• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Supreme Court of India

నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !

02 Saturday Jul 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, nupur sharma fringe comments, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై అయ్యో పాపం అని కూడా నరేంద్ర మోడీ అనలేరా !

08 Friday Oct 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Lakhimpur Kheri killings, Narendra Modi, Navjot Singh Sidhu, Supreme Court of India, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పదివేల కోట్ల కోసం కక్కుర్తి – స్వయంగా పరువు తీసుకున్న ప్రధాని మోడీ !

09 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.

గతంలో ప్రకటించిన వాక్సిన్‌, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్‌ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్‌ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?

తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్‌ విధానంలో ఇంత షాక్‌ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్‌ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?

మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్‌ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్‌ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్‌ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్‌ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్‌ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్‌ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?

ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్‌ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?

ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్‌ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్‌ నుంచి కూడా అలాంటి డిమాండ్‌ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్‌ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?

నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.

కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్‌ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.

ఆత్మనిర్భర పాకేజ్‌ కింద మేడిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్‌ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్‌ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్‌ విదేశీ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?

వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్‌ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్‌ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.

గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్‌ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?

గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్‌ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్‌ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ, బిజెపిని వణికిస్తున్న ” టూల్‌కిట్లు ” -సరఫరాదారుగా న్యాయవ్యవస్ధ ?

04 Friday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP dangerous toolkits, Congress Toolkit case, Judiciary Activism, Supreme Court of India, Toolkits


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడిలో అన్నీ విజయాలే అన్న మాటలు జనానికి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. వంది మాగధులు కూడా పొగిడేందుకు వెనుకా ముందూ చూశారు. ఏడు సంవత్సరాలకు ముందు- ఏడు సంవత్సరాల తరువాత ఏమిటని ఎవరైనా పోల్చుకున్నారా ? కాస్త నిదానంగా ఆలోచించండి. కాంగ్రెస్‌ గురించి 2014కు ముందు బిజెపి మీడియా వారికి, పార్టీ ప్రచారదళాలకు ఇచ్చిన టూల్‌కిట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే పార్టీని టూల్‌కిట్లు గజగజ వణికిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏడేండ్ల నరేంద్రమోడీ పాలనలో మిగతావన్నీ దిగజారుతుంటే ఇవి ఏటికేడు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం స్వయంగా బిజెపి పార్టీ, సర్కార్‌ తయారు చేస్తున్నవే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలను విమర్శించటం దేశద్రోహంగా భావిస్తున్న రోజుల్లో ఈ టూల్‌కిట్లకు న్యాయవ్యవస్ధలో వెలువడుతున్న తీవ్ర వ్యాఖ్యలు మరింతగా పదును పెడుతున్నాయా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వ పరువు తీశారంటూ దిశ రవి అనే యువతి మీద రైతు ఉద్యమం గురించి టూల్‌కిట్‌ కేసు వేశారు. వివాహ సమయాల్లో పెళ్లికూతుళ్లకు పంపే మేకప్‌కిట్‌ గురించి, సుత్తీ, రెంచీలు, స్క్రూడ్రైవర్ల వంటి చిన్న పరికరాలు ఉండే దానిని టూల్‌ బాక్సు, కిట్‌ అంటారని తెలుసుగానీ మీడియా టూల్‌కిట్‌లో ఏముంటాయో తెలియక, ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో అని చాలా మంది మధనపడ్డారు. కానీ బిజెపి వారు దిశ రవి కేసుతో తెలియని వారికి అవేమిటో తెలియ చేశారు.జనానికి విజ్ఞానం పంచారు.


తరువాత తమ నేత నరేంద్రమోడీ, ప్రభుత్వాన్ని బదనామ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ టూల్‌కిట్లను పంపిణీ చేసిందని బిజెపి నేతలు ఆరోపించారు. చివరికి అది వారికే ఎదురు తన్నింది, పరువు తీసింది. దాంతో దాని వ్యూహకర్తలకు చెప్పుకోరాని చోట దెబ్బ తగిలింది. మా పేరుతో బిజెపి రూపొందించిన టూల్‌కిట్‌ అని కాంగ్రెస్‌ ఎదురు కేసు పెట్టింది. దాంతో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌కు సంబంధించి బిజెపి నేతలు చేసిన ట్వీట్లకు మానిప్యులేటెడ్‌ మీడియా(మోసపుచ్చే సమాచారం) అని ట్విటర్‌ కంపెనీ ముద్రవేసి దేశ, విదేశీయులకు ఒకటూల్‌ కిట్‌ అందించింది. దీని అర్ధం ఏమంటే బిజెపి వారు చేసే ట్వీట్లు మోసపుచ్చేవి సుమా మీరు జాగ్రత్త అని చెప్పటమే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదే. ఆ ముద్రను చెరిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ కంపెనీ మీద పోలీసులతో దాడి చేయించి భయపెట్టింది. ఇది మరింత పరువు తీసింది.


ఏడు సంవత్సరాలకు ముందు బిజెపి టూల్‌కిట్‌లో గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, అచ్చేదిన్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. అధికారానికి వచ్చిన తరువాత మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా తోడయ్యాయి. ఏడు సంవత్సరాల తరువాత చూస్తే టూల్‌కిట్‌లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే చిత్రం ఏమంటే ప్రపంచానికి, ప్రతిపక్షాలకు, ప్రచార, ప్రసార సాధనాలకు స్వయంగా ప్రభుత్వంతో పాటు కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్ధ కూడా టూలుకిట్లు ఎలా అందించగలదో దాదాపు ప్రతి రోజూ చూస్తున్నాం.దిశ రవి ఒక సాధారణ యువతి, ఏమీ చేయలేదని కేసు దాఖలు చేశారు గానీ న్యాయమూర్తుల మీద కూడా పెడతారా ?


లోపభూయిష్టమైన వెంటిలేటర్లతో రోగుల మీద ప్రయోగాలు చేయవద్దని, వాటిని తాము అంగీకరించబోమని బొంబాయి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదీ కరోనా వైఫల్యాల టూల్‌కిట్టులో చేరింది. ఇదే వ్యాఖ్యను ప్రతిపక్ష పార్టీలు గనుక చేసి ఉంటే ఈ పాటికి కాషాయ దళాలు ఎలా రెచ్చిపోయి ఉండేవో తెలిసిందే. పిఎం కేర్‌ నిధులకు దాతలు ఉదారంగా నిధులు ఇస్తే వాటితో పనికి రాని వెంటిలేటర్లు కొనుగోలు చేయటం వెనుక అవినీతి, అక్రమాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా ? అలాంటి నాసిరకం పరికరాలను రోగులకు అమర్చితే వారి ప్రాణాలు హరీమంటే దాన్ని హత్య అనాలా, స్వర్గానికి పంపారనుకోవాలా ? ఆ పుణ్యం ప్రధాని మోడీ ఖాతాలోనే వేయాలి, ఎందుకంటే ప్రధాని పేరుతోనే కదా కొనుగోలు చేస్తున్నది ! బొంబాయిహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు అర్దం ఏమిటి ? మరట్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు నాసిరకం వెంటిలేటర్ల సరఫరా గురించి వచ్చిన వార్తల మీద ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరట్వాడా ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు పంపిన 150 వెంటిలేటర్లలో 113 లోపభూయిష్టమైనవని బయటపడింది. మిగిలిన 37ను ఆసుపత్రుల వారు అసలు రవాణా చేసిన డబ్బాల నుంచి బయటకు తీయనేలేదు. మే 28వ తేదీన ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. వెంటిలేటర్లను మామూలుగా పని చేసేట్లు చూస్తామని, వేటిలో అయినా లోపాలుంటే తొలగిస్తామని పేర్కొన్నది. అయితే ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డిఆర్‌ కాలే మే 29వ తేదీన ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వెంటిలేటర్ల పనితీరు నమోదు చేసిన అంశాలను కోర్టుకు సమర్పిస్తూ మరమ్మతులు చేసిన తరువాత కూడా అవి సరిగా పని చేయటం లేదని పేర్కొన్నారు. సిబ్బందికి వాటిని పని చేయించటం తెలియదన్న కేంద్ర వాదనను తిప్పికొట్టారు. వాటిని గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సిఎన్‌సి అనే కంపెనీ సరఫరా చేసింది. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వైద్యులను పంపి పరిశీలించిన తరువాత లోపాలుంటే తయారీదారును బాధ్యులను చేస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము పూర్తిగా సంతృప్తి చెందేంత వరకు వాటిని వినియోగించబోమని అలాంటి వాటితో తీవ్ర ముప్పు ఉంటుందని మహారాష్ట్ర న్యాయవాది చెప్పారు. ఈ వాదనల తరువాత న్యాయమూర్తులు పైన పేర్కొన్న వ్యాఖ్యలను చేశారు. ఇది ప్రతిపక్షాల విమర్శలకు ప్రాతిపదిక అవుతుందా లేదా ? ఈ ఆయుధాన్ని ఎవరిచ్చారు, దానికి మూలం ఎవరు ? దీన్ని కుంభకోణం అనక ఏమంటారు ?


కేంద్ర ప్రభుత్వ వాక్సినేషన్‌ విధానం గురించి సాక్షాత్తూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన విషయాన్ని చెప్పుకోనవసరం లేదు. మూడు ధరల విధానం గురించి ప్రతిపక్షాలు విమర్శించాయంటే రాజకీయం అనుకుందాం, సుప్రీం కోర్టు సంగతేమిటి ? దేశంలో వేస్తున్న వాక్సిన్‌ ధరలు-విదేశాల్లో వాటి ధరలను పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందా లేదా ? వాక్సిన్లకోసం 35వేల కోట్లు కేటాయించినట్లు మోడీ సర్కార్‌ పెద్ద ప్రచార ఆయుధంగా వాడుకుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీసింది. ఇప్పటి వరకు వాక్సిన్లను ఏ రోజు ఎన్ని కొన్నారో చెప్పమంది, ఆ మొత్తంతో 18-45 సంవత్సరాల వయస్సు వారికి వాక్సిన్లు ఎందుకు వేయకూడదో వివరించాలంది ? ఈ వివరాలన్నింటినీ సుప్రీం కోర్టు ముందు కూడా మూసిపెడుతుందా ? అంతకు ముందు ప్రతిపక్షాలు ఇదే డిమాండ్‌ చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. ఇది మీడియా, ప్రతిపక్షాలకు, అన్నింటికీ మించి అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసే ఆయుధం కాదా ? అంతకు ముందు ఆక్సిజన్‌ సరఫరా విధానం లేదంటూ తానే ఒక కమిటీని వేసిన తీరు తెలిసిందే. మోడీ, బిజెపి విమర్శకులకు ఇవన్నీ బహిరంగంగా అందుతున్న ఆయుధాలు కావా ? టూల్‌ కిట్స్‌ కాదా ?వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసిన వ్యాఖ్యలన్నింటినీ గుదిగుచ్చి చూస్తే తేలుతున్నదేమిటి ? గతంలో కాంగ్రెస్‌ తన విధానాలు, తీరుతెన్నులతో తానే ప్రతిపక్షాలకు టూల్‌కిట్లు అందించింది. ఇప్పుడు బిజెపి అదే బాటలో నడుస్తున్నది.

వాక్సిన్‌ విధానం గురించి రాష్ట్రాలు తీసుకోవాల్సిన వైఖరుల గురించి కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా టూల్‌కిట్లే. వాటి తయారీకి ముడి పదార్దాన్ని అందించిది నరేంద్రమోడీ సర్కారే కదా ! ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శిస్తాయి, బిజెపి ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతారు. పది సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన తీర్మానం పేరు ” మన సమాఖ్యవాదానికి పెను ముప్పు యుపిఏ ”. దానిలో ఏమి రాశారు ? రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నది, గవర్నర్లను రాజకీయకీయ ఏజంట్లుగా పని చేయిస్తున్నది. కాంగ్రెసేతర రాష్ట్రాలు చెబుతున్నదానిని ఆమోదించటం లేదు. ఇలా సాగింది, దానిలో నూటికి నూరు పాళ్లు వాస్తవం ఉన్నది.

కానీ ఇప్పుడు అదే నరేంద్రమోడీ చేస్తున్నది ఏమిటి ? ఆ కాంగ్రెస్‌ చెప్పుల్లోనే కాళ్లు దూర్చి అంతకంటే ఎక్కువ చేస్తున్నారా లేదా ? ఇదీ టూలుకిట్టే, ప్రతిపక్షాలకు ఇచ్చిందెవరు ? కేరళ గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ చేస్తున్న రాజకీయం చూస్తున్నాం. మహారాష్ట్ర గవర్నర్‌ రాజకీయాన్ని ఎలా రక్తి కట్టించారో చూశాము. తమ ఆదేశాలను ఖాతరు చేయలేదని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శిని కేంద్రానికి రావాలని ఫర్మానా జారీ చేశారు. ప్రధాని మోడీ తమ మాటలు వినటం లేదని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌ బహిరంగంగానే చెప్పారు. మంత్రులను పక్కన పెట్టి తమ రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడటం ఏమిటంటూ తమిళనాడు సర్కార్‌ ఆ సమావేశాన్నే బహిష్కరించింది. వైద్య, ఆరోగ్య విషయాలు రాష్ట్రాలకు సంబంధించినవి అని బిజెపి నేతలు ఎలుగెత్తి చాటుతున్న సమయంలోనే ఇది జరిగింది. విద్య రాష్ట్రాల అంశం కాదా ? కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ చేసిందేమిటి ? డిఎంకెకు టూల్‌కిట్‌ అందించట కాదా ?


కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో దాదాపు అందరూ ముస్లింలే ఉన్నారు. గుజరాత్‌ వివాదాస్పద బిజెపి రాజకీయ నేత ప్రఫుల్‌ పటేల్‌ను దాని సామంతుడిగా నియమించి అక్కడ చిచ్చు పెట్టారు. చివరికి స్ధానిక బిజెపి నేతలకే అది నచ్చక అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. జిఎస్‌టి నుంచి కోవిడ్‌-19 అత్యవసరాలను మినహాయించాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రులు కమిటీలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు బిజెపి అందించిన టూల్‌కిట్స్‌ కాదా ?


సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కేంద్రంలో ఉన్న బిజెపి లేదా రాష్ట్రాలలో ఉన్న బిజెపి, ఇతర పార్టీలకు చురకలు, అభిశంసనల వంటివే. అయితే గతంలో ఇదే న్యాయవ్యవస్దలో వెలువడిన తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను మరచిపోకూడదు. భారత్‌, అమెరికా, చైనా, పాకిస్ధాన్‌ రాజ్యాంగాలు ఏవైనా అక్కడ ఉన్న న్యాయవ్యవస్ధలు పాలకవర్గాలకు అనుకూలంగా పని చేసేవే అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. చైనాలో కార్మికవర్గ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ వర్గానికి అనుకూలంగా అక్కడి వ్యవస్ధ ఉంటుంది. మిగతా దేశాలలో పాలకవర్గాలు పెట్టుబడిదారులు కనుక వాటికి అనుకూలంగా న్యాయవ్యవస్దలు ఉంటాయి. కొన్ని అంశాల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం అంటే పుట్టి మునుగుతుంది జాగ్రత్త పడమనే హెచ్చరిక అని ఎందుకు అనుకోకూడదు. గాంధీ పుట్టిన దేశంలోనే గాడ్సే కూడా పుట్టాడు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా పొగిడిన నోటితోనే ఆ రాజ్యాంగాన్నే దెబ్బతీసే శక్తులను భక్తితో కొలిచే ప్రబుద్దులను చూస్తున్నాము.

న్యాయవ్యవస్ధకు మొత్తంగా దురుద్దేశ్యాన్ని ఆపాదించటం లేదు. పాలనా విధానాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అందువలన ఆ వ్యవస్ధలోని వారి తీరు తెన్నులను విమర్శనాత్మకంగా చూడక తప్పదు. పైన చెప్పుకున్న న్యాయమూర్తుల వ్యాఖ్యలు, కోర్టుల నిర్ణయాలు నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూడకపోతే ఇబ్బందుల్లో పడతాము. రాజ్యాంగ పదవుల్లో, రక్షణలతో ఉన్న వారు రాజకీయ నేతలను పొగడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి. పదవీ విరమణ చేయగానే ఎంపీ నామినేషన్‌ పోస్టును తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి గొగోరు న్యాయవ్యవస్ధకు, సమాజానికి ఎలాంటి సందేశమిచ్చారు. సుప్రీం కోర్టు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా 2020లో అంతర్జాతీయ న్యాయ సమావేశంలో మాట్లాడుతూ ” ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన దార్శనికుడు, ప్రపంచ దృష్టితో ఆలోచిస్తూ స్ధానికంగా పని చేసే బహుముఖ ప్రజ్ఞాశాలి ” అని ప్రశంసలు కురిపించారు. ఆ సమావేశంలో ఇరవై దేశాలకు చెందిన న్యాయమూర్తులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఉన్నారు.( అలాంటి ప్రజ్ఞాశాలి కరోనా విషయంలో ఏం చేశారో యావత్‌ ప్రపంచం చూస్తున్నది) ఒక స్వతంత్ర వ్యవస్ధలో ఉన్నత స్ధానంలో ఉన్న వారే అలా పొగిడి ఎలాంటి సందేశాన్ని జనానికి పంపినట్లు ? అంతకు ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి తరువాత పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంఆర్‌ షా చెప్పిందేమిటి ? ” మోడీ ఒక ఆదర్శం, ఒక హీరో ” అన్నారు.


అధికారంలో ఉన్న వారిని పొగడటం ప్రయోజనాలు పొందటం నరేంద్రమోడీ హయాం కంటే ముందే కాంగ్రెస్‌ పాలనలోనే ప్రారంభమైంది.1980 ఎన్నికల్లో విజయం సాధించగానే ఇందిరా గాంధీని పొగుడుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పిఎన్‌ భగవతి ఒక లేఖ రాశారు. అత్యవసర సమయాల్లో పౌరుల ప్రాధమిక హక్కులను తీసివేయవచ్చని ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ కేసులో మెజారిటీ తీర్పు ఇచ్చిన వారిలో భగవతి ఒకరు . ఆ కేసులో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా అసమ్మతి తీర్పు రాశారు. దానికి గాను ఆయనకు రావాల్సిన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కలేదు. దానికి నిరసనగా ఆయన న్యాయమూర్తి పదవికి 1977లో రాజీనామా చేశారు. మరోవైపున ముగ్గురు న్యాయమూర్తుల సీనియారిటీని పక్కన పెట్టి భగవతిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. రాజకీయ నేతలను పొగిడే న్యాయమూర్తులకు ఇవన్నీ తెలియవా, ప్రభావితం చేయవా ? అలాంటి వారు పక్షపాతం లేని తీర్పులు ఇస్తారంటే జనం నమ్ముతారా ? న్యాయవ్యవస్ధ మీద నమ్మకం ఉంటుందా ? ఇప్పటికే మూడు రాజ్యాంగ వ్యవస్ధలోని కార్యనిర్వాహక వ్యవస్దను, శాసనవ్యవస్ధలను ఎలా నీరుగారుస్తున్నారో చూస్తున్నాము. న్యాయవ్యవస్ధను కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. పురుషులందరు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా న్యాయమూర్తులలో కూడా తేడాలున్నాయని ముందే చెప్పుకున్నాము. అదే పాలకులకు నచ్చదని కరోనా వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న న్యాయమూర్తుల మీద మింగా కక్కలేకుండా ఉన్న పాలకులను చూస్తున్నాము. తమ పీఠాలకు ముప్పు అనుకుంటే న్యాయవ్యవస్దను కూడా ఎలా దిగజారుస్తారో లాటిన్‌ అమెరికాతో సహా అనేక దేశాల్లో చూశాము. అలాంటి పరిస్ధితే మన దేశం కూడా రానుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు వ్యవహారం : న్యాయవ్యవస్ధ తీరుతెన్నులపై మరో వివాదం !

14 Saturday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arnab-Goswami-bail, JUDICIARY, Kunal Kamra, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు మంజూరు తీరు తెన్నులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ విదూషకుడు(కమెడియన్‌) కునాల్‌ కమ్రా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శుక్రవారం నాడు ప్రకటించారు. మరోవైపున కుమ్రాపై చర్య తీసుకోవాలని కోరుతూ అనేక మంది న్యాయవాదులు, న్యాయ విద్యార్ధులు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్ధానం వాటిని ఏమి చేయనుందనే ఆసక్తి దేశంలోనూ, వెలుపలా నెలకొన్నది. కునాల్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టు దిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అనేక మంది చేసిన వినతికి అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సమ్మతి తెలిపిన ఒక రోజు తరువాత కునాల్‌ తన వైఖరిని బహిరంగంగా వెల్లడించారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవటం లేదా క్షమాపక్షణ గానీ చెప్పేది లేదన్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ ఈ ఉదంతం మరోమారు సుప్రీం కోర్టు జనం నోళ్లలో నానేందుకు దారితీసింది. ఆర్నాబ్‌ వ్యవహారం వెనక్కు పోయి సుప్రీం కోర్టు-భావ ప్రకటనా స్వేచ్చ అంశం ముందుకు వచ్చింది. మీడియా విస్తరణ కారణంగా ఎన్నడూ లేని విధంగా సామాన్యులలో సైతం ఈ అంశాలు చర్చకు దారితీయనున్నాయి.


ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, తీర్పుల గురించి వెలువడుతున్న వ్యాఖ్యలు, విమర్శల మీద సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించకూడదు గానీ వారిచ్చిన తీర్పులపై మంచి చెడ్డల చర్చ, విమర్శలు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అంశాలు, తీర్పులు, బెయిలు మంజూరు సందర్భాలలో కొందరు న్యాయమూర్తుల తీరుతెన్నులు, వ్యాఖ్యలు ఆ హద్దును కూడా చెరిపి వేస్తున్న నేపధ్యంలో ఈ అంశాలను చూడాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పరిధి,పరిమితుల మీద మరింతగా మరోమారు స్పష్టత రానుంది.
ఆర్నాబ్‌ గురించేగాక ఇతరుల వ్యక్తిగత స్వేచ్చ అంశాలపై సుప్రీం కోర్టు మౌనాన్ని విమర్శించకుండా వదలకూడదు కనుక నా వైఖరిలో ఎలాంటి మార్పులేదని కునాల్‌ మరోమారు స్పష్టం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జమ్మూ-కాశ్మీర్‌ ప్రత్యేక హౌదా రద్దు,ఎన్నికల బాండ్ల చట్టబద్దత లేదా ఇతర అనేక ముఖ్య అంశాలకు సమయాన్ని,దృష్టి సారించాల్సి ఉందని కూడా సుప్రీం కోర్టుకు సూచన చేశారు. సుప్రీం కోర్టు,న్యాయమూర్తులకు సంబంధించిన ధిక్కార అంశాలపై చర్యలు తీసుకోవాలని మూడవ పక్షం కోరేందుకు నిబంధనల ప్రకారం తొలుత అటార్నీ జనరల్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో ధైర్యంగా, అడ్డగోలుగా ఉన్నత న్యాయస్దానాన్ని, దాని న్యాయమూర్తులను విమర్శించవచ్చని జనాలు నమ్ముతున్నారు, అయితే అది ధిక్కార చట్టానికి పరిమితుల్లోనే ఉంటుందని వాటిని దాటితే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అర్ధం చేసుకోవాల్సిన సమయమిదని అటార్నీ జనరల్‌ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరికీ పేచీ లేదు, విబేధించటం లేదు. తీర్పులు, వాటిని వెలువరిస్తున్న న్యాయమూర్తుల తీరుతెన్నులు ఇటీవలి కాలంలో లేవనెత్తుతున్న అంశాల సంగతేమిటన్నది జనాల ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ అంశాన్ని విస్మరించగలమా ?


దేశ ఉన్నత న్యాయస్ధానం స్వతంత్రమైనది మరియు నిష్పాక్షికమైనది కాదు, కనుక దాని న్యాయమూర్తులు కూడా అంతే అనటం మొత్తం వ్యవస్ధ మీద తీవ్రమైన నింద మోపటమే, అయితే మరోవైపు అది పాలక బిజెపి కోర్టు అని, బిజెపి ప్రయోజనాలకే కోర్టు ఉన్నదని ఆరోపిస్తున్నారంటూ అటార్నీ జనరల్‌ కునాల్‌ ట్వీట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్‌ ఎన్‌వి రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల మీద తీవ్రమైన ఫిర్యాదులే చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి, సిఎం ప్రధాన సలహాదారు మీద కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతి కోరిన న్యాయవాదికి రాసిన లేఖలో ఈ అంశం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున తాను అనుమతి ఇవ్వటం లేదని, ఎవరైనా నేరుగా చర్యలకు ఉపక్రమించవచ్చని అటార్నీ జనరల్‌ చెప్పిన విషయం తెలిసిందే. అక్టోబరు ఆరవ తేదీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సలహాదారు అజరు కల్లం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఐదు వారాలు గడిచినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ లేఖను ఏమి చేసిందీ తెలియదు.దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటం, అది సంచలనం సృష్టించినదాని మీద ఏ చర్య తీసుకుంటారన్నది జనంలో సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి తన రిపబ్లిక్‌ టీవీ స్టూడియో కోసం చేయించుకున్న పనికిగాను డబ్బు ఎగవేశారన్న ఆవేదనతో ఆర్కిటెక్ట్‌ అనవ్‌ నాయక్‌ 2018లో ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ సందర్భంగా రాసిన లేఖలో ఆర్నాబ్‌ చెల్లించాల్సిన డబ్బు గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఆత్మహత్యకు ఆర్నాబే బాధ్యుడనే ఆరోపణను గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి-శివసేన ప్రభుత్వం తిరస్కరించి కేసును మూసివేసింది. ఇటీవల శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం దానిని తిరిగి విచారణకు చేపట్టి అర్నాబ్‌ను అరెస్టు చేసింది. బోంబే హైకోర్టు ఈ కేసులో బెయిల్‌ను తిరస్కరించి సెషన్స్‌ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆర్నాబ్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇద్దరు సభ్యులు సుప్రీం కోర్టు బెంచ్‌ విచారించి బెయిలు మంజూరు చేసింది.హైకోర్టును తప్పు పడుతూ వ్యక్తిగత స్వేచ్చ రక్షణకు హైకోర్టులు తమ పరిధిని వినియోగించాలని న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తన జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేశారని ఆర్నాబ్‌ కోర్టులో చేసిన వినతిని గమనంలో ఉంచుకొని చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు.


సుప్రీం కోర్టు తీరు తెన్నులపై సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత దవే వ్యాఖ్యానిస్తూ వేలాది మంది పౌరులు జైల్లో ఉండి తమ కేసులను విచారించాలని వారాలు, నెలల తరబడి వేచి చూస్తుండగా ఆర్నాబ్‌ దరఖాస్తును వెంటనే చేపట్టటం తీవ్రంగా కలచివేసేదిగా ఉందని పేర్కొన్నారు. కునాల్‌ కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇచ్చిన అటార్నీ జనరల్‌ చర్య దురదృష్టకరం, ప్రతికూల ఫలితాలనిస్తుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో న్యాయమూర్తులను బుద్ధిహీన వృద్దులు, ప్రజాశత్రువులు అని మీడియా వర్ణించినా అక్కడి సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యకు ఉపక్రమిస్తే సుప్రీం కోర్టు అపహాస్యం పాలవుతుంది.బలవంతంగా గౌరవాన్ని పొందలేరు అని పేర్కొన్నారు.
కునాల్‌ కమ్రా మీద చర్య తీసుకోనట్లయితే సామాజిక మాధ్యమంలో ఉన్న మిలియన్ల మంది తమకు లేదా అభిమానించే వారికి తీర్పులు అనుకూలంగా రానట్లయితే న్యాయమూర్తులు, కోర్టుల మీద బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయటం మొదలు పెడతారని ఏజి అనుమతి కోరిన వారిలో ఒకరైన న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధికీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పతాకం ఎగురుతూ కాషాయ రంగుతో ఉన్న సుప్రీం కోర్టు భవన చిత్రాన్ని పోస్టు చేస్తూ కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అటార్నీ జనరల్‌కు న్యాయవాదులు రాసిన లేఖల మీద కునాల్‌ కమ్రా వ్యాఖ్యానిస్తూ దీన్ని కోర్టు ధిక్కరణ అని వర్ణించవద్దు,భవిష్యత్‌లో రాజ్యసభ స్ధాన ధిక్కరణ అని చెప్పండి అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగోరు పదవీ విరమణ చేసిన తరువాత రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఈ దేశ సుప్రీం కోర్టు దేశంలో అత్యంత పెద్ద జోక్‌. ” జాతీయ ప్రాధాన్యత కలిగిన ” అంశాలపై సుప్రీం కోర్టు వేగంగా స్పందిస్తున్న తీరును చూస్తే కోర్టులలో మహాత్మాగాంధీ బొమ్మలను తొలగించి హరీష్‌ సాల్వే(అర్నాబ్‌ న్యాయవాది) చిత్రాలను పెట్టాలి. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ముందుగా వచ్చిన మొదటి తరగతి ప్రయాణీకులకు తొలుత మద్యం అందించే విమాన సహాయకుడి మాదిరి డివై చంద్రచూడ్‌ ఉన్నారు. అసలు ఎప్పుడూ విమానం ఎక్కని వారు లేదా సీట్లలో కూర్చోనివారిని వదలివేస్తారు. వెన్నెముక ఉన్న న్యాయవాదులందరూ సుప్రీం కోర్టు లేదా దాని న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడేముందు గౌరవనీయ అని సంబోధించటం మానుకోవాలి. చాలాకాలం క్రితమే ఆ భవనం నుంచి గౌరవం నిష్క్రమించింది. అని కునాల్‌ చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.


అటార్నీ జనరల్‌ తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమంలో పెద్ద చర్చకు తెరలేపింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మీద చర్యకు తిరస్కరించినపుడు ఇంత వివాదం కాలేదు. టీవీ యాంకర్‌గా అర్నాబ్‌ గోస్వామి అత్యంత వివాదాస్పదుడు, ఏకపక్షంగా వ్యవహరించటం గురించి తెలిసినవారందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ చర్చలో అతని కంటే న్యాయవ్యవస్ధ మీద కేంద్రీకృతం కావటం గమనించాల్సిన అంశం. జర్నలిజానికి సంబంధం లేని ఒక నేరంతో ప్రమేయం ఉన్న కేసులో వ్యక్తిగత స్వేచ్చ గురించి సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ స్పందనకు మూలం. సాధారణంగా ఒక బెయిలు దరఖాస్తును వేగంగా పరిష్కరిస్తే ప్రశంసలు సహజం, అర్నాబ్‌ విషయంలో దానికి భిన్నంగా జరిగింది.
హత్రాస్‌ అత్యాచారం, హత్య ఉదంతంలో వార్తలు సేకరించేందుకు ఆ గ్రామం వెళుతున్న జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసుల అక్రమంగా నిర్బంధించారు. అతన్ని విడుదల చేయాలన్న హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జర్నలిజానికి సంబంధం లేని కేసులో జర్నలిస్టు ఆర్నాబ్‌కు వెంటనే బెయిలు మంజూరు చేసింది. ఆర్నాబ్‌ పిటీషన్‌లో ఉన్న లోపాలను కూడా పట్టించుకోకుండా కోర్టు ప్రారంభమైన వెంటనే బెంచ్‌ మీద పెట్టారు.
సుప్రీం కోర్టులో బెయిలు దరఖాస్తులు ఎన్ని పరిష్కారం కాకుండా ఉన్నాయి ? ఒక దరఖాస్తు పరిష్కారానికి సగటున ఎంతవ్యవధి తీసుకుంటారు అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తానని ఒకరు ట్వీట్‌ చేశారు. కొందరు వ్యక్తుల దరఖాస్తులను అత్యవసరంగా తీసుకోవాల్సిన మరియు వ్యక్తిగత స్వేచ్చలకు రక్షణ కల్పించాల్సిన నేపధ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన ఆర్నాబ్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మనుస్మృతి ప్రకారం ఉద్దావ్‌ థాకరేను చంపివేయమని అదృష్టం కొద్దీ డివై చంద్రచూడ్‌ ఆదేశాలు జారీ చేయలేదు అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. బిజెపి+ఆర్‌ఎస్‌ఎస్‌+ఎన్నికల కమిషన్‌+సిబిఐ+ఐటి+ఇడి+న్యాయవ్యవస్ధ+ మీడియా+ఫేస్‌బుక్‌లతో మహాకూటమి ఉందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఒక ట్వీట్‌ ఉంది.


సుధా భరద్వాజ 807 రోజులు, ఆసిఫ్‌ సుల్తాన్‌ రెండు సంవత్సరాలు, షజ్రీల్‌ ఇమామ్‌ 286, మీరన్‌ హైదర్‌ 223, ఇష్రాత్‌ జహాన్‌ మరియు ఖాలిద్‌ షఫీ 255, ఆసిఫ్‌ తన్హా 178, దేవాంగ కలితా మరియు నటాషా నర్వాల్‌ 171, ఉమర్‌ ఖాలిద్‌ 58, కిషోర్‌ చంద్ర వాంగ్‌ఖెమ్‌ 30 రోజుల నుంచి జైల్లో బెయిలు దరఖాస్తులతో ఉన్నారు అని ఒకరు ట్వీట్‌ చేశారు. వీరంతా నేరాలు చేశారని, వీరిని ఆర్నాబ్‌ను ఒకే గాటన కట్టటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. నేరం రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కానప్పుడు కొందరికి సంవత్సరాల తరబడి బెయిలు నిరాకరణ, ఆర్నాబ్‌కు అంతవేగంగా ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. ఎనభైనాలుగు సంవత్సరాల పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌ స్వామి బెయిల్‌ పిటీషన్‌ ఇరవై రోజులు ఆలశ్యం చేసిన కోర్టు ఆర్నాబ్‌ విషయంలో అంతవేగంగా కదలటాన్ని ఎలా సమర్ధించుకుంటుంది ? రిపబ్లిక్‌ టీవీలో నిత్యం విద్వేష పూరిత ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్నాబ్‌ వ్యక్తిగత స్వేచ్చకు ఇతరులకు వివక్ష ఎందుకు ?


ఇటీవలి కాలంలో కొన్ని బెయిలు ఉత్తరువుల తీరు తెన్నులు విమర్శకు గురికావటం ఆర్నాబ్‌ వ్యవహారంతో ఆరంభం కాలేదని గ్రహించాలి. బిజెపి మాజీ ఎంపీ అయిన సోమ్‌ మరాండీ మరొక ఐదుగురికి ఒక కేసులో బెయిలు మంజూరు చేస్తూ వారంతా 35వేల రూపాయల చొప్పున పిఎం కేర్‌ నిధికి జమచేయాలని, ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. పిఎం కేర్‌ నిధి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర చెప్పటంతో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కరోనా పోరులో భాగంగా ఆరోగ్యసేతు యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నది కూడా తెలిసిందే. ఇదే రాష్ట్రంలో సామాజిక మాధ్యమంలో ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన రిచా భారతి ఐదు గ్రంధాలయాలకు ఖురాన్‌ పంపిణీ చేయాలని బెయిలు షరతుగా ఒక మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. బెయిలు రాజ్యాంగంలోని హక్కుల నిబంధనల మేరకు ఇవ్వాలా లేక న్యాయమూర్తుల విచక్షణ మేరకా అన్నది ప్రశ్న.

యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన జెఎన్‌యు మాజీ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్‌ మీద మోపిన కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా రాణి 27పేజీల సుదీర్ఘ బెయిలు ఉత్తరువు జారీ చేశారు. సాధారణంగా బెయిలు ఉత్తరువులు చిన్నవిగా ఉంటాయన్నది తెలిసిందే. అతని మీద మోపిన నేరం రుజువుకాక ముందే తుది తీర్పు మాదిరి బెయిలు ఉత్తరువులో అసందర్భంగా అనేక అంశాలను పేర్కొన్నారు. కన్నయ్య కుమార్‌ మీద సంఘపరివార్‌ శక్తులు చేసిన ప్రచారంలోని అనేక అంశాలలోని జాతి వ్యతిరేక ధోరణులు, సరిహద్దులను సిపాయిలు కాపాడటం-వాటికి భావ ప్రకటనా స్వేచ్చను జోడించటం వంటివన్నీ బెయిలు ఉత్తరువులో చేసుకున్నాయి.అన్నింటికీ మించి పదివేల రూపాయలను జెఎన్‌యు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే విధంగా బిజెపి నేత స్వామి చిన్మయానందపై వచ్చిన అత్యాచార కేసులో బెయిలు సందర్భంగా కూడా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి 25పేజీల ఉత్తరువులో బాధితురాలి మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారు.
ఆరు సంవత్సరాల క్రితం పూనాలో మోషిన్‌ షేక్‌ అనే ఐటి ఇంజనీర్‌ను ముగ్గురు హత్య చేశారు.వారికి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. హతుని తప్పిదం ముస్లిం కావటం, ఆకుపచ్చ రంగుచొక్కా ధరించటం, గడ్డం పెంచుకోవటం, నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత లేదు. మతం పేరుతో వారిని రెచ్చగొట్టినట్లుగా దాంతో వారు నేరానికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. దేశంలో ఫలానా రంగు చొక్కా ధరించకూడదని, గడ్డం పెంచుకోకూడదనే నిబంధనలేవీ లేవు. రెచ్చగొట్టటం లేదా రెచ్చిపోవటం అనేది ఎటు నుంచి ఎటు జరిగినా ఉత్తిపుణ్యానికే జరగవు. ఈ కేసులో నిందితులు వివాదాస్పద, విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విమర్శలు ఉన్న హిందూ రాష్ట్రీయ సేన సభలో ఉపన్యాసాలు వినేందుకు వెళ్లారన్నది వెల్లడైంది.


మావోయిస్టు సానుభూతి పరులనే పేరుతో హత్యవంటి తీవ్రనేర ఆరోపణలు లేకపోయినా, కుట్ర ఆరోపణలతో చక్రాల కుర్చీ ఉంటే తప్ప కదల్లేని అనారోగ్యంతో ఉన్న సాయిబాబా వంటి వారితో పాటు ఎనిమిది పదుల వయసున్న వరవరరావు వంటి వృద్దులకు కోర్టులు బెయిలు నిరాకరిస్తున్నాయి. గుజరాత్‌ మారణకాండలో నరోదా పాటియా ఉదంతంలో శిక్ష పడిన బిజెపి నేత మాయా కొడయానీకి అనారోగ్యం పేరుతో బెయిలు మంజూరు చేశారు. ఆ మారణకాండలోనే 33 మందిని సజీవంగా దహనం చేసిన సరదార్‌పైరా ఉదంతంలో శిక్షపడిన 13మందికి అసాధారణరీతిలో బెయిలు మంజూరు చేస్తూ గుజరాత్‌ వెలుపల సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇలాంటి ఉదంతాలలో బెయిలు నిందితులు ఎవరో చెప్పనవసరం లేదు. ఆర్నాబ్‌ గోస్వామి వ్యవహారం బహిరంగ రహస్యం. అతని అరెస్టుకు నిరసనగా బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశ్మీరులో కథువా, హత్రాస్‌ ఉదంతాలలో నిందితులు నిర్దోషులు అంటూ అదే బిజెపి నేతలు వెనుక వేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కనుకనే కోర్టులు, న్యాయమూర్తులు ఎవరికోసం ఉన్నాయి, ఎవరికోసం పని చేస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు తలెత్తుతున్నాయి. న్యాయవ్యవస్ధ కూడా దోపిడీ వర్గపు కనుసన్నలలోనే నడుస్తుందని ప్రపంచంలోని కమ్యూనిస్టుల సాధారణ అభిప్రాయం. దీనితో ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు. ఐదు దశాబ్దాల క్రితం దేశ రాజ్యాంగం మీద తమకు విశ్వాసం లేదంటూ తుపాకి పట్టిన నగ్జల్స్‌ కోర్టుల మీద విశ్వాసం లేదని తమపై మోపిన కేసుల సందర్భంగా చెప్పారు. ఒక అయిడియా మీ జీవితాన్నే మార్చి వేస్తుందన్నట్లుగా నేడు వెలువడుతున్న తీర్పులు, వాటి తీరుతెన్నులు కమ్యూనిస్టులు చెప్పేపని లేకుండానే, వారితో విబేధించేవారితో సహా అనేక మందికి న్యాయవ్యవస్ధ మీద విశ్వాసం పోతోంది. అందువలన తిరిగి దాని మీద విశ్వాసాన్ని పునరుద్దరించాలంటే ఎక్కడ ప్రారంభించాలి? విత్తు ముందా -చెట్టు ముందా ? కునాల్‌ కమ్రా వంటి వారిని శిక్షించా లేక అలాంటి వారి వ్యాఖ్యలకు తావివ్వని తీర్పులు, న్యాయమూర్తుల తీరుతోనా ? కునాల్‌ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. గతంలో ప్రశాంత భూషణ్‌ మీద వచ్చిన కేసుకు దీనికి ఎంతో తేడా ఉంది. దాఖలైన కేసును విచారణకు చేపడితే మీడియా, ఇతర అన్ని రంగాలలో మరింత తీవ్రమైన చర్చకు దారి తీయటం అనివార్యం. ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించినట్లు అది ప్రతికూల ఫలితాల నిస్తుందా లేక అటార్నీ జనరల్‌ వంటి వారు చెబుతున్నట్లు సానుకూల ఫలితాలనిస్తుందా ? మరి కొంత మందికి న్యాయవ్యవస్ధల మీద విశ్వాసాన్ని పోగొడుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

497 వివాదం పురుషుల పట్ల వివక్ష మీద- తీర్పు, చర్చ మహిళల సమానత్వం గురించి !

29 Saturday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

Adultery, adultery law, IPC section 497, Supreme Court of India

Image result for adultery law : challenged by men, ruling and discussion focused on women

ఎం కోటేశ్వరరావు

‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే ఆ కారణంగా విడాకులు కోరవచ్చు అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైది కాదు ‘ సుప్రీం కోర్టు మన శిక్షా స్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టి వేస్తూ ఇచ్చి తీర్పు సారాంశమిది. అయితే ఈ తీర్పు వివాహితుల విశృంఖలతకు, వివాహ వ్యవస్ధ విచ్చిత్తికి దోహదం చేస్తుందంటూ ఆడమగా తేడా లేకుండా కొందరి నుంచి తీవ్ర వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(ఈ రచయిత న్యాయ నిపుణుడు కాదు, కనుక పరిమితులు వున్నాయని గమనించ మనవి). న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారిచ్చే ఏ తీర్పునైనా విమర్శించ వచ్చు కనుక వారికా స్వేచ్చ వుంది. ఇక తాజా తీర్పు విషయానికి వస్తే అసలు ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తి వుద్ధేశ్యం వేరు. ఇప్పుడున్న చట్టం పురుషుల పట్ల వివక్షతో కూడుకున్నదని తన స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా ఆ వివక్షను సవాలు చేస్తూ పగబట్టిన మహిళలు, వారి భర్తల నుంచి వివాహేతర సంబంధాల విషయంలో పురుషులను రక్షించేందుకు తాను కేసు దాఖలు చేసినట్లు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైనీ చెప్పాడు. అతను ఇటలీలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై వెలువడిన తీర్పు, దాని మీద జరుగుతున్న చర్చ మహిళల సమానత్వం, ఇతర అంశాల చుట్టూ తిరగటం విశేషం.

రంకుతనం నేరపూరితమైనదిగా నిర్దేశించిన భారతీయ శిక్షా స్మృతిలోని 497వ సెక్షన్‌ చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలో రంకుతనం గురించి చెబుతున్న సెక్షన్‌ 497 ప్రకారం దానికి పాల్పడిన మహిళలను శిక్షించే అవకాశం లేదు. భర్త అంగీకారం లేకుండా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు మాత్రమే నేరం చేసినట్లుగా అది చెబుతున్నది. ఎవరైనా రంకుతనానికి పాల్పడితే భాగస్వామి ఆ కారణంగా విడాకులు కోరవచ్చు. ఈ సెక్షన్‌ భర్తను ఒక యజమానిగా పరిగణిస్తున్నదంటూ కోర్టు కొట్టి వేసింది. రంకుతనం(వివాహేతర సంబంధం) అంటే ఒక వ్యక్తి అంగీకారం లేదా చూసీచూడనట్లుగా వుంటే తప్ప అతని భార్యతో ఎవరైతే లైంగిక సంబంధం కలిగి వున్నారో దాన్ని రంకుతనంగా పరిగణిస్తారు. అటు వంటి సంబంధం అత్యాచార నేరం కిందికి రానప్పటికీ రంకుతనపు నేరస్దుడిగా పరిగణించబడతాడు. అందుకుగాను జరిమానాతో లేదా జరిమానా లేకుండా, లేదా జరిమానాతో సహా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాంటి కేసులలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిందంటూ భార్యను శిక్షించటానికి వీలు లేదు.

ఈ భాష్యం అనేక అంశాలను ముందుకు తెచ్చింది. రంకుతనం నేరంలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా వివాహిత మహిళను పరిగణించరు. అంటే రంకుతనానికి పురుషులను తప్ప మహిళలను బాధ్యురాలిగా చూడటం లేదు. వివాహంగాని ఒక మహిళ ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్‌ వర్తించదు. ముందే చెప్పినట్లు భర్త అనుమతించినా, చూసీచూడనట్లు వ్యవహరించినా ఆ రంకుతనం నేరం కాదు. రంకుతనానికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయటానికి సదరు వివాహిత మహిళ భర్తకు మాత్రమే హక్కు వుంది. సదరు పురుషుడి భార్య హక్కు గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఒక మహిళ ఒక పురుషుడికి చెందినది మాత్రమే అని, ఒక వేళ ఆమె వివాహేతర సంబంధానికి అంగీకరించినప్పటికీ ఆమెకు స్వంతంగా ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వుండవని సెక్షన్‌ పరిగణిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మరియు 15ను వుల్లంఘిస్తున్నదని అందువలన దాని మీద విచారణ జరపాలంటూ 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ముందు ఒక జోసెఫ్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది.

రాజ్యం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టపరమైన సమాన రక్షణను నిరాకరించజాలదని ఆర్టికల్‌ 14 చెబుతుండగా కుల, మత, తెగ, లింగ, పుట్టిన ప్రాంతం తదితరాలు కారణాలుగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదని ఆర్టికల్‌ 15చెబుతున్నది. జోసెఫ్‌ పిటీషన్‌ స్వీకరించిన కోర్టు 497 సెక్షన్‌ను సవాలు చేసిన తొలి పిటీషన్‌ ఇది కాదని 1954 నుంచీ సవాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి, కేసులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ప్రయాస లేకుండానే దీని గురించి నిర్ణయించవచ్చని పేర్కొన్నది. చట్టాలు లింగ సంబంధంగా తటస్ధంగా వుండాలని భావించింది. పురుషుల పట్ల వివక్ష చూపుతున్నదని పిటీషన్‌దారు వాదించాడు. ఈ పిటీషనర్‌ వాదనను అంగీకరిస్తే ఇప్పటి కంటే వివాహేతర సంబంధాలు మరింత స్వేచ్చగా చెలరేగుతాయని, దీని బదులు సంస్కరణల కమిటీ సూచించినట్లుగా ‘ మరొక వ్యక్తి భాగస్వామి లేదా మరొకరితో ఎవరు లైంగిక సంబంధాలు నెరిపినా దానిని రంకుతనంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆగస్టు ఒకటిన వాదనలు వినటం ప్రారంభించిన కోర్టు సెప్టెంబరు 27న ఆ సెక్షన్‌ చెల్లదంటూ ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది.

తీర్పు పట్ల పిటీషనర్‌ జోసెఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో కలసి పని చేస్తున్న వుద్యోగిని ఒకరు ఒకరు తప్పుడు అత్యాచార ఆరోపణ చేయటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ వుదంతం తనను పిటీషన్‌ వేసేందుకు ప్రేరేపించిందని చెప్పాడు. మహిళలు ఇష్టపూర్వకంగానే భాగస్వాములై వుండవచ్చు, కానీ భర్తలు ఫిర్యాదు చేసినపుడు సంబంధం పెట్టుకున్న పురుషుడు బాధితుడు అవుతున్నాడు. ఇలాంటి ఫిర్యాదులు దాఖలైనపుడు పురుషుడు ఒంటరి తనం ఫీలవుతాడు. తట్టుకోలేకపోవచ్చు. ఈ సెక్షన్‌ రద్దు ఒక ప్రాధమిక చర్య, అది అనేక మార్పులకు దారి తీయవచ్చు అన్నాడు. కేరళ పురుషుల్లో రంకుతనం విచ్చలవిడిగా వున్నప్పటికీ బయటకు ఖండిస్తారు అన్నాడు.

భారతీయ సంస్కృతి ఏమౌతుందో అని ఆవేదన చెందే వారు ఈ తీర్పు వివాహేతర సంబంధాలకు ఇప్పటి వరకు వున్న బంధనాలను ఛేదించి స్వేచ్చ ప్రసాదించిందని, దీన్ని అవకాశంగా తీసుకొని స్త్రీ, పురుషులు ఇక తెగబడతారని, ఇంక పెళ్లెందుకు అని ఈసడించుకుంటున్నారు. గతాన్ని ఒకసారి అవలోకించటం అవసరం. ఇక్కడ ఇతిహాసాలు, మనుస్మృతి లేదా పురాణాల వుదంతాలను ప్రస్తావిస్తున్నామంటే అర్ధం వాటిన నమ్మిలేదా అవి మంచివి అని అర్ధం కాదు. వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా వుందన్నది కాదనలేని వాస్తవం. కొన్ని సందర్భాలలో తమకు వాటంగా వుందనుకున్నపుడు వాటిని మన సంస్కృతిగా చూపుతూ రక్షణగా తీసుకోవటం, ఇష్టం లేనపుడు వాటికి విరుద్దంగా వాదించే అవకాశవాద వైఖరి మన సమాజంలో కనిపిస్తుంది. దాన్ని చెప్పేందుకే వాటి ప్రస్తావన పరిమితి. మిర్యాలగూడెం ప్రణయ్‌-అమృత వివాహ విషయాన్నే చూడండి.మిర్యాల గూడెం అమృత, ప్రణయ్‌ వివాహ వుదంతంలో తొమ్మిదో తరగతిలో ప్రేమ ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంటున్న వారు రుక్మిణిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న సమయంలో కృష్ణుడి వయసెంతో చెబుతారా ? రుక్మిణికి 13 లేదా 14, కృష్ణుడికి 14, కొన్ని పురాణాల ప్ర కారం ఎనిమిది, 16, ఆ సమయానికి కృష్ణుడు ఇంకా సెటిల్‌ కాలేదు. సీతారాముల వివాహ సమయంలో వారి వయస్సు 12-6 సంవత్సరాలట. ఆ వుదంతాలను లట్టలు వేసుకుంటూ భక్తి పారవశ్యంతో చూస్తాం. మరి దీన్నెందుకు ద్వేషిస్తున్నాం. వారు అవతారపురుషులు అనేట్లయితే, ముందే రాసి పెట్టిన దాని ప్రకారం ఎలాగూ వివాహం అవుతుంది కదా? అంత చిన్న వయస్సులో అలా చేసుకోవాల్సిన ఖర్మేం పట్టింది. మనుస్మృతిలోని ఒక శ్లోకం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన యువతి తనను చేపట్టే పెండ్లికొడుకు కోసం మూడు సంవత్సరాలు ఆగాలి. పెండ్లికొడుకులు రానపుడు ఆయువతే తనకు కావాల్సిన వాడిని చూసుకోవచ్చు.అని కామకోటి.ఓఆర్‌జిలో రాశారు.వీటన్నింటినీ చూసినపుడు చూసినపుడు ప్రణయ్‌-అమృత బాల్య వివాహం చేసుకోలేదు. చట్ట ప్రకారం వయస్సు వచ్చిన తరువాతే చేసుకున్నారు.శివుడిని తన కుమార్తె పార్వతి వివాహం చేసుకోవటం ఇష్టం లేని దక్షుడు వారిమానాన వారిని వదలి వేశాడు తప్ప శివుడ్ని చంపించేందుకు సుపారీ ఇచ్చి ఏర్పాట్లు చేయలేదే. విధి రాతను తప్పించలేం అని నమ్మేట్లయితే అందుకు విరుద్దంగా హత్య చేయించటం విధిని వెనక్కు తిప్పే ప్రయత్నమే కదా? అలాంటి మారుతీరావుకు మద్దతుగా ప్రదర్శనలు జరపటం, సామాజిక మాధ్యమాల్లో మద్దతు ప్రకటించట అంటే సమాజరీతిని వెనక్కు నడిపించాలని చూడటం తప్ప వేరు కాదు.

మహాభారతంలో పాండు రాజు ఇతరుల నుంచి పిల్లలను కనాలని కుంతిని స్వయంగా ప్రోత్సహించాడు. కుంతి తొలుత అంగీకరించలేదు. భార్య ఒక భర్తకే కట్టుబడి వుండాలన్న ఆంక్షలేవీ లేవని చెబుతాడు. ఆమె ఒకరికి పరిమితం కాకుండా ఒకరిని అనధికారికంగా ఐదుగుర్ని ఐదుగురితో అధికారికంగా కన్నదనుకోండి అది వేరే విషయం. ద్రౌపది ఆ పాండవులను ఐదుగుర్నీ భర్తలుగా చేసుకుంది. దాని వలన మన సమాజానికి హాని కలిగిందని ఎవరూ చెప్పలేదు. ఏదో ఒకసాకుతో ఆమోదించారు. వుద్ధాలకుడి కుమారుడు శేవత్‌కేతు తన తల్లి ఇతరులతో సంబంధాలను కలిగి వుండటాన్ని చూసి భార్యలు భర్తలకే పరిమితం కావాలన్న కొత్త నిబంధనను తీసుకువచ్చిన విషయమూ తెలిసిందే. భర్త చనిపోయినపుడు నియోగి విధి పేరుతో అంబిక, అంబాలిక పిల్లలను కనవచ్చని వ్యాసుడే చెప్పాడు. ఇప్పుడెవరైనా ఆ పని చేస్తే అంగీకరిస్తారా? రామాయణం విషయానికి వస్తే కొంత కాలం పరపురుషుడి పంచన వున్న ఒక మహిళ పవిత్రంగా ఎలా వుంటుందన్న మాటలు విన్న రాముడు సీత పవిత్రతను నిరూపించుకొనేందుకు అగ్ని ప్రవేశం చేయమన్న విషయం తెలిసిందే. అదే రాముడి సాయం పొందిన సుగ్రీవుడు తన భార్య రుమ వాలి చెరలో వున్నప్పటికీ ఆమె పవిత్రను నిరూపించుకోమని కోరలేదు. రాముడు కూడా దాన్ని రుద్దలేదు. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం మహిళలు పురుషుల ఆస్తులుగానే వున్నారు తప్ప వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. మనుస్మృతి ప్రకారం ఒక మహిళ ఎగువ తరగతి కులపు వ్యక్తితో సంభోగిస్తే అది శిక్షించదగిన చర్య కాదు. అదే దిగువ కులపు పురుషుడితో చేస్తే శిక్షార్హమేకాదు ఆమెను విడిగా వుంచాలి. దిగువ తరగతి పురుషుడు ఎగువ తరగతి మహిళతో సంబంధం కలిగి వుంటే అతనికి వురి శిక్ష విధించాలి. ఎవరైనా పురుషుడు (భార్యకాని) తన స్వంతకులపు మహిళతో తన ఇచ్చ తీర్చుకుంటే అతడు ఆమెకు పరిహారం చెల్లించాలి. ఈ తీరు తెన్నులను మన గత ఘన సంస్కృతి అని కీర్తిద్దామా?

ఎవరి వాదనలు వారు, ఎవరి తర్కం వారు చెప్పవచ్చు. తమకు నచ్చని భావాలను వ్యతిరేకించటం,అసహనాన్ని ప్రదర్శించవద్దు.తమ భావాలను ఇతరుల మీద రుద్ద వద్దు. సమాజం తనకు ఆటంకం కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేసి ముందుకు పోతుంది. వివాహేతర సంబంధాలు నేరాలు కావని చెప్పటమంటే అలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్లు కాదు. చట్టం వున్నప్పటికీ రోజూ జరుగుతున్న అనేక నేరాలకు అవే కారణమని మనకు తెలిసిందే. అందువలన రంకుతనం అనేది చట్టం వుంటే అదుపులో వుంటుందని లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతుందని వాదించటం అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవటం. అనేక దేశాలలో ఇలాంటి బూజుపట్టిన చట్టాలు ఎప్పుడో రద్దయ్యాయి. అక్కడ వివాహవ్యవస్ధ, కుటుంబ జీవనం లేదా, నైతిక విలువలు లేవా? ఏ సమస్య మీద అయినా మధనం జరగనివ్వండి, ఎవరికి వారిని మంచి చెడ్డలను నిర్ణయించుకోనివ్వండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాడు కన్నీరు, నేడు ఆశాభంగం, రేపు ?

17 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CJI BREAKDOWN, CJI DISAPPOINTED, CJI THAKUR, Modi, Narendra Modi, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

    తగినంత మంది న్యాయమూర్తులను నియమించకపోవటంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ న్యూఢిల్లీలో జరిగిన ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్య మంత్రుల సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని సమక్షంలో తన ఆవేదనను ఆపుకోలేక కంటతడి పెట్టిన విషయం చాలా మందికి గుర్తుండే వుంటుంది. అనూహ్యమైన ఆ పరిణామంతో కంగుతిన్న ప్రధాన మంత్రి న్యాయమూర్తుల నియామకం గురించి చర్యలు తీసుకొనే విషయం ప్రధాన న్యాయమూర్తి, ఇతరులతో మాట్లాడతానని ప్రకటించినట్లు వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అలాంటి ప్రధాని ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటం పట్ల తాను ఆశాభంగం చెందినట్లు అదే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రిని బహిరంగంగా ప్రశ్నించి మరో సంచలనానికి కారకులయ్యారు. మీడియా దీని గురించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే వేలు ప్రధాని వైపు చూపుతుంది, అది ఆయనకు ఆగ్రహం తెప్పిస్తుంది కనుక అని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్రదినోత్సవం రోజున సుప్రీం కోర్టు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.

   ‘మీరు బహుళ ప్రజాదరణ పొందిన మరియు జాతీయ వాది ప్రధాన మంత్రి ఒకటిన్నర గంటల పాటు చేసిన ప్రసంగం విన్నారు. మీరు కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడింది కూడా విన్నారు. వుపన్యాసంలో న్యాయప్రస్తావన చో టు చేసుకుంటుందేమోనని నేను కూడా ఆశించాను. న్యాయమూర్తుల నియామకం గురించి మాట్లాడతారనుకున్నాను. నేను ఈ వేదిక మీద ఒక్కటే చెప్పదలచుకున్నాను. మీరు (వేదికపై వున్న న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ను వుద్ధేశించి) దారిద్య్రాన్ని తొలగించండి, జనానికి వుపాధి కల్పించండి, జాతిని ఐక్యంగా వుంచండి మరియు పెద్ద పధకాలన్నింటినీ రూపొందించండి కానీ మన దేశ ప్రజలకు న్యాయం చేయటం గురించి కూడా ఆలోచనకు చోటివ్వండి.’ అన్నారు. ‘మీరు ఇతరుల మీద పండ్లూ, పూలూ చల్లారు, అదే విధంగా నేను కూడా వాటికోసం ఇక్కడ వేచి చూస్తున్నాను’ అంటూ ఒక వుర్దూ కవితను చదివారు.’ నా వైఖరి ఏమిటో అందరికీ స్పష్టం, కోర్టు వెలుపలా లేదా బయట అయినా నేను నా మనసులో వున్నదానిని మాట్లాడతాను. నేను ఒక వున్నత స్ధాయికి వచ్చాను, సాధించగలిగింది సాధించాను. నేను ఇంతకు మించి వున్నతికి పోయేదేమీ వుండదు. అందువలన నా మనసులో వున్నదాని గురించి నేను మాట్లాడేప్పుడు ఇతరుల గురించి ఆలోచించను, సంకోచించను. నేను ఒక మంచి మాట చెబితే అది ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది, అదే నా బలం. బ్రిటీష్‌ వారి పాలనలో ఒక కేసును ఖరారు చేయటానికి పది సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు కేసులు, వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయి. ఇదంతా మాకు కష్టంగా మారుతోంది అందుకే ఈ సమస్యల గురించి పట్టించుకొమ్మని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని చెప్పారు.

  సుప్రీం కోర్టులో పతాకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా జండా ముడి విడిపోలేదు. తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ మనం కూడా లబ్దిదారులమే,మనల్ని కూడా అడుగుతారు కానీ రవిశంకర్‌ ప్రసాద్‌గారూ ఈ ముడులను తీవ్రంగా పరిగణించండి.నేను పతాకావిష్కరణ చేయబోయినపుడు జరగాల్సిన విధంగా ముడులు విడిపో లేదు, అయినప్పటికీ ఇక్కడున్నవారందరికీ నేను ఒకటి చెప్పాలి. ఆ ముడుల గురించి ఆయన ధృఢంగా వుంటే మేము కూడా అలాగే వుంటాం. ఈ రోజు ఇక్కడ జండా ఎగుర వేయటానికి మేము ఇనుప రాడ్డును తీసి తిరిగి జండాను ఎలా అమార్చామో అంతా మీరు చూశారు’ అని కూడా పరోక్షంగా ప్రభుత్వ తీరును విమర్శించారు.

    ఈ రోజు భారత జనాభా 125 కోట్లు, దాదాపు 40శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నారు. మీరు గీచిన గీత ప్రకారం గ్రామాలలో రోజుకు రు 26, పట్టణాలలో రు.32లపైన సంపాదించిన వారంతా దారిద్య్రరేఖకు ఎగువున వున్నట్లే. కాబట్టి 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా మనం దారిద్య్రాన్ని నిర్మూలించగలమా లేదా అన్నది సవాలుగా వుంది.సుప్రీం కోర్టులో ఒక గుమస్తా వుద్యోగానికి కూడా ఒక పోస్టు గ్య్రాడ్యుయేట్‌ దరఖాస్తు చేస్తాడు. మనం దారిద్య్రం, దోపిడీ నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామో అదే నిజమైన స్వాతంత్య్రం అని ఠాకూర్‌ చెప్పారు.

    గత శుక్రవారం నాడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్బంగా జస్టిస్‌ ఠాకూర్‌ జడ్జీల నియామకం గురించి ప్రభుత్వంపై అపనమ్మక భావం కలుగుతోందని, ఈ ప్రతిష్టంభన తొలగింపునకు అవసరమైతే కోర్టు జోక్యం చేసుకొనే స్ధితికి తీసుకు వెళ్ల వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.’ వ్యవస్ధ స్థంభించేవరకు తీసుకురాకండి, న్యాయమూర్తుల నియామకంలో ఆటంకాలను మేము సహించజాలం, అది కోర్టు పనిని ఆటంకపరుస్తోంది. జవాబుదారీతనాన్ని ఇప్పుడు వేగవంతం చేస్తాం, ఎందుకీ అపనమ్మకం, ఈ ఆటంకం ఇలాగే కొనసాగేట్లయితే న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కొలీజియం మీకు పంపిన ప్రతి ఫైలు కోసం మేము అడగాల్సి వుంది అని చెప్పారు.

   న్యాయమూర్తుల కొరత కారణంగా దేశంలోని వివిధ కోర్టులలో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. మూడు దశాబ్దాల క్రితమే కనీసం నలభైవేల మంది న్యాయమూర్తులు అవసరమని లా కమిషన్‌ సిఫార్సు చేయగా ప్రస్తుతం 21వేల మంది మాత్రమే వున్నారు. దేశంలోని 24 హైకోర్టులలో 38లక్షలు, సుప్రీం కోర్టులో 60వేల కేసులు పెండింగ్‌లో వున్నాయి. జస్టిస్‌ వివి రావు ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడుతూ వివిధ కోర్టులలో వున్న 3.128 కోట్ల కేసుల విచారణ పూర్తి కావాలంటే 320 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. గత మూడు దశాబ్దాలలో న్యాయమూర్తుల సంఖ్యదేశంలో ఆరు రెట్లు పెరిగితే కేసులు పన్నెండు రెట్లు పెరిగాయి.రానున్న మూడు దశాబ్దాలలో కేసులు 15 కోట్లకు చేరితే వాటి పరిష్కారానికి 75వేల మంది న్యాయమూర్తుల అవసరం వుంటుందని ఒక అంచనా. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తుల అవసరం వుందని 1987లోనే లా కమిషన్‌ సిఫార్సు చేయగా ఆ సమయంలో పది మంది వుండగా ప్రస్తుతం మన దేశంలో 13 మంది వున్నారు. అమెరికాలో 1980 దశకంలోనే 107, బ్రిటన్‌లో 51, కెనడాలో 75 మంది చొప్పున న్యాయమూర్తులున్నారు.

   సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాని ప్రసంగంలో న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావన లేకపోవటాన్ని ప్రశ్నించటంతో అనేక మంది స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు వున్నవారి కోసం వెతుకుతున్న కారణంగానే కొలిజియం సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని ఆలశ్యం చేస్తున్నదని విమర్శించారు.

  న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించకుండా తనకు దాసులుగా వుండాలని ప్రధాని కోరుకుంటున్న కారణంగానే నియామకాలు జరపటం లేదని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.. న్యాయమూర్తులు ప్రధాని ప్రసంగాలపై వ్యాఖ్యలు చేయకూడదని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు. న్యాయం ఎంత త్వరగా అందచేయాలో అని ఆలోచించాల్సిన న్యాయమూర్తులు దానికి బదులు ఎంత త్వరగా న్యాయమూర్తులను నియమిస్తారా అని చూడకూడదని, న్యాయమూర్తుల నియామకంతోనే న్యాయం జరగదని నరేంద్రమోడీని సమర్ధించే మితవాద పత్రిక స్వరాజ్య వ్యాఖ్యాత జగన్నాధన్‌ పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘భావ ప్రకటనా స్వేచ్చ అవధులు లేని హక్కు కాదు’

16 Thursday Jun 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

defamation, Free press, fundamental rights, Media, Speaking Free, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

      భావ ప్రకటనా స్వేచ్చ అవధులు లేని హక్కు కాదు అని సుప్రీం కోర్టు 2016 మే 13వ తేదీన ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. పరువు నష్టం జరిగినపుడు భారతీయ నేర శిక్షా స్మృతి(ఐపిసి) కింద చర్యలు తీసుకోవటం సబబే అని దానిలో వున్న అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి కాదని కోర్పు పేర్కొన్నది. ఐపసిి సెక్షన్‌ 499, 500 నేరపూరిత పరువు నష్టం గురించి వివరించాయి.నేరపూరితమైన పరువు నష్టం అంటే ఏమిటో 499 వివరించగా దానిని వుల్లంఘిస్తే ఎలాంటి శిక్ష వేయాలో 500 పేర్కొన్నది. ఈ తీర్పు ప్రత్యేకించి రాజకీయవేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, జర్నలిస్టులపై ఎంతో ప్రభావం చూపే అవకాశం వుంది. న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. భావప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణలపై నేరపూరితమైన పరువు నష్టపు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని భావించలేమని, ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మరొక వ్యక్తి గౌరవహక్కుతో సమంగా వుండాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.తమిళనాడు, మహారాష్ట్రలలో బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రసంగాల ద్వారా తమ పరువు నష్టం కలిగించే నేరం చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసులపై కోర్టు విచారణ జరిపింది. వలస పాలనా కాలంలో ఆమోదించిన చట్టాన్ని ఇప్పుడు వర్తింప చేయటం అసహేతుకం, నియంత్రత్వమని, స్వతంత్ర భారత్‌లో వాటి గురించి ఎలాంటి చర్చ, రాజ్యాంగబద్దత గురించి పరీక్ష లేకుండానే కొనసాగిస్తున్నారని స్వామి, రాహుల్‌ వాదించారు. బిజెపి నేత నితిన్‌ గడ్కరీ, ఇతరులు కూడా ఇదే అంశాల ఆధారంగా ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీ వాల్‌పై కూడా కేసులు దాఖలు చేశారు. నేరమయ జాబితా నుంచి పరువు నష్టం చట్టాన్ని తొలగించాలని కక్షిదారులు వాదించారు. సామాజిక మాధ్యమం ద్వారా జనాన్ని అప్రతిష్టపాలు చేసే ధోరణి పెరుగుతున్నందున దానిని అడ్డుకునేందుకు ఐపిసిలోని సెక్షన్లు 499,500లను కొనసాగించాలని కేంద్రం సమర్ధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్చ హక్కు హామీతో పాటు ఆర్టికల్‌ 19(2) తగినన్ని రక్షణలు కల్పించటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా వున్నాయని పేర్కొన్నది. కోర్టు ఆదేశం మేరకు తన అభిప్రాయం వెలిబుచ్చిన (అమికస్‌ క్యూరీ) టిఆర్‌ అంధ్యార్జున కూడా ఈ వాదనను సమర్ధించారు. గతేడాది ఆగస్టు 13తో వాదనలు ముగిసిన తరువాత న్యాయమూర్తులు తీర్పును వాయిదా వేసి మేనెలలో వెలువరించారు. వివిధ హైకోర్టులలో పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న సుబ్రమణ్యస్వామి, రాహుల్‌ గాంధీ, అరవింద కేజ్రీవాల్‌కు ఎనిమిది వారాల గడువు ఇస్తూ ఆ కేసులను సవాలు చేయటం లేదా విచారణను ఎదుర్కోవాలని పేర్కొన్నది.

    ఇతర దేశాలలో పరువు నష్టం కేసులు సత్వరమే పరిష్కారం అవుతుండగా మన దేశంలో సంవత్సరాలు, దశాబ్దాల తరబడి కూడా కొనసాగుతున్నాయి. సెక్షన్‌ 500 ప్రకారం పరువు నష్టం కలిగించినట్లు రుజువైతే రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. భావ ప్రకటనా స్వేచ్చ దారీ తెన్నూ తెలియని వర్తమానంలో పరువు నష్టం కేసులు నేరపూరితమైన వనే అంశాన్ని, వాటి రాజ్యాంగ బద్దతను సవాలు చేయటం దేశంలో బహుశా ఇదే ప్రధమంగా జరిగిందని అనేక మంది చెబుతున్నారు. వివిధ సందర్బాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులు భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనేవిగానే వున్నాయనే అభిప్రాయం కూడా వుంది. వర్గ ప్రయోజనాలు న్యాయవ్యవస్ధను నడిపిస్తున్నాయనే అభిప్రాయం వెలిబుచ్చినందుకు గాను కమ్యూనిస్టు అగ్రనేత నంబూద్రిపాద్‌ను సుప్రీం కోర్టు శిక్షించింది. సినిమాలలో చూపే అధివాస్తవికత కారణంగా రెచ్చగొట్టినపుడు సహజంగానే తమను తాము అదుపుచేసుకోలేని భారతీయ ప్రేక్షకుల స్థితి కారణంగా సినిమాలను ముందుగానే సెన్సార్‌ చేయటం చట్టబద్దమే అని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు బసవేశ్వరపై కన్నడ రచయిత బరాగుర్‌ రామచంద్రప్ప రాసిన పుస్తకంపై నిషేధాన్ని సమర్ధిస్తూ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు ఇతరులకు లేదని కూడా ఇదే కోర్టు తీర్పు చెప్పింది. మహిళల ఆలయ ప్రవేశంపై సంప్రదాయాలు, మనో భావాలకు వ్యతిరేకంగా కోర్టులు మరోవైపు తీర్పు ఇవ్వటాన్ని కూడా చూశాము.

    భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం ఇవ్వటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా విధించింది. సమస్య. ఈ సహేతుకమైన వాటికి వ్యాఖ్యానం చెప్పటాన్ని బట్టి, అవి అనేక పరిస్థితులపై ఆధారపడి వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. గతంలో ఎన్నో పురోగామి తీర్పులు ఇచ్చిన అవే కోర్టులు తిరోగామి తీర్పులు కూడా ఇవ్వటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.

   పరువు నష్టం విషయానికి వస్తే ఒకపుడు ఐరోపాలో ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసినట్లు రుజువైతే అలాంటి వారి నాలికను కత్తిరించే శిక్ష వేసేవారు. ఇప్పుడు వాస్తవాలు చెప్పినా, విమర్శలు చేసినా పరువు నష్టం పేరుతో నోరు నొక్కేసే పరిస్థితులు ఇలాంటి తీర్పులతో వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మన కళ్ల ముందే రెండు ఎకరాలున్న ఒక వ్యక్తి రెండువేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడనుకోండి, మనలో ఒకరిగా సైకిలు మీద తిరిగిన ఒక జర్నలిస్టు ఒక పెద్ద సంస్ధకు అధిపతి, ఒక వీధి రౌడీ, రౌడీ షీటర్‌గా ఒకపుడు రికార్డులకెక్కిన వారు ప్రజా ప్రతినిధిగా, మన కళ్ల ముందే మత ఘర్షణలను రెచ్చగొట్టి మారణకాండకు కారకులైన వారు పెద్ద మనుషులు, రాజ్యాంగ బద్ద, ప్రభుత్వ పదవులకు ఎలా ఎగబాకారని, లేదా రాజధర్మాన్ని విస్మరించి మారణకాండను కొనసాగనిచ్చారని ఎవరైనా విమర్శించి ఆధారాలు చూపకపోతే పరువు నష్టం కింద శిక్షించవచ్చు. అలాంటి ఆరోపణలను ప్రచురించిన లేదా ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్య తీసుకోవచ్చు. కళ్ల ముందు కనిపిస్తున్న వాటన్నింటికీ సామాన్యులు లేదా అసామాన్యులుగాని ఆధారాలు చూపటం సాధ్యం అవుతుందా? కానపుడు మౌన ప్రేక్షకుల మాదిరిగా వుండిపోవటం తప్ప మాట్లాడకూడదు. ఇది ఎవరికి లాభం?

     ఎవరిదైనా ఒక కుక్క అదుపు తప్పి మరొకరిని కరిచిందనుకోండి దాని దాడికి గురైన వారు కుక్క యజమాని మీద కేసు వేసి పరిహారం పొందవచ్చు. ఆ డబ్బుతో బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవచ్చు.అంతటితో సమస్య పరిష్కారం అవుతుంది. పిచ్చి కుక్కల వంటి కొన్ని శక్తులు అదుపు తప్పి మారణకాండకు పాల్పడుతున్నా అధికారంలో వున్న వారు అదుపు చేసేందుకు రాజధర్మాన్ని నిర్వర్తించకుండా వదలి వేస్తే అది అనేక పర్యవసానాలకు దారితీసే సామాజిక సమస్య అవుతుంది. దానిని ఎవరైనా రాజకీయంగా విమర్శించినపుడు అది తన పరువుకు నష్టం కలిగిందని కోర్టుకు ఎక్కితే విమర్శించిన వారు ఆధారాలు చూపకపోతే వారితో పాటు విమర్శలను వెల్లడించిన మీడియాను కూడా శిక్షించటానికి వీలు కలిగింది.

     బ్రిటీష్‌ వారి వలసగా అమెరికా వున్న సమయం, 1735లో న్యూయార్క్‌ వీక్లీ అనే పత్రికలో బ్రిటీష్‌ ప్రభుత్వ ప్రతినిధిగా వున్న న్యూయార్క్‌ గవర్నర్‌ విలియం కాస్బీని విమర్శిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించారు.అది దేశద్రోహకర పరువు నష్టంగా చిత్రిస్తూ ఒక కేసును దాఖలు చేశారు. రచయితతో పాటు పత్రికను ముద్రించిన వ్యక్తిని కూడా దోషిగా నిలబెట్టారు.అయితే దానిలో వ్యాస రచయిత రాసినవన్నీ నిజాలే కావటంతో ఇద్దరూ పరువు నష్టం కేసునుంచి విముక్తి అయ్యారు. 1964లో అమెరికాలోని అలబామా రాష్ట్ర కోర్టు ఒకటి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పరువు నష్టానికి పాల్పడిందని ఒక తీర్పు ఇచ్చింది. పత్రికలో ప్రచురించిన ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌లో విద్యార్ధి పౌర హక్కుల కార్యకర్తల పట్ల అలబామా అధికార యంత్రాంగం అనుచితంగా ప్రవర్తించిందనే విమర్శ దానిలో వుంది. ఆ ప్రకటనలో కొన్ని అవాస్తవాలు వున్నప్పటికీ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.తెలిసి గానీ తెలియక గానీ వాస్తవానికి విరుద్దంగా ప్రచురించిన దాని వెనుక వున్న వాస్తవమైన దుర్బుద్ధి గురించి అధికార యంత్రాంగం సాక్ష్యాలు చూపాలని కోర్టు పేర్కొన్నది.

     బ్రిటన్‌లో మధ్య యుగాలలో పరువు నష్టాన్ని నేరపూరితమైనదిగా చేయటం ఆ నాటి పరిస్థితులలో దానిని ప్రజా ప్రయోజనాలకోసం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా తమ పరువు తీశారని భావిస్తే ఆరోజులలో ఎదుటివారితో కత్తులు, తుపాకులతో అమీతుమీ తేల్చుకొనేవారు. ఇది మధ్యయుగం కాదు, పరస్పరం తలపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతమైన పరువు నష్టం విషయంలో మాత్రమే దానిని నేరపూరితమైనదిగా చేశారు. అటువంటి వాటికి మొత్తం ప్రజానీకానికి సంబంధించిన చట్టాలను పరిష్కారంగా చేయటం ఏమిటన్నది కొందరి అభ్యంతరం. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మరొక వ్యక్తి చేసిన తప్పిదం మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన తప్పిదం ఎలా అవుతుందన్నది ప్రశ్న. పరువు నష్టానికి సంబంధించి సివిల్‌ చట్టాలుండగా నేర చట్టాల వర్తింపు అవసరం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.

    న్యూయార్క్‌ టైమ్స్‌ కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు దగ్గరగా మన సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అయితే దానిని తాజా తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదన్నది ఒక సమాచారం. ఆ కేసు వివరాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. చెన్నయ్‌ నుంచి ప్రచురితమయ్యే నక్కీరన్‌ వారపత్రిక తరఫున సంపాదకుడు, ముద్రాపకుడు, ప్రచురణకర్త, సహసంపాదకుడు కోర్టుకు ఎక్కటం విశేషం. అదే ఆర్‌ రాజగోపాల్‌-తమిళనాడు ప్రభుత్వం మధ్య నడిచిన కేసు.తమ పత్రికలో అచ్చవుతున్న సమాచారాన్ని నిలిపివేయకుండా తమిళనాడు ప్రభుత్వ అధికారులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 32 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ తరఫున పిటీషన్‌ దాఖలైంది.

     ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అటో శంకర్‌ అనే ఖైదీ ఆత్మకధ ప్రచురణ నిలిపివేయాలని కోరుతూ తమిళనాడు జైళ్ల ఐజి 1994 జూన్‌ 15న తమకు వర్తమానం పంపారని అది తమ ప్రచురణలలో జోక్యం చేసుకోవటమే కనుక నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ పిటీషనర్లు కోరారు. అనేక మంది జైలు అధికారులతో తనకు సంబంధాలు వున్నాయని, తన నేరాలలో వారు కూడా భాగస్వాములే అన్న వర్ణనలు దానిలో వున్నాయి.ఆత్మకధను ఆటో శంకర్‌ తన భార్యకు ఇచ్చాడు. అది జైలు అధికారులకు కూడా తెలుసు. దానిని ప్రచురించాలని శంకర్‌ కోరాడు. భార్య దానిని నక్కీరన్‌ పత్రికలో ప్రచురణకు అందచేసింది. మూడు భాగాలు ప్రచురితమైన తరువాత శంకర్‌ ఆత్మకధలో పేర్కొన్న అంశాలు అవాస్తవాలని,ప్రచురించటం జైళ్ల నిబంధనలకు విరుద్దం గనుక తదుపరి ప్రచురణ నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్య తీసుకుంటామని జైళ్ల ఐజి నక్కీరనన్‌ ప్రచురణ కర్తలకు తెలిపారు. దాంతో పర్యవసానాలకు భయపడిన పత్రికా నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు.తమకు ప్రచురించే హక్కుందని వాదించారు.ఈ కేసులో ఖైదీ లేదా అతని భార్య ఈ కేసులో కక్షిదారులుగా లేకపోవటంతో ఖైదీ ఆత్మకధ రాయటంగానీ దానిని ప్రచురణకు అనుమతించటం గానీ జరగలేదనే భావనతో ఆ కేసును స్వీకరించింది. ఈ కేసులో ముందుకు అంశాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. 1. ఈ దేశ నివాసి మరొక వ్యక్తి తన కధ లేదా జీవిత చరిత్రను రాయకుండా ఆపగలరా ? అనుమతి లేకుండా రాసిన రాత నివాసి యొక్కు గోప్యత హక్కును హరిస్తుందా ? మరొక నివాసి జీవితం, కార్యకలాపాల గురించి రాసిన అటువంటి అనుమతి లేని రాతలను ప్రచురించటం ఆర్టికల్‌ 19(1) ప్రకారం హామీ ఇచ్చిన పత్రికా స్వేచ్ఛకిందకు వస్తుందా ? వస్తే అది ఎంతవరకు, ఎటువంటి పరిస్థితులలో చేయవచ్చు? ఒక వేళ అటువంటి రాతలు గోప్యత హక్కుకు , పరువు నష్టం కలిగించేట్లయితే దానికి పరిష్కారాలు ఏమిటి ? 2.ప్రభుత్వం తన పరువు నష్టానికి చర్య కొనసాగించవచ్చునా ? తన అధికారుల పరువునకు భంగం కలిగించే సమాచారాన్ని ప్రచురించకుండా పత్రికలను నిరోధించేందుకు చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి వున్నదా ? ప్రభుత్వ అధికారులు తాము లేదా తమ సహచరుల పరువు పోవచ్చనే కారణంతో అటువంటి రాతలను ప్రచురించకుండా పత్రికలపై ముందుగానే ఆంక్షలు విధించవచ్చా? 3. జైలులో బందీగా వున్న ఒక ఖైదీ చట్టపరంగా పరిష్కారాలను చూసుకోలేని స్ధితిలో అతని జీవిత కథ ప్రచురణ కాకుండా జైలు అధికారులు అడ్డుకోగలరా ? అతని తరఫున వారు వ్యవహరించవచ్చా ?

     ఈ పూర్వరంగంలో ఒక అంశాన్ని ప్రచురించకుండా ముందస్తుగా ఎవరూ నిరోధించలేరు, ఏదైనా పరువు నష్టం కలిగించే అంశాలుంటే ప్రచురణ తరువాత వాటిని సవాలు చేయాలి అని భావించి ఈ కేసుకు వర్తించే కొన్ని సాధారణ సూత్రాలను కోర్టు రూపొందించింది.1.ఈ దేశ వాసులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 21లో హామీగా ఇచ్చిన జీవిత, స్వేచ్ఛా హక్కులలోనే గోప్యత హక్కు కూడా ఇమిడి వుంది. తమ మానాన తమను వదిలేయమనే హక్కు అది. ఒక నివాసి తన స్వంత గోప్యతను కాపాడుకొనే, తన కుటుంబం, వివాహం, సంతానం, మాతృత్వం, బిడ్డలను కనటం, విద్య వంటి ఇతర అంశాలలో ఆ నివాసి అనుమతి లేకుండా ఎవరూ ప్రచురించటానికి వీలమైనాలేదు. అది నిజమైనదైనా, అభినందించేది లేదా విమర్శనాత్మకమైనా ప్రచురించకూడదు. ఎవరైనా దానిని వుల్లంఘిస్తే ఒక వ్యక్తి గోప్యత హక్కును వుల్లంఘించినట్లే.నష్టపరిహారానికి అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు.అయితే ఒక వ్యక్తి స్వచ్చందంగా వివాదంలోకి దిగినా, వివాదాన్ని ఆహ్వానించినా అప్పుడు పరిస్ధితి భిన్నంగా వుంటుంది.2. పైన పేర్కొన్న నిబంధనకు మినహాయింపులు వున్నాయి. ప్రచురణలో పై అంశాలు అభ్యంతరం కానివి అయితే, అది బ హిరంగ రికార్డులను బట్టి రాసిదై వుండాలి. ఒక సారి ఈ అంశాలు బహిరంగ రికార్డులకు ఎక్కిన తరువాత ఇతరులతో పాటు పత్రికలు, మీడియాకు వాటిపై వ్యాఖ్యానించేందుకు చట్టబద్ద అంశం అవుతుంది. అయినప్పటికీ ఈ నిబంధన మర్యాద, యోగ్యతలకు లోబడే వుంటుంది. వుదాహరణకు ఒక మహిళ లైంగిక దాడి, అపహరణ, ఆటంకాల వంటి నేరాలలో బాధిత అయితే ఆ వుదంతాన్ని పత్రికలు, మీడియాలో ప్రచారం చేయటం ద్వారా ఆమె పేరుకు అప్రతిష్ట తీసుకురాకూడదు. ఈ కారణంగానే ఇలాంటి బాధితుల పేర్లు , వుదంతాల వివరాలు రాయకుండా నేరగాళ్ల పేర్లు మాత్రమే వెల్లడిస్తున్నారు.3.దీనికి మరొక మినహాయింపు కూడా వుంది, నిజానికి ఇది మినహాయింపు కంటే ఒక స్వతంత్ర నిబంధన. ప్రభుత్వ అధికారుల విషయానికి వస్తే గోప్యత హక్కు లేదా దానికి సంబంధించిన అంశాలలో నష్టం జరిగినపుడు పరిష్కరించేందుకు కేవలం వారి అధికారిక విధులు నిర్వర్తించటం ద్వారా మాత్రమే కుదరదు. వాస్తవం కాని అంశాలు, ప్రకటనలను ప్రచురించినప్పటికీ నిజం పట్ల మీడియా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు రుజువులు చూపితే తప్ప కుదరదు. అటువంటి వుదంతంలో వాస్తవాలను సహేతుకమైన తనిఖీ తరువాతనే ప్రచురించినట్లు మీడియా వ్యక్తులు రుజువు చేసుకోవాల్సి వుంటుంది. రాసినది వాస్తవమే అని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ప్రచురణ దుర్బుద్ధితో కూడినది లేదా వ్యక్తిగత ద్వేషంతో కూడినదని రుజువైతే ప్రచురణ కర్తలు సమర్ధించుకొనేందుకు ఏమీ వుండదని వేరే చెప్పనవసరం లేదు.

    రాజ్యాంగం సంక్రమింప చేసిన విధంగా కోర్టు ధిక్కరణకు పాల్పడితే శిక్షించే హక్కు కోర్టుకు, పార్లమెంట్‌, శాసనసభల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్షించే హక్కు మాదిరి ఇతర ప్రభుత్వ సంస్థలకు లేదు. ప్రభుత్వ అధికారాలను వుపయోగిస్తున్న ప్రభుత్వం, స్ధానిక సంస్ధలు, ఇతర సంస్ధలు పరువు నష్టానికి దావాలను వేయజాలవు. ముందుగా ప్రచురణలను నిలిపివేసే అధికారం రాజ్యం దాని అధికారులకు అధికారమిచ్చే చట్టం లేదు. అందువలన ప్రభుత్వ రికార్డుల నుంచి తీసుకున్న సమాచారంతో కూడిన జీవిత చరిత్రను సంబంధిత వ్యక్తుల అనుమతితో నిమిత్తం లేకుండానే ప్రచురించటానికి ప్రచురణ కర్తలకు హక్కు వున్నదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ రికార్డులలో వున్న దానికి మించి ప్రచురించినట్లయితే ఖైదీ గోప్యత హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుంది.

   ఈ తీర్పు పర్యవసానాల విషయానికి వస్తే అధికారంలో వున్న వారు ముందుగా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న వారు ఎవరైనా అధికార పక్షానికి చెందిన వారిపై అవినీతి, ఇతర ఆరోపణలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వుంటుంది. చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకుండా అవసరమైనపుడు చూపుతామని తప్పించుకుంటే కుదరదు.ఇది రాజకీయ పార్టీలు, వ్యక్తులకే కాదు మీడియాకు సైతం మెడమీద కత్తే అవుతుంది. అనేక మంది తమ పేరు బయటకు రాకుండా అనేక అంశాలను మీడియాకు తెలియచేస్తారు. వాటిని మీడియా అనధికారిక కధనాలు, వనరుల పేరుతో ప్రచురిస్తోంది. తాను సేకరించిన వార్తల వనరుల గురించి మీడియా వెల్లడించనవసరం లేదు, అయితే తాను ప్రచురించిన అంశాలు వాస్తవమే అని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ఇది ఒక్క అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాతం వంటివాటికే పరిమితం చేస్తారా ?

    బిజెపి, మజ్లిస్‌ వంటి వాటిని మతోన్మాద పార్టీలని రాజకీయ నాయకులు, మీడియా వ్యాఖ్యాతలు కూడా విమర్శిస్తున్నారు. కోర్టు ఖర్చులు తగ్గించుకొనేందుకు ఆ రెండు పార్టీలు వుమ్మడిగా ఒక లాయర్‌ను పెట్టి తమపై చేసిన విమర్శలను రుజువు చేయమని కేసులు వేస్తే పరిస్థితి ఏమిటి ? సాధుపుంగవుడిగా చెప్పబడే పార్లమెంట్‌ సభ్యుడు సాక్షి మహరాజ్‌ ఇటీవల ఒక మహిళ జీన్స్‌ బొత్తాలు విప్పితే అందరూ చూస్తుండగానే ఆమె ప్రయివేటు భాగాలు చూశారని వార్తలు వచ్చాయి. ఇక ముందు అలాంటి వార్తలను ప్రచురించటానికి, టీవీలలో చూపటానికి అవకాశం వుంటుందా ? ఈ తీర్పు పర్యవసానంగా ఆర్నాబ్‌ గోస్వామి వంటి యాంకర్లు ప్రతి రోజూ రాత్రి కాగానే జైలుకు పోవాల్సి వస్తుందని ఒక వ్యాఖ్యాత జోక్‌ వేశారు.

    ఇప్పటికే మీడియాపై దాడులు, వాటి ఆదాయ మూలాలను దెబ్బతీయటం ద్వారా తమ చేతులలో వుంచు కొనేందుకు అనేక శక్తులు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చట్టం కూడా మరొక ఆయుధంగా మారితే మరింత ప్రమాదం. రాబోయే రోజుల్లో అనేక పర్యవసానాలకు దారి తీసే సుప్రీం కోర్టు తీర్పు గురించి భావ ప్రకటనా స్వేచ్చను కోరుకొనే వారు, మీడియా నిపుణులు, జర్నలిస్టు సంఘాలు కూడా నిశితంగా అధ్యయనం చేసి అవసరమైతీ చట్టబద్దమైన పోరాటం చేయటానికి సిద్ధం కావాల్సి వుంది.

    ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాస పత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Pending Court Cases

03 Thursday Mar 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, STATES NEWS

≈ Leave a comment

Tags

Court, High Court, Pending Court Cases, Subordinate Courts, Supreme Court of India

 

Data on pendency of cases is maintained by the Supreme Court and High Courts.  As per the information made available by the Supreme Court of India, details of civil and criminal cases pending in the Supreme Court of India; and civil and criminal cases pending for more than 10 years in the Supreme Court of India; and number of cases disposed of by the Supreme Court of India during the last three years and the current year are as under:-

 

Number of Pending Cases as on 19.02.2016 Number of Cases pending for more than 10 years up to 19.02.2016. Number of Cases disposed during last three years and current year upto 19.02.2016
Civil Criminal Civil Criminal 2013 2014 2015 2016
48,418 11,050 1,132 84 40,189 45,042 47,424 6,054

 

As per information made available by High Courts, details of pending cases in High Courts and District and Subordinate Courts are as under:-

 

Number of Pending Cases in High Courts as on 31.12.2014 Number of Cases pending for more than 10 years in High Courts as on 31.12.2014 Number of Pending Cases in District and Subordinate Courts as on 31.12.2014 Number of Cases pending for more than 10 years in District and Subordinate Courts as on 31.12.2014
Civil Criminal Civil Criminal Civil Criminal Civil Criminal
3116492 1037465 589631 187999 8234281 18254124 611658 1432079

 

The details of cases disposed of during 2012, 2013 and 2014 by the High Courts and District / Subordinate Courts are given in the Statements at Annexure – I and Annexure – II respectively.

 

Some of the main factors responsible for pendency of cases in courts are increasing number of state and central legislations, accumulation of first appeals, continuation of ordinary civil jurisdiction in some of the High Courts, vacancies of Judges, appeals against orders of quasi-judicial forums going to High Courts, number of revisions / appeals, frequent adjournments, indiscriminate use of writ jurisdiction, lack of adequate arrangement to monitor, track and bunch cases for hearing.

 

The Chief Justices’ Conference held on 03rd and 04th April 2015 has resolved that each High Court shall establish an Arrears Committee to clear the backlog of cases pending for more than five years.  As per information available, Arrears Committees have been set up in the High Courts of (i) Allahabad, (ii) Bombay, (iii) Calcutta, (iv) Chhattisgarh, (v) Delhi, (vi) Himachal Pradesh, (vii) Jammu & Kashmir, (viii) Jharkhand, (ix) Kerala, (x) Madhya Pradesh, (xi) Madras, (xii) Manipur, (xiii) Meghalaya, (xiv) Orissa, (xv) Patna (xvi) Punjab & Haryana, (xvii) Sikkim, (xviii) Tripura, and (xix) Uttrakhand.

*************

ST/rs

 

Annexure-I

Pending Court Cases.

Cases disposed of in High Courts during last three years

Sl. No High Court 2012 2013 2014
Disposal of cases Disposal of cases Disposal of cases
1 Allahabad 2,47,539 2,36,821 3,10,294
2 Andhra Pradesh 66,130 58,278 66,239
3 Bombay 1,74,020 1,40,761 1,30,580
4 Calcutta 78,428 1,34,938 95,656
5 Delhi 35,656 35,371 40,154
6 Gujarat 63,778 64,450 74,444
7 Gauhati 35,713 30,308 27,467
8 Himachal Pradesh 37,772 36,455 62,270
9 Jammu &Kashmir 16,380 24,916 23,151
10 Karnataka 1,21,624 1,28,134 1,19,824
11 Kerala 78,801 68,871 72,173
12 Madras 2,46,200 2,31,817 1,29,954
13 Madhya Pradesh 1,00,281 1,11,348 1,29,373
14 Orissa 81,388 70,262 76,523
15 Patna 91,328 82,343 1,04,955
16 Punjab & Haryana 1,08,266 1,11,465 1,14,801
17 Rajasthan 1,31,277 1,27,928 83,792
18 Sikkim 126 140 230
19 Uttarakhand 13,616 15,661 13,386
20 Chhattisgarh 27,817 28,206 28,155
21 Jharkhand 30,030 25,970 22,327
22 Tripura* 0 4,379 5,144
23 Manipur* 0 2,677 1,926
24 Meghalaya* 0 1,418 1,724
Total 17,86,170 17,72,917 17,34,542

*Operationalisation of High Court was notified on 23rd March, 2013.

**********

Annexure-II

Pending Court Cases.

Cases disposed of in District and Subordinate Courts during last three years

Sl. No States 2012 2013 2014
Disposal of cases Disposal of cases Disposal of cases
1 Andhra Pradesh and Telangana 6,06,447 5,14,867 6,47,130
2 Arunachal Pradesh 7,355 7,444 7,615
3 Assam 2,39,706 3,14,672 2,76,138
4 Bihar 3,04,786 3,15,586 3,05,583
5 Chhattisgarh 1,62,104 1,79,065 1,76,144
6 Goa 33,886 30,717 30,625
7 Gujarat 10,72,123 11,37,159 11,32,433
8 Haryana 7,33,591 6,08,315 5,87,385
9 Himachal Pradesh 2,46,052 2,93,575 4,09,732
10 Jammu & Kashmir 2,91,100 3,07,192 2,97,507
11 Jharkhand 1,23,777 1,18,076 1,10,068
12 Karnataka 10,35,706 10,17,437 13,67,041
13 Kerala 11,12,342 11,71,821 13,55,926
14 Madhya Pradesh 12,17,733 12,73,437 11,13,382
15 Maharashtra 20,48,255 17,10,180 15,36,322
16 Manipur 14,572 16,189 14,257
17 Meghalaya 2,982 3,284 11,691
18 Mizoram 11,747 10,270 10,747
19 Nagaland 3,179 3,062 3,047
20 Orissa 3,00,337 4,14,772 4,70,085
21 Punjab 7,58,927 6,11,671 5,49,300
22 Rajasthan 11,50,808 11,99,745 11,32,028
23 Sikkim 1,913 2,146 2,008
24 Tamil Nadu 14,99,884 18,44,056 16,45,329
25 Tripura 1,48,688 1,58,838 1,93,003
26 Uttar Pradesh 27,98,690 29,66,521 31,82,318
27 Uttarakhand 1,78,409 2,22,318 2,20,660
28 West Bengal  and A & N Island 9,92,367 11,84,289 10,89,309
29 Chandigarh 1,38,558 1,53,772 1,80,616
30 D & N Haveli and Daman & Diu 8,451 3,344 2,771
31 Delhi 9,18,683 9,57,154 9,30,732
32 Lakshadweep 96 93 95
33 Pondicherry 33,899 32,479 28,631
Total 1,81,97,153 1,87,83,546 1,90,19,658

******************

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 928 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: