంగా ఏ రంగం మీద ఎంత ప్రభావం పడేది పరిస్ధితిని బట్టి మారుతుంది. వాటి తీవ్రతను వెంటనే బేరీజు వేయటం కష్టం. ఉక్రెయిన్‌ – రష్యా ఉద్రిక్తతలు ఎలా పరిష్కారమైనప్పటికీ చమురు ధరలు మన సామాన్యజనాల నడ్డి విరవటం ఖాయం. ఆర్‌టిసి, రైల్వే వంటి ప్రజారవాణా వ్యవస్దలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే డీజిలు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు భారం ప్రయాణీకుల మీద మోపటం ఖాయం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అమెరికా, రష్యా ఎత్తులకు పైఎత్తులు !

22 Tuesday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, NATO allies, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది.ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారం నాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్ధిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధినేత పుతిన్‌ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ లోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్‌ షరతు పెట్టారు.బైడెన్ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేము. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్‌, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి ? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి దళాలను పంపాలన్న పధకం ప్రస్తుతానికి లేదని ముప్పు తలెత్తితే ఆ పని చేస్తామని రష్యా ప్రకటించింది.


ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని,ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్‌ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది.2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్‌ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు.2019 జూన్‌ నుంచి డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతాపూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులను గుర్తించటం లేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారువాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్‌ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్‌, రష్యన్‌ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్‌ 2020లో రష్యన్‌ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్‌లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగెల్‌ ఒక బ్రిటన్‌ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది.1991 మార్చి ఆరవ తేదీన బాన్‌ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ” అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు ” అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్‌ సెట్జ్‌ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్‌ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది.” 2+4 సంభాషణల్లో నాటోను ఎల్‌బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని ” నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్‌జెన్‌ హ్రౌబోగ్‌ అన్నాడు.


డెర్‌ స్పీగల్‌ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాషువా షిఫ్రిన్స్‌న్‌ బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్‌ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్‌ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అన్నాడు.1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.


ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్ధిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సిఇఓ గ్రెగ్‌ హేస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్ధిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.


తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి ) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్‌ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్‌ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.


ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్ధ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.


డాంటెస్క్‌, లుహనస్క్‌ రిపబ్లిక్‌లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది.దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. ఎలాంటి కారణం లేకుండా కూడా తమ మీద ఆంక్షలు విధించటం చూశామని, దీనిలో కొత్తేముందని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. తాము స్వంతంగా కొన్ని ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా చెప్పింది. బ్రిటన్‌ కొన్ని బాంకులపై ఆంక్షలు విధించింది. సముద్రగర్భం నుంచి వేసిన గాస్‌, చమురు గొట్టపు మార్గ పధకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ పేర్కొన్నది. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గడువుల పేరుతో అమెరికా అబద్దాలు – కొనసాగుతున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తత !

20 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, Donbass, Joe Biden, Minsk agreements, NATO, RUSSIA, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా డాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్నమాటలు. ఇప్పటి వరకైతే జోబైడెన్‌ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమదేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్దోమిర్‌ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు.” ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు ? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి ,రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్టపరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా ” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్‌ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్‌ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్‌ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులు జరిపినట్లు కూడా చెబుతున్నారు.


రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్‌ ప్రభుత్వం మారణాయుధాలను గుట్టలుగా పోసి ఉంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్‌ మీద దాడి చేసింది, సద్దాంను ఉరితీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా – ఇరాక్కు, సద్దాం హుసేన్‌, వ్లదిమిర్‌ పుతిన్‌కు పోలిలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్‌ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.


ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్దం చేసేందుకు కాదు, బల ప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్‌ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్‌ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్‌ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కతలు చెప్పటం ప్రారంభించాయి. మరోవైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కుల మీద అదేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.


2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేనువేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి.దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యాసరిహద్దులో ఉన్నందున ఉక్రెయిన్‌ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి.


ఈ ఒప్పందాల అమలు గురించి కాకుండా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యామీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్‌ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.


మిన్‌స్క్‌ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ-ఉక్రెయిన్‌ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్‌ చెబుతుండగా దానికి తాము సిద్దంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్దమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యాతొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్టవేసి రోజువారి తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.


నిబంధనలు, అవగాహనలకు విరుద్దంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి.2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్‌ 460టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్‌ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు.


అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్రదేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. ” ఉక్రెయిన్‌, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాలలో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు ”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని యుద్దనావలు, రష్యాగగన తలానికి సమీపంలోని అణుబాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్‌ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్‌ ప్రాంతానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయినే ముందుగా దాడికి దిగుతుందా ? చమురు ధరల పెరుగుదలతో బలపడుతున్న రష్యా !

08 Tuesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

NATO allies, NATO war threats against Russia, RUSSIA, Ukraine attack on Donbass, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మా దేశం సోవియట్‌ కాదు – మాతో పెట్టుకోవద్దు : అమెరికాను హెచ్చరించిన చైనా రాయబారి !

01 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Qin Gang, RUSSIA, UNSC Resolution on Afghanistan, US


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్‌ యూనియన్‌ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ వాషింగ్టన్‌ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్దాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వ కూడదు.చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్‌ యూనియన్‌ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ద ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.


ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ద రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగమయ్యారు. ప్రచ్చన్న యుద్దం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒకదానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతికవేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్దనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్‌ కావచ్చు, అది ఇజ్రాయెల్‌, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికి బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50వేల మంది, దక్షిణ కొరియాలో 29వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.


మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. ” అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్‌ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది.అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్ద సలహాదారు ఫ్రాంకోయిస్‌ హెయిస్‌బర్గ్‌ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.


ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న ఆప్ఘన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు .తగినంత కసరత్తు చేసి ఏక గ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండేవిధంగా వత్తిడి చేయటం తప్ప మరొకమార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబాన్‌ రాజకీయ విభాగనేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెకజారును కలుసుకొని మన వైఖరిని వివరించారు.


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. ఆఫ్ఘన్‌ బదులు మరొక దేశాన్ని తమ స్దావరంగా మార్చుకోవాలని అమెరికా పధకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్‌ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.


భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌ దుస్ధితికి తాలిబాన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్‌ స్టేట్‌ మరియు ఉఘుర్‌ ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోషరహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. ఆఫ్ఘన్‌ ఆర్ధిక ఆస్తులను స్ధంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.


ఆఫ్ఘన్‌ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్యతా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగుదేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్దంలో అమెరికా తన ఆయుధాలను పరిక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్దారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబాన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.


ఫోర్బ్స్‌ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు(కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు.ఆప్ఘన్‌ మిలిటరీ, పోలీసులు 69వేలు, సామాన్య పౌరులు 47వేల మంది మరణించారు. ఆప్ఘన్‌ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడులక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌరజీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.


మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి ? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనేదానితో నిమిత్తం లేకుండా చైనా-రష్యా అఫ్ఘన్‌ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్‌ పరిశీలకుడు అలెగ్జాండర్‌ వి లోమనోవ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి- వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్‌ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి.దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్‌ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్దలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఆఫ్ఘన్‌ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగు పొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా,రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: