ఎం కోటేశ్వరరావు
వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ప్రపంచమంతటా పొలాల్లో పని చేసేందుకు యువత ముందుకు రావటం లేదు.వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకొనేందుకు కొన్ని చోట్ల యువతులు సుముఖత చూపటం లేదు. పర్యావరణం పేరుతో అనేక నిబంధనలు, సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్కు ఎన్నికల సంవత్సరమిది. మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ అనేక దేశాల్లో గ్రామీణులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా వ్యవసాయం ఒక్కటే, అందరూ రైతులే అయితే, ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది. మార్కెట్ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడబడితే అక్కడ అమ్ముకొనేందుకు, నేరుగా ఎగుమతులు చేసుకొని భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు గతంలో నరేంద్రమోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి, భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గారు.ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పుకొని ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుంది ?
స్పెయిన్ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. టోకు సూపర్మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపేనాధుడు లేకపోవటంతో రైతులు పోరుబాట పట్టారు. మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్ రైతులు చెబుతున్నారు.2023 జూన్-సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది.మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.దేశీయ రైతుల మీద నిబంధనలను గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్ కంపెనీల దిగుమతుల మీద ఉన్నవాటిని చూసీ చూడనట్లు వదలివేస్తున్నారు.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న వత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు.ఐరోపా సమాఖ్య దేశాల జిడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్లో వ్యవసాయ రంగం 30శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపునింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకు అని ప్రశ్నించటమే.1960లో స్పెయిన్ జిడిపిలో వ్యవసాయ వాటా 23.5శాతం కాగా 2022 నాటికి 2.6శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది.పారిశ్రామిక రంగ జిడిపి వాటా కూడా ఇదే కాలంలో .30.8 నుంచి 17.4శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6శాతానికి పెరిగింది.ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2శాతం ఉన్నారు. దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా 6.6లక్షల యజమానులు ఏదో ఒక రూపంలో ఐరోపా సమాఖ్య సాయం పొందుతున్నారు. గతేడాది నలభైశాతం ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. తొంభైలక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ అమల్లో ఉంది. తెలుగు ప్రాంతాల్లో వేరుశనగ నూనె వంటలకు వాడినట్లుగా స్పెయిన్లో ఆలివ్ నూనె వినియోగిస్తారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటరు ధర ఐదు నుంచి 14యూరోలకు పెరిగింది. దుకాణాల్లో దొంగతనాలు చేసే వస్తువుగా మారింది.
రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి.వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హానికలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్, నైట్రోజన్ తదితర వాయువులను 30శాతం తగ్గించాలన్నది ఒకటి.ఓజోన్ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు.మన మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్దం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.
ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్లో జరిగే ఐరోపా యూనియన్ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది. స్పెయిన్ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చివేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్ అమెరికా దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.జూన్లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు. తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని కర్ణాటక బిజెపి ఎంపీ అనంతకుమార్ హెగ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే గతంలో వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో తిరిగి ప్రవేశపెడతారనే భావం కార్పొరేట్లలో ఆశలు రేపుతోంది. అందుకే మద్దతు ఇస్తున్నారు. అనేక దేశాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాల నుంచి మనదేశంలో జరుగుతున్నదానిని వేరు చేసి చూడలేము.ప్రపంచీకరణ యుగంలో ప్రతి రంగంలోనూ విడదీయరాని బంధం ఉంటుంది.
లోక్సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి అనుమతి లేదంటూ పంజాబ్లోని అనేక గ్రామాలలో పోస్టర్లు వెలువడినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి.” మీరు మమ్మల్ని ఢిల్లీలో ప్రవేశించనివ్వలేదు గనుక మీ నేతలను గ్రామాల్లోకి రానివ్వం ” అని పోస్టర్లలో హెచ్చరించారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసిన సాగు చట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతారని పంజాబ్లో జరుగుతున్న రైతుల సభల్లో హెచ్చరిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సునీల్ జక్కర్ మార్చినెల 24న భటిండాలో తలపెట్టిన బిజెపి మహౌత్సవ్ సభ రైతుల నిరసన కారణంగా రద్దు చేసుకున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొన్నది.ఇలాంటి నిరసనలే అనేక గ్రామాల్లో వెల్లడౌతున్నాయి. రైతుల ఆందోళన పట్ల బిజెపి వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం, ఎన్డిఏ నుంచి అకాలీదళ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీతో సర్దుబాటు చేసుకొనేందుకు చూసిన బిజెపి భంగపడింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే బిజెపితో చేతులు కలిపేందుకు ఆ పార్టీ భయపడిందని చెప్పవచ్చు.” బిజెపి బండారాన్ని బయటపెట్టండి, బిజెపిని వ్యతిరేకించండి, బిజెపిని శిక్షించండి ” అంటూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ప్రచారం చేస్తున్నది.
మనదేశంలో రైతు కుటుంబాలలో యువకులకు వివాహాలు ఒక సమస్యగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాం. ఐరోపా, అమెరికాల్లో కూడా వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావటం లేదు.ఫ్రాన్సులో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలుగా ఉందని, అనేక కుటుంబాల్లో సాగును కొనసాగించే వారు కనిపించటం లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. యాంత్రీకరణతో పనిచేసే జనాభా తగ్గి అనేక చోట్ల గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.ఫ్రెంచి ఆహార, వ్యవసాయ, పర్యావరణ జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 18శాతం మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, మరో 25శాతం మంది చావ బతకలేని స్థితిలో ఉన్నారు.పర్యావరణం పేరుతో సాగుకు ఆటంకం కలిగించటం పట్ల రైతులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు.నాలుగుశాతం సాగు భూమిలో సాగు చేయకుండా చెట్ల పెంపకానికి వదలివేయాలన్నది ఒక నిబంధన పెట్టారు. ఇతర నిబంధనల కారణంగా సబ్సిడీలకు కోత పెడుతున్నారు. ఐరోపాలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏర్పడిన పార్టీల సమావేశాల మీద రైతులు దాడులకు దిగుతున్నారు. జర్మనీలో అదే జరిగింది. బెర్లిన్ సమపంలో రోడ్లపై ఎరువుల మడ్డిని కుమ్మరించటంతో అనేక కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి.ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఐరోపా దేశాల్లో ఇంథన, విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగాయి.ఫ్రాన్స్లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ ఖర్చు అంతకు ముందుతో పోలిస్తే గతేడాది రెట్టింపైంది. ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఐరోపా వ్యవసాయ విధానమే అక్కడి రైతులను ఆందోళనలకు పురికొల్పుతున్నది. పోలాండ్లో కార్మికుల వేతన రేట్లు చాలా తక్కువ, దానికి తోడు చౌకగా కోళ్లను పెంచి ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించటంతో ఫ్రాన్స్ వంటి చోట్ల కోళ్ల రైతులకు గిట్టుబాటు కావటం లేదు.ఉక్రెయిన్లో వేతనాలు మరీ తక్కువ. దాంతో అక్కడి నుంచి చౌక ధరలకు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అది రైతుల్లో అసంతృప్తికి దారితీయటంతో పంచదార, కోడి మాంస దిగుమతులపై ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు.