షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ – ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా(ఫేక్‌), వక్రీకరణ సమాచారం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా నరేంద్రమోడీని అపహాస్యం పాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బిబిసి లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్‌ శాంతి బహుమతికి నరేంద్రమోడీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్‌ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది.రామ రామ తానసలు అలా చెప్పలేదని టోజె ఖండించాడు. అది ఫేక్‌ వార్త అని దానికి శక్తి లేదా ప్రాణ వాయువును అందించవద్దని అన్నాడు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించే ప్రబుద్దుల మాదిరి మోడీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఎవరో ఒక కొత్త రిపోర్టరు లేదా సబ్‌ ఎడిటర్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా వ్యవహరించాయి.


నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను 5 దశాబ్దాల పాటు వెల్లడించకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోడీ ప్రధాన పోటీదారు అని చెప్పాడంటే వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అసలు గతంలో పోటీ పడుతున్నారంటూ ఎవరి గురించీ అలాంటి వార్తలు రాలేదు.ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు.టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్‌ కమిటీ ఉపనేత హౌదాలో ఢిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌(ఐసిఎఫ్‌) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు.” ఒక కుహనా వార్త ట్వీట్‌ను చేశారు.దాన్ని కుహనా వార్తగా చూడాలి. ఇక్కడకు భారత రాజకీయాలు, అభివృద్ది గురించి మాట్లాడటానికి వచ్చాను.కుహనా వార్త గురించి చర్చించకూడదు లేదా దానికి శక్తి లేదా ప్రాణవాయువును అందించాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్‌లో రాసినట్లుగా నేనేమీ చెప్పలేదని విస్పష్టంగా చెబుతున్నాను.” అన్నాడు.


అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్‌ విలేకరితో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ సంక్షోభంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక సానుకూల వైఖరితో స్పందించారు.అణ్వాయుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు.వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్‌ పుతిన్‌కు చెప్పారు.ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.” అని చెప్పాడు.ఫేక్‌న్యూస్‌ను వండి వార్చింది టైమ్స్‌ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. నరేంద్రమోడీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు.దీంతో మోడీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. టైమ్స్‌నౌ ఛానల్‌తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఐసిఎఫ్‌ చైర్మన్‌ వైభవ్‌ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుడుగా చిత్రించారన్నారు.టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు.పధకం ప్రకారం చేసి ఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్‌ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్‌ హౌటల్లో ఉన్నానని, టైమ్స్‌ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోడీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్‌ ఛానల్‌ యాంకర్‌ మోడీ-బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి, ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి ” అన్నాడు తప్ప మోడీ పోటీదారనో మరొకటో చెప్పలేదు.నోబెల్‌ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా వాటిలో 212 మంది వ్యక్తులు, 93 సంస్థలవి ఉన్నాయి. అసలు నరేంద్రమోడీ నామినేషన్‌ ఉన్నదో లేదో కూడా తెలియదు.


మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారం చేసే ఫేక్‌ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్‌ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్‌ టిప్‌ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్‌ రాజకీయవేత్త అమీర్‌ లియాకత్‌ హుసేన్‌ డాన్స్‌ చేసినట్లు ఒక వీడియో వైరలైంది.నిజానికి అతను సొహాయిబ్‌ షుకూర్‌ అనే డాన్స్‌మాస్టర్‌. టైమ్స్‌ నౌ, నవభారత్‌ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్‌ కుమార్‌ దాస్‌ నీట్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరా చూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన రాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడి కాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్‌ ఛానల్‌ శ్రీ లంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం 500 వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పని చేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.


అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్‌, టీవీ9, ఇండియాటీవి,ఆసియానెట్‌, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి.నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి.నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. జెసిబి ట్రాక్టర్‌ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్‌ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జింపింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణం అరెస్టయిన మాజీ మంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారం చేశాయి.పీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడు వార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి.


అసలు గమనించాల్సిందేమంటే ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి చేసిన కృషి ఏమిటి అన్నది ప్రశ్న. తటస్థంగా ఉండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడిన వారిలో మోడీ ఒకరు తప్ప నివారణకు ఇతరుల కంటే భిన్నంగా చేసిందేమీ లేదు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో విశ్వగురువు, ప్రపంచ నేత అని ఎవరెన్ని చెప్పినా ఏ అంశంలోనూ నిర్దిష్టపాత్రను పోషించి ఒక అంశాన్ని కొలిక్కితెచ్చిన ఉదంతం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా రెండూ మనకు మిత్రదేశాలే. అలాంటి స్థితిలో అమెరికా బెదిరింపులు, వత్తిడికి లొంగి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అంటే అమెరికా వైపు నిలిచినట్లు సందేశమిచ్చాము. ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసినా మన దేశం వైపు నుంచి చేసిందేమీ లేదు. చిత్రం ఏమంటే ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే అమెరికా సానుకూలంగా స్పందించింది. ఆరు రోజుల తరువాత మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ సమస్యల పరిష్కార చర్చలకు మన దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని ముక్తసరిగా మాట్లాడారు.ఇరాన్‌-సౌదీ ఒప్పందం కుదరటానికి చైనా నిర్వహించిన పాత్ర చివరి క్షణం వరకు ప్రపంచానికి బహిరంగంగా తెలియదు. ఇలాంటి చొరవ తొమ్మిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ వైపు నుంచి ఎక్కడా లేదు. మన దేశంలోని జాతీయ టీవీలు, పత్రికలకు దీని గురించి తెలియదని అనుకోగలమా ? ప్రపంచ శాంతికి నరేంద్రమోడీ ఏమి చేశారని నోబెల్‌ బహుమతి వస్తుందని అలాంటి కుహనా వార్తలకు తావిచ్చినట్లు ?ఎవరినైనా ప్రభావితం చేయగల నరేంద్రమోడీ నోబెల్‌ కమిటీని పైరవీ చేసి బహుమతి తెచ్చుకోగల సమర్థత ఉందని జర్నలిస్టులు నిజంగా నమ్ముతున్నారా ? నోబెల్‌ కమిటీ ఉపనేత గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అంశాన్ని ప్రపంచ మీడియా మూసిపెడుతుందా ? విశ్వగురువుగా చెబుతున్న నరేంద్రమోడీకి ప్రపంచంలో ఎంత పరువు తక్కువ ? ప్రపంచ నేతలకు ఈ వార్తలు చేరకుండా ఉంటాయా ? భారత్‌ గురించి విదేశీ మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు మోడీ మద్దతుదార్లు ఊరూవాడా నానా యాగీ చేస్తున్నారు. తమ నేత పరువు తీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు ?

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్య ప్రాచ్యంలో ఉప్పు నిప్పు మాదిరి ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మార్చి నెల పదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందం కొన్ని దేశాలను కంపింప చేస్తే, అనేక మందికి నిజమా అన్న ఆశ్చర్యానికి గురి చేసిందనే వర్ణనలు వెలువడ్డాయి. ఈజిప్టులోని సూయజ్‌ కాలువ 1956 వివాదం తరువాత బ్రిటిష్‌ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడినట్లే ఈ ఒప్పందం ఆమెరికా పెత్తనానికి తెరదించేందుకు నాంది అన్నట్లుగా కొందరు వర్ణించారు. దీని కంటే ఆ ఒప్పందం చైనా రాజధాని బీజింగ్‌లో కుదరటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ఇరాన్‌-సౌదీ ప్రత్యక్ష పోరుకు తలపడనప్పటికీ అనేక చోట్ల ఏదో ఒక పక్షానికి మద్దతు ఇస్తూ గడచిన నాలుగు దశాబ్దాలుగా పరోక్షంగా శత్రుదేశాలుగా మారాయి. గత ఏడు సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కూడా లేవు. బీజింగ్‌ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు నెలల్లోగా రాయబార కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది.ఇటీవలి కాలంలో దేశాలు ఏదో ఒక పక్షాన చేరటం లేదా తటస్థంగా ఉండటాన్ని ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం స్పష్టం చేసింది. అమెరికా, పశ్చిమ దేశాలకు తాన తందాన అనేందుకు పేద, వర్ధమాన దేశాలు సిద్దంగా లేవు అనే సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇరాన్‌-సౌదీ ఒప్పందం ఈ కూటమికి మింగుడుపడకపోయినా అమెరికా హర్షం ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం నాటి వరకు మన దేశం దీని గురించి ఎలాంటి స్పందన వెల్లడించలేదు.


రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి దారితీసిన కారణాలేమిటి ? షియా మతపెద్ద నిమిర్‌ అల్‌ నిమిర్‌తో సహా 50 మందిని సౌదీ అరేబియా 2016 జనవరి రెండున ఉరితీసింది. దీనికి నిరసనగా టెహరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం మీద ఇరానియన్లు దాడి చేశారు. ఇరాన్‌ అధిపతి అయాతుల్లా అలీ ఖమేనీ కక్ష తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. జనవరి మూడవ తేదీన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది. ఎమెన్‌లోని తమ రాయబార కార్యాలయం మీద సౌదీ వైమానిక దాడులు చేసినట్లు ఏడవ తేదీన ఇరాన్‌ ఆరోపించింది. వాస్తవం కాదని సౌదీ ఖండించింది. వార్షిక హాజ్‌ యాత్రకు వెళితే రక్షణకు హామీ లేదని, సౌదీ కుట్రకు పాల్పడవచ్చంటూ తన యాత్రీకుల మీద ఇరాన్‌ మేనెల 29న నిషేధం విధించింది.తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడికి ఇరాన్‌ కారకురాలని, దాని వలన తమ దేశంలో సగం సరఫరా నిలిచిందని సౌదీ చేసిన ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ గ్రూపు తామే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారి ఖాశిం సొలిమనీ బాగ్దాద్‌లో 2020జనవరి మూడున అమెరికా డ్రోన్‌దాడిలో మరణించారు. అతను ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్దరణకు కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత 2021 ఏప్రిల్‌ తొమ్మిదిన బాగ్దాద్‌లో సౌదీ-ఇరాన్‌ తొలి చర్చలు జరిగాయి. ఐదవ దఫా చర్చలు జరగనుండగా 41 మంది షియా ముస్లింలను సౌదీలో ఉరితీశారు. దాంతో ఎలాంటి కారణం చూపకుండా 2022 మార్చి 13న చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 21న ఐదవ దఫా చర్చలు జరిగాయి. అక్టోబరు 19న రాయబార కార్యాలయాలను రెండు దేశాలూ తెరవాలని ఇరాన్‌ అధిపతి ఖమేనీ సలహాదారు ఒక ప్రకటన చేశాడు. డిసెంబరు తొమ్మిన చైనా అధినేత షీ జింపింగ్‌ సాదీ సందర్శన జరిపి రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బిజింగ్‌ను సందర్శించి షీ జింపింగ్‌తో చర్చలు జరిపాడు. మార్చి పదవ తేదీన ఒప్పందం కుదిరింది.


ఒప్పందం కుదరటమే గొప్ప ముందడుగు. సంవత్సరాల తరబడి తెరవెనుక చైనా మంత్రాంగంతో రెండు దేశాలనూ ఒక దగ్గరకు తేవటం ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం అని చెప్పటం కంటే తరుగుతున్న అమెరికా, పశ్చిమ దేశాల పలుకుబడి అనటం సముచితంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఇరాన్‌-సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యం, చైనా విజయంగా కొందరు చూస్తున్నారు. ప్రపంచం అమెరికా చెప్పినట్లు నడిచే రోజులు గతించాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉన్న చమురు సంపదలు, భౌగోళికంగా ఉన్న ప్రాధాన్యత రీత్యా గతంలో బ్రిటన్‌, తరువాత అమెరికా ఆప్రాంతంపై పట్టుకోసం చూశాయి.దానిలో భాగంగా చిచ్చు రేపాయి.ఏదో ఒక పక్షం వహించి రెండోదాన్ని దెబ్బతీసి తన అదుపులో పెట్టుకోవటం, చివరకు నాటో తరహా కూటమిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తన పట్టులో బిగించుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. సాధారణ సంబంధాల ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇరాన్‌-సౌదీ మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర అనుమానాలు కూడా పరిష్కారం కావాల్సిఉంది. ఈ ఒప్పందానికి హామీదారుగా ఉన్న చైనా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వివాదాల్లో ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపిన దాఖలాల్లేని కారణంగానే రెండు దేశాలూ దాన్ని నమ్మి ముందుడుగువేశాయి. ఇది మిగతా వివాదాలకూ విస్తరిస్తే అమెరికాను పట్టించుకొనే వారే ఉండరు గనుక దీన్ని ముందుకు పోకుండా చూసేందుకు చేసేందుకు అది చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.1979లో అమెరికా మద్దతు ఉన్న ఇరాన్‌ షా ప్రభుత్వం పతనమైన తరువాత అమెరికా ఆ ప్రాంతంలో తలెత్తిన వివాదాల్లో ఇరాన్‌-సౌదీ ఘర్షణ పెరిగింది. ఇరాన్ను శత్రువుగా, సౌదీని మిత్రదేశంగా అమెరికా పరిగణించింది.


సయోధ్య అవసరమని రెండు దేశాలూ గుర్తించినందువల్లనే ఈ ఒప్పందానికి దారి తీసింది తప్ప చైనా వత్తిడేమీ దీనిలో లేదు.దీనిలో చైనా ప్రయోజనాలు లేవా అంటే దాని కంటే ఆ రెండు దేశాల, ప్రాంత ప్రయోజనాలు ఎక్కువ అన్నది స్పష్టం. ప్రస్తుతం ఉన్న కొన్ని వివాదాలను చూద్దాం. లెబనాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో హిజబుల్లా సంస్థకు ఇరాన్‌, ప్రత్యర్ధి పక్షాలకు సాదీ మద్దతు ఉంది. సిరియాలో దశాబ్దికాలానికి పైగా సాగుతున్న పోరులో సౌదీ మద్దతు ఉన్న జీహాదీలకు, ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఇతర మిలిటెంట్లకు వైరం ఉంది. ఎమెన్‌లో అమెరికా మద్దతుతో సౌదీ దాడులకు దిగుతున్నది. అక్కడ హౌతీ మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతు ఉంది.వారు కొన్ని సందర్భాలలో సౌదీ చమురు టాంకర్ల మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్‌లో అత్యధికులు షియా తెగ ముస్లింలు కాగా సౌదీలో సున్నీలు ఉన్నారు.ఇరాక్‌, బహరెయిన్‌లో, చివరికి సౌదీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సున్నీ-షియా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అవి క్రమంగా తగ్గుతాయి తప్ప పెరగవు అన్నది అందరూ చెబుతున్నారు. ఇంతకాలం సౌదీ-ఇరాన్‌ వివాదాలతో లాభపడిన అమెరికాకు ఈ పరిణామం సుతరామూ అంగీకారం కాదు. దానికి నిరంతరం ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉండాల్సిందే. ప్రపంచంలో అస్థిరతకు అమెరికా చూస్తుంటే సుస్థిరతకు చైనా చేయూత నందిస్తోంది. అమెరికా ఎక్కడ కాలుపెట్టినా తన ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకొనే ఉద్రిక్తతల సృష్టి తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు.


ఎందుకు సౌదీ అరేబియా అమెరికా నుంచి దూరంగా జరుగుతోంది ? పెట్రో డాలరు బదులు పెట్రో యువాన్‌కు సౌదీ మొగ్గుచూపుతున్నదన్న వార్తలు అమెరికా నేతలకు రక్తపోటును పెంచుతున్నాయి. దీనికి తోడు బ్రెజిల్‌,రష్యా,భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు, తద్వారా రష్యా, చైనాలకు దగ్గర కావాలని సౌదీ చూడటం కూడా దానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే మరింత నష్టమని కావచ్చు, మంచిదేగా అన్నట్లు తడిపొడిగా స్పందించింది. నిజానికి ఒప్పందం కుదరకుండా తెరవెనుక ఎంత చేసినా సాధ్యం కాలేదు.” దీని గురించి మాకు ఎప్పటికప్పుడు సౌదీ చెబుతూనే ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాంగానీ నేరుగా ప్రమేయం పెట్టుకోలేదు.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గటానికి చేసే యత్నాలకు మేము మద్దతు ఇస్తాం, అది మాకూ అవసరమే, మా పద్దతిలో మేమూ చేశాం ” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ అన్నాడు. ఇరాన్‌ పట్ల అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనత కారణంగానే సౌదీ తన దారులు తాను వెతుక్కొంటోందని ఒప్పంద ప్రకటన వార్త వెలువడగానే ఇజ్రాయెల్‌ స్పందించింది. అమెరికా పధకాల ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాల మీద దాడులు జరపాలన్న తమ కలనెరవేరదనే దుగ్గదానికి ఉంది. పాతిక సంవత్సరాల పాటు అమెరికా విదేశాంగశాఖలో మధ్య ప్రాచ్య విధాన సలహాదారుగా పనిచేసిన అరోన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఎన్‌బిసి టీవీతో మాట్లాడుతూ ” ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి, విశ్వసనీయత తగ్గుతున్నట్లుఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాంతీయ పొందికలు చోటు చేసుకుంటున్నాయి, అవి చైనా, రష్యాలకు సాధికారతను, వాటి స్థాయిని పెంచినట్లుగా ఉంది ” అన్నాడు.ఉక్రెయిన్‌ వివాదం పేరుతో రష్యామీద ప్రకటించిన ఆంక్షలను అనేక దేశాలు తిరస్కరించిన నేపధ్యంలో అమెరికా పలుకుబడి గురించి ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు తన విధానాలను సమీక్షించుకుంటుంది. దానికి సౌదీ అరేబియా మినహాయింపు కాదని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


మధ్య ప్రాచ్యపరిణామాల్లో అమెరికా వైఖరిని చూసిన తరువాత ఇరాన్‌-సౌదీ రెండూ పునరాలోచనలో పడటంతో పాటు, సర్దుబాట్లకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా విధించిన ఆంక్షలతో ఆ ప్రాంత దేశాల నుంచి ఇరాన్‌ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. సౌదీదీ అదే పరిస్థితి, అమెరికాను నమ్ముకొని దాని పధకంలో భాగంగా పని చేస్తే సాధించేదేమీ ఉండదని తేలింది. ఇరాన్‌తో చైనా, రష్యాల సంబంధాలు మరింతగా బలపడటంతో అమెరికాతో వైరం కారణంగా ఇరాన్‌ మరింత బలపడుతుందనేది సౌదీకి అర్దమైంది.దీనికి తోడు ఈ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా మాదిరి ఏ ఒక్క దేశంతోనూ అది ఘర్షణాత్మకవైఖరిని ప్రదర్శించటం లేదు.తన ఎత్తుగడలు, భావజాలాన్ని రుద్దటం లేదు. ఒకదానితో మరొకదానికి తంపులు పెట్టి పబ్బంగడుపుకోవటం లేదు.పరస్పర లబ్ది పొందే పెట్టుబడులు పెడుతున్నది.అందువల్లనే దానితో ప్రతి దేశమూ సంబంధాలు పెట్టుకొనేందుకు చూస్తున్నది. ఇరాన్‌-సౌదీ ఒప్పందం గురించి తొలుత ఇరాక్‌, ఒమన్‌ వంటి ప్రాంతీయ తటస్థ దేశాల్లో ఐదు దఫాలు ప్రాధమిక చర్చలు జరిగాయి. 2030నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి పది దేశాల్లో స్థానం సంపాదించాలంటే అమెరికా ఆధారిత విధానాలతో లాభం లేదని సౌదీకి అర్ధమైంది. అన్నింటి కంటే ఇరుగు పొరుగుదేశాల్లో అస్థిరత్వం, ఘర్షణల వాతావరణం ఉంటే అది ప్రారంభించిన హరిత చొరవ ముందుకు వెళ్లే అవకాశం లేదు. సౌదీతో సర్దుబాటు చేసుకుంటే ఇతర అరబ్బుదేశాలు తమ మీద దాడికి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇరాన్‌కు అర్ధమైంది. ఒంటరి తనం నుంచి అభివృద్ధి వైపు వెళ్లాలంటే మరొక దగ్గరదారి లేదు.తనను బూచిగా చూపి మధ్య ప్రాచ్య నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు మరొక మార్గం లేదు. ఒప్పందాలకు చైనా హామీదారుగా ఉన్నందున రెండు దేశాలకు పెద్ద భరోసా అన్నది స్పష్టం. చైనాకు తెరవెనుక అజండా లేదు. బిఆర్‌ఐ పేరుతో అది రూపొందించిన పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. తమ మీద వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన పోరుకు దిగిన అమెరికాను ఎదుర్కొనేందుకు అంతర్గతంగా మార్కెట్‌ను సృష్టించుకోవటంతో పాటు తన ఎగుమతులకు ఇతర మార్కెట్లను వెతుక్కోవలసిన అవసరాన్ని పశ్చిమ దేశాలు ముందుకు నెట్టాయి. ఇరాన్‌-సౌదీ ఒప్పందం మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ !

ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

క్రైస్తవ మత కుట్రదారులకు జైలు శిక్ష -నికరాగువాలో పెరుగుతున్న ప్రజా చర్చ్‌లు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని నికరాగువాలో మానవహక్కులకు భంగం వాటిల్లిందంటూ తాజాగా ఐరాస మానవహక్కుల సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.తటస్థంగా ఉండాల్సిన సంస్థలు తాము ఇచ్చిన వివరాలను, జరిగిన ఉదంతాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నికరాగువా వామపక్ష శాండినిస్టా ప్రభుత్వం ఆ నివేదికను తోసిపుచ్చింది. డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా ఉన్న ప్రభుత్వం కాథలిక్‌ బిషప్‌ రోలాండో అల్వారెజ్‌కు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన 26 సంవత్సరాల శిక్ష విధించి జైల్లో పెట్టిందంటూ అనేక క్రైస్తవ మత సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఆ ఉదంతం పట్ల విచారం, ఆందోళన ప్రకటించారని, సదరు బిషప్‌ కోసం ప్రార్ధనలు జరపాలని ఎసిఎన్‌ (ఎయిడ్‌ టు ద చర్చ్‌ ఇన్‌ నీడ్‌) సంస్థ పిలుపునిచ్చింది.మతపరమైన ఊరేగింపుల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలను విధించినట్లు ఆరోపిస్తూ అందువలన గుడ్‌ఫ్రైడే వంటి వాటిని కూడా చర్చ్‌లకే పరిమితం చేసినట్లు మత సంస్థలు పేర్కొన్నాయి.బిషప్‌ రోలాండో అల్వారెజ్‌ వంటి వారు అమెరికాతో చేతులు కలిపి 2018 ఓర్టేగా సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర చేశారు. అలాంటివారు 222 మందిని కోర్టులలో విచారించి శిక్షలు వేశారు. వారి పౌరసత్వాలను రద్దు చేశారు.వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ముందుకు రావటంతో ఒక విమానంలో వారిని పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తాను అమెరికా వెళ్లేది లేదని బిషప్‌ తిరస్కరించాడు. దాంతో అతన్ని జైల్లో పెట్టి అంగీకరించిన వారిని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విమానంలో అమెరికా పంపారు.వారిలో పదకొండు మంది మతాధికారులు కూడా ఉన్నారు.


నికరాగువాలో అసలే జరుగుతోంది ? తప్పుడు ప్రచారాలకు ఎందుకు పూనుకున్నట్లు ? ముందుగా గమనించాల్సింది, ఇది మొదటిసారి కాదు. అక్కడ తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడినపుడు, కొంత కాలం తరువాత తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ప్రచారం సాగుతూనే ఉంది. అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) సంస్థతో కలసి ఐరాస మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధులు తాజాగా ఒక నివేదిక ఇచ్చారు. ఏకపక్షంగా ప్రపంచం ముందు నికరాగువాను చెడుగా చూపేందుకు చూసింది. భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్‌ తన నాలుగవ యాత్రలో 1502లో పసిఫిక్‌ సముద్రం వైపు నుంచి నికరాగువాలో అడుగుపెట్టాడు.తరువాత 1523 నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని అక్రమించి 1821వరకు స్పెయిన్‌ వలసగా మార్చారు. 1821లో గౌతమాలా స్వాతంత్య్రం ప్రకటించుకుంది.అదే ఏడాది మెక్సికోలో భాగంగా మారింది. రెండు సంవత్సరాలకే మెక్సికో రాజరికాన్ని కూలదోసి మిగతా ప్రాంతాలతో కలసి కొత్త రిపబ్లిక్‌ను ఏర్పాటు చేశారు. దానిలో భాగమైన నికరాగువా 1838లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. అప్పటి నుంచిఅంతర్యుద్దానికి లోనైంది.1848లో కాలిఫోర్నియాలో బంగారాన్ని కనుగొన్న తరువాత తూర్పు అమెరికా నుంచి అక్కడికి కార్మికులను చేర్చేందుకు అమెరికన్లు నికరాగువా మీదుగా ప్రయాణించటం దగ్గరిదారిగా భావించి లక్షలాది మంది అటుగా వచ్చారు. నికరాగువాపై ఆధిపత్యం కోసం పోటీపడిన అక్కడి మితవాద, ఉదారవాద వర్గాలలో రెండవది అమెరికన్లను ఆహ్వానించి వారి మద్దతు తీసుకుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల పేరుతో 1856లో ఫిలిబస్టర్‌ విలియం వాకర్‌ అనేవాడు తాను నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. 1857లో వాకర్‌ను తరిమివేసి మితవాద శక్తుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1909 వరకు నికరాగువా స్వతంత్ర దేశంగా ఉంది.1893 నుంచి 1909వరకు నికరాగువా అధ్యక్షుడిగా ఉన్న జోస్‌ శాంటోస్‌ జెలయాపై అమెరికా మితవాద శక్తులతో తిరుగుబాటు చేయించింది. తమ పౌరులను రక్షించే పేరుతో 1909 నవంబరు 18 నికరాగువా తీరానికి అమెరికా తన యుద్ద నౌకలను పంపింది. దాంతో జెలయా పదవి నుంచి తప్పుకున్నాడు. తరువాత అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.దానిలో కుమ్ములాటలు తలెత్తాయి. 1912 నుంచి 1933 వరకు అమెరికా మిలిటరీ స్వాధీనంలో నికరాగువా ఉంది. కాలువ తవ్వకంతో సహా అనేక ఒప్పందాలను తనకు అనుకూలంగా చేసుకుంది.


1927 నుంచి 1933 వరకు తిరుగుబాటు మిలిటరీ అధికారి అగస్టో సీజర్‌ శాండినో గెరిల్లా పద్దతిలో మితవాద ప్రభుత్వం, అమెరికా మిలిటరీ మీద సాయుధ పోరాటం సాగించాడు. దాంతో 1933లో ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. శాండినో తిరిగి తిరుగుబాటు చేయవచ్చన్న జనరల్‌ అంటాసియా సోమోజా గార్సియా సలహామేరకు శాండినోను హతమర్చాలని పధకం వేశారు. దానిలో భాగంగా శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసే పేరుతో 1934 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి విందుకు ఆహ్వానించారు, విందు తరువాత తిరిగి వెళుతున్న శాండినోను సోమోజా హత్య చేయించాడు. తరువాత తానే గద్దెనెక్కాడు.1956లో సోమోజాను ఒక యువకవి కాల్చి చంపాడు. సోమోజా పెద్ద కుమారుడు లూయిస్‌ సోమోజాను గద్దె నెక్కించారు. 1967లో సీనియర్‌ సోమోజా చిన్న కుమారుడు ఆంటాసియో సోమోజాను గద్దెనెక్కించారు. శాండినోలు 1979 కూల్చేంతవరకు అధికారంలో ఉన్నాడు. సోమోజాపాలన మీద తిరుగుబాటు చేసిన శక్తులు ఆగస్టో సీజర్‌ శాండినో పేరుతో శాండినిస్టా విముక్తి దళాన్ని ఏర్పాటు చేశారు. దాని నేతగా డేనియల్‌ కార్టేగా 1979లో అధికారానికి వచ్చాడు. అనేక సంక్షేమ పధకాలను అమలు చేశాడు. దేశంలో అస్థిర పరిస్థితలను సృష్టించి ఓర్టేగాను దోషిగా చూపి 1990 ఎన్నికల్లో ఓడించారు.తిరిగి 2007 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఓర్టేగాను జనం ఎన్నుకుంటున్నారు.


2018లో ఓర్టేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విఫల తిరుగుబాటు కుట్ర జరిగింది.ఏప్రిల్‌ 18 నుంచి జూలై 17వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు అమెరికా తదితర దేశాలు,సంస్థలు ఇచ్చిన మద్దతు, డబ్బు, ఆయుధాలతో హింసాకాండకు పాల్పడ్డాయి. ఇరవైరెండు మంది పోలీసు అధికారులు ఆ దాడుల్లో మరణించగా 400 మందికి పైగా తుపాకి గాయాలయ్యాయి. అరవై మంది అధికార శాండినిస్టా పార్టీ కార్యకర్తలు లేదా మద్దతుదార్లను చంపివేశారు. వందలాది మంది గాయపడ్డారు. ఏప్రిల్‌ 19,20,21 తేదీల్లో అనేక చోట్ల ప్రతిపక్ష సాయుధమూకలు పోలీస్‌ స్టేషన్లు, శాండినిస్టా ఆఫీసులపై జరిపిన దాడుల్లో పెట్రోలు బాంబులు, తుపాకులను వినియోగించిన తీరు వీడియోల్లో ఉంది. వీటిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి సంబంధించి స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఐరాస కమిషన్‌కు కనిపించలేదు.శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలపై పోలీసులు దాడులకు పాల్పడినట్లు, తొలుత జరిగిన నిరసనల్లో అసలు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ పాల్గొనలేదని ఐరాస కమిషన్‌ చెప్పింది.


ఎవరెన్ని కుట్రలు చేసినా వాటన్నింటికీ ఇప్పటి వరకు ఓర్టేగా సర్కార్‌ తిప్పికొడుతున్నది. జన విశ్వాసం పొందుతున్నది.ముందే పేర్కొన్న 2018 విఫల కుట్ర తరువాత జరిగిన 2019 కరీబియన్‌ ప్రాంతీయ ఎన్నికలు,2021జాతీయ ఎన్నికలు, 2022 మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార శాండినిస్టా నేషనల్‌ ఫ్రంట్‌ భారీ మెజారిటీలతో గెలిచింది. జనాభాలో 85శాతం మంది క్రైస్తవులే, వారిలో సగానికి పైగా రోమన్‌ కాథలిక్‌లు. పదిహేనుశాతం జనాభా మతం లేని వారు. లాటిన్‌ అమెరికా అంతటా చర్చి ఎప్పుడూ నిరంకుశ శక్తులు, మితవాదులు కనుసన్నలలోనే పనిచేసింది. వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాలలో ప్రజల పక్షం వహించే మతపెద్దలు అనేక మంది మమేకమయ్యారు. అలాంటి దేశాలలో నికరాగువా ఒకటి.వారికి నియంతలను వ్యతిరేకించటం, పేదల సంక్షేమం ప్రధానం తప్ప పోరు చేస్తున్న వారు పురోగామి వాదులా,కమ్యూనిస్టులా ? మతం పట్ల వారి వైఖరి ఏమిటన్నది ప్రధానంగా కనిపించలేదు.వామపక్ష, కమ్యూనిస్టు గెరిల్లాలకు కూడా మతపెద్దలని గాక వారేవైపు ఉన్నారన్నదే గీటురాయి. అక్కడి వాస్తవ పరిస్థితుల నుంచే ఈ పరిణామం. అందుకే లాటిన్‌ అమెరికా దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు పడక కుర్చీ మార్క్సిస్టు సిద్దాంతవేత్తల చట్రంలో జరగటం లేదు. ఒక చేత్తో బైబిల్‌ మరో చేత్తో ఎర్రజెండా పట్టుకున్న వెనెజులా నేత హ్యూగో ఛావెజ్‌ను ” అమెరికా క్రీస్తు ” అని అనేక మంది జనం నమ్మారు.”నేను క్రీస్తును ప్రేమిస్తాను. నేను క్రైస్తవుడిని. పిల్లలు ఆకలితో మరణిస్తున్నపుడు, అన్యాయాన్ని చూసినపుడు నేను ఏడ్చాను ” అని ఛావెజ్‌ ఒకసారి చెప్పారు.నికరాగువాలో కూడా అదే జరుగుతోంది. అమెరికాతో చేతులు కలిపిన క్రైస్తవమతాధికారులు వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చర్చీలను ఆయుధాలు, కిరాయిమూకల కేంద్రాలుగా మార్చారు. ఆదివారం ప్రార్దనల్లో ప్రభుత్వ కూల్చివేత సుభాషితాలు వల్లించారు.చర్చ్‌కు వచ్చిన వారిలో ఎవరైనా శాండినిస్టాలు(కమ్యూనిస్టులు) ఉన్నారా అని మరీ పిలిచి నిలబడిన వారిని చర్చికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు, 2018 కుట్రలో అనేక మంది ఫాదర్లు స్వయంగా హింసాకాండలో పాల్గొనటాన్ని చూసిన అనేక మందికి చర్చ్‌లు, ఫాదర్ల మీద విశ్వాసం పోయింది. తమకు మేలు చేస్తున్న పాలకులను కూల్చివేసి నిరంకుశ, దోపిడీదార్లను బలపరుస్తున్న చర్చి ఉన్నతాధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. దాంతో క్రీస్తును ఆరాధించాలంటే చర్చ్‌లకే పోనవసరం లేదని అనేక మంది భావించారు. ఇండ్లకే పరిమితం కానివారు సామూహిక ప్రార్ధనలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలను చూశారు. అవే ప్రజా చర్చ్‌లుగా ఉనికిలోకి వచ్చాయి.


” మేం సంప్రదాయ కాథలిక్కులం కాదు. ఎందుకంటే మాకు ఇక్కడ పూజార్లు ఉండరు.ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.” అని రాజధాని మనాగువాలోని సెయింట్‌పాల్‌ ప్రాంతానికి చెందిన అపోస్తల్‌ క్రిస్టియన్‌ బేస్‌ కమ్యూనిటీకి చెందిన యామిల్‌ రియోస్‌ విలేకర్లతో చెప్పాడు. ఒక రూములో ప్రార్దనల కోసం వచ్చిన వారందరూ మడత కుర్చీల్లో కూర్చున్నారు. రూము వెలుపల ప్రార్ధనగీతాలు పాడేవారు సంగీత వాద్యాలతో సిద్దంగా ఉన్నారు. మత పెద్దల కుట్రలు వెల్లడైనకొద్దీ పేదలు, కార్మికులతో ఇలాంటి ప్రజా చర్చ్‌లు పెరుగుతున్నాయి.సంప్రదాయ చర్చ్‌లకు వెళ్లేవారు తగ్గుతున్నారు. ఇలాంటి ప్రజాచర్చ్‌లు 1970దశకంలో ప్రారంభమైన 1979లో నియంత పాలన అంతంతో మరింతగా పెరిగాయి. ఇవి క్రైస్తవం-విప్లవం మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవన్న క్రైస్తవ విముక్తి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన పూజారుల ప్రచార కేంద్రాలుగా కూడా పని చేశాయి. వారిలో ఒకరైన ఫాదర్‌ మిగుయెల్‌ డి స్కోటో ప్రస్తుతం నికరాగువా విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు.” నీవు జీసస్‌ను అనుసరించకపోతే విప్లవకారుడు కారుడివి కూడా కాలేవు ” అంటారాయన.ఇలాంటి వారు అనేక మంది ఇప్పుడు ఓర్టేగా సర్కార్‌లో పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.వారు క్రైస్తవులే గానీ శాండినిస్టాపాలనను ప్రతిఘటించే అధికార మతపెద్దల తెగకు చెందిన వారు కాదు.1990లో తాము కాథలిక్కులమని చెప్పుకున్నవారు 94శాతం ఉండగా ఇటీవల అది 50శాతానికి తగ్గి ఇప్పుడు 37శాతం ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. లాటిన్‌ అమెరికాలో ఒక చిన్న దేశమైన నికరాగువా(జనాభా 70లక్షల లోపు) ఐరాస మానవహక్కుల సంస్థను శిఖండిగా చేసుకొని అమెరికా, దాని కూటమి చేస్తున్న ప్రచారదాడికి గురవుతోంది. కరీబియన్‌-దక్షిణ పసిఫిక్‌ సముద్రాల మధ్య వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న దేశాలలో అదొకటి. అందువల్లనే ఆ ప్రాంత దేశాలను ఆక్రమించుకొనేందుకు, వీలుగాకుంటే తన తొత్తు ప్రభుత్వాలను రుద్దేందుకు అమెరికా నిరంతరం చూస్తూ ఉంటుంది.దానిలో భాగమే ఇటీవలి పరిణామాలు.

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

అమెరికా పాలకవర్గాన్ని మరోసారి భయపెడుతున్న సోషలిజం-పార్లమెంటులో తీర్మానాలతో అడ్డుకోగలరా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !

అమెరికా సియాటిల్‌ నగరంలో కులవివక్షపై నిషేధం – మహిళలందు కమ్యూనిస్టు క్షమా సావంత్‌ వేరయా !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.


సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్‌ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.


సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్‌అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.


మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్‌ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?