ఎం కోటేశ్వరరావు
ఇతర ముఖ్యమంత్రులను వేటాడుతున్నట్లుగా బిజెపి కేరళ సిఎం పినరయి విజయన్ వెంట ఎందుకు పడటం లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. కాషాయ పార్టీని విమర్శించే దమ్ము సిపిఎంకు ఉందా అంటూ మాట్లాడారు.ఎల్డిఎఫ్-బిజెపి కుమ్మక్కై తమను దెబ్బతీసేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్డిఎఫ్-యుడిఎఫ్ మధ్య సంకుల సమరం సాగుతున్న కేరళలో గతంలో మాదిరి తమకు సీట్లు రావని భావిస్తున్న కాంగ్రెస్ ముందుగానే సాకులు వెతుకుతున్నట్లు ఈ ప్రచారం వెల్లడిస్తున్నది.నిజానికి సిపిఎంను దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్-బిజెపి అనేక చోట్ల కుమ్మక్కైన చరిత్ర ఆ పార్టీలకు ఉందని సిపిఎం అనేక సార్లు చెప్పింది. తమను విమర్శిస్తున్నంత తీవ్రంగా బిజెపిని వామపక్షాలు విమర్శించటం లేదని యుడిఎఫ్ ఆరోపిస్తోంది. ఇద్దరు మాజీ సిఎంల బిడ్డలు బిజెపిలో చేరి కాంగ్రెస్ను సవాలు చేస్తుంటే, అనేక మంది అటువైపు తొంగి చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేని స్థానిక కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ బిజెపిని వదలి సిపిఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నట్లు ? బిజెపి అభ్యర్ధిగా తన కుమారుడు పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారానికి వెళ్లటానికి మాజీ సిఎం ఎకె ఆంటోని ఆరోగ్యం బాగులేదని సాకు చెప్పారు. బిజెపిని గట్టిగా విమర్శిస్తే ఎవరి మీద ఏ ఇడి,ఐటి, సిబిఐని వదులుతారో అని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.మాజీ సిఎం కరుణాకరన్ కుమార్తె పద్మజ ఆ కారణంగానే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.
” ఎవరైనా బిజెపిని విమర్శిస్తే వారు సిబిఐ, ఇడి,సభ్యత్వాల రద్దు, ఆస్తుల స్వాధీనాలతో ఎదురుదాడి చేస్తారని నాకు తెలుసు.ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే కేరళ సిఎం మీద బిజెపి ఎందుకు దాడి చేయటం లేదు. ఎందుకు ఆయన సంపదలను స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు సిఎం పదవిని లాగివేయలేదు, కోర్టు కేసులు ఎందుకు పెట్టలేదు, ఇడి ద్వారా ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికే ఇద్దరు సిఎంలు జైల్లో ఉన్నతరువాత కూడా ఎందుకు అలా చేయలేదు ” అని బిజెపిని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మతి తప్పి రాజకీయంగా దిగజారి మాట్లాడటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.” ఇరవై నాలుగు గంటలూ తనను విమర్శిస్తున్న కేరళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపిని ఎందుకు విమర్శించటం లేదు, కొద్ది సమయమైనా బిజెపి, ఆర్ఎస్ఎస్, నరేంద్రమోడీని విమర్శించాలి కదా ” అని రాహుల్ ప్రశ్నించారు.రాహుల్ గాంధీ ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడారన్నది ప్రశ్న.పినరయి విజయన్ మీద తప్పుడు కేసులు పెట్టాలని మోడీకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.
కేరళ ఎన్నికలలో సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ సిఏఏ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు తిరస్కరించింది. ఈ రెండు అంశాలను ఎందుకు విస్మరిస్తున్నదని గురువారం నాడు మలప్పురం విలేకర్ల సమావేశంలో, అంతకు ముందు కూడా సిఎం పినరయి విజయన్ విమర్శించారు. సిఏఏ గురించి కాంగ్రెస్ న్యాయపత్రలో ప్రస్తావన లేదని చివరికి దీన్ని అమెరికా కూడా విమర్శించినా కాంగ్రెస్ మౌనంగా ఉందన్నారు. బిజెపిని సిపిఎం గట్టిగా విమర్శించటం లేదన్న కాంగ్రెస్ ఆరోపణ గురించి మాట్లాడుతూ ఈ అంశంలో తమకు కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంత మంది కాంగ్రెస్ వారి మీద కేసులు నమోదయ్యాయో రాహుల్ గాంధీ చెప్పగలరా అని విజయన్ సవాల్ విసిరారు. సిఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గిందని, బహుశా అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల కావచ్చని సిఎం అన్నారు.( జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలన కలిగించిన సంగతి తెలిసిందే.) కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసినవారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్ సింగ్ను స్వయంగా రాహుల్ గాంధీ గత నెలలో కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఇప్పుడు ఉధంపూర్ లోక్సభ అభ్యర్ధిగా నిలిపారని విజయన్ విమర్శించారు. సంఘపరివార్ను వ్యతిరేకించటంలో కాంగ్రెస్ గట్టి వైఖరి తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ రు.1,952 కోట్లు తీసుకొన్నదని అలాంటి పార్టీ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి లూటీ అంటూ కబుర్లు చెబుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ విమర్శించారు.వాటికి వ్యతిరేకంగా సిపిఎం కేసు వేసిన అంశాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ నిర్వహిస్తున్న ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఒక కేసు నమోదైంది.దానిలో నిజానిజాలను ఆరోపించిన వారు వెల్లడించాలి, దాన్ని కోర్టు విచారించి తీర్పు చెప్పాలి. కానీ ఈ లోగానే దీన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్,బిజెపి చూస్తున్నాయి. మీడియా కూడా విజయన్న్ను రెచ్చగొట్టేందుకు చేయని యత్నం లేదు.” ఎన్నికల సమయం గనుక సిఎంను ఇబ్బంది పెట్టటం, మౌనంగా ఉండేట్లు చూడటం నరేంద్రమోడీ ఎత్తుగడ. కానీ సిఎం సవాలుగా తీసుకున్నారు.తన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారని పినరయికి తెలుసు. కానీ పార్టీకోసం ఆయన సహించారు ” అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక రాసింది. తన కుమార్తె కంపెనీ మీద వచ్చిన ఆరోపణల గురించి త్రిసూరులో జరిపిన విలేకర్ల సమావేశంలో విజయన్ ఇచ్చిన సమాధానాలు విమర్శకుల నోటికి తాళం వేయటమే కాదు, ఆయన హుందాతనాన్ని వెల్లడిస్తున్నాయి.” ఒక కంపెనీ నుంచి సేవలు పొందినందుకు మరొక కంపెనీ ఇచ్చిన ఫీజు అంశమది. దాన్లో రహస్యమేమీ లేదు. అదంతా బాంకు ఖాతాల ద్వారానే జరిగింది.కంపెనీ దాఖలు చేసిన ఆదాయపన్ను పత్రాల్లో కూడా అది ప్రతిబింబించింది. దేశంలో కొత్త అంశమేమంటే పారదర్శకంగా జరిగిన లావాదేవీలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని నూతన సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు. దాని గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు ” అన్నారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు, చెప్పుకున్న గొప్పలను విలేకర్లు ప్రస్తావించగా వాటికి ఇచ్చిన సమాధానాలను చూద్దాం.
నరేంద్రమోడీ: డిపాజిటర్ల (కరువన్నూరు సహకార బాంకు) డబ్బు తిరిగి ఇచ్చినట్లు సిఎం అవాస్తవం చెబుతున్నారు.బాంకు నుంచి స్వాధీనం చేసుకున్న రు. 90 కోట్ల మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అని నేను ఇప్పటికే మాట్లాడాను.
విజయన్ : కరువన్నూరు డిపాజిటర్లకు రు.117 కోట్ల వరకు చెల్లించారు.డిపాజిటర్లు కోరితే ఇంకా ఇవ్వటానికి బాంకు సిద్ధంగా ఉంది.బిజెపి కోరుకుంటున్నట్లుగా బాంకు కుప్పకూలిపోలేదు.అది సాధారణ లావాదేవీలు నడుపుతున్నది.
నరేంద్రమోడీ : త్రిసూరు జిల్లా సిపిఎం కార్యదర్శికి వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయన్: స్థానిక శాఖల నుంచి జిల్లా కమిటీ కార్యాలయం వరకు జిల్లా అంతటా స్థలాలు, ఆఫీసులు ఉన్నాయి.వాటినే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆస్తులని ప్రధాని చెప్పారు. ఇలాంటి అభాండాలు సిపిఎం వంటి పార్టీని దెబ్బతీయలేవు.
నరేంద్రమోడీ : సిపిఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.
విజయన్: గత పది సంవత్సరాలలో బిజెపి నాయకత్వంలోని కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తాజా అంశానికి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణం. దీనికి అనేక కోణాలు ఉన్నాయి.ఇంత పెద్ద అవినీతి అసాధారణ రాజకీయ సంస్కృతిలో భాగం.
నరేంద్రమోడీ : పేదలకు మూడు కోట్ల ఇళ్లు మోడీ హామీ.
విజయన్ : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి చెప్పింది. ఈ హామీ ఏమైంది ? 2024 ప్రణాళికలో దీని గురించి మౌనం దాల్చారు. ఇక్కడ కేరళ పని తీరును చూడవచ్చు. ఇల్లులేని వారు ఎవరూ ఉండకూడదు అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే 4.56 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. మరో 1.52లక్షల ఇళ్ల పని పురోగతిలో ఉంది.
నరేంద్రమోడీ : సాధించిన విజయాలుగా చెప్పుకొనేందుకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. కేంద్ర పధకాలనే తన గొప్పలుగా చెప్పుకొంటోంది.
విజయన్ : గృహ నిర్మాణంలో కేంద్ర పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం.పిఎంఏవై(గ్రామీణ) పధకం కింద 33,517 ఇళ్లకు ఒక్కోదానికి రు.72,000 మంజూరు చేసింది.పిఎంఏవై(పట్టణ) పధకం కింద ఒక్కోదానికి రు.1.5లక్షల చొప్పున 83,261 ఇళ్లకు మంజూరు చేసింది. కేరళ లైఫ్ మిషన్ పధకం కింద ఇప్పటికి దాదాపు ఐదు లక్షల ఇండ్లకు గాను రు.17,490 కోట్లు ఖర్చు చేశాము. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది కేవలం రు.2,081 కోట్లు, మొత్తంలో కేవలం 11.9శాతం మాత్రమే.
కేరళ లోక్సభ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి.దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాషాయ దళాలు కేరళలో క్రైస్తవుల ఓట్ల కోసం చర్చీల చుట్టూ తిరుగుతున్నాయి.లవ్ జీహాద్ పేరుతో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు.వ్రతం చెడ్డా భంగపడ్డారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికి 48.48శాతం, 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్డిఎఫ్ కూటమికి 36.29శాతం, 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి 15.64శాతం, 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డిఎఫ్కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో కింగ్ మేకర్గా మారి తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్కసీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఈ సారి మరోసారి ఓటర్లను మభ్య పెట్టేందుకు పూనుకుంది.