ఎం కోటేశ్వరరావు
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూ – కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటంతో ఉగ్రవాదుల వెన్ను విరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని కీలక సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్భాటం చేశారు. నిజమే కామోసనుకొని జనం సంతోషించారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో ఉన్న కాశ్మీరులో గత పక్షం రోజుల్లోనే పది మంది సైనికుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా మిలిటరీ గ్రామాలను నిర్మిస్తోందంటూ అమెరికా ఇచ్చిన సమాచారంతో మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల గురించి ఎలాంటి సమాచారమూ ఇచ్చినట్లు వార్తలు లేవు. మరో రాష్ట్రం మణిపూర్. ఇక్కడ బిజెపి పాలన ఉంది. ఇది రాసిన సమయానికి అక్కడ ఇటీవల జరిగిన హింసాకాండలో 55మంది మరణించినట్లు వార్తలు. వారెలా మరణించిందీ తెలియదు. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ బంద్, కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు ఇచ్చి ఆర్టికల్ 355ను ప్రకటించి కేంద్ర బలగాలకు అప్పగించారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనా రాష్ట్రపతి పాలన పెట్టలేదు, స్వంత పార్టీ కదా !
చిత్రం ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విలేకర్లతో మాట్లాడేందుకు ఎలాగూ ముందుకు రారు, కనీసం ఒక ప్రకటన లేదా బహిరంగ సభల్లో మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయన్నట్లు ఉన్నారు. కల్పిత కట్టుకథలతో కేరళ సమాజాన్ని అవమానపరిచేందుకు తీసిన కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు, మద్దతు ఇచ్చినట్లు రాళ్లు వేసేందుకు తీరిక దొరుకుతుంది గానీ కాశ్మీర్, మణిపూర్ గురించి ప్రస్తావించలేదు. ఢిల్లీలో రెజ్లర్ల మీద పోలీసు జులం గురించి మాట్లాడరు. స్వంత పార్టీ ఎంపీ మీద పోక్సో కేసు పెట్టినా అరెస్టు లేదు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధాని 30 ట్వీట్లు పెట్టారు వాటిలో సగం కాంగ్రెస్, జెడిఎస్ మీద దాడికి దిగారు. మణిపూర్, కాశ్మీరు, రెజ్లర్ల ఉదంతాలపై ట్వీట్ల ద్వారా కూడా స్పందించలేదు. జై భజరంగ బలీ అంటూ మతం పేరుతో ఓట్లడిగేందుకు నోరు వచ్చిందన్న విమర్శలు వచ్చినా సరే పదే పదే ప్రస్తావించారు. అడిగేవారెవరు, నిబంధనలను అమలు జరిపేదెవరు? ప్రపంచ నేతగా,విశ్వగురువుగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ కాశ్మీరు, మణిపూర్లో జరుగుతున్న ఉదంతాలు అల్పమైనవని, వాటి మీద స్పందించటం తన స్థాయికి తగదని మౌన ముద్రదాలుస్తున్నారా ?
మణిపూర్ అగ్నిగుండంగా మారేందుకు హైకోర్టు ఇచ్చిన సలహా కారణమైంది.న్యాయమూర్తుల సలహాలు చిచ్చు రేపేవిగా ఉండకూడదు, వాటి పర్యవసానాలను కూడా గమనంలో ఉంచుకోవాలి.రాష్ట్ర జనాభాలో 53శాతంగా ఉన్న మెయితీ సామాజిక తరగతికి చెందిన వారు తమను షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్దమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన కోర్టు వారి కోర్కెను పరిశీలించాలని ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులుగా ఉన్న కుకీలు, నాగాలు తమ భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బిజెపి ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చేందుకు పూనుకోలేదు.ఏప్రిల్ 28వ తేదీన సిఎం బిరేన్ సింగ్ చురుచందపూర్ అనే చోట ఒక జిమ్ను ప్రారంభించేందుకు రానుండగా ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు.గిరిజన-గిరిజనేతర ప్రాంతాలన్నింటా కనిపిస్తే కాల్చివేత ప్రకటించి ప్రభుత్వం మరింత రెచ్చగొట్టింది.గిరిజన విద్యార్ధి సంఘం మే మూడవ తేదీన చురుచందపూర్లో గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపునిచ్చింది.ఆ సందర్భంగా హింసాకాండ చెలరేగింది. గిరిజనేతర ప్రాంతాల్లోని గిరిజనుల మీద, చర్చ్ల మీద దాడులు జరిపారు. అప్పటి నుంచి రాష్ట్రం అగ్నిగుండంగా మారింది.
మణిపూర్ భూ సంస్కరణల చట్టం ప్రకారం గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు, భూములు కొనేందుకు వీల్లేదు.గిరిజనేతరులు ఇంఫాల్ లోయ ప్రాంతానికే పరిమితం కావాలి. అక్కడ రాష్ట్రంలోని భూమిలో పదిశాతమే ఉంది. గిరిజనులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. గిరిజనేతరుల్లో ఎక్కువ మంది హిందువులు, గిరిజనులంతా క్రైస్తవులు. అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను 40 చోట్ల మెయితీలే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వారి మద్దతు కోసమే రాష్ట్రాన్ని బిజెపి అగ్నిగుండంగా మార్చిందా ? విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.
కాశ్మీరులో నిజంగా ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించారా ? అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? బిజెపి చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంత ? ఇక్కడ ఉగ్రవాదాన్ని ఐదు దశలుగా విభజించాలి. ఎప్పుడు ఎవరి పాలనలో ఏం జరిగిందో దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.1988 నుంచి 1997వరకు కాంగ్రెస్ పాలన.1998 నుంచి 2003 వరకు ఎన్డిఏ వాజ్పాయి ఏలుబడి, 2004 నుంచి 2013వరకు తిరిగి కాంగ్రెస్ పాలన. 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్రమోడీ అధికారం.2019 ఆగస్టు నుంచి కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఈ కాలంలో మరణించిన పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు, చొరబాటుదార్ల సంఖ్యలు. బ్రాకెట్లలో ఉన్నవి వార్షిక సగటుగా గమనించాలి.
ఎవరు×××1988-97××××1998-03×××××2004-13××××× 2014-2023×× కేంద్ర పాలన
పౌరులు××7692(769.2)××5583(797.5)××1503(150.3) ××× 350(38.8)×××× 99(33)
భద్రతా ××1988(198.2)××3367(481)××1158(115.8) ××× 569(56.9)××××× 131(43.6)
ఉగ్రవాదు×11352(1621.7)××5583(797.5)××4221(424.1)××× 1485(148.5)×× 618(206)
పైన పేర్కొన్న అంకెలను చూసినపుడు కాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు,కొత్తగా భద్రతా దళాలకు అధికారం ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న కాలంలో జరిగిన పరిణామాలను చూసినపుడు అంతకు ముందు జరిగిన వాటితో కుడి ఎడమలుగా ఉన్నాయి తప్ప ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలన కాలేదు. వాజ్పాయి పాలనతో పోల్చినపుడు అదే కాశ్మీరులో ఆర్టికల్ 370 ఉండగా కూడా కాంగ్రెస్ ఏలుబడిలో ఉగ్రవాదం తగ్గినట్లు అంకెలు చెబుతున్నాయి. పలు కారణాలతో ఉదంతాలు తగ్గినపుడు తమ ఘనతగాను లేనపుడు పాక్ కుట్రగానూ వర్ణిస్తే కుదురుతుందా ? తగ్గినపుడు పాక్ దూరంగా ఉందని చెబుతారా ?
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సిఓ) సమావేశానికి హాజరైనపుడే ఉగ్రవాదులు మన పారా ఎస్ఎఫ్(స్పెషల్ ఫోర్సెస్) దళానికి చెందిన ఐదుగురు కమాండోలను చంపారు. అదే జమ్మూ ప్రాంతంలో ఏప్రిల్ 20న ఐదుగురు సైనికులను చంపారు. తాజా ఉదంతాలను చూసినపుడు ఉగ్రవాదులు కాశ్మీరు నుంచి జమ్మూకు తమ కుట్రలను విస్తరింప చేసినట్లు కనిపిస్తోంది. చిన్న బృందాలుగా దాడులు చేసేందుకు శిక్షణ పొందినట్లు కూడా చెబుతున్నారు. అది పాకిస్తాన్లో తప్ప మన గడ్డమీద సాధ్యం కాదు. వీటి గురించి మనకు అమెరికా ఎందుకు సమాచారం అందించటం లేదు అన్నది ప్రశ్న. పూంచ్లో ఏప్రిల్ 20న జరిపిన దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిలిటరీ వదలి వెళ్లినవని గుర్తించారు. వాటిని అక్కడి తాలిబాన్లు మన దేశంలోని ఉగ్రవాదులకు అందిస్తే తప్ప దొరికేవి కాదు. మరోవైపున ఉగ్రవాదులు స్థానికంగా, విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లో దొరికిన సమాచారం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు ఉగ్రవాదులకు నిధులు దొరక్కుండా చేయటం ఒకటని చెప్పారు. మరి ఇప్పుడు దీనికి ఏ సాకు చెబుతారు ? పాత నోట్లు రద్దు చేసి కొత్తగా రెండువేల నోట్లు ముద్రించి మరింత పెద్ద మొత్తాలను సులభంగా అందచేసేందుకు అదే మోడీ సర్కార్ వీలు కల్పించింది.