• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Japan

చైనాను బూచిగా చూపి పేట్రేగుతున్న అమెరికా మిలిటరీ ఉన్మాదం !

18 Wednesday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Military Spending Frenzy, Nuclear Warheads, PENTAGON, Pentagon on China military, US imperialism


ఎం కోటేశ్వరరావు


2023లో 858 బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని పెంటగన్‌ (అమెరికా రక్షణ శాఖ ) నిర్ణయించింది. ఇది అడిగినదానికంటే 45 బి.డాలర్లు అదనం. నిజానికి 1200బి.డాలర్లు ఖర్చు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజు తలచుకోవాలే గానీ దెబ్బలకు కొదవా అన్నట్లుగా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు కనుసైగ చేయాలేగానీ అమెరికా పాలకులు డాలర్లతో వాలిపోతారు. స్టాక్‌హౌం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రీ) గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో తొలిసారిగా ప్రపంచ రక్షణ ఖర్చు రెండు లక్షల కోట్ల డాలర్లు (2,113 బి.డాలర్లు) దాటింది. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా వాటా మొత్తంలో 62శాతం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు లేదా బాధితులను ఆదుకొనేందుకు చేసిన ఖర్చు సంగతేమో గానీ వరుసగా ఏడేళ్లు , కరోనాలో ఆర్థిక రంగం దిగజారినప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం మిలిటరీ ఖర్చు మాత్రం పెరిగింది.


అమెరికాలో 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. సాంకేతికంగా ఇతర దేశాల కంటే పైచేయిగా ఉండాలన్న వైఖరితో ఏటా భారీ ఎత్తున పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. రష్యా నుంచి ప్రధానంగా ఎగుమతి జరిగే చమురు ధరలు తక్కువగా ఉండి రాబడి తగ్గటంతో 2016 నుంచి 2019 వరకు దాని మిలిటరీ ఖర్చు కూడా తగ్గింది. అయితే, అమెరికా, ఇతర నాటో దేశాల కుట్రలను పసిగట్టి తరువాత ఉక్రెయిన్‌ సరిహద్దులో మిలిటరీని పెంచటంతో ఖర్చు కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2021లో ఖర్చు పెరిగినందున 65.9బి.డాలర్లకు చేరింది. గతేడాది 75, ఈ ఏడాది 84బి.డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెండవ స్థానంలో ఉన్న చైనా ఖర్చు 293 బి.డాలర్లుంది. గత 27 సంవత్సరాలుగా వరుసగా పెరుగుతూనే ఉంది.76.6 బి.డాలర్లతో మన దేశం మిలిటరీ ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. ఇటీవల జపాన్‌ భారీ మొత్తాలను పెంచటంతో మనలను వెనక్కు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించనున్నట్లు వార్తలు. 2021లో 50 బి.డాలర్లకు మించిన ఖర్చు ఉన్న దేశాలు వరుసగా అమెరికా(801), చైనా (293), భారత్‌ (76.6), బ్రిటన్‌ (68.4), రష్యా (65.9), ఫ్రాన్స్‌ (56.6), జర్మనీ (56), సౌదీ అరేబియా (55.6), జపాన్‌(54.1), దక్షిణ కొరియా (50.2) ఉంది.
అమెరికాతో సహా ప్రత్యేకించి చైనాను దెబ్బతీసేందుకు చూస్తున్న దేశాలు దాన్నొక బూచిగా చూపుతూ తమ ఖర్చును పెంచుతున్నాయి.

ఏ దేశమూ మరో దేశాన్ని నమ్మే పరిస్థితి లేనందున మిలిటరీ నవీకరణకు తప్పనిసరిగా కొంత ఖర్చు పెరగటం సహజం. అమెరికా, ఐరోపాలోని ప్రయివేటు రంగంలోని ఆయుధ కంపెనీల లాభాలను పెంచేందుకు వివిధ ప్రాంతాలలో చిచ్చు రేపుతున్నందున, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేక దేశాలు ఖర్చును పెంచాల్సి వస్తోంది. రెండవ అంశమే ప్రధానంగా పని చేస్తోంది. ప్రపంచాన్ని భయ పెట్టేందుకు, తన పెత్తనాన్ని రుద్దేందుకు అవసరం లేకున్నా తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తరువాత కాలంలో ప్రపంచమంతటా అణ్వాయుధాల తయారీ, ఇతర వాటికి పదును పెట్టే, సేకరణ పోటీకి తెరతీసింది. సోవియట్‌ యూనియన్ను బూచిగా చూపి రక్షణ పేరుతో నాటో కూటమిని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్నే ఏకంగా తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మిలిటరీ శక్తితో చైనా, ఇండో-చైనా దేశాలను ఆక్రమించుకున్నది జపాన్‌.అది రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిన తరువాత దాని మీదకు ఎవరో దాడికి రానున్నట్లు బూచిగా చూపి రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పిటలోకి తీసుకున్నదీ అమెరికానే. ఇప్పుడు చైనాను బూచిగా చూపి ఇతర దేశాలను తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే కొత్త కథలు అల్లుతోంది.


చైనా దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల అణ్వాయుధాలు 2035 నాటికి 1,500కు పెరుగుతాయని, అందువలన దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పెంటగన్‌ అందరినీ ఉసిగొల్పుతోంది. అంతే కాదు, అమెరికాలోని ఆయుధ పరిశ్రమల కోసం కూడా మీడియాలో కట్టుకథలను అల్లించటం, వాటిని చూపి బడ్జెట్‌ను పెంచాలని వత్తిడి తేవటం అమెరికాలో అనేక మంది అధికారుల, ఎంపీల రోజువారీ వృత్తి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర 13,080 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇక అణువిద్యుత్‌ కేంద్రం ఉన్న ప్రతి దేశం వాటిని ఏ క్షణంలోనైనా రూపొందించగల సత్తా కలిగినదిగా పరిగణిస్తున్నారు. రష్యా వద్ద 6,257 అణ్వస్త్రాలు ఉంటే వాటిలో తక్షణమే దాడికి పనికి వచ్చేవి 1,458, అందుబాటులో ఉన్నది 3,039, పనికి రానివి 1,760గా చెబుతున్నారు. ఆ తరువాత అమెరికా వద్ద ఇలాంటివే వరుసగా 5,550-1,389-2,361-1,800 ఉన్నట్లు అంచనా. వీటితో పోలిస్తే చైనా ఒక మరుగుజ్జు మాదిరి ఉంటుంది. ఇక దేశాల వారీగా చైనా వద్ద 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, పాకిస్థాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు ఉన్నట్లు అంచనా. ఈ అంచనాలు, సంఖ్యలను ఎవరూ పూర్తిగా నిర్ధారించలేరు. అవసరమైతే ఎప్పటికప్పుడు రూపొందిందే ఆధునిక పరిజ్ఞానం అమెరికా, రష్యా వద్ద ఉంది. ఇప్పుడు చైనాను చూపి మరింతగా మిలిటరీ ఖర్చు ఎందుకు చూపుతున్నట్లు అన్నది ప్రశ్న.


ఏడాదికి ఒక సారో రెండుసార్లో ఎవరైనా కొనుగోలు చేసి కాల్చగల దీపావళి బాంబుల వంటివి కాదుఅణ్వాయుధాలు. వాటి రూపకల్పనకు ఖర్చైన మాదిరే నిర్వీర్యం చేసేందుకు కూడా చేతి సొమ్ము వదిలించుకోవాల్సిందే. అమెరికా తప్ప ఇంతవరకు ఏ దేశమూ వాటిని ప్రయోగించలేదు.అలాంటి పని చేస్తే ఏ దేశమూ మిగలదు.భారత్‌కు పాకిస్థాన్‌ ఎంత దూరమో పాకిస్థాన్‌కూ భారత్‌ అంతే దూరం. అదే విధంగా ఇతర అణుశక్తి దేశాలూ కూడా. ఎవరు అస్త్రాన్ని వదిలినా వెంటనే మరొకరు సంధిస్తారు. కట్టుకథలు, పిట్టకతలను ఆకర్షణీయంగా మలచటం తప్ప వాటిలో హేతుబద్దత కనిపించదు. ఉదాహరణకు గతేడాది నవంబరు 29న సిఎన్‌ఎన్‌ ఒక వార్తను అల్లింది. దాని ప్రకారం చైనా వద్ద 2020లో రెండువందల అణ్వాయుధాలుండగా 2022 నాటికి 400కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేగానికి అనుగుణంగా 2035 నాటికి 1,500కు పెరగవచ్చని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు పెరిగితే పదమూడు సంవత్సరాల్లో 12,800కు చేరతాయి.అది జరిగేదేనా ? ఈ లోగా ఇతర దేశాలు చేతులు ముడుచుకు కూర్చుంటాయా ? ఇలాంటి అంకెలకు ఆధారం ఏమిటి ?


అణ్వాయుధాలంటే ఫాక్షనిస్టులు ఇండ్ల దగ్గర నాటు బాంబులను చుట్టినట్లు కాదు. అవసరమైన యురేనియం,ప్లుటోనియం కోసం అణురియాక్టర్లు, శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగాలి.దానికోసం ఎంతో ఖర్చు అవుతుంది. అనేక దేశాలు విద్యుత్‌ వంటి పౌర అవసరాల కోసం అణుకేంద్రాల నిర్మాణం చేస్తున్నాయి. అక్కడే అణ్వాయుధాల రూపకల్పనకు అవసరమైన గ్రేడ్ల యురేనియం,ప్లుటోనియం కూడా తయారు చేయవచ్చు.విద్యుత్‌ కోసం చైనాతో సహా అనేక దేశాలు అణుకేంద్రాల నిర్మాణం చేపట్టాయి. మన దేశంలో 22 రియాక్టర్లు, ఎనిమిది విద్యుత్‌ కేంద్రాలున్నాయి. మరో పది రియాక్టర్లు, విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణం,ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెంటగన్‌ నివేదికల్లో చెప్పినవన్నీ ప్రమాణాలు కాదు. ఊహాగానాలు, ఆధారం లేని ఆరోపణలు అనేకం ఉంటాయి. మూడు వందల ఖండాంతర క్షిపణుల(ఐసిబిఎం)ను ప్రయోగించేందుకు అవసరమైన నిర్మాణాలను చైనా జరుపుతోందన్నది దానిలో ఒకటి. దీనికి ఎలాంటి ఆధారం లేదని అమెరికా పత్రికలే రాశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ సంస్థకు చెందిన వారు చైనా వద్ద కేవలం 110 మాత్రమే ఖండాంతర క్షిపణులున్నట్లు, బహుశా దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా కలుపుకొని 300 సంఖ్య చెప్పి ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా1960 దశకం నుంచి ఐసిబిఎం, అణుక్షిపణి జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లను సమన్వయం చేస్తున్న విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వీటిని మరింత నవీకరించేందుకు 1.8లక్షల కోట్ల డాలర్లతో ఒక పధకాన్ని ప్రారంభించారు. చైనా కూడా ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తున్నదనే అనుమానం పెంటగన్‌కు ఉండి, చీకట్లో బాణాలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ దేశానికైనా తన జాగ్రత్తలో తానుండే హక్కు, అవకాశం ఉంది.


అణుక్షిపణుల జలాంతర్గాములతో 1959 నుంచే అమెరికా పహారా కాస్తున్నది. చైనా వద్ద ఉన్న అలాంటి జలాంతర్గాములు 2021 నుంచి పని చేస్తున్నట్లు అంచనా. అమెరికా వద్ద 11,840 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేరుకొనే జలాంతర్గాములు క్షిపణులు ఉండగా చైనా వద్ద 6,880 కిమీ దూరం వెళ్లే క్షిపణులున్నట్లు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం వాస్తవం చైనా అంటే చౌక ధరలకు అందించే పాదరక్షలు, దుస్తులు,ఫోన్లు, టీవీల వంటి వినియోగవస్తువులను మాత్రమే భారీ ఎత్తున తయారు చేయగలదని అనేక మంది ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. బొమ్మ విమానాలు, దీపావళి తారాజువ్వలనే కాదు నిజమైన వాటిని రూపొందించగల సత్తా సమకూర్చుకుంది. చైనాలో గుట్టు ఎక్కువ. రోజువారీ వస్తువులతో పాటు తనను దెబ్బతీసేందుకు చూసే వారికి దడపుట్టించే ఆధునిక అస్త్రాలను కూడా అది ఇప్పుడు కలిగి ఉంది. అమెరికాకు పట్టుకున్న భయాలలో అదొకటి. ఇటీవల తైవాన్‌ జలసంధిలో అలాంటి వాటిని చైనా ప్రదర్శించింది.


2023లో జర్మనీతో సహా నాటో దేశాలన్నీ రక్షణ ఖర్చును భారీ ఎత్తున పెంచనున్నాయి. వాటి జిడిపిలో రెండు శాతం అందుకు కేటాయించాలని, నాటో ఖర్చును తామెంత కాలం భరించాలంటూ, ఒక వేళ రష్యా గనుక దాడి చేస్తే రక్షణకు తాము వచ్చేది లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు బహిరంగంగానే వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ నేపధ్యంలో భారీగా పెంచుతున్నప్పటికీ పెంటగన్‌ వాటిని లోక కల్యాణం కోసం అన్నట్లుగా చూస్తున్నది. జిడిపిలో రెండు శాతం అన్న దానికి అనుగుణంగా ప్రత్యేక ఆయుధ నిధి కోసం తాము 106బి.డాలర్లు ఖర్చు చేస్తామని గతేడాది ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన మూడు రోజుల తరువాత జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు.జర్మనీ ఆయుధ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవటంతో పాటు, అమెరికాను సంతుష్టీకరించటం నాటోలో అమెరికా తరువాత పెత్తనం తనదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్థికంగా దిగజారి ఉన్నందున బ్రిటన్‌ ఖర్చు పెంచే స్థితిలో లేదు. జపాన్‌ మాదిరే ఇటీవలి కాలంలో జర్మనీ తన ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నది. తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌,ఫిన్లండ్‌ కూడా నాటోలో చేరి మిలిటరీ ఖర్చును పెంచనున్నాయి. పోలాండ్‌ కూడా ఖర్చు పెంచేందుకు పూనుకుంది.ఇవన్నీ జరిగితే సింహభాగం అమెరికా సంస్థలే లబ్ది పొందుతాయి.


భారీ ఎత్తున పెంచిన పెంటగన్‌ బడ్జెట్‌తో సంతృప్తి చెందని మిలిటరీ కార్పొరేట్ల కనుసన్నలలో నడిచే ఎంపీలు, అధికారులు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ సలహాదారు మెక్‌ మాస్టర్‌ పన్నెండువందల బి.డాలర్లు కావాలని చెప్పాడు. జపాన్‌ రెండింతలు చేసేందుకు పూనుకున్నదని దాన్ని చూసి నేర్చుకోవాలంటూ చైనాను నిలువరించేందుకు అవసరమైనదాని కంటే అమెరికా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు విమర్శించాడు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంటగన్‌ వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుందని కొందరు గుండెలు బాదుకున్నారు. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్న అమెరికాకు తోడుగా, జపాన్‌, ఆస్ట్రేలియా కూడా రక్షణ ఖర్చు పేరుతో సమీకరణ కావటం ఆందోళన కలిగించే పరిణామం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ప్రభావం : రూపాయి ఉల్లాస లాభం 328, వైఫల్య నష్టం 2,420 పైసలు !

31 Saturday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్‌ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్‌ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్‌, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్‌ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.


డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్‌ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్‌ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్‌ డాలర్‌ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్‌ పెసో,చైనా యువాన్‌, దక్షిణ కొరియా వాన్‌, మలేసియా రింగిట్‌, థాయిలాండ్‌ బట్‌ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్‌ జర్నల్‌ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్‌ ఎన్‌ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్‌ 8.6, ఆస్ట్రేలియా డాలర్‌ 6.5,దక్షిణ కొరియా వాన్‌ 5.5 శాతం చొప్పున క్షీణించింది.


2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్‌ పుతిన్‌, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్‌ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్‌ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్‌ షేర్వాణీ అందర్‌ పరేషానీగా ఉంది.


మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.


నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్‌ ఖాతా అంటారు) 36.4 బిలియన్‌ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.


డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.


ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.


కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్‌ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్‌ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో జోడీ కట్టాలా ! విడగొట్టుకోవాలా ! తైవాన్‌ చిప్స్‌ పరిశ్రమ ధ్వంసం అమెరికా బెదరింపు !

21 Wednesday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Decouple from China, Narendra Modi, Narendra Modi Failures, RSS, Taiwan Matters, TRADE WAR, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

23 Wednesday Nov 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Kim Jong-un, North Korea’s missile tests, Pyongyang, US imperialism, yankees


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌ వేర్పాటు వాదులు, అమెరికాకు షీ జింపింగ్‌ హెచ్చరిక !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CPC 20th congress, Taiwan independence, Taiwan Matters, Xi Jinping, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అతి పెద్ద దేశం చైనా. అతి పెద్ద రాజకీయ సంస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభల్లో భాగంగా 20వ మహాసభ అక్టోబరు 16-22 తేదీలలో జరుగుతున్నది.తొమ్మిది కోట్ల 67లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మిలిటరీతో సహా వివిధ విభాగాలు, తిరుగుబాటు ప్రాంతంగా ఉన్న తైవాన్‌ నుంచి మొత్తం 2,296 మంది పాల్గ్గొంటున్నారు. తదుపరి మహాసభ 2027లో జరగనుంది. సహజంగానే చైనా అధికార పార్టీ మహాసభ తీసుకొనే నిర్ణయాలు, చేసే దశ, దిశ నిర్దేశాల గురించి ప్రపంచం ఆసక్తితో ఎదురు చూస్తుంది. కొంత మంది ఆ ఏముంది, నేతలు ఏమి చెబితే ప్రతినిధులు దానికి తలూపటం తప్ప భిన్నాభిప్రాయాలను వెల్లడి కానివ్వరుగా అని పెదవి విరుస్తారు.వీరిలో కమ్యూనిస్టు పార్టీల పని పద్దతుల గురించి తెలియని వారు కొందరైతే, తెలిసీ బురద చల్లేవారు మరి కొందరు. మన దేశంలో సిపిఎం మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు.గతం, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసి వచ్చే మూడు సంవత్సరాల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం గురించి పాత కేంద్ర కమిటీ కొత్త మహాసభకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి దిగువన ఉన్న ప్రాధమిక శాఖ నుంచి రాష్ట్ర కమిటీల వరకు చర్చకు పంపుతారు, సవరణలు, వివరణలను ఆహ్వానిస్తారు. అంతిమంగా ఖరారు చేసిన దానిని ప్రతినిధుల మహాసభ ఆమోదానికి పెడతారు. అక్కడే దాన్ని ఖరారు చేస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ దాని నిబంధనావళి ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధికారంలో ఉంది గనుక రాజకీయ విధానంతో బాటు దేశ అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం గురించి కూడా చర్చిస్తుంది.


కొంత మంది ఆశిస్తున్నట్లు లేదా కోరుకుంటున్నట్లుగా అనేక పార్టీల మాదిరి భిన్నాభిప్రాయాలను పార్టీ ప్రతినిధులు వీధుల్లోకి తీసుకురారు. పార్టీ వేదికల మీదే కుస్తీ పడతారు. మెజారిటీ అంగీకరించిన విధానాన్ని మిగతావారు కూడా అనుసరిస్తారు. నేను పార్టీలోనే దీన్ని గురించి నిరసన తెలిపాను, కనుక అంగీకరించను, అమలు జరపను అని వెలుపల చెప్పటం క్రమశిక్షణా రాహిత్యం, కేంద్రీకృత ప్రజాస్వామిక విధానానికి విరుద్దం. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరణతో సహా తగిన చర్యలుంటాయి.చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ చేసే నిర్ణయాలు, విశ్లేషణలు, ప్రపంచ స్పందనల గురించి ఒక వ్యాసంలో వివరించటం కష్టం. ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కూడా కాలేదు. ప్రారంభ సభలో పార్టీ అధినేత షీ జింపింగ్‌ చేసిన ప్రసంగంలో తైవాన్‌ గురించి చేసిన ప్రస్తావన గురించి చూద్దాం.


ఈ మహాసభ పూర్వరంగంలోనే చైనాను రెచ్చగొట్టేందుకు వేసిన ఎత్తుగడ, చేసిన కుట్రలో భాగంగా అమెరికా అధికార వ్యవస్థలో మూడవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) స్పీకర్‌ నాన్సీ పెలోసీని అడ్డదారిలో తైవాన్‌ పంపారు, అక్కడి వేర్పాటు వాదులకు మద్దతు తెలిపి గతంలో తాను అంగీకరించిన ఒకే చైనాఅన్న విధానానికి తూట్లు పొడిచారు. ఈ వైఖరి ఐరాస, భద్రతా మండలి నిర్ణయాలకు సైతం వ్యతిరేకమే. అది వేరుగా ఉన్నందున శాంతియుత పద్దతుల్లో విలీనం జరగాలన్నది వాటి తీర్మానాల సారాంశం. దానికి భిన్నంగా తైవాన్‌లో కొంత మంది చైనా వ్యతిరేక దేశాల తెరచాటు మద్దతుతో తమది స్వతంత్ర దేశమని చెబుతున్నారు. ఒక వైపు విలీనం జరగాలని చెబుతూనే అమెరికా వంటి దేశాలు తైవాన్‌ వేర్పాటు వాదులకు అవసరమైన ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటుకు పురికొల్పుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే షీ జింపింగ్‌ తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఈ మహాసభలో తమ వైఖరి గురించి మరోసారి పునరుద్ఘాటించారు. తైవాన్‌ విలీనానికి శాంతియుత పద్దతులు విఫలమైతే అవసరమైతే బలప్రయోగం తప్పదన్న తమ ప్రకటన, వైఖరిని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని జింపింగ్‌ చెప్పారు.” తైవాన్‌ సమస్య పరిష్కారం చైనీయులకు సంబంధించింది. దాన్ని పరిష్కరించుకోవాల్సింది చైనీయులే. పూర్తి చిత్తశుద్ది, చివరి క్షణం వరకు శాంతియుత పద్దతుల్లో విలీన యత్నాలను కొనసాగిస్తాం. బలప్రయోగం చేయబోము అని మేము వాగ్దానం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాల చర్యలు తీసుకొనే అవకాశాలను అట్టి పెట్టుకుంటాం. వెలుపలి శక్తుల జోక్యం, తైవాన్‌ స్వాతంత్య్రం కోరుతున్న కొంత మంది, వారి వేర్పాటు వాద కార్యకలాపాలే ఈ వైపుగా మమ్మల్ని నడిపిస్తున్నాయి. దీని అర్దం ఏ విధంగానూ మా తైవాన్‌ సోదరులను లక్ష్యంగా చేసుకోవటం కాదు ” అన్నారు. షీ జింపింగ్‌ మాటలను బట్టి మరింత వేగంగా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పాడు. మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌తో మాట్లాడినపుడు ఈ మాటలు చెప్పాడు.


ఈ మహాసభకు తైవాన్‌ ప్రాంతం నుంచి పది మంది ప్రతినిధులు వచ్చారు. వారు పార్టీ వైఖరిని సమర్ధిస్తూ ఒక చైనా, రెండు వ్యవస్థలనే విధానం ( బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన హంకాంగ్‌ , అదే విధంగా పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన మకావో దీవులను చైనాలో విలీనం చేశారు. ఆ సందర్భంగా అక్కడి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను 50 సంవత్సరాల పాటు ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగిస్తామని, పౌరపాలనకు ప్రత్యేక పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్థ-విలీన ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించటం. ఇదే విధానాన్ని తైవాన్‌ ప్రాంతానికి కూడా వర్తింప చేస్తామని చైనా చెబుతోంది. హాంకాంగ్‌, మకావో విలీనాలు జరిగి పాతికేండ్లు అవుతోంది. ఈ ప్రాంతాలకు చైనా భద్రతా చట్టాలు వర్తిస్తాయి, వాటితోనే అక్కడి వేర్పాటు వాదులను అదుపులోకి తెచ్చారు.) శాంతియుత విలీనం అన్న విధానానికి అనుగుణంగా, విలీనం కోసం పార్టీ చేస్తున్న యత్నాలకు రుజువుగా నివేదిక ఉందని పేర్కొనటం పట్ల సభ ప్రతినిధులందరూ హర్షాతిరేకాలు వెల్లడించారు. బ్రిటీష్‌ వారి పాలనలో ఎన్నడూ స్వాతంత్య్రం, ఎన్నికల గురించి మాట్లాడని కొన్ని శక్తులు చైనాలో విలీనం తరువాత తొలిసారిగా జరిపిన ఎన్నికలను తప్పు పట్టటం, విద్యార్దులను రెచ్చగొట్టి స్వాతంత్య్రం పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి కుట్రల గురించి తెలిసిందే. తైవాన్‌లో ఏకంగా అక్కడి ప్రభుత్వం ఏకంగా మిలిటరీ, ఆయుధాలను సేకరిస్తున్నది. ఈ కారణంగానే అవసరమైతే చివరి అస్త్రంగా బలప్రయోగం తప్పదని చైనా చెబుతోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆయుధాలను మోహరించి రష్యాకు పక్కలో బల్లెంలా మారేందుకు అమెరికా, నాటో కూటమి పూనుకుంది. అదే మాదిరి టిబెట్‌, తైవాన్లను స్వతంత్ర దేశాలుగా చేసి అక్కడ పాగా వేసి చైనా, భారత్‌లకు తల మీద కుంపటి పెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకే అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. దలైలామా తిరుగుబాటు, మన దేశంలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు కూడా దానిలో భాగమే.

1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చినపుడు పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ మిగిలిన మిలిటరీ, ఆయుధాలను తీసుకొని తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ తిష్టవేశాడు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి. అప్పటికే ఉన్న ఐరాస భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం తన ఆధీనంలోనే కొనసాగుతున్నదంటూ ఐరాసలో చాంగ్‌కై షేక్‌ నియమించిన వారినే ఐరాస గుర్తించింది. ఉన్నది ఒకే చైనా అని పేర్కొన్నారు. ఇది 1970 దశకం వరకు కొనసాగింది. విధిలేని పరిస్థితిలో అసలైన చైనా అంటే ప్రధాన భూభాగంలో ఉన్న కమ్యూనిస్టులదే ప్రభుత్వమని గుర్తించిన తరువాత తైవాన్‌ గుర్తింపు రద్దు, దాన్ని కూడా చైనాలో అంతర్భాగంగానే పరిగణించారు. అందువలన సాంకేతికంగా దాని స్వాతంత్య్ర ప్రకటనను అమెరికాతో సహా శాశ్వత సభ్యదేశాలేవీ సమర్దించే అవకాశం లేదు. దొడ్డిదారిన ఏదో ఒకసాకుతో విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. 1950 దశకంలో ఒకసారి విలీనానికి చైనా ప్రయత్నించినపుడు అణుబాంబులు వేస్తామని అమెరికా బెదిరించింది. దాంతో అప్పటికే హిరోషిమా-నాగసాకీలపై అవసరం లేకున్నా బాంబులు వేసిన దాని దుర్మార్గాన్ని చూసిన తరువాత అలాంటి పరిస్థితిని చైనా పౌరులకు కలిగించకూడదనే జవాబుదారీతన వైఖరితో పాటు తరువాత చూసుకుందాం లెమ్మని చైనా తన ఇతర ప్రాధాన్యతలపై కేంద్రీకరించింది. అంతే తప్ప తైవాన్‌పై తన హక్కును ఎన్నడూ వదులు కోలేదు. సందర్భం వచ్చినపుడల్లా పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో తడిక రాయబారాలు జరుగుతూనే ఉన్నాయి.


పార్టీ మహాసభ ప్రారంభంలో షీ జింపింగ్‌ తైవాన్‌ గురించి చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక అమెరికాకే అని అనేక మంది విశ్లేషించారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. తన ఉపన్యాసంలో విలీన ప్రక్రియలో భాగంగా చైనాకు చెందిన తైవాన్‌ జలసంధి సంబంధ సంస్థ, తైవాన్‌లోని జలసంధి ఎక్సేంజ్‌ ఫౌండేషన్‌, బ్రిటీష్‌ పాలనలోని హాంకాంగ్‌ ప్రతినిధులతో చైనా జరిపిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన 1992 ఏకాభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా షీ చెప్పారు. అయితే ప్రస్తుతం తైవాన్‌ అధికారంలో ఉన్న వేర్పాటు వాదులు దాన్ని తిరస్కరిస్తున్నారు. తైవాన్‌లో అప్పుడున్న జాతీయ ఐక్యతా మండలి ఇప్పుడు లేదు. నాటి ఏకాభిప్రాయం ప్రకారం చైనా అంటే ఒకటే గానీ అసలు చైనా అంటే ఏమిటి అన్నదానిపై విబేధం ఉందని తప్పుడు భాష్యం చెబుతున్నారు. విలీనం తరువాత ప్రత్యేక పాలిత ప్రాంతంగా తైవాన్‌ ఉంటుందని చైనా చెబుతుండగా, 1911 నాటిదే అసలైన చైనా అని దానిలో తైవాన్‌, ఇతర ప్రాంతాలతో పాటు ప్రధాన భూభాగం కూడా ఒక ప్రాంతమే అని తైవాన్‌ వేర్పాటువాదులు అన్నారు. దివంగత తైవాన్‌ నేత లీ టుంగ్‌ హుయి అసలు 1992ఏకాభిప్రాయం లేదని, ఒకే చైనాలో రెండు దేశాలు అనే ప్రతిపాదనను ముందుకు తేగా చైనా తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా తమది స్వతంత్ర దేశమని అక్కడి పాలకులు అంటున్నారు. అమెరికా ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఒకసారి చెప్పినదాన్ని మరోసారి చెప్పటం లేదు. మొత్తం షీ జింపింగ్‌ మాటల సారం గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం అంటున్న తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర చైనా వ్యతిరేకుల ఆటలు సాగనివ్వబోమన్నదే హెచ్చరిక !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

5జి వశీకరణ మంత్రం : మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, జోడీగా కార్పొరేట్‌ మహా మాంత్రికుడు ముకేష్‌ అంబానీ !

04 Tuesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, GDP growth, India GDP, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌ గురించి చెప్పాలి. సార్‌ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్‌ డ్రైవర్‌ను సార్‌ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్‌ మజాక్‌ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్‌ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్‌,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసిండో బాలన్స్‌ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !


మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్‌ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.


ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.


బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?


ఇక అరవై ఐదేండ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్‌లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్‌ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.


ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ కంపెనీ జపాన్‌లో ఒకటవ తరం సెల్‌ఫోన్‌ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్‌ 2జిని, 2001లో జపాన్‌ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్‌ఫోన్‌తో పశ్చిమ బెంగాల్‌ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్‌తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్‌కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.


మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.


2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్‌ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.


5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్‌ సర్వీసు సెంటర్స్‌(సిఎస్‌సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?


జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్‌ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్‌ చేసిన కాబ్‌ డ్రైవర్‌కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాను రెచ్చగొడుతున్న అమెరికా : తాజాగా తైవాన్‌ జలసంధికి రెండు యుద్ద నౌకలు !

31 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Nancy Pelosi Taiwan trip, Taiwan Matters, US provocative actions, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ అని తాలిబాన్లను వేడుకొని ఆఫ్ఘనిస్తాన్నుంచి అవమానకరంగా వెనుదిరిగిన అమెరికా కొద్ది నెలలు గడవకుండానే ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెరదీసింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో అంతుబట్టని స్థితిలో ఇప్పుడు తైవాన్‌ పేరుతో చైనాను రెచ్చగొడుతోంది.ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్‌లో.ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ జోక్యం, దాడులు స్పష్టం చేశాయి. ప్రకృతిలో రాబందులు పశువుల, మనుషుల మృతకళేబరాల కోసం నిరంతరం చూస్తుంటాయి, అవే వాటి ఆహారం. అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ రాబందులు మాత్రం నిరంతరం యుద్ధాల కోసం చూస్తుంటాయి.అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టి లాభాలను పిండుకోవటమే దాని పని. ఇప్పటి వరకు అమెరికా గడ్డమీద ఎలాంటి యుద్దాలు జరగకపోవటం, ప్రత్యక్షంగా పర్యవసానాలను అనుభవించకపోవటంతో అక్కడి జనాలు కూడా మొత్తం మీద యుద్ధాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.ఆమోదిస్తున్నవారు ఉండటం ఆందోళనకరం.


తైవాన్‌ జలసంధిలో తిరుగుతున్న అమెరికా మిలిటరీ నౌకలు ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలను కట్టివేసుకొని ఏమీ తెలియనట్లు సంచరిస్తున్నాయని, ఇది రెచ్చగొట్టుడుకే తప్ప మరొకటి కాదని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. తైవాన్‌ విలీన ప్రక్రియను అడ్డుకొనే క్రమంలో ఒకవేళ యుద్దమే గనుక వస్తే జలసంధిలో ప్రవేశించే అమెరికా మిలిటరీ నౌకలు చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయని భూమి మీద నుంచి చైనా సంధించే క్షిపణులను అవి తట్టుకొని నిలవలేవని అందువలన తైవాన్‌ జలసంధిలో సంచారానికి అర్ధం లేదని చైనా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా పంపిన నౌకలు దాని వద్ద ఉన్న పాత తరానికి చెందినవని, చైనా వద్ద అంతకంటే మెరుగైనవి ఉన్నందున వాటితో తైవాన్‌ వేర్పాటు వాదులను సంతుష్టీకరించటం, తన మిత్ర దేశాలకు భరోసాను ప్రదర్శించటం తప్ప చైనాను భయపెట్టలేరని పశ్చిమ దేశాల విశ్లేషకులు పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో తైవాన్‌ విలీనం తమకు అంగీకారం కాదని ప్రపంచానికి చెప్పటం కూడా దీని వెనుక ఉందని అంటున్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.


ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులు చైనా – రష్యా మిలిటరీల సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. రెండున్నర దశాబ్దాల నాడు రష్యా నుంచి ఆయుధాలను కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్న చైనా నేడు కొన్నింటిని అమ్మే దశకు ఎదిగింది.ఆధునిక అస్త్రాలను అది రూపొందిస్తున్నది. నాన్సీ పెలోసీ రాక తరువాత తన సత్తా ఏమిటో చూపుతున్నది. తాను స్వంతగా రూపొందించుకున్న రెండు విమానవాహకయుద్ద నౌకలను అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్‌ నిర్వహించింది. తమకు అడ్డు వచ్చే వారిని క్షణాల్లో ఎదిరించే సత్తా ఉందని ప్రపంచానికి వెల్లడించింది.

ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం అంత సత్తా లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఆయుధాల అంశంలో రష్యాతో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అమెరికా ఎదిరించేందుకు వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టటానికి రెండు దేశాలూ సిద్దపడతాయి. పరిమితులు లేని భాగస్వాములుగా ఉన్నట్లు రెండు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే.తైవాన్‌ అంశం మీద అమెరికా ఇలా ఇంకా రెచ్చగొట్టుడు కొనసాగిస్తే మిలిటరీ సహకారం కూడా రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపధ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్‌ క్రమంగా తైవాన్‌ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు.చైనాకు వ్యతిరేకంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు పధకం వేశారు.


ఇటీవలి అమెరికా బుద్దిపూర్వక చర్యలు, రష్యా వ్యతిరేక వైఖరి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది.దీన్నుంచి కూడా లబ్ది పొందేందుకు అమెరికా చూస్తున్నది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో అమెరికా ప్రాణ నష్టాలు నాలుగు లక్షల లోపే.మరో ఆరులక్షల మంది తమ వారు కనిపించటం లేదని అమెరికా చెప్పింది. ఇతర దేశాలలో మరణించిన ఆరు కోట్ల మందితో పోలిస్తే నిజానికి ఇది పెద్ద సంఖ్యకాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన లాభాలతో అమెరికాలో 22వేల మంది మిలియనీర్లను సృష్టించింది, 28.6బిలియన్‌ డాలర్లు లాభాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో లాభాలు రెట్టింపు వచ్చాయి.రక్తంతో తడిచిన లాభాలు మరిగిన అమెరికన్‌ కార్పొరేట్లు అప్పటి నుంచి జనాలకు కావాల్సిన వస్తువుల కంటే ప్రాణాలు తీసే ఆయుధాల తయారీకే ప్రాధాన్యత ఇచ్చారు. చైనాలో చౌకగా దొరికే శ్రమతో తక్కువ ధరలకు వినిమయ వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టటం, పరిశ్రమలను తరలించటం కూడా కార్పొరేట్ల లాభాల వేటలో భాగమే.

నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్దం అమెరికాలో బిలియనీర్లను 32 నుంచి 44కు వారి ఆస్తులు 103బి.డాలర్లకు పెంచింది. ప్రపంచానికి ఆ యుద్ద ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా కాగా అమెరికా వాటా కేవలం 336 బి.డాలర్లు మాత్రమే.ఆ యుద్దంలో సర్వనాశనమైన ఐరోపా పునరుద్దరణ పేరుతో అమెరికా ముందుకు రావటానికి దానికి వచ్చిన లాభాలే పెట్టుబడి. ఆ పధకంలో కూడా అమెరికా లబ్దిపొందింది.ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందనే ఉందనే బూచిని చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్‌ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది. అది పెట్టే తంపులన్నీ తనకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు దేశాల్లోనే.అమెరికాకు ఇరుగు పొరుగుదేశాలతో పేచీ లేదు కనుక వాటి నుంచి ముప్పులేదు.


రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి 2001వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్దాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు.వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్య అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్‌ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్‌ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్‌మెయిల్‌, తైవాన్‌ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపెట్టటం, మిలిటరీ ఖర్చు పెరిగేట్లు చూడటం వంటి అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ మదింపు వేసుకొనే తైవాన్‌ అంశంలో రాజీలేదని చైనా ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌పై తాజా వివాదం 3 : ఉలిపికట్టె అమెరికా – సంయమనం పాటిస్తున్న చైనా !

17 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, Joe Biden, Taiwan Matters, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


తైవాన్‌ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్‌ పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్‌ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్‌, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందుపాతరలను తొలగించటంలో విజయవంతమైనట్లు వార్తలు. సముద్రాల్లో పైన తేలే వాటితో పాటు నీటిలో ఉండే మందుపాతరలు కూడా ఉంటాయి. పేరుకు రెండే పాల్గొన్నా వాటికి మద్దతుగా అనేక నౌకలు ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది.తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.


మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న.గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా,జపాన్‌, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్‌ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూనుకుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆకసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్‌ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్‌ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.


దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్‌ రీగన్‌ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొనటంతో పాటు ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్‌ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్‌ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.


పైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం,ఆయుధ కార్పొరేట్‌ సంస్థల నిధులతో నడిచే సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ చైనా పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది.దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది.వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఏ) ప్రపంచంలో భూమి మీద నుంచి ప్రయోగించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాలక్షిపణులను దెబ్బతీసే సత్తాలేదు అనుకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవని ఆ పత్రంలో పేర్కొన్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థలను ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్‌-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్‌-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్‌ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.


చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్‌ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.


చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ.2019 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అది పెద్దది చైనా మిలటరీ.ఇరవై లక్షల మంది సైనికులున్నారు. తైవాన్‌ వద్ద 1.7లక్షల మంది ఉన్నారు. చైనా వద్ద ఐదు లక్షల మంది రిజర్వు సైనికులుంటే తైవాన్‌ వద్ద మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు. పారామిలిటరీ దళాలు చైనా వద్ద 6.24లక్షలు కాగా తైవాన్‌ వద్ద కేవలం 11,500 మంది మాత్రమే. చైనా వద్ద 5,250 టాంకులుండగా తైవాన్‌ వద్ద 1,110, చైనా సాయుధశకటాలు 35వేల కాగా తైవాన్‌ వద్ద 3,472 ఉన్నాయి. చైనా వద్ద విమానాలు 3,285 కాగా, వాటిలో జట్‌లు 1,200, స్పెషల్‌ బాంబర్లు 450, రవాణాకు 286 ఉండగా, తైవాన్‌ వద్ద 741 విమానాలు వాటిలో జట్‌లు 288, 19 రవాణా విమానాలున్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 79, తైవాన్‌ వద్ద నాలుగు, చిన్నా పెద్ద మిలటరీ ఓడలు చైనా వద్ద 777 ఉండగా తైవాన్‌ 117 ఉన్నాయి. చైనా వద్ద తొమ్మిది అణు జలాంతర్గాములు, ఆరు ఖండాంతర క్షిపణి జలాంతర్గాములుండగా తైవాన్‌ వద్ద ఒక్కటి కూడా లేదు. చైనా వద్ద డీజిలుతో నడిచే జలాంతర్గాములు 56 ఉండగా తైవాన్‌ వద్ద రెండున్నాయి.


చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోఏది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబుదారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలిపెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?

14 Sunday Aug 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor, RSS


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు ఐదవ తేదీతో ముగిసిన వారంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 572.978 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొన్నది. అంతకు ముందు వారంలో ఉన్న మొత్తం 573.875బి.డాలర్లు. జూలై మాస ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ఆ నెలలో ఉన్న స్థితిని బట్టి 2022-23లో తొమ్మిదిన్నర నెలల దిగుమతులకు డాలర్‌ నిల్వలు సరిపోతాయి. ఈ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.2014 జూలై 28 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషణ ప్రకారం డాలర్‌ నిల్వలు 317బి.డాలర్లకు పెరిగాయి.అవి ఎనిమిది నెలల దిగుమతులకు సరిపోతాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి(2008) ముందున్న కొనుగోలు శక్తి స్థాయికి తిరిగి పుంజుకోవాలంటే వాటిని 500బి.డాలర్లకు పెంచాల్సి ఉంటుందని, 2008కి ముందు మన దగ్గర ఉన్న నిల్వలు పదిహేను నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. 2013 ఆగస్టులో 275 బి.డాలర్లు ఉండగా 2014 జూలై 18 నాటికి అవి 317.8 బి.డాలర్లకు పెరగటానికి ఆర్‌బిఐ ప్రవాస భారతీయుల డిపాజిట్లకు ప్రోత్సాహాకాలివ్వటం, విదేశీ బాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని ప్రోత్సహించటమని కూడా చెప్పారు. డాలరు అప్పులు 420 బి.డాలర్లు ఉన్నందున ఆ పరిస్థితి మన కరెన్సీని వడిదుడులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడిలో 2022 మార్చినెలాఖరు నాటికి మన విదేశీ అప్పు 620.7 బి.డాలర్లకు పెరిగింది. ఎనిమిదేండ్ల క్రితం డాలరుకు రు.68 ఉండగా ఇప్పుడు 80కి దిగజారిన సంగతి తెలిసిందే.


2022 మార్చి నెలాఖరుకు ఉన్న 607.3 బి.డాలర్లు అంతకు ముందు ఏడాది లావాదేవీలను బట్టి పన్నెండు నెలల దిగుమతులకు సరిపడా ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. సిఇఐసి సమాచారం ప్రకారం 2022 మే నెలలో ఉన్న నిల్వలు 8.5 నెలల దిగుమతులకు సరిపడా ఉంటే జూన్‌ నాటికి అవి 7.5నెలలకు తగ్గాయి. మన డాలరు నిల్వలు 573 బి.డాలర్లలో సింహభాగం 509.646 బి.డాలర్లు విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సిఏ)గా ఉన్నాయి. అవి నెలనెలా తగ్గుతున్నాయి.(జూలై 8నాటికి 518.089 బి.డాలర్లు) మన రూపాయి విలువ పతనం, పెరుగుదల మీద ఈ నిల్వలు ప్రభావం చూపుతాయి. ఇవిగాక బంగారం నిల్వల విలువ 40.313 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌లు 18.031 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నిల్వలు 4.987 బి.డాలర్లు ఉన్నాయి.
తొలిసారిగా మన డాలరు నిల్వలు 2020 జూన్‌లో 500 బిలియన్‌లకు,2021జూన్‌లో 600, అదే ఏడాది సెప్టెంబరు ఎనిమిదిన మరో రికార్డు 642.453 చేరాయి.2022 జూలై 29కి 573.9 బి.డాలర్లకు తగ్గాయి


చమురు మార్కెట్లో ధరల పెరుగుదల వివరాలను చూస్తే మన విదేశీ మారకద్రవ్యంపై దాని వత్తిడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. 2014-15 నుంచి 2021-22వరకు ఎనిమిది సంవత్సరాల్లో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 61.08 డాలర్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు13 వరకు అది 106.45 డాలర్లకు పెరిగింది. దీన్ని బట్టి మన దిగుమతి బిల్లు ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని కూడా తన ఘనతగా బిజెపి చెప్పుకోవటమే కాదు, పాత అప్పులు తీర్చేందుకని, మిలిటరీకి ఖర్చు చేసేందుకని, రోడ్లు వేసేందుకని, కరోనా వాక్సిన్ల కోసమనీ పెద్ద ఎత్తున చమురుమీద పెంచిన భారాన్ని సమర్ధించింది. 2014 మే 29 నుంచి జూన్‌ 11 వరకు సగటున ఒక డాలరు రు.59.17 ఉంటే ఇప్పుడది 2022 జూన్‌ 29 నుంచి జూలై 27వరకు రు.79.54 ఉంది. దీన్ని గోడదెబ్బ చెంపదెబ్బ అనవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను అదుపుచేసే శక్తి నరేంద్రమోడీకి లేదు. కానీ రూపాయి విలువ దిగజారకుండా కాపాడి ఉంటే ఒక డాలరుకు ఇరవై అదనంగా చెల్లించవలసి వచ్చేది కాదు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్‌ నిర్వాకానికి జనం చెల్లిస్తున్న మూల్యమిది.


రూపాయి పతనం ఒక్క చమురుకే కాదు, మనం చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ అదనపు భారమే. మన విద్యార్ధుల విదేశీ చదువులు కూడా భారంగా మారాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి కబుర్లతో ఎనిమిదేండ్లుగా జనాన్ని మభ్య పెట్టటం తప్ప దేశం నుంచి ఎగుమతులు పెరగటం లేదు. గత ఏడాది వాణిజ్యలోటు జిడిపిలో 1.2శాతం ఉండగా వర్తమానంలో మూడుశాతం కావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 2.14శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే మాసంలో దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.27 బి.డాలర్లకు చేరాయి. గతేడాది జూలై వాణిజ్య లోటు 10.63 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 30బి.డాలర్లకు పెరిగింది.ఏప్రిల్‌-జూలై ఎగుమతులు 157.44 బి.డాలర్ల విలువ గలవి జరగ్గా దిగుమతుల విలువ 256.43 బి.డాలర్లు. వాణిజ్య లోటు గతేడాది 42బి.డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 98.99 బి.డాలర్లకు చేరింది. దిగుమతుల్లో చమురు వాటా గతేడాదితో పోలిస్తే జూలైలో 12.4 నుంచి 21.13 బి.డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో చైనాతో మన వాణిజ్యలోటు 48 బి.డాలర్లు ఉంది. ఒక వైపు చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ, మరోవైపు భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులకు మోడీ సర్కార్‌ అనుమతిస్తున్నది. కమ్యూనిస్టు వ్యతిరేకులను మానసికంగా సంతృప్తి పరచేందుకు చైనా వ్యతిరేక కబురు, ప్రచారం, కార్పొరేట్ల నుంచి నిధులు పొందేందుకు వారి లాభాల కోసం చైనా నుంచి గత రికార్డులను బద్దలు కొడుతూ వస్తు దిగుమతులకు పచ్చజెండా, జనానికి దేశ భక్తి సుభాషితాలు.విశ్వగురువు లీలలు ఎన్నని చెప్పుకోగలం !


ప్రపంచంలో విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది నాల్గవ స్థానమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆగస్టు ఐదవ తేదీన చెప్పారు. ఇది నరేంద్రమోడీ భజనపరులకు వీనుల విందు, కనులకు పసందుగా ఉంటుంది. ఇదే ప్రాతిపదికైతే మనం అమెరికా కంటే కూడా గొప్పవారం అని చెప్పాల్సి ఉంటుంది. బంగారం మినహా విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం అది పదమూడవ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి వివరాలు వెల్లడిస్తాయి. అందువలన అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2022లో కొన్ని దేశాల విదేశీమారకద్రవ్య వివరాలు బిలియన్‌ డాలర్లలో ఇలా ఉన్నాయి. చైనా 3,275.490(జూలై),జపాన్‌ 1,311.254(జూన్‌), స్విడ్జర్లాండ్‌ 960.084(జూన్‌), రష్యా 574.8(ఆగస్టు 5), భారత్‌ 572.978(ఆగస్టు 5), తైవాన్‌ 548.960(జూన్‌), అమెరికా 234.430(జూలై 8). అంతకు ముందు నెలతో పోలిస్తే చైనా నిల్వలు 28.895, రష్యా 3.6 బి. డాలర్ల చొప్పున పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ల కారణంగా చైనా, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందులు పడినప్పటికీ వాటి నిల్వలు పెరగ్గా అంతా సజావుగా ఉందని చెబుతున్న మన దేశ నిల్వలు ఎందుకు తగ్గుతున్నట్లు ? పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనుకుందాం, సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో దేశాన్ని పెట్టామని అనేక మంది చెప్పారు, బిజెపి కూడా స్వంత డబ్బా కొట్టుకుంది. జనం కూడా నిజమే అని నమ్మారు. మరి ఇప్పుడీ పరిస్థితి ఎందుకు తలెత్తినట్లు ?కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో సాధించలేని దానిని నరేంద్రమోడీ ఐదు సంవత్సరాల్లో చేసి చూపారని 2019 ఎన్నికలపుడు ఊదర గొట్టారు. మోడీ సాధించిన ఘనతల్లో విదేశీ మారక ద్రవ్య పెంపుదల ఒకటని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి అంతగా తెలియని(విద్యావంతులైన) జనం ఉన్నారు గనుక బిజెపి ప్రచార దళాలు వాట్సాప్‌ పండితులతో ఏది ప్రచారం చేసినా నడుస్తోందా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: