• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: #Pinarayi Vijayan

పేట్రేగుతున్న కేరళ గవర్నర్‌ : 15న రాజభవన్‌ వద్ద ధర్నా , ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ !

29 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Arif Mohammed Khan, BJP, Kerala LDF, Narendra Modi, Pinarai Vijayan, RSS, Subramanya swamy


ఎం కోటేశ్వరరావు


కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తనకు పదవి ఇచ్చిన కేంద్ర పెద్దలను సంతుష్టీకరించేందుకుగాను నానా పాట్లు పడుతున్నారు. దానిలో భాగంగానే ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా పేట్రేగుతూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నారు. పచ్చి అవాస్తవాలు కూడా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి కేంద్ర నేత సుబ్రమణ్య స్వామి మరింతగా రెచ్చిపోయారు. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వెంట్రుకను ముట్టుకున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఒక ట్వీట్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.” రాజ్యాంగం ప్రకారం కేరళ గవర్నర్‌ అంటే భారత రాష్ట్రపతి ప్రతినిధి అని కేరళలోని వెర్రి కమ్యూనిస్టులు తెలుసుకొనేట్లు చేయండి. ఒక వేళ గవర్నర్‌ వెంట్రుకను ముట్టుకున్నా మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సిద్దం కావాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని ఒక ట్వీట్‌ చేశారు. తాజా వివాదానికి వస్తే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో యుజిసి నిబంధనలను పాటించని కారణంగా వారంతా రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆదేశించారు. దీని గురించి పరోక్షంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ చేసిన సాధారణ విమర్శ తన గురించే అని ఊహించుకొని ఏకంగా మంత్రిని తొలగించాలని లేఖ రాశారు.


కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో బాలగోపాల్‌ మాట్లాడుతూ ” ఉత్తర ప్రదేశ్‌ వంటి చోట్ల ఉన్న పరిస్థితులకు అలవాటు పడి అక్కడి నుంచి వచ్చిన కొందరికి కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామికంగా పని చేస్తున్న తీరును అర్ధం చేసుకోవటం కష్టం. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ భద్రతా సిబ్బంది ఐదుగురు విద్యార్దుల మీద కాల్పులు జరిపారు. నేను అప్పుడు ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్‌ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారు.అక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అది.” అన్నారు. గవర్నర్‌ ఖాన్‌ పేరు ప్రస్తావించినట్లుగా ఏ పత్రిక కూడా వార్తలు ఇవ్వలేదు. కానీ ఆమాటలను తనకు వర్తింప చేసుకొని, మంత్రిగా బాలగోపాల్‌ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున తాను ఇచ్చిన సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నానని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అక్టోబరు 25న ఒక లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. దాన్ని విజయన్‌ తిరస్కరించుతూ, గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, బాలగోపాల్‌ మంత్రిగా కొనసాగటానికి గవర్నర్‌ అనుమతి అవసరం లేదు కనుక ఎలాంటి చర్య అవసరం లేదని అన్నారు. తొలగించాలన్న పదాన్ని గవర్నర్‌ పేర్కొనకపోయినా మంత్రిని తొలగించాలన్నదే దాని తార్కిక ముగింపు.


ముఖ్యమంత్రి గనుక మంత్రిని తొలగించకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారని శుక్రవారం నాడు ఢిల్లీలో గవర్నర్‌ ఖాన్‌ ది ప్రింట్‌ పత్రిక ప్రతినిధితో చెప్పారు. ఆర్ధిక మంత్రి బాలగోపాల్‌ను తొలగించాలని తాను కోరలేదని, తన సమ్మతి లేకుండా పదవిలో కానసాగే అవకాశం లేదని రాజ్యాంగం చెప్పిన దానిని కేవలం వివరించానని గవర్నర్‌ వివరించారు. తన లేఖ మీద నిర్ణయం ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిందని, అయితే ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రమాణం చేయించాల్సింది గవర్నర్‌,నేనాపని చేశాను. దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతానని అతను ప్రమాణం చేశాడు. అతను( బాలగోపాల్‌ ) దాన్ని ఉల్లంఘించారు. విద్యావ్యవస్థను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తే అది ఉల్లంఘన కాదా ! అతనికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని కూడా తెలియదు, అంతేకాదు దాని వైస్‌ ఛాన్సలర్లను ఉత్తరాది నుంచి గాక దక్షిణాది నుంచి నియమిస్తారు అని గవర్నర్‌ చెప్పారు.( ఆ విశ్వవిద్యాలయ ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ సుధీర్‌ కె జైన్‌.2000 సంవత్సరంలో తెలుగువాడైన విసి సింహాద్రి, 2003లో పచ్చా రామచంద్రరావు పనిచేశారు. వారికి ముందు 1952 వరకు-తరువాత జాబితాను చూస్తే ఉత్తరాది, ఇతర ప్రాంతాల వారు, ఒకరిద్దరు తప్ప దక్షిణాది వారు కనిపించరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు ఈ అంశాలు తెలియవనుకోవాలా ? లేక బుకాయించారా. జాబితాను ఎవరైనా చూడవచ్చు. ) తనకు కేరళలోని ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని గవర్నర్‌ చెప్పుకున్నారు.


వైస్‌ ఛాన్సలర్లు రాజీనామాలు సమర్పించాలని తాను సూచించానే తప్ప ఉత్తరువులు ఇవ్వలేదని, తన సూచనలను నిర్ణీత గడువులో ఖాతరు చేయనందున సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశానని గవర్నర్‌ చెప్పారు. తన మార్గదర్శకాలను కోర్టు పక్కన పెట్టిందని చెప్పటం తప్పని గవర్నర్‌ అన్నారు. కేసు విచారణ రోజున విసిలకు పదకొండు గంటల వరకు గడువు ఇచ్చానని ఎలాంటి స్పందన లేకపోవటంతో 11.30 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే రోజు కోర్టు సాయంత్రం నాలుగు గంటలకు విచారించిందని అప్పటికే నోటీసులు జారీ చేశానని అన్నారు. సమాధానం చెప్పేందుకు వారికి నవంబరు మూడవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు చెప్పారు.


గవర్నర్‌ చేస్తున్న పనులన్నీ సంఘపరివార్‌ అజెండా మేరకే ఉన్నాయని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నందున నవంబరు 15న రాజభవన్‌ ఎదుట, జిల్లా కేంద్రాలలో ఎల్‌డిఎఫ్‌ నిరసన తెలుపుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ప్రకటించారు. రాజభవన్‌ వద్ద సిఎం కూడా పాల్గొంటారని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని, విసిలను తరచూ బెదిరిస్తున్నారని అన్నారు. ఏదో విధంగా సెనెట్‌, సిండికేట్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని దూర్చేందుకు చూస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని అన్నారు. నవంబరు రెండవ తేదీన భావ సారూప్యత కలిగిన వారితో పెద్ద సభ నిర్వహిస్తామని, పదవ తేదీలోగా జిల్లాల్లో సభలు, పన్నెండవ తేదీన కాలేజీల్లో జరుగుతాయని చెప్పారు.


గవర్నర్‌ విధుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదని, అంతకు మించి ఇతర అధికారపరిధిలోకి ఒక్క అంగుళం మేర ప్రవేశం గురించి కూడా ఊహించుకోవద్దని, తలదూర్చుదామనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హితవు చెప్పారు.వ్యక్తిగత హౌదాతో పని చేసేందుకు గవర్నర్లకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. వైస్‌ ఛాన్సలర్ల రాజీనామా కోరటం లేని అధికారాన్ని చెలాయించ చూడటమే అన్నారు. కెటియు వైస్‌ ఛాన్సలర్‌ నియామకాన్ని కోర్టు కొట్టివేయటాన్ని అవకాశంగా తీసుకొని తొమ్మిది మంది విసీలను తప్పు కోమని కోరుతున్నారని, ఒక వేళ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగితే నియమించే అధికారర ఉన్న గవర్నర్‌దే దానికి దానికి ప్రాధమిక బాధ్యత అవుతుందని అన్నారు. కెటియు విసి ఉదంతంలో అకడమిక్‌ అర్హతలు లేవని సుప్రీం కోర్టు చెప్పలేదని, అనుసరించిన పద్దతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ఈ వివాదం హైకోర్టులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటీషన్‌ వేసే అవకాశం ఉందని, ఈ లోగా దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్‌ రాష్ట్రం మొత్తంలో యంత్రాంగాన్ని అస్థిరపచేందుకు చూస్తున్నారని సిఎం చెప్పారు. సుప్రీం తీర్పు ఒక్క కెటియుకే పరిమితమని అన్నారు.


వైస్‌ ఛాన్సలర్లను తొలగించేందుకు రెండు కారణాలుండాలని వాటిలో నిధుల దుర్వినియోగం, చెడునడతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వాటి మీద హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి విచారణ జరిపి నిర్దారిస్తేనే తొలగించాలి తప్ప ఛాన్సలర్లకు తొలగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గవర్నర్‌ తీరు ప్రజల తీర్పునే అవమానించేదిగా ఉంది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం, రాజ్యాంగమిచ్చిన అధికారాల మేరకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లను సకాలంలో ఆమోదించకపోవటంతో పదకొండింటికి గడువు ముగిసింది.2019లో గవర్నర్‌గా వచ్చిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదాన్ని గవర్నర్‌ ముందుకు తెస్తున్నారు. మంత్రి వర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదివేందుకు తిరస్కరించి తన స్వంత ప్రసంగం చేశారు. తాను కోరిన అధికారిని విధుల నుంచి మార్చకపోతే గవర్నర్‌ ప్రసంగ ప్రతిపై సంతకాలు చేసేది లేని భీష్మించారు. మంత్రుల నియామకం, తొలగింపులో గవర్నర్లకు విచక్షణ అధికారాలు లేవు. గవర్నర్‌ ఖాన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రారంభించి, సెనెట్‌, సిండికేట్‌ మెంబర్స్‌, చివరికి విసీలను కూడా రచ్చ చేస్తున్నారు. పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంఘపరివార్‌ శక్తులు అడుగుపెట్టిన జెఎన్‌యు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిందేమిటో తెలిసిందే, కేరళ సంస్థలను కూడా అలాంటి వారితో నింపేందుకు చూస్తున్నారని ఎల్‌డిఎఫ్‌ విమర్శిస్తోంది.


గవర్నర్‌ తీరుతెన్నులను కాంగ్రెస్‌ కూడా విమర్శించింది. ప్రశ్నించటానికి వీల్లేని దేవుడేమీ కాదు అంటూ ప్రతిపక్ష నేత విడి సతీషన్‌ చెప్పారు. మంత్రిని తొలగించాలనే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రి తొలగింపు కోరుతూ గవర్నర్‌ రాసిన లేఖకు పూచికపుల్లకున్న విలువ కూడా లేదని మాజీ మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ అన్నారు. ఈ వివాదం చివరకు ఏమౌతుంది, ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

12 Thursday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala LDF, Thrikkakara by-election, UDF Kerala


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మైనారిటీ స్కాలర్‌ షిప్‌ల సమస్య : కేరళ ప్రభుత్వ సూత్రబద్దవైఖరి !

19 Monday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP-Kerala, Kerala LDF, Kerala Minority Scholarship issue, Muslim League, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

25 Friday Jun 2021

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, COVID- 19 pandemic, excess corona death trends, Kerala Corona Deaths, Kerala LDF


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళలో బిజెపి ఓట్లు పెరిగాయా ? తరిగాయా ? ఫలితాల తీరు తెన్నులేమిటి ?

04 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala BJP vote Share, Kerala LDF, Kerala Mandate


ఎం కోటేశ్వరరావు


కిందపడ్డా విజయం మాదే అని ప్రచారం చేసుకోవటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అనేందుకు మరో ఉదాహరణ కేరళ ఎన్నికల ఫలితాలే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 10.6శాతం ఓట్లు, 2021లో 11.3శాతం తెచ్చుకుంది. అంటే గతం కంటే అదనంగా ఓట్లు తెచ్చుకున్నట్లే కదా అని బిజెపి చెబుతోంది. దీనిలో నిజము – వక్రీకరణ ఉంది. కేరళ అగ్రశ్రేణి మీడియా సంస్ధ మళయాల మనోరమ నివేదించినదాని ప్రకారం 2016 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఓట్లు 14.96శాతం, 2019 లోక్‌సభ ఎన్నికలలో వచ్చినవి 15.53, 2021లో వచ్చినవి 12.47 శాతం, అంటే రెండు సంవత్సరాలలో దాని ఓట్లు 3.06శాతం తగ్గాయి. మరి బిజెపి ఓట్లు పెరిగాయనటంలో నిజం ఏమిటి ? 2016 ఎన్నికలలో అది 140కి గాను 98 చోట్ల పోటీ చేసి 10.6శాతం తెచ్చుకుంది, తాజా ఎన్నికలలో 113 చోట్ల పోటీ చేసి తెచ్చుకున్నది 11.3శాతం. అది ఎక్కువ సీట్లలో పోటీ చేసింది, దాని మిత్రపక్షాలు తక్కువగా పోటీ చేశాయి. రెండు చోట్ల నామినేషన్‌ పత్రాలు సరిగా వేయటం చేతగాక పోటీలో లేదు తప్ప 138 చోట్ల ఎన్‌డిఏ పక్షాలు పోటీ చేశాయి. వాటన్నింటికీ కలిపి గత ఎన్నికల కంటే 2.49 శాతం తగ్గిపోయాయి. బిజెపి పోటీ చేసిన స్ధానాల్లో గత ఎన్నికల కంటే ఐదు చోట్ల అదనంగా ఓట్లు తెచ్చుకుంది. ఈ అంకెలను బట్టి బిజెపి చెబుతున్నదానిలో నిజం ఏమిటో వక్రీకరణ ఏమిటో అంతిమంగా ఏం జరిగిందో పాఠకులే అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు పర్యటించిన చోట్ల కూడా కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగి బిజెపికి ఓట్లు తగ్గాయని, దీని మీద ఆ పార్టీ విచారణ కమిటీని వేస్తే మంచిదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చమత్కరించారు.

బిజెపి విషయానికి వస్తే నరేంద్రమోడీ పలుకుబడి-శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశ సమస్యల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయని చెప్పవచ్చు. 2014లో కేంద్రంలో బిజెపి విజయం తరువాత 2015లో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీకి 13.3శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14.96 శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 15.64 శాతం ఓట్లు రావటాన్ని చూపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే 2020 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దాని బలం 14.5శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలలో 12.47కు పడిపోయింది. అధికార యావలో ఈ సారి క్రైస్తవుల ఓట్ల కోసం బిషప్పుల బంగ్లాల చుట్టూ బిజెపి నేతలు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2016లో ఆ పార్టీ ఏడు నియోజకవర్గాలలో రెండవ స్ధానంలో వచ్చింది. ఈ సారి మరొక స్ధానంతో, నీమమ్‌తో తొమ్మిదికిి చేరాయి. అంతకు మించి పెరగలేదు. ఆ ఏడు చోట్లా ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా ఆశలు పెట్టుకుంది. వాటిలో నాలుగు చోట్ల గతం కంటే స్వల్పంగా ఓట్లు పెంచుకోగా నీమమ్‌తో సహా నాలుగు చోట్ల రెండవ స్ధానాన్ని కాపాడుకున్నప్పటికీ బలం కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 15శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు 54, ఇరవైశాతం తెచ్చుకున్నవి మరో 24 ఉన్నాయి. వాటిని చూసి ఈ సారి తమదే అధికారం అని ఆ పార్టీ పేరాశలు పెంచుకుంది.ఆ నియోజకవర్గాలు ఇప్పుడు 34-16కు తగ్గిపోయాయి. ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ఓట్లను రాబట్టేందుకు భారత ధర్మ జనసేన పేరుతో ఉన్న పార్టీని బిజెపి కలుపుకుంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించినా ఈసారి ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎన్‌డిఏ కూటమి ఓట్ల శాతం మొత్తంగా తగ్గింది. బిజెపి రాష్ట్రనేతలు పోటీ చేసిన చోట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట స్వల్పంగా ఓట్లశాతం పెరిగింది, శబరిమల ఆలయం ఉన్న నియోజకవర్గంలో బాగా తగ్గాయి, మిగతా అగ్రనేతలు పోటీ చేసిన చోట్ల కూడా ఓట్లశాతాలు తగ్గాయి. మెట్రోమాన్‌ శ్రీధరన్‌, సినీ హీరో సురేష్‌ గోపి పోటీ చేసిన చోట ఓట్లశాతాలు పెరిగాయి. గిరిజన నాయకురాలిగా పేరున్న సికె జాను పోటీ చేసిన నియోజకవర్గంలో గతంలో 16.35 శాతం ఓట్లు తెచ్చుకోగా ఈసారి 9.08 శాతం మాత్రమే వచ్చాయి. నరేంద్రమోడీ పలుకుబడి పని చేయక, అయ్యప్ప స్వామి వివాదం ఓట్లు రాల్చక బిజెపి పరిస్దితి అగమ్య గోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నోట మాటరాని బిజెపి నాయకత్వం – ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసిందన్న బిడిజెఎస్‌ !


ముప్పై ఐదు స్ధానాలు వస్తాయని, వాటితోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికలలో తలెత్తిన పరిస్ధితిని కార్యకర్తలకు వివరించలేని స్ధితిలో ఉన్నారు. ఉన్న ఒక్క స్ధానం పోయి ఖాతా రద్దయింది. దానికి తోడు కూటమి ఓట్లశాతం తగ్గటం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు.గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి మద్దతు ఇచ్చిన వెనుకబడిన తరగతుల ఓట్లు సిపిఎంకు పడ్డాయని భావిస్తున్నారు. బిజెపి తమను మోసం చేసిందని బిజెపితో కలసి 21 సీట్లలో పోటీ చేసిన బిడిజెఎస్‌ పార్టీ ఫలితాల తరువాత గగ్గోలు పెడుతోంది. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోయామని అలాంటి పార్టీతో ఇలా అయితే కలసి పనిచేయలేమని ఆ పార్టీ నేతలు వాపోతున్నారని వార్తలు. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహం కేరళలో పని చేస్తుందనుకోవటం తెలివితక్కువ తనమని బిజెపి సీనియర్‌ నేత సికె పద్మనాభన్‌ విమర్శించారు. గతంలో ఒకే పార్టీకి వరుసగా రెండవ సారి అధికారమిచ్చిన ఉదంతం లేనప్పటికీ విజయన్‌ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు, దాన్ని మనం అంగీకరించాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. పొరపాట్లను సరిచేయకపోతే పార్టీ పెరిగే అవకాశం లేదన్నారు. విజయోత్సవ సభల్లో సిపిఎం దాని మిత్ర పక్షాలు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) మీద విమర్శలు చేస్తున్నాయని దాన్ని తాము సహించేది లేదని కేంద్ర మంత్రి, బిజెపి నేత వి మురళీధరన్‌ చెప్పారు. ఇతరుల మాదిరే ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమారన్‌కూ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నారు. ఏప్రిల్‌ ఆరున ఉదయమే ఓటు వేసేందుకు వచ్చిన సురేంద్రన్‌ అంతకు ముందు చెప్పిన తటస్ధ వైఖరికి విరుద్దంగా ప్రభుత్వ మార్పుకోసం ఓటు వేయాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక ప్రకటన చేశారు.


ఎల్‌డిఎఫ్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?


కేరళలో వామపక్షాలు గతంలో ఎన్నడూ సాధించని రీతిలో 97 స్దానాలు తెచ్చుకొని గత యుడిఎఫ్‌ రికార్డును సమం చేశాయి, ఘనవిజయం సాధించాయి, రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు వరుసగా రెండవ సారి అధికారపక్షానికి పట్టం గట్టి చరిత్రను తిరగరాశారు. సంతోషించాల్సిందే. కానీ మరోవైపు పరిస్ధితి ఏమిటి ? కేరళలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చిన ఓట్లు 45.43 శాతం, దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వేసిన ఓటర్లు యుడిఎఫ్‌కు వచ్చిన 39.47, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు వచ్చిన 12.47శాతం కలుపు కుంటే 51.94 శాతం ఉన్నారు. ఇలా చెప్పటం అలాంటి కలయిక వెంటనే ఏర్పడుతుందని కాదు, ఒకవేళ అదే జరిగినా ఆ పార్టీల వెనుక ఉన్న సామాన్య ఓటర్లు అలాగే స్దిరపడిపోతారనీ కాదు. ఆ పార్టీల వెనుక ఉన్నవారందరూ కమ్యూనిస్టు లేదా ప్రజావ్యతిరేకులు కారు. వీరిలో గణనీయమైన భాగాన్ని ఎల్‌డిఎఫ్‌లోకి ఆకర్షించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. వివిధ తరగతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎల్‌డిఎఫ్‌ వెలుపల ఉన్న ప్రజాతంత్రశక్తులను ఎలా కూడగట్టాలో ఆ కూటమి నాయకత్వం ఆలోచించాలి. మనోరమ విశ్లేషణ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు 2.67, లోక్‌సభ కంటే 10.73శాతం ఈసారి అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 0.66శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని వికీపీడియా విశ్లేషణ పేర్కొంటే 0.78 అని, పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 7.87 తగ్గినట్లు మనోరమ విశ్లేషణ తెలిపింది. (స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ధోరణిని గమనించాలి).

కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్న బిజెపి !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్లతో చెప్పిన అంశాల ప్రకారం 140కి గాను 90 చోట్ల కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగిందన్నారు. కొన్ని చోట్ల దీన్ని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారని అన్నారు. ఈ వ్యాపారం అగ్రనాయకుల మధ్యనే జరిగిందని విమర్శించారు. విజయన్‌ చెప్పిన కొన్ని నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌ బతరేలో బిజెపికి 12,458 ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్‌ అభ్యర్ధి 11,822 మెజారిటీతో నెగ్గారు.పెరుంబవూరులో యుడిఎఫ్‌ 2,889 తేడాతో నెగ్గగా బిజెపికి 4,596 తగ్గాయి, ఓడిపోయిన సిపిఎం నాయకురాలు, ఏకైక మంత్రి మెర్సికుట్టి అమ్మ 4,452 ఓట్ల తేడాతో ఓడిపోగా అక్కడ బిజెపి ఓట్లు 14,160 తగ్గాయి. త్రిపురినితురలో సిపిఎం ఎంఎల్‌ఏ మీద గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మెజారిటీ 992 కాగా అక్కడ బిజెపికి 6,087 తగ్గాయి. చలక్కుడిలో కాంగ్రెస్‌ 1,057 ఓట్లతో గెలవగా బిజెపికి అక్కడ కూడా 6,087 తగ్గాయి. తిరువనంతపురంలోని కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 11,562 మెజారిటీతో నెగ్గగా బిజెపికి 12,323 తగ్గాయి. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు జోస్‌కె మణిని ఓడించేందుకు యుడిఎఫ్‌-బిజెపి కుమ్మక్కయ్యాయి. గెలిచిన మణి సికప్పన్‌కు 15,378 మెజారిటీ రాగా బిజెపికి 13,952 తగ్గాయి. కడుత్తురత్తిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి 4,251 ఓట్ల తేడాతో ఓడిపోగా బిజెపికి 5,866 తగ్గాయి. ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో తమ బలం పెరుగుతోందని చెప్పిన బిజెపి ఈ తగ్గుదలను ఎలా సమర్ధించుకుంటుందో చెప్పాలని విజయన్‌ ప్రశ్నించారు. నీమమ్‌ నియోజకవర్గంలో ఈ సారి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఓట్లశాతం పెరగటాన్ని గతంలో ఆమేరకు బిజెపికి ఓట్లు బదిలీ అయి అక్కడ బిజెపి గెలిచిందని, ఈ సారి కాంగ్రెస్‌ పోటీలో ఉండటంతో బిజెపి ఖాతా మూతపడిందన్నారు. రెండు రెళ్లు నాలుగు అవుతాయని కాంగ్రెస్‌-బిజెపి భావించాయని అయితే ఓటర్లు భిన్నంగా ఆలోచించి ఎల్‌డిఎఫ్‌కు ఘనవిజయం చేకూర్చారన్నారు.


కాంగ్రెస్‌ ఎదురుదాడి – బిజెపి ఓటమి బాధ్యత తనదే అన్న సురేంద్రన్‌ !


ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరలేపారు. సిపిఎం-బిజెపి 69 నియోజకవర్గాలలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బిజెపి చెబుతున్న కాంగ్రెస్‌ ముక్తభారత్‌లో భాగంగానే రెండు పార్టీలు కుమ్మక్కై తమను దెబ్బతీశాయన్నారు. బిజెపికి తగ్గిన ఓట్లన్నీ సిపిఎంకు పడ్డాయన్నారు. మరోవైపు బిజెపి ఓటమికి ప్రాధమిక బాధ్యత తనదే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ ప్రకటించారు. ఓటమి కారణాలను పార్టీకి వివరించానని పార్టీ ఏ చర్య తీసుకున్నా తాను సిద్దమే అని విలేకర్లతో చెప్పారు. కాంగ్రెస్‌ -సిపిఎం కుమ్మక్కయినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్ల సమీకరణ జరిగిందని, ముస్లింలీగ్‌ లేని చోట్ల ఎస్‌డిపిఐ పార్టీతో సహా అనేక బృందాల ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయన్నారు.మతశక్తులైన ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ ఓట్లను సిపిఎం పొందిందని చెప్పుకున్నారు. కేరళ విద్యుత్‌ శాఖ మంత్రి మణిపై ఓడిపోయిన యుడిఎఫ్‌ అభ్యర్ది అగస్తీ ముందుగా ప్రకటించినట్లుగా ఓడిపోయినందుకు గుండు గీయించుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ దానిపై మనం మాట నిలుపుకోవాలని శీర్షికగా పెట్టారు.


నీమమ్‌లో జరిగిందేమిటి ?


కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన బిజెపి ఉన్న ఒక్క సీటు నీమమ్‌ను కోల్పోయి ఖాతాను నిలబెట్టుకోలేకపోయింది. యుడిఎఫ్‌లోని ఒక చిన్న పార్టీ అభ్యర్ధిని నిలిపిన కాంగ్రెస్‌ నేతలు బిజెపితో కుమ్మక్కై తమ ఓట్లను బదలాయించి సీనియర్‌ బిజెపి నేత ఓ రాజగోపాల్‌ను గెలిపించారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయటంతో అలాంటి తెరచాటు బాగోతం లేదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ అక్కడ తన అభ్యర్ధినే నిలిపింది. అనేక మంది సీనియర్‌ నేతలను అక్కడ నిలిపేందుకు ప్రయత్నించి విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నిలపాలని ఆయన మీద వత్తిడి తెచ్చారు. అయితే చాందీ పుతుపల్లిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బెదిరింపులకు దిగారు. నీమమ్‌లో గతంలో మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ ప్రాతినిధ్యం వహించి ఉన్నందున ఆ పేరుతో ఆయన కుమారుడు, ఎంపీ అయిన కె మురళీధరన్‌ను నిలిపారు.
గతంలో బిజెపి సీనియర్‌ నేత రాజగోపాల్‌కు అక్కడ 67,813 రాగా ఈ సారి కుమనం రాజశేఖరన్‌కు 51,888 వచ్చాయి. యుడిఎఫ్‌కు గతంలో 13,860 రాగా ఈ సారి 36,524 వచ్చాయి. సిపిఎం అభ్యర్ధి, తిరువనంతపురం మాజీ మేయర్‌ అయిన వి శివన్‌కుట్టికి గత ఎన్నికల్లో 55,837 రాగా ఈ సారి 59,142 వచ్చాయి. గతంలో కుమ్మక్కులో భాగంగా బిజెపికి పడిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.


వెలుగు దివ్వెలతో ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు : ఎల్‌డిఎఫ్‌


కరోనా దృష్యా ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ కోరారు. ఏడవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మద్దతుదారులందరూ దివ్వెలను వెలిగించి ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించినట్లు విజయరాఘవన్‌ చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కె కె శైలజ టీచర్‌ పదిహేనవ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని అధిష్టించనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే నూతన సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుతో పాటు కేరళ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మరో రికార్డు సృష్టిస్తారు. గతంలో ముగ్గురు మహిళలు ఉపసభాపతులుగా పని చేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

04 Sunday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala political scene


ఎం కోటేశ్వరరావు


” ప్రియమైన భక్తులారా నేను ఎన్నికలలో పోటీ చేయటం లేదు. దయచేసి నా పేరుతో ఓట్లు అడిగే వారు దొంగ భక్తులని తెలుసుకోండి. వారి గడ్డాలు, జులపాలు చూసి మోసపోకండి. మీ అయ్యప్ప, స్వామి శరణం ” అంటూ అయ్యప్ప బొమ్మతో పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు కేరళలో సంచలనం అయింది. స్వామి సందీపానందగిరి తన ఖాతాలో అయ్యప్ప స్వామి భక్తులతో మాట్లాడినట్లు పెట్టిన పోస్టు ద్వారా బిజెపి, గడ్డం పెంచుతున్న నరేంద్రమోడీని ఉతికి ఆరేసినట్లయింది. కేరళ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో ప్రసంగాలను ప్రారంభించి సుప్రీం కోర్టులో ఉన్న వివాదాన్ని పరోక్షంగా ముందుకు తెచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెలువడ్డాయి. కేరళకు చేసిన అన్యాయానికి ప్రాయచిత్తంగా నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో క్షమించాలని వేడుకొని ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురక అంటించారు. అయ్యప్ప భక్తుల మీద పోలీసులను ప్రయోగించిన దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్ర మంత్రి చేసిన పాపం ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసినా పోదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, దాన్ని ప్రశ్నించిన వారి కాళ్లు ఇరగ్గొడుతున్నారని కన్నూరులో జరిగిన ప్రచారంలో ఆమె ఆరోపించారు. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని పార్టీలు ప్రధానంగా రోడ్డు షోలు నిర్వహించాయి. ప్రచార గడువు ముగియటంతో మైకులు, నాయకుల నోళ్లు మూతపడ్డాయి.


అదానీ విద్యుత్‌ కొనుగోలు -రమేష్‌ చెన్నితల అబద్దాలు !


అదానీతో ఒప్పందం చేసుకొని అత్యధిక రేట్లకు ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ సౌర విద్యుత్‌ కొనుగోలు చేసిందన్న ఆరోపణ చేసిన కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల తన మాటలను తానే మింగాల్సి వచ్చింది. మార్కెట్లో యూనిట్‌ రెండు రూపాయలకు విద్యుత్‌ లభిస్తుండగా పాతిక సంవత్సరాల పాటు అమలులో ఉండే ఒప్పందం ద్వారా యూనిట్‌కు రు.2.83 చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని వెయ్యి కోట్ల లబ్ది చేకూర్చే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని, అదానీ ప్రత్యేక విమానంలో కన్నూరు విమానాశ్రయానికి వస్తే ఆయనతో కలసి ముఖ్యమంత్రి, ఇతరులు మంతనాలు జరిపారని చెన్నితల తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని పట్టుకొని ఇతర కాంగ్రెస్‌ నేతలు పాడిందే పాడారు. అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయి. కేరళ ప్రభుత్వం సౌరవిద్యుత్‌ను అసలు కొనుగోలు చేయలేదు. ఏప్రిల్‌, మే మాసాల్లో అదనపు విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ వేలం కేంద్రం ద్వారా రెండు వందల మెగావాట్ల సాంప్రదాయ విద్యుత్‌ కోసం బహిరంగ టెండర్లు పిలిచింది.దానిలో వంద మెగావాట్లు రోజంతా, మరో వంద మెగావాట్లు మధ్యాహ్నం రెండు నుంచి అర్ధరాత్రి వరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మొదటి వంద మెగావాట్లకు ఆరు కంపెనీలు టెండర్లు వేశాయి.వాటిలో జిఎంఆర్‌ కంపెనీ యూనిట్‌ రు.3.04కు సరఫరా చేస్తామని వేసిన ధర అతితక్కువగా ఉంది. అయితే ఆ కంపెనీ టెండరు ఖరారు అయిన తరువాత తాము 50మెగావాట్లకు మించి సరఫరా చేయలేమని చెప్పింది. అయితే అదే ధరకు తాము మిగిలిన 50మెగావాట్లను సరఫరా చేస్తామని అదానీ గ్రూప్‌ చెప్పగా విద్యుత్‌ బోర్డు ఆమేరకు దానికి అర్డరు ఇచ్చింది. రెండవ వంద మెగావాట్లకోసం కూడా ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. దానిలో కూడా జిఎంఆర్‌ కంపెనీ రూ.3.41తో అతి తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిలో కూడా తాము 50మెగావాట్లే సరఫరా చేస్తామని చెప్పటంతో మిగిలిన 50 మెగావాట్లను పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఇది వాస్తవం అని కావాలంటే ఫిబ్రవరి 15నాటి విద్యుత్‌ బోర్డు సమావేశ వివరాలు ఎవరైనా చూడవచ్చని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

డబ్బిచ్చి సర్వేలు చేయించుకున్న ఎల్‌డిఎఫ్‌ – రాహుల్‌ గాంధీ ఉక్రోషం ! ఇరకాటంలో కాంగ్రెస్‌ !!

మరోసారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రానుందని చెప్పిన సర్వేలన్నీ డబ్బిచ్చి రాయించుకున్నవి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. బిజెపిని సిపిఎం ఎన్నడూ వ్యతిరేకించదని అందుకే ఆ పార్టీ దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలని చెప్పింది గానీ సిపిఎం నుంచి విముక్తి చేయాలని అనలేదన్నారు. కేరళలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను ఆర్‌ఎస్‌ఎస్‌ కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా వ్యవహరిస్తున్నాయని, కేరళ దొంగబంగారం కేసులో వాస్తవాలు బయటకు రావన్నారు. కేరళలో గట్టిగా జోక్యం చేసుకోవటం లేదని విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీ ఇతర రాష్ట్రాలో జోక్యం చేసుకుంటే అదే సంస్ధలను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి విజయన్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తమ వైఖరి అన్ని చోట్లా ఒకే విధంగా ఉందన్నారు.
కాసరగోడ్‌ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గంలో యుడిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న ముస్లింలీగ్‌ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ చేసిన ప్రకటన కాంగ్రెస్‌ కూటమిని ఇరుకున పెట్టింది. ఆ మద్దతు తీసుకుంటున్నదీ, తిరస్కరిస్తున్నదీ స్పష్టం చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మంజేశ్వరంలో పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఓటమికి తాము ముస్లింలీగుకు మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ ప్రకటించింది. దీని గురించి యుడిఎఫ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమకు మంజేశ్వరంలో 7,800 ఓట్లు వచ్చాయని, వాటిని ముస్లింలీగుకు వేస్తే బిజెపి ఓడిపోతుందని తమ సర్వేలో తేలిందని ఎస్‌డిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ ఫైజీ చెప్పారు. మద్దతు గురించి తమకు తెలియదని ముస్లింలీగు నేత ఒకరు చెప్పారు.
వైనాడ్‌ జిల్లా మనంతవాడి నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ పర్యటన సమయంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకపోవటం ఒకచర్చగా మారింది. కాంగ్రెస్‌-బిజెపి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం బిజెపి ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయిస్తారు. దానికి గాను ప్రచారంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకూడదని బిజెపి షరతు పెట్టిందని సిపిఎం నేతలు పేర్కొన్నారు.


విదేశీ కంపెనీకి ఓటర్ల వివరాలు అందించినందుకు రమేష్‌ చెన్నితల మీద బిజెపి కేసు !


కేరళ ఓటర్ల వివరాలను సింగపూర్‌ కంపెనీకి వెల్లడించినందుకు గాను బిజెపి నేత జార్జి కురియన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు. పౌరుల వ్యక్తిగత వివరాలను విదేశాలకు వెల్లడించటం తీవ్రమైన నేరమని, జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఓటర్ల మౌలిక సమాచారానికి ఎన్నికల కమిషన్‌ సంరక్షకురాలని, దాని అనుమతి లేకుండా విదేశీ సంస్ధకు సమాచారం అందించటం పౌరుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. రమేష్‌ చెన్నితల ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో 4,34,000 మంది రెండేసి ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించగా ఎన్నికల కమిషన్‌ ఆ సంఖ్యను 38వేలని పేర్కొన్నదని, 2017లో సుప్రీం కోర్టు విన్న పుట్టుస్వామి కేసు ప్రకారం రమేష్‌ చెన్నితల, కాంగ్రెస్‌ కమిటీ పౌరహక్కులను ఉల్లంఘించిందని కురియన్‌ పేర్కొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ ఫిర్యాదు చేయనప్పటికీ రమేష్‌చెన్నితల సమాచారాన్ని బహిర్గతపరిచారని విమర్శించారు. అయితే ఎన్నికల జాబితాను ఎవరైనా చూడవచ్చని తాను చేసిన దానిలో తప్పేమీ లేదని చెన్నితల సమర్ధించుకున్నారు. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేసినందున ఎన్నికల కమిషన్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


నేను ఈల వేశా చూడండి అంటున్న మెట్రోమాన్‌ !


నేను గానీ ఈల వేస్తే అని గారడీలు చేసే వ్యక్తి కబుర్లు చెప్పే మాదిరి మెట్రోమాన్‌గా సుపరిచితుడైన బిజెపి అభ్యర్ధి శ్రీధరన్‌ మాట్లాడుతున్నారు. తాను రంగంలోకి దిగిన కారణంగా బిజెపికి 30శాతం వరకు ఓట్లు వస్తాయని, కనీసం 40 సీట్లు, గరిష్టంగా 75 వచ్చినా ఆశ్చర్యం లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను బిజెపిలో చేరిన తరువాత ఎంతో మంది ప్రముఖులు తనను చూసి పార్టీలో చేరారన్నారు. బిజెపి వ్యక్తిగా కాదు మెట్రోమాన్‌గా చూసి తనకు ఓటు వేయాలన్నారు. తమకు మెజారిటీ సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ కూడా చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ మాట్లాడుతూ సర్వేలలో పేర్కొన్నదానికి భిన్నంగా తమకు జనం ఆదరణను ప్రకటించటాన్ని తాను చూశానని చెప్పారు.
దౌత్య సిబ్బంది ఉపయోగించే సంచుల్లో తెచ్చిన దొంగబంగారం కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులను ఇరికించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనపై వత్తిడి తెచ్చారని ఆ కేసులో నిందితుడైన సందీప్‌ నాయర్‌ రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తప్పుడు ప్రకటనలు చేయించిన ఇడి అధికారుల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయటమేగాక విచారణ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఆ కేసులను కొట్టివేయాలన్న ఇడి దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది.


మీ నిర్వాకం మీ అద్దాల్లోనే చూసుకోండి : విజయన్

‌
ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ ఆర్ధిక పని తీరుతో రాష్ట్రాన్ని రుణ ఊబిలో దింపిందన్న ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌, బిజెపిలు తమ ప్రభుత్వాల నిర్వాకాలను చూసి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురకలంటించారు.రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 2019-20లో కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌కు 40.3, రాజస్దాన్‌కు 33.1, బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌కు 34.బీహార్‌కు 31.9, పశ్చిమ బెంగాల్‌కు 37.1శాతం అప్పులు ఉంటే కేరళకు 30.2శాతమే అన్నారు. 2006లో యుడిఎఫ్‌ పాలన పూర్తి అయిన సమయానికి 35శాతం అప్పు ఉంటే 2011లో ఎల్‌డిఎఫ్‌ దిగిపోయే నాటికి 31.8శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అప్పులో ఊబిలో దించారో, ఎవరు తేల్చారో జనం చూస్తున్నారని అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌తో కుమ్మక్కు నిజమే : అప్రూవర్‌గా మారిన మరో బిజెపి నేత !

02 Friday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Co-le-b nexus in Kerala, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M)


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌-ముస్లింలీగుతో చేతులు కలిపింది నిజమే అంటూ మరో బిజెపి నేత సికె పద్మనాభన్‌ అప్రూవర్‌గా మారారు.2001లో కూడా అలాంటి అవగాహన ఉందన్నారు. ముస్లింలీగు నేత కున్హాలీకుట్టి, దివంగత కేరళ కాంగ్రెస్‌ నేత మణి, తాను, తమ నేతలు పిపి ముకుందన్‌, కేరళ బిజెపి పర్యవేక్షకుడు దేవ ప్రకాష్‌ గోయల్‌ కాసరగోడ్‌లో సమావేశమై సహకరించుకొనే విషయాలను చర్చించినట్లు పద్మనాభన్‌ చెప్పారు. 1991 ఎన్నికల్లో తాను కాసరగోడ్‌ లోక్‌సభ స్ధానంలో పోటీ చేయగా తమ నేత మరార్‌ మంజేశ్వరం అసెంబ్లీకి పోటీ చేశారని, మరార్‌ విజయం సాధించేట్లు చూడాలని కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ ఒక అవగాహనకు వచ్చాయని తమకు తెలిపారని, అయితే రాజీవ్‌ గాంధీ హత్యతో అంతా తారుమారైందని పద్మనాభన్‌ మాతృభూమి న్యూస్‌తో చెప్పారు. ప్రతిసారీ కాంగ్రెస్‌ తమను మోసం చేస్తున్నదని చెప్పారు.అదింకే మాత్రం కుదరదన్నారు. 2001 ఎన్నికల్లో తాను మంజేశ్వరమ్‌ బిజెపి అభ్యర్దిగా ఉన్నపుడు జరిగిన సమావేశంలో సిపిఎం వ్యతిరేక ఓట్ల గురించి చర్చించామన్నారు.1991లో మాదిరి మోసం చేస్తే కుదరదని తాను స్పష్టం చేశానన్నాను. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లకు తమ ఓట్లు కావాలని అయితే మైనారిటీలు దూరం అవుతారనే భయంతో వారు బయటకు చెప్పరని, ఇప్పుడు వారి జిమ్మిక్కులు తమ మీద పని చేయవని వారు గ్రహించి ఉంటారని పద్మనాభన్‌ చెప్పారు. మూడు పార్టీల మధ్య ఉన్న అవగాహన నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ కొద్ది రోజుల క్రితం నిర్దారించిన విషయం తెలిసిందే. తమ మధ్య కుమ్మక్కు లేదని ముస్లింలీగులో ప్రముఖుడిగా ఉన్న కున్హాలీకుట్టి చెబుతున్నారు. పద్మనాభన్‌తో సహా బిజెపి నేతలను తాను కలసినట్లు గుర్తు లేదన్నారు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు గురించి తాము బయట పెట్టిన తరువాత దాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.


క్రైస్తవుల మీద దాడులు చేసిన వారు ఏసు పేరు చెప్పి ఓట్లడుగుతున్నారు : విజయన్

‌
క్రైస్తవుల మీద దాడులు చేసిన వారే కేరళలో ఏసు క్రీస్తు పేరుతో ఓట్లడిగేందుకు వచ్చారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. కొద్ది పాటి వెండికోసం యూదులు ఏసుక్రీస్తును దెబ్బతీశారని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపధ్యంలో విజయన్‌ స్పందించారు. ఏసు క్రీస్తు, యూదులు అంటూ మాట్లాడుతున్నవారు క్రైస్తవులను ప్రయాణాలు, ప్రార్ధనలు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో గ్రాహమ్‌ స్టెయిన్స్‌, ఆయన ఇద్దరు పిల్లలను సజీవదహనం చేసి హత్య చేసిన దారుణం వెనుక ఉన్న వారికి కేంద్రంలో మంత్రి పదవులిచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తరువాత దేశంలో పాలక పార్టీల అండతో రెండు పెద్ద మారణకాండలు జరిగాయని ఒకటి 1984లో కాంగ్రెస్‌ నాయకత్వాన ఢిల్లీలో వేలాది మంది సిక్కులను చంపివేశారని, 2002లో గుజరాత్‌లో సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ముస్లింలను ఊచకోశారని, అలాంటి పార్టీల వారు కేరళ వచ్చి తమకు అహింస గురించి బోధలు చేస్తున్నారని, గత ఏడాది జరిగిన స్ధానిక సంస్ద ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బిజెపిలకు చెందిన వారు ఆరుగురు కమ్యూనిస్టులను హత్య చేశారని వారు ఇప్పుడు శాంతిదూతలుగా ఫోజు పెడుతున్నారని విజయన్‌ అన్నారు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో రోహింగ్యా మైనారిటీల మీద సైన్యం దాడులు చేసినపుడు మెజారిటీ మౌనంగా ఉందని , ఇప్పుడు మెజారిటీ పౌరుల మీదనే అదే మిలిటరీ విరుచుకుపడుతోందని, ఫాసిస్టులు ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని విజయన్‌ చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి చర్చించేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్దంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సవాల్‌ విసిరారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ ఉన్నట్లు, కాంగ్రెస్‌ పాలనలోని రాజస్దాన్‌లో పెద్ద ఎత్తున ఉందని తేలిందన్నారు. కేరళ పరిస్దితులను తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని నోట కరుచుకొని జాతీయ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు.


2,224 దొంగబంగారం కేసుల్లో అధికారులు, బిజెపి నేతలకు సంబంధాలు !


తిరువనంతపురం విమానాశ్రయంలో రాయబార కార్యాలయ సంచుల్లో దొరికిన 30 కిలోల దొంగబంగారం గురించే మీడియా తరచూ ప్రస్తావిస్తున్నది. దాన్ని ముఖ్యమంత్రికి, ఇతర ఎల్‌డిఎఫ్‌ ప్రముఖులకు అంటకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం చూస్తున్నది, దానికి కాంగ్రెస్‌ వంతపాడుతున్నది. సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కస్టమ్స్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌ఆర్‌ గోస్వామి ఇచ్చిన సమాచారం మేరకు 2015 ఏప్రిల్‌ నుంచి 2021 ఫిబ్రవరి 28వరకు కేరళలోని నాలుగు విమానాశ్రయాలలో 2,224 కేసుల్లో 374.52 కోట్ల రూపాయల విలువగల 1327కిలోల బంగారం దొరికింది.
చిత్రం ఏమంటే ఈ కేసుల్లో ఏమి చేశారు అన్న ప్రశ్నకు బంగారాన్ని తీసుకువస్తున్నవారి మీద ఆరోపణలు మోపటం తప్ప అసలు ఆ బంగారం స్వంతదారుల మీద ఎలాంటి చర్యలూ లేవు. అత్యధిక సందర్భాలలో ఈ బంగారం గుజరాత్‌లోని మార్వాడీలకు చేర్చేందుకు ఉద్దేశించిందని తేలింది. వారందరికీ బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే కేసులు నమోదు తరువాత అడుగు ముందుకు సాగటం లేదు. అసలు నేరగాండ్లలో ఒక్కరిని కూడా బయటకు లాగలేదు. యుఏయి నుంచి దౌత్యపరమైన సంచుల్లో వచ్చి పట్టుబడిన బంగారాన్ని పంపింది ఎవరు, ఎవరికోసం పంపారో కూడా గత తొమ్మిది నెలల్లో కేంద్ర సంస్దలు తేల్చలేకపోయాయి. మలప్పురం సమీపంలో కరిపూర్‌ విమానాశ్రయంలో దొరికిన దొంగబంగారానికి సంబంధించి ముగ్గురు సూపరింటెంట్లతో సహా 14 మంది కస్టమ్స్‌ అధికారులను సిబిఐ పట్టుకుంది.


కాంగ్రెస్‌ అబద్దాల యంత్రానికి చార్జింగ్‌ చేస్తున్న బిజెపి – ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన చర్చి !


కాంగ్రెస్‌లోని రమేష్‌ చెన్నితల అబద్దాల యంత్రానికి బిజెపి నేత సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయాన్నే ఒక అబద్దాన్ని చెన్నితల తన యంత్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ యంత్రానికి సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని అన్నారు.కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యుడిఎఫ్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడరని, కేరళలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫెవికాల్‌ అంటించుకొని నోళ్లు మూసుకు వస్తారని బృందా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితలకు బుర్ర సరిగా పని చేస్తున్నట్లు లేదని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుందని చెన్నితల ఆరోపణ చేయటం ఆయన స్ధితిని వెల్లడిస్తున్నదన్నారు. ఎవరి దగ్గర నుంచి ఎంతకు విద్యుత్‌ కొనుగోలు చేసిందీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది చూడవచ్చన్నారు. రాష్ట్రం కేంద్ర గ్రిడ్‌ నుంచి కొనుగోలు చేసింది తప్ప ప్రయివేటుగా చేయలేదన్నారు. యుడిఎఫ్‌ హయాంలో పది సంవత్సరాలకు కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేయాలన్నా కుదరలేదని మణి చెప్పారు. దానిలో షరతులు ప్రకారం రాష్ట్రం ఒప్పందం నుంచి వైదొలిగితే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విమానాశ్రయంలో బంగారం దొరికితే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయలేదని గతంలో రమేష్‌ చెన్నితల చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన బుర్రపని చేయటం లేదని తేలిందన్నారు.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జోక్యం చేసుకొన్న చరిత్ర ఉన్న కేరళ చర్చి అధికారులు ఈ ఎన్నికల్లో కూడా అదేపనిలో నిమగమైనట్లు కనిపిస్తోంది. త్రిసూరు నుంచి వెలువడే ” కాథలికో సభ ” అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో కాంగ్రెస్‌ ప్రస్తావన లేకుండా ఎల్‌డిఎఫ్‌, బిజెపిల మీద ధ్వజమెత్తటాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. పరోక్షంగా బిజెపి మతతత్వాన్ని విమర్శించటంతో పాటు దొడ్డిదారిన సిపిఎం కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను కూడా పునశ్చరణ కావించటం ద్వారా ఎవరికి ఓటు వేయాలో సూచించినట్లయింది.


35 చోట్ల హౌరా హౌరీ పోటీ -ఓట్ల వ్యాపారులుగా మోడీ అనుచరులు !


ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం నాడు ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నూట నలభైకి గాను 35 చోట్ల హౌరా హౌరీ పోటీ జరుగుతోందని ప్రస్తుత సరళి వెల్లడిస్తోంది. తమకు బలం ఉందని భావిస్తున్న రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-ముస్లిం లీగుతో కుమ్మక్కయిన కారణంగానే నామినేషన్‌ పత్రాలు సరిగా వేయకుండా తిరస్కరణకు గురయ్యేట్లు చూసుకుందని బిజెపి మీద విమర్శలు వచ్చాయి. అవి పోను ఐదు చోట్ల చావో రేవో అన్నట్లు బిజెపి అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. నరేంద్రమోడీ అనుచరులుగా ఉన్న వారు ఓట్ల వ్యాపారంలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో నీమమ్‌లో బిజెపి ఎలా గెలిచిందో మోడీ చెప్పాలని అన్నారు. రాజ్యసభ ఎన్నికల గురించి స్వతంత్ర నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ చెప్పారు. కేరళలో ఏప్రిల్‌ 12న జరగాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసినదే. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ మీద స్పందించిన ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది తెలుపుతామని హామీ ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చివరిక్షణంలో ప్రత్యర్ధుల ప్రచార బాంబు : పినరయి విజయన్‌ హెచ్చరిక !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala UDF, Narendra Modi, Priyanka gandhi, propaganda bomb in last minute


ఎం కోటేశ్వరరావు


సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రచార బాంబు ప్రయోగం కేరళ ఓటర్ల మీద జరగబోతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాసరగోడ్‌ ఎన్నికల సభలో హెచ్చరించారు. అదేమిటి ? ఎలా ఉండబోతున్నది అనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విజయన్ను ప్రశ్నించాలని, విజయన్‌ కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ కోరారు. కొంత మంది రాబోయే రోజుల్లో పెద్ద బాంబు పేలబోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి బాంబులనైనా ఎదుర్కొనేందుకు మన నేల సిద్దంగా ఉందని, అలాంటి ప్రచారాల ఉద్దేశ్యం ఏమిటో జనానికి తెలుసునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవాల ముందు ఎంత పెద్ద అబద్దమైనా నిలవదని, నిజాలేమిటో బయటకు వచ్చేంత వరకే అలాంటివి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో అబద్దాలను ప్రచారంలోకి తెస్తే జవాబు చెప్పేందుకు అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారని, సమాధానం చెప్పేందుకు తగిన వ్యవధి ఉండదు, అబద్దాలు మనల్నేమీ చేయకపోయినప్పటికీ , వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వాటి పట్ల ఎల్‌డిఎఫ్‌ కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్‌ కోరారు.


ప్రచార బాంబు ఏమై ఉంటుంది అన్న చర్చ అంశాల సారాంశం ఇలా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్దలు దొంగబంగారం, డాలర్ల కేసుల్లో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల మేరకు ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు. విచారణకు హాజరు కావాలని ఎన్నికలకు ముందు రోజు నోటీసులు జారీ చేయవచ్చు. వామపక్ష సంఘటన నేతల కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని కంపెనీలపై ఐటి, ఇతర దాడులు జరగవచ్చు. పెరియ ప్రాంతంలో జరిగిన జంట హత్యల కేసులో సిబిఐ సంచలనాత్మకంగా ఆరోపణలు చేయవచ్చు. ఇలా పరిపరి విధాల చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ అగ్రనేతలు, కార్యకర్తలు కుటుంబాల ఆత్మీయ సమావేశాలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమంలో ముమ్మరంగా నిమగమయ్యారు. ఏప్రిల్‌ ఆరవ తేదీ పోలింగ్‌ కనుక రెండు రోజుల ముందుగా బహిరంగ ప్రచార కార్యక్రమం ముగియనున్నది.


ముఖ్యమంత్రి చెబుతున్న బాంబు ఆ పార్టీలోనే పేల నున్నదని, కన్నూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను విజయన్‌ పక్కన పెట్టారని వారి కోసమైనా ఇడి అధికారులు విజయన్‌ను విచారించాలని, ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అన్నారు. ఇడి కనుక విజయన్ను ప్ర శ్నించకపోతే మోడీ-అమిత్‌ షా తమ ప్రతిష్టను కోల్పోతారని చెప్పారు.

నీమమ్‌లో తెరిచిన బిజెపి ఖాతా మూత !


గత ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గంలో విజయం ద్వారా బిజెపి తెరిచిన ఖాతా ఈసారి మూసివేయక తప్పదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గతం కంటే ఎల్‌డిఎఫ్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా వివాదాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులుగా తయారయ్యారన్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్ధలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్దంగా లేవని, వారు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అభివృద్ది గురించి జనానికి తెలుసునని, ఏప్రిల్‌ ఆరవ తేదీన తగిన జవాబు ఇస్తారని చెప్పారు. పినరయి విజయన్‌తో కేరళలో సిపిఎం అధికారం కుప్పకూలుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే త్రిపుర, బెంగాల్లో దాని ఖాతాను మూసివేశామని త్వరలో కేరళలో కూడా అదే జరుగుతుందన్నారు. దొంగబంగారం కేసులో అనుచితంగా వ్యవహరించిన ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కేసు నమోదు చేశామని, అప్రూవర్‌గా మారిన సందీప్‌ నాయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ పోలీసులు రాష్ట్ర హైకోర్టును కోరారు. ఇడి అధికారి రాధాకృష్ణన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను వ్యక్తిగతంగా వ్యహరించటం లేదని అందువలన తనపై నమోదు చేసిన కేసును తిరస్కరించాలని కోరారు.

దొంగ ఓట్లకు హైకోర్టు తెర – రమేష్‌ చెన్నితల నోటికి మూత !

దొంగ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చేసిన ఫిర్యాదులకు హైకోర్టు తెరవేసింది. అలాంటి ఓటర్లు ఎవరైనా వస్తే వారి ఫొటో, అఫిడవిట్‌ తీసుకొని నమోదు చేయాలని, వారి వేలు మీద వేసిన సిరా ఎండిపోయిన తరువాతే వారిని పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పోనివ్వాలని హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి ఓట్ల గురించి తీసుకోదలచిన చర్యల వివరాలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ తరుణంలో ఓటర్ల జాబితాలను సవరించటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. అలాంటి ఓటర్ల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రకటిస్తామని రమేష్‌ చెన్నితల చెప్పారు. కోర్టు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. రమేష్‌ చెన్నితల ఫిర్యాదు మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ఎన్నికల కమిషన్‌ చర్యకు హైకోర్టు అడ్డుకట్టవేసింది. విద్యార్దులు, ఇతరులకు ప్రత్యేక కోటా కింద బియ్యం పంపిణీ చేయవచ్చని, అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో కూడా రమేష్‌ చెన్నితలకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రధాని చౌకబారు ప్రచారం-క్రైస్తవ ఓటర్ల సంతుష్టీకరణ యత్నం !

ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారం సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి క్రైస్తవ ఓటర్లను సంతుష్టీకరించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. కొంత వెండి కోసం యూదులు ఏసు ప్రభువుకు ద్రోహం చేశారని అలాగే బంగారం కోసం ఎల్‌డిఎఫ్‌ జనాన్ని మోసం చేసిందని నరేంద్రమోడీ చెప్పారు. ఒక ఐదు సంవత్సరాలు యుడిఎఫ్‌, మరొక ఐదు సంవత్సరాలు ఎల్‌డిఎఫ్‌ రాష్ట్రాన్ని దోచుకొనే విధంగా పంచుకున్నారని ఇప్పుడు బిజెపి వచ్చినందున అదింకేమాత్రం సాగదని మోడీ అన్నారు. పాలక్కాడ్‌లో పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ శ్రీధరన్‌ అధికారం కావాలనుకుంటే రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో చేరి ఉండేవారన్నారు. శబరిమల సమస్య రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినవని , వాటిని కాపాడేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అరెస్టయ్యారని, ఆ సమయంలో యుడిఎఫ్‌ మౌనంగా ఉందని నరేంద్రమోడీ ఆరోపించారు. అనేకసార్లు వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నదని, దాని నాయకులనేక మంది గూండాల మాదిరి వ్యవహరించారని, బిజెపి అధికారానికి వస్తే వాటన్నింటికీ తెరపడుతుందని ప్రధాని అన్నారు.
కేరళలో తాము అధికారానికి వస్తే నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేదవారికి అందచేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నలభై ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రాజకీయాల్లోకి రాని కారణాన్ని వివరిస్తూ అందరు గృహిణుల్లాగే తాను కూడా పిల్లల సంరక్షణ, ఇల్లు, వంట కోసం ఇంటికే పరిమితం అయ్యానని అన్నారు. నేను ఎప్పుడూ వంట చేయలేదని ఇల్లు శుభ్రం చేయలేదని అనుకోవచ్చు, కానీ నేనా పని చేశానని నమ్మండి అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే అధికారంలో ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి చౌకబారు ప్రచారం – గడ్డి పెట్టిన వరదల హీరో !

కేరళలో సంభవించిన అసాధారణ వరదల సమయంలో అనేక మందిని రక్షించిన మత్స్యకారుడు జైసాల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇంటికి వచ్చిన బిజెపి అభ్యర్ది సత్తార్‌ హాజీ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నందుకు అభినందించాలనుకుంటున్నామని చెపితే అంగీకరించగా వారి పార్టీ కండువా కప్పి ఫొటో తీసుకున్నారని, తాను చేసిన దానికి గతంలో అనేక పార్టీలు, సంస్దలు తనను అభినందించాయని, దానిలో భాగంగానే ఇది అనుకున్నాను తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారానికి దాన్ని వినియోగించుకుంటారని తాను భావించలేదన్నారు. బిజెపిలో చేరేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. తాను సిపిఎం అభిమానినని, ఆ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తానని చెప్పారు. తన పడవ ద్వారా వరద బాధితులను రక్షించిన వీడియో పెద్ద సంచలనం కలిగించి జైసాల్‌కు ఎంతో పేరు తెచ్చింది. తాజా ఎన్నికల్లో తిరురంగడి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ది నియాల్‌ పులికలకమ్‌కు ధరావత్తు సొమ్ము చెల్లించి జైసాల్‌ తన అభిమానాన్ని ప్రదర్శించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాంగ్రెస్‌, ముస్లింలీగుతో కుమ్మక్కు నిజమే : బిజెపి ఎంఎల్‌ఏ రాజగోపాల్

18 Thursday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Pinarayi Vijayan, BJP, Co-le- b unholy alliance, Kerala LDF, Kerala UDF, RSS

‌
ఎం కోటేశ్వరరావు


సిపిఎంను ఓడించేందుకు తాము గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ముస్లింలీగుతో చేతులు కలిపిన మాట నిజమే అని కేరళలో ప్రధమ బిజెపి ఎంఎల్‌ఏ,91 సంవత్సరాల సీనియర్‌నేత ఓ రాజగోపాల్‌ వెల్లడించారు. గతంలో ఇదే విషయాన్ని సిపిఐ(ఎం) అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు బిజెపి నేత నోటి నుంచి ఆ విషయం వెల్లడి కావటంతో మూడు పార్టీలు ఇరకాటంలో పడ్డాయని చెప్పవచ్చు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆరోపణ గురించి స్పందించాలని ఒక టీవీ ఛానల్‌ అడిగినపుడు రాజగోపాల్‌ గతం గురించి చెప్పారు.గతంలో అనేక సందర్భాలలో కొన్ని స్ధానాలలో మూడు పార్టీలు సహకరించుకోవటం బహిరంగ అంశమే. మూడు పార్టీలు కలసి వ్యవహరించపోయినా సిపిఎం ఓటమికి గాను బిజెపికి ఓట్లు పడేందుకు ఒకరికొకరు సహకరించుకున్నారు,ఒత్తపాలెం, మంజేశ్వరం వంటి నియోజకవర్గాలు వాటిలో ఉన్నాయి. ఆ మేరకు బిజెపికి లబ్ది చేకూరిందని రాజగోపాల్‌ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసని, అలా లబ్దిపొందటం తప్పుకానేకాదని కూడా ఉద్ఘాటించారు. నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ది కె మురళీధరన్‌ బలమైన అభ్యర్ధి అని కూడా వ్యాఖ్యానించి పార్టీని, అక్కడ పోటీ చేస్తున్న కుమనం రాజశేఖర్‌ను కూడా ఇబ్బందిలోకి నెట్టారు. బిజెపి ప్రధాన శత్రువు కాదని గతంలో ముస్లిం లీగు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గుర్తు చేశారు. బిజెపికి లబ్ది చేకూర్చేవిధంగా లీగు-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయన్నారు. గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అదేవిధంగా జతకట్టారని అవవిత్ర కూటమిని ఓ రాజగోపాల్‌ నిర్దారించారని విజయన్‌ చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా తొలుత ప్రకటించింది ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే అన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా నిరసన తెలపాలని తాము కోరగా కాంగ్రెస్‌, లీగు తిరస్కరించాయని చెప్పారు. రాజగోపాల్‌ చెప్పిన అంశంపై బిజెపి, ముస్లిం లీగు, కాంగ్రెస్‌ మౌనందాల్చాయి.


ఓ రాజగోపాల్‌ చెప్పిన అంశాలతో దిక్కుతోచని బిజెపి సరికొత్త అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. బిజెపి-సిపిఎం కలసి పని చేయటం అందరికీ తెలిసిందేనని, ఇదేమీ కొత్తకాదని, తమ పార్టీనేత కెజి మరార్‌ గతంలో ఉడుమ నియోజకవర్గంలో పోటీ చేసినపుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ ప్రధాన ఏజంట్‌గా మరార్‌ తరఫున పని చేశారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ పచ్చి అవాస్తవాలను చెప్పారు. 1977లో మరార్‌ ఉడుమలో పోటీ చేశారు. అప్పటికి అసలు బిజెపి పుట్టనేలేదు. జనతా పార్టీ అభ్యర్దిగా మరార్‌ పోటీ చేశారు. ఆ సమయంలో జనతా పార్టీలో ఎవరున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా అత్యవసర పరిస్దితిని వ్యతిరేకించిన వారితో కూడిన ఆ పార్టీని సిపిఎం బలపరిచింది. అదే సమయంలో సిపిఎంను కూడా జనతా పార్టీ బలపరిచింది. 1977లో పినరయి విజయన్‌ వేరే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు.అందువలన మరార్‌కు ప్రధాన ఏజంట్‌గా ఉండే అవకాశమే లేదు. జనతా పార్టీలో అంతకు బిజెపి పూర్వరూపంగా ఉన్న జనసంఫ్‌ు తన మతతత్వ అజెండాను పక్కన పెట్టి విలీనమైన అంశం తెలిసిందే. తరువాత మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వ వివాదం తలెత్తినపుడు తాము జనతా పార్టీకంటే ఆర్‌ఎస్‌ఎస్‌కే విధేయులమని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నడూ ఎక్కడా ఏ రూపంలోనూ బిజెపిని సిపిఎం బలపరచలేదు.


నాలుగు నియోజకవర్గాలలో సిపిఎం-బిజెపి కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆధారం లేని ఆరోపణను ఆ సంస్ద నేతలే ఖండించారు. ప్రాంత కార్యవాV్‌ా గోపాలన్‌కుట్టి మాట్లాడుతూ బాలశంకర్‌ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించిన విషయం తనకు తెలియదని, దాని మీద ఎలాంటి వ్యాఖ్య చేయనని, అతని వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా కొద్దికాలమే బాలశంకర్‌ పని చేశారని, ఆ మాటకు వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు కాని వారు కూడా సంపాదకులుగా పని చేశారని అన్నారు. బాలశంకర్‌ చెబుతున్న నాలుగు నియోజకవర్గాలలో ఇప్పుడు సిపిఎం ప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అందువలన బిజెపితో కుమ్మక్కు ఆరోపణకు అర్ధం లేదని సిపిఎం నేతలు చెప్పారు.


ధర్మదోమ్‌పై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీకి ఎవరిని నిలపాలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌ ఎట్టకేలకు అభ్యర్దిని ఖరారు చేసింది. తొలుత అక్కడ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్ది దేవరాజన్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్‌ సూచింది. అయితే ప శ్చిమబెంగాల్లో సిపిఎం నాయకత్వంలోని ఉన్న ఫ్రంట్‌లో ఉన్న తాము ఇక్కడ కాంగ్రెస్‌తో ఉన్నప్పటికీ విజయన్‌ మీద పోటీ చేసేందుకు తాము సుముఖంగా లేమని ఆ పార్టీ చెప్పటంతో కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. ఎవరిని నిలపాలా అని తర్జనభర్జన పడుతున్నది. కాలేజీ రోజుల నుంచి విజయన్‌కు ప్రత్యర్ధిగా ఉన్న కన్నూరు ఎంపీ సుధాకరన్‌ను పోటీకి నిలపాలని పార్టీ అధిష్టానం సూచించింది. అయితే వత్తిడి చేయవద్దని, పూర్తిగా అంగీకారమైతేనే ఖరారు చేయాలని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీమమ్‌, ధర్మదోమ్‌లో బలమైన అభ్యర్దులను దింపటం ద్వారా తాము బిజెపి-సిపిఎంలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ.అధిష్టానం గట్టిగా కోరితే పరిశీలిస్తానని సుధాకరన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తానుకానట్లయితే తన అనుచరుడు రఘునాధ్‌ను పోటీకి నిలపాలని ప్రతిపాదిస్తున్నారని మీడియా పేర్కొన్నది. చివరికి అదే జరిగింది. తాను ధర్మదోమ్‌లో పోటీ చేస్తే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుందని, ఐదు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు వీలుండదని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అక్కడ పోటీ చేయటం కుదరదని ఎంతో ముందుగానే నిర్ణయించి ఉంటే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉండేవాడినని కూడా చెప్పారు.


తాను ఎవరి ముందు అయినా ఎలాంటి అభిప్రాయాలనైనా వ్యక్తం చేయగల ధైర్యం ఉందని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ తమ పార్టీనేతలకు సవాలు విసిరారు. అభ్యర్ధుల ఎంపికలో సుధాకరన్‌ ఆశాభంగం చెందినట్లున్నారు, ఆయనకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితి తెలియదని సిఎల్‌పి నేత రమేష్‌ చెన్నితల చేసి వ్యాఖ్యాల మీద సుధాకరన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ ఒక లెక్కలోది కాదని, ఆయన మీద పోటీ చేస్తానని తాను సీటును కోరలేదని, తనను ఎవరూ అడగనూ లేదన్నారు. ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు, పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్దమే అన్నారు. పార్టీ అభ్యర్ధుల ఎంపిక మీద తనకు సంతృప్తి లేదని, దీనికి తాను ఎవరినీ నిందించటం లేదని చెప్పారు. సుధాకరన్‌ చేసిన వ్యాఖ్యల మీద తాను స్పందించదలచ లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. సీట్ల ఎంపిక ఉమ్మడిగానే జరిగిందని, గెలుపు అవకాశాలనే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్‌సిపిలో చేరిన పిసి చాకో కన్నూరు ఎంపీ సుధాకరన్‌తో సహా అనేక మంది పార్టీ నుంచి వెలుపలికి వెళ్లే విషయాలను తనతో చర్చించారని అన్నారు. తాను ఎల్‌డిఎఫ్‌ తరఫున రాష్ట్రవ్యాపితంగా ప్రచారం చేస్తానన్నారు. తానసలు ఇటీవల చాకోతో మాట్లాడలేదని సుధాకరన్‌ వివరణ ఇచ్చారు.


మహిళలకు ఓడిపోయే సీట్లిచ్చిన యుడిఎఫ్‌ !


మహిళలకు యుడిఎఫ్‌ ప్రకటించిన పది స్ధానాలలో గతంలో ఎనిమిదింటిలో ఓడిపోయినవే ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్‌డిఎఫ్‌ కేటాయించిన 15 స్ధానాలకు గాను పది గెలిచిన స్ధానాలు ఉన్నాయి. ఐదింటిలొ ఓడిపోయిన రెండు చోట్ల ఏడువేలలోపే తేడా ఉంది. ప్రస్తుతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్దానాలో యుడిఎఫ్‌ ఈసారి వారికి మొండి చేయి చూపింది. మహిళలకు కేటాయించిన వాటిలో ఆరు చోట్ల గత ఎన్నికల్లో యుడిఎఫ్‌ పది నుంచి 43వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. స్దానిక సంస్దల ఎన్నికలలో మహిళలకు 50 శాతం స్దానాలను రిజర్వు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికలలో గెలిచిన వారిలో 54శాతం మంది మహిళలు ఉండటం విశేషం. జమాయతుల్‌ ఉలేమా మహిళల పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నది. పాతిక సంవత్సరాల తరువాత ముస్లిం లీగు పోటీ చేస్తున్న 27 స్దానాలలో ఒకదానిలో మహిళను నిలిపింది.


శబరిమలను వివాదంగా ముందుకు తెచ్చే యత్నం !


శబరిమల దేవాలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అమలు జరిపింది తప్ప మరొకటి కాదని, దాని గురించి దేవాదాయశాఖ మంత్రి ఎందుకు విచారం ప్రకటించారో తనకు తెలియదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును అమలు జరపక ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. శబరిమల సమస్య మీద ముఖ్యమంత్రి తన వైఖరి ఏమిటో వెల్లడించాలని బిజెపికి మద్దతు ఇస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో కోరింది. భక్తులకు తెలుసుకొనే హక్కుందని పేర్కొన్నది. శబరిమల సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దాని తీర్పు వెలువడిన తరువాత అందరితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి విజయన్‌ గతంలోనే ప్రకటించినప్పటికీ ఎన్నికలలో దాన్నొక సమస్యగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సుధాకరన్‌(సిపిఐ) పోటీ చేస్తున్న కజకోట్టమ్‌ నియోజకవర్గంలో బిజెపి అసంతృప్త నేత శోభా సురేంద్రన్‌ పోటీలో ఉన్నారు.
శబరిమల వివాదం ముగిసిన అంశమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్‌ చెప్పారు. ఈ వివాదాన్ని తమ మంత్రి లేవనెత్తలేదని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండటం కనీస మర్యాద అని ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్నవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిపిఐ నుంచి వెళ్లిపోయి బిజెపి అభ్యర్దులుగా మారిన వారి గురించి అడగ్గా సీటురాని వా రు అలా చేస్తున్నారని బిజెపికి అభ్యర్దులే దొరకని స్ధితి అన్నారు.


ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన కేరళ కాంగ్రెస్‌(టి) తమ పార్టీని యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్‌(జె)లో విలీనం చేసినట్లు ఆ పార్టీనేత పిసి థామస్‌ ప్రకటించారు. అయితే అతని చుట్టూ కొంత మంది వ్యక్తులు తప్ప జనం లేరని ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత జోస్‌ మణి వ్యాఖ్యానించారు.బిజెపితో సంబంధాలను ఏర్పాటు చేసేందుకే యుడిఎఫ్‌లో చేరినట్లు మణి చెప్పారు. అసలు ఆ పార్టీకి రిజిస్ట్రేషన్‌ కూడా లేదని అన్నారు.నిజమైన కేరళ కాంగ్రెస్‌ ఏదో గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనమే తేల్చారని అన్నారు. త్రిపురలో బిజెపి, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాదిరి కేరళలో ఈ ఎన్నికల్లో 70 స్ధానాలు వస్తాయని బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ జోశ్యం చెప్పారు.
కేరళ నుంచి రాజ్యసభకు ఏప్రిల్‌ 12న మూడు స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో యుడిఎఫ్‌కు రెండు, ఎల్‌డిఎఫ్‌కు ఒకటి ఉన్నాయి. ఇప్పుడున్న బలాబలా ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు రెండు, యుడిఎఫ్‌కు ఒక స్దానం దక్కనుంది. యుడిఎఫ్‌లోని ముస్లింలీగు తన స్ధానానికి తిరిగి ప్రస్తుత అభ్యర్దినే ప్రకటించింది. రెండో స్ధానంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు. ఎల్‌డిఎఫ్‌ తరఫున ప్రస్తుతం ఆలిండియా కిసాన్‌ సభలో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న విజూ కృష్ణన్‌తో పాటు సిపిఎం సానుభూతి పరుడు చెరియన్‌ ఫిలిప్పును ఎంపిక చేయవచ్చని వార్తలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపికి తీవ్ర ఆశాభంగం కలిగించిన అయ్యప్ప !

12 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Kerala elections 2021, #Pinarayi Vijayan, Ayyappa-Pandalam palace, BJP-Kerala, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: