ఎం కోటేశ్వరరావు
ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్), నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి.రాష్ట్రాలలో ఒక్క సింధులో మాత్రమే పీపుల్స్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. జాతీయ అసెంబ్లీ, మిగిలిన మూడు రాష్ట్రాలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని నిషేధిత పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్(పిటిఐ) పార్టీ మద్దతుదార్లు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలకు గాను 266 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 సీట్లలో 60 మంది మహిళలను రాష్ట్రాల వారీగా పార్టీలు తెచ్చుకున్న ఓట్లను బట్టి దామాషా పద్దతిలో నియమిస్తారు.దేశమంతటి నుంచి మరో పది మంది ముస్లిమేతర సామాజిక తరగతులకు చెందిన వారిని నామినేట్ చేస్తారు. ఎన్నికలు జరిగిన స్థానాలలో రెండు ఖాళీగా ఉన్నాయి. పార్టీల వారీ పిటిఐ బలపరిచిన స్వతంత్రులు 101 గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి 91 మంది పిటిఐ స్వతంత్రులు, ముస్లింలీగ్(ఎన్) 80, పీపుల్స్ పార్టీ 54, ముత్తాహిదా క్వామీ మువ్మెంట్(ఎంక్యుఎం) 17 సీట్లు తెచ్చుకోగా ఐదుగురు ఇతర స్వతంత్రులు, మరో పది చిన్న పార్టీలకు 17 స్థానాలు వచ్చాయి. అంతిమంగా పార్లమెంటు సమావేశాల నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు ఉండవచ్చు. ఓటర్లలో 47శాతం మంది పాల్గొన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి. ఖైబర్ ఫక్తూన్లోని 145 మొత్తం స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన 115లో 84 స్థానాలను పిటిఐ స్వతంత్రులు గెలుచుకున్నారు. అతి పెద్ద పంజాబ్లో 371కి గాను ఎన్నికలు జరిగిన 297లో ముస్లిం లీగుకు 137, పీటిఐ స్వతంత్రులు 116, పీపుల్స్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంది.మరో రాష్ట్రమైన సింధులో 168కి గాను ఎన్నికలు జరిగిన 130లో పీపుల్స్ పార్టీ 84, ఎంక్యుఎం 28, పిటిఐ స్వతంత్రులు 11 మంది గెలిచారు. ఇక్కడ పీపుల్స్ పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.బలూచిస్తాన్లో 65కు గాను ఎన్నికలు జరిగిన 51 చోట్ల పీపుల్స్ పార్టీ, జమాతే ఉలేమాకు పదకొండు చొప్పున ముస్లింలీగ్కు పది, మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు వచ్చాయి. పంజాబ్లో ముస్లిం లీగ్కు మద్దతు ఇస్తామని, దానికి బదులు ప్రధాని పదవిని తమకు ఇవ్వాలని పీపుల్స్ పార్టీ తన డిమాండ్ను ముందుకు తెచ్చింది. పాకిస్థాన్లో 12.85కోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.6 కోట్ల మంది 35 సంవత్సరాలలోపు వారే.36-45 సంవత్సరాల వారు 2.9 కోట్ల మంది.మొత్తం ఓటర్లలో మహిళలు 46శాతమే. కాశ్మీరు నుంచి ఆక్రమించుకున్న ప్రాంతంతో పాటు గిల్గిట్-బాల్టిస్థాన్కు జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వాటిని స్వతంత్ర విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ విడిగా ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 12,695 మంది పోటీ చేశారు. వీరిలో 882 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.అభ్యర్దులలో 11,785 మంది స్వతంత్రులు, వారిలో 607 మంది మహిళలు.
పాకిస్థాన్ గద్దెమీద ఇమ్రాన్ ఖాన్ ఉండటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. అతగాడు చేసిన ”పాపం” ఏమిటంటే అమెరికాతో పాటు చైనా, రష్యాలతో కూడా సామరస్యంగా ఉండాలన్న వైఖరి తీసుకోవటమే. తటస్థంగా ఉండటం కూడా తమను వ్యతిరేకించటమే అన్నది అమెరికా భావన, అందుకే అనేక దేశాధినేతలను కుట్ర చేసి కూల్చివేసిన చరిత్ర తెలిసిందే. ఇస్లామాబాద్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమకు మాత్రమే విధేయత చూపాలని అది కోరుకుంటున్నది. ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున మాస్కోలో వ్లదిమిర్పుతిన్-ఇమ్రాన్ ఖాన్ భేటీ జరిగింది. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఖాన్ చెప్పాడు. రష్యాపై విధించిన ఆంక్షలను కూడా వ్యతిరేకించాడు. అది అమెరికాకు నచ్చలేదు. మార్చి నెల ఆరవ తేదీన ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాడు. దానిలో ఒక కాగితాన్ని చూపుతూ ” రష్యాను ఖండించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఐరోపా యూనియన్ రాయబారులు ఒక లేఖ రాశారు. మీరు మా గురించి ఏమనుకుంటున్నారు. మీరేం చెబితే దాన్ని చేయటానికి మేము మీ బానిసలమా ? మేము రష్యాకు, అమెరికాకు, చైనాకు, ఐరోపాకూ స్నేహితులమే. మేము ఎవరి శిబిరంలోనూ లేము.పాకిస్థాన్ తటస్థంగా ఉంటుంది, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించేందుకు చూసేవారితో కలసి పని చేస్తుంది ” అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే కుట్రకు తెరలేచింది.
వాషింగ్టన్లో పాక్ రాయబారి అసాద్ మజీద్ ఖాన్తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్ అంశంలో పాక్ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్ గనుక అధికారంలో కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు.
అమెరికా సిఐఏ కుట్ర ప్రకారం సాకులు చూపి పాక్ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి 2022 ఏప్రిల్లో ఖాన్ను పదవి నుంచి తొలగించారు. పిటిఐ పార్టీలో అంతర్గత ఎన్నికలు తమకు సంతృప్తి కలిగే విధంగా నిర్వహించలేదని సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది, ఎన్నికల చిహ్నం క్రికెట్ బాట్ను స్థంభింప చేసింది. దాంతో ఆ పార్టీ అభ్యర్ధులందరూ స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులతో పోటీ చేయాల్సి వచ్చింది. వారంతా పార్లమెంటులో మరొక కొత్త పార్టీ పేరుతో ఒక బృందంగా ఏర్పడతారా, ఏం జరుగుతుందో తెలియని స్థితి. వారిని చేర్చుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రలోభాలు, బెదరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు. పాక్ నిబంధనల ప్రకారం వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం పార్టీలకు నామినేటెడ్ సీట్లను కేటాయిస్తారు. పిటిఐ ప్రస్తుతం ఒక పార్టీగా గుర్తింపు లేనందున దానికి వచ్చే అదనపు సీట్లేమీ ఉండవు. గత ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించి 336కు గాను 149 సీట్లను కైవశం చేసుకుంది.ఈ సారి ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 169 సీట్లను తెచ్చుకొనే పరిస్థితి లేదు. ముస్లింలీగ్, పీపుల్స్ పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు. డెబ్బయి ఒక్క సంవత్సరాల ఇమ్రాన్ ఖాన్కు మూడు కేసుల్లో 31 సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదేండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనే అనర్హతను కూడా కోర్టు ప్రకటించింది.
ఈ పూర్వరంగంలో జరిగిన ఎన్నికలు ఎంత ప్రహసనంగా సాగిందీ అర్ధం చేసుకోవచ్చు. ఓట్ల రిగ్గింగు, లెక్కింపును సాగదీశారని, 24 చోట్ల గెలిచినట్లు ప్రకటించిన వారికి వచ్చిన మెజారిటీ కంటే చెల్లవని ప్రకటించిన ఓట్లే ఎక్కువని తేలింది. వాటిలో 13 సీట్లు ముస్లింలీగ్కు, ఐదు పీపుల్స్ పార్టీ, నాలుగు చోట్ల పిటిఐ-స్వతంత్రులు, మరోరెండు చోట్ల ఇతర స్వతంత్రులు గెలిచారు.ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ 91 మంది పిటిఐ మద్దతుదార్లు గెలిచారంటే పాక్ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మిలిటరీ, న్యాయవ్యవస్థ కుట్రలను వ్యతిరేకిస్తున్నారని, అన్నింటికీ మించి ముఖ్యంగా యువత అమెరికా పట్ల వ్యతిరేకతను వెల్లడిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక విదేశీ మీడియా సంస్థలు వెల్లడించిన అభిప్రాయం కూడా ఇదే. ఈ అక్రమాల గురించి పిటిఐ మద్దతుదార్లు, సాధారణ ప్రజానీకం ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్ వెలువడిన తరువాత 21రోజుల్లోపు(ఫిబ్రవరి 29) కొత్త పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంది. అంతకు ముందే కూడా ఏర్పాటు కావచ్చు. తొలుత స్పీకర్ ఎన్నిక ,తరువాత సభా నేత ( ప్రధాని )ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. సాధారణ మెజారిటీ 169 ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ మేరకు రాకపోతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం, మార్చినెల ఒకటిన స్పీకర్, రెండవ తేదీ ప్రధాని ఎన్నిక జరుగుతుంది. తరువాత సెనెట్ ఎన్నికలు జరుగుతాయి.
1985లో పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారందరినీ స్వతంత్రులుగా పరిగణించారు. తరువాత అత్యధికులు తాము పాకిస్థాన్ ముస్లిం లీగ్ అనే పార్టీగా ఏర్పడినట్లు ప్రకటించుకున్నారు. తరువాత ఆ పార్టీలో చీలికలు వచ్చాయి.ఇప్పుడు కూడా పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రులు ఏదో ఒక పార్టీ పేరుతో ఏర్పడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఒక వేళ అలా ఏర్పడితే ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మందిని అకర్షించేందుకు ప్రధాన పార్టీలు బేరసారాలు, బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పార్లమెంటు సమావేశం నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మూడు రోజుల్లో స్వతంత్ర అభ్యర్ధులు పార్టీలను ఎంచుకోవచ్చు. తరువాత పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషాలో నామినేటెడ్ సీట్లను కేటాయిస్తారు. తరువాత అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.
