• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ys jagan vs chandrababu

జగన్‌ నెల రోజుల పాలన -అభినందనలు -అనుమానాలు !

28 Friday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion

≈ Leave a comment

Tags

challenges before ys jagan, praja vedika, praja vedika Undavalli, YS jagan, YS Jagan 30 days rule, ys jagan vs chandrababu

Image result for YS Jagan 30 days rule

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదిహేడవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నెల రోజుల పాలన గురించి చెప్పాలంటే కొన్ని చర్యల మీద తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ వ్యతిరేకుల విమర్శలను పక్కన పెడితే అభిమానులనుంచి అభినందనలు అందుకున్నారు. అనేక మంది తటస్ధుల ప్రశంసలు కూడా పొందారు. వీటితో పాటు నూతన ప్రభుత్వ లేదా నా మాటే శాసనం అన్న బాహుబలి పాత్ర మాదిరి ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు, చర్యలు కొన్ని అభిమానించే వైసిపి వారితో సహా మొత్తం జనాల్లో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయి. అసాధారణ విజయం సాధించిన పాలక పార్టీకి, ప్రభుత్వానికి తొలి నెలలోనే ఇలాంటి పరిస్ధితి ఏర్పడటం ఒక విశేషంగానే చెప్పాలి.

Image result for praja vedika undavalli

నాటకీయ పరిణామాల మధ్య కృష్ణా కరకట్టలోపల వున్న ప్రజావేదికను కూల్చివేయించిన తీరు ఒక సంచలనం అనటంలో ఎలాంటి సందేహాలు లేవు. ఆదిలోనే అనేక అంశాలలో తరువాత ఏంటి అన్న సహస్ర శిరఛ్చేద అపూర్వచింతామణి ప్రశ్నలతో పాలన ప్రారంభమైంది దానికి తగిన జవాబు చెప్పగలిగితే జగన్‌ సర్కార్‌ బతికిపోతుంది లేకపోతే బలి అవుతుంది. అదే విధంగా మరోసారి ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబు కూడా నెల రోజులుగా కొత్త పాత్రను పోషిస్తున్నారు. అనుభవం రీత్యా జగన్‌తో పోల్చుకోవటానికే లేదు. పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు చట్టరీత్యా గాకపోయినా నైతికంగా అయినా రాష్ట్ర జనాల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుంది.

Image result for praja vedika undavalli

అన్ని అంశాలను ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు కనుక ఒక్కో అంశాన్ని చూద్దాం. ప్రజావేదిక అక్రమ కట్టడం కనుక దాన్ని కూల్చివేయాలని అనుకున్నారు, అన్నంత పనీ చేశారు, హైకోర్టు కూడా అడ్డుపడలేదు. ఇంతవరకు ఇబ్బంది లేదు.దాని కొనసాగింపుగా చంద్రబాబు నివాసం వుంటున్న మరొక అక్రమ కట్టడం గురించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడే బంతి ప్రభుత్వం చేతి నుంచి ప్రతిపక్షానికి చేరింది. అక్రమ కట్టడాలు రాష్ట్రంలో అనేక వున్నాయి. వీటిలో రెండు రకాలు. సముద్రతీరం, నదీ తీరాల్లో నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవి ఒక రకం, మరో తరగతి అలాంటి నిషేధాలు లేని ప్రాంతాలలో అనుమతులు పొందీ వుల్లంఘించి జరిపిన నిర్మాణాలు కొన్ని, అసలు అనుమతులు లేకుండానే నిర్మించినవి కొన్ని. రెండవ తరగతి వాటిని ప్రభుత్వం తలచుకుంటే అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి కూల్చివేయవచ్చు, లేదూ స్వల్ప వుల్లంఘనలు వుంటే, అవి జనానికి, రాకపోకలకు, ఇతరత్రా ఇబ్బంది కరం కాదు అనుకుంటే జరిమానాలు విధించి ఆమోద ముద్ర వేయటం ఒకటి. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం నిషేధిత ప్రాంతాల్లో చేసిన నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు. వాటిని గత పాలకులు ఎందుకు కూల్చివేయలేదు,యజమానుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎలా అనుమతించారు అంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమ వ్యవహారం తప్ప మరొకటి కాదు.

కేరళలోని కొచ్చిన్‌ శివార్లలోని మరాదు అనే మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన కేసు ప్రస్తుతం నడుస్తోంది. దాన్ని నిర్మించిన సంస్ధ, కొనుగోలు చేసిన వారు చేసే వాదన ఏమంటే మరాదు గ్రామ పంచాయతీ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. అవి అక్రమం అంటూ హైకోర్టుకు వెళ్లినపుడు నిర్మాణాలను నిలుపుదల చేయకుండా కోర్టు అనుమతించింది. నిర్మాణాలు జరిగే సమయంలో కోస్తా పరిరక్షణ సంస్ధ వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీరా పూర్తిగా నిర్మించిన తరువాత ఇప్పుడు కూల్చివేయాలని కోరటం ఏమిటి? మా వాదన వినకుండా కోర్టు తీర్పు ఇచ్చింది కనుక మా వాదనలు విని అంతిమంగా నిర్ణయించాలి, తీర్పును తిరిగి విచారించాలి అని యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తీర్పు ఇచ్చింది మరొక బెంచి కనుక తాము దానిని విచారించబోము, ఆరువారాలు కూల్చివేతల నిలిపివేతకు వుత్తరువు ఇస్తాము అంటూ తాజాగా మరొక బెంచి వారు ప్రకటించారు.కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా సమస్యను సంక్లిష్టం చేసే విధంగా తీర్పులు చెబుతున్నందున ఇదొక పెద్ద సమస్య. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకువచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అజెండాను ముందుకు తెస్తున్నది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అంశాల గురించి ముందుగా చూద్దాం. కృష్ణానది తీరంలో జరిగిన అక్రమ కట్టడాల గురించి ప్రతిపక్షంగా వున్నపుడు వైసిపి ఈ అక్రమాలను ప్రశ్నించింది. అది అధికారానికి వచ్చిన తరువాత ఆ సమస్యను చేపట్టబోయే ముందు తగినంత కసరత్తు చేసినట్లు కనిపించటం లేదు. లేదూ నాటకీయంగా ఒక ప్రభుత్వ నిర్మాణాన్ని కూల్చివేసిన తరువాత ప్రయివేటు నిర్మాణాల విషయంలో ప్రభుత్వ విధానమేమిటో స్పష్టం చేయలేదు. ముందే చెప్పినట్లు నా మాటే శాసనం మాదిరి నిర్ణయాలు చేస్తే కుదరదు.ప్రభుత్వ భవనం మాదిరి ప్రయివేటు వాటి జోలికి పోవటం అంత సులభం కాదు. అనేక భవనాలు వుండగా ఒకే భవనానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ప్రతిపక్షాలకు, మీడియా, సామాజిక మాధ్యమానికి వ్యాఖ్యానించే అవకాశం ఇచ్చింది. ‘గౌరవ ముఖ్యమంత్రి గారు, నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై – డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా?లేకపోతే మన రాష్ట్రంలో క ష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ ప్రకారం తొలగిస్తారా! కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు…’అంటూ తెలుగుదేశా పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.

అక్రమ నిర్మాణాల చర్చ పక్కదారి పట్టకుండా వుండాలంటే ఇప్పటికైనా ఆ సమస్య మీద సమగ్రవిధానం ప్రకటించాలి. దాన్ని మంత్రి వర్గ నిర్ణయంగానో మరొకటిగానో చట్టబద్దమైనదిగా వుండాలి. లేదూ గత ప్రభుత్వాలు తీసుకున్న విధానాల కొనసాగింపే అయితే ఆ విధానాలు ఏమిటి? నూతన ప్రభుత్వం దానినే కొనసాగిస్తున్నదా అన్న విషయమైనా చెప్పాలి. లేదా అసలు ఎలాంటి విధానం లేకుండా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరిస్తే అదైనా చెప్పాలి. విద్యుత్‌ కొనుగోళ్ల మీద సమీక్ష జరిపి వాటిలో వేలాది కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైందని చెబుతున్న జగన్‌, అక్రమ నిర్మాణాల మీద ఎందుకు సమీక్ష జరపరు? వాస్తవాలు, తన కార్యాచరణ ఏమిటో జనానికి ఎందుకు చెప్పరు? సంబంధిత మంత్రులతో వుపసంఘాన్నివేసి ఒక నివేదిక తెప్పించుకోవటం, మంత్రివర్గ ఆమోదం వంటి పద్దతులను ఎందుకు పాటించరు? తొందరపడ్డారు, కక్ష తీర్చుకుంటున్నారు అనే ఆరోపణలకు గురికావటం ఎందుకు?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ చర్యల మీద ధ్వజమెత్తుతున్నారు. వారికి ఆ హక్కు వుంది. అయితే ప్రతి పార్టీ అధికారంతో నిమిత్తం లేకుండా సమస్యల మీద ఒక వైఖరిని తీసుకోవాలి. అక్రమ కట్టడాల మీద తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటి అన్నది ప్రశ్న. అధికారపక్షానికి 50శాతం వరకు ఓట్లు వస్తే ప్రతిపక్షానికి కూడా 40శాతం వరకు వచ్చాయి. అందులోనూ గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో వుంది కనుక ఎలాబడితే అలా మాట్లాడితే కుదరదు.తాజాగా నోటీసు ఇచ్చిన ప్రయివేటు భవనానికి గతంలో గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చిందని, తరువాత రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఇచ్చారని, అది అక్రమ కట్టడం అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ దాన్ని ఎందుకు కూల్చలేదని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పటానికి ఆ రాజశేఖరరెడ్డి లేరు కనుక ఆయనెందుకు కూల్పించలేదు అన్నది పక్కన పెడదాం. నిన్నటి వరకు అధికారంలో వున్న చంద్రబాబు ఏమి చెబుతారు అన్నది ప్రశ్న. ఆ కట్టడం అక్రమం అని దానిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివాసం వుండటం ఏమిటని ప్రారంభంలోనే విమర్శలు వచ్చాయి కదా ? దాని మీద లేదా అలాంటి కట్టడాల మీద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వ అనుసరించిన వైఖరి ఏమిటి అన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. అసలది అక్రమమా, సక్రమమా అన్నది చెప్పకుండా తండ్రి అనుమతించిన వాటికి కొడుకు నోటీసులు పంపటమా, ఒకవేళ అక్రమం అయితే దానికి జగన్‌మోహన్‌ రెడ్డే బాధ్యత వహించాలని అని సీనియర్‌ నేత ఎనమల రామకృష్ణుడు వాదిస్తున్నారు. జగనే బాధ్యత వహించాలి అంటున్నవారు ఆ జగనే బాధ్యతగా భావించి చర్యతీసుకొనేందుకు నోటీసు పంపించారు కనుక మాట్లాడకుండా కూర్చోవాలి తప్ప ప్రశ్నించటం ఏమిటి అన్నది జనం నుంచి వస్తున్న స్పందన. సదరు భవన యజమాని తేల్చుకోవాల్సిన అంశం అది. లేదా శాశ్వతంగా చంద్రబాబు లేదా ఆయన కుటుంబ సభ్యులు వుండటానికి హక్కులు లేదా అమ్మకం లాంటివి ఏవైనా జరిగితే చంద్రబాబు కుటుంబం స్వంత వ్యవహారంగా తేల్చుకోవాలి తప్ప రాజకీయ రంగు పూయాల్సిన అవసరం ఏముంది?

ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత కుటుంబంతో కలసి ఐరోపా విహార యాత్రకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. వెళ్లే సమయంలో ఏమి ఆలోచించుకుంటూ వెళ్లారో తెలియదుగానీ వచ్చిన తరువాత ఏం మాట్లాడాలో అర్ధం అవుతున్నట్లు లేదు. కంటి చూపే తప్ప జరుగుతున్న పరిణామాల మీద నోటి మాటలేదు. అనుమతుల్లేకుండా, అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చివేయదలచుకున్న జగన్‌ సర్కార్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలను కూడా కూల్చుతారా అని అనుచరులతో అన్నట్లు లీకుల వార్తలు వచ్చాయి. తరువాత తెలుగుదేశం నేతలు కూడా అదే వాదనలు చేస్తున్నారు కనుక నిజమే అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసమంటూ నిబంధనలకు విరుద్దంగా జనం సొమ్ముతో ప్రజావేదికను నిర్మించటమే ఒక అక్రమం అయితే, అధికారాన్ని కోల్పోయిన తరువాత దాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన అవసరం కోసం కేటాయించమని కోరటం- అదీ ప్రతిపక్ష నాయకుడి హోదా వుంటుందో లేదో కూడా తెలియని స్ధితిలో- గొంతెమ్మ కోరిక తప్ప మరొకటి కాదు, అన్నింటికి మించి ు ఈ సమస్యమీద తెలుగుదేశం నేతలు ముందేమి చెబుతున్నారో, తరువాతేమి మాట్లాడుతున్నారో తెలిసే స్ధితిలో లేరు.

Image result for praja vedika undavalli

ప్రభుత్వ సమీక్షా సమావేశాలకు సరైన సమావేశ మందిరం లేదు, హోటళ్లు, ఇతర ప్రయివేటు భవనాల్లో చేసే ఖర్చును పొదుపు చేసేందుకు, సచివాలయానికి వచ్చే జనానికి అందుబాటులో వుండేందుకు ప్రజావేదికనిర్మాణం జరిగిందని తెలుగుదేశం వారు వాదిస్తున్నారు. నిజమే అనుకుందాం. మే 23వ తేదీకి ముందు రోజుకు తరువాత రోజుకు జరిగిన మార్పుల్లో అధికార మార్పిడి తప్ప పైన చెప్పిన అవసరాలు తీర్చే ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడలేదు కదా ? అలాంటపుడు ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించామని చెప్పినదానిని తన అవసరాలకు కేటాయించమని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కోరటం ఏమిటి? అంటే కొత్త ప్రభుత్వం సమీక్షలు ఎక్కడ చేయాలి? జనాన్ని ఎక్కడ కలుసుకోవాలి? అవన్నీ వేరే చోట్ల పెట్టి, సదరు భవనాన్ని తనకు అప్పగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని నాలుగుదశాబ్దాల రాజకీయ అనుభవం వున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి సూచించటమే కదా !

ప్రభుత్వ సమీక్షల కోసం ఒక భవనం వుండాల్సిందే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కట్టేదేదో కృష్ణానది కరకట్టకు ఇవతల రాజధానికి సేకరించిన భూములుండగా అక్కడ కట్టకుండా నిబంధనలకు విరుద్దంగా ఎందుకు నిర్మాణం చేయించినట్లు ! 2020, 2050 స్వాప్నికుడిగా చెప్పుకున్న చంద్రబాబుకు ప్రపంచంలో పర్యావరణ హానికి ఎదురవుతున్న ముప్పు, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియవా ? తాను నివసిస్తున్న ఒక అక్రమ ప్రయివేటు భవనం పక్కనే ప్రజావేదికను నిర్మింపచేయటంలో ఆయన విజ్ఞత ఏమైనట్లు ? తానున్నది రాష్ట్ర ముఖ్య మంత్రుల లేదా ప్రతిపక్ష నేతల అధికారిక శాశ్వత నివాసం ఏమి కాదే ! ఈ వుదంతంలో తలెత్తుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నేతల వద్ద వున్న సమాధానాలు ఏమిటి అనటంతో పాటు ప్రభుత్వ తీరు తెన్నులు ఏమిటి అని కూడా ప్రశ్నించక తప్పదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 2 – జగన్‌ నవరత్నాలు జిందా తిలిస్మాత్‌ కాదు !

19 Wednesday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AP Agriculture, AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Jaythi Ghosh Committe, Navarthnalu, Ycp, YS jagan, ys jagan vs chandrababu

Image result for YS Jagan Navaratnalu

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో ఎవరికీ పేచీ లేదు. అసలేమీ లేనిదాని కంటే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో జనానికి ప్రభుత్వం నుంచి సంక్షేమం రూపంలో అందటం మంచిదే. సంక్షేమ పధకాల గురించి యండమూరి వీరేంద్రనాధ్‌ వంటి పేరు మోసిన రచయితల మొదలు, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి విమర్శలు చేశారో, ఎంత చులకనగా వ్యాఖ్యానిస్తున్నారో తెలిసిందే. అవన్నీ బడుగు, బలహీన వర్గాల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు. వారు వినియోగిస్తున్న వస్తువులు, సేవలకు మిగతావారితో పాటు జిఎస్‌టి చెల్లిస్తున్నారు. విదేశీ, స్వదేశీ విమానాలకు సరఫరా చేసే ఇంధనానికి ఇచ్చే రాయితీలకు చెల్లిస్తున్న సొమ్ములో సామాన్యుల వాటా వుంది. విదేశాల నుంచి ధనికులు దిగుమతి చేసుకొనే సౌందర్యసాధనాలకు, చివరికి దోసకాయలు, యాపిల్‌ పండ్లకు, బంగారానికి, నగలు, వజ్ర వైఢూర్యాలకు, విదేశీ మద్యం వంటి వాటికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న విలువైన విదేశీ మారకద్రవ్యంలో కూడా పేదల వాటా వుందని తెలుసా? కనుక పేదలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలను అందుకోవటానికి సంకోచించనవసరం లేదు గానీ వారు చేయనితప్పుకు అవమానాలు పడాల్సిన అవసరం వుందా అన్నది సమస్య. వారు సంక్షేమం పేరుతో తీసుకున్న మొత్తాలతో తిరిగి సరకుల కొనుగోలు, సేవలకే కదా వెచ్చిస్తున్నది. అంటే తిరిగి ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు చెల్లిస్తున్నారు. ఆ విధంగా వస్తు, సేవల డిమాండ్‌ను పెంచటానికే తోడ్పడుతున్నారు తప్ప విదేశీ బ్యాంకుల్లో ఆ సొమ్మును దాచుకోవటం లేదు.

ప్రభుత్వ వుద్యోగులు, టీచర్లకు 27శాతం మధ్యంతర భృతి ప్రకటించటం హర్షణీయమే, వారికి ఐదు సంవత్సరాల క్రితం 47శాతం వేతనాలు పెంచారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన పెంపుదల చేస్తున్నందున మరోసారి వేతన పెంపుదల బకాయి వుంది, దాన్ని ఖరారు చేసే లోగా మధ్యంతర భృతి చెల్లించటం హర్షణీయమే. చంద్రబాబు వాగ్దానం చేసినదాని కంటే ఎక్కువే ఇస్తామనటం మంచిదే. వైఎస్‌ జగన్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో జనంలో వున్నారు. యాత్రలు చేశారు, జనం సమస్యలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటిన్నర మంది వరకు అసంఘటిత రంగ కార్మికులు వున్నారని అంచనా. వారిలో ఏ ఒక్కరూ, ఏ గ్రామం లేదా పట్టణంలోగానీ, లేదా వైసిపి కార్మిక నేతలు గానీ వారి వేతనాల పెంపుదల గురించి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదా అన్నది ఒక ముఖ్యాంశం. ఇవ్వలేదు అనేందుకు ఆస్కారం లేదు. గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా వారి సమస్యల ప్రస్తావన లేదు. ఎందుకన్నది ప్రభుత్వంతో పాటు జనం గూడా ఆలోచించాలి. ఎన్నికల మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగిసిన తరువాత 2019ఏప్రిల్‌ 16న రాష్ట్ర కార్మిక శాఖ ఒక గజెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దానిలో అసంఘటితరంగ కార్మికులకు చెల్లించాల్సిన కరువు భత్యం గురించి పేర్కొన్నది. దాని వివరాల్లోకి వెళితే 2014 తరువాత ఎవరికీ వేతనాలను సవరించలేదు. 2006 నుంచి సవరించని వారు వున్నారు. ఎక్కువ తరగతులకు 2006-2009 మధ్య సవరించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయని వైసిపి నాయకులకు, గవర్నర్‌ ప్రసంగం రాసిన సీనియర్‌ అధికారులకు తెలియనిదా ? అంటే చివరి తరగతిని తీసుకుంటే పదమూడు సంవత్సరాలుగా ఒకే వేతనం తీసుకుంటూ, దాని మీద కరువు భత్యం పొందుతున్నారని అనుకోవాలి. నిజంగా ఎన్ని యాజమాన్యాలు కరువు భత్యం చెల్లిస్తున్నాయన్నది పెద్ద బేతాళ సందేహం.

Image result for YS Jagan Navaratnalu

వుదాహరణకు పబ్లిక్‌ మోటార్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు 2006 డిసెంబరు నాలుగవ తేదీన నిర్ణయించిన వేతనాలలో అనాటికి వున్న కరువు భత్యం 502 పాయింట్లను కలిపి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటికి కరువు భత్యం పాయింట్లు 1306కు పెరిగాయి. అంటే మూలవేతనంలో పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి పెరుగుదల లేకుండా 502 పాయింట్లు పోను మిగిలి ఒక్కో పాయింట్‌కు ఆరున్నర రూపాయల చొప్పున 804 పాయింట్లకు, మూలవేతాన్ని కలిపి చెల్లిస్తారు. మన ఇండ్లకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకు వచ్చే వారికి మొదటి జోన్‌లో 3,700, రెండవ జోన్‌లో 3,370 రూపాయల వేతనాన్ని 2007 డిసెంబరు 19న 525పాయింట్ల కరువు భత్యాన్ని విలీనం చేసి నిర్ణయించారు. ఇప్పుడు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు రూ 5,226, గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చే వారికి రూ.5,076 కరువు భత్యం మొత్తాన్ని మూలవేతనానికి కలిపి చెల్లించాలి.అసలు కంటే కరువు భత్యం అధికం. ఇది ఏ విధంగా సమర్ధనీయం. ప్రభుత్వ సిబ్బందికి ఒక న్యాయం అసంఘటిత రంగ కార్మికులకు ఒక న్యాయమా? ప్రభుత్వం అంటే ప్రజల పక్షమా, యజమానుల పక్షమా ? ఈ విషయాలను జగన్‌ పట్టించుకోరా? ప్రభుత్వ వుద్యోగులకు వేతన సవరణ చేసినపుడు డిఏను కలిపి మూలవేతనం మీద కొంతశాతం పెంచి కొత్తవేతనాలను నిర్ణయిస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు పదమూడేండ్లు అంటే ఇప్పటికి రెండుసార్లు మూలవేతనం పెంచాల్సి వుండగా ఒక్కసారి కూడా పెంచలేదు. ఇది సామాజిక న్యాయమా? అన్యాయమా ? ఇంత పెద్ద సంఖ్యలో వున్న వారి సమస్య ప్రభుత్వ విధానాన్ని తెలిపే ప్రసంగంలో చోటు చేసుకోలేదంటే కావాలని విస్మరించినట్లా, నవరత్నాలే జిందా తిలిస్మాత్‌ కాదని గ్రహించాలి.

ఆశావర్కర్లకు నెలవేతనాన్ని మూడు నుంచి ఒక్కసారిగా పదివేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనేక మందికి ఇంత వుదారమా అనిపించింది. ఇది వేతనమా లేక ప్రోత్సాహకాలతో కలిపి ఇచ్చే మొత్తమా ? ప్రస్తుతం వున్న విధానం ప్రకారం మూడువేల రూపాయల వేతనానికి తోడు చేసిన పనిని బట్టి ప్రోత్సాహకాలను జత చేసి రూ.8,600 వరకు చెల్లిస్తామని గత పాలకులు వాగ్దానం చేశారు. ఆచరణలో గరిష్ట ప్రోత్సాహకాన్ని మూడువేల రూపాయలకు పరిమితం చేశారు. అంటే అంతకంటే తక్కువ పని చేస్తే కోత పెడతారు, ఎంత ఎక్కువ చేసినా ఇచ్చేది పెంచరు. దీని వలన అత్యధిక ఆశావర్కర్లకు ఇప్పుడు అన్నీ కలిపి నాలుగున్నర-ఐదున్నరవేల మధ్య వస్తుండగా ఒక పదిశాతం మందికి గరిష్టంగా ఆరువేలు వస్తున్నాయని ఆశా సంఘాలు చెబుతున్నాయి. ఆశావర్కర్లకు చెల్లించే పారితోషికంలో 60శాతం కేంద్రం, నలభైశాతం రాష్ట్రం చెల్లిస్తున్నాయి. ఈ పారితోషికాల మొత్తాన్ని ఇటీవల పెంచింది. అయితే అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న మొత్తం కంటే తక్కువే కనుక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా కొంత సొమ్ము జమ అవుతుంది తప్ప ఆశావర్కర్లకు ఒరిగేది, పెరిగేదేమీ వుండదు. జగన్‌ ప్రకటించినది వేతనమే అనుకుంటే పదివేలు, దానికి ప్రోత్సాహంగా మూడువేలు, సీలింగ్‌ను ఎత్తివేస్తే అంతకంటే ఎక్కువ వస్తాయి, అలా జరిగితే అభినందనీయమే, అలాగాక కిరికిరి చేసి అన్నీ కలిపి పదివేలే అని అన్యాయం చేస్తే పరిస్ధితి ఏమిటి?

వ్యవసాయ రంగం ప్రధానంగా వున్న రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. గతంలో రాజన్న రాజ్యంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం గాకుండా ఆదర్శరైతుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంపిక చేశారు. వారిలో వ్యవసాయం తెలియని వారు, మానుకున్నవారు కూడా వున్నారు. నియమించిన తరువాత వారు కాంగ్రెస్‌ సేవకులుగా మారారు తప్ప రైతులకు అందించిన సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం ఏటా వారికి 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ సేవలను అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని, పొరుగుసేవల ద్వారా వాటిని అందించాలని ప్రపంచబ్యాంకు మన మీద రుద్దిన ఆదేశాల ఫలితమే. రైతు భరోసా పేరుతో ఏటా ప్రతి రైతు కుటుంబానికి రు.12,500 చెల్లించాలని జగన్‌ నిర్ణయించటం హర్షణీయమే. ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన ఆరువేలకు అదనమా అది పోను మరో ఆరున్నరవేలు ఇస్తారా ? స్పష్టత ఇవ్వాలి.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై సబ్సిడీ మొత్తాలను గణనీయంగా తగ్గించిన కారణంగా రైతులు వాటిని కొనలేక సబ్సిడీ వున్న యూరియాను అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.ఎరువుల ధరల పెరుగుదల,సబ్సిడీ గణనీయంగా తగ్గింపు కారణంగా 2010లో 41లక్షల టన్నులుగా వున్న వినియోగం 2017 నాటికి 32లక్షల టన్నులకు పడిపోయింది. సగటు వాడకం కూడా బాగా తగ్గింది. ఎరువుల సబ్సిడీ నామమాత్రం అవుతున్న కారణంగా రైతులపై ఏటా పడుతున్న అదనపు భారాలను రైతు భరోసా పధకం పూడ్చుతుందని అనుకుందాం. మరి గిట్టుబాటు ధరల మాటేమిటి? కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు పడిపోయినపుడు రైతులను ఆదుకొనే మార్గాలేమిటి? ఇలాంటి సమస్యలు అనేక వున్నాయి. వాటి గురించి రైతులు, నిపుణులు, రైతు సంఘాలతో సమగ్ర చర్చలు జరిపితే ప్రయోజనం వుంటుంది. అలాగాక చంద్రబాబు నాయుడి మాదిరి సహజ వ్యవసాయం పేరుతో కాలక్షేపం చేయటం వలన ప్రజాధనం దండగ తప్ప రైతులకు ఒరిగేదేమీ వుండదు. అనేక పంటల దిగుబడులు అంతర్జాతీయ పరిస్ధితితో పోల్చితే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బాగా తక్కువగా వున్నాయి. పప్పుధాన్యాల సగటు దిగుబడులు ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక పోవటానికి ఇది కూడా ఒక కారణం.

2014-17 మథ్య మినుముల దిగుబడి హెక్టారుకు(రెండున్నర ఎకరాలు) 946 కిలోల నుంచి 920కు పడిపోగా నాలుగేండ్ల సగటు 856 కిలోలుగా వుంది.పెసల దిగుబడి ఇదే కాలంలో 825 నుంచి 662కు పడిపోగా సగటు దిగుబడి 656 కిలోలు. కందుల విషయానికి వస్తే 503 నుంచి 430కి పడిపోయింది. నాలుగేండ్ల సగటు 478కిలోలు, శనగల దిగుబడి 1143 నుంచి 1132కు తగ్గిపోగా నాలుగేండ్ల సగటు 1074 కిలోలు. ఇక పత్తి సంగతి చూస్తే 588 నుంచి 549కి తగ్గిపోయింది, నాలుగేండ్ల సగటు 545కిలోలు. వీటి తీరుతెన్నులను చూస్తే ప్రకృతి అనుకూలతలు, ప్రతికూలతల మీద రైతులు ఆధారపడటం తప్ప దిగుబడులను పెంచేందుకు ప్రభుత్వ కృషి కనిపించదు. ప్రధాన ఆహార పంటల విషయానికి వస్తే ధాన్య దిగుబడి 3022 నుంచి 3815కిలోలకు పెరిగింది. నాలుగేండ్ల సగటు 3460కిలోలు. చంద్రబాబు నాయుడు తొలిసారి అధికారంలో వున్నంత కాలం ఇజ్రాయెల్‌ వ్యవసాయమని, గత ఐదేండ్లు పాలేకర్‌ సహజ సాగు అంటూ కాలక్షేపం చేశారు.

Image result for YS Jagan Navaratnalu

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి అధికారంలోకి రాగానే ప్రముఖ ఆర్ధికవేత్త జయతిఘోష్‌తో ఒక కమిషన్‌ వేసి వ్యవసాయ రంగం మీద సిఫార్సులను తీసుకున్నారు. అనేక కమిషన్లకు పట్టిన దుమ్ము మాదిరే దానికీ పట్టింది.ఆ కమిషన్‌ సిఫార్సులలో అనేక మౌలిక అంశాలున్నాయి. వాటిని రాజశేఖరరెడ్డి, తరువాత ఆయనవారసులుగా వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు గానీ, గత ఐదు సంవత్సరాలు అధికారంలో వున్న చంద్రబాబు నాయుడు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌ ఆ కమిషన్‌ సిఫార్సులను తిరిగి పరిశీలిస్తారా ? ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ను రైతాంగ కమిషన్‌లో పనిచేయవలసిందిగా జగన్‌ ఆహ్వానించినట్లు, కమిషన్ల సిఫార్సులను అమలు జరుపుతారనే విశ్వాసం తనకు లేదంటూ శాయినాధ్‌ సున్నితంగా తిరస్కరించినట్లు, కమిషన్‌ కాదు, కార్యక్రమానికి తోడ్పడమని జగన్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వారి సలహాలను తీసుకోవాలని ప్రయత్నించటం మంచిదే. అయితే జయతీ ఘోష్‌ సిఫార్సుల అమలు తీరుతెన్నులను చూసిన తరువాత మరొకరెవరూ అలాంటి వృధా ప్రయాసకు పూనుకోరు. పదిహేను సంవత్సరాల నాటి పరిస్ధితుల మీద జయతీఘోష్‌ చేసిన సిఫార్సులు, వుమ్మడి రాష్ట్రానికి చెందినవి కనుక కొన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్తమానానికి వర్తించకపోవచ్చు. కానీ వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం, వ్యవసాయానికి అవసరమైన వాటన్నింటినీ సరఫరా బాధ్యతను ప్రభుత్వమే చేెపట్టాలనేటువంటి సిఫార్సులు వున్నాయి, వాటికి కాలదోషం పట్టదు. రాజన్న రాజ్యం తిరిగి తీసుకువస్తామని చెబుతున్నవారు, ఆ రాజన్న ప్రభుత్వం నియమించిన కమిషన్‌ సిఫార్సులు, పరిస్ధితులను అధ్యయనం చేసి పనికి వచ్చేవాటిని అమలు జరుపుతారా? చంద్రబాబు మాదిరి మభ్యపెట్టి కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 1: జగన్‌ సర్కార్‌ విస్మరించిందేమిటి? చేయాల్సిందేమిటి?

16 Sunday Jun 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telugu

≈ Leave a comment

Tags

AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu

https://s3.ap-south-1.amazonaws.com/hansindia-bucket/2975_YS-jagan-Mohan-Reddy.jpg

ఎం కోటేశ్వరరావు

ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్‌15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.

గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్‌ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్‌ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.

రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్‌ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్‌ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?

శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్‌ 14 రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్‌ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్‌ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.

2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్‌ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.

ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్‌ గవర్నర్‌ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.

Image result for YS Jagan

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్‌ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్‌ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.

సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్‌ చెబుతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.

భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్‌, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్‌ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.

Image result for YS Jagan

వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్‌ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్‌ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్‌ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్‌ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్‌ నవరత్నాలలో గానీ, గవర్నర్‌ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైసిపి ‘అనకొండ’ తెలుగు దేశాన్ని మింగు విధంబెట్టిదనిన !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, Anti defection law, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp, ys jagan vs chandrababu, ysrcp

Image result for jagan chandrababu

ఎం కోటేశ్వరరావు

‘ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’ ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను వుద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి వుంటుందని, వుండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి వుండటం పెద్ద సమస్య కూడా కాదు.

సీన్‌ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసిపి అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. మరీ పాత కథ చెప్పినట్లు వుందా, అయితే వైసిపి అనకొండ తెలుగుదేశాన్ని మింగదలచుకుంది అందాం. అయితే అది ఎలా ఎప్పుడు అన్నదే కిక్కునిచ్చే అంశం. ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినపుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్ధి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా వుంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ వూహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా వుంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.

ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలో వున్న లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ఆమోదించిన రాజ్యాంగాలు, వాటికి అనుగుణ్యంగా చేసిన చట్టాల మీద కమ్యూనిస్టులకు అంతగా విశ్వాసం లేకపోయినా, పార్లమెంటరీ పార్టీ వ్యవస్ధను ఆమోదించి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వాటికి కట్టుబడి వుంటున్నాయి తప్ప మిగతాపార్టీలేవీ అలా లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన గత మూడున్నర దశాబ్దాలు లేదా అంతకు ముందు కూడా కమ్యూనిస్టులు ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. అసలా ఫిరాయింపుల చట్టం గురించి నాలుగు ముక్కలు.

హర్యానా మన దేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఆయారామ్‌ గయారామ్‌ అంటే అతిశయోక్తి కాదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్‌, దానికి వ్యతిరేకంగా రూపొందిన పలు పార్టీల కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌ మధ్య ఫిరాయింపుల పర్వం నడిచింది. పంజాబ్‌ నుంచి విడివడి 1966 నవంబరు ఒకటిన హర్యానా ఏర్పడింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన గయాలాల్‌ అనే ఎంఎల్‌ఏ ఒకే రోజు తొమ్మిది గంటల వ్యవధిలో మూడు సార్లు పార్టీ మారాడు.కాంగ్రెస్‌ నుంచి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మారిన తరువాత తిరిగి కాంగ్రెస్‌కు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్‌ నేత రావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను చండీఘర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లకు చూపుతూ గయారామ్‌ ఇప్పుడు ఆయారామ్‌ అయ్యాడు అని ప్రకటించారు. ఆయారామ్‌ తరువాత వెంటనే తిరిగి గయారామ్‌గా మారి తిరిగి యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఫిరాయించాడు.( తండ్రి గయాలాల్‌ బాటలో నడిచిన కుమారుడు వుదయ్‌ భాను 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించారు.) అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కొనే భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం.

దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నా ,వుద్దేశ్యపూర్వకంగా సభకు గైర్‌హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్‌ లేదా అసెంబ్లీలో వున్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనం అయినా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎంఎల్‌ఏలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి గాని వాటిని ఇంతవరకు ఆమోదించి చట్టసవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్చందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్చందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్‌ నిర్ణయానికి తిరుగులేదు అని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్‌ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణాలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్‌పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన వుదంతాలు వున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌ఏగా వుంటూ ఫిరాయించిన ఒకరు తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత వుంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది తెరాసలో చేరేవరకు స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్‌ తెదే శాసనసభా పక్షం తెరాసలో విలీనమైనట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్‌ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ సభ్యత్వానికి వుత్తమ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్‌ శాసనభా పక్షాన్ని విలీనం చేయటం కూడా ఇదే పద్దతిలో జరిగింది.

ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులు వున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వున్న 23 మంది సభ్యులలో పదకొండు మంది మినహా 13 మంది తమతో సంబంధాలలో వున్నారని వైసిపి ఎంఎల్‌ఏలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసిపిలో చేరాలన్నా 16 మంది కావాల్సి వుంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసిపి వారు చెబుతున్నట్లు 13 మంది టచ్‌లో వుంటే మరో ముగ్గురు ఎంఎల్‌ఏలను ఆకర్షించితే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్‌ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13 మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్‌ఆర్‌సిపి లేదా మరొక పార్టీ దేనిలో అయినా చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు, అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.

దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నైతిక విలువలకు ఏ పార్టీ కూడా కట్టుబడి వుండటం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ చీలికపక్షమైన బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరటం ఫిరాయింపు కాదా అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదని వైసిపి సమర్ధించుకుంది. చట్టం వున్నా లేకున్నా ఫిరాయింపు ఫిరాయింపే, నైతికంగా అక్రమమే. బెదిరించి లేదా ప్రలోభపెట్టి ఆకర్షించిన తెలుగుదేశం చర్య కూడా గర్హనీయమే. ముందే చెప్పుకున్నట్లు చట్టాన్ని పటిష్టపరచటం గాకుండా లోపాలను వుపయోగించుకొని తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మూడు ప్రాంతీయ పార్టీలలో రెండు మిత్రపక్షాలుగా వున్నాయి. రెండూ అధికారంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపిలో ప్రాతినిధ్యం లేకపోవటం బిజెపికి తలకొట్టేసినట్లుగా వుంది. అందుకోసం అది వైసిపికి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బిజెపితో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసిపి చెప్పి వుండవచ్చు, విధిలేని స్ధితిలో బిజెపి సరే అని వుండవచ్చు. అనూహ్యంగా బిజెపి కేంద్రంలో రెండవసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది వుంటుందా అంటే వుండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాము. వాటికీ ఆంధ్రప్రదేశ్‌కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సిబిఐ, ఇడిలను ప్రయోగించాల్సి వుండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు కనుక జగన్‌కు ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక బిజెపి ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే వుంటుంది, జగన్‌కు అది తెలిసిందే కనుక వేటు పడకుండా చూసుకుంటారు. కొంతకాలం రేచుక్క పగటి చుక్క, చిక్కడు-దొరకడు వ్యవహారం నడుస్తుంది.

Image result for jagan chandrababu

రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్‌ ఆకర్ష పధకానికి తెరతీసినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో తెరాసలోకి పోగా మిగిలిన కాంగ్రెస్‌ను తమలో విలీనం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్‌ నాయకులు బిజెపికి ముద్దు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్‌ పెద్దలు బిజెపిలో చేరారు. బిజెపి ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్‌ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నువేసినట్లు చెబుతున్నారు. నిజానికి బిజెపి గతంలోనే తెలుగదేశం పార్టీని మింగివేసేందుకు ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్‌ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్‌ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్‌ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బిజెపిలో చేరితే వైసిపికి మింగా కక్కలేని స్ధితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా వుండదనుకొని వైసిపి సర్దుకు పోతుందా ? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకొన్న నాయకులకు పని ఇవ్వకుండా బిజెపి మాత్రం ఎంతకాలం వుంటుంది? కొద్ది కాలం తరువాత అదే బిజెపి తాను బలపడేందుకు సిబిఐ, ఇడి సంస్ధలను ప్రయోగించి జగన్‌ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసిపి సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి వుంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కెయి వర్గాలే కలసిపోగా లేనిది వైసిపి తన అవసరాల కోసం కనీసం జగన్‌ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటలోనే పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బిజెపికి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనై పోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎట్టకేలకు మోడీ మోక్ష స్వర్గ సోపానాల దగ్గర వైఎస్‌ జగన్‌ ?

11 Thursday May 2017

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ బలంగా వున్నచోట దానిని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీతో బంధం వుండగానే మరొక పార్టీకి కన్నుగీటుతూ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? బ్రహ్మంగారు మరి ఈ విషయంలో ఏం చెప్పారో తెలియదు. నిజానికి వైఎస్‌ఆర్‌సిపి ఎందుకోసం ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కోరిందో, ప్రధాని ఎందుకు జగన్‌ పరివారంతో కలిశారో అధికారికంగా తెలియదు. ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్‌మోహనరెడ్డి బృందం ప్రధానికి ఇచ్చినట్లు చెప్పిన మెమోరాండం, మీడియాతో మాట్లాడినదాని ప్రకారమే ఎవరైనా వ్యాఖ్యానించగలరు. పరకాయ ప్రవేశ విద్యతో కథనాలు రాసే విలేకర్ల నుంచి ఇంకా ఏమీ వెలువడలేదు కనుక వాటిని నమ్ముకున్న పాఠకులు నిరాశ చెందివుంటారు. కొద్ది వారాల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రధానిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో మునిగినా తేలినా రెండు పార్టీలు కట్టకట్టుకు వుండాలని నిర్ణయించుకున్నట్లుగా పరకాయ విలేకర్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలపరుస్తానంటే ఎవరైనా వద్దన్నారా అంటూ వెంకయ్య నాయుడు బిజెపిలో తలెత్తిన సందేహాలను తీర్చిన విషయం బహిరంగమే. దానిలో భాగంగానే విశాఖలో బిజెపి పెద్ద ఎత్తున సభ జరిపేందుకు పూనుకుందని వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇపుడు జగన్‌ పరిణామాలను నిస్సందేహంగా మరో మలుపు తిప్పారు. బిత్తర పోయిన తెలుగు తమ్ముళ్లు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లు విదేశాల్లో వున్న సమయంలో జగన్‌ ప్రధాన మంత్రిని కలిశారు అనేకంటే ప్రధాని కార్యాలయం అవకాశం కల్పించింది అని చెప్పటం సబబుగా వుంటుందేమో ?

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్క పక్కనే అనేక కత్తులకు స్ధానం కల్పించటం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాలలో చూడటం లేదూ ! పార్టీలో, ప్రత్యర్ధులలో ముఠాలుగా, ఒకరి పొడ మరొకరికి గిట్ట మట్టుపెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు – రెండు రెళ్లు నాలుగు అన్నట్లు శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికీ – వున్నట్లే రెండు పార్టీలను కూడా పక్క పక్కనే వుంచేందుకు , ఆంధ్రప్రదేశ్‌ పౌరులను కొత్త బాటలో నడిపించేందుకు బిజెపి నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇప్పటికిప్పుడు అంత సీను లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాల క్రమంలో పరిణామాలు ఎలా వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్‌ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో వుంటే వారి పంచనచేరి తమ వాటాలను రాబట్టుకొనేందుకు రాయలసీమ మొరటు ప్రత్యర్ధి ఫ్యాక్షనిస్టులే ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్లుగా వుండటం చూశాం, చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగురోడ్లు, విమానాశ్రయాలు అటూ ఇటూ, అక్కడా ఇక్కడా అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయటాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయబాట విషయంలో కూడా అదేవిధంగా జరగబోతోందా ? మేథావులు, వుడుకురక్తంతో వుండే యువతీ యువకులే అలాంటి తప్పుడు రాజకీయాలకు సలాం కొడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.

రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్రత్యేక పాకేజీ పేరుతో మోసం చేసినా ఫర్లేదు, వాటి గురించి అడగకుండా వుంటాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మాత్రం ఎలాంటి రాజకీయ అనుబంధం పెట్టుకోకూడదని చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ,చాణక్యనీతిని వుపయోగించి ఇంతకాలం అడ్డుకున్నారన్నది ఒక అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్దులెవరో తేలలేదు, నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు, మీడియాలో ఎలాంటి వూహాగానాలు రాయలేదు. ఆకస్మికంగా పిడుగులు పడినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి వర్గాన్ని కలుసుకొనేందుకు నరేంద్రమోడీ సిద్ధంగా వున్నారంటూ పిలుపు రావటం పొలోమంటూ జగన్‌ పరివారం ఢిల్లీ వెళ్లి కలవటం, రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ప్రకటించటం అంతా కల మాదిరి జరిగిపోయింది. అదీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను రప్పించేందుకు అమెరికా వీధులలో కాలి నడకన తిరుగుతున్న సమయంలో జరగటం అనేక మందికి మింగుడు పడని అంశం. చంద్రబాబు నాయుడే కాదు వెంకయ్య నాయుడు కూడా దేశంలో లేనపుడు అని ఎవరైనా ముక్తాయింపు ఇవ్వవచ్చు.

మిగతా పత్రికలు ఏమి రాసినా సాక్షి పత్రికలో వక్రీకరణకు అవకాశాలు వుండవు. అదేమి రాసిందో చూడండి

‘ మీడియా : ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా ?

జగన్‌ : రాష్ట్రపతి ఎన్నికలలో వారు పెట్టే అభ్యర్ధికి సంపూర&ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రిగారికి చెప్పాం.వైఎసనఆరన కాంగ్రెసు నుంచి సంపూర&ణ మద్దతు వుంటుంది. మాటల సందర&భంలో వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బిజెపికి సంబధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత వుందీ అంటే అది ప్రత్యేక హోదా విషయంలో, భూ సేకరణ బిల్లు విషయంలో మాత్రమే.అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. వుంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బిజెపిని వ్యతిరేేకించాం. ‘

దీనిని చదివిన తరువాత తెలుగులో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మరోసారి వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంగా వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు, మేం ఇస్తాం అంటే భవిష్యత్‌లో అని అర్ధం. మరోవైపున మేం మద్దతు ఇస్తామని చెప్పాం అన్నారు. ప్రధానితో కలిసేందుకు వెళ్లగానే పాహిమాం అంటూ కాళ్లమీద పడినట్లు, విధేయులమై వుంటామని అడగకుండానే మద్దతు ప్రకటించారని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది వారి అంతర్గత వ్యవహారం అనుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య ఏమంటే అనేక ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యేక హోదా గురించి కంటి తుడుపు విమర్శలు తప్ప పొలో మంటూ జెపికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఎలాగూ బిజెపి అభ్యర్ధి గెలుస్తారని చెబుతున్నారు. అంటే మీ మద్దతు ఆరోవేలు వంటిదే. మరో వైపు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధానికి విన్నవించిన వైసిపి పెద్దలు హోదా విషయంలో అడ్డంగా మాట తప్పి ఇచ్చేందుకు తిరస్కరించిన బిజెపి విషయంలో కనీసం తటస్థంగా వుంటామని చెప్పి వుంటే కాస్త బెట్టుగా వుండేది. కేసుల నుంచి బయట పడవేయించుకొనేందుకే ఆరాటపడ్డారనే విమర్శ వచ్చి వుండేది కాదు. అయినా బిజెపి అభ్యర్ధి రాష్ట్రపతి అయితే మన రాష్ట్రానికేమి ఒరుగుతుంది, దీనిలో బిజెపి మనకు చేసే మంచేమిటి ? హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ కూడా వట్టిస్తరి మంచినీళ్లే అని తేలిపోయింది. ఏ రకంగానూ మనకు ఒరిగేదేమీ లేనపుడు, గడచిన మూడు సంవత్సరాలలో చేసిందేమీ లేనపుడు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియనపుడు అడగకుండానే దాని అభ్యర్ధికి మద్దతు అని ప్రకటించటం ఎందుకు ?ఎవరిని మోసం చేద్దామని ? అలాగాక మేం బిజెపితో వూరేగదలచుకున్నాం, కేసుల మీద కేంద్ర సంస్ధలు చూసీచూడనట్లు, వీలైతే బయటపడవేయించమని కోరాం అని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది. నరేంద్రమోడీ అంటే అంటరాని వ్యక్తి కాదని 2013లోనే జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరువాత ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మోడీ-జగన్‌ కలయికపై తెలుగుదేశ వారి తొలి వ్యాఖ్యానాలు చూస్తే అనుకుంటున్నదొకటీ అయ్యింది ఒకటీ అన్నట్లుగా కనిపిస్తోంది. నూతన పరిస్థితిలో నూతన ఎత్తుగడలకు అగ్రనాయకత్వం బహుశా సమయం తీసుకోవచ్చు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని పక్కన పెట్టిన పెద్దలు- జగన్‌ దొందూ దొందే అయినపుడు ఒకరి గురించి మరొకరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.

ఇక రాష్ట్ర రాజకీయ అవనిక ఎలా వుండబోతోందో చూద్దాం. హోదా, పాకేజీలంటూ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మోసం చేసిన తెలుగుదేశం-బిజెపి కూటమి ఇతర అన్ని రంగాలలో కూడా విఫలబాటలోనే నడుస్తోంది. చెప్పుకొనేందుకు పట్టుమని పది మంచి పధకాలు కూడా లేవు.అందువలన ఈ కూటమి సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరగటం ఖాయం. 2014లో వారికి కలసి వచ్చిన సానుకూల అంశాలు వచ్చే ఎన్నికలలో వుండవు. అందువలన ఇప్పుడున్న రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తెలుగుదేశంతో పాటు బిజెపి కూడా బంగాళాఖాతంలో కలవటం ఖాయం. అందుకే తాము స్వంతంగా బలపడాలనే ఆరాటం బిజెపిలో రోజు రోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ లోగా ఒంటరిగా బిజెపి స్వంతంగా పోటీచేసే సీన్‌ లేదు. జనంలో గబ్బు పడుతున్న తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్‌ఆర్‌సిపితో వెళితే ఎలా వుంటుంది అని నాడి పరీక్షించేందుకే తొలి చర్యగా జగన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్‌తోనే వాటంగా వుంటే ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీని ఒదిలించుకుంటుంది. రాజకీయ పార్టీలకు సాకులు దొరక్కపోవు. పార్లమెంట్‌ సీట్లు తాను తీసుకొని అసెంబ్లీలో మెజారిటీ జగన్‌కు వదల వచ్చు. వరుస కుదిరితే సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయవచ్చు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలకు వాటి నేతల ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ పట్టవు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలు ఎలా స్పందిస్తారన్నది ఒక ప్రశ్న. కొంత ఓటింగ్‌ను అనివార్యంగా కోల్పోవాల్సి వుంటుంది. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుల విషయంలో బిజెపిని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన జగన్‌ ఒక వేళ సయోధ్య కుదిరితే వాటిని తూనాబొడ్డుబాలు అనటం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని తరువాత తమకు అర్ధమైందని తెలుగుదేశం సమర్ధించుకున్న మాదిరి జగన్‌ మాట మార్చలేరా ? భూ సేకరణ విషయంలో మడమ తిప్పలేరా ? ఎందరిని చూడలేదు !

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా లోకేష్‌ నాయకత్వాన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లోకేష్‌ను ముందు పెట్టి ఓడిపోతే చెప్పుకొనేందుకు వైసిపి రోజా చెప్పిన ముద్దపప్పు అనే ఒక సాకు అయినా వుంటుంది. అదే చంద్రబాబు నాయకత్వాన అయితే అలాంటిదేమీ వుండదు. బిజెపి-వైఎస్‌ఆర్‌సిపి అవకాశాలు కనిపిస్తే అసలు తెలుగుదేశంలో ఎందరు మిగులుతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఆయారాం గయారాంలకు కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పెద్ద పీట వేస్తున్నపుడు ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా చేరేవారు, చేర్చుకొనే వారూ ఎలాగూ వుంటారు. పార్టీ కార్యాలయాల ఆస్ధులను కబ్జా చేసేందుకు తెలుగుదేశం నామమాత్రంగా వుండవచ్చు.

అత్తారింటికి దారి చూసుకోవటంలో విజయం సాధించిన పవన కల్యాణ్‌ అధికారానికి దారి వెతుక్కోవటం అంత సులభం కాదు. సినిమా పేరును ముందుగా రిజిస్టరు చేసుకున్న మాదిరి పార్టీ పేరును నమోదు చేశారు తప్ప నిర్మాణం లేదు. జనతా మాదిరి అధికారానికి వచ్చిన తరువాత పార్టీ పెట్టిన లేదా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చిన ఎన్టీరామారావు నాటి రోజులు కావివి. గత ఎన్నికల్లో కాంగ్రెసు తాట తీసినట్లుగా ఈ ఎన్నికల్లో గతంలో బిజెపితో కలిసిన లేదా వచ్చే ఎన్నికలలో ఏదైనా కొత్తగా కలిస్తే వాటి తాటతీయాలి. ఈ నేపధ్యంలో వున్నంతలో వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేయటం తప్ప మరొక దారి లేదు. లేదా ఏదో ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని అందరూ అనుకుంటున్నట్లుగా దానికి లేదా వాటికి కాలీ&షట్లు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో నటించాల్సి వుంటుంది. వామపక్షాల విషయానికి వస్తే అవి గతం మాదిరి జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. వివిధ తరగతుల ప్రయోజనాల కోసం అవి తప్ప మిగతా ఏ పార్టీలు గత మూడు సంవత్సరాలలో వుద్యమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వుద్యమాలు ఆగలేదు. ఎన్నికలలో గెలవటానికి అవి మాత్రమే చాలవన్నది గత అనుభవం.గత ఎన్నికలలో వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అనే విమర్శలకు గురయ్యాయి. అందువలన అవి కొత్తగా పొగొట్టుకొనేదేమీ లేదు. కమ్యూనిస్టులకు దగ్గరదారులు లేవు, తెలియవు కనుక తమ సైద్ధాంతిక నిబద్దతకు కట్టుబడి, తమతో కలసి వచ్చే శక్తులు, వ్యక్తులతో కలసి మరోసారి ఒంటరి పోరాటం చేయటం తప్ప పెను మార్పులు వచ్చే సూచనలు ఇప్పటికైతే లేవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చంద్రబాబు-వైఎస్‌ జగన్‌ తిట్ల దండకంలో ఎవరిది తప్పు, ఒప్పు

05 Sunday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

   ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటంపై రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కవి చౌడప్పకు సమాజం మీద కోపం వచ్చి తిట్లదండకం రచించారు. మరి ఈ పార్టీల వారికి ఏమి వచ్చి అందుకు పాల్పడుతున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ప్రత్యేకించి తెలుగుదేశం-వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు కొన్ని సార్లు సభ్యతగా మాట్లాడినపుడు మాట్లాడుతున్నది మనవారే అని వారి అభిమానులకే అనుమానం వస్తుంది, నీరసపడిపోతారు. రాజకీయాలంటే తిట్లు, నిందలుగా తయారు చేసి కార్యకర్తలకు, జనానికి గంజాయి దమ్ము వంటి కిక్కు ఎక్కించారు. అది లేకపోతే డీలా పడిపోతారు. దొందూ దొందే అన్నట్లు ఎవరూ తక్కువ కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తిట్లకు దిగటం అంటేనే విమర్శలలో పసలేక వాటిని ఆశ్రయిస్తున్నారని లేదా అసలు విషయాల నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారని అనుకోవాలి.

    ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని అది బాగాలేదంటే చీపుర్లతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటం కొంత మందికి వినోదంగా మరికొందరికి అభ్యంతరంగా కనిపిస్తోంది. అదే చంద్రబాబు , తెలుగుదేశం మంత్రులు, నేతలు జగన్‌ను నేరస్థుడు, దొంగ వంటి ఎన్నో పద ప్రయోగాలు చేసినపుడు కూడా పైన చెప్పిందే జరిగింది. అందువలన ఎవరు ఎవరిని తప్పుపట్టాలి? వారికి వారు కూర్చుని నిర్ధారించుకుంటే తప్ప దీనిని ఎవరు ముందు ప్రారంభించారని తేల్చటం కూడా కష్టమే. ఒక ప్రముఖుడిని చెప్పుతో, చీపుర్లతో కొట్టాలి అని విమర్శించటం చట్టవిరుద్దమా, సభ్య సమాజంలో పలకాల్సిన మాట కాదా ? కానీ ఏ నేరం రుజుకు కాకుండానే ఒకరిని నేరస్ధుడు అని వర్ణించటం చట్ట బద్దమా ? జగన్‌ కొట్టాలి అన్నారు, కానీ తెలుగు తమ్ముళ్లు అనంతపురం జిల్లాలో ఏకంగా చెప్పులతో దాడి చేసి కొట్టి చూపించారు. ఏది మంచో ఏది చెడో ఎవరూ వినే పరిస్థితి లేదు. ఒక అసహ్యకర పరిస్థితిని రెండు పార్టీలూ సృష్టించాయన్నది మాత్రం స్పష్టం. దాని నుంచి వెనక్కు తగ్గే చైతన్యం, సంస్కారాన్ని ఎవరు ముందు ప్రదర్శిస్తారో చూడాలి.

    చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలతో కలసి సంఖ్యా పరంగా ఎంతో బలంగా కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయంగా ఎంతో బలహీనపడి పోయారు.ఎప్పుడైతే కేంద్రం నుంచి ఆశించింది రాకపోవటంతో శాశ్వత రాజధానికి అట్టహాసంగా శంకుస్థాపన చేసి తాత్కాలిక రాజధానిపేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను తగలేస్తున్నారో అప్పుడే చంద్రబాబు బలహీనత వెల్లడైంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వూరించిన పాకేజీకీ కూడా గతి లేకపోయింది. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని కనీసం సానుకూల విమర్శలు కూడా చంద్రబాబు చేయలేకపోయారు. తన ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరుగా జారిపోతుంటే జగన్‌ నిస్సహాయుడై గుడ్లప్పగించి చూస్తూ సంఖ్యా పరంగా బలహీనపడిపోయారు. పోయినవారు పోగా ఇంకా ఎంత మంది మిగులుతారన్నది ప్రశ్న. అయితే ఇదే సమయంలో చంద్రబాబు తన వాగ్దానాలు, విజన్‌ రంగుల కలలు మసకబారి పోయేకొద్దీ ఆ బలహీనతను ఆధారం చేసుకొని రాజకీయంగా దాడి చేయటానికి రాబోయే రోజుల్లో జగన్‌కు ఇంకా అవకాశాలు పెరగవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ చేయకుండా చంద్రబాబుకే పరిమితమైతే జనం మెచ్చరని, అనుమానిస్తారని జగన్‌ గుర్తించాలి.

    బిజెపి నేతలు ఒకవైపు తమ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశమంతటా సభలు, ప్రదర్శనలు పెడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విభజన కారణంగా తాము నష్టపోయామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్‌నిర్మాణం పేరుతో దీక్షలను పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విజయాలు దానికి కనిపించే స్ధితి లేదు.అలాగే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసే స్ధితిలో బిజెపి నేతలూ లేరు. ఈ తరుణంలో కోరని వరంలా జగన్‌ విమర్శలు తెలుగుదేశం పార్టీ వారి నోళ్లకు పని చెప్పి వుత్సాహాన్ని నింపాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో చేశానని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె స్ధానాన్ని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అలంకరించారు. రైల్వే ప్రత్యేక జోన్‌ ఎలాగూ ఇచ్చే, వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు, కనీసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న రైల్వే ప్రాజెక్టులలో రానున్న మూడు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి అయినా మద్దతు ఇచ్చి అందలం ఎక్కించినందుకు చంద్రబాబు జన్మ ధన్యమైనటే.్ల .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: