ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Tags

, , , , , , , ,

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

శనగ రైతుల సంక్షోభం

Tags

, ,

డా|| కొల్లా రాజమోహన్‌

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్ల బర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో వున్నారు. నల్ల బర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం – దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్‌ స్టోరేజ్‌లో వున్న శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.

పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పుధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్‌ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావాల్సినంత పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంపిణీ సరిగ్గా లేక అందరికీ అందనందున ”ప్రొటీన్‌ క్యాలరీ మాల్‌న్యూట్రిషన్‌” దాపురిస్తున్నది. ఒకపక్క గోడౌన్లలో శనగలు పుచ్చిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పుధాన్యాలు అందటంలేదు. రేషన్‌ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడు పోవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులు – తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. శనగలకు ఉత్తరాదిన డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది.
దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్‌ స్టోరేజీలలో శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కోల్డ్‌ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
భూసారం క్షీణించడం వలన, వాతావరణంలో మార్పుల వలన, దిగుబడులు తగ్గిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులతో సహా వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను పోత్సహిస్తున్నాయి. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో ఇక్కడి శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి.
ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

సుంకాల రద్దు- రైతుకు ఉరి
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత 2025 ఏప్రిల్‌ నుండి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియని పరిస్థితులలో, కొద్దిగా డబ్బులు వస్తాయనే ఆశతో నల్ల బర్లీ పొగాకును సాగు చేశారు. నల్ల బర్లీ పొగాకు 15-18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్‌ నల్ల బర్లీ పొగాకు రేట్లను రూ.12000-9000-6000గా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశాయి. ఈ సంవత్సరం అసలు నల్ల బర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు.
పత్తికి ధర లేదు. విదేశాల నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి. రెండు సంవత్సరాల నుండి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజ్‌లో స్టాక్‌ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్లు, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే…
– రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి.
– కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
– ఇదివరకు లాగా విదేశీ దిగుమతులపైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్‌ ఉంటుంది.
– విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
– వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి.
రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
– వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు, సెల్‌: 9000657799

హీరోయిన్‌ త్రిషను కించపరిచిన బిజెపి నేత క్షమాపణ : హీరో విజై మౌనముద్రకు అర్ధం ఏమిటి !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నట్లు కలలు కంటున్న సినీహీరో విజై ఒంటరిగా బరిలో దిగుతారా లేక ఏ పార్టీతో అయినా జతకడతారా ? తన ఆధిపత్యాన్ని అంగీకరించటం తప్ప సిద్దాంత రాద్దాంతాలేమీ లేవనే సందేశం పంపుతున్న తమిళ వెట్రి కజగమ్‌(టివికె) నేతను ఎవరైనా భరించగలరా ? డిఎంకె నాయకత్వంలోని కూటమిలో తాము కొనసాగాలంటే అధికారంలో కూడా భాగం పంచాలని కోరుతున్న కాంగ్రెస్‌ ఎత్తుగడ ఏమిటి ? ఇలా ఎన్నో సశేషాలుగా ఉన్న విశేషాలు అక్కడ జరుగుతున్నాయి. విలువలు, వలువలు, సంస్కారం అంటూ కబుర్లు చెప్పే బిజెపి కుదురులోని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ నోరుపారవేసుకొని అభాసుపాలయ్యారు. భారతీయ సంస్కృతికి తామే ప్రతీకలమని చెప్పుకొనే వారు ఎంత అసహ్యంగా మాట్లాడుతారో ఈ ఉదంతం వెల్లడించింది.గతంలో అనేక మంది సినీనటులు పార్టీలను పెట్టినపుడు,రాజకీయాల్లోకి వచ్చినపుడు వారి అనుభవం గురించి ఇతరులు విమర్శలు చేశారు. అయితే అనుభవం ఉన్న వారు మాత్రం వెలగబెడుతున్నదేమిటి అన్న అంశం ఉన్నప్పటికీ నటీనటులపై ఒక మేరకు విమర్శను అర్ధం చేసుకోవచ్చు గానీ చౌకబారు మాటలు తగవు.

విజైకు అనుభవం లేదంటూనే ముందుగా హీరోయిన్‌ త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని బిజెపినేత చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినప్పటికీ తీవ్ర అభ్యంతరకరం. మాజీ ప్రధాని వాజ్‌పాయి దశాబ్దాల పాటు ఒకనాడు తాను ప్రేమించిన రాజకుమారి కౌల్‌కు వేరే వ్యక్తితో వివాహమైన తరువాత తాను కూడా దంపతుల ఇంట్లో జీవించారు.ఆమెకు పుట్టిన కుమార్తె గురించి నిరూపితం కాని వార్తలు వచ్చినా ఎన్నడూ ఏ రాజకీయ నేత, పార్టీ కూడా వారి బంధం గురించి బహిరంగంగా రచ్చ చేయలేదు. త్రిషతో స్నేహం కారణంగా విజై భార్య విదేశాల్లో ఒంటరిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఏమైనప్పటికీ అది వారి వ్యక్తిగత వ్యవహారం. అనేక మంది ఇష్టపూర్వకంగా సహజీవనం చేయటం ఈ రోజుల్లో అందునా సినిమా రంగంలో సర్వసాధారణంగా జరుగుతోంది. రాజకీయ రంగంలో కూడా ప్రారంభమైంది. విజరు రాజకీయ నేతగా మారిన కారణంగానే నాగేంద్రన్‌ మాటలు సంచలనం కలిగించాయి. బహుశా బిజెపి అగ్రనాయకత్వం కూడా చివాట్లు పెట్టిన కారణంగా ఆ పెద్దమనిషి తన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేయటం తప్పే, ఎవరైనా వాటితో గాయపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను.మా పార్టీ అఖిల భారత మహిళా విభాగం అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్‌, అన్నామలై ఈ అంశం గురించి నాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆరోజు దాన్నుంచి వైదొలిగి మాట్లాడాను అని నాగేంద్రన్‌ పేర్కొన్నారు. నాగేంద్రన్‌ వ్యాఖ్యలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రస్తావన లేకుండా త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన చేయించారు. వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని, రాజకీయాల్లో తాను తటస్థంగా ఉన్నానని,రానున్న రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదని ఆమె పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అంతగా దిగజారి మాట్లాడతారని ఎన్నడూ ఊహించలేదన్నారు.తనకు సంబంధం లేని అంశాల్లో తన పేరును లాగవద్దని కోరారు. సంచలనం కలిగించిన ఈ ఉదంతం గురించి విజై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చారు. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడలేదు. ఒక వేళ ఏ పరిస్థితిలోనైనా బిజెపితో జట్టుకట్టాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఈ వైఖరి తీసుకున్నారా లేక మరింత రచ్చ అవుతుందని భావించారో తెలియదు.

అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా రానున్న రోజుల్లో బిజెపి పట్ల విజై వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తింది.కరూరులో జరిగిన తొక్కిసలాట మరణాల ఉదంతం తరువాత బిజెపి గురించి ఇంతవరకు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓడించాల్సింది డిఎంకెను గనుక దాని వరకే పరిమితం అవుదాం అని తప్పించుకున్నారు.గతేడాది కేంద్ర బడ్జెట్‌ మీద విమర్శలు చేసిన విజై ఈసారి మౌనం పాటించారు.కరూరు కేసు, తన వ్యాపారలావాదేవీలు, కేంద్ర సంస్థలను చూసి భయపడే ఈ వైఖరి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రెండు కూటములనూ వ్యతిరేకిస్తానంటూ ప్రకటించినా తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు. డిఎంకె కూటమి, అన్నాడిఎంకె-బిజెపి, టివికే, సీమన్‌ అనే మాజీ నటుడు, దర్శకుడు ఏర్పాటు చేసిన నామ్‌ తమిళ్‌ కచ్చి(ఎన్‌టికె) కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు, అయితే ఎన్‌టికే ప్రభావం పరిమితమే. తమిళనాడు రాజకీయాలు డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య కేంద్రీకృతమయ్యాయి. గతంలో పార్టీ పెడతానంటూ లీకులు వదిలిన రజనీకాంత్‌ ధైర్యం చేయలేకపోయారు.మరో ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ పార్టీ పెట్టి విఫలమయ్యారు. వారిద్దరి తరువాత ప్రేక్షకాదరణ ఉన్న విజరు పరిస్థితి చెప్పలేము. స్టార్‌ హీరోల సభలకు జనం రావటం, ఈలలు, కేకలు వేయటం వేరు, ఓట్లు పడటం మరొకటి. కెప్టెన్‌ విజయకాంత్‌ కూడా పేరున్న నటుడే అయినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

తమ పార్టీ మాత్రమే డిఎంకెను సవాలు చేయగలదని టివికె నేత విజై ప్రతి సభలోనూ చెబుతున్నారు. దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్‌ స్పందన ఏమిటని ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.” ఇంటి మీదకు కూడా ఎక్కలేని వారు స్వర్గానికి ఎగురుతామని కలలు కంటున్నారు. అతనికి ఏమాత్రం అనుభవం లేదు. ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి, తరువాత ఏదైనా జరుగుతుంది” అంటూ నవ్వారు. ఒక్క కౌన్సిలర్‌ కూడా పార్టీలో లేరు గానీ 30శాతం ఓట్లు తనకు ఉన్నాయని విజరు ఎలా చెప్పుకుంటారు. ముందు విజై తన కుటుంబంతో సంబంధాలను నిర్వహించుకోవాలి, గొప్పనేతలు చెప్పిన అంశాలను సక్రమంగా జనాలకు చెప్పాలి, ముందు వీటన్నింటి నుంచి బయటపడాలి అన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారటంతో వాటిని వెనక్కు తీసుకుంటారా అని అడగ్గా చెప్పినదానికి కట్టుబడి ఉంటాను అన్నారు. తరువాత విధిలేక క్షమాపణ చెప్పారు. టివికె సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల కుమార్‌ మాట్లాడుతూ గతంలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని,వచ్చే ఎన్నికల్లో ఇంకా దిగజారతాయని అన్నారు.కొంత మంది బిజెపి నేతలు డిఎంకె తొత్తులుగా ఉన్నారన్నారు. బిజెపి ఎంఎల్‌ఏ, మహిళా నాయకురాలు వనాతి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ నాగేంద్రన్‌ ఎంతో మృదువుగా మాట్లాడే మనిషని, అలాంటి వ్యాఖ్యలు చేయటం విచారకరమంటూ తన అసంతృప్తిని తెలియచేస్తానని చెప్పారు. డిఎంకె, కాంగ్రెస్‌ నేతలు మహిళానేతలను వేధిస్తారని ఆరోపించారు.

ఈ ఉదంతం జరగ్గానే డిఎంకె నేతలు బిజెపి అధ్యక్షుడిపై ధ్వజమెత్తారు. పార్టీ ప్రతినిధి టికెఎస్‌ ఇలాంగోవన్‌ స్పందిస్తూ మహిళలను కించపరచటంలో బిజెపి నేతల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.” వారు మనుధర్మాన్ని అనుసరిస్తారు, అది మహిళలకు ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు, సహజంగానే అతను అలా మాట్లాడతారు. అందుకే తమిళనాడు జనాలు బిజెపికి వ్యతిరేకంగా, వారు మహిళలను అవమానిస్తారు, ఆ విషయంలో వారు పేరుమోశారు, నాగేంద్రన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు బానిసగా మారారు, అందుకే అతను అలా మాట్లాడారు ” అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెల్వపెరుంతగరు కూడా విమర్శించారు. త్రిష గురించి అలా మాట్లాడటం దిగ్భ్రాంతికి గురిచేసింది.దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, అది చేయకుండా అతను వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు.రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగవు అన్నారు. తమ నేత సదుద్ధేశ్యంతో చేసిన వ్యాఖ్యలను డిఎంకె వక్రీకరించిందంటూ బిజెపి నేతలు నాగేంద్రన్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆ పార్టీ నాయకురాలు విజయధరణి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరినపుడు డిఎంకె తన గురించి చెడు వ్యాఖ్యలు చేసిందని, వారెప్పుడూ మహిళల పట్ల అలాగే మాట్లాడతారని ఆరోపించారు.తమ నేత చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. నాగేంద్రన్‌ చౌకబారు మాటలపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరోవైపు హీరో విజైను ఎలా సమర్ధించాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బందికరంగా పరిణమించింది. విజై-త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి పలు కథనాలు ఈ వివాదానికి ముందే ఉన్నాయి. అయితే బజారుకు ఎక్కలేదు గనుక సమస్య రాలేదు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలను బిజెపి నేత ఒక కుదుపుకుదిపారు. రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం !

అగ్రగామిగా జపాన్‌ – నయా సైనికవాదం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

మరోసారి అమెరికాను అగ్రగామిగా నిలపాలన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. వాషింగ్టన్‌ అడుగుజాడల్లో నడుస్తున్నది జపాన్‌.గత వారంలో జరిగిన ఎన్నికల్లో 1955 తరువాత అత్యధిక మెజారిటీ సాధించిన మితవాద ఎల్‌డిపి నేత, ప్రధాని సానే తకాయిచీ మరోసారి జపాన్ను అగ్రగామిగా చేయాలని ఇచ్చిన పిలుపు ప్రమాద ఘంటికలను మోగించింది. డైట్‌(పార్లమెంటు) ఎగువ సభలో మెజారిటీ లేనప్పటికీ అవసరమైతే వ్యతిరేకతను పక్కకు నెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.ఇప్పటికే పెద్ద మొత్తాలలో మిలిటరీ బడ్జెట్‌కు కేటాయించిన ప్రభుత్వం అవసరమైతే యుద్ధాలను నిషేధించి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత మిలిటరీ ఉండాలన్న శాంతికాముక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు చూస్తున్నది.తనను తాను జపాన్‌ మార్గరెట్‌ ధాచర్‌గా వర్ణించుకొనే తకాయిచీ చైనా, ఉత్తర కొరియాలనుంచి ముప్పు అంటూ సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అధికారానికి వచ్చిన షింజే అబే ” ధృడమైన జపాన్ను పునరుద్దరించాలని ” ప్రతిజ్ఞ పూనాడు. గత విధానాలను క్రమంగా పక్కన పెట్టటం ప్రారంభించాడు. దాని కొనసాగింపుగా ” మరోసారి జపాన్ను అగ్రగామి ” చేయాలని తకాయిచీ చెబుతున్నారు.దానిలో భాగంగా మిలిటరీని పటిష్టపరచటం, ఆయుధ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, నాటో, ఐరోపాయూనియన్‌, క్వాడ్‌తో సహా నూతన భద్రతా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, అమెరికాతో బంధాన్ని మరింత పటిష్టపరుచుకొనే వ్యూహంతో ముందుకు పోవాలని జపాన్‌ నిర్ణయించుకుంది. తమ మీద ఎవరైనా దాడి చేస్తే ఉమ్మడిగా ఆత్మరక్షణ లేదా భాగస్వాముల సాయం పొందవచ్చని రాజ్యాంగమే అనుమతిస్తున్నదంటూ నూతన భాష్యాలు చెబుతున్నారు. గత ఏడాది అధికారానికి వచ్చిన వెంటనే ఒక వేళ చైనా గనుక తైవాన్‌పై దాడి చేస్తే తమ మిలిటరీని రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఈ వైఖరి ప్రాంతీయ భద్రతకు ముప్పు అని చైనా వర్ణించింది.

ఆర్థిక రంగంలో దీర్ఘకాల పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌ ఇప్పుడు ఆర్థిక, మిలిటరీ లక్ష్యాలను ఉమ్మడిగా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నది. ఇప్పటికే జిడిపిలో రెండు శాతానికి రక్షణ ఖర్చు చేరింది.అణు జలాంతర్గాములను సమకూర్చుకోవాలని, ఆయుధ విక్రయాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని,మారణాయుధాలను ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు పంపటంతో తగ్గిన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.ఇటలీ,ఆస్ట్రేలియాకు ఫ్రైగేట్స్‌ సరఫరా, నూతనతరం జెట్‌ఫైటర్ల రూపకల్పనకు బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాటో పేరుతో ఉక్రెయిన్‌కు మిలిటరీ పరికరాలను సరఫరా చేస్తున్నది. సిఐఏ మాదిరి నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. తద్వారా ఇప్పటికే ఐదు కళ్ల పేరుతో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గూఢచర్యంలో సహకరించుకుంటున్నాయి, దీనిలో చేరటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమెరికాతో రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా మిలిటరీ, సైనిక కేంద్రాలను ఏర్పాటును అనుమతించింది. ”డోన్రో సిద్దాంతం”(డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడలు) పశ్చిమార్ధగోళం వైపు కేంద్రీకరిస్తూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ ప్రాంతంలో తాను కేంద్ర బిందువుగా ఉండాలని జపాన్‌ భావిస్తున్నది, అందుకోసం అమెరికాతో మరింతగా జతకట్టేందుకు పూనుకుంది. తన దగ్గర ఉన్న నిల్వనుంచి 550 బిలియన్‌ డాలర్ల మేర అమెరికాలో పెట్టుబడులు పెడతామంటూ అమెరికాకు ఆశచూపుతున్నది.

మరోసారి మిలిటరీవాదం వైపు పయనిస్తున్న జపాన్‌ చర్యలను దాని బాధిత దేశాలలో ఒకటైన చైనా సహజంగానే వ్యతిరేకిస్తుంది. జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో ప్రస్తుతం జరుగుతున్న భద్రతా సమావేశాలలో మిలిటరీ భూతంలా జపాన్‌ ఉందని చైనా విమర్శించింది. మమ్మల్ని అంతమాట అంటారా అని జపాన్‌ నిరసన తెలిపింది. ” ప్రపంచంలో చైనా ” అనే ఇతివృత్తంపై మ్యూనిచ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ మాట్లాడుతూ చైనాకు దూరంగా జరుగుతున్న జపాన్‌ మరోవైపు తైవాన్‌కు మద్దతు ఇస్తూ దురాక్రమణ ఉద్దేశ్యాలను బయటపెట్టుకున్నదని విమర్శించాడు. తైవాన్‌పై దాడితో వలసగా మార్చుకొనేందుకు చూస్తున్నదని, జపాన్‌ మిలిటరీ వాద భూతం భయం కొనసాగుతున్నదంటూ ఒకవేళ గతంలో మాదిరి పాత పద్దతిలో దురాక్రమణకు పూనుకుంటే వెనక్కు తిరిగి చూసుకొనే లోపే చావు దెబ్బతింటుందని హెచ్చరించాడు. తైవాన్‌కు మద్దతు ఇవ్వటం ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పరిణామం అవుతుందని, చైనా సర్వసత్తాకతకు సవాలు, 140 మంది జనాభా అంగీకరించే సమస్యే లేదని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తరువాత సామ్రాజ్యవాదాన్ని జర్మనీ తిరస్కరించిందని, నాజీల ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయగా జపాన్‌ మాత్రం యుద్ద నేరగాండ్లకకు ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్నదని, వారికి వందనాలు చేయటమే సమస్యలన్నింటికీ మూలమని వాంగ్‌ ఇ చెప్పాడు.చైనా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని జపాన్‌ పేర్కొన్నది. తమ మిలిటరీ నిర్మాణం పెరుగుతున్న భద్రతా పర్యావరణానికి స్పందన తప్ప ఒక దేశానికి వ్యతిరేకం కాదని, తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పుకుంది. కొన్ని దేశాలు తమ మిలిటరీ శక్తిని పెంచుకుంటున్నాయని, బెదిరిస్తున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా జపాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో వ్యాఖ్యానించారు. తమ పరిసర దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని జపాన్‌ రక్షణ మంత్రి కొజుమీ మ్యూనిచ్‌ సమావేశాల్లో ఆరోపించాడు.

అక్టోబరులో అధికారానికి వచ్చిన తకాయిచి జపాన్‌కు తొలి మహిళా ప్రధాని, వచ్చీ రావటంతోనే దూకుడుగా వ్యవహరిస్తున్నారు, చైనాను రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. తమ భూ భాగాల రక్షణకు ఇప్పటికే తిష్టవేసిన అరవైవేల మంది అమెరికన్‌ మిలిటరీతో పాటు తాము కూడా రక్షణ ఏర్పాట్లను మరింతగా పెంచుతామని ప్రకటించారు. గత 14 సంవత్సరాలుగా క్రమంగా జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది.తాజాగా 2026 సంవత్సరానికి రికార్డు స్థాయిలో గత రికార్డులను బద్దలు కొట్టి 57.8 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ మొత్తమే ఖర్చు చేయనుందని, జిడిపిలో రెండుశాతానికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదేదో అనుకోకుండా జరిగే పరిణామం కాదు. నయా సైనికవాదంలో భాగమే. రాజ్యాంగం శాంతికాముకమని, ఆత్మరక్షణ మిలిటరీ బలగాలని చెబుతున్నప్పటికీ వర్తమాన ఆచరణ యుద్దోన్మాద బాటగా ఉంది. ప్రతిదాడులు చేసే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను దెబ్బతీసే సామర్ద్యాలను సమకూర్చుకుంటున్నది. చైనా, తైవాన్‌ల సమీపంలో ఉన్న తన దీవులను మిలిటరీ, ఆయుధాలతో నింపుతున్నది. నిజానికి జపాన్‌ వద్ద ఆధునిక ఆయుధాలను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదు. ఇప్పుడు ఉపగ్రహాలు పనిచేయకుండా స్థంభింపచేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నది. అనేక ఆంక్షల కారణంగా ఆయుధాల బదులు ఎలక్ట్రానిక్‌, వినియోగవస్తువులపై కేంద్రీకరించి కొన్ని దశాబ్దాల పాటు హవా నడిపింది. ఇటీవలి కాలంలో చైనా సవాలు విసురుతున్నది. ఈ నేపధ్యంలోనే ఆయుధాల తయారీకి పూనుకుందని చెప్పవచ్చు, అయితే తనకు ముప్పు రానంతవరకు లేదా తనకు అవసరమైన వాటిని మాత్రమే అమెరికా అనుమతించవచ్చు. తానుగా విదేశాలపై దాడులు చేసినపుడు అంతర్గతంగా తలెత్తుతున్న వ్యతిరేకత, నష్టాలను గమనంలో ఉంచుకొని తమ చేతికి మట్టి అంటకుండా చూసుకుంటున్నది. నాటో దేశాలు తమ మిలిటరీ బడ్జెట్లను పెంచుకోవాలని వత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి ఆసియాలో చైనా మీద దాడికి దిగితే పక్కనే ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎంతో అవసరం. అందువలన వాటి మిలిటరీ ఖర్చు పెంచేందుకు అమెరికా పూనుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కుదిరిన ఒప్పందాల ప్రకారం జపాన్‌, జర్మనీ మిలిటరీ వాదాన్ని వదులుకోవాలని స్పష్టంగా ఉంది. అందువలన దానికి దానికి తూట్లు పొడుస్తూ రెండు దేశాలు కూడా మిలిటరీబాటలో ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఓడిపోయింది తప్ప దాని మిలిటరీ సామర్ధ్యాలు అంతరించలేదు. అందుకే మరోసారి వాటిని ప్రదర్శించేందుకు పూనుకుంది. తూర్పు ఆసియాను ఉద్రిక్తల్లోకి నెట్టేందుకు చూస్తున్నది.తొలుత వాణిజ్యం, మత ప్రచారం పేరుతో మనదేశానికి బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదులు వచ్చినట్లుగానే 1,600 సంవత్సరంలో పోర్చుగీసు వాణిజ్య, మత ప్రచారకులు జపాన్‌లో అడుగుపెట్టారు. జపాన్‌ నాలుగు ప్రధాన దీవులు, 14,121 చిన్నదీవుల సముదాయం. పోర్చుగీసు, ఇతర పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులను ఎదుర్కొనే క్రమంలో అక్కడి రాజులు తామే సామ్రాజ్యవాదులుగా మారి కొరియాను ఆక్రమించుకున్నారు.చైనా ఆక్రమణకూ పూనుకున్నారు. ఈ క్రమంలో జపాన్‌-చైనా, జపాన్‌-రష్యా యుద్దాలు జరిగాయి.కాముకురా, ఆషికా షోగుంటే రాజరికాలు జపాన్ను ఐక్యం కావించిన తరువాత ప్రపంచానికి దూరంగా ఒక అగ్రహారంలా ఉంది. అమెరికా 1853లో నౌకా దళాన్ని పంపి రాజును లొంగదీసుకొని పశ్చిమదేశాలకు మార్కెట్‌గా మార్చింది. దాంతో 1868లో షోగుంటే పాలన రద్దయి, మెజి పాలన ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్‌ సంబంధాలను బద్దలు కొట్టి పారిశ్రామీకరణ, నవీకరణ, మిలిటరీ వాదంతో పాలకులు ముందుకు వచ్చారు.ప్రష్యా(జర్మనీ) పాలకులను అనుకరించారు.ఈ క్రమంలో 1910లో కొరియాను ఆక్రమించుకుంది, 1937చైనా ఆక్రమణకు పూనుకుంది. తరువాత అమెరికా,ఐరోపా దేశాలతో తలపడింది.రెండవ ప్రపంచ యుద్దంలో మితవాద భావజాలం, మిలిటరీ శక్తులు, సామ్రాజ్యవాదులుగా ఉన్న ఇటలీ, జర్మనీలతో చేతులు కలిపి సోవియట్‌ యూనియన్‌, అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో తలపడింది. ఆ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయటంతో సామాన్య జపనీయులు యుద్ధ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో శాంతికాముక రాజ్యాంగంతో యుద్దాలకు దూరంగా ఉంటామని జపాన్‌ పాలకవర్గం ప్రకటించకతప్పలేదు. అయితే వలసలు, సామ్రాజ్యవాదంతో ఎలా లబ్ది పొందవచ్చో తెలిసిన వారు గనుక మరోసారి నయా సైనిక వాదంతో ప్రాంతీయంగా అయినా తమ ప్రభావాన్ని రుద్దేందుకు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించారు. వాటి గురించి ఎగువన చెప్పుకున్నాం. గడచిన ఎనిమిది దశాబ్దాలలో ప్రపంచ పటంలో అనేక మార్పులు వచ్చాయి. బలాబలాలు తారుమారవుతున్నాయి.గతంలో మాదిరి ఏ దేశాన్ని కూడా భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశాలు లేదు. అందువలన జపాన్‌ గతాన్ని తలుచుకోవటం తప్ప అంతకు మించి చేసేదేమీ లేదు, అయినప్పటికీ పాలకవర్గ స్వభావం మారదు, అందుకే మరోసారి జాతీయోన్మాదాన్ని, నయా సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నారు, అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో జపనీయులకు తెలిసినంతగా మరొరికి తెలియదు గనుక పాలకవర్గ యత్నాలను అడ్డుకుంటారని, అడ్డుకోవాలని ఆశిద్దాం !

అవాస్తవాలు చెబుతున్నదెవరు పియూష్‌ గోయలా – రాహుల్‌ గాంధీనా : పత్తి రైతులు, పరిశ్రమకు ముప్పుగా మారిన మోడీ-ట్రంప్‌ ఒప్పందం !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !

ట్రంప్‌ మరో గడువు : పురోగతిలేని ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య బుధవారం నాడు 1,448వ రోజులో ప్రవేశించింది. తనకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు చేసిన కుట్రను వమ్ము చేసేందుకు ఎనిమిది సంవత్సరాలు వేచి చూసిన రష్యా ఇక లాభం లేదని 2022 ఫిబ్రవరి 24న సైనిక చర్యకు పూనుకుంది, మరికొద్ది రోజుల్లో ఐదవ ఏడాదిలో ప్రవేశించనుంది.పుతిన్‌ గనుక దాడులను ఆపకపోతే రష్యాకు మద్దతు ఇస్తున్న దేశాల మీద ట్రంప్‌ కేంద్రీకరిస్తారని మాజీ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే వెనెజులా, ఇరాన్‌ మీద తీసుకున్న చర్యలను ఉటంకించారు. దానిలో భాగంగానే భారత్‌ మీద వత్తిడి తెచ్చి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షల కత్తి ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించటంలో ఐక్యరాజ్యసమితి పూర్తిగా విఫలమైంది. తొలి రోజుల్లో ఒప్పందం చేసుకొనేందుకు ఉక్రెయిన్‌ ముందుకు వచ్చినప్పటికీ ఐరోపా దేశాలు అడ్డుపడ్డాయి. అనేక యుద్దాలను ఆపిన తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వలేదని మండి పడుతున్న ”అపరశాంతి దూత ” డోనాల్డ్‌ ట్రంప్‌ తాను గద్దెనెక్కిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పాడు. జనవరి 19తో ఏడాది గడచిపోయింది, జూన్‌ నెల వరకు కొట్టుకోండి, చంపుకోండి ఆ లోగా పోరును ముగించండి అంటూ తాజాగా గడువు విధించాడు.దాడుల విరమణ ప్రతిపాదనలపై రెండు పక్షాలూ ఏకాభిప్రాయానికి రావటం లేదు.అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప కనుచూపు మేరలో పరిష్కారం కనిపించటం లేదు.చివరిసారిగా గతవారంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబూదాబీలో అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ఎవరికి తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు.

నిజానికి ఉక్రెయిన్‌ సంక్షోభానికి నాంది 2014లోనే పడింది. అంతకు ముందు రష్యాను కూడా తమ జి 7 ధనిక దేశాల కూటమిలో చేర్చుకున్నప్పటికీ తెరవెనుక వ్యతిరేక కుట్రలకు తెరలేపటంతో రష్యా ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌లో రష్యాకు అనుకూలంగా ఉన్న పాలకులను మార్చి తమతొత్తులను నాటో కూటమి అధికారానికి తీసుకురావటం, కుట్రలకు పూనుకోవటంతో గతంలో తన ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా దీవిని రష్యా 2014లో విలీనం చేసుకుంది. తరువాత ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటుకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాంతంపై రష్యా దాదాపుగా పూర్తిగా ఆధిపత్యం కలిగి ఉంది. అక్కడ ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాలని, ప్రత్యేక దేశంగా పరిగణించాలని రష్యా చెబుతోంది.ససేమిరా కుదరదని ఉక్రెయిన్‌ అంటోంది. గత నాలుగు సంవత్సరాలుగా మెల్లమెల్లగా 20శాతం ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి, ఆప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. చర్చలను పట్టించుకోకుండా ఇరు పక్షాలూ పరస్పరదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఈ సంక్షోభంలో గెలుపెవరిది అనే చర్చ మొదలైంది.రెండు నెలల్లోనే ఉక్రెయిన్‌కు పాఠం చెప్పాలన్న పుతిన్‌ వ్యూహం సాధ్యం కాదని తేలింది.అదే విధంగా రష్యాను చావుదెబ్బతీసి వెనక్కు నెట్టారని పశ్చిమదేశాలు, వాటి కనుసన్నలలో పని చేసే మీడియా చేసిన ప్రచారం, చూపిన హాలీవుడ్‌ చిత్రాలు కూడా వాస్తవం కాదని తేలిపోయింది.ఉక్రెయిన్‌లో నాజీలకు స్థానం లేకుండా చేయటం, తూర్పు ప్రాంతంలో డాన్‌టెస్క్‌, లుహానస్క్‌, తదితర ప్రాంతాలతో కూడిన డాన్‌బాస్‌ ప్రాంత రక్షణకు, అక్కడ ఉన్న రష్యన్‌ మైనారిటీలకు రక్షణ, మిలిటరీ రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో సైనిక చర్య తీసుకున్నట్లు పుతిన్‌ ప్రకటించాడు.తరువాత పరిణామాలు వేరే విధంగా సంభవించాయి.ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలను దెబ్బతీయటం ద్వారా లొంగదీసుకొనేందుకు రష్యా దాడులు జరుపుతున్నది. ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఎలా పరిష్కారం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. గెలిచే అవకాశాలు లేని ఉక్రెయిన్‌కు ఎంతకాలం మద్దతు ఇవ్వాలి, అక్కడి నుంచి వచ్చిన శరణార్ధులను ఎంతకాలం భరించాలనే చర్చ ఐరోపాలో ఉంది. ఇప్పటి వరకు నాటో కూటమి దేశాలు అందచేసిన సమాచారం, ఆయుధాలతో ఉక్రెయిన్‌ ప్రతిఘటన కొనసాగిస్తున్నది. రష్యాపై విధించిన ఆంక్షలు ఇంతవరకు పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు.చైనా పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నది. అమెరికాలో వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న యుద్ధ అధ్యయనాల సంస్థ అంచనా ప్రకారం 2025లో ప్రతినెలా సగటున 176 చదరపు మైళ్ల (వరంగల్‌ నగరం, పరిసరాలంత) ప్రాంతాన్ని రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. రాజధానిపై గాక ఇతర ప్రాంతాలపై పుతిన్‌ సేనలు కేంద్రీకరిస్తున్నాయి. కొంత ప్రాంతాన్ని రష్యాకు స్వాధీనం చేస్తామంటూ ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన 28 అంశాల పరిష్కార మార్గాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్షిపణులతో సహా ఉక్రెయిన్‌ మిలిటరీ శక్తి పరిమితం కావాలని, నాటోలో చేరటం లేదా నాటో శాంతిస్థాపక దళాలను ఉక్రెయిన్‌లో ఉంచకూడదని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దీన్ని అంగీకరిస్తే తాము పాదాక్రాంతులమైనట్లే అంటూ కుదరదని ఉక్రెయిన్‌ చెప్పింది.డాన్‌బాస్‌ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా అంగీకరిస్తామని, అమెరికా, నాటో కూటమి నుంచి తమకు రక్షణ హామీ కావాలని పట్టుబడుతోంది. విజయం తనవైపే ఉందని, ఉక్రెయిన్ను చీల్చటం తమ లక్ష్యమని పుతిన్‌ చెబుతున్నాడు.

ఉక్రెయిన్‌ సంక్షోభంలో మరణించిన సైనికులు, జరిగిన నష్టాల గురించి అంచనాలు, అతిశయోక్తులు తప్ప నిజానిజాలు వెల్లడి కావటం లేదు. రష్యా వైపు నుంచి పన్నెండు లక్షల మంది, ఉక్రెయిన్‌కు చెందిన వారు 20లక్షల మంది మరణించినట్లు సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ అంచనావేసింది. రష్యా పన్నెండు లక్షల మందితో పోల్చితే ఉక్రెయిన్‌ పక్షంలో మరణించిన,గాయపడిన లేదా కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఐదు నుంచి ఆరులక్షల వరకు ఉందని సిఎన్‌ఎన్‌ మీడియా విశ్లేషకుడు చెబుతున్నారు. బ్రిటన్‌ రక్షణ శాఖ అంచనా రష్యా వైపు నష్టాల సంఖ్య పదిలక్షలు. రష్యా మిలిటరీ, యుద్దానికి నిధులు సమకూర్చే మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు చేస్తుండగా, విద్యుత్‌,మంచినీరు వంటి వ్యవస్థలను ధ్వంసం చేయటం పుతిన్‌ సేనల లక్ష్యాలుగా ఉన్నాయి. గత ఏడాది డ్రోన్లతో జెలెనెస్కీ దళాలు రష్యా అదుపులో ఉన్న ఉక్రెయిన్‌ ప్రాంతాలు, రష్యా భూభాగం మీద 371 దాడులు జరిపినట్లు ఒక మీడియా సంస్థ పేర్కొన్నది. వాటిలో సైనిక పరిశ్రమలపై 91, మిలిటరీ స్థావరాలపై 25,వైమానిక కేంద్రాలపై 16 దాడులు జరిగాయి. రష్యాకు వచ్చే రాబడిలో 40శాతం చమురు, గ్యాస్‌ల నుంచే వస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలు ఇచ్చిన సమాచారంతో ఆ వ్యవస్థలపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తున్నది. చమురుశుద్ధి కేంద్రాలపై 88, ఉపకేంద్రాలపై 30,చమురు నిల్వకేంద్రాలపై 28, రవాణా సదుపాయాలపై 28, రేవులపై 15, గ్యాస్‌ వ్యవస్థలపై ఆరుసార్లు దాడులు జరిగాయట. సైనికులను చేరవేసే రైల్వే మౌలికసదుపాయాలపై 36 దాడులు జరిగాయి. ఈ దాడులతో రష్యా రాబడి బాగా తగ్గిందని అంచనా. ఏటా 160 బిలియన్‌ డాలర్ల మేర మాస్కో మిలిటరీ ఖర్చు ఉందని చెబుతున్నారు.

రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాల గురించి పశ్చిమదేశాల మీడియా దాచిపెడుతున్నది. ఆ వివరాలు వెల్లడైతే జెలెనెస్కీకి ఇస్తున్న సాయంపై ఆ దేశాలలో వ్యతిరేకత వెల్లడయ్యే అవకాశం ఉంది. యుద్దంలో రష్యా గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు వస్తుందనే ప్రచారంతో జనాలను మభ్యపెడుతూ ఆ పేరుతో ఆర్థిక, మిలిటరీ సాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన పోక్రోవస్క్‌ ప్రాంతాన్ని పట్టుకొనేందుకు రష్యా, నిలుపుకొనేందుకు ఉక్రెయిన్‌ పోరాడుతున్నాయి, నిత్యం రాజధాని కీవ్‌పై దాడులు జరుగుతున్నాయి. అక్కడ రోజుల తరబడి విద్యుత్‌ సరఫరా లేదు, చలికాచుకొనే సదుపాయాలు వారం రోజులుగా పని చేయటం లేదు.ఒకవైపు విపరీతమైన చలి, మరోవైపు ఎడతెగకుండా రష్యా చేస్తున్న దాడులతో పౌరులు సతమతమౌతున్నారు. జెలెనెస్కీ సేనలు యుద్ధ రంగం నుంచి పారిపోతున్నట్లు, రష్యన్లకు లొంగిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.కీలకమైన రైల్వే కేంద్రంగా ఉన్న పోక్రోవస్క్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనేందుకు గత కొద్ది నెలలుగా పుతిన్‌ సేనలు ప్రయత్నిస్తున్నాయి. పట్టణ ఉత్తర ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని ఉక్రేనియన్‌ మిలిటరీ జనరల్‌ చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలోకి కూడా రష్యా సేనలు చొచ్చుకుపోతున్నట్లు డీప్‌స్టేట్‌ అనే సంస్థ పరిశోధకులు చెప్పారు. ఈ పట్టణం పూర్తిగా, పక్కనే ఉన్న మైనోర్‌హార్డ్‌ అనే పట్టణంలో ఎక్కువ భాగం రష్యన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇదే చివరి పోరు కావచ్చని కూడా పేర్కొన్నారు.

అలాస్కాలో పుతిన్‌తో జరిపిన భేటీలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్‌ వెనక్కు పోతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారం కావాలని అమెరికా కోరిందని, పోరు ఆగాలంటే డాన్‌బాస్‌ ప్రాంతం మొత్తాన్ని తమకు అప్పగించాలని అన్నాడు.అందరూ ఉక్రెయిన్‌ భద్రత గురించి మాట్లాడుతున్నారు తప్ప తమ గురించి ఎందుకు ఆలోచించటం లేదని రష్యన్‌ దౌత్యవేత్త గ్రుష్‌కో ప్రశ్నించారు. ఉక్రెయిన్‌కు రక్షణ ఉండాలని తాము కూడా అంగీకరిస్తామని, వివాదానికి మూలం తమ భద్రతకు తెచ్చిన ముప్పుగురించే గనుక దాని సంగతేమిటని రష్యన్‌ వార్తా సంస్థ ఇజ్వెస్తియాతో అన్నాడు. ఐరోపా యూనియన్‌ నేతల ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రష్యా భద్రతా హామీల గురించి ప్రస్తావించటం లేదని, శాంతి ఒప్పందంలో అదే కీలకాంశమని, అది తేలకుండా ఒప్పందం అసాధ్యమన్నాడు

జూన్‌లోగా మొత్తంగా యుద్దాన్ని ముగించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తాజా గడువు విధించినట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. వచ్చే వారంలో ఉభయపక్షాలను మరోసారి చర్చలకు పిలిచినట్లు చెప్పాడు. తాజా గడువులోగా అంగీకారానికి రాని పక్షంలో ఇరుపక్షాల మీద అమెరికా వత్తిడి పెంచనుందని కూడా అన్నాడు. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్‌ చెప్పాడు, అందుకోసం ప్రత్యేక రాయబారిగా కెయిత్‌ కెలోగ్‌ నియామకం జరిగింది. అయితే సదరు రాయబారి పరిష్కారానికి వంద రోజులు పడుతుందన్నాడు.గతేడాది ఆగస్టులోగా ఒప్పందం కుదరాలని ట్రంప్‌ గడువు పెట్టాడు. ముసాయిదా ఒప్పందం 95శాతాన్ని అంగీకరించినట్లు డిసెంబరులో ప్రకటించాడు.అదీ జరగలేదు, శాంతి చర్చలు ప్రారంభమైన తరువాత 55వేల మంది తమ సైనికులు మరణించినట్లు జెలెనెస్కీ చెప్పాడు. గతవారంలో అబూదాబీలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. త్వరలో అమెరికాలోని మియామీలో చర్చలు జరుగుతాయని, తాము హాజరవుతున్నట్లు వెల్లడించాడు.జూన్‌ గడువును నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల ప్రచారానికి వినియోగించుకొనేందుకు ట్రంప్‌ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రతి సంక్షోభాన్ని అమెరికా పాలకవర్గం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం మామూలే !

కాషాయదళానికి కర్రుకాల్చి వాత పెట్టిన పినరయి విజయన్‌ : బోనస్‌ , ధాన్యం పండిస్తే భారమ ంటూ లేఖ రాసిన మోడీ సర్కార్‌, ఇరుకున పడ్డ బిజెపి !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ధాన్య ఉత్పత్తి పెరిగితే దేశానికి భారంగా మారుతుందా ? నేరుగా రైతులకే ఎగుమతి అవకాశాలు కల్పిస్తామంటూ కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ అదే చెబుతోంది, రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. అవర్‌ వరల్డ్‌ డాటా ప్రకారం మన పక్కనే ఉన్న చైనాలో 2022లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున 3,454 కాలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని అందిస్తుండగా నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్న నరేంద్రమోడీ ఏలుబడిలో 2,574 కాలరీలు ఉంది. అయినప్పటికీ ధాన్యం పండించే రైతులకు బోనస్‌ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుందని, అది దేశానికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర వైఖరిని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి మద్దతు ధరకంటే అదనంగా క్వింటాలుకు కేరళ ప్రభుత్వం రు.631 అందిస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇవ్వటాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా ఇస్తున్న కారణంగా ధాన్య సేకరణ ఖర్చు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద వత్తిడిని పెంచుతున్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణాలో సన్న రకాలు పండించే వారికి బోనస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర లేఖ ఒక్క కేరళకేనా, అన్ని రాష్ట్రాలు పంపిందా అన్నది తెలియదు. ఎలాంటి శషభిషలు లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నదని, రైతులకు ఇచ్చే బోనస్‌ను ప్రధాన ఆర్థిక భారంగా ఎందుకు భావిస్తున్నదని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఈ లేఖలో వెల్లడించిన అభిప్రాయం వెనుక మనదేశ మార్కెట్‌ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తెరవాలన్న ఆలోచన ఉందా అని కూడా ప్రశ్నించారు.వరి రైతులకు చెల్లించాల్సిన సాయాన్ని సకాలంలో విడుదల చేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరి ఆహార భద్రత, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖలో గోధుమ,వరి పంటలకు అదనపు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పు ధాన్యాలు,చమురు గింజలు,చిరుధాన్యాలకు ప్రోత్సాహాకాలను అందించాలని పేర్కొన్నారు.కేంద్ర సూచనను తిరస్కరిస్తున్నామని, వరి సాగు విషయంలో రాజీపడేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌ కేంద్రానికి లేఖ రాశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు ప్రోతాహకాలను తాము వ్యతిరేకించటం లేదని, వరిని ఫణంగా పెట్టి ఆ పని చేయలేమని, వాటి ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ అవసరాలలో కేవలం 21శాతం మాత్రమే స్థానికంగా బియ్యం ఉత్పత్తి ఉంది, దాన్ని 30శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందిస్తున్నది.

కొసమెరుపు ఏమంటే కేంద్ర చర్యతో రైతాంగంలో వెలువడిన వ్యతిరేకతతో రాష్ట్ర బిజెపి బెంబేలెత్తింది. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్త వచ్చింది. అంతవరకైతే అదో దారి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్య రైతాంగాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు, సేకరణ యంత్రాంగం, మార్కెటింగ్‌ మద్దతు ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ప్రకటించలేదని కూడా చెప్పారు.కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నట్లు కేరళలో అదనపు ఉత్పత్తిలేదని, కేంద్ర నిల్వలు కూడా అదనంగా లేవని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పిన అంశాలు కేరళకు వర్తించవని బిజెపి నేత వాపోయారు. ధాన్య సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.ఈ కారణంగానే కేంద్రం ఆర్థికంగా కేరళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును పెంచేందుకు అదనంగా బోనస్‌ ఇస్తున్నది. దీన్ని సాకుగా చూపి మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకే ఆర్థిక శాఖ రాసిన లేఖ అన్నది స్పష్టం. త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఇబ్బందులను ఊహించి బిజెపి నేత నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కూడా ఇరుకునపడింది.ఇప్పుడు లేఖను వెనక్కు తీసుకున్నా, లేకున్నా బిజెపికే నష్టం.అదొక అసెంబ్లీ ఎన్నికల అస్త్రంగా మారుతుంది.

ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం గురించి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో వేసిన కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు, ఏం చేస్తున్నారని కేంద్రం అడగనూ లేదు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ శ్రద్దకు ఇది చక్కటి తార్కాణం.అమెరికా ఉత్పత్తులకు ఒక్కసారే పూర్తి స్థాయిలో మార్కెట్‌ను తెరిస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో దశలవారీ చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరినైనా హత్య చేయదలచుకుంటే మెల్లగా పనిచేసే విషం ఇవ్వటం తెలిసిందే. అలా ఒక్కొక్కటిగా వెల్లడిస్తే ఈలోగా జనం అలవాటు పడిపోతారన్నది భావన కావచ్చు. మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పినట్లు ఇప్పుడు కుదిరింది ఒక స్వరూప అవగాహన మాత్రమే. ఉదాహరణకు ఇల్లు కట్టేటపుడు ఒక ప్లాన్‌ గీస్తారు. తరువాత పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ వేస్తారు. ఇంట్లో ఏమేమి ఉండేది తరువాత మాత్రమే బయటివారికి తెలుస్తుంది. అలాంటిదే అమెరికాతో కుదిరిన అవగాహన. తాత్కాలిక ఒప్పందం పేరుతో పశుదాణా అవసరాలకు ఎర్ర జొన్నలు, పలురకాల ధాన్యాలతో చేస్తున్న ఇథనాల్‌ తయారీలో ఉప ఉత్పత్తిగా తయారయ్యే చెక్కను కూడా కూడా దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిగుమతి పన్నులేకుండా అనుమతించింది. ఇప్పటికే పత్తి దిగుమతి పన్ను తగ్గింపుతో క్వింటాలకు వెయ్యి నుంచి రెండువేల వరకు రైతాంగం నష్టపోయింది.ఈ పశుదాణా పేరుతో దిగుమతులు, అందుకోసం మనదేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న, ఇతర పంటల ధరల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సోయా ఆయిల్‌ దిగుమతి ఆ పంట పండించే రైతాంగంతో పాటు పామాయిల్‌, నూనె గింజల సాగుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుందో అధ్యయనం చేయాల్సి ఉంది. యాపిల్‌ పండ్ల దిగుమతులు కాశ్మీర్‌,హిమచల్‌ ప్రదేశ్‌ ఇతర ప్రాంతాల్లోని రైతాంగానికి గొడ్డలి పెట్టని యాపిల్‌ సాగుదార్ల అఖిల భారత సంఘ అధ్యక్షుడు, సిపిఐ(ఎం) నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామి పేర్కొన్నారు.

అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం గనుక ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, దాన్నుంచి విడిపోయిన వారితో సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికన్‌ కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేశారని పేర్కొన్నాయి.వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మనం ఎగుమతి చేసే వాటిపై 18శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు గిడసబారిన స్థితిలో ఉన్నందున చేసుకొనే ఒప్పందాలు వాటికి ఉపయోగం తప్ప భారత్‌కు మేలు చేయవని అనేక మంది చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈనెల పన్నెండున లేబర్‌ కోడ్‌లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాపిత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే, వారికి మద్దతుగా, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆ రోజున రైతాంగం కూడా పాల్గ్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున ట్రంప్‌, మోడీ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) ఒక ప్రకటన చేస్తూ త్వరలో సమావేశం జరిపి, అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తామని పేర్కొన్నది. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ముప్పు ఉండదని పియూష్‌ గోయల్‌ చెప్పుకున్నారు.

వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి 13న డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ చర్చలకు శ్రీకారం చుట్టారు.రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు మరియు పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను భారత్‌ పూర్తిగా ఎత్తివేయటం లేదా తగ్గించటం చేస్తుంది.వాటిలో పశుదాణా అవసరాల కోసం డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ గ్రెయిన్స్‌(పైన చెప్పుకున్న ఇథనాల్‌ ఉప ఉత్పత్తులు), ఎర్ర జొన్నలు,ట్రీ నట్స్‌, తాజా మరియు ప్రోసెస్‌ చేసిన పండ్లు, సోయాబీన్‌ నూనె, వైన్‌, ఆల్కహాల్‌ మరియు అదనపు ఉత్పత్తులు.దీనికి ప్రతిగా ఏప్రిల్‌ రెండవ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై 18శాతం పన్నులు విధిస్తారు. వాటిలో వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ మరియు రబ్బరు, ఆర్గానిక్‌ రసాయనాలు,గృహ అలంకరణ వస్తువులు, కళా ఉత్పత్తులు మరియు కొన్ని యంత్రాలు ఉన్నాయి.జనరిక్‌ ఔషధాలు, వజ్ర వైఢూర్యాలు, విమానాల విడిభాగాల మీ పన్నులను రద్దు చేస్తారు.అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించి గతంలో పన్నులు విధించిన భారత విమానాల విడిభాగాలు,అల్యూమినియం, ఉక్కు, రాగి, వాహన ఉత్పత్తులపై రాయితీలు, కోటాలను అమలు చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఇంథన ఉత్పత్తులు, విమానాలు, విమానవిడి భాగాలు, వంట బొగ్గు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పతులను 500 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేయాలనుందని భారత్‌ చెప్పింది. ఈ ఒప్పందంలో భారత్‌ నుంచి అమెరికా ఏ వస్తువులను, ఎంత మొత్తంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించిందీ లేదా వాంఛిస్తున్నదీ వివరాలు లేవు.ఈ కారణంగానే దీన్ని ఖరారు చేసే నాటికి వాటిలో ఎన్ని చేరుస్తారో ఏమిటో జనాలకు అంతుబట్టటం లేదు గనుకనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇది అమెరికాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం రావటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఒప్పందంపై సంతకాల తరువాత అవి వెల్లడౌతాయి !

బూతు పురాణంలో ”భారతీయ ” ప్రముఖులు : దర్శకురాలు మీరా నాయర్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన హిందూత్వ శక్తులు !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ ఈ మాట వినగానే వివాదాస్పద కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా గుర్తుకు వస్తుంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ స్వంత విమానాల్లో తిరిగేంత ధనవంతుడు, ఫైనాన్సర్‌, ఘరానా పైరవీ, తార్పుడుగాడు. వాడి దగ్గర ఉన్న ఫైల్స్‌ ఓ బూతుసినిమా అనుకుంటే దానిలో మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రభుత్వ ప్రాపకం ఉన్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ వరకు కొందరు నటించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి.నీలి చిత్రాల్లో నటించటం అంటే ‘ఏ’ దృశ్యాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. అసలేం జరిగింది ? ట్రంప్‌ సర్కార్‌ విధిలేక బయటపెట్టిన లక్షలాది ఆ ఫైళ్లలో ప్రముఖ దర్శకురాలు, న్యూయార్క్‌ నగర వామపక్ష మేయర్‌ జోహ్రాన్‌ మమదానీ తల్లి మీరా నాయర్‌ పేరు కూడా ఉంది. ట్రంప్‌ను సవాల్‌ చేసి ప్రపంచ పెట్టుబడిదారీ కుంభస్థలంగా భావించే నగరానికి 34ఏండ్ల మమదానీ ఎన్నికయ్యాడు. అవకాశం కోసం చూస్తున్న అమెరికాలో వామపక్ష వ్యతిరేకులు, వారి అడుగుజాడల్లో నడిచే హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి.

కృత్రిమ మేథతో రూపొందించిన చిత్రాల్లో ఒకదానిలో బాలుడిగా ఉన్న జోహ్రాన్‌ మమ్‌దానీ, మీరానాయర్‌, బిల్‌క్లింటన్‌,జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ ఉన్నారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో పెట్టటంతో లక్షలాది మంది చూశారు.ఇద్దరు పెద్ద ఉగ్రవాదులతో ఒక చిన్న ఉగ్రవాది అన్నారు. మమదానీకి శిక్షణ ఇచ్చింది ఎప్‌స్టెయిన్‌ అన్న అర్ధం వచ్చేలా ఫొటోల కింద వ్యాఖ్య రాశారు. మన దేశంలో హిందూత్వ ప్రచారం చేస్తున్న ఖాతాలలో జైపూర్‌ డైలాగ్స్‌ ఒకటి. అలెక్స్‌ జోన్స్‌ పోస్టు చేసిన ఫేక్‌ ఫొటో వీడియోను అది షేర్‌ చేసింది. మమదానీ అసలు తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని వర్గాలు తెలిపాయి అంటూ వ్యాఖ్య చేశారు. ఇదే విధంగా వాయిస్‌ ఆఫ్‌ హిందూస్‌ పేరుతో ఉన్నవారు కూడా దాన్ని ప్రచారంలో పెట్టారు. నిజమేమిటో తల్లి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలా అనేక మంది వాటిని వైరల్‌ చేశారు. దీని వెనుక ముస్లిం, వామపక్ష భావజాల వ్యతిరేక ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది. మీరా నాయర్‌ అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆమెకు టీచర్‌గా ఉన్న మిచెల్‌ ఎపిస్టెయిన్‌తో 1970దశకం చివరిలో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత విడిపోయారు.ఈ ఎపిస్టెయిన్‌కు, తార్పుడు ఎపిస్టెయిన్‌కు కుటుంబం, ఇతరత్రా ఎలాంటి సంబంధాలు లేవు. ఒకరు ఆర్టిస్టు కాగా మరొకడు నేరగాడు. మీరా నాయర్‌ ఎలాంటి తప్పూ చేయనప్పటికీ ఆ పార్టీలో పాల్గొనటాన్ని అవకాశంగా తీసుకొని మమదానీ వ్యతిరేకులు, వారితో గొంతుకలిపిన హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున కృత్రిమ ఫొటోలు సృష్టించి అక్రమ సంబంధాలను అంటగట్టారు.జోహ్రాన్‌ తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిజాలను దాచి తమను మోసం చేశారంటూ మమదానీ అభిమానుల ముసుగులో కొందరు న్యూయార్క్‌లో ప్రదర్శన చేశారు. అయితే నిజనిర్ధారణ చేసిన వారు అవన్నీ తప్పుడు ప్రచారాలని, ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో మాన్‌సూన్‌ వెడ్డింగ్‌, నేమ్‌సేక్‌, సలాంబాంబే వంటి చిత్రాలు నిర్మించినప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌ ప్రస్తావన ఉంది. ఆమె న్యూయార్క్‌లో ” సామాజిక సేవకురాలు ” గా ఉన్న ఘిస్‌లేయిన్‌ మాక్స్‌వెల్‌ ఇంట్లో జరిగిన ఒక విందులో పాల్గ్గొన్నారు. తన సినిమా అమేలియా తొలి ప్రదర్శన తరువాత 2009లో ఈ ఉదంతం జరిగింది. ప్రచార రంగంలో ఉన్న పెగీ సిగల్‌ ఆ పార్టీలో పాల్గ్గొన్నవారి గురించి ఎప్‌స్టెయిన్‌కు పంపిన ఈ మెయిల్‌లో ” సినిమా కోసం ఏర్పాటు చేసిన పార్టీ తరువాత ఘిస్‌లెయిన్‌ టౌన్‌హౌస్‌ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. బిల్‌క్లింటన్‌(అమెరికా మాజీ అధ్యక్షుడు),జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌ అధినేత) అక్కడ ఉన్నారు.జీన్‌ పిగోజీ (పెట్టుబడిదారు), డైరెక్టర్‌ మీరా నాయర్‌ తదితరులు కూడా ఉన్నారు ” అని ఉంది. సినిమా పార్టీ గనుక అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖులు కూడా వచ్చారు. న్యూయార్క్‌లో ఇలాంటి పార్టీలు మామూలు. మీరా నాయర్‌-ఎపిస్టెయిన్‌ మధ్య నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. మాక్స్‌వెల్‌ కార్యకలాపాల గురించి తెలియని అనేక మంది అలాంటి పార్టీలకు సినిమా రంగానికి చెందిన వారు వచ్చేవారు. నిజానికి ఆమె సామాజిక సేవకురాలి ముసుగులో ఎప్‌స్టెయిన్‌తో కలసి తరుణ వయస్సులో ఉన్న బాలికలను ఆకర్షించి ప్రముఖులకు తార్చటంలో ప్రముఖురాలు.ఆ కేసులో 20 ఏండ్ల శిక్షపడి ఇప్పుడు జైల్లో ఉంది. చిత్రం ఏమిటంటే ఆమె తండ్రే ఎప్‌స్టెయిన్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కలసి తిరగటమేగాక బాలికలను సరఫరా చేశారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో పేర్లున్న మన ప్రముఖుల గురించి చూద్దాం.వారికి ఆ తార్పుడు గాడు అమ్మాయిలను సరఫరా చేసినట్లు గానీ, వాడి నేరాలలో భాగస్వామ్యం ఉన్నట్లు గానీ ఇప్పటి వరకు వెలువడిన పత్రాల్లో లేదు.ఇప్పటికి ఆరులక్షల పేజీలు వెల్లడి కాగా ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య అలాంటి అవాంఛనీయ వ్యక్తితో విలువలు వలువల గురించి కబుర్లు చెప్పేవారు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారన్నదే బయటకు రావాల్సిన అంశం. తెరవెనుక ఇవన్నీ సాధారణమే అంటారా అదైనా చెప్పండి. మోడీ ఆన్‌ బోర్డ్‌ అనే ఇమెయిల్లో ప్రధాని పేరు ప్రస్తావన ఉంది. ఆ తార్పుడుగాడితో 2014-17 సంవత్సరాలలో కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఐదుసార్లు కలిసినట్లు వెల్లడైంది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన పూరీ 2014 జనవరిలో బిజెపిలో చేరారు. అంతకు ముందు 1974 నుంచి 2013వరకు విదేశాంగశాఖ అధికారిగా వివిధ హౌదాల్లో పని చేశారు.ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ గురించి జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ మరియు డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బనాన్‌ మధ్య నడిచిన ఇమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది.తాను ట్రంప్‌ అధికార యంత్రాంగం-భారత ప్రధాని కార్యాలయ అధికారులకు మధ్యవర్తిగా ఉన్నట్లు ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. 2017 జూలై ఆరున మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ముగిసిన తరువాత కతార్‌కు చెందిన జబోర్‌ వై అనే వ్యక్తి(కతార్‌ రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అని వార్తలు)కి మెయిలు పంపాడు.దానిలో ” భారత ప్రధాని మోడీ సలహా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి మేలు చేకూర్చేందుకు ఇజ్రాయెల్‌లో నృత్యం చేశారు, పాట పాడారు.వారు కొద్ది వారాల ముందు కలుసుకున్నారు, అది పని చేసింది ” ( ఇక్కడ నృత్యం, పాట అంటే అవసరానికి అనుగుణంగా వ్యవహరించారని అనుకోవాలేమో) మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ఖ్యాతి తనదే అని కూడా పేర్కొన్నాడు. ఒక భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్‌ను సందర్శించటమే గాక తరువాత విదేశాంగ విధానంలో నిర్ణయాత్మక మార్పులు చేసిన ఖ్యాతి మోడీకి దక్కిందన్నది స్పష్టం. ఈ ఫైళ్లలో ఉన్న అంశం మీద మన విదేశాంగశాఖ స్పందించింది.ప్రధాని పర్యటన నిజమే గానీ శిక్షపడిన ఒక నేరగాడు పేర్కొన్న అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎప్‌స్టెయిన్‌ లేదా ఇతర విదేశీ సలహాల ప్రభావంగానీ పర్యటన మీద లేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఎప్‌స్టెయిన్‌ ట్రంప్‌ యంత్రాంగంతో సంబంధాలలో ఉన్నాడన్నది, భారత వ్యవహారాల్లో వేలుపెట్టాడన్నది వాస్తవమే అన్నది కొందరి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిలో నిజానిజాలను ఎవరూ బయటపెట్టరన్నది వేరే చెప్పనవసరం లేదు.

నరేంద్రమోడీ నేరుగా కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ కూడా చెప్పలేదు. అతగాడి హవా నడిచిన సమయంలో కేంద్ర మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ 2014-17 సంవత్సరాలలో ఐదుసార్లు పూరీ కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ దినచర్య డైరీలో పూరీ పేరు ఉంది. మూడు సార్లు న్యూయార్క్‌ నివాసంలో భేటీ అయినట్లు స్పష్టంగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో భారత డిజిటల్‌ ఎకానమీ, పెట్టుబడులకు ఉన్న మంచి అవకాశాల గురించి పూరీ ఒక మెయిల్‌ పంపారు.సిలికాన్‌ వాలీలోని,టెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో పూరీని కలిపేందుకు చురుకుగా ఎప్‌స్టెయిన్‌ పని చేసినట్లు ఒక మెయిల్లో ఉంది. లింక్‌డ్‌ ఇన్‌ కంపెనీ స్థాపకుడితో భారత్‌లో పెట్టుబడి అవకాశాల గురించి పూరీ చర్చించినట్లు కూడా వెల్లడైంది.తాను ఎనిమిదేండ్లు న్యూయార్క్‌లో ఉన్నానని, మూడు సార్లు కలిసింది నిజమే అని అంతర్జాతీయ పీస్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తుండగా మూడుసార్లు కలిసింది నిజమే అని, అది పని సంబంధంగా, చాలా పరిమితమైన కలయిక అని, తనకు అతగాడి నేరజీవితం గురించి తెలియదని వైర్‌ పోర్టల్‌ అడిగిన ప్రశ్నకు పూరీ సమాధానంగా చెప్పారు.తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని చెప్పినట్లుగా కేంద్ర మంత్రి సమాధానం ఉంది.అంతర్జాతీయ శాంతి వ్యవహారాల్లో ఎప్‌స్టెయిన్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఒక రాయబారిగా పూరీ ఏమి చర్చించారో అంతుబట్టదు. ఆ భేటీల తరువాతే గురుదీప్‌ సింగ్‌ పూరీ కేంద్ర మంత్రివర్గంలో 2017లో చేరారు. చిత్రం ఏమిటంటే ఈ ఫైళ్ల గురించి తొలి సమాచారం 2025 నవంబరులోనే వెల్లడైంది. ఇదంతా వట్టిదే అని అప్పుడు బిజెపి ప్రతినిధి ప్రదీప్‌ భండారీ కొట్టి పడేశారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి తలెక్కడ పెట్టుకున్నారో తెలియదు.

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ పేరుతో మందిని ముంచిన అనిల్‌ అంబానీ నడిపిన వ్యవహారాలు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి. 2017మార్చినెల 16న అంబానీ పంపిన ఒక వర్తమానం ఇలా ఉంది.” హలో నేను ఢిల్లీలో ఉన్నాను.జారెడ్‌(ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుషనర్‌) మరియు బానన్‌ (స్టీవ్‌ బానన్‌ ట్రంప్‌ ప్రధాన వ్యూహకర్త)లను నేను కలుసుకొనేందుకు మీ సాయం కావాలని ”నాయకత్వం ” ( ప్రధాని కార్యాలయం) వాంఛిస్తున్నది. దయచేసి సలహా ఇవ్వండి.ప్రధాని వాషింగ్టన్‌ పర్యటన జరపబోతున్నారు. అని అనిల్‌ అంబానీ పేర్కొన్నాడు. ఇదంతా ఆ తరువాత 2017 జూన్‌లో జరిపే అమెరికా పర్యటనకు ముందు జరిగింది.2017 నుంచి 2019వరకు అనిల్‌ అంబానీ -ఎప్‌స్టెయిన్‌ మధ్య నిరంతర సంబంధాలు ఉన్నట్లు ఫైళ్లలో బయటపడింది.వారేమి చర్చించుకున్నారంటే అమెరికా, భారత్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పెట్టుబడి వ్యూహాలు, ట్రంప్‌ యంత్రాంగంతో అప్పాయింట్‌మెంట్లు,మోడీ అమెరికా, ఇజ్రాయెల్‌ యాత్రల గురించి.ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనకు ముందు, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ను ఎలా కలుసుకోవాల్సిందీ ఒక మెయిల్‌లో ఎప్‌స్టెయిన్‌ అంబానీకి సూచించాడు. ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మోడీ పర్యటనపై ఇజ్రాయెల్‌ వ్యూహం గురించి చర్చించారు. ఆ సమయంలో అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వ రంగ సంస్థ రాఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో సంయుక్త ప్రాజెక్టు నడుస్తున్నది. మోడీ సర్కార్‌ రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్‌ అంబానీ పాత్ర, అతగాడికి ఆ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌తో విమానాల విడిభాగాల తయారీపేరుతో కుదిరిన ఒప్పందం గురించి తెలిసిందే. అంతకు ముందు అంబానీలు ఎన్నడూ ఆ రంగంలో లేరు. అనిల్‌ అంబానీ దివాలా ప్రకటించినపుడు 2019లో తనకు 75 కోట్ల డాలర్ల రుణ సేకరణకు సలహా ఇవ్వాలని ఎప్‌స్టెయిన్ను కోరినట్లు వెల్లడైంది. వీటి గురించి వివరణ కోరగా అంబానీ కంపెనీ నుంచి స్పందన లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయ నేతలు, వాణిజ్య కంపెనీల యజమానుల సంబంధాలు గురించి ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.ఎపస్టెయిన్‌ వంటి బాపతును దేనికైనా వినియోగించుకోవచ్చని కూడా తెలిసిందే.

భారతీయ-అమెరికన్‌ రచయిత,నీతి బోధలు చేస్తూ, ప్రత్యామ్నాయ వైద్యం గురిచి ప్రచారం చేస్తున్న దీపక్‌ చోప్రా కూడా ఎప్‌స్టెయిన్‌తో సంబంధాలు నెరిపినట్లు బయటపడింది. అతనితో సంబంధాలు నిజమే గానీ తానెలాంటి నేరాలకు పాల్పడలేదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వారి మధ్య 2016-2019 మధ్య ఇమెయిల్స్‌ నడిచాయి.పన్నెండుసార్లు వారు కలుసుకున్నట్లు తేలింది.డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవ భార్య మర్లా మాపుల్స్‌ సమాచారం చెప్పమని, అది మన మధ్యే ఉంటుంది తప్ప ఇతరులెవరితో చెప్పనని దీపక్‌ మిశ్రా 2016 జూలైలో ఎప్‌స్టెయిన్‌కు మెయిలు చేశారు.అమె వివరాలు తెలియచేస్తూ ఆమె గర్భవతా కాదా అన్నదాని గురించిన పందెంలో తాను ఓడిపోయినట్లు కూడా ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ వ్యవహారాలు బయటపడిన తరువాత నెలకు పదిడాలర్లు చెల్లిస్తే ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తానంటూ దీపక్‌ మిశ్రా జనాలను ఆకట్టుకొనేందుకు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. మనదేశానికి చెందిన వారు ఎప్‌స్టెయిన్‌తో నిర్వహించిన లావాదేవీలు, సంబంధాల గురించి మన ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చింది.నిజానిజాలను చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, బిజెపి వాటిని కొట్టిపారవేయటం, మౌనం దాల్చి మూసిపెట్టేందుకు చూస్తున్నది.

రష్యా, చైనాల కట్టడికి మరిన్ని అణ్వాయుధాలు కావాలంటున్న అమెరికా !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా ా రష్యా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌) గడువు బుధవారం రాత్రితో (ఫిబ్రవరి నాలుగు) ముగియనుంది. పునరుద్దరణకు అవకాశాలు లేనందున ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో ముందుకు వస్తుందో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది. ఆయుధ రంగంలో ముందున్న అమెరికా తాపీగా ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబిస్తూ ఒక వేళ ఒప్పందం గడువు తీరితే,అది ముగిసిపోతుంది అంతే అని స్పందించాడు.అమెరికా, రష్యా రెండు దేశాలూ పాతబడిన ఆయుధాలను తొలగించుకొనేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని వినియోగించుకున్నాయి తప్ప కొత్తవాటిని తయారు చేయటం మానుకోలేదనే విమర్శ ఉంది. ఆ రెండు దేశాల దగ్గర ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 87శాతం ఉన్నాయి. గతంలో 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలను 1,700 మరియు 2,200కు పరిమితం చేసుకోవాల్సి ఉంది. దాని స్థానంలో 2010లో పదేండ్లపాటు అమల్లో ఉండే నూతన ఒప్పందం ప్రకారం మరింతగా తగ్గించేందుకు అంగీకరించాయి.దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోనుంది. ఉన్నవాటిని నవీకరించుకొనేందుకు, వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ వంటి వాటికి అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లమేర ఖర్చు అవుతుందని అంచనావేశారు.రష్యా పరిస్థితి కూడా అటూఇటూగా అంతే. పోనీ ఇంత ఖర్చు చేసినా అమెరికా కలలుగన్న ప్రపంచాధిపత్యం సాధ్యం కాలేదు, పూర్వపు సోవియట్‌, తరువాత రష్యాకు యావత్‌ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం లేకపోయినా అమెరికాను అడ్డుకొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒప్పందం లాంఛనంగా ఫిబ్రవరి ఐదుతో ముగియనున్నప్పటికీ ఆ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. సమాచార మార్పిడి, తనిఖీల వంటి వాటిని రష్యా పక్కన పెట్టింది.

అమెరికాకు ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కొత్తగా దానికి మరొక భయం పట్టుకుంది. గతంలో ఒక్క రష్యాతోనే పోటీ అనుకుంటే ఇప్పుడు చైనా ముందుకు వస్తోంది, రెండూ కలసి వస్తే తమ పరిస్థితేమిటని వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట. నిజానికి అణుయుద్దమే వస్తే ఎవరూ మిగలరు. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకారం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఆ సమాచారాన్ని మూడు నాలుగు నిమిషాల్లోనే చైనా కమాండర్లకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ బీజింగ్‌ వద్ద ఉందని పేర్కొన్నారు. శత్రు క్షిపణులు తమను చేరేలోగానే పసిగట్టి ఎదురుదాడికి దిగే సత్తా కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఆధునిక క్షిపణిని చైనా 2024లో పసిఫిక్‌ సముద్రంలో పరీక్షించింది. తరువాత అనేక ప్రయోగాలు చేసింది. అమెరికాను ఎదుర్కొనేందుకు రకరాల క్షిపణుల తయారీలో ఉంది. 2050 నాటికి ఇప్పుడు మోహరించిన 1,770 అణ్వాయుధాల సంఖ్యను 4,625కు పెంచుకోవాలని చూస్తోంది. ఇతర ఆయుధాల సంగతి సరేసరి. ఒకవైపు ఇలా మారణాయుధాల గుట్టలను పెంచుతూనే ఎదుటి దేశాల మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నది.

ఈ పూర్వరంగంలో భవిష్యత్‌లో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే వాటిలో చైనా కూడా చేరాల్సిందేనని అమెరికా పట్టుబడుతున్నది, ససేమిరా కుదరదని బీజింగ్‌ పలుసార్లు స్పష్టం చేసింది. ఒప్పందాల్లేకపోతే జరిగేదేమిటి ? ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కొద్ది నెలల్లోనే రష్యా 60, అమెరికా వందశాతంపైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలు, వాటి స్థితి ఇలా ఉంది.

దేశం× ఆయుధాలు×మోహరింపు×నిల్వలు ×ఉపయోగంలో లేనివి

రష్యా×××× 5,449 ×× 1,710 ×× 2,589 ×× 1,150

అమెరికా×× 5,277 ×× 1,770 ×× 1,930 ×× 1,577

చైనా ×××× 600 ×× 24 ×× 576 ×× 0000

ఫ్రాన్స్‌×××× 290 ×× 280 ×× 10 ×× 0000

యుకె×××× 220 ×× 120 ×× 105 ×× 0000

భారత్‌×××× 180 ×× 0000 ×× 180 ×× 0000

పాక్‌ ×××× 170 ×× 0000 ×× 170 ×× 0000

ఇజ్రాయెల్‌ × 90 ×× 0000 ×× 90 ×× 0000

ఉ.కొరియా × 50 ×× 0000 ×× 50 ×× 0000

రెండవ ప్రపంచ యుద్దం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా జపాన్‌ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది.దాంతో మిగిలిన దేశాలు కూడా వాటిని సమకూర్చుకున్న కారణంగానే దాని దూకుడు తగ్గింది.అయినప్పటికీ దాని దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు ఉండటంతో అనేక దేశాలను ఇతరంగా బెదిరిస్తూనే ఉంది,దాడులు, దురాక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఎర్రగీత దాటితే అణ్వాయుధాలను మోహరిస్తానని ఉక్రెయిన్‌ పోరులో రష్యా హెచ్చరించిన కారణంగానే నాటో దేశాలు అదుపులో ఉన్నాయి.ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద అనేక కట్టుకథలను ప్రచారంలో పెట్టి ఇతర దేశాలను తన వెనుక సమీకరించుకొనేందుకు అమెరికా పూనుకుంది.వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజింగ్‌ తన అణ్వాయుధాలను వెయ్యికి పెంచుకోనుందని, వాటిని మోహరించటానికి ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం దానిలో భాగమే. ప్రతిదేశం మాదిరే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటున్నది.చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి మనదేశాన్ని కూడా ఆయుధ పోటీలోకి పశ్చిమదేశాలు దించుతున్నాయి. అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలకు ఖర్చు చేస్తే పాక్‌ మాదిరి దివాలాదీయటం ఖాయం. ఆయుధాలను అమ్ముకొనేవారు రకరకాల కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తే వేర్వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజంట్లు వాటికి మసాలా దట్టిస్తారు. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మనదేశం రక్షణ బడ్జెట్‌ను పెద్ద మొత్తంలో పెంచిన తీరు చూశాము.

ఆయుధ నియంత్రణ ఒప్పందం లేకపోవటంతో భారత్‌కు ఇబ్బంది వచ్చిందనే కొత్త పల్లవి కొందరు అందుకున్నారు. నిజానికి ఆ ఒప్పందంలో చైనా లేదు, అయినప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఆయుధాలు పెంచుకొనేందుకు పూనుకున్నందున మనం కూడా ఆలోచించాలని చెబుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ కూడా అమ్ములపొదిని విస్తరించుకోవచ్చంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ చైనాతో పోటీపడాలని చెప్పటం సరైందేనా ! మన దేశం నుంచి ముప్పు ఉందనే కారణంతో చైనా తన ఆయుధాలను పెంచుకోవటం లేదు, దాని కేంద్రీకరణ అంతా అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తదితర దేశాల మీదనే. అమెరికాతో అవసరానికి మించి ఆయుధ పోటీకి దిగటం కూడా సోవియట్‌ దెబ్బతినటానికి ఒక కారణంగా కొందరు చెప్పటాన్ని, చైనా, మన ఆర్థిక శక్తిని విస్మరించకూడదు.

వర్తమాన కాలంలో మిలిటరీ శక్తిలో అణ్వాయుధాలు ప్రముఖ పాత్రపోషిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృత్రిమ మేథ(ఎఐ) ఆయుధ పోటీని గణనీయంగా ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైన సెమీకండక్టర్ల రంగంలో అమెరికా-చైనా పోటీపడుతున్నాయి. ఏ రంగంలోనైనా అవి లేకుండా గడిచే స్థితి లేదు.శత్రువుల కదలికలను పసిగట్టటం, స్థావరాలను స్పష్టంగా ఫొటోలు తీయటంలోనూ అవి కీలకంగా మారాయి. చైనా తన సత్తాను చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో సెమీకండక్టర్ల రంగంలో ప్రస్తుతం తూర్పు ఆసియాలోని తైవాన్‌ ప్రాంతం, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రధానంగా ముందుండగా అమెరికా, ఐరోపా దేశాలు కూడా గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సెమికండక్టర్లను చైనాకు అందకుండా అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. విడిగా ఉంటున్న తైవాన్‌ విలీనం 2049 నాటికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించగా అడ్డుకొని తీరతామని, రక్షణగా సిలికాన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేస్తామని, ఒక వేళ బలవంతంగా విలీనం చేసుకుంటే అంతిమంగా అక్కడ ఉన్న సెమికండక్టర్‌ పరిశ్రమలన్నింటినీ పేల్చివేస్తామని కూడా వాషింగ్టన్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు తైవాన్‌ తమదే అని వెనక్కు తగ్గేది లేదని ప్రకటిస్తున్నది, తాను విధించిన గడువు చాలా సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి మిలిటరీ చర్యకు పాల్పడటం లేదు.ప్రస్తుతం అమెరికా వద్ద ఆధునిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ చిప్స్‌ తయారీలో కేవలం 12శాతమే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దాని అవసరాల కోసం ఎక్కువగా తైవాన్‌ మీద ఆధారపడుతున్నది. చైనాలో విలీనాన్ని అడ్డుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.మొత్తం మీద ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌ సగం, ఆధునిక చిప్స్‌లో 90శాతం కలిగి కీలకమైన స్థానంలో ఉంది. పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఈ పాటికి అమెరికా ఆ పని చేసి ఉండేది, అది సాధ్యం కాదని, వాటిలో పనిచేసే నిపుణులు కూడా తైవాన్‌లో గణనీయంగా ఉండటమే అని చెబుతున్నారు.మొత్తం 66శాతం ఉత్పాదక సంస్థలు తూర్పు ఆసియాలో 292 చోట్ల ఉన్నాయి.

మిలిటరీ రంగంలో ఏఐ లేదా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది.ప్రస్తుతం ప్రయోగశాలలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద వాటిని పరీక్షించారు, అయితే అధిక వేడి, శీతల ప్రాంతాల్లో వాటి పనితీరును చూడాల్సి ఉంది.అవసరమైన సంఖ్యలో తయారు చేసే సంస్థల అవసరం కూడా ఒక సమస్యే. జోబైడెన్‌ హయాంలో చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ నివిడియా కంపెనీ మీద ఆంక్షలు విధించారు. అయితే దాన్ని సవాలుగా తీసుకొని భారీ మొత్తాలను కేటాయించిన డ్రాగన్‌ తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఆధునిక రకాల కోసం పరిశోధనలు చేస్తున్నది. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత నిషేధాన్ని సడలించి ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ నివిడియా ఉత్పత్తి హెచ్‌-200రకం చిప్స్‌ తమకు అవసరం లేదని చైనా ప్రకటించినట్లు వార్తలు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించటం తెలిసిందే.ఒకవైపు పన్నుల యుద్ధం మరోవైపు సాంకేతిక రంగంలో అమెరికా దాడిని తట్టుకొనేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయటమే గాక అనేక విజయాలను సాధించి స్వయంసమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నది.చాట్‌జిపిటికి పోటీగా చాలా తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తన అవసరాలకు ప్రపంచ సరఫరా గొలుసు మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నది. ఎప్పుడైనా తైవాన్‌ విలీనం చేసుకుంటానంటూ చేస్తున్న ప్రకటనలతో సెమీకండక్టర్లకు దాని మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు దడపుట్టిస్తున్నది. బహుశా అందుకే తమ దేశంలో ఉత్పత్తి చేసే విధంగా 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను వమ్ము చేసేందుకు కృత్రిమ మేథలో ఇతరుల మీద ఆధారపడకుండా చైనా పూనుకుంది.2025 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా సమావేశం జరిపి కర్తవ్య నిర్దేశం చేసింది. ప్రభుత్వం దేశీయంగా ఉన్న పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్లను స్వయంగా తయారు చేస్తున్నప్పటికీ అమెరికాలోని నివిడియా కంపెనీ మాదిరి ఆధునిక డిజైన్లలో అది ఇంకా వెనుకబడే ఉంది. సాంకేతిక అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నది. ప్రపంచ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా మాదిరి సౌకర్యాలు కల్పిస్తూ 2025 అక్టోబరు నుంచి కె వీసాలను జారీ చేస్తున్నది.అమెరికాలో ఉన్న తన జాతీయులైన వారిని స్వదేశానికి రప్పిస్తున్నది. గతంలో అమెరికా విసిరిన సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు పోయిన చైనా కృత్రిమ మేథలో కూడా విజయం సాధిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు !

యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

వేదాలు నాలుగు, వాటి ప్రాతిపదికన దేశంలో ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలకు నలుగురు జగద్గురువులైన శంకరాచార్యలు ఉన్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గోవర్ధన మఠం రుగ్వేదంతో సంబంధం కలిగినది, నిశ్చలానంద అధిపతి, గుజరాత్‌లోని ద్వారకలో ఉన్నది శారదా పీఠం, సామవేదం ప్రకారం నడుస్తుంది, స్వామి సదానంద సరస్వతి, కర్ణాటక శృంగేరిలో ఉన్న శారదా పీఠం యజుర్వేదాన్ని అనుసరిస్తుంది, స్వామి భారతీ తీర్థ.నాలుగవది ఉత్తరాఖండ్‌లో ఉన్న జ్యోతిర్మ్‌ఠం. ఇది అధర్వణవేదాన్ని పాటిస్తుంది. స్వామి అవిముక్తేశ్వరానంద అధిపతి. ఆయన నియామకాన్ని కొందరు సవాలు చేయటంతో అది సుప్రీం కోర్టుకు చేరింది.ఈ శంకరాచార్యకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్నది. మాఘ మాసం సందర్భంగా జనవరి 18న మౌనీ అమావాస్య రోజున ప్రయాగరాజ్‌లో పల్లకిలో ఊరేగుతూ త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు రాగా కుదరదని అధికార యంత్రాంగం అడ్డుకుంది.రద్దీ ఎక్కువగా ఉందని సాకు చెప్పింది, కావాలంటే అందరి మాదిరి కాలినడకన వెళ్ల వచ్చంటూ అసలు ముందు మీరు శంకరాచార్య అని రుజువు ఏమిటి అని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అండ లేదా ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుందని ఎవరూ నమ్మటం లేదు. మొత్తం మీద ఈ వివాదం కొత్తమలుపు తిరిగింది. మార్చినెల పదవ తేదీలోగా ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని, గోవధను, గొడ్డు మాంసాన్ని నిషేధించాలని లేనట్లయితే పది, పదకొండు తేదీలలో లక్నోలో జరిగే సాధు, సంతుల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ” నకిలీ హిందువు ” గా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద ప్రకటించారు.

తానే జ్యోతిర్మఠ శంకరాచార్యనని, తాను చూపిన రుజువును పదిహేను రోజుల తరువాత కూడా తిరస్కరించలేదంటే ఇంతకంటే వేరే ఆధారం ఏమి కావాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పీఠాధిపతి ప్రశ్నించారు. జనవరి 29న వారణాసిలో నిర్వహించిన పత్రికా గోష్టిలో ముఖ్యమంత్రికి అవిముక్తేశ్వరానంద సవాల్‌ విసిరారు. యోగి ప్రభుత్వం తనను వేధిస్తున్నదని 1966లో కరపత్రి జీ మహారాజ్‌ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నదని అన్నారు.సిఎం సన్నిహితుడు రామభద్రాచార్య తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. ఇరవై నాలుగు గంటల్లో తన ఆచార్యత్వం గురించి రుజువులు చూపాలని అడిగారని, చూపి పదిహేను రోజులు కావస్తున్నా ప్రభుత్వం వాటిని కాదని తిరస్కరించలేదని చెప్పారు. యోగి నిజమైన హిందువో కాదో నిరూపించుకోవాలన్నది ఇప్పుడు ప్రశ ్న అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షమాపణలు చెప్పి రక్షణ కల్పిస్తే ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగరాజ్‌లో మాఘపూర్ణిమ రోజున పవిత్ర స్నానం చేస్తారని అవిముక్తేశ్వరానంద మీడియా ప్రతినిధి శైలేంద్ర యోగిరాజ్‌ చెప్పారు గానీ జరిగినట్లు వార్తలు లేవు. మౌనీ అమావాస్య రోజున తన పరివారంతో స్నానమాచరించటానికి అనుమతి నిరాకరించచటంతో జనవరి 18 నుంచి పది రోజుల పాటు ప్రయాగరాజ్‌లోని తన శిబిరంలోనే నిరసన దీక్ష చేసి 28వ తేదీన వెళ్లిపోయారు. తన అంతరాత్మ సంతృప్తికోసం సంగమంలో స్నానమాచరించాలని తలపెట్టానని అనుమతించకపోవటంతో ఎంతో కలచివేతకు గురయ్యానని, స్నానమాచరించకుండానే బరువైన హృదయంతో వెళ్లిపోతున్నట్లు శంకరాచార్యచెప్పారు. తానిలాంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించలేదన్నారు. స్వామి అనుచరులు బారికేడ్‌ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపించారు.శంకరాచార్య ఎవరనేది సుప్రీం కోర్టులో వివాదం ఉన్నందున మీరు శంకరాచార్య అని ఎలా చెప్పుకుంటారంటూ అధికార యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

శంకరాచార్య పట్ల అనుసరించిన వైఖరి దురహంకారానికి నిదర్శనం, తీవ్ర అరిష్టదాయకమని సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ వర్ణించారు.యోగి ప్రభుత్వ చర్యతో ప్రపంచంలోని సనాతనులందరూ బాధపడ్డారని, అధికారం బిజెపిని గుడ్డిదానిగా మార్చిందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచింది.తప్పిదాన్ని సరిచేసుకొనేందుకు మాఘపూర్ణిమ రోజున లాంఛనాలతో స్నానమాచరించేందుకు అధికారులు చూస్తున్నారని అవిముక్తేశ్వరానంద చెప్పగా అలాంటిదేమీ లేదని అధికారవర్గాలు చెప్పాయి.తనకు క్షమాపణ చెప్పాలని, రానున్న రోజుల్లో నలుగురు శంకరాచార్యలకు ప్రామాణిక లాంఛనాలతో పవిత్ర స్నానాలు ఆచరించే విధంగా నిబంధనలు రూపొందించాలని స్వామి డిమాండ్‌ చేశారు. జనవరి 18 ఉదంతంపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. ప్రయాగరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, మేలా అధికారిపై కేసులు దాఖలు చేయాలని కూడా దానిలో కోరారు. యోగి ఆదిత్యనాధ్‌పై అవిముక్తేశ్వరానంద చేసిన ఆరోపణలతో మనోభావాలు దెబ్బతిన్న కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర జిఎస్‌టి ఆయోధ్య ఉపకమిషనర్‌ ప్రశాంత కుమార్‌ సింగ్‌ ప్రకటించారు.రాజీనామాను నేరుగా గవర్నర్‌కు పంపారు, అయితే దాన్ని ఆమోదించిందీ లేనిదీ తెలియదు..

జ్యోతిర్మఠ్‌ పీఠం శంకరాచార్య గురించి గత ఎనిమిది దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయి.అవిముక్తేశ్వరానంద 2022 నుంచి శంకరాచార్యగా గుర్తింపు పొందారు. అయితే అప్పటి నుంచీ వివాదం ప్రారంభమైంది. ఎక్కడా లేని విధంగా స్వామి రామకృష్ణ తీర్ధ మరణించిన తరువాత గత 168 సంవత్సరాల నుంచి ఈ పీఠానికి గుర్తింపు పొందిన శంకరాచార్యల గురించి వివాదాలు నడుస్తున్నాయి. అనేక మంది తమను పీఠాధిపతులుగా ప్రకటించుకొని కొనసాగారు.స్వాతంత్య్రానికి ముందు 1941లో మిగిలిన ముగ్గురు శంకరాచార్యలు ఉత్తరాఖండ్‌ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని స్వామి బ్రహ్మానంద సరస్వతిని కోరారు. ఆయన 1953 మే 20వ తేదీన మరణించినప్పటి నుంచి వారసత్వం గురించి ఇప్పటి వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.బ్రహ్మానంద శిష్యుడు హరిహరానంద పీఠాన్ని అలంకరించేందుకు నిరాకరించారు. వారసుడిగా శాంతానంద సరస్వతి అని బ్రహ్మానంద విల్లు రాసినట్లుగా చెప్పటమే దీనికి కారణం. విల్లు చట్టబద్దతను ఇతర శంకరాచార్యలు ప్రశ్నించారు. ఆది శంకరుడు మహాత్మన్యాయ మహానుశాసనం ప్రకారం విల్లుద్వారా వారసుల నియామకం చెల్లదని వారు పేర్కొన్నారు. తరువాత కూడా వివాదాలు కొనసాగాయి. 1973లో స్వామి కృష్ణబోధ్‌ మరణంతో స్వామి స్వరూపానంద నియామకం జరిగింది. తరువాత వాసుదేవానంద సరస్వతిని కూడా శంకరాచార్యగా గుర్తించటంతో ఒకేసమయంలో ఇద్దరు శంకరాచార్యలు తయారయ్యారు. ఇది కోర్టుకెక్కటంతో 2017లో వీరిద్దరినీ గుర్తించేందుకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. స్వామి స్వరూపానంద 2022 సెప్టెంబరు 11న మరణించారు. ఆ మరుసటి రోజే తానే నూతన శంకరాచార్య అని స్వామి అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. అయితే అక్టోబరు 16నఆచారం ప్రకారం నిర్ణయించిన పీఠాధిపత్య స్వీకార కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే కోర్టు ఉత్తరువులో పలు చోట్ల అవిముక్తేశ్వరానందను శంకరాచార్యగా ప్రస్తావించటం సమస్యను ఝటిలం చేసింది.కోర్టు అలా పేర్కొన్నది కనుక తానే ఆ స్థానంలో ఉన్నట్లు అప్పటి నుంచి అవిముక్తేశ్వరానంద చెబుతున్నారు.పీఠంలో కొనసాగుతున్నారు. సాంప్రదాయాలు, చట్టపరమైన అంశాల గురించి కోర్టు ఇంతవరకు తేల్చలేదు. దీనికి తోడు రాజకీయనేతలు కూడా వేలుబెట్టటం మరింతగా వివాదాన్ని పెంచింది. ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌ అధికార యంత్రాంగం మీరు శంకరాచార్యులనేందుకు ఆధారాలేమిటని ప్రశ్నించింది, పల్లకిలో ఊరేగుతూ స్నానానికి వెళ్లటాన్ని అడ్డుకుంది.

పదిరోజుల పాటు జరిపిన ధర్నా సమయంలో మాటల తూటాలు పేలాయి. యోగి ఆదిత్యనాథ్‌ను హిందువుగా పిలవాల్సిన అవసరం లేదని, అతన్ని తాను అక్బర్‌, ఔరంగజేబ్‌ అంటానని, సదరు వ్యక్తి దేవాలయాల కూల్చివేతకు మద్దతు పలికాడని అవిముక్తిశ్వేరానంద ధ్వజమెత్తారు. ధర్మం పేరుతో కొందరు వ్యక్తులు బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పేరు పెట్టకుండా యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు.ఇలాంటి వారి పట్ల సనాతన ధర్మాన్ని నమ్మేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. హర్యానాలో ఒక మతపరమైన క్రతువులో మాట్లాడుతూ ఒక యోగి అంటే అన్నింటినీ త్యజించిన వాడు, ఒక స్వామి అంటే ధర్మం, జాతికంటే గొప్పవ్యక్తి కాదు. అతనికేమీ వ్యక్తిగత ఆస్థి ఉండదు,అనేక మంది కాలనేమి వంటి వారు ఉన్నారు.(రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవినీ మూలిక తెచ్చేందుకు హిమాలయాలకు ఎగిరి వెళుతున్న సమయంలో కాలనేమి అనే రాక్షసుడు మునివేషంలో వచ్చి తప్పుదారి పట్టించేందుకు చూస్తాడు) స్వాముల పేరుతో ఉండేవారు ధర్మం ముసుగు వేసుకుంటారు.వారు సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే యోగి మాట్లాడిన కొద్ది గంటల తరువాత అవిముక్తేశ్వరానందకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ముందుకు వచ్చారు. భగవాన్‌ శంకరాచార్య లేదా గౌరవనీయమైన స్వాములు, ఆచార్యలు ఎవరి పట్లా కూడా అగౌవరవాన్ని ప్రదర్శించకూడదని, అలాంటి ఉదంతాలు జరిగినట్లు వెల్లడైతే విచారణ జరుపుతామని, తప్పుచేసిన వారి మీద చర్య తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. శంకరాచార్యకు పాదాభివందనం చేస్తాం, పవిత్ర స్నానం ఆచరించాలని కోరతాం. వివాదం దాంతో సమసి పోవాలి. ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు.శంకరాచార్యను అవమానించటం అంటే సనాతన ధర్మాన్ని అవమానించటమే అని బిజెపి నేత సునీల్‌ భలారా విమర్శించారు. ప్రయాగరాజ్‌ అధికారులు దయ్యాల మాదిరి అవమానించారని, శంకరాచార్య శిష్యుల శిఖలు పట్టుకొని లాగారని అన్నారు.బిజెపి నేతల ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ఆ పార్టీలో ఉన్న గందరగోళంతో పాటు విబేధాలు కూడా వెల్లడయ్యాయి. వ్యక్తులుగా అభిప్రాయాలు వెల్లడించటం మినహా పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది. అనేక మంది సంత్‌లు, ఆలిండియా అఖారాపరిషత్‌ కూడా అవిముక్తేశ్వరానందకు మద్దతు పలికింది.యోగి-శంకరాచార్య మధ్య వివాదం కొత్తగా తలెత్తింది కాదు,పరోక్షంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నది,అవిముక్తేశ్వరానంద బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందగా యోగి ఠాకూర్‌.గతేడాది కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, మరణాల గురించి యోగి అబద్దాలు చెప్పినందున రాజీనామా చేయాలని గతేడాది జనవరిలోనే అవిముక్తేశ్వరానంద డిమాండ్‌ చేశారు.నలభై రోజుల్లో ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని,గొడ్డు మాంస ఎగుమతుల నిషేధం చేయకపోతే యోగిని నకిలీ హిందువుగా ప్రకటిస్తామని శంకరాచార్య చేసిన ప్రకటన ఏమౌతుందో ఆసక్తి కలిగిస్తోంది !