• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: YS jagan

జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన్‌ ఫిర్యాదు-పర్యవసానాలేమిటి ?

11 Sunday Oct 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Chief Justice of India S A Bobde, SC judge NV Ramana, YS jagan


ఎం కోటేశ్వరరావు


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయటం కొత్త కాదు. అయితే చేసిన ఫిర్యాదును ఒక ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేయటం దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ద్వితీయ స్ధానంలో ఉండి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.


న్యాయమూర్తుల మీద గతంలో కూడా అధికారంలో ఉన్న వారు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ విధంగా వాటిని బహిరంగపరచలేదు. పదోన్నతి వరుసలో ఉన్న న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయటం ఒక ధోరణిగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే కొద్ది వారాల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని తరువాత ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తన మీద, అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు కోర్టు విచారణల వరకు వెళ్లాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళా జడ్జి చేసిన ఫిర్యాదు విచారణ సమయంలో జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా ప్రమోషన్‌ వరుసలో ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు కోర్టులో లేదా పోలీస్‌ సేష్టన్‌లో దాఖలు కాలేదు. గతంలో న్యాయమూర్తులకు రాసిన లేఖలను, పత్రికా వార్తల మీద స్పందించి విచారణకు ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారు అన్నది పెద్ద ప్రశ్న.


మధ్య ప్రదేశ్‌ జిల్లా జడ్జిపై వచ్చిన ఆరోపణల కేసులో ఎవరైనా పదోన్నతి పొందుతారు అనగానే మన వ్యవస్దలో అన్ని రకాల అంశాలు ప్రారంభం అవుతాయి. ఫిర్యాదులు చేస్తారు, పత్రికల్లో వార్తలు కనిపిస్తాయి, అరే ఇతను అంత చెడ్డవాడా అని ఆకస్మికంగా జనాలు గుర్తు చేసుకుంటారు అని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఆ జిల్లా జడ్జి ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్‌ అవకాశాలున్నాయని అనుకుంటున్న సమయంలో అతని మీద 2018లో పని స్ధలంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫిర్యాదు చేసింది కూడా మరొక జడ్జి కావటం గమనార్హం. జిల్లా ప్రధాన జడ్జిని మరొక జిల్లాకు బదిలీ చేశారు. అతని మీద వచ్చిన ఫిర్యాదులను విచారించిన అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తన మీద చర్యను నిలిపివేయించాలని కోరుతూ సదరు న్యాయమూర్తిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు సలహాయిచ్చింది. అయితే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవటంతో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయకూడనే నిబంధనలేవీ లేవు. ఎవరి మీద అయినా ఫిర్యాదులు చేయవచ్చు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి వాటి మీద విచారణ జరిపే పరిస్ధితి వస్తే కొన్ని రక్షణలు ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ మీద సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే 2014లో రాజస్ధాన్‌ గవర్నర్‌గా నియమించటంతో విచారణ నిలిపివేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత విచారణకు పిలవ వచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.


ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసింది ఫిర్యాదు మాత్రమే. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశమే. ప్రతి కేసులో ఒకరు ఓడిపోతారు, రెండవ వారు గెలుస్తారు. ఓడిన వారు న్యాయమూర్తి వల్లనే తనకు అన్యాయం జరిగిందని విమర్శ లేదా ఆరోపణ చేయవచ్చు. అది ఇతర న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుంది. చివరకు న్యాయవ్యవస్ధ మీదనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తూ బ్రిటీష్‌ వారి హయాంలోనే చట్టాలు చేశారు.
న్యాయమూర్తిగా వ్యవహరించే వారు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయవచ్చు తప్ప వారి మీద చర్యలు తీసుకొనేందుకు వీలు లేకుండా రక్షణ కల్పించారు. అయితే కొన్ని ఉదంతాలలో న్యాయమూర్తులు తప్పు చేసినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అవి వాస్తవమే అని తేలిన సందర్భాలలో వారికి రక్షణ వర్తించదు అన్న తీర్పులు వచ్చాయి. ఒక సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఒక వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధానికి ఇచ్చిన ఉత్తరువు నిర్లక్ష్యపూరితంగా ఉందని భావించిన సుప్రీం కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఐదువేల రూపాయలు ఇవ్వాలన్న తీర్పును సమర్ధించింది. మరో కేసులో ఒక మెజిస్ట్రేట్‌ తన బుర్రను ఉపయోగించకుండా ఒక వారంట్‌ మీద సంతకం చేయటం అక్రమం అని బాధితుడు సెషన్స్‌ కోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి తప్పు చేశారని బాధితుడికి ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. మరో కేసులో ఆరోపణలు చేసిన న్యాయవాది ఒక రౌడీ గూండా, జూదగాడని ఒక మెజిస్ట్రేట్‌ స్వయంగా కోర్టులో చెప్పటం విధి నిర్వహణలో భాగం కాదని అందువలన అతని మీద చర్య తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మరో కేసులో ఒక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ విధి నిర్వహణలో ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాస్తూ కాపీ చేస్తూ దొరికి పోయాడు. తాను న్యాయాధికారిని కనుక తనమీద చర్య తీసుకోరాదని వాదించటాన్ని కోర్టు అంగీకరించలేదు.


ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు వ్యవహరించాలి. ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించాలి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపణలతో లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదంతాలు గతంలో లేవు లేదా రహస్యంగా చేసిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తి మీద విచారణకు ఆదేశిస్తారా లేక ఫిర్యాదుల్లో పసలేదని, బహిరంగంగా ప్రకటించి ఒక న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదుదారు మీద చర్య తీసుకుంటారా ?


ఒక వేళ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తొలగింపు వంటి చర్యలు తీసుకోవాల్సి రాష్ట్రపతి ఉత్తరువు జారీ చేయాలి. దానికి ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు చర్యలకు ఆమోదం తెలపాలి. ఓటింగ్‌ సమయంలో మూడింట రెండువంతుల మంది సభ్యులు హాజరు ఉండాలి. న్యాయమూర్తుల తీరుతెన్నులపై చర్చ జరపకూడదు. గతంలో జస్టిస్‌ రామస్వామి మీద చర్యకు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ లేక ప్రతిపాదన వీగిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చర్యను ప్రతిపాదన దశలోనే రాజ్యసభలో తిరస్కరించి అసలు ఓటింగ్‌ వరకే రానివ్వలేదు.


సమాజ సరళి ప్రతి వారి మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముందుకు వచ్చిన ఈ సమస్య మన వ్యవస్దలో ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్నట్లు భావిస్తున్న, చెవులు కొరుకుతున్న కుమ్ములాటలను బహిర్గతం చేసింది. దీని పర్యవసానాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు అయినా చేయవచ్చు. జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం మరింత సడలటానికే దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి కేసును కుల, ప్రభావాల ప్రాతిపదికన జనం చూసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాన్నే పాలకులు కోరుకుంటున్నారా ?

కోర్టుల తీరుతెన్నుల మీద సీనియర్‌ న్యాయవాది నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పుల తీరుతెన్నులపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కానప్పటికీ సుప్రీం కోర్టు నేరంగా పరిగణించింది. ఇప్పుడు ప్రత్యేకించి ఒక న్యాయమూర్తి మీద జగన్‌ ఫిర్యాదు చేశారు. రాసిన లేఖకు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చేవరకు ఆగి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావానికి లోనై తీర్పులు ఇస్తున్నారని ఆరోపించటం ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్‌ చేయటమే అంటున్నవారు లేకపోలేదు. తీర్పులను విమర్శించ వచ్చు తప్ప న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించిన వారు దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే వారి మీదనే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించటం ఒకటైతే, వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేశారని ఆరోపించటం మరొకటి. ఈ రెండింటికీ తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి పంపటమే కాదు, బహిరంగపరిచారు. ఆస్తులు ఉండటం తప్పు కాదు, వాటిని ఎలా సంపాదించారనేది సమస్య. ఆదాయానికి మించి సంపాదిస్తే ఆదాయ వనరులను తెలియచేయాల్సి ఉంటుంది. వీగిపోయిన లేదా గెలిచిన ప్రతి కేసు వెనుక ఎవరో ఒకరు న్యాయమూర్తులను ప్రభావితం చేశారని ఆరోపించితే రాబోయే రోజుల్లో కేసులు నమోదైతే వాటి మీద ప్రభావం పడకుండా ఉంటుందా ? సుప్రీం కోర్టులో కూడా కేసులు వీగిపోతే అక్కడి న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారా ? వీటికి అంతమెక్కడ ? ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నీ శేష ప్రశ్నలే.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న కేసుల మీద, న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే. పార్టీలు, మీడియా వ్యాఖ్యాతలు చేస్తున్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని గతంలో విమర్శించిన వైసిపి నేతలు ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తున్నారని రోడ్డెక్కారు. గతంలో 16నెలల పాటు జైల్లో ఉన్న జగన్‌ బెయిలు పొందేందుకు నాటి యుపిఏ ప్రభుత్వ సహకారాన్ని పొందారంటూ ఒక వ్యాఖ్యాత పలికారు. ఇప్పుడు కేసులు తుది విచారణకు వస్తున్నందున తిరిగి కేంద్ర సాయం కావాల్సి వచ్చిందని, మోడీ-షా ద్వయం సహకరిస్తారనే నమ్మకం లేకపోయినా సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా రాశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయమూర్తులను ప్రభావితం చేసి బెయిల్‌ ఇప్పించారని సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్న వారికి అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నపుడు వైసిపి ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు సైతం అలా ప్రభావితం చేస్తారనేందుకు ఆస్కారం లేదా ? జస్టిస్‌ రమణ పూర్వాశ్రమంలో న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీలో పని చేయలేదా కేసులను చూడలేదా ? ఆ పరిచయంతో చంద్రబాబు ప్రభావితం చేసి ఉండవచ్చని జనం అనుకొనేందుకు ఆస్కారం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగనాంధ్రప్రదేశ్‌లో అప్పు చేసి పప్పుకూడు !

17 Wednesday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Andhra Pradesh budget 2020-21, Andhra Pradesh Debt, YS jagan, YS Jagan first year regime


ఎం కోటేశ్వరరావు
అవును జగన్మోహనరెడ్డే ఆంధ్రప్రదేశ్‌-ఆంధ్రప్రదేశ్‌ అంటేనే జగన్మోహనరెడ్డి అన్నట్లుగా అధికారపక్షం భజన చేస్తున్నపుడు అన్నింటికీ బాధ్యుడు జగనే కదా ! మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన రెండవ బడ్జెట్‌ విన్యాసాలు ప్రదర్శించారు. ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో అడుగడుగునా జగన్నామ స్పరణం చేశారు మరి. గతేడాది రెండు లక్షల 27వేల 975 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దాన్ని రూ.1,74,757 కోట్లకు సవరించారు. అంటే 53వేల కోట్ల రూపాయల కోత పెట్టారు. ఇది కూడా జగన్‌ అనుమతి లేకుండా చేసేంత స్వతంత్ర ప్రతిపత్తి ఆర్ధిక మంత్రికి ఉందనుకోవటం లేదు. గత ఏడాది కాలంలో నవరత్నాలకు, మరికొన్ని మరకతాలు తోడయ్యాయి తప్ప తగ్గలేదు. మరి అన్ని వేల కోట్ల రూపాయలను ఏ రంగాలకు తగ్గించినట్లు ? నవరత్నాలకు తగ్గించిన దాఖల్లాలవు కనుక కచ్చితంగా అభివృద్ధి పనులకే అని వేరే చెప్పాల్సిన పనేముంది. మరో విధంగా చెప్పాలంటే గతేడాది కాలంలో ఎంత అప్పయితే చేశారో అంతమేరకు అభివృద్ది పనులకు కోతలు పెట్టారు. తెచ్చిన అప్పును నవరత్నాలకు వినియోగించారు. కొందరు దీన్నే అప్పుచేసి పప్పుకూడు అంటున్నారు.
చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వం తొలి ఏడాది దాన్నే రెండులక్షల 28వేల కోట్లకు పెంచి లక్షా 74వేల కోట్లకు(53వేల కోట్లు) కుదించింది. ఇది చంద్రబాబు కంటే ఎక్కువా తక్కువా ? జగన్‌ గారి ఇంగ్లీషు మీడియం పిల్లలు కూడా మోర్‌ దేన్‌ చంద్రబాబు సర్‌ (చంద్రబాబు కంటే ఎక్కువే అండీ) అని కచ్చితంగా చెబుతారు. వారిని పచ్చ పిల్లలు అనకండి, చాల బాగోదు.
చంద్రబాబు నాయుడు బిజెపితో అంటకాగారు కనుక రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడలేని బలహీనతకు లోనయ్యారు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టలేకపోయారు. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి అడిగేందుకు ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. చివరి క్షణంలో మంత్రుల చెయ్యి ఖాళీ లేదు రావద్దు అని వర్తమానం పంపారని వార్తలు. అసలు రమ్మనటమెందుకు ? ఖాళీగా లేమని వద్దనటమెందుకు ? తమాషాగా ఉందా ? ఇది వ్యక్తిగతంగా జగన్‌కు ఏమిటన్నది ప్రధానం కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రికి జరిగిన అవమానంగానే పరిగణించాలి.
తెలుగుదేశం సర్కార్‌ చివరి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు కాగా వచ్చిందని చూపిన మొత్తం 21,876 కోట్లు మాత్రమే. వర్తమాన సంవత్సరంలో వస్తుందని చూపిన మొత్తం 53,175 కోట్లు. రెండేళ్ల తీరు తెన్నులు చూస్తే రాష్ట్రం రావాలంటున్న మొత్తం రాదని తేలిపోయింది. అసలు ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలా లేదా ? బిజెపి నేతలు తమ పలుకుబడిని ఉపయోగించలేరా ? వారికి బాధ్యత లేదా ? జగన్‌ ఎలాగూ గట్టిగా అడగలేరు. చంద్రబాబు నాయుడి సంగతి సరే సరి. అలాంటపుడు అంత మొత్తాలను బడ్జెట్‌లో చూపటమెందుకు ? వస్తుందో రాదో ఖరారు చేసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకీ దోబూచులాట ?
కీలకమైన సాగునీటి రంగానికి జగన్‌ తొలి బడ్జెట్‌లో 13,139 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు చేసింది 5,345 కోట్లు మాత్రమే. రెండవ బడ్జెట్లో కేటాయింపు రూ. 11,805 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపుల మేరకైనా ఖర్చు చేయకుండా, పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. మరికొన్ని ముఖ్యమైన రంగాల కేటాయింపుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూడండి.( కేటాయింపులు కోట్ల రూపాయల్లో )
శాఖ 2019-20 ప్రతిపాదన —సవరణ —–2020-21ప్రతిపాదన——- శాతాలలో కోత
గ్రామీణాభివృద్ది 31,564 —- 11,661 — 16,710 —– 47.10
వ్య-సహకారం 18,327 — 5,986 —- 11,891 —- 35.12
పశు సంవర్ధక 1912 —- 720 — 1,279 —– 33.08
పరిశ్రమలు, వాణి 3,416 —- 852 —- 2,705 —- 20.82
సెకండరీ విద్య 29,772—- 17,971 — 22,604 —– 24.08
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం, గ్రామీణ రంగాలు వాటికి కేటాయింపులు ఎంత పెద్దమొత్తంలో కోత పెట్టారో చూస్తే రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారో అర్ధం అవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. సంక్షేమ చర్యలను ఎవరూ తప్పుపట్టటం లేదు. అవి ఉపశమనం కలిగించే చర్యలే తప్ప సంపదలను ఉత్పత్తి చేసేవి కాదు. అందువలన సమతూకం తప్పితే సంక్షేమ పధకాలను పొందిన పేదల జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి మాదిరి అక్కడే ఉంటాయి తప్ప సంక్షేమ చర్యలతో మెరుగుపడిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.
ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయం గమనంలో ఉంచుకొని గానీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది 7,271 కోట్లు కేటాయించి 18,986 కోట్లు ఖర్చు చేసి ఈ బడ్జెట్‌లో 26,934 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా మైనారిటీల సంక్షేమానికి 952 కోట్ల కేటాయింపు, 1,562 కోట్ల ఖర్చు, కొత్తగా 2,055 కోట్లు ప్రతిపాదించారు.
కరోనా వైరస్‌ దేశంలో ఒక అంశాన్ని ముందుకు తెచ్చింది. ప్రజారోగ్య వ్యవస్ధను నిర్లక్ష్యం చేస్తే అలాంటి మహమ్మారులు వచ్చినపుడు ప్రయివేటు రంగం చేతులెత్తివేస్తుందని తేలిపోయింది. అందువలన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రుల స్ధాయిని మెరుగుపరచాల్సి ఉంది. గతేడాది రూ.11,399 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 7,408 కోట్లు మాత్రమే ఈ ఏడాది కేటాయింపు 11,419 కోట్లు మాత్రమే చూపారు.
వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి వంటి ఆర్ధిక సేవల రంగాలకు గత బడ్జెట్‌లో 37.8 శాతం కేటాయిస్తే తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని 27.39కి కోత పెట్టారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి సామాజిక సేవలకు 33 నుంచి 43శాతానికి పెంచారు. వీటిలో సాధారణ విద్యకు 14.38శాతంగా ఉన్న మొత్తాన్ని 11.21శాతానికి కోత పెట్టారు. సంక్షేమ చర్యల వాటాను 6.2 నుంచి 18.44శాతానికి పెంచారు. కరోనా వైరస్‌ కారణంగా పారిశుధ్య కార్మికుల సేవల గురించి పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. బడ్జెట్‌లో మంచినీటి సరఫరా, పారిశుధ్య బడ్జెట్‌ను 2234కోట్ల నుంచి 1644 కోట్లకు తగ్గించటాన్ని ఏమనాలి ?
తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 60 వేల కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అల్లుడికి బుద్ధి చెప్పి మామ తప్పు చేసినట్లుగా లేదూ ఇది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచారు. వచ్చే ఏడాదికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. అంటే మొత్తం నాలుగు లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గత నాలుగు సంవత్సరాలుగా 27.92శాతంగా ఉన్న అప్పు వచ్చే ఏడాదికి చివరికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. అందుకే జగనాంధ్ర అప్పుచేసి పప్పు కూడు ఆంధ్రగా మారబోతోందని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !

14 Sunday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

instead of corona, tdp, ycp jagan, YS jagan, ys jagan targeting opposition

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !
ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొద్ది వారాల క్రితం వ్యాఖ్యానించారు. ఆ వ్యాధి తీవ్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో అసందర్భ వ్యాఖ్య చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు కేసులు మరింత ఆందోళనకరంగా పెరుగుతున్నపుడు బతికిన వారు బతుకుతారు, చచ్చేవారిని ఎలాగూ ఆపలేము, మిగతా సంగతులు చూసుకుందాం అన్నట్లుగా పరిస్ధితి తయారౌతోందా అనిపిస్తోంది.
కోర్టుల్లో తగులుతున్న ఎదురు దెబ్బలు తమ ప్రజాపునాదిని దెబ్బతీసేవిగా లేవనే నిర్దారణకు వైసిపి నాయకత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. జనం కులాల వారీ సమీకరణ అయినపుడు, భ్రమల్లో ఉన్నపుడు నిజమే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే కేసులు కోర్టుల్లో కొట్టి వేసినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతిపక్ష నేతలను కొంత కాలమైనా జైలు పాలు చేయాలనే ధోరణితో వైసిపి నాయకత్వం వున్నట్లు జనం అనుకుంటున్నారు. తెలుగుదేశం, వైసిపి, తెరాస వంటి ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వమైనా, అనుచరులైనా అంతా ఒకరే. తెలుగుదేశంలో అంతా చంద్రబాబే, వైసిపిలో సర్వం జగన్మయం, ఏకోపాసన.
తెలుగుదేశం నేతలు పైకి బింకాలు పోవచ్చుగానీ మానసికంగా తామూ ఏదో ఒకనాడు ఏదో ఒక కేసులో శిక్షగా కాకున్నా కస్టడీలో అయినా ఏడు ఊచలు లెక్కపెట్టక తప్పదని చాలా మంది లోలోపల అనుకుంటూ ఉండాలి. అధికార రాజకీయం అన్న తరువాత దేన్నయినా భరించాలి మరి. ఏ కారణంతో జైలుకు వెళ్లి వచ్చినా మంచి చెడ్డలను చూడకుండా నీరాజనాలు పట్టే జనాలు ఎలాగూ ఉన్నారని నిర్ధారణ అయింది కనుక ఎవరూ జైలు గురించి ఆందోళనపడాల్సిన పనిలేదు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళనల్లా తమ కార్యకర్తలు, మద్దతుదార్లను ఎంత మేరకు నిలుపుకోగలమన్నదే.
కరోనా విషయంలో చేయాల్సిందేదో చేస్తున్నాం, ఇప్పుడు అవినీతి అంతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జనానికి కనిపించేందుకు, రాజకీయ రచ్చను కొనసాగించేందుకు వైసిపి పూనుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఉన్న సొమ్మును సంక్షేమ పధకాలకు ఖర్చు చేయటం, అభివృద్ధి పనులకు నిధుల లేమి అన్నది ఒక వాస్తవం. ఏడాది పూర్తి అవుతున్న సమయంలో కొంత మంది ఎంఎల్‌ఏలు, ఎంపీలలో వెల్లడైన అసమ్మతి అధికార పార్టీలో జరుగుతున్న మధనానికి చిహ్నం. అమృతం వస్తుందా హాలా హలం వస్తుందా ? దేన్ని ఎవరికి ఇస్తారు అన్నది వెండి తెరమీద చూడాల్సిందే.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొనేందుకు వినసొంపుగానే ఉంటుంది. అనేక ఉదంతాలలో కేసులు బనాయించటం తప్ప అంగుళం కూడా ముందుకు పోని స్ధితి తెలిసిందే. అంటే అవసరమైనపుడు వాటిని బయటకు తీస్తారు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఏగా ఉన్న కె అచ్చన్నాయుడిని అరెస్టు చేయటాన్ని తప్పు పట్టనవసరం లేదుగానీ, తీరు కక్షపూరితంగా కనిపిస్తోంది. మైనర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చన్నాయుడికి స్వస్ధత చేకూరే వరకు, అంతగా అవసరం అయితే కొద్ది రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉంచి తరువాత చట్టపరంగా కోర్టుకు అప్పగించవచ్చు. దానికి బదులు అరెస్టు చేసి గంటల కొద్దీ తిప్పిన తీరుతో ఆపరేషన్‌ గాయం పెద్దది కావటంతో చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. మరోమారు ఆపరేషన్‌ అవసరం లేదు అని వైద్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి స్ధితిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాల్సినంత అత్యవసరం ఆ కేసులో ఉందా అంటే నిస్సందేహంగా లేదు.
అనంతపురం జిల్లా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం నేత జెసి ప్రభాకర రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని మోటారు వాహనాల కొనుగోలు అక్రమాల కేసులో అరెస్టు చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరవుతానని చెప్పినప్పటికీ పిలవ కుండా కావాలని అరెస్టు చేశారని ఆయన చెబుతున్నారు.దానిలో వాస్తవం ఏమిటో ఎవరూ నిర్ధారణ చేయలేరు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఉన్న ప్రతి నిందితుడు న్యాయస్ధానాల్లో రుజువయ్యేవరకు నిర్ధోషినని, కావాలని ఇరికించారనే చెబుతాడు.అప్రూవర్‌లుగా మారిన ఉదంతాలలో తప్ప ఇంతవరకు ఏ నేరగాడూ లేదా నేరగత్తె స్వచ్చందంగా నేరాన్ని అంగీకరించిన ఉదంతం మనకు సాధారణంగా కనపడదు. ప్రస్తుతం అనేక కేసులలో ముద్దాయిలుగా ఉన్న వారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి వాదనలు ఏమిటో అందరికీ తెలిసిందే.
ఇఎస్‌ఐ అక్రమాల కేసుల్లో మంత్రిగా అచ్చెన్నాయుడి అవినీతి, మోటారు వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జెసి కుటుంబ సభ్యుల అవినీతి నిగ్గు తేలేవరకు వారంతా నిందితులే.అవసరమైతే జైలుకు పోవాల్సిందే. పదహారు నెలల పాటు జైల్లో ఉండి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టుతో చెప్పించుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో వైసిపి నేతలు జైలు పాలయినపుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇప్పుడు తమ నేతల అరెస్టుల గురించి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేయటం సహజమే. గత ఐదు సంవత్సరాల పాలనలో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసులు దాఖలైతే మిగిలిన వారు కూడా రిమాండ్‌ లేదా జైలు పాలు కావచ్చన్న భయంలో వారిలో ఉండటం సహజం. తమ ఏలుబడిలో రాజకీయ ప్రత్యర్ధులను, సమస్యల మీద ఉద్యమించినందుకు తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను ఎందరిని జైలు పాలు లేదా కస్టడీలకు పంపిందీ గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం నేతలకు వారి మద్దతుదార్లకు కాస్త ఊరట కలుగుతుందేమో !
గతంలో కూడా అధికారంలో ఉన్నవారి మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయటం తెలిసిందే. అయితే వారు అధికారానికి వచ్చిన తరువాత వాటిని మరచిపోయినట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించే ధోరణులు ప్రబలిన కారణంగా అంతే స్ధాయిలో కక్షలూ పెరిగాయి. ప్రతిపక్షంలో ఉండి తమను ఎదిరించిన వారిని ఆర్ధికంగా దెబ్బతీయటం, రాజకీయంగా అవమానించటం అనే కక్షపూరిత ధోరణులు దక్షిణాదిలో తొలుత తమిళనాడులో ప్రారంభమయ్యాయి.అధికార రాజకీయ కక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో,నీచ స్ధాయికి దిగజారుతాయో మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో చూశాము. ఎంజిఆర్‌ మరణించినపుడు మృతదేహం దగ్గర ఆమెపై జరిగిన దాడి, గెంటివేత ఒకటైతే ఆ తరువాత రెండు సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న ఆమెపై దాడి, చీరలాగివేసి అవమానించిన తీరు ఎరిగినదే. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి పరిణామాలను చూడాల్సి ఉంటుందో !
ఇలాంటి కక్ష, దెబ్బతీసే ధోరణులు పపంచమంతటా ఉన్నాయి. అందువలన తమ నేతకు కక్ష సాధించే లక్షణం లేదని ఎవరైనా వైసిపి కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ముందే చెప్పుకున్నట్లు కేసుల్లో అరెస్టు చేయటం వేరు. అరెస్టు చేసిన తీరు విపరీతంగా ఉన్నపుడు దానిలో కక్ష పాలు లేదని ఎలా చెప్పగలరు ? అచ్చెన్నాయుడిని అరెస్టు చేయదలచుకుంటే సాధారణంగానే ఆపని చేయవచ్చు గానీ అర్దరాత్రి అంత హైడ్రామా ఆడాల్సిన పనిలేదు. సినిమాల్లో పేరు మోసిన బందిపోటు, గజదొంగలు, లేదా స్మగ్లర్లను పట్టుకొనే మాదిరి దృశ్యాలకు తెరతీయాల్సినపని లేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇప్పటికే బనాయించిన కేసులు,రాబోయే కేసుల గురించి జనానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సాధారణ అంశంగానే తీసుకుంటున్నారు. అందుకే మీడియా ముందు నేతలు గుండెలు బాదుకుంటున్నా అవన్నీ మామూలే అనుకుంటున్నారు. తెలుగుదేశం పాలనలో లేదా అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరగలేదని ఎవరూ చెప్పటం లేదు సమర్ధించటమూ లేదు. అందుకు బాధ్యులైన వారు రాజకీయ నేతలైనా, వారికి సహకరించి వాటా పొందిన ఉన్నత అధికారులైనా సరే విచారణ, కేసులను ఎదుర్కోవాల్సిందే.
రాజకీయ నేతలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి లేకపోతే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉదంతం తెలియచేస్తోంది. మాజీ ఎంఎల్‌ఏ పిల్లి అనంత లక్ష్మి కుమారుడికి యనమల స్వగ్రామంలో రెండవ వివాహం చేసేందుకు ఏర్పాటు చేయగా దానికి ఎనమలతో పాటు సోదరుడు కృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. అది తెలిసిన అనంత లక్ష్మి కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని నిలిపివేయించింది. ఆమె దళిత యువతి, తన భర్తకు రెండవ వివాహం చేయించేందుకు ప్రయత్నించారని, తనను బెదిరించారని ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార చట్టం కింద కేసుదాఖలు చేసింది. ఈ ఉదంతంలో పాలకపార్టీ పెద్దల ప్రమేయంతో ఆ యువతి కేసు దాఖలు చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పుకోవచ్చు. ఒక వివాహంలో సమస్యలు వచ్చి విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేయటం, దానికి హాజరు కావటం ఒక అక్రమాన్ని ప్రోత్సహించటమే అవుతుంది. మాకు వివరాలు తెలియదు అంటే చట్టం అంగీకరించదు.
ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న పాలకులు కొత్తగా ప్రారంభించినవేమీ కాదు. అంతకు ముందే నాంది పలికారు. దానిలో భాగమే ప్రతి పార్టీలో గెలిచిన నేతలను అధికారపక్షం వైపు ఆకర్షించటం లేదా పరోక్షంగా బెదిరించటం అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే అవి పరాకాష్టకు చేరాయి. రానున్న రోజుల్లో సాధారణం అవుతాయి. ఎన్నికల్లో డబ్బు అన్నది ప్రధాన పాత్ర వహిస్తున్నందున ఓటర్లు కూడా నేతల నైతిక ప్రవర్తనకు బదులు జేబులను చూస్తున్నారు.ఇది పార్టీలు మారేందుకు, అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరేందుకు రాజకీయనేతలకు మరింత వెసులుబాటు కలిగిస్తోంది.
గత పాలకుల అవినీతిపై కేసులు బనాయించటం, జైలు పాలు చేయటం రాబోయే రోజుల్లో ఏ పర్యవసానాలకు దారి తీస్తుంది ? అధికారపక్షంలో ఉన్నవారి అవినీతి మీద ప్రతిపక్షం నిరంతరం ఒక కన్నువేసి ఉంచుతుంది. ఎప్పటికప్పుడు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అధికారగణం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారపక్షం తన అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొత్త పుంతలు తొక్కిస్తుంది.
వైఎస్‌ జగన్మోహనరెడ్డి, అనుయాయుల మీద ఉన్న కేసులు ఆశ్రిత పెట్టుబడిదారుల నుంచి లబ్దిపొందారన్న స్వభావం కలిగినవి. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొందరు పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలకు అనుచిత లబ్ది కలిగిస్తే దానికి ప్రతిగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ప్రతి లబ్ది కలిగించారన్నవి, మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎదుర్కొనేవి స్వయంగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినవి. ఏవైనా చిన్నవా, పెద్దవా అన్నది కాదు. అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నదే అసలు సమస్య. కోట్లాది రూపాయలను అక్రమంగా వెనుకేసుకొని జైలుపాలైతే కుటుంబ సభ్యులు వాటిని దర్జాగా అనుభవిస్తారు. అలాంటి ఘరానా పెద్దలు జైల్లో ఉన్నా వారి భోగాలకు కొదవ ఉండదు. కొన్నేండ్లు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన సమాజంలో గౌరవానికి ఎలాంటి ఢోకా ఉండటం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారికి సంబంధించి ఆస్తుపాస్తులేవైనా ఉంటే వాటిని జప్తుచేసి ఎంతో కొంత రాబట్టేందుకు అవకాశం ఉంది. అవినీతి కేసులో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినా, లేదా కొన్ని కంపెనీలు, వ్యక్తులకు కట్టబెట్టినా ఆ మొత్తాన్ని రాబట్టినపుడే భవిష్యత్‌లో అవినీతికి పాల్పడే వారికి కాస్త బెరకు ఉంటుంది. అందుకు తగిన విధంగా వైసిపి ప్రభుత్వం బనాయిస్తున్న కేసులు ఉన్నాయా? ప్రజల సొమ్మును తిరిగి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అన్నదే ఇప్పుడున్న సవాలు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏడాదిగా అడుసు తొక్కుతూ కాళ్లు కడుక్కుంటున్న వైసిపి నేతలు !

29 Friday May 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP SEC Row, YS jagan, ysrcp


ఎం కోటేశ్వరరావు
రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగించటం చెల్లదని, దానికి దోహదం చేసిన ఆర్డినెన్స్‌, ప్రభుత్వ ఉత్తరువులను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. శనివారం నాడు ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్న జగన్‌ మోహనరెడ్డి, అనుయాయులకు ఇది ఊహించని ఎదురు దెబ్బ. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత తెలిసిందే. గత ఏడాది కాలంలో జరిగిన అనేక పరిణామాలను చూస్తే జగన్‌ పరివారం అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అధికారానికి వచ్చిన తొలిరోజుల్లో అనుభవం లేక లేదా ప్రతిపక్ష నేతగా తాను అనుభవించిన అవమానాల అక్కసును భరించలేక ప్రత్యర్ధి పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనుకొని ఏ పార్టీకి చెందని వారు సరిపెట్టుకున్నారు. ఏడాది కాలంలో అలాంటి వారందరినీ వైసిపి దూరం చేసుకుంది. జగన్‌ నాయకత్వం చేస్తున్న పనులు తెలియక కాదు తెలిసే చేస్తున్నారని, పర్యవసానాలను అనుభవించకతప్పదనే అభిప్రాయం పెరుగుతోంది. జగన్‌ తన మంత్రులకు సమాంతరంగా సలహాదారులను ఏర్పాటు చేసుకున్నారు. వారంతా భజనపరులుగా, మనసెరిగి మసలుకొనే అవకాశవాదుల్లా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కొంప ముంచటంలో సలహాదారులు తక్కువేమీ తినలేదు. ఇప్పుడూ అదే పునరావృతం అవుతోందా అన్నది వైసిపి శ్రేణులు పరిశీలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
తిరుమల వెంకన్న భూములు కొన్ని నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయని, వాటిని అమ్మేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చర్యను సమర్ధించుకుంటూ ఆ నిర్ణయం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దేవస్ధానం బోర్డే నిర్ణయం తీసుకుందని దాన్నే తాము అమలు జరుపుతున్నామని సమర్ధించుకున్న నేతల తీరు తెన్నులు యావత్‌ రాష్ట్రం చూసింది. తరువాత వచ్చిన వత్తిడి మేరకు తాము గత నిర్ణయాలను సమీక్షించామే తప్ప విక్రయ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ అలాంటిది చేయాల్సివస్తే సంప్రదించే చేస్తామని అదే నోళ్లు ఎలాంటి వెరపు లేకుండా ప్రకటించటాన్ని చూసి విస్తుపోతున్నది. అంతే కాదు గతంలో వచ్చిన కానుకలు, భూముల విక్రయాలు తదితర అంశాలన్నింటితో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఎవరు వద్దన్నారు ? ఎవరి బండారం ఏమిటో బయటపడుతుంది. జనం కోరుకున్నదీ అదే. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒక్క అంగుళం కూడా భూములు విక్రయించం అని కూడా ప్రకటించారు. ఇదేదో తొలిరోజే చెప్పి ఉంటే పోయేది. ప్రతిపక్షాలను అల్లరి పాలు చేయాలని యత్నించి తమ గోతిలో తామే పడినట్లుగా ఉంది వైసిపి వ్యవహారం. ఇలాంటి చర్యలతో గ్రామాలు, పట్టణాల్లో దిగువ స్ధాయిలో రొమ్ములు విరుచుకొని గుడ్డిగా సమర్ధించిన సామాన్య కార్యకర్తల పరువు ఏమౌతుందో, దాని ప్రభావం ఏమిటో ఆలోచించే వారున్నారా ?
ప్రభుత్వం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో తీర్పులు వస్తున్న తరువాత అయినా కొత్తగా వేసే కేసులు నిలుస్తాయా లేదా ఓడిపోతే పరువు సంగతి ఏమిటని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు, తమ నేతలను ప్రశ్నిస్తున్నట్లూ కనపడదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయినా జనంలో తమ పలుకుబడి తగ్గటం లేదని వైసిపి నాయకత్వం భావిస్తున్నదా ? దానికి ఆస్కారం లేకపోలేదు. ఆంగ్ల మాధ్యమంపై కోర్టులో ఓడిపోయిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారందరూ కోర్టు తీర్పును తప్పుపట్టారు. అది సహజం. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య తమ బిడ్డలను అందలాలెక్కిస్తుందని ఆశలు పెంచుకున్నవారికి సహజంగానే కోర్టు తీర్పు రుచించదు, కనుక కేసు పోయినా మా మద్దతు మీకే అని అలాంటి వారందరూ మద్దతు ప్రకటించి ఉండవచ్చు. అయితే అది శాశ్వతంగా ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆంగ్ల మాధ్యమాన్ని గతంలో చెప్పినట్లు అమలు జరపకపోతే చేతగాని వారు ఎందుకు చెప్పినట్లు అనే అసంతృప్తి మెల్లగా ప్రారంభం అవుతుంది.
పోలీసు ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం ఓడిపోయినా అదేమీ ప్రజాసమస్య కాదుకనుక తమకు వచ్చే నష్టమేమీ లేదని వైసిపి శ్రేణులు సమర్ధించుకోవచ్చు. సామాన్య జనానికి సంబంధించిన సమస్య కాదు గనుక దానితో పలుకుబడి మీద ప్రభావం చూపదు. కానీ తిరుమల వెంకన్న భూములపై తమ మాటలను తామే మింగిన తీరు, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై తలెత్తిన తీవ్ర రగడ, రాజకీయ నేపధ్యం చూస్తే అది మిగతా కేసుల కంటే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యమంత్రిగా అసలైన అధికారం నాదా ఎన్నికల కమిషనర్‌దా అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌కు అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడింది. ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసిన లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. విచారణ తతంగం జరిపారు. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ? ఆ లేఖ గురించి నానా యాగీ చేసిన వైసిపి నేతలు అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావటం, దాని మేరకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిందని ప్రకటించటం, కొత్త కమిషనర్‌ నియామకం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవికి తగిన వారెవరూ లేనట్లు తమిళనాడులో పాస్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకురావటం, ఆయన దళిత సామాజిక తరగతికి చెందిన వారని ప్రచారం చేసి దళితుల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించటం తెలిసిందే.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కులాన్ని అంటగట్టిందీ, కొత్త కమిషనర్‌కూ అదే పని చేసిందీ వైసిపి వారే కావటం గమనించాలి. అదీ, ఇదీ రెండూ చౌకబారు రాజకీయాలే. ఒక దళితుడి నియామకాన్ని తప్పుపడతారా అని మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది సలహాదారుల బుర్రలో పుట్టిందా లేక జగన్‌మోహనరెడ్డిగారికే తట్టిందో తెలియదు. ఇప్పుడు రమేష్‌ కుమార్‌ తొలగింపు చెల్లదు అని తీర్పు వచ్చిన తరువాత దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని కొందరు, కోర్టు తీర్పును ఆమోదిస్తామని మరి కొందరు అధికార పార్టీ నేతలు చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మరో సమస్యను తలకెత్తుకొనేందుకు పూనుకున్నట్లే ?
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తిరిగి అధికారం చేపట్టిన తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోనవసరం లేదు. ఈ తీర్పుతో ప్రభుత్వ పలుకుబడి తగ్గుతుందా, రమేష్‌ కుమార్‌కు సానుభూతి పెరుగుతుందా? పర్యవసానాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. కారకులు వారా వీరా ఎవరు, ఎవరు ప్రారంభించారు, ఎవరు కొనసాగిస్తున్నారు అన్నది ఒక అంశమైతే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుమ్ములాటలు, సమీకరణలు మరింతగా ఘనీభవించాయన్నది ఒక అభిప్రాయం. ఆ ప్రాతిపదికన ఆలోచించే వారు ఏ పార్టీకి చెందినప్పటికీ లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం తమ పార్టీ ఏది చేసినా సరైనదే అనే అడ్డగోలు సమర్ధనకు పూనుకుంటున్నారు. దాన్ని సమర్ధించేందుకు ప్రత్యర్ధి పక్షం కూడా చేసింది అదేగా అని వారి తప్పులను తమకు రక్షణగా ముందుకు తెస్తున్నారు. ఈ నేపధ్యంలో చూసినపుడు నిమ్మగడ్డకు కొత్తగా వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. అదే విధంగా కేవలం ఈ అంశం మీద అధికార పార్టీ పెద్దగా మద్దతు కోల్పోయే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పవచ్చు.
అయితే అధికార పార్టీమీద ఎలాంటి ప్రభావం ఉండదా ? తప్పకుండా ఉంటుంది. ఏలుబడిలోకి వచ్చి ఏడాది మాత్రమే గడచింది. పెట్టుబడులు పెట్టిన వారు వాటిని రాబట్టుకోవటం ప్రారంభించిన సమయానికి కరోనా సమస్య వచ్చింది. సంక్షేమ పధకాలలో అధికార పార్టీ వారికి వచ్చే వాటాలేమీ ఉండవు. ఇసుక, మట్టిని పిండటం ప్రారంభమైంది. అవే చాలవు, ప్రభుత్వం చేపట్టే రోడ్లు, నిర్మాణాలు, ప్రాజెక్టుల వంటివి ఉంటే పంటపండుతుంది. ఉన్న సొమ్మంతా నవరత్నాలకే పోతే అలాంటివి ఎన్ని పనులు చేపడతారు, ఎలా అన్నది బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు తేలిపోనుంది.
కోర్టులలో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా వైసిపిలో స్ధానిక కార్యకర్తల మనస్ధైర్యం క్రమంగా సడలటం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రే స్వయంగా రచ్చ చేసిన నిమ్మగడ్డ వ్యవహారంలో వచ్చిన తీర్పు ఒక మలుపు, అధికారపక్షానికి ఒక షాక్‌ వంటిదే. రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ ప్రతిపక్షాలకు ప్రచార ఆస్త్రాలుగా, పాలక పార్టీకి ప్రతికూలంగా మారతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగన్‌ అభివృద్ధి ప్రణాళిక గుట్టు విప్పాలి-చేసేదేమిటో చెప్పాలి !

23 Thursday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Aandhra Pradesh three Capitals, YS jagan, ys jagan development plan

Image result for now ys jagan should reveal his development plan

ఎం కోటేశ్వరరావు
నీతులు ఉన్నదెందుకు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే అన్నట్లుగా ఆంధ్రపదేశ్‌ రాజకీయాలు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో జరిగిన పరిణామాలను చూస్తే ఇలా జరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం లేదా ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడామస్‌ లేదా తామే చెప్పామనో బతికున్న జ్యోతిష్కులు ఎవరైనా చెబుతారేమో చూడాలి. అధికారపక్షానికి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియంలోకి దూసుకువస్తే తప్పు పట్టిన వారు, తాము మైనారిటీగా ఉన్న శాసనమండలిలో సభ్యులుగాని మంత్రులే ఏకంగా మండలి అధ్యక్షుడి పోడియంను, అధ్యక్షుడినే చుట్టుముట్టారు. ఇదొక వైపరీత్యం. అసెంబ్లీలో ప్రతిపక్షచర్యలను జనానికి చూపేందుకు టీవీల్లో ప్రసారం చే శారు. అదే తమ చర్యలను జనం చూడకుండా చేసేందుకు సాంకేతిక కారణాల పేరుతో మండలి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. అక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్పీకర్లు ఎలా అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నారో విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించుతున్నారో గత అసెంబ్లీలోనూ, ఇప్పుడూ చూస్తున్నాము. ఇప్పుడు మండలి చైర్మన్‌ కూడా అదే విచక్షణ అధికారంతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. అందువలన విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించి నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. దేశ రాజ్యాంగ వ్యవస్ధలను నీరుగార్చుతున్న నేపధ్యంలో ఈ పరిణామాలను చూడాల్సి ఉంది.
మూడు రాజధానుల రాజకీయం ఎటు తిరుగుతుందో, ఎవరి దగ్గర ఎలాంటి తురుపు ముక్కలున్నాయో, వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారో ఊహించి చెప్పలేము. సామాన్య జనం కోసం, ప్రాంతీయ మనోభావాలను రేకెత్తించటానికి మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ చట్టపరంగా అది పాలనా వికేంద్రీకరణ పేరుతో జరుగుతోంది. వాణిజ్య కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్ధల నమోదు(రిజిస్టర్డ్‌) కార్యాలయాలు ఒక చోట, కార్యకలాపాల నిర్వహణ పలు చోట్ల ఉండటం తెలిసిందే. రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు పరిమితమే. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దానిని అలాగే కొనసాగిస్తూ కార్యకలాపాలను పరిమితం చేస్తూ సచివాలయాన్ని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలని పాలకపార్టీ తలపెట్టింది. అందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అనూహ్యంగా శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బలు తగిలితే వాటి తీవ్రతను బట్టి విరామం ఉంటుంది తప్ప ప్రయాణం ఆగదు. తమ మూడు రాజధానుల అజెండా కూడా అలాంటిదే అని అధికారపార్టీ చెబుతోంది. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆలస్యం కావించేందుకు తెలుగుదేశం పార్టీ తాను చేయగలిగిందంతా చేస్తోంది.
పాలన వికేంద్రీకరణను ఒక విధానంగా జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ముందుకు తెస్తోంది గనుక కోర్టులు అభ్యంతర పెట్టే అవకాశాలు పరిమితం అని చెప్పవచ్చు. రాజ్యాంగానికి అనుగుణ్యంగా ఉన్న విధానాలను అభ్యంతర పెట్టే అధికారం కోర్టులకు లేదు. కేంద్రం కూడా అడ్డుకొనే అవకాశాలు అంతంత మాత్రమే. సమస్య హైకోర్టు తరలింపు దగ్గరే ఎదురు కానుంది.అన్ని పార్టీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అది మాత్రమే చాలదు. రాజధాని ఖరారు సమయంలోనే కర్నూలులోనో మరొక చోటో హైకోర్టును ప్రతిపాదించి కేంద్రానికి పంపి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. దేశ విభజన తరువాత తలెత్తిన పరిస్ధితులలో ఏర్పడిన తూర్పు పంజాబ్‌ హైకోర్టు, తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నూతన హైకోర్టులు లేదా ఉన్న బెంచ్‌లను హైకోర్టులుగా మార్చటం తప్ప ఒక రాష్ట్రంలో ఒకసారి ఖరారు అయిన హైకోర్టును మరొక చోటికి తరలించిన ఉదంతం మన దేశంలో ఇంతవరకు లేదు. రాష్ట్ర పునర్వ్యస్దీకరణ చట్టం, ఇతర విధి, విధానాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం సాధ్యం కాదని కొందరు నిపుణుల తాత్పర్యం. చట్టంలో ఏ అడ్డంకులు ఉన్నా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అనుమతి ఇస్తే మరొక నోటిఫికేషన్‌ ద్వారా తరలించవచ్చన్నది మరొక భాష్యం. తరలింపును వ్యతిరేకిస్తున్నదీ, కోరుకుంటున్న వారిలో న్యాయవాదులు సహజంగానే ముందున్నారు కనుక రెండు వైపులా ఉద్దండులనే న్యాయపోరాటంలో రంగంలోకి దించుతారు.
హైకోర్టు విషయంలో న్యాయ పోరాటం అవసరం లేకపోతే సమస్యే లేదు, రణం తప్పనిసరైతే అదెలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో చూద్దాం. దానిలో జగన్‌ సర్కార్‌ గెలిస్తే హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. ఓడిపోతే అమరావతిలోనే ఉండిపోతుంది. పర్యవసానాలకు జగన్‌మోహనరెడ్డి ఇప్పటి నుంచే సిద్దం కావాల్సి ఉంటుంది. వెలువడుతున్న అభిప్రాయాల మేరకు సెలెక్టు కమిటీ పేరుతో గరిష్టంగా ఆరునెలల పాటు అడ్డుకోవటం తప్ప మండలి చేసేదేమీ లేదు. ఆమోదించినా ఆమోదించకపోయినా అసెంబ్లీ తీర్మానం ఖరారు అవుతుంది. ఆ తరువాతే హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం. దానికి కేంద్రం నుంచి అనుమతి ఎంతకాలానికి వస్తుందో, అసలు రాదో కూడా తెలియదు. హైకోర్టు తరలింపు తక్షణమే జరగదని తెలిసినా దానితో నిమిత్తం లేకుండానే విశాఖకు సచివాలయాన్ని తరలించాలని మౌఖింగా ఆదేశాలు, ఏర్పాట్ల గురించి సూచనలు వెళ్లాయి గనుక హైకోర్టు విషయం తేలేవరకు బండి గుర్రం కళ్ల ముందు గడ్డి ఉంచి పరుగెత్తించినట్లుగా రాయలసీమ వాసులకు కేంద్రాన్ని చూపుతూ కాలక్షేపం చేయవచ్చు. అది ఆలస్యమయ్యే కొద్దీ అధికారపక్షానికి సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తరలింపు సాధ్యం కాదని తేలితే రాయలసీమలో వైసిపి భవిష్యత్‌ ఏమిటి? రాయలసీమ జనాన్ని సంతృప్తి పరచటం ఎలా అనే సమస్య తిరిగి ముందుకు వస్తుంది. అధికారపక్షానికి అది ఇరకాటమే.
మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైతే అసలు మండలినే రద్దు చేస్తామనే సూచనలు అధికారపక్షం నుంచి వెలువడ్డాయి. అవి బెదిరింపులా, ప్రలోభాలా మరొకటా అన్నది అన్నది ఎవరికి వారే భాష్యం చెప్పుకోవచ్చు. తరువాత అలాంటిదేమీ లేదని వైసిపి నేతలు చెబుతున్నప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరించి రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే రద్దవుతుందా ? కేంద్రంలోని అధికారపార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఒకే రాజధాని అని చెబుతోంది కనుక ఆ సిఫార్సును వెంటనే ఆమోదించటానికి ఎందుకు చర్య తీసుకుంటుంది? ఆమోదించాలని కోరే పార్టీ వైసిపి తప్ప మరొకటి ఉండదు. రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ ప్రకారం రాజ్యసభ సీట్లకోసం బిజెపి నాయకత్వం ఒక వేళ రాజీపడి శాసన మండలిని వెంటనే రద్దు చేస్తే నష్టపోయే వాటిలో వైసిపి కూడా ఉంటుంది. తక్షణమే మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి ఉద్యోగాలు ఊడతాయి. తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం ముగియగానే తలెత్తే ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వైసిపి రాజకీయ నిరుద్యోగుల ఆశలకు నీళ్లొదులు కోవాల్సిందే. వారిని సంతృప్తిపరచేందుకు పాలకపార్టీ ఆయాసపడాల్సిందే. రెండవది ఇప్పటికే రివర్సు(తిరగదోడే) సర్కార్‌ అని తెలుగుదేశం చేస్తున్న రాజకీయ దాడికి మరొక అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. రాజశేఖరరెడ్డి కార్యక్రమాలన్నింటినీ సమర్ధవంతంగా అమలు జరుపుతామన్న వైసిపి ఆయన హయాంలో పునరుద్దరణ జరిగిన మండలిని రద్దు చేశారనే సెంటిమెంటును కూడా తెలుగుదేశం ముందుకు తెస్తుంది.
మూడు రాజధానుల ప్రక్రియతో పాటు స్ధానిక సంస్ధలకు ఎన్నికలకు కూడా వైసిపి సిద్దపడింది. రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు ఎక్కిన కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పుడు బిల్లు సెలక్టు కమిటీకి వెళ్లటంతో దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తారా? వేయకపోతే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలు కూడా జరగవచ్చు, సహజంగానే కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా ఎక్కువ చోట్ల లబ్ది పొందవచ్చన్న అంచనాతోనే వైసిపి ముందుకు పోవచ్చు. పెద్ద మెజారిటీతో అనుకూల ఫలితాలు వస్తే వాటిని చూపి మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఒక వేళ ప్రతిపక్షాలకు తగినన్ని స్ధానాలు వస్తే ఒకే రాజధాని గురించి సమీకరణలు మరింతగా పెరుగుతాయి.
అధికార వికేంద్రీకరణ ఎత్తుగడతో సచివాలయ తరలింపును సాంకేతికంగా అడ్డుకొనే అవకాశాలు లేవు గనుకనే బిజెపి రాజకీయ పార్టీగా వ్యతిరేకతకు పరిమితమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతోంది. లేదా అడ్డుకొనేందుకు ఉన్న నిబంధనా పరమైన అంశాల పరిశీలన, అధ్యయనం కోసం సమయం తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వైసిపి అజెండాను జయప్రదంగా అమలు జరిగేందుకు సహకరిస్తే లోపాయికారిగా ప్రయోజనాలు పొందవచ్చేమోగానీ రాజకీయంగా బిజెపి దానితో ముడివేసుకున్న జనసేన పని ముగిసినట్లే. అన్ని చోట్లా తన దుకాణామే ఉండాలి, మిగిలిన పార్టీల దుకాణాలు మూతపడాలని కోరుకుంటున్న, అందుకోసం దేనికైనా తెగించే బిజెపి అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన చర్యలకు పాల్పడుతుందా ? ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో దాని మెజారిటికి ఢోకా లేదు. స్వయంగా దానికే సంపూర్ణ మెజారిటీ వుండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన రాజకీయ కోణంలోనే బిజెపి ఆలోచించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బిజెపి-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను తామే దిగమింగుకోవటం కష్టం.
అనుకోని ఇబ్బందుల్లో పడిన వైసిపి ఇప్పుడేం చేస్తోంది? అసలేం చేయాలి? ఆస్ద్ధులన్నీ కరిగి పోయినా ఫర్వాలేదు, కేసు గెలవటం ముఖ్యం అని ఫ్యూడల్‌ ప్రభువులు వ్యవహరించినట్లుగా తాను తలపెట్టినదాన్ని నెగ్గించుకొనేందుకు ఎంతదాకా అయినా పోతాను అన్నట్లుగా వుంది ప్రభుత్వ తీరు. ఎందరో ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ అమరావతి కేసుల్లో వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజుతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహతగిని నియమించుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే అలాంటి వారిని మరికొందరిని నియమించుకున్నా ఆశ్చర్యం లేదు, జనం సొమ్ము కదా ! మండలిని పూర్వపక్షం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెస్తారా, దానికి గవర్నర్‌ రబ్బరు స్టాంపు వేస్తారా ? వంటి అనేక అంశాలు ఉన్నాయి.
సెలక్టు కమిటీ, ఇతర ఆటంకాల పర్యవసానాలు ఎలా ఉన్నా వైసిపి సర్కార్‌ రోజువారీ పాలన సాగించక తప్పదు. ఎన్నికలకు ముందే ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలను అమలు జరపాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షకోట్ల రూపాయలను దాని ఒక్కదానికే ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పింది కనుక ఇప్పుడు ఆ సొమ్మును, ఇతర అభివృద్ధి పధకాల సొమ్ముతో కలిపి పదమూడు జిల్లాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేయనుందో ప్రణాళికను వెల్లడించాలి. నవరత్నాలను ఎలా అమలు జరుపుతామో వివరంగా చెప్పిన వారికి రాష్ట్ర అభివృద్ది పధకాలు రూపొందించటం ఒక లెక్క కాదు. సెలక్టు కమిటీ తీసుకొనే వ్యవధిని ప్రభుత్వం దీనికి ఉపయోగించుకొని మూడు రాజధానులు అయితే, ఒక వేళ కాకున్నా పదమూడు జిల్లాల అభివృద్ధి సూచికలు ఎంతెంత ఉన్నాయో, రానున్న నాలుగు సంవత్సరాలలో వాటిని ఎంత మేరకు, ఎలా పెంచుతారో జనానికి వెల్లడిస్తూ శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రభుత్వం తానుగా అభివృద్ధికి పెట్టుబడుల సంగతి తేల్చాలి. మూడు రాజధానులతో నిమిత్తం లేకుండానే ఇప్పటికే అమలు జరుపుతున్న అభివృద్ధి పధకాలు ఎలాగూ కొనసాగుతాయి గనుక నిమిత్తం వాటితో లేకుండా వాటిని ప్రత్యేకంగా చేసే అభివృద్ధి ఏమిటో వెల్లడించాలి. అప్పుడే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ పేదలు తమ వలసలను విరమించుకొని ఇక్కడే ఉపాధి పొందేందుకు పూనుకుంటారు. అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జిఎన్‌ రావు కమిటీ, లేదా బోస్టన్‌ కన్సల్టెన్సీ బృందం సమర్పించిన నివేదికలను మధించిన మంత్రుల ఉన్నత సా ్ధయి కమిటీ చేసిన సూచనలేమిటో, పూర్తి నివేదిక ఏమిటో జనానికి అందుబాటులో ఉంచాలి. ఇదేమీ రహస్యం కాదు, పారదర్శకతకు పక్కా నిదర్శనం అవుతుంది. అలాగాక మూడు రాజధానుల అంశం తేలిన తరువాతే మా గుప్పెట తెరుస్తాము లేదా మనసులో ఉన్నది చెబుతాము అంటే అందులో ఏమీ లేదనే అనుకోవాల్సి వస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌-నేడు ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌ = ఆంధ్రుల రాజధానులు !

21 Saturday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

AP three capitals, GN RAO Committee, YS jagan

Image result for andhra pradesh

ఎం కోటేశ్వరరావు
రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాజీ అయ్యేఎస్‌ అధికారి జిఎన్‌ రావు కార్యదర్శిగా నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా తమ నివేదిను అందించింది. దీనిలో ఏదో అలా జరిగిపోయింది గానీ, ముందస్తు ఆలోచనేమీ లేదని జగన్‌ అభిమానులు చెప్పుకోవచ్చు గానీ, అంతర్గతంగా వారే మరోవిధంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా వచ్చేది లేదు పోయేది లేదు. ఆంధ్రుల గురించి అలారాసి పెట్టి ఉంది, కనుక జరగాల్సింది జరిగింది అనుకోవాలా ?
ఒక్కటి మాత్రం స్పష్టం. అదేమిటో నాకన్నీ ముందే అలా తెలిసిపోతుంటాయి అన్నట్లుగా నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. కాలజ్ఞానం విషయంలో పోతులూరి వీరబ్రహ్మం గారిని మించి పోయారు. గత సర్కార్‌ హయాంలో రాజధాని నిర్ణయం జరగముందే అంతర్గత వ్యాపారం జరిగిందని ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో నివేదిక తయారీకి అంతర్గత బోధ జరిగిందన్నది కూడా అంతే స్పష్టం. అమరావతిలో అంతర్గత వ్యాపారం(ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌) జరిగిందనటానికి జగన్‌ సర్కార్‌ వెల్లడించిన భూముల వివరాలు సాక్ష్యం అనుకుంటే, జగన్‌ ముందే చెప్పినట్లుగానే మూడు రాజధానుల మీద అంతర్గత బోధ (ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌) జరిగిందనేందుకు జిఎన్‌ రావు కమిటీ నివేదిక తిరుగులేని సాక్ష్యం ! ఈ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపి, ఆమోదం వచ్చిన తరువాత ఎంతవరకు అమలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రమేయం, రాష్ట్ర అధికారాల గురించి చూడాల్సి ఉంది.
ఇక ఈ నివేదిక పూర్తి పాఠం ఇంకా అందలేదు కనుక జిఎన్‌రావు విలేకర్లతో చెప్పిన అంశాలకే ఈ పరిశీలన పరిమితం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌గా ఏర్పాటు చేయాలని, ఒక దానిలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రెండవ దానిలో ఉభయ గోదావరులు, కృష్ణా, మూడవ దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగవ దానిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉండాలని పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అమరావతి, విశాఖలో డివిజన్‌ బెంచ్‌లు పెట్టాలని సూచించారు. అమరావతిలో భాగం గాని మంగళగిరి ప్రాంతంలో మంత్రుల నివాసాలు, అమరావతిలో గవర్నర్‌, అసెంబ్లీ అని చెప్పారు. విశాఖలో అసెంబ్లీ వేసవి సమావేశాలు జరపాలన్నారు. ఇవన్నీ కూడా పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి జనాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చెప్పామన్నారు.
ఈ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సభ్యులు పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి వారు ప్రయాసకు గురై రాస్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేశారనిపిస్తోంది. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ను కర్ణాటక తరహాలో అని వారే చెప్పారు. ఇంటర్నెట్‌లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. రెండవది ప్రాంతీయ కమిషనరేట్స్‌ లేదా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అనేవి మనకు తెలియనివి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ముల్కీ నిబంధనల అమలును సుప్రీం కోర్టు సమర్ధించిన తరువాత దానిని రద్దు చేసి ఆరుసూత్రాల పధకంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. తరువాత వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ అంటే వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు. కర్ణాటక కమిషనరేట్స్‌ అయితే రెవెన్యూ డివిజన్లు. అంటే రాష్ట్ర కేంద్రం, జిల్లాల మధ్య మరొక అధికార దొంతర ఏర్పడుతుంది. లేదా గతంలో మాదిరి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అయితే రాజకీయనేతలకు ఉద్యోగాలిస్తారు. ఏది చేసినా వీటి ద్వారా ఆయా జిల్లాలను ఎలా అభివృద్ది చేస్తారు ? ఇప్పుడున్న వ్యవస్ధలో అభివృద్దికి అడ్డువస్తున్న ఆటంకా లేమిటి ?
కర్ణాటకలో అలాంటి ఏర్పాటు చేసినా అనేక ప్రాంతాలు వెనుకబడిపోయాయి. నైజాం సంస్ధానం నుంచి విడదీసి కర్ణాటకలో విలీనం చేసిన కన్నడ ప్రాంతాలలో ఇది చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ వరకు దారి తీసింది. ఇప్పటికీ దానిని ముందుకు తెస్తూనే ఉన్నారు. అనేక రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో అలాంటి డిమాండ్లే ఉన్నాయి. మొత్తంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఎక్కడ గతంలో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయో అక్కడే, ఎక్కడ రేవులు, రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సులభంగా సరకు రవాణా అవకాశాలుంటాయో అక్కడికే పెట్టుబడులు తరలి వెళుతున్నాయి తప్ప వెనుకబడిన ప్రాంతాలకు రావటం లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇది మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, అనేక సంస్ధలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి తమ అనుయాయలకు తెగనమ్మి కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. అటువంటపుడు నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుకు, అభివృద్ధికి సంబంధం ఏమిటి ? వైసిపి దగ్గర నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి పధకాల ఊసే లేదు. ప్రయివేటు పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్రమోడీ పలు విమర్శలపాలై పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగా అని చెప్పుకున్నా వచ్చిన పెట్టుబడులు లేవు, మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలం కావటం చూస్తున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు ?
జిఎన్‌ రావు కమిటీలో ఉన్నదంతా పట్ణణ ప్రణాళికల నిపుణులే కనుక పట్టణీకరణ గురించి ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజానికి ఇది సామాన్యులకు కూడా తెలిసిన అంశమే. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసేది ఎవరనేదే కదా ప్రశ్న. సహజవనరులను దోచుకోవటానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వెళతారు తప్ప పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఎక్కడా ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టిన చోట్లనే అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. మధ్య కోస్తోలో వ్యవసాయ రంగంలో మిగులు పట్టణీకరణ, వ్యాపారాల అభివృద్ధికి ఒక కారణం తప్ప ఒక్క పట్టుమని పదివేల మందికి ఒక దగ్గర ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ లేదు.
2019 జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో పని చేయటం ప్రారంభమైంది. తిరిగి దానిని కర్నూలుకు తరలించటానికి, విశాఖ, అమరావతిలో బెంచ్‌లు ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తాయన్నది సందేహమే. మద్రాసు ప్రావిన్సులోని తెలుగు ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయం(తెలుగుకు పర్యాయపదం ఆంధ్రం కనుక ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై నాటి కాంగ్రెస్‌ నేతల( ఆంధ్రా-రాయలసీమ) మధ్య వివాదం వచ్చింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగి చివరికి విశాఖలో 1926లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంత నేతలు తన్నుకు పోయారనే అసంతృప్తిలో ఉన్న రాయలసీమ నేతలను సంతృప్తి పరచేందుకు చిత్తూరు, ఇతర రాయలసీమ(సీడెడ్‌) జిల్లాలను మాత్రం దానిలో చేర్చకుండా మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. తరువాత మద్రాసు ప్రావిన్సు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినపుడు మరోసారి రాయల సీమకు అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఆ ప్రాంత నేతలు వ్యక్తం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఉభయ ప్రాంతాల నేతలు కాశీనాధుని నాగేశ్వరరావు గృహం శ్రీబాగ్‌లో సమావేశమై భవిష్యత్‌లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలనే ( పెద్ద మనుషుల )ఒప్పందానికి వచ్చారు. ఆమేరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. తరువాత రెండింటినీ హైదరాబాద్‌కు తరలించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత వివిధ చోట్ల హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు ఒక్కదానినీ ఆమోదించలేదు. ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అలహాబాద్‌లోహైకోర్టు, లక్నోలో బెంచ్‌ ఉంది. మరో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా అలాంటి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల బెంచ్‌లు పెట్టాలన్న ప్రతిపాదనను అంగీకరించటానికి కేంద్రం ఏ ప్రాతిపదికన ముందుకు వస్తుంది అన్నది ప్రశ్న. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని జిఎన్‌ రావు కమిటీ ఉటంకించింది.

Image result for ys jagan mohan reddy
ఈ కమిటీ నివేదిక ఒక ప్రహసన ప్రాయం అన్నది స్పష్టం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆకాంక్ష వైసిపిలో ఎన్నడూ కనిపించలేదు. వారు కోరుకున్న విధంగా వ్యవహరించేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలంటే దానికి ఒక కమిటీ నివేదిక కావాలి. అందుకోసం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఏమి రాయాలో రాయించుకున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడి అవుతున్నాయి. గతంలో రాజధాని నిర్ణయానికి ముందు అనుయాయులకు ఉప్పందించి లబ్ది చేకూర్చేట్లు చేశారని, చంద్రబాబుతో సహా అనేక మంది భూములు కొనుగోలు చేసిన గ్రామాలను రాజధాని పరిధి, భూ సేకరణ నుంచి తప్పించారని వైసిపి చెబుతోంది. ఆమేరకు అసెంబ్లీలో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వెనుక వైసిపి నేతలు కూడా అదే పనికి పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ వివరాలు ఐదేండ్ల తరువాత కొత్త ప్రభుత్వం వస్తే, వారు బయట పెట్టేంత వరకు అనుమానాలు, ఆరోపణలుగానే ఉంటాయి. ఐదేండ్ల తరువాత వచ్చే పాలకులు మూడు రాజధానుల్లో అనుకున్నట్లుగా అభివృద్ది జరగలేదంటూ మరొక కమిటీని వేసి మరో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ? తన అధికారానికి ఇక తిరుగులేదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నట్లే గతంలో చంద్రబాబు కూడా అనుకున్నారు, అయినా వేరేలా జరగలా ? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కోర్టుకు హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు నిరాకరణ, ముందుకు తెచ్చిన కొన్ని సమస్యలు !

02 Saturday Nov 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra CM’s DA case, CBI court rejects Andhra CM’s exemption application, YS jagan

Image result for Andhra CM’s DA case

ఎం కోటేశ్వరరావు
ఆర్థిక నేరాల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన వినతిని హైదరాబాద్‌ నాంపల్లి సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామం ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ముందుకు తెచ్చింది. మినహాయింపునకు కోరిన కారణాలతో పాటు అభ్యంతరానికి చెప్పిన కారణాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. సీఎంగా బిజీగా ఉన్నందున, ప్రతివారం హైదరాబాద్‌ వచ్చి వెళ్లాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరారు.
జగన్‌ పిటిషన్‌ విచారణకు అర్హమైందే కాదని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఛార్జిషీట్లు దాఖలై ఆరేళ్లయినా విచారణ ప్రారంభం కాలేదని ఆయన ఏదో ఒక కారణంతో విచారణను జాప్యం చేస్తారని, జగన్‌ పిటిషన్‌లో పేర్కొన్న ఏపీ పునర్విభజన, గత ప్రభుత్వ పనితీరు అంశాలు ఈ కేసుతో సంబంధం లేనివని, జగన్‌ వ్యక్తిగత హౌదాలోనే నిందితుడిగా ఉన్నారని, ఆయనపై నమోదైన అభియోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపుతాయని, విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్‌లోని కోర్టుకురావడం పెద్ద కష్టమేం కాదని వాదించింది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఆయన్ను గతంలో అరెస్టు చేశామని. ఇప్పుడు అందుకు ఆస్కారం ఎక్కువ ఉందని, కేసులో సాక్షులుగా ఉన్న అధికారులు సీఎంగా ఉన్న జగన్‌ అధీనంలోనే ఉన్నారని వాదించింది.
అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆ రోజు మినహాయింపు కోరవచ్చని సూచించింది. ప్రభుత్వ విధుల్లో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలనడం రాజ్యాంగ విరుద్ధం, చట్టం ముందు అందరూ సమానులేనని సీబీఐ పేర్కొంది.
సిఎం పదవిలో ఉన్నందున వారానికోసారి హైదరాబాద్‌ కోర్టుకు రావటం ఇబ్బంది అనటం పొసగని వాదన. రాజధాని, సచివాలయాన్ని వదలి ముఖ్యమంత్రి విదేశీ, రాష్ట్రేతర, రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు జరుపుతున్నపుడు లేని ఇబ్బంది కోర్టుకు వచ్చినపుడు కొత్తగా వచ్చేదేమిటో తెలియదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్య మంత్రులను నియమించుకున్న సిఎంకు నిజానికి వెసులు బాటు ఎక్కువగా వుంటుంది. రాజధాని వదలి వెళ్లిన సమయాల్లో ఏదైనా అసాధారణ సమస్య తలెత్తితే విధానపరమైన అంశాలు మిగిలిన రోజువారీ అంశాలపై చర్యలు తీసుకొనేందుకు అధికార యంత్రాంగం, మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించవచ్చు. రెండవది ఖర్చు గురించిన అంశం. ఒక వ్యక్తిగా ఉన్నపుడు దాఖలైన కేసును ఎదుర్కొనేందుకు జనం సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి ? ముఖ్యమంత్రి కుటుంబంతో సహా జెరూసలేం సందర్శించినపుడు ఖర్చును స్వయంగా భరించినట్లు చెప్పారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా స్వంత ఖర్చుతోనే కోర్టులకు హాజరు కావాలి కదా ? గవర్నర్‌ మాదిరి ముఖ్యమంత్రికి మినహాయింపులు లేనపుడు ఖర్చులు భరించటానికి అనుమతి సరైనదేనా ? స్వంత ఖర్చుతోనే కోర్టుకు వెళ్లాలి కదా !
సిబిఐ వాదనను కోర్టు అంగీకరించి జగన్‌ వినతిని తిరస్కరించింది. దాని గురించి పై కోర్టులకు వెళతారా లేక కోర్టు ఆదేశాన్ని పాటించి హాజరవుతారా అన్నది వేరే అంశం. ఇక్కడ న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. ఇక సీబీఐ వాదన తీరుతెన్నులను చూద్దాం. వారానికోసారి విచారణ నుంచి హాజరు కాకుండా మినహాయింపు ఇస్తే జగన్‌ సాక్షుల్ని ప్రభావితం చేస్తారనడం అసంగతంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాలను తారు మారు చేసే బలం జగన్‌కు ఉందని అందుకే అరెస్ట్‌ చేశామని సీబీఐ చెప్పింది. ఇప్పుడు సీఎం హౌదాలో ఉన్న జగన్‌ మరింత బలపడ్డారు. సిబిఐ వాదన ప్రకారం సాక్ష్యాలను తారు మారు జరిగితే ఇప్పటికే జరిగి ఉండాలి. అయినా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైతే అలాంటి అక్రమాన్ని ఎలా అడ్డుకుంటారో సామాన్యులకు అర్ధం కావటం లేదు. వారంలో ఆరు రోజులు అలాంటి అవకాశం ఇచ్చి ఏడో రోజు అడ్డుకుంటారా ?
ఇక ముఖ్యమంత్రులు ఎడతెగని పనిలో ఉంటారు కనుక కోర్టులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదన మీద ఢిల్లీ హైకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చింది. బిజెపి నేత మీద కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ ఒక పరువు నష్టం కేసు వేశారు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పని వత్తిడిలో ఉంటారని అందువలన కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది కోర్టును కోరారు. అందుకు తిరస్కరించిన కోర్టు ఆమె హాజరు కానట్లయితే కేసు కొట్టివేస్తామని స్పష్టం చేసి తదుపరి వాయిదాకు రావాలని అదేశించింది. రెండు పరువు నష్టం కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ కేసు తేలేవరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని ఆ రాష్ట్ర హైకోర్టు, మెట్రోపాలిటన్‌ కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచినపుడు కోర్టుకు వస్తామని హామీ ఇవ్వాలని కేజరీవాల్‌ను హైకోర్టు కోరింది.తన పరోక్షంలో కేసు విచారణ కొనసాగించవచ్చని రాసివ్వాలని కోరింది. ఇది తమనేతకు ఎందుకు వర్తించదు అని వైసిపి శ్రేణులు ప్రశ్నించవచ్చు. కేజరీవాల్‌ది పరువు నష్టం కేసు, జగన్‌ది అవినీతి అక్రమాల కేసు అనేతేడా తప్ప ఇద్దరూ నిందితులే, ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నవారే. ఒకే చట్టం ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో భిన్నమైన అన్వయం.

Image result for Andhra CM’s DA case
కేజరీవాల్‌ అయినా, జగన్‌ అయినా ప్రతి ప్రజాప్రతినిది అనే కారణం చూపి అటువంటి మినహాయింపు కోరితే చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి అర్ధం ఏమిటి అన్నది ప్రశ్న. ఈ కేసులకు ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు. వ్యక్తిగత స్ధాయిలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ ఆ కేసులో నిందితుడు. అలాంటి వ్యక్తిని కేంద్ర బిజెపి సర్కార్‌ గవర్నర్‌గా నియమించటం నైతికమా అనైతికమా అన్నది ఒక అంశం. గవర్నర్‌ పదవిలో ఉన్నారు కనుక రాజ్యాగంలోని ఆర్టికల్‌ 361కింద గత ఐదు సంవత్సరాలుగా మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరు కావటానికి కల్యాణ్‌ సింగ్‌కు మినహాయింపు లభించింది. ఆ పదవి కాలం అయిపోగానే ఆయన కోర్టుకు రాకతప్పదని సిబిఐ పేర్కొన్నది. ముఖ్యమంత్రికి అటువంటి మినహాయింపులు లేకపోవటం లోపమా లేక ప్రజాస్వామ్య బద్దమా అన్న అంశాన్ని చర్చించాలి. గవర్నర్‌తో సహా ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకోసం చేసిన పనుల పర్యవసానాలు కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: