• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: victims of 1965

అయిదిత్‌ ఫొటోను చూసి భయపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులు

14 Sunday Aug 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, communist Aidit, Indonesian Communist Party (PKI)., PKI, victims of 1965

Netizens see face of communist Aidit, painting removed from Terminal 3

ఎం కోటేశ్వరరావు

   ఒకవైపు కమ్యూనిజం అంతరించి పోయింది, దాన్ని పూర్తిగా ఓడించి విజయం సాధించామని ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు నేతల ఫొటోలను చూసి కూడా వ్యతిరేకులు ఎంతగా భయపడుతున్నారో, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమ రాజకీయ ప్రయోజనానికి ఎలా వుపయోగించుకుంటున్నారో రెండు వుదాహరణలు వెల్లడిస్తున్నాయి.ఒకటి నియంత సుహార్తో హతమార్చిన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ అధినేత డిఎన్‌ అయిదిత్‌ ఫొటో. రెండవది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా.

    ఇండోనేషియా రాజధాని జకర్తా సమీపంలో కొత్తగా నిర్మించిన సోకర్నో -హట్టా విమానాశ్రయంలోని మూడవ టెర్మినల్‌ 2017లో పూర్తి స్ధాయిలో వినియోగానికి రానుంది. ఇటీవలే పూర్తయి పాక్షికంగా రాకపోకలకు అనుమతించారు. ఆ టెర్మినల్‌ భవనం అలంకరణలో భాగంగా ఇండోనేషియా జాతీయ నాయకులుగా పరిగణించబడుతున్న వారి వందలాది ఫొటోలను ఏర్పాటు చేశారు. వాటిలో యాభై సంవత్సరాల క్రితం అమెరికా మార్గదర్శకత్వంలో జరిగిన సైనిక కుట్రలో హత్యకు గురైన కమ్యూనిస్టు పార్టీ నేత డిఎన్‌ అయిదిత్‌ మాదిరిగా వున్న ఒక చిత్రం కూడా వుంది. దాని కింద క్లుప్తంగా ఇలా రాసి వుంది.’ ఒక రంగస్థలంగా వున్న ఇండోనేషియా చర్చ ద్వారా వాస్తవాలను వెదికేందుకు అచంచలంగా నివేదిస్తోంది. ఒక సూత్రాన్ని రూపొందించేందుకు భావాలు జత కూడుతాయి . అది కేవలం రాజ్యం గురించే కాదు, జాతీయ ఐక్యత అనే ఒక ఆత్మగా రూపొందేందుకు భిన్న భాషలనుంచి భిన్నత్వాన్ని ఎలా రూపొందించాలన్నదాని గురించి కూడా వుంటుంది.’

     దీనికి ఎవరికి వారు తమదైన అర్ధాలు తీసుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఆ చిత్రాన్ని చూసి ఇంకేముంది ఇండోనేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీకి ప్రాణ ప్రతిష్ట జరిగిందని సామాజిక మీడియాలో గగ్గోలు పెట్టారు. దీనిపై గత శుక్రవారం నాడు విమానాశ్రయ నిర్వాహకులు స్పందించారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యదర్శి అగస్‌ హర్యాదీ మాట్లాడుతూ ఆ చిత్రంలో వున్నది అయిదిత్‌ అని నిర్ధారణగా చెప్పలేము. దానిని నిర్ధారించుకొనే పనిలో వున్నాము. ఎందుకంటే కోంపాస్‌ డాట్‌ కాం పేర్కొన్నట్లు తొలి ప్రధాని సుతాన్‌ జహీర్‌ది కూడా కావచ్చు అన్నారు. ఇది చెప్పిన కొద్ది గంటలలోనే కంపెనీ డైరెక్టర& జొకో మూర్తజా మోద్‌జో ఒక ప్రకటన చేస్తూ ఆ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత దానిపై తెల్లని వస్త్రం కప్పి తరువాత పూర్తిగా తొలగించారు. ఐదు దశాబద్దుాల క్రితం ఇండోనేషియాలో జరిగిన కుట్రలో భాగంగా ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, నియంత సుహార్తోను వ్యతిరేకించిన వారిని మిలిటరీ, వారితో చేతులు కలిపిన ఇస్లామిక్‌ సంస్ధల సాయుధులు హతమార్చిన విషయం తెలిసిందే. నాటి ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, వూచకోతపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన నేపధ్యంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకులు చెలరేగి పోతున్నారు.

   గతంలో జరిగినదానిని తవ్వటం గాయాలను కెలకటం తప్ప మరొక ప్రయోజనం వుండదని అందువలన వాటి గురించి మాట్లాడ కూడదని రిటైర్డ్‌ జనరల్‌ కికి శ్యాంకరీ వంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక గళం విప్పుతున్నారు. జాతీయ భావమైన పంచశీలకు విరుద్ధంగా దేశంలో తిరిగి కమ్యూనిజం, ఇతర భావజాలాలను వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జూన్‌లో జరిగిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సులో కికీ ఆరోపించాడు. ఒక మార్క్సిస్టు తప్పకుండా ఒక నాస్తికుడు అయి వుంటాడని, భూమిని దేవుడు సృష్టించలేదని చెప్పిన అరిస్టాటిల్‌, ప్లాటోల తత్వశాస్త్రం మార్క్సిజం వెనుక వున్నదని, కాబట్టి వారు దేవుడిని నమ్మరంటూ అరిగిపోయిన రికార్డును తిరిగి వినిపించాడు. కికీ రోత వాదనలను తత్వవేత్త, క్రైస్తవ పూజారి అయిన ఫ్రాంజ్‌ మెగ్నిస్‌ సుసేనో తిరస్కరించారు. కారల్‌ మార్క్స్‌ భావాలు అరిస్టోటిల్‌తో సంబంధం లేనివి,అరిస్టోటిల్‌ భావాలు నాస్తికత్వంతో నిమిత్తం లేనివి అన్నారు. మార్క్స్‌ పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించారని, దాన్ని కూలదోయాలని చెప్పాడన్నారు. తరువాత రష్యా నాయకుడు లెనిన్‌ ఆ పని చేసేందుకు ఒక విప్లవ పార్టీ అవసరాన్ని గురించి చెప్పారని అన్నారు. ‘మార్క్స్‌ విప్లవ పార్టీ గురించి మాట్లాడలేదు, కానీ లెనిన్‌ పార్టీపై కేంద్రీకరించారు, కేవలం సిద్ధాంతం మీదే కాదు విప్లవనిర్వణ గురించి కూడా చెప్పారు.కనుకనే అతను విప్లవకారులను తయారు చేశాడు, వారిని కమ్యూనిస్టులని పిలిచారు, కాబట్టి కమ్యూనిజం అంటే మార్క్‌, లెనిన్‌ సిద్దాంతాల కలయిక ‘ అని ఫ్రాంజ్‌ జకర్తాపోస్టుతో చెప్పారు. కికీ వక్రీకరణలను జర్నలిస్టు ఫెబ్రియానా ఫిర్దౌస్‌ తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేయటంతో అనేక మంది మాజీ జనరల్‌ కికీ కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటూ వ్యంగ్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దాంతో మతశక్తులు ఫెబ్రియానాపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

   రెండవ విషయం డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి గురించిన ప్రచారం. ట్రంప్‌ భార్య ఒక కమ్యూనిస్టా అంటూ అదొక పెద్ద రహస్యాన్ని బయట పెట్టినట్లుగా ఆదివారం నాడు ఒక వ్యాఖ్యాత ఏకంగా పెద్ద వ్యాసమే రాశాడు. మార్నింగ్‌ లెడ్జర్‌ అనే డాట్‌కామ్‌లో సౌనక్‌ ముఖోపాధ్యాయ అనే పెద్ద మనిషి ఆ పని చేశాడు.ఆమె కమ్యూనిస్టు అయి వుండటానికి పేర్కొన్న కారణాలు ఇలా వున్నాయి. ఆమె ఐరోపాలోని యుగోస్లావియాలో పుట్టింది.ఆ సమయంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం వుంది, కనుక తప్పకుండా ఆమె మ్యూనిస్టు భావజాలాన్ని అభిమానించి వుంటుంది కనుక కమ్యూనిస్టే అయి వుంటుందన్నది తర్కం. ఒక వేళ ట్రంప్‌ గనుక గెలిస్తే ఒక కమ్యూనిస్టు దేశంలో పుట్టిన మహిళ అమెరికాలో ప్రధమ మహిళగా తొలిసారిగా రికార్డుల కెక్కుతారట. ట్రంప్‌ కమ్యూనిస్టు పార్టీ పాలనలో వున్న చైనా అంటే సానుకూల వైఖరి వుండటం మరొక కారణమట. మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతూ రాసే మతిలేని రాతలు తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ భార్య మెలినియా యుగోస్లావియాలో పుట్టినప్పటికీ మోడలింగ్‌ వృత్తి కోసం అమెరికా వచ్చింది.అక్కడే ఒక ఫ్రెంచి పత్రికకు నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత ఒక ఫ్యాషన్‌ షో సందర్భంగా పరిచయమైన ట్రంప్‌ను వివాహం చేసుకుంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగటంతో ఆయన ప్రత్యర్ధులు ఆ పొటోలను ఈనెలలో తిరిగి ప్రచురింప చేయించి, ఇలాంటి ఆమెను ప్రధమ పౌరురాలిగా ఎలా అంగీకరిస్తామంటూ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆమె తండ్రి కమ్యూనిస్టు కనుక ఆమె కూడా కమ్యూనిజాన్ని అభిమానించి వుంటుందంటూ ట్రంప్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టు వ్యతిరేకతను కూడా వాడుకోవటం దీని లక్ష్య ంగా వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘అవును నేను మతపరమైన మార్క్సిస్టును ‘

18 Saturday Jun 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

1965 Symposium, communism, D.N. Aidit, Indonesian Communist Party (PKI)., MARXIST, PKI, religious Marxist, Suharto, victims of 1965

160614_ID_IlhamAidit-1000.jpg

ఎంకెఆర్‌

   తండ్రి, ఆ నాటికి ప్రపంచంలో మూడవ పెద్ద కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు. అప్పటికి అతని వయస్సు 43 సంవత్సరాలే. కుట్ర చేసి సైనిక నియంతలు, వారి తాబేదార్లు కలిసి ఆయనను హత్యచేసిన సమయంలో కేవలం ఆరు సంవత్సరాల వయస్సున్న పసివాడతను. ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, అభిమానులుగా అనుమానించిన వారిని హతమార్చి, అంతకంటే ఎక్కువ సంఖ్యలో జైళ్లలో కుక్కిన సమయంలో మిగిలిన ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుంది. తరువాత ఆ బాలుడు స్కూలుకు వెళితే ప్రతి రోజూ కమ్యూనిస్టు అంటూ సహాధ్యాయులు తిట్టేవారు. తొలి రోజుల్లో తట్టుకోలేకపోయినా తరువాత చలించలేదు, నా తండ్రిని ఎందుకు చంపారు, ఆయన నమ్మిన కమ్యూనిజాన్ని అంతగా ఎందుకు ద్వేషిస్తున్నారు? అసలు కమ్యూనిజం అంటే ఏమిటి అని ఆ చిన్న వయసులోనే, ఆ చీకటి రోజుల్లోనే అతని మనస్సులో జిజ్ఞాస మొదలైంది.నియంతల చీకటి పాలనలోనే మానవాళికే వెలుగునిచ్చే మార్క్సిజం గురించి తెలుసుకున్నాడు. ఇపుడు యాభై ఆరు సంవత్సరాల వయసులో తాను మార్క్సిస్టును అని సగర్వంగా చెబుతున్నాడు.అతడెవరో కాదు, నిషేధానికి గురైన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ చివరి అధ్యక్షుడు దీపా నౌసంత్ర అయిదిత్‌ (డిఎన్‌ అయిదిత్‌ గా ప్రపంచానికి సుపరిచితం) కుమారుడు, ఆర్కిటెక్షర్‌గా పనిచేస్తున్న ఇలహమ్‌ అయిదిత్‌.

   యాభై సంవత్సరాల నాడు జరిగిన మారణకాండ గురించి విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని, నాటి నిజానిజాలేమిటో వెల్లడించాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఈ పూర్వరంగంలో గాయాలను మాన్పే పేరుతో ప్రభుత్వమే రెండు రోజుల పాటు అధికారికంగా ఒక సదస్సు నిర్వహించింది. దానికి పోటీగా నాటి మారణకాండలో పాల్గొన్నవారు, వారి మద్దతుదారులు జూన్‌ ఒకటి రెండు తేదీలలో విచారణకు వ్యతిరేకంగా ఒక సదస్సు జరిపారు. ఈ పూర్వరంగంలో 1965-66 సంవత్సరాలలో జరిపిన మారణ కాండకు ప్రభుత్వం క్షమాపణ చెబుతుందా, దోషులపై విచారణ జరుపుతుందా, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తుందా అన్నది ప్రస్తుతం ఇండోనేషియాలో చర్చగా వుంది. ఇండోనేషియాలో ప్రస్తుతం పౌరపాలనే నడుస్తున్నప్పటికీ అదెంతో బలహీనంగా వుంది. అధికారంలో వున్నవారి ఆదేశాలను వక్రీకరించి తమ అజెండాను అమలు జరిపేందుకు మిలిటరీ, పోలీసు వ్యవస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ కమ్యూనిజంపై నిషేధం కొనసాగటాన్ని అవకాశంగా తీసుకొని అభ్యుదయ లేదా ప్రశ్నించే ప్రతి వారినీ కమ్యూనిస్టు అని చివరకు ఎర్రచొక్కా వేసుకున్న ప్రతివారూ కమ్యూనిస్టులే అని సూత్రీకరించి టీషర్టులను అమ్మేవారిని కూడా కమ్యూనిస్టు ప్రచారకులుగా చిత్రించి అరెస్టు చేసిన విపరీత పరిస్ధితి అక్కడ వుంది. చివరకు అధ్యక్షుడు జోకోవియే స్వయంగా యంత్రాంగం అతిగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇప్పటికీ గ్రామాల వరకు మిలిటరీ వ్యవస్ధ వేళ్లూనుకొని వుంది. అయినా వచ్చిన కాస్త వెసులుబాటును వుపయోగించుకొని అభ్యుదయ వాదులు, మానవ హక్కుల కార్యకర్తలు కమ్యూనిస్టు వ్యతిరేక దమనకాండ వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇలహమ్‌ అయిదిత్‌తో రంజాన్‌ మాసం ప్రారంభమైన కొద్ది రోజుల క్రితం బేనార్‌ స్యూస్‌ జరిపిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలేమిటో చదవండి మరి.

ప్రభుత్వం మీద మీరు విశ్వాసం కోల్పోయారా ?

నేను ఆశావాదిని కాదు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఈ అంశంలో జోకోవి( దేశ అధ్యక్షుడు) ప్రభావం చూపవచ్చు, ఆయన ధృడంగా వున్నారు. ఇక తొలి సదస్సు తరువాత అనేక భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. లుహుత్‌ బిన్సర్‌ పాండిజైతన్‌ (ఇండోనేషియా హోం మంత్రి) అగస్‌ విడ్‌జోజో( ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సు అధ్యక్షుడు ) ఎంతో సహనంతో వుండటాన్ని నేను చూశాను. కానీ వాస్తవంలో ఎంతో ప్రతిఘటన వుంది. అందుకే జోకోవి పాత్ర ప్రభావం చూపుతుంది, మారణకాండపై అతను క్షమాపణ చెబుతారా? పునరావాసం కలిగించటం అన్నది అధ్యక్షుడి విచక్షణకు సంబంధించింది.

మీ మాదిరే ఇతర బాధిత కుటుంబాలు, బంధువులు కూడా నిరాశావాదులుగా వున్నారా ?

అంతా అలా లేరు, అయితే ప్రభుత్వం పాలు( సులావెసి ప్రాంతంలోని ఒక పట్టణం)ను అనుసరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ నగర మేయర్‌ చర్య ఆశ్చర్యకరమైనది. పాలులో 1965లో సామూహిక హాత్యాకాండ జరిగిందని వారు గుర్తించారు,సమాధానపరిచారు, స్ధానిక యంత్రాంగం క్షమాపణ చెప్పింది. బాధితులకు పరిహారం చెల్లించనప్పటికీ వారు మాజీ ఖైదీలు జబ్బు పడినపుడు వారికి వుచిత వైద్యంతో పాటు సామాజిక భద్రత కల్పించారు. నేను తప్పుగా అర్ధం చేసుకోకపోతే మూడవ తరంవారి వరకు అవి అందుతాయి. దానిని వుదాహరణగా తీసుకోవాలి, జోకోవి కనీసం ఆ పని చేయగలరు.

జూన్‌ ఒకటి రెండు తేదీలలో వుద్యోగ విరమణ చేసిన సైనిక జనరల్స్‌ ఎందుకు సదస్సు జరిపారంటారు ?

ఆ సదస్సు ఒక ప్రహసనం. సమాధానపరచటమనే ఇతివృత్తంతో దానిని జరిపారు, కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వారు తీర్మానించారు. అది సమాధానపరచటం కాదు కదా. సైన్యంలో అసంతృప్తి వుందని అది ప్రతిబింబిస్తోంది. అగస్‌ విడ్‌జోజో, హెన్‌డ్రాప్‌రియోనో మరియు లుహుత్‌ బిన్సర్‌ పాండిజైతన్‌ వంటి సంస్కరణవాదులైన జనరల్స్‌ వున్నారు, మానవ హక్కుల వుల్లంఘన జరిగిందని, దానికి సదుద్ధేశ్యంతో కూడిన పరిష్కారం అవసరం అని వారు గుర్తించారు. అది కషాయం వంటిదే అయినా , అవును దానికి సాయుధ బలగాలనే తప్పు పట్టాలని అని కనీసంగా వారు చెప్పవచ్చు, ఎందుకంటే ఆ సమయంలో వారు తప్పు చేసినట్లు రుజువులున్నాయి కనుక… ఇదే సమయంలో సంస్కరణవాద వ్యతిరేక మిలిటరీ వర్గం వుంది. వారిలో రక్షణ మంత్రి రేమిజర్డ్‌ రేకుడు, కివలన్‌ జెన్‌, కివీ శ్యాంకరి వంటి వారంతా దానిలో వున్నారు, వారంతా ఇప్పటికీ సుహార్తో నాయకత్వంలో మాదిరి మిలిటరీ స్వర్ణయుగంలో వున్నామనుకుంటున్నారు.

ఈ సమయంలో చట్టబద్దమైన పరిష్కారాన్ని మీరు ఎందుకు అంగీకరించటలేదు ?

ఒక పాత సమస్యకు న్యాయేతర పరిష్కార మార్గం సరైనదని అనుకుంటున్నాను. అందుకు బలమైన సాక్ష్యం వుంది. మంచి సర్దుబాటు, రాజీకి నాలుగు షరతులు వున్నాయి. ఒకటి, సామూహిక హత్యలు జరిగాయి. రెండు, ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించాలి, మూడు, నిజం చెప్పాలి, ఆ తరువాత దాన్ని యధాతధంగా స్కూలు పుస్తకాలలో వివరించటంతో పాటు దాని ప్రభావం ఎలా పడిందో కూడా వివరించాలి. నాలుగు, పరిస్థితిని చక్కపరచటం, దానితో ముడిపడివున్న పరిహారం, పునరావాసం, క్షమాభిక్ష.

కానీ లుహుత్‌ క్షమాపణ చెప్పటం కుదరదని చెప్పారు, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారా ?

నేను తగ్గుతున్నాను, ఎందుకంటే బహుశా విచార ప్రకటనకు మాత్రమే అవకాశం వుంటుందని లుహుత్‌ చెప్పారు. కానీ విచార ప్రకటనకు, క్షమాపణకు మధ్య వున్న తేడా మీకు తెలుసు, మొదటిది కేవలం సానుభూతి మాత్రమే. అది కూడా జరగదేమోనని నేను ఇప్పుడు ఆందోళనపడుతున్నాను. వాస్తవాలను వెల్లడి చేయకుండా పునరావాసం కలిగించటం అసాధారణం అవుతుంది, అది వికారమైన తర్కం అవుతుంది. డిఎన్‌ఎ(డిఎన్‌ అయిదిత్‌ ) ఎన్నడూ విచారణను ఎదుర్కొనలేదు, ఆయన నేరం చేసి వుంటే విచారణ జరిపి వుండాల్సింది. తప్పుంటే వురి శిక్ష విధించినా సమస్య వుండేది కాదు, కానీ న్యాయ విచారణ జరగాలి కదా !

   అధ్యక్షులుగా పనిచేసిన వారు అనేకమంది మారారు, కానీ 1965-66లో జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక వూచకోత సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు, దశాబ్దాల పాటు సాగదీయటానికి కారణం ఏమిటి ?

అధ్యక్షుడు సుహార్తో నాయకత్వంలో నూతన వ్యవస్ధ పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎంతో మంది జనం బుర్రల్లో అది నిలిచిపోయింది. దాని గురించి ఏమీ తెలియని వారిలో కూడా అది వ్యతిరేకతను కలిగించింది, ఇప్పటికీ వున్నది. అందుకే అలాంటి వ్యతిరేకత ప్రబలి వున్నది. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించకూడదు అని చెప్పేవారు కూడా వున్నారు, వారు నేరం చేసినట్లు అది స్పష్టం చేస్తున్నది.

దీనిని ఎవరు చేస్తున్నారు ?

మిలిటరీ నూతన వ్యవస్ధ ప్రాభవాన్ని కాంక్షిస్తున్న కొంత మంది జనరల్స్‌ వున్నారు, ఈ సమస్య ద్వారా మరోసారి దానికోసం మార్గం వెతికేందుకు ప్రయత్నించారు. ఏదో ఒక సమస్య సాకు కోసం మాట్లాడటం అందరికీ తెలిసిందే. అదృష్టం కొద్దీ జనం ఎంతో చురుకుగా వున్నారు. కానీ ఇప్పటికీ కమ్యూనిస్టు ముప్పు వుందని వారు ఆలోచించటం అసాధారణంగా వుంది. ప్రపంచంలో మనది తీవ్రంగా భయపడుతున్న దేశంగా వుంది. కమ్యూనిజం పునరుద్ధరణ గురించి ఇండోనేషియా తప్ప ఏ దేశమూ భయపడటం లేదు.తీవ్రవాదులైన ఐఎస్‌ లేదా ఆల్‌ ఖైదా నుంచి నిజమైన ముప్పు వస్తున్నందున దాని గురించి వారు భయపడాలి.కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సమస్య, వారికి ఎవరు నిధులు ఇస్తారు ? కమ్యూనిజాన్ని నిషేధించినట్లు అందరికీ తెలుసు.

ఈ సమస్యను ఇంకా సాగదీయటం గురించి మీరేమనుకుంటున్నారు?

దాన్ని మీరు వూహించుకోవచ్చు, యువతరం మంచి వుదాహరణను చూడజాలదు. రాజ్యం క్షమాపణ చెప్పినట్లు మీరు వూహించుకోండి, వారిని మీరు గౌరవించరా ? గౌరవ ప్రదమైన చర్యను యువతరం అనుసరిస్తుంది, ఇప్పటికీ నిందలపాలు అవుతున్న బాధితులు కూడా క్షమిస్తాము అని చెప్పటానికి వీలుకలుగుతుంది.

మీకు కమ్యూనిజం గురించి ఎలా తెలిసింది?

ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ అధ్య క్షుడిగా నా తండ్రి పనిచేశారని నేను తెలుసుకున్నాను. అదంతా నా మనస్సులో వుంది. వారు రైతులు, మత్స్యకారులు, ఇతర జనాన్ని సమర్ధించారు, కానీ నేను హైస్కూలులో వుండగా కమ్యూనిజం గురించి చదవాలన్న ఆసక్తి ఏర్పడింది. మార్క్సిజం దానికి పునాది అని తెలుసుకున్నాను.

కమ్యూనిజం గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి కలిగించినది ఏమిటి ?

నా తండ్రి చేసిన తప్పిదం ఏమిటి అన్న కుతూహలమే ప్రధానంగా నన్ను ప్రేరేపించింది.నేను హైస్కూలులో వుండగా కొన్ని విశ్లేషణ మెళకువలను తెలుసుకోవటం ప్రారంభించాను.ఈ ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు వున్నాయని తెలుసుకున్నాను. డబ్బుకు అనుకూలమైన సిద్ధాంతం ఒకటుంది, జనం తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేరు కనుక ఈ ప్రపంచంలోని సంపదనంతటినీ జనమంతటికీ సమానంగా పంచాలన్న సిద్ధాంతం ఒకటి వుంది. కమ్యూనిస్టు భావన గురించి నేను ఒక స్కూలు స్నేహితుడిద్వారా చదివాను. అతని తండ్రి కమ్యూనిస్టు కాకపోయినా వారి వద్ద ఎంతో సాహిత్యం వుంది. వుదాహరణకు గాంధీ ఒక హిందువు అయినా ఆయనను మీరు అభిమానించవచ్చు, ఆయన గురించి పుస్తకాలు కలిగి వుండవచ్చు. నేను ఆ విధంగా చదువుకున్నాను.

కమ్యూనిస్టుగా మారటమంటే అర్ధం మీరు నాస్తికులా ?

కమ్యూనిస్టుగా వుండటమంటే అర్ధం నాస్తికుడని కాదు….మా తండ్రి వుపవాసాలు వున్నారు, రంజాన్‌ పండుగ చేసుకున్నారు. కానీ ఆయన నూతన ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నారు. సామాజిక తరగతులు లేకుండా చేయాలనుకున్నారు.దానికీ దేవుడికీ సంబంధం లేదు.నాస్తికుడని ముద్రవేశారు, అది సుహార్తో హయాంలో జరిగిన ప్రచారం, అది పని చేసింది. భౌతిక సంపదలను సమంగా పంచినపుడే ప్రపంచం సుఖంగా వుంటుందని మార్క్స్‌ చెప్పారు.ఆ సూత్రంతో నేను ఏకీభవిస్తాను.మనల్ని పెట్టుబడిదారులు పాలించటాన్ని అనుమతించకూడదు.

అయితే మీరు ఒక కమ్యూనిస్టు ?

నేను కమ్యూనిస్టు అనే దాని కంటే ఎక్కువగా మార్క్సిస్టును అని చెప్పగలను

మీరు నాస్తికులా ?

నేను ఇప్పుడు వుపవాసం వుంటున్నాను, నేను మతపరమైన మార్క్సిస్టును అందులో గందరగోళం లేదు కదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మేం మీతో వున్నాం ! ఫెబ్రియానా ఫిర్దౌస్‌ ముందుకు సాగిపో !!

15 Wednesday Jun 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, Anti communist, Febriana Firdaus, Indonesia, Indonesian Communist Party (PKI)., victims of 1965

కమ్యూనిస్టు వ్యతిరేకుల వత్తిళ్లకు లొంగవద్దు,

ఎం కోటేశ్వరరావు

స్థలం ఇండోనేషియా రాజధాని జకర్తా నగరం !

సమయం 2016 జూన్‌ రెండవ తేదీ !!

      సందర్భం కమ్యూనిజం నుంచి దేశాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేకుల సభ రెండవ రోజు కొనసాగింపు !!!

    ఆ సభ ప్రాంగణం దగ్గరకు వచ్చారు కొందరు క్రైస్తవ విద్యార్ధులు. కుక్క మనిషిని కరవటం సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే వార్త. ప్రపంచంలో కమ్యూనిస్టుల కార్యకలాపాలు, అందులో భాగంగా సభలు సమావేశాలు సాధారణం. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడండని సభ పెట్టటమే వార్త. ఆ సభకు వచ్చిన క్రైస్తవ యువకులు సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో శిలువ గుర్తు కూడా వుంది. ఆ చిహ్నాన్ని వుపయోగించుకోవటం పట్ల తమకు అభ్యంతరం వుందంటూ తమ నిరసనను వారు నిర్వాహకుల ముందు వెల్లడించారు.

     ఇంకేముంది జర్నలిస్టులకు అదొక మిర్చి మసాలా ! మిరప చిన్నదా పెద్దదా అని కాదు అన్నయా అది కారంగా వుందా లేదా అన్నదే పాయింటు అన్నట్లుగా అది చాలా హాట్‌గా వుంటుంది కదా !! మూడుపదులు దాటిన ఒక మహిళా జర్నలిస్టు ఆ విద్యార్ధులను పక్కకు పిలిచి మీ అభ్యంతరం ఏమిటని వారితో మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో తెల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. దుర్వాసుడికి దూరపు బంధువులా వుంది ముఖం. వస్తూనే ఈమె ఫెబ్రియానా ఫిర్దౌస్‌ , తప్పుడు వార్తలు రాస్తుంటుంది.ఆమెతో మాట్లాడకండి అంటూ వాదులాటకు దిగాడు.ఇంతలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా వున్న మరో తలపాగా వాలా వస్తూనే ఈ వార్త కనుక అచ్చయిందో, నీ ఫొటో, వివరాలన్నీ మా దగ్గర వున్నాయి, జైల్లో తోయిస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. ఇస్లాం రక్షణ సంఘటన, దేశ రక్షణ వుద్యమం పేరుతో వున్న సంస్ధలకు చెందిన వారు ఈ వ్యక్తులు.

    అసలే కోతి, ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా రెండు తలపాగాలూ పెద్దగా రంకెలు వేస్తూ వుండటంతో అసలే ఎరుపు భయంతో వున్న సభికులు తాము మట్టుబెట్టిన లక్షలాది మంది కమ్యూనిస్టులలో ఎవరైనా భూతంగా ఆ సభకు వచ్చిందేమో అని భయపడ్డారో లేక భ్రమపడ్డారో గాని అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇంకే ముంది . ఆ రెండు పత్రికల వార్తలను పట్టించుకోకూడదని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ పత్రిక, ఛానల్‌ వారు తమ వార్తలను కవర్‌ చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లుగా ఫెబ్రియానా రాసే వార్తలు మాకు అవసరం లేదు, అసలు ఆమెను మేం పిలవలేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు ఆమె మీదకు వెళ్లారు.జాగ్రత్త మన మహిళల్లో కొందరు నకిలీ ముస్లింలు బురఖాలు వేసుకొని వస్తారు, నిజానికి వారు కమ్యూనిస్టు తొత్తులు, బురఖాలతో మోసం చేయవద్దు అంటూ వీరంగం వేశారు. వున్మాదంతో వున్న జనం, విచక్షణ జ్ఞానం వుండదు వారికి వివరించినా ప్రయోజనం శూన్యం అని గ్రహించి ఆ ప్రాంగణం నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ తరువాత ఆమె అంతం చూస్తామంటూ సామాజిక మీడియాలో మతశక్తులు బెదిరింపులు ప్రారంభించాయి.

AJI Condemns Intimidation against Journalist

     ఫెబ్రియానా ఫిర్దౌస్‌ గురించి ఇంక పరిచయం అవసరం లేదేమో ! ఇండోనేషియాలో వున్న తాజా పరిస్థితికి ఆ వుదంతం అద్దం పట్టింది. ఇంతకూ ఆమె చేసిన అపరాధం ఏమిటి ? నియంత సుహార్తో నాయకత్వంలో అమెరికా కుట్ర ప్రకారం మిలిటరీ, పారా మిలిటరీ, రజాకార్ల వంటి మతోన్మాద గూండాలను తయారు చేసి దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను హతమార్చిన దారుణ మారణం కాండ గురించి ఆ నియంత మరణించిన వచ్చిన కొద్దిపాటి వెసులు బాటును వుపయోగించుకొని బుద్ధి జీవులు ఆ దారుణాల గురించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది క్రమంగా వూపందుకొని ఆ దారుణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హత్యాకాండపట్ల క్షమాపణ చెప్పాలని తదితర డిమాండ్లు ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు తాము ప్రజాస్వామ్యయుతంగా వున్నామని జనం ముందు ప్రదర్శించుకోవాలి కదా ? కొంత మంది అభిప్రాయం ప్రకారం పాలకులకు ఇష్టం లేకపోయినా పెరుగుతున్న వత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక పేరుతో ఆ చర్చకు తెరదించాలనే లక్ష్యంతో కొద్ది వారాల క్రితం ఇండోనేషియా ప్రభుత్వం 1965నాటి వూచకోతపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఆచరణలో గతంలో మాదిరే ప్రస్తుత ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు భావజాలం, పదజాలం వున్న కళారూపాలు, డాక్యుమెంటరీలు, పాటలను కూడా నిషేధించారు.కేసులను నమోదు చేశారు. అంతకు ముందున్న పరిస్ధితికి వర్తమానానికి తేడా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

    అయినప్పటికీ దేశంలోని నిరంకుశ, మతశక్తులు గగ్గోలు ప్రారంభించాయి.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి ఇండోనేషియాలో వ్యాపింప చేయాలనే వారు ప్రభుత్వ సదస్సు వెనుక వున్నారని కొందరు, అసలు ప్రభుత్వంలోనే కమ్యూనిస్టులున్నారని మరి కొందరు, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందని, వచ్చే ఏడాది లాంఛనంగా ప్రకటన చేయనున్నారని ఇలా రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. వీటిలో వాస్తవాలు ఎంత వరకు అన్నది చెప్పలేము గాని 1965 మారణకాండ గురించి జనానికి నిజాలు చెప్పాలన్న ప్రజాతంత్ర డిమాండ్‌ మాత్రం నానాటికీ అక్కడ పెరుగుతోందన్నది స్పష్టం.

     ఈ పూర్వరంగంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, నాటి మారణకాండలో భాగస్వామ్యులైన మాజీ సైనికాధికారులు, వారితో చేతులు కలిపిన మతోన్మాద శక్తులు, సంస్ధలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు కలిసి ప్రభుత్వం పెట్టినదానికి పోటీ సదస్సును పెట్టి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని, గతంలో జరిగినదానిపై ఎలాంటి క్షమాపణ చెప్పటం, విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తీర్మానించారు. దాని గురించి విమర్శనాత్మకంగా వార్తలు,వ్యాఖ్యలు రాయటమే ఫెబ్రియానా చేసిన పని. అంతకు ముందు కూడా కమ్యూ నిస్టులు, సానుభూతిపరులు అన్న అనుమానం వున్న కళాకారులు, రచయితల సభలు,సమావేవాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకున్న నిషేధ చర్యలు మొదలైన వాటి గురించి కూడా ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పేరు ఎత్తితేనే కమ్యూ నిస్టు వ్యతిరేకులు, మతశక్తులు మండి పడుతున్నాయి. భౌతిక దాడులకు ప్రయత్నించటంతో ఆమె ప్రస్తుతం అజ్ఞాతవాసంలో వున్నట్లు వార్తలు వచ్చాయి.

     ఒక్క ఫెబ్రియానా గురించే కాదు, ఇండోనేషియాలో పత్రికా స్వాతంత్య్రం గురించి అనేక మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఫెబ్రియానాకు బెదిరింపుల గురించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకొనే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా అక్కడి కరెన్సీలో 50 కోట్ల రుపయాల( 34,500 డాలర్లకు సమానం) జరిమానా విధించవచ్చు.తమ జర్నలిస్టును సభ నుంచి గెంటివేయటం అక్రమం అని ఫెబ్రియానా ఒక సంపాదకురాలిగా పనిచేస్తున్న రాప్లర్‌ డాట్‌ కాం యాజమాన్యం ఒక ప్రకటనలో ఖండించింది.ఆగ్నేయాసియా ప్రెస్‌ అలయన్స్‌ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది.ఇండోనేషియా ఇండిపెండెంట్‌ జర్నలిస్టు అలయన్స్‌ ఫెబ్రియానా రక్షణకు చర్యలు తీసుకుంది.ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియాలో కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా !

04 Saturday Jun 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, Indonesian Communist Party, PKI, victims of 1965

ఎంకెఆర్‌

    ఇండోనేషియాలో అంత మైంది అనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా ? కొంత మంది చెబుతున్నట్లు 2017లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందా ? లేక మరికొందరు అంటున్నట్లు ఎక్కువ చేసి చెబుతున్నారా ? యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోశారు. మరికొన్ని లక్షల మందిని అనుమానంతో కమ్యూనిస్టులుగా భావించి జైళ్లలో పెట్టారు, చిత్రహింసల పాలు చేశారు. కమ్యూనిజాన్ని అణచివేశామని అదింకేమాత్రం ఇండోనేషియాలో కనిపించదని సంబరాలు చేసుకున్నారు. ఆసియాలో కమ్యూనిజ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమెరికా సిఐఏ రూపొందించిన ఒక దుష్ట పధకం ప్రకారం ఇదంతా జరిగింది.నాడు ఏక్షణంలో ఏ సైనికులు, పోలీసులు, వారి కిరాయి ఏజంట్లు వచ్చి తమను హతమారుస్తారో అని కమ్యూనిస్టులు, అభిమానులు, సాధారణ ప్రజాతంత్ర వాదులు భయపడ్డారు. నేడు అందుకు విరుద్ధంగా ఏ మూల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకు వస్తారో అని భయపడుతూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు వీధులకెక్కుతున్నారు. అనేక సంస్థలకు చెందిన వారూ, రిటైర్డ్‌ మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితం కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సు పెట్టి ఆ సందర్భంగా రాజధాని జకర్తాలో ఒక ప్రదర్శన చేశారు.అరుణ పతాకాలను తగుల పెట్టారు.కమ్యూనిస్టులను చంపటం సరైనదే అని వున్మాదంతో నినాదాలు చేశారు. కమ్యూనిజం, ఇతర భావజాలాల నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రదర్శన జరిపినట్లు వుపన్యాసాలు చేసిన వారు చెప్పారు. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసి ఎంతో మందిని చంపిన అమెరికా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిందని, కమ్యూనిస్టులను చంపటం కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించి ప్రభుత్వం ఎలాంటి క్షమాపణలు చెప్పకూడదని వాదించారు. ఇంతకాలంగా కార్యకలాపాలలో లేని ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(పికెఐ) తన వునికిని చాటుకొనేందుకు పధకాలు వేసిందని, దానిని అడ్డుకోవాలని కోరారు. కొన్ని పత్రికలు మూడువేల మంది పాల్గొన్నట్లు రాస్తే మరికొందరు పదివేలని పేర్కొన్నారు.

    దీనికి కొద్ది వారాల ముందు ప్రభుత్వమే 1965 హత్యాకాండ బాధితుల గురించి వారి కుటుంబాలు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో ఒక సదస్సు జరిపిన విషయం తెలిసినదే.అదే ప్రభత్వం కమ్యూనిస్టు ప్రచారం, పునరుద్ధరణలో భాగంగా చివరికి కమ్యూనిస్టు చిహ్నాలున్న టీ షర్టులను అమ్ముతున్నవారిని, ధరించిన వారిని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పికెఐ భావజాలం వున్న వారు చెప్పింది మాత్రమే వినవద్దు, మేము చెప్పేది కూడా వినాలి, 1965లో మరణించిన వారిని (కమ్యూనిస్టులను) బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తే వారిని హతమార్చిన వారిని(మిలిటరీ, ఇతర కిరాయి ఏజంట్లు) నేరస్థులుగా పరిగణించాల్సి వుంటుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు పేర్కొన్నారు.

  ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికలిగిస్తున్నాయి.ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేశామని అమెరికన్లు ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత అదే అమెరికాలో తాము సోషలిస్టుల మంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ ప్రస్తుతం ప్రచారంలో మునిగిన విషయం, ఆయనకు యువత నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

   ఇండోనేషియాలో నియంత సుహార్తో పతనం తరువాత 1965 నాటి మారణకాండపై విచారణ జరపాలనే అంశం మెల్లగా వూపందుకుంది. మొత్తాన్ని అంతం చేసిన తరువాత కూడా ఇంకా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా ? వుంటే ఏ పేరుతో వున్నారు, తాజా డిమాండ్‌ వెనుక వారున్నారా ? అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులను వేధిస్తున్న ప్రశ్న. కమ్యూనిస్టుల నాయకత్వాన నైజా నవాబు, దేశముఖ్‌లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా సాయుధ పోరాట సందర్బంగా కోస్తా జిల్లాలో ఆ పోరాటానికి మద్దతు తెలిపిన వారిని కూడా మిలిటరీ, పోలీసులు అనేక మందిని కాల్చి చంపటమే గాక గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి చిత్ర హింసల పాలు చేశారు. పోలీసులకు ఎవరు కమ్యూనిస్టులో ఎవరు కాదో తెలియని స్ధితి, వచ్చిన స్పెషల్‌ ప ోలీసులకు జనాన్ని బాదటం తప్ప తెలుగు తెలియదు. గాంధీ విగ్రహాల ముందు జనాన్ని మందవేసి చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో కొంత మంది తాము యాంటీ కమ్యూనిస్టుల మని చెప్పుకున్నారట. అసలే పోలీసు, తలమీద టోపీ పెట్టగానే బుర్ర అసలు పని చేయదని తెలిసిందే. దాంతో వున్న కమ్యూనిస్టులతోనే వేగలేకపోతుంటే వీరెవరో కొత్తగా యాంటీ కమ్యూనిస్టులట వీరికి నాలుగు అదనంగా తగిలించమని పురమాయించినట్లు చెప్పేవారు. అలాగే ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎంతవరకు పోయిందంటే కమ్యూనిస్టు వ్యతిరేక పుస్తకాలను కూడా మిలిటరీ, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఏమిటంటే కమ్యూనిస్టులను విమర్శించాలన్నా కమ్యూనిస్టులు ఏమి చెప్పేది వివరించాలి కనుక అది కూడా కమ్యూనిస్టు ప్రచారానికి తోడ్పడుతందని వారు భయపడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకత ముసుగులో నియంత సుహార్తో అనుసరించిన మేథోవ్యతిరేక ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇలాంటి చర్యలు ఫలితాలనివ్వవని తెలిసినప్పటికీ అదే మొరటు పద్దతులను పాటిస్తున్నారు. మిలిటరీ, పోలీసులు ఎంతగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడితే యువతరం అంతగా దానిపట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు భయపడుతున్నారు.

   ఇండోనేషియాలో కమ్యూనిస్టు కార్యకలాపాల పునరుద్ధరణ గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తులని దేశ వుపాధ్యక్షుడు యూసఫ్‌ కలా వ్యాఖ్యానించారు.’ కమ్యూనిజం అనేది సమానత్వం కోరుతున్న ఒక భావజాలం,అందుకే కాబోలు జనం దానిని భిన్నంగా చూస్తున్నారు, ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ అనేది అతిశయోక్తి అనుకుంటున్నా. అది అనేక దేశాలలో విఫలమైంది, ప్రస్తుతం వుత్తర కొరియాలో మాత్రమే వుంది, అక్కడి ప్రభుత్వం కూడా విఫలమైంది, ఒక భావజాలంగా ఒకసారి తిరస్కారానికి గురైంది తిరిగి వేళ్లూను కుంటుంది అనుకోవటం లేదు.’ అన్నారు. మిలిటరీ అధికారి కివలన్‌ జెన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరించబడింది, 2017లో ప్రకటన వెలువడ నుంది అన్నారు. రాజకీయ, భద్రత, న్యాయ వ్యవహారాల మంత్రి లుహుత్‌ బిన్సర్‌ పండజైటన్‌ మాట్లాడుతూ ‘ అదే నిజమైతే ఆ సంస్ధ ఎక్కడుందో చెప్పమనండి, నాకు చాలా కళ్లు,చెవులు వున్నాయి కానీ ఒక్క నివేదిక కూడా నాకు అందలేదు’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుత్తీ, కొడవలి టీ షర్టులతో భయపడిన ఇండోనేషియా సర్కార్‌

15 Sunday May 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist symbols, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియాలో కమ్యూనిస్టుల వూచకోతపై విచారణకు ఆదేశం

30 Saturday Apr 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

1965 Symposium, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

సత్య

    యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోసి, లక్షలాది మందిని చిత్రహింసలు, జైలు పాలు చేసిన దుర్మార్గంపై దర్యాప్తు జరిపి వాస్తవాలను వెల్లడించటంతో పాటు దోషులను శిక్షించాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. దానికి అనుగుణ్యంగానే ఈ వారంలో దేశాధ్యక్షుడు జోకోవి దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందని భావిస్తున్నారు. మిలిటరీతో పాటు నాడు హత్యాకాండలో మిలిటరీకి సహకరించి నేడు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు దర్యాప్తును సాధ్యమైన మేరకు అడ్డుకోవాలని, వీలుకానపుడు దానినొక ప్రహసంగా మార్చాలని మరోవైపు నుంచి వత్తిడి తెస్తున్నారు. కమ్యూనిస్టులను హత్య చేసి సామూహికంగా పూడ్చిపెట్టిన ప్రాంతాల గురించి వివరాలు సేకరించాలని అధ్యక్షుడు తమను ఆదేశించినట్లు సీనియర్‌ మంత్రులు జోకో విడోడో, లుహుత్‌ పాండజైటన్‌ ప్రకటించారు. సమాచారం గురించి ప్రభుత్వం తమను, ఇతరులను కూడా సంప్రదిస్తున్నదని ఇండోనేసియన్‌ పరిశోధనా సంస్ధ అధిపతి హరీస్‌ అజహర్‌ వెల్లడించారు.

    మాజీ జనరల్‌ అయిన మంత్రి లుహుట్‌ దర్యాప్తు గురించి మాట్లాడుతూ ఇంతకాలంగా లక్షల మంది మరణించారని చెబుతున్నాం, అయితే అందుకు సంబంధించిన ఒక్క సామూహిక ఖనన ప్రాంతాన్ని కూడా కనుగొనలేదన్నారు. అలాంటివి ఏమైనా వుంటే కనుగొనమని అధ్యక్షుడు నాకు చెప్పారు అన్నారు.స్పష్ట మైన ఆధారాలున్నాయని మానవ హక్కుల బృందాలు చెబుతున్నాయి.

    దుష్టులైన కొంత మంది మిలిటరీ జనరల్స్‌తో కలసి కమ్యూనిస్టులు కొందరు జనరల్స్‌ను హత్య చేసి తిరుగుబాటు చేశారని, దాన్ని అణచివేసే క్రమంలో కొంతమంది మరణించి వుండవచ్చని ఇప్పటి వరకూ మిలిటరీ చెబుతోంది. దాని గురించి మాట్లాడిన వారిని వేధింపులకు గురి చేసింది. అసలు చర్చకే అవకాశం ఇవ్వలేదు. అమెరికా పన్నిన పెద్ద కుట్రలో భాగంగా సైనిక జనరల్స్‌ను కొంత మందిని పధకం ప్రకారం హత్యగావించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై మోపి వూచకోతకు పాల్పడ్డారన్నది వాస్తవం. చైనీస్‌ ఇండోనేషియన్స్‌ను, కమ్యూనిస్టులు కాని వారిని కూడా అనుమానంతో మిలిటరీ, దానికి సహకరించిన మతోన్మాదశక్తులు హత్యకావించాయి. ఎన్నో లక్షల మందిని అనుమానంతో చిత్రహింసలు పెట్టారు. జైలు పాలు గావించారు. వారికి వుద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. విదేశాలలో తలదాచుకున్నవారిలో వేలమంది ఇప్పటికీ స్వదేశానికి రాలేదు.

   ఇంతవరకు అసలు ఈ దుర్మార్గం గురించి మాట్లాడటానికి, చర్చించటానికి అనుమతించని ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా తానే గతవారంలో ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. వాస్తవాల వెల్లడికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆశాభావం కొందరు వెల్లడిస్తే, ఈ సమస్య గురించి భవిష్యత్‌లో ఎవరూ మాట్లాడకుండా దీనికి ముగింపు పలికేందుకే ఈ తతంగం నడిపిందని భావించేవారు కూడా వున్నారు.ఈ వూచకోతపై నేర విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రస్తుతం ప్రభుత్వం తిరస్కరించి పక్కన బెట్టటమే దీనికి మూలం. సమాచారం సేకరించి ప్రభుత్వం ఏమి చేయనుందని అనేక హక్కుల బృందాలు సందేహిస్తున్నాయి. అన్నింటికీ మించి ఎవరైనా సాక్ష్యాలు చెప్పటానికి ముందుకు వస్తే వారికి రక్షణ, వేధించకుండా హామీ ఏమిటన్నది కీలకమైన సమస్య.

   ప్రపంచానికంతటికీ మానవ హక్కుల గురించి సుద్దులు చెప్పే అమెరికా ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత గురించి తన వద్ద వున్న వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తోంది. ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమనేత, జాతిపితగా పరిగణించబడే సుకర్ణో కమ్యూనిస్టుల పట్ల సానుకూల వైఖరితో వుండేవారు.ఈ పూర్వరంగంలో 30లక్షల మంది సభ్యులను కలిగి వున్న కమ్యూనిస్టు పార్టీ ఆయనకు బాసటగా వుండేది. ఈ పూర్వరంగంలోనే 1963లో సిఐఏ సలహాదారు అమెరికాను హెచ్చరించాడు.’ కమ్యూనిస్టుపార్టీని ఇలాగే కొనసాగనిస్తే ఆగ్నేయాసియాలో చట్టబద్దంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇండోనేషియాలో ఏర్పడే అవకాశం వుందని’ పేర్కొన్నాడు. అది జరిగిన రెండు సంవత్సరాల తరువాతే మిలిటరీ నాయకత్వంలో వూచ జరిగింది. అనేక దేశాలకు సంబంధించి తన వద్ద వున్న సమాచారాన్ని 30 సంవత్సరాల తరువాత బహిరంగ పరచటాన్ని ఒక విధానంగా అమెరికా పాటిస్తోంది.అయితే ఇండోనేషియా విషయంలో మాత్రం ఆ పని చేసేందుకు నిరాకరించటం గమనించాల్సిన అంశం. ఈ దారుణంలో అమెరికా అధికారుల ప్రమేయం వుందని వెల్లడైన కొన్ని ప్రాధమిక పత్రాలు వెల్లడించటమే దీనికి కారణం.

     సహజ సంపదలు, రబ్బరు తోటలకు ప్రసిద్ధి చెందిన కారణంగా 1940 దశకం నుంచీ అమెరికన్లు ఇండోనేషియాపై కన్ను వేశారు. 1958లో సుకర్ణో ప్రభుత్వంపై జరిగిన విఫల కుట్రకు అమెరికా ఆర్ధిక సాయం చేసింది. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆర్ధిక ఆంక్షలకు పాల్పడింది. 1965 కుట్రకు ముందు అమెరికా విదేశాంగశాఖ అధికారులు పార్లమెంటరీ కమిటీ ముందు మాట్లాడుతూ సుకర్నో రంగం నుంచి తప్పుకుంటే మిలిటరీ ఆ స్ధానాన్ని భర్తీ చేస్తుందని అందువలన అమెరికా తన తలపులను తెరిచి వుంచాలని చెప్పారు. ముందస్తుగా వేసుకున్న పధకంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా గూఢచార సంస్థలు కట్టుకధలను ప్రచారంలో పెట్టాయి. మిలిటరీ జనరల్స్‌ను హత్య చేసేందుకు, చైనా నుంచి ఆయుధాలను సేకరించేందుకు, ముస్లిం మత నేతలను హతమార్చేందుకు కమ్యూనిస్టు పార్టీ పధకం వేసిందన్న కధనాలను ప్రచారంలో పెట్టాయి.

    వూచకోత తరువాత తనకేమీ సంబంధం లేనట్లు అమెరికా మౌనం పాటించింది.కొద్ది నెలల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ అనే వ్యాఖ్యాత ‘ ఇండోనేషియాలో తిరుగుబాటు వెనుక తాను వున్నట్లు చెప్పుకోకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించింది. అయితే దీనర్ధం వాషింగ్టన్‌కు దీనితో ఏ సంబంధమూ లేదని కాదు’ అని పేర్కొన్నారు. వూచకోతకు ముందుగా చేసిన ప్రచారంలో పేర్కొన్న అంశాలనే మిలిటరీ జనరల్‌ సుహార్తో కూడా ప్రచారంలో పెట్టి కమ్యూనిస్టులపైకి ముస్లింలను వుసిగొల్పాడు. ఇదే విషయాన్ని ఆనాడు ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా వున్న మార్షల్‌ గ్రీన్‌ తన వర్తమానాలలో తెలియ చేశాడు. తిరుగుబాటుదార్లకు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేయాలని కూడా పేర్కొన్నాడు.ఈ తిరుగుబాటులో కమ్యూనిస్టులు, చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రచార విభాగాలను రంగంలోకి దించాలని కూడా సూచించాడు. వియత్నాంలో గ్రామ పెద్దలను మట్టుపెట్టి కమ్యూనిస్టులపై నెపం మోపిన పద్దతులలో ఇండోనేషియాలో జనరల్స్‌, మత పెద్దల విషయంలోనూ కమ్యూనిస్టులపై ప్రచారం చేయాలని సూచించాడు. తమతో సంబంధాలలో వున్న మిలిటరీ, ఇస్లామిక్‌ నేతలతో రాయబార కార్యాలయం వ్యూహం గురించి చర్చలు జరిపిందని, ముస్లిం దళాల సాయంతో మిలిటరీ పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టులను అరెస్టు చేసి హతమార్చిందని పేర్కొన్నాడు.

      1965 డిసెంబరులో టైమ్‌ పత్రిక వూచకోత గురించి తన వార్తలో ఇలా పేర్కొన్నది.’ వేలాది మంది కమ్యూనిస్టులు, ఎరుపు సానుభూతి పరులు, వారి కుటుంబాలను వూచకోశారు. మారు మూల జైళ్లలో వేలాది కమ్యూనిస్టు కుటుంబాలను ప్రశ్నించి బాక్‌లాండ్స్‌ సైనిక యూనిట్లు వురి తీసినట్లు తెలుస్తోంది. రాత్రి పూట కమ్యూనిస్టుల ఇండ్లకు ముస్లిం పట్టీలను గుర్తులుగా వేలాడదీసిి ‘పరాంగ్స్‌’ అని పిలిచే పదునైన త్తులతో మొత్తం కుటుంబాలన్నింటినీ పొడిచి చంపి శవాలను లోతైన గోతులలో పూడ్చి పెట్టారు. తూర్పు జావా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో హత్యాకాండ బహిరంగంగా సాగింది. కమ్యూనిస్టులుగా భావించిన వారిని పట్టుకొని వారి నుదుళ్లకు పట్టీలు పెట్టి వారిని పొడవైన స్ధంభాలకు కట్టి గ్రామాలలో వూరేగించి తరువాత చంపివేశారు. తూర్పు జావా, సుమత్రా వుత్తర ప్రాంతంలో ఎంత భారీగా హత్యలు జరిగాయంటే పూడ్చిన శవాలు కుళ్లిపోయి, దుర్వాసనలతో తీవ్రమైన పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.ఆ ప్రాంత నదులు, వాగులు వంకలన్నీ శవాలతో నిండిపోయాయి. అనేక చోట్ల నదులలో ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ప్రయాణీకులు తెలిపారు.’

    1966 ఫిబ్రవరి నాటికి కనీసంగా నాలుగు లక్షలమందిని హతమార్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. అంటే హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు వేసినపుడు మరణించిన వారి కంటే ఎక్కువ.’ఇక్కడి (అమెరికా ) నుంచి రహస్యంగా పరోక్ష సాయం లేకుండా ఇది జరిగి వుండేది కాదు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ వ్యాఖ్యానించారు. 1960 దశకంలో ఇండోనేషియాతో అమెరికా సంబంధాల గురించి చరిత్రకారుడు బ్రాడ్లే సింప్సన్‌ 2008లో వెల్లడించిన తన అధ్యయనంలో సిఐఏ రికార్డులలో బయటకు వచ్చినవి చాలా తక్కువని, అంతకంటే చాలా ఎక్కువగా సిఐఏ రహస్య కార్యకలాపాలు వున్నట్లు వీటిని బట్టి చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత దుర్మార్గమైన రాక్షస కాండలలో ఒకటిగా పరిగణించబడే ఇండోనేషియా వుదంతాలలో అమెరికా ప్రత్యక్ష, ప్రరోక్ష ప్రమేయం ఎంత వుందో వెల్లడి కావాలంటే వారి దగ్గర వున్న పత్రాలన్నింటినీ బయట పెడితే తప్ప మరొక మార్గం లేదు. అమెరికాపై ఇండోనేషియా సర్కార్‌ ఆమేరకు వత్తిడి తెస్తుందా, తన పాత్రను బయటకు రాకుండా చేసేందుకు వాటిని అమెరికా భూస్తాపితం చేస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టుల వూచకోతపై చర్చలు తప్ప క్షమాపణ లేదన్న ఇండోనేషియా సర్కార్‌

18 Monday Apr 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, US, victims of 1965

 

ఎంకెఆర్‌

1965-66లో జరిగిన మరణాలపై చర్చలు తప్ప క్షమాపణ చెప్పేది లేదని సోమవారం నాడు ఇండోనేషియా సర్కార్‌ ప్రకటించింది. ఆ సంవత్సరాలలో ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు, అనుమానం వున్న వారిని, కొంత మంది సైనిక అధికారులను హత్య కావించిన వుదంతంపై వారి వారసులతో సర్దుబాటు పేరుతో రెండు రోజుల జాతీయ సెమినార్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సభను ప్రారంభించిన హోంమంత్రి లహుట్‌ పంజైటన్‌ మాట్లాడుతూ గతంతో శాంతిని కోరుకుంటున్నాం తప్ప జరిగినదానికి క్షమాపణ చెప్పేది లేదని చెప్పారు.’ క్షమాపణ చెప్పేంత బుద్దిహీనులం కాదు మేము, ప్రతిదానికీ ప్రభుత్వం క్షమాపణ చెబుతుందని మీరు అనుకోవద్దు, దేశం హితం కోసం మంచి ఏమిచేయాలో మాకు తెలుసు.గతంలో జరిగిన ముఖ్యంగా 1965లో జరిగిన మానవ హక్కుల దుర్వినియోగం కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది, అదెంతో సంక్లిష్టతతో కూడుకున్నదని తెలుసు’ అన్నారు.

‘ప్రపంచ వ్యాపితంగా ఎన్నో దేశాలు నిజనిర్ధారణ కమిషన్లు వేశాయి, అవి గతంలో జరిగిన అత్యాచారాలను వెల్లడించాయి. ఇలాంటి విషయాలెప్పుడూ క్లిష్టంగానే వుంటాయి అది ఇండోనేషియాలో ఎందుకు సాధ్యం కాదు, ఇప్పుడు కావలసింది వాస్తవాల వెల్లడి ‘ అని మానవహక్కుల నిఘా సంస్ధ డైరెక్టర్‌ కెన్నెత్‌ ప్రశ్నించారు. మానవహక్కుల కోర్టును ఏర్పాటు చేసి నేర విచారణ జరపాలని ఇండోనేషియా మానవ హక్కుల కమిషన్‌ 2012లోనే సిఫార్సు చేసింది. వూచకోతకు పురికొల్పినవారెవరూ నేడు లేరని, నాటి వుదంతాల గురించి సాక్ష్యం చెప్పేవారెవరూ లేరని, ఎంతో సమయం వృధా అవుతుందనే సాకులతో ప్రభుత్వం దానిని తిరస్కరించింది.

ఈ సెమినార్‌ సందర్భంగా కమ్యూనిస్టుల వూచకోతను సమర్ధించే మాజీ జనరల్స్‌, ప్రభుత్వ అధికారులు ఊచకోత వాస్తవాలను వెల్లడించి, దోషులను శిక్షించాలని కోరుతున్న మానవ హక్కుల కార్యకర్తలు, బాధితుల కుటుంబ సభ్యులు, మారణ కాండ నుంచి తప్పించుకున్న వారిలో కొంత మంది సెమినార్‌ జరిగే ప్రాంగణం వెలుపల గుమికూడి తమ వాదనలను వినిపించారు.

హత్యాకాండకు పాల్పడిన వారిగా ఆరోపణలున్న అనేక మంది నేడు ప్రభుత్వ వున్నత పదవులలో వున్నారని, అందువలన వారిని శిక్షించటం అంతసులభం కాదంటూ, అయితే మానవ హక్కుల వుల్లంఘన సమస్యను పరిష్కారించాల్సి వుందని ప్రభుత్వం గుర్తించింది, కోర్టు వెలుపల వివాదాలను పరిష్కరించుకోవాలన్నది ప్రభుత్వ అభిమతమని మంత్రి చెప్పారు. గతంలో ఈ వుదంతాలపై రూపొందించిన సినిమాలను బలవంతంగా నిషేధించటం భద్రతా కారణాలతో పాటు ప్రజా జీవనంలో వున్న ప్రముఖుల వత్తిడి కూడా తోడైందని భవిష్యత్‌లో అటువంటి పరిస్ధితి వుండదని మంత్రి అన్నారు. అందరూ చెబుతున్నట్లు మరణించిన వారు లక్షలలో లేరంటూ సైనిక జనరల్స్‌ చెబుతున్న కధలను పునరుద్ఘాటించారు.

రిటైర్డ్‌ జనరల్‌ సింటోంగ్‌ పంజాయిటిన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టుల కోసం వేటాడారని, హత్యకు గురైన వారు కేవలం 80వేల మందే అన్నారు.తాను పనిచేసిన ఆర్మీ కమాండో రెజిమెంట్‌ను సెంట్రల్‌ జావాలో ఏర్పాటు చేశారని, తమకు ముస్లిం యువకులతో కూడిన అసోర్‌ యూత్‌ అండ్‌ మహమ్మదీయ సంస్ధకు చెందిన వారు తోడ్పడిన మాట వాస్తవమని చెప్పారు. కమ్యూనిస్టులం కాదని చెప్పిన వారిని వెంటనే విడుదల చేశారన్నారు. మానవ హక్కుల న్యాయవాది టోడంగ్‌ ముల్యా మాట్లాడుతూ ఊచకోతకు గురైన వారి సంఖ్య గురించి చెబుతున్న వాటిని తాము అంగీకరించటం లేదన్నారు. భయంతో అనేక మంది దేశం వదలి వెళ్లారని వారు తిరిగి వచ్చిన తరువాత అనుమానంతో వుద్యోగాలలోకి తీసుకొనేందుకు తిరస్కరించారని చెప్పారు. నాటి ప్రభుత్వమే విదేశాలలో విద్య కోసం పంపిన విద్యార్ధులు దేశంలోకి తిరిగి రావటానికి అనుమతించలేదని అందువలన వాస్తవాలను మరుగుపరచవద్దని కోరారు.మిలియన్ల మందిపట్ల వివక్షను ప్రదర్శించారని, మానవ హక్కుల వుల్లంఘన తీవ్రంగా జరిగిందని, వాటిని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారా మరొక పద్దదా అన్నది సమస్య కాదని, చరిత్ర చరిత్రగానే వుంటుందని, అది బయటకు రావాలని తరువాతే సర్దుబాటు, పునరావాసం లేదా పరిహారం గురించి మాట్లాడుకోవచ్చన్నారు.

ఈ సెమినార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు పంచశీల ఫ్రంట్‌ అనే సంస్ధ ప్రకటించింది. ఇదంతా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయటానికి, కమ్యూనిస్టులను హత్య చేసినందుకు ప్రభుత్వంతో క్షమాపణలు చెప్పించే యత్నమిదని ఆరోపించింది. 1945 నాటి రాజ్యాంగం ప్రకారం కమ్యూనిస్టుపార్టీ, మార్క్సిజం లేదా లెనిజం నిషేధించబడ్డాయని సంస్ధ చైర్మన్‌ సిద్దికి విలేకర్ల సమావేశంలో చెప్పాడు.ఈ సెమినార్‌లో పాల్గొనేవారిలో 85-90శాతం కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులే వున్నారని ఆరోపించాడు. కమ్యూనిస్టు పార్టీ తప్పేమీ లేదని నిర్ధారించేందుకు, పార్టీ సభ్యుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేస్తున్న యత్నంగా వున్నందున తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు.అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, వారి వారసులు ప్రస్తుతం పార్లమెంట్‌, ప్రాంతీయ మండళ్లూ, స్దానిక సంస్ధలలో ప్రతినిధులుగా వున్నారని కూడా సిద్దికి చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత నిజాలను దాచవద్దు

17 Sunday Apr 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ 1 Comment

Tags

cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, US, victims of 1965

ఎంకెఆర్‌

    1965లో కమ్యూనిస్టుల వూచకోతకు సంబంధించిన వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించవద్దని ఇండోనేషియా మానవ హక్కుల కార్యకర్తలు, మేథావులు, చరిత్రకారులు డిమాండ్‌ చేశారు.ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను సామూహిక హత్య చేయించిన మిలిటరీ నియంత సుహార్తో ఆ దుర్మార్గాన్ని మరుగుపరచేందుకు తన జీవితకాలంలో తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ దుర్మార్గుడి పతనం తరువాత నాటి ఘటనలకు సంబంధించి వాస్తవాలను బయట పెట్టాలనే డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. దీంతో వత్తిడికి తట్టుకోలేని ప్రభుత్వం నాటి దమనకాండను తక్కువ చేసి చూపేందుకు, విచారం వెలిబుచ్చి వాస్తవాలను మరుగు పరచేందుకు పూనుకుందని అనేక మంది భావిస్తున్నారు.

    ఇండోనేషియా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1965 నాటి ఘటనలపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సెమినార్‌ను హోంమంత్రి లుహుత్‌ పంజైతన్‌ సోమవారం నాడు ప్రారంభిస్తారు. 1965-66 సంవత్సరాలలో ఐదు నుంచి పదిలక్షల మంది కమ్యూనిస్టులు, పార్టీ సానుభూతిపరులు, చైనా జాతీయులను హత్య కావించటమో, నిర్భంధ శిబిరాలలో చిత్రహింసలకు గురిచేయటమో చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన మిలిటరీ అధికారి సుహార్తో కొంత మంది మిలిటరీ జనరల్స్‌ను హత్య చేయించి అందుకు కమ్యూనిస్టుపార్టీ బాధ్యురాలంటూ నిందవేసి దేశ వ్యాపితంగా దమనకాండకు పూనుకున్నాడు. ఆదంతా నాటి అధ్యక్షుడు సుకర్ణో ఆదేశాల మేరకే జరిగిందని ప్రపంచాన్ని నమ్మించాడు.

    సెమినార్‌ నిర్వాహకులలో ఒకరైన రిటైర్డ్‌ మిలిటరీ జనరల్‌ అగస్‌ మాట్లాడుతూ గతంలో జరిగినదానిని పునరావృతం కానివ్వబోమని,అయితే వాటిని మరిచి పోరాదని అన్నారు. నాటి ఊచకోతలో మరణించిన కమ్యూనిస్టుల- హత్యకు గురైనట్లు చెబుతున్న సైనిక జనరల్స్‌, ఇతర బాధిత కుటుంబాల పిల్లల మధ్య చర్చలకు, సర్దుబాటు చేసేందుకు ఏర్పడిన ఒక సంస్ధను అగస్‌ నిర్వహిస్తున్నారు. నాడు జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌గా వున్న అగస్‌ తండ్రి కూడా మరణించాడు. సెమినార్‌లో చర్చలు.సర్దుబాట్లకు ప్రయత్నం చేసినందువలన ప్రయోజనం వుండదని అసలు ఏం జరిగిందన్నది వెల్లడి కావాలని, ప్రభుత్వం దేన్నీ దాచకూడదని అనేక మంది కోరుతున్నారు. ఊచకోతపై గతేడాది హేగ్‌ నగరంలో ప్రజా విచారణ నిర్వహించిన మానవ హక్కుల లాయర్‌ నూర్‌సియాబానీ కాట్‌జసుంగ్‌కానా ఈ సెమినార్‌ను స్వాగతిస్తూ జాతీయ చర్చకు, సర్దుబాటుకు దోహదం చేస్తుందని అయితే అందుకు గాను ముందుగా నిజాలను వెల్లడించాలని అన్నారు.

    న్యూయార్క్‌, జకర్తాలోని మానవ హక్కుల బృందాలు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ 1965 నాటి హంతకులు, అమెరికా ప్రభుత్వం మధ్య వున్న సంబంధాలు ఎలాంటివో బయట పెట్టాలని డిమాండ్‌ చేశాయి. 1998లోనే నియంత సుహార్తో పాలన అంతమైనా మానవ హక్కుల వుల్లంఘనకు సంబంధించిన వివరాలను ఇంతవరకు ప్రభుత్వం బయటకు రానివ్వటం లేదు. ఆ హత్యాకాండలో మిలిటరీతో పాటు ఇస్లామిక్‌ సంస్ధలకు చెందిన వారు కూడా భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ఇప్పటికీ సజీవులుగా వున్నారు. వారి వివరాలు బయటకు వస్తే వారిని విచారించి శిక్షించాలనే వుద్యమం తలెత్తుతుందని పాలకులు, మిలిటరీ భయపడుతున్నది.

    జాతీయ సెమినార్‌కు సన్నాహంగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ముస్లిం తీవ్రవాదులుగా వున్న వారు అడ్డుకున్నారని సంస్ధ అధ్యక్షుడు బిజో అంటుంగ్‌ చెప్పారు. తమ సభ్యులు జకర్తా నగరానికి చేరుకోక ముందే మిలిటరీ గూఢచారులు వారిని విచారించారని కూడా వెల్లడించారు. బాధితులకు చెందిన వారు ఎక్కడ మీటింగ్‌ పెట్టినా ప్రభుత్వం ముఖ్యంగా మిలిటరీ బెదిరింపులకు దిగుతున్నదని బిజో వెల్లడించారు. సెమినార్‌లో వాస్తవాలను వెల్లడిచేయకపోతే ఎవరు హంతకులు, ఎవరు బాధితులో, ఎవరికి పునరావాసం కల్పించాలో ఎలా తెలుస్తుందని సెటా పరిశోధనా సంస్ధకు చెందిన అహమ్మద్‌ ఫనానీ రోజ్‌యిదీ ప్రశ్నించారు. నిందితులను కప్పి పుచ్చి బాధితులకు వూరట కల్పిస్తే ప్రయోజనం ఏముందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. 1965 నాటి వాస్తవాలకు సంబంధించి అమెరికా వద్ద వున్న సమాచారాన్ని తెప్పించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం పూనుకోవాలని అనేక మంది డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం వుందని ఒకవైపు చెబుతున్నప్పటికీ దానికి ప్రభుత్వం, మిలిటరీ, అధికార యంత్రాంగంలోని కొన్ని శక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన కూడా వున్నదని వార్తలు వస్తున్నాయి. వియత్నాంపై దురాక్రమణ తీవ్రంగా సాగుతున్న సమయంలో ఇండోనేషియాలో బలంగా వున్న కమ్యూనిస్టు పార్టీతో నాటి అధ్యక్షుడు సుకర్ణో సఖ్యతగా వుండటంతో మరో ఆగ్నేయాసియా దేశం కమ్యూనిస్టుల ప్రభావంలోకి వెళుతుందేమో అన్న భయంతో అమెరికాయే మిలిటరీ జనరల్‌ సుహార్తోను వుపయోగించి కుట్ర చేసి కమ్యూనిస్టుల వూచకోతకు తెరలేపిందనే అభిప్రాయం కూడా వుంది. అమెరికా వద్ద వున్న ఫైళ్లు, వుత్తర ప్రత్యుత్తరాలను బయట పెడితే అసలేం జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తాయి. అమెరికా తన వద్ద వున్న సమాచారంలో తనకు హాని కరం కాని వాటిని బహిర్గతం చేస్తున్నప్పటికీ ఇండోనేషియా వూచకోత వంటి వాటిని ఇంతవరకు వెల్లడించలేదు.

    ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్వంతంగా దర్యాప్తును ప్రారంభించింది.అయితే అది చేసిన సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.రెండు రోజుల పాటు జరిగే సెమినార్‌లో ఎనిమిది అంశాల గురించి చర్చిస్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

As long as communism is ‘threat’, democracy is flawed – Ririn Sefsani and Timo Duil

13 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communism, democracy, Human Rights, Indonesia, PKI, victims of 1965

13 December 2015

A spectre is haunting Indonesia, the spectre of communism. All the powers of the political establishment have entered into a holy alliance to exorcise this spectre: Muslim and Christian clerics, politicians and bureaucrats, the military and vigilante rackets.

Karl Marxs famous first sentences of the manifesto of the Communist Party, written in 1848, precisely depict Indonesia’s current situation. But, in sharp contrast to Europe in the mid-19th century, there is no leftist party worthy of mention in Indonesia. Communism in Indonesia is a mere spectre indeed.

Fifty years after the bloody extermination of the Communist Party, the very term of communism is still an effective tool to exclude from public debates those that are perceived as a threat by the ruling elite. This tool can be applied to virtually all leftist movements opposing the established political and economic order.

The political elite can count on various groups whom, despite not knowing what communism actually is, remain willing to oppose this ideology as it has been depicted as a threat not solely to the elite, but to the nation in general.
It is doubtful whether members of the Islam Defenders Front (FPI) or the Anticommunist Front are able to explain how Marxist economic thought explains economic exploitation, what surplus value is, what the concept of the working class is about.

Communism, to those people, is without any precise content and is merely something that should be feared. It is exactly this perception of communism which makes large parts of society mentally captivated by Cold War doctrines.

Approximately 32 years of indoctrination by an anticommunist regime continues to show its effect and it could be that this consciousness is one of the biggest obstacles for both reconciliation and democratization.

Before the International People’s Tribunal was held in The Hague recently, the School of Southeast Asian Studies at Bonn University, Germany, conducted a workshop on the 1965 incidents and on the question of how to deal with that bloody past. The event was attended a crowd of Indonesian citizens, by lawyers, journalists and survivors.

Participants were able to discuss sensitive topics with the Indonesian deputy ambassador in Germany. The deputy ambassador listened to what the victims had to say.

In contrast, the reactions coming from the administration of President Joko “Jokowi” Widodo and Vice President Jusuf Kalla leave much to be desired since they are not willing to pay any attention to those victims proving testimony to the cruelty they experienced.

The decision of Balinese authorities at the Ubud Writer’s Festival and even by universities to ban the screening of Joshua Oppenheimer’s films on the 1965-issue is also a clear sign that the fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

It is this mixture of ignoring those stigmatised people who suffered painful experiences on behalf of a harmonious, conflict-free society and the ignorance of what communism actually is that makes it so hard for Indonesia to deal adequately with its past.

However, while these attitudes linger on, Indonesia will not succeed its transition towards democracy because of two reasons; firstly, because this attitude clearly highlights a gesture of suppressing points of view considered cumbersome for the elite and for those many citizens with minds still rooted in New Order ideology.

Furthermore, the attitude of fear toward the confused thread named communism prevents Indonesia’s political culture from becoming democratic as it hampers socialist or labor parties from the political stage.

As long as that is the case, voters in Indonesia will not have real alternatives in elections because the established parties do not differ fundamentally in their ideologies.

All parties are more or less bound to fuzzy nationalist and Islamic notions and are pragmatic and usually pro-capital in their political operations.

The fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

However, democracy needs alternatives and the most urgently needed one continues to remain as a spectre of fear in Indonesia; a leftist alternative to pro-capitalist realpolitik with blurry nationalist notion.

For as long as Indonesia is unready to face the truth about the actual idea of communism, violation of human rights such as freedom of speech and the stigmatisation of the victims of 1965 will persist. In contrast to his opponent Prabowo Subianto, Jokowi highlighted his commitment to implement human rights during his campaign.

In alliance with parties supporting him, he also stressed in his Nawacita program that he would “create space for dialogue between citizens”. It is obvious that he will fail to do so if the government keeps on demonising communism and those victims of the anti-communist massacres.

The International People’s Tribunal was an excellent opportunity for the President to provide proof of the promises made during the election campaign.

But instead of “creating space for dialogue between citizens”, Kalla reduced the incidents of 1965 to the issue of the six murdered generals and did not even mention the hundreds of thousands of victims.

Also, Attorney General Muhammad Prasetyo called the tribunal “irrelevant” and said Indonesia doesn’t need intervention from other countries, indirectly blaming the Dutch government which had nothing to do with the tribunal.

The organisers, in contrast, stressed that they would have conducted the tribunal in Jakarta, but as many victims did not felt safe in Indonesia, they decided to perform it at The Hague, the city of international law.

Given that facts, the government effectively limited the space for dialogue between citizens because they are still not able to leave New Order narratives behind.

Until today, Marxist works are officially banned in Indonesia – works that represent the foundations of major political parties in many well-established democracies all over the world. Social democracy, socialism, labor parties and left-wing green parties are all based on Marxist political thoughts.

Through leftist parties, Marxist thoughts enrich democratic pluralism and provide political identities that are not solely based on religion and nationalism. Indonesia, with its immense workforce of labourers, peasants and urban poor, needs a political ideology that can represent and articulate these people’s economic demands.

Institutional reforms alone do not make a democracy work; for as long as conflicting ideological alternatives have yet to be established and socialism is excluded from Indonesian politics, Indonesia’s democracy is flawed. – December 13, 2015.

Courtesy: themalaysianinsider.com

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: