• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

31 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CEPR, China, Donald trump, Economic Sanctions, imperialism, Joe Biden, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు ఎలా దారికి రారో చూద్దాం అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ” ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు ” అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.మానవహక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలుదువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికిలోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.


ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్దమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగుశాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆప్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవహక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.


ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల వత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి. డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది.భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1లక్షల కోట్ల నష్టం జరిగింది.


ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది.2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020నాటికి దేశ దిగుమతులు 91శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.


అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని.అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దెదింపాలని అమెరికా చూసింది.వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది.వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.


ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు.రష్యా ఐటి,ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42,ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి.ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి.హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్నకారణం కావచ్చు ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి.వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా ఉంది.
దేశం ×× మొత్తం ××2022, ఫిబ్రవరి×× 2022 ఫిబ్రవరి తరువాత
రష్యా ×× 14,081 ××× 2,754 ××× 11,327
ఇరాన్‌ ×× 4,191 ××× 3,616 ××× 575
సిరియా ×× 2,644 ××× 2,598 ××× 46
ఉ.కొరియా ×× 2,133 ××× 2,052 ××× 81
బెలారస్‌ ×× 1,154 ××× 788 ××× 366
వెనెజులా ×× 651 ××× ××××× ××× ×××


చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్గుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది.వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది.2023తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది.తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వుబాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వుబాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.


.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !

24 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

China-Central Asia Summit 2023, G7 summit, Hiroshima, Joe Biden, Narendra Modi, The Group of Seven (G7) 2023, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ఏ పదజాలం వెనుక ఏమి దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ మాటలు పరమ సత్యాలు. అలాగే ఏ సమావేశం ఎందుకు జరిగిందో అని కూడా మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే సారి ఆసియాలో రెండు ముఖ్య సమావేశాలు జరిగాయి. ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ శాంతి, అభివృద్ధికి ముప్పు తెస్తున్న అమెరికా నేతృత్వంలోని జి 7 సమావేశం 19-21 తేదీలలో జపాన్‌లోని హీరోషిమాలో జరిగింది. రెండవది చైనాలోని షియాన్‌ నగరంలో మే 18-19 తేదీలలో మధ్య ఆసియా దేశాల సదస్సు. మొదటిది రాజకీయాల చుట్టూ నడిస్తే రెండవది అభివృద్ధి కేంద్రంగా జరిగింది. చైనాతో విడగొట్టుకోకుండానే నష్టాలను పరిమితం చేసుకోవాలని ఈనెల జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశం పిలుపునిచ్చింది. తన పాటకు అనుగుణంగా నృత్యం చేయించాలని ఈ బృందంతో సహా ప్రపంచదేశాలన్నింటి మీద అమెరికా వత్తిడి తెస్తున్నప్పటికీ దానికి కొన్ని దేశాలు సిద్దంగా లేవన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా ఉన్న సందేశం. అయితే పదజాలం దానికి చెప్పే భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమావేశం జరిగిన తీరు, ఆమోదించిన ప్రకటన చూస్తే చైనా చుట్టూ తిప్పి దాన్ని ఎలా దెబ్బతీయాలన్న దాని మీదే కేంద్రీకరించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి.


అమెరికా కోరుతున్నట్లుగా చైనాతో విడగొట్టుకొనేందుకు జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాలు సిద్దంగా లేవు. ఈ కారణంగానే ఆర్థిక అంశాల్లో బస్తీమే సవాల్‌ అంటూ చైనా మీద తొడగొట్టకుండా అటు అమెరికాను, ఇటు ఇతర దేశాలను సంతుష్టీకరించే విధంగా ఈ పిలుపు ఉంది. ఆర్థికంగా చైనా ఇతర దేశాలను బలాత్కారం చేస్తోందన్న ఆరోపణలను ఇటీవలి కాలంలో అనేక దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.హిరోషిమా సమావేశాలు కూడా దాని చుట్టూ తిరిగాయి గానీ బహిరంగంగా వేలెత్తి చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చైనా నుంచి చేసుకొనే దిగుమతులను తగ్గించుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.చైనా నుంచి విడగొట్టుకోవటం ఇప్పటల్లో జరిగేది కాదని తెలుసు గనుకనే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చూస్తుంది తప్ప చైనా ఆర్థిక ప్రగతి, అభివృద్ధిని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకొనేందుకు చూశాయి. దశాబ్దాల తరబడి పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎంతో అవసరం. గత సంవత్సరం జపాన్‌ చైనాకు 189 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు, 145బి.డాలర్ల దిగుమతులు చేసుకుంది. నష్టాలను తగ్గించుకోవటం అంటే అవసరమైన వస్తువుల కోసం ఒక దేశం మీద ఆధారపడకుండా చూసుకోవాలన్నది అమెరికా వైఖరి అని జో బైడెన్‌ చెప్పాడు. చైనాలో పెట్టుబడులతో ముప్పు కూడా ఉంటుందని తెలిసినప్పటికీ తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ చెప్పాడు.


చైనాతో సంబంధాలను విడగొట్టుకోవాలని జి 7 కోరుకోవటం లేదు, ఎందుకంటే అది ఎంతో కష్టం,ఇబ్బందులను కూడా తెస్తుంది, సాధ్యం కూడా కాదు అని కునీహికో మియాకే అనే విశ్లేషకుడు చెప్పాడు. అందుకే సమావేశ ప్రకటనలో విడగొట్టుకోవటం అనే పదం బదులు ముప్పు తగ్గించుకోవటం అని చెప్పారని అన్నాడు. జి 7 సమావేశం చైనా వ్యతిరేక (వర్క్‌షాప్‌) కసరత్తు అని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వర్ణించింది.2021 నుంచి జి 7 సమావేశాల ప్రకటనలు క్రమంగా ట్రాఫిక్‌ సిగల్‌ మాదిరి మారుతూ చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఆ బృందం పూర్తి పేరు ఏడు పారిశ్రామిక శక్తి దేశాల బృందం అనీ, ఆర్థికంగా చేసేదేమీ లేక ఇప్పుడది ఒక చిన్న వర్క్‌షాప్‌గా పని చేస్తూ చైనా వ్యతిరేక నకిలీ ఉత్పత్తుల సామూహిక ఉత్పత్తి మీద కేంద్రీకరిస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ ఎద్దేవా చేసింది. తాజా ప్రకటనలో తైవాన్‌,తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, షింజియాంగ్‌, చైనా అణుశక్తి అంటూ ఇరవైసార్లు చైనా పేరును పలవరించినట్లు పేర్కొన్నది. దీనికి తోడు చైనా ఆర్థిక బలత్కారాన్ని కూడా చేర్చినట్లు పేర్కొన్నది. శిబిరాల మధ ఘర్షణలను కోరుతూ ఈ బృందం ప్రపంచ శాంతి, అభివృద్ధికి అతి పెద్ద ముప్పులలో ఒకటిగా మారినట్లు స్పష్టం చేసింది.


ఆర్థిక అంశాలకు సంబంధించి సమావేశ ప్రకటనలో మాటల గారడీ చేసినా రాజకీయాలకు వస్తే చైనా మీద దూకుడుగానే ఉన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ ఆర్థిక నియమావళిని తిరిగి రాసేందుకు పూనుకుందని ఆరోపించాయి. సిడ్నీలో జరగాల్సిన చతుష్టయ(క్వాడ్‌) సమావేశాలు రద్దు కావటంతో పరువు దక్కించుకొనేందుకు హిరోషిమాకు వచ్చిన అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్‌, భారతదేశ నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీని ఆహ్వానించి జి7 సభ్యదేశాలన్నీ అతని వెనుక నిలిచాయి.సాయాన్ని పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలను చూసినపుడు ఈ సమావేశం చైనా, రష్యాల మీద కేంద్రీకరించినట్లు చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనలు చేస్తుండగానే దీర్ఘకాలంగా పోరు సాగుతున్న బఖుమత్‌ పట్టణాన్ని రష్యా తన అదుపులోకి తెచ్చుకొని ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల పప్పులు ఉడకవనే సందేశాన్ని పంపింది. గత సమావేశాలు లేదా ఇతర శిఖరాగ్ర సమావేశాలకు భిన్నంగా హిరోషిమా సభ ఒక రోజు ముందుగానే సమావేశ ప్రకటనను విడుదల చేసింది. మీడియాలో జెలెనెస్కీకి ప్రాధాన్యత ఇచ్చి ఈప్రకటనను పక్కన పడవేస్తారన్న కారణంగా ముందుగానే విడుదల చేసినట్లు కొందరు చెప్పారు. నిజానికి గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్లుగా సమావేశం చేసే ప్రకటనలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద కేంద్రీకరించటం తప్ప కొత్తగా చెప్పేదేమీ ఉండదని ముందుగా ఊహించిందే. దానికోసం ప్రకటన దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు.చైనా మీద వత్తిడి స్వరాన్ని పెంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, సహకరించుకోవటం లక్ష్యంగా ఏర్పడిన జి7 ఇటీవలి కాలంలో దాని కంటే ప్రపంచ రాజకీయాల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ కూటమిలోని దేశాలు నాడు ప్రపంచ జీడిపిలో 70శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాని విలువ నలభైశాతానికి అటూ ఇటూగా ఉంది.


అసలు జి 7 ఎలా ఉనికిలోకి వచ్చిందీ క్లుప్తంగా చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం.అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1998లో రష్యా చేరి జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలపుడు ఎవరు దేశాల అధిపతిగా ఉంటే వారు ప్రతినిధిగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు.తమ దేశంలో జరిగే సమావేశాలకు ఇతర దేశాలను ఆహ్వానించే స్వేచ్చ ఆ దేశానికి ఉంటుంది. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. శిఖరాగ్ర సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. మన దేశం ఆహ్వానం అందుకోవటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్న తొమ్మిది దేశాలలో మనది కూడా ఒకటి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలా పాల్గన్నదేశాల అధినేతలు విడి విడిగా ఇతర దేశాల నేతలను కలుసుకోవటం, వేదిక మీద ధర్మోపన్యాసాలు చేయటం తప్ప బృంద నిర్ణయాలతో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఈ ఏడాది అతిధులుగా ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కామెరూస్‌,కూక్‌ ఐలాండ్స్‌, భారత్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం అధినేతలను ఆహ్వానించారు. పసిఫిక్‌ సముద్రంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదిహేను దీవుల సముదాయం 15,040 మంది జనాభా ఉన్న ఈ దేశ అధినేతకు ప్రపంచంలో పెద్దదైన భారత అధినేతల మర్యాదలు ఒకే విధంగా ఉంటాయి. పసిఫిక్‌ దీవుల్లో ఉన్న చిన్న దేశాలకు ఏర్పడిన ప్రాధాన్యాత కారణంగానే కూక్‌ ఐలాండ్స్‌కు ఆహ్వానం పలికారన్నది స్పష్టం.


ఒక దశలో ట్రంప్‌ ఏలుబడిలో తిరిగి రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.తరువాత అది ముందుకు పోలేదు. దాని వలన చేరే దేశాలకు జరిగే మేలేమీ కనిపించకపోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.అన్నింటికీ మించి అమెరికా అజెండాను ముందుకు తీసుకువెళ్లే ఒక వాహనంగా అది మారింది. ధనిక దేశాల బృందం తన పూర్వపు ఆర్థిక శక్తిని తిరిగి తెచ్చుకొనేందుకు చూపుతున్న శ్రద్ద కంటే ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నారంటే దాని అర్ధం ఈ బృందం అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు తోడ్పడటం తప్ప వేరు కాదు. చైనా ఆర్థిక బలాత్కారం అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా అలాంటి పనిచేసిన, ఇప్పటికీ చేస్తున్నది వాటి మీద పెత్తనం చేస్తున్న ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. తమకు లంగని లేదా రాజకీయంగా వ్యతిరేకించే దేశాల మీద ఆర్థిక, వాణిజ్య అంశాలను ఆయుధాలుగా మారుస్తున్నది పశ్చిమ దేశాలు. లడఖ్‌ సరిహద్దు వివాదం తరువాత మన దేశంలోని సంఘపరివార్‌, ఇతర చైనా వ్యతిరేక శక్తులు చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చేసిన హడావుడి గురించి తెలిసిందే. ఊహలు, వాంఛలను బట్టి ప్రపంచం నడవదు. నరేంద్రమోడీ సర్కార్‌ గత రికార్డులను బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మరోవైపు చైనా నుంచి విడగొట్టుకోవాలన్నదేశాలతో యుగళగీతం ఆలపిస్తున్నారు.


షియాన్‌ నగరంలో చైనా, ఆరు మధ్య ఆసియా దేశాల సదస్సు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ది అజండాతో జరిగింది. పలు ఒప్పందాలను చేసుకున్నారు.అమెరికా, ఐరోపా, మన దేశంతో చైనా జరుపుతున్న వాణిజ్యలావాదేవీల మాదిరే ఈ దేశాలతో కూడా జరుపుతున్నది. పరస్పర అంగీకారంతో పెట్టుబడులు పెడుతున్నది.కొందరు విశ్లేషకులు ఈ సమావేశాన్ని తన పలుకుబడిని పెంచుకొనేందుకు చైనా చేసిన కసరత్తుగా ఆరోపించుతున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట అమెరికా అభివృద్ది పేరుతో పాగా వేసేందుకు, రక్షణ పేరుతో తన విష కౌగిలిలో బంధించేందుకు చూస్తున్నది తెలిసిందే. అలాంటిది చైనా తన పొరుగున ఉన్నదేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడితే దాన్ని విస్తరణ కాంక్షగా వర్ణించటం అర్ధం లేదు. మన దేశం పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లకు చేస్తున్న సాయాన్ని విస్తరణ కాంక్షలో భాగంగా చేస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెరుగుతున్న చైనా పలుకుబడి – తగ్గుతున్న అమెరికా పెత్తనం !

11 Thursday May 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, emmanuel macron, Joe Biden, NATO, Sudan’s army, Sudanese Communist party, The Rise of China, U.S. Hegemony


ఎం కోటేశ్వరరావు


ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. గురువారం నాటికి 27రోజులుగా ఘర్షణ సాగుతోంది. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్‌ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్‌ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించుకోవాలి అన్న ఆఫ్రికా యూనియన్‌ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.


ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్‌ ఒకటి. బ్రిటీష్‌ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటీష్‌ ఏలుబడిలో ఉన్నపుడు దక్షిణ, ఉత్తర సూడాన్‌ ప్రాంతాలుగా ఉంది. బ్రిటీష్‌ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్‌ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.


సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్‌ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు ప్రారంభమైనట్లు వార్తలు. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు.చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు.రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్‌ బుర్హాన్‌ చెప్పాడు.ఆర్‌ఎస్‌ఎఫ్‌ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేందుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.


చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్‌ పరిణామాలను గమనించినపుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్‌ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్ధకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే.అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్ధం అమెరికా కథ ముగిసినట్లు కాదు.


రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు.తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80 దేశాలలో 800 మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.అట్లాంటిక్‌ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్‌ – హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్‌ గల్ఫ్‌Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్‌ , వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960,70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్‌ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్తాన్‌, లావోస్‌, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పధకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.


ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది.సోవియట్‌ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు, ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదౌతున్నది.అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్‌ దేశాల మధ్య షియా-సున్నీ విబేధాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్‌-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.


నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇటీవలి బీజింగ్‌ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్‌ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్‌ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్‌ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది.డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినపుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నపుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.


” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ సూడాన్‌ పరిణామాలపై చెప్పారు.ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆందోళనకరంగా ప్రపంచ మిలిటరీ ఖర్చు !

26 Wednesday Apr 2023

Posted by raomk in Africa, Asia, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2022 global military expenditure, Arms race, Arms Trade, China, Cold War, Joe Biden, NATO, US cold war with China, World military expenditure


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో చూసినపుడు చైనా లేదా మరొక ఏ దేశమైనా యావత్‌ మానవాళికే ముప్పు తెచ్చే ఆయుధాలతో ఆమెరికా, దాని మిత్ర దేశాలు భూమి, ఆకాశాలను నింపుతున్నపుడు ఎవరైనా వాటిని ఎదుర్కొనేందుకు పూనుకోక తప్పదు. స్టార్‌వార్స్‌ పేరుతో గగనతలంలో అమెరికా రూపొందిస్తున్న అస్త్ర, శస్త్రాల గురించి దశాబ్దాల తరబడి జరుపుతున్న ప్రచారం అదెలా ఉంటుందో చూపుతున్న సినిమాలు, వాస్తవాల గురించి అందరికీ తెలిసిందే.అందువలన దానికి పోటీగా ఏ దేశం ఏం చేస్తున్నదనే వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ ఏదో ఒకటి చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబీలతో స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు తమ ప్రభుత్వానికి సిఐఏ నివేదించినట్లు ఇటీవల బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది. చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక జరిపిన సమీక్షలో పేర్కొన్నారు.చైనా కొత్త ఆయుధాలను రూపొందించటం ఇదే కొత్త కాదంటూ కొందరు విశ్లేషకులు గుండెలుబాదుకుంటున్నారు. వారికి అమెరికా, ఇతర దేశాలు ఏం చేస్తున్నదీ కనపడవా ? చూడదలచుకోలేదా ?


కంటికి కనిపించని సైబర్‌దాడులు అంటే కంప్యూటర్లతో పని చేసే మిలిటరీ, పౌర వ్యవస్థలను నాశనం లేదా పని చేయకుండా చేయటం. అమెరికా తరచూ చేసే ఆరోపణ ఏమంటే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తమ నుంచి అపహరించిందన్నది. సైబర్‌దాడులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా తమ జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) నుంచి తస్కరించినట్లు కథనాలు రాయిస్తున్నది. చైనా 2016లోనే ఎన్‌ఎస్‌ఏ, అమెరికా మిత్రదేశాలకు చెందిన ఐరోపా కంపెనీల నుంచి గుప్త సంకేతాలను తీసుకొని వాటితో అదే కంపెనీల మీదే దాడులు జరుపుతోందన్నది సారం. గత సంవత్సరం అమెరికా కనీసం ఆరు దేశాల ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసినట్లు ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మక సమాచార వ్యవస్థ ఆరోపించింది.అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్‌ ఆయుధాలతో గూఢచర్యం, సమాచారాన్ని పంపే అమెరికా ఉపగ్రహాల వ్యవస్థలను పని చేయకుండా చేయవచ్చని, ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


ప్రపంచంలో రోజు రోజుకూ మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది. ప్రపంచం ఏమైనా సరే ఈ ఖర్చు ఎంత పెరిగితే అమెరికా కార్పొరేట్లకు అంతగా లాభాలు. మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది.ప్రపంచ జిడిపి వృద్ది 2.9శాతం, అంతకంటే తక్కువే అని అంచనా వేస్తున్నారు. డాలర్లలో చెప్పుకుంటే 2022 ఖర్చు 2,240బిలియన్‌ డాలర్లు. ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. ఐరోపాలో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగింది.ప్రపంచం మొత్తం చేస్తున్న ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. దేశాల వారీ అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్‌ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అందచేసిన దాదాపు 20 బి.డాలర్లను కూడా కలుపుకుంటే దాని వాటా 40శాతం. ఐరోపాలో అధికంగా ఖర్చు చేస్తున్న బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ ఎనిమిది శాతం, అమెరికా నీడలో ఉండే జపాన్‌, దక్షిణ కొరియా 2.1శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచ ధోరణులను గమనిస్తే ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్య, తూర్పు ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దీనికి మూలంగా కనిపిస్తున్నాయి, వాటికి అమెరికా, దానితో చేతులు కలుపుతున్న పశ్చిమ దేశాలే కారణం అన్నది బహిరంగ రహస్యం. సోవియట్‌ ఉనికిలో లేదు, దానిలో ఉన్న అనేక దేశాలు ఇప్పుడు అమెరికా చంకనెక్కాయి. అయినప్పటికీ ప్రచ్చన్న యుద్ధం నాటి స్థాయిని దాటి మధ్య,పశ్చిమ ఐరోపా దేశాల మిలిటరీ ఖర్చు ఇప్పుడు పెరిగింది.ఉక్రెయిన్‌ సంక్షోభంతో నిమిత్తం లేని ఫిన్లండ్‌ 36, లిథువేనియా 27, స్వీడెన్‌ 12, పోలాండ్‌ 11శాతం చొప్పున ఖర్చు పెంచాయి. అనేక తూర్పు ఐరోపా దేశాలు 2014తో పోల్చితే రెట్టింపు చేశాయి.


ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్‌ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి చేరింది. అమెరికాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్బణం పెరిగి ఇబ్బందులు తలెత్తినా మిలిటరీ ఖర్చు పెంచుతూనే ఉంది. ఉక్రెయిన్‌తో సహా ప్రపంచంలో ఏ దేశానికి మిలిటరీ సాయం చేసినా అది అమెరికా ఆయుధ పరిశ్రమల లాభాలు పెంచేందుకే అన్నది తెలిసిందే.అమెరికాకు యుద్ధం వచ్చిందంటే చాలు పండుగే. రెండవ ప్రపంచ యుద్ధంలో డ్యూపాంట్‌ కంపెనీ లాభాలు 950శాతం పెరిగాయి. ప్రతి పోరూ అలాంటిదే.ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం నాటో ద్వారా ఆయుధాల అమ్మకం 2021తో పోల్చితే 2022లో 35.8 నుంచి 51.9 బి.డాలర్లకు పెరిగాయి.అదే నేరుగా ఈ కాలంలోనే 103.4 నుంచి 153.7 బిడాలర్లకు పెరిగాయి. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి. పేట్రియాట్‌ క్షిపణులను రూపొందించే రేతియాన్‌, ఎఫ్‌-16, 22, 35 రకం యుద్ధం విమానాలను తయారు చేసే లాక్‌హీడ్‌ మార్టిన్‌, నార్త్‌రాప్‌ గ్రుయిమాన్‌ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగానే ఉక్రెయిన్‌ వివాదంలో సంప్రదింపులు జరగకుండా అడ్డుపడుతున్నది, పదే పదే తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడుతున్నది. మరోవైపున ఆఫ్రికాలో కొత్త చిచ్చు రేపేందుకు, ఉన్నవాటిని కొనసాగించేందుకు చూస్తున్నది.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే గత మూడు దశాబ్దాలుగా దాని ఖర్చు పెరుగుతూనే ఉన్నప్పటికీ అమెరికా 877 బి.డాలర్లతో పోలిస్తే దాని ఖర్చు 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్‌ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. నైజీరియా 2021లో 56శాతం ఖర్చు పెంచగా గతేడాది 38శాతం తగ్గించింది.నాటో మిలిటరీ ఖర్చు 1,232 బి.డాలర్లకు పెరిగింది.ఐరోపాలో 68.5బి.డాలర్లతో బ్రిటన్‌ మొదటి స్థానంలో ఉంది. తుర్కియె(టర్కీ) వరుసగా మూడవ ఏడాది మిలిటరీ ఖర్చును తగ్గించింది.ఐరోపా మొత్తంగా 13శాతం పెరిగింది.


స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం 4వ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. చైనా తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ 12.5 బి.డాలర్లతో 21వ స్థానంలో ఉంది. నలభై దేశాలలో చివరిదిగా 5.2బి.డాలర్లతో రుమేనియా ఉంది. 2021తో పోలిస్తే అనేక దేశాల రాంకుల్లో మార్పు వచ్చింది. సిప్రి వివరాలను అందచేసిన 36 ఐరోపా దేశాల్లో 23 ఖర్చును పెంచటం ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రభావాన్ని వెల్లడిస్తున్నది. వీటి ఖర్చు 0.4శాతం స్విడ్జర్లాండ్‌ నుంచి లక్సెంబర్గ్‌ 45శాతం గరిష్టంగా ఉంది. పదమూడు దేశాల ఖర్చు 0.4శాతం నుంచి 11శాతం వరకు తగ్గింది. వరల్డో మీటర్‌ విశ్లేషణ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌ తన జిడిపిలో 61శాతం ఖర్చు చేస్తున్నది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్‌ 50, మయన్మార్‌ 48, భారత్‌ 43,బంగ్లాదేశ్‌ 27, నేపాల్‌ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది.


ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచితే అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని పైన పేర్కొన్న తలసరి ఖర్చు వెల్లడిస్తున్నది. అలాగే మన దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ దానికే మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది. అమెరికా ఆయుధ కంపెనీలకు లాభసాటి గనుక అది మిలిటరీ ఖర్చు ఎంతైనా పెడుతుంది.దాని జిడిపి కూడా ఎక్కువే.తనకు లాభం కనుక ఇతర దేశాలనూ ఉసిగొల్పుతుంది. తనను చక్రబంధం చేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు చైనా కూడా మిలిటరీ ఖర్చు పెడుతున్నా అది తక్కువే. తనకోసం అది అయుధాలను రూపొందిస్తున్నది కనుక కొన్నింటిని ఎగుమతి కూడా చేస్తున్నది. 2021లో ప్రపంచ మిలిటరీ సేవలు, అయుధాల వంద పెద్ద కంపెనీల మార్కెట్‌ 592 బి.డాలర్లని అంచనా. వాటి ఎగుమతిలో 2018 నుంచి 2022 వరకు పది అగ్రశ్రేణి దేశాల వారీ వాటా అమెరికా 40, రష్యా 16,ఫ్రాన్స్‌ 11,చైనా 5.2,జర్మనీ 4.2, ఇటలీ 3.8, బ్రిటన్‌ 3.2,స్పెయిన్‌ 2.6, దక్షిణ కొరియా 2.4, ఇజ్రాయెల్‌ 2.3శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మన దేశంలో కూడా కొన్ని బడా కంపెనీలు లాభసాటిగా ఉండే ఆయుధ తయారీకి ఉబలాటపడుతున్నాయి.మిగిలిన అంశాలన్నీ సరిగా ఉంటే అలాంటి పని చేసినా అదొక తీరు లేనపుడు మన పెట్టుబడులను వాటి మీదే కేంద్రీకరిస్తే జనం సంగతేంగాను. అందుకే ఎదుటి వారు తొడకోసుకుంటే మనం మెడకోసుకుంటామా అని పెద్దలు ఏనాడో చెప్పారు. దాన్ని మన పాలకులు పాటిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అతి రహస్యం బట్టబయలు : మిత్రుల మీదా దొంగకన్నేసిన అమెరికా !

12 Wednesday Apr 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, leaked U.S. documents, NATO, Ukraine war


ఎం కోటేశ్వరరావు


అందరికీ జోశ్యం చెప్పే బల్లి తానే కుడితి తొట్లో పడికొట్టుకున్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. పదేండ్ల క్రితం కేవలం వందడాలర్ల(రు.8,200)తో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి లక్షలాది పత్రాలను లీకు చేశాడు. స్నోడెన్‌కు ఇటీవలనే పుతిన్‌ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చాడు. అంతకు ముందు 1971లో అమెరికా రక్షణ శాఖ పత్రాలు కూడా వెల్లడయ్యాయి. అదే విధంగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రహస్య పత్రాలను సేకరించి బహిర్గత పరచిన వికీలీక్స్‌ లక్షలాది అమెరికా రహస్య పత్రాలను వెల్లడించటంతో ప్రాచుర్యం పొందింది.వాటి గురించి అమెరికాలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.ఆ సంస్థలో ప్రముఖుడైన జూలియన్‌ అసాంజేను పట్టుకొనేందుకు,జైల్లో పెట్టేందుకు వీలైతే మట్టుపెట్టేందుకు చూస్తూనే ఉంది.


ఇప్పుడు మరోసారి అలాంటి సంచలనం మరో విధంగా చెప్పాలంటే రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువ అన్నట్లుగా వెల్లడైన వందకు పైగా పత్రాలు అమెరికా, నాటో కూటమిని పెద్ద ఇరకాటంలో పెట్టాయనటం అతిశయోక్తి కాదు. రహస్యం, అతి రహస్యం అని దాచుకున్న రక్షణశాఖ ఫైళ్లు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకేం వెల్లడౌతాయోనని అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచంలో ఎక్కడే జరిగినా పసిగట్టి చెబుతామని చెప్పుకొనే అమెరికా తాజాగా తన ఫైళ్లను వెల్లడి చేసింది ఎవరన్నది తేల్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నది. ఎవరు వాటిని వెల్లడించిందీ తరువాత సంగతి, అసలు ఎంత అజాగ్రత్తగా ఫైళ్ల నిర్వహణ చేస్తున్నదో లోకానికి వెల్లడైంది. అమెరికన్లతో తామేమి మాట్లాడినా అవి వెల్లడికావటం తధ్యంగా ఉంది కనుక ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలనే ఆలోచన,జాగ్రత్తలకు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని పురికొల్పింది. తమ గురించిఎలాంటి సమాచారం సేకరించిందో అదెక్కడ వెల్లడి అవుతుందో అన్న ఆందోళన అమెరికా మిత్రదేశాల్లో కూడా తలెత్తింది.


ఈ ఫైళ్లలో ఉన్న అంశాలు వికీలీక్స్‌, ఇతర వాటి మాదిరి గతంలో జరిగిన ఉదంతాలు, పరిణామాల సమాచారం కాదు. వర్తమానంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని గురించి అమెరికా అంతర్గత అంచనా, ఆందోళనలతో పాటు ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, చివరికి తాను చెప్పినట్లు ఆడుతున్న ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మీద కూడా దొంగకన్నేసినట్లు తేలింది.ఉక్రెయిన్‌ దళాల వద్ద ఉన్న మందుగుండు, ఇతర ఆయుధాలు ఎప్పటివరకు సరిపోతాయి, మిలిటరీలో తలెత్తిన ఆందోళన, ఆ సంక్షోభంలో రోజువారీ అంశాల్లో అమెరికా ఎంతవరకు నిమగమైంది, పెద్దగా బహిర్గతం గాని ఉపగ్రహాలద్వారా సమాచారాన్ని సేకరించే పద్దతులతో సహా రష్యా గురించి ఎలా తెలుసుకుంటున్నదీ, మిత్ర దేశాల మీద ఎలా కన్నేసిందీ మొదలైన వివరాలున్న పత్రాలు ఇప్పటివరకు వెలికి వచ్చాయి. రష్యన్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి(హాకింగ్‌) సమాచారాన్ని కొల్లగొట్టారని అమెరికా ఒక కథను ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి ఆ కథ అంతగా అతకటం లేదని కొందరు చెప్పారు.దాంతో పత్రాల్లో కొంత వాస్తవం కొంత కల్పన ఉందని అమెరికా అధికారులు చెవులు కొరుకుతున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని ఫైళ్లు కుర్రాళ్లు ఆటలాడుకొనే వెబ్‌సైట్లలో తొలుత దర్శనమిచ్చాయి.


ఒక కథనం ప్రకారం ఐదునెలల క్రితం అక్టోబరులో కంప్యూటర్‌గేమ్స్‌(ఆటలు) ఆడుకొనే ఒక డిస్కార్డ్‌ వేదిక (ఒక ఛానల్‌) మీద కొన్ని వివరాలు కనిపించాయి. మన దేశంలో ఇప్పుడు నరేంద్రమోడీ- అదానీ పాత్రలతో( గతంలో అమ్మా-నాన్న ఆట మాదిరి) కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉక్రెయిన్‌ సంక్షోభం మీద ఆడుకుంటున్న కుర్రకారులో ఒకడు తనది పై చేయి అని చూపుకొనేందుకు ఎలుగుబంటితో పంది పోరు అంటూ ఒక వీడియోను వర్ణిస్తూ కొన్ని పత్రాలను పెట్టటంతో కొంత మంది భలే సమాచారం అంటూ స్పందించారు. దాంతో ఆ లీకు వీరుడు మరిన్ని జతచేశాడు. ఆ గేమ్‌లో పాల్గొన్నవారు ఉక్రెయిన్‌ పోరు పేరుతో అప్పటికే నాటో కూటమి విడుదల చేసిన అనేక కల్పిత వీడియోలను కూడా పోటా పోటీగా తమ వాదనలకు మద్దతుగా చూపారు. అనేక మంది ఆ రహస్యపత్రాలు కూడా అలాంటి వాటిలో భాగమే అనుకొని తరువాత వదలివేశారు.ఐదు నెలల తరువాత మరొక ఆటగాడు తన వాదనలకు మద్దతు పొందేందుకు మరికొన్ని పత్రాలను జత చేశాడు. తరువాత అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఎడిట్‌ చేసి పెట్టింది. దాన్ని బట్టి వాటిని రష్యన్లు సంపాదించి పెట్టారని భావించారు. అంతకు ముందు వాటిని చూసిన వారు ఉక్రెయిన్‌ పోరు గురించి ప్రచారం చేస్తున్న అనేక అవాస్తవాల్లో భాగం అనుకున్నారు తప్ప తీవ్రమైనవిగా పరిగణించలేదు. చీమ చిటుక్కుమన్నా పసిగడతామని చెప్పుకొనే అమెరికా నిఘా సంస్థలు వాటిని పసిగట్టలేకపోయినట్లా లేక, జనం ఎవరూ నమ్మరులే అని తెలిసి కూడా ఉపేక్షించారా, ఒక వేళ గేమర్స్‌ మీద చర్యలు తీసుకుంటే లేనిపోని రచ్చవుతుందని మూసిపెడతామని చూశారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచించేకొద్దీ గందరగోళంగా ఉంది.


వెల్లడైన వందకు పైగా పత్రాల్లోని అనేక అంశాలను ఖరారు చేసేందుకు ఇటీవలనే అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిలే, ఇతర ఉన్నతాధికారులకు వాటిని సమర్పించారు. ఇంత త్వరగా అవి బహిర్గతం కావటం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాప్‌ సీక్రెట్లుగా పరిగణించే పత్రాలకు అంగీకారం, వాటిని పరిశీలించేందుకు అనుమతించే వారి సంఖ్య గురించి చెబుతూ 2019లో పన్నెండు లక్షల మందికి అవకాశం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఇటీవలనే వెల్లడించింది. అందువలన వారిలో ఎవరైనా వాటిని వెల్లడించాలనుకుంటే ఆ పని చేయవచ్చు. అమెరికా ప్రభుత్వ విధానాలు నచ్చని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నపుడు తనకు అందుబాటులోకి వచ్చిన అనేక అంశాలను బహిర్గతపరిచాడు. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతా సంస్థ , ఐదు కళ్ల పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ గూఢచార సంస్థలతో కలసి జరుపుతున్న నిఘా బండారాన్ని వెల్లడించాడు. అమెరికా అధికారపక్షం డెమోక్రాట్లు, ప్రతిపక్షం(పార్లమెంటు దిగువసభలో మెజారిటీ పార్టీ) రిపబ్లికన్ల మధ్య ఉన్న విబేధాలు కూడా ఈ లీకుల వెనుక ఉండవచ్చన్నది మరొక కథనం. నాటోలోని పశ్చిమ దేశాలు కొన్ని అమెరికా వైఖరితో పూర్తిగా ఏకీభవించటం లేదు. అందువలన అవి కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ పోరులో పుతిన్‌ సేనలను ఓడించటం అంత తేలిక కాదని భావిస్తున్న అమెరికా కొంత మంది విధాన నిర్ణేతలు వివాదానికి ముగింపు పలికేందుకు ఈ లీక్‌ దోహదం చేస్తుందని భావించి ఆ పని చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. రష్యా గనుక వీటిని సంపాదించి ఉంటే దానిలో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు చూస్తుంది తప్ప బహిరంగపరచదు అన్నది ఒక అభిప్రాయం. కష్టపడి సంపాదించిందాన్ని బహిర్గతం చేస్తే శత్రువు ఎత్తుగడలు మారిపోతాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు అమెరికా సుముఖంగా లేదని, అతి పెద్ద ఆటంకం అన్నది ఈ పత్రాల్లో తేటతెల్లమైంది.కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థల కొరత, బకుమట్‌ పట్టణాన్ని పట్టుకోవటంలో పుతిన్‌ సేనల విజయం వంటి అనేక అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి.ఈ పత్రాల్లోని సమాచారం కట్టుకథలైనా అది ప్రచారంలోకి తేవటం మానసికంగా ఉక్రెయిన్ను దెబ్బతీసేదిగా ఉంది. ఉద్రిక్తతలు పెరిగి మిలిటరీ రంగంలోకి దిగితే డాన్‌బోస్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు అదుపులోకి తీసుకుంటాయని అమెరికాకు ముందుగానే తెలుసునని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షల మంది రష్యన్‌ సేనలు మరణించినట్లు సిఐఏ,అమెరికా, నాటో కూటమి దేశాలన్నీ ఊదరగొట్టాయి.ఈ పత్రాల ప్రకారం పదహారు నుంచి 17,500 మధ్య మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు మే రెండవ తేదీ వరకే సరిపోతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి మద్దతు ఇస్తున్న తూర్పు ఐరోపా, ఇతర దేశాల నమ్మకాలను దెబ్బతీసేవే. మిత్రదేశాల కంటే తొత్తు దేశాలుగా పేరు మోసిన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాల మీద కూడా అమెరికా దొంగ కన్నేసినట్లు దాని రాయబారులు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో నెతన్యాహు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాల్సిందిగా జనాన్ని అక్కడి గూఢచార సంస్థ మొసాద్‌ రెచ్చగొట్టినట్లుగా అమెరికా పత్రాల్లో ఉంది. అదే విధంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఇంకాకరికి ఆయుధాల సరఫరా తమ విధానాలకు వ్యతిరేకం అని చెబుతున్నా ఉక్రెయినుకు మూడులక్షల 30వేల ఫిరంగి మందుగుండు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అమెరికా వత్తిడి చేసింది. ఫలానా తేదీలోగా జరగాలని కూడా ఆదేశించింది. ఇదంతా కేవలం నలభై రోజుల క్రితం జరిగింది. ఇది దక్షిణ కొరియాను ఇరుకున పెడుతుంది. పక్కనే ఉన్న రష్యా ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోదని అక్కడి పాలక పార్టీ భావిస్తున్నది.


గతంలో స్నోడెన్‌, మానింగ్‌, వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం ఎక్కువ భాగం పాతదే కానీ అమెరికా దుష్ట పన్నాగాలను లోకానికి వెల్లడించింది. తాజా సమాచారం వర్తమాన అంశాలది కావటం ఆమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పదేండ్ల నాటికి ఇప్పటికీ అమెరికాను ఎదుర్కోవటంలో చైనా, రష్యా సామర్ధ్యం పెరిగింది. తాజా పత్రాలు అమెరికా ఎత్తుగడలను కూడా కొంత మేరకు వెల్లడించినందున వచ్చే రోజుల్లో వాటిని పక్కన పెట్టి కొత్త పథకాలు రూపొందించాలంటే నిపుణులకు సమయం పడుతుంది. మిగిలిన దేశాలకూ వ్యవధి దొరుకుతుంది. బలాబలాలను అంచనా వేసుకొనేందుకు వీలుకలుగుతుంది.ఇదొకటైతే అనేక దేశాలు అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల గురించి పునరాలోచించుకొనే పరిస్థితిని కూడా కల్పించింది.తమ గురించి, తమ అంతర్గత వ్యహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకుంటున్నదో అనే అనుమానాలు తలెత్తుతాయి. ఉక్రెయిను, జెలెనెస్కీ ఏమైనా అమెరికాను ఎక్కువగా ఆందోళన పరుస్తున్నదీ ఈ అంశాలే అని చెప్పవచ్చు. ఇంకెన్ని పత్రాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

టెక్నాలజీ పోరులో చైనాతో గొంతు కలిపిన భారత్‌! 

05 Wednesday Apr 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Anti China, #CHIPS War, chipmakers, CHIPS Act, Semiconductor Programme, Trade Protectionism, WTO, WTO-India

ఎం. కోటేశ్వరరావు

          చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరు మరింత తీవ్రం అవుతున్నది. చైనాతో సహా ఇతర దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా పూనుకోవటంతో ఈ రంగంలో ముందున్న దేశాలు తమవైన జాగ్రత్తలు తీసుకుం టున్నాయి. మన దేశంలో సెమి కండక్టర్లు లేదా చిప్స్‌ తయారీకి మద్దతు ఇస్తామని అమెరికా చెప్పినప్పటికీ దాని చర్యలు అనుమానా స్పదంగా ఉండటంతో మన దేశం కూడా ప్రపంచ వాణిజ్య సంస్థలో అభ్యంతరం తెలిపింది. గతేడాది అక్టోబరులో అమెరికా వాణిజ్యశాఖ చైనాకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ను తయారు చేసే యంత్రాలను ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. అంతటితో ఆగితే అదొక దారి, ఇతర దేశాలు కూడా అలాగే ఉండాలని లేకుంటే తమ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించింది. ఈ ఆంక్షలు తమ న్యాయమైన హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్లు డిసెంబరు నెలలో ప్రపంచవాణిజ్య సంస్థలో చైనా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం అప్పీళ్ల కమిటీ ఏర్పాటుపై వివిధ దేశాల మధ్య ఏకీభావం కుదరకపోవటంతో అది పని చేయటం లేదు.అందువలన చట్టపరంగా జరిగేదేమీ ఉండదు. కమిటీ పునరుద్దరణ జరిగిన తరువాతనే దాని మీద విచారణ జరుగుతుంది.


చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ విధించిన పన్నులు న్యాయసమ్మతం కాదని 2022 డిసెంబరు తొమ్మిదిన ప్రపంచ వాణిజ్య సంస్థ తీర్పు చెప్పింది. ఈ తీర్పు తరువాతనే చిప్స్‌ నిషేధంపై చైనా ఫిర్యాదు దాఖలు చేసింది. దీని మీద అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిప్స్‌ మీద విధించిన ఆంక్షలు తమ జాతీయ భద్రతకు చెందిన అంశాలని చైనాకు ముందే తెలిపామని, ఇలాంటి అంశాలపై తీర్పు చెప్పేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ సరైన వేదిక కాదని అన్నాడు. ఇంతకు ముందు చిప్స్‌ను, వాటిని తయారు చేసే యంత్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్నడూ జాతీయ భద్రత గురించి అమెరికా, మరొక దేశం ఎన్నడూ ప్రస్తావించలేదు. షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తరువాత పశ్చిమ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని, అలాంటి వాటి మీద ఎక్కువగా పరిశోధనలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆంక్షలకు పూనుకున్నాడు. చైనా హువెయి టెలికాం కంపెనీని అడ్డుకోవటంతో అమెరికా అసలు రంగు వెల్లడైంది.చైనాపై సాంకేతిక పోరులో కలసి రావాలని జపాన్‌, నెదర్లాండ్స్‌ను కూడా అమెరికా కోరింది. చివరకు చైనాలో ఉన్న కంపెనీలకు సేవలందించే సిబ్బందిని కూడా అమెరికా కంపెనీలు తగ్గించాయి. ఎవరైనా చైనా కంపెనీల్లో పని చేసేందుకు వెళ్తే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా ఆంక్షలు విధించింది.


ప్రపంచ చిప్‌ మార్కెటో ఆధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. అందుకోసం 280 బిలియన్‌ డాలర్ల పథకాన్ని రచించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే చిప్స్‌ను అనుమతి లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన ప్రస్తుతానికి చైనాను దెబ్బతీసేందుకు ఉద్దేశించినప్పటికీ తన దారికి రాని ఏదేశం మీదనైనా ఆ నిబంధనను రుద్దే అవకాశం ఉంది. గతంలో విదేశీ ఉత్పత్తుల నిబంధనల పేరుతో చైనా కంపెనీ హువెయి టెలికాం ఉత్పత్తులను అమెరికాకు దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించింది. రష్యాకు చిప్స్‌ ఎగుమతి నిలిపివేసింది. ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా భంగకరమే అని గుర్తించిన మన ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన అమెరికా వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో అభ్యంతరాన్ని నమోదు చేసింది. అమెరికా కోసం ఉత్పత్తి చేసే సెమికండక్టర్లకు తోడ్పడే ప్రోత్సాహకాల పేరుతో అమెరికా రూపొందించిన ఒక చట్టం ప్రకారం ఇవ్వనున్న రాయితీలు ప్రపంచమంతటా మరింత పోటీని పెంచుతాయని, నష్టాన్ని కలిగిస్తాయని ఈ రంగంలో ఉత్పత్తిదారులు ప్రత్యేకించి వర్దమాన దేశాలలో వారికి సమాన అవకాశాలు కలిగించేందుకు ప్రతి పాదన లేమిటని మన దేశం ప్రశ్నించింది. వివిధ సందర్భాలలో ఇతర దేశాల సబ్సిడీ విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అమెరికా తన వైఖరిని మార్చుకుందా అంటూ మన దేశ వాదనకు మద్దతుగా చైనా కూడా గొంతు కలిపింది. తమ దేశం రూపొందించుకున్న చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థకు లోబడే సబ్సిడీలు ఇస్తున్నట్లు అమెరికా సమర్థించుకుంది.


అనేక దేశాలు అమెరికా పోకడలను గమనించి తాము కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. తమ దేశంలో చిప్స్‌ ఉత్పత్తిదారులకు పన్నుల రాయితీ ఇవ్వాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. దానికి గాను కొరియా చిప్స్‌ చట్టాన్ని తెచ్చింది. రక్షణాత్మక చర్యల వలన తమ కంపెనీలకు అమెరికా నుంచి నిధులు రావటం కష్టమని మంత్రి ప్రకటించాడు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీ వర్తిస్తుంది. గతంలో తగ్గింపు ఎనిమిది శాతం ఉన్నదానిని ఇప్పుడు 15శాతానికి పెంచారు. వచ్చే ఇరవై సంవత్సరాల్లో 230 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది. ఐరోపా కమిషన్‌ కూడా అమెరికా మాదిరే 2022 చిప్స్‌ చట్టాన్ని చేసింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పదిశాతంగా ఉన్న ఐరోపా వాటాను 2030 నాటికి కనీసం ఇరవై శాతానికి పెంచేందుకు దాన్ని తెచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఐరోపాలోనే చిప్స్‌ ఉత్పత్తి చేయటం వాటికి ప్రోత్సాహకాల చుట్టూ దానిలో నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం 2030 నాటికి 17బిలియన్‌ డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించారు.


డిజిటలైజేషన్‌ వంటి ఆధునిక ఉత్పత్తుల నుంచి మిలిటరీ పరికరాల వరకు చిప్స్‌ ప్రాణవాయువు వంటివి. అందువలన చైనాకు దాన్ని నిలిపివేస్తే తమ దారికి వస్తుందని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా భావిస్తున్నాయి. పశ్చిమ దేశాల కంపెనీలకు ఫౌండ్రిగా పని చేసేందుకు ఇంకే మాత్రం చైనా సిద్దంగా లేదని స్వంతంగా రూపొందించేందుకు పూనుకుందని ఐరోపా ఐడిసి పరిశోధనా డైరెక్టర్‌ ఆండ్రూ బస్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆధునిక చిప్స్‌ తయారీలో తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ 80శాతం వాటాను కలిగి ఉంది. చైనా బలవంతంగా దాన్ని విలీనం చేసుకొనేందుకు పూనుకుంటే చైనాకు దక్కకుండా అక్కడి చిప్స్‌ పరిశ్రమలను ధ్వంసం చేస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఒక్క చిప్స్‌ రంగాన్నే కాదు విద్యుత్‌ వాహనాలకు సైతం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు పూనుకుంది. చైనాపై అమెరికా జరుపుతున్న సాంకేతిక దాడిలో తాత్కాలికంగానైనా పొగపెట్టే నాలుగు అంశాలున్నాయి. 1.ఆధునిక కృత్రిమమేధ చిప్స్‌ను చైనాకు చేరకుండా అడ్డుకోవటం, 2. అమెరికాలో రూపొందించిన చిప్‌ రూపకల్పన సాఫ్ట్‌వేర్‌ను చైనాకు అందకుండా చూడటం, 3.చిప్స్‌ను తయా రు చేసేయంత్రాలు చైనాకు చేరకుండా చేయటం, 4. చైనా చిప్స్‌ తయారీకి అమెరికాలో రూపొందిన విడి భాగాలు అందకుండా చూడటం. ప్రపంచం లోని ఇతర అమెరికా మిత్ర దేశాల నుంచి కూడా ఇదే విధంగా అడ్డుకోవటం ప్రస్తుతం బైడెన్‌ పనిగా ఉంది. పౌర అవసరా లకు ఉపయోగపడే వాటిని కూడా చైనా మిలిటరీకి వాడుతున్నదనే ప్రచారం మరోవైపు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ చిప్స్‌ మార్కెట్‌ విలువ 2022లో 574 బి.డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఇతర రంగాలన్నీ మందగించి నప్పటికీ చిప్స్‌ మార్కెట్‌ పెరగటం వాటి అవసరాన్ని వెల్లడిస్తున్నది. ఈ మొత్తంలో చైనా ఒక్కటే 180 బి.డాలర్ల మేరకు కొనుగోలు చేస్తున్నది, 2021తో పోలిస్తే 6.2శాతం తగ్గినప్పటికి ఇంత వాటా కలిగి ఉంది కనుకనే దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దెబ్బతీయాలని అమెరికా కూటమి చూస్తున్నది. 1990లో ప్రపంచ చిప్స్‌ రంగంలో అమెరికా వాటా 37శాతంగా ఉన్నది 2021 నాటికి 12కు పడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వాటి ప్రాధాన్యత ఎంతో పెరిగింది కనుకనే తిరిగి పూర్వపు స్థితికి చేరాలని, తద్వారా ప్రపంచ మార్కెట్‌ను శాసించాలని అమెరికా కలలు కంటున్నది. ఇటీవలి కాలంలో చైనా ఈ రంగంలో పురోగమించినప్పటికీ ఆధునిక చిప్స్‌ కోసం ఇతర దేశాల మీద ఆధారపడే స్థితిలోనే ఉంది. కొన్ని ఆధునిక ఉత్పత్తులు జపాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికాలోని కొన్ని కంపెనీల చేతుల్లో ఉన్నాయి.

ఆధునిక సాంకేతికరంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఎప్పటికైనా పశ్చిమ దేశాల నుంచి సవాలు ఎదురవుతుందని గమనించిన చైనా 2015లో చిప్స్‌ రూపకల్పన, ఉత్పత్తికి పూనుకుంది. అంతకు ఏడాది ముందే 21బిలియన్లు, 2019లో 35బి.డాలర్లు నిధులు కేటాయించింది, 2020 నాటికి ఈ మొత్తం 150 బి.డాలర్లని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఎక్కువ భాగం పరిశోధనకే వెచ్చించారు. తాజా పరిణామాలతో మరింతగా బడ్జెట్‌ను పెంచేందుకు పూనుకుంది. స్థానిక పరిశ్రమలకు 143 బి.డాలర్ల మేర సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు డిసెంబరులో వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం చైనాను అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ఒక్కటిగా ముందుకు పోవాలని నిర్ణయించాయి. ఇరవై మూడు రకాల ఉత్పత్తులను చైనాకు విక్రయించకూడదని జపాన్‌ శుక్రవారం నాడు ప్రకటించింది. మిలిటరీ అవసరాలకు వాడకుండా చూసేందుకే ఈ పని చేసినట్లు చెప్పుకుంది. అమెరికా ప్రారంభించిన ఈ పోరుతో వినియోగదారులకు ఉపయోగం లేకపోగా భారం పడుతుందని తైవాన్‌ కంపెనీ ప్రతినిధి హెచ్చరించాడు. అక్కడ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ గనుక ధరలు పెరుగుతాయన్నాడు. కనీసం 40శాతం ధరలు పెరగవచ్చని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఐఫోన్‌ 14ప్లస్‌ ధర ఉత్పత్తి ఖర్చు 527 డాలర్లు కాగా దానిలో 54శాతం చిప్స్‌కే చెల్లించాల్సి ఉంది.దీనిలో 5జి మోడెం ధర 47 డాలర్లు కాగా, 618 డాలర్ల శాంసంగ్‌ 22 ప్లస్‌లో మోడెం ధర 193, గూగుల్‌ పిక్సెల్‌ 441 డాలర్లలో మోడెం ధర 69 డాలర్లు ఉంది. అమెరికా చిప్స్‌ను వాడితే ఐఫోన్‌ ధర మరో వంద డాలర్లు పెరగవచ్చని అంచనా. పశ్చిమ దేశాలు ప్రారంభించిన ఈ పోరు ఎటుదారి తీస్తోందో అని ప్రపంచం ఎదురు చూస్తోంది!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విప్లవకారుడిగా జైలుకు-విద్రోహిగా బయటకు వచ్చిన సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ తోకముడిచారా ?

02 Sunday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, UK

≈ Leave a comment

Tags

BJP, Rahul gandhi, RSS, Sharad Pawar, Siva Sena, vd savarkar


ఎం కోటేశ్వరరావు


నాపేరు సావర్కర్‌ కాదు, గాంధీ, గాంధీలు క్షమాపణలు చెప్పరు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య దుమారం లేపింది. సూరత్‌ కోర్టుకు రాహుల్‌ క్షమాపణ చెప్పి ఉంటే శిక్ష పడేది కాదు, లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యేది కాదు అంటూ బిజెపి చేస్తున్న ప్రచారానికి ప్రతిగా పై విధంగా మాట్లాడారు. రాహుల్‌ అనర్హతకు నిరసనగా ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి తాము రావటం లేదని ఉద్దావ్‌ థాక్రే శివసేన వర్తమానం పంపింది, రాహుల్‌ సావర్కర్‌ మీద చేసిన విమర్శను దానికి కారణంగా చూపింది. దాంతో ఎన్‌సిపి నేత శరద్‌ పావర్‌ రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు, శివసేన హాజరైంది. తాను మరోసారి సావర్కర్‌ గురించి మాట్లాడనని రాహుల్‌ గాంధీ చెప్పారని వార్తలు వచ్చాయి. నిజంగా అలాగే చెప్పారా మరొకటా అన్నది అధికారికంగా ప్రకటించలేదు గనుక దాని గురించి పక్కన పెడదాం.


ఈ పరిణామాల నేపధ్యంలో కాషాయ మరుగుజ్జు దళాలు రంగంలోకి దిగాయి.సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ కేసు దాఖలు చేస్తానని హెచ్చరించటంతో సావర్కర్‌ మీద చేసిన ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారు. ఏం జరిగిందనేది తరువాత చూద్దాం. సావర్కర్‌ క్షమాపణ గురించి మరోసారి చర్చకు తెరలేవటంతో అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అసలు సావర్కర్‌ ఎందుకు క్షమాపణ చెప్పారు, ఎవరికి చెప్పారు ? ఎప్పుడు చెప్పారు అని సందేహాలను లేవనెత్తారు. ఇది సహజం. సావర్కర్‌ గొప్ప స్వాతంత్య్రసమర యోధుడు గనుక భారత రత్న ఇవ్వాలన్నవారు కొందరు నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు, గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చేసిన వాగ్దానాల్లో అది ఒకటి. ఆ మాటకొస్తే జాతిపితను హత్యచేసిన గాడ్సేను కూడా పూజిస్తూ చివరకు గుడులు కట్టేందుకు కూడా సిద్దపడుతున్నవారు రెచ్చిపోతున్న రోజులివి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి,ఉద్దావ్‌ థాక్రే శివసేన ఒక కూటమిలో ఉన్నందున వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం బిజెపి-ఏకనాధ్‌ షిండే శివసేన కూటమి ఈ ఏడాది మే 28వ తేదీ నుంచి వారం రోజుల పాటు సావర్కర్‌ జన్మదిన వారోత్సం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పూనుకుంది. దానికి రాహుల్‌ గాంధీ విమర్శ ఒక పెద్ద అవకాశాన్నిచ్చింది.


” ఈ రోజు సావర్కర్‌ ఒక జాతీయ అంశం కాదు, పాతది.దేశంలో కేంద్రీకరించేందుకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మేము కూడా సావర్కర్‌ గురించి కొన్ని అంశాలు మాట్లాడాము, కానీ అది వ్యక్తిగతమైనది కాదు. అది హిందూ మహాసభకు వ్యతిరేకమైనవి.మరోవైపు కూడా చూడాలి. సావర్కర్‌ చేసిన సేవలను మనం విస్మరించలేము. 32 సంవత్సరాల నాడు సావర్కర్‌ గురించి నేను పార్లమెంటులో మాట్లాడాను ” అని ఆదివారం నాడు శరద్‌ పవార్‌ నాగపూర్‌లో విలేకర్లతో చెప్పారు. దేశంలోని సమస్యల గురించి విదేశీ గడ్డ మీద ఒక భారతీయుడు మాట్లాడం ఇదే మొదటిసారి కాదు అంటూ రాహుల్‌ గాంధీని సమర్ధించారు. సావర్కర్‌ను విమర్శించినందుకు రాహుల్‌ గాంధీని దేశం క్షమించదని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదివారం నాడు అన్నారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌ కాలేడన్నారు. సావర్కర్‌ జీవితాంతం స్వాతంత్య్రంకోసం పోరాడితే రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ వారితో కలసి దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపించారు.సావర్కర్‌ చేసిన త్యాగాల గురించి మహారాష్ట్ర వాసులకు తెలిపేందుకు రాష్ట్రమంతటా సావర్కర్‌ గౌరవ్‌ జాతా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏకనాధ్‌ షిండే ప్రకటించారు.


ఇక కాషాయ మరుగుజ్జుల ప్రచారం గురించి చూద్దాం. సావర్కర్‌ మనవడు రంజిత్‌ ఇంతవరకు రాహుల్‌ గాంధీ మీద ఎలాంటి కేసు దాఖలు చేయలేదు, క్షమాపణ చెప్పకపోతే చేస్తానని బెదిరించారు.గతంలో కూడా ఇలాంటి బెదరింపులే చేశారు. రాహుల్‌ గాంధీ గతంలో చేసిన ట్వీట్లు గానీ లేదా వ్యాఖ్యలను గానీ వెనక్కు తీసుకోలేదని పిటిఐ వార్తా సంస్థ, ఇతరులు స్పష్టం చేశారు. అసలు దాన్ని గురించే కాదు, ఇతర ఏ ఒక్కదాన్ని కూడా తొలగించలేదు. అలా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన వారే తమ ట్వీట్లను వెనక్కు తీసుకున్నారు లేదా పాత సామాన్ల గదిలో పడవేశారు. ” కేసు దాఖలు చేస్తానని సావర్కర్‌ మనవడు బెదిరించిన తరువాత వీర్‌ సావర్కర్‌ మీద చేసిన అన్ని ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారు. ” అన్న ట్వీట్‌ను లక్షలాది మందిపేరుతో పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేశారు. స్వాతంత్య్రం కోసం సావర్కర్‌ ఏమి చేశారన్నది చర్చ. ఒక మేకపిల్లను సింహం మాదిరి ప్రచారం చేశారంటూ గతంలో ఒక విశ్లేషణ వెలువడింది.


సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.


తప్పుడు ప్రచారం చేయటంలో, ఇతరుల మీద నిందలు మోపటంలో కొందరు పేరు మోశారు.మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి క్షమాపణ లేఖలు రాసినట్లు గతంలో రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆరోపించారు. దీనిపై 2021 నవంబరు 22వ తేదీ ఫ్రంట్‌లైన్‌ పత్రిక ఇంటర్వ్యూలో లాస్‌ ఏంజల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడు ప్రొఫెసర్‌ వినయ లాల్‌ సావర్కర్‌ గురించి చేస్తున్న అనేక తప్పుడు ప్రచారాలను సవాలు చేశారు. దానిలో కొన్నింటి సారాంశం ఇలా ఉంది. రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పిన అంశం పూర్తిగా నిరాధారం, అల్లిన కట్టుకథ, మహాత్మాగాంధీ సలహా ఇచ్చినట్లు ఏ చిన్న ఆధారం కూడా లేదు. మంత్రికంటే ముందే అనేక మంది దీని గురించి చెప్పారు. 1911లో సావర్కర్‌ రాసిన క్షమాపణ పిటీషన్‌ కాపీ దొరకటం లేదు గానీ 1913 తరువాత రాసినవి అందుబాటులో ఉన్నాయి. ఇతర ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించిన బ్రిటిష్‌ సర్కార్‌ తమ సోదరుడికి వర్తింప చేయలేదని, మీరేమైనా చేయగలరా అంటూ 1920 జనవరి 18న సావర్కర్‌ సోదరుడు మహాత్మాగాంధీకి లేఖ రాశారు. మీ లేఖ చేరింది, మీకు సలహా ఇవ్వటం కష్టం అని గాంధీ జవాబు రాశారు. తరువాత ఒక ఆర్టికల్లో ఇతర రాజకీయ ఖైదీల మాదిరి సావర్కర్‌ సోదరులు క్షమాభిక్షకు అర్హులే అని రాశారు తప్ప మరొకటి కాదు.సావర్కర్‌ మద్దతుదారులు, భక్తులు చిత్రిస్తున్నమాదిరి హీరో కాదు.దేశ స్వాతంత్య్రం కోసం చేసింది చాలా తక్కువ.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ కూడా చేసిందేమీ లేదు, బ్రిటిష్‌ వారితో కుమ్మక్కు అయ్యారు. దేశ విభజనకు ద్విజాతి సిద్దాంతాన్ని ప్రతిపాదించింది జిన్నా అని చెబుతారు గానీ జిన్నాకంటే ముందే సావర్కర్‌ ప్రతిపాదించారు. అంబేద్కర్‌ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. పరస్పరం వ్యతిరేకించకపోగా ఇద్దరిదీ ఒకే అభిప్రాయం, విభజన జరగాలని గట్టిగా కోరారు అని థాట్స్‌ అన్‌ పాకిస్తాన్‌ (1940) అనే పుస్తకంలో అంబేద్కర్‌ రాశారు. అని లాల్‌ పేర్కొన్నారు.


విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ” సంఘపరివార్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది చరిత్రకారులు హరప్పా నాగరికతను సరస్వతి నాగరికతగా చిత్రించటంలో ఇది కనిపిస్తుంది. గతంలో ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌లో మార్పులు చేసేందుకు చూశారు. దీని మీద దేశంలో ఎందుకు వ్యతిరేకత లేదు ? ” అని వినయ లాల్‌ పేర్కొన్నారు.చరిత్రను తిరగరాయదలచుకున్నవారికి వాస్తవాలు, శాస్త్రీయ అవగాహనతో పని ఉండదని సంఘపరివార్‌ ప్రేరేపిత రాతలు వెల్లడిస్తున్నాయి. వీరత్వంగురించి రాస్తూ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు సావర్కర్‌ పికిలి పిట్ట (బుల్‌బుల్‌) రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలో పర్యటించి తిరిగి వెళ్లేవారని కర్ణాటక ఎనిమిదవ తరగతి పుస్తకంలో రాశారు.అదే పుస్తకంలో మహాత్మాగాంధీ హత్య ప్రస్తావన లేదు. అంతకు ముందు రాజస్తాన్‌లో ప్రచురించిన పుస్తకాల్లో హల్దీఘటీ పోరులో అక్బర్‌ మీద మహరాణా ప్రతాప్‌ గెలిచినట్లు రాశారు.

పాకిస్తాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి మూడు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని భారత దేశ పిత అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించాడు.

దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తణ ప్రాయంగా అర్పించాడు. ఎంత తేడా, అసలు సిసలు దేశభక్తుడు, నకిలీకి ఉన్న తేడాను గుర్తించలేని స్థితిలో జనం ఉన్నారని భావించేవారే సావర్కర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.


‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి చిత్రాలతో సహా పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు. 1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ దాని గురించి రాసి ఉండవచ్చు తప్ప వేరు కాదు. అసలు సిసలు చరిత్ర పేరుతో వక్రీకరణలతో నకిలీ చరిత్రను జనాల మీద రుద్దాలని చూస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాపై అమెరికా యుద్ధోన్మాద రంకెలు !

29 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, imperialism, Joe Biden, south china sea conflict, Taiwan, US war Cry, US war With China, WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఇటీవలి వరకు అమెరికా తొత్తుగా ఉన్న హొండూరాస్‌ ఆదివారం నాడు తైవాన్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడ వామపక్ష శక్తులు అధికారానికి రావటమే ఈ మార్పుకు కారణం. మారుతున్న బలాబలాలకు నిదర్శనంగా 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది దేశాలు తైవాన్ను వదలి చైనాతో సంబంధాలు పెట్టుకున్నాయి. హొండూరాస్‌పై వత్తిడి తెచ్చేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపిన అమెరికా చివరికి చేసేదేమీ లేక మీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ హొండూరాస్‌కు చెప్పింది. ఈ పరిణామం తైవాన్ను గుర్తిస్తున్న ఇతర దేశాల మీద కూడా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. తైవాన్ను గుర్తించినందుకు ప్రతిఫలంగా అమెరికా, తైవాన్నుంచి కూడా సదరు దేశాలకు పెట్టుబడులు, ఇతరంగా ప్రతిఫలం ముడుతున్నది. అది ఎంతో కాలం కొనసాగించలేరని ఒక్కొక్కటి జారుకుంటున్న తీరు వెల్లడిస్తున్నది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ ఏడవ తేదీ వరకు తైవాన్‌ ప్రాంత పాలకురాలు తై ఇంగ్‌ వెన్‌ లాటిన్‌ అమెరికా, అమెరికా తదితర దేశాలను సందర్శించనున్నారు. తైవాన్‌ వేర్పాటు వాదులకు ప్రపంచంలో ఎంతో మద్దతు ఉందని చెప్పి విశ్వాసం కల్పించేందుకు ప్రధానంగా ఆమె వెళుతున్నారు. పైకి ఏమి చెప్పినప్పటికీ తమకు చైనా నుంచి ముప్పు వస్తున్నదని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. ఇదంతా అమెరికా అడిస్తున్న నాటకం అన్నది తెలిసిందే.


ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది.నడమంత్రపు సిరి నరం మీది పుండు కుదురుగా ఉండనివ్వవు అన్నట్లుగా అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది.గత వారంలో అమెరికా మిలిటరీ జాయింట్‌ ఛీఫ్‌ల చైర్మన్‌ మార్క్‌ మిలే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ రక్షణశాఖ పార్లమెంటరీ ఉపకమిటీ ముందు మిలిటరీ విధానం, ఆలోచనల గురించి మాట్లాడారు. రికార్డు స్థాయిలో మిలిటరీ బడ్జెట్‌ ప్రధానంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినదని స్పష్టం చేశారు. చైనాతో పోరుకు తమను సన్నద్దం చేస్తుందని అన్నారు.ఉప సంఘం చైర్మన్‌ కెన్‌ క్లవర్ట్‌ తొలి పలుకులు పలుకుతూ అవసరమైతే ఈ రాత్రికి రాత్రే పోరుకు సిద్దంగా ఉండాలి, ప్రపంచంలో ఎదురులేని శక్తిగా వేగంగా నవీకరించాలని ప్రకటించాడు. చైనా మిలిటరీతో అమెరికా వ్యూహాత్మక పోటీ దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ అని ఆస్టిన్‌ చెప్పాడు. మార్క్‌ మిలే మాట్లాడుతూ రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని వర్ణించాడు.ప్రస్తుతం మొత్తం 10,330 యూనిట్లు ఉన్నాయని, వాటిలో 4,680 చురుకైన విధుల్లో ఉన్నట్లు, అవి ఎంతగా అంటే వాటిలో అరవైశాతాన్ని 30 రోజుల్లో, పదిశాతాన్ని కేవలం 96 గంటల లోపుగానే మోహరించవచ్చని చెప్పాడు. ఈ సన్నద్దతను కొనసాగించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.దీనితో ప్రతి విభాగాన్ని సంసిద్దం గావించవచ్చన్నారు.మొత్తం లక్ష కోట్ల డాలర్లను బైడెన్‌ సర్కార్‌ సిద్దం చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యను అవకాశంగా తీసుకొని ఎలాంటి టెండర్లతో నిమిత్తం లేకుండా అమెరికాతో సహ అనేక దేశాల్లో నేరుగా పరికరాలు, అస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. మిలిటరీ ఎత్తుగడల గురించి కూడా మిలే, ఆస్టిన్‌ వెల్లడించారు. దేశ ఉద్ధేశ్యాలు శాంతియుతమైనవే, హింసాకాండ జరగవచ్చనే బెదిరింపులతో అమెరికా తన ఆలోచనలను రుద్దాలి అవి విఫలమైతే హింసాకాండకు దిగాలి అన్నారు.యుద్దం కంటే ఖర్చు ఎక్కువ కానప్పటికీ యుద్దసన్నద్దత, నిరోధించటం కూడా అసాధారణ రీతిలో ఖర్చుకు దారితీస్తుంది. ఈ భారీ బడ్జెట్‌ యుద్దాన్ని నిరోధిస్తుంది, అవసరమైతే పోరుకు మనల్ని సన్నద్ద పరుస్తుందని మిలే వాదించాడు. ఇలాంటి మాటలతో అమెరికన్లను, ప్రపంచ జనాలను మభ్యపెట్టేందుకు గతంలో అనేక మంది మిలిటరీ అధికారులు చూశారు. దీని వెనుక మిలిటరీ పరిశ్రమల అధిపతులకు లబ్ది చేకూర్చే ఎత్తుగడ ఉంది. నిజానికి చరిత్రలో హిట్లర్‌ మిలిటరీ అధికారులు కూడా ఇదేవిధంగా మాట్లాడారు, జర్మన్లను మభ్యపెట్టారు. వారిలో ఒకడైన ఎరిక్‌ రాడెర్‌ జర్మన్‌ నావికాదళ అధికారి, రెండవ ప్రపంచ యుద్ద నేరాలను విచారించిన న్యూరెంబర్గ్‌ కోర్టులో చేసిన ఇదే వాదనలను తిరస్కరించి జీవితకాల శిక్ష వేశారు. జర్మనీకి దుష్ట ఆలోచనలు లేవని, మిలిటరీ బలంగా ఉంటే కోరుకున్న ప్రాంతాలను యుద్దంతో నిమిత్తం లేకుండా బలాన్ని చూపి పొందవచ్చని వాదించాడు. నిజానికి మిలిటరీని పెంచటమేగాక, దాడుల పధకంలో కూడా ఎరిక్‌ రాడెర్‌ చురుకైన పాత్రధారి అని కోర్టు నిర్ధారించింది. ఆర్థికంగా దిగజారుడును మిలిటరీ హింసాకాండద్వారా పూడ్చుకోవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు.” ఏ దేశంలోనూ లేని విధంగా చైనాలో సంపద, వృద్ది జరుగుతున్నట్లు మనకు కనిపిస్తున్నది.విపరీతంగా సంపద పెరిగితే ప్రపంచవ్యాపితంగా అధికారం కూడా అలాగే పెరుగుతుంది.ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న మనం ఎల్లవేళలా అదే స్థానంలో ఉండాలని ” మిలే చెప్పాడు.


సినిమాలు, టీవీ చిత్రాల ద్వారా అమెరికన్లకు ముప్పు ఎలా ఎటు వైపు నుంచి వస్తున్నదో చూపటం అక్కడ జరుగుతున్నది.వాటిలో గతంలో రష్యన్లు, ఇతర అమెరికా వ్యతిరేకులను ప్రతినాయకులుగా చూపే వారు. వారి మీద అమెరికన్లలో ద్వేషం పుట్టించేవారు. ఇప్పుడు చైనా, ఇతర దేశాల వారిని కూడా ప్రధానంగా చూపుతున్నారు.దానిలో భాగంగానే ఇటీవల కొన్ని అమెరికా సంస్థలు, పార్లమెంటులోని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కొన్ని ఊహాజనిత యుద్ద క్రీడలను కంప్యూటర్లలో సృష్టించి జనానికి చూపుతున్నారు. వాటి ప్రకారం 2025నాటికి తైవాన్‌ అంశం మీద అమెరికా-చైనా పోరుకు తలపడతాయని, దానిలో చైనా ఓడిపోతుందని చిత్రించారు. ఇది హాలీవుడ్‌ సినిమా వంటిదే. వాటిలో అమెరికా సిఐఏ గూఢచారులను తెలివిగలవారిగా ఇతర దేశాల వారిని దద్దమ్మలుగా చిత్రిస్తారు. నిజానికి ఇంతవరకు ఏ ఒక్క యుద్దంలోనూ అమెరికా గెలిచిన ఉదంతం లేదు. దాన్ని సిఐఏ పసిగట్టి తమ నేతలను హెచ్చరించి పరువు నిలిపిందీ లేదు. అమెరికా రిటైర్డ్‌ నావీ అధికారి మార్క్‌ మాంట్‌గోమరీ ఓర్లాండోలో రిపబ్లికన్‌ ఎంపీలకు చైనాతో పోరు అనే ఒక ఊహా చిత్రాన్ని చూపాడు. దానిలో వేలాది మంది అమెరికన్లు మరణిస్తారని, విమానవాహక నావలను ముంచివేస్తారని చిత్రించాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మిలిటరీలో పని చేస్తున్న వారిలో 15 నుంచి 50 మంది లేదా దేశం మొత్తంగా ఐదు నుంచి ఇరవైవేల మంది ఒక వారంలో మరణిస్తారని చూపాడు. దానిలో తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు చైనా ప్రధాన ప్రాంతంపై ఎలాదాడి చేసేది, దాని నౌకలను ఎలా ముంచేది, మిలిటరీని ఎలా చక్రబంధం చేసేది, వివిధ కోణాల్లో జరిగే పర్యవసానాలను చూపారు. ఇలాంటి వాటిని బూచిగా చూపి అమెరికా తన దుర్మార్గాలను జనంతో ఆమోదింప చేసుకునేందుకు చూస్తున్నది.ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా తైవాన్‌ ఆక్రమణకు చైనా పూనుకుంటే నేరుగా అమెరికా మిలిటరీని దింపుతారా అన్న ప్రశ్నకు జో బైడెన్‌ అవును అని సమాధానమిచ్చాడు.


ప్రజాబలం, పట్టుదలలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ మిలిటరీ రీత్యా అమెరికాతో 50 సంవత్సరాల నాడు వియత్నాం సరితూగే స్థితిలో లేదు. అయినా బతుకు జీవుడా అంటూ అమెరికా మిలిటరీ ఎలా పారిపోయిందీ ప్రపంచమంతా చూసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందీ అదే. తాలిబాన్లకు సలాం కొట్టి అమెరికన్లు వెళ్లారు. అలాంటిది చైనాతో ఢకొీనగలమని అమెరికన్లను నమ్మించేందుకు అక్కడి యుద్ధోన్మాదులు చూస్తున్నారు. ” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో 2022 ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు మిలిటరీ డ్రిల్లుల ద్వారా చైనా చూపుతున్నది. వత్తిడి పెంచి రాయితీలు పొందేందుకు, వీలుగాకుంటే దాడికి తెగించేందుకు అమెరికా చూస్తున్నది. దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి ప్రతిగానే ఇటీవల షీ జింపింగ్‌ మాస్కో వెళ్లి పుతిన్‌తో మరింత గట్టిగా బంధానికి తెరతీశాడు. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని, ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడైంది. చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను సిఐఏ ప్రకటించింది.


ఏడు దశాబ్దాల నాడున్న చైనాకు నేటి చైనాకు ఏ విధంగానూ పోలికే లేదు. ఇరాన్‌-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చి తన పలుకుబడి ఏమిటో ప్రదర్శించింది. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.డేనియల్‌ ఎల్స్‌బర్గ్‌ బహిర్గతపరచిన పెంటగన్‌ పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ అధిగమించింది. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే నిప్పుతో చెలగాటాలాడవద్దని బైడెన్‌తో భేటీలో షీ జింపింగ్‌ హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

12 Sunday Mar 2023

Posted by raomk in Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adolf Hitler, anti communists, Joseph Stalin, Joseph Vissarionovich Stalin, USSR, world war 2


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: