• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: trs

మూడవ ప్రత్యామ్నాయం-కెసిఆర్‌ ముందున్న సమస్యలు !

15 Saturday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), KCR, RJD, Third front formation in India, trs


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్‌ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్‌ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్‌ జాతీయ సభ, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్‌ ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.


కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ను కెసిఆర్‌ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్‌ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్‌ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్‌ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నేత జనానికి చెప్పకనే చెప్పారు.


తేజస్వి యాదవ్‌ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కెసిఆర్‌ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్‌ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్‌ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్‌ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్‌ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.


వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్‌ఎస్‌ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్‌ గురించి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.


టిఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్‌డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్‌ గురించి కెసిఆర్‌ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.


రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్‌ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్‌ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.


ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.


టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్‌ఎస్‌ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్‌ఎస్‌-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.


అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్‌ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్‌ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.


కెసిఆర్‌ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్‌ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్‌ఎస్‌, దాని అధినేత కెసిఆర్‌ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆసక్తి గొలుపుతున్న తెలంగాణా రాజకీయాలు – ఈ సారీ ముందస్తు ఎన్నికలేనా !

20 Monday Sep 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Telugu, Uncategorized

≈ Leave a comment

Tags

Bandi Sanjay, BJP, KCR, Revanth Reddy, Telangana Left, Telangana politics, trs

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డాగా తెలంగాణా గడ్డను మారుస్తారా ?

06 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Telangana

≈ 1 Comment

Tags

AIMIM, BJP, GHMC election 2020, trs


ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్‌ అన్ని స్ధానాలకు కాంగ్రెస్‌ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్‌ 55, బిజెపి 48, మజ్లిస్‌ 44, కాంగ్రెస్‌ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్‌ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్‌ 15.85 ——– 18.28
కాంగ్రెస్‌ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్‌ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్‌ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్‌ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41

పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్‌ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్‌ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్‌ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్‌ పరిధి వేరు.

కాంగ్రెస్‌ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్‌ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్‌-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.

చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్‌ కారు !
టిఆర్‌ఎస్‌ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్‌ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.

మజ్లిస్‌ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్‌ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్‌, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్‌ విమర్శించక తప్పలేదు. మజ్లిస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్‌ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్‌ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్‌ లేదా కొంతకాలం మేయర్‌ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్‌ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్‌ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్‌ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్‌ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్‌ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్‌-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్‌ సర్కార్‌ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్‌ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్‌ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్‌ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్‌ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్‌ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్‌ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్‌ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చౌకీదారుగా నరేంద్రమోడీ – సిఇఓగా చంద్రబాబు విఫలం !

07 Thursday Mar 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, CEO chandrababu naidu, chandrababu naidu, chowkidar narendra modi, Data Theft, Narendra Modi, trs, ysrcp

Image result for as chowkidar narendra modi

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తోంది. దీనికి నేరపూరిత అంశాలు తోడవుతున్నాయి. నేను దేశానికి పెద్ద కాపలాదారును అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అని పిలిపించుకోవటం కంటే సిఇఓ అంటేనే నాకు పెద్ద కిక్కబ్బా అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పుకొని ఎంతో తృప్తి పొందారు. ఇప్పుడు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. పెద్ద కాపలాదారు సంరక్షణలో వున్న రాఫెల్‌ విమానాల లావాదేవీలు, చర్చల పత్రాలు చోరీకి గురైనట్లు మార్చి ఆరవతేదీన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా తాము నిల్వచేసిన తమ పార్టీ సమాచారం చోరీకి గురైందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణా పోలీసులు, మరికొందరి మీద గుంటూరు జిల్లాలో ఫిర్యాదు చేశారు. అతి పెద్ద కాపలాదారు రక్షణలో వున్న రక్షణ శాఖ పత్రాల చోరీ గురించి ఎలాంటి ఫిర్యాదు లేదా కేసు నమోదు లేకుండానే ఏకంగా వున్నత న్యాయ స్ధానానికి తెలియచేయటం సరికొత్త వ్యవహారశైలికి నిదర్శనం. సమాచార చౌర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్యలు, చర్చ మొదలైన వారం రోజులకు తమ సమాచారం పోయిందని తెలుగుదేశం గొల్లు మంటూ కేసు దాఖలు చేసింది. సామాన్యులు ఈ పరిణామాలను ఒక పట్టాన అర్ధం చేసుకోవటంలో విఫలమైతే జుట్టుపీక్కోవటం తప్ప ఏమీ చేయలేరు.

రెండు అంశాలు స్పష్టం. రాఫెల్‌ పత్రాలు చోరీకి గురైనట్లు మోడీ సర్కార్‌ కోర్టుకు నివేదించటం అంటే హిందూ పత్రిక వెల్లడించినవి వాస్తవమే అని నిర్ధారించటం. రెండవది చేయాల్సిన పని చేయనందుకు పెద్ద కాపలాదారు మీద ముందు కేసు నమోదు చేసి వుద్యోగం నుంచి వూడగొట్టాలి. ఏండ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా చోరీ చేసేందుకు వీలుగా వుంచి కాపాడుకోవటంలో విఫలమైన తెలుగుదేశం కంపెనీ సిఇవో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బాధ్యతల్లో కొనసాగించటమా లేదా అన్నది సదరు కంపెనీ లేదా పార్టీకి వదిలివేద్దాం. దొంగలు దోచుకుపోయిన తరువాత ఇంటికి తాళాలు వేసినట్లు తెలుగుదేశం వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఎందుకాపని చేశారంటే మిగిలిన సమాచారాన్ని కాపాడుకొనేందుకు అంటున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ధర ఎక్కువా, తక్కువా, ఎంతో అనుభం వున్న ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీకి కట్టబెట్టారా లేదా అన్న చర్చ జరుగుతోంది, వున్నత న్యాయస్ధానంలో విచారణలో వుంది. వాటిని పక్కన పెడితే రాఫెల్‌ విమానాలో మరొకటో మన వాయుసేనకు అవసరం అనేదానిలో ఎలాంటి తేడాలు లేవు. రాఫెల్‌గాక పోతే మరోకంపెనీ లావాదేవీలు లేదా ప్రభుత్వం చెబుతున్నట్లు అత్యంత రహస్య సమాచారాన్ని నరేంద్రమోడీ సర్కారు జాగ్రత్త పరచలేదు అన్నది తేలిపోయింది. సదరు పత్రాలు హిందూ పత్రిక చోరీ చేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఆరోపించింది.

ప్రపంచంలో ఇలా అధికారిక పత్రాలు బహిర్గతం కావటం కొత్తేమీ కాదు. అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వుంచే సమాచారాన్ని జూలియన్‌ అసాంజే అనే పెద్ద మనిషి బహిర్గతం చేసిన వాటిని సంవత్సరాల బడి చదువుతూనే వున్నా ఇంకా తరగటం లేదు. కళ్ల ముందు జరిగే ఒక దుర్మార్గం లేదా ఒక అక్రమాన్ని సహించలేని వారో లేదా సదరు లావాదేవీ పోటీలో వెనుక బడి తోటి కంపెనీ అక్రమాలకు బలైన వారో ఇలాంటి పత్రాలను స్వయంగా మీడియాకు తెచ్చి ఇవ్వటం బహిరంగ రహస్యం. అలాంటి వనరు ఏదో ఒకటి లేకుండా మీడియా వ్యక్తులు దొంగతనం చేసి సంపాదించిన దాఖలా లేదా అలాంటి వుదంతాలలో శిక్షలు పడిన వుదంతాలు నాకైతే కనపడలేదు. అదే హిందూ పత్రిక గతంలో బోఫోర్సు పత్రాలను, బిజెపి నేత మాజీ మంత్రి అయిన అరుణ్‌శౌరీ జర్నలిస్టుగా వున్న సమయంలో అనేక కుంభకోణాలను బయట పెట్టారు. కానీ అప్పుడెవరూ ప్రభుత్వ పత్రాలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయలేదు. జర్నలిస్టులను దొంగలుగా చిత్రించి కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో, ప్రపంచంలో కేసులు వుండని జర్నలిస్టులు, మీడియా సంస్ధలు వుండవు.

రాఫెల్‌ లావాదేవీల అక్రమాల గురించి హిందూ పత్రిక ప్రకటించిన వెంటనే ఫిబ్రవరి ఎనిమిదిన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దానిలో చోరీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నెల రోజుల తరువాత చోరీ జరిగిందని అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వాటిని బయట పెట్టిన రెండు పత్రికల మీద విచారణ, చర్యను పరిశీలిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. అది కూడా ఈ లావాదేవీలపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలన్న పిటీషన్లపై విచారణ ప్రారంభమైన తరుణంలో అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కోర్టులో చేసిన వాదనను చూస్తే అధికార రహస్యాల చట్ట వుల్లంఘన అనే కత్తిని మీడియా మీద ప్రయోగించేందుకు పూనుకుందన్నది స్పష్టం. దాన్నే రక్షణగా చేసుకొని పునర్విచారణను అడ్డుకోవాలని చూస్తోంది. పునర్విచారణ పిటీషన్‌ విచారణకు ముందే వార్తా పత్రికలు సంబంధిత అంశాలను ప్రచురించటం కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే అని అందువలన ఇది కోర్టు ధిక్కారం కూడా అని ఏజి వాదించారు. దీనికి ప్రతిగా పిటీషన్‌దారైన ప్రశాంత భూషణ్‌ కోర్టుకు వాస్తవాలను వివరించే పిటిషనర్లను అడ్డుకొనే ప్రయత్నమే ఏజి ప్రకటనలని నిజానికి అవే కోర్టు ధిక్కరణకిందికి వస్తాయన్నారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం వున్న ఏదేశంలోనూ ఒక వార్త మీడియాకు ఎలా వచ్చిందో చెప్పాలని ఆదేశించే హక్కు ఏ కోర్టుకూ లేదు. మీడియాకు అనేక వనరుల నుంచి వార్తలు వస్తాయి. వాటిని బయటకు వెల్లడించబోమనే ఎలాంటి రాతకోతలు లేని హామీతోనే స్వీకరిస్తాయి, ప్రచురిస్తాయి.అలాంటి విశ్వసనీయతను మీడియా కాపాడుకొంటూ వస్తోంది. ఈ వుదంతంలో హిందూ పత్రిక ప్రచురించిన వాటి గురించి పత్రిక చైర్మన్‌, స్వయంగా రాఫెల్‌ పత్రాలను బయట పెట్టిన ఎన్‌ రామ్‌ ఈ విషయాలనే స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలు కోర్టు విచారణలోనూ వస్తాయి కనుక వాటి గురించి మరోసారి పరిశీలిద్దాం.

Image result for as ceo  chandrababu naidu failed

తెలుగుదేశం- వైసిపి మధ్యలో తెరాస !

రెండవ అంశం ఆంధ్రప్రదేశ్‌, తెలుగుదేశం పార్టీ సమాచార చోరీ వివాదం.సమాచార చోరీ చాలా సంక్లిష్టమైనది. దానికి ముందే చెప్పుకున్న జూలియన్‌ అసాంజే వికీలీక్స్‌ వెల్లడించిన సమాచార వుదంతం చక్కటి వుదాహరణ. అసాంజే ఆస్ట్రేలియా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్‌, ఇరాక్‌ యుద్ధాలు, సిఐఏ, అమెరికా రాయబారులు పంపే ప్రయివేటు సమాచారం లక్షల ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశాడు. అతని మీద నేరుగా చర్యలు తీసుకొనే అవకాశం లేక లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై స్వీడన్‌ అరెస్టు చేసి విచారణ జరిపింది, తేలిందేమీ లేదు. స్వీడన్‌తో అమెరికాకు వున్న ఒప్పందం కారణంగా రహస్యాలను బయట పెట్టిన కేసులో అమెరికాకు అప్పగిస్తామని స్వీడన్‌ ప్రకటించింది. దాంతో అతను బ్రిటన్‌ పోలీసులకు లంగిపోయాడు. పదిరోజుల పాటు విచారించి బెయిలు మీద విడుదలయ్యాడు. బ్రిటన్‌ కూడా అమెరికాకు పంపే యత్నాలను గమనించి బ్రిటన్‌ పోలీసుల కళ్లుగప్పి లండన్లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్ర యం పొందాడు. 2017లో ఈక్వెడార్‌ పౌరసత్వం కూడా పొంది అక్కడే వుంటున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలు అర్దమైతే తప్ప ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అర్ధం కాదు.

స్వాతంత్య్రం తరువాత అనేక రాష్ట్రాలను చీల్చి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. బహుశా ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పార్టీల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం ఒక విధంగా భారత రాజకీయ రంగం మీద కొత్త అంకం అనుకోవాల్సి వుంటుంది. తెలుగు వారు గణనీయ సంఖ్యలో వున్న కర్ణాటకలో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్రసమితి(తెరాస) మధ్య మొదలైన తెరవెనుక రాజకీయ పోరు గతేడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదకు వస్తే, ఇప్పుడు అది కత్తులు దూసుకొనే స్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకోవాలి అని అనుకోవాలేగానీ అవకాశాలు, సాకులు బోలెడన్ని.మనకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ గనుక చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క, ఎత్తుకు పై ఎత్తు, దొరికితే దొంగలు, జగత్‌ కిలాడీలు, జగత్‌ జెంత్రీలు వంటి సినిమాలను చూసి తెలుగువారు చాల మెళకువలను నేర్చుకున్నారు. తాజాగా వచ్చిన ఎఫ్‌టు అనే తెలుగు సినిమాలో ఒక అధికారి తాను తెలంగాణా లేదా ఆంధ్రకు చెందిన వాడిని అని చెబితే ఎక్కడ తేడా వస్తుందోనని కేంద్ర పాలిత ప్రాంతం యానం అని చెబుతాడు. ఇప్పుడు వర్తమానానికి వస్తే సమాచార చౌర్యం. సమస్య తెలుగుదేశం-వైసిపి వ్యవహారంలా వున్నప్పటికీ బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి పాత్రకూడా తక్కువేమీ కాదు. దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారు, ఫిర్యాదులు చేసిన వారందరూ సామాన్య జనాన్ని గందరగోళపరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన ఐటి గ్రిడ్స్‌ ఇండియా అనే ఒక కంపెనీ తెలుగుదేశం పార్టీకోసం సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారు చేసిందని, దానిలో వుపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పధకాల లబ్దిదారులు, ఓటర్ల వివరాలను తస్కరించారని హైదరాబాద్‌కు చెందిన టి లోకేశ్వర్‌ రెడ్డి అనే సమాచార విశ్లేషకుడు మార్చినెల రెండవ తేదీన హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సమాచార చోరీ వివాదం ప్రారంభమై సినిమాల్లో మాదిరి మలుపులు తిరుగుతోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటిగ్రిడ్‌ కంపెనీలో సోదాలు జరిపి సిబ్బందిని ప్రశ్నించారు. యజమాని ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతను అమరావతిలో అంటే విజయవాడలో ఏపి పోలీసుల రక్షణలో వున్నాడన్నది బిజెపి, తెరాస ఆరోపణ. దాని గురించి తెలుగు దేశం పార్టీ వారు అవుననీ, కాదనీ ఏమీ మాట్లాడరు. మార్చి మూడవ తేదీన ఏపి పోలీసులు హైదరాబాదు వచ్చి సమాచార చోరీ ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అతనేమీ సమాచార దొంగకాదు. ఐటి గ్రిడ్‌ సిబ్బందిని నిర్బంధించారన్న అరోపణలతో కోర్టుకు ఫిర్యాదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా తమను ప్రశ్నించారు తప్ప నిర్బంధించలేదని కోర్టుకు తెలపటంతో కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది. ఐటి గ్రిడ్‌ కంపెనీని వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించటంతో సమాచార చౌర్యం కేసు రాజకీయ రంగు పులుము కుంది.

ఈ లోగా హైదరాబాద్‌కు చెందిన దశరధరామి రెడ్డి అనే మరోవ్యక్తి హైదరాబాద్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో తాత్కాలికంగా నివాసం వుంటున్న వారి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వస్ధలాలలో ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్నది దాని సారాంశం. ఫిర్యాదుదారు హైదరాబాదులో వుండటంతో తాము ఇక్కడ కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సమాచార తస్కరణ కేసు సత్వర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాదు పోలీసులు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలంగాణాకు చెందిన పోలీసులు, కొందరితో కుమ్మక్కై తమ పార్టీ సమాచారాన్ని అపహరించారని పేర్కొన్నారు. తెలంగాణా పోలీసులు సత్వర విచారణకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే , దానికి పోటీగా ఏపి సర్కార్‌ రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఒకటి తెలుగుదేశ ం పార్టీ సమాచార చౌర్యం మీద అయితే రెండవది ఫారం ఏడుతో అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన వారి మీద చర్యతీసుకొనేందుకు అని ప్రకటించారు.

చట్టపరమైన అంశాలు, కేసులు ఏమౌతాయి అన్న అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ వివాదం ఎందుకు మొదలైందన్నది ఆసక్తి కలిగించే అంశం. తమ వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెటింగ్‌ వ్యూహాలను రచించుకొనేందుకు ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్‌ కంపెనీలు జన ఆమోదంతో నిమిత్తం లేకుండా మభ్య, ప్రలోభపరచి లేదా సాధ్యంగాక తస్కరించి సమాచార సేకరణ,దాయటం అందరికీ తెలిసినదే. ఇప్పుడిది కార్పొరేట్‌ రాజకీయ పార్టీలకు పాకింది. పార్టీ కార్యకర్తల, సభ్యుల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో సమాచార సేకరణ, ఎన్నికల సమయంలో దాన్ని వుపయోగించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది.గతంలో ముఖ్య మంత్రి పేరుతో ప్రతి ఇంటికీ లేఖలు రాస్తే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారులను కూడా చేర్చి తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవటం అసలు వివాదానికి మూలం. విచారణలో ఏ విషయాలు బయటపడతాయో లేక ఓటుకు నోటు కేసు మాదిరి తెరవెనుకకు పోతాయో మనకు తెలియదు. ఒకటి జరిగి వుండాలి. ఇది వూహ మాత్రమే. తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్‌కు అప్పగించి తన యాప్‌ ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు నిర్ణయించి వుండాలి. అది తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణాలో తన మిత్రపక్ష సహకారంతో ఆ సమాచారాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రతి వ్యూహం రచించి వుండాలి. దానిలో భాగంగానే తస్కరణ ఫిర్యాదులు, ఐటి గ్రిడ్‌పై పోలీసుల విచారణ,సమాచార కాపీ, దాన్ని వైఎస్‌ఆర్‌సిపికి అందచేసి వుండాలి. దీనిలో మరొక అంశం ఏమంటే తమకు ఓటు వేసే అవకాశం లేదు అనుకొనే వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లకు తెలియకుండానే కొందరు కుట్ర చేసి దరఖాస్తులు చేయటం, వాటిని అధికారం యంత్రాంగం తెలిసీ లేదా తెలియనట్లు నటించిగానీ దరఖాస్తులో కోరిన మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించటం జరుగుతోంది. ఇలాంటి చర్యలకు తెలుగుదేశం-వైసిపి రెండు పార్టీలూ పాల్పడ్డాయన్నది అందరినోటా వినిపిస్తున్న అంశం. ఎవరు సమాచారాన్ని దొంగిలించారు లేదా ఎవరు ఐటి గ్రిడ్‌కు అప్పగించారు, దాని దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌ సర్కార్‌ సాయంతో వైసిపికి అందచేశారా అనేది ఒకటైతే ఆ సమాచారం అంతా అసలు మన దేశంతోనే సంబంధం లేని అమెజాన్‌, గూగుల్‌ కంపెనీల సర్వర్లకు చేరిందన్నది మరొక అంశం. మరి అదెలా జరిగినట్లు ?

నిజానికి ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయిగానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఎందుకు అంటే రెండు పార్టీలు అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీ దుకాణం ఖాళీ అవుతుంది. గత ఎన్నికలలో తెలుగు దేశం సీట్ల పరంగా ఎక్కువ పొందినా ఓట్ల పరంగా పెద్దగా రాబట్టలేదు. రెండు పార్టీల మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఏ పార్టీ అయినా అధికారానికి వస్తేనే అది ఐదు సంవత్సరాలూ నిలుస్తుంది. ఏదో ఒకసాకుతో ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులను టోకుగా లేదా చిల్లరగా కొనుగోలు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తన బలాన్ని పెంచుకొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వున్నప్పటికీ స్పీకర్ల అండ, చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ఫిరాయింపుదార్లను రక్షిస్తున్నారు. పార్టీ మారకుండానే మంత్రిపదవులను సైతం కట్టబెట్టిన విపరీతాన్ని చూశాము. అందువలన ఎలాగైనా సరే అధికారాన్ని పొందాలన్నదే ఏకైక సూత్రంగా ఇప్పుడు అధికారపార్టీలు పని చేస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్నికల తాయిలాలు, డబ్బులు పంచటం, కులాన్ని రంగంలోకి తీసుకురావటం పాత పద్దతులు. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలుగా వున్న వారి వ్యాపారాలు, ఇతర లావాదేవీలను దెబ్బతీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ద్వారా తమవైపు తిప్పుకోవటం అధికారపార్టీలు కొత్తగా ప్రారంభించిన ప్రమాదకరక్రీడ. ఎవరు అధికారంలో వుంటే వారు దీన్ని ఆడుతున్నారు. ఇది రాష్ట్రాలను దాటింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తన లేదా తన మిత్రపక్ష రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్ధలను వుపయోగించుతోందన్నది ఒక విమర్శ. హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా వున్న వారు బహిరంగంగానే ఆరోపించిన అంశం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణా వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఈ పని చేస్తోందన్నది ఆరోపణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఏపికి చెందిన చంద్రబాబు నాయుడు జోక్య ం చేసుకొని తమను ఓడించేందుకు ప్రయత్నించినదానికి ఇది బదులు తీర్చుకోవటంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ సమాచార చోరీ జరిగిందన్న ఫిర్యాదుకు, తమ సమాచారాన్ని చోరీ చేశారన్న ఆరోపణకు రెండింటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వుంది. అధికారంలో వున్న పార్టీగా అధికారిక సమాచార చోరీ నివారణకు, చివరకు స్వంత సమాచార చోరీని అడ్డుకోవటంలో ఎందుకు విఫలమైంది అన్నదానికి జవాబు చెప్పాల్సింది వారే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడని, సామాజిక మీడియాను వుపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో కూడా జాబితా తయారీలోనే ఓటర్లకు ప్రలోభాలు, తమకు ఓట్లు పడవు అనుకున్న ప్రాంతాలలో ఓటర్లజాబితాల్లో అక్రమాలు, కుంటి సాకులు చూపి ఓటర్లను అడ్డుకోవటం బహిరంగ రహస్యం.

ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తొలగింపుల గురించి తెలుగుదేశాంవైసిపి పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే రేపు ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాకపోతే రెండోవారిని నిందించటానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోవాలి.ఓట్ల తొలగింపు గురించి సాధారణంగా ఎన్నికల రోజు, లేదా తరువాత ఆరోపణ,ప్రత్యారోపణులు వస్తాయి.అలాంటివి ఇప్పుడు ముందే వస్తున్నాయంటే అర్ధం అదే. ఈ పూర్వరంగంలో ఎన్నికల సంస్కరణలు లేదా నిబంధనల సవరణ అంశం ముందుకు వస్తోంది. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఇచ్చినట్లే, రద్దు దరఖాస్తుల ప్రకారం ఏ ఓటర్లను తొలగిస్తున్నదీ, అభ్యంతరాలుంటే తెలియచేయాల్సిందిగా కోరుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందచేస్తే తప్పుడు దరఖాస్తులా నిజమైనవా అన్నది తేలుతుంది. కనీసం తొలగింపు ఓటర్లను బూత్‌ల వారీ ఎలక్ట్రానిక్‌ జాబితాలను అయినా పార్టీలు, ఓటర్లకు అందుబాటులో వుంచి సరిచూసుకొనేందుకు వీలు కల్పించాలి. బోగస్‌ దరఖాస్తులుగా తేలిన వాటిని దరఖాస్తుదారులను, వాటిని విచారణ చేయకుండా ఆమోదించి ఓట్లను తొలగించిన సిబ్బంది మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటువంటివి పునరావృతం కాకుండా వుంటాయి. ఒకసారి ఓటు హక్కు వచ్చిన తరువాత ఓటరు స్వయంగా కోరితే లేదా మరణిస్తే తప్ప జాబితా నుంచి రద్దయితే దానికి జాబితా తయారు చేసినవారిని బాధ్యులుగా చేయాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నయీం తరువాత గ్యాంగస్టర్ల భవితవ్యం ఏమిటి ?

14 Sunday Aug 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, gangsters, Naeem, tdp, Telangana police, trs

సత్య

   హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలోని షాద్‌ నగర్‌ దగ్గరలో పోలీసులు మట్టు పెట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం గురించి కొన్ని మీడియా సంస్ధలు పేజీల కొద్దీ కథనాలను వండి వడ్డిస్తున్నాయి. వాటిని పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. స్త్రీ వేషధారణలో వున్న నయీం ఫొటోను విడుదల చేసిన పోలీసులు వాటికి మరింత కిక్కు ఎక్కిస్తున్నారు. అంతకు ముందు గ్యాంగస్టర్‌ కధాంశంగా నిర్మించిన రజనీకాంత్‌ సినిమా కబాలీ గురించి కూడా మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాఖ్యానాలు ఇచ్చింది. మనం అమ్మే సరకు ఏదన్నది కాదన్నయా దాని వలన మనకు ఎంత డబ్బు వస్తుందన్నదే ముఖ్యం అన్నట్లుగా పత్రికలు, టీవీ ఛానల్స్‌, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియా వంటివి దేనిని ఆదాయవనరుగా మార్చుకోవచ్చో నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నయీం గురించి వర్ణితమౌతున్న కధనాలు రాంగోపాల్‌ వర్మ తన అభిమాన హీరోయిన్‌ శ్రీదేవికి 53ఏండ్లు నిండిన కారణంగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీయలేకపోయినా వేరే వారితో హాలీవుడ్‌ మాదిరి సీరియల్‌ సినిమాలు తీయటానికి పనికి వస్తాయి. ఎందుకంటే నయీం కధలలో చీమలను, నరికిన వేళ్లను కరకరా నమిలి తినటం వంటి వాటితో సహా లేడీ డాన్‌లు,గోవా బీచ్‌లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది కనుక కల్పిత పాత్రల కోసం చూడనవసరం లేదు.

    ఒక గ్యాంగ్‌స్టర్‌ హతమైన తరువాత అతగాడి బాధితుల గురించి కధనాలు రాసినట్లుగానే, నిజాలను నిర్భయంగా చెబుతాం, రాస్తాం అనే మీడియా రాజకీయ నేతల బాధితుల కధలు ఎందుకు రాయటం లేదు ? పోయినోళ్లందరూ మంచోరే అయితే గ్యాంగస్టర్‌లు కూడా అంతేగా ? పోనీ పోయిన అందరు గ్యాంగ్‌స్టర్ల గురించి మీడియా అలా రాస్తోందా? ఎందుకు రాయటం లేదు? నయీం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్థులను బాధితులకు తిరిగి ఇస్తాం అని చెబుతున్నట్లుగా రాజకీయ నేతలు లేదా ఆ ముసుగులో కబ్జా చేసిన వాటి గురించి ఏమిటి ? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

   ఈ మధ్య కాలంలో అనేక మంది గ్యాంగస్టర్లు, రాజకీయ నేతల బారిన పడిన కథలే కాకుండా మీడియా బారిన పడి ఎలా నష్టపోయిందీ చెబుతున్నారు. నయీం బాధితులకు భరోసా ఇస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా బాధితులకు కూడా అలాంటి హామీ ఇవ్వగలదా ? విక్రమార్కుడి కధలో రాజా నిజం తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి వక్కలౌతుంది అన్నట్లుగా, సమాధానం చెప్పలేకపోతే తల శిరఛ్చేదం అవుతుందనే అపూర్వ చింతామణి కధలు లేదా గులేబకావళికధ సినిమాలో జూదంలో గెలవలేక బందీలుగా మారిపోవటానికి గాని ముందుకు వచ్చే వీరులెవ్వరుంటారు ?

  నయీం వంటి గ్యాంగస్టర్‌లను మట్టుపెట్టినపుడు భవిష్యత్‌లో అలాంటి మరొకరిని ఎదగనీయకూడదని అనేక మంది సామాన్యులు నిజంగానే కోరుకుంటారు. వారి సానుభూతిని కొల్లగొట్టటానికి పాలకులు, అధికార యంత్రాంగం కూడా నిరోధానికి కఠిన చర్యల గురించి భీకర ప్రతిన బూనుతుంది. స్మశాన, ప్రసూతి వైరాగ్యాల మాదిరి రెండవ రోజుకు అవి గుర్తుండవు. అంటే మతి మరపు వైరస్‌ వారిని సోకుతుందా ? ఏమౌతుంది, ఎందుకు అలా జరుగుతుంది.

   భూస్వాములు, దొరలు, దేశముఖ్‌ల హయాంలో వారికి ప్రయివేటు సైన్యాలు వున్న విషయం తెలిసిందే. కావాలంటే పాత సినిమాలు చూడవచ్చు. ఆ ఫ్యూడల్‌ వ్యవస్ధ అంతరించి లేదా అంతరిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారి స్ధానాన్ని గ్యాంగస్టర్లు, తాలిబాన్లు (అన్ని రకాల మతోన్మాదులు) భర్తీ చేస్తున్నారు. అనేక హాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నాయి. ధనిక దేశాలలో మాఫియా, గ్యాంగస్టర్ల ఆధిపత్యం, పట్టు గురించి ఎన్నో పరిశోధనలు, ఎంతో సాహిత్యం వెలువడుతోంది. వారు అనేక చోట్ల సమాంతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాఫియాతో పాటు నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాలలో బూతు ఒకటి. అన్ని రంగాలలో అగ్రస్ధానంలో వున్న అమెరికాలో హాలీవుడ్‌ సినిమాలతో సమంగా బూతు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ పాలక వర్గాలు, వ్యవస్ధ ఎలా అనుమతించింది. ఎలా కొనసాగనిస్తోంది ?

    అందుకే ప్రపంచంలో మనకు ఎక్కడా మంచి భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, మంచివ్యాపారి కనిపించడు. రాజ్యాంగ వ్యవస్ధలు వునికిలోకి వచ్చిన తరువాత వివిధ కాలాలు, దేశాలలో పేరు ఏదైనప్పటికీ పోలీసు, మిలిటరీ అనేది పాలకవర్గాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న అధికారిక యంత్రాంగం. విలువలు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం వంటి వాటి గురించి కబుర్లు చెబుతుంటారు కదా ? అలాంటి వారు పోలీసు వ్యవస్ధద్వారా కొన్ని అక్రమాలు చేయించలేరు. అలాంటి వారు ఏర్పాటు చేసుకొనే అనధికార యంత్రాంగమే గూండాలు. భూస్వామి, దొరలు, దేశ ముఖులు అయితే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను అదుపు చేయటానికి, వారిపై దాడులకు, పెట్టుబడిదారులు అయితే కార్మిక సంఘాలను, వుద్యమాలను దెబ్బతీయటానికి గూండాలతో పాటు మత శక్తులను వుపయోగించుకోవటం, అడ్డదారిలో లాభాల సంపాదనకు వ్యాపారులు స్మగ్లర్లను వినియోగించుకోవటం తెలిసిందే.ఈ శక్తులన్నింటితో సంబంధాలు, వాటాలు వుంటాయి కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పాలకవర్గ రాజకీయనేతలకు వాటిలో వాటా వుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం కూడా పైన పేర్కొన్న అవాంఛనీయ శక్తులు అదుపుతప్పినపుడు అణచివేయటానికి వారిలోని వారినే వినియోగించుకోవటం ప్రారంభమైంది. వుదాహరణకు నక్సల్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం కొంత కాలం సాగింది. అది బూటకం అని జనానికి అర్ధమైన తరువాత శవాల దగ్గర తుపాకులు,ఎర్ర కరపత్రాలు,సాహిత్యం పెట్టటం వంటి పాతబడిన పద్దతుల స్ధానంలో వారిలోకి కోవర్టులను ప్రవేశపెట్టి వారి చేతే మట్టుపెట్టే సరికొత్త ప్రక్రియకు తెరతీశారు. అది ఇప్పటికీ నడుస్తోంది. నిఘా వ్యవస్ధ, సిబ్బంది కంటే ఈ కోవర్టుల ద్వారానే నక్సల్స్‌, గూండా, మాఫియా గ్యాంగుల పక్కా సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలుగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ వ్యవహారం. ఈ క్రమంలోనే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు పోలీసులతో సహా ప్రతివారూ అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఇది ఒక విషవలయం.

    గతం గురించి ఎలాంటి అనుభవాలున్నప్పటికీ ప్రతి తరంలోనూ ఇది పునరావృతం కావటానికి ఇది కూడా లాభసాటి వ్యాపారమే కనుక దానికి నాయకత్వం వహించే వ్యవస్దే దీనిని పెంచి పోషిస్తున్నది. నక్సల్స్‌ ఎందరో భూస్వాములను ఖతం చేశారు, వారి స్ధానంలో కొత్తవారు పుట్టుకు వచ్చారా లేదా, అలాగే సుబ్బరామిరెడ్డి వంటి ఒక పారిశ్రామికవేత్తను హతమార్చారు, అయినంత మాత్రాన ఆ వర్గం అంతమైందా లేదు. ముంబైలో ఎందరో గ్యాంగస్టర్లను అంతమొందించారు, జైళ్లలో పెట్టారు. అయినా అక్కడ కొత్తవారు పుట్టుకు రావటం ఆగిపోలేదే. అమెరికా పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు, ఐఎస్‌ వుగ్రవాదులు, పంజాబ్‌, కాశ్మీర్‌లలో వేర్పాటు వాదులను ఎందరినో హతమార్చారు. అయినా కొత్త వారు తయారు కావటం ఆగిపోలేదే. ఎందుకంటే అమెరికా కొత్తవారిని తయారు చేయటం నిలిపివేయలేదు.

   మీడియా రంగంలో అవాంఛనీయ శక్తులు, ధోరణులు ప్రవేశించటం దేన్ని సూచిస్తున్నది. దిగువ స్ధాయిలో వున్న విలేకర్లు అనేక అక్రమాలను వెలికి తీసి నివేదిస్తే వాటిని ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల సంగతి తెలియనిదెవరికి? దీన్ని చూసిన తరువాత అదే విలేకర్లలో కొందరు సంపాదనకు దగ్గరదారిగా వుందని భావించి అదే పని చేస్తున్నారా లేదా ?అలాంటి యాజమాన్యాల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలియదా ? తెలిసీ ఎందుకు మౌనంగా వుంటున్నారు. కనీస చట్టాలను కూడా అమలు జరిపేందుకు పూనుకోవటం లేదే ? ఇది పత్రికా యాజమాన్యాలు-ప్రభుత్వనేతలు, రాజకీయనేతల కుమ్మక్కు కాదా ?

    అందువలన గూండాగిరి, గ్యాంగస్టర్‌, మాఫియా వంటి పదాలకు సాంప్రదాయ అర్ధాలను నవీకరించి కొత్త తరగతులను జత చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో కొన్ని తరగతుల జనానికి నేరస్థ తెగలనే ముద్రవేసి వారి పునరావాసం పేరుతో కొన్ని కప్పరాలతిప్ప, స్టూవర్టుపురం, సీతానగరం వంటి కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేశారు. చివరికి వారి చేతనే పోలీసు యంత్రాంగం, పలుకుబడిగల పెద్దలు దొంగతనాలు చేయించి వారిని శాశ్వత నేరస్థులుగా చేసిన వుదంతాలు మన కళ్ల ముందే వున్నాయి.

   అనేక ప్రాంతాలలో గూండాలుగా తయారై అర్ధంతరంగా జీవితాలు ముగించిన వారి గురించి తెలుసు. అదొక వారసత్వం మాదిరి వారి వారసులు కూడా తయారై కొనసాగటం మన కళ్ల ముందే కనిపిస్తోంది.వారిని వుపయోగించుకుంటున్న రాజకీయ నేతలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.అందువలన ఒక వీరుడు మరణిస్తే వేయి మంది వుద్బవిస్తారు అన్న మాదిరి ఈ రోజులలో వీరులు వుదయించటం లేదు గాని ఒక గూండా మరణిస్తే పదివేల మంది గూండాలు తయారవుతారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    ఎక్కడైనా ఒక కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద దుకాణంలో ఎవరైనా అంతరించి పోగా మిగిలి వున్న తమ హక్కులను కాపాడు కొనేందుకు కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే వెంటనే వారిపై దాడి. వారి వెనుక ఎవరున్నారని ఆరాలు, ఆ యూనియన్లను అధికారపక్షం స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోతే వారే ఒక యూనియన్‌ పెడతారు. దానిలో అందరూ చేరాలని వత్తిడి చేస్తారు, బెదిరిస్తారు, వేధిస్తారు, దానికి లొంగకుండా అనివార్య స్ధితిలో ఆందోళన చేస్తే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే వారు వెనక్కు పోతారంటూ కఠినంగా అణచివేసేందుకు పూనుకుంటారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ అందరూ ఏకీభావంతో కూడబలుక్కున్నట్లుగా ఒకే విధంగా వ్యవహరిస్తారు. కార్మిక వుద్యమాల గురించి మీడియా కనీస ప్రస్తావన కూడా చేయదు, రాజకీయ ఫిరాయింపులపై చూపిన ఆసక్తి, కేటాయించిన స్ధలం, సమయాలతో పోల్చితే జనం సమస్యలకు ఇచ్చేది నామమాత్రం.అందుకే వెయ్యి మంది నయీంలు తయారు కావటానికి అయినా ఈ వ్యవస్ధ అంగీకరిస్తుంది కానీ ఒక ప్రజా వుద్యమం పురుడు పోసుకొని ఎదగటాన్ని మాత్రం సహించదు. దోపిడీ వ్యవస్ధల మౌలిక లక్షణం అది.

    అందరూ శాకాహారులే మధ్యలో రొయ్యలబుట్ట మాయం, అన్నట్లుగా అందరూ గ్యాంగస్టర్లుగా కఠినంగా వ్యవహరించినవారే గానీ గ్యాంగస్టర్లు తయారవుతూనే వున్నారు, దందాలు చేస్తూనే వున్నారు. నయీం వంటి ఒక సామాన్యుడు గూండాగా మారి వందల మందిని అనుచరులుగా చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నా, నిత్యం అనేక మందిని బెదిరిస్తున్నా, హత్యలు చేసినా, చేయిస్తూ దశాబ్దాల తరబడి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ఇలాంటి పెద్దా, చిన్న గ్యాంగస్టర్లు ఎంత మంది వున్నారు? వారు కూడబెట్టిన ఆస్తులెన్ని, బాధితులెందరు ? వారిని కాపాడిన పోలీసులెవరు? వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన పోలీసులెవరు? వారికి అడ్డుపడిన రాజకీయ నేతలెవరు ? ఎందుకలా చేశారు వంటి అంశాలపై శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు వెల్లడించాలి. ఇవేమీ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కావు, అవాంఛనీయ శక్తుల అసలు రంగు.ప్రభుత్వం అలా చేయకపోతే లేదా తమకు ప్రత్యర్ధులుగా వున్నవారిని మాత్రమే పోలీసు యంత్రాంగం ద్వారా లక్ష్యంగా చేసుకుంటే ఎస్‌సి, ఎస్‌టి కేసుల మాదిరి నయీం ముఠాపై దాఖలైన కేసులు నీరు గారి పోయి, రాబోయే తరాలకు మరింత వుత్సాహమిస్తాయి. ఇప్పటివరకు గ్యాంగస్టర్లపై నమోదు చేసిన కేసులలో వారితో చేతులు కలిపిన వారిని శిక్షించిన దాఖలాలు లేవు. ఒక వేళ అలాంటివి వున్నా ప్రభుత్వం బయట పెట్టి వాస్తవాలను తెలియచేయాలి. అప్పుడే ఎవరైనా ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. రాబోయే రోజుల్లో చిన్న గ్యాంగులు పెద్ద గ్యాంగులుగా మారకుండా చర్యలు తీసుకోవటానికి నిజాయితీగల యంత్రాంగం ముందుకు వస్తుంది.జోక్యం చేసుకొనే పెద్దలు వెనక్కు తగ్గుతారు.

    అలా చేయకపోతే చిత్తశుద్ధిలేని మీడియాలో నయీం గురించి మరికొద్ది రోజులు చదువుకుంటాం. అతగాడి వారసులు రంగంలోకి వచ్చిన తరువాత మీడియాలో వారి గురించి ఒక్క ముక్కా రాదు. ఆ గూండాలు అంతమైన తరువాత అదే మీడియా మరోసారి విజృంభిస్తుంది. కొత్త కథలను వండివారుస్తుంది. యధాప్రకారమే పోలీసు అధికారులు వారిని మేము ఇతర అవసరాలకు వుపయోగించుకున్నాం గానీ, ఇంత ముదురుతారని వూహించలేకపోయాం అంటారు. అతనెవరో కూడా నాకు తెలియదు గానీ అంతమొందించాలని నేను సూచిస్తే పాలకులు అంగీకరించలేదు అని కూడా చెబుతారు. వాటిని నోరు మూసుకొని,చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి. ఎవరైనా కాదంటే పాలకులు, పోలీసులు, గూండాలు కలసి వారి అంతు చూస్తారు.అన్ని దోపిడీ వ్యవస్థలు, ప్రాంతాలలో జరుగుతున్నది ఇదే, ఇక్కడా జరగబోయేది అదే.

    ఇలాంటి వారిని అంతం చేస్తే చాలదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారిని తయారు చేస్తున్న వ్యవస్ధను నాశనం చేసి కొత్త సమాజానికి పునాదులు వేయటమే పరిష్కారం. పేరుదేముంది దానికి ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనవాదం ! మనువాదం !! అవకాశవాదం !!!

10 Sunday Apr 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, communist, Congress, CPI(M), K CHANDRA SEKHRA RAO, manuvadam, Narendra Modi, opportunism, pro people, RSS, tdp, trs

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొడదామంటే కడుపుతో వుంది-తిడదామంటే అక్కకూతురై పోయింది !

01 Tuesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

Amaravati, ANDHRA PRADESH, Andhrapradesh new Capitol, AP CM, Central budget 2016, tdp, Telangana, trs

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు-పార్టీలపై పర్యవసానాలు

06 Saturday Feb 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, Congress, GHMC, HYDERABAD, tdp, trs

ఎంకెఆర్‌

     ఈనెల రెండున జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్ధ ఎన్నికలు అటు ఘన విజయం సాధించిన అధికార పార్టీని, ఇటు ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం-బిజెపి కూటమి, కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచాయంటే అతిశయోక్తి కాదు. మూడు జిల్లాల పరిధిలోని 150 వార్డులకు గాను తెలంగాణా రాష్ట్రసమితి 99,  కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లాలోని నాచారం స్ధానంతో సరిపెట్టుకొని హైదరాబాదు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక అసలైన పరాజయం గౌరవ ప్రద స్ధానంలో వుంటామని కలలు కన్న తెలుగుదేశం-బిజెపి కూటమిది. తెలుగు దేశం పార్టీ రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్టు స్థానాన్ని గెలుచుకొని ఎట్టకేలకు ప్రాతినిధ్యం సాధించింది, బిజెపి నాలుగు స్ధానాలు తెచ్చుకుంది.మజ్లీస్ 44 తెచ్చుకుంది

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధాని స్ధానిక ఎన్నికలలో పాల్గొనటం, ఘోరంగా ఓడిపోవటం మన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో.ఆ ఖ్యాతి ఎన్‌ చంద్రబాబు నాయుడికి దక్కింది. మరొకరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా హెచ్చరికలు చేసింది. హైదరాబాదు ఎన్నికలలో తాము 99 స్ధానాలను గెలుచుకుంటామని అసలు తెలంగణా రాష్ట్ర సమితికే నమ్మకం లేదు.వుంటే ముందు జాగ్రత్త చర్యగా కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేసి ఎంఎల్‌సీల ఓట్లతో గద్దె నెక్కాలని చూసేది కాదు. దానిని కొట్టివేస్తామని కోర్టు సూచన ప్రాయంగా చెప్పటంతో ఎన్నికలు జరిగి-ఫలితాలు వెలువడే మధ్యలో ఒక అసాధారణ ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ తెచ్చి విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌సి దొడ్డిదారితో నిమిత్తం లేకుండానే అప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నారని అది వూహించలేకపోయింది. ఏ మాత్రం పసిగట్టినా అపర ప్రజాస్వామికంగా వుండేది.

    విజయం సాధించింది కనుక చంద్రశేఖరరావు కోర్టు అభిప్రాయాన్ని మన్నించినట్లు ఆ ఆర్డినెన్సుకు కొత్త భాష్యం చెప్పారు. అంత మాత్రాన దానివెనుక వున్న దురాలోచన దాస్తే దాగేది కాదు. ఈ విజయం తెలంగాణా రాష్ట్రసమితిలో కొత్త పరిణామాలకు నాంది పలుకుతుంది. హైదరాబాద్‌ ఎన్నికలను చంద్రశేఖరరావు తనయుడు, మంత్రి కెటిఆర్‌ ఒక్కడే తన బాధ్యతగా ఎదుర్కొన్నారు. అదేదో యాదృచ్పికంగా జరిగిందంటే ఎవరూ నమ్మరు. ఎన్నికల స్క్రిప్టు, డైలాగులు, డైరెక్షన్‌ అంతా కెసిఆర్‌ వారసుడు ఎవరో స్పష్టం చేసేందుకే అన్నది సుస్పష్టం.ఈ విజయంతో తెరాసలో మిగిలిన మంత్రులు, ఇతరులు మరింతగా డమ్మీలుగా మారతారు. అధికారం మరింతగా కుటుంబపరంగా కేంద్రీకృతం అవుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమస్యలకు నాంది పలుకుతుంది. అన్ని పాలక రాజకీయ పార్టీలలో జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేది ఇదే.

    ఒక వూరి మునసబు పక్క వూరికి వెట్టితో సమానం అన్నది ఒక సామెత.దీనిని వినయంతో ఎవరైనా గుర్తిస్తే పరువు నిలబడుతుంది. లేకుంటే చంద్రబాబు నాయుడి మాదిరి శృంగభంగం తప్పదు.కోటి మంది జనాభా వున్న హైదరాబాదు ఎన్నికలకు ప్రాధాన్యత లేదని ఎవరూ అనరు. స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే ప్రచారానికి దిగకుండా ఒక బహిరంగ సభ పెట్టి గౌరవ ప్రదంగా వ్యవహరించారు. ఒక వేళ ఓడిపోతే, తగినన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లినా ఓడిపోయారంటారు. లేకపోతే సిఎం వచ్చి వుంటే విజయం దక్కేది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయం లేదా ఓటమిపై సంశయం కారణంగానే కెసిఆర్‌ ఈ విధంగా ప్రచారానికి దూరంగా వున్నారు. తన కొడుకును దించారు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, గెలిస్తే చెప్పక్కర లేదు. కానీ మిగతావారి పరిస్ధితి అది కాదు.

   పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకంటే తెలుగుదేశంలో పలుకుబడిన నాయకుడిగా చక్రంతిప్పుతున్నారని కొందరంటే, రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కుమారుడు నారా లోకేష్‌, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అంతటి పలుకుబడి కలిగిన మోడీ అంతరంగికులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు వంటి వారు ప్రచారం చేసినా , తమ కూటమి వారిని గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించినా పరాభవమే మిగిలింది. వారు చేసిన ప్రచారం ఓటర్లలో ఎంత వుత్సాహం నింపిందంటే తాము ఓటు వేయకపోయినా సరే తెలుగుదేశం-బిజెపి కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసంతో కాబోలు అసలు ఓటింగ్‌కే రాలేదు. కొన్ని పరిణామాలు మరికొన్నింటిని వేగవంతం చేస్తాయి. ఎక్కడో స్విచ్‌ వేస్తే ఎక్కడో లైటు వెలుగుతుంది.ఎన్నడూ ఓటింగ్‌కు రాని వారు కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో పనిగట్టుకొని వచ్చి హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో తెరాసకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. నగరం మరింతగా విస్తరిస్తోంది. పరిశ్రమలు పెరగటం లేదు,మూతపడుతున్నాయి, కొత్తగా వచ్చే వాటిలో వుపాధి తక్కువగా వుంటోంది. అసమానతలు తీవ్ర మౌతున్నాయి.నగరంలో పారిశుధ్యం, కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్య రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా కానుంది.వాటిని పరిష్కరించకుండా ఎక్కువ కాలం గడపలేరు.

     గతంతో పోలిస్తే తాను మారానని చెబుతూ చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదని ఎన్నికైన తరువాత ప్రతి చర్య ద్వారా జనాలలో గట్టి విశ్వాసం కల్పించేందుకు ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో హైదరాబాడు నగర ఎన్నికలలో తెలుగుదేశం, దానితో జతకట్టిన బిజెపి ఓడిపోవటం పార్టీల కన్నా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా కలిగిన ఘోరపరాభంగానే పరిగణించాలి. తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి. చంద్రబాబు నాయుడు తనను తానే నమ్మడని ప్రతీతి. అందుకని ఇతరులను నమ్మే పరిస్ధితి వుండదు. అలాంటి వ్యక్తి ఎండమావులను కూడా సునామీ వరదలని నమ్మించగల దిట్ట కావటం వలనే ప్రతి తరంలో ఎంతో కొంత మంది అపరచాణుక్యుడని నమ్ముతూ వుంటారు. మాటల ద్వారా మూతులు, డబ్బుతో చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాదులో అదే జరిగింది.

     తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ దుకాణం మూతపడటం గత ఎన్నికల మరుసటి రోజునుంచే ప్రారంభమైంది. అయినా అవకాశం లేని వారు, అనివార్యంగా ప్రతిపక్షంలో వుండాల్సిన వారు లేదా చంద్రబాబు చాణక్యం మీద అతి విశ్వాసం వున్నవారు గానీ మొత్తం మీద పార్టీలో మిగిలారు. ఇప్పుడు మిగిలిన పార్టీ కూడా ఎంత త్వరగా అంతరిస్తుందన్నదే సమస్య. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ ఒకటికి మించి రెండు రాష్ట్రాలలో కొనసాగిన దాఖలా మనకు ఎక్కడా కనపడదు. బీహార్‌, వుత్తర ప్రదేశ్‌లను చీల్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన తరువాత సమాజవాది పార్టీ యుపికి, ఆర్‌జెడి బీహార్‌కు పరిమితం అయ్యాయి తప్ప రెండోచోట లేవు. తెలుగుదేశం పార్టీ అందుకు మినహాయింపు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇంతటి పరాభవం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని వారు అసలు వూహించి వుండరు. ఎందుకంటే చంద్రబాబు మంత్రదండంపై నమ్మకం వున్నవారు ఇంకా గణనీయంగా వున్నారు. వారి సంఖ్యను హైదరాబాద్‌ ఎన్నికలు గణనీయంగా తగ్గిస్తాయి.

    హైదరాబాదు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడికి పోయేదేమీ లేదు, తీరని నష్టం బిజెపికి. మతోన్మాద అజెండా లేకుండా అది మనుగడ సాగించలేదు. ప్రస్తుతం హైదరాబాదులో అటువంటి పరిస్ధితులు లేవు. తెలుగుదేశం వంటి పార్టీతో అది సర్దుబాటు చేసుకోవాలంటే తాత్కాలికంగా అయినా అది మేకతోలు కప్పుకోవాలి. స్వంత ఎజండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది కనుక, ప్రతి ఎన్నికలో అది ఏదో ఒక పార్టీతో లోపాయికారీ వప్పందాలకు వస్తుండటంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. తెరాస స్వంతంగా మెజారిటీ తెచ్చుకున్నది కనుక మజ్లిస్‌ అప్రజాస్వామిక పోకడలను అడ్డుకొని హైదరాబాదు పాతబస్తీలో మార్పులకు శ్రీకారం చుడితే దానిని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా హర్షిస్తారు.లేనట్లయితే మజ్లిస్‌ను చూపి బిజెపి, బిజెపిని చూపి మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తాయి. అది తెరాసకు రాజకీయంగా నష్టదాయకమే గాక, తెలంగాణాకు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.

     కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని అవకాశ వాదానికి అటు వుమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌ జనమూ వ్యతిరేకించారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న చోటా అదే పరిస్ధితి కల్పించారు. వామపక్షాల విషయానికి వస్తే గతంలో వాటికి వున్నదీ లేదు ఇప్పుడు పోగొట్టుకున్నదీ లేదు. తమ నుంచి తమ జనం చేజారి పోయిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి గనుక తిరిగి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనటానికి ఎలాంటి పద్దతులు అనుసరిస్తాయన్నది చూడాల్సి వుంది

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: