Tags
Austria Communist Party, Communist history, Communist mayor of Graz Elke Kahr, Communist Party of Austria (KPÖ)
ఎం కోటేశ్వరరావు
సోవియట్ యూనియన్ పతనం కాగానే అనేక దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు ఎర్ర జెండాలను పక్కన పడేశారు, మరికొన్ని చోట్ల పేర్లు మార్చుకున్నారు.కమ్యూనిస్టు గతానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అదే పేరును కొనసాగించిన వాటిలో మధ్య ఐరోపాలోని ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వస్తున్న ఆదరణను చూసి పేరు మార్చుకుంటే ఇంకా ఎక్కువ మద్దతు పెరుగుతుందేమో అన్న ఆశతో కొందరు మరోసారి ఆ ప్రస్తావనను చేసిన పూర్వరంగంలో అలాంటి మార్పు అవసరం లేదని పార్టీ చరిత్రకారుడు మాన్ఫ్రెడ్ మగ్రార్ తాజాగా జాకోబిన్ పత్రిక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్న వాటిలో ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ (కెపిఓ) ఒకటి.ఐరోపాలో మరోమారు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో ఎన్నికలలో ఆస్ట్రియన్ కమ్యూనిస్టులు పొందిన విజయాలను చూసిన తరువాత పార్టీ పేరు మార్చాలని కొందరు కోరారు.2021లో జరిగిన ఎన్నికలలో దేశంలో రెండవ పెద్ద పట్టణమైన గ్రాజ్ మేయర్గా పార్టీ నాయకురాలు ఎకె కాహర్ ఎన్నికయ్యారు.ఆమె 2023 ప్రపంచ ఉత్తమ మేయర్గా ఎన్నికైంది. తాజాగా నాలుగో పెద్ద నగరమైన సాల్జ్బర్గ్లో కమ్యూనిస్టు అభ్యర్ది కే మైఖేల్ డాంకల్ ఉప మేయర్గా గెలిచాడు. అక్కడి నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారు మేయర్గా, రెండోవారు ఉపమేయర్ అవుతారు. మార్చినెల పదిన జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి 29.4, డాంకల్కు 28శాతం ఓట్లు వచ్చాయి. గెలుపుకు అవసరమైన 50శాతంపైగా ఓట్లను తెచ్చుకోవటంలో బహుముఖ పోటీలో ఎవరూ లేకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య మార్చి 24వ తేదీన తుది ఎన్నిక జరిగింది. దానిలో డాంకల్కు 36.9శాతం ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలు సోషల్ డెమోక్రటిక్ అభ్యర్దికి మద్దతు ఇవ్వటంతో 63.1శాతం ఓట్లతో మేయర్గా గెలిచాడు.ఆస్ట్రియా జనాభా 90లక్షలు.మితవాదశక్తులదే ఆధిపత్యం.అయినప్పటికీ కమ్యూనిస్టులకు మద్దతు పెరగటం ఒక మంచి పరిణామం.సాల్జ్బర్క్ రాష్ట్ర ఎన్నికలలో 2018లో కేవలం 0.4శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇటీవల 2023లో 11.7శాతానికి పెంచుకుంది. అదే సాల్జ్బర్గ్ నగరంలో చూస్తే 21.5శాతం వచ్చాయి. అక్కడ ఈ ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో 28శాతానికి పెరిగాయి. రెండోదశ ముఖాముఖీ పోటీలో 36.9శాతం వచ్చాయి. అంతకు ముందు తొలిదఫా జరిగిన ఎన్నికల్లో నగర కౌన్సిల్లో అంతకు ముందు ఉన్న ఒక స్థానం నుంచి పదికి పెంచుకుంది. మేయర్గా గెలిచిన పార్టీకి వచ్చింది పదకొండు మాత్రమే. మరో రెండు చిన్న నగరాల్లో కమ్యూనిస్టులకు మూడు సీట్లు వచ్చాయి. ఆస్ట్రియాలో అందరికీ తెలిసిన పెద్దదైన వియన్నా నగరంతో సహా మొత్తం రాష్ట్ర రాజధానుల నగరాలు తొమ్మిది ఉన్నాయి. ఆస్ట్రియాలో ఇండ్లు పెద్ద సమస్యగా ఉన్నాయి. కమ్యూనిస్టులు దాని మీద ప్రధానంగా కేంద్రీకరించారు.ఈ ఏడాది జరిగే జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో కనీసమైన ఐదుశాతానికి మించి ఓట్లు సాధించి 1959 తరువాత తొలిసారిగా ప్రాతినిధ్యం పొందేందుకు కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పేరు మార్చుకుంటే జనం ఆదరణ పెరుగుతుందనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. కమ్యూనిస్టులంగానే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేశామని తమ గురించి తెలిసే జనం తమకు ఓట్లు వేస్తున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు.పార్టీ చరిత్రకారుడు మాన్ఫ్రెడ్ మగ్రార్ తాజాగా జాకోబిన్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటాన్ని కార్పొరేట్ మీడియా తీవ్రంగా పరిగణిస్తున్నది. కమ్యూనిస్టులు నియంతలను ఆరాధిస్తారని, ఎన్నికైన కమ్యూనిస్టులు తమకు వచ్చే వేతనాలను విరాళాలుగా ఇవ్వటం జనాకర్షకం తప్ప మరొకటి కాదని, గతంలో జరిగిన కమ్యూనిస్టు అకృత్యాలను సమర్దిస్తారంటూ విష ప్రచారం చేస్తున్నది. గ్రాజ్ కమ్యూనిస్టు మేయర్ కాహర్ను 2022లో ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రధాన పత్రిక సంపాదకుడు సగం సమయాన్ని బెలారస్, పుతిన్, టిటో,లెనిన్ల గురించి అడగటానికే వెచ్చించాడు.దాన్ని ప్రసారం చేసిన తరువాత వీక్షకుల నుంచి వెల్లడైన నిరసనతో క్షమాపణలు చెప్పటాన్ని మరచిపోలేము. అయినప్పటికీ తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. గతంలో పార్టీ అనుసరించిన వైఖరిని ఎక్కడా దాచుకోవటం లేదు. నాజీ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దాచలేరు.అయితే రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్ యూనియన్, ఇతర తూర్పు ఐరోపా దేశాలతో కమ్యూనిస్టు పార్టీ సంబంధాల కారణంగా ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు జనం దృష్టిలో మరుగునపడ్డాయి.సోషలిస్టు వ్యవస్థలున్న దేశాల్లో జరిగిన పరిణామాల పట్ల ముఖ్యంగా సోవియట్ యూనియన్ గురించి విమర్శనాత్మక వైఖరిని తీసుకోకపోవటం ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీకి ఒక సమస్యగా మారింది. ప్రచ్చన్న యుద్ధకాలంలో జనం నుంచి దూరం చేసింది. కార్మిక, సామాజిక ఉద్యమాల్లో రోజువారీ పని చేయటం కూడా కష్టంగా మారింది.
1990 దశకం నుంచి (సోవియట్, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత) గతంలో అనుసరించిన వైఖరి మీద విమర్శనాత్మక సమీక్షలు జరిగాయి. దాని గురించి అన్ని అంశాలను పార్టీ ప్రచురించింది.వీటిని మితవాద శక్తులు, మీడియా పరిగణనలోకి తీసుకోకపోవటం అంటే వారికి బురద చల్లటం తప్ప వాటి పట్ల ఆసక్తి లేదు.పాత కమ్యూనిస్టు వ్యతిరేకత నుంచి బయటపడటం లేదు.ఇటీవలి ఎన్నికల విజయాల తరువాత పార్టీ గురించి ఆసక్తి వెల్లడిస్తున్న ”వామపక్ష ఉదారవాదులు ” కూడా పార్టీ ఆత్మవిమర్శను పరిగణనలోకి తీసుకోవటం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రచ్చన్న యుద్దానికి ముందే అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు గ్రాజ్,సాల్జ్బర్గ్ నగరాల్లో 30శాతం జనం ” కమ్యూనిస్టు ” పేరు చూసి భయపడటం లేదని రుజువైంది. ఇప్పుడు ఆస్ట్రియన్ కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న నిర్దిష్ట విధానాలు, అభ్యర్ధుల విశ్వసనీయతనే జనం చూస్తున్నారు. ప్రచ్చన్న యుద్ద కాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక పడికట్టు పదాలు,దుర్భ్రమలు ఇప్పుడు లేవు. కమ్యూనిస్టులు జాతీయ పార్లమెంటులో అడుగుపెట్టిన తరువాత జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా గుర్తించుతారు. అత్యంత కష్ట కాలంలోనే పార్టీపేరులో కమ్యూనిస్టు పదాన్ని తొలగించలేదు. గతంలో పార్టీలో కూడా అంతర్గతంగా పేరు మార్పు గురించి మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.చారిత్రక నేపధ్యం, అనేక అంశాలను చర్చించిన తరువాత పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని భావించుతున్నాము.కొన్ని సోషలిస్టు దేశాలతో కొన్ని సమస్యలున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్న సానుకూల అభిప్రాయం జనంలో కూడా ఉంది, కమ్యూనిస్టులు దాన్నేమీ దాచటం లేదు అని మాన్ఫ్రెడ్ మగ్రార్ చెప్పాడు.
పలుచోట్ల రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు !
దశాబ్దాల తర్జనభర్జనల తరువాత అనేక దేశాలలో రివల్యూషనరీ కమ్యూనిస్టు పేరుతో మరో కొత్త పార్టీ అవతరించింది.దాని విధానాలు, సిద్దాంత వైఖరులు ఎలా ఉండేది ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్న రోజుల్లో మరో పార్టీ ఉనికిలోకి రావటం చిన్న విషయమేమీ కాదు. ఈ పార్టీ గురించి పత్రికల్లో రాజకీయ, మీడియా వర్గాల్లో గందరగోళం, ఆగ్రహం వెల్లడైంది. కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానిస్తే అనుమానించాలిగాని పాలకవర్గాలు వ్యతిరేకించాయంటే మంచిదే. ”అంతర్జాతీయ మార్క్సిస్టు ధోరణులు” (ఐఎండి) అనే సంస్థకు చెందిన వారు వివిధ దేశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.త్వరలో ప్రధమ మహాసభలు జరిపేందుకు నిర్ణయించారు. లెనిన్ బోధనలను తాము అధ్యయనం చేస్తున్నామని, వాటి ఆధారంగా విధానాలు, వైఖరులు నిర్ణయించకుంటామని చెబుతున్నారు. మీరు కమ్యూనిస్టా ? మనకు విప్లవం కావాలి అనే పేరుతో ఐఎండి నలభై దేశాలలో ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేసి యువతరాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫ్రాజర్ సంస్థ బ్రిటన్,అమెరికా,ఆస్ట్రేలియా,కెనడాలలో ఒక సర్వే నిర్వహించిందని, ఆయా దేశాలలోని 18-34 సంవత్సరాల యువతను ప్రశ్నించగా వరుసగా 29,20,18,13శాతాల చొప్పున సరైన ఆర్థిక వ్యవస్థ కమ్యూనిజంలో ఉంటుందని భావించినట్లు వెల్లడైందని, ఇతర దేశాల్లో సర్వే చేసినా ఇదే మాదిరి ఉంటుందని, అన్ని ఖండాలలో మిలియన్ల మంది కమ్యూనిస్టులు ఉన్నట్లు దీని అర్ధమని ఐఎండి పేర్కొన్నది.కమ్యూనిస్టు భావజాలాన్ని అంగీకరించటంతో సరిపోదని కారల్ మార్క్స్ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి కమ్యూనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ అవసరమన్న అవగాహన మేరకు అలాంటి పార్టీని అనేక దేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండి పేర్కొన్నది.
సోషలిస్టు దేశాల్లో మత స్వేచ్చ !
సోషలిస్టు దేశాలు మతాన్ని అణచివేస్తాయన్నది ప్రపంచంలో ఒక తప్పుడు ప్రచారం. కమ్యూనిస్టులు ఏ దేశంలోనూ ఒక చర్చి, మసీదు, గుడిని కూల్చివేసిన చరిత్ర లేదు. మతాలకు చెందిన అనేక చారిత్రక కట్టడాలను ప్రతి చోటా పరిరక్షించుతున్నారు తప్ప పడగొట్టటం లేదు.దోపిడీ వర్గాలు మతాన్ని ఒక మత్తు మందుగా మార్చి జనాన్ని చైతన్య రహితంగా ఉంచుతాయని కమ్యూనిస్టులు నమ్ముతారు. ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులుగా ఉన్నవారు మతాలకు దూరంగా ఉండాలని చెబుతారు తప్ప జనం మీద బలవంతం చేయరు. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తారు. పార్టీలో సభ్యులుగా చేర్చుకొనే అర్హతల్లో మతాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఉండదు. ఒకసారి పార్టీలో చేరిన తరువాత భౌతిక వాదులుగా వారిని మార్చేందుకు చూస్తారు. ఎక్కడైనా అలాంటిది జరగటం లేదంటే స్థానిక నాయకత్వాల లోపం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టుల మీద ఉన్న అనేక తప్పుడు ప్రచారాలు, అపోహలను తొలగించుకుంటూ మత సంస్థలు కమ్యూనిస్టు దేశాలతో సంబంధాల కోసం చూస్తున్నాయి. తాజాగా వాటికన్ పెద్దలు సోషలిస్టు వియత్నాంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొనేందుకు పూనుకున్నారు. మత సంస్థల మీద అనేక నియంత్రణలు ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి. రాజ్యాన్ని కూలదోసే ఒక సాధనంగా మతాన్ని, మతావలంబలకును మార్చేందుకు, జనం మధ్య విభజనలు తెచ్చేందుకు చేసే యత్నాలను ఏ దేశమూ అంగీకరించదు.
వియత్నాం జనాభాలో ఆరుశాతం మంది కాథలిక్కులు ఉన్నారు. అక్కడ మతాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పుకున్న మొత్తం జనాభా పన్నెండుశాతం ఉన్నట్లు 2019లెక్కలు వెల్లడించాయి. వాటికన్ విదేశాంగ మంత్రి ఆర్చిబిషప్ పాల్ రిచర్డ్ గలాఘర్ నాయకత్వంలో ఒక బృందం ఏప్రిల్లో ఆరు రోజుల పాటు పర్యటించింది. ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ కూడా పర్యటనకు వస్తారన్న వార్తల పూర్వరంగంలో వారు వచ్చారు. వియత్నాంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా క్రైస్తవమత పెద్దలు జపాన్, ఫ్రాన్స్, అమెరికాతో కలసి నిర్వహించిన ప్రజా వ్యతిరేక పాత్ర తెలిసిందే. ఈ కారణంగా వాటికన్ ప్రతినిధులను దశాబ్దాలుగా అక్కడికి అనుమతించటం లేదు. గతేడాది ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత వాటికన్ ప్రతినిధులు వచ్చారు.దశాబ్దాల తరువాత గత డిసెంబరులో వియత్నాంలో వాటికన్ తన శాశ్వత ప్రతినిధిని నియమించింది.ఈ ఏడాది జనవరిలో పోప్ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మత సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకొని అనుమతి పొందాలని 2018లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. మత సంస్థల ముసుగులో విదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్న కారణంగా నిబంధనలను పటిష్టం గావించింది.
గ్రీకు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సౌంపస్ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం అమెరికాలోని ఆర్చిబిషప్ ఎపిడోఫరోస్ను ఏప్రిల్ 26న కలుసుకున్నారు. గ్రీకు అమెరికన్ల గురించి, గ్రీసులోని చర్చికి సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.మతాధికారి అయిన కౌట్సౌంపస్ తాత 1944లో నాజీల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన తీరును, ఆ వారసత్వ కొనసాగింపుగా గ్రీకు దేశం కోసం పని చేయాలని అర్చిబిషప్ అభిలషించారు.