• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2022

చైనా నుంచి వస్తు దిగుమతులా ! తగ్గేదేలే !!

27 Thursday Jan 2022

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti China Propaganda, BJP, India imports from China, India-China trade in 2021, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మన పాలకులు, వారికంటే ఎక్కువగా మన మీడియా జనాలకు ఎక్కిస్తున్న దేశభక్తి ఎక్కడికి పోతున్నది ? గాంధీ, నెహ్రూ వంటి నేతలు సరైన పునాది వేయని కారణంగా దేశభక్తి అంటే పంద్రాగస్టు, రిపబ్లిక్‌ దినోత్సవాలకే పరిమితం అయిందని అనుకుందాం కాసేపు. వారి కంటే దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు, ప్రపంచానికే గురువు అని చెబుతున్న నరేంద్రమోడీ ఓకల్‌ ఫర్‌ లోకల్‌( స్ధానిక వస్తువులనే వాడండి), మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వగైరా , దేశ కాలాలతో నిమిత్తం లేకుండా ముందుకు తెచ్చిన చైనా వ్యతిరేకత ఏమైనట్లు ? ఎక్కడా ఆ ఛాయలే కనిపించటం లేదు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని సెలవిచ్చిన కంగనా రనౌత్‌ వంటి అసలు సిసలు సమరయోధులు గుండెలు దిటవు చేసుకోవాలి.


2021 చైనా-భారత వాణిజ్య లావాదేవీలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డిసెంబరు నాటికి వంద బి.డాలర్లకు చేరతాయని అంచనా వేస్తే ఏకంగా 126 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది 97.52 బి.డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 46.2శాతం ఎక్కువ. మనం చైనాకు ఎగుమతి చేసిన సరకుల విలువ 28.14బి.డాలర్లు. ఇది 34.2శాతం పెరిగింది. మన సరకుల ఎగుమతుల పెరిగినందుకు సంతోషించాలా, దిగుమతు ఎక్కువైనందుకు విచారించాలా ? ఎందుకిలా దిగుమతుల రికార్డులను బద్దలు కొడుతున్నాము ? మీకేం బాబూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాళ్లు ఎన్ని కబుర్లైనా చెబుతారు. వీలుపడక గానీ లేకపోతేనా దేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయి ఉండేవారు.చైనా సెల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏవీ లేకుండా వారి వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు, ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు ఒక్క క్షణం పని చేయవు. వారికి ఒక న్యాయం ఇతరులకు ఒకటా ? పది మందికి పని కల్పించి తిండిపెడుతున్నాం. తగ్గేదేలే ! దిగుమతులను ఆపేదేలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఎవరు, ఇంకెవరు, చైనా వస్తు దిగుమతిదారులు.


రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. ధర్నాలు, రాస్తారోకోల వంటివి అసలు చేపట్టలేదు. పార్టీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దిగుమతిదారులు ఉన్నట్లు ఎవరూ నిరూపించలేదు.మన దేశంలోని మూలస్దంభం వంటి పరిశ్రమల్లో ఔషధరంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిలో 50-60శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల్లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా ? ఎలాంటి అజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్‌, చైనా అధినేత షీ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు? జనం అమాయకులు కాదు కదా !


చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అక్కడి నేతలు మన కాళ్ల దగ్గరకు వస్తారని ప్రచారం చేశారు.చైనా తొలిసారిగా ప్రస్తుతం ఏటా ఆరులక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి దిగుమతులు జరుపుతున్నది. దానిలో పన్నెండవ వంతు అంటే 755బి.డాలర్ల మేరకు అమెరికాతో జరుగుతున్నాయి. మొదటి స్ధానంలో ఉన్న వారే ఎందుకు పెట్టుకున్నామురా బాబూ వీరితో తగాదాని తలలు పట్టుకుంటున్నారు. పదిహేనవ స్ధానంలో ఉన్న మనతో ఉన్న లావాదేవీలు కేవలం 126 బి.డాలర్లు మాత్రమే. అలాంటిది మనం దిగుమతులు ఆపేస్తే చైనా దారికి వస్తుందా ? పగటి కలలు గాకపోతే, మన గురించి మనకు అవగాహన ఉందా లేక హనుమాన్‌ తాయత్తు కట్టుకొని మాట్లాడుతున్నామా ? వెనుకటి రోజుల్లో పిచ్చి మంత్రం పెడతామని పిల్లల్ని బెదిరించినట్లుగా చైనా యాప్‌ల నిషేధం వలన ఒరిగిందేమిటి ? ఔషధ పరిశ్రమకు అవసరమైన దిగుమతులు చేసుకున్నామంటే అర్ధం ఉంది. పోనీ వాటిని కూడా అక్కడి నుంచి గాక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అడ్డుకున్నదెవరు? అమెరికా నేతలతో కౌగిలింతలకు దిగినా మరొకటి చేసినా రెండు దేశాల లావాదేవీలు 2021లో 110 బి.డాలర్లు మాత్రమే. చైనా వస్తువులా అబ్బే అవి నాశిరకం, చౌకరకం అని ఒక వైపు ఈసడించుకుంటారు. కానీ అదే చైనా నుంచి విలాసవంతమైన సెల్‌ఫోన్లు, రంగురాళ్లు, ఆటోమొబైల్స్‌కు మన విలువైన విదేశీమారక నిల్వలను ఖర్చు చేయాలా? ఎందరు సామాన్యులకు ఉపయోగం ఉంటుంది ? వీటి మీద దిగుమతి పన్నులు పెంచినా జనం తగ్గటం లేదు, అసలు అనుమతి ఎందుకివ్వాలి ? మన దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మన దేశం నుంచి చైనా దిగుమతి చేసుకొనే సరకులేవీ ప్రపంచంలో ఎక్కడా దొరకనివి కాదు. వివాదాలు ఎన్ని ఉన్నా సర్దుకుంటాయనే భావంతో లావాదేవీలను నిర్వహిస్తున్నదా ?
ఒకవైపు పశ్చిమ దేశాలతో బేరసారాలు, మరోవైపు చైనా మీద అనధికారికంగా తప్పుడు ప్రచారం, మరోవైపు రికార్డులను బద్దతు కొడుతూ దిగుమతులు. పరస్పర విరుద్దం కదా ? ప్రపంచంలో మనకు విలువ ఉంటుందా ? గతంలో మన దేశాన్ని బ్రిటీష్‌ పాలకులు ఏలినపుడు మన దగ్గర నుంచి ముడిసరకులు దిగుమతి చేసుకొని వారి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులను మన మీదకు వదిలారు. రెండింటిలోనూ వారికే లాభం. ఇప్పుడు చైనా విషయంలో కూడా జరుగుతున్నది అదే. మనం వాణిజ్య లోటుతో ఉన్నాము అంటే అది చైనా, మరొక దేశం ఏదైనా సరే మన సంపదలకు అక్కడకు తరలుతున్నట్లే కదా ?నాడు మనది ఆక్రమిత దేశం, పరాధీనత, నేడు మనది స్వతంత్ర దేశమైనా స్పష్టమైన వైఖరి లేకపోవటంమే కారణం. మనం నేర్చుకున్నది ఏమిటి ? చైనాను పక్కన పెట్టి పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని జనాన్ని ఉద్దరించమనండి. ఎవరు వద్దన్నారు. కావలసింది పిల్లి ఎలుకలను పడుతుందా లేదా అన్నది తప్ప నల్లదా తెల్లదా అన్నది కాదు. చైనాతో సంబంధాలను వెనక్కు మళ్లించుకొనేందుకు అమెరికా వంటి బడా దేశాల వల్లనే కావటం లేదు, చైనా మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. దీని అర్ధం చైనాకు లొంగిపొమ్మని కానే కాదు. చైనా వస్తువుల మీద అక్రమంగా దిగుమతి పన్ను విధించటం చట్టవిరుద్దమని జనవరి 16న ప్రపంచ వాణిజ్య సంస్ధ తీర్పు ఇచ్చింది. అంతే కాదు, పరిహారంగా అమెరికా వస్తువుల మీద 64.5 కోట్ల డాలర్ల మేర ఏటా పన్నులు విధించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు చెప్పిన భాష్యం అంతా తొండి, మొత్తంగా ప్రపంచ వాణిజ్య సంస్దనే సంస్కరించాలని అమెరికా ఇప్పుడు గోలగోల చేస్తున్నది.


ఇక్కడ జనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు చైనా మీదకు మనల్ని ఉసిగొల్పుతున్న అమెరికా మరోవైపు వారితోనే ఏడాదికేడాది లావాదేవీలను ఎందుకు పెంచుకుంటున్నట్లు ? అంతకు ముందుతో పోల్చితే 2021లో 28.7శాతం లావాదేవీలు పెరిగాయి.చైనా మిగులు 396.5 బి.డాలర్లు ఉంది.2018లో వాణిజ్యయుద్దం ప్రారంభానికి ముందు ఇది 323 బి.డాలర్లు మాత్రమే ఉంది. 2021లో తొలిసారిగా చైనా ఆరులక్షల కోట్ల డాలర్ల వాణిజ్యలావాదేవీల మైలు రాయిని అధిగమించింది. అమెరికా తనను తానే రక్షించుకోలేని స్ధితిలో ఉన్నపుడు మరొక దేశాన్ని రక్షించగలదా ? అమెరికా అడ్డగోలుగా ప్రపంచాన్ని నడిపే రోజులు కావివి అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తమ ప్రయోగాలకు నల్లజాతి అమెరికన్లు, దళితులను కమ్యూనిస్టులు వాడుకుంటున్నారా !

23 Sunday Jan 2022

Posted by raomk in CHINA, CPI(M), Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Americans, communism, discrimination against dalits india, Left politics, US anti communism


ఎం కోటేశ్వరరావు


” కమ్యూనిజం ప్రయోగాల కోసం నల్లజాతి అమెరికన్లను ఉపయోగించుకుంటున్న పురోగామివాదులు ” అనే శీర్షికతో ఇటీవల ఒక విశ్లేషణను అమెరికా మీడియాలో చదివాను. వెంటనే మన దేశంలో దళితులను కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చింది. అమెరికాలో లేదా మన దేశం, మరెక్కడైనా ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు రెండు రకాలు. ఒకటి ఒక పధకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసే మేథావులు, రెండో తరగతి వారి ప్రచారదాడి బాధితులుగా మారిన వారు. కమ్యూనిజం, పురోగామివాదులపై చేసిన దాడికి పాల్పడిన ఆడమ్‌ బి కోల్‌మన్‌ ” బ్లాక్‌ విక్టిమ్‌ టు బ్లాక్‌ విక్టర్‌ ” అనే పుస్తక రచయిత కూడా, ఆఫ్రో-అమెరికన్‌ అని వేరే చెప్పనవసరం లేదు.


ఏమంటాడు ఇతను ? ” అమెరికాలో నేడు నల్లవారు ఫుట్‌బాల్‌ బంతుల్లా ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడు ఎటు తంతారో తెలియదు. నల్లవారికి తమ మీద అదుపు ఉండదు. ఆధునిక రాజకీయాల్లో రాణించాలంటే నల్లజాతి వారికి సాయం అనే అంశాన్ని సోపానంగా చేసుకుంటున్నారు. సాయం చేస్తున్నట్లు చెప్పుకోవటం వేరు నిజంగా సాయం చేయటం వేరు. పురోగామివాదులు ఊహాజనిత కమ్యూనిస్టు జ్వర ప్రేలాపనలో నల్లజాతి అమెరికన్లను ఒక ప్రయోగశాలలో మాదిరి వాడుతున్నారు. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించుకొని నల్లజాతీయులను ధనికులు కాకుండా అడ్డుకుంటున్నారు.” అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా అతగాడు రాసిందాన్ని మొత్తం పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుడై ఉండి ఒక వైపు జాత్యహంకార వివక్ష ఉంది, దాడులు నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అక్కడి దోపిడీ వ్యవస్ధకు మద్దతు ఇచ్చే, కమ్యూస్టు వ్యతిరేకతను అడుగడుగునా వెల్లడించిన కోల్‌మన్‌ వాదనల గురించి ఎంత చెప్పుకున్నా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.


కోల్‌మన్‌ ఇంకా ఎంత కుతర్కం చేశాడో చూడండి ” అమెరికా చరిత్రలో నల్లజాతీయులు హతులయ్యారా ? నిస్సందేహంగా ఎలాంటి మినహాయింపుల్లేవు. పోలీసులు నల్లజాతీయులను అన్యాయంగా కాల్చి చంపారా ? అవును. కానీ జాత్యహంకారం ఉనికిలో ఉండటం, జాత్యహంకార అన్యాయం జరుగుతుండటాన్ని ఉపయోగించుకొని సర్వకాలాల్లో అందరిని సమానంగా చూస్తారు, ప్రతిభతో నిమిత్తం లేకుండా అందరికీ సమంగా ఉత్పత్తిని పంచుతారు అనే ఊహాజనితమైన వైఖరివైపు అమెరికా జనాన్ని వామపక్షం లాగుతున్నది. ఇది కేవలం ప్రహసన ప్రాయమైన అసాధ్యం. సమాజం పని చేసేందుకు అవసరమైన ప్రతిదాన్నీ నాశనం చేయాలని, దానిలోనే జీవించాలని, అదే సరైనదని చెబుతారు… అమెరికా అంతటా పట్టణాల్లో జరుగుతున్నదాన్ని మీరు చూడవచ్చు.శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చివరికి పట్టపగలు కూడా దొంగతనాలు జరగటం సర్వసాధారణం. ఇళ్లు లేని వారు నగరమంతటా ఎక్కడబడితే అక్కడ వారు అనుకున్న చోట గుడారాలు వేస్తున్నారు, అనుకున్న ప్రతిదాన్నీ అపరిశుభ్రంగావిస్తున్నారు. తప్పుడు విధానాలు దీనికి కారణం కావచ్చు గానీ ఇదంతా మన సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకే పధకం ప్రకారం చేస్తున్నది. మార్క్సిస్టు భావజాలపు ప్రత్యక్ష ప్రభావం ఇది ”


1950దశకంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలో వ్యతిరేకులు ఇలాంటి ప్రచారాలే చేశారు. మనకు ఐదువేళ్లు సమంగా ఉండవు కదా, కమ్యూనిస్టులు వస్తే అన్నింటినీ సమంగా నరికేస్తారు. మీకు రెండు చొక్కాలు, పంచెలు ఉంటే ఒకటి లాక్కుని లేనివారికి ఇస్తారు. ఇంటిని సగం చేసి మిగతాది లేని వారికి అప్పగిస్తారు. ఎవరైనా వ్యతిరేకిస్తే నెత్తిమీద సుత్తితో కొట్టి కాడవలితో గొంతు కోస్తారు, ఇంకా నోరుబట్టని ప్రచారాలతో జనాన్ని రెచ్చగొట్టారు. అన్నింటినీ ధ్వంసం చేస్తామని కమ్యూనిస్టులు ఎక్కడ చెప్పారు. మనిషిని మనిషి దోచుకొనే పద్దతిని నాశనం చేస్తామన్నారు, దోపిడీకి రక్షణగా , జనానికి వ్యతిరేకంగా ఉండేవారి సంగతి చూస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోనో మరొక నగరంలో జనానికికందరికీ ఇంటి వసతి కల్పిస్తే రోడ్లమీద గుడారాలు ఎందుకు వేస్తారు. పని, ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తారా ? నల్లవారు కనిపించగానే ఉట్టిపుణ్యానికే రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేస్తే ఎందుకు తిరగబడతారు ? అలాంటి పరిస్ధితులను నివారిస్తే కమ్యూనిస్టులు, మరొక పురోగామి, ప్రజాస్వామ్యవాదులతో పనేముంటుంది ?


మన దేశంలో కూడా దళితుల పేరుతో ఇలాంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగారు. దీనికి అమెరికాలోని కోల్‌మన్‌ వంటి వారి ప్రభావం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని నల్లజాతివారు, దళితులకు అనేక పోలికలు కనిపిస్తాయి. ఇరువురూ బాధితులే. రాబిన్‌హుడ్‌ మాదిరి ఒక వీరుడు వచ్చి వారిని విముక్తి చేస్తాడని, దోపిడీ, వివక్ష నుంచి రక్షిస్తాడని ఎవరూ చెప్పలేదు. తామే విముక్తి చేస్తామని కమ్యూనిస్టులూ వకాల్తాపుచ్చుకోలేదు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు అంటే ఎవరి విముక్తికి వారు ముందుకు రావాలనే తప్ప మీరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండండి మేమే పోరాడతాం అనటం లేదు. జనం జరిపే పోరాటాల్లో ముందుంటాం అని దారి చూపుతున్నారు. అణగారిన తరగతులు వారు ఎవరైనప్పటికీ వారినందరినీ కమ్యూనిస్టులు వినియోగించుకుంటూ వారిని జెండాలు మోసేవారిగానే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు, వక్రీకరణలు తెలిసిందే. మహత్తర తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు ? మల్లు స్వరాజ్యం వంటి వారంతా దొరల కుటుంబాలనుంచి వచ్చి తుపాకి పట్టిన వారే కదా ! వారితో పాటు వెట్టి,అణచివేతకు గురైన వారందరూ కూడా బందూకులు పట్టారు. ఆ పోరాటంలో ఎవరు అమరులైందీ ఆ గ్రామాలు, పట్టణాల్లో ఎవరిని అడిగినా చెబుతారు.కమ్యూనిస్టులు వాడుకుంటారు అని చెప్పేవారు కేరళలో వరుసగా రెండోసారి సిఎంగా చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ గురించి ఏమి చెబుతారు ? ఒక గీత కార్మికుడి కుమారుడు కదా !


కుల వివక్ష సమస్యను కమ్యూనిస్టులు గుర్తించలేదు అన్నది ఒక విమర్శ. ఇది కూడా వక్రీకరణే, వాస్తవం కాదు. అంబేద్కర్‌ కంటే ముందే నారాయణ గురు, అయ్యంకలి వంటి సంస్కరణవాదులెందరో కులవివక్ష పోవాలని చెప్పి ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎకె గోపాలన్‌ వంటి ఎందరో కమ్యూనిస్టులు దళితుల దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు వ్యవస్ధలో ఆర్ధిక అంతరాలను రూపుమాపితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదని భావించిన కారణంగానే మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది. ప్రతి సంఘసంస్కరణ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న కమ్యూనిస్టులు దళిత కులవివక్షను పట్టించుకోలేదనటం వక్రీకరణే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటితో పోలిస్తే సిపిఎం నేతలు ఆ సమస్యను మకింత స్పష్టంగా గుర్తించారు గనుక కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐనా వర్గ సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యతను వర్ణ అంశానికి కూడా ఇచ్చి పోరాడలేదని సానుకూలంగా విమర్శిస్తే అదొకదారి. అందుకు సూచనలు చేయవచ్చు. శత్రుపూరిత దాడికి దిగితే ఏమనాలి ?


వర్గ శత్రువు కంటికి కనిపించేది, వర్ణశత్రువు స్వభావం అలాంటిది కాదు. ముందు కులాన్ని నిర్మూలించిన తరువాత వర్గ నిర్మూలన చేపట్టాలని చెప్పేవారు కమ్యూనిస్టులతో నిమిత్తం లేకుండా అంబేద్కర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు జనాన్ని కూడగట్టారో, ఎంత పురోగతి సాధించారో ఒక్కసారి నెమరువేసుకోవాలి. చివరికి అంబేద్కర్‌ను సైతం ఒక కులానికి ప్రతినిధిగా దిగజార్చారనే విమర్శ ఉంది కదా ! కులవివక్షనే వ్యతిరేకించేందుకు మద్దతు తెలపని స్ధితిలో కుల నిర్మూలనకు పిలుపు ఇవ్వటం నేలవిడిచి సాము కాదా ! చట్టాలు, సంస్కరణలతో వెంటనే సామాజిక మార్పులు రావని అనేక దురాచారాల అంశంలో రుజువైంది. రిజర్వేషన్లను అనుభవించేందుకు కులాలవారీ వర్గీకరణ చేయాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్‌నే దళితులలో కొందరు అంగీకరించకుండా వీధులకు ఎక్కుతున్న స్ధితి ఉంది. దేశంలో కులనిచ్చెనమెట్లు అన్ని కులాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటినే పరిష్కరించలేని స్ధితిలో మొత్తంగా కులనిర్మూలన అంశాన్ని చేపట్టాలనే వాదన ఆచరణాత్మకóమా ? లేదూ సాధ్యమే అని నమ్మేవారు అందుకోసం పోరాడితే ఎవరూ తప్పు పట్టరు. ఆర్ధిక సమస్యల మీద పోరాడేందుకే జనం ముందుకు రావటం లేదన్నది ఒక కఠోరవాస్తవం. నరనరాన వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన కులవివక్ష అంశం ఎక్కడైనా ముందుకు వచ్చినపుడు దాని మీద పోరాడటం, మిగతా సమయాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేస్తూ వర్గ సమస్యతో జమిలిగా చేపట్టటం ఆచరణాత్మక అంశం అవుతుంది.


ఇక్కడ ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆఫ్రికా నుంచి అమెరికాకు అక్కడి జనాలను బానిసలుగా తీసుకురావటం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మన దేశంలో దళితులను కొన్ని వేల సంవత్సరాల నాడే సృష్టించారు. అనేక దేశాలలో ఆఫ్రికన్‌ బానిసల వారసులు గానీ, దళితులు గానీ లేరు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ గానీ, వారికి ముందున్న ఊహాజనిత సోషలిస్టులు కానీ నల్లజాతీయులు లేదా దళితుల కోసమే కమ్యూనిస్టు సిద్దాంతం అని గానీ, వారితోనే ప్రయోగాలు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు సిద్దాంతం పుడుతుందని, దాని ప్రయోగాలకు వీరిని సిద్దం చేసి ఉంచాలని వారిని వందలు, వేల ఏండ్లక్రితమే సృష్టించారా మరి ? సృష్టిస్తే ఎవరు వారు ? ఒక వేళ తమ ప్రయోగాల కోసమే ఈ సామాజిక తరగతులను లేదా కార్మికవర్గాన్ని సృష్టించి ఉంచారని మార్క్స్‌-ఎంగెల్స్‌లకు తెలుసా ? తెలిసినా, వారు అనుకున్నా తమ కార్యకలాపాలను అమెరికా లేదా లాటిన్‌ అమెరికాలోని స్పానిష్‌ వలస దేశాలు, భారత్‌కు వెళ్లి ప్రయోగాలు చేయకుండా జర్మనీ, బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు ? 1871లో జరిగిన పారిస్‌ కమ్యూన్‌ తిరుగుబాటులో అక్కడి ఆఫ్రో-ఫ్రెంచి జాతీయులు పాల్గని ఉండవచ్చు గానీ నాయకత్వం ఫ్రెంచి కార్మికవర్గమే కదా ? రష్యా,చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలో ఎవరిని వినియోగించి విప్లవాలను తీసుకువచ్చారు ? ఎవరు లబ్ది పొందారు ?


ఇక కమ్యూనిస్టు నేతలు, వారి కుటుంబసభ్యులు త్యాగాలు చేయరు, సామాన్యకార్యకర్తలనే బలిపెడతారు అన్న దుర్మార్గమైన నిందలు కూడా వేసేవారున్నారు. జనం కోసం త్యాగాలకు సిద్దపడి ఏటికి ఎదురీదేవారు కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేరు. ఎక్కడైనా పార్టీనేతలుగా ఉండి అక్రమాలకు పాల్పడేవారు వేళ్లమీద లెక్కించగలిగిన వారు లేరని ఎవరూ చెప్పరు. వారిని మాత్రమే చూపుతున్నారంటే ఏమనుకోవాలి ? ఎన్నో కుటుంబాలు అసమాన త్యాగాలు చేశాయి. ఆ వివరాలన్నీ పేర్కొనటం ఇక్కడ సాధ్యం కాదు. రెండు మూడు ఉదంతాలు చూద్దాం.


హిట్లర్‌ అంతు చూసిన స్టాలిన్‌ కుమారుడు ఎకోవ్‌ జర్మన్లకు చిక్కి వారి చేతిలో మరణించిన అంశం తెలిసిందే. అధినేతగా తలచుకుంటే తన కుమారుడిని ఏదో ఒక ఉద్యోగంలో పెట్టటం కష్టమేమీ కాదు. కానీ సైన్యంలో చేరాలని కోరాడు. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మన్లకు బందీగా చిక్కాడు. తమ వారిని విడిచిపెడితే ఎకోవ్‌ను అప్పగిస్తామని హిట్లర్‌ మూకలు చేసిన ప్రతిపాదనను స్టాలిన్‌ అంగీకరించలేదు. కుమారుడి కోసం నరహంతక నాజీలను వదిలేదని తిరస్కరించాడు. తరువాత ఎకోవ్‌ను జర్మన్లు కాల్చి చంపారు. స్టాలిన్‌ తరువాత అధికారానికి వచ్చిన నికితా కృశ్చేవ్‌ కుమారుడు లియోనిద్‌ కృశ్చేవ్‌ ఆర్టిలరీ బాటరీ కమాండర్‌. అదే యుద్దంలో వీరమరణం పొందాడు. ఇలాంటి వారెందరో ఉన్నారు. సోవియట్‌ వెలుపల యుగోస్లావియా నేత టిటో కుమారుడు జర్‌కో బ్రోజ్‌ తన చేతిని పొగొట్టుకున్నాడు. స్పెయిన్‌ కమ్యూనిస్టు నేత డోలోర్స్‌ గోమెజ్‌ కుమారుడు రూబెన్‌ రూయిజ్‌ స్టాలిన్‌గ్రాడ్‌ పోరులో కమాండర్‌గా వీరత్వం పొందాడు.


చైనా అగ్రనేత మావో సంతానంలో మావో అనీయింగ్‌ ఒకడు. తల్లి యాంగ్‌ కైహుయి విప్లవకారిణి.1930 అక్టోబరులో కొమింటాంగ్‌ యుద్దప్రభువు హి షియాన్‌ ఆమెను బందీగా పట్టుకున్నాడు. మావోకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేస్తే వదలివేస్తామని చెప్పాడు. నిరాకరించినందుకు చిత్రహింసలు పెట్టారు. చివరకు నవంబరు 14న ఆమెను ఉరితీశారు. ఆ నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. మావో ఎక్కడున్నాడో తెలియదు, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.మావో అనీయింగ్‌కు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. షాంఘైవీధుల్లో అడుక్కొని పొట్టపోసుకున్నాడు.1936లో అతన్ని కనుగొన్న మావో రష్యా పంపాడు. మావో కుమారుడు కనుక అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. సెర్గీ మయవ్‌ అని కొత్త పేరు పెట్టారు. 1942లో తనను రెడ్‌ ఆర్మీలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌కు సెర్గీ లేఖ రాశాడు.” ప్రియమైన కామ్రేడ్‌ స్టాలిన్‌ ! నేను ఒక చైనా యువకుడిని. మీ నేతృత్వంలోని సోవియట్ల దేశంలో ఐదు సంవత్సరాలు చదువుకున్నాను. నేను చైనాను ఎంతగా ప్రేమిస్తానో యుఎస్‌ఎస్‌ఆర్‌ను కూడా అంతగొప్పగా ఆరాధిస్తాను. మీ దేశం జర్మన్‌ ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోతుంటే నేను చూస్తూ కూర్చోలేను. లక్షలాది మంది సోవియట్‌ పౌరులను చంపినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ముందు పీఠీన నిలిచి పోరాడేందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నాను. దయచేసిన నా వాంఛను మన్నించాలని కోరుతున్నాను.” అని రాసిన లేఖకు సమాధానం రాలేదు. తరువాత ఒక అధికారి వచ్చి ” తండ్రి ఒక హీరో, కుమారుడు ఆయన ఒడిలో పెరిగిన బలశాలి ” అంటూ సైనిక శిక్షణకు పంపాడు.1944లో టాంకుల కమాండర్‌గా పోలాండ్‌, జర్మనీ రంగాలలో పోరాడాడు. అయితే అతను రష్యన్‌ భాష బాగా మాట్లాడుతుండటంతో తోటివారెవరూ మావో కుమారుడని గుర్తించలేదు. తరువాత 1945లో సోవియట్‌ -జపాన్‌ యుద్దంలో కూడా పాల్గొన్నాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి స్టాలిన్‌ స్వయంగా తన సంతకంతో కూడిన ఒక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చాడు.1950లో కొరియాలో పోరాడేందుకు వెళ్లాడు. అక్కడ అమెరికా వైమానిక దాడిలో ప్రాణాలు అర్పించాడు.


మన దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇతర దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు కాని వారు కూడా ఎందరో అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ పోరాటాల్లో ఎందరో నేతలతో పాటు వారి అడుగుజాడల్లో నడిచిన సామాన్యులు కూడా అమరులైనారు. స్వాతంత్య్రం పేరుతో సామాన్యులను బలిపెట్టారని ఎవరైనా నాటి నేతలను నిందించగలమా ? చౌకబారుతనం, పాలకవర్గాల ప్రచారాన్ని భుజానవేసుకొనే బానిస బుద్ది తప్ప అది సంస్కారమేనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేడ కొంటామమ్మ పేడ,ఆవు పేడ అంటున్న ప్రియాంక – నరేంద్రమోడీ రూపంలో కృష్ణుడు పుట్టాడన్న బిజెపి !

21 Friday Jan 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృతవేషాలు అన్నట్లుగా అధికారం కోసం పార్టీలు, నేతలు ఎన్ని మాటలు చెబుతున్నారో కదా ! తాము అధికారంలోకి వస్తే ఆవు పేడ కొనుగోలు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రైతులకు వాగ్దానం చేసింది. ఆవు రాజకీయంలో ఇదో కొత్త కోణం. తమ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌ఘర్‌లో ఇప్పటికే ఈ పధకాన్ని అమలు జరుపుతున్నామని, తమను ఎన్నుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో కూడా అమలు చేస్తామని చెప్పింది. అవినీతి అక్రమాలను అంతం చేసేందుకు కృష్ణుడే నరేంద్రమోడీ అవతారంలో జన్మించారని ఉత్తర ప్రదేశ్‌ బిజెపి మంత్రి ఒకరు చెప్పారు. తనకు కృష్ణుడు ప్రతిరోజూ కలలోకి వచ్చి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పోరు పెడుతున్నట్లు సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ చెప్పారు. ఎన్నికలు భలే వినోదాన్ని కలిగిస్తాయి కదా !


గౌధన్‌ న్యాయ యోజన పధకం కింద కిలో రు.1.50 వంతున ఆవు పేడ కొని సేంద్రియ ఎరువులను తయారు రైతులకు అందచేస్తామని గతేడాది జూలైలో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్ష బిజెపి అప్పుడు విమర్శించింది. అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తమ ప్రభుత్వం ఆవుపేడను సేకరించి ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ తలపెట్టినట్లు గతేడాది నవంబరులో ప్రకటించారు. అంతే కాదు పశువులకు సుస్తీ చేసినపుడు 109నంబరుకు ఫోన్‌ చేస్తే వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స చేస్తారని కూడా ప్రకటించారు. పశువుల పేడతో ఎరువును రైతులు తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు. ఆవు పేరు జోడించటమే గమనించాల్సిన అంశం. ఆవు, ఎద్దు, దున్న, గేదె-బర్రెలకు పెట్టే మేత అంతా ఒకటే, అవి వేసే పేడ సేమ్‌ టు సేమ్‌. పాలివ్వటం ఆగిపోయిన ఆవులను రైతులు వదలివేస్తున్నారని, అవి వేసే పేడను ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని చత్తీస్‌ఘర్‌ సిఎం భూపేష్‌ భాగెల్‌ చెప్పారు. వాటికి పెట్టే మేత, నిర్వహణ ఖర్చుకు తగ్గ ఆదాయం పేడ అమ్మకం ద్వారా వస్తుందా అన్నదే సమస్య. రాష్ట్రంలో రైతులెవరూ పేడ అమ్మరని బిజెపి మాజీ మంత్రి అజయ చక్రధర్‌ అన్నారు. డిసెంబరు నాటికి రెండు లక్షల మంది రైతుల నుంచి 59లక్షల క్వింటాళ్ల ( రు.114 కోట్ల ) ఆవు పేడను కొనుగోలు చేసినట్లు, పదిలక్షల క్వింటాళ్ల వర్మీకంపోస్టు తయారు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.


కాంగ్రెస్‌ అవినీతిని అంత మొందించేందుకు, ఆ పార్టీ నాశనం చేసిన సంస్కృతి పరిరక్షణ కృష్ణుడు నరేంద్రమోడీ అవతారమెత్తి జన్మించినట్లు ఉత్తర ప్రదేశ్‌ వ ్యవసాయ మంత్రి కమల్‌ పటేల్‌ చెప్పారు.భారత్‌కు ముప్పు తలెత్తినపుడల్లా భగవంతుడు ఏదో ఒక అవతారమెత్తుతున్నాడని ఇప్పుడు మోడీ రూపంలో ఉన్నారని చెప్పారు. మధుర నియోజకవర్గంనుంచి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను పోటీకి నిలపాలని ఎందుకంటే కృష్ణుడు కలలోకి వచ్చి మధుర నుంచి పోటీ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం సాధిస్తారని చెప్పారంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు హరనాధ్‌ సింగ్‌ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. అయితే కృష్ణుడి జన్మ స్ధలంగా చెప్పుకొనే మధుర, రాముడి జన్మకేంద్రంగా చెప్పే అయోధ్యను కాదని గోరఖ్‌పూర్‌ నుంచి యోగి పోటీ చేస్తున్నారు. మరి కృష్ణుడు, రాముడికి కోపం వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. హరనాధ్‌ సింగ్‌ లేఖ వార్తలను చూసిన తరువాత సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ కృష్ణుడు తనకు ప్రతి రోజూ కలలోకి వస్తూ సమాజవాది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తనకు చెబుతున్నారని ప్రకటించారు.


గతంలో అధికారంలో ఉన్న సమాజవాది నేతలు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ కుటుంబ పాలన కేంద్రాలుగా మారినట్లు బిజెపి ధ్వజమెత్తింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు-విమర్శలకు గురైన కుటుంబ సభ్యులను బిజెపి చేరదీసింది. ములాయం సింగ్‌ రెండో భార్య కోడలైన అపర్ణా యాదవ్‌, రెండో భార్య బావమరిది, మాజీ ఎంఎల్‌ఏ ప్రమోద్‌ గుప్తాను పార్టీలో చేర్చుకుంది. దీంతో తనకు కుటుంబ భారాన్ని బిజెపి తగ్గించిందని అఖిలేష్‌ యాదవ్‌ చమత్కరించారు. అపర్ణా యాదవ్‌ బిజెపిలో చేరిన కొద్ది రోజుల తరువాత శుక్రవారం నాడు ములాయం సింగ్‌ యాదవ్‌ను కలసి ఆశీస్సులు అందుకున్నట్లు తెలుపుతూ కలసినప్పటి ఫొటో అంటూ ఒక చిత్రాన్ని ట్విటర్‌ద్వారా విడుదల చేశారు.ములాయం సింగ్‌ కోడళ్లు ఇద్దరూ ఠాకూర్‌ సామాజిక తరగతికి చెందిన వారు తప్ప యాదవులు కాదు. అందువలన అపర్ణ బిజెపిలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి కలిగే లాభమూ సమాజవాదికి వచ్చే నష్టమూ ఏమీ ఉండదని చెబుతున్నారు. ములాయం రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రకటించాలని రెండో భార్య సాధన చేసిన వత్తిడి ఫలించలేవు. ములాయం సోదరుడు శివపాల్‌ తిరుగుబాటు చేసి వేరే పార్టీని పెట్టినా ఫలితం లేకపోవటంతో ఇప్పుడు అఖిలేష్‌తో రాజీకి వచ్చినట్లు వార్తలు.


కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మీకు మరొకరి ముఖం ఎక్కడైనా కనిపిస్తోందా ? ప్రతి చోటా మీకు నా ముఖమే కనిపిస్తోందని ప్రియాంక గాంధీ స్పందించారు. శుక్రవారం నాడు తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలసి యువజన ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడారు.తాను పోటీ చేసేది లేనిదీ ఇంకా నిర్ణయించలేదన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగుబాటుకు బ్రెజిల్‌ బోల్సనారో కుట్ర – మిలిటరీ పాత్రపై ఉత్కంఠ !

18 Tuesday Jan 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

2022 Brazilian Presidential Elections •, 2022 Elections in Latin America, Brazil elections, Brazil’s Military, Jair Bolsonaro, lula da silva


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశం బ్రెజిల్‌. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలన్నీ ఈ ఏడాది అక్టోబరు రెండవ తేదీన జరిగే ఎన్నికల్లో వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా విజయం సాధించనున్నారనే చెబుతున్నాయి. మరోవైపున ఫాసిస్టు శక్తిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు జైర్‌ బోల్సనారో రంగం సిద్దం చేసుకుంటున్నాడు. లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్న తరుణంలో బ్రెజిల్‌ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ తాజాగా ధ్వజమెత్తాడు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటమి పాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన మద్దతుదార్లను అమెరికాపార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పిన దురాగతం గురించి తెలిసినదే. బ్రెజిల్‌లో కూడా అలాంటిదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అవినీతి అక్రమాలను, నేరాలను అరికడతానన్న వాగ్దానాలతో అధికారానికి వచ్చిన తరువాత నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బోల్సనారో కుట్రకు మిలిటరీ సహకరిస్తుందా ? వమ్ము చేస్తుందా అన్నది ఉత్కంఠరేపుతున్న అంశం.


లూలా మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఇద్దరు న్యాయమూర్తులు కోరుకుంటున్నారని బోల్సనారో అన్నాడు. నాకు ఓట్లు వేయద్దనుకుంటున్నారు పోనీయండి, ఎనిమిదేండ్ల పాటు దేశాన్ని దోచుకున్న వ్యక్తి రావాలని కోరుకోవటం ఏమిటంటూ లూలాను ఉద్దేశించి అన్నాడు. 2003 నుంచి 2010వరకు అధికారంలో ఉన్న లూలాపై తప్పుడు అవినీతి ఆరోపణలతో కేసులు పెట్టిన అంశం తెలిసిందే. కొంత కాలం పాటు జైల్లో ఉంచిన తరువాత కేసును కొట్టివేశారు. తొలి దఫా ఎన్నికల్లోనే లూలాకు 54, బోల్సనారోకు 30శాతం ఓట్లు వస్తాయని ఒకటి, 45-23శాతం వస్తాయని మరో తాజా సర్వే పేర్కొన్నది. ఏ సర్వేను చూసినా ఇద్దరి మధ్య ఇరవైశాతానికి మించి తేడా ఉంటోంది. అక్కడి నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో 50శాతం పైగా వస్తేనే ఎన్నికౌతారు. లేనట్లయితే అక్టోబరు 30న తొలి ఇద్దరి మధ్య తుది పోటీ జరుగుతుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతిలో రిగ్గింగు జరిపి తనను ఓడించేందుకు చూస్తున్నారని, ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకంటూ అనుసరించిన వాక్సిన్లు, లాక్‌డౌన్‌ విధానాల వలన కరోనా కేసులు, మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. స్ధానిక తెగలు, ఆఫ్రో-బ్రెజిలియన్‌ సామాజిక తరగతుల్లో వైరస్‌ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.


దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత వచ్చిన వార్తల మీద పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెబుతున్నారు.పార్లమెంటు మీద దాడికి దిగిన వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్దంగా ఉండాలని చెప్పటమెందుకు అన్నది ఒక ప్రశ్న. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు.ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.


రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.ఐనా ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. ఎన్నికల్లో బాలట్‌ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అమెరికాలో బాలట్‌ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన ట్రంప్‌కు ఇతగాడు ఏడాది క్రితం మద్దతు పలికాడు. గతేడాది మార్చినెలలో దేశ చరిత్రలో అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. దీన్ని చూస్తే 1964నాటి అమెరికా మద్దతు ఉన్న కుట్ర అనంతరం రెండు దశాబ్దాల పాటు సాగినమిలిటరీ పాలన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అంతేకాదు అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణ పేరుతో జరుపుతున్న తతంగం ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు.పౌర విచారణ కమిటీ తమపై విచారణ జరపటం ఏమిటని వారు నిరసన తెలిపారు. విచారణ సమయంలో దానికి మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించటం, అలాంటి ఒక ప్రదర్శనలో మిలిటరీ అధికారి ఒకరు పాల్గొనటం, తన అరెస్టు అక్రమం అని చెప్పటం ప్రమాదకర సూచనలను వెల్లడించాయి. బాలట్‌ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్‌ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తరువాత సెప్టెంబరు ఏడున తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. మిలిటరీ జోక్యం చేసుకోవాలని ఆ ప్రదర్శనల్లో బానర్లను ప్రదర్శించారు. ఇవన్నీ తిరుగుబాటు సన్నాహాలే అని కొందరు భావిస్తున్నారు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇస్తున్నది. బోల్సనారో పిచ్చిపనులు, మిలిటరీ తీరు తెన్నులపై ఇంతవరకు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి )పార్టీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలకు సన్నాహాలతో పాటు కుట్రలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ఆలోచనలతో ఉంది.


ఈ ఏడాది బ్రెజిల్‌తో పాటు కొలంబియా, కోస్టారికాలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. చిలీలో నూతన రాజ్యాంగ ఆమోదం, అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి ఆరున కోస్టారికాలో సాధారణ ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్‌ 3న అధ్యక్షపదవికి తుది ఎన్నిక, మార్చి 13న కొలంబియా పార్లమెంట్‌, మే 29నతొలి విడత అధ్యక్ష ఎన్నికలు, అవసరమైతే తుది విడత జూన్‌ 19, అమెరికా పార్లమెంటు ఎన్నికలు నవంబరు 8న జరుగుతాయి. బ్రెజిల్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, 81 స్ధానాల ఎగువ సభలో 27 స్ధానాలు, దిగువ సభలోని 513 డిప్యూటీలు, 26 రాష్ట్రాల, ఒక ఫెడరల్‌ జిల్లా గవర్నర్‌ పదవులకు ఎన్నికలు అక్టోబరు రెండున జరుగుతాయి. ఎగువ సభ సెనెటర్లు ఎనిమిది సంవత్సరాలు, దిగువసభ డిప్యూటీలు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటారు. అధ్యక్ష పదవికి లూలా, బోల్సనారోతో సహా పన్నెండు మందని, ఐదుగురు పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి.


కొలంబియాలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఇవాన్‌ డూక్‌పై డిసెంబరులో జరిగిన సర్వేలో 80శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి గెలిచే అవకాశాలు లేవు. మాజీ గెరిల్లా , గత ఎన్నికల్లో రెండవ స్ధానంలో వచ్చిన వామపక్షనేత గుస్తావ్‌ పెట్రో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అధ్యక్షపదవిని పొందేవారు 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాలి. తొలి దఫా సాధించలేకపోతే తొలి ఇద్దరి మధ్య రెండవ సారి పోటీ జరుగుతుంది. కోస్టారికాలో తొలి రౌండ్‌లో ఒకరు 40శాతంపైగా ఓట్లు తెచ్చుకొన్నపుడు మరొకరెవరూ దరిదాపుల్లో లేకపోతే అధికారం చేపట్టవచ్చు. ఇద్దరు గనుక 40శాతంపైన తెచ్చుకుంటే వారి మధ్య తుది పోటీ జరుగుతుంది. మితవాద పార్టీలే ప్రధాన పోటీదార్లుగా ఉన్నాయి. అమెరికాలోని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) మొత్తం 435 స్ధానాలకు, సెనెట్‌లోని వందకు గాను 34, 39 రాష్ట్ర గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. పెరూలో అక్టోబరు నెలలో స్ధానిక సంస్ధ ఎన్నికల జరగనున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష తరంగాలను ఆపేందుకు అమెరికా, దానితో చేతులు కలుపుతున్న మితవాద, కార్పొరేట్‌ శక్తులు చేయని ప్రయత్నం లేదు. గతంలో మిలిటరీ నియంతలను ప్రోత్సహించిన అమెరికా లాభ నష్టాలను బేరీజు వేసుకున్నపుడు నష్టమే ఎక్కువగా జరిగినట్లు గ్రహించి పద్దతి మార్చుకుంది. ఎన్నికైన వామపక్ష శక్తులను ఇబ్బందులకు గురించి చేసి దెబ్బతీయటం ద్వారా జనం నుంచి దూరం చేయాలని చూస్తోంది. అలాంటి చోట్ల అధికారానికి వచ్చిన మితవాద శక్తులు తదుపరి ఎన్నికల్లో జనం చేతిలో మట్టి కరుస్తున్నారు. బ్రెజిల్‌లో కూడా అదే పునరావృతం కానుందన్న వార్తల నేపధ్యంలో అమెరికా ఎలాంటి పాత్ర వహిస్తుందో చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

యువతలో పెరుగుతున్న అసంతృప్తి, అప్పులు దేశానికి ముప్పు- ప్రపంచ ఆర్ధికవేదిక హెచ్చరిక

17 Monday Jan 2022

Posted by raomk in BJP, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Disillusionment among youth, Global Risk Report, India Youth, Narendra Modi, Narendra Modi Failures, World Economic Forum


ఎం కోటేశ్వరరావు


దవోస్‌ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు గత నెలలో జరగాల్సినవి కరోనా కారణంగా జనవరి 17-21 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ ముప్పు నివేదికను వెలువరించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ దేశాలలో గడచిన ఏడాది కాలంలో సంభవించిన సంక్షోభాలను దీనిలో విశ్లేషిస్తారు.ఆర్ధిక వేదిక సమావేశాల్లో వాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ నేతలు చర్చిస్తారు. ఈ సారి ఏమి చర్చిస్తారో, ఏం జరుగుతుందో సమావేశాల తరువాత చూద్దాం. గతేడాది మాదిరే ఈ సారి కూడా కరోనా సంక్షోభం మీదే ప్రధానంగా కేంద్రీకరణ ఉంది. ప్రతిదేశం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి దీనిలో చర్చించారు.
మన దేశం ఐదు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటున్నదని 2022 నివేదికలో పేర్కొన్నారు. ఒకటి యువత అసంతృప్తి,రుణభారం, డిజిటల్‌ అసమానత, అంతర్రాష్ట సంబంధాలు దెబ్బతినటం, సాంకేతిక పాలన వైఫల్యంగా పేర్కొన్నారు. పని కోసం అడ్డాల మీదకు వస్తున్న వారికి ఉపాధి చూపకపోతే పక్కదార్లు పడతారు. అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. పర్యవసానాలను ఊహించలేము. జి-20 కూటమిలోని మన దేశంలో ఇది పెద్ద ముప్పుగా ఉంది. దేశంలో కార్మికశక్తి భాగస్వామ్యం 2020లో 46.29శాతం ఉండగా చైనాలో 66.82శాతం ఉంది. గతేడాది డిసెంబరులో సిఎంఐఇ సమాచారం ప్రకారం దేశం మొత్తంగా 7.91శాతం, పట్టణాల్లో 9.3,గ్రామాల్లో 7.28శాతం నిరుద్యోగులున్నారు. పరిస్ధితి ఎప్పుడు మెరుగుపడుతుందో అర్ధంగాని స్ధితిలో యువత ఉంది. కరోనాకు ముందే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించిందన్న సమాచారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనధికార మార్గం ద్వారా వెల్లడైన అంశాలను వాస్తవం కాదని తోసి పుచ్చి లెక్కలు సరిగా లేవని చెప్పింది. ఎన్నికలు ముగిశాక ఆ నివేదికనే గుట్టుచప్పుడు కాకుండా అంగీకరించింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్ధితి ఇంకా దిగజారింది.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.


1975అత్యవసర పరిస్ధితికి ముందున్న నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి.2014, 2019లో రెండు సార్లు మంచి రోజులను తెస్తానన్న నరేంద్రమోడీ వాగ్దానం,రేకెత్తించిన ఆశలకు ఇది విరుద్దం. వెనుకా ముందూ ఆలోచించకుండా, కుల, మతాలను అధిగమించి మద్దతు ఇచ్చిన వారు హతాశులౌతున్నారు. ఒకసారి అధికారంలో అన్నీ చేయటం ఎవరికైనా కష్టమే, రెండోసారి అవకాశం ఇద్దాం అనుకున్నవారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ ఊహించని పరిణామాలను చూస్తున్నారు.


నైపుణ్యశిక్షణ ఉంటే ఇంకేముంది ఉద్యోగం సిద్దం అన్నారు. డిగ్రీలు పుచ్చుకున్నవారు కాలేజీల నుంచి వెలుపలికి రాగానే వేలాది రూపాయలు వెచ్చించి పొందిన శిక్షణలు ఉపాధికి పనికి రాకుండా పోతున్నాయి. అసమానతలు, ఆర్ధిక రంగ పునరుద్దరణ, కరోనా పర్యవసానాలు కనీసం పదేండ్ల పాటు ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబాలు, దేశం అప్పుల పాలు కావటం కూడా యువత మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. పాలకులు చేసిన అప్పులకు వడ్డీ, అసలు మొత్తాలకు వచ్చిన ఆదాయాలను ఖర్చు చేస్తారా లేక ఉపాధికి అవసరమైన పెట్టుబడులు పెడతారా అంటే మొదటి దానికే మొగ్గు. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వనరుల వృద్ది జరిగి అపులు చేయాల్సి వచ్చినా పరిమితంగా ఉండేవి. కరోనా పేరుతో ఒకవైపు జనాల మీద భారాలు మోపుతూ అప్పులకు సైతం వాటినే కారణాలుగా చూపుతున్నారు. అసలు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలకే ఎక్కువగా మళ్లిస్తున్నారు.కరోనా కారణంగా అసమానతలు మరింత పెరిగినట్లు ప్రపంచబాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోని ధనికుల్లో ఎగువన ఉన్న 20శాతం మంది 2021లో తమ నష్టాలలో సగాన్ని తిరిగి పొందగలిగితే, దిగువ 20శాతం మంది ఐదుశాతంపైగా ఆదాయాలను కోల్పోయారు. కరోనా ముందున్న పరిస్ధితితో పోల్చితే 2030 నాటికి 5.1 కోట్ల మంది ఎక్కువగా దుర్భరదారిద్య్రంలో ఉంటారని అంచనా.


ఒక్క యువతే కాదు, గత ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన చూసినపుడు ఏ రంగంలోనూ ఆశాజనక పరిస్ధితి కనిపించటం లేదు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఏ రంగంలో చూసినా దిగజారుడు లేదా గిడసబారుడే.చెప్పుకొనే గొప్పలకు తక్కువ లేదు. దేశాన్ని అవినీతి నుంచి రక్షిస్తానని నేను తినను ఎవరినీ తిననివ్వను అని నరేంద్రమోడీ చెప్పినపుడు సంసార బంధాలు, బాధ్యతలు లేవు గనుక నిజంగానే చేస్తారని జనం నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. తన ఆశ్రితులకు అప్పనంగా జన సంపదలను అప్పగించటం ఏమిటన్నది ప్రశ్న. ఎవరి మేలుకోసం ఇది చేస్తున్నట్లు ?ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచికలో మన దేశ స్ధానం 2021లో 82లో ఉంది, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏడు స్ధానాలు దిగజారింది. మొత్తంగా ఎనిమిదేండ్ల పాలన చూసినపుడు 2014లో ఉన్న 82వ స్ధానమే ఇప్పుడూ ఉంది. మరి అవినీతిని అరికట్టిందెక్కడ ? ట్రేస్‌ అనే అంతర్జాతీయ సంస్ధ 194 దేశాలతో రూపొందించిన జాబితాలో మన స్ధానం అది. 2020లో 45 మార్కులు వస్తే 2021నాటికి 44కు తగ్గాయి.2014లో కూడా అన్నే మార్కులొచ్చాయి. ప్రభుత్వంతో వాణిజ్యలావాదేవీలు, అవినీతి నిరోధక చర్యలు, పౌరయంత్రాంగ పారదర్శకత, మీడియాతో సహా పౌరసమాజ నిష్ట సామర్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన దీన్ని మదింపువేస్తారు. ముడుపుల డిమాండ్‌ ఎక్కువగా ఉందంటే విదేశీ సంస్ధలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిన వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు చెప్పుకున్న పాలకుల ఏలుబడిలో ఉన్నాము. అనేక సూచికలను చూస్తే వివిధ అంశాలలో మనం ఎక్కడున్నాం అన్నది అవలోకనం చేసుకోవాల్సి ఉంది. వైఫల్యాలను కాంగ్రెస్‌ మీదో మరొకరి మీదో నెడితే ఇంకేమాత్రం కుదరదు. స్వాతంత్య్రం తరువాత అత్యంతబలమైన ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ మాత్రమే నెలకొల్పారని చెబుతున్నపుడు ఫలితాలు కూడా అలాగే ఉండాలి కదా ! లంచాల సూచికలో పని తీరు ఏమిటో చూశాము. మరికొన్నింటిలో ఏ స్ధానంలో ఉన్నామో పరిశీలించుదాం.
ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచిక 82(2021)
నిరంతర అభివృద్ధిసూచిక(ఎస్‌డిజి) 120 (2021)
మానవాభివృద్ధి సూచిక(యుఎన్‌డిపి) 131 (2020)
ప్రపంచ లింగవివక్ష(ప్రపంచ ఆర్ధికవేదిక) 140 (2021)
ప్రపంచ ఆకలి సూచిక 94(2020)
ప్రపంచ యువత ఆభివృద్ధి సూచిక 122(2020)
ప్రపంచ ఆరోగ్య భద్రత సూచిక 57(2019)
ప్రపంచ ముప్పు సూచిక 89(2020)
ప్రపంచ పర్యావరణ ముప్పు సూచిక 7(2021)
ప్రపంచ ఉగ్రవాద ముప్పు సూచిక 8 (2020)
ప్రపంచ ప్రజాస్వామ్య (ఇఐయు) సూచిక 53(2020)
ప్రపంచ మానవ స్వేచ్చ (కాటో) సూచిక 111(2020)
ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచిక 105(2020)
ప్రపంచ అవినీతి దృష్టి సూచిక 86(2020)
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 142(2021)
ప్రపంచ సుపరిపాలన సూచిక 49(2021)
ప్రపంచ సులభతర వాణిజ్య సూచిక 63(2019)
ప్రపంచ పోటీతత్వ సూచిక 43(2021)
ప్రపంచ నవకల్పన సూచిక 48(2020)
ప్రపంచ పిల్లల హక్కుల సూచిక 112(2021)
ప్రపంచ అసమానతల నివారణ నిబద్దత సూచిక 129(2020)
ప్రపంచ ఇంటర్నెట్‌ సూచిక 49(2021)
ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచిక 72(2021)
ప్రపంచ శాంతి సూచిక 135(2021)
ప్రపంచ విద్యా సూచిక 135(2020)


దేశ రుణ భారం ఆకస్మికంగా పెరిగింది. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం ప్రపంచ రుణం 226లక్షల కోట్ల డాలర్లు.2019 కంటే 27లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. కరోనా తరువాత విపరీతంగా పెరిగింది. మన జిడిపిలో అప్పు మొత్తం 90.6శాతం ఉంది. మన అప్పులు 2016లో 68.9శాతం కాగా 2020 నాటికి 89.6, మరుసటి ఏడాదికి 90.6శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. తరువాత మొత్తంగా చూస్తే అప్పు పెరిగినప్పటికీ జిడిపి పెరుగుదల కూడా ఉంటుంది కనుక దానితో పోలిస్తే 2022లో 88.8 నుంచి 2026 నాటికి 85.2శాతానికి చేరుతుందని అంచనా. అంటే కరోనా ముందు స్ధితికి చేరే అవకాశమే లేదు. రుణాల పెరుగుదల వలన సామాజిక అశాంతి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక హెచ్చరించింది. పాలకులు ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కారాలను చూస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మతవిశ్వాసులపై లెనిన్‌ చెప్పిందేమిటి ? కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేకత !

16 Sunday Jan 2022

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, anti communist resolution, CPI(M), IUML, Samastha Kerala Jamayat Ulema, Vi Lenin on believers


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మూడవ ప్రత్యామ్నాయం-కెసిఆర్‌ ముందున్న సమస్యలు !

15 Saturday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), KCR, RJD, Third front formation in India, trs


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్‌ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్‌ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్‌ జాతీయ సభ, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్‌ ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.


కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ను కెసిఆర్‌ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్‌ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్‌ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్‌ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నేత జనానికి చెప్పకనే చెప్పారు.


తేజస్వి యాదవ్‌ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కెసిఆర్‌ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్‌ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్‌ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్‌ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్‌ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.


వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్‌ఎస్‌ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్‌ గురించి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.


టిఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్‌డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్‌ గురించి కెసిఆర్‌ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.


రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్‌ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్‌ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.


ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.


టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్‌ఎస్‌ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్‌ఎస్‌-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.


అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్‌ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్‌ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.


కెసిఆర్‌ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్‌ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్‌ఎస్‌, దాని అధినేత కెసిఆర్‌ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి తాళం కప్ప బహుమతి – ఒక మంత్రి, 15 మంది ఎంఎల్‌ఏలు రాం రాం !

12 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, Hinduthwa, Narendra Modi, OBC, Swami Prasad Maurya, UP BJP poll fate, UP poll 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: