• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !

26 Friday Feb 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala LDF, Kerala political love jihad, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఏప్రిల్‌ ఆరవ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణలు, సర్దుబాట్లు త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. గత నాలుగు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారానికి వస్తే మరోసారి సిపిఎం నాయకత్వంలోని కూటమి రావటం తెలిసిందే. దానికి భిన్నంగా ఈ సారి మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తుంటే, అధికారానికి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ చేయని ప్రయత్నం లేదు. కేవలం ఒక స్ధానం ఉన్న బిజెపి తాము కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. తాను చేరితే బిజెపి ఓట్లు రెట్టింపు అవుతాయని, అధికారానికి వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి సిద్దంగా ఉన్నానని మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌లో 14 పార్టీలు, యుడిఎఫ్‌లో ఐదు ఉన్నాయి. ఎన్‌డిఏలో బిజెపితో పాటు మరో నాలుగు చిన్న పార్టీలు ఉన్నాయి. మొత్తం 140 స్దానాలకు గాను ఎల్‌డిఎఫ్‌కు 91 స్ధానాలు, యుడిఎఫ్‌కు 47, బిజెపికి ఒకటి, ఆ పార్టీతో జత కట్టిన మరో పార్టీకి ఒక స్ధానం ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌లో కొత్తగా చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ యుడిఎఫ్‌లో ఉండగా గత ఎన్నికల్లో 11, 7 స్దానాల చొప్పున పోటీ చేశాయి. ఇప్పుడు వాటికి ఎల్‌డిఎఫ్‌లోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా సిపిఎం, సిపిఐ తమ స్దానాల సంఖ్యను తగ్గించుకొని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు యుడిఎఫ్‌లో ఖాళీ అవుతున్న సీట్లలో మిగిలిపోయిన కేరళ కాంగ్రెస్‌(జె)కు ఏడు సీట్లు పోను మిగిలిన వాటిని కాంగ్రెస్‌-ముస్లిం లీగు పంచుకుంటాయని వార్తలు వచ్చాయి. కొద్ది వారాల క్రితం పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి ఎల్‌డిఎఫ్‌కు 101 స్ధానాలు వస్తాయని, మళయాల మనోరమ విశ్లేషించగా, 98వస్తాయని సిపిఎం సమీక్షలో తేలిందని అదే ప త్రిక రాసింది. స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికలలో ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కూడా తిరిగి అదే ప్రచారం ప్రారంభమైంది.మీడియా వాటికి వంతపాడుతున్నది.


ఓట్లకోసం చర్చిల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న బిజెపి -ముస్లిం లీగుకూ ఆహ్వానం !


కేరళలో సీట్లు వచ్చినా రాకపోయినా కనీసం ఓట్లయినా పెంచుకోవాలని, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకోవాలన్నది బిజెపి ఆత్రం. అత్రగాడికి బుద్ది మట్టు అన్న సామెత తెలిసిందే. నిత్యం మత మార్పిడుల గురించి క్రైస్తవ మతాన్ని తిట్టిపోసే బిజెపి నేతలు ఇప్పుడు కేరళలో చర్చ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు, ఆ మత పెద్దలను సంతుష్టీకరించి ఓట్లు పొందేందుకు నిర్ణయించుకున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ త్వరలో అందుకోసం బయలుదేర నున్నారని కేరళలో అగ్రశ్రేణి దినపత్రిక మళయాల మనోరమ రాసింది.కర్ణాటక నుంచి కేరళ బిజెపి అభ్యర్ధులకు అవసరమైన డబ్బుతో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నడుంకట్టారు. కేరళలో సమస్యలు, బిజెపి ఎత్తుగడల గురించి చర్చించేందుకు బెంగళూరులోని వంద మంది మళయాలీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట.
కేరళ రాజకీయాల్లో ఏది వాటంగా ఉంటే దాన్ని అనుసరించే సీనియర్‌ ఎంఎల్‌ఏ పిసి జార్జి. కాంగ్రెస్‌తో జీవితాన్ని ప్రారంభించి స్వతంత్రుడిగా, కేరళ కాంగ్రెస్‌లోని రెండు ప్రధాన గ్రూపుల్లో చేరి తరువాత దాన్నుంచి బయటకు వచ్చి జనపక్షం పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. ఏ పేరుతో పోటీ చేసినా మంచి మెజారిటీలతో ఏడు విజయాలతో ఒక ప్రత్యేకత సాధించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తాజా వార్తల ప్రకారం మరోసారి బిజెపితో చేతులు కలపబోతున్నారు. రెండు సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు వార్తలు. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బహిరంగ ప్రకటనలు, అంతర్గతంగా బిజెపితో సంబంధాలు నెరపటంతో జార్జిని చేర్చుకుంటే చేర్చుకుంటే సంగతి తేలుస్తాం అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం హెచ్చరించింది. ఒక వేళ చేర్చుకొని సీటు ఇస్తే పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని కొట్టాయం జిల్లా నేతలు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్ధితిలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా కొన్ని వేల ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి కనుక చేర్చుకోవాలన్న వర్గం వాదనలను మెజారిటీ అంగీకరించలేదు.


ఎల్‌డిఎఫ్‌ ఎలాగూ చేర్చుకోదు గనుక పిసి జార్జి బిజెపి వైపు చేరనున్నారు. ఆ పార్టీని మంచి చేసుకునేందుకు ముందుగానే చెప్పినట్లు ముస్లింలను విమర్శించి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామాలయ నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చినట్లుగా మాతృభూమి పత్రిక రాసింది. బిజెపితో కలసిన మరొక పార్టీ కేరళ కాంగ్రెస్‌(థామస్‌). దీని నేత పిసి థామస్‌ గతంలో వాజ్‌పేయి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పిసి జార్జిని బిజెపి వైపు తీసుకురావటంలో సంధానకర్తగా పనిచేశారని వార్తలు.జార్జి వస్తే కొట్టాయం జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్ధానంగా మారిన పాలా నియోజకవర్గంలో బిజెపి గెలవవచ్చనే అంచనాతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఐదు దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత మణి మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున్‌ ఎన్‌సిపి అభ్యర్ధి ఎంసి కప్పన్‌ విజయం సాధించారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(ఎం) బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరింది.దాంతో పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించాలని సిపిఎం నిర్ణయించింది. కప్పన్‌కు వేరే చోట కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినలేదు. దాంతో ఎన్‌సిపి అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించటంతో యుడిఎఫ్‌లో చేరారు. పిసి జార్జి గతంలో కేరళ కాంగ్రెస్‌(ఎం)లో ఉన్నపుడు దివంగతనేత మణి కుమారుడు ప్రస్తుత నేత జోస్‌కె మణితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి మణి పాలాలో పోటీ చేస్తారన్న వార్తల పూర్వరంగంలో పిసి జార్జి కాంగ్రెస్‌లో చేరి దెబ్బకొట్టాలని చూశారు. అది సాధ్యంగాకపోవటంతో బిజెపితో చేతులు కలుపుతున్నారు. పాలాలో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


మరొక ముఖ్యమైన పరిణామం ముస్లిం లీగ్‌ను ఎన్‌డిఏలోకి ఆహ్వానించారు. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శోభా సురేంద్రన్‌ మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లిం లీగ్‌ జాతీయవాదాన్ని అంగీకరించి ఎన్‌డిఏలోకి రావాలని అది లీగ్‌ నేతలకు, ముస్లింలకూ ఉపయోగం అని ఆమె వ్యాఖ్యానించారు. అది జరిగినా ఆశ్చర్యం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు సంచలనం సృష్టించటంతో కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ మాట్లాడుతూ తాము ముస్లింలీగ్‌తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు కాదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలను వారు గుర్తించాలన్నారు. మరోవైపున కేరళలో తాము అధికారానికి రావాలంటే 35-40 స్ధానాలు వస్తే చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చెప్పారు.


బిజెపి రిక్రూట్‌మెంట్‌ ఏజంట్‌గా రాహుల్‌ గాంధీ !


కాంగ్రెస్‌ నిర్వహించిన కేరళ ఐశ్వర్య యాత్ర ముగింపు సభకు వచ్చిన రాహుల్‌ గాంధీ ప్రసంగ తీరుతెన్నులు బిజెపి రిక్రూటింగ్‌ ఏజంట్‌ మాదిరిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గం విమర్శించింది. బిజెపిపై పల్లెత్తు విమర్శకూడా చేయకుండా వామపక్షాలపై బిజెపి చేస్తున్న విమర్శల పదజాలాన్నే పునశ్చరణ గావించారని, ఆ కారణంగానే అనేక చోట్ల కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఏకంగా బిజెపిలోనే చేరేందుకు ఉత్తేజం పొందుతున్నారని సిపిఎం పేర్కొన్నది. బిజెపి అమలు చేస్తున్న వ్యవసాయ సంస్కరణలు అమలు జరుపుతామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ వైనాడ్‌లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన రాహుల్‌ గాంధీ చిత్తశుద్ది ఏమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విస్మరించిన రాహుల్‌ గాంధీ కేరళ వచ్చి మద్దతు ప్రకటించటం అసాధారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.1990 దశకంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన ఉదారవిధానాలు వ్యవసాయ సంక్షోభానికి కారణమని, ఆ పార్టీ చేతులు రైతుల రక్తంతో తడిచాయని, అందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన నియోజకవర్గం వైనాడ్‌లో గతంలో ఏమి జరిగిందో, కాఫీ, మిరియాల రైతులు ఎలా నాశనమయ్యారో తెలుసుకొనేందుకు సిద్దపడాలని అన్నారు. రెండు దశాబ్దాల నాడు కాంగ్రెస్‌ అమలు జరిపిన విధానాల కారణంగా వైనాడ్‌లోని ఆ పంటల రైతులు రెండు మూడు సంవత్సరాలలో ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయారని జర్నలిస్టు శాయినాధ్‌ పేర్కొన్న విషయాన్ని రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలన్నారు.ఆ విధానాల ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని అందుకుగాను రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం పట్ల రాహుల్‌ గాంధీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకే విధమైన వైఖరితో ఉన్నందున వారి మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !

26 Friday Feb 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#support farmers, Farmers Delhi agitation

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయ చట్టాలకు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతాంగాన్ని నగర ప్రవేశానికి నిరాకరించటంతో ప్రారంభమైన ఢిల్లీ శివార్లలో తిష్టకు మూడు నెలలు నిండాయి. నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించినట్లు అన్న సామెత తెలిసిందే. చర్చలకు సిద్దమే అన్న ప్రధాని నరేంద్రమోడీ ఆందోళనా జీవులంటూ రైతులను కించపరిచారు. తాము సిద్దంగానే ఉన్నామని రైతులు చెప్పినా జనవరి 22 తరువాత చర్చలు జరగలేదు. చట్టాల అమలు వాయిదా వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అయితే చర్చలకు తాము సిద్దమే అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.రైతులు గుమికూడినంత మాత్రానే చట్టాలు రద్దవుతాయా అని తనలోనూ తల్లి వైపు నుంచి రైతు రక్తం ఉందని చెప్పుకున్న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతులను తాజాగా ఎద్దేవా చేశారు.ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? జనాలు గుమికూడితే చట్టాలేం ఖర్మ ప్రభుత్వాలే మారిపోతాయని మతులు పోగొట్టుకున్న వారికి అర్ధం కాదు అని రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటిని చూడాలో !

బేటీ బచావో అన్న నోటితో ఉచ్చరించరాని బూతులా ? హవ్వ !!

మరోవైపున సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో, పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఉద్యమం మీద, రైతులకు మద్దతు ఇచ్చిన వారి మీద ఎడతెగని ముమ్మర దాడి సాగుతూనే ఉంది. భిన్నాభిప్రాయం లేదా నిరసన తెలిపిన మహిళలను సామాజిక మాధ్యమంలో బజారు…..లని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. తమ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన మహిళలు, యువతులు కూడా అనేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు అనే స్పృహ వారిలో ఉందా లేక ఉన్మాదంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. శీలము,ఏకత అంటూ కబుర్లు చెప్పేవారు ఇంతగా నోరుపారవేసుకోవాలా ? వారి నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడుతున్నంతగా గతంలో ఎన్నడూ లేదన్నది నిజం.తమను వ్యతిరేకించే వారిని ఇలాంటి పదజాలంతో తిట్టే బాపతు తమను కూడా వదలరు అని బిజెపి మహిళా అభిమానులు, కార్యకర్తలు గ్రహించటం అవసరం.

ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా రైతులు మనం చెప్పేది వినటం లేదు. వ్యవసాయ చట్టాల మీద వారిని మాయపుచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి అంటూ ఫిబ్రవరి 22న హర్యానాలోని గురుగామ్‌లో జరిగిన సమావేశంలో కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపి ధనకర్‌, క్రీడల మంత్రి సందీప్‌ సింగ్‌, హిసార్‌ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ తదితరులు హాజరైన సమావేశ దృశ్యాలతో ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా షేర్‌ చేశారు.

ప్రజా ఉద్యమాల అనుభవం ఏమిటి ? పాలకులను బట్టే కొత్త ఎత్తుగడలు !

మూడు నెలల తరువాత రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.నిజానికి ఇదొక కొత్త అనుభవం. రైతాంగ ఆవేదన నుంచి ఉద్బవించిన ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోయే దారిని కనుగొనగలదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 2011నాటి వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సెప్టెంబరు 17 ప్రారంభమైన ఆందోళనను పారిశుధ్య పరిస్ధితి దిగజారిందనే పేరుతో నవంబరు 15న నిరసనకారులను బలవంతంగా పోలీసులతో బయటకు గెంటివేశారు. కొన్ని వందల మంది మాత్రమే జుకొట్టి పార్కులో ఉన్నారు గనుక తొలగించగలిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా తాత్కాలిక మరుగుదొడ్లను తొలగించటం, నీటి సరఫరా, విద్యుత్‌ నిలిపివేయటం వంటి చౌకబారు చర్యలకు పాల్పడినా స్ధానిక జనం మద్దతుతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప వెనక్కు తగ్గలేదు.

ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రను చూస్తే విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఇలా చెప్పటం అంటే నిరాశావాదమూ, నిరుత్సాహపరచటమూ కాదు. మన దేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం 1857 నుంచి 1947వరకూ సాగింది.ఉవ్వెత్తున ఉద్యమించటం,నీరసించటాన్ని చూశాము. బ్రిటీష్‌ పాలకులు తమ ఎత్తుగడలను ఎన్నింటినో మార్చుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కూడా అదే పద్దతిలో తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది తప్ప వెనక్కు పోలేదు. సంఘపరివార్‌ మినహా కమ్యూనిస్టులతో సహా అన్ని శక్తులూ ఆ ఉద్యమంలో భాగస్వాములే, వారసులే.తమ చరిత్రను,త్యాగాలను మరచిపోయి ప్రజావ్యతిరేకిగా మారిన స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని గుర్తించేందుకు జనానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అలాంటిది విద్రోహ చరిత్ర తప్ప మరొకటి లేని సంఘపరివార్‌ సంస్ధ బిజెపి నిజస్వరూపం తెలుసుకొనేందుకు ఒక దశాబ్దం కూడా పట్టలేదు. మన శరీర ధర్మాలకు దేనికీ పనికి రాని క్రిమిక(అపెండిసైటిస్‌) ప్రతివారిలో ఉంటుంది.అది కొందరికి ప్రాణాంతకం అయినపుడు సకాలంలో గుర్తిస్తే ముప్పుతొలుగుతుంది.లేనపుడు కొనసాగితే ఎలాంటి హాని ఉండదు. బ్రిటీష్‌ వారు దేశం వదలి పోయిన తరువాత కూడా వారి పాలనను పొగిడిన జనం ఉన్నారు. అలాగే హిట్లర్‌ దుర్మార్గాలు తెలిసిన తరువాత కూడా సమర్దించిన వారు ఉన్నారు. వారు క్రిమికలాంటి వారే ఏ పార్టీకి అయినా అలాగే ఉంటారు.ఇలా ఎందుకున్నారు అని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు.

ఉద్యమాన్ని ఎంతకాలం సహిస్తారు ?

ఢిల్లీ శివార్లలో మూడు వైపుల ఉన్న లక్షలాది మంది రైతులను వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణదారుల మాదిరి తొలగించటం సాధ్యం కాదు గనుక మోడీసర్కార్‌ ఆపని చేయలేదు.కారణాలు ఏవైనా సుప్రీం కోర్టు రైతు ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరి సానుకూలం అని చెప్పకపోయినా అణచేందుకు తాత్కాలికంగా అయినా ప్రభుత్వానికి ఆయుధాన్ని ఇవ్వలేదు. ఇదొక ప్రధాన అంశం, తరువాత కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఢిల్లీ అన్ని వైపులా బిజెపి ఏలుబడే ఉంది, కనుక పోలీసులను, ప్రత్యేక దళాలను రప్పించటం పెద్ద పని కాదు. సాధ్యంగాకనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలను ఏర్పాటు చేశారు. ఎంతకాలం ఇలా అనుమతిస్తారు.తరువాతేం జరుగుతుందో తెలియదు గానీ అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి బల ప్రయోగానికి పూనుకోకపోవచ్చు. ఇప్పటికే పంజాబ్‌ మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపికి జనం చుక్కలు చూపించారు.

ఒక వైపు పంజాబ్‌, హర్యానా, యుపిలో రబీ గోధుమ పంట చేతికి వచ్చే తరుణం. కొంత మంది రైతులు తమ స్వస్ధలాలకు పోవటం అనివార్యం. అందువలన ఢిల్లీ శివార్లలో ఉన్నవారి సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు కూడా. దీన్ని చూపి ఉద్యమం వెనుక పట్టు పట్టిందనే ప్రచారం జరిపేందుకు బిజెపిశ్రేణులు సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించటం, కిసాన్‌ పంచాయత్‌లు, మహాపంచాయత్‌ల పేరుతో నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతాంగంలో మోడీ సర్కార్‌ మీద ఆగ్రహం పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు.ఫిబ్రవరి 21వ పంజాబ్‌లోని బర్నాలాలో లక్ష మందితో జరిగిన మజ్దూర్‌ కిసాన్‌ మహా ర్యాలీలో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు కూడా గణనీయంగా పొల్గొన్నారు. ఒక్క రైతులే కాదు, వ్యవసాయంతో పెనవేసుకున్న వ్యవసాయ కార్మికులను కూడా భాగస్వాములను చేయటం ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా మార్చే యత్నం ఇది. రైతులు-వ్యవసాయ కార్మికులు పరస్పర ఆధారితులు. వ్యవసాయ కార్మికులకు రెక్కల కష్టం తప్ప మరొక ఆదాయం ఉండదు తప్ప వేతనాలు పెంచాలని అడుగుతారు. తమకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి వేతనాలు కారణం కాదని అర్ధం చేసుకోలేని రైతులు వ్యతిరేకిస్తారు. వ్యవసాయ సంస్కరణలు రెండు తరగతులకూ నష్టం చేకూర్చేవి గనుక ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వుంది. వారి మధ్య ఉన్నది మిత్రవైరుధ్యమే తప్ప శత్రువైరుధ్యం కాదుగనుక సర్దుబాటు చేసుకోవచ్చు.

తమ మూడవ దశ ఉద్యమం గురించి ఫిబ్రవరి 28న వెల్లడిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.ఇరవై ఆరవ తేదీన యువ రైతుల దినం పాటిస్తున్నారు.మరుసటి రోజు స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర అజాద్‌ ప్రాణార్పణం చేసిన రోజు, సంత్‌ రవిదాస్‌ జయంతి రోజును కలిపి కిసాన్‌ మజ్దూర్‌ ఏక్తా దినం-రైతు, వ్యవసాయ కార్మిక ఐక్యతా దినం- పాటించాలని పిలుపునిచ్చినట్లు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ వెల్లడించారు.మార్చి ఎనిమిదిన ఢిల్లీ సరిహద్దుల్లో మహిళాదినోత్సవం సందర్భంగా ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోధుమ కోతలను గమనంలో ఉంచుకొనే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్ధానిక కిసాన్‌ పంచాయత్‌లు వాటిలో భాగమే. సభలకు హాజరవుతూనే రైతులు తమపని తాము చేసుకుంటారు. వెసులుబాటు కుదరగానే తిరిగి ఢిల్లీ ముట్టడిలో చేరతారని భావిస్తున్నారు.

వ్యవసాయ చట్టాల నిలిపివేత ఓ ప్రహసనం !

రైతు ఉద్యమం ఒక అనూహ్య పరిణామం. ప్రభుత్వ నిఘా సంస్ధలు,లేదా దిగువ స్దాయిలో ఉన్న సంఘపరివార్‌ కార్యకర్తలు కూడా దీన్ని పసిగట్టలేకపోయారు. లక్షల మంది రైతుల మీద బలప్రయోగం సాధ్యం కాదు, ఒక వేళ పశుబలాన్ని ప్రయోగిస్తే అది మోడీ సర్కార్‌ అంతానికి ఆరంభం అవుతుంది. చట్టాల అమలు నిలిపివేసినట్లు ప్రకటించిన సుప్రీం కోర్టు రైతులతో చర్చించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మేకలతో చర్చలకు తోడేళ్లను మధ్యవర్తులుగా పంపినట్లుగా వ్యవసాయ చట్టాలను సమర్దించేవారితో కూడిన కమిటీ అది. దానికి ఇచ్చే నివేదనలు ఎలా ఉన్నా, అంతిమంగా ఎలాంటి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పిస్తారో ఊహించుకోవటం కష్టం కాదు.ఆ కమిటీ నివేదిక సుప్రీం కోర్టుకు అంది దాని మీద ఒక నిర్ణయం తీసుకొనే వరకు లేదా పద్దెనిమిది నెలలపాటు చట్టాల అమలు నిలిపివేస్తామని కేంద్రం చెబుతోంది. నిజానికి నిలిపివేసినట్లు కాదు. చట్టాల సవరణకు ముందున్న పరిస్దితిని పునరుద్దరించకుండా చట్టాల అమలు నిలిపివేత అంటే మోసం తప్ప మరొకటి కాదు. ఆర్డినెన్స్‌ తెచ్చిన గతేడాది జూన్‌ నుంచే అమలు జరుగుతోంది అని ప్రభుత్వమే చెప్పింది.దాన్ని నిలిపివేయటం అంటే అర్ధం ఏమిటి ? అంటే ఇప్పుడు అసలే చట్టమూ లేదా ? చట్టరహిత పాలన ఎవరికి ఉపయోగం ? నిజానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన నిలిపివేత ప్రకటనలో నిజాయితీ లేదు. రైతు ఉద్యమం గురించి చర్చించేందుకు భయపడిన సర్కార్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేసి నేరుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకే పోయింది. ప్రభుత్వాన్ని నిలదీస్తే సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు, నిలిపివేతను చూపుతూ చర్చ లేకుండా చేస్తారు. ఒక వేళ అనూహ్య పరిస్దితిలో సుప్రీం కోర్టు చట్టాలను శాశ్వతంగా నిలిపివేయాలని తీర్పునిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతివ్వాలా లేదా అనే అంశం తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే అని సుప్రీం కోర్టు చెప్పటం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇష్టం లేకున్నా ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన అనుమతిని ఎలా వినియోగించుకుందో చూశాము.

రైతుల కంటే హిందూత్వ గురించే ఆర్‌ఎస్‌ఎస్‌ బెంగ !

ఇరు పక్షాలూ ఒక మధ్యేమార్గంలో పరిష్కారానికి రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి బహిరంగంగానే రైతు ఉద్యమం-ప్రభుత్వ తీరు గురించి ఒక ప్రకటన చేశారు. ఉద్యమ సెగ వారికి కూడా తగిలిందన్నది స్పష్టం. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బిజెపికి మార్గదర్శనం చేసేది, ప్రభుత్వాన్ని పర్యవేక్షించేది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది స్పష్టం. సాంస్కృతిక సంస్ద ముసుగులో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నది బహిరంగ రహస్యం.వ్యవసాయ చట్టాల గురించి ఆర్డినెన్స్‌ తెచ్చినపుడే అనేక రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి, ఆందోళనలు చేసినా వారికి పట్టలేదు, ఆందోళనా జీవులను నెట్టవతల పడవేయవచ్చన్న అతి అంచనా కావచ్చు. రైతుల ఆందోళనను బలప్రయోగంతో అణచివేస్తే దాని అసలైన హిందూత్వ అజెండా ముందుకు పోకపోగా వ్యతిరేకత ముందుకు వస్తుంది. ఆ కారణంతో జాగ్రత్తపడమని మధ్యేమార్గం చూడమని చెప్పింది తప్ప చిత్తశుద్ది, రైతుల పట్ల దానికి ఆసక్తి అనుమానమే.దాన్ని దాచిపెట్టి ప్రభుత్వం పట్ల సంఫ్‌ు సంతృప్తిగా లేదంటూ లీకుల ద్వారా దాని మంచితనం గురించి ప్రచారం చేశారు.

రైతు ఉద్యమం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా రాకేష్‌ తికాయత్‌ – ఇతర నేతల మధ్య తేడా ఉన్నట్లు చూపే ప్రయత్నం కూడా జరిగింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత మహేంద్రసింగ్‌ తికాయత్‌ కుమారుడిగా రాకేష్‌కు గుర్తింపు ఉంది. ఉత్తర భారత్‌లోని వ్యవసాయ సామాజిక తరగతి జాట్‌ల పలుకుబడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పంజాబ్‌లో వీరు సిక్కు మతాన్ని ఇతర చోట్ల హిందూమతాన్ని పాటిస్తారు. అందువలన హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ జాట్‌ ప్రాంతాలలో తికాయత్‌కు పరిచయం అవసరం లేదు. రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీలో జరిగిన ఉదంతాల తరువాత ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం గురించి భిన్న కథనాలున్నా లక్షలాది మంది రైతులను కదిలించింది.ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ప్రారంభంలో తికాయత్‌ ప్రభావం పరిమితమే. ఆయనను విడిగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవటంలో కూడా విభజించి పాలించాలనే ఎత్తుగడ ఉంది. దాన్ని గ్రహించి వెనక్కు తగ్గారనుకోండి. తికాయత్‌ కొన్ని వ్యక్తిగతమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారనే అభిప్రాయం ఉంది. మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు రెండు వరకు రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తారని చేసిన ప్రకటన అలాంటిదే. ఇలాంటి వాటిని చూపే బిజెపి రాజకీయ దాడి చేస్తున్నది. కార్యాచరణ కమిటీలో దాన్ని గురించి చర్చించలేదని ఒక నేత చెప్పాల్సి వచ్చింది.ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి ఉద్యమాలలో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే ప్రతిదానికీ దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. అన్నా హజారే అంటే ఇప్పటికీ గౌరవం ఉంది, కానీ ఆ పెద్దమనిషి ఉద్యమానికి మద్దతు ప్రకటించి తరువాత ప్రభుత్వం వేసిన కమిటీ గురించి సంతృప్తి ప్రకటించారు. ఇలాంటి వారి గురించి రైతులు ఆలోచించుకోవాలి.

ఉద్యమ బలం – బలహీనతలూ !

నెల రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలవటం లేదని కొందరు రైతు నేతలు ఆందోళన పడుతున్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు.పదకొండు కాదు, పదకొండు వందల సార్లు పిలిచినా ఇంతకు ముందు చెప్పిందే చెబుతారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే ఆందోళనా జీవి అంటూ ఎద్దేవా చేసిన ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని చూస్తే ఢిల్లీ శివార్లలో ఎన్ని నెలలు కూర్చుంటారో కూర్చోనివ్వండి, విసిగిపోయి వారే లేచిపోతారనే భావంతా ఉన్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు.

ఒక ఉద్యమం, అదీ స్వచ్చందంగా ప్రారంభించిన ఉద్యమం. ప్రతి ఉద్యమానికి బలం-బలహీనతలు రెండూ ఉంటాయి. రెండోదాన్ని అధిగమించి ముందుకు పోవటమే ఉద్యమ లక్షణం.ఒక కొండ ఎక్కేందుకు ముందు చాలా ఉత్సాహంగా ప్రారంభం అవుతాము. అదే పైకిపోయే కొలదీ ఎక్కటానికి ఎంత ఇబ్బంది పడాలో తెలిసిందే. ఒక ఉద్యమం కూడా అలాంటిదే. రోజులు గడిచే కొద్దీ కొంత మందిలో తొలుత ఉన్న ఉత్సాహం, పట్టుదల సడలుతుంది.నలుగురితో పాటూ మనమూ అంటూ సాదాసీదాగా ప్రారంభమైన వారిలో పట్టుదల రెట్టించటం కూడా తెలిసిందే.

రైతులపై ముప్పేట దాడి !

రైతులు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి కోత కోసి పంటను తేగలరు తప్ప మధ్యలో వచ్చే తెగుళ్లను తట్టుకోవటం అంత తేలిక కాదు. ఉద్యమం ప్రారంభంలోనే ఖలిస్తానీ, ఉగ్రవాద ముద్రవేశారు. దీని వెనుక జాతి వ్యతిరేక శక్తులున్నారని ప్రచారం చేశారు. అంతర్జాతీయంగా సమన్వయ పరుస్తున్నారని అతిశయోక్తులు చెప్పారు.ఇప్పటి వరకు పాలకుల అణచివేతకంటే ఏ ఉద్యమం ఎరగని విధంగా మాధ్యమాల ముట్టడి- తప్పుడు ప్రచారదాడిని రైతాంగం ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంకా కొనసాగుతూనే ఉంది.యుద్దంలో ఒక్క అంగుళాన్ని కూడా వదలకుండా బాంబులతో నాశనం చేయటాన్ని కార్పెట్‌ బాంబింగ్‌ అంటారు. వియత్నాంలో అమెరికా దురాక్రమణ-దాడి సమయంలో ఈ పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రచార దాడి జరుగుతోంది. ఇన్ని నెలల ఉద్యమం, ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యం పొందిన తరువాత అంతర్జాతీయంగా ప్రముఖులు స్పందించకుండా ఎలా ఉంటారు. రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌, మీనా హారిస్‌ వంటి వారు ట్వీట్లు చేయగానే మన దేశంలో ప్రముఖులుగా ఉన్నప్పటికీ దేనికీ స్పందించని వారందరితో ట్వీట్ల మీద ట్వీట్లు చేయించి మరో యుద్దరంగాన్ని తెరిచారు.మన దేశం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు విదేశీయులకు టూల్‌కిట్‌ సరఫరా చేశారనే పేరుతో దిశారవి మరికొందరి మీద దేశద్రోహం నేరం వంటివి ఆపాదించి అరెస్టులు చేశారు. ఇలాంటి ఎదురుదాడి, రిపబ్లిక్‌ డే రోజున జరిగిన కుట్రలను నిజంగానే రైతాంగం ఊహించలేదు. దిశారవి టూల్‌కిట్‌లో దేశద్రోహమూ లేదు, హింస ప్రేరేపణా లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

నిజానికి అంత ముప్పేగనుక వస్తే దాన్ని మరింత రచ్చ చేయటం ఎందుకు ? కుట్రలు వాస్తవమే అనుకుంటే వాటిని వమ్ము చేసేందుకు చట్టాలను రద్దు చేస్తే పోలా ? నరేంద్రమోడీకి దేశమా ? మరొకటా ! ఏది ముఖ్యం ! ముందు చట్టాలను రద్దు చేసి అంతర్జాతీయ కుట్రలను వమ్ము చేసి అంతగా అయితే అన్ని తరగతులతో చర్చించి ఆమోదయోగ్యమైన సంస్కరణలు తెచ్చి నిజంగా రైతాంగాన్ని ఉద్దరిస్తామంటే ఎవరు వద్దంటారు ?

పాలకులను బట్టే ఉద్యమ స్వభావంలో మార్పు !

ఉద్యమం సాగుతున్నకొద్దీ, పాలకుల వైఖరిని అర్ధం చేసుకున్న కొద్దీ ఏ కష్టజీవుల ఉద్యమం అయినా తమ సమస్యలకే పరిమితం కాదు. కాంగ్రెస్‌ 1895లో ప్రారంభమైనపుడు దానికి రాజకీయాల్లేవు.భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని, చదుకున్న భారతీయులకు ప్రభుత్వంలో ఎక్కువ అవకాశాలివ్వాలనే కోర్కెలతోనే ఉద్యోగవిరమణ చేసిన బ్రిటీష్‌ జాతీయుడు ఎఓ హ్యూమ్‌ ఒక ఉద్యమంగా ప్రారంభించాడు.నిజాం సంస్ధానంలో తెలుగును బతికించాలనే కోర్కెతోనే ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. చివరికి ఆ కాంగ్రెస్‌ బ్రిటీష్‌ వారు దేశం వదలి పోవాలనే వైఖరితో, నైజాం సంస్దానాన్ని కూల్చివేసే విధంగా కమ్యూనిస్టుల నాయకత్వాన ఆంధ్రమహాసభ తయారయ్యాయి. అలాగే ఇప్పుడు రైతు ఉద్యమం పట్ల బిజెపి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేతలను బహిష్కరించాలనే పిలుపులు వెలువడుతున్నాయి,వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక పాఠం చెప్పాలనే ఆలోచనలు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.వీటిని చూసి ఆ పార్టీ కూడా పంజాబ్‌, రాజస్ధాన్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో తమ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ దాడికి సిద్దం అవుతోంది. దానిలో భాగమే పైన చెప్పుకున్న హర్యానా గురుగామ్‌ సమావేశం. చూశారా మేము ముందే చెప్పాం ఇది రైతుల ఉద్యమం కాదు, ఆపేరుతో బిజెపి వ్యతిరేక ఉద్యమం అని ప్రచారం ప్రారంభించవచ్చు.కానివ్వండి ఆ పార్టీకి ఆ హక్కు ఉంది. జనమే తేల్చుకుంటారు. బిజెపికి ఏ రాజకీయ పార్టీ వద్దలేనంత డబ్బు ఉంది, దాన్ని నిలబెట్టేందుకు అదానీ,అంబానీల వంటి వారు ఎంతైనా ఇంకా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా చేసే యంత్రాంగం ఎలాగూ ఉంది.నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు గోవిందా అన్నట్లు జనం తలచుకోవాలేగానీ ఏదీ ఆగదు. రైతు పోరు కొత్త దిశ, కొత్త దశలో ప్రవేశించనుంది. ప్రభుత్వంతో చర్చల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరింతగా రైతులను, వారికి మద్దతు ఇచ్చే వారిని సమీకరించటం, దేశ వ్యాపితంగా విస్తరించటమే చేయాల్సి ఉంది.

8 .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !

20 Saturday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

# Metro Man Sreedharan, #Kerala CPI(M), Jacobite church, Kerala BJP, Kerala political scene, LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడున్న ఒక స్ధానాన్ని డెబ్బయి ఒకటికి పెంచాలని ప్రధాని నరేంద్రమోడీ కేరళ బిజెపి నేతలకు ఉద్బోధ చేశారు. దాన్ని నిజమే అని నమ్మినట్లున్నారు మెట్రోమాన్‌గా ప్రసిద్ది చెందిన ఇ శ్రీధరన్‌. ఇంకేముంది కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దం సుమతీ అంటూ మీడియాకు ఎక్కారు. దీన్నే ముది మది తప్పటం అంటారేమో ! అసంఖ్యాక అభిమానుల నీరాజనాలు అందుకున్న ఏడు పదుల సూపర్‌ స్టార్‌ రజనీకాంతే ఆ దేవుడు వద్దన్నాడు ఈ రజనీ పార్టీ రద్దన్నాడు అన్నట్లుగా తమిళనాడులో చేతులెత్తేశాడు. అలాంటిది 88ఏండ్ల వయస్సులో శ్రీధరన్‌ కేరళలో నేను రెడీ అంటున్నారు. అయితే తాను, లేకపోతే కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ మరోసారి ముఖ్యమంత్రి అయినా తనకు సంతోషమే అన్నారు. కాంగ్రెస్‌ నేతలు రమేష్‌ చెన్నితల, ముస్లింలీగు నేత కున్హాలీ కుట్టి తనను మంచిగా చూసుకున్నారని, వామపక్షాల నుంచి అలాంటిది లేదన్నారు.పాలక్కాడ్‌ జిల్లా జన్మస్దలం అయినా ప్రస్తుతం మలప్పురం జిల్లాలో ఉంటున్నారు. అక్కడి నుంచే పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. అందుకే ముస్లిం లీగు నేతను కూడా ఉబ్బించే యత్నం చేశారు. నేను గాని ఈల వేస్తే అన్నట్లుగా నేను గనుక బిజెపిలో చేరితే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఓట్లు రెట్టింపు అవుతాయి అని శ్రీధరన్‌ చెప్పుకున్నారు. అది దేశభక్తి సంస్ద తప్ప మతతత్వపార్టీ కాదు, అది తప్ప మిగతా పార్టీలేవీ అభివృద్దిని పట్టించుకోవు అన్నారు.


ఇప్పటి వరకు ఒక ఇంజనీరుగా గౌరవం పొందిన ఆ పెద్దమనిషి జీవిత చరమాంకంలో కాషాయతాలిబాన్‌గా తన అంతరంగాన్ని బయటపెట్టుకున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నంత వరకు ఏ పార్టీ పట్ల అభిమానం చూపకూడదు, ఇప్పుడు తనకు అలాంటివేమీ లేవు గనుక బిజెపిలో చేరుతున్నా అన్నారు. కాకినాడ జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ విద్యార్ధిగా, తదుపరి మంచి ఇంజనీరుగా తన ప్రతిభను చూపారు. ఆ విషయంలో ఎవరూ వేలెత్తి చూపటం లేదు. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్‌ శేషన్‌కూ అదే ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒకేసారి సీటు వచ్చింది. అయితే శేషన్‌ ఇంజనీరింగ్‌ వద్దని సివిల్స్‌ను ఎంచుకొన్నారు. ఇద్దరూ ప్రస్తుత కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందినవారే.శేషన్‌ 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కెఆర్‌ నారాయణన్‌ మీద పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా ఇద్దరూ మితవాదులే.


బిజెపి నిర్వహిస్తున్న యాత్ర మలప్పురం జిల్లాలో ప్రవేశించే 21వ తేదీన శ్రీధరన్‌ ఆ పార్టీలో చేరే తతంగం పూర్తి చేస్తారు. ఈ రోజుల్లో బిజెపిలో పార్టీలో చేరాలంటే తాము పచ్చి హిందూత్వవాదులమని ప్రకటించుకోవటం మొదటి అర్హత. శ్రీధరన్‌ బీఫ్‌ నుంచి లవ్‌ జీహాద్‌ వరకు దేన్నీ వదలకుండా అన్నింటినీ వల్లిస్తూ దాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. కేరళ అభివృద్ది కావాలంటే తాను ముఖ్యమంత్రి అయితే తప్ప సాధ్యం కాదన్నారు. అధికారాల్లేని గవర్నర్‌ పదవి తనకు అవసరం లేదని కూడా ముందే చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే ప్రశ్నలు అడగటం తప్ప వేరే ఏమీ ఉండదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కనుక తాను ఆ పార్టీలో చేరితే రాష్ట్రానికి ఉపయోగం అన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పొందిన బిజెపి కేరళ నేత కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయనే చేయలేనిది శ్రీధరన్‌ చేయగలరా ?
ఇక బిజెపి గురించి ఆ తాతయ్య లేదా ముత్తాత పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. బిజెపి స్వయంగా విధించుకున్న నిబంధన ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ఎలాంటి పాలనా పదవుల్లో ఉండకూడదు. ఆ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను మార్చివేశారు. అయితే కర్ణాటక వచ్చేసరికి తనకు పదవి లేకపోతే అసలు పార్టీయే ఉండదని బెదిరించిన కారణంగా అబ్బే తూచ్‌ అదేమీ మాటతప్పని-మడమ తిప్పని సూత్రమేం కాదు, అవసరమైనపుడు మినహాయింపు ఇస్తాం అన్నట్లుగా 77 ఏండ్ల యడియూరప్పను కొనసాగిస్తున్నారు. శ్రీధరన్‌ ఇంజనీరుగా తన అనుభవంతో రైళ్లను నడిపించగలరు తప్ప రాజకీయవేత్తగా ఈ వయస్సులో బిజెపిని అదీ కేరళలో ? పెద్దాయన, ఎందుకు లెండి !


ఊమెన్‌ చాందీ ఊపేస్తున్నారంటున్న కాంగ్రెస్‌ !


కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని ఎన్నికల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడిగా నియమించటం, ప్రస్తుతం యాత్ర చేస్తున్న రమేష్‌ చెన్నితలతో ఆయన పర్యటిస్తుండటంతో స్దానిక ఎన్నికల తరువాత ఊపు వచ్చిందని, ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌తో పోటా పోటీ స్ధితికి చేరుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని కాంగ్రెస్‌ ఏఐసిసి ప్రకటించుకుంది. స్దానిక సంస్దలలో కూడా గణనీయంగా గెలిచినట్లు చెప్పుకున్న విషయం తెలిసిందే. ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ మీద బట్టకాల్చివేసే కార్యక్రమాన్ని ముమ్మురం చేసింది. ఈనెల 24న రాహుల్‌ గాంధీతో మత్స్యకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలోని లోతు ప్రాంతాలలో చేపల వేటకు ఒక అమెరికన్‌ కంపెనీతో ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ ఒప్పందం చేసుకుందని, మంత్రి మెర్సీకుట్టి కంపెనీ ప్రతినిధులను కలుసుకున్నారని రమేష్‌ చెన్నితల ఒక నిరాధార ఆరోపణ చేశారు. నిజానికి ఆ కంపెనీ ప్రవాస కేరళీయులు అమెరికాలో ఏర్పాటు చేసుకున్నది. చేపల వేట గురించి ఒక పధకాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందచేశార తప్ప ఆలూ లేదు చూలూ లేదని కంపెనీ స్వయంగా ఖండించింది. మత్స్యకారులను దెబ్బతీసే లోతు ప్రాంత చేపల వేటకు అనుమతిస్తూ గత యుపిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకించిందని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిందని, అయితే తాము అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. మత్స్యకారులు, స్దానిక కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని పేర్కొన్నారు. అమెరికన్‌ కంపెనీ ప్రతినిధులు తొలుత అమెరికాలో మంత్రిని కలిశారని ఆరోపించిన చెన్నితల తరువాత తన మాటలను తానే దిగమించి కాదు, సచివాలయంలో కలిశారంటూ కంపెనీ ప్రతిపాదనలు అందచేసిన సమావేశ చిత్రాలను విడుదల చేసి ఇంతకంటే రుజువు ఏమి కావాలని అడ్డు సవాళ్లు విసిరారు. మంత్రిగా తనను అనేక మంది కలుస్తుంటారని అంత మాత్రాన ఒప్పందం జరిగిందనటం పచ్చి అవాస్తవం, రమేష్‌ చెన్నితల క్షమాపణ చెప్పాలని మెర్సికుట్టి డిమాండ్‌ చేశారు.


ఎన్‌సిపి నుంచి బయటకు వచ్చి యుడిఎఫ్‌లో చేరిన ఎంఎల్‌ఏ కప్పన్‌ పరిస్ధితి అయోమయంగా తయారైంది. తమ పార్టీ గుర్తు మీదే పోటీ చేయాలని, ఫ్రంట్‌ భాగస్వామిగా చేరటం గురించి ఎన్నికల తరువాతే చూద్దాం అని కొంత మంది కాంగ్రెస్‌ నేతలు షరతు పెడుతుండగా, అలా చేస్తే ఆయన తప్ప వెంట నీడ కూడా రాదని అందువలన అలాంటి తీవ్ర షరతు పెట్టకూడదని మరికొందరు అంటున్నారు. కేరళ కాంగ్రెస్‌ నుంచి బలమైన మణి వర్గం చీలి ఎల్‌డిఎఫ్‌లో చేరినందున గతంలో కేటాయించినన్ని సీట్లు ఈ సారి ఇచ్చేది లేదని జోసెఫ్‌ వర్గానికి కాంగ్రెస్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. అవమానాన్ని తట్టుకొని అంగీకరిస్తారా ? మరేం చేస్తారో తెలియదు.

అదీ సిపిఎం నిబద్దత !


కొన్ని పంచాయతీలలో అడగకుండానే యుడిఎఫ్‌, బిజెపి, ఇతర పార్టీల సభ్యులు స్ధానిక రాజకీయాలు, ఎత్తుగడల్లో భాగంగా సిపిఎం సభ్యులకు ఓటు వేసి సర్పంచ్‌లు అయ్యేందుకు దోహదం చేశారు. అలాంటి చోట్ల ఆ పదవులు తమకు అవసరం లేదంటూ సిపిఎం సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఒక చోట ఎల్‌డిఎఫ్‌లోని మరో పార్టీ సర్పంచ్‌ అందుకు నిరాకరించటంతో ఫ్రంట్‌ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మలప్పురం జిల్లా వెట్టం పంచాయతీలో సంక్షేమ స్టాండింగ్‌ కమిటీలో సిపిఎంకు రెండు, యుడిఎఫ్‌కు రెండు, వెల్ఫేర్‌ పార్టీకి ఒక స్ధానం ఉంది. దాని చైర్‌పర్సన్‌ ఎన్నికలో వెల్ఫేర్‌ పార్టీ సభ్యుడు సిపిఎంకు ఓటు వేయటంతో కెటి రుబీనా ఎన్నికయ్యారు. అయితే తాము ఎవరి మద్దతూ కోరలేదని, అందువలన ఆ పదవి తనకు అవసరం లేదని రుబీనా రాజీనామా చేశారు. మతతత్వ వెల్ఫేర్‌ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవటం స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజకీయ దుమారం రేపింది. దాన్ని సిపిఎంకు అంటించేందుకు వేసిన ఎత్తుగడను పార్టీ ఇలా తిప్పికొట్టింది.పంచాయతీలోని 20 వార్డులకు గాను యుడిఎఫ్‌కు 10, ఎల్‌డిఎఫ్‌కు తొమ్మిది, వెల్ఫేర్‌ పార్టీకి ఒకటి ఉంది. సర్పంచ్‌ ఎన్నికను వెల్ఫేర్‌ పార్టీ బహిష్కరించింది.


బెదిరింపులకు దిగిన జాకోబైట్‌ చర్చ్‌ !


కేరళలోని మలంకర చర్చి వివాదంలో సుప్రీం కోర్టులో ఓడిపోయిన జాకోబైట్‌ చర్చ్‌ పెద్దలు బెదిరింపులకు దిగారు. సుప్రీం కోర్టు 2017లో ఇచ్చిన తీర్పు మేరకు 800 సంవత్సరాల నాటి చర్చి నిర్వహణ బాధ్యతను ఆర్డోడాక్స్‌ వర్గానికి అప్పగించాల్సి ఉంది. అయితే వివాద పడుతున్న రెండు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకుంటాయనే వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోలేదు. అయితే ఆర్దోడాక్స్‌ వర్గం వారు కోర్టు తీర్పును అమలు జరపటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ ఫిర్యాదులు చేయటంతో గత ఏడాది స్వాధీనం చేసుకొని అప్పగించారు. సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తెచ్చి తిరిగి తమకు స్వాధీనం చేయాలని జాకోబైట్స్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. గత 50 రోజులుగా నిరసన తెలుపుతున్న ఆ వర్గం దాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. అధికార, ప్రతిపక్షం రెండూ తమను పట్టించుకోలేదని, తామింక ఏ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండదలచలేదని, తమ రాజకీయ కార్యాచరణ రెండు వారాల్లో ప్రకటిస్తామని, అది ఎన్నికల ఫలితాలలో కనిపిస్తుందని ఆవర్గ పెద్దలు ప్రకటించారు. తమ మద్దతు కోసం ఎవరినీ బిషప్‌ బంగ్లాల్లోకి రానివ్వబోమన్నారు. ఈవర్గపు పెద్దలు కొద్ది వారాల క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. బిజెపి, ట్వంటీ20 పార్టీతో సహా తమ 15లక్షల ఓట్లను ఏ పార్టీకి వేయాలనేదీ తాము నిర్ణయిస్తామని జాకోబైట్‌ వర్గాలు తెలిపాయి. నిత్యం క్రైస్తవ, ఇస్లాం మతాలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే బిజెపి ఈ చర్చి వివాదంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా జాకోబైట్‌లను సమర్ధించి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లు పొందేందుకు సంతుష్టీకరణ చర్యలకు ఎల్‌డిఎఫ్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

17 Wednesday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Kerala LDF, Narendra modi pipe dreams, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


కేరళలో గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఏకైక స్ధానం తిరిగి వస్తుందా రాదా అన్న సమస్య ఉంటే ఆ ఒకటిని 71చెయ్యాలని కొద్ది రోజుల క్రితం కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. ఫిబ్రవరి 14న బిజెపి ముఖ్యనేతల సమావేశంలో మోడీ ఈ మేరకు దిశానిర్దేశం గావించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీకి మద్దతు కూడగట్టేందుకు అవసరమైన ప్రధాని మోడీ సూచనలు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను జనం వద్దకు తీసుకుపోవాలని ప్రధాని కోరారన్నారు. అన్ని తరగతులను పార్టీలోకి వచ్చేట్లు చూడాలని ప్రధాని కోరినట్లు బిజెపి నేతలు చెప్పారు. ఒకటి నుంచి 71సీట్లకు పెరిగేట్లుగా పార్టీ పని ఉండాలని ప్రధాని చెప్పినట్లు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పికె కృష్ణదాస్‌ చెప్పారు.

కేరళలో బిజెపి ప్రభావం-పని చేయని నరేంద్రమోడీ ఆకర్షణ !

బిజెపి నేతలు కేరళ గురించి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, బలం గురించి అతిశయోక్తులు చెప్పుకున్నా అంకెలు వాస్తవాలను వెల్లడిస్తాయి. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత జరిగిన 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఒకటి నుంచి 71కి చేరుకోవాలని ప్రధాని సూచించారు. అసెంబ్లీలో మొత్తం స్దానాలు 140, దానిలో అధికారానికి రావాలంటే 71 కావాలి, ఈ కారణంగానే అన్ని స్దానాల గురించి చెప్పారన్నది స్పష్టం.

విజయన్ను గట్టిగా వ్యతిరేకించమంటారు, అదెలా సాధ్యం అన్న బిజెపి ఏకైక ఎంఎల్‌ఏ !

ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ను గట్టిగా వ్యతిరేకించాలని కొంత మంది నన్ను కోరారు, అదెలా సాధ్యం అని కేరళ శాసనసభలో బిజెపి తొలి శాసనసభ్యుడిగా ఉన్న 91 సంవత్సరాల ఓ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. నీమమ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటి చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా మన వైపు రావాలని, గుడ్డిగా వ్యతిరేకిస్తే లాభం లేదన్నారు. ప్రతివారితోనూ స్నేహంగా ఉండాలని అది రాజకీయాల్లో లాభిస్తుందని తాను ఆ దిశగా పనిచేస్తానని అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయాలు సాధించినా ఆశించిన మేరకు బిజెపి పని తీరు లేదన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాజగోపాల్‌ బలపరిచిన విషయం తెలిసిందే ?

మళయాల సమాజం పూర్తిగా హిందూత్వకు లొంగలేదు -రచయిత హరీష్‌

తన నవల ” మీషా ”కు 2019 సాహిత్య అకాడమీ అవార్డు రావటం అంటే మళయాల సమాజం హిందూత్వకు పూర్తిగా లొంగలేదనేందుకు నిదర్శనం అని ప్రముఖ రచయిత ఎస్‌ హరీష్‌ వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యత ఉన్నందున అవార్డును స్వీకరించటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన నవలను ఒక పత్రిక అర్ధంతరంగా నిలిపివేయటం, తరువాత జరిగినదాన్ని చూస్తే సాహితీవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు హిందూత్వ శక్తులు ఒక ప్రయత్నం చేసినట్లు కనిపించిందన్నారు. 2018లో మాతృభూమి వారపత్రికలో ధారవాహికగా ప్రారంభమైన ఈ నవలలో ఒక పాత్రతో రచయిత చెప్పించిన మాటలపై బిజెపి, హిందూ ఐక్యవేది, ఇతర హిందూత్వ సంస్దలు వివాదం రేపాయి. ఈ నవలకు అవార్డు ఇవ్వటం హిందువులకు ఒక సవాలు అని, పినరయి విజయన్‌ ప్రభుత్వానికి హిందువుల మీద ఇంకా కోపం తగ్గలేదని, శబరిమలలో కూడా అదే చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు.


వివాదాస్పదం కావించిన నవలలోని రెండు పాత్రల మధ్య సంభాషణ ఇలా నడుస్తుంది.
” స్నానం చేసి ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకొని ఈ అమ్మాయిలు దేవాలయాలకు వెళ్లేది ఎందుకు ?
ప్రార్ధన చేసేందుకు !
కాదు, నువ్వు జాగ్రత్తగా చూడు. ప్రార్ధన చేసేందుకు అయితే వారు మంచి దుస్తులు వేసుకొని అందంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది ? తమకు తెలియకుండానే తాము శృంగారానికి సిద్దంగా ఉన్నామని సూచించటమే !
కానట్లయితే వారు నెలకు నాలుగైదు రోజులు దేవాలయాలకు ఎందుకు రారు ? ఆ రోజుల్లో తాము అందుబాటులో ఉండం అని చెప్పటమే. ప్రత్యేకించి పూజారులకు తెలియచేయటమే ! గతంలో పూజార్లు ఈ విషయాల్లో ముదుర్లు కదా ! ”
దేవాలయాలకు వెళ్లే హిందూ యువతులను, పూజార్లను అవమానించటమే ఇదంటూ కొందరు వివాదాస్పదం కావించటమే కాదు, రచయిత, కుటుంబ సభ్యులను బెదిరించారు. దాంతో తాను నవలను నిలిపివేస్తున్నట్లు రచయిత హరీష్‌ ప్రకటించారు. దేశాన్ని పాలిస్తున్నవారిని ఎదుర్కొనేందుకు తాను ఎంతో బలహీనుడినని అని వారపత్రికలో ప్రచురుణ నిలిపివేత సమయంలో చెప్పారు.రచయితల భావ ప్రకటనా స్వేచ్చకు తాము మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.
2018లో ఈ నవల మాతృభూమి పత్రికలో నిలిపివేసిన తరువాత డిసి బుక్స్‌ అనే సంస్ద వివాదాస్పద భాగాలతో సహా మొత్తం నవలను ప్రచురించింది. దీన్ని నిషేధించాలని కోరుతూ అదే ఏడాది కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ దాన్ని విచారించి పిటీషన్ను కొట్టివేసింది. ఇంటర్నెట్‌ యుగంలో మీరు ఇలాంటి అంశాలకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒక సమస్యగా చేస్తున్నారు. దీన్ని మరచి పోవటం మంచిది అంటూ భావ ప్రకటనా స్వేచ్చ కింద దీన్ని పరిగణిస్తున్నామన్నారు.

ఓట్ల కోసం కాంగ్రెస్‌ -బిజెపి అయ్యప్ప నామజపం !


వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి మరోసారి అయ్యప్ప నామజపం ప్రారంభించాయి. అయితే తామే అసలు సిసలు అయ్యప్ప పరిరక్షకులమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో శబరిమల అంశం తమకు లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్‌ భావిస్తున్నది. స్ధానిక సంస్ధలలో అది పని చేయలేదని గమనించిన తరువాత మరోసారి దాన్ని రేపేందుకు పూనుకుంది. ఈ విషయంలో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) బిజెపితో గొంతు కలిపింది. ఆందోళనలో ముందున్నది, కేసుల్లో ఇరుక్కున్నది తామే అని చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే భక్తులు కోరుకున్న విధంగా శబరిమల దేవస్దానం గురించి ఒక చట్టం తెస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేవస్ధానం బోర్డు ఆధీనంలో 1,300ల దేవాలయాలుండగా ఒక్క శబరిమల గురించి మాత్రమే చట్టం చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందని బిజెపి నేత కుమనమ్‌ రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అనేక మంది నిరుద్యోగ యువకుల మీద శబరిమల కేసులు ఉన్నాయని, వారంతా అమాయక భక్తులని కేసులను ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ నిందితుల మీద సానుభూతిని కల్పించేందుకు ప్రయత్నించారు.కేసులు ఎత్తివేయకపోతే భక్తులంటే ద్వేషం అని రుజువు అయినట్లే అన్నారు. అసెంబ్లీలో, అదే విధంగా పార్లమెంటులో శబరిమల మీద కాంగ్రెస్‌ సభ్యులు బిల్లును ప్రతిపాదించటానికి అనుమతి లభించలేదని, దాని గురించి కాంగ్రెస్‌ నేతలు చెప్పినదానితో సంతృప్తి చెందామన్నారు.


చిన్న పార్టీలు -చీలికలు !


అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాజకీయ సమీకరణలలో మార్పులు వస్తున్నాయి, అయితే అవి ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపేవిగా లేవు. యుడిఎఫ్‌ నుంచి బయటకు వచ్చిన ఒక పెద్ద పార్టీ కేరళ కాంగ్రెస్‌ (ఎం). ఆ పార్టీలో చీలికవర్గం యుడిఎఫ్‌లో కొనసాగుతుండగా, స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు పెద్ద వర్గం ఎల్‌డిఎఫ్‌లో చేరింది. అనేక చోట్ల ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాలను మెరుగుపరచింది.
ఎల్‌డిఎఫ్‌లో భాగస్వామిగా ఉన్న ఎన్‌సిపి చీలిపోయింది. ఉప ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్‌(ఎం) మీద గెలిచిన కప్పన్‌ యుడిఎఫ్‌ శిబిరంలో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలా నియోజకవర్గం కేరళ కాంగ్రెస్‌(ఎం)కు బలమైన నియోజకవర్గం. ఆ పార్టీ నేత మణి ఐదు దశాబ్దాల పాటు దానికి ప్రాతినిధ్యం వహించారు. మణి మరణంతో ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున కప్పన్‌ విజయం సాధించారు. ఆ స్దానాన్ని తనకు ఇస్తేనే కూటమిలో కొనసాగుతానన్న బెదిరింపులను ఎల్‌డిఎఫ్‌ ఖాతరు చేయలేదు. మరొక స్దానం కేటాయిస్తామని చెప్పినా దానికోసమే పట్టుబట్టారు. యుడిఎఫ్‌లో చేరినప్పటికీ తమ గుర్తుమీదనే పోటీ చేయాలని, కప్పన్‌కు పాలా స్దానం తప్ప మరొక స్ధానం ఎవరికీ కేటాయించేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎల్‌డిఎఫ్‌లో ఉన్న మరో చిన్న పార్టీ కేరళ కాంగ్రెస్‌(బి), దీనిలో అంతర్గత సమస్యల కారణంగా కొందరు యుడిఎఫ్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.కేరళ కాంగ్రెస్‌, మరో చిన్న పార్టీ ఎల్‌డిఎఫ్‌లో చేరిన కారణంగా వాటికి సీట్లు కేటాయించేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లను వదలుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నాయకత్వం కోరింది. ఆమేరకు కొన్ని సీట్లు తగ్గటం, స్దానాలు మారటం వంటివి చోటు చేసుకుంటాయి. మూడు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి ఈ సారి అవకాశం ఇవ్వకూడదని సిపిఐ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఉద్యోగాల భర్తీలో ఎల్‌డిఎఫ్‌ ఘనత !


కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవటం చూస్తున్నాం అలాంటిది కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్తగా 3,151 పోస్టులను సృష్టించాలని బుధవారం నాడు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 3000 వరకు ఆరోగ్యశాఖలో ఉన్నాయి.ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్దతకు ఇది పెద్ద నిదర్శనం. దొడ్దిదారిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ఆయన విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రాకముందు యుడిఎఫ్‌ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిక దిగువ విధంగా ఉంది.
ప్రభుత్వశాఖలు ××××× యుడిఎఫ్‌ ××××ఎల్‌డిఎఫ్‌
పోలీసు శాఖ ××××××××× 4,791 ×××× 13,825
ఎల్‌డిసి ××××××××× 17,771 ×××× 19,120
ఎల్‌పి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 1,630 ×××× 7,322
యుపి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 802 ×××× 4,446
స్టాఫ్‌ నర్సు(ఆరోగ్య) ×× ×1,608 ×××× 3,324
స్టాఫ్‌ నర్సు(మెడికల్‌) ×× 924 ×××× 2,200
అ.సర్జన్స్‌ (ఆరోగ్య) ×× ×2,435 ×××× 3,324

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

09 Tuesday Feb 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Vizag steel agitation, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలలో ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశాయి. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని నేతలు ప్రకటించారు. ”వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్‌” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.
అసలు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలననా? లేక ప్రభుత్వ ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లా ఉంటారు అని కొందరు అంటున్నారు. నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్‌ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్‌ ను ప్రారంభించి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడు సంవత్సరాల పాటు నిధులు కేటాయించలేదు. 1978 లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్‌ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌ , టౌన్‌ షిప్‌ శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ ను జాతికి అంకితం చేశారు. తరువాత ్‌ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వ పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆరించింది. ప్లాంట్‌ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్‌ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని సాధించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ”నవరత్న ” గా గుర్తించారు. ఏడాది గడవ కుండానే నవరత్నగా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్‌లో 10 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌ లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గత అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ”పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ 10 కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాం ట్‌ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా? ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.

2 )అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తోంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తున్నది. స్వంత గనులు వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. అసలు కర్మాగారమే లేని బ్రాహ్మణీ స్టీల్స్‌కు గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాగ్దానాలను, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమ తరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమ తరావు అర్దంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది.

విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాత విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను ఇవ్వక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు కేవలం కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలా అన్నారు. ”ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్‌ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్‌ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీగా పేరు పడిన విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేలఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను – పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది. రూ.7977 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీ గా రూ.18,000 కోట్లు చెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది.

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్దంగావున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది..

వ్యాస రచయిత గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేత, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కులం పేరుతో కేరళ ముఖ్యమంత్రిని అవమానించిన కాంగ్రెస్‌కు బిజెపి మద్దతు !

07 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF


ఎం కోటేశ్వరరావు


ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్‌ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.

ఏప్రిల్‌ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్‌ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్‌ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్‌ నోరు పారవేసుకున్నారు.


కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్‌ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ ఘాటుగా సురేంద్రన్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్‌ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్‌ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్‌ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.

” సురేంద్రన్‌ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ మీద సుధాకరన్‌ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్‌ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్‌ విలేకర్లతో చెప్పారు.

బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్‌ ?

సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్‌ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్‌ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్‌ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్‌ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్‌ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్‌ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్‌ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.

మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌ !

స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్‌ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్‌ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్‌ అన్నారు.


శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్‌ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కుమారుడు చాండీ ఊమెన్‌ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్‌ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.


బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్‌) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్‌) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్‌ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్‌ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్‌ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !

23 Saturday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP rank opportunism, halal or jhatka, Hindu Aikya Vedi, Religious tag to meat, SDMC on Halal


ఎం కోటేశ్వరరావు


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట
అన్న పోతన పద్యం తెలిసిందే. దానికి వికట కవితను చెప్పుకుంటే పలికెడిది వసుధైక కుటుంబమట, పలికించెడిది కాషాయదళమట అని రాయవచ్చు. వసుధైక కుటుంబం – సర్వజనులూ ఒకటే అని చెప్పేవారికి ఒకే నాలిక ఉంటుందని అనుకుంటాం. కానీ కొందరికి ఎన్ని నాలికలు ఉంటాయో, ఒకే నోటితో ఎన్ని మాటలు మాట్లాడతారో తెలియదు. కానీ వాటన్నింటినీ పలికించేది మెదడు లేదా నియంత్రించే మెదడు వంటి సంస్ధలు అని తెలిసిందే.


ఇక అసలు విషయానికి వస్తే బిజెపి ఏలుబడిలోని దేశ రాజధాని నగరంలో ఒకటైన దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈనెల 21న ఒక నిర్ణయం చేసింది. తమ పరిధిలోని హౌటళ్లలో సరఫరా చేసే మాంసం హలాల్‌ చేసిందా లేక ఝట్కానో తెలియ చేస్తూ హౌటళ్లలో విధిగా బోర్డులు పెట్టాలని ఆదేశించింది. ఉల్లంఘించిన వారి మీద కేసులు పెడతారని వేరే చెప్పనవసరం లేదు.
దీనికి కసరత్తు జరుగుతున్న సమయంలోనే కేరళలోని ఎర్నాకుళం జిల్లా కురమసెరీ అనే పట్టణంలో ఒక బేకరీ యజమాని తన దుకాణం ముందు తాము విక్రయించే తినుబండారాలలో ” హలాల్‌ ” చేసిన మాంసాన్ని వినియోగిస్తామని ఒక నోటీసు పెట్టారు. ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అన్నట్లుగా అలా పెట్టటం అంటరానితనంతో సమానం-నేరపూరితమని దాన్ని తొలగించకపోతే ఆందోళన చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ అయిన హిందూ ఐక్యవేది ప్రతినిధులు నోటీసులు జారీ చేసి బెదిరించారు. వారెలాంటి వారో తెలిసిన ” మోడీ ” పేరుతో ఉన్న ఆ బేకరీ యజమాని వెంటనే నోటీసును తొలగించాడు. ఇది జనవరి మొదటి వారంలో జరిగింది.దాదాపు ఒకే సమయంలో, ఒకే సంస్ధ, ఒకే భావజాలానికి చెందిన వారు కేరళలో ఒకలా ఢిల్లీలో ఒకలా వ్యవహరించటాన్ని రెండు నాలికలనాలా నాలుగనాలా ?

సులభతర వాణిజ్య సూచికలో 2014లో 142వ స్దానంలో ఉన్న దేశాన్ని 2020 నాటికి 63కు తెచ్చామని బిజెపి నేతలు తమ విజయగానాల్లో ఒకటిగా పాడుకుంటారు. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ జనవరి 21న చేసిన చేసిన నిర్ణయం తమను ఇబ్బందుల పాలు చేస్తుందని, సదరు ఆదేశాన్ని వెనక్కు తీసుకోవాలని హౌటళ్ల యజమానులు మొత్తుకుంటున్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న తమ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ ఉత్తరువు ఆటంకంగా మారుతుందని ఫస్ట్‌ ఫిడిల్‌ కంపెనీ యజమాని ప్రియాంగ్‌ సుఖిజియా వాపోయారు.


ఇంతకీ హలాల్‌ – ఝట్కా అంటే ఏమిటి ? ప్రవక్త మహమ్మద్‌ ప్రవచనాలతో కూడిన ఖురాన్‌లో చెప్పిన పద్దతుల్లో కోళ్లు, మేకల వంటి వాటిని మాంసం కోసం వధించే క్రతువును హలాల్‌ అంటారు. ఇది అరబిక్‌ పదం, దీని అర్ధం అనుమతి. ముస్లిం మతం అనుమతించిన మేరకు అంటే ఒక ముస్లిం అల్లాను ప్రార్ధిస్తూ మత పవిత్ర స్ధలంగా భావించే కాబా వైపు పెట్టి జంతువుల మెడనరాన్ని కొద్దిగా కత్తిరించి రక్తం పూర్తిగా ఆగిపోయి చల్లబడేవరకు ఆగి తరువాత పూర్తి వధిస్తారు. అదే ఝట్కా అంటే ఒకే ఒక్క వేటుతో మెడనరకటం. ప్రత్యేకించి సిక్కులు ఒక్క వేటుతో తెగిపడిన జంతు మాంసాన్ని మాత్రమే భుజిస్తారు. ఒక వేళ ఒక వేటుకు పూర్తిగా తెగనట్లయితే దాన్ని పక్కన పడేస్తారు. మిగిలిన సామాజిక తరగతులకు అలాంటి ప్రత్యేక పద్దతులేవీ లేవు. నిజానికి ఏ ప్రక్రియలో అయినా జంతువు ప్రాణం పోయేదే. అందుకే సంత్‌ కబీర్‌దాస్‌ పద్దతి ఏదైనా హింసే కదా అంటాడు.


హౌటళ్లకు వచ్చే వినియోగదారులు అత్యధికులు ఏ పద్దతి మాంస వంటకాలు వడ్డిస్తున్నారని ఎవరూ అడగరని, ఉదారవాద విధానాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ హౌటళ్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బిజెపి ఆధ్వర్యంలోని కార్పొరేషన్‌ తమ మీద కఠిన ఆంక్షలను పెడుతున్నదని ప్రియాంక సుఖీజా విమర్శించారు. రెండు రకాల మాంసాలను నిల్వచేయటం, తెచ్చుకోవటంలో సమస్యలు వస్తాయని, వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సర్వర్లకు సమస్యలు వస్తాయని మరికొందరు యజమానులు వాపోయారు. ఇలాంటి ఉత్తరువులు ఢిల్లీ మొత్తానికి ఉంటే ఒక పద్దతి అలాగాక కొన్ని ప్రాంతాలకే వర్తింప చేస్తే గందరగోళం ఏర్పడుతుందని నగరంలోని అన్ని ప్రాంతాలలో హౌటళ్లు ఉన్న యజమానులు మొత్తుకుంటున్నారు.


ప్రతి అంశంలోనూ మతకోణాన్ని చొప్పిస్తున్న కాషాయదళాలు చివరికి మాంసాన్ని కూడా వివాదాస్పదం గావించాయి. ముస్లిం మత పద్దతిలో వధించే జంతు మాంసాన్ని ఇతర మతాల వారు ఎందుకు తినాలి అని రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. హలాల్‌ చేసిన ఆహారాన్ని తినటం సిక్కు, హిందూ మతాలకు వ్యతిరేకమని, నిషేధించారని దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏ పద్దతిలో మాసం విక్రయిస్తున్నదీ తెలియ చేస్తూ విధిగా బోర్డులు పెట్టాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాంకంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు ఉనికిలోకి వచ్చిన హిందూమతం తనకు తెలియని హలాల్‌కు వ్యతిరేకం అని ఎలా చెప్పగలదు ? ఎవరైనా ఇది ఇంతే అని చెబితే దాన్ని నోరుమూసుకొని అంగీకరించాలా ?


అక్రమంగా ఉన్న జంతు వధశాలలంటూ ఉత్తర ప్రదేశ్‌ యోగి సర్కార్‌ మూడు సంవత్సరాల క్రితం మూసివేత చర్యలు తీసుకుంది. ఆ వృత్తిలో ఉన్న ముస్లింల నోట్లో మట్టికొట్టటమే అసలు లక్ష్యం. ఒకవైపు జీవహింసకు వ్యతిరేకమని కబుర్లు చెబుతూ మరోవైపు గొడ్డుమాంసాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతిస్తూ నాలుగు డాలర్ల కోసం కక్కుర్తిపడుతున్నారనే విమర్శ నరేంద్రమోడీ సర్కారు మీద ఉంది. నిజానికి మన దేశం నుంచి గొడ్డు మాంసం ఎగుమతి చేసే వారిలో అత్యధికులు మతాల రీత్యా చెప్పాలంటే హిందువులదే ఆధిపత్యం. అది కూడా ఎలా ? తమ సంస్ధలకు ముస్లిం పేర్లు పెట్టుకొని !
తాజా గణాంకాల ప్రకారం 2020లో కోటీ ఆరులక్షల 57వేల టన్నుల గొడ్డు మాంసం ప్రపంచవ్యాపితంగా ఎగుమతి జరిగింది. దీనిలో 23.93శాతంతో బ్రెజిల్‌, ఆస్ట్రేలియా,భారత్‌, అమెరికాలు పదమూడు శాతం చొప్పున తొలి నాలుగు అగ్రస్ధానాల్లో ఉన్నాయి. పాకిస్దాన్‌ ఎగుమతులు కేవలం 0.52శాతమే. అమెరికా ఒకవైపు ఎగుమతులు చేస్తూనే మరోవైపు ప్రపంచంలో అత్యధిక దిగుమతి దేశంగా కూడా ఉంది. 2018లో 83లక్షల 80వేల టన్నులు వివిధ దేశాలు దిగుమతి చేసుకోగా వాటిలో అమెరికా 16.38, చైనా 14.32శాతాలతో తొలి రెండు స్ధానాల్లో ఉన్నాయి.


మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న బడా కంపెనీలు, వాటి యజమానులెవరో చూద్దాం. దేశంలో అతి పెద్ద గొడ్డుమాంస ఎగుమతి సంస్ధ పేరు అల్‌ కబీర్‌ ఎక్స్‌పోర్ట్స్‌. ఇది హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారంలో ఉంది. దీని యజమానులు సతీష్‌, అతుల్‌ సబర్వాల్‌. మరో కంపెనీ అరేబియన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని సునీల్‌ కపూర్‌, ఎంకెఆర్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌ యజమాని మదన్‌ అబోట్‌, పిఎంఎల్‌ యజమాని ఎఎస్‌ బింద్రా (షఉటర్‌ అభినవ్‌ బింద్రా తండ్రి), ఆల్‌ నూర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని సునీల్‌ సూద్‌, ఎఓబి ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఓపి అరోరా. స్టాండర్డ్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని కమల్‌ వర్మ, మహారాష్ట్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌ ఓనరు సన్నీ ఖట్టర్‌.


కావాలంటే దిగుమతి చేసుకొనే దేశాలను బట్టి హలాల్‌ మాంసం అని ముద్రవేసుకోవచ్చు, సర్టిఫికెట్లు తీసుకోవచ్చు తప్ప లేనట్లయితే విధిగా అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జనవరి మొదటి వారంలో నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎగుమతి చేస్తున్న మాంసం హలాల్‌ చేయబడినది అని అలిండియా జమాత్‌ ఉలేమాల ద్వారా నిర్ధారణ పత్రాలను తీసుకోవాలని కేంద్రం నిబంధనల్లో పేర్కొన్నది. ఇప్పుడు దాన్ని తొలగించింది.దిగుమతి చేసుకొనే దేశానికి అనుగుణ్యంగా జంతువులను వధిస్తారని పేర్కొన్నది. విశ్వహిందూపరిషత్‌, ఇతర హిందూత్వ సంస్దల నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఈ మార్పులు చేశారు. విదేశాలకు ఎగుమతి చేసే వాటి మీద కావాలంటే హలాల్‌ అని ముద్రించుకోవచ్చు తప్ప దేశంలో వాటికి ఎందుకన్నది వాటి వాదన.

ఇలాంటి వాదనలన్నీ ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఒక పధకంలో భాగమే. పోనీ వీరు ఒకే మాట, ఒకే వైఖరికి కట్టుబడి ఉంటారా ? అవకాశవాదం-పచ్చి అవకాశవాదం ! కేరళలోని హిందూ ఐక్యవేది ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఒక మతసంస్ధ. దాని ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కుమనం రాజశేఖర్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అందువలన వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పనవసరం లేదు. ముందే చెప్పుకున్నట్లుగా దక్షిణ ఢిల్లీలో హౌటళ్లలో సరఫరా చేసే పదార్దాలు హలాల్‌ లేదా ఝట్కా పద్దతిలో చేసిన మాంసానివో బోర్డులు పెట్టాలని లేక పోతే శిక్షిస్తామని బిజెపి చెప్పింది. అలాంటి వాటిని తీసివేయకపోతే ఆందోళన చేస్తామని కేరళలోని బిజెపి సోదర సంస్ద హిందూ ఐక్యవేది బెదిరింపులకు దిగింది. ఒకే కుటుంబం నుంచి రెండు వైఖరులు. ఎంత తేడా !


కేరళ ఎర్నాకుళం జిల్లా కురమ్‌సెరీలో రెండు నెలల క్రితం ” మోడీ ” పేరుతో ఒక బేకరీని ఏర్పాటు చేశారు. హలాల్‌ చేసిన మాంసాన్ని తమ ఆహార పదార్ధాలలో వినియోగిస్తామని తెలిపే ఒక నోటీసును యాజమాన్యం బేకరీ ముందు ఏర్పాటు చేసింది. ఇష్టమైన వారు కొనుగోలు చేయవచ్చు, అభ్యంతరం ఉన్నవారు మరో బేకరికి వెళ్ల వచ్చు. ఆక్సిజన్‌ బదులు హిందుత్వ ప్రాణవాయువుతో జీవిస్తున్న హిందూ ఐక్యవేది ఆ ప్రాంతంలో మతోన్మాద బీజాలు వేసేందుకు ఆ నోటీసును ఎంచుకుంది. స్దానిక నేతలు డిసెంబరు 28న యజమానులకు ఒక లేఖ రాసి వారం రోజుల్లో దాన్ని తొలగించకపోతే కొనుగోళ్లను బహిష్కరించటంతో పాటు ఆందోళన చేస్తామని బెదిరించారు. అలా పేర్కొనటం అంటరానితనం వంటి నేరమని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి వివక్షాపూరితమైన అంశాలతో దుకాణదారు ప్రచారం చేయకూడదని, చేస్తే ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.

దానికి ముందు హిందూ ఐక్యవేది ప్రతినిధులు ఆ బేకరీకి వెళ్లి హలాల్‌ చేయని మాంసంతో చేసిన పదార్ధాలు కావాలని అడిగారు. కావాలంటే హలాల్‌ చేసింది ఉందా అని అడుగుతారు కదా అలాంటి బోర్డు ఎందుకు పెట్టారని నిలదీశారు. స్ధానికులే గాక ఆ వైపుగా రాకపోకలు సాగించే వారు కూడా ఉంటారని వారిని ఆకర్షించేందుకు ఆ నోటీసు పెట్టామని చెప్పిన బేకరీ యజమాని వెంటనే తొలగించాడు. ఈ ఉదంతాన్ని ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదని ఎల్‌డిఎఫ్‌కు చెందిన ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతీష్‌ చెప్పారు. హిందూ ఐక్యవేది నోటీసు ఇవ్వటం అవాంఛనీయమని, దాని గురించి పరిశీలిస్తామని చెప్పారు.


విద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే 2019లో జొమాటో సంస్ధ తరఫున ఆహార పదార్ధాన్ని ఒక ముస్లిం యువకుడు సరఫరా చేశాడనే కారణంతో తిరస్కరించిన ఉదంతం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. గాల్వాన్‌లోయ ఉదంతం తరువాత చైనా యాప్‌లను నిషేధించినట్లుగా కొందరు జొమాటో ఆప్‌లను తొలగిస్తామని ఆ సమయంలో బెదిరింపులకు దిగారు. ఆహారానికి కులం, మతం, ప్రాంతం లేదు. కానీ వినియోగదారులను ఆకర్షించేందుకు,ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొన్ని విషయాలను సూచించేందుకు హౌటళ్ల యజమానులు పేర్లు పెట్టటం తెలిసిందే. ఆంధ్రా,ఉడిపి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, చౌదరి,క్షత్రియ, మిలిటరీ, జైన్‌, కోషర్‌(యూదు) హౌటల్స్‌ వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి.
హైదరాబాద్‌, ఇతర అనేక చోట్ల బిర్యానీ హౌటల్స్‌కు , రంజాన్‌ సమయంలో హలీం కోసం వెళ్లే వారు అక్కడ పదార్ధాలు ఎంత రుచిగా ఉంటాయో చూస్తున్నారు తప్ప మాంసం హలాల్‌ చేసిందా లేదా అని చూస్తే, కాషాయ మతోన్మాదాన్ని తలకెక్కించుకుంటే అవన్నీ మూతపడతాయి లేదా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే. అయ్యప్పమాల ధారణ సమయంలో వారికి ప్రత్యేకం అనే బోర్డుల గురించి తెలిసిందే. ఇవేవీ ఎన్నడూ వివాదం కాలేదు.

ముస్లింల క్రతువు అయిన హలాల్‌ మీద ఇంత రాద్దాంతం అవసరం ఎందుకంటే దాని లక్ష్యం స్పష్టమే.హలాల్‌ నిర్ధారణ పత్రాలు తీసుకోవాలని బలవంతం చేయటం న్యాయమైన వాణిజ్య పద్దతి కాదని కొందరు సూత్రీకరిస్తున్నారు. ఎవరు బలవంతం చేశారు ? దిగుమతి చేసుకొనే వారు, వినియోగదారులకు అభ్యంతరం లేకపోతే ఎలాంటి ముద్రలు లేకుండానే ఎగుమతి చేయవచ్చు. ఒక మతానికి చెందిన వినియోగదారులను కూడా ఆకర్షించి నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే వ్యాపారులకు తప్ప సర్టిఫికెట్లు ఎవరికి అవసరం. ఉదాహరణకు బ్రాహ్మణ భోజన హౌటల్‌ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ సామాజిక తరగతివారు నిర్వహించే హౌటల్‌ కనుక వారు వచ్చి భోజనం చేయవచ్చనే సూచన దానిలో ఉంది. ఆ హౌటల్లో వండే, వడ్డించే, ప్లేట్లు లేదా ఆకులు ఎత్తేవారందరూ బ్రాహ్మణులే పనివారిగా ఉన్నారా లేదా అని ఎవరూ సర్టిఫికెట్లు అడగరు. ఆ పేరు పెట్టుకున్నదానికి వెళ్లి ఎవరైనా బిర్యానీ ఉందా అని అడుగుతారా ?


హలాల్‌, ఝట్కా, కోషర్‌, జైన్‌ అయినా అన్నీ మత కోవకు చెందినవే. ముస్లింల అసహనం, హలాల్‌ కావాలనే మంకు పట్టుతో లొంగని కారణంగానే హలాల్‌ నిర్దారణ పత్రాలు తీసుకోవాల్సి వస్తోందని సూత్రీకరించే మెజారిటీ అసహన శక్తుల వాదనలు కూడా మీడియాలో వచ్చాయి. ఇలా చెప్పేవారి అసలు లక్ష్యం ముస్లింలను లొంగదీసుకోవటమా ? వ్యాపారం చేసుకోవటమా ? వాటివలన అదనపు ఖర్చు అని కూడా లెక్కలు చెబుతున్నారు. పోనీ హలాల్‌ చేయని మాంసం వడ్డించే హౌటల్స్‌లో రేట్లు ఎక్కడైనా తక్కువ ఉంటున్నాయా ? హిందుత్వ గురించి కబుర్లు చెప్పే బాబారామ్‌ దేవ్‌ తన పతంజలి ఉత్పత్తులకు హలాల్‌ నిర్దారణ పత్రాలు తీసుకొనే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఎంత మందికి తెలుసు ? ఆయన కంపెనీ మీద ఎవరు వత్తిడి తెచ్చారు ?

మతోన్మాదం వైరస్‌ ఒకసారి తలెత్తితే అది మెజారిటీ వారికే పరిమితం కాదు మైనారిటీలకూ పాకుతుంది.కేరళలో హలాల్‌ మాంసాన్ని బహిష్కరించాలని కొందరు కాసా పేరుతో ఉన్న క్రైస్తవ సంఘాల పేరుతో ఉన్నవారు పిలుపులు ఇచ్చారు.ఆ మాంసం లేదా వాటితో తయారైన వాటిని తినటం క్రైస్తవానికి వ్యతిరేకం అని చెప్పారు. అందువలన మాంసం కోసం మనమే జంతువులను కొనుగోలు చేసి మనమే వధించి తిందామని చెప్పారు. హలాల్‌ ఉత్పత్తులు అమ్మే, కొనుగోలు చేసే విధంగా వత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వారికి హిందూ ఐక్యవేది మద్దతు ప్రకటించింది. తెల్లారితే క్రైస్తవులు, ముస్లింలు మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ ఊదరగొడుతున్న హిందూ ఐక్యవేది లాంటి సంస్ధలు ఇలాంటి సమస్యలు వచ్చే సరికి క్రైస్తవుల మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తాయి. అయితే మతపరంగా తామెలాంటి అనుకూలతలు, వ్యతిరేకతలు వ్యక్తం చేయలేదని ఎవరి ఇష్టానికి వారికి వదలివేస్తున్నామని కొందరు చర్చినేతలు ప్రకటించారు. జంతువులు లేదా పక్షుల మాంసాన్ని తినేందుకు దేవుడు అనుమతించలేదని కొందరు క్రైస్తవ పెద్దలు భాష్యాలు చెబుతున్నవారూ ఉన్నారు.


అవకాశవాదానికి అడ్డదారులు వెతకటంలో, అతితెలివి ప్రదర్శనలో ఎవరైనా బిజెపి తరువాతే. ఒకవైపు ఇతర పార్టీలన్నీ సంతుష్ట రాజకీయాలు చేస్తున్నాయని, తాము మాత్రమే మాట తప్పని, మడమ తిప్పని ముక్కుసూటి వారమని చెప్పుకుంటారు. గోవా, ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి వారికి గొడ్డుమాంసం మహా ప్రియం.లొట్టలు వేసుకుంటూ తింటారు. అక్కడి వారి ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టవు. పెట్టేందుకు తిరస్కరిస్తాయి, ఎందుకంటే పెడితే ఓట్లు రావు కదా ? అందుకే సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఆ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. స్ధానిక ఆహారపు అలవాట్లను తాము గౌరవిస్తామని చెప్పుకున్నారు. గో వధ నిషేధానికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించుకొనే వెసులుబాటు కల్పించామని బిజెపి ప్రకటించటం సంతుష్టీకరణ తప్ప ఏమిటి ? ఆ వెసులు బాటు, ఆహారపు అలవాట్లు దేశమంతటా ఎందుకు వర్తించదు, ఎందుకు గౌరవించరు ? గో మాంసం కలిగి ఉన్నారనే పేరుతో కొట్టి చంపటం ఎందుకు ? పాలకోసం గోవులను తరలిస్తున్నా వధకే అంటూ దాడులు ఎందుకు చేస్తున్నట్లు ?

ఎన్నికల్లో బిజెపి ఓట్ల కక్కుర్తి ఎలా ఉందో కేరళలో చూశాము. అక్కడి మలప్పురం జిల్లాలో 65శాతం మంది ముస్లింలు, ఐదుశాతం క్రైస్తవులు. మిగిలినవారు ఇతరులు. కేరళలో గొడ్డు మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేవు. 2017లో మలప్పురం లోక్‌సభ స్దానం ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ బిజెపి తరఫున శ్రీ ప్రకాష్‌ పోటీ చేశారు. కేరళలో ఎలాంటి నిషేధం లేదు కనుక తనను ఎన్నుకుంటే నాణ్యమైన గొడ్డు మాంసం అందచేయిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే బిజెపి గొడ్డు మాంస దుకాణాలను ప్రారంభిస్తుందా ? గొడ్డు మాంసంపై నిషేధం గురించి తమ పార్టీని చెడుగా చిత్రిస్తున్నారని, తనను ఎన్నుకుంటే మంచి నాణ్యమైన గొడ్డుమాంసం దొరికేట్లు చేస్తా నన్ను నమ్మండి అన్నట్లుగా మాట్లాడారు. అంతకు ముందు రోజే నాడు చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత రామన్‌ సింగ్‌ ఆవులను వధించిన వారికి ఉరిశిక్ష వేయాలని ప్రతిపాదించారు. దీన్నే ఏ రోటి కాడ ఆ పాట పాడటం అంటారు. వీరు విలువలు, వలువల గురించి జనానికి నీతులు చెబుతారు.


మాంసమైనా మరొకటైనా ఆరోగ్యానికి హాని లేని ప్రమాణాలతో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం తప్ప దాన్ని ఏ మత క్రతువు ప్రకారం కోశారన్నది కాదు. ఆగ్‌ మార్క్‌, ఐఎస్‌ఐ ప్రమాణాలకు బదులు కాషాయ దళాలు మాంసానికి మత ముద్రలు వేయటం ద్వారా సమాజాన్ని ఎక్కడకు తీసుకుపోతున్నారో, ఎందుకీ ఉన్మాదమో, వారి ద్వంద్వ ప్రమాణాలేమిటో ప్రతివారూ ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

10 Sunday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

Amit Malviya, Capitol hill rioters, Donald trump, Donald Trump's Twitter account, Tejaswi Surya


ఎం కోటేశ్వరరావు
డోనాల్డ్‌ ట్రంప్‌ ! అతగాడిని ఇప్పుడెలా వర్ణించాలో తెలియటం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యముంటేనే లేకపోతేనేం, ట్రంపూ అంతే ! నిర్ణీత వ్యవధి జనవరి 20వరకు పదవిలో ఉంటాడా, అభిశంసన లేదా మరో ప్రక్రియ ద్వారా మెడపట్టి వైట్‌ హౌస్‌ నుంచి గెంటి వేస్తారా అన్నది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు. నిండా మునిగిన వారికి చలేమిటి-కొత్తగా పోయే పరువేమిటి ! ట్రంప్‌ అంటే ఏమిటో ఇంకా తెలియని వారు ఉండవచ్చు. తెలిసిన వారు అతగాడి స్నేహితుల గురించి ఆలోచించాలి, ఆందోళనపడాలి !


ఆ పిచ్చోడు ఏమి చేస్తాడో తెలియదు కనుక మిలటరీ పరంగా ఎలాంటి నిర్ణయాలనూ ఆమోదించవద్దు, అణ్వాయుధాల మీటల దగ్గరకు రానివ్వవద్దంటూ మిలిటరీ అధికారులకు అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ లేఖ రాసి జాగ్రత్తలు చేప్పారు. ఏ విద్వేషాలు రెచ్చగొట్టి మరింతగా ముప్పు తలపెడతాడో అని సామాజిక మాధ్యమాలు తాత్కాలికంగా అతని ఖాతాలను నిలిపివేశాయి. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్దం, ట్రంప్‌ భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం అంటూ బిజెపి నేతలు మీడియాకు ఎక్కటం వారేమిటో తెలియనివారికి తెలుస్తున్నది, వీరు కూడా ట్రంప్‌ బాటలో పయనిస్తారా అన్న ఆందోళనకు తావిస్తోంది.


జనవరి ఆరవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని అమెరికా అధికార పీఠం ఉన్న కాపిటల్‌ హిల్స్‌ భవనంలో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపు- విజేతల నిర్ధారణకు పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశం జరిపాయి. ఆ ఎన్నికలను గుర్తించవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ట్రంప్‌ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలతో ఆ సమావేశం మీద ఒక్కసారిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మూకలు దాడికి దిగాయి, ఎంపీలు బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. నేల మాళిగలో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. మూకదాడిలో ఐదుగురు మరణించగా 50 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.


అమెరికాలో, ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల వేగు యంత్రాంగం, అత్యాధునిక పరికరాలు కలిగినవని చెప్పుకొనే వారికి ఇది తలవంపులు తెస్తున్నది, వారి సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు, భద్రతా సిబ్బంది ఏకంగా తమ కాపిటల్‌ మీద జరగనున్న దాడిని ఎలా పసిగట్టలేకపోయారు? వీరు ప్రపంచాన్ని రక్షిస్తామంటే, సమాచారాన్ని అందిస్తామంటే నమ్మటం ఎలా ? భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది ? మూకలను పురికొల్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ మీద, మూకల కుట్రను పసిగట్టలేకపోయిన యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను ఈ పాటికే పదవి నుంచి తొలగించి ఉగ్రవాద చట్టం కింద అరెస్టు చేసి ఉండాల్సింది.
బొలీవియా, వెనెజులా వంటి దేశాలలో గెలిచిన వారిని గుర్తించేది లేదని ప్రకటించినపుడు వారు వామపక్ష శక్తులు గనుక ఏమైపోతే మనకేమిలే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించారు. ఇప్పుడు తాము నిజంగా ఓటువేసిన ఎన్నికలను గుర్తించేది లేదంటూ, ఆ ప్రక్రియను వమ్ము చేసేందుకు మూకలను పంపి అధికార కేంద్రంపై దాడికి ట్రంప్‌ ఉసిగొల్పటాన్ని చూసి వారు, యావత్‌ ప్రపంచం విస్తుపోతోంది. విదేశాల్లో అమెరికా దుశ్చర్యలను ప్రజాస్వామిక వాదులందరూ గట్టిగా ఖండించి ఉంటే ట్రంప్‌ ఇంతకు బరితెగించి ఉండేవాడా ?

తాను ఓడిపోతే ఓటమిని అంగీకరించను అని ఎన్నికలకు ముందే తెగేసి తేల్చి చెప్పిన అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌. తోటకూర నాడే అన్నట్లుగా అప్పుడే ప్రియమైన స్నేహితుడా ఇది నీకు తగదు అని నరేంద్రమోడీ చెప్పి ఉంటే ఇంతటి దురాగతానికి పాల్పడి ఉండేవాడు కాదేమో ! అతగాడి చర్యలను చూస్తూ దు:ఖితుడనయ్యానని చెప్పుకోవాల్సిన దుస్ధితి వచ్చేది కాదేమో ! అలా చెప్పాల్సిన అవసరం మోడీకి ఏమిటి అని మరుగుజ్జులు ఎగిరి పడవచ్చు. ట్రంప్‌ మద్దతుదార్ల దాడిని చూసిన తరువాత అనేక మంది దేశాధినేతలు అధికారమార్పిడి సజావుగా జరగాలంటూ సుభాషితాలు చెప్పారు. కానీ నరేంద్రమోడీగారికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏడాది క్రితమే తిరిగి వచ్చేది ట్రంప్‌ సర్కారే (అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) అని, మీరంతా మద్దతు ఇవ్వండని అమెరికాలోని భారతీయులకు చెప్పి, తరువాత అహమ్మదాబాద్‌కు తీసుకు వచ్చి ఊరేగించిన మోడీగారు కూడా ఇతరుల మాదిరే సుభాషితాలు చెబితే ? కొట్టినా, తిట్టినా, ముద్దు పెట్టుకున్నా ఇష్టమై కౌగిలించుకున్నవారికే కదా అవకాశం ఉండేది.


మన పార్లమెంట్‌ మీద జరిగిన దానిని ఉగ్రవాద దాడి అన్నాము. కాపిటల్‌ భవనం మీద ట్రంప్‌ మద్దతుదార్లు చేసిన దాడి, హత్యలను మూర్తీభవించిన ప్రజాస్వామిక పరిరక్షక మహత్తర కర్తవ్యంలో భాగం అంటారా ? తనకు ఓటు వేసిన వారిని దేశభక్తులు అని ట్రంప్‌ వర్ణించారు, వారిలో కొందరు దాడికి పాల్పడ్డారు కనుక వారిని కూడా దేశ భక్తులుగానే పరిగణించాలా ? లేకపోతే మోడీ నోట దు:ఖం తప్ప ఖండన మాట రాలేదేం !


ప్రపంచంలో ట్రంపు ముఖ్యస్నేహితులు కొద్ది మందిలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మన ప్రధాని నరేంద్రమోడీ సరేసరి. వీరి మధ్య ఉన్న ఉల్లాసం, సరసత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. ఆ చెట్టపట్టాలు-ఆ కౌగిలింతలను చూసిన తరువాత అదొక అనిర్వచనీయ బంధం వాటిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం అందరికీ కలగదు కదా అని ఎందరో మురిసిపోవటాన్ని చూశాము.

ఎంతలో ఎంత మార్పు ! ” వాషింగ్టన్‌ డిసి.లో కొట్లాటలు మరియు హింసా కాండ వార్తలు చూడాలంటే దు:ఖం కలిగింది. అధికార మార్పిడి పద్దతి ప్రకారం మరియు శాంతియుత పద్దతుల్లో కొనసాగాలి. చట్టవిరుద్దమైన నిరసనలతో ప్రజాస్వామిక ప్రక్రియను కూలదోయకూడదు ” అని నరేంద్రమోడీ నోటి నుంచి అదే లెండి ట్విటర్‌ ద్వారా స్పందన వెలువడుతుందని ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా ? దీన్ని విధిరాత అందామా ? లేక మోడీ గారి సిబ్బంది రాసింది అనుకోవాలా ? దు:ఖితులైన సామాన్యులు కోలుకోవాలంటే సమయం పడుతుంది. నరేంద్రమోడీ అసామాన్య వ్యక్తి గనుక త్వరలోనే మామూలు మనిషి కావచ్చు. అయినా ప్రపంచమంతా చీత్కరించుకుంటున్న వ్యక్తి ప్రేరేపిత చర్యల గురించి ఒక ప్రధాని దు:ఖితులు కావటంలో నిజాయితీ ఉందా అని ఎవరికైనా అనుమానం వస్తే… చెప్పలేం !


అమెరికా అధికార కేంద్రంపై తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ట్రంప్‌ వైఖరి మీద ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం కావటంతో విధిలేక మాట మాత్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు.చిత్రం ఏమంటే మన నరేంద్రమోడీ గారి నోట ఖండన రాలేదు. నిజానికి ట్రంప్‌ ఖండన కూడా ఒక నాటకమే. కాపిటల్‌ మీద మూక దాడికి సిద్దమౌతున్న సమయంలో కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఎన్నిక అపహరణను అడ్డుకోవాలని, తనకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికలను అంగీకరించేది లేదని గతంలో చేసిన ఆరోపణలను పునశ్చరణ గావిస్తూ ట్రంప్‌ ఉపన్యాసం చేశాడు. నా అద్భుతమైన మద్దతుదారులారా మీరు ఆశాభంగం చెందుతారని నాకు తెలుసు. నమ్మశక్యం కాని మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని మీరు తెలుసుకోవాలి అంటూ మాట్లాడాడు. దాడులకు పాల్పడిన వారి ఆశాభంగానికి నా సానుభూతి అని ఒక వీడియో ద్వారా తొలి స్పందనలో పేర్కొన్నాడు. (మరుసటి రోజు మాట మార్చాడు.)

కాపిటల్‌ మీద దాడి జరుగుతున్న సమయంలో ఒక తాత్కాలిక గుడారంలో ట్రంప్‌ తన చుట్టూ ఉన్నవారితో నృత్యాలు చేయటం, దాడుల దృశ్యాలను టీవీల్లో ఉత్సాహంతో చూసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ట్రంప్‌తో పాటు కుమారుడు ఎరిక్‌, కుమార్తె ఇవాంక, సలహాదారు కింబర్లే గుయిల్‌ ఫోయిల్‌, అధ్యక్ష భవన సిబ్బంది ప్రధాన అధికారి మార్క్‌ మెడోస్‌ తదితర సీనియర్‌ అధికారులందరూ అక్కడే టీవీల ముందు ఉన్నారు. అయితే ఆ వీడియోలు మూకలను రెచ్చగొడుతూ పోరాడాలని, తాను కూడా వస్తానంటూ ట్రంప్‌ ప్రసంగం చేయటానికి ముందు చిత్రీకరించినవని ఒక కధనం.
పిచ్చి పట్టిన ట్రంప్‌ అధికారపు చివరి రోజుల్లో మిలటరీ లేదా అణుదాడికి పాల్పడకుండా అణ్వాయుధాల సంకేతాలు అందకుండా చూడాలని మిలిటరీ ఉన్నతాధికారి మార్క్‌ కెలీకి చెప్పినట్లు అమెరికన్‌ కాంగ్రెస్‌(మన లోక్‌సభ వంటిది) స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ప్రయివేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాటితో అవి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. ప్యాకేజీలు ఇవ్వని వారికి వ్యతిరేకంగా ఇచ్చిన వారికి అనుకూలంగా పని చేస్తాయి. కాపిటల్‌పై దాడి తరువాత ట్రంప్‌ ఖాతాలను పూర్తిగా స్ధంభింప చేశారని, తాత్కాలికంగా నిలిపివేశారని భిన్నమైన వార్తలు వచ్చాయి. ఆ చర్యలు ప్రజాస్వామ్య బద్దమా కాదా అన్న చర్చను కొందరు లేవదీశారు. ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయటం అక్రమం అని గుండెలు బాదుకుంటున్నారు. ట్రంప్‌కు పిచ్చి పట్టింది పట్టించుకోవద్దు, ఎలాంటి కీలకాంశాలు అందుబాటులో ఉంచవద్దని నాన్సీ పెలోసీ వంటి వారు మిలిటరీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అలాంటి పిచ్చివాడు జనాన్ని మరింతగా రెచ్చగొట్టకుండా ఖాతాలను నిలిపివేసి కట్టడి చేయకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోసేందుకు అనుమతించాలా ?అనుమతించాలనే సంఘపరివార్‌ కోరుతోంది. ఎందుకంటే వారికి ఆ స్వేచ్చ అవసరం కదా !


తన ట్వీట్లను తొలగించగానే స్పందిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్లలో మరో ప్రత్నామ్నాయ సామాజిక వేదికలను ఏర్పాటు చేయాలని చెప్పాడు. ” నన్ను అడిగే వారందరికీ ఇదే చెబుతున్నా జనవరి 20వ తేదీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లటం లేదు. ఏడున్నర కోట్ల మంది అమెరికన్‌ దేశ భక్తులు నాకు ఓటు వేశారు. అమెరికాదే అగ్రస్ధానం, మరోసారి అమెరికాను గొప్పదిగా చేయండి, భవిష్యత్‌లో మరింత పెద్ద గొంతుకను కలిగి ఉండబోతున్నాం. వారు ఏవిధంగానూ, ఏ రూపంలోనూ మనల్ని కించపరలేరు ” అని పేర్కొన్నాడు. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ కూడా ఇదే మాదిరి హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో దేశభక్తులు కావాలో దేశద్రోహులు కావాలో తేల్చుకోమని ఓటర్లకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. తమకు ఓటు వేస్తే ఓటర్లు దేశభక్తులు, ఇతరులకు వేస్తే దేశద్రోహులు. ట్రంపు – సంజయ ఇద్దరూ ఎన్నడూ మాట్లాడుకొని ఉండరు,కానీ చెట్టుమీది కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లు భావజాలం ఎలా కలుపుతుందో, కలుస్తుందో చూడండి.
ఈ రోజు ట్రంప్‌ ఖాతాలను మూసివేసిన వారు రేపు ఎవరి దాన్నయినా అదే చేసే ప్రమాదం ఉందంటూ బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఈ చర్య మేలుకొలుపు, నియంత్రణలేని బడా కంపెనీల నుంచి పొంచి ఉన్న ముప్పు అని గుండెలు బాదుకున్నారు. పొద్దున లేస్తే అసత్యాలు, అర్ధసత్యాలు, నకిలీ వార్తలను పుంఖాను పుంఖాలుగా సృష్టించే కాషాయ ఫ్యాక్టరీల పర్యవేక్షకుడు అమిత్‌ మాలవీయ, బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య ఇప్పుడు ట్రంప్‌ హక్కులు హరించారంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక వేళ సామాజిక మాధ్యమాలు తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తే తక్షణమే ” అమిత్‌ మాల్‌వేర్‌ ” మీద తీసుకోవాలని ట్విటరైట్స్‌ స్పందించారు.(మాల్‌వేర్‌ అంటే కంప్యూటర్‌ వైరస్‌ ) అమెరికా అధ్యక్షుడి విషయంలోనే వారా పని చేయగలిగితే ఎవరినైనా అదే చేస్తారు. మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచేందుకు త్వరలో భారత్‌ వీటిని సమీక్షంచ నుంది అని బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాల నిలిపివేత ప్రమాదకరమైన సంప్రదాయం అని బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టటం, తప్పుడు వార్తలను ప్రచారంలో బెట్టటంలో దేశంలో ముందున్నది ఎవరో అందరికీ తెలిసిందే. కనుకనే మాలవీయ వంటి వారు రేపు తమ మీద కూడా అదే డిమాండ్‌ వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారు. ట్రంప్‌ అభిప్రాయాల మీద చేయగలిగింది తక్కువే అయినా విభేదించే వాటిని సహించకపోవటం ఎక్కువ కావచ్చు అని అమిత్‌ మాలవీయ చెప్పారు. సహనం గురించి ఆ పెద్దమనిషి చెప్పటాన్ని చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా లేదూ ! ప్రజాస్వామ్యంలో అసమ్మతి ప్రాధమికమైనది, ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది(బిజెపి ?) అయితే దాని సహేతుకతను రాజ్యాంగబద్దమైన అధికారవ్యవస్ధలే నిర్ణయించగలవు. బడా టెక్‌ కంపెనీలు ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాయి, వాటిని నియంత్రించేందుకు సమయం ఆసన్నమైంది అని తేజస్వి సూర్య చెప్పారు. ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకోవటం, మాట విననపుడు తమదారికి తెచ్చుకోవటం-పాలన నియంత్రణ తక్కువ, స్వేచ్చ ఎక్కువ అని కబుర్లు చెప్పిన వారి సిజరూపం ఇది.

అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేసిన ట్రంపు ప్రేరేపిత నేరగాండ్ల మీద బిజెపి నేతలు ” తమలపాకుల ”తో కొడుతున్నారు ఎందుకు అన్న అనుమానం రావచ్చు. 2001 డిసెంబరు 13న పాక్‌ ప్రేరేపిత జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలోని మన పార్లమెంట్‌ భవనం మీద దాడి చేశారు. ఆ దుండగుల స్ఫూర్తితో మూడు రోజుల తరువాత 16వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టించిన విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, దుర్గావాహినీ సంస్ధలకు చెందిన వారు ఒడిషా అసెంబ్లీ భవనం మీద దాడి చేశారు. అంతకు ముందు రోజు అసెంబ్లీలో కొందరు ఎంఎల్‌ఏలు విశ్వహిందూ పరిషత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారట. అందువలన వాటిని ఉపసంహరించుకోవాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిని అప్పగించాలని, తమ నేత గిరిరాజ కిషోర్‌ను విడుదల చేయాలనే నినాదాలతో త్రిశూలాలు, కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి జై శ్రీరామ్‌, వాజ్‌పేయి జిందాబాద్‌ నినాదాలతో అరగంటపాటు విధ్వంసం సృష్టించారు. అనేక మంది మీద దాడి చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప సారంగితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ఈ దాడిని అంతకు ముందు మూడు రోజలు ముందు పార్లమెంట్‌ మీద జరిగిన దాడిని ఒకే విధంగా చూడకూడదని,అంతకు ముందు కొన్ని సంస్ధల వారు వివిధ సందర్భాలలో అసెంబ్లీని ముట్టడించారని బిజెపి నేతలు అప్పుడు సమర్ధించుకున్నారు. ఇప్పుడు ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత తగదని చెప్పటంలో కూడా రేపు తమకూ అదే ప్రాప్తించవచ్చనే ముందు చూపు ఉందేమో ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

05 Tuesday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Science, USA

≈ Leave a comment

Tags

Bjp nationalism, COVAX, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అరుణాచల్‌లో బిజెపి లౌ జీహాద్‌ – బీహార్‌ జెడియులో ముసలం !

31 Thursday Dec 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Bihar Politics, BJP-JDU, Nithish Kumar, RJD, Trouble in JDU


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి కొత్త ప్రభుత్వం వంద రోజులు కూడా పూర్తి చేసుకోక ముందే దాని మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిప్పులేనిదే పొగరాదు. రెండు పార్టీల మధ్య అనుమానాలు తలెత్తాయా ? తనకు ముఖ్యమంత్రి కావాలని లేకపోయినా వత్తిడి చేశారని, కొనసాగాలనే ఆసక్తి లేదని, కొత్త నేతను ఎన్నుకోవచ్చని డిసెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాలలో పరిపరి ఆలోచనలను రేకెత్తించింది. ఇది బిజెపిని బెదిరించించేందుకే చేసినట్లు కూడా భావించవచ్చు. నిజంగానే నితీష్‌ కుమార్‌కు సిఎం పదవిపై ఆసక్తి లేదని, అయితే బిజెపి ఇతర ప్రముఖులు వత్తిడి చేసి ఒప్పించారని, ఆయన పూర్తి కాలం కొనసాగుతారని బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ ప్రకటించి నష్టనివారణకు పూనుకున్నారు. మరోవైపు బీహార్‌ మహాకూటమిలో ఆర్‌జెడి, కాంగ్రెస్‌నేతలు ఈ పరిణామం గురించి వ్యాఖ్యానిస్తూ ఎన్‌డిఏ కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ బయటకు రావాలని కోరారు. తమ నేత తేజస్వియాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తోడ్పడితే వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి నితీష్‌ను బలపరుస్తామని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఎన్‌డిఏ నుంచి బయటకు రావటానికి ఇది సరైన సమయమని, బిజెపి లౌకిక పార్టీ కాదని, తాను లౌకిక వాదినని నితీష్‌ భావిస్తే బయటకు రావాలని కాంగ్రెస్‌ నేత శర్మ వ్యాఖ్యానించారు.


జెడియు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. మాజీ అయ్యేఎస్‌ అధికారి, పార్టీ నేతగా ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజానికి 2022 వరకు నితీష్‌ కుమార్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది వారాలుగా బిజెపి-జెడియు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయనే వార్తలు వస్తున్నాయి. బిజెపికి చెందిన వారు స్పీకర్‌గా, ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో పెద్ద పార్టీనేతగా తన మాట నెగ్గించుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు జూనియర్‌ భాగస్వామిగా ప్రతిదానికీ బిజెపి వైపు చూడాల్సి వస్తోంది. ఆరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఎంఎల్‌ఏలలో ఆరుగురిని బిజెపి లాగివేసుకోవటం తాజా వ్యాఖ్యలకు మూలం. అయితే బీహార్‌లో కూడా జెడియులో చీలిక తెచ్చేందుకు బిజెపి చేస్తున్న యత్నాలు కూడా కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బలపరచాలని, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వాల మాదిరి లవ్‌ జీహాద్‌ బిల్లును తేవాలని బిజెపి వత్తిడి చేస్తోంది. లవ్‌ జీహాద్‌ పేరుతో దేశంలో విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాటికి తాము వ్యతిరేకమని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి ఘాటుగా స్పందించారు.

గతేడాది నవంబరు 16న నితీష్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బిజెపి నేతలు ఏదో ఒక వ్యాఖ్యలతో తలనొప్పి కలిగిస్తున్నారు. అవినీతిని ఏమాత్రం సహించనని ముఖ్యమంత్రి ప్రకటించగా ఆయన నిర్వహిస్తున్న శాఖల్లోనే అవినీతి తాండవమాడుతోందని బిజెపి మంత్రులు వ్యాఖ్యానించారు.తమకు వ్యతిరేకంగా పోటీ చేసి అనేక చోట్ల ఓటమికి కారణమైన ఎల్‌జెపిని ఎన్‌డిఏ నుంచి బయటకు పంపాలని నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను బిజెపి ఖాతరు చేయలేదు. పదిహేను మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు ఎల్‌జెపి తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా రెండు పార్టీల మధ్య వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం విస్తరణకు అవకాశం లేదని, బిజెపి నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని, ఒక వేళ వస్తే అప్పుడు ఉమ్మడిగా అలోచిస్తామని నితీష్‌ కుమార్‌ చెప్పారు. హౌంశాఖ వంటి ముఖ్యమైన పదవులను తమకు ఇవ్వాలని బిజెపి చేస్తున్న డిమాండ్‌కు నితీష్‌ కుమార్‌ తలొగ్గటం లేదు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో తమ పార్టీ ఎంఎల్‌ఏలను లాగివేసుకోవటం సంకీర్ణ ధర్మ విరుద్దమని జెడియు చెబుతోంది. అయితే వారంతటవారే చేరితే తామేమీ చేయగలమని బిజెపి అమాయకంగా ప్రశ్నిస్తోంది. అక్కడి పరిణామాలకు బీహార్‌లో కూటమికి ఎలాంటి సంబంధం లేదని సుశీల్‌ కుమార్‌ మోడీ వ్యాఖ్యానించారు. జెడియు అధ్యక్షుడిగా ఆర్‌సిపి సింగ్‌ నియామకం వెనుక కారణాల గురించి భిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నితీష్‌ కుమార్‌కు నమ్మిన బంటు అన్నది అసలైన కారణం. బీహార్‌ ఎన్నికల్లో జెడియు రెండవ స్దానానికి దిగజారిన తరువాత గతంలో మాదిరి నరేంద్రమోడీ, అమిత్‌ షా నేరుగా కాకుండా ఇతర నేతలతో నితీష్‌ కుమార్‌తో మాట్లాడించటాన్ని అవమానకరంగా భావించారని, తనతో నేరుగా కాకుండా పార్టీ అధ్యక్షుడితో ముందు మాట్లాడాలనే సంకేతం ఇచ్చేందుకు ఆర్‌సిపి సింగ్‌ను నియమించారన్నది ఒక అభిప్రాయం.

బీహార్‌ మరో కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ కానుందా ? పరిణామాలను చూస్తుంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా బిజెపి అనుసరించిన ఎత్తుగడలే బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి ప్రభుత్వానికి ఎదురు కానున్నాయా ? తనకు పదవిపై ఆసక్తి లేదని నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగా జెడియు ఎంఎల్‌ఏలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆర్‌జెడి నేతలు ప్రకటించటంతో పరిణామాలు మరో మలుపు తిరిగాయి.తమ పార్టీలో చేరేందుకు 17 మంది ఎంఎల్‌ఏలు సిద్దంగా ఉన్నారని అయితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘించాలను కోవటం లేదు కనుక 28 మంది వస్తే స్వాగతిస్తామని, త్వరలో అది జరగనుందని ఆర్‌జెడి నేత శ్యామ్‌ రజాక్‌ చెప్పారు. జెడియు చీలిక ఖాయమని సత్తా ఉంటే నివారించుకోవచ్చని ఆర్‌జెడి నేత మృత్యుంజయ తివారీ సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు అన్నింటికీ సిద్దంగా ఉండాలని, మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు, సిద్దంగా ఉండాలని డిసెంబరు మొదటి వారంలో ఒక సందర్భంలో ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.


గతంలో మూడోవంతు సభ్యులు ఫిరాయిస్తే దానిని చీలికగా గుర్తించే నిబంధన ఉండేది. తరువాత దాన్ని సవరించటంతో ఇప్పుడు మూడింట రెండువంతుల మంది బయటకు వస్తేనే గుర్తిస్తున్నారు. కర్ణాట, మధ్య ప్రదేశ్‌లో అధికారానికి దగ్గరగా వచ్చిన బిజెపి అవసరమైన సీట్లు లేకపోవటంతో ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే ప్రత్యర్ధి పార్టీలలో చీలికకు అవసరమైన సంఖ్య లేకపోవటంతో ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించి ప్రభుత్వాలను మైనారిటీలో పడవేసి తాను గద్దెనెక్కింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఆ సీట్లును గెలుచుకొని రెండు రాష్ట్రాలలో పాలన సాగిస్తోంది. ఇప్పుడు అదే అనుభవం బీహార్‌లో బిజెపి-జెడియు సంకీర్ణ కూటమికి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2020 అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్ధానాలకు గాను బిజెపి-జెడియు కూటమికి 125, ఆర్‌జెడి-కాంగ్రెస్‌-వామపక్షాల కూటమికి 110, ఇతరులకు ఎనిమిది స్దానాలు వచ్చాయి. వీటిలో ఒకటి బిజెపిని బలపరిచే ఎల్‌జెపికి, మరొక స్వతంత్ర సభ్యుడు, ఐదుగురు మజ్లిస్‌ సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్ధానాలు అవసరం. పదిహేడు మంది జెడియు సభ్యులు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని, అందువలన అధికారయుతంగా చీలికకు అవసరమైన 28 మంది వచ్చిన తరువాత బయటకు రావచ్చని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఈ వార్తలకు ప్రాతిపదిక లేదని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఒక వేళ 28 మంది వచ్చే అవకాశం లేకపోయినా 17 మంది బయటకు వచ్చి మరో పార్టీలో చేరితే స్పీకర్‌గా బిజెపి నేత ఉన్నందున వెంటనే వారి సభ్యత్వం రద్దవుతుంది, రాజీనామా చేస్తే ఆ స్దానాలు ఖాళీ అవుతాయి. సంకీర్ణ కూటమి సర్కార్‌ మైనారిటీలో పడుతుంది. ఆర్‌జెడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం దొరుకుతుంది.మజ్లిస్‌ సభ్యులు బిజెపికి మద్దతు ఇచ్చినా- లేదా కొత్తగా ఏర్పడే ఆర్‌జెడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినా మజ్లిస్‌ – బిజెపి మధ్య ఉన్న లోపాయికారీ సంబంధాలు వాస్తవమే అని రుజువు చేసినట్లు అవుతుంది. గతంలో నితీష్‌ కుమార్‌ అటు ఆర్‌జెడిని ఇటు బిజెపిని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికలలో అలాంటి అవకాశం మూసుకుపోయింది. మరోసారి ఆర్‌జెడి నాయకత్వం నితీష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం లేదు. నితీష్‌ నిస్సహాయతను గమనించే అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియు ఎంఎల్‌ఏలు ఏడుగురిలో ఆరుగురిని బిజెపి తనవైపుకు తిప్పుకుంది. నితీష్‌ కుమార్‌ను డమ్మీ చేసి అధికారం చెలాయించాలన్నది బిజెపి ఎత్తుగడ.


నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. ఇప్పటికే బిజెపి నమ్మిన బంటు అనుకున్న ఆకాలీదళ్‌ స్నేహానికి స్వస్తి చెప్పింది. అంతకు ముందే మహారాష్ట్రలో శివసేన ఏమి చేసిందో చూశాము. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే రాజకీయంగా అది ఒంటరి పాటు కావటమే కాదు, తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు దరికి చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందువలన తనంతటతానుగా నితీష్‌ కుమార్‌కు బిజెపి పొగపెట్టకపోయినా, జెడియు ఎంఎల్‌లు ప్రభుత్వంలో రెండవ తరగతి వారిగా సహజీవనం చేయగలరా అన్నది ప్రశ్న. బీహార్‌లో తలెత్తిన ఈ పరిణామం టీ కప్పులో తుపానులా సమసిపోతుందా ? కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లేదా ఏకంగా అసెంబ్లీ రద్దుకే దారి తీస్తుందా ? అధికార రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: