• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Vladimir Putin

ఉక్రెయిన్‌ పోరులో కంటే ఇంథన సంక్షోభంతో ఐరోపాలో చలి మరణాలే ఎక్కువా !

30 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

energy cost, High fuel prices, imperialism, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌హ‌త‌హ‌..  శ‌ర‌వేగంగా మారుతున్న పరిస్థితులు

25 Tuesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

American hegemony, Joe Biden, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సమస్య :రణమా ! శరణ్యమా ? నాటోలో కొత్త భయం ! మరో మలుపు తిరిగిన సంక్షోభం !!

12 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Crimea bridge blast, Crimea., NATO, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


కొందరు వర్ణిస్తున్నట్లు ఉక్రెయిన్లో అసలైన పోరు ఇప్పుడే ప్రారంభమైందా లేక మరో పెద్ద మలుపు తిరిగిందా ? రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు. తాజా పరిణామాలను ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. అసలేం జరగనుంది అనే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు 231 రోజుల తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి.గత కొద్ది వారాలుగా ఎలాంటి దాడులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు వెళ్లాయి.నాలుగు ప్రాంతాల పౌరులు కోరుకున్నట్లుగా వాటిని రష్యా విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత విమర్శలు తప్ప పెద్ద పరిణామాలేవు. అలాంటిది ఒక్కసారిగా సోమ, మంగళవారాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్‌ అంతటా అనేక పట్టణాలపై పెద్ద ఎత్తున రష్యా క్షిపణి దాడులు జరిగాయి. అనేక పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్‌ కేంద్రాలపై సోమ, మంగళవారాల్లో పుతిన్‌ దళాలు కేంద్రీకరించాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రాలపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేము. ఇదంతా ఎందుకు అంటే !


అక్టోబరు 8 తేదీ శనివారం నాడు రష్యా క్రిమియా ద్వీపకల్పంలోని క్రిమియా లేదా కెర్చ్‌ వంతెన మీద పెద్ద పేలుడు జరిగింది. ఐదుగురు మరణించారని వార్తలు. ఉదయం ఆరు గంటలపుడు (మన కాలమానం ప్రకారం 9.30 గంటలు) ఈ ఉదంతం జరిగింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాద ఆత్మాహుతి దళం తాము తెచ్చిన ఒక కారు, ట్రక్కును పేల్చివేసినట్లు ఒక కథనం కాగా, వంతెన కింద ఉన్న సముద్ర జలాల్లోనుంచి వచ్చిన ఒక అస్త్రంతో పేల్చివేసినట్లు మరొక విశ్లేషణ. ఈ ఉదంతం జరిగినపుడే ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసిన ఒక మానవరహిత పడవ రష్యా ఓడరేవు సమీపంలో కనిపించటంతో ఈ అనుమానం తలెత్తింది. ఎలా జరిగిందనేది ఇంకా నిర్ధారణగాకున్నా పేలుడు జరిగింది. దానికి ప్రతి స్పందనగా సోమవారం నాడు వివిధ పట్టణాల మీద రష్యా త్రివిధ దళాల క్షిపణుల దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో అనుమానితులుగా ఐదుగురు రష్యన్‌, ముగ్గురు ఉక్రేనియన్‌, ఆర్మీనియన్‌ పౌరులను అరెస్టు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.


ఈ వంతెన మీదుగా వెళ్లే ప్రతి వాహనం ఒక పెద్ద స్కానర్‌ గుండా వెళుతుంది. వాటిలో ఒకవేళ పేలుడు పదార్ధాలు ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. దాన్ని తప్పించుకొని వాహనాలు వెళ్లాయా, అప్పుడు అది పని చేయలేదా, తనిఖీలోపమా, విద్రోహమా లేక సముద్ర జలాల్లో నుంచి వచ్చిన ఏదైనా పడవ నుంచి పేలుడు జరిపారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌ అధికారులు వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించారు.జూలై నెలలో జెలెనెస్కీ సలహాదారు అరెస్తోవిచ్‌ త్వరలో తమ మిలిటరీ దాడి చేస్తుందని చెప్పాడు. వంతెనల మీద దాడి చేసినందుకు బహిరంగంగా ఎస్తోనియా విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపాడు.ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రత్యేక కార్యకలాపాల దళపు హస్తం ఉందని కూడా చెప్పాడు. గత కొద్ది సంవత్సరాలుగా సిరియా, ఇతర ఇస్లామిక్‌ తీవ్ర వాదులను జెలెనెస్కీ సర్కార్‌ చేరదీస్తున్నదని, వారు ఐరోపా సమాఖ్య దేశాల్లో తిరిగేందుకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులు ఇచ్చారని, ఆ ఆత్మాహుతి దళాలతో పేలుడుకు పాల్పడి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
వంతెన మీద పేలుడుతో సంబంధం లేకుండానే తమపై దాడికి ముందుగానే రష్యా పధకం వేసిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. వంతెన పేలుడు గురించి మౌనంగా ఉన్న అమెరికా, ఇతర దేశాలూ మరోవైపు క్షిపణి దాడులను ఖండిస్తూ విమర్శలకు దిగాయి. పుతిన్‌ సేనలను, రష్యాను దెబ్బతీయాలంటే ఎక్కువ దూరం ప్రయాణించి రష్యా మీద బాంబులను కురిపించే క్షిపణులను తమకు ఇవ్వాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ అమెరికా, ఇతర నాటో దేశాలను కోరుతున్నాడు. అందుకు గాను పుతిన్ను మరింత రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగంగా క్రిమియా వంతెన పేల్చి వేతకు పధకం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అది ఎంతో కీలకమైన రోడ్డు, రైలు వంతెన గనుక పుతిన్‌ తీవ్రంగా స్పందిస్తే ఆ సాకుతో అలాంటి క్షిపణులు ఇవ్వాలన్న ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వేళ అందచేస్తే కొందరు చెబుతున్నట్లు అసలైన పోరు ప్రారంభానికి నాంది అవుతుంది. దానిలో అమెరికా, ఇతర నాటో దేశాల సైనికులు భౌతికంగా పాల్గొంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైతే ఆ దేశం ఆధునిక ఆయుధాల ప్రయోగశాలగా మారుతుంది.


క్రిమియా ద్వీపకల్పంలో పేల్చిన వంతెన ఆ ప్రాంతానికి రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే పందొమ్మిది కిలోమీటర్ల రోడ్డు, పక్కనే ఉన్న రైలు వంతెన.పౌరులకు అవసరమైన సరఫరాలతో పాటు మిలిటరీ రవాణాకు సైతం అది కీలకం. ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి జనం తమ ప్రాంతాన్ని తిరిగి రష్యాలో కలపాలని కోరారు. ఆ మేరకు 2014లో విలీనం జరిగింది. తరువాతనే పుతిన్‌ ప్రభుత్వం ఆ వంతెనల నిర్మాణం చేసింది.స్వయంగా పుతిన్‌ కారు నడిపి వంతెనలను ప్రారంభించారు. నిజానికి ఆ వంతెనల వలన రవాణా వేగంగా జరగటం తప్ప ఆ ప్రాంతానికి దారి లేక కాదు. ఇక శనివారం నాటి పేలుడు జరిగిన చోట రోడ్డు వంతెన మీద ఒక వైపున ఉన్న ఇనుపకంచె(రెయిలింగ్‌) కొంత మేర విరిగి సముద్రంలో పడింది. పక్కనే ఉన్న రైలు వంతెన మీద ఉన్న రైలులోని ఇంధన టాంకర్లకు నిప్పంటుకుంది. కొంత సేపు రవాణా నిలిపివేసి అదే రోజు పునరుద్దరించారు. నష్టం పెద్దది కాదు గానీ తరువాత జరిగిన పరిణామాలకు అది నాంది పలికింది. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని చెప్పుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్లో సంబరాలు, నర్మగర్భంగా ఆ దేశ నేతలు చేసిన ప్రకటనలు, అది ఉక్రెయిన్‌ చేసిందే అని పేరు చెప్పని వారు తమకు చెప్పినట్లు అమెరికా పత్రికలు ప్రకటించటం వంటి పరిణామాలన్నీ వేలు జెలెనెస్కీవైపే చూపుతున్నాయి. ఇది పౌర, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్య అంటూ భద్రతా మండలిలోని శాశ్వత దేశాల ప్రతినిధులతో పుతిన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించాడు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ఉగ్రవాద దళాలు స్వదేశంలోనూ, తమ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడినట్లు రష్యా గతంలో కూడా పేర్కొన్నది.హిట్లర్‌ మూకలు పార్లమెంటు భవనాన్ని తగులబెట్టి నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపినట్లుగా జెలెనెస్కీ దళాలు స్వంత అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడులకు పాల్పడి నెపాన్ని తమ మీద మోపేందుకు చూసినట్లు కూడా ఐరాసకు ఫిర్యాదు చేసింది. తమ కురుస్క్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మూడు సార్లు విద్యుత్‌ లైన్ల మీద దాడులు చేసినట్లు, టర్క్‌ స్ట్రీమ్‌ గాస్‌పైప్‌లైన్‌ పేల్చివేతకు చూసిందని కూడా పేర్కొన్నది. బాల్టిక్‌ సముద్రంలో ఉన్న అంతర్జాతీయ గాస్‌ పైప్‌లైన్ల విధ్వంసానికి జరిపిన పేలుళ్ల విచారణ బృందంలో తమ ప్రతినిధులను అనుమతించలేదని రష్యా పేర్కొన్నది.
క్రిమియా వంతెన పేల్చివేతకు ప్రతిగా రష్యా క్షిపణులు జనావాసాలపై బాంబులు వేసినట్లు జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా తాము ఉక్రెయిన్‌ ఇంథన, మిలిటరీ, సమాచార కేంద్రాల మీద దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పుతిన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో 14 మరణించారని, 97 మంది గాయపడినట్లుగా ఉక్రెయిన్‌ పేర్కొన్నది. నిజంగా జనం ఉన్న ప్రాంతాల మీద క్షిపణులు పడి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది.రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమై మంగళవారం నాటికి 230 రోజులు.(ఫిబ్రవరి 24) అప్పటి నుంచి ఐరాస లెక్కల ప్రకారం అక్టోబరు రెండవ తేదీనాటికి మరణించిన పౌరుల సంఖ్య 6,114 అంటే సగటున రోజుకు పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు ఒకే సారి అనేక పట్టణాల మీద క్షిపణి దాడి జరిగింది. ఏ కారణంతోనైనా అమాయక పౌరుల మరణాలను సమర్ధించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాడుల స్వభావం గురించి జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకొనేందుకే ఈ వివరాలు. తమ ప్రతీకారం తీవ్రంగానే ఉంటుందని రష్యన్లు బాహాటంగానే చెబుతున్నారు. సోమవారం నాడు పుతిన్‌ సేనలు వదలిన 83క్షిపణుల్లో 43ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులు 60 మంది మరణించినట్లు, అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు , ఒక మిగ్‌ విమానాన్ని కూల్చినట్లు రష్యా లెక్కలతో సహా ప్రకటించింది. నిజానికి ఇప్పటి వరకు 230 రోజుల పోరులో ఎటువైపు ఎంత నష్టం అన్నది ఇంతవరకు నిర్దారణగా వెల్లడికాలేదు. దేశమంతటా తమ విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. పదకొండు ప్రధాన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రధాని వెల్లడించాడు. అనేక చోట్ల మంచినీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచి పౌరులందరూ తమ ఇండ్లలోనే ఉండాలని ఫ్రాన్స్‌ కోరగా, దేశం విడిచి పోవాలని తమ పౌరులను అమెరికా కోరింది. అదనపు మిలిటరీ సరఫరాలను పంపుతామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అనేక దేశాల నేతలకు ఫోన్‌ చేసిన జెలెనెస్కీ అందరం కలసి పోరాడాలని కోరాడు.


అనేక దేశాలలో అమెరికా కూటమి కిరాయి మూకలను రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్లో కూడా అదే జరుగుతోంది. వేలాది మందిని రష్యా మిలిటరీ పట్టుకోవటం, హతమార్చటం తెలిసిందే. ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వస్తున్న వార్తలను బట్టి గతంలో తిరుగుబాటుదార్లుగా ఉండి పుతిన్‌ సర్కార్‌కు లొంగిపోయిన చెచెన్‌ సాయుధులను ఉక్రెయిన్‌పై దాడులకు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అనుభవంతో ఉగ్రవాదుల తీరుతెన్నులు వారికి కొట్టిన పిండేగనుక ఉక్రెయిన్‌ ఉగ్రవాదులను అరికట్టేందుకు వారే సరైన వారని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే తమ వారు పదివేల మంది ఉన్నారని 70వేల మందిని రంగంలోకి దించనున్నట్లు కొద్ది రోజుల క్రితం రష్యా మిలిటరీలో జనరల్‌గా చేరిన రమజాన్‌ కదరయోవు చెప్పాడు. నాటో కూటమి నేర్పిన పాఠాలను తిరిగి వారికే నేర్పేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. అమెరికా, ఇతర నాటో ప్రధాన దేశాల తీరు తెన్నులను చూసినపుడు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఒక తీరులో దీర్ఘకాలం కొనసాగిస్తూ రష్యాను బలహీనపరిచి తమకు ఎదురులేదని, తమను ప్రతిఘటించేవారికి ఇదే గతి అని ప్రపంచానికి చెప్పేందుకు చూస్తున్నట్లు చెప్పవచ్చు.ఈ క్రమంలో వారు ఊహించని ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత శీతాకాలం గడవటం ఒకటైతే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి నుంచి ఎలా నెగ్గుకు రావాలా అన్నది వాటి ముందున్న ప్రధాన సవాలు.


ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీకి నాటో కూటమి అందచేసిన అస్త్రాలన్నీ పరిమిత ప్రాంతాలకు పరిమితమైనవే. మూడు వందల కిలోమీటర్లు అంతకు మించి వెళ్లగల క్షిపణులను ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఇస్తే సంక్షోభ స్వరూపం, స్వభావమే మారుతుంది. నాలుగు ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత కూడా ఈ వైఖరిలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. రష్యా భూభాగమైన క్రిమియా వంతెనపై దాడి చేస్తే ఎలాంటి ప్రతి స్పందన ఉంటుందో చూసేందుకు ఒక పధకం ప్రకారం పశ్చిమ దేశాలు చేయించిన దాడి అన్నది స్పష్టం. రెండు రోజులుగా జరుపుతున్న దాడులను పుతిన్‌ నిలిపివేస్తారా, కానసాగిస్తారా? కొనసాగితే ఉక్రెయిన్‌ పౌరుల్లో తలెత్తే భయ, సందేహాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి, సంక్షోభం ఏ రూపం తీసుకుంటుంది, జెలెనెస్కీని మునగచెట్టు ఎక్కించిన పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి. ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పట్లో సమాధానం కనిపించేట్లు లేదు.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది.తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యామహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్‌ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దులకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు.


తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్‌ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో పుతిన్‌ విజయం సాధిస్తాడేమోనని నాటో భయపడితే ఇప్పుడు ఓడిపోతే అణ్వాయుధాలను రంగంలోకి తెస్తాడేమో అని భయపడుతున్నట్లు ఒక వార్తా సంస్థ కొత్త కథనాన్ని రాసింది. ఇది ఊహాజనితమే గాని దీని వెనుక రష్యా ఓడిపోనుందని, కొద్ది రోజులు ఇబ్బందులను భరించాలనే భావనలోకి పశ్చిమ దేశాల జనాన్ని తీసుకు వెళ్లే ఎత్తుగడ కూడా ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

షాంఘై సహకార సంస్థ భేటీ : ఉక్రెయిన్‌పై చైనా వైఖరి కూడా మారితే మోడీతో షీ జింపింగ్‌ను కలిపి అమెరికా మీడియా ఎందుకు పొగడలేదు ?

21 Wednesday Sep 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, US Media, US Media Praises PM Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాను సంతుష్టీకరించిన నరేంద్రమోడీ ! అందుకే అక్కడి మీడియా పొగడ్తలా !!

18 Sunday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, Ukraine-Russia crisis, US Media Praises PM Modi, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికన్‌ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్‌ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీ-రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విడిగా భేటీ అయ్యారు.


సదరు భేటీలో ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్‌ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్‌ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వం-జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.


” అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్‌, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చర్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్‌ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్‌ టైమ్స్‌, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్‌ ట్రిబ్యూన్‌, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్‌ వంటి పత్రికలు విమర్శించాయి. పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శలు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.


మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది. అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్‌ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.
ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 2017-18 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్‌, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్‌, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్‌ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్‌ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధైర్యవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్‌ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అందువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ది ” ప్రచార విజయమా ” !

14 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Germany, NATO, Propaganda “Victory”, Ukraine war, Ukraine-Russia crisis, Ukraine’s counteroffensive, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు

రష్యా సైనిక చర్యలో కోల్పోయిన ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు, పుతిన్‌ సేనలను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరుసటి రోజు దాన్ని ఆరువేలని, మంగళవారం నాడు ఎనిమిది వేలని చెప్పారు. నిజమే, ఇదిగో చూడండి పారిపోతున్న రష్యా సేనలు అంటూ పశ్చిమ దేశాల టీవీలు కొన్ని దృశ్యాలను చూపటం, విశ్లేషణలు, వాటి ప్రాతిపదికగా అనేక దేశాల వారు స్పందించటం, వాటిని మన దేశంలోని మీడియా ఎప్పటికప్పుడు అందించటం చూస్తున్నాము.ఖారకైవ్‌ ప్రాంతం నుంచి తమ సేనలను వెనక్కు మళ్లించినట్లు మాస్కో అధికారులు ప్రకటించారు. అందువలన ఆప్రాంతం ఎంతైతే అన్ని వేల కిలోమీటర్లను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పుకోవటంలో తప్పులేదు, ఆశ్చర్యమూ ఉండదు. దాని నేత జెలెనెస్కీ అధికారానికి రాక ముందు సినిమాల్లో విదూషక పాత్రధారి. గత ఆరున్నర నెలలుగా అనేక ప్రకటనలు చేశాడు. తమ మూలనున్న ముసలమ్మలు ఊతకర్రలు పట్టుకొని, పాలుతాగే పసివాళ్లు కూడా ఉయ్యాళ్ల నుంచి దూకి దేశ రక్షణకు వచ్చినట్లుగా గతంలో చెప్పిన కబుర్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.


మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఒక ఎత్తుగడగా మాస్కో సేనలు భారీ దాడులకు సిద్దం కావటంలో భాగంగా వెనక్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అందువలన ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నదా ? నాలుగు నెలలుగా సాధ్యం కానిది ఈనెల మొదటి వారంలో ఆకస్మికంగా నాలుగు రోజుల్లో రష్యా సేనలను తరిమికొట్టే శక్తిని జలెనెస్కీ ఎలా సంపాదించినట్లు ? పశ్చిమ దేశాలు జనాల ప్రాణాలు తీసే లేదా ఆస్తులను విధ్వంసం చేసే అస్త్ర శస్త్రాలే కాదు జనాల మెదళ్ల మీద దాడి చేసే ప్రచార ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి. ప్రాణాంతక అస్త్రాలను దాడులు జరిగే చోటనే ప్రయోగిస్తే ప్రచారదాడికి ఎల్లలు లేవు. తాజాగా ఉక్రెయిన్‌ ప్రతిఘటన అనేది ఒక ప్రచార ” విజయం ” గా కొందరు వర్ణించారు. జరిగిన దాన్ని తమ వైఫల్యాలు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో తలెత్తిన ఆర్ధిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇంకొక్క ఊపు ఊపితే పుతిన్‌ పతనం ఖాయం అనే అభిప్రాయాన్ని, వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది.


తాము జరుపుతున్నది దురాక్రమణ దాడి కాదని రష్యా చెబుతున్నది, కాదు అదేనని దాన్ని వ్యతిరేకించే దేశాలు వర్ణిస్తున్నాయి. ఏ కారణంతో పశ్చిమ దేశాలు చెప్పినప్పటికీ 1,27,484 చదరపు కిలోమీటర్ల మేర జెలెనెస్కీ సర్కార్‌ ఏలుబడిలో లేదు, దీనిలో ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని పెద్ద విజయంగా చిత్రించుతున్నారు. ఒక పోరు జరుగుతున్నపుడు ఇలాంటివి సాధారణం. ఇదేమీ నిర్ణయాత్మక పరిణామం కాదు. దీంతోనే ముగిసేది లేదు. అందుకే దీన్ని ప్రచార ” విజయం ” అంటున్నారు. దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికన్లు అక్కడ సాధించిన విజయ గాధలను ప్రపంచానికి ఎలా వినిపించారో, తప్పుదారి పట్టించారో, చివరికి తాలిబాన్ల కాళ్లు పట్టుకొని ప్రాణాలతో స్వదేశానికి పారిపోయారో తెలిసిందే. ఖార్‌కైవ్‌ ప్రాంతం నుంచి రష్యా సైనికులు టాంకులు, వాహనాలు, తుపాకులను ఎక్కడి వక్కడ వదిలేసి ఉక్రేనియన్లు దాచుకున్న సైకిళ్లను అపహరించి వాటి మీద పారిపోయారట. మరి జెలెనెస్కీ సేనలు వారిని ఎందుకు బందీలుగా చేయలేదు. ఎవడైనా పారిపోవటానికి ఉన్న వాహనాలను వదలి సైకిళ్లెందుకు ఎక్కుతారు?


మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకోవటం గొప్పే అనేవారిని కాసేపు సంతృప్తిపరుద్దాం. ఐరాస కాందిశీకుల సంస్థ వివరాల ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత మంది కాందిశీకులు ఏ సంక్షోభంలోనూ రాలేదు. ఆగస్టు 30 నాటికి 70లక్షల మంది కాందిశీకులు వివిధ దేశాల్లో ఉన్నారు. అత్యధికంగా 24లక్షల మంది రష్యాకే వెళ్లారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, నాజీ కిరాయి మూకలు జరిపిన దాడుల కారణంగా వారు వలస పోవాల్సి వచ్చింది. మిగిలిన వారు రష్యా మిలటిరీ దాడుల కారణంగా ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. వీరు గాక అంతర్గతంగా మరో 80లక్షల మంది తమ నెలవులు తప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు, వారికి ఎందరికి తిరిగి పూర్వపు జీవనాన్ని కల్పించారన్నది ముఖ్యం. ఆ వివరాలు మనకు ఎక్కడా కనపడవు, వినపడవు.తామే ఇంథన కొరతతో ఇబ్బందులు పడుతుంటే కాందిశీకులకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ అనేక దేశాల్లో గుసగుసలు.


ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఉక్రెయిన్‌ మిలిటరీ, ఆర్ధిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా దాడులను జరుపుతున్నది. జన నష్టం జరగకుండా ఎంపిక చేసుకున్న వాటి మీదనే దాడులు చేస్తోంది. రెండు వైపులా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. చెబుతున్నది నమ్మదగినవిగా లేవు. దాడుల్లో జననష్టం జరిగితే దాన్ని చూపి రష్యాను మరింత ఒంటరి చేసి ఎండగట్టాలన్న అమెరికా ఎత్తుగడ పారలేదు. అదే విధంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున జెలెనెస్కీ సేనలకు ఆయుధాలు అందిస్తాయనే అంచనా ఉన్నప్పటికి ఆధునిక అస్త్రాలతో తమను ఎదుర్కొంటారని పుతిన్‌ ఊహించినట్లు కనపడదు. ఇలా ఊహించనివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంథనాన్ని ఆయుధంగా మలచాలని చూసిన అమెరికాకు అది ఎదురుతన్నటమే కాదు మాస్కోకు అదనపు రాబడి తెచ్చిపెడుతున్నది. ఇంథన సంక్షోభంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అది ఏ రూపంలో జనంలో ఆగ్రహం కలిగిస్తుందో చెప్పలేము. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్య ముప్పు పొంచి ఉంది. మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోవాలని అమెరికా విసిరిన మతిమాలిన సవాలు దానికే ఎదురుతన్నింది. డాలరును పక్కన పెట్టి తమ కరెన్సీలతో లావాదేవీలు జరుపుకోవాలని మరింతగా గట్టిగా చెప్పేందుకు ఈ సంక్షోభం అవకాశం ఇచ్చింది. పెద్దన్న ప్రాభవం తగ్గుతున్నదని లోకానికి స్పష్టం చేసింది. చివరికి ప్రతిదానికి అమెరికా నేతలను కావలించుకున్న నరేంద్రమోడీ ఈ అంశంలో మాత్రం దూరంగా ఉన్నారు. గొంతు కలిపేందుకు వెనుకాడుతున్నారు.

రెండవ ప్రపంచయుద్దంలో జర్మనీ,జపాన్‌ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సోవియట్‌తో భుజం కలిపి పోరాడిన అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్సులు తరువాత దాన్నే బూచిగా చూపి ప్రపంచానికే శత్రువులుగా రుజువైన జర్మనీ,జపాన్‌లను చంకనెత్తుకున్నాయి. అన్నింటికంటే విపరీతం ఏమంటే నాటో పేరుతో జర్మనీని, రక్షణ ఒప్పందం పేరుతో జపాన్ను కాపాడేందుకు పూనుకున్నాయి. అన్నీ కలసి ప్రపంచానికి ముప్పు తలపెట్టాయి. గతంలో ఐరోపాలో యుద్దానికి జర్మనీ కారణమైతే ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఉక్రెయిన్‌ యుద్దానికి అమెరికా కారణమైంది. ఏదో ఒకదాన్ని బూచిగా చూపకపోతే తమ దుష్టపధకాలను జనం ప్రశ్నిస్తారు గనుక ఊహాజనిత బూచిని చూపుతున్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం రష్యాను, దానికి మద్దతు ఇస్తున్నదంటూ చైనాను బూచిగా చూపుతున్నారు. చివరికి స్విడ్జర్లాండ్‌, ఫిన్లాండ్‌ వంటి తటస్థ దేశాలను కూడా తమ కూటమిలోకి లాగాయి. లాటిన్‌ అమెరికాలో నియంతలను ప్రోత్సహించి ప్రజా ఉద్యమాలను అణచేందుకు పూనుకుంటే అక్కడా ఎదురుతన్నింది.వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ముందుకు వస్తుండగా మితవాద శక్తులను జనం ఛీకొడుతున్నారు.


అమెరికా డాలరు దెబ్బకు తమ కరెన్సీ యురో, బ్రిటీష్‌ పౌండ్‌ కూడా విలవిల్లాడుతున్నాయి. వాటి పర్యవసానాలు ఇప్పుడే తెలియదు. ఇంథనాన్ని ఆయుధంగా మార్చాలని చూసిన అమెరికా ఎత్తుగడకు విరుగుడుగా దాన్నే తన అస్త్రంగా మార్చుకున్న రష్యా ప్రయోగానికి ఐరోపా గింగిరాలు తిరుగుతోంది. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సిద్దము సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. ఈ పధకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్ధించే ఏ దేశానికి తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ తెగేసి చెప్పాడు. ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్‌ స్రీమ్‌ ఒకటవ సహజవాయు సరఫరాను రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా గుండెలు బాదుకుంటోంది.

ఆంక్షలు అమల్లోకి రాక ముందే రష్యా నుంచి అందినంత మేరకు ఇంథనాన్ని కొని నిలువ చేసుకోవాలని ఐరోపా దేశాలు చూశాయి. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు కోతలు, పరిశ్రమల మూతలు ప్రారంభించి పొదుపు మంత్రాన్ని జనాలకు ప్రవచిస్తున్నాయి.చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని తలలు పట్టుకుంటున్నాయి. సిగ్గువిడిచి రష్యాను అడగలేవు, జనానికి సంతృప్తి కలిగించలేని స్థితి. ఇంథన బ్లాక్‌మెయిల్‌, తమను చీల్చేందుకు కుట్ర అంటూ ఐరోపా సమాఖ్య మండిపడుతోంది. నీవు నేర్పినే విద్యే కదా అన్నట్లుగా పుతిన్‌ ఉన్నాడు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు వద్దు అన్న జర్మనీ ఇప్పుడు తమకు అవే ముద్దు అన్నట్లుగా తిరిగి తెరుస్తున్నది. జర్మనీతో సహా అనేక దేశాలజనం పెరిగిన ఇంథన ధరలను తాము తట్టుకోలేమంటూ వీధులకు ఎక్కుతున్నారు.మన ఆర్‌బిఐ మాదిరే ఐరోపా బాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నది.1970దశకం తరువాత ఇలాంటి తీవ్ర పరిస్థితిని ఐరోపా ఎన్నడూ ఎదుర్కోలేదు, ఈ స్థితి ఎంతకాలం ఉంటుందో అంతుబట్టటం లేదు.రెండు సంవత్సరాల పాటు సాధారణ జనానికి, ఆరునెలల పాటు వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ చార్జీలను పెంచబోమని బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జి, ఇతర ఇంథనం అందుబాటులో ఉన్నా ఐరోపా దేశాలకు నిల్వచేసుకొనే ఏర్పాట్లు లేవు. ఇంతకాలం రష్యా నుంచి నిరంతర సరఫరా ఉండటంతో నిల్వ అవసరం లేకపోయింది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కుదిరేవి కాదు. జర్మనీలో రసాయనకర్మాగారాల మూత లేదా విద్యుత్‌ లేక కోతలుండటంతో చైనా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.


ఖారకైవ్‌ ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాం,మిగతా ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలు, డబ్బు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కోరుతున్నాడు. ఇచ్చినడబ్బులో కొంత నొక్కేశాడని వార్తలు. మా సమస్యలు మాకుంటే ఇదేమి గొడవ అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. తాము ఇస్తున్న వాటిని పెంచే అవకాశం లేదని జర్మన్‌ రక్షణ మంత్రి క్రిస్టిని లాంబ్రెచెట్‌ అన్నారు. మా దగ్గర ఉన్న ఆయుధాలు నిండుకుంటున్నాయి, మా అవసరాలకే మేము కొనుక్కోవాలి అన్నారామె. మరొక ముఖ్య దేశమైన ఫ్రాన్స్‌ అంటీముట్టనట్లుగా నాకేంటి అన్నట్లుగా ఉంది. బ్రిటన్‌, జర్మనీ, పోలెండ్‌, ఇస్తోనియా, డెన్మార్క్‌ తరువాతే అది ఇస్తున్న సాయమొత్తం ఉంది. గొడవలెందుకు అన్న ధోరణితో ఫ్రాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. మీరు తలచుకుంటే అందరికంటే ఎక్కువ సాయం చేయగలరంటూ జర్మనీని మునగ చెట్టు ఎక్కించేందుకు అమెరికా పూనుకుంది. మొత్తం మీద రానున్న కొద్ది రోజులు లేదా చలికాలంలో లేదా ముగిసిన తరువాత కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యాపై నాటో కూటమి దేశాలు, ఇతరుల ఆర్ధిక దాడి !

01 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి కుట్రల కారణంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య తలెత్తిన వివాదం విచారకరమైన యుద్ధానికి దారి తీసి బుధవారం నాటికి ఏడవ రోజులో ప్రవేశించింది. రష్యా సైనిక పాటవం ముందు ఉక్రెయిన్‌ నిలిచే అవకాశం లేదని, త్వరగానే పతనం అవుతుందన్న అంచనాలు తప్పాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు. వస్తున్న వార్తలను బట్టి సామాన్య జన నష్టం జరగకుండా చూసేందుకు రష్యన్‌ దళాలు కేవలం నిర్దేశిత సైనిక కేంద్రాల మీదనే కేంద్రీకరించటం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాటో అందచేసిన ఆధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటన శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన ఊహించలేదని పశ్చిమ దేశాల సంస్ధలు వార్తలు ఇచ్చాయి. బైలోరస్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన బేషరతు చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే సోమవారం ముగిశాయి.భద్రతా కారణాల రీత్యా ఈ చర్చలు సరిగ్గా ఎక్కడ జరిగాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ” మత్స్యకారుడి గుడిసె ”లో అని గుప్తనామం చెప్పారు. ఈ చర్చలు సరిహద్దులో తమవైపే జరపాలని పట్టుబడిన ఉక్రెయిన్‌ మెట్టుదిగి బెలారస్‌ వైపుకే తన ప్రతినిధులను పంపింది. రెండవ దఫా సంప్రదింపులు బెలోరస్‌- పోలాండ్‌ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. వీటి ఫలితం గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ రెండు దేశాల వివాదంతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్ధలకు అంతరాయం, పరస్పర ఆంక్షల కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, పర్యవసానాలను ప్రపంచం చవి చూస్తోంది. మంగళవారం నాడు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌లో రెండవ పెద్ద పట్టణమైన ఖర్‌కివ్‌ నగరంలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప మరణించటం తీవ్ర విచారకరం.


శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరు పక్షాలూ సంయమనం, కాల్పులకు విరామం పాటించటం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ అటువంటి అవకాశాలు కనిపించలేదు. చర్చలు చర్చలే, దాడులు దాడులే అని రష్యా చెప్పటం కొంత మందికి విపరీతంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి ముందుకు తోసిన పశ్చిమ దేశాలు ప్య్రత్యక్షంగా దాడులకు దిగలేదు తప్ప రష్యాను దెబ్బతీసేందుకు భద్రతా మండలిని సాధనంగా చేసుకొని ప్రచారదాడి, ప్రతిరోజూ కొత్త ఆంక్షలు, చర్యలను ప్రకటిస్తూనే పరోక్షదాడులను పెంచుతున్నాయి. ఇదంతా ఉక్రెయినుకు మద్దతుగానే అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన అణుదళాలను సిద్దంగా ఉండాలని పుతిన్‌ ఆదేశించాడు, చర్చల సమయంలో దాడులను ఆపేది లేదని కూడా ప్రకటించాడు. ఇవన్నీ వత్తిడిని పెంచే ఎత్తుగడలే.


రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిసార్లు జరిగినా కీలక సమస్యపై అంగీకారం కుదిరితేనే సంధి తప్ప మరొకమార్గం లేదు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆ ముసుగులో రష్యా సరిహద్దుల్లో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడను పక్కన పెట్టేందుకు సిద్దం కావటం లేదు. అందువలన భౌతికంగా దాడి ఉక్రెయిన్‌ మీద జరుపుతున్నప్పటికీ అసలు లక్ష్యం నాటో కూటమి, దాని పెద్ద అమెరికా అన్నది స్పష్టం. నాటోలో చేరకుండా తటస్ధదేశంగా ఉంటామని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతోంది. ఒకవైపు తమను ముందుకు తోసి నట్టేట ముంచారని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ చెబుతూనే ఇంకా దింపుడు కల్లం ఆశమాదిరి పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాను దారికి తెస్తాయనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయ మీరు మా వైపు ఉన్నారో లేదో రుజువు చేయాలంటూ ఐరోపాయునియన్ను మంగళవారం నాడు డిమాండ్‌ చేశాడు. రష్యాను ఖండిస్తూ భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలు వీగిపోతాయని తెలుసు. ఐనా ప్రచారదాడిలో భాగంగా ఆ తతంగం నడిపించిన తరువాత కొనసాగింపుగా ఇప్పుడు సోమవారం నుంచి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు తెరతీశారు. దాని మీద ఓటింగ్‌ జరగనుంది. దాని ఫలితం ఏమైనప్పటికీ నిబంధనల ప్రకారం దాన్నెవరూ అమలు జరపాల్సిన అవసరం లేదు. గతంలో యుగోస్లావియాపై భద్రతా మండలి అనుమతి లేకుండానే నాటో దళాలు 78 రోజుల పాటు దాడులు చేశాయి. దాన్ని మూడు ముక్కలు చేసి బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియాగా విడతీసి ప్రత్యేక రాజ్యాలుగా గుర్తించాయి. అల్బేనియా నుంచి కొసావోను విడగొట్టి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు అవే నాటో దేశాలు ఉక్రెయిన్లో స్వాతంత్య్రం కోరుకుంటున్న డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను రష్యాగుర్తిస్తే ఇంకేముంది చట్టబద్దతకు ముప్పు వాటిల్లిందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చైనా అంతర్భాగాలైన తైవాన్‌, హాంకాంగ్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలన్న కుట్రను బలపరుస్తున్నాయి.


ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్న ప్రధాన డిమాండ్‌తో పాటు రష్యా మరికొన్ని అంశాలను కూడా ముందుకు తెచ్చింది. 2015మిన్‌స్క్‌ ఒప్పందాన్ని అమలు జరపాలని అది డిమాండ్‌ చేస్తోంది. డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా ఉక్రెయిన్‌ గుర్తించాలని, ఆ ప్రాంతాల నుంచి మిలిటరీ సామగ్రిని తొలగించాలన్న వాటితో పాటు పన్నెండు అంశాలున్నాయి. దాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన నాటోలోని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పట్టించుకోకుండా చోద్యం చూశాయి. ఇప్పుడు ఆ రిపబ్లిక్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించటంతో అవి కూడా గగ్గోలు పెడుతున్నాయి. రష్యా ముందుకు తెచ్చిన అంశాలను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో కూటమి పడనిచ్చేట్లు కనిపించటం లేదు. అవి విధించిన ఆంక్షలు రష్యాకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి జనంలో పుతిన్‌ మీద వ్యతిరేకతను రేకెత్తించాలన్న పధకం కూడా ఉందన్నది స్పష్టం. రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధను కుప్పకూల్చివేస్తామని ఫ్రాన్స్‌ ఆర్ధిక మంత్రి బ్రూనో లీ మారీ చెప్పాడు. రష్యామీద పూర్తి స్ధాయిలో ఆర్ధిక యుద్ధం చేయనున్నట్లు, ఆ మేరకు ఆర్ధిక రంగాన్ని దెబ్బతీస్తామని ఒక రేడియోలో మాట్లాడుతూ చెప్పాడు.ఈ అంశాలు పుతిన్‌కు తెలియనివేమీ కాదు కనుకనే ప్రతి ఆంక్షలు, తీవ్ర వత్తిడికి పూనుకున్నాడు. ఇప్పటికి ఐదు దఫాలుగా నాటోను విస్తరించి రష్యా ముంగిట తిష్టవేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ వివాదానికి మూలం అదే అన్నది తెలిసిందే.రష్యా భద్రత అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు సాగితే కుదరదని పుతిన్‌ పశ్చిమ దేశాలకు స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే క్రిమియాను తమ అంతర్భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్లోని నయానాజీ మూకలను వదిలించుకోవాలని కూడా కోరుతున్నాడు.


పశ్చిమ దేశాల కవ్వింపు చర్యలు, సమీప దేశాల్లో ఆయుధమోహరింపును ఎదుర్కొనేందుకు రష్యాకూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే బెలారస్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అవసరమైతే అణ్వాయుధాలు, క్షిపణులను మోహరించేందుకు, రష్యాదళాలను శాశ్వతంగా దేశంలో కొనసాగించేందుకు రాజ్యాంగబద్ద ఆమోదం పొందారు. రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు అణుదాడి కంటే తక్కువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూబుల్‌ విలువిలువ కుప్పకూలింది.ద్రవ్యోల్బణం పెరిగింది. జనం బాంకుల ముందు వరుసలు కట్టారు. ఇతర దేశాల నుంచి నగదు బదిలీకి వీల్లేకుండా కొన్ని రష్యన్‌ బాంకులను స్విఫ్ట్‌ నుంచి తొలగించారు.పుతిన్‌తో సహా అనేక మంది వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో ఉన్నవారి ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆంక్షల నుంచి గాస్‌, చమురు, ఎరువులు, గోధుమల వంటి వాటి లావాదేవీలకు చెల్లింపులను మినహాయించారు. ఇరాన్‌, వెనెజులా మీద ఇలాంటి ఆంక్షలనే అమెరికా విధించింది. క్యూబామీద దశాబ్దాలుగా ఇంతకంటే తీవ్ర అష్టదిగ్బంధనం గావించినప్పటికీ అవి తట్టుకొని నిలిచాయి. అందువలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ రష్యాకు తట్టుకొనే శక్తి ఉంది. ఐరోపాలో అమెరికా అణ్వాయుధాల మోహరింపు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్‌ విదేశాంగ మంత్రి లావరోవ్‌ మంగళవారం నాడు చెప్పాడు. ప్రస్తుత పరిస్ధితిలో నూతన ఆయుధపోటీ తగదని, నిరోధించాలని అన్నాడు.ఐరోపాలో స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపుపై మారటోరియం ప్రకటించాలని ప్రతిపాదించాడు. అమెరికా అణ్వాయుధాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని ఇది అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందానికి విరుద్దమని జెనీవాలో జరుగుతున్న నిరాయుధ సభలో వీడియో ద్వారా మాట్లాడుతూ లావరోవ్‌ చెప్పాడు.


తమ గడ్డమీద అణ్వాయుధాలను ఉంచేందుకు బెలారస్‌ తీర్మానించటాన్ని బట్టి పశ్చిమ దేశాల నుంచి వచ్చే ముప్పు కనిపిస్తున్నది. బహుశా అందుకే రష్యా అణుదళాలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు చెప్పవచ్చు. అణ్వాయుధాల గురించి ముందుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫిబ్రవరి 24న ప్రస్తావించాడు. అణుదాడి గురించి పుతిన్‌ బెదిరిస్తున్నాడని బైడెన్‌ విలేకర్లతో చెప్పాడు. అదేమిటో వివరిస్తారా అని అడిగితే అతనేమనుకుంటున్నాడో తనకు తెలియదని సమాధానాన్ని దాటవేశాడు. పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయా లేదా అని పుతిన్‌ పరీక్షించాలనుకుంటున్నాడని కూడా అన్నాడు. అణుదళాల సన్నద గురించి పుతిన్‌ చెప్పటాన్ని అణుదాడికి దిగుతాడని భావించనవసరం లేదు.


ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడినపుడల్లా అణ్వాయుధ అగ్రదేశాలు హెచ్చరికలు, కొత్త పరీక్షలు, అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలు చేయటం సాధారణంగా జరుగుతోంది తప్ప రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎవరూ ప్రయోగించలేదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హడావుడి, తరువాత మౌనంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ కూడా అదే ఎత్తుడను అనుసరించాడు. దాడికి రెండునెలల ముందు నుంచి అనేక విధాలుగా తమ దేశ భద్రతకు హామీ గురించి ఐరాసకు, నాటో దేశాలకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేకపోగా మరింతగా రెచ్చగొట్టిన అంశం తెలిసిందే.ఉక్రెయిన్‌ అణుశక్తి దేశం కాదు. కేవలం బెదిరింపు, వత్తిడికి మాత్రమే పరిమితం అని విశ్లేషకులు చెఋన్నారు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచార యుద్దంలో ఏ దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఎలాంటి తెగింపులకు పాల్పడుతుందో చెప్పలేము. ఉక్రెయిన్‌కు నాటో తీర్ధం ఇవ్వనంత మాత్రాన గత మూడు దశాబ్దాలుగా ఆదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎప్పుడైతే తన అనుకూల శక్తులను గద్దెనెక్కించి రష్యాను కవ్విస్తోందో అప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు అనుసరించే వైఖరిపైనే అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిదేశం తన రక్షణను తాను చూసుకోవాల్సిన పరిస్ధితిని అమెరికా, నాటో కూటమి కల్పించింది. అందువలన ఇప్పుడు ఎక్కడా మనకు శాంతిదూతలు కనపడరు.పశ్చిమదేశాల తీరు తెన్నులను చూస్తుంటే మరోసారి ఐరోపా ఆయుధ మోహరింపు కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒక వైపు రష్యా మరోవైపు ఉంటాయి. తగులుతున్న ఎదురుదెబ్బలు, దెబ్బకుదెబ్బ తీస్తామని చేస్తామని హెచ్చరికల కారణంగానే అమెరికా అదుపులో ఉంటోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ పతనం ! విశ్వగురువుగా మోడీ పాత్ర ఏమిటి ?

25 Friday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Narendra Modi Failures, NATO, Ukraine crisis, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


రష్యన్‌ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్‌ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్‌ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి ఈ దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ద కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి గానీ ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్‌ చెప్పాడు. పోలాండ్‌ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు ?


ఉక్రెయిన్‌ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. తాము ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్‌ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్దం ఉండదన్నాడు.నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికాలోని 52శాతం మంది ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఎపి-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది.ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్‌ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.ఆంక్షల ప్రకటనతో గురువారం నాడు పీపా ముడిచమురు ధర 106డాలర్లకు పెరిగింది. తరువాత ఇంధనాన్ని మినహాయించినట్లు ప్రకటించటంతో 99కి పడిపోయింది.శుక్రవారం నాడు తిరిగి 102 డాలర్ల వరకు పెరిగినా తిరిగి 98.74కు తగ్గింది.


మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని.ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా పొగడ్తలు అందుకుంటున్న స్ధితి.మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా ! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా ? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ” అన్ని పక్షాలు ” ” పరిస్ధితి దిగజారకుండా” ” దౌత్యం ద్వారా ” పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్ధంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జో బైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది.ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదే పదే చెప్పారు. ఏమోయి మోడీ అంటే ఏంటోయి బైడెన్‌ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే బంధం ఉంది.( డోనాల్డ్‌ట్రంప్‌తో కౌగిలింతల గురించి చెప్పనవసరం లేదు.) అలాంటి వారు ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారిరువురూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు, అభిప్రాయ మార్పిడిగానీ ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. ఇదే సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జో బైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఫోన్‌పెట్టేసి ఉంటే మోడీ సర్కార్‌ నిజంగానే తటస్ధంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్‌ చేద్దామని జో బైడెన్‌ కూడా అనుకోలేదు.


తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జో బైడెన్‌ గురువారం నాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్‌ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం,ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్‌ చెప్పాడు.అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ ” ప్రస్తుతం మేము భారత్‌ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాము.ప్రపంచంలోని శక్తివంతులైన నేతలలో ఒకరైన మోడీ గారికి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్‌ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికత లేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్‌ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి ” అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50 మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్దుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే.భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్‌ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.


నరేంద్రమోడీ చెప్పినట్లుగా జోబైడెన్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్దం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి, కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు.ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు.తటస్ధం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా ?


ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మన దేశం తటస్ధ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్‌ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్‌ – అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్‌ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరైనా వాటితో లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్ధత ఎక్కడుంది. హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్ధలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ అణు అంశంలో రాజీకుదుర్చుకోనున్నాయి, మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్‌ ఇచ్చిన రాయితీధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది ? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా ?


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యాదాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది.ఉక్రెయిన్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్దులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాగ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్లో పరిస్ధితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు ? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను జేమ్స్‌బాండ్‌గా వర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్‌ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా ? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా ? వారి తరలింపు గురించి తగినంత ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే వారంతా తిరిగి వచ్చి ఉండేవారు, పరిస్ధితి చక్కబడిన తరువాత తిరిగి వెళ్లి ఉండేవారు.అలా జరగకపోవటానికి బాధ్యులెవరు ? ఉక్రెయిన్‌ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే దాన్ని నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా ? అమెరికా తోకపట్టుకు పోతామా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అమెరికా, రష్యా ఎత్తులకు పైఎత్తులు !

22 Tuesday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, NATO allies, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది.ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారం నాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్ధిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధినేత పుతిన్‌ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ లోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్‌ షరతు పెట్టారు.బైడెన్ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేము. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్‌, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి ? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి దళాలను పంపాలన్న పధకం ప్రస్తుతానికి లేదని ముప్పు తలెత్తితే ఆ పని చేస్తామని రష్యా ప్రకటించింది.


ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని,ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్‌ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది.2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్‌ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు.2019 జూన్‌ నుంచి డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతాపూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులను గుర్తించటం లేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారువాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్‌ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్‌, రష్యన్‌ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్‌ 2020లో రష్యన్‌ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్‌లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగెల్‌ ఒక బ్రిటన్‌ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది.1991 మార్చి ఆరవ తేదీన బాన్‌ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ” అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు ” అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్‌ సెట్జ్‌ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్‌ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది.” 2+4 సంభాషణల్లో నాటోను ఎల్‌బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని ” నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్‌జెన్‌ హ్రౌబోగ్‌ అన్నాడు.


డెర్‌ స్పీగల్‌ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాషువా షిఫ్రిన్స్‌న్‌ బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్‌ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్‌ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అన్నాడు.1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.


ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్ధిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సిఇఓ గ్రెగ్‌ హేస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్ధిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.


తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి ) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్‌ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్‌ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.


ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్ధ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.


డాంటెస్క్‌, లుహనస్క్‌ రిపబ్లిక్‌లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది.దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. ఎలాంటి కారణం లేకుండా కూడా తమ మీద ఆంక్షలు విధించటం చూశామని, దీనిలో కొత్తేముందని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. తాము స్వంతంగా కొన్ని ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా చెప్పింది. బ్రిటన్‌ కొన్ని బాంకులపై ఆంక్షలు విధించింది. సముద్రగర్భం నుంచి వేసిన గాస్‌, చమురు గొట్టపు మార్గ పధకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ పేర్కొన్నది. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: