• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Taiwan Matters

చైనాతో జోడీ కట్టాలా ! విడగొట్టుకోవాలా ! తైవాన్‌ చిప్స్‌ పరిశ్రమ ధ్వంసం అమెరికా బెదరింపు !

21 Wednesday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Decouple from China, Narendra Modi, Narendra Modi Failures, RSS, Taiwan Matters, TRADE WAR, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌ వేర్పాటు వాదులు, అమెరికాకు షీ జింపింగ్‌ హెచ్చరిక !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CPC 20th congress, Taiwan independence, Taiwan Matters, Xi Jinping, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అతి పెద్ద దేశం చైనా. అతి పెద్ద రాజకీయ సంస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభల్లో భాగంగా 20వ మహాసభ అక్టోబరు 16-22 తేదీలలో జరుగుతున్నది.తొమ్మిది కోట్ల 67లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మిలిటరీతో సహా వివిధ విభాగాలు, తిరుగుబాటు ప్రాంతంగా ఉన్న తైవాన్‌ నుంచి మొత్తం 2,296 మంది పాల్గ్గొంటున్నారు. తదుపరి మహాసభ 2027లో జరగనుంది. సహజంగానే చైనా అధికార పార్టీ మహాసభ తీసుకొనే నిర్ణయాలు, చేసే దశ, దిశ నిర్దేశాల గురించి ప్రపంచం ఆసక్తితో ఎదురు చూస్తుంది. కొంత మంది ఆ ఏముంది, నేతలు ఏమి చెబితే ప్రతినిధులు దానికి తలూపటం తప్ప భిన్నాభిప్రాయాలను వెల్లడి కానివ్వరుగా అని పెదవి విరుస్తారు.వీరిలో కమ్యూనిస్టు పార్టీల పని పద్దతుల గురించి తెలియని వారు కొందరైతే, తెలిసీ బురద చల్లేవారు మరి కొందరు. మన దేశంలో సిపిఎం మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు.గతం, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసి వచ్చే మూడు సంవత్సరాల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం గురించి పాత కేంద్ర కమిటీ కొత్త మహాసభకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి దిగువన ఉన్న ప్రాధమిక శాఖ నుంచి రాష్ట్ర కమిటీల వరకు చర్చకు పంపుతారు, సవరణలు, వివరణలను ఆహ్వానిస్తారు. అంతిమంగా ఖరారు చేసిన దానిని ప్రతినిధుల మహాసభ ఆమోదానికి పెడతారు. అక్కడే దాన్ని ఖరారు చేస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ దాని నిబంధనావళి ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధికారంలో ఉంది గనుక రాజకీయ విధానంతో బాటు దేశ అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం గురించి కూడా చర్చిస్తుంది.


కొంత మంది ఆశిస్తున్నట్లు లేదా కోరుకుంటున్నట్లుగా అనేక పార్టీల మాదిరి భిన్నాభిప్రాయాలను పార్టీ ప్రతినిధులు వీధుల్లోకి తీసుకురారు. పార్టీ వేదికల మీదే కుస్తీ పడతారు. మెజారిటీ అంగీకరించిన విధానాన్ని మిగతావారు కూడా అనుసరిస్తారు. నేను పార్టీలోనే దీన్ని గురించి నిరసన తెలిపాను, కనుక అంగీకరించను, అమలు జరపను అని వెలుపల చెప్పటం క్రమశిక్షణా రాహిత్యం, కేంద్రీకృత ప్రజాస్వామిక విధానానికి విరుద్దం. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరణతో సహా తగిన చర్యలుంటాయి.చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ చేసే నిర్ణయాలు, విశ్లేషణలు, ప్రపంచ స్పందనల గురించి ఒక వ్యాసంలో వివరించటం కష్టం. ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కూడా కాలేదు. ప్రారంభ సభలో పార్టీ అధినేత షీ జింపింగ్‌ చేసిన ప్రసంగంలో తైవాన్‌ గురించి చేసిన ప్రస్తావన గురించి చూద్దాం.


ఈ మహాసభ పూర్వరంగంలోనే చైనాను రెచ్చగొట్టేందుకు వేసిన ఎత్తుగడ, చేసిన కుట్రలో భాగంగా అమెరికా అధికార వ్యవస్థలో మూడవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) స్పీకర్‌ నాన్సీ పెలోసీని అడ్డదారిలో తైవాన్‌ పంపారు, అక్కడి వేర్పాటు వాదులకు మద్దతు తెలిపి గతంలో తాను అంగీకరించిన ఒకే చైనాఅన్న విధానానికి తూట్లు పొడిచారు. ఈ వైఖరి ఐరాస, భద్రతా మండలి నిర్ణయాలకు సైతం వ్యతిరేకమే. అది వేరుగా ఉన్నందున శాంతియుత పద్దతుల్లో విలీనం జరగాలన్నది వాటి తీర్మానాల సారాంశం. దానికి భిన్నంగా తైవాన్‌లో కొంత మంది చైనా వ్యతిరేక దేశాల తెరచాటు మద్దతుతో తమది స్వతంత్ర దేశమని చెబుతున్నారు. ఒక వైపు విలీనం జరగాలని చెబుతూనే అమెరికా వంటి దేశాలు తైవాన్‌ వేర్పాటు వాదులకు అవసరమైన ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటుకు పురికొల్పుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే షీ జింపింగ్‌ తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఈ మహాసభలో తమ వైఖరి గురించి మరోసారి పునరుద్ఘాటించారు. తైవాన్‌ విలీనానికి శాంతియుత పద్దతులు విఫలమైతే అవసరమైతే బలప్రయోగం తప్పదన్న తమ ప్రకటన, వైఖరిని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని జింపింగ్‌ చెప్పారు.” తైవాన్‌ సమస్య పరిష్కారం చైనీయులకు సంబంధించింది. దాన్ని పరిష్కరించుకోవాల్సింది చైనీయులే. పూర్తి చిత్తశుద్ది, చివరి క్షణం వరకు శాంతియుత పద్దతుల్లో విలీన యత్నాలను కొనసాగిస్తాం. బలప్రయోగం చేయబోము అని మేము వాగ్దానం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాల చర్యలు తీసుకొనే అవకాశాలను అట్టి పెట్టుకుంటాం. వెలుపలి శక్తుల జోక్యం, తైవాన్‌ స్వాతంత్య్రం కోరుతున్న కొంత మంది, వారి వేర్పాటు వాద కార్యకలాపాలే ఈ వైపుగా మమ్మల్ని నడిపిస్తున్నాయి. దీని అర్దం ఏ విధంగానూ మా తైవాన్‌ సోదరులను లక్ష్యంగా చేసుకోవటం కాదు ” అన్నారు. షీ జింపింగ్‌ మాటలను బట్టి మరింత వేగంగా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పాడు. మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌తో మాట్లాడినపుడు ఈ మాటలు చెప్పాడు.


ఈ మహాసభకు తైవాన్‌ ప్రాంతం నుంచి పది మంది ప్రతినిధులు వచ్చారు. వారు పార్టీ వైఖరిని సమర్ధిస్తూ ఒక చైనా, రెండు వ్యవస్థలనే విధానం ( బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన హంకాంగ్‌ , అదే విధంగా పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన మకావో దీవులను చైనాలో విలీనం చేశారు. ఆ సందర్భంగా అక్కడి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను 50 సంవత్సరాల పాటు ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగిస్తామని, పౌరపాలనకు ప్రత్యేక పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్థ-విలీన ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించటం. ఇదే విధానాన్ని తైవాన్‌ ప్రాంతానికి కూడా వర్తింప చేస్తామని చైనా చెబుతోంది. హాంకాంగ్‌, మకావో విలీనాలు జరిగి పాతికేండ్లు అవుతోంది. ఈ ప్రాంతాలకు చైనా భద్రతా చట్టాలు వర్తిస్తాయి, వాటితోనే అక్కడి వేర్పాటు వాదులను అదుపులోకి తెచ్చారు.) శాంతియుత విలీనం అన్న విధానానికి అనుగుణంగా, విలీనం కోసం పార్టీ చేస్తున్న యత్నాలకు రుజువుగా నివేదిక ఉందని పేర్కొనటం పట్ల సభ ప్రతినిధులందరూ హర్షాతిరేకాలు వెల్లడించారు. బ్రిటీష్‌ వారి పాలనలో ఎన్నడూ స్వాతంత్య్రం, ఎన్నికల గురించి మాట్లాడని కొన్ని శక్తులు చైనాలో విలీనం తరువాత తొలిసారిగా జరిపిన ఎన్నికలను తప్పు పట్టటం, విద్యార్దులను రెచ్చగొట్టి స్వాతంత్య్రం పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి కుట్రల గురించి తెలిసిందే. తైవాన్‌లో ఏకంగా అక్కడి ప్రభుత్వం ఏకంగా మిలిటరీ, ఆయుధాలను సేకరిస్తున్నది. ఈ కారణంగానే అవసరమైతే చివరి అస్త్రంగా బలప్రయోగం తప్పదని చైనా చెబుతోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆయుధాలను మోహరించి రష్యాకు పక్కలో బల్లెంలా మారేందుకు అమెరికా, నాటో కూటమి పూనుకుంది. అదే మాదిరి టిబెట్‌, తైవాన్లను స్వతంత్ర దేశాలుగా చేసి అక్కడ పాగా వేసి చైనా, భారత్‌లకు తల మీద కుంపటి పెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకే అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. దలైలామా తిరుగుబాటు, మన దేశంలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు కూడా దానిలో భాగమే.

1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చినపుడు పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ మిగిలిన మిలిటరీ, ఆయుధాలను తీసుకొని తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ తిష్టవేశాడు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి. అప్పటికే ఉన్న ఐరాస భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం తన ఆధీనంలోనే కొనసాగుతున్నదంటూ ఐరాసలో చాంగ్‌కై షేక్‌ నియమించిన వారినే ఐరాస గుర్తించింది. ఉన్నది ఒకే చైనా అని పేర్కొన్నారు. ఇది 1970 దశకం వరకు కొనసాగింది. విధిలేని పరిస్థితిలో అసలైన చైనా అంటే ప్రధాన భూభాగంలో ఉన్న కమ్యూనిస్టులదే ప్రభుత్వమని గుర్తించిన తరువాత తైవాన్‌ గుర్తింపు రద్దు, దాన్ని కూడా చైనాలో అంతర్భాగంగానే పరిగణించారు. అందువలన సాంకేతికంగా దాని స్వాతంత్య్ర ప్రకటనను అమెరికాతో సహా శాశ్వత సభ్యదేశాలేవీ సమర్దించే అవకాశం లేదు. దొడ్డిదారిన ఏదో ఒకసాకుతో విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. 1950 దశకంలో ఒకసారి విలీనానికి చైనా ప్రయత్నించినపుడు అణుబాంబులు వేస్తామని అమెరికా బెదిరించింది. దాంతో అప్పటికే హిరోషిమా-నాగసాకీలపై అవసరం లేకున్నా బాంబులు వేసిన దాని దుర్మార్గాన్ని చూసిన తరువాత అలాంటి పరిస్థితిని చైనా పౌరులకు కలిగించకూడదనే జవాబుదారీతన వైఖరితో పాటు తరువాత చూసుకుందాం లెమ్మని చైనా తన ఇతర ప్రాధాన్యతలపై కేంద్రీకరించింది. అంతే తప్ప తైవాన్‌పై తన హక్కును ఎన్నడూ వదులు కోలేదు. సందర్భం వచ్చినపుడల్లా పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో తడిక రాయబారాలు జరుగుతూనే ఉన్నాయి.


పార్టీ మహాసభ ప్రారంభంలో షీ జింపింగ్‌ తైవాన్‌ గురించి చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక అమెరికాకే అని అనేక మంది విశ్లేషించారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. తన ఉపన్యాసంలో విలీన ప్రక్రియలో భాగంగా చైనాకు చెందిన తైవాన్‌ జలసంధి సంబంధ సంస్థ, తైవాన్‌లోని జలసంధి ఎక్సేంజ్‌ ఫౌండేషన్‌, బ్రిటీష్‌ పాలనలోని హాంకాంగ్‌ ప్రతినిధులతో చైనా జరిపిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన 1992 ఏకాభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా షీ చెప్పారు. అయితే ప్రస్తుతం తైవాన్‌ అధికారంలో ఉన్న వేర్పాటు వాదులు దాన్ని తిరస్కరిస్తున్నారు. తైవాన్‌లో అప్పుడున్న జాతీయ ఐక్యతా మండలి ఇప్పుడు లేదు. నాటి ఏకాభిప్రాయం ప్రకారం చైనా అంటే ఒకటే గానీ అసలు చైనా అంటే ఏమిటి అన్నదానిపై విబేధం ఉందని తప్పుడు భాష్యం చెబుతున్నారు. విలీనం తరువాత ప్రత్యేక పాలిత ప్రాంతంగా తైవాన్‌ ఉంటుందని చైనా చెబుతుండగా, 1911 నాటిదే అసలైన చైనా అని దానిలో తైవాన్‌, ఇతర ప్రాంతాలతో పాటు ప్రధాన భూభాగం కూడా ఒక ప్రాంతమే అని తైవాన్‌ వేర్పాటువాదులు అన్నారు. దివంగత తైవాన్‌ నేత లీ టుంగ్‌ హుయి అసలు 1992ఏకాభిప్రాయం లేదని, ఒకే చైనాలో రెండు దేశాలు అనే ప్రతిపాదనను ముందుకు తేగా చైనా తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా తమది స్వతంత్ర దేశమని అక్కడి పాలకులు అంటున్నారు. అమెరికా ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఒకసారి చెప్పినదాన్ని మరోసారి చెప్పటం లేదు. మొత్తం షీ జింపింగ్‌ మాటల సారం గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం అంటున్న తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర చైనా వ్యతిరేకుల ఆటలు సాగనివ్వబోమన్నదే హెచ్చరిక !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాను రెచ్చగొడుతున్న అమెరికా : తాజాగా తైవాన్‌ జలసంధికి రెండు యుద్ద నౌకలు !

31 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Nancy Pelosi Taiwan trip, Taiwan Matters, US provocative actions, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ అని తాలిబాన్లను వేడుకొని ఆఫ్ఘనిస్తాన్నుంచి అవమానకరంగా వెనుదిరిగిన అమెరికా కొద్ది నెలలు గడవకుండానే ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెరదీసింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో అంతుబట్టని స్థితిలో ఇప్పుడు తైవాన్‌ పేరుతో చైనాను రెచ్చగొడుతోంది.ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్‌లో.ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ జోక్యం, దాడులు స్పష్టం చేశాయి. ప్రకృతిలో రాబందులు పశువుల, మనుషుల మృతకళేబరాల కోసం నిరంతరం చూస్తుంటాయి, అవే వాటి ఆహారం. అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ రాబందులు మాత్రం నిరంతరం యుద్ధాల కోసం చూస్తుంటాయి.అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టి లాభాలను పిండుకోవటమే దాని పని. ఇప్పటి వరకు అమెరికా గడ్డమీద ఎలాంటి యుద్దాలు జరగకపోవటం, ప్రత్యక్షంగా పర్యవసానాలను అనుభవించకపోవటంతో అక్కడి జనాలు కూడా మొత్తం మీద యుద్ధాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.ఆమోదిస్తున్నవారు ఉండటం ఆందోళనకరం.


తైవాన్‌ జలసంధిలో తిరుగుతున్న అమెరికా మిలిటరీ నౌకలు ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలను కట్టివేసుకొని ఏమీ తెలియనట్లు సంచరిస్తున్నాయని, ఇది రెచ్చగొట్టుడుకే తప్ప మరొకటి కాదని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. తైవాన్‌ విలీన ప్రక్రియను అడ్డుకొనే క్రమంలో ఒకవేళ యుద్దమే గనుక వస్తే జలసంధిలో ప్రవేశించే అమెరికా మిలిటరీ నౌకలు చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయని భూమి మీద నుంచి చైనా సంధించే క్షిపణులను అవి తట్టుకొని నిలవలేవని అందువలన తైవాన్‌ జలసంధిలో సంచారానికి అర్ధం లేదని చైనా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా పంపిన నౌకలు దాని వద్ద ఉన్న పాత తరానికి చెందినవని, చైనా వద్ద అంతకంటే మెరుగైనవి ఉన్నందున వాటితో తైవాన్‌ వేర్పాటు వాదులను సంతుష్టీకరించటం, తన మిత్ర దేశాలకు భరోసాను ప్రదర్శించటం తప్ప చైనాను భయపెట్టలేరని పశ్చిమ దేశాల విశ్లేషకులు పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో తైవాన్‌ విలీనం తమకు అంగీకారం కాదని ప్రపంచానికి చెప్పటం కూడా దీని వెనుక ఉందని అంటున్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.


ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులు చైనా – రష్యా మిలిటరీల సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. రెండున్నర దశాబ్దాల నాడు రష్యా నుంచి ఆయుధాలను కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్న చైనా నేడు కొన్నింటిని అమ్మే దశకు ఎదిగింది.ఆధునిక అస్త్రాలను అది రూపొందిస్తున్నది. నాన్సీ పెలోసీ రాక తరువాత తన సత్తా ఏమిటో చూపుతున్నది. తాను స్వంతగా రూపొందించుకున్న రెండు విమానవాహకయుద్ద నౌకలను అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్‌ నిర్వహించింది. తమకు అడ్డు వచ్చే వారిని క్షణాల్లో ఎదిరించే సత్తా ఉందని ప్రపంచానికి వెల్లడించింది.

ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం అంత సత్తా లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఆయుధాల అంశంలో రష్యాతో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అమెరికా ఎదిరించేందుకు వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టటానికి రెండు దేశాలూ సిద్దపడతాయి. పరిమితులు లేని భాగస్వాములుగా ఉన్నట్లు రెండు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే.తైవాన్‌ అంశం మీద అమెరికా ఇలా ఇంకా రెచ్చగొట్టుడు కొనసాగిస్తే మిలిటరీ సహకారం కూడా రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపధ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్‌ క్రమంగా తైవాన్‌ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు.చైనాకు వ్యతిరేకంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు పధకం వేశారు.


ఇటీవలి అమెరికా బుద్దిపూర్వక చర్యలు, రష్యా వ్యతిరేక వైఖరి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది.దీన్నుంచి కూడా లబ్ది పొందేందుకు అమెరికా చూస్తున్నది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో అమెరికా ప్రాణ నష్టాలు నాలుగు లక్షల లోపే.మరో ఆరులక్షల మంది తమ వారు కనిపించటం లేదని అమెరికా చెప్పింది. ఇతర దేశాలలో మరణించిన ఆరు కోట్ల మందితో పోలిస్తే నిజానికి ఇది పెద్ద సంఖ్యకాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన లాభాలతో అమెరికాలో 22వేల మంది మిలియనీర్లను సృష్టించింది, 28.6బిలియన్‌ డాలర్లు లాభాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో లాభాలు రెట్టింపు వచ్చాయి.రక్తంతో తడిచిన లాభాలు మరిగిన అమెరికన్‌ కార్పొరేట్లు అప్పటి నుంచి జనాలకు కావాల్సిన వస్తువుల కంటే ప్రాణాలు తీసే ఆయుధాల తయారీకే ప్రాధాన్యత ఇచ్చారు. చైనాలో చౌకగా దొరికే శ్రమతో తక్కువ ధరలకు వినిమయ వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టటం, పరిశ్రమలను తరలించటం కూడా కార్పొరేట్ల లాభాల వేటలో భాగమే.

నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్దం అమెరికాలో బిలియనీర్లను 32 నుంచి 44కు వారి ఆస్తులు 103బి.డాలర్లకు పెంచింది. ప్రపంచానికి ఆ యుద్ద ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా కాగా అమెరికా వాటా కేవలం 336 బి.డాలర్లు మాత్రమే.ఆ యుద్దంలో సర్వనాశనమైన ఐరోపా పునరుద్దరణ పేరుతో అమెరికా ముందుకు రావటానికి దానికి వచ్చిన లాభాలే పెట్టుబడి. ఆ పధకంలో కూడా అమెరికా లబ్దిపొందింది.ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందనే ఉందనే బూచిని చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్‌ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది. అది పెట్టే తంపులన్నీ తనకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు దేశాల్లోనే.అమెరికాకు ఇరుగు పొరుగుదేశాలతో పేచీ లేదు కనుక వాటి నుంచి ముప్పులేదు.


రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి 2001వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్దాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు.వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్య అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్‌ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్‌ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్‌మెయిల్‌, తైవాన్‌ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపెట్టటం, మిలిటరీ ఖర్చు పెరిగేట్లు చూడటం వంటి అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ మదింపు వేసుకొనే తైవాన్‌ అంశంలో రాజీలేదని చైనా ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌పై తాజా వివాదం 3 : ఉలిపికట్టె అమెరికా – సంయమనం పాటిస్తున్న చైనా !

17 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, Joe Biden, Taiwan Matters, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


తైవాన్‌ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్‌ పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్‌ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్‌, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందుపాతరలను తొలగించటంలో విజయవంతమైనట్లు వార్తలు. సముద్రాల్లో పైన తేలే వాటితో పాటు నీటిలో ఉండే మందుపాతరలు కూడా ఉంటాయి. పేరుకు రెండే పాల్గొన్నా వాటికి మద్దతుగా అనేక నౌకలు ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది.తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.


మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న.గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా,జపాన్‌, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్‌ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూనుకుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆకసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్‌ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్‌ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.


దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్‌ రీగన్‌ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొనటంతో పాటు ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్‌ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్‌ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.


పైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం,ఆయుధ కార్పొరేట్‌ సంస్థల నిధులతో నడిచే సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ చైనా పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది.దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది.వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఏ) ప్రపంచంలో భూమి మీద నుంచి ప్రయోగించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాలక్షిపణులను దెబ్బతీసే సత్తాలేదు అనుకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవని ఆ పత్రంలో పేర్కొన్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థలను ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్‌-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్‌-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్‌ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.


చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్‌ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.


చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ.2019 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అది పెద్దది చైనా మిలటరీ.ఇరవై లక్షల మంది సైనికులున్నారు. తైవాన్‌ వద్ద 1.7లక్షల మంది ఉన్నారు. చైనా వద్ద ఐదు లక్షల మంది రిజర్వు సైనికులుంటే తైవాన్‌ వద్ద మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు. పారామిలిటరీ దళాలు చైనా వద్ద 6.24లక్షలు కాగా తైవాన్‌ వద్ద కేవలం 11,500 మంది మాత్రమే. చైనా వద్ద 5,250 టాంకులుండగా తైవాన్‌ వద్ద 1,110, చైనా సాయుధశకటాలు 35వేల కాగా తైవాన్‌ వద్ద 3,472 ఉన్నాయి. చైనా వద్ద విమానాలు 3,285 కాగా, వాటిలో జట్‌లు 1,200, స్పెషల్‌ బాంబర్లు 450, రవాణాకు 286 ఉండగా, తైవాన్‌ వద్ద 741 విమానాలు వాటిలో జట్‌లు 288, 19 రవాణా విమానాలున్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 79, తైవాన్‌ వద్ద నాలుగు, చిన్నా పెద్ద మిలటరీ ఓడలు చైనా వద్ద 777 ఉండగా తైవాన్‌ 117 ఉన్నాయి. చైనా వద్ద తొమ్మిది అణు జలాంతర్గాములు, ఆరు ఖండాంతర క్షిపణి జలాంతర్గాములుండగా తైవాన్‌ వద్ద ఒక్కటి కూడా లేదు. చైనా వద్ద డీజిలుతో నడిచే జలాంతర్గాములు 56 ఉండగా తైవాన్‌ వద్ద రెండున్నాయి.


చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోఏది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబుదారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలిపెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !

12 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్‌ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్‌” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్‌ వ్యవస్థలను తైవాన్‌ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్‌ టైమ్స్‌ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్‌ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్‌ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్‌ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్‌ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్‌ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్‌ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.


ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్‌ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్‌ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్‌ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్‌ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్‌ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.


చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్‌ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జాసన్‌ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్‌ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.


అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.


అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్‌ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్‌ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.


సోవియట్‌ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.


ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్‌ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్‌ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్‌ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్‌ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన – కాలు మోపితే ఖబర్దార్‌ అన్న చైనా !

28 Thursday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

China stern warning, Joe Biden, Nancy Pelosi, Nancy Pelosi Taiwan trip, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్‌లో అడుగు పెడతారా ? హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆమె మొండిగా వస్తే చైనా చూస్తూ ఊరుకుంటుందా ? తైవాన్ను నిషేధిత గగనతలంగా ప్రకటించే అవకాశం ఉందా ? ఒక వేళ నాన్సీ పెలోసీ విమానం గనుక తైవాన్‌ ప్రాంతానికి వస్తే చైనా విమానం లేదా విమానాలు దాన్ని వెంబడిస్తాయని, తైవాన్‌ గడ్డపై దిగకుండా చూస్తాయని అనధికార వార్తలు. ఒక వేళ అమెరికా విమానవాహక యుద్ద నౌకలు గనుక తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోంది ? ఉక్రెయిన్‌ వివాదంలో ఆశించినట్లుగా రష్యాను దెబ్బతీయలేకపోతున్నందున ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పధకం వేసిందా ? పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో గెలుపుకోసం బైడెన్‌ పడుతున్న పాట్లా ? లేక నిజంగానే చైనాతో లడాయి పెట్టుకొనేందుకు బైడెన్‌ యంత్రాంగం సిద్దపడుతోందా ? అమెరికాకు అంత సత్తా ఉందా ? చైనాను రెచ్చగొట్టి దాని స్పందన చూడండి అంటూ ప్రచారదాడిలో భాగంగా అమెరికా పథకం వేసిందా ? చివరికి టీ కప్పులో తుపానులా ముగుస్తుందా? ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతోంది.పెలోసీ పర్యటన నేపధ్యం లేదా తైవాన్‌ వేర్పాటు వాదులకు హెచ్చరికలో భాగం కావచ్చు తైవాన్‌ జలాల్లోకి ప్రవేశించే అమెరికా విమానవాహక నౌకలను లక్ష్యంగా చేసుకొని ఆధునిక క్షిపణులతో విన్యాసాలు నిర్వహించాలని మిలిటరీని చైనా ఆదేశించింది.


ప్రధాన భూభాగానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్‌ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం అన్న సంగతి తెలిసిందే.1949 నుంచి అది వివిధ కారణాలతో విడిగా ఉంది. 1971 వరకు చైనా అంటే ఐరాస, భద్రతా మండలిలో దాన్నే గుర్తించారు, వీటో అధికారం కూడా ఉంది. 1971 నవంబరు 15 నుంచి చైనా అంటే తైవానుతో సహా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోని ప్రభుత్వమే అసలైన ప్రతినిధిగా ఉంది. తరువాత అమెరికా కూడా విధిలేక తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించింది. అయినప్పటికీ తైవాన్‌ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ అమెరికా, దాని అనుకూల దేశాలు తైవాన్‌లోని విలీనవ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి ఆయుధాలు అందిస్తున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలు చేయిస్తున్నాయి. దీనిలో భాగంగానే నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన. అమెరికా అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ ఉంటారు.ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనల మేరకు చైనా అనుమతి లేకుండా వీరిలో ఎవరు తైవాన్‌లో అడుగుపెట్టినా అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుంది.నిబంధనలను పాటించాలని ఇతర దేశాలకు ఉద్బోధించే అమెరికాకు అది వర్తించదా !


చైనా తీవ్ర హెచ్చరికల నేపధ్యంలో అమెరికాలో ఇప్పుడు పెద్ద నాటకం నడుస్తోంది. ప్రభుత్వ సహకారం లేకుండా నాన్సీ పెలోసి పర్యటన జరగదు. ఆమె నిజంగా పరó్యటిస్తారో లేదో అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ పర్యవసానాల గురించి బహిరంగ చర్చ జరుగుతోంది. తైవాన్‌ వెళితే తలెత్తే ముప్పు గురించి పెలోసికి నచ్చ చెప్పేందుకు బైడెన్‌ యంత్రాంగం తెరవెనుక మంతనాలు జరుపుతోందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. ఏమైనా సరే వెళ్లాల్సిందేనని డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీల్లోని చైనా వ్యతిరేకులు రెచ్చగొడుతున్నారు. జపాన్‌, ఇతర ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌ కూడా ఆగస్టు తొలివారంలో వెళ్ల వచ్చని అనధికార వార్తలు. ఆమె పర్యటనను రద్దు చేయాలని చైనా జాతీయ రక్షణ శాఖ బహిరంగంగా ప్రకటించింది.తమ సార్వభౌత్వాన్ని రక్షించుకొనేందుకు గట్టి కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ముందుకుపోతే మిలిటరీ చేతులు ముడుచుకు కూర్చోదని పేర్కొన్నది.


పెలోసీ పర్యటనను మిలిటరీ వ్యతిరేకించినట్లు గతవారంలో జోబైడెన్‌ స్వయంగా చెప్పాడు. బైడెన్‌ చెప్పిందానికి అర్ధం ఏమిటో తనకు తెలియదని బహుశా తాను ప్రయాణించే విమానాన్ని కూల్చివేయటం లేదా అలాంటిదే ఏమైనా జరగవచ్చునని మిలిటరీ భయపడుతోందేమో నాకు తెలియదని పెలోసీ కూడా గతవారంలో విలేకర్లతో అన్నారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. స్పీకర్‌కు మేం చెప్పాల్సింది చెప్పాం, ఒకే చైనా అన్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని,వెళ్ల దలచుకుంటే ప్రభుత్వం నివారించలేదని ఒక అధికారి చెప్పాడు.” నాన్సీ నేను మీతో వస్తాను, నామీద చైనాలో నిషేధం ఉండవచ్చుగానీ స్వేచ్చను కోరుకొనే తైవాన్‌లో లేదు కదా, అక్కడ మిమ్మల్ని చూస్తాను ” అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో రెచ్చగొట్టాడు. పెలోసి గనుక వెళ్లకపోతే చైనా వత్తిడికి అమెరికా లొంగినట్లే అని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన రిపబ్లికన్లు, మితవాదులు రెచ్చగొడుతున్నారు.


అక్టోబరులో జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలో మరోసారి పార్టీ, అధికార పగ్గాలు చేపడతారని భావిస్తున్న చైనా అధినేత షీ జింపింగ్‌ నాయకత్వాన్ని అవమానించటం, రెచ్చగొట్టటం కూడా అమెరికా ఎత్తుగడలో భాగం అని చెబుతున్నారు. తైవాన్ను నిషేధిత గగన తలంగా ప్రకటించి పెలోసి విమానాన్ని చైనా గనుక వెంబడిస్తే అది ఆమె పర్యటన నిరోధం కంటే ఆ ప్రాంతం తమదే అని ప్రపంచానికి మరోసారి స్పష్టం చేయటం, అమెరికాకు పెద్ద హెచ్చరిక దాని వెనుక దాగుందని భావిస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి అమెరికా చేతిలో ఉందని చెబుతున్నారు. పెలోసి గనుక సంయమనం పాటించి వెనక్కు తగ్గకపోతే తరువాత పర్యవసానాలను ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీ ఎదుర్కోవలసి ఉంటుంది. గతంలో తైవాన్‌ తిరుగుబాటు నేత లీ టెంగ్‌ హుయి 1996లో అమెరికా పర్యటన జరిపినపుడు తైవాన్‌ దీవి చుట్టూ చైనా క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పుడు పెలోసీ రాక దానికంటే తీవ్రమైనది కనుక తీవ్రంగా పరిగణిస్తున్నది.


నాలుగు దశాబ్దాల ద్రవ్యోల్బణ రికార్డు, ధరల పెరుగుదల ఒక వైపు, రష్యాతో వివాదంలో సాధించిందేమీ లేకపోవటంతో తైవాన్‌ సమస్య పేరుతో చైనాను రెచ్చగొట్టి హడావుడి చేసి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు పొందటం లేదా ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు ఇస్తున్న మద్దతు నుంచి వెనక్కు మరల్చే ఎత్తుగడతో అమెరికా ఉందని, ఈ రెండూ జరిగేవి కాదని పరిశీలకులు చెబుతున్నారు. వీలైనంత వరకు లబ్ది పొందేందుకు పెలోసీని తురుపుముక్కగా బైడెన్‌ ప్రయోగిస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. పెలోసీ పర్యటనతో నిమిత్తం లేకుండానే ఇటీవలి కాలంలో రెండు దేశాల సంబంధాలు దిగజారుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పిచ్చిపనుల గురించి తెలిసినా వెనక్కు తగ్గితే చులకన అవుతామన్న భయం, తగ్గకపోతే నష్టపోతామన్న ఆందోళన బైడెన్‌కు ఉంది. చైనా వస్తువులపై ట్రంప్‌ విధించిన దిగుమతి పన్ను విలువ 32బిలియన్‌ డాలర్లు అమెరికన్లపైనే భారంగా పడింది. ఇప్పటికీ కొనసాగుతున్న పన్నులను తగ్గిస్తే ఒక శాతం ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా. చైనాతో అంతం లేని వివాదం మంచిది కాదని విదేశాంగశాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ కూడా బైడెన్‌కు సలహా చెప్పాడు. ఇలా అనేక వత్తిళ్ల కారణంగా షీ జింపింగ్‌తో చర్చలు జరుపుతానని బైడెన్‌ చెప్పాల్సి వచ్చింది.


ఒక వేళ నాన్సీ పెలోసి మొండిగా ప్రవేశిస్తే 2001లో చైనాలోని హైనాన్‌ దీవిలో జరిగిన అమెరికా-చైనా విమానాల ఢ కంటే తీవ్రపరిణామాలు జరగవచ్చని కొందరు గుర్తు చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని పార్సెల్‌ దీవులు తమవేనని చైనా వాదిస్తున్నది. అమెరికా దాన్ని అంగీకరించటం లేదు. అంతర్జాతీయ జలాల్లో తిరిగే స్వేచ్చ తమకు ఉందంటూ జపాన్‌లోని తమ సైనిక కేంద్రం నుంచి నిఘా విమానాలు, ఓడలను తిప్పుతున్నది. దానిలో భాగంగా 2001 ఏప్రిల్‌ ఒకటవ తేదీన ఒక నిఘా విమానం చైనా సైనిక స్థావరం ఉన్న హైనాన్‌ దీవులకు దగ్గరగా వచ్చింది. దాన్ని అడ్డుకొనేందుకు చైనా మిలిటరీ విమానం కూడా ఎగిరింది. రెండూ దీవుల వద్ద ఢకొీన్నాయి. ఈ ఘటనలో చైనా పైలట్‌ మరణించగా దెబ్బతిన్న అమెరికా విమానం హైనాన్‌ దీవిలో దిగింది. దాని సిబ్బంది 24 మందిని చైనా అరెస్టు చేసి, విమానాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే అనూహ్య పరిణామంతో దిక్కుతోచని సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కంప్యూటర్లపై కాఫీ, నీళ్లను పోశారు. తరువాత అమెరికా ప్రభుత్వం చైనాకు క్షమాపణలు చెబుతూ లేఖలు రాసి ఖర్చులను చెల్లించి తమ సిబ్బంది, విమానాన్ని విడిపించుకుంది. తరువాత జరిగిందానికి చింతిస్తున్నట్లు, విచారపడుతున్నట్లు లేఖల్లో పేర్కొన్నాం తప్ప క్షమాపణ కాదని అమెరికా చెప్పింది. హైనాన్‌ దీవుల్లో ప్రస్తుతం చైనా జలాంతర్గాముల కేంద్రం ఉంది. అక్కడి నుంచి జలాంతర్గాముల ద్వారా ఖండాంతర అణుక్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే తరువాత కూడా చీటికి మాటికి దాని సమీపంలోకి అమెరికా నిఘావిమానాలు, ఓడలను పంపుతున్నారు. చైనా కూడా దానికి ధీటుగా విమానాలతో సమాధానం చెబుతున్నది. రెండు మూడు సార్లు రెండు దేశాల విమానాలు సమీపానికి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే చైనా మిలిటరీ సామర్ధ్యం ఎంతో పెరిగిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలంలో తైవాన్‌ వేర్పాటు వాదులు అమెరికా సాయంతో స్వాతంత్య్రం సంపాదించుకుంటామని పదే పదే చెప్పటం, చైనా గనుక విలీనానికి బలాన్ని వినియోగిస్తే తాము మిలిటరీ జోక్యం చేసుకుంటామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


నూటయాభై ఆరు సంవత్సరాల పాటు బ్రిటీష్‌ పాలనలో ఉన్న హాంకాంగ్‌ 1997 జూలై ఒకటిన చైనాలో విలీనమైంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉన్నందున తమ ప్రత్యేకపాలన ప్రాంతంగా పరిగణించి 50 సంవత్సరాల పాటు అక్కడి వ్యవస్థలను కొనసాగిస్తామని చైనా సర్కార్‌ అంగీకరించింది. అదేవిధంగా పోర్చుగీసు ఏలుబడిలో అంతర్జాతీయ జూద కేంద్రంగా మార్చిన మకావూ దీవులను కూడా అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నది. ఆ గడువు 2048 వరకు ఉంది. విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన హామీల మాదిరే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడులకూ అదే వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. తైవాన్నుంచి పెట్టుబడులే కాదు, ఎవరైనా వచ్చి ఉపాధికూడా పొందవచ్చని అవకాశం ఇచ్చింది. అందువలన తైవాన్‌న్ను కూడా అప్పటి వరకు వాటి మాదిరిగానే కొనసాగనిస్తుందని, తరువాత పూర్తిగా విలీనం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఆగడువు దగ్గర పడుతున్నకొద్దీ విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు చైనా చూస్తుండగా ప్రజాస్వామ్యం, స్వేచ్చ,స్వాతంత్య్రం పేరుతో చిచ్చుపెట్టేందుకు అమెరికా,జపాన్‌ తదితర దేశాలు చూస్తున్నాయి.


తైవాన్‌, హాంకాంగ్‌,టిబెట్‌, షింజియాంగ్‌ రాష్ట్రంలో మానవహక్కుల గురించి అమెరికా సంధిస్తున్న అస్త్రాలేవీ పని చేసేవి కాదు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ ప్రయోజనాలకు హానికలిగే వాటిని వేటినీ సహించేది లేదని చైనా పదే పదే స్పష్టం చేస్తోంది. హాంకాంగ్‌, మకావు దీవుల విలీన సమయంలో 50 సంవత్సరాలపాటు(2048 వరకు) అక్కడి యధాతధ స్థితిని కొనసాగనిస్తామని ఒకే దేశం-రెండు వ్యవస్థలన్న తన వైఖరిని చైనా ఎప్పుడో స్పష్టం చేసింది. వాటి మాదిరే అదుపులో ఉన్నంత వరకు తైవాన్‌ అంశంలో కూడా చైనా అప్పటి వరకు తొందరపడే ధోరణిలో లేదు. ఈ లోగా అమెరికా కూటమి దేశాలు దుస్సాహసానికి పాల్పడి తెగేదాకా లాగితే పరిణామాలు వేరుగా ఉంటాయి.విచక్షణను ఉపయోగించి వెనక్కు తగ్గితే పెలోసీ పర్యటన వివాదం టీకప్పులో తుపానులా ముగుస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొందరు అమెరికన్ల ఉన్మాదం : చైనా దాడికి వస్తే తైవాన్‌ చిప్స్‌ కంపెనీల నాశనం !

10 Monday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chinese Invasion Plan, Taiwan Matters, TSMC, US warmongers


ఎం కోటేశ్వరరావు


చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకొనేందుకు పూనుకుంటే తైవాన్‌ తన సెమికండక్టర్‌ పరిశ్రమను (TSMC),పూర్తిగా ధ్వంసం చేయాలని అమెరికన్‌ మిలిటరీ పత్రిక ” పారామీటర్స్‌” సూచించింది. జార్‌డ్‌ మెకెనీ, పీటర్‌ హారిస్‌ అనే జంట రచయితలు ఈ సలహా ఇచ్చారు. ఎందుకటా ! తైవాన్‌లో ఉన్న వనరులను పనికి రాకుండా చేస్తే తైవాన్‌ అనావశ్యకమైనదిగా చైనాకు కనిపిస్తుందట. ఒకవేళ ఆక్రమించుకున్నా దానికి పనికి రాకుండా చేయటం చైనాను అడ్డుకొనే ఎత్తుగడల్లో ఒకటవుతుందట.తనకు దక్కని అమ్మాయి వేరెవరికీ దక్క కూడదంటూ యాసిడ్‌ పోసే, హత్యలు చేసే బాపతును ఈ సలహా గుర్తుకు తేవటం లేదూ ! చైనాను దారికి తెచ్చుకొనేందుకు ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించక అమెరికాలో పెరిగిపోతున్న అసహనం, దుష్ట ఆలోచనలకు ఇది నిదర్శనం. ఒక వేళ తైవాను పాలకులు ఆ పని చేయకపోయినా సిఐఏ వారే ఆపని చేయగల దుర్మార్గులు. తైవాన్‌లో రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు. వారేమైనా అమెరికన్లకు పట్టదు, కావలసిందల్లా చైనాను అడ్డుకోవటమే. పారా మీటర్స్‌ పత్రికలో ఈ సలహా ఇచ్చిన వారు చిన్నవారేమీ కాదు. అమెరికా ఎయిర్‌ విశ్వవిద్యాలయంలోని భద్రత, వ్యూహాత్మక అధ్యయన కేంద్ర అధిపతిగా మెకనీ, కొలరాడో స్టేట్‌ విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్‌గా పీటర్‌ హారిస్‌ ఉన్నాడు.


ఎలక్ట్రానిక్స్‌లో కీలకమైన చిప్స్‌ తయారీలో తైవాన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.అనేక ఇతర దేశాలతో పాటు వాటిని ప్రధాన భూభాగమైన చైనాకు సరఫరా చేస్తోంది.తైవాన్‌ గనుక సెమికండక్టర్‌ పరిశ్రమను నాశనం చేస్తే అమెరికా మిత్రదేశంగా ఉన్న దక్షిణ కొరియాలోని శాంసంగ్‌ ఒక్కటే చిప్స్‌ రూపకల్పనలో ప్రత్నామ్నాయంగా మారుతుందని, చిప్స్‌ లేకపోతే చైనాలోని హైటెక్‌ పరిశ్రమలేవీ పనిచేయవని,అప్పడు చైనీయులు తమ నేతల యుద్ధ ప్రయత్నాలపై తిరగబడతారని, ఒక వేళ స్వాధీనం చేసుకున్పప్పటికీ ఆర్ధిక మూల్యం సంవత్సరాల తరబడి ఉంటుందని, చైనా కమ్యూనిస్టు పార్టీపై జన సమ్మతి తగ్గుతుందంటూ ఒక ఊహా చిత్రాన్ని సదరు పెద్దమనుషులు ఆవిష్కరించారు. చైనా మిలిటరీ అలా వస్తున్నట్లుగా తెలియగానే ఇలా మీటనొక్కగానే వాటంతట అవే సెమికండక్టర్‌ పరిశ్రమలు పేలిపోయేవిధంగా చిప్స్‌ తయారు చేయాలన్నట్లుగా హాలీవుడ్‌ సినిమాల స్క్రిప్ట్‌ను వారు సూచించారు. ఈ రంగంలో పని చేస్తున్న తైవాన్‌ నిపుణులను త్వరగా వెలుపలికి తరలించే పధకాలను సిద్దం చేయాలని, వారికి అమెరికాలో ఆశ్రయం కల్పించాలని కూడా వారు చెప్పారు. తాము చేస్తున్న ప్రతిపాదన తైవానీస్‌కు నచ్చదని, సెమికండక్టర్‌ పరిశ్రమలను నాశనం చేస్తే నష్టం చాలా స్వల్పమని అదే అమెరికా యుద్ధానికి దిగితే పెద్ద ఎత్తున, దీర్ఘకాలం సాగుతుందని అమెరికన్‌ రచయితలు పరోక్షంగా తైవానీస్‌ను బెదిరించారు.


చైనాలోని ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌ . ఐక్యరాజ్యసమితిలో రెండు చైనాలు లేవు, తైవాన్‌కు ఒక దేశంగా గుర్తింపు లేదు.తైవాన్‌లోని కొందరు స్వతంత్ర దేశంగా మార్చాలని చూస్తున్నారు. అధికారికంగా తైవాన్‌ ప్రాంతం కూడా చైనాలో విలీనం గురించే మాట్లాడుతుంది తప్ప మరొకటి కాదు. విలీనం అవుతాము గానీ అది కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాలో కాదు అంటూ నాటకం ఆడుతోంది. అమెరికా సైతం ఒకే చైనా భావనను అంగీకరిస్తూనే విలీనం బలవంతంగా జరగకూడదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు దానికి ఆయుధాలు సమకూరుస్తూ, దొడ్డి దారిన అక్కడ కార్యాలయం తెరిచింది. బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను అడ్డుకుంటామని పదే పదే చెబుతోంది. ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా తైవాన్ను కొన్ని అమెరికా తొత్తు దేశాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించి చైనాను రెచ్చగొడుతున్నాయి. ఆ ప్రాంతం తమదే అని, విలీనం సెమికండక్టర్‌ పరిశ్రమ కోసం కాదని చైనా స్పందించింది. ఒకవేళ తైవాన్ను ఆక్రమించదలచుకుంటే చైనాకు 14గంటల సమయం చాలునని, దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌ రావాలంటే 24 గంటలు పడుతుందని కొందరు చెప్పారు.


తమ దేశాన్ని బాగు చేసుకోవటం గురించి ఇలాంటి పెద్దలు కేంద్రీకరించకుండా ఎదుటి వారిని దెబ్బతీయాలని దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్లు ? రెండు కారణాలున్నాయి. చైనా మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలన్నది అమెరికా కార్పొరేట్ల ఆలోచన. రకరకాల ఎత్తుగడలు వేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నకొద్దీ కొరకరాని కొయ్యగా మారుతోంది. ఆంక్షలను విధించటం, అమెరికా యుద్దనావలను తైవాన్‌ జలసంధిలో దించినప్పటికీ చైనా అదరలేదు బెదరలేదు. తాజాగా చైనా స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకుంది.2049 నాటికి ఒక దేశం- రెండు వ్యవస్ధల ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్న హాంకాంగ్‌, మకావు దీవులు ప్రధాన ప్రాంతలో పూర్తిగా విలీనం అవుతాయి. అప్పటికి తైవాన్‌ విలీనం కూడా పూర్తి కావాలని చైనా భావిస్తోంది. ధనిక దేశాల స్ధాయికి తమ జనాల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. హాంకాంగ్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలనే అమెరికా ఎత్తుగడలు విఫలం కావటంతో ఇప్పుడు తైవాన్‌ అంశం మీద రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.


మన దేశంలో కూడా ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నవారు లేకపోలేదు.ఆర్‌సి పాటియల్‌ అనే మాజీ సైనికాధికారి తాజాగా రాసిన వ్యాసంలో అమెరికా ఎత్తుగడలకు అనుగుణంగా ప్రతిపాదించారు. దాని సారాంశం ఇలా ఉంది. అడ్డుకొనే వారు లేకపోతే వివిధ దేశాల పట్ల చైనా కప్పగంతులు వేస్తూ ముందుకు సాగుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాలు జపాన్‌ మీద దాడి చేసినపుడు భారీ ఎత్తున మిలిటరీ ఉన్న దీవులను వదలి ఇతర వాటిని పట్టుకున్నాయని ఇప్పుడు చైనా కూడా అదే పద్దతులను అనుసరించవచ్చని పేర్కొన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు దిగువ సూచనలు పాటించాలని పాటియల్‌ పేర్కొన్నారు. చైనా బలవంతానికి గురైన దేశాలు ముందు స్వంతంగా పోరాడాలి, తరువాత ఉమ్మడిగా పధకం వేయాలి. చైనా వాణిజ్య, ఇతర వత్తిళ్లకు ఇప్పటికై గురైన వాటిని, భవిష్యత్‌లో అవకాశం ఉన్న దేశాలన్నింటినీ అమెరికా, భారత్‌ ఒక దగ్గరకు చేర్చాలి. చైనాలో టిబెట్‌ అంతర్భాగమంటూ 1954లో నెహ్రూ ప్రభుత్వం గుర్తించినదానిని రద్దు చేయాలి. ముందుగా దేశ రాజకీయనేతలు ఆ పని చేసేందుకు భయపడకూడదు. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, దాని తరఫున అమెరికా నిలవాలి. కొత్త దలైలామాను ఎన్నుకొనేందుకు సాంప్రదాయ పద్దతి పాటించేందుకు ప్రస్తుత దలైలామాను అనుమతించాలని భారత్‌ వత్తిడి తేవాలి. ఈ అంశంలో చైనా వైఖరిని గట్టిగా ఎదుర్కోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఉఘిర్స్‌ ఈస్ట్‌ టర్కిస్తాన్‌ ప్రభుత్వాన్ని(చైనాలోని షిన్‌జియాంగ్‌ రాష్ట్ర తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసినది. వారికి మానవహక్కులు లేవంటూ ప్రచారం చేస్తున్న అంశం తెలిసిందే) గుర్తించే విధంగా ముస్లిం దేశాలను ఒప్పించాలి. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఉన్న చతుష్టయం(క్వాడ్‌) ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదు, రాబోఏ రోజుల్లో అలా మార్చాలి. మరిన్ని దేశాలతో విస్తరించాలి.అమెరికా, ఇజ్రాయెల్‌,భారత్‌, ఐక్య అరబ్‌ దేశాలతో రెండవ చతుష్టయాన్ని ఏర్పరచాలి.చైనాతో అన్ని దేశాలూ వాణిజ్యాన్ని తగ్గించుకోవాలి.ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో కూడిన అకుస్‌ మాదిరి భారత్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ భద్రతా కూటమిని ఏర్పాటు చేయాలి. ఇండో-పసిఫిక్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ అమెరికా రక్షణ కల్పించాలి. చైనాను అగ్రరాజ్యంగా ఎదగకుండా చూడాలి.భావ సారూప్యత కలిగిన దేశాలు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దపడి చైనా కప్పగంతు పధకాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి.


అమెరికా అజెండాకు అనుకూలమైన ఎత్తుగడలతో మన దేశాన్ని ఎక్కడకు తీసుకుపోదామనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లనే అదుపు చేయలేని అమెరికా మిలిటరీ చైనాను నిలువరించగలదా ? తన మిలిటరీని తానే రక్షించుకోలేక తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని దేశం విడిచిన వారు మన దేశం, మరొక దేశం కోసం పోరాడతారా? అసలు అమెరికా తాను స్వయంగా ప్రారంభించిన ఏ యుద్దంలో ఐనా గెలిచిన ఉదంతం ఉందా? దురద తనది కాదు గనుక ఇతరులను తాటి మట్టతో గోక్కోమన్నట్లుగా పడక కుర్చీలకు పరిమితమైన ఇలాంటి యుద్దోన్మాదులు చెప్పే ఉచిత సలహాలను అనుసరిస్తే వారికేమీ పోదు, సామాన్య జనజీవితాలు అతలాకుతలం అవుతాయి.చైనాతో మనకు పరిష్కారం కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. శుభకార్యానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుందా ? కావాల్సింది సరిహద్దు సమస్య పరిష్కారమా ? చైనాతో వైరమా ? దాన్ని గురించి ఒక్కటంటే ఒక్క సూచన కూడా ఈ పెద్దమనిషి చేయలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జపాన్‌ మీద అణుబాంబు వేస్తామని చైనా బెదిరించిందా ? నిందలు-నిజాలేమిటి ?

07 Saturday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Nuke Japan, China Threat, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: