Tags
Actor Vijay, BJP, DMK, Nainar Nagendran, Narendra Modi Failures, Tamilnadu Elections 2026, Tamilnadu politics, Thrisha, TVK
ఎం కోటేశ్వరరావు
తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నట్లు కలలు కంటున్న సినీహీరో విజై ఒంటరిగా బరిలో దిగుతారా లేక ఏ పార్టీతో అయినా జతకడతారా ? తన ఆధిపత్యాన్ని అంగీకరించటం తప్ప సిద్దాంత రాద్దాంతాలేమీ లేవనే సందేశం పంపుతున్న తమిళ వెట్రి కజగమ్(టివికె) నేతను ఎవరైనా భరించగలరా ? డిఎంకె నాయకత్వంలోని కూటమిలో తాము కొనసాగాలంటే అధికారంలో కూడా భాగం పంచాలని కోరుతున్న కాంగ్రెస్ ఎత్తుగడ ఏమిటి ? ఇలా ఎన్నో సశేషాలుగా ఉన్న విశేషాలు అక్కడ జరుగుతున్నాయి. విలువలు, వలువలు, సంస్కారం అంటూ కబుర్లు చెప్పే బిజెపి కుదురులోని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ నోరుపారవేసుకొని అభాసుపాలయ్యారు. భారతీయ సంస్కృతికి తామే ప్రతీకలమని చెప్పుకొనే వారు ఎంత అసహ్యంగా మాట్లాడుతారో ఈ ఉదంతం వెల్లడించింది.గతంలో అనేక మంది సినీనటులు పార్టీలను పెట్టినపుడు,రాజకీయాల్లోకి వచ్చినపుడు వారి అనుభవం గురించి ఇతరులు విమర్శలు చేశారు. అయితే అనుభవం ఉన్న వారు మాత్రం వెలగబెడుతున్నదేమిటి అన్న అంశం ఉన్నప్పటికీ నటీనటులపై ఒక మేరకు విమర్శను అర్ధం చేసుకోవచ్చు గానీ చౌకబారు మాటలు తగవు.
విజైకు అనుభవం లేదంటూనే ముందుగా హీరోయిన్ త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని బిజెపినేత చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినప్పటికీ తీవ్ర అభ్యంతరకరం. మాజీ ప్రధాని వాజ్పాయి దశాబ్దాల పాటు ఒకనాడు తాను ప్రేమించిన రాజకుమారి కౌల్కు వేరే వ్యక్తితో వివాహమైన తరువాత తాను కూడా దంపతుల ఇంట్లో జీవించారు.ఆమెకు పుట్టిన కుమార్తె గురించి నిరూపితం కాని వార్తలు వచ్చినా ఎన్నడూ ఏ రాజకీయ నేత, పార్టీ కూడా వారి బంధం గురించి బహిరంగంగా రచ్చ చేయలేదు. త్రిషతో స్నేహం కారణంగా విజై భార్య విదేశాల్లో ఒంటరిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఏమైనప్పటికీ అది వారి వ్యక్తిగత వ్యవహారం. అనేక మంది ఇష్టపూర్వకంగా సహజీవనం చేయటం ఈ రోజుల్లో అందునా సినిమా రంగంలో సర్వసాధారణంగా జరుగుతోంది. రాజకీయ రంగంలో కూడా ప్రారంభమైంది. విజరు రాజకీయ నేతగా మారిన కారణంగానే నాగేంద్రన్ మాటలు సంచలనం కలిగించాయి. బహుశా బిజెపి అగ్రనాయకత్వం కూడా చివాట్లు పెట్టిన కారణంగా ఆ పెద్దమనిషి తన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేయటం తప్పే, ఎవరైనా వాటితో గాయపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను.మా పార్టీ అఖిల భారత మహిళా విభాగం అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్, అన్నామలై ఈ అంశం గురించి నాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆరోజు దాన్నుంచి వైదొలిగి మాట్లాడాను అని నాగేంద్రన్ పేర్కొన్నారు. నాగేంద్రన్ వ్యాఖ్యలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రస్తావన లేకుండా త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన చేయించారు. వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని, రాజకీయాల్లో తాను తటస్థంగా ఉన్నానని,రానున్న రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదని ఆమె పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అంతగా దిగజారి మాట్లాడతారని ఎన్నడూ ఊహించలేదన్నారు.తనకు సంబంధం లేని అంశాల్లో తన పేరును లాగవద్దని కోరారు. సంచలనం కలిగించిన ఈ ఉదంతం గురించి విజై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చారు. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడలేదు. ఒక వేళ ఏ పరిస్థితిలోనైనా బిజెపితో జట్టుకట్టాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఈ వైఖరి తీసుకున్నారా లేక మరింత రచ్చ అవుతుందని భావించారో తెలియదు.
అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా రానున్న రోజుల్లో బిజెపి పట్ల విజై వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తింది.కరూరులో జరిగిన తొక్కిసలాట మరణాల ఉదంతం తరువాత బిజెపి గురించి ఇంతవరకు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓడించాల్సింది డిఎంకెను గనుక దాని వరకే పరిమితం అవుదాం అని తప్పించుకున్నారు.గతేడాది కేంద్ర బడ్జెట్ మీద విమర్శలు చేసిన విజై ఈసారి మౌనం పాటించారు.కరూరు కేసు, తన వ్యాపారలావాదేవీలు, కేంద్ర సంస్థలను చూసి భయపడే ఈ వైఖరి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రెండు కూటములనూ వ్యతిరేకిస్తానంటూ ప్రకటించినా తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు. డిఎంకె కూటమి, అన్నాడిఎంకె-బిజెపి, టివికే, సీమన్ అనే మాజీ నటుడు, దర్శకుడు ఏర్పాటు చేసిన నామ్ తమిళ్ కచ్చి(ఎన్టికె) కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు, అయితే ఎన్టికే ప్రభావం పరిమితమే. తమిళనాడు రాజకీయాలు డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య కేంద్రీకృతమయ్యాయి. గతంలో పార్టీ పెడతానంటూ లీకులు వదిలిన రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయారు.మరో ప్రముఖ నటుడు కమల్ హసన్ పార్టీ పెట్టి విఫలమయ్యారు. వారిద్దరి తరువాత ప్రేక్షకాదరణ ఉన్న విజరు పరిస్థితి చెప్పలేము. స్టార్ హీరోల సభలకు జనం రావటం, ఈలలు, కేకలు వేయటం వేరు, ఓట్లు పడటం మరొకటి. కెప్టెన్ విజయకాంత్ కూడా పేరున్న నటుడే అయినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
తమ పార్టీ మాత్రమే డిఎంకెను సవాలు చేయగలదని టివికె నేత విజై ప్రతి సభలోనూ చెబుతున్నారు. దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ స్పందన ఏమిటని ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.” ఇంటి మీదకు కూడా ఎక్కలేని వారు స్వర్గానికి ఎగురుతామని కలలు కంటున్నారు. అతనికి ఏమాత్రం అనుభవం లేదు. ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి, తరువాత ఏదైనా జరుగుతుంది” అంటూ నవ్వారు. ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీలో లేరు గానీ 30శాతం ఓట్లు తనకు ఉన్నాయని విజరు ఎలా చెప్పుకుంటారు. ముందు విజై తన కుటుంబంతో సంబంధాలను నిర్వహించుకోవాలి, గొప్పనేతలు చెప్పిన అంశాలను సక్రమంగా జనాలకు చెప్పాలి, ముందు వీటన్నింటి నుంచి బయటపడాలి అన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారటంతో వాటిని వెనక్కు తీసుకుంటారా అని అడగ్గా చెప్పినదానికి కట్టుబడి ఉంటాను అన్నారు. తరువాత విధిలేక క్షమాపణ చెప్పారు. టివికె సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల కుమార్ మాట్లాడుతూ గతంలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని,వచ్చే ఎన్నికల్లో ఇంకా దిగజారతాయని అన్నారు.కొంత మంది బిజెపి నేతలు డిఎంకె తొత్తులుగా ఉన్నారన్నారు. బిజెపి ఎంఎల్ఏ, మహిళా నాయకురాలు వనాతి శ్రీనివాసన్ మాట్లాడుతూ నాగేంద్రన్ ఎంతో మృదువుగా మాట్లాడే మనిషని, అలాంటి వ్యాఖ్యలు చేయటం విచారకరమంటూ తన అసంతృప్తిని తెలియచేస్తానని చెప్పారు. డిఎంకె, కాంగ్రెస్ నేతలు మహిళానేతలను వేధిస్తారని ఆరోపించారు.
ఈ ఉదంతం జరగ్గానే డిఎంకె నేతలు బిజెపి అధ్యక్షుడిపై ధ్వజమెత్తారు. పార్టీ ప్రతినిధి టికెఎస్ ఇలాంగోవన్ స్పందిస్తూ మహిళలను కించపరచటంలో బిజెపి నేతల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.” వారు మనుధర్మాన్ని అనుసరిస్తారు, అది మహిళలకు ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు, సహజంగానే అతను అలా మాట్లాడతారు. అందుకే తమిళనాడు జనాలు బిజెపికి వ్యతిరేకంగా, వారు మహిళలను అవమానిస్తారు, ఆ విషయంలో వారు పేరుమోశారు, నాగేంద్రన్ ఆర్ఎస్ఎస్కు బానిసగా మారారు, అందుకే అతను అలా మాట్లాడారు ” అన్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగరు కూడా విమర్శించారు. త్రిష గురించి అలా మాట్లాడటం దిగ్భ్రాంతికి గురిచేసింది.దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, అది చేయకుండా అతను వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు.రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగవు అన్నారు. తమ నేత సదుద్ధేశ్యంతో చేసిన వ్యాఖ్యలను డిఎంకె వక్రీకరించిందంటూ బిజెపి నేతలు నాగేంద్రన్కు మద్దతుగా మాట్లాడారు. ఆ పార్టీ నాయకురాలు విజయధరణి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరినపుడు డిఎంకె తన గురించి చెడు వ్యాఖ్యలు చేసిందని, వారెప్పుడూ మహిళల పట్ల అలాగే మాట్లాడతారని ఆరోపించారు.తమ నేత చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. నాగేంద్రన్ చౌకబారు మాటలపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరోవైపు హీరో విజైను ఎలా సమర్ధించాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బందికరంగా పరిణమించింది. విజై-త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి పలు కథనాలు ఈ వివాదానికి ముందే ఉన్నాయి. అయితే బజారుకు ఎక్కలేదు గనుక సమస్య రాలేదు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలను బిజెపి నేత ఒక కుదుపుకుదిపారు. రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం !
