• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ukraine-Russia crisis

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రంగనాయకమ్మ గారూ”కుహనా మిత్ర శత్రువు” లతోనే నష్టం ఎక్కువ !

23 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Left politics, NATIONAL NEWS, Political Parties, RUSSIA, USA, WAR

≈ 2 Comments

Tags

#Ranganayakmma, Ranganayakmma, Ukraine-Russia crisis, ultra – leftism


ఎం కోటేశ్వరరావు


రంగనాయకమ్మ గారి మహా రష్యన్‌ దురహం కారం అనే విశ్లేషణపై స్పందించిన నాకు ఆమె ఆత్మానందాన్ని ఆపాదించారు. దానికి పారమార్ధిక పదకోశంలో చెప్పిన ఒక వ్యాఖ్యానం లేదా భాష్యం ప్రకారం కలిమి,బలిమి మరెందులోనూ తనకు మించిన వారు లేరని సంబరపడటం. అలాంటి అంబర సంబరం నాకు లేదుగానీ పురోగామి వాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉంది. మార్క్స్‌కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ స్పందనకు ప్రతిస్పందనగా కొన్ని అంశాలను పాఠకుల ముందుంచుతున్నాను. (ఆంధ్రజ్యోతిలో మార్చి రెండవ తేదీన రంగనాయకమ్మ గారి విశ్లేషణకు నా స్పందన మార్చి12న ప్రచురితం కాగా ఏప్రిల్‌20న రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన ప్రచురితమైంది)


1. లెనిన్‌ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్‌ రిపబ్లిక్‌ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అనే రాశాను. ‘ఫెడరేటివ్‌’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్‌ రిపబ్లిక్‌ అని రాశాను.(చైనా అసలు పేరు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది) ఆ పేరును అంతకు ముందు ప్రభుత్వ నేతగా ఉన్న కెరెన్‌స్కీ పెట్టారని రంగనాయకమ్మగారు రాశారు. కెరెన్‌స్కీ సర్కార్‌ పెట్టిన పేరు ” రష్యన్‌ డెమోక్రటిక్‌ ఫెడరల్‌ రిపబ్లిక్‌ ” అని తెలుసుకుంటే చాలు. లెనిన్‌ అధికారానికి వచ్చిన 1917 నవంబరు ఏడు నుంచి 1918 జనవరి 18న రాజ్యాంగ సభ ‘రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అని పేరు మారుస్తూ డిక్రీ జారీ చేసే వరకు కెరెన్‌స్కీ పెట్టిన పాత పేరు కొనసాగింది. కెరెన్‌స్కీ-లెనిన్‌ ప్రభుత్వం పెట్టిన రెండు పేర్లలోనూ మధ్యలో పదాలు మారినప్పటికీ ” రష్యన్‌ ” అనే పదంతోనే ప్రారంభమైంది కనుక లెనిన్‌ కూడా రష్యన్‌ మహాదురహంకారానికి గురైనట్లు భావించాలా అని ప్రశ్నించాను తప్ప లెనిన్‌ గురైనట్లు నేను చెప్పలేదు. ” రష్యన్‌ ” పదం లేకుండా తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు. స్టాలిన్‌ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో ఉన్నవారిని ఏ విధంగానూ సంతుష్టీకరించలేము.యుఎస్‌ఎస్‌ఆర్‌లో ఉన్నది ఫెడరల్‌ ప్రభుత్వం తప్ప రంగనాయకమ్మగారు పేర్కొన్నట్లుగా రష్యాలోని కేంద్ర ప్రభుత్వం కాదు. అధికార కేంద్రం(రాజధాని) మాస్కోలో ఉన్నంత మాత్రాన అది రష్యన్‌ కేంద్ర ప్రభుత్వం కాదు.


2. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వంతో కుదుర్చుకొనే ఒప్పందాలమీద దేశాధినేతల సంతకాలు, తరువాత వాటిని పార్లమెంటు ఆమోదించటాలు, పార్టీల విధాన రూపకల్పన పద్దతికి ఉన్న తేడా గురించి రంగనాయకమ్మగారికి తెలియదనుకోలేం. ప్రభుత్వ ఒప్పందాలను సులభతరంగా పాఠకులు అర్ధం చేసుకొనేందుకు అధినేతలు ఒప్పందాలు చేసుకున్నారని ఒక జర్నలిస్టుగా అనేక సార్లు స్వయంగా రాశాను. ఒక విధానాన్ని స్టాలిన్‌కు ఆపాదించి తాను చేసిన దాడిని సమర్ధించుకొనేందుకు నేను చేసిన ప్రస్తావనను ఉటంకిస్తూ నేను కూడా వ్యక్తులకు ఆపాదించినట్లు ఆమె చిత్రించారు. ఒప్పందాలపై సంతకాలు సాంకేతికంగా ప్రభుత్వాల తరఫు దేశాధిపతులు లేదా మంత్రులు కూడా చేస్తారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఆమోదించే,అనుసరించే విధానం అన్నది సమిష్టి నిర్ణయం. ఆమోదించిన తరువాత వాటి మీద లెనిన్‌, స్టాలిన్‌ లేదా ఒక వేళ రంగనాయకమ్మగారే ఏదైనా పార్టీ నేతగా ఉంటే ఆమె సంతకాలు, గెజెట్‌ నోటిఫికేషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల ఒప్పందాలను లిఖించేది అధికారులు. పార్టీల విధాన రూపకల్పన పరిధి, అంశాలను కమిటీలు ఆవెెూదించిన తరువాత ముసాయిదా రాతపనిని ఒకరికో, ఒక బృందానికో అప్పగిస్తారు, వారు దాన్ని ప్రతిపాదిస్తారు, లేదా వివాదం తలెత్తినపుడు కొంత మంది కలసి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తారు. వాటికి ఆమోదం లేదా తిరస్కారం తరువాత అది వ్యక్తులది కాదు ఉమ్మడి అభిప్రాయం మాత్రమే. లెనినిజం, స్టాలినిజం,మరొకయిజం అన్నది మార్క్సు-ఎంగెల్స్‌ల తరువాత సంభవించిన నూతన పరిణామాలు లేదా రంగనాయకమ్మగారి వంటి వారు ముందుకు తెచ్చిన భాష్యాల్లోని వక్రీకరణలను తిప్పికొట్టేందుకు లెనిన్‌ ఇచ్చిన వివరణలు మార్క్కిస్టు సిద్దాంతాన్ని పరిపుష్టం చేశాయి, వాటిని దాదాపుగా కమ్యూనిస్టులందరూ అంగీకరించారు గనుక తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అని పిలిచారు. స్టాలిన్‌ కూడా కొన్ని అంశాలకు వివరణ ఇచ్చినప్పటికీ వాటిని స్వీకరించినా దాన్ని స్టాలినిజంగా ఎవరూ పరిగణించటం లేదు. అలాగే మావో వివరణలు ఆమోదించిన వారు మార్క్సిజం-లెనినిజాలకు మావో ఆలోచనా విధానమనో, మావో ఇజమనో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోని వారు కూడా చైనా పరిస్ధితులకు మావో అన్వయించిన సూత్రీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక రంగనాయకమ్మగారి భాష్యాలను ఆమోదించిన వారు మార్క్సు-లెనిన్‌ సరసన ఆమె ఇజాన్ని కూడా చేర్చి విప్లవాలను తేవచ్చేమో ? ఇంతకీ ఆమె ఇజాన్ని ఆమోదించే లేదా అమలు చేసే పార్టీ ఏదైనా ఉందా ? నిజంగా తెలుసుకొనేందుకే !

3) 1953లో స్టాలిన్‌ మరణం తర్వాత అధికారానికి వచ్చిన కశ్చెవ్‌ స్టాలిన్‌ మీద చేసిన దాడి గురించి చెప్పనవసరం లేదు. అదే పెద్ద మనిషి, బ్రెజ్నెవ్‌ కూడా స్టాలిన్‌ విధానాన్నే కొనసాగించాడని అందుకే ఇతర జాతుల వారు విడిపోవాలనే డిమాండ్‌ను ముందుకు తేలేదని రంగనాయకమ్మగారు చెప్పారు. అలాంటపుడు ఆమె దాడి ఒక్క స్టాలిన్‌ మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు ?


4. సోవియట్‌ యూనియన్‌ నించీ విడిపోయాక ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఉంది. వివిధ పార్టీల, ప్రభుత్వాల నేతలు అమెరికా లేదా రష్యా ప్రభావంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాధారణ దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు తప్ప ఏ కూటమిలోనూ చేరలేదు అని మరోసారి చెబుతున్నాను. తాము నాటోలో చేరాలనుకుంటున్నట్లు బుఖారెస్ట్‌ 2008 నాటో సభకు ఉక్రెయిన్‌, జార్జియా దరఖాస్తు చేశాయి. అమెరికా అంగీకరించగా ఐరోపా దేశాలు కొన్ని కాదన్నాయి, కానీ రాజీగా నిర్ధిష్ట గడువును పేర్కొనకుండా ఈ దేశాలు నాటో సభó్యదేశాలు అవుతాయి అని ప్రకటన చేశారు. తాజా సంక్షోభానికి ఆ విధంగా నాటో కూటమి నాంది పలికింది. తరువాత 2010 ఉక్రెయిన్‌ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ వెంటనే సెవాస్తపూల్‌ రేవు కౌలు గడువును 2042వరకు పెంచుతూ రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే పెద్ద మనిషి తరువాత పశ్చిమ దేశాల వత్తిడితో ఐరోపా యూనియన్‌ కూటమితో ఒప్పందానికి 2013 ఏప్రిల్‌లో సుముఖత తెలిపాడు. వెంటనే రష్యా రంగంలోకి దిగటంతో సంతకాలు చేసేందుకు కొద్ది రోజుల ముందు ఆ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు. ఎవరు వత్తిడి చేస్తే అటు మొగ్గాడు.చివరకు పశ్చిమ దేశాలు నిరసనలను ఎగదోయటంతో దేశం విడిచి వెళ్లాడు. వాస్తవం ఇది కాగా ” అతనికి ముందు 1991 నించీ 2012 వరకూ వున్న వాళ్ళూ, అతని తర్వాత వాళ్ళూ అమెరికా కూటమికి అనుకూలురూ అన్నమాట! ” అంటూ రంగనాయకమ్మగారు చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్దామె అనాకారి అన్నట్లుగా ఉంది.


5) ” రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ వుంది అని వ్యాసకర్త సమర్ధన. అసలు అక్కడ, అప్పుడు వున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం. ఇంకా సరిగా చెప్పాలంటే, పార్టీ పెట్టుబడిదారీ విధానం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల స్వంత ఆస్తిగా లేనంత మాత్రాన, అది సోషలిజం కాదు. ” అన్నారు. అంటే సోవియట్‌ యూనియన్ను సోషలిస్టు దేశంగా గుర్తించలేదు. తత్వం తలకెక్కింది రోకలిని తలకు చుట్టమనటం తప్ప మరొకటి కాదు. సోషలిస్టు వ్యవస్దలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్లు ? ఫలితాలను ఎవరు అనుభవిస్తారు ?

6) ” కొన్ని దేశాలు అమెరికా పెత్తనానికీ, దుర్మార్గానికీ బలయ్యాయనీ రష్యాకి అలాంటి దుర్మార్గ చరిత్ర లేదనీ వ్యాసకర్త కితాబు. మరి, 1956లో హంగరీ మీదకీ, 1968లో చెకొస్లవేకియా మీదకీ, 1979లో అఫ్గనిస్తాన్‌ మీదకీ యుద్ధ టాంకుల్ని పంపింది, రష్యాయా, అమెరికాయా? ” అని ప్రశ్నవేశారు. మొదటి రెండు ఉదంతాల్లో సోషలిస్టు వ్యవస్ధకు అమెరికా సిఐఏ కుట్రలతో ముప్పు తలపెట్టినపుడు వాటి రక్షణకు అక్కడి ప్రభుత్వాల కోరిక మేరకు సోవియట్‌ జోక్యం చేసుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష శక్తుల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేసిన కుట్రను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ కోరిక మేరకే అడుగు పెట్టింది. దానిలో ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ కూడా భాగస్వామే. అంతర్జాతీయ కర్తవ్యంగా ఆపని చేసినందుకు సోషలిస్టు అభిమానులందరూ హర్షించారు. రంగనాయకమ్మ వంటి వారు పురోగామివాదులుగా చెప్పుకుంటూ శత్రువులతో గొంతు కలిపి ఖండించారు. సోషలిస్టు శత్రువులకూ-మిత్రులుగా చెప్పుకున్నవారికీ భలే కలిసింది. సోషలిజం, కమ్యూనిజం అంటే గిట్టదు అని సూటిగా వ్యతిరేకించే వారిని అర్దం చేసుకోగలం. వారి గురించి పురోగామి శక్తులకు స్పష్టత ఉంటుంది. కానీ మార్క్సిస్టు ముసుగులో ఉండి దాడి చేసే వారు ” కుహనా మిత్ర శత్రువులు ” తప్ప మరొకటి కాదు. అసలు శత్రువుల కంటే వీరు చేసే నష్టం ఎక్కువ. వారు సృష్టించిన గందరగోళంలో పడిన పురోగామి వాదులు ఎటూ తేల్చుకోలేక పడక కుర్చీలకు తప్ప దేనికీ పనికి రారు. అంతిమంగా వారు పాలకవర్గాలకు మేలు చేస్తున్నారు తప్ప కార్మికవర్గానికి కాదు.
7) ”ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణని సమర్ధించడానికి, వ్యాసకర్త ఒక కొత్త సూత్రాన్ని తయారు చేశారు. ‘అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు’ అని ” అవును, అది మన కళ్ల ముందున్న ఒక వాస్తవం.శాశ్వతంగా అలాగే ఉంటాయని నేను చెప్పలేదు. పెట్టుబడిదారీ దేశాల స్వభావం గురించి మార్క్సూ- ఎంగెల్సులు చెప్పిన మాట నిజం. అది సాధారణ సూత్రీకరణ. పారిశ్రామిక విప్లవం తరువాత మార్కెట్ల ఆక్రమణకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగానే యుద్దాలు జరిగాయి. తరువాత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా దురాక్రమణదారులుగా మారలేదు. వలసలు అంతరించాయి. దాన్ని గుర్తించకపోతే మొరటుతనం అవుతుంది తప్ప మార్క్సిజం లెనినిజం కాదు. సోషలిస్టు చైనా మీద అమెరికా కుట్రలు చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు తోడ్పడితే వారి సహకారం తీసుకోవాలి. దానిలో భాగమే రష్యా-చైనా మైత్రి. అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా, మరొక సోషలిస్టు దేశం గానీ అవకాశం వచ్చినపుడు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం చేసుకోకపోతే శత్రువలలో చిక్కినట్లే ! అసలు ఇంతకూ రంగనాయకమ్మగారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళ గీతం పాడుతున్నారా ?
8) దురాక్రమణ యుద్ధానికి నాజూకైన పేరే ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రంగనాయకమ్మగారు అంటున్నారు. ఎవరు దేన్ని ముట్టుకుంటే దాన్ని అలా వర్ణిస్తారు అన్న అంధ వికలాంగులు- ఏనుగు కథ తెలిసిందే. దీని కంటే కళ్లుండీ చూడలేక మార్క్సిస్టు కబుర్లు చెబుతున్నవారు తమ వక్రీకరణలకు నాజూకైన పేర్లు పెట్టటమే పెద్ద నష్టం కలిగిస్తోంది. రష్యా తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యకబుర్లు చెప్పలేదు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యఖూనీ జరిగిందనా లేదు. నాటో చేరాలనే ప్రతిపాదనను వదులు కుంటే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తిస్తానని, ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇస్తానని చెప్పింది.


9)” అమెరికా, రష్యా, రెండూ పెట్టుబడిదారీ దేశాలే అని ఒక పక్కన ఒప్పుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా రష్యాని బలపరచాలని సలహా ఇస్తున్నారు వ్యాసకర్త” అన్నారు రంగనాయకమ్మగారు. మార్క్సిజంలో ఔపోసన పట్టటానికి ఇంకేమీ మిగిలినట్లు లేదు కనుక ఆమె చరిత్రను ఒక పట్టుపట్టాలి. చైనా విప్లవ చరిత్రలో జపాన్‌ సామ్రాజ్యవాదుల మీద పోరాడేందుకు అప్పటి వరకు తమను అణిచివేస్తున్నచాంగ్‌కై షేక్‌తోనే కమ్యూనిస్టులు చేతులు కలిపారు.” ఇద్దరు బందిపోటు ముఠాలున్నప్పుడు, ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. అంతేగానీ, ‘ఈ బందిపోటుది న్యాయం, ఆ బందిపోటుది కుట్ర’ అని ఏదో ఒక పక్షాన నిలబడడం అంటే, రెండు దేశాల ప్రజలకూ ద్రోహం చెయ్యడమే.” అని చెప్పిన రంగనాయకమ్మగారి సూత్రీకరణలో చైనా పరిణామాన్ని ఎలా ఇముడ్చుతారు ? మావో నాయకత్వంలో అక్కడి పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని చెబుతారా, ఏమో !


10) ”వ్యాసకర్త… అమెరికా, పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ సోషలిస్టు దేశాలు ఎక్కడున్నాయో చెపితే బాగుండేది. చైనాలో మావో గ్రూపూ, చౌ ఎన్‌ లై గ్రూపూ, లిన్‌ పియావో గ్రూపూ అంటూ 3 పెద్ద గ్రూపుల మధ్య కమ్యూనిస్టు పార్టీలోనే వర్గ పోరాటం లాంటిది జరుగుతూ వుండేది. దాని ఫలితంగానే, అప్పటికి ఎన్నో ఏళ్ళుగా సంబంధం లేని అమెరికాతో చైనా సంబంధాలు మొదలైనాయి.” అని రంగనాయకమ్మగారు చెప్పారు. విస్సన్న చెప్పిందే వేదం – నేను చెప్పిందే అసలు సిసలు మార్క్సిజం అని ఆమె అనుకుంటున్నట్లున్నారు. చైనాతో సహా ఇతర సోషలిస్టు దేశాలను గుర్తించటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైద్దాంతిక, విధానాల అమలు మీద అంతర్గత చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ” వర్గపోరాటం ” అని ఏ మార్క్సిస్టు అవగాహన ప్రకారం వర్ణించినట్లు ? అందుకే పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా తొలి స్పందనలో మనవి చేశాను. మరోసారి అదే చేస్తున్నాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” నాగరిక ” ఐరోపాలో ఉక్రెయిన్‌ మహిళల మాన మర్యాదలకు ముప్పు !

20 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

sexual exploitation, Ukraine-Russia crisis, Ukrainian Refugees, UN refugee agency


ఎం కోటేశ్వరరావు


యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు, వద్దే వద్దు ! దానిలో ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలే అన్నది ప్రపంచ అనుభవం. సామ్రాజ్యవాదులు తమ లబ్దికోసం యుద్దాలను రుద్దుతున్నారు. అమెరికా, ఐరోపా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య. దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు అనుసరించిన విస్తరణ వాదం చివరకు తన ముంగిట్లో ముప్పుకు దారితీస్తున్నదనే భయాన్ని రష్యా పదే పదే వెల్లడించినా ఐరాస పట్టించుకోలేదు. దుష్టవిధానాల కారణంగా ప్రారంభమైన దాడులను ఎందరు మరణించినా సరే, అతివల మాన మర్యాదలు మంట కలిసినా, పిల్లల జీవితాలు నాశనమైనా తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలు మరింతగా ఎగదోస్తున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 49లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా ఉక్రెయిన్‌ పౌరులు వలస వెళ్లారు. దేశంలో 71లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొన్ని అంచనాల ప్రకారం మరొక కోటీ ఇరవైలక్షల మంది ఎటూ పోలేని స్ధితిలో ఉన్నారని వార్తలు. మొత్తం జనాభా నాలుగున్నర కోట్ల మంది అంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా సరే నాటో కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన జెలెనెస్కీలో ఎలాంటి మార్పు లేదు. దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తమవైపు నుంచి ఉండదని రష్యా పదే పదే చెబుతున్నా నాటో దేశాలు ఇచ్చే ఆయుధాలను చూసుకొని మరింతగా పరిస్ధితిని దిగజార్చుతున్నాడు.


రష్యా దాడులతో విదేశాలకు కాందిశీకులుగా వెళ్లినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు.వారికి బాంబులు, బుల్లెట్లు,క్షిపణుల ముప్పు లేదు. ఆశ్రయం ఇచ్చిన వారి చేతుల్లో మరొక ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. ఆడపిచ్చితో తపించేవారు, దేహాలతో వ్యాపారం చేసే తార్పుడుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతకళేబరాల కోసం వాలే రాబందుల మాదిరి కాందిశీక మహిళల కోసం సాయం చేసే స్వచ్చంద సేవకులు, ఇతర ముసుగులో పోర్నోగ్రాఫర్స్‌(బూతువ్యాపారులు) వాలిపోతున్నారు. కాందిశీకులకు భాష కూడా పెద్ద సమస్యగా మారి వేటగాండ్ల వలలో చిక్కుకుంటున్నారు. తీవ్ర గర్హనీయ అంశం ఏమంటే ఒంటరిగా ఉండే పురుషుల ఇండ్లకు శరణార్ధులైన మహిళలు, పిల్లలను బ్రిటన్‌ ప్రభుత్వం పంపుతున్నదని, ఇది వారిని లైంగికంగా దోపిడీ చేసేందుకు దోహదం చేస్తుందని సాక్షాత్తూ ఐరాస కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే వారెంత నిస్సహాయ స్ధితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక మంది తాము ఎక్కడ ఎలాంటి వారి చేతుల్లో ఇరుక్కున్నామో వెల్లడిస్తున్న గాధలు పత్రికల్లో వస్తున్నాయి.


ఐరోపా దేశాల బూతు వెబ్‌సైట్లలో ఇప్పుడు ఉక్రెయిన్‌ పేరు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది.మహిళల దేహాలు మగతనపుదాడుల కేంద్రాలుగా మారుతున్నాయి.” మేము ఉక్రెయిన్‌పై బాంబులు వేశాము, అమ్మాయిలను అనుభవించాము.యుద్దానికి వెళ్లే ముందు రష్యన్‌ బాలికను అనుభవించిన ఉక్రెయిన్‌ సైనికుడు. ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం ” వంటి అంశాలు బూతుసైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంతకంటే దారుణమైన భాష వాడుతున్నారు. ” ఉక్రెయిన్లో యుద్దం బూతుకు ప్రతిరూపంగా మారింది ” అని ఒక విశ్లేషణకు ఇచ్చిన శీర్షిక. ఇదంతా ఎక్కడో కాదు మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెబుతూ నాగరికులం అని తమకు తామే కితాబునిచ్చుకుంటున్న ఐరోపాలో జరుగుతోంది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షకులం తామే అని ఫోజు పెట్టే అమెరికా, ఐరోపా దేశాలకు ఈ దారుణాలు పెద్దగా పట్టినట్లు లేదు. ప్రతి మానవ విపత్తులోనూ సర్వం కోల్పోయినపుడు ఇలాంటి లైంగిక దాడులు లేదా దోపిడీకి మహిళలు గురికావటం, లాభాల కోసం ఉపయోగించుకోవటం సర్వసాధారణంగా మారింది.


” రుమేనియా సరిహద్దులో మాటువేసిన పురుషులు ఆకర్షణీయ వాగ్దానాలతో లోబరుచుకుంటున్నారు. మీ సెల్‌ఫోన్లకు చార్జిచేసుకోండి, మీరు ఏదైనా కారు ఎక్కితే వాటి నంబర్లు నమోదు చేసుకోండి అని హంగరీ అధికారులు చెబుతున్నారు. పాసుపోర్టులు తమకు స్వాధీనం చేస్తే ఆశ్రయం కల్పిస్తామని, డబ్బిస్తామని కొందరు చెబుతున్నారు” అని ఐరోపా కౌన్సిల్‌ అనే మానవహక్కుల సంస్ధ తన నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలివి. తీరా ఆశ్రయం కల్పించిన వారి ఇండ్లకు వెళ్లిన తరువాత వారి నిజస్వరూపాలు వెల్లడి కావటంతో అనేక మంది తప్పించుకొని తిరిగి సరిహద్దులకు చేరి కొత్తగా వస్తున్న కాందిశీకులను హెచ్చరిస్తున్నారు. పదిహేనులక్షల మంది పిల్లలు పెద్దవారి తోడు లేకుండా సరిహద్దులు దాటి వచ్చారని వారికి ముప్పు ఉందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.మానవ వ్యాపారులు వారిని ఐరోపా దేశాలకే కాదు, వెలుపలకు కూడా తరలించవచ్చని, ఇలాంటి వారితో జరిపే బూతు వ్యాపార విలువ ఏటా వంద బిలియన్‌ డాలర్లని అంచనా. అవయవవ్యాపారుల సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ ఆర్ధిక దుస్ధితి కారణంగా మహిళలు చాలా కాలం నుంచి దోపిడీకి గురవుతున్నారు. అద్దెగర్భాలతో పిల్లల్ని కనటం ఇక్కడ చట్టబద్దం కావటంతో ఆ విధంగా కూడా వారు బాధితులే. కరోనా కారణంగా పరిస్ధితులు దిగజారటంతో యుద్ధానికి ముందే అనేక మంది ఉక్రెయిన్‌ మహిళలు విదేశాల్లో ఉపాధిపేరుతో మానవ వ్యాపారుల(తార్పుడు) వలలో చిక్కుకున్నారు. ఇది మరొక విపత్తు. తాజాగా పోలెండ్‌, తదితర దేశాల్లో అలాంటి వారి వలనుంచి తప్పించుకున్నవారి ఉదంతాలు కూడా ఉన్నాయి.


మార్చినెలలో స్వీడెన్‌ పోలీసులు 38 మంది పురుషులను వ్యభిచార నేరం కింద అరెస్టు చేశారు. వారిలో 31 మందితో ఉన్న మహిళలు ఉక్రెయినుకు చెందిన వారే, ఇటీవల వచ్చిన వారు అని పోలీసులు వెల్లడించారు. రవాణా, ఆశ్రయం వంటి ఇంటర్నెట్‌లో ప్రకటనలతో సంఘటితంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిను కాందిశీకులు 40కిపైగా దేశాలకు వలస వెళ్లినట్లు ఇప్పటి వరకు వివరాలు చెబుతున్నాయి.ఐరాస పేర్కొన్న 49లక్షల మందిలో ఒక్క పోలెండులోనే 27,63,786 మంది ఉన్నారు. మూడు లక్షలకు పైబడి రుమేనియా,హంగరీ, మాల్డోవా, స్లోవేకియా, జర్మనీ ఉన్నాయి. ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి నయానాజీలు జరుపుతున్నదాడులు, అత్యాచారాల నుంచి తప్పించుకొనేందుకు 4,84,725 మంది రష్యాకు కాందిశీకులుగా వెళ్లారని కూడా ఐరాస తెలిపింది. ఈప్రాంతం నుంచి జనాలు వెళ్లిపోవాలని ఉక్రెయిను ప్రభుత్వమే ఆదేశించింది.
ప్రభుత్వం రూపొందించిన పధకం ప్రకారం బ్రిటన్‌లోని కుటుంబాలు, ఒంటరి పురుషులు ఉక్రెయిన్‌ మహిళలకు తమ రూముల్లో లేదా ఇతరంగా ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం కాందిశీక మహిళలను కేటాయించి పంపుతుంది. ఈ కార్యక్రమం తార్పుడు గాళ్లకు చెకుముకి రాయి వంటిదని ఒక స్వచ్చంద సంస్ద తూర్పారబట్టింది. వేలాది మంది బ్రిటన్‌ పురుషులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమతో శృంగారంలో పాల్గొంటేనే ఆశ్రయం కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో వారి కారుణ్యం వెనుక ఉన్న వలేమిటో అర్ధమైంది. నిజానికి ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు అనేక దేశాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఉచితంగా జర్మనీ లేదా పోలెండ్‌ తీసుకుపోతామంటూ ముందుకు వచ్చిన వారెందరో లైంగికదోపిడీ గాళ్లని తేలింది. తమ ఆశ్రయం పొందాలన్నా, తాము చూపిన ఉపాధిలో చేరాలన్నా తమను లేదా తాము పంపేవారిని గాని లైంగికంగా తృప్తి పరచాలనే షరతులను ముందుకు తెస్తున్నారు.


ఉక్రెయిన్‌ మిలిటరీ లేదా నయా నాజీలకు ఆయుధాల అందచేతలో అమెరికా,బ్రిటన్‌ ముందున్నాయి. బ్రిటన్‌ పాలకుల మరొక దుర్మార్గం ఏమంటే వివిధ దేశాల కాందిశీకులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకుండా ఖర్చును తగ్గించుకొనేందుకు తూర్పు ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి పంపుతున్నది.ఈ చర్యను ఐరాస కాందిశీకుల కమిషనర్‌ ఖండించినా బ్రిటన్‌ ఖాతరు చేయటం లేదు, అక్రమంగా ఇంగ్లీషు ఛానల్‌ దాటుతూ ప్రమాదాలపాలు కాకుండా నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నామని కుంటిసాకులు చెబుతున్నది. ఉక్రెయిన్‌ కాందిశీకులకూ దీన్నే అమలు జరుపుతున్నారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పడని వారు ఎవరైనా బ్రిటన్‌ వస్తే వారిని వదిలించుకోవటం ఒక విధానంగా పెట్టుకున్నది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ కాందిశీకులను చౌకగా పని చేసే శ్రామికులుగా వినియోగిస్తూ గతంలో ఉన్నవారిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


లండన్‌ టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకామె కాందిశీకుల దురవస్తలను తెలుసుకొనేందుకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వచ్చిన 22 ఏండ్ల నటలయ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే కుప్పలు తెప్పలుగా శృంగార సందేశాలు పంపుతూ బ్రిటన్‌ పురుషులు స్పందించారు. నా దగ్గర పెద్ద పరుపు ఉంది, ఇద్దరం ఇబ్బంది లేకుండా నిద్రించవచ్చని, నేను సాయం చేస్తా ప్రతిగా నీవు కూడా ఏదో చేయాలి, నీకు వివాహం కాకపోతే నేను చేసుకుంటా,నిన్ను మంచిగా చూసుకుంటా వంటి సందేశాలు వచ్చాయి. ఆమెకు రెండు రోజుల్లో వచ్చిన 75 ప్రయివేటు సందేశాలు పంపిన వారిలో 41 మంది ఒంటరి పురుషులే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడపోతలో నేర చరితులను నిరోధించటం సాధ్యం అవుతుంది తప్ప శృంగార వలవిసిరే వేటగాళ్లు దొరకరు. ఆ వలకు చిక్కిన వారి పరిస్ధితి ఏమిటి ?


ఏప్రిల్‌ 20 నాటికి రష్యా సైనిక చర్య ప్రారంభమై 57వ రోజుకు చేరుకుంది. తన యుద్ద నౌకను ముంచి వేసిన తరువాత రష్యాదాడులను ముమ్మరంగావించింది. కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తూర్పు ఉక్రెయిను మీద దాడి మరింత సులభం అవుతుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో స్ధానికంగా ఉన్న తన మద్దతుదారులతో కలసి పెద్ద ఎత్తునదాడులకు దిగనున్నట్లు తాజావార్తలు వెల్లడించాయి. రష్యా నౌకను ముంచామని, సైనికులకు నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ పాలకులు ఆనందం వెల్లడించటం ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలకు ఆనందం, తృప్తి కలగవచ్చునేమో గానీ తన పౌరులకు, ఆర్ధికరంగానికి జరుగుతున్న నష్టం గురించి జెలెనెస్కీ, ఇతర విధాన నిర్ణేతలకు పట్టినట్లు లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో సఖ్యత కోరితే దేశద్రోహం – వాణిజ్యం చేస్తే దేశభక్తి ! ఏమి తర్కంరా బాబూ !!

17 Sunday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2022 BRICS Summit, BJP, BRICS, China-India Relations, Indo-China trade, Narendra Modi Failures, RSS, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్‌(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్‌ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్‌ ఫర్‌ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్‌ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!


చైనా విదేశంగ మంత్రి వాంగ్‌ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్‌(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్‌ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్‌ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్‌ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ భారత్‌-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.


ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్‌ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్‌ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్‌ పూనుకుందన్నది స్పష్టం.


మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్‌ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్‌ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్‌ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.


చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్‌ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్‌ ఉదంతాలు చూసినపుడు మన సోషల్‌ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.


ఉక్రెయిన్‌ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.


గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్‌-రిలయన్స్‌ వివాదం, మన కార్పొరేట్‌ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్‌ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్‌ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్‌ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్‌ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : రైతాంగానికి గోడదెబ్బ-చెంపదెబ్బ !

31 Thursday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, burden on farmers, fertilizer prices enhancement, Fertilizers subsidies, India fertilizer prices, India's farmers, Narendra Modi, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089, రోడ్డు మార్గమైతే 6,528 కిలోమీటర్ల దూరంలో అది జరుగుతోంది. కానీ దాని ప్రభావం అనేక రూపాల్లో మనకు దూరంతో నిమిత్తం లేకుండా స్వానుభవంలోకి వస్తోంది. కలికాల మహిమ కాదు ప్రపంచీకరణ పర్యవసానమిది. దీని వెనుక ఉన్న అమెరికా,దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్ని తరగతుల కష్టజీవులను ఇబ్బంది పెడుతోంది. ఈ సందర్భంగా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఈ యుద్దం ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తుందో చూద్దాం. భారత్‌లో తీవ్ర కొరత మధ్య ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయని అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల కదలికల మీద విశ్లేషణలు అందించే ఎస్‌ అండ్‌ పి(స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌) సంస్ధ మార్చి 30వ తేదీన పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద వంద కిలోల ఎరువుల ఉత్పత్తి జరిగితే పద మూడు కిలోలు రష్యాలో తయారవుతాయి. వాటి నుంచి మనతో సహా అనేక దేశాలు తెచ్చుకుంటాయి.2022 మార్చినెల ప్రారంభంలో ఎరువుల ఎగుమతులను అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి మన దేశంలో 8.12మిలియన్‌ టన్నుల డిఏపి, 1.9మి.టన్నుల ఎంఓపి, 7.7మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల నిల్వలున్నాయని, అవి వచ్చే ఖరీఫ్‌ పంటకాలంలో అవసరమైన వాటి కంటే తక్కువని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 65.4మి.టన్నుల డిఏపి, 23.4మి.టన్నుల ఎంఓపి, 58.3మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల అవసరం ఉంటుందని అంచనా.యూురియా 19.8మి.టన్నులు అవసరం కాగా ఫిబ్రవరి చివరి నాటికి 25.5మి.టన్నుల నిల్వలున్నాయని చెప్పినట్లు ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంఓపి, డిఏపి ధరలు 30-40శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో పెరిగే ధరలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను బట్టి రైతులకు ఏ ధరలకు ఎరువులు దొరుకుతాయనేది చెప్పలేమని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషకుడు భాను పాట్ని చెప్పారు.


తమ శత్రుదేశాలకు తాము ఎగుమతి చేసే సరకులకు రూబుళ్లలోనే సొమ్ము చెల్లించాలని రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించాడు. మన దేశం ఆ జాబితాలో లేనందున రూపాయి-రూబుల్‌ లావాదేవీలకు అవకాశం ఉంది.మనం అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ఖాతరు చేయనప్పటికీ నౌకలపై ఆంక్షలు, బీమా సౌకర్యం వర్తించవనే అనుమానాల నేపధ్యంలో రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని పెంచని పక్షంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఉంటుంది. ఎరువుల ధరల పెరుగుదల వలన సాగు విస్తీర్ణం తగ్గవచ్చని, సూపర్‌(ఎస్‌ఎస్‌పి) వంటి ఇతర ఎరువుల వైపు రైతులు మరలవచ్చని చెబుతున్నారు. గాస్‌ ధరల్లో ప్రతి ఒక్క డాలరు పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రు.4000-5000 కోట్ల వరకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్‌బిఐ పరిశోధనా బృందం వెల్లడించిన ఒక పత్రంలో పేర్కొన్నారు.


నత్రజని ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్దాల ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ఉత్పత్తి ఖుర్చు రెండున్నర రెట్లు పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. మన అవసరాల్లో 25శాతం యూరియా, 90శాతం ఫాస్పేట్‌ ఎరువులు లేదా ముడిపదార్ధాలను, నూటికి నూరుశాతం పొటాష్‌ ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాము.2021 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2022లో(ఏప్రిల్‌-జనవరి కాలంలో) రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న యూరియా విలువ 27.15 మిలియన్‌ డాలర్ల నుంచి 123.79మి.డాలర్లకు పెరిగింది, ఉక్రెయిన్‌ నుంచి 2021జనవరి నాటికి 368.79మి. డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నాము. రష్యా ఎరువుల ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించగా ఉక్రెయిన్నుంచి సరఫరాలు అనిశ్చితంగా మారాయి. ఇతర దేశాల నుంచి ఏదో విధంగా తెచ్చుకున్నా సబ్సిడీల మొత్తం పెరగనుంది. ప్రస్తుతం కేటాయించిన రు.1.05లక్షల కోట్లు చాలకపోతే పెరిగిన మొత్తాన్ని రైతుల మీద మోపాలి లేదా బడ్జెట్‌ మొత్తాలను పెంచాల్సి ఉంటుంది. ఫాక్టంఫాస్‌(20-20-0-13) ధరలు గత పది నెలల కాలంలో బస్తా ధర రు.500 పెరిగి ఇప్పుడు రు.1,490కి చేరింది.

పాత స్టాక్‌ పూర్తిగా అమ్ముడు పోయిన తరువాత పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఎరువుల కంపెనీలు కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఉక్రెయిన్‌ – రష్యా వివాదం లేదు. అంతకు ముందు అంతర్జాతీయంగా పెరిగిన ఎరువుల ధరలు, దేశీయంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఎంత మేరకు ధరలు పెంచవచ్చో కంపెనీలు తమ అంతర్గత సమాచారంలో డీలర్లకు తెలిపా యి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీలు తాజా పరిణామాలను కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఇంకా పెంచటమే తప్ప తగ్గించేది ఉండదు. ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
ఎరువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని కేంద్రప్రభుత్వం పెంచని పక్షంలో ఆ భారం రైతుల మీదనే పడుతుంది.దీనికి తోడు డీజిలు, పెట్రోలు ధరల భారం రైతుల మీద పడనుంది. చిన్న కమతాల్లో కూడా యంత్రాల వాడకం పెరిగినందున ఆ మేరకు ఖర్చు రైతులే భరించాల్సి ఉంటుంది.ఇది గోడదెబ్బ-చెంపదెబ్బ వంటిదే. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసే వారికి లీటరుకు డీజిలు ధరను రు.25పెంచుతూ చమురు సంస్ధలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మానసికంగా అంతభారం భరించకతప్పదని జనాన్ని సిద్దం చేసేందుకే అలా చేశారు. ఆ మేరకు చిల్లర కొనుగోలుదార్లకు పెరగనున్నాయి.ఒకేసారి పెంచితే నిరసన వెల్లడౌతుందనే భయంతో మార్చి నెల 21వ తేదీ నుంచి రోజూ కొంత చొప్పున పెంచుతున్నారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేదు. గత లోటును పూడ్చుకున్న తరువాత ధరలనుబట్టి నిరంతర పెరుగుదల ఎలానూ ఉంటుంది.


బెలారస్‌ నుంచి పొటాష్‌, రష్యానుంచి ఫాస్ఫేట్‌ ఎరువుల దిగుమతి అనిశ్చితంగా మారిందని రేటింగ్స్‌ సంస్ధ ఇక్రా పేర్కొన్నది. ఈ రెండు దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో నలభైశాతం పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. అమోనియాలో 22, అమోనియం ఫాస్పేట్‌ , యురియా 14శాతాల చొప్పున రష్యా ఎగుమతులు చేస్తున్నది. రక్షణ భయంతో నౌకలు నల్లసముద్రం వైపు వెళ్లేందుకు సుముఖత చూపటం లేదు. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగితే అది ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతాయి.ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా ఎరువులు, పురుగుమందుల ధరలు 11 నుంచి 15శాతం పెరుగుతాయని కోటక్‌ మహేంద్ర సంస్ధ పేర్కొన్నది. కంపెనీలు, రైతులకు ఖర్చు పెరిగిన కారణంగా కనీస మద్దతు ధరలను పెంచవచ్చని కూడా జోశ్యం చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి నెలల కాలంలో అమోనియా ధరలు 200శాతం, పొటాష్‌ ధర 100శాతం పెరిగిందని ఎలారా కాపిటల్‌ తన నివేదికలో పేర్కొన్నది. సబ్సిడీ మొత్తాన్ని ఆ మేరకు పెంచని పక్షంలో రైతులే పెరిగిన మొత్తాలను భరించాల్సి ఉంటుందని తెలిపింది. సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చనే అంచానాతో ఎరువుల కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు మదుపుదార్లు ఎగబడటంతో గత నెలలో కొన్ని కంపెనీల వాటాల ధరలు 50శాతం పెరగ్గా సగటున 20శాతం పెరుగుదల నమోదైంది. మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ ధరలు 76.7శాతం పెరిగాయి.


రైతులకు అవసరమైన ఎరువులు, చమురు ధరల పెరుగుదల ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తున్నది.లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌ రైతాంగం మొక్కజొన్న పంటకు ఎరువుల వాడకాన్ని తగ్గించగా, పొటాష్‌కు డిమాండ్‌ పెరగటంతో సొమ్ము చేసుకొనేందుకు అమెజాన్‌ ప్రాంతంలోని రక్షిత భూమిపుత్రుల(మన దగ్గర గిరిజనులు అంటున్నాం) భూముల్లో పొటాష్‌ను వెలికి తీసేందుకు అనుమతించాలని పాలకపార్టీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆఫ్రికాలోని జింబాబ్వే, కెన్యాలో చిన్న రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించారు. ఉత్తర అమెరికాలోని కెనడాలో ముందు జాగ్రత్త చర్యగా కనోలా రైతులు 2023కు కూడా ఇప్పుడే నిల్వలు చేసుకుంటున్నట్లు వార్తలు. ఇప్పటికే ధరలు పెరగ్గా వచ్చే ఏడాది ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. అమెరికాలో గతేడాది ఎరువుల ధరలు 17శాతం పెరగ్గా, ఈ ఏడాది 12శాతంగా ఉండవచ్చని అంచనా. కొందరు రైతులు తక్కువ ఎరువులతో పండే పంటల వైపు చూడటం, సాగు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు. తమ పంటలకు ఎంత ధరలు వస్తాయనిగాక ఇంత ఖర్చు పెట్టి సాగులోకి దిగాలా, ఎరువుల సరఫరా ఉంటుందా అనే ప్రాతిపదికన ఆలోచించి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికాలోని కొందరు ఎంపీలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్యకమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఎరువుల మీద పన్నులు తగ్గించాలని కోరారు. గతేడాది తన రైతుల రక్షణకు గాను చైనా ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది సడలించవచ్చని, అదే జరిగితే కొంత మేరకు ఇతర దేశాలకు సరఫరా పెరగవచ్చని భావించారు. ఇప్పుడేర్పడిన అనిశ్చిత పరిస్ధితుల్లో అది జరగకపోవచ్చని చెబుతున్నారు.


మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశం మీద ఒక కమిటీని వేస్తామని కేంద్రం ప్రకటించి నెలలు గడిచినా మాటల్లేవు, చేతల్లేవు.2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కబుర్లు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. పెంచుతున్న చమురు ధరలకు అంతర్జాతీయ పరిస్ధితులు కారణమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఎరువుల ధరలకూ ఇదే పాటపాడతారా ? భారం మొత్తాన్ని రైతుల మీదనే వేస్తారా ? అదే జరిగితే గ్రామీణ భారతంలో పరిస్ధితులు మరింత దిగజారుతాయి. మొత్తంగా ధరలు పెరుగుతాయి.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్దమిది, కాదంటారా !

26 Saturday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

corporate loves a good war, Fuel Price in India, profiting from war, Ukraine-Russia crisis, US imperialism, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెద్దన్న జో బైడెన్‌ చివాట్లు పెట్టినా చీమకుట్టినట్లు లేని చిన్నన్న నరేంద్రమోడీ !

24 Thursday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Biden shaky comment, BJP, Joe Biden, Narendra Modi, RSS, RUSSIA, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా మా నరేంద్రమోడీ ఉన్నారు కనుక సరిపోయింది. మన దేశం రష్యాను చూసి వణుకుతున్నదని అమెరికా అధినేత జో బైడెన్‌ అన్నాడు, అదే మరొకరు ఆ పదవిలో ఉండి ఉంటే భారత్‌ బట్టలు తడుపుకుంటున్నదని అనే వాడు అని ఒక బిజెపి మిత్రుడు చలోక్తి విసిరారు.నిజమే అనిపించింది. వారే కాదు, ఇప్పటికీ చాలా మంది నిజంగానే మోడీ గొప్పతనం గురించి అలాగే అనుకుంటున్నారు. దేశాన్ని అంతమాట అన్నా అని మోడీ మౌనం పాటించటాన్ని చూస్తే ఒక వేళ అంతమాట అన్నా మాట్లాడి ఉండేవారు కాదన్నది కూడా నిజమే కదా ! నిజానికి వణుతున్నదని అన్నా ఆత్మగౌరవం గలవారికి అభ్యంతరకరమే, అవమానంగా భావిస్తారు, అదేమీ గౌరవ ప్రదమైన వ్యాఖ్య కాదు. సరే, నరేంద్రమోడీ గారికి ఆ మాత్రం తట్టదా ? మహానుభావులైన పెద్దల మౌనానికి పలు అర్ధాలుంటాయి మరి. ఎందుకొచ్చిన తంటా అంటారు ? ….” మోడీ ఏది చేసినా దేశం కోసమే ” అంటున్నారు కదా భక్తులు, మనమూ అందాం !


ఇదిగో ట్రంపూ కాశ్మీరు సమస్యలో కాస్త మధ్యవర్తిగా ఉండి ఒకదారి చూపకూడదూ, బాబ్బాబూ నీ పుణ్యం ఊరికే పోదులే అని నరేంద్రమోడీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగా చెప్పిన అంశం తెలిసిందే.2019 జూలై 22న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాషింగ్టన్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్నాడు. ఆ సందర్భంగా ఖాన్‌తో కలసి ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడాడు. భారత ఉపఖండంలో శాంతి స్దాపనకు అమెరికా పోషించాల్సిన పాత్ర ఏదైనా ఉందా అని ఇద్దరు నేతలను ఉద్దేశించి ఒక విలేకరి అడిగాడు. శాంతి చర్చల కోసం మేం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముందు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపాలంటూ భారత్‌ మావైపుకు బంతిని తోసి చర్చల పునరుద్దరణకు అంగీకరించటం లేదు, ట్రంప్‌ ఆ క్రమాన్ని ముందుకు నెట్టగలరని ఇమ్రాన్‌ చెప్పాడు. వెంటనే ట్రంప్‌ మాట్లాడుతూ ఒసాకా జి20 సమావేశాలలో రెండు వారాల క్రితం నేను మోడీతో భేటీ జరిపినపుడు కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం లేదా తీర్పరి పాత్ర వహించమని నన్ను అడిగారు, మీరు కోరుకుంటే నేనా పని చేస్తా అన్నాడు. దీని మీద అబ్బే అలాంటిదేమీ జరగలేదని అధికారులు చెప్పారు తప్ప నరేంద్రమోడీ నోరు విప్పలేదు.


రెండవ సారి ఎన్నికల్లో పోటీ చేస్తూ 2020 అక్టోబరు 22న చర్చలో ట్రంప్‌ మాట్లాడాడు. పర్యావరణంపై 2016పారిస్‌ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవటం సరైనదే అని సమర్ధించుకున్నాడు. అది వారిష్టం అని సరిపెట్టుకుందాం, కానీ ఆ సందర్భంగా చైనా, భారత దేశాల్లో గాలిని చూడండి ఎంత రోతగా ఉంటుందో అలాంటి దేశాలకు ఆ ఒప్పందం ఉపయోగం అని నోరుపారవేసుకున్నాడు. అంతకు ముందు నెలలోనే హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ సభలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తామెంత దగ్గరో అని ప్రవాసభారతీయుల ముందు ఒయ్యారాలను ఒలికించారు. అప్పుడు అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ ఓటర్లను ప్రభావితం చేశారు. అలాంటి ట్రంప్‌ దేశాన్ని అవమానించినా నరేంద్రమోడీ నోరు విప్పలేదు.చిత్రం ఏమంటే ప్రభుత్వం కూడా నోరుమెదపలేదు.
తాజాగా రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని జో బైడెన్‌ అన్నా అదే మౌనం. చైనాను దెబ్బతీసే తమ దీర్ఘకాలిక పధకంలో భారత్‌ కీలక పాత్రపోషించాలని కోరుకుంటున్నది అమెరికా. బైడెన్‌ ప్రకటనతో నరేంద్రమోడీని ఇరుకున పెట్టినట్లయిందని, మరీ తెగేదాకా లాగకూడదనీ కావచ్చు. మరుసటి రోజు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకర్లతో మాట్లాడుతూ నష్ట నివారణకు ప్రయత్నించాడు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) పధకంలో భారత్‌ తమకు అనివార్యభాగస్వామి అంటూ ఉబ్బేశాడు. రష్యాతో చారిత్రాత్మక రక్షణ సంబంధం ఉన్నప్పటికీ భారత్‌ను తమ భాగస్వామిగా ఎంచుకొనేందుకు అదేమీ ఆటంకం కాలేదన్నాడు. పాతికేళ్లుగానో ఇంకా ఎక్కువో మా రెండు దేశాల మధ్య రక్షణ మరియు భద్రత సంబంధాలు మరింతగా పెరిగాయి, ఉమ్మడి ప్రయోజనాలలో భారత్‌ ఎంచుకున్న భాగస్వాములం మేము అన్నాడు. అంతకు ముందు రోజు జో బైడెన్‌ అమెరికన్‌ కార్పరేట్ల సిఇఓలతో మాట్లాడుతూ చతుష్టయ దేశాల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి మన వైఖరిని చెప్పనవసరం లేదు. ఒక్క భారత్‌ తప్ప, అది కొంతమటుకు వణుకుతోంది, జపాన్‌ ఎంతో గట్టిగా ఉంది, అదే విధంగా ఆస్ట్రేలియా, నాటో, పసిఫిక్‌ ప్రాంతంలో మేమంతా గట్టిగా ఉన్నాం అన్నాడు.


అమెరికా నేతలు ఇన్ని మాట్లాడుతున్నా నరేంద్రమోడీ మౌనం దాల్చటం భారత ప్రతిష్టకే భంగం. మూడు రోజులు దాటినా ఎలాంటి స్పందన లేదు. దీని గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం.రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని బైడెన్‌ అనటం ”ఒక చిన్న చివాటు( మందలింపు)” అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి చిదానంద రాజఘట్ట ఒక విశ్లేషణలో వర్ణించారు.( అంతేగా మరి ఇష్టమైన వారు చావు దెబ్బలు కొట్టినా అబ్బే ప్రేమతో కొట్టిన తియ్యని దెబ్బ అనిపిస్తుంది.) దానిలోనే వ్యూహాత్మక వ్యవహారాల వ్యాఖ్యాత బ్రహ్మ చెల్లానే చెప్పిన మాటలను ఉటంకించారు. ” ఇక్కడొక వైరుధ్యం ఉంది. పూర్తి స్ధాయి యుద్ద ముప్పుతో సహా చైనా సరిహద్దు దురాక్రమణను భారత్‌ ఎదుర్కొంటున్న సమయంలో ఆ దురాక్రమణ గురించి బైడెన్‌ తన నోరు విప్పడు.ఇంతే కాదు రెచ్చగొట్టేందుకు స్వయంగా తోడ్పడి ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్దం గురించి భారత స్పందనను వణుకుతున్నదిగా మందబుద్ది బైడెన్‌ వర్ణించాడు.” అని చెల్లానే పేర్కొన్కారు. ” భారత్‌ మీద బైడెన్‌ చేసింది అవాంఛనీయ వ్యాఖ్య.ప్రచ్చన్న యుద్దం ముగిసిన తరువాత రష్యా మీద అమెరికా విధానం ఊగిసలాడే పునాదుల మీద పడిపోనున్న కట్టడంలా ఉంది. ఇప్పుడది కూలిపోతున్నది.నాటోలోకి ఉక్రెయిన్ను రప్పించే అమెరికా అవివేకానికిి భారత్‌ ఎందుకు మూల్యం చెల్లించాలి ? అమెరికా ఆంక్షలు మనలను దెబ్బతీస్తున్నాయి వారిని మనం బలపరచాలా ” అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ అన్నారు.


మౌనం గురించి మన దేశంలో పెద్ద చర్చే నడిచింది. మన్మోహన్‌ సింగ్‌ను మౌన ముని అన్నారు. సింగ్‌ ఎందుకు మాట్లాడలేదంటే రిమోట్‌ కంట్రోల్లో ఉన్నారు గనుక అని కొందరు చెప్పారు. మరి నరేంద్ర మోడీ అలాకాదే ! ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా పెద్ద మౌన మునిలా ఉంటున్నారు. తన సేనలను ఉసిగొల్పుతారు. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడితే మోడీ మంచి వారే మంత్రులకే నోరుకుదరటం లేదు అనిపిస్తారు. అదొక ఎత్తుగడ అన్నది స్పష్టం. అంతర్జాతీయంగా పరువుపోతున్న అంశాలే కాదు, దేశీయంగానూ ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా అనేక అంశాలపై మౌనం. బిజెపి నేతలకు మన్మోహన్‌ సింగ్‌కు మౌనముని అని పేరు పెట్టి నిందించారు. అది తనకూ వర్తిస్తుందని తెలిసినా ఆ వైఖరికి తనకు నష్టం కంటే లాభాన్నే కలిగిస్తుందని భావిస్తున్నారు. తాను మీడియాకు జవాబుదారీ కాదు, ఏదైనా ఉంటే జనానికే చెబుతా అనే సందేశాన్ని జనంలో చొప్పించేందుకు విలేకర్లతో మాట్లాడటమే మానుకున్నారు.నిపుణులు రూపొందించిన కొన్ని పధకాల్లో భాగంగా చేసిన అనేక విన్యాసాలను దేశం చూసింది. ఎంపిక చేసిన విలేకర్లతో, ఎంపిక చేసిన ప్రశ్నలతో ఎంపిక చేసిన పద్దతిలో మాట్లాడటం కూడా దానిలో భాగమే. అంతే కాదు, ప్రధాని నరేంద్రమోడీ పనిలో ఉన్నారు. అనవసర ప్రశ్నలతో విలేకర్లు దాన్ని చెడగొట్టవద్దు అనే సందేశం ఇస్తున్నారు. మోడీ స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడాదికి సగటున 22 సార్లు విలేకర్లతో మాట్లాడితే జోబైడెన్‌ ఇంతరకు 15నెలల కాలంలో 11 సార్లు మాట్లాడాడు. ఇవి అధికారిక సమావేశాలు, ఇతరత్రా వేరే సందర్భాలలో మాట్లాడిన వాటిని కలిపితే ఎక్కువే ఉంటాయి వారు పనీపాటా లేక విలేకర్లతో మాట్లాడుతున్నారా ? ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఏ దేశంలోనూ ఇలాంటి ప్రజాప్రతినిధి ఇంతవరకు లేరంటే అతిశయోక్తి కాదు.


2021 సెప్టెంబరులో నరేంద్రమోడీ వాషింగ్టన్‌లో జోబైడెన్‌తో భేటీ జరిపారు. ఆ సందర్భంగా విలేకర్లు వచ్చారు. అమెరికా విలేకర్ల కంటే భారతీయ విలేకరులే మెరుగు అని బైడెన్‌ అన్నాడు. అంతేకాదు మోడీవైపు చూస్తూ మీకు అంగీకారమైతే మనం వారి ప్రశ్నలకు మన సమాధానం చెప్పనవసరం లేదు, ఎందుకంటే వారు ఒక అంశం గురించి అడగరు అన్నాడు.ప్రధాని నరేంద్రమోడీని పక్కన కూర్చో పెట్టుకొని తమ మీడియాను కించపరిచాడు. అసలు మోడీగారు ప్రధానిగా ఉన్నంతవరకు మీడియాతో మాట్లాడనని భారత, గోమాతల మీద ఒట్టు వేసిన లేదా ఆత్మసాక్షిగా శపధం చేసిన సంగతి బైడెన్‌కు తెలిసి ఉండదు. దేశం వణుకుతున్నదని అంటే ఎందుకు స్పందించటం లేని ప్రశ్నించుకొనే వారికి విసుగు పుట్టి ఆలోచించటం మానుకోవాలే తప్ప మోడీ మాట్లాడరని తేలిపోయింది. అమెరికా రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలా అని ఎవరైనా అనవచ్చు, ఇక్కడ రెచ్చిపోవటం కాదు, మనకూ 56అంగుళాల ఛాతీ ఉందన్న సందేశం అన్నవారికి ఇవ్వాలా వద్దా ? ఇక్కడ వైపరీత్యం ఏమంటే సంఘపరివార్‌ బిజెపితో సహా దాని అనుబంధ సంస్దలేవీ మాట్లాడలేదు. వాటికి పెద్దన్న జో బైడెన్‌ అంటే వణుకుపుడుతోందా అని సందేహం కలిగితే తప్పుకాదు కదా !
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తోటకూరనాడే…. నరేంద్రమోడీ గట్టిగా చెప్పి ఉంటే ఇప్పుడిలా జరిగేదా !

20 Sunday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Diplomacy Matters, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Ukraine-Russia crisis, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలి. విశ్వగురువుగా నరేంద్రమోడీ, ప్రపంచమంతా మోడీవైపే చూస్తోంది. అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు అది లేకున్నా నడుస్తుంది. చైనా నుంచి మనం దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మనతో కాళ్ల బేరానికి వస్తుంది. నరేంద్రమోడీ మాత్రమే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలరు. ఇలాంటి కబుర్లన్నీ వాట్సాప్‌ విశ్వవిద్యాలయ పండితుల మొదలు వివిధ మాధ్యమాల ద్వారా మన చెవుల తుప్పు వదిలించారు, మెదళ్లను ఖరాబు చేశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని నిజమే అని నిజంగానే నమ్మిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉక్రెయిన్‌ వివాదంలో మనలను ప్రతివారూ బెదిరించేవారే తప్ప ఇతరత్రా పట్టించుకొనే వారే లేరు. అనేక చిన్న దేశాలనేతలు గళం విప్పినా మన ప్రధానికి నోరు పెగలటం లేదు. చైనా నుంచి దిగుమతులను నిలివేస్తారా అనుకున్నవారికి రికార్డులను బద్దలు కొడుతూ కొనసాగించటం మింగుడుపడటం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24కు ముందు మన నేతలు, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మన జేమ్స్‌బాండ్‌గా ప్రచారంలో ఉన్న అజిత్‌ దోవల్‌ ఉక్రెయిన్‌ పరిణామాలను పసిగట్టలేకపోయారు. తరువాత ఆపరేషన్‌ గంగ పేరుతో అక్కడ చిక్కుకు పోయిన మన విద్యార్ధులను వెనక్కు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలంటూ నష్ట నివారణ చర్యగా నరేంద్రమోడీ సమీక్షల గురించి మన మీడియా చేసిన హడావుడి కూడా ముగిసింది. కేంద్ర మంత్రులను పంపటం, ఇతరత్రా చేసిన ప్రయత్నాల కంటే అసలు నరేంద్రమోడీ గారే వెళ్లి కూర్చుని ఉంటే ఇంకా తొందరగా పూర్తయి ఉండేది, తలిదంద్రుల ఆవేదన పరిమితంగా ఉండేది. ముందే ఆనందం వెల్లివిరిసేది. ఎందుకంటే ఏదేశంలో ఏది ఎక్కడుందో, ఎక్కడకు ఎలా చేరాలో మోడీగారికి తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. సీజన్‌ టికెట్‌ తీసుకున్నట్లుగా స్వల్పకాలంలో ఏ ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు, అందుకే ప్రతిదేశం కొట్టినపిండి మరి. సరే అది జరగలేదు, ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముఖ్యగనుక ! ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు కదా !


ఎన్నికలు ముగిశాయి, మొత్తం మీద సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగించి అనుకున్నది సాధించారు.యుద్ధం, ప్రేమలో గెలిచేందుకు సాధారణ సూత్రాలు, నీతినియమాలు వర్తించవు అంటారు గనుక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే జరిగిందని అనుకుందాం. ఇప్పుడేమిటి ? ఆపరేషన్‌ గంగ సమయంలో ప్రధాని జరిపిన సమీక్షల గురించి వార్తలేని రోజు లేదు. ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్ధిక రంగంలో ఆందోళనకర పరిస్ధితి, చమురు ధరల పిడుగు ఎప్పుడు ఎలా పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్న జనం గురించి కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా జనాన్ని ఎలా రక్షించాలి అన్న ఆతృత, కార్యాచరణ ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని ?


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు.అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా-చైనా అధిపతులు జో బైడెన్‌- షీ జింపింగ్‌ వీడియో కాన్ఫరెన్సుద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధవైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా షీ జింపింగ్‌తో చర్చించటం ఏమిటి ? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా ? లేక మనకు అంతసీన్‌ లేదా ? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా ? ఇవన్నీ కాస్త ఆలోచించేవారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా ?


ఉక్రెయిన్‌ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జింపింగ్‌ స్పష్టం చేసిందేమిటి ? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్యపేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈవివాదాన్ని మేం కోరుకోవటం లేదు.యుద్ద రంగలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు.మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేదా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది.దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యానుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగా కక్కలేకుండా ఉంది. తెరవెనుక బెదిరింపులకు దిగుతోంది.


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. తన పట్టునుంచి ఎటూ కదలకుండా మన దేశాన్ని ఒక్కొక్కటిగా బిగిస్తున్నది. అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ(క్వాడ్‌) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలు మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.రష్యన్‌ నాయకత్వానికి మద్దతు ఇవ్వటం అంటే( చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అని అర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు.

ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది.యుద్దం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి ? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్‌ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా ? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి. మన దేశంలో 42బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్‌ వేశాడు.


ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్‌ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా ? 2017లో రెండవ సారి దల్వీర్‌ ఎన్నిక నరేంద్రమోడీ సర్కార్‌ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్‌ వ్యక్తిగత హౌదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా ? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా ? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు ?
తైవాన్‌ సమస్య మీద కూడా జింపింగ్‌ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్‌ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.

మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు ? బైడెన్‌-జింపింగ్‌ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యాతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు.” పుతిన్‌ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్‌ ” అన్న శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. రష్యా చేసినదానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదే పదే చెప్పనవసరం లేదు. అలాంటిది షీ జింపింగ్‌తో భేటీలో బైడెన్‌ చెప్పిందేమిటి? ” చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు,చైనాతో కొత్త ప్రచ్చన్న యుద్దాన్ని కోరుకోవటం లేదు. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్‌ చెప్పిన అంశాన్ని షీ జింపింగ్‌ ముఖ్యఅంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా ! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.


ఉక్రెయిన్‌ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయనాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్‌, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగా నైనా హెచ్చరికలు చేశారు కదా ? అమెరికా, నాటో కూటమి పట్ల అంత అణకువ ఎందుకు ? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమదేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్‌ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ?


గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అని ఆ నాడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? ఇరాన్‌ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణుకార్యమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్‌ ఇరాన్నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది ? మనసుంటే మార్గం దొరికేది కాదా ? ఇదే మాదిరి వెనెజులా నుంచి కూడా నిలిపివేశాము. గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మనబలహీనత తెలిసింతరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్ధేశ్యాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని షీ జింపింగ్‌ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైందో చూస్తున్నాము. తన లబ్దికోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్దం.ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం.దీనిలో రాజకీయాలు కాదు,దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా లేకున్నా, విమర్శించినా అభిమానించినా ప్రధానిగా నరేంద్రమోడీ వాటికోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ – ఒప్పందానికి చేరువలో చర్చలు !

16 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Russia- Ukraine peace plan, Russia-Ukraine tensions Impact on India, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


రష్యా -ఉక్రెయిన్‌ పోరుకు స్వస్తి పలికేలా ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం నాడు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దీని మేరకు నాటోలో చేరాలనే ఆకాంక్షలకు స్వస్తి పలికినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించాలి.దాని సాయుధ దళాలను పరిమితం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే రష్యా సైనిక చర్యనిలిపివేస్తుంది. దీనికి ముందు ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండాలని ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఈ పరిణామం ఉంది.అయితే సంభావ్యమైన ( సంభవించగల) ఒప్పందాల వివరాలను వెల్లడించటం తొందరపాటవుతుందని రష్యా ప్రతినిధి దిమిత్రి సెకోవ్‌ చెప్పాడు. మరోవైపున దాడులను నిలిపివేయాలని బుధవారం నాడు అంతర్జాతీయ న్యాయ స్ధానం రష్యాను కోరింది. ఇదిలా ఉండగా రష్యాకు లొంగిపోతున్నట్లు జెలెనెస్కీ ఒక ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్‌ 24 అనే టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. వెంటనే జెలెనెస్కీ ఒక ప్రకటన చేస్తూ తానలాంటి ప్రకటన చేయ లేదని ఖండించాడు. తమ నెట్‌వర్క్‌ను హాక్‌ చేసి తప్పుడు వార్తను చొప్పించారని తరువాత ఆ ఛానల్‌ వివరణ ఇచ్చింది. రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపధ్యంలో అనేక కుహనా వార్తలు వస్తున్నాయి.


చర్చలు చర్చలే – దాడులు దాడులే – రెండునోళ్లతో మాట్లాడుతున్న జెలెనెస్కీ. రష్యా ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నాయంటాడు ఒకనోటితో. మరోవైపు తమ తరఫున యుద్దం చేయాలని పశ్చిమ దేశాలకు వినతుల మీద వినతులు. ఎవరి ఎత్తుగడలు వారివే, 30లక్షల మంది నిర్వాసితులుగా మారినా, ఇంకా ఎందరు ఉక్రెయిన్‌ వదలిపోయినా దుష్ట రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదేలే అంటున్నారు పశ్చిమ దేశాల మానవతామూర్తులు.అగ్గిని మరింతగా ఎగదోసేందుకు పూనుకున్నారు. ప్రపంచ ఆర్ధిక రంగం అతలాకుతలం అవుతుందని ఐఎంఎఫ్‌ ఆందోళన. ఇదీ మార్చి 16 నాటికి ఉన్న పరిస్ధితి. వివాదం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. రక్తపోటు అదుపులోకి రాకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు ఎందుకు ఒక రోజు విపరీతంగా పైకి ఎగబాకుతున్నాయో,ఎందుకు మరోరోజు పడిపోతున్నాయో తెలీటం లేదు.మన వంటి చమురు దిగుమతి దేశాలకు నిదురపట్టటం లేదు.నవంబరు నాలుగు నుంచి స్ధంభింపచేసిన చమురు ధరల కళ్లెం విప్పితే ఏమౌతుందో లేకపోతే ఎంత బండపడుతుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండేట్లు ఒప్పందం కుదరవచ్చని వార్తలు, పశ్చిమదేశాలు దాన్ని పడనిస్తాయా అన్న సందేహాలు సరేసరి !


ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల తీరు రాజీకుదిరేందుకు కొంత ఆశాభావాన్ని కలిగించాయని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్‌ చెప్పాడు.ఆస్ట్రియా, స్వీడన్‌ మాదిరి తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ ఉండవచ్చని, మిలిటరీని కూడా కలిగి ఉండవచ్చని రష్యా ప్రతిపాదించింది. అదే జరిగితే ఆ ప్రాంత దేశాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. రష్యా ప్రతిపాదించినట్లుగాక తమకు అంతర్జాతీశక్తుల హామీ కావాలని ఉక్రెయిన్‌ చెప్పింది. తాము నేరుగా రష్యాతో పోరులో ఉన్నాం గనుక తమ పద్దతిలోనే పరిష్కారం ఉండాలని అంటోంది. బాధ్యత కలిగిన దేశాలతో కూడిన కొత్త కూటమి శాంతికోసం పని చేయాలని జెలెనెస్కీ బుధవారం నాడు అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో కోరాడు. ఐరోపా దేశాలు చాలా కాలంగా రష్యా ముప్పు గురించి పట్టించుకోలేదన్నాడు. మరిన్ని ఆంక్షలను విధించాలని కోరాడు. మేమూ మీలాంటి వారిమే, మా ప్రాణాలను రక్షించాలని కోరటం చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పెరల్‌ హార్బర్‌ మీద దాడి, 2011లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడిని ఉటంకిస్తూ తాము మూడువారాలుగా అలాంటి దాడులను అనుభవిస్తున్నాం అన్నాడు. అంతకు ముందు రోజు కెనడా పార్లమెంటునుద్దేశించి కూడా జెలెనెస్కీ మాట్లాడాడు.


పోలాండ్‌, చెక్‌, స్లోవేనియా దేశాల ప్రధానులు కీవ్‌ను సందర్శించి జెలెనెస్కీతో చర్చలు జరిపి మద్దతు ప్రకటించి వెళ్లారు. ఇలాగే ఇతర దేశాల నేతలు కూడా వచ్చి రష్యా మీద వత్తిడి తేవాలని జెలెనెస్కీ కోరాడు. ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడు మక్రాన్‌ కీవ్‌ పర్యటన జరిపే ఆలోచనేదీ లేదని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.ప్రచారదాడిలో భాగంగా తూర్పు ఐరోపాలో మిలిటరీ సన్నద్దంగా ఉండాలని నాటో కమాండర్లను కోరినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ తరువాత ఇతర దేశాల మీద కూడా రష్యా దాడులు జరపనుందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సన్నద్దత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇబ్బంది కనుక ఇలాంటి ప్రచార విన్యాసాలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.


రష్యా గనుక అడ్డం తిరిగి విదేశాల నుంచి తీసుకున్న అప్పులను మేము ఇచ్చేది లేదని ప్రకటిస్తే ఏమిటన్న బెంగ ఇప్పుడు రుణాలు ఇచ్చిన వారికి పట్టుకుంది. బుధవారం నాటికి వడ్డీ కింద 11.7కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. తమపై విధించిన ఆంక్షల కారణంగా డాలర్లలో కాకుండా తమ కరెన్సీ రూబుళ్లలో చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటించాడు. ప్రభుత్వమే అప్పులను చెల్లించేది లేదని ప్రకటిస్తే అక్కడి కంపెనీలు కూడా అదే బాటపడతాయనే భయం పట్టుకుంది. ప్రస్తుతం పుతిన్‌ సర్కార్‌ జారీ చేసిన బాండ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు గానీ మన కరెన్సీలో చెప్పాలంటే రూపాయికి ఇరవై పైసలు కూడా అప్పులిచ్చిన వారికి వచ్చే అవకాశాలు లేవు. అందువలన ఆంక్షలు ఎత్తివేసి తమను ఆదుకోవాలని రుణాలిచ్చిన వారు పశ్చిమదేశాల మీద వత్తిడి తేవచ్చు. గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం రష్యా అంతర్గత రుణాలు జిడిపిలో కేవలం 13శాతమే ఉన్నాయి. విదేశీరుణం 150 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 45 బి.డాలర్లే, మిగతాదంతా కంపెనీలు తీసుకున్నది. రష్యా వద్ద 630బి.డాలర్ల నిల్వలున్నాయి.కనుక చెల్లింపులకు ఇబ్బంది లేదు. ఆంక్షలే అడ్డుపడుతున్నాయి.


రష్యాకు వర్తింప చేస్తున్న అత్యంత సానుకూల హౌదా రాయితీని ఎత్తివేస్తున్నట్లు జపాన్‌ ప్రకటించింది.మరోవైపు మరిన్ని ఆంక్షలను అమలు జరిపేందుకు జి7 దేశాలు సమావేశం కానున్నాయని వార్తలు వచ్చాయి. తాము నాటోలో చేరటం లేదనే అంశాన్ని గుర్తించండి మహా ప్రభో అని జెలెనెస్కీ నాటోదేశాలకు స్పష్టంచేశాడు. బ్రిటన్‌ ప్రతినిధి వర్గంతో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ నాటో సభ్యురాలు కాదు. దానికోసం ద్వారాలు తెరిచి ఉన్నట్లు చాలా సంవత్సరాలుగా మేం వింటున్నాం, ఇదే సమయంలో మేం చేరకూడదని కూడా విన్నాం. ఇది ఒక వాస్తవం దీన్ని గుర్తించాల్సి ఉంది. మా జనం దీన్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించారు, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారు, అలాగే మాకు సాయం చేస్తున్నవారు కూడా గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నాడు.నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని, తమ భద్రతకు తలపెడుతున్న ముప్పును కూడా గమనించాలని రష్యా ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న అంశాన్ని పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిణామాలన్నది తెలిసిందే.


ఉక్రెయిన్‌పై రష్యాదాడి కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలో మౌలిక మార్పులు వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. పౌరుల ఇబ్బందులు, నిర్వాసితులు కావటంతో పాటు ఆహార, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, జనాల కొనుగోలుశక్తి పడిపోతుందని, ప్రపంచ వాణిజ్య, సరఫరా వ్యవస్ధలు దెబ్బతింటాయని కూడా చెప్పింది. మదుపుదార్లలో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటంతో పాటు ఆస్తుల విలువలు పడిపోతాయని, వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కూడా చెప్పింది. ఉక్రెయిన్‌ గగనతలంపై ఆంక్షలు విధించకుండానే నాటో కూటమి వేరే విధంగా ఆయుధాలతో ఎంతో తోడ్పడవచ్చని నాటోలో అమెరికా మాజీ రాయబారి కర్ట్‌వాల్కర్‌ చెప్పాడు. నల్లసముద్రం మీద నుంచి రష్యా వదులుతున్న క్షిపణులను, టాంకులను కూల్చివేసేందుకు అవసరమైన సాయం అందించవచ్చన్నాడు.


యుద్దం ముగిసే సూచనలు కనిపించకపోవటంతో ఐరోపా దేశాల్లో అనేక చోట్ల జనం ఆహార పదార్దాలను పెద్ద ఎత్తున కొనుగోలు నిల్వచేసుకుంటున్నారు. స్లీపింగ్‌ బాగ్స్‌, పాలపొడి, డబ్బాల్లో నిల్వ ఉండే ఆహారం, బాటరీలు, టార్చిలైట్లు, ప్లాస్టిక్‌ డబ్బాల వంటివి ఒక్కసారిగా ఆరురెట్లమేరకు అమ్మకాలు పెరిగాయి. రేడియోల అమ్మకాలు కూడా ఇరవైశాతం పెరిగాయి. వీటిలో నిర్వాసితులుగా వచ్చిన వారు కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు 26 బిలియన్‌ యురోలు అవసరమౌతాయని ఫ్రెంచి ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న పొటాష్‌ ఎరువులకు మన దేశంలో కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు. రష్యా నుంచి గోధుమల ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో మన దేశ గోధుమల ఎగుమతికి అవకాశాలున్నట్లు రాయిటర్‌ పేర్కొన్నది.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: