ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

కుక్క మనిషిని కరిస్తే సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే పెద్ద వార్త. జర్నలిజం విద్యార్ధులకు చెప్పే ఉదాహరణ ఇది. అదే మాదిరి చట్టసభల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్‌ చేయటం పెద్ద వార్త కాదు, కానీ గవర్నర్లు అదే పని చేస్తే సంచలనం. కానీ మన మీడియా చర్మాలు మొద్దుబారటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. పెద్దన్న నరేంద్రమోడీ పైనుంచి గమనిస్తున్నారన్న భయంతో రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుదార్లం అని చెప్పుకొనే వారు కూడా గొణుగుతున్నారు తప్ప నోరు విప్పటం లేదు. మన దేశంలో అపహాస్యం పాలైన వాటిలో గవర్నర్ల వ్యవస్థ ఒకటి. తొలిసారిగా 1959 జూలై 31న రాష్ట్రగవర్నర్‌ సిఫార్సుతో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి ఎన్నికలలో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలో అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి అమలు జరిపేందుకు పూనుకున్న కారణంగా అక్కడ ఉన్న అన్ని రకాల కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఏకమై విమోచన సమరం పేరుతో సాగించిన ఆందోళనను సాకుగా చూపి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందనే సాకుతో ఆ దుండగానికి పాల్పడ్డారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే సదరు ఆందోళన వెనుక ఉన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం) నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో గవర్నర్‌ ధరమ్‌ వీర అధర్మంగా వ్యవహరించి ఆ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయటంతో రాష్ట్రపతి పాలన విధించారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలు రాష్ట్రాలలో అధికారానికి వస్తే గవర్నర్ల ద్వారా కుట్రలు, కూలదోయించటంలో ఎవరూ తక్కువ తినలేదు, 2014 నుంచి మోడీ సర్కార్‌ నియమించిన గవర్నర్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఏజంట్ల మాదిరి గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన ప్రభుత్వాల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవవరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. చట్టసభలను ఉద్దేశించి ఏడాది ప్రారంభంలో గవర్నర్లు ప్రసంగించాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగ సవరణ చేయటమే పరిష్కారమని, ఇతర పార్టీలతో కలసి దీని గురించి రానున్న పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతామని చెప్పారు. జనవరి 22(2026)న కర్ణాటక గవర్నర్‌ తహ్వార్‌చంద్‌ గెహలట్‌ కేవలం కొన్ని పేరాల ప్రసంగాన్ని మాత్రమే చదివి మిగతాది వదలి ఉభయ సభల సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్‌ సభ్యులు కూడా అనుసరించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం తయారు చేస్తుందన్నది తెలిసిందే. దానిలో పదకొండు పేరాలను చదివేందుకు గవర్నర్‌ నిరాకరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని బదులు ఒక స్కీమును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రసంగంలో విమర్శించారు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176, 163 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగాన్ని విధిగా చదవటం తప్ప గవర్నర్‌కు మరొక అవకాశం లేదని, తన స్వంత అభిప్రాయాలను దానిలో చొప్పించే అధికారం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గవర్నర్‌ చర్యను ఖండించారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే భాగాలు ఉన్నందున అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలను వదలి, కొన్నింటిని తాను చేర్చి చదివారు.తాము సూచించిన భాగాలను చేర్చకుండా ప్రసంగాన్ని రూపొందించారని లోక్‌భవన్‌ పేర్కొన్నది.కేరళకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యవిధానాన్ని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్రవేయని గవర్నర్‌ చర్యను విమర్శిస్తూ రాసిన భాగాలను గవర్నర్‌ విస్మరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అనవసరమైన, ఆధారం లేని అంశాలు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్న తమ సూచనను పట్టించుకోకుండా రెండవసారి కూడా తొలి ముసాయిదానే పంపారని గవర్నర్‌ కార్యాలయం ఆరోపించింది. ఏ అంశ ం అవసరమో కాదో నిర్ణయించే విచక్షణ అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్‌ ఏమి ప్రసంగించినప్పటికీ అసెంబ్లీ రికార్డులలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగపాఠమే ఉండాలని ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరే మంత్రివర్గం తయారు చేసినదే రికార్డులలో ఉంటుందని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు, విధానాలనే కాదు తొలిసారిగా గవర్నర్‌ చర్యను కూడా పశ్చిమబెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో విమర్శించింది.1967లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన తరువాత 1969లో ఎన్నికలు జరిపారు. తిరిగి వామపక్షాలతో కూడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రూపొందించిన ప్రసంగంలో గవర్నర్‌ చర్యను తప్పుపట్టింది. తన చర్యను తానే విమర్శించినట్లు అవుతుంది గనుక ఆ పేరాను చదివేది లేదని ధరమ్‌ వీర తిరస్కరించారు. తరువాత కూడా బెంగాల్లో పునరావృతమైంది. గవర్నర్‌ బిడి పాండేను బంగ్లా డామన్‌ పాండే( బెంగాల్‌ను నాశనం చేస్తున్న పాండే)గా వామపక్షాలు వర్ణించాయి.1984లో గవర్నర్‌ ఏపి శర్మ కొల్‌కతా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా తాను ఎంపిక చేసిన వ్యక్తిని తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి నియమించేందుకు తిరస్కరించారు.ఇలాంటి అనేక చర్యలకు పాల్పడుతుండటంతో గవర్నర్‌ కార్యక్రమాలను బహిష్కరించాలని వామపక్ష సంఘటన నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సర్కారియా కమిషన్‌కు నివేదిక పంపింది.2007లో నందిగ్రామ్‌ హింసాకాండ సందర్భంగా గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ (మహాత్మా గాంధీ మనవడు) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.ఈ డొంకతిరుగుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గంటే పోతుందిగా అని అప్పుడు సిపిఐ(ఎం) నేతలు గడ్డిపెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా గవర్నర్‌ను సమర్ధించిన మమతా బెనర్జీకి తరువాత బిజెపి నియమించిన గవర్నర్లు అదేపని చేస్తే భగ్గుమన్నారు,కొంత మందికి అంతే, తమదాకా వస్తే తప్ప తత్వం బోధపడదు. తరువాత కాలంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికై అర్ధంతరంగా రాజీనామా చేసిన బిజెపి అసంతృప్త నేత జగదీప్‌ థంకడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు.

మనదేశంలో గవర్నర్లను మూడు తరగతులుగా చూడాలి. స్వాతంత్య్రానికి ముందు, తరువాత 1967వరకు, ఆ తరువాత వ్యవహరించిన తీరులో స్పష్టంగా దిగజారుడు కనిపిస్తుంది. బ్రిటీష్‌ వారి కాలంలో గవర్నర్‌ అంటే ప్రభుత్వ ప్రతినిధి, సర్వాధికారి. మనదేశంలోని ప్రోవిన్స్‌లకు అధిపతులుగా ఉన్నారు.ప్రజాప్రభుత్వాలు లేవు, స్వాతంత్య్రానికి ముందు 1935 నుంచి పరిమితంగా ప్రావిన్సు( రాష్ట్ర ) ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వాటికి పెద్దగా అధికారాలు లేవు, గవర్నర్లే సర్వస్వం. తరువాత రెండు దశాబ్దాలలో దేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే లేవు(1957లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తప్ప, దాని గురించి ముందే చెప్పుకున్నాం) గవర్నర్లుగా నియమితులైనవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నతరం వారే అత్యధికులు కనుక రాజ్యాంగ విలువలను పాటించారు.గవర్నర్ల గురించి జనానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోయిన 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలలో తమకు పోటీగా వస్తున్నారని పక్కకు తప్పించిన నేతలు, సామాజిక సమీకరణల్లో భాగంగా కొందరిని గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. వారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేత నియమాకాలు పొందినవారు కావటంతో పార్టీల ఏజంట్లుగా సిగ్గువిడిచి ప్రవర్తిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రచించే సమయంలో గవర్నర్ల వ్యవస్థ గురించి పెద్ద చర్చే జరిగింది. గవర్నర్లు వద్దని, కావాలని వాదించిన వారు ఉన్నారు. రాజీమార్గంగా రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా గవర్నర్‌ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సలహామేరకు పని చేయాల్సి ఉంటుందని పరిమితి విధించారు. ఇదే సమయంలో కొన్ని విచక్షణాధికారాలను కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌ బొమ్మరు-కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు కోర్టు సమీక్షలకు లోబడి ఉంటాయన్నదే అది.దానికి అనుగుణంగానే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి గవర్నర్ల చర్యలను సవాలు చేశాయి.అడ్డగోలుగా ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తరువాత 2005లో రామేశ్వర ప్రసాద్‌-కేంద్ర ప్రభుత్వ వివాదంలో గవర్నర్ల విచక్షణ అధికారం,రాష్ట్ర అసెంబ్లీ పనివిధానం గురించిన అంశం ముందుకు వచ్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేయకముందే గవర్నర్‌ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర పాలకపార్టీ ఏజంట్లుగా తయారయ్యారు.1984లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంలో గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా తలెత్తిన ప్రజానిరసనతో తిరిగి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామం మరేరాష్ట్రంలోనూ జరగలేదు.

సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌ ఎనిమిదిన మైలురాయిగా నిలిచే తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు తిరస్కరించటం గవర్నర్‌ రాజ్యాంగవిరుద్ధ చర్య అని ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వం 2020 నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య పదమూడు బిల్లులను ఆమోదించగా వాటిలో పదింటిని ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్‌ తనదగ్గరే అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200ప్రకారం గవర్నర్లకు నాలుగు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బిల్లులకు ఆమోదం తెలపటం, ఆమోదం నిలిపివేయటం, ద్రవ్య బిల్లుతప్ప ఇతర వాటిని తిరిగి పరిశీలించాలని కోరటం,తిరిగి వచ్చిన వాటిని ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిలిపివేయటం. అయితే ఆ నిబంధనలో ఎటూ తేల్చకుండా ఎంతకాలం కొనసాగించవచ్చు అన్నది ఎక్కడా లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.తమిళనాడు గవర్నర్‌ చర్య ఉద్దేశ్య పూర్వకంగా బిల్లులను అడ్డుకున్నట్లున్నదని,రాజ్యాంగ పద్దతిని ఉల్లంఘించటమే అని కోర్టు పేర్కొన్నది. ఎలాంటి మార్పులు లేకుండా రెండవసారి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఉండటం తగదని, నిలిపివేయకూడదని రాజ్యాంగం పేర్కొన్నదని విధిగా పంపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు గవర్నర్‌ రవి పాల్పడ్డారని స్పష్టం చేసింది. బిల్లు వచ్చిన నెలరోజుల్లో ఆమోదం తెలపాలి,ఆమోదం తెలపని వాటిని కారణం తెలుపుతూ మూడు నెలల్లోగా తిప్పి పంపాలి.రెండవసారి వచ్చిన బిల్లుకు నెలరోజుల్లో ఆమోదం తెలపాలి, మూడు నెలలకు మించి బిల్లులను నిలిపివేయరాదు. ఆర్టికల్‌ 201ప్రకారం రాష్ట్రపతి కూడా నిరవధికంగా ఆమోదం నిలిపివేయరాదు. ఒకవేళ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందనకుంటే రాష్ట్రపతి దాని గురించి తప్పనిసరిగాకపోయినప్పటికీ సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు అని కూడా కోర్టు చెప్పింది.ఈ తీర్పులు వచ్చిన తరువాత కూడా గవర్నర్లు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాలకు బద్దులై ఉండకుండా స్వంతపైత్యాలను జోడించటం చూస్తున్నాం. అందువలన ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టటం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేందుకు క్షణ క్షణం ప్రయత్నిస్తున్న బిజెపి చర్యలను అడ్డుకొనేందుకు అటు న్యాయవ్యవస్థను ఆశ్రయించటంతో పాటు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ కూడా అవసరం.

ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

గ్రీన్‌లాండ్‌ కోసం అమెరికా ఎంత దూరం వెళుతుందో మీరు చూస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఐరోపా నేతలకు ఒక సవాలు విసిరాడు. దవోస్‌ ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్‌ మాటలివి. గ్రీన్‌లాండ్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రానికి ఒక యుద్ధ విమానం కూడా వచ్చిందన్న వార్తలు ఒకవైపు, ఏం చేయాలో తోచక ఐరోపా కూటమి మరోవైపు. ప్రపంచ పరిణామాలు సామాన్యుల ఊహకు అందకుండా మారుతున్నాయి. అనేక దేశాల, దేశాధినేతల బండారాలు బయటపెడుతున్నాయి.కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలువేసుకు కూర్చుందామంటే కుదరదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటూ రెండు పక్షాలనూ సంతుష్టీకరించాలంటే జరిగేది కాదు. వెనెజులా మన మిత్రదేశమే, చౌకగా చమురు తెచ్చుకున్నాం, డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించగానే మానేశాం, ఆ దేశ అధ్యక్షుడు మదురో, సతీమణిని కిడ్నాప్‌ చేసినా తప్పని చెప్పలేకపోయాం.ఇరాన్‌ కూడా మనకు మిత్రదేశమే. మన రూపాయలు తీసుకొని చమురు విక్రయించింది.అమెరికా బెదిరించగానే అక్కడి నుంచీ కొనుగోలు నిలిపివేశాం. ఆ దేశం మీద దాడులు చేస్తాం, పాలకులను మార్చివేస్తామని పెద్దన్న అమెరికా బెదిరిస్తుంటే తగదని అనలేకపోయాం. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో అక్కడ ఉన్న మనవారిని వెనక్కు రప్పించేందుకు, పుతిన్‌కు చెప్పి దాడులు ఆపించామని చెప్పుకున్నాం, ప్రత్యేక విమానాలు పంపి భారతీయులను స్వదేశానికి రప్పించాం. కానీ ఇరాన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రమ్మని సుభాషితం మాత్రమే చెప్పాం తప్ప విమానాలు పంపి వెనక్కు తీసుకురాలేదు. కొన్ని సమయాల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తారో గుర్తు చేసేందుకే ఇవి. ఈ సందర్భంగా అమెరికా బెదిరింపులపై ఐరోపా స్పందన గురించి విశ్లేషించుకుందాం.

డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో కమ్యూనిస్టు చైనా మీద పన్ను ఉగ్రవాదదాడులను ప్రారంభించగానే అనేక మంది సంతోషించారు.చైనా వస్తువుల ధరలు పెరిగితే అంతకంటే చౌకగా అమెరికాకు ఎగుమతి చేసి లాభం పొందవచ్చని డాలర్‌ కలలు కన్నారు. ఇప్పుడు అదే ట్రంప్‌ తన పరబేధాలు లేకుండా బస్తీమే సవాల్‌ అందరి సంగతి చూస్తా అంటూ కొరడా ఝళిపిస్తుంటే దిక్కు తోచక దిక్కులు చూస్తున్నారు.చైనా మూడు చేపల కథలో దీర్ఘదర్శి మాదిరి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నది. ప్రస్తుతం ఐరోపా ఇరకాటంలో పడింది. మదురోను కిడ్నాప్‌ చేసి వెనెజులా చమురు సంపదలన్నింటినీ స్వంతం చేసుకుంటామన్నపుడు దానికి పట్టలేదు. ఇప్పుడు డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనగానే ఐరోపా సమాఖ్యకు గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. ఆర్కిటిక్‌ సముద్రంలోని ఆ మంచుదీవిని అన్నమాట ప్రకారం స్వాధీనం చేసుకోకపోతే అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ చులకన అవుతాడు. ఆక్రమించుకుంటే ఐరోపా సమాఖ్య అభాసుపాలవుతుంది. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యూరెన్స్‌( ఆర్కిటిక్‌ ప్రాంతానికి బాసట) పేరుతో పరిమిత వన్యాసాలు జరిపేందుకు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా పన్నెండు దేశాలు మిలిటరీ అధికారులు, సిబ్బందిని పంపేందుకు నిర్ణయించాయి, కొన్ని దేశాల నుంచి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. నిజంగా అమెరికా దురాగతానికి దిగి బలవంతంగా స్వాధీనానికి పూనుకుంటే వారు చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే ఈ మాత్రానికే ఆగ్రహించిన ట్రంప్‌ ధిక్కారమును సైతునా అంటూ ఐరోపా దేశాల వస్తువుల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించాడు.

అయితే దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై 108 బిలియన్‌ డాలర్ల మేర ప్రతి సుంకాలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.తోటి నాటో దేశాన్ని మరో సభ్య దేశం ఆక్రమించుకోవటం ఏమిటి అని గట్టిగా ఖండించలేక ఆమోదించలేక ఇతర దేశాలు సతమతం అవుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ మా ఒక్కరి భద్రతకోసమే కాదు, ఐరోపా రక్షణకూ అవసరమే అని, తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమిస్తే మీకు అంగీకారమేనా అంటూ ట్రంప్‌ యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. ఐరోపా యూనియన్‌ పరిస్థితిని చూస్తే అమెరికాను ఎదిరించే స్థితిలో లేదు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఐరోపా రక్షణ బాధ్యత పేరుతో నాటో ఖర్చులో అధిక భాగం అమెరికా భరించింది. ఆ మేరకు పొదుపు మొత్తాలను పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాలకు మళ్లించిన ఐరోపా అనేక విధాలుగా రెండు ప్రపంచ యుద్ద నష్టాల నుంచి కోలుకున్నది. ఐరోపా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నది. ఉభయుల వాణిజ్యలావాదేవీల విలువ 2024లో 976 బిలియన్‌ డాలర్లు ఉండగా అమెరికా వస్తు ఎగుమతులు 370 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకే దిగుమతి పన్ను అదనంగా వేస్తా అని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇది ఐరోపా బలహీనత కాగా అదే పరిస్థితి అమెరికాకూ ఉంది, 2015-19 సంవత్సరాలతో పోలిస్తే 2020-24 నాటికి అమెరికా నుంచి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు 28 నుంచి 52శాతానికి పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత ఇది జరిగింది. అందువలన మాతో తెగేదాకా లాగితే ఆయుధ దిగుమతులు తగ్గిస్తామని ఐరోపా సంకేతాలు పంపుతున్నది. అంతే కాదు చైనాతో లావాదేవీలు పెంచుకోవాల్సి వస్తుందని కూడా చెబుతున్నది. అందుకే దాగుడుమూతలాడుతున్నాయి. చైనా ప్రమాదాన్ని చూపి భారత్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అదే ఎత్తుగడతో రష్యాను చూపి ఐరోపాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నది. అందుకే అప్పుడప్పుడు మిత్రవైరుధ్యాలు తలెత్తినప్పటికీ వాటిని శత్రువుల స్థాయికి తీసుకువెళ్లకుండా రాజీపడుతున్నాయి. ఇది ఎల్లకాలమూ సాధ్యమౌతుందా ?

తన ఆర్థిక బలం, మిలిటరీ బలగాలను చూపి గరిష్టంగా లబ్దిపొందేందుకు, ప్రభావాన్ని మరింతగా పెంచుకొనేందుకు అమెరికా పూనుకుంది.అయితే బలహీనమైన అంశాల పట్ల కఠినంగా, బలమైన వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఐరోపా.దాన్లో భాగమే అమెరికా వస్తువులపై పన్ను వేస్తామని హెచ్చరించటంగా చెప్పవచ్చు. అట్లాంటిక్‌ దేవాల మధ్య ఇదొక తీవ్రమైన సంక్షోభానికి గుర్తు అని తాజా పరిణామాల గురించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అంత తేలికగా అమెరికా వత్తిడికి ఐరోపా లొంగే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఇప్పటి వరకు ఐరోపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ కావాల్సిందేనని ఆదివారం నాడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరోసారి చెప్పాడు. ఆ ప్రాంతం అమెరికాలో అంతర్భాగం గాకపోతే రక్షణ అసాధ్యమన్నాడు. రక్షణ పేరుతోనే క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటాన్ని విమర్శించేవారు గ్రీన్‌లాండ్‌ విలీనాన్ని ఎలా సమర్ధించుకుంటారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తమ చర్య అందరికీ మంచిదని, యూరోపియన్స్‌ దీన్ని అర్ధంచేసుకుంటారని భావిస్తున్నా అని మాత్రమే బెసెంట్‌ చెప్పాడు. ట్రంప్‌ ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ఐరోపా పార్లమెంటు ఆమోద ముద్రవేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. బలవంతంగా ఒప్పించటాన్ని వ్యతిరేకించే సమాఖ్య 2023 నాటి ఆయుధంతో అమెరికాను దెబ్బతీయాలని ఫ్రాన్సు పిలుపునిచ్చింది. ఒకవైపు అమెరికాను అడ్డుకోవాలని అంటున్న ఐరోపా దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలకు దూరంగా ఉండాలని జర్మనీ నిర్ణయించింది. శుక్రవారం నాడు వచ్చిన జర్మనీ మిలిటరీ బృందం ఆదివారం నాడు వెనక్కి వెళ్లింది. అమెరికా వత్తిడి తప్ప మరొక కారణం లేదు. ఈ మిలిటరీ విన్యాసంలో పాల్గన్నదేశాల మీద ప్రత్యేకించి పన్నులు విధించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి అన్నమాట ప్రకారం పన్నులు వేస్తారా లేక బేరసారాల కోసం వాయిదా వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఐరోపా ప్రతిపన్ను హెచ్చరిక కూడా ఎత్తుగడలో భాగమే అంటున్నారు. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఎనిమిది దశాబ్దాలుగా అనుసరించిన విధానాలన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఒక్క గ్రీన్‌లాండ్‌తోనే సమసిపోదు. మొత్తం నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.ప్రపంచ బలాబలాల్లో వచ్చే మార్పులు తమకు లాభదాయకమా లేక అమెరికాతో ఉంటేనే మంచిదా అన్న మధింపు జరిగిన తరువాత నిర్ణయాత్మక పరిణామాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు పరిమితం. అసలు గ్రీన్‌లాండ్‌తో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో ఐరోపా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఒక వ్యూహం అనుసరిస్తున్నదని చెబుతున్నారు. గతేడాది డిసెంబరులో జాతీయ భద్రతా వ్యూహం పేరుతో రూపొందించిన పత్రంలో ఐరోపా సమాఖ్యలో రాజకీయ స్వేచ్చను బలహీనపరుస్తున్నారని, రాజకీయ వ్యతిరేకతను, భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.మరోవైపు ఐరోపాలో ఇటీవలి కాలంలో తలెత్తిన మితవాద జాతీయోన్మాద శక్తులను అమెరికా ప్రోత్సహిస్తున్నట్లు ఈ విమర్శల మర్మం అంటున్నారు. విద్వేష ప్రసంగాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌లో చొప్పిస్తున్న వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్న సాంకేతిక విభాగ ఐరోపా మాజీ కమిషనర్‌ తియెరీ బ్రెటన్‌పై అమెరికా ఆంక్షలు విధించటం కూడా వత్తిడిలో భాగమే అంటున్నారు. అమెరికా కంపెనీల పట్ల నిబంధనలను చూసీచూడనట్లు పోవాలని, వాటికి అవకాశాలను పెంచాలని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వత్తిడి చేస్తున్నారు.అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలన్న ట్రంప్‌ ఏలుబడిలో అది మరింతగా బరితెగించినట్లు కనిపిస్తోంది. ఐరోపాను ఒక వలస ప్రాంతంగా చూస్తూ తన నిబంధనలను అక్కడ రుద్దాలని చూస్తోందని, అందుకుగాను ఎంతకైనా తెగిస్తోందని ఐరోపా వర్గాలు భావిస్తున్నాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంతగా గతంలో ఎన్నడూ ఐరోపా పట్ల అమెరికా వ్యతిరేకత వెల్లడి కాలేదేని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు.తమను నాశనం చేయాలని వాషింగ్టన్‌ చూస్తున్నదని ఇనిస్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నతాలీ టోసీ చెప్పారు. ఉదారవాద ప్రజాస్వామ్యం, ఐరోపా ఒక్కటి కావటం తమకు వ్యతిరేకంగా పరిగణిస్తున్నదని కూడా అన్నారు. నాటో అనుకూల ఐరోపా దేశాల్లో అమెరికా పట్ల పునరాలోచనకు నాంది పడింది.గ్రీన్‌లాండ్‌ గురించి అమెరికా చాలా కాలం క్రితమే తన వాంఛను వెల్లడించింది. డెన్మార్క్‌ మిలిటరీ గూఢచార సేవల విభాగం గత డిసెంబరులో తొలిసారి అమెరికా తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని ఒక నివేదికలో పేర్కొన్నది. తన మిత్రదేశాలను కూడా వదలకుండా అధిక పన్నులతో సహా ఆర్ధిక బలాన్ని వినియోగిస్తున్నదని, చివరికి మిలిటరీ ఫోర్సు వినియోగంలో కూడా వదలటం లేదని దానిలో ప్రస్తావించారు. ఈ పూర్వరంగంలోనే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ తోటి నాటో సభ్యదేశంపై అమెరికా దాడికి దిగుతానని చెప్పటాన్ని గర్హించారు. భద్రత గురించి అమెరికా మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని కొందరు నిపుణులు హెచ్చరించటం పెరుగుతోంది. ఇలా ఆధారపడిన కారణంగా స్వతంత్ర ఆత్మరక్షణ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుందని, ఐరోపా మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రష్యా, చైనాల రక్షణ బడ్జెట్ల కంటే ఎక్కువగా 2025 ఐరోపా 447 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినందున స్వతంత్ర మిలిటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో యూరోలు ఖర్చు చేస్తే ప్రయోజనం లేదని, కీలకమైన గూఢచర్యం, నిఘా, భౌతిక పరిస్థితి వివరాలపై అమెరికా మీద ఆధారపడకతప్పదని, అనేక రంగాలలో ఐరోపా వెనుకబడి ఉందని మరికొందరు చెబుతున్నారు. అణ్వాయుధాలు తమ దగ్గర మాత్రమే సురక్షితంగా ఉంటాయని అమెరికన్లు భావిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర ఉన్నవి అవాంఛనీయ శక్తుల చేతుల్లో పడకుండా చూసేందుకు గాను మొత్తం ఖండ సాంప్రదాయ రక్షణ సామర్ధ్యాలను 2027 నాటికి తమ అదుపులోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నదని రాయిటర్స్‌ వార్తలో పేర్కొన్న అంశాలు ఐరోపాలో ఆందోళనకు గురిచేశాయి. మొత్తం మీద ఐరోపాలో అమెరికాతో సంబంధాల గురించి ఒక మధనం ప్రారంభమైంది, అది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో, ఏ రూపంలో ఉంటుందో చూడాల్సి ఉంది !

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకు అమెరికా రంగం సిద్దం చేసింది. ఆప్రాంతాన్ని తమ 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకొనేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల సభ సభ్యుడు రాండీ ఫైన్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు.ఈ దురాగతాన్ని ఐక్యంగా అడ్డుకోవాలని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ నిర్ణయించాయి. గతంలో వాణిజ్యం పేరుతో ఐరోపా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్‌,డచ్‌, పోర్చుగీసు,ఫ్రాన్సు వంటి దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ఆక్రమంలో వాటి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.ఇప్పుడు తన భద్రతకు ముప్పు పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా పావులు కదుపుతోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాకు నాయకుడంటూ తప్పుడు ప్రచారం చేసి వెనెజులా అధ్యక్షుడిని అపహరించింది. ఇరాన్‌లో ప్రజాందోళలను అణచివేస్తున్నందున జోక్యం చేసుకుంటామని బెదిరిస్తున్నది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఆర్కిటిక్‌ సముద్రంలో ఉన్న డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ దీవి తన రక్షణకు అవసరమంటూ దాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. అన్ని ఖండాలలో 800కు పైగా చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలు, లక్షలాది మంది సైన్యాన్ని మోహరించిన అమెరికా ఏ దేశం మీదనైనా దాడికి దిగదలుచుకుంటే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని దించగలదు. అలాంటిది చిన్న దేశమైన క్యూబా మొదలు పెద్ద దేశమైన చైనా వరకు అన్నీ తన భద్రతకు ముప్పు తలపెట్టాయంటూ ఒక మైండ్‌ గేమ్‌(మానసిక క్రీడ) ఆడుతోంది. ఆ సాకుతో బెదిరింపులకు, ఆక్రమణలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అనేక మధురమైన మాటలతో ఇంక పనిలేదు, అనుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదంటూ కర్ర పుచ్చుకొని దందాకు పూనుకుంది. తనకు లొంగని వెనెజులా మీద దాడి చేసి అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అపహరించి విచారణ తతంగం ప్రారంభించింది. ఆ దేశానికి తానే తాత్కాలిక అధ్యక్షుడనని ట్రంప్‌ ప్రకటించుకున్నాడు. తదుపరి లక్ష్యాలుగా కెనడా,గ్రీన్‌లాండ్‌,ఇరాన్‌, మెక్సికో, కొలంబియా ఇలా జాబితాను పెంచుకుంటూ పోతోంది.

ఇరాన్‌ మీద గతేడాది భీకరదాడి జరిపినప్పటికీ అది సాధించిందేమీ లేదు. అణుస్థావరాలకు ఆవగింజంత నష్టం కూడా జరగలేదని తేలింది. అందువలన ఇప్పుడు మరోసారి దాడి జరగాలంటే అనేక అంశాలను మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన తొలుత గ్రీన్‌లాండ్‌తో ఆక్రమణ ప్రారంభం కావచ్చన్నది ఒక అభిప్రాయం. ఒక గుండా ముందుగా బలహీనులనే దాడికి ఎంచుకుంటాడు. దాని వలన రెండు ప్రయోజనాలు ఒకటి నా తడాఖా ఇట్లుంటది అని చూపుకోవచ్చు, మిగిలిన వారిని బెదిరించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తాను స్వాధీనం చేసుకోనట్లయితే రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని అందువలన తానే ఆపని చేయనున్నట్లు ట్రంప్‌ ఒక అబద్దాన్ని చెప్పాడు. నిజానికి అలాంటి ఆరోపణలను ఏ దేశం లేదా వాటిని వ్యతిరేకించే మీడియా కూడా చేసేందుకు సాహసించలేదు.జనాలను తప్పుదారి పట్టించేందుకు ఒక పధకం ప్రకారం గోబెల్స్‌ను మించి ప్రచారాలు చేయటంలో అమెరికా పేరుమోసింది.ఆర్కిటిక్‌ సముద్రంలో అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.ఎక్కడా దాపరికం లేదు, చైనా కూడా అదే చేస్తోంది. కానీ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకే అని బీజింగ్‌ మీద కథనాలు రాస్తున్నారు. ఆర్కిటిక్‌ సముద్రంలో మంచుకరిగి పోతున్నదని గత మూడుదశాబ్దాలుగా అనేక మంది చెబుతున్నారు, దాని పరిణామాలు, పర్యవసానాల గురించి పరిశోధనలు చేయటం ఆ ప్రాంత దేశాలైన నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌,ఐస్‌లాండ్‌, కెనడా, అమెరికా, రష్యా, ఫిన్లాండ్‌ దేశాలకే కాదు, యావత్‌ మానవాళికి అవసరం.అయితే అవి అంగీకరించిన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల మేరకు జరగాలి. ప్రస్తుతం వార్తలోకి ఎక్కిన గ్రీన్‌ లాండ్‌ దీవి డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం. అది డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసికి మధ్యలో రెండు దేశాలకు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యాకు ఐదువేలు, చైనాకు ఎనిమిది, మనదేశానికి తొమ్మిదివేల కిలోమీటర్లు ఉంటుంది.గ్రీన్‌లాండ్‌ రాజధాని నుక్‌ పట్టణం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంటే అమెరికా నగరం న్యూయార్క్‌కు 2,900కి.మీ దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని చెబుతున్న అమెరికా, ఆర్కిటిక్‌ సర్కిల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రాంతంలో పరిశోధనలు చేసే హక్కు చైనాతో సహా ఏ దేశానికైనా ఉంటుందా లేదా ! ప్రచ్చన్న యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ కూడా అణుజలాంతర్గాములను మోహరించాయి. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ కార్యక్షేత్రంగా మార్చేందుకు అమెరికా పూనుకుంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో ఉన్న తన మిలిటరీ కేంద్రాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తనకు ఆ దీవి పూర్తిగా కావాలని, మర్యాదగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. రష్యా, చైనా నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతానికి ముప్పు వచ్చిందని 2024లోనే అమెరికా ప్రచారం ప్రారంభించింది.

గ్రీన్‌లాండ్‌ ప్రాంతంపై అమెరికా కన్ను ఎందుకు ? ఆర్కిటిక్‌ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి సర్వేలో తేలిన 34 రకాల్లో 25 విలువైన ఖనిజ జాబితాలో ఉన్నాయి. నౌకా రవాణా మార్గంగా ఉండటం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతం కావటంతో దాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని, చైనా, రష్యాలను మరింతగా ఇబ్బంది పెట్టాలన్నది అసలు లక్ష్యం.ఇదే జరిగితే ఐరోపా భద్రత, ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉంది, ఐరోపాలోని డెన్మార్క్‌లో భాగం అయినప్పటికీ స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ప్రపంచంలోని పెద్ద దీవి.జనాభా కేవలం 60వేల లోపే, వారు కూడా ఎక్కువగా చేపలవేట మీదే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాల నిర్వహణకు డెన్మార్క్‌తో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పర్యావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటంతో నూతన నౌకా మార్గాలు ఏర్పడ్డాయి.ప్రయాణ దూరం తగ్గింది,ముడి చమురు, గ్యాస్‌, విలువైన ఖనిజాల వంటి లక్షల కోట్ల డాలర్ల విలువగల సహజవనరుల వెలికితీతకు మార్గం ఏర్పడింది.మిలిటరీ నిఘాకూడా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణను నిరోధించేందుకు అమెరికా ప్రవేశానికి డెన్మార్క్‌ అనుమతించింది. ఈ ప్రాంతాన్ని తమకు అమ్మాలని 1946లోనే వాషింగ్టన్‌ ప్రతిపాదించినప్పటికీ అంగీకరించలేదు.

ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలను దగ్గర చేసేందుకు సూయజ్‌ కాలువ మీదుగా కంటే ఆర్కిటిక్‌ ప్రాంతం అనువుగా ఉండటం, దూరం తగ్గటం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుండటంతో ఇటీవలి కాలంలో నౌకా రవాణా పెరిగింది. చైనా, రష్యా నౌకలు సంచరిస్తున్నాయి. రష్యా నుంచి చైనాకు చమురు రవాణాకు ప్రత్యామ్నాయ నౌకా మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఆ నౌకల మీద నిఘాపెంచాలంటే అమెరికన్లకు ఈ దీవి ఎంతో అనువుగా ఉంటుంది.దీనితో పాటు ఉపగ్రహాలకూ అనువైన ప్రాంతం. ప్రస్తుతం కొన్ని రంగాలకు చమురు, బంగారం కంటే విలువైన ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా వీటిపై 90శాతం అదుపు కలిగి ఉంది, ఎవరు తోక ఝాడించినా వాటి ఎగుమతులు నిలిపివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నది.అమెరికా కూడా దాని మీద ఆధారపడి ఉండటంతో ఎక్కడ అలాంటి వనరులుంటే వాటిని సొంతం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంది. లిథియం, కోబాల్ట్‌,చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నాయి.

గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు పూనుకుంటే ఐరోపా ఎలా స్పందిస్తున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా మదింపువేస్తున్నది. నాటో ప్రారంభ దేశాలలో డెన్మార్క్‌ ఒకటి. ఇప్పుడు దాని స్వయం పాలిత ప్రాంతాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అంటే నిబంధనలకు విరుద్దం. నాటో దేశాలన్నీ దాన్ని ఎదుర్కోవాలని నిబంధన ఉంది. అయితే గతంలో టర్కీ-గ్రీస్‌ మధ్య తలెత్తిన వివాదంలో నాటో నాయకత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా ? ఆదివారం నాడు బ్రిటన్‌, జర్మనీ నాయకత్వంలో కొన్ని దేశాల ప్రతినిధులు సమావేశమై ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత గురించి మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు వార్తలు. ఒక దేశసార్వభౌమత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కెనడా కూడా కోరింది. అయితే ముసుగులో కుమ్ములాట మాదిరి తప్ప నేరుగా అమెరికాను విమర్శించటానికి ఇంకా ముందుకు రావటం లేదు. తాము అమెరికన్లుగా మారటానికి సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జేన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ప్రకటన చేశాయి. తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశాయి.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తమ వ్యతిరేకులను అడ్డుకోవటానికి ప్రాధాన్యత ఇస్తామని అమెరికా అధ్యక్ష భవనం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.అంతకు ముందు జనవరి నాలుగున ట్రంప్‌ స్వయంగా మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నందున తమ జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఆ ప్రాంతం తమకు కావాలని చెప్పాడు. ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నది అధ్యక్షుడు తన బృందంతో చర్చిస్తున్నాడని,మిలిటరీ వినియోగ అవకాశం ఎప్పుడూ ఉంటుందని అధ్యక్ష భవన ప్రకటన తేటతెల్లం చేసింది. 1979 నుంచి గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కూడా 2009 నుంచి దానికి వచ్చింది. అయితే ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు.నిజానికి ట్రంప్‌ 2019లోనే గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి చెప్పాడు. ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడిన జనవరి నాలుగునే డెన్మార్క్‌ ప్రధాని మెటీ ఫ్రెడరిక్సన్‌ ఖండించారు.డెన్మార్క్‌ రాజరికంలోని మూడు ప్రాంతాలలో ఏ ఒక్కదానిని విలీనం చేసుకొనే హక్కు అమెరికా లేదని ఆమె పేర్కొన్నారు. ఫారో దీవి కూడా గ్రీన్‌లాండ్‌ వంటిదే అన్నారు, మరో దేశంగానే గాక చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న దేశం మీద అమెరికా ఇలాంటి కోరికలను వెలిబుచ్చటం తగదన్నారు.

అమెరికా విస్తరణ కాంక్ష ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదు. కెనడా తమ 51వ రాష్ట్రం కావాలని గతంలోనే ట్రంప్‌ కోరిన సంగతి తెలిసిందే. అందువలన కెనడియన్లు కూడా అప్రమత్తం కావాలని అనేక మంది హెచ్చరిస్తున్నారు.గ్రీన్‌లాండ్‌తో పోల్చితే కెనడా పక్కనే ఉంటుంది, అక్కడ కూడా సహజ సంపదలు పుష్కలంగానే ఉన్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో అధిక చమురు నిల్వలున్న దేశాల్లో నాలుగవదిగా ఉంది. బ్రిటన్‌ నుంచి రెండు దేశాలూ స్వాతంత్య్రం పొందినవే. గత రెండువందల సంవత్సరాల్లో లాటిన్‌ అమెరికాలో అమెరికన్లు జరపని కుట్ర లేదు, అనేక ప్రభుత్వాలను కూల్చివేశారు, అనేక మందిని హత్య చేయించారు. మొత్తం పశ్చిమార్ధగోళం తమకిందే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.చరిత్రలోకి చూస్తే కెనడాను ఆక్రమించుకొనేందుకు అమెరికా 1812లోనే ప్రయత్నించింది.1939వరకు కెనడాను ఆక్రమించాలనే మిలిటరీ వ్యూహాన్ని కొనసాగించి తరువాత ఉపసంహరించుకుంది, ట్రంప్‌కు ఆ గతం గుర్తుకు వచ్చి ఉంటుంది.కెనడా వర్తమాన చరిత్రను చూస్తే అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలసి అనేక దాడుల్లో భాగస్వామిగా ఉంది.నాటో కూటమిలో కూడా చేరింది.అయితే కొన్ని సందర్భాలలో అమెరికా వైఖరితో విబేధించింది. అణ్వాయుధాల మోహరింపుకు అంగీకరించలేదు, వియత్నాంపై యుద్దాన్ని అంగీకరించలేదు. క్యూబా విషయంలో కూడా సానుకూలంగా ఉంది.చివరికి తన ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా రుద్దిన ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో మెక్సికోతో కలసి భాగస్వామి అయింది.గల్ఫ్‌వార్‌లో అమెరికాతో కలసిపనిచేసింది.వీటితో పాటు కొన్ని మిత్రబేధాలు ఉన్నాయి. అందుకే తాజా పన్ను ఉగ్రవాదాన్ని ట్రంప్‌ కెనడాకూ విస్తరించాడు.ఈ పూర్వరంగంలో చూసినపుడు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొంటే ఐరోపా, మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత కెనడాను కూడా తనదారికి తెచ్చుకుంటుందా ? చూద్దాం ! హొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొ

గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్నికబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది.రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.వివిధ రంగాల జివిఏల తీరు తెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తరువాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి.మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ ీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవారంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011-12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.

2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటుతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రు.6,426 ఉంటే 2024-25లో రు.19,696గా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదల రు.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం 4శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేకపోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం నాలుగుశాతంగా ఉన్న పశుపోషణ రాబడి 2018-19 నాటికి 16శాతానికి పెరిగింది. పంటల రాబడి వాటా 40శాతం దిగువకు పడిపోయింది.ఉద్యానవన పంటల సాగు మెరుగ్గా ఉండటంతో సాగు భూమి పెరుగుతున్నది.వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల్లో కేవలం రెండుశాతమే ఉద్యానవన పంటలకు ఉంది. ఈ పంటల రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తేనే వారికి ఉపయోగం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు పూనుకున్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి.మౌలిక సదుపాయాలు, రోడ్లు,పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళాదుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.

ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రధమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రు.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం.

పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు 60 శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చుకుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా ? 2021 ఆగస్టులో ఖాద్య తైలాలు- పామాయిల్‌ ఉత్పత్తి పెంపు పథకాన్ని ప్రకటించి 2025-26 నాటికి అదనంగా పామాయిల్‌ 6.64లక్షల హెక్టార్ల సాగు చేయిస్తామని చెప్పారు, కానీ 1.89లక్షలే పెరిగింది, ఇదే కాలంలో ఆవనూనె సాగు, ఉత్పత్తి రెండూ తగ్గాయి. దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ నేతలే కారణమని చెప్పినా నమ్మే జనాలున్నారు మరి ! మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుసెనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది ! గుజరాత్‌ వేరుశన సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశాబ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బిజెపి రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపివేయటమే దీనికి కారణం.పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటంలో ఉన్న శ్రద్ద రైతాంగం మీద లేదు. ఇతర ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా సబ్సిడీకి లభిస్తుండటంతో రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు, దానికి తోడు గతేడాది వర్షాలు బాగాపడటం కూడా డిమాండ్‌ను పెంచింది.

అంతర్గత పరిస్థితి ఇలా ఉంటే అమెరికా కత్తి మన రైతాంగం మీద వేలాడుతున్నది.2030 నాటికి ఇరుదేశాల వాణిజ్యాన్ని 128 బిలియన్‌ డాలర్ల నుంచి 500బి.డాలర్లకు తీసుకుపోతామని మన నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గాను తమ దేశంలో వినియోగించని కోడికాళ్లు, మిగులుగా ఉన్న వెన్న, జున్ను వంటి పాడి ఉత్పత్తులను, సోయా, మొక్కజొన్నలు, పత్తి తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతితో పాటు పన్ను భారాన్ని తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది.ఏటా 20 బిలియన్‌ డాలర్ల మేర అక్కడి రైతాంగానికి అమెరికా సబ్సిడీలు ఇస్తున్నది. షరతులను అంగీకరిస్తే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో కుమ్మరిస్తారు,మనకు వ్యవసాయం వాణిజ్యం కంటే జీవనాధారంగా ప్రాధాన్యత కలిగి ఉంది.అమెరికా వస్తువులకు మార్కెట్‌ను తెరిస్తే నరేంద్రమోడీతో పాటు బిజెపి రాజకీయ పతనానికి నాంది పలికినట్లే.ట్రంప్‌ను సంతుష్టీకరించటానికి సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పత్తి దిగుమతి పన్ను రద్దు చేశారు. దాని ప్రభావం మన పత్తిమార్కెట్‌పై పడి కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ వ్యవసాయ మార్కెట్‌ విలువ 452 బిలియన్‌ డాలర్లని, 2030నాటికి 563బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా,146 కోట్ల జనాభా ఉన్నందున మన మార్కెట్‌ ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ పూర్వరంగంలో కనీస మద్దతు ధరలను పెంచటంతో పాటు వాటికి చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ సరైనదే అని తేలుతున్నది.ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 సార్లు సమావేశం జరపటం తప్ప చేసిందేమీ లేదు, దానికి ఎలాంటి వ్యవధి నిర్ణయించలేదు గనుక అలా సాగదీస్తూనే ఉంటారు. ఈలోగా రైతులు మరచిపోతారు.ఏడాది క్రితమే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను పన్నెండు వేలకు పెంచాలని కూడా చెప్పింది. అయినా మోడీ సర్కార్‌ ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.గ్రామీణ ఆదాయ పెరుగుదల 57.6, ఖర్చు పెరుగుదల 69.4శాతాల చొప్పున ఉంది.ఈ కారణంగా రుణ భారం పెరిగినందున రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలి.2016-17లో రుణ భారం ఉన్న గ్రామీణ కుటుంబాలు 47.4శాతం కాగా 2021-22 నాటికి 52శాతానికి చేరినట్లు నాబార్డు సర్వే తెలిపింది.వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు 2020-21లో 3.53శాతం ఉండగా 2024-25లో 2.54శాతానికి తగ్గాయి.వ్యవసాయ వృద్ధి రేటు 2023-24లో 1.4శాతానికి తగ్గింది, ఇది ఏడు సంవత్సరాల్లో కనిష్టం. రెండు ఎకరాలలోపు రైతాంగానికి విధిగా అందిరికీ పంటల బీమా చేయించాలి. వ్యవసాయ కార్మికులకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖగా ఉన్న పేరును వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మిక సంక్షేమ శాఖగా మార్చాలి. పంటల సేకరణ పరిమితంగానే ఉన్నందున కనీస మద్దతు ధరలను కేవలం ఆరుశాతం మంది రైతులు మాత్రమే 2021-22లో లబ్ది పొందినట్లు తేలింది.చట్టబద్ద హామీ ఉంటే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి నిర్ణయించాలి.బలహీనమైన మార్కెట్‌ సంబంధాలు ఉన్న రాష్ట్రాలలో రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. మొత్తం 23 పంటలకు అమలు జరపాలంటే ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి కావాలి. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. గోధుమలు, బియ్యానికి ఒక శాతం కనీస మద్దతు ధర పెంచితే చిల్లర ధరలు 0.22శాతం పెరుగుతాయి.రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యేక విధానాలను రూపొందించాలి.చట్టబద్దత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు ఆధరలకు కొనేందుకు ముందుకు రారు, ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా అవసరయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల ధరలకు చట్టబద్దత కల్పిస్తే భూగర్భ జలాల వాడకం ఎక్కువ అవుతుంది, భూసారం దిగజారుతుంది. చట్టబద్దత కల్పించటం ప్రపంచవాణిజ్య సంస్థ నిబంధనకు విరుద్దం, మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వటానికి ఉండదు. బియ్యం ఎగుమతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను మద్దతు ధరలతో ప్రోత్సహించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులలో అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రతికూలంగా ఉన్న అంశాలను మాత్రమే పట్టించుకొని అనుకూలంగా ఉన్నవాటిని విస్మరించటం రైతాంగం మీద ఉన్న కక్ష, వివక్షగాక మరేమిటి ?

వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని వెనెజులా ప్రస్తుతం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది.జనవరి మూడవ తేదీన రాజధాని కారకాస్‌పై దాడి చేసిన అమెరికా నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకుపోయింది.నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది.తాను వెనెజులా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు.తదుపరి ఏం జరుగుతుందో తెలియదు. తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు.ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష భాద్యతలు చేపట్టారు.తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను బెదిరించాడు.ఆర్థిక, రాజకీయ ” సంస్కరణలు ” చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్‌ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్‌ మిలర్‌ చెప్పాడు.వెనెజులాలో పరిస్థితి గురించి భిన్న కథనాలు వెలువడుతున్నాయ. వాటిని అవునని లేదా కాదని గానీ వెంటనే నిర్దారించలేము. ఉదాహరణకు కొందరు వెనెజులా అధికారులు అమెరికాతో చేతులు కలిపారని అంటున్నారు. అది జరిగి ఉండకపోతే అంత సులభంగా కిడ్నాప్‌ జరిగేదా అనే సందేహాలు ఉన్నాయి.దేని గురించి తొందరపడి నిర్దారణలకు రానవసరం లేదు. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిది భారత్‌ అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ దుర్మార్గాన్ని ఖండించకుండా మౌనముద్ర దాల్చారు.తాను భారత్‌ పట్ల సంతోషంగా లేనని ట్రంప్‌ ప్రకటించాడు. అతగాడిని ” సంతుష్టీకరించేందుకే ” మౌన దౌత్యమా ! మొత్తానికి మోడీని అమెరికా ఇరకాటంలో పెట్టింది. చమురుకోసమే అన్నది అందరికీ అర్ధమైన ఒక అంశం. మదురో మీద నార్కో టెర్రరిస్టు ముద్రవేసిన అమెరికా, ప్రస్తుతం అధ్యక్షరాలిగా ఉన్న డెల్సీ మీద అలాంటి ఆరోపణ చేయలేదు, తమకు సహరించకపోతే సంగతి చూస్తాం అని బెదిరించిందంటే కారణాలు ఉన్నాయన్నది స్పష్టం. వాటి గురించి ప్రపంచంలో పండిత మధనం జరుగుతోంది.

మదురోను ఎలా పట్టుకున్నారు, అందుకు అనుసరించిన పద్దతేమిటి అనే అంశాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని నెలల పాటు మదురు నివశించే భవనం లాంటిదే ఒకటి ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించారని, మదురో సిబ్బందిని ప్రలోభపెట్టి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు.అపహరణ సమయంలో జరిగిన ప్రతిఘటనలో 80 మంది మరణించారని, వారిలో 32 మంది క్యూబన్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగజ్‌, ఆమె సోదరుడు జార్జి ఇద్దరూ వామపక్ష గెరిల్లా కుటుంబం నుంచి వచ్చిన వారే. మదురో పాలకుడైతే జార్జి విధానాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడు. వారి తండ్రి జార్జి ఆంటోనియో రోడ్రిగజ్‌ 1970దశకంలో వెనెజులా నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన గెరిల్లా పోరాట యోధుడు. అతన్ని పట్టుకొని పోలీసులు కస్టడీలో చంపివేశారు.డెల్సీ రోడ్రిగజ్‌ సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఆమెనేమీ చేయలేదు. ఇది లొంగదీసుకొనేందుకు బెదిరింపుగా కనిపిస్తున్నది. మరోవైపు డెల్సీ అమెరికా విదేశాంగ మంత్రితో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇవి ఛావెజ్‌ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించటానికి ఎత్తుగడగా వ్యాపింపచేసినవి కూడా కావచ్చు.

చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్ధించని నియంతలు లేరు, మారణకాండ లేదు.తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో ! రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ హిట్లర్‌ యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా ”ప్రజాస్వామిక ముసుగు ” వేసుకున్నదేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది.సోవియట్‌ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినపుడు సోషలిస్టు వ్యవస్థను అంతంచేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు. ఉక్కు మనిషి స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తరువాత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు ? తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు.రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు.అది కూడా సాధ్యం కాదని 80 ఏండ్ల అనుభవం తేల్చింది. అందుకు గాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని,గతంలో తమ పెరటి తోటగా పరిగణించిన లాటిన్‌ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌ లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదంగా చరిత్రలో నమోదైంది.

ప్రస్తుతం ప్రపంచంలో అస్థిరపరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది.ఉక్రెయిన్‌, పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్‌లో దాడులు, అంతర్యుద్ధాలు,రష్యా, ఇరాన్‌, వెనెజులాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం,సోవియట్‌తో ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా,లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు మద్దతు, ఇరాన్‌పై దాడి, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో పరాభవం.మొత్తం మీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది. వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా ” ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్య ” గా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకతలనే వల్లిస్తున్నాయి.ఒక పధకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుకపలుకులు పలికిస్తున్నది,వాటిని పట్టుకంని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు.డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌( డిఇఏ) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐరాస వందపేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి. మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు, మెక్సికోలో నిజమైన పాలకులు అవే అని స్వయంగా ట్రంప్‌ తాజాగా చెప్పాడు.పక్కనే సరిహద్దు నుంచి పెంటానిల్‌ అనే డ్రగ్‌ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు.మరి దాని మీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణం ఏమిటంటే గత పాతిక సంవత్సరాలుగా వెనెజులా కొరకరాని కొయ్యగా తయారైంది.క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది.మనదేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ బెదిరించటంతో 2025లో 81శాతం తగ్గించింది.తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్లుగా ట్రంప్‌ ఎలాంటి శషభిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.కట్టుకథలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలశ్యం చేస్తే ఉన్న పట్టుకూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపుకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే.తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది.

వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం తప్ప బలానికి కాదు. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్‌ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది.ఈ రెండూ కలసి వాషింగ్టన్ను సవాలు చేస్తున్నాయి. అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి.చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు.మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్‌ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్‌లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్దపడుతున్నట్లు ట్రంప్‌ తీరుతెన్నులు ఉన్నాయి.అయితే అది జరగాలంటే అనేక చిక్కు ముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరక్కుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. భారత్‌ మీద తాను ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలుసని ఈ సందర్భంగా ట్రంప్‌ చేసిన ప్రకటన నరేంద్రమోడీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆపరేషన్‌ సింధూర్‌ను తానే ఆపివేయించానని పదే పదే చెప్పిన ట్రంప్‌ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు.ఒక వైపు పాకిస్తాన్‌ మరో వైపు నుంచి బంగ్లాదేశ్‌ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు.

అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్‌ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్‌ నోరిగాను గద్దె నెక్కించింది అమెరికా. సంబంధాలు చెడింతరువాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే అ మూడు వందల విమానాలు, 27వేల మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకొని అమెరికాలో విచారించి 40 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్‌ మీద దాడి చేసి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్ను పట్టుకొని తరువాత ఉరితీసి అమెరికా చంపింది.హైతీ అధ్యక్షుడు జీన్‌ బెట్రాండ్‌ అరిస్డైడ్‌ను కిడ్నాప్‌ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్‌ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెస్‌ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45ఏండ్ల శిక్షవేసింది. ట్రంప్‌ అతగాడిని క్షమించి జైలు నుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్‌లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీయం చేసినందుకు ప్రధాని మహమ్మద్‌ మొసాదిక్‌ను తొలగించి నియంత షాను గద్దెనెక్కించింది.గౌతమాలాలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్‌ ఆర్బెంజ్‌ను తొలగించింది. అతనికీ కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్‌ కరీం ఖాశింను ఇరాక్‌లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దె నెక్కించిన నియంత నగో దిన్‌ డైమ్‌ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది.గ్రెనడాలో హడ్సన్‌ ఆస్టిన్‌ను తొలగించింది.లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది..

విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Tags

, , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మేం అందంగా లేకపోవచ్చు, మేమూ అందరిమాదిరి మనుషులమే…

మా శరీరాలు నల్లగా ఉండవచ్చు, మా హృదయాలు స్వచ్చం…

విత్తనాలు నాటేవారిలో మేమూ ఒకరిమే, వాటికి కాపలాదారులం కూడా ….

పిడికెడు ధాన్యమే మేం కోరుతున్నాం….

ఈ భావంతో లిపిలేని తమ భాషలో పాటలు పాడుకొంటారు కేరళలోని పనియా గిరిజన తెగకు చెందిన వారు. సమాజంలో నిరాదరణకు గురైన ఈ తెగకు చెందిన నాలుగుపదుల వయస్సున్న పి.విశ్వనాధన్‌ జీవనం కోసం కాపలాదారుగా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికలలో కేరళలోని వయనాడ్‌ జిల్లా కేంద్రమైన కాల్‌పెట్టా మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర గిరిజన తెగలలో కురిచియా వారే రిజర్వుడు సీట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కారణంగా నోరులేని పనియా తెగకు చెందిన వారు ఇప్పటి వరకు ఇలాంటి పదవులను చేపట్టలేదు. దళితులు, గిరిజనులకు కేటాయించిన స్థానాల నుంచే ఆ తరగతులకు చెందిన వారు ఎన్నికై పదవులను చేపట్టటం సర్వసాధారణం. అయితే సిపిఐ(ఎం) తన కార్యకర్తగా పని చేస్తున్న విశ్వనాధన్ను ఒక జనరల్‌ వార్డు నుంచి పార్టీ పోటీకి నిలిపింది. పట్టణంలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిపించింది. గిరిజనులకు రిజర్వు చేసిన చైర్మన్‌ పదవిని చేపట్టారు.మళయాళ పత్రికలతో పాటు అక్కడి నుంచి వెలువడే జాతీయ పత్రికలన్నీ ఈ ఎన్నిక గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. విశ్వనాధన్ను ఒక పత్రిక హీరోగా వర్ణించింది. తమ పొలాల్లో పని చేసేందుకు గతంలో ఈ తెగవారిని భూస్వాములు బానిసలుగా చేసుకున్న చరిత్ర ఉంది.

యువకుడిగా డివైఎఫ్‌ఐ నేతగా, సిపిఐ(ఎం)లో ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆదివాసీ క్షేమ సమితి నేతగా, జానపద గాయకుడిగా విశ్వనాధన్‌ పని చేస్తున్నారు.గిరిజన తెగల హక్కులు, గౌరవం కోసం జరిగే అన్ని ఉద్యమాల్లో భాగస్వామి.చిన్న తనంలో చదువు సంధ్యలకు నోచుకోని కారణంగా ఈ వయస్సులో పదవ తరగతితో సమానమైన( మెట్రిక్‌ వంటిది) తుల్యత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎవరికోసమో ఎదురు చూడకుండా తమ సామాజిక తరగతికి చెందిన వారు తమ పరిమితులను అధిగమించి అన్ని ఆటంకాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ఎన్నిక తమవారిలో ప్రోత్సాహానికి దోహదం చేస్తుందన్నారు.దరఖాస్తులు రాసుకోవటం కూడా రాని తమవారు ఇతరుల మీద ఆధారపడుతున్నారని చెప్పారు. వయనాడ్‌ జిల్లాలోని గిరిజనుల్లో పనియా తెగవారు 75వేల మంది ఉండగా కురుమా, కురిచియా తెగలకు చెందిన వారు 52వేల మంది చొప్పున ఉన్నారు. ఈ తెగకు చెందిన వారు వయనాడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలో ఉన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు నీలగిరి జిల్లాలో, కర్ణాటకలో పరిమితగా ఉన్నారు. ఎన్నికైన తరువాత అధికారిక వాహనంలో తన తలిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లినపుడు వారిలో ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు లేకుండా కొడుకును చూశారని, తన కుమారుడు ఈ పదవికి ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి చెప్పినట్లు పిటిఐ తెలిపింది. అతని సామర్ధ్యం కారణంగానే జనరల్‌ సీటు నుంచి గెలిచారని సిపిఐ(ఎం) సీనియర్‌ నేత వి హారిస్‌ చెప్పారు.

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ – కుమ్మక్కుతోనే బిజెపి విజయం: పినరయి విజయన్‌

కేరళలో కూడా మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని జనం జాగరూకులై ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు.గురువారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ(ఎం) వ్యతిరేకంగా 1990దశకంలో ప్రారంభమైన కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌-బిజెపి కుమ్మక్కు ఇప్పటికీ కొనసాగుతున్నదని, ఆ కారణంగానే ఇటీవల తిరువనంతపురంలో, 2024 ఎన్నికల్లో త్రిసూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని, అంతకు ముందు 2016లో నీమమ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.తనకు అనుకూలంగా కాంగ్రెస్‌ సహకరించిందని నీమమ్‌లో గెలిచిన బిజెపి నేత ఓ రాజగోపాల్‌ స్వయంగా అంగీకరించిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తిరువనంతపురంలో బిజెపి గెలిచిన అనేక వార్డుల్లో కాంగ్రెస్‌కు అతి తక్కువగా ఓట్లు రావటాన్ని బట్టే కుమ్మక్కును గ్రహించవచ్చన్నారు. కర్ణాటకలో ముస్లింల ఇండ్ల కూల్చివేతపై తాను స్పందించిందాంట్లో తప్పులేదన్నారు. ఇలాంటి ఉదంతాలు విదేశాల్లో జరిగినా స్పందిస్తున్నపుడు దేశంలో జరిగిన వాటి మీద మౌనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కేరళకే పరిమితం కావాలని అనటం ఏమిటని అన్నారు. ఈ అంశాన్ని కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో చర్చించారా అని అడగ్గా, ఇటీవల శివగిరి మఠసమావేశానికి ఆయన ఆలశ్యంగా వచ్చారని, మంత్రివర్గ సమావేశం, ఇతర కార్యక్రమాల వలన తాను ముందుగానే మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు.

సోనియా గాంధీని కలిసిన శబరిమల బంగారం చోరీ కేసు నిందితులు !

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు సిట్‌ దర్యాప్తులో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్నదన్న కాంగ్రెస్‌ ఆరోపణను విజయన్‌ తోసిపుచ్చారు. జవాబు చెప్పాల్సిన వారు ఎదురుదాడికి దిగినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ పొట్టి, దొంగబంగారం కొనుగోలు చేసిన వర్తకుడు గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఆడూర్‌ ప్రకాష్‌, ఆంటో ఆంటోనీ కాంగ్రెస్‌ నేత సోనియగాంధీతో కలసి దిగిన ఫొటో సంగతేమిటో చెప్పకుండా నాటకాలు వేస్తున్నారని సిఎం అన్నారు. పొట్టి పిలిస్తే వెళ్లానని ప్రకాష్‌ చెబుతున్నారని, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారా, అసలు వారిని సోనియా వద్దకు తీసుకువెళ్లిన వారెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కేసు విచారణలో ఎలాంటి ఇబ్బంది లేదని, హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున బిజెపి కోరుతున్నట్లుగా సిబిఐకి నివేదించాల్సిన అవసరం లేదని విజయన్‌ చెప్పారు.

ఏ కూటమి ఓట్లు పెరిగాయి, ఎవరికి తగ్గాయి !

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ ఘోరపరాజయం పాలైందని, రానున్న రోజుల్లో బిజెపి హవా ప్రారంభమౌతుందని మీడియాలో అనేక మంది చెబుతున్నారు. మళయాళ మనోరమ పత్రిక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన అంకెలను ఉటంకిస్తూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఎల్‌డిఎఫ్‌కు మొత్తం 70,99,175 ఓట్లు వచ్చాయి, 2024లోక్‌సభ ఎన్నికల కంటే 4.3లక్షలు ఎక్కువ.యుడిఎఫ్‌, ఎన్‌డిఏల కంటె మెరుగైనదిగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్‌ 90,18,752 ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 82,37,385కు అంటే 7.81లక్షల ఓట్లు తగ్గాయి.ఎన్‌డిఏ(బిజెపి) ఓట్లు 38,37003 నుంచి 31,21,335కు పడిపోయాయి, 7.16లక్షల ఓట్లు తగ్గాయి.

బిజెపి మేయర్‌కు శృంగభంగం !

తిరువనంతపురం నగరమేయర్‌గా ఎన్నికైన బిజెపి నేత వివి రాజేష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొనే తానే ఇరుక్కు పోయారు. స్మార్ట్‌ సిటీ పధకంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్‌ వాటా సొమ్ముతో 113 ఎలక్ట్రానిక్‌ బస్సులను కొనుగోలు చేసి నగరంలో, వెలుపలా వాటిని నడిపిస్తున్నారు.గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నిర్వహణలో వచ్చే లాభంలో వాటాను నగర కార్పొరేషన్‌కు ఇవ్వాలని ఉంది. ఆ మేరకు తమకు ఇవ్వటం లేదంటూ బిజెపి మేయర్‌ ధ్వజమెత్తారు. ఆ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. కార్పొరేషన్‌ ఖాతా నుంచి కొంత సొమ్ము ఇచ్చినప్పటికీ అది కూడా ప్రభుత్వ సొమ్మే, దీనికి తోడు ప్రత్యేకంగా ఆ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఖాతా లేదు గనుక గనుక లాభనష్టాల ప్రస్తావన రాలేదు.పినరయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేందుకు మంచి అవకాశం దొరికిందని బిజెపి భావించింది. డీజిలుతో నడిచే బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ భారంగా ఉందని రవాణా శాఖ మంత్రి కెబి గణేష్‌ కుమార్‌ చెప్పారు. మేయర్‌కు నిజంగా ఆసక్తి ఉంటే వాటిని తిరిగి తమకు అప్పగించాలని లేఖ రాస్తే వెంటనే స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఆ బస్సులను ఆర్‌టిసి డిపోలలో నిలిపేందుకు వీల్లేదని, కార్పొరేషనే ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రభుత్వం చౌకగా దొరికే డీజిల్‌ బస్సులను కొనుగోలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దాంతో తత్వం బోధపడిన మేయర్‌ తమకు వాటిని వెనక్కు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదంటూ తోకముడిచారు. నగరమేయర్‌ పదవిని ఆశించి భంగపడిన బిజెపి కార్పొరేటర్‌, మాజీ డిజిపి అయిన ఆర్‌ శ్రీలేఖ ఒక భవనం విషయంలో కూడా భంగపడ్డారు. మాజీ మేయర్‌, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ అయిన వికె ప్రశాంత్‌ ప్రస్తుతం కార్పొరేషన్‌కు చెందిన ఒక భవనానికి అద్దె చెల్లిస్తూ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోనే సదరు ప్రాంత వార్డు కార్పొరేటర్‌ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఆ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ భవనం నుంచి ఎంఎల్‌ఏ ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఒప్పందం మేరకు అద్దె చెల్లిస్తున్నందున ఖాళీ చేసే ప్రసక్తి లేదని, గడువు తీరేంతవరకు తననెవరూ కదిలించలేరని ప్రశాంత్‌ స్పష్టం చేశారు. దాంతో ఆమె అబ్బే ఊరికే కేవలం అభ్యర్ధించా అంటూ వెనక్కు తగ్గారు. నెల రోజులు కూడా గడవక ముందే బిజెపి ఇలాంటి పనులకు పాల్పడిందింటే రానున్న రోజుల్లో ఎలాంటి గిల్లి కజ్జాలకు దిగుతుందో చూడాల్సి ఉంది.

బంగ్లాదేశీయుడివా అంటూ గిరిజనుడిని కొట్టి చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి గూండాలు !

డిసెంబరు 17న కేరళ పాలక్కాడ్‌ జిల్లా అట్టపల్లమ్‌ గ్రామంలో హత్యకు గురైన చత్తీస్‌ఘడ్‌ వలస కూలీ, గిరిజనుడైన రామనారాయన్‌ భగేల్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల రూపాయలు మంజూరు చేసింది. తల్లి, భార్యకు ఐదేసి లక్షలు, ఇద్దరు పిల్లలకు పదేసి లక్షల చొప్పున వారి పేర్లతో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తారు. నువ్వు బంగ్లాదేశీయుడివా అంటూ రామనారాయన్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో నిందితుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరు పదిహేనేండ్ల క్రితం ఒక సిఐటియు మరియు డివైఎఫ్‌ఐ కార్యకర్తను చేసిన వారిలో ఉన్నారు. వారితో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీకి చెందిన వారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు మీడియాకు తెలిసినప్పటికీ మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

శాంతి, మానవాళి అభ్యున్నతి కోరుకోవటానికి జరుపుకొనే క్రిస్మస్‌ రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ కొంత మంది ప్రాణాలు తీయించాడు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని వాయువ్య ప్రాంతంపై అమెరికా వైమానిక, క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇస్లామిక్‌ రాజ్య ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పుకుంది. క్రిస్మస్‌ రోజున జరిగిన ఈ దాడిలో 140 మంది మరణించారు, వారిలో ఉగ్రవాదులెందరు, గొర్రెలు, మేకలు, పశువుల కాపరులెందరు అనేది తెలియదు. ఇలా అమాయకులపై దాడులు చేసి, హతమార్చటం ద్వారా ఇస్లామిక్‌ రాజ్య ఉగ్రమూకలు మరింతగా రెచ్చపోయేందుకు ట్రంప్‌ దోహదం చేసినట్లు కొందరు భావిస్తున్నారు. నైజీరియాలోని క్రైస్తవులపై జరుపుతున్న మారణకాండకు ఇది ప్రతీకారమని, క్రిస్మస్‌ కానుక అని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. నోబెల్‌ శాంతి బహుమతి కావాలంటూ నానా యాగీ చేసిన ఆ పెద్దమనిషి నాయకత్వంలో ఇది తొమ్మిదో దేశంపై జరిగిన దాడి అని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడి హయాంలోనూ ఇన్నిదేశాల మీద దాడులు జరగలేదు. నైజీరియాలో ఉగ్రవాద మూకలు దశాబ్దాలుగా మారణకాండకు పాల్పడుతున్నమాట నిజం. వారికి మతం లేదు. పోనీ క్రిస్మస్‌కు ముందు పెద్ద ఉదంతం జరిగి క్రైస్తవులను హతమార్చారా అంటే అదీ లేదు. మరెందుకు దాడి చేయించినట్లు ? గత కొంత కాలంగా నైజీరియాలో క్రైస్తవులను ఊచకోత కోస్తున్నారంటూ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కొందరు మతరాజకీయం చేసే ఎంపీలు, క్రైస్తవ మత సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు పనిగట్టుకొని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయి. ఏమతం కూడా అమాయకులను చంపమని చెప్పలేదు. కానీ ఆ పేరుతో ప్రపంచంలో మారణకాండలు సాగాయి. హిట్లర్‌ యూదులను ఊచకోతకోశాడు. అనేక దేశాల్లో యూదులు ఊచకోతకు గురయ్యారు. ఇజ్రాయెల్‌లో యూదు మతస్తులపై పాలస్తీనాకు చెందిన హమస్‌ సాయుధులు దాడి చేసి 1,195 మందిని హత్యచేసి 251మందిని బందీలుగా పట్టుకుపోయారు. దాన్ని సాకుగా చూపుతూ పశ్చిమదేశాల మద్దతుతో ఇజ్రాయెల్‌ 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు పాలస్తీనియన్లను ఊచకోత కోస్తూనే ఉంది. దాదాపు 70వేల మంది మరణించగా వారిలో సగానికి పైగా అమాయకులైన మహిళలు, పిల్లలే ఉన్నారు, మరో 1,71,000 మంది గాయపడ్డారు. వేలాది మంది జాడతెలియటం లేదు, లక్షలాది ఇండ్లను కూల్చివేశారు. మన కళ్ల ముందు జరుగుతున్న మారణకాండ ఇది.

నైజీరియాలో అలాంటి ఉదంతాలేమైనా జరిగాయా ? మతపరమైనదైనా, మరొక ఉగ్రవాదమైనా అది ఆయా దేశాల అంతర్గత సమస్య. ఎవరికి వారు తేల్చుకోవాల్సిన అంశం. ఉగ్రవాద అణచివేతకు అమెరికాకు ఎవరు అధికారమిచ్చారు ? నైజీరియాలో మత ప్రాతిపదికన ఉగ్రదాడులు జరగటం లేదు, అనేక కారణాలు ఉన్నాయి. అలాంటపుడు క్రైస్తవుల రక్షణ పేరుతో జరిపేదాడులు ఆ సామాజిక తరగతిని మరింతగా లక్ష్యం చేసుకొనేందుకే తోడ్పడతాయి. లేని ఆలోచన కలిగించటం తప్ప మరొకటి కాదు. ప్రపంచంలో ఆరవ పెద్ద దేశంగా ఇరవై మూడు కోట్ల మంది జనాభా ఉన్న నైజీరియాలో 56శాతం మంది ముస్లింలు 43శాతం క్రైస్తవులు. ఉత్తర ప్రాంతంలో ముస్లింలు కేంద్రీకృతం కాగా దక్షిణ ప్రాంతంలో ముస్లింలు ఉన్నారు. మనదేశంలో ఒకే మతంలో వివిధ కులాలు ఉన్నట్లే అక్కడ రెండు మతాల్లోనూ తెగలవారీ విభజన ఉంది. బోకోహారమ్‌, ఐసిస్‌ వంటి ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి. అవి రెండు మతాలకు చెందిన వారినీ హతమారుస్తున్నాయి.మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని అనేక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలు, పశువుల కాపరులు-రైతాంగం మధ్య, పశువులను మేపుకోవటం దగ్గర తలెత్తిన వివాదాలు, బందిపోట్ల చర్యలు, హత్యలు అక్కడ సర్వసాధారణం. వాటిలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారు తప్ప క్రైస్తవుల ఊచకోత అనేది ఒక సాకు మాత్రమే, దానికి ఎలాంటి ఆధారాలు లేవని అనేక విశ్లేషణలు వెల్లడించాయి. అక్కడి జనాభా తీరుతెన్నులను చూసినపుడు ఒక మతంవారిపై మరొక మతం లేదా రాజ్యమే పనిగట్టుకొని ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు, అలాంటి అవకాశాలు కూడా లేవు. నైజర్‌ నది ప్రవహిస్తున్న కారణంగా బ్రిటీష్‌ వారు తమ వలసగా ఉన్న ఆ ప్రాంతానికి 1897 నైజీరియా నామకరణం చేశారు. సహజ సంపదలు, పరిసర దేశాలను అదుపులో ఉంచుకొనేందుకు, ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో భాగంగానే క్రిస్మస్‌ రోజు ట్రంప్‌ సేనల దాడులు జరిగాయి.

నైజీరియాలో అమెరికాకు అవసరమైన విలువైన ఖనిజాలు ఉన్నాయి, చమురు నిల్వలు కూడా ఉన్నసంగతి తెలిసిందే. ఉగ్రవాదులను నిరోధించటంలో అక్కడి ప్రభుత్వాలు విఫలం చెందాయి. అధికారంలోకి వచ్చిన పాలకులందరూ నీకిది నాకది అంటూ ఆశ్రితులతో కలసి దేశ సంపదలను పంచుకొనేవారే తప్ప జన సంక్షేమాన్ని గాలికి వదిలారు.దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడి పాలకుల మద్దతుతోనే అమెరికా రంగంలోకి దిగి సహజసంపదలను స్వంతం చేసుకొనేందుకు ఉగ్రవాదాన్ని ఒక ముసుగుగా చేసుకుందన్నది స్పష్టం. తాజాదాడులకు ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. నైజీరియా పొరుగుదేశమైన నైజర్‌లో యురేనియం ఖనిజ వెలికితీతలో రష్యా ఉంది. ఆఫ్రికాలోని విలువైన ఖనిజాల్లో 30శాతం నైజీరియాలో ఉన్నాయి. ఆఫ్రికా ప్రాంతాన్ని వలసగా చేసుకున్న ఫ్రెంచి, అమెరికా ప్రోత్సహించిన పాలకులను అనేక దేశాలలో మిలిటరీ తిరుగుబాట్లతో వదిలించుకొని పశ్చిమదేశాల ప్రభావం నుంచి బయటపడేందుకు పూనుకున్నారు. ఇటీవల చైనా తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమంలో భాగంగా ఆఫ్రికా దేశాలలో పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిన నైజీరియాను అడ్డుకొనేందుకు అమెరికా రంగంలో దిగిందని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో బుర్కినాఫాసో, మాలి, నైజర్‌ దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు పూనుకున్నాయి, దాన్లో భాగంగానే ఒక మిలిటరీ బెటాయిలియన్‌ ఏర్పాటును ప్రకటించాయి. ఈ కూటమికి రష్యా మద్దతు ఉంది. ఈ పరిణామంతో ఎక్కడ చొరవ వాటి చేతిలోకి పోనుందో అనే ఆతృతతో అమెరికా దాడులు జరిపింది. అంతేకాదు అమెరికాలోని మతవాద క్రైస్తవుల మద్దతు పొందేందుకు, అమెరికాను మరోసారి గొప్పగా చేయాలన్నవారి ప్రశంసలు అందుకొనేందుకు, 2026 నవంబరులో జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా ఈదాడులను ఉద్దేశించినట్లు భావిస్తున్నారు. ఈ పూర్వరంగంలో నైజీరియా పాలకులు ఎందుకు వాషింగ్టన్‌తో చేతులు కలుపుతున్నారంటే జూనియర్‌ భాగస్వామిగా ప్రాంతీయంగా పెత్తనం సాగించాలని తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు తెరవెనుక ఉండి రాజకీయం చేస్తున్న వాషింగ్టన్‌ నేరుగా రంగంలోకి దిగింది. ఇదంతా సామ్రాజ్యవాద ప్రాజెక్టులో భాగమే.మొదటిసారి అధికారానికి వచ్చినపుడు 2017 నుంచి దిగిపోయే వరకు తిరిగి రెండవసారి పదవి చేపట్టిన తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, పాకిస్తాన్‌, సోమాలియా, సిరియా, ఎమెన్‌, తాజాగా నైజీరియా మీద దాడులు చేయించాడు. వెనిజులా మీద యుద్దానికి సిద్దం అవుతున్నాడు. గతంలో జార్జి డబ్ల్యు బుష్‌ ఐదు, బరాక్‌ ఒబామా ఏడు దేశాల మీద దాడులు చేయిస్తే ”శాంతిదూత” డోనాల్డ్‌ ట్రంప్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఉగ్రవాదం మీద పోరు పేరుతో అమెరికా చేయించిన దాడుల్లో 4,32,000 మంది పౌరులతో సహా 9,40,000 మంది మరణించినట్లు బ్రౌన్‌ విశ్వవిద్యాలయం యుద్ధ ఖర్చు అనే పరిశోధనలో వెల్లడించింది.

2009లో ఏర్పడిన బోకో హరామ్‌ అనే సంస్థ సున్నీ తెగ ముస్లింలను ”శుద్ధి” చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించుకుంది. నైజీరియా ఉత్తర ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున అక్కడే కేంద్రీకరించి అనేక దాడులు చేసింది.వాటిలో పెద్ద సంఖ్యలో పెద్దలు, పిల్లలు మరణించారని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు అంచనా, అనేక ప్రాంతాలను ఆక్రమించి ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నది. దాని బాధితులలో ఎక్కువ మంది ముస్లింలే. క్రైస్తవులు కూడా ఉన్నారు.మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నవారిని ఊచకోత కోసింది, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్లను దగ్దం చేసింది. ఈ క్రమంలోనే ఆప్రాంతాల్లో ఉన్న చర్చ్‌లను కూల్చివేసింది, క్రైస్తవులపై కూడా దాడులు చేసింది.వాటికి మతంతో సంబంధం లేదు. 2025లో పౌరులపై దాడులు జరిగిన ఉదంతాలు 1,923 ఉంటే వాటిలో కేవలం 50ఘటనల్లో మాత్రమే క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ జరిగినట్లు చెబుతున్న మరణాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం లేదు. పశువుల కాపరులు- రైతుల మధ్య నిరంతరం ఘర్షణలు జరగటం ఒక సాధారణ అంశం. వాటిలో మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. బందిపోట్ల దాడులను కూడా ఉగ్రవాదదాడులుగా అమెరికా చిత్రిస్తున్నది. అధికార యంత్రాంగంలో విపరీతమైన అవినీతి కారణంగా ఉగ్రవాదులకు ప్రభుత్వ అధికారులే ఆయుధాలను అక్రమపద్దతుల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.2023లో అధికారానికి వచ్చిన అధ్యక్షుడు టినుబు ఇప్పటి వరకు 13,500 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించాడు. ఇదే కాలంలో 10,217 మంది ఉగ్రవాద సంబంధ దాడులలో మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చెప్పింది.

నిజానికి అమెరికా ఐసిస్‌ మీద దాడులు చేయటం కొత్తకాదు. బరాక్‌ ఒబామా 2014లోనే ఇరాక్‌, సిరియాల్లో ప్రారంభించాడు. అప్పటి నుంచి దాని కార్యకలాపాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.అయినప్పటికీ 2018లో దాని మీద విజయం సాధించినట్లు ట్రంప్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు తిరిగి నైజీరియాలో దాడులు చేయించటం వెనుక అతగాడి బూతుపురాణాలను వెల్లడించే ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ను ధ్వంసం చేయించాడనే అంశం బయటపడటంతో జనాలను పక్కదారి పట్టించేందుకు చూశాడని సోషల్‌ మీడియా కోడై కూస్తున్నది. నైజీరియాలో 2011 నుంచి వివిధ ఉదంతాల్లో లక్షమందికి పైగా మరణించారని, ఒక్క 2025లోనే 8వేల మంది ఉన్నట్లు ఒక అంచనా. నిజానికి మానవత్వం గురించి మాట్లాడే ట్రంప్‌ ఇప్పుడే ఎందుకు మేలుకున్నట్లు ? క్రైస్తవులవి తప్ప ముస్లింలవి ప్రాణాలు కావా ? అమెరికా అందించే మానవతాపూర్వక సాయాన్ని ట్రంప్‌ నిలిపివేయించాడు. ఫలితంగా అనేక మంది నైజీరియన్లు సరైన వైద్యం అందక మరణించారు. ఇది ఉగ్రవాదం కాదా ?

ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Tags

, , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్‌ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా భారత్‌-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్‌ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్‌ హిమాలయ ప్రాంతంలో భారత్‌ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్‌ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్‌ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్‌ జనరల్‌ అమ్రిత్‌ పాల్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల విధింపుతో భారత్‌, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్‌, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్‌ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్‌ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్‌ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్‌ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్‌ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్‌ చైనాలో భాగంగా బ్రిటీష్‌ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్‌ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్‌ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్‌-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్‌ విమానాలను పాకిస్తాన్‌ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్‌ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్‌ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్‌ మరియు రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్‌ చెబుతున్నట్లే నాడు బుష్‌ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్‌-పుతిన్‌ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్‌ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్‌ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్‌ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్‌ బదులిచ్చాడు.అయితే పుతిన్‌ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్‌ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్‌ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.

అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్‌ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్‌ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్‌ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్‌ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్‌,జపాన్‌,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ కూటమి భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్‌ సింగ్‌ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్‌ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్‌ ” అజండాగా మార్చి దానికి భారత్‌ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్‌ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్‌ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!

రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్‌ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్‌ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్‌ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !