• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

కేరళామే హమ్‌ దేఖేంగే !

06 Saturday Mar 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP-Kerala, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !

02 Tuesday Mar 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

#Correismo, #latin american left, Ecuador, imperialism, Second Progressive Wave


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో కొన్ని చోట్ల తగిలిన తీవ్ర ఎదురు దెబ్బలతో ఇంకేముంది వామపక్షాల పని ముగిసింది అని చాలా మంది సంతోషించారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి సారీ మనుషుల ప్రాణాలు పోయేట్లయితే మానవ జాతి ఇంతలా పెరిగి ఉండేది కాదు. అలాంటిది తగిలిన ఎదురు దెబ్బలకు ఉద్యమాలు అంతరించిపోతాయను కోవటం ఒక భ్రమ మాత్రమే. సామ్రాజ్యవాదుల కుట్రలు, వాటికి వ్యతిరేకంగా జాగ్రత్తలను తీసుకోకపోవటం, నయా ఉదారవాదం మీద భ్రమలు, దాని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయటం, నయా ఉదారవాద పునాదులను కదిలించకపోవటం వంటి అనేక అంశాలు వామపక్షాల ఎదురు దెబ్బల వెనుక ఉన్నాయి. ఎదురు దెబ్బలను మాన్పుకొని తిరిగి పయనం ఎలా సాగిస్తామో ఉద్యమాలూ అంతే . ఇటీవల జరిగిన పరిణామాలు, కొన్ని చోట్ల ఎన్నికలలో తిరిగి వామపక్షాలు విజయం సాధించటాన్ని కొందరు మరోసారి వామపక్ష పురోగమన తరంగం ప్రారంభం అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కడలి తరంగాల ఆటు పోట్లు నిత్యం జరుగుతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. అదే మాదిరి ఉద్యమాలుంటాయి. అల అది పురోగామి లేదా తిరోగామి ఏదైనా జనానికి కొత్త అనుభవం నేర్పుతుంది.


లాటిన్‌ అమెరికా ప్రత్యేకించి బొలీవియాలో ఉన్న పరిస్దితి గురించి దేశ మాజీ ఉపాధ్యక్షుడు అల్వారా గార్సియా లినేరా మాట్లాడుతూ రెండవ పురోగమన తరంగంలో ఉన్నామని చెప్పారు.యాభై ఎనిమిది సంవత్సరాల లినేరా చేగువేరా స్ఫూర్తితో ఏర్పాటయిన టపాక్‌ కటారీ గెరిల్లా సైన్య నేతగా పని చేశారు. తిరుగుబాటు చేశారనే ఆరోపణలతో 1992లో అరెస్టు చేసి 1997లో విడుదల చేశారు. ఇవోమొరేల్స్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2005 నుంచి 2019వరకు దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన వారిద్దరి మీద పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి దేశం నుంచి వెళ్లిపోయేట్లు చేసింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మొరేల్స్‌ నాయకత్వంలోని మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్సీ ఘన విజయం సాధించటంతో ఇద్దరూ స్వదేశానికి చేరుకున్నారు.


ఒక వార్తా సంస్దతో తన స్వగృహంలో మాట్లాడుతూ ఏడాది తరువాత ఇంటి తలుపులు తెరిచినపుడు వచ్చిన శబ్దాలు తనను ఎంతో ఉద్వేగానికి గురి చేశాయన్నారు. లూయీస్‌ ఆర్సీ 55శాతం ఓట్లతో అధికారానికి రావటం వామపక్ష వాద విజయాలు మరియు పురోగమనాన్ని నిర్దారించింది.కొంత మంది వామపక్ష సైకిలు చక్రం తిరగటం ఆగిపోయిందనటం వాస్తవం కాదనేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇది, వామపక్ష ఉద్యమం తరంగాల వంటిది తప్ప ఆగిపోయే చక్రం కాదు, తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. తొలి తరంగం బలమైన ప్రజాకర్షణ గల నాయకత్వంతో విప్లవాత్మక పురోగమనవాదం అయితే రెండవది అలాంటి ప్రజాకర్షక నాయకత్వం లేని సాధారణ పురోగమనవాదంగా మనం చూస్తామన్నారు. మధ్యేవాద మితవాద శక్తుల పతనం పచ్చిమితవాద శక్తులకు దారి కల్పిస్తుంది, బలపడతాయి, దీన్ని మనం బ్రెజిల్లో చూశాము. ఇదేదో ఏదో ఒక చోట జరిగింది కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌లో చూశాము, ఐరోపాలో చూస్తున్నాము. మధ్యేవాద మితవాదం విప్లవాత్మకంగా మారలేక వామపక్ష ప్రజాకర్షకనేతలను విమర్శిస్తూ హింసాత్మక మితవాదులనుంచి తనకు తాను దూరం జరుగుతోందని లినేరా చెప్పారు. బొలీవియాలో మరోసారి కుట్ర జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అందుకే నేను యువతను కలిసిన ప్రతిసారీ మరోసారి కుట్ర జరిగితే మీరేం చేస్తారు అని అడుగుతాను. అదొక సంస్దాపరమైన ప్రశ్న. అలా అడగటం ద్వారా సంఘటితం కావటం, రాజకీయ శిక్షణవైపు, స్పష్టమైన మార్గంవైపు వారిని నెడుతుంది. కేవలం ఎన్నికల కూటములకు మించి ఆలోచించటం నూతన ప్రజాస్వామ్య తరంగానికి ముఖ్యం అన్నారు.


అనేక చోట్ల ప్రతిపక్ష స్ధానాల్లోకి పోయిన లాటిన్‌ అమెరికా వామపక్షం తిరిగి నూతన ఎన్నికల విజయాల గురించి ఆశలు రేపుతున్నది.చిలీలో 1973లో వామపక్ష అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీని హత్య చేసి నియంత అగస్టో పినోచెట్‌ అధికారాన్ని చేపట్టాడు. వామపక్ష ఉద్యమాన్ని అణచివేశాడు. పినోచెట్‌ అధికారం కోల్పోయిన తరువాత ఎవరు అధికారానికి వచ్చినా అతగాడి నిరంకుశ రాజ్యాంగమే అమల్లో ఉంది. గతేడాది జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా వామపక్షాలు ఆమోదించిన కొత్త రాజ్యాంగ రచన జరగనుంది. దాని రూపు రేఖల మీద కొందరికి అనుమానాలు ఉన్నప్పటికీ అది కూడా ఒక విజయంగానే పరిగణించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగి కొత్త రాజ్యాంగం ప్రకారం ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగితే వామపక్షాలు సమైక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వామపక్షం అని పూర్తిగా చెప్పేందుకు లేకున్నా వారితో కలసిపని చేసే, అర్జెంటీనాలో గతంలో అధికారానికి వచ్చి తరువాత ఓడిపోయిన పెరోనిస్టు పార్టీ 2019లో అధికారానికి వచ్చింది. ” లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు వెనుకపట్టు పట్టినా మితవాదం-వామపక్షం మధ్య వైరుధ్యం ముగియలేదు.2021లో వామపక్షం తిరిగి లాటిన్‌ అమెరికాలో ముందుకు పోయేందుకు వీలుగా ఉంది. ఈక్వెడోర్‌లో మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా బలపరచిన వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ విజయం సాధిస్తే ఎంతో ప్రాధాన్యత కలిగినది అవుతుంది. లాటిన్‌ అమెరికాలో పురోగమన వాదం నూతన రాజకీయ దశకు నాంది అవుతుంది” అని కొలంబియాకు చెందిన సామాజికవేత్త జేవియర్‌ కాలడెరన్‌ కాస్టిలో చెప్పారు. పెరూలో వామపక్ష విజయావకాశాలు పెరుగుతున్నాయి, వెరోనికా మెండోజా విజయం సాధించే అవకాశాలున్నాయని కూడా అన్నారు. ”నయా ఉదారవాదానికి బొలీవియా, చిలీలో పెద్ద దెబ్బ తగిలింది. నేడు నయా వుదారవాదవిధానాల పర్యవసానాలకు వ్యతిరేకంగా జనం పోరాడుతున్నారు. పురోగామి శక్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పురోగమించే అవకాశాలు అంటే గత దశాబ్దంలో మాదిరి సాధ్యమైనంత త్వరలో అని కాదు. నయా ఉదారవాద శక్తులకు తమ ఇబ్బందులేమిటో తెలుసు, ఇదే సమయంలో పురోగామిశక్తుల పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో జరిగే కొలంబియన్‌ ఎన్నికలలో కొందరు పురోగామి శక్తులు విజయం సాధించవచ్చు ” అని కాస్టిలో చెప్పారు. బ్రెజిల్‌ గురించి చెబుతూ ” అది లాటిన్‌ అమెరికాలో పెద్ద దేశం. అది లాటిన్‌ అమెరికాలో బలాబలాల పొందికను కచ్చితంగా మారుస్తుంది. ప్రస్తుతానికి అది పచ్చి మితవాదశక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పురోగమనం ఉన్నా అది సంపూర్ణం కాదు, పోరు ఇంకా సాగుతూనే ఉంది.అక్కడ పురోగామి శక్తులు ఉన్నా ఇంకా ఎంతో ముందుకు పోవాల్సి ఉంది.

చిలీ సోషలిస్టు పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు ఎన్రిక్వెజ్‌ ఒమినామీ ఇలా అభిప్రాయపడ్డారు.” లాటిన్‌ అమెరికా ఖండం మరింత సన్నిహితం అయ్యేందుకు సాధ్యమైనన్ని ప్రభుత్వాలతో వామపక్షం తిరిగి ముందుకు రావాలి. అది వాణిజ్య పరంగా, ఆర్ధిక విలువ, రుణాలపై మారటోరియం, మిలిటరీ ఖర్చు, అమెరికాతో సంబంధాలలో జరగాలి. ఆర్దిక సామర్ధ్యం కంటే సామాజిక న్యాయం గురించి వామపక్షం కేంద్రీకరిస్తుంది, కనుక ఇది ఎంతో ముఖ్యం. మితవాద లేదా ఉదారవాద ప్రభుత్వాలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈక్వెడోర్లలో తమ వాగ్దానాలను నిలుపుకోలేదు కనుక వామపక్షాలకు అవకాశాలు ఉన్నాయి.దీనికి తోడు లాటిన్‌ అమెరికా వామపక్షం వ్యవస్దా వాదాన్ని మార్చాల్సి ఉందనే పాఠాన్ని నేర్చుకున్నది. మధ్య తరగతి డిమాండ్లకు అనుగుణ్యంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి” అన్నారు.


ఏప్రిల్‌ నెలలో రెండవ దఫా ఎన్నికలు జరగాల్సిన ఈక్వెడోర్‌లో ఏం జరగనుందో ఇప్పటికీ స్పష్టత లేదు. అమెరికా అనుకూల హరితవాది యకు పెరెజ్‌ను రెండవ స్ధానంలో నిలిపేందుకు, తుది దఫా ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నాలుగు జైళ్లలో ఆటవిక పద్దతిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 81 మంది మరణించారు. రంపాలతో శరీరాలను కోయటం, కుళ్లపొడవటం, ముక్కలు చేయటం వంటి దారుణాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.లాటిన్‌ అమెరికాలోని కొలంబియా వంటి కొన్ని దేశాల్లో ఇటువంటి చర్యలకు పోలీసులు, పారామిలిటరీ, ప్రభుత్వకిరాయి హంతక దళాలు, వాటిని ఎదిరించే వారు పాల్పడటం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించి గుర్తింపు బయటకు రాకుండా ఇలాంటి పనులు చేయించి ఇతరుల మీద నిందలు వేయటం సర్వసాధారణం. ఈక్వెడోర్‌ జైళ్లలో జరిగిన ఉదంతాలకు మాజీ అధ్యక్షుడైన వామపక్ష రాఫెల్‌ కొరెయా అనుచరులే కారణమని ప్రభుత్వం ప్రకటించటం వెనక ఉన్న కుట్ర ఏమిటో స్పష్టం.రెండవ దఫా జరగనున్న ఎన్నికలలో కొరెయా బలపరచిన అభ్యర్దిని దెబ్బతీసే దుర్మార్గమైన ఎత్తుగడ ఇది.మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అనేక మంది నేరగాండ్లు ఈ జైళ్లలో ఉన్నారు. అలాంటి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జైళ్లలో కూడా వారు మారణకాండకు పాల్పడిన ఉదంతాలెన్నో. తాజా ఉదంతాలలో మరణించిన వారిలో అలాంటి మాఫియాలకు చెందిన వారు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయించిన దారుణం తప్ప రాజకీయంగా వామపక్ష పార్టీకి ఎలాంటి సంబందం లేదు. జైళ్లలో ఉన్నవారికి అధికారుల అనుమతి, అవకాశం ఇవ్వకుండా అలాంటి మారణాయుధాలు ఎలా అందుబాటులోకి వస్తాయి ? వామపక్ష ఇఎల్‌ఎన్‌ పార్టీకి మాదకద్రవ్యాల ముఠాల నుంచి నిధులు అందుతున్నాయని ముందే తప్పుడు ప్రచారం చేశారు. ఆ పార్టీ అభ్యర్ధి ఆండ్రెస్‌ అరుజ్‌ ప్రధమ స్ధానంలో ఉన్నందున, ఏదో ఒకసాకుతో అసలు ఎన్నికలనే రద్దు చేసేందుకు ఇదంతా చేశారన్నది స్పష్టం.

అమెరికా అనుకూల అభ్యర్ధి యకు పెరెజ్‌ అనూహ్యంగా మూడవ స్ధానంలో రావటంతో అసలు రెండోసారి పోటీకే అనర్హుడయ్యాడు.మూడో స్ధానంలో వచ్చిన మరోమితవాది లాసో అతని మధ్య ఓట్ల తేడా కేవలం 20వేలు లోపు కావటంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ యాగీ చేశాడు. దానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. తీరా చూస్తే దానిలో కూడా పసలేదని తేలింది. లెక్కింపులో అటువేయాల్సిన ఓట్లను ఇటు వేశారని చెప్పిన 31 పత్రాలను పరిశీలించగా వాటిలో ఉన్న మొత్తం ఓట్లే పదహారు వేలు. అవి మొత్తం పెరేజ్‌కు వచ్చినా మూడవ స్ధానం మారదు.వాటిలో 7,233 ఓట్లలో మాత్రమే ఓటు నంబరు, ఓటరు సంతకానికి తేడాలు కనిపించాయి, వాటిలో కూడా 1,453ను రెండుసార్లు లెక్కించారు. అందువలన అది కూడా వీగిపోయిన తరువాత చట్టపరంగా ఇతర ఇబ్బందులు కలిగించేందుకు పూనుకోవటంతో పాటు జైల్లో హత్యాకాండ చేయించారు. అందువలన అడుగడుగునా ఎన్నికలను తొత్తడం చేసేందుకు కుట్ర సాగుతూనే ఉంది. దానిలో భాగమే మాదకద్రవ్య మాఫియా నుంచి వామపక్ష అభ్యర్ధికి నిధులు అందాయన్న మరొక కట్టుకధ. దాని మీద ఫిర్యాదు, విచారణ తతంగం. ఎంతకు బరితెగించారంటే ఏప్రిల్‌లోగా వామపక్ష అభ్యర్ధి అరౌజ్‌ పతనం కానట్లయితే తరువాత అక్రమంగా నిధులు పొందారన్న కారణంతో పతనం అవుతాడని యకు పెరేజ్‌ ప్రకటించటం కుట్రగాక మరేమిటి ?


ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ అంతర్గతంగా అనేక మంది గళమెత్తుతున్నారు.ప్రజాస్వామిక ప్రక్రియ ఈక్వెడోర్‌లో కొనసాగుతుందనే హామీ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ అబ్రాడోర్‌, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రకటనను బొలీవియా అధ్యక్షుడు లూయీస్‌ ఆర్సీ కూడా బలపరిచారు. రాఫెల్‌ కొరియా నాయకత్వంలో ఉన్న పార్టీకి ద్రోహం చేసి విద్రోహ శక్తులతో చేతులు కలిపిన ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో తన అభ్యర్ధి సోదిలో కూడా లేకుండా పోవటంతో ఇప్పుడు బ్యాంకర్‌ అయిన రెండవ స్ధాన అభ్యర్ధి లాసోకు మద్దతు ఇస్తున్నాడు. కనిపించని కుట్రల నేపధ్యంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్దితిని బట్టి పోటీ అరౌజ్‌ -లాసో మధ్య జరుగుతుందా ? మితవాదశక్తులన్నీ లాసో వెనుక నిలుస్తాయా ? అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది చెప్పలేము. ఇక్కడ అరౌజ్‌ విజయం లాటిన్‌ అమెరికాలో వామపక్షాల నిర్ణయాత్మక పాత్రను మరింత ముందుకు తీసుకుపోనుంది. అయితే సామ్రాజ్యవాదులు దీన్ని అనుమతిస్తారా లేక గతం మాదిరి మిలిటరీ నియంతలను తిరిగి రంగంలోకి తెస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !

26 Friday Feb 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala LDF, Kerala political love jihad, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఏప్రిల్‌ ఆరవ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణలు, సర్దుబాట్లు త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. గత నాలుగు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారానికి వస్తే మరోసారి సిపిఎం నాయకత్వంలోని కూటమి రావటం తెలిసిందే. దానికి భిన్నంగా ఈ సారి మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తుంటే, అధికారానికి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ చేయని ప్రయత్నం లేదు. కేవలం ఒక స్ధానం ఉన్న బిజెపి తాము కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. తాను చేరితే బిజెపి ఓట్లు రెట్టింపు అవుతాయని, అధికారానికి వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి సిద్దంగా ఉన్నానని మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌లో 14 పార్టీలు, యుడిఎఫ్‌లో ఐదు ఉన్నాయి. ఎన్‌డిఏలో బిజెపితో పాటు మరో నాలుగు చిన్న పార్టీలు ఉన్నాయి. మొత్తం 140 స్దానాలకు గాను ఎల్‌డిఎఫ్‌కు 91 స్ధానాలు, యుడిఎఫ్‌కు 47, బిజెపికి ఒకటి, ఆ పార్టీతో జత కట్టిన మరో పార్టీకి ఒక స్ధానం ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌లో కొత్తగా చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ యుడిఎఫ్‌లో ఉండగా గత ఎన్నికల్లో 11, 7 స్దానాల చొప్పున పోటీ చేశాయి. ఇప్పుడు వాటికి ఎల్‌డిఎఫ్‌లోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా సిపిఎం, సిపిఐ తమ స్దానాల సంఖ్యను తగ్గించుకొని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు యుడిఎఫ్‌లో ఖాళీ అవుతున్న సీట్లలో మిగిలిపోయిన కేరళ కాంగ్రెస్‌(జె)కు ఏడు సీట్లు పోను మిగిలిన వాటిని కాంగ్రెస్‌-ముస్లిం లీగు పంచుకుంటాయని వార్తలు వచ్చాయి. కొద్ది వారాల క్రితం పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి ఎల్‌డిఎఫ్‌కు 101 స్ధానాలు వస్తాయని, మళయాల మనోరమ విశ్లేషించగా, 98వస్తాయని సిపిఎం సమీక్షలో తేలిందని అదే ప త్రిక రాసింది. స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికలలో ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కూడా తిరిగి అదే ప్రచారం ప్రారంభమైంది.మీడియా వాటికి వంతపాడుతున్నది.


ఓట్లకోసం చర్చిల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న బిజెపి -ముస్లిం లీగుకూ ఆహ్వానం !


కేరళలో సీట్లు వచ్చినా రాకపోయినా కనీసం ఓట్లయినా పెంచుకోవాలని, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకోవాలన్నది బిజెపి ఆత్రం. అత్రగాడికి బుద్ది మట్టు అన్న సామెత తెలిసిందే. నిత్యం మత మార్పిడుల గురించి క్రైస్తవ మతాన్ని తిట్టిపోసే బిజెపి నేతలు ఇప్పుడు కేరళలో చర్చ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు, ఆ మత పెద్దలను సంతుష్టీకరించి ఓట్లు పొందేందుకు నిర్ణయించుకున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ త్వరలో అందుకోసం బయలుదేర నున్నారని కేరళలో అగ్రశ్రేణి దినపత్రిక మళయాల మనోరమ రాసింది.కర్ణాటక నుంచి కేరళ బిజెపి అభ్యర్ధులకు అవసరమైన డబ్బుతో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నడుంకట్టారు. కేరళలో సమస్యలు, బిజెపి ఎత్తుగడల గురించి చర్చించేందుకు బెంగళూరులోని వంద మంది మళయాలీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట.
కేరళ రాజకీయాల్లో ఏది వాటంగా ఉంటే దాన్ని అనుసరించే సీనియర్‌ ఎంఎల్‌ఏ పిసి జార్జి. కాంగ్రెస్‌తో జీవితాన్ని ప్రారంభించి స్వతంత్రుడిగా, కేరళ కాంగ్రెస్‌లోని రెండు ప్రధాన గ్రూపుల్లో చేరి తరువాత దాన్నుంచి బయటకు వచ్చి జనపక్షం పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. ఏ పేరుతో పోటీ చేసినా మంచి మెజారిటీలతో ఏడు విజయాలతో ఒక ప్రత్యేకత సాధించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తాజా వార్తల ప్రకారం మరోసారి బిజెపితో చేతులు కలపబోతున్నారు. రెండు సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు వార్తలు. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బహిరంగ ప్రకటనలు, అంతర్గతంగా బిజెపితో సంబంధాలు నెరపటంతో జార్జిని చేర్చుకుంటే చేర్చుకుంటే సంగతి తేలుస్తాం అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం హెచ్చరించింది. ఒక వేళ చేర్చుకొని సీటు ఇస్తే పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని కొట్టాయం జిల్లా నేతలు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్ధితిలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా కొన్ని వేల ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి కనుక చేర్చుకోవాలన్న వర్గం వాదనలను మెజారిటీ అంగీకరించలేదు.


ఎల్‌డిఎఫ్‌ ఎలాగూ చేర్చుకోదు గనుక పిసి జార్జి బిజెపి వైపు చేరనున్నారు. ఆ పార్టీని మంచి చేసుకునేందుకు ముందుగానే చెప్పినట్లు ముస్లింలను విమర్శించి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామాలయ నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చినట్లుగా మాతృభూమి పత్రిక రాసింది. బిజెపితో కలసిన మరొక పార్టీ కేరళ కాంగ్రెస్‌(థామస్‌). దీని నేత పిసి థామస్‌ గతంలో వాజ్‌పేయి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పిసి జార్జిని బిజెపి వైపు తీసుకురావటంలో సంధానకర్తగా పనిచేశారని వార్తలు.జార్జి వస్తే కొట్టాయం జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్ధానంగా మారిన పాలా నియోజకవర్గంలో బిజెపి గెలవవచ్చనే అంచనాతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఐదు దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత మణి మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున్‌ ఎన్‌సిపి అభ్యర్ధి ఎంసి కప్పన్‌ విజయం సాధించారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(ఎం) బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరింది.దాంతో పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించాలని సిపిఎం నిర్ణయించింది. కప్పన్‌కు వేరే చోట కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినలేదు. దాంతో ఎన్‌సిపి అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించటంతో యుడిఎఫ్‌లో చేరారు. పిసి జార్జి గతంలో కేరళ కాంగ్రెస్‌(ఎం)లో ఉన్నపుడు దివంగతనేత మణి కుమారుడు ప్రస్తుత నేత జోస్‌కె మణితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి మణి పాలాలో పోటీ చేస్తారన్న వార్తల పూర్వరంగంలో పిసి జార్జి కాంగ్రెస్‌లో చేరి దెబ్బకొట్టాలని చూశారు. అది సాధ్యంగాకపోవటంతో బిజెపితో చేతులు కలుపుతున్నారు. పాలాలో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


మరొక ముఖ్యమైన పరిణామం ముస్లిం లీగ్‌ను ఎన్‌డిఏలోకి ఆహ్వానించారు. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శోభా సురేంద్రన్‌ మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లిం లీగ్‌ జాతీయవాదాన్ని అంగీకరించి ఎన్‌డిఏలోకి రావాలని అది లీగ్‌ నేతలకు, ముస్లింలకూ ఉపయోగం అని ఆమె వ్యాఖ్యానించారు. అది జరిగినా ఆశ్చర్యం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు సంచలనం సృష్టించటంతో కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ మాట్లాడుతూ తాము ముస్లింలీగ్‌తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు కాదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలను వారు గుర్తించాలన్నారు. మరోవైపున కేరళలో తాము అధికారానికి రావాలంటే 35-40 స్ధానాలు వస్తే చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చెప్పారు.


బిజెపి రిక్రూట్‌మెంట్‌ ఏజంట్‌గా రాహుల్‌ గాంధీ !


కాంగ్రెస్‌ నిర్వహించిన కేరళ ఐశ్వర్య యాత్ర ముగింపు సభకు వచ్చిన రాహుల్‌ గాంధీ ప్రసంగ తీరుతెన్నులు బిజెపి రిక్రూటింగ్‌ ఏజంట్‌ మాదిరిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గం విమర్శించింది. బిజెపిపై పల్లెత్తు విమర్శకూడా చేయకుండా వామపక్షాలపై బిజెపి చేస్తున్న విమర్శల పదజాలాన్నే పునశ్చరణ గావించారని, ఆ కారణంగానే అనేక చోట్ల కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఏకంగా బిజెపిలోనే చేరేందుకు ఉత్తేజం పొందుతున్నారని సిపిఎం పేర్కొన్నది. బిజెపి అమలు చేస్తున్న వ్యవసాయ సంస్కరణలు అమలు జరుపుతామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ వైనాడ్‌లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన రాహుల్‌ గాంధీ చిత్తశుద్ది ఏమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విస్మరించిన రాహుల్‌ గాంధీ కేరళ వచ్చి మద్దతు ప్రకటించటం అసాధారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.1990 దశకంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన ఉదారవిధానాలు వ్యవసాయ సంక్షోభానికి కారణమని, ఆ పార్టీ చేతులు రైతుల రక్తంతో తడిచాయని, అందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన నియోజకవర్గం వైనాడ్‌లో గతంలో ఏమి జరిగిందో, కాఫీ, మిరియాల రైతులు ఎలా నాశనమయ్యారో తెలుసుకొనేందుకు సిద్దపడాలని అన్నారు. రెండు దశాబ్దాల నాడు కాంగ్రెస్‌ అమలు జరిపిన విధానాల కారణంగా వైనాడ్‌లోని ఆ పంటల రైతులు రెండు మూడు సంవత్సరాలలో ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయారని జర్నలిస్టు శాయినాధ్‌ పేర్కొన్న విషయాన్ని రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలన్నారు.ఆ విధానాల ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని అందుకుగాను రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం పట్ల రాహుల్‌ గాంధీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకే విధమైన వైఖరితో ఉన్నందున వారి మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !

26 Friday Feb 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#support farmers, Farmers Delhi agitation

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయ చట్టాలకు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతాంగాన్ని నగర ప్రవేశానికి నిరాకరించటంతో ప్రారంభమైన ఢిల్లీ శివార్లలో తిష్టకు మూడు నెలలు నిండాయి. నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించినట్లు అన్న సామెత తెలిసిందే. చర్చలకు సిద్దమే అన్న ప్రధాని నరేంద్రమోడీ ఆందోళనా జీవులంటూ రైతులను కించపరిచారు. తాము సిద్దంగానే ఉన్నామని రైతులు చెప్పినా జనవరి 22 తరువాత చర్చలు జరగలేదు. చట్టాల అమలు వాయిదా వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అయితే చర్చలకు తాము సిద్దమే అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.రైతులు గుమికూడినంత మాత్రానే చట్టాలు రద్దవుతాయా అని తనలోనూ తల్లి వైపు నుంచి రైతు రక్తం ఉందని చెప్పుకున్న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతులను తాజాగా ఎద్దేవా చేశారు.ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? జనాలు గుమికూడితే చట్టాలేం ఖర్మ ప్రభుత్వాలే మారిపోతాయని మతులు పోగొట్టుకున్న వారికి అర్ధం కాదు అని రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటిని చూడాలో !

బేటీ బచావో అన్న నోటితో ఉచ్చరించరాని బూతులా ? హవ్వ !!

మరోవైపున సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో, పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఉద్యమం మీద, రైతులకు మద్దతు ఇచ్చిన వారి మీద ఎడతెగని ముమ్మర దాడి సాగుతూనే ఉంది. భిన్నాభిప్రాయం లేదా నిరసన తెలిపిన మహిళలను సామాజిక మాధ్యమంలో బజారు…..లని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. తమ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన మహిళలు, యువతులు కూడా అనేక ఆందోళనల్లో పాల్గొంటున్నారు అనే స్పృహ వారిలో ఉందా లేక ఉన్మాదంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. శీలము,ఏకత అంటూ కబుర్లు చెప్పేవారు ఇంతగా నోరుపారవేసుకోవాలా ? వారి నిజస్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడుతున్నంతగా గతంలో ఎన్నడూ లేదన్నది నిజం.తమను వ్యతిరేకించే వారిని ఇలాంటి పదజాలంతో తిట్టే బాపతు తమను కూడా వదలరు అని బిజెపి మహిళా అభిమానులు, కార్యకర్తలు గ్రహించటం అవసరం.

ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా రైతులు మనం చెప్పేది వినటం లేదు. వ్యవసాయ చట్టాల మీద వారిని మాయపుచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి అంటూ ఫిబ్రవరి 22న హర్యానాలోని గురుగామ్‌లో జరిగిన సమావేశంలో కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపి ధనకర్‌, క్రీడల మంత్రి సందీప్‌ సింగ్‌, హిసార్‌ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ తదితరులు హాజరైన సమావేశ దృశ్యాలతో ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా షేర్‌ చేశారు.

ప్రజా ఉద్యమాల అనుభవం ఏమిటి ? పాలకులను బట్టే కొత్త ఎత్తుగడలు !

మూడు నెలల తరువాత రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.నిజానికి ఇదొక కొత్త అనుభవం. రైతాంగ ఆవేదన నుంచి ఉద్బవించిన ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోయే దారిని కనుగొనగలదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 2011నాటి వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సెప్టెంబరు 17 ప్రారంభమైన ఆందోళనను పారిశుధ్య పరిస్ధితి దిగజారిందనే పేరుతో నవంబరు 15న నిరసనకారులను బలవంతంగా పోలీసులతో బయటకు గెంటివేశారు. కొన్ని వందల మంది మాత్రమే జుకొట్టి పార్కులో ఉన్నారు గనుక తొలగించగలిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా తాత్కాలిక మరుగుదొడ్లను తొలగించటం, నీటి సరఫరా, విద్యుత్‌ నిలిపివేయటం వంటి చౌకబారు చర్యలకు పాల్పడినా స్ధానిక జనం మద్దతుతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప వెనక్కు తగ్గలేదు.

ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రను చూస్తే విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఇలా చెప్పటం అంటే నిరాశావాదమూ, నిరుత్సాహపరచటమూ కాదు. మన దేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం 1857 నుంచి 1947వరకూ సాగింది.ఉవ్వెత్తున ఉద్యమించటం,నీరసించటాన్ని చూశాము. బ్రిటీష్‌ పాలకులు తమ ఎత్తుగడలను ఎన్నింటినో మార్చుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కూడా అదే పద్దతిలో తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది తప్ప వెనక్కు పోలేదు. సంఘపరివార్‌ మినహా కమ్యూనిస్టులతో సహా అన్ని శక్తులూ ఆ ఉద్యమంలో భాగస్వాములే, వారసులే.తమ చరిత్రను,త్యాగాలను మరచిపోయి ప్రజావ్యతిరేకిగా మారిన స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని గుర్తించేందుకు జనానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అలాంటిది విద్రోహ చరిత్ర తప్ప మరొకటి లేని సంఘపరివార్‌ సంస్ధ బిజెపి నిజస్వరూపం తెలుసుకొనేందుకు ఒక దశాబ్దం కూడా పట్టలేదు. మన శరీర ధర్మాలకు దేనికీ పనికి రాని క్రిమిక(అపెండిసైటిస్‌) ప్రతివారిలో ఉంటుంది.అది కొందరికి ప్రాణాంతకం అయినపుడు సకాలంలో గుర్తిస్తే ముప్పుతొలుగుతుంది.లేనపుడు కొనసాగితే ఎలాంటి హాని ఉండదు. బ్రిటీష్‌ వారు దేశం వదలి పోయిన తరువాత కూడా వారి పాలనను పొగిడిన జనం ఉన్నారు. అలాగే హిట్లర్‌ దుర్మార్గాలు తెలిసిన తరువాత కూడా సమర్దించిన వారు ఉన్నారు. వారు క్రిమికలాంటి వారే ఏ పార్టీకి అయినా అలాగే ఉంటారు.ఇలా ఎందుకున్నారు అని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు.

ఉద్యమాన్ని ఎంతకాలం సహిస్తారు ?

ఢిల్లీ శివార్లలో మూడు వైపుల ఉన్న లక్షలాది మంది రైతులను వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణదారుల మాదిరి తొలగించటం సాధ్యం కాదు గనుక మోడీసర్కార్‌ ఆపని చేయలేదు.కారణాలు ఏవైనా సుప్రీం కోర్టు రైతు ఉద్యమం పట్ల అనుసరించిన వైఖరి సానుకూలం అని చెప్పకపోయినా అణచేందుకు తాత్కాలికంగా అయినా ప్రభుత్వానికి ఆయుధాన్ని ఇవ్వలేదు. ఇదొక ప్రధాన అంశం, తరువాత కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఢిల్లీ అన్ని వైపులా బిజెపి ఏలుబడే ఉంది, కనుక పోలీసులను, ప్రత్యేక దళాలను రప్పించటం పెద్ద పని కాదు. సాధ్యంగాకనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలను ఏర్పాటు చేశారు. ఎంతకాలం ఇలా అనుమతిస్తారు.తరువాతేం జరుగుతుందో తెలియదు గానీ అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి బల ప్రయోగానికి పూనుకోకపోవచ్చు. ఇప్పటికే పంజాబ్‌ మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపికి జనం చుక్కలు చూపించారు.

ఒక వైపు పంజాబ్‌, హర్యానా, యుపిలో రబీ గోధుమ పంట చేతికి వచ్చే తరుణం. కొంత మంది రైతులు తమ స్వస్ధలాలకు పోవటం అనివార్యం. అందువలన ఢిల్లీ శివార్లలో ఉన్నవారి సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు కూడా. దీన్ని చూపి ఉద్యమం వెనుక పట్టు పట్టిందనే ప్రచారం జరిపేందుకు బిజెపిశ్రేణులు సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించటం, కిసాన్‌ పంచాయత్‌లు, మహాపంచాయత్‌ల పేరుతో నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతాంగంలో మోడీ సర్కార్‌ మీద ఆగ్రహం పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు.ఫిబ్రవరి 21వ పంజాబ్‌లోని బర్నాలాలో లక్ష మందితో జరిగిన మజ్దూర్‌ కిసాన్‌ మహా ర్యాలీలో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు కూడా గణనీయంగా పొల్గొన్నారు. ఒక్క రైతులే కాదు, వ్యవసాయంతో పెనవేసుకున్న వ్యవసాయ కార్మికులను కూడా భాగస్వాములను చేయటం ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా మార్చే యత్నం ఇది. రైతులు-వ్యవసాయ కార్మికులు పరస్పర ఆధారితులు. వ్యవసాయ కార్మికులకు రెక్కల కష్టం తప్ప మరొక ఆదాయం ఉండదు తప్ప వేతనాలు పెంచాలని అడుగుతారు. తమకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి వేతనాలు కారణం కాదని అర్ధం చేసుకోలేని రైతులు వ్యతిరేకిస్తారు. వ్యవసాయ సంస్కరణలు రెండు తరగతులకూ నష్టం చేకూర్చేవి గనుక ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వుంది. వారి మధ్య ఉన్నది మిత్రవైరుధ్యమే తప్ప శత్రువైరుధ్యం కాదుగనుక సర్దుబాటు చేసుకోవచ్చు.

తమ మూడవ దశ ఉద్యమం గురించి ఫిబ్రవరి 28న వెల్లడిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.ఇరవై ఆరవ తేదీన యువ రైతుల దినం పాటిస్తున్నారు.మరుసటి రోజు స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర అజాద్‌ ప్రాణార్పణం చేసిన రోజు, సంత్‌ రవిదాస్‌ జయంతి రోజును కలిపి కిసాన్‌ మజ్దూర్‌ ఏక్తా దినం-రైతు, వ్యవసాయ కార్మిక ఐక్యతా దినం- పాటించాలని పిలుపునిచ్చినట్లు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ వెల్లడించారు.మార్చి ఎనిమిదిన ఢిల్లీ సరిహద్దుల్లో మహిళాదినోత్సవం సందర్భంగా ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోధుమ కోతలను గమనంలో ఉంచుకొనే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్ధానిక కిసాన్‌ పంచాయత్‌లు వాటిలో భాగమే. సభలకు హాజరవుతూనే రైతులు తమపని తాము చేసుకుంటారు. వెసులుబాటు కుదరగానే తిరిగి ఢిల్లీ ముట్టడిలో చేరతారని భావిస్తున్నారు.

వ్యవసాయ చట్టాల నిలిపివేత ఓ ప్రహసనం !

రైతు ఉద్యమం ఒక అనూహ్య పరిణామం. ప్రభుత్వ నిఘా సంస్ధలు,లేదా దిగువ స్దాయిలో ఉన్న సంఘపరివార్‌ కార్యకర్తలు కూడా దీన్ని పసిగట్టలేకపోయారు. లక్షల మంది రైతుల మీద బలప్రయోగం సాధ్యం కాదు, ఒక వేళ పశుబలాన్ని ప్రయోగిస్తే అది మోడీ సర్కార్‌ అంతానికి ఆరంభం అవుతుంది. చట్టాల అమలు నిలిపివేసినట్లు ప్రకటించిన సుప్రీం కోర్టు రైతులతో చర్చించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మేకలతో చర్చలకు తోడేళ్లను మధ్యవర్తులుగా పంపినట్లుగా వ్యవసాయ చట్టాలను సమర్దించేవారితో కూడిన కమిటీ అది. దానికి ఇచ్చే నివేదనలు ఎలా ఉన్నా, అంతిమంగా ఎలాంటి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పిస్తారో ఊహించుకోవటం కష్టం కాదు.ఆ కమిటీ నివేదిక సుప్రీం కోర్టుకు అంది దాని మీద ఒక నిర్ణయం తీసుకొనే వరకు లేదా పద్దెనిమిది నెలలపాటు చట్టాల అమలు నిలిపివేస్తామని కేంద్రం చెబుతోంది. నిజానికి నిలిపివేసినట్లు కాదు. చట్టాల సవరణకు ముందున్న పరిస్దితిని పునరుద్దరించకుండా చట్టాల అమలు నిలిపివేత అంటే మోసం తప్ప మరొకటి కాదు. ఆర్డినెన్స్‌ తెచ్చిన గతేడాది జూన్‌ నుంచే అమలు జరుగుతోంది అని ప్రభుత్వమే చెప్పింది.దాన్ని నిలిపివేయటం అంటే అర్ధం ఏమిటి ? అంటే ఇప్పుడు అసలే చట్టమూ లేదా ? చట్టరహిత పాలన ఎవరికి ఉపయోగం ? నిజానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన నిలిపివేత ప్రకటనలో నిజాయితీ లేదు. రైతు ఉద్యమం గురించి చర్చించేందుకు భయపడిన సర్కార్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేసి నేరుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకే పోయింది. ప్రభుత్వాన్ని నిలదీస్తే సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు, నిలిపివేతను చూపుతూ చర్చ లేకుండా చేస్తారు. ఒక వేళ అనూహ్య పరిస్దితిలో సుప్రీం కోర్టు చట్టాలను శాశ్వతంగా నిలిపివేయాలని తీర్పునిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతివ్వాలా లేదా అనే అంశం తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే అని సుప్రీం కోర్టు చెప్పటం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇష్టం లేకున్నా ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన అనుమతిని ఎలా వినియోగించుకుందో చూశాము.

రైతుల కంటే హిందూత్వ గురించే ఆర్‌ఎస్‌ఎస్‌ బెంగ !

ఇరు పక్షాలూ ఒక మధ్యేమార్గంలో పరిష్కారానికి రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి బహిరంగంగానే రైతు ఉద్యమం-ప్రభుత్వ తీరు గురించి ఒక ప్రకటన చేశారు. ఉద్యమ సెగ వారికి కూడా తగిలిందన్నది స్పష్టం. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బిజెపికి మార్గదర్శనం చేసేది, ప్రభుత్వాన్ని పర్యవేక్షించేది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది స్పష్టం. సాంస్కృతిక సంస్ద ముసుగులో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నది బహిరంగ రహస్యం.వ్యవసాయ చట్టాల గురించి ఆర్డినెన్స్‌ తెచ్చినపుడే అనేక రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి, ఆందోళనలు చేసినా వారికి పట్టలేదు, ఆందోళనా జీవులను నెట్టవతల పడవేయవచ్చన్న అతి అంచనా కావచ్చు. రైతుల ఆందోళనను బలప్రయోగంతో అణచివేస్తే దాని అసలైన హిందూత్వ అజెండా ముందుకు పోకపోగా వ్యతిరేకత ముందుకు వస్తుంది. ఆ కారణంతో జాగ్రత్తపడమని మధ్యేమార్గం చూడమని చెప్పింది తప్ప చిత్తశుద్ది, రైతుల పట్ల దానికి ఆసక్తి అనుమానమే.దాన్ని దాచిపెట్టి ప్రభుత్వం పట్ల సంఫ్‌ు సంతృప్తిగా లేదంటూ లీకుల ద్వారా దాని మంచితనం గురించి ప్రచారం చేశారు.

రైతు ఉద్యమం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా రాకేష్‌ తికాయత్‌ – ఇతర నేతల మధ్య తేడా ఉన్నట్లు చూపే ప్రయత్నం కూడా జరిగింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత మహేంద్రసింగ్‌ తికాయత్‌ కుమారుడిగా రాకేష్‌కు గుర్తింపు ఉంది. ఉత్తర భారత్‌లోని వ్యవసాయ సామాజిక తరగతి జాట్‌ల పలుకుబడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పంజాబ్‌లో వీరు సిక్కు మతాన్ని ఇతర చోట్ల హిందూమతాన్ని పాటిస్తారు. అందువలన హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ జాట్‌ ప్రాంతాలలో తికాయత్‌కు పరిచయం అవసరం లేదు. రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీలో జరిగిన ఉదంతాల తరువాత ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం గురించి భిన్న కథనాలున్నా లక్షలాది మంది రైతులను కదిలించింది.ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ప్రారంభంలో తికాయత్‌ ప్రభావం పరిమితమే. ఆయనను విడిగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవటంలో కూడా విభజించి పాలించాలనే ఎత్తుగడ ఉంది. దాన్ని గ్రహించి వెనక్కు తగ్గారనుకోండి. తికాయత్‌ కొన్ని వ్యక్తిగతమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారనే అభిప్రాయం ఉంది. మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు రెండు వరకు రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తారని చేసిన ప్రకటన అలాంటిదే. ఇలాంటి వాటిని చూపే బిజెపి రాజకీయ దాడి చేస్తున్నది. కార్యాచరణ కమిటీలో దాన్ని గురించి చర్చించలేదని ఒక నేత చెప్పాల్సి వచ్చింది.ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి ఉద్యమాలలో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే ప్రతిదానికీ దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. అన్నా హజారే అంటే ఇప్పటికీ గౌరవం ఉంది, కానీ ఆ పెద్దమనిషి ఉద్యమానికి మద్దతు ప్రకటించి తరువాత ప్రభుత్వం వేసిన కమిటీ గురించి సంతృప్తి ప్రకటించారు. ఇలాంటి వారి గురించి రైతులు ఆలోచించుకోవాలి.

ఉద్యమ బలం – బలహీనతలూ !

నెల రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలవటం లేదని కొందరు రైతు నేతలు ఆందోళన పడుతున్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు.పదకొండు కాదు, పదకొండు వందల సార్లు పిలిచినా ఇంతకు ముందు చెప్పిందే చెబుతారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే ఆందోళనా జీవి అంటూ ఎద్దేవా చేసిన ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని చూస్తే ఢిల్లీ శివార్లలో ఎన్ని నెలలు కూర్చుంటారో కూర్చోనివ్వండి, విసిగిపోయి వారే లేచిపోతారనే భావంతా ఉన్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు.

ఒక ఉద్యమం, అదీ స్వచ్చందంగా ప్రారంభించిన ఉద్యమం. ప్రతి ఉద్యమానికి బలం-బలహీనతలు రెండూ ఉంటాయి. రెండోదాన్ని అధిగమించి ముందుకు పోవటమే ఉద్యమ లక్షణం.ఒక కొండ ఎక్కేందుకు ముందు చాలా ఉత్సాహంగా ప్రారంభం అవుతాము. అదే పైకిపోయే కొలదీ ఎక్కటానికి ఎంత ఇబ్బంది పడాలో తెలిసిందే. ఒక ఉద్యమం కూడా అలాంటిదే. రోజులు గడిచే కొద్దీ కొంత మందిలో తొలుత ఉన్న ఉత్సాహం, పట్టుదల సడలుతుంది.నలుగురితో పాటూ మనమూ అంటూ సాదాసీదాగా ప్రారంభమైన వారిలో పట్టుదల రెట్టించటం కూడా తెలిసిందే.

రైతులపై ముప్పేట దాడి !

రైతులు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి కోత కోసి పంటను తేగలరు తప్ప మధ్యలో వచ్చే తెగుళ్లను తట్టుకోవటం అంత తేలిక కాదు. ఉద్యమం ప్రారంభంలోనే ఖలిస్తానీ, ఉగ్రవాద ముద్రవేశారు. దీని వెనుక జాతి వ్యతిరేక శక్తులున్నారని ప్రచారం చేశారు. అంతర్జాతీయంగా సమన్వయ పరుస్తున్నారని అతిశయోక్తులు చెప్పారు.ఇప్పటి వరకు పాలకుల అణచివేతకంటే ఏ ఉద్యమం ఎరగని విధంగా మాధ్యమాల ముట్టడి- తప్పుడు ప్రచారదాడిని రైతాంగం ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంకా కొనసాగుతూనే ఉంది.యుద్దంలో ఒక్క అంగుళాన్ని కూడా వదలకుండా బాంబులతో నాశనం చేయటాన్ని కార్పెట్‌ బాంబింగ్‌ అంటారు. వియత్నాంలో అమెరికా దురాక్రమణ-దాడి సమయంలో ఈ పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రచార దాడి జరుగుతోంది. ఇన్ని నెలల ఉద్యమం, ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యం పొందిన తరువాత అంతర్జాతీయంగా ప్రముఖులు స్పందించకుండా ఎలా ఉంటారు. రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌, మీనా హారిస్‌ వంటి వారు ట్వీట్లు చేయగానే మన దేశంలో ప్రముఖులుగా ఉన్నప్పటికీ దేనికీ స్పందించని వారందరితో ట్వీట్ల మీద ట్వీట్లు చేయించి మరో యుద్దరంగాన్ని తెరిచారు.మన దేశం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు విదేశీయులకు టూల్‌కిట్‌ సరఫరా చేశారనే పేరుతో దిశారవి మరికొందరి మీద దేశద్రోహం నేరం వంటివి ఆపాదించి అరెస్టులు చేశారు. ఇలాంటి ఎదురుదాడి, రిపబ్లిక్‌ డే రోజున జరిగిన కుట్రలను నిజంగానే రైతాంగం ఊహించలేదు. దిశారవి టూల్‌కిట్‌లో దేశద్రోహమూ లేదు, హింస ప్రేరేపణా లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

నిజానికి అంత ముప్పేగనుక వస్తే దాన్ని మరింత రచ్చ చేయటం ఎందుకు ? కుట్రలు వాస్తవమే అనుకుంటే వాటిని వమ్ము చేసేందుకు చట్టాలను రద్దు చేస్తే పోలా ? నరేంద్రమోడీకి దేశమా ? మరొకటా ! ఏది ముఖ్యం ! ముందు చట్టాలను రద్దు చేసి అంతర్జాతీయ కుట్రలను వమ్ము చేసి అంతగా అయితే అన్ని తరగతులతో చర్చించి ఆమోదయోగ్యమైన సంస్కరణలు తెచ్చి నిజంగా రైతాంగాన్ని ఉద్దరిస్తామంటే ఎవరు వద్దంటారు ?

పాలకులను బట్టే ఉద్యమ స్వభావంలో మార్పు !

ఉద్యమం సాగుతున్నకొద్దీ, పాలకుల వైఖరిని అర్ధం చేసుకున్న కొద్దీ ఏ కష్టజీవుల ఉద్యమం అయినా తమ సమస్యలకే పరిమితం కాదు. కాంగ్రెస్‌ 1895లో ప్రారంభమైనపుడు దానికి రాజకీయాల్లేవు.భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని, చదుకున్న భారతీయులకు ప్రభుత్వంలో ఎక్కువ అవకాశాలివ్వాలనే కోర్కెలతోనే ఉద్యోగవిరమణ చేసిన బ్రిటీష్‌ జాతీయుడు ఎఓ హ్యూమ్‌ ఒక ఉద్యమంగా ప్రారంభించాడు.నిజాం సంస్ధానంలో తెలుగును బతికించాలనే కోర్కెతోనే ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. చివరికి ఆ కాంగ్రెస్‌ బ్రిటీష్‌ వారు దేశం వదలి పోవాలనే వైఖరితో, నైజాం సంస్దానాన్ని కూల్చివేసే విధంగా కమ్యూనిస్టుల నాయకత్వాన ఆంధ్రమహాసభ తయారయ్యాయి. అలాగే ఇప్పుడు రైతు ఉద్యమం పట్ల బిజెపి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేతలను బహిష్కరించాలనే పిలుపులు వెలువడుతున్నాయి,వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక పాఠం చెప్పాలనే ఆలోచనలు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.వీటిని చూసి ఆ పార్టీ కూడా పంజాబ్‌, రాజస్ధాన్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో తమ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ దాడికి సిద్దం అవుతోంది. దానిలో భాగమే పైన చెప్పుకున్న హర్యానా గురుగామ్‌ సమావేశం. చూశారా మేము ముందే చెప్పాం ఇది రైతుల ఉద్యమం కాదు, ఆపేరుతో బిజెపి వ్యతిరేక ఉద్యమం అని ప్రచారం ప్రారంభించవచ్చు.కానివ్వండి ఆ పార్టీకి ఆ హక్కు ఉంది. జనమే తేల్చుకుంటారు. బిజెపికి ఏ రాజకీయ పార్టీ వద్దలేనంత డబ్బు ఉంది, దాన్ని నిలబెట్టేందుకు అదానీ,అంబానీల వంటి వారు ఎంతైనా ఇంకా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా చేసే యంత్రాంగం ఎలాగూ ఉంది.నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు గోవిందా అన్నట్లు జనం తలచుకోవాలేగానీ ఏదీ ఆగదు. రైతు పోరు కొత్త దిశ, కొత్త దశలో ప్రవేశించనుంది. ప్రభుత్వంతో చర్చల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరింతగా రైతులను, వారికి మద్దతు ఇచ్చే వారిని సమీకరించటం, దేశ వ్యాపితంగా విస్తరించటమే చేయాల్సి ఉంది.

8 .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

17 Wednesday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Kerala LDF, Narendra modi pipe dreams, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


కేరళలో గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఏకైక స్ధానం తిరిగి వస్తుందా రాదా అన్న సమస్య ఉంటే ఆ ఒకటిని 71చెయ్యాలని కొద్ది రోజుల క్రితం కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. ఫిబ్రవరి 14న బిజెపి ముఖ్యనేతల సమావేశంలో మోడీ ఈ మేరకు దిశానిర్దేశం గావించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీకి మద్దతు కూడగట్టేందుకు అవసరమైన ప్రధాని మోడీ సూచనలు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను జనం వద్దకు తీసుకుపోవాలని ప్రధాని కోరారన్నారు. అన్ని తరగతులను పార్టీలోకి వచ్చేట్లు చూడాలని ప్రధాని కోరినట్లు బిజెపి నేతలు చెప్పారు. ఒకటి నుంచి 71సీట్లకు పెరిగేట్లుగా పార్టీ పని ఉండాలని ప్రధాని చెప్పినట్లు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పికె కృష్ణదాస్‌ చెప్పారు.

కేరళలో బిజెపి ప్రభావం-పని చేయని నరేంద్రమోడీ ఆకర్షణ !

బిజెపి నేతలు కేరళ గురించి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, బలం గురించి అతిశయోక్తులు చెప్పుకున్నా అంకెలు వాస్తవాలను వెల్లడిస్తాయి. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత జరిగిన 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఒకటి నుంచి 71కి చేరుకోవాలని ప్రధాని సూచించారు. అసెంబ్లీలో మొత్తం స్దానాలు 140, దానిలో అధికారానికి రావాలంటే 71 కావాలి, ఈ కారణంగానే అన్ని స్దానాల గురించి చెప్పారన్నది స్పష్టం.

విజయన్ను గట్టిగా వ్యతిరేకించమంటారు, అదెలా సాధ్యం అన్న బిజెపి ఏకైక ఎంఎల్‌ఏ !

ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ను గట్టిగా వ్యతిరేకించాలని కొంత మంది నన్ను కోరారు, అదెలా సాధ్యం అని కేరళ శాసనసభలో బిజెపి తొలి శాసనసభ్యుడిగా ఉన్న 91 సంవత్సరాల ఓ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. నీమమ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటి చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా మన వైపు రావాలని, గుడ్డిగా వ్యతిరేకిస్తే లాభం లేదన్నారు. ప్రతివారితోనూ స్నేహంగా ఉండాలని అది రాజకీయాల్లో లాభిస్తుందని తాను ఆ దిశగా పనిచేస్తానని అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయాలు సాధించినా ఆశించిన మేరకు బిజెపి పని తీరు లేదన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాజగోపాల్‌ బలపరిచిన విషయం తెలిసిందే ?

మళయాల సమాజం పూర్తిగా హిందూత్వకు లొంగలేదు -రచయిత హరీష్‌

తన నవల ” మీషా ”కు 2019 సాహిత్య అకాడమీ అవార్డు రావటం అంటే మళయాల సమాజం హిందూత్వకు పూర్తిగా లొంగలేదనేందుకు నిదర్శనం అని ప్రముఖ రచయిత ఎస్‌ హరీష్‌ వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యత ఉన్నందున అవార్డును స్వీకరించటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన నవలను ఒక పత్రిక అర్ధంతరంగా నిలిపివేయటం, తరువాత జరిగినదాన్ని చూస్తే సాహితీవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు హిందూత్వ శక్తులు ఒక ప్రయత్నం చేసినట్లు కనిపించిందన్నారు. 2018లో మాతృభూమి వారపత్రికలో ధారవాహికగా ప్రారంభమైన ఈ నవలలో ఒక పాత్రతో రచయిత చెప్పించిన మాటలపై బిజెపి, హిందూ ఐక్యవేది, ఇతర హిందూత్వ సంస్దలు వివాదం రేపాయి. ఈ నవలకు అవార్డు ఇవ్వటం హిందువులకు ఒక సవాలు అని, పినరయి విజయన్‌ ప్రభుత్వానికి హిందువుల మీద ఇంకా కోపం తగ్గలేదని, శబరిమలలో కూడా అదే చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు.


వివాదాస్పదం కావించిన నవలలోని రెండు పాత్రల మధ్య సంభాషణ ఇలా నడుస్తుంది.
” స్నానం చేసి ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకొని ఈ అమ్మాయిలు దేవాలయాలకు వెళ్లేది ఎందుకు ?
ప్రార్ధన చేసేందుకు !
కాదు, నువ్వు జాగ్రత్తగా చూడు. ప్రార్ధన చేసేందుకు అయితే వారు మంచి దుస్తులు వేసుకొని అందంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది ? తమకు తెలియకుండానే తాము శృంగారానికి సిద్దంగా ఉన్నామని సూచించటమే !
కానట్లయితే వారు నెలకు నాలుగైదు రోజులు దేవాలయాలకు ఎందుకు రారు ? ఆ రోజుల్లో తాము అందుబాటులో ఉండం అని చెప్పటమే. ప్రత్యేకించి పూజారులకు తెలియచేయటమే ! గతంలో పూజార్లు ఈ విషయాల్లో ముదుర్లు కదా ! ”
దేవాలయాలకు వెళ్లే హిందూ యువతులను, పూజార్లను అవమానించటమే ఇదంటూ కొందరు వివాదాస్పదం కావించటమే కాదు, రచయిత, కుటుంబ సభ్యులను బెదిరించారు. దాంతో తాను నవలను నిలిపివేస్తున్నట్లు రచయిత హరీష్‌ ప్రకటించారు. దేశాన్ని పాలిస్తున్నవారిని ఎదుర్కొనేందుకు తాను ఎంతో బలహీనుడినని అని వారపత్రికలో ప్రచురుణ నిలిపివేత సమయంలో చెప్పారు.రచయితల భావ ప్రకటనా స్వేచ్చకు తాము మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.
2018లో ఈ నవల మాతృభూమి పత్రికలో నిలిపివేసిన తరువాత డిసి బుక్స్‌ అనే సంస్ద వివాదాస్పద భాగాలతో సహా మొత్తం నవలను ప్రచురించింది. దీన్ని నిషేధించాలని కోరుతూ అదే ఏడాది కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ దాన్ని విచారించి పిటీషన్ను కొట్టివేసింది. ఇంటర్నెట్‌ యుగంలో మీరు ఇలాంటి అంశాలకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒక సమస్యగా చేస్తున్నారు. దీన్ని మరచి పోవటం మంచిది అంటూ భావ ప్రకటనా స్వేచ్చ కింద దీన్ని పరిగణిస్తున్నామన్నారు.

ఓట్ల కోసం కాంగ్రెస్‌ -బిజెపి అయ్యప్ప నామజపం !


వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి మరోసారి అయ్యప్ప నామజపం ప్రారంభించాయి. అయితే తామే అసలు సిసలు అయ్యప్ప పరిరక్షకులమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో శబరిమల అంశం తమకు లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్‌ భావిస్తున్నది. స్ధానిక సంస్ధలలో అది పని చేయలేదని గమనించిన తరువాత మరోసారి దాన్ని రేపేందుకు పూనుకుంది. ఈ విషయంలో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) బిజెపితో గొంతు కలిపింది. ఆందోళనలో ముందున్నది, కేసుల్లో ఇరుక్కున్నది తామే అని చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే భక్తులు కోరుకున్న విధంగా శబరిమల దేవస్దానం గురించి ఒక చట్టం తెస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేవస్ధానం బోర్డు ఆధీనంలో 1,300ల దేవాలయాలుండగా ఒక్క శబరిమల గురించి మాత్రమే చట్టం చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందని బిజెపి నేత కుమనమ్‌ రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అనేక మంది నిరుద్యోగ యువకుల మీద శబరిమల కేసులు ఉన్నాయని, వారంతా అమాయక భక్తులని కేసులను ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ నిందితుల మీద సానుభూతిని కల్పించేందుకు ప్రయత్నించారు.కేసులు ఎత్తివేయకపోతే భక్తులంటే ద్వేషం అని రుజువు అయినట్లే అన్నారు. అసెంబ్లీలో, అదే విధంగా పార్లమెంటులో శబరిమల మీద కాంగ్రెస్‌ సభ్యులు బిల్లును ప్రతిపాదించటానికి అనుమతి లభించలేదని, దాని గురించి కాంగ్రెస్‌ నేతలు చెప్పినదానితో సంతృప్తి చెందామన్నారు.


చిన్న పార్టీలు -చీలికలు !


అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాజకీయ సమీకరణలలో మార్పులు వస్తున్నాయి, అయితే అవి ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపేవిగా లేవు. యుడిఎఫ్‌ నుంచి బయటకు వచ్చిన ఒక పెద్ద పార్టీ కేరళ కాంగ్రెస్‌ (ఎం). ఆ పార్టీలో చీలికవర్గం యుడిఎఫ్‌లో కొనసాగుతుండగా, స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు పెద్ద వర్గం ఎల్‌డిఎఫ్‌లో చేరింది. అనేక చోట్ల ఎల్‌డిఎఫ్‌ విజయావకాశాలను మెరుగుపరచింది.
ఎల్‌డిఎఫ్‌లో భాగస్వామిగా ఉన్న ఎన్‌సిపి చీలిపోయింది. ఉప ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్‌(ఎం) మీద గెలిచిన కప్పన్‌ యుడిఎఫ్‌ శిబిరంలో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలా నియోజకవర్గం కేరళ కాంగ్రెస్‌(ఎం)కు బలమైన నియోజకవర్గం. ఆ పార్టీ నేత మణి ఐదు దశాబ్దాల పాటు దానికి ప్రాతినిధ్యం వహించారు. మణి మరణంతో ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున కప్పన్‌ విజయం సాధించారు. ఆ స్దానాన్ని తనకు ఇస్తేనే కూటమిలో కొనసాగుతానన్న బెదిరింపులను ఎల్‌డిఎఫ్‌ ఖాతరు చేయలేదు. మరొక స్దానం కేటాయిస్తామని చెప్పినా దానికోసమే పట్టుబట్టారు. యుడిఎఫ్‌లో చేరినప్పటికీ తమ గుర్తుమీదనే పోటీ చేయాలని, కప్పన్‌కు పాలా స్దానం తప్ప మరొక స్ధానం ఎవరికీ కేటాయించేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎల్‌డిఎఫ్‌లో ఉన్న మరో చిన్న పార్టీ కేరళ కాంగ్రెస్‌(బి), దీనిలో అంతర్గత సమస్యల కారణంగా కొందరు యుడిఎఫ్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.కేరళ కాంగ్రెస్‌, మరో చిన్న పార్టీ ఎల్‌డిఎఫ్‌లో చేరిన కారణంగా వాటికి సీట్లు కేటాయించేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లను వదలుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నాయకత్వం కోరింది. ఆమేరకు కొన్ని సీట్లు తగ్గటం, స్దానాలు మారటం వంటివి చోటు చేసుకుంటాయి. మూడు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి ఈ సారి అవకాశం ఇవ్వకూడదని సిపిఐ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఉద్యోగాల భర్తీలో ఎల్‌డిఎఫ్‌ ఘనత !


కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవటం చూస్తున్నాం అలాంటిది కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్తగా 3,151 పోస్టులను సృష్టించాలని బుధవారం నాడు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 3000 వరకు ఆరోగ్యశాఖలో ఉన్నాయి.ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్దతకు ఇది పెద్ద నిదర్శనం. దొడ్దిదారిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ఆయన విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రాకముందు యుడిఎఫ్‌ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిక దిగువ విధంగా ఉంది.
ప్రభుత్వశాఖలు ××××× యుడిఎఫ్‌ ××××ఎల్‌డిఎఫ్‌
పోలీసు శాఖ ××××××××× 4,791 ×××× 13,825
ఎల్‌డిసి ××××××××× 17,771 ×××× 19,120
ఎల్‌పి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 1,630 ×××× 7,322
యుపి స్కూల్‌అసిస్టెంట్స్‌ × 802 ×××× 4,446
స్టాఫ్‌ నర్సు(ఆరోగ్య) ×× ×1,608 ×××× 3,324
స్టాఫ్‌ నర్సు(మెడికల్‌) ×× 924 ×××× 2,200
అ.సర్జన్స్‌ (ఆరోగ్య) ×× ×2,435 ×××× 3,324

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌లో సరికొత్త కుట్ర ?

17 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

#Ecuador's presidential election, #Rafael Correa, Andres Arauz, Ecuador left wing


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా ! సామ్రాజ్యవాదుల ప్రయోగశాల !! వలసల నుంచి ప్రజాస్వామ్య ఖూనీ- ప్రహసనం వరకు జరగని ప్రయోగాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈక్వెడోర్‌లో ఫిబ్రవరి ఏడవ తేదీన అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు తొలి దఫాలో 50శాతానికి పైగా తెచ్చుకోవాలి, లేదా 40శాతానికి మించి తెచ్చుకొంటే సమీప ప్రత్యర్ధికంటే పదిశాతం ఆధిక్యతలో ఉండాలి. జనవరిలో చేసిన సర్వేల ప్రకారం ఆండ్రెస్‌ అరౌజ్‌కు 43శాతంతో ముందుండగా సమీప ప్రత్యర్దులు 25,19శాతాలతో ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నారు.


అధ్యక్ష పదవి ఎన్నికలలో ఎన్నికలలో మొత్తం పన్నెండు మంది పోటీ చేశారు. నలుగురు రెండంకెలకుపైగా ఓట్లు సాధించారు. వామపక్ష ఆండ్రెస్‌ అరౌజ్‌కు 32.7, మితవాద పార్టీ గులెర్మో లాసోకు 19.74, హరిత వామపక్షం అని చెప్పుకొనే యకు పెరెజ్‌కు 19.38, మరో అభ్యర్ధి గ్జేవియర్‌ హెరవాస్‌కు 15.69శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మొరెనా పార్టీ అభ్యర్ధికి కేవలం 1.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీతో ఉన్నట్లు తేలింది. దాంతో తాను విజయం సాధించినట్లు ప్రకటించారు కూడా. ఆ తరువాతే ” లెక్క ” మారిపోయింది.


అక్రమాలు జరిగాయంటూ పచాకుటిక్‌ పార్టీ అభ్యర్ధి యకు పెరెజ్‌ రాజధాని క్విటోలోని కేంద్ర ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశాడు.తనను రెండవ స్ధానానికి చేరకుండా రాఫెల్‌ కొరెయా, ఎన్నికలలో మరో ప్రత్యర్ధి లాసో, మరొక పార్టీనేతలు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించాడు. తనకు 35శాతం రావాల్సి ఉండగా పదిహేనుశాతమే వచ్చేట్లు, తనకు వచ్చే వాటిని ఇతరులకు బదలాయించారని ఆరోపించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరే ఓట్లను అపహరించారని చిందులు వేశాడు.నిజానికి రెండవ స్దానంలో ఉన్న లాసో ఎన్నికల ఫలితాల మీద తనకెలాంటి సందేహం లేదని, అయితే యకు పెరెజ్‌ కోర్కెకు మద్దతుగా తాను కూడా తిరిగి ఓట్ల లెక్కింపు కోరుతున్నట్లు చెప్పాడు.నిజానికి ఈ ఇద్దరూ ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకున్నారు. బ్యాంకరు లాసోకు ఓటు వేయటం కంటే ఒక నియంతకు వేయటం మంచిదని పెరెజ్‌ వర్ణించాడు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే ధోరణి మారిపోవటంతో అక్రమాలు జరిగాయని బెల్జియంలో ఉన్న రాఫెల్‌ కొరెయా ట్వీట్‌ చేశారు. తమ అభ్యర్ధికి 38శాతంపైగా రావాల్సి ఉండగా 31శాతం అని ప్రకటిస్తున్నారన్నారని ఇది అబద్దం అని అందరికీ తెలుసన్నారు.
పార్లమెంట్‌లోని 137 స్ధానాలను మూడు తరగతులుగా విభజించారు. పదిహేను స్దానాలను జాతీయ ప్రాతిపదికన, ఆరింటిలో రెండేసి చొప్పున అమెరికా-కెనడా, లాటిన్‌ అమెరికా, ఐరోపా- ఆసియా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస ఈక్వెడోరియన్లకు, 116 స్దానాలను రాష్ట్రాలలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో అండ్రెస్‌ అరౌజ్‌ నాయకత్వంలోని వామపక్ష పార్టీకి 5,4,40 చొప్పున మొత్తం 49 వచ్చాయి.


అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తగినన్ని ఓట్లు రానందున రెండవ దఫా ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగాల్సి వుంది. ప్రధమ స్దానంలో వామపక్ష అభ్యర్ధి వచ్చినా రెండవ స్ధానంలో తన మద్దతు ఉన్న యకు పెరేజ్‌ రెండవ స్ధానంలో ఉంటారని, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించి గెలిపించవచ్చని అమెరికన్లు తలచారు. అయితే అదికూడా సాధ్యమయ్యేట్లు కనిపించకపోవటంతో సరికొత్త కుట్రకు తెరలేపారు. రెండవ దఫా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేదాని కంటే ఎన్నికలను ఎలా బూటకంగా మార్చుతారనే చర్చ ఇప్పుడు ముందుకు వచ్చింది.

కొన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని మొదట ఆరోపించారు. పెద్ద రాష్ట్రమైన గుయాస్‌లో మొత్తం, మిగిలిన 16 రాష్ట్రాలలో సగం ఓట్ల లెక్కింపు జరపాలని తాజాగా నిర్ణయించారు. ఇక్కడే ప్రహసనానికి నాంది పడింది. మొదటి స్ధానంలో ఉన్న అభ్యర్ధి అభిప్రాయం, అనుమతి, సంప్రదింపులు కూడా లేకుండానే రెండవ, మూడవ స్దానాల్లో ఉన్న అభ్యర్ధులు ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరపటం, వెంటనే ఓట్లను మరోసారి లెక్కించాలని నిర్ణయించటం వెంటవెంటనే జరిగిపోయాయి. దేనికి రెండవ సారి లెక్కింపు జరుపుతున్నారో, ఎంత వ్యవధిలో జరుపుతారో కూడా వెంటనే ప్రకటించలేదు. మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని అసలు ఎన్నికలలోనే పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొరెయాను ఒక తప్పుడు కేసులో ఇరికించి ఆయన పరోక్షంలో ఏకపక్షంగా శిక్ష విధించారు. దాన్ని సాకుగా చూపి కొరెయా, ఆయన నాయకత్వంలోని పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే నామినేషన్లకు మరో 48 గంటల సమయం ఉందనగా కొరెయా మినహా ఇతరులు పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ 3-2 ఓట్ల మెజారిటీతో అనుమతి ఇచ్చింది.


మరోసారి ఓట్ల లెక్కింపు పేరుతో ఏ అక్రమాలకు తెరతీయనున్నదీ చెప్పలేము. అక్రమాల పేరుతో మొత్తం ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించటం, రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని ఏదో ఒక సాకుతో పోటీలో లేకుండా చేయటం. బహుశా దీనికోసమే కొరెయా బలపరిచిన అభ్యర్ది అరౌజ్‌ విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన నిధులను ప్రచారంలో వినియోగించారని కట్టుకధలను మీడియాలో రాయించారు. లెక్కింపును తారుమారు చేసి అమెరికా బలపరచిన యకు పెరేజ్‌ను రెండవ స్దానంలోకి తెచ్చి, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేకులందరనీ వీలైతే ఏకం చేయటం, సాధ్యంగాకపోతే పెరెజ్‌ను అడ్డగోలు పద్దతిలో గెలిచినట్లు ప్రకటించటం. ఇవన్నీ సాధ్యంగాకపోయినా, ప్రజాప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని భావించినా బొలివీయాలో మాదిరి వెనక్కు తగ్గటం, ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. గుయాస్‌ రాష్ట్రంలో ఆండ్రెజ్‌ అరౌజ్‌కు 41.82శాతం ఓట్లు రాగా లాసోకు 25.27, గ్జేవియర్‌ హెరవాస్‌కు 9.94, పెరెజ్‌కు 8.73శాతమే వచ్చాయి. ఇక్కడ మొత్తం ఓట్లను లెక్కించటం ద్వారా కొన్ని ఓట్లను పెరెజ్‌కు బదలాయించినా రెండవ స్ధానంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదూ మొత్తంగా తొత్తడం చేస్తే రెండు మూడు స్దానాల్లో ఉన్నవారు తొలి రెండు స్ధానాల్లోకి వస్తే అరౌజ్‌ అసలు పోటీలో ఉండరు. మొదటి ఇద్దరులో ఎవరు గెలిచినా అమెరికాకు, వామపక్ష వ్యతిరేకులకు ఇబ్బంది లేదు.


ఈక్వెడార్‌ పరిణామాలు వామపక్ష శక్తుల ముందు మరో కొత్త సవాలను ముందుకు తెచ్చాయి. అనేక దేశాలలో పర్యావరణం లేద హరిత ఉద్యమ కార్యకర్తలు, కొన్ని చోట్ల పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడాలని కోరటం ఒక పురోగామి భావన అనటంలో ఎలాంటి సందేహం లేదు, అవసరం కూడా ఉంది.సాధారణంగా ఇలాంటి శక్తులన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి, పర్యావరణం రక్షణ విషయంలో వామపక్షాలు కూడా సానుకూలమే.అందువలన వారితో చేతులు కలపటం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పశ్చిమ దేశాల మీడియా వీరిని హరిత లేదా హరిత వామపక్షాలు అని వర్ణిస్తోంది. ఈక్వెడార్‌లో స్దానిక తెగల నేత కూడా అయిన యకు పెరేజ్‌ను ఈ కారణంగానే హరిత వామపక్ష వాది అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడి నాయకత్వంలోని పార్టీ తీరు తెన్నులను చూసినపుడు వామపక్షాలకు బద్దశత్రువు అయిన అమెరికా పాలకవర్గ ఒళ్లో కూర్చున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


వామపక్ష వాది, ఆర్ధికవేత్త అయిన రాఫెల్‌ కొరెయా 2007 నుంచి 2017వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు.వామపక్ష విధానాలను అమలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పాలకుల హయాంలో చేసిన అప్పు అక్రమం అని మూడు బిలియన్‌ డాలర్లమేరకు చెల్లించేది లేదని ప్రకటించాడు.దాని మీద అంతర్జాతీయ కోర్టుల్లో విచారణ జరిగింది.పర్యవసానంగా అప్పులో 60శాతం పైగా తగ్గింది. రాజ్యాంగ సవరణల కారణంగా 2009లో తిరిగి 2013లో కొరెయా విజయం సాధించారు. లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష నేతలతో చేతులు కలిపారు.2006-16 మధ్య దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 36.7శాతం మందిని 22.5కు తగ్గించారు. అంతకు ముందు రెండు దశాబ్దాలలో జిడిపి వృద్ధి రేటు 0.6శాతంగా ఉన్నదానిని 1.5శాతానికి పెంచాడు. అసమానతలను కొలిచే గిని కోఎఫిసియెంట్‌ 0.55 నుంచి 0.47కు తగ్గింది. 2016లో వచ్చిన భూకంపంలో 650 మంది మరణించారు. ఆస్దినష్టం జిడిపిలో మూడుశాతం ఉంది. దాంతో దేశం మాంద్యంలోకి దిగజారి ప్రభుత్వ ఖర్చులో కోత పెట్టాల్సి వచ్చింది.

రెండు సార్లు అధ్యక్ష పదవిని స్వీకరించిన కారణంగా 2017ఎన్నికలలో కొరెయా పోటీ చేసేందుకు అవకాశం లేకపోయింది.పార్టీ అభ్యర్ధిగా 2007-13 మధ్య ఉపాధ్యక్షుడిగా పని చేసిన లెని(మ్‌)న్‌ మోరెనో పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా అంతకు ముందు అనుసరించిన వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి తిరోగమన విధానాల అమలుకు పూనుకోవటంతో పార్టీలో విబేధాలు వచ్చాయి. కొరెయాను పక్కకు నెట్టి ఆయన మీద అవినీతి కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసేందుకు కుట్ర చేశారు. దాన్ని గమనించి అదే ఏడాది తన భార్యతో కలసి బెల్జియం వెళ్లి తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేశారు. కొరెయా ఉన్నత విద్య అక్కడే జరగటం, ఆయన భార్య బెల్జియం పౌరురాలు కావటంతో అక్కడే ఉండిపోయిరు. కొరెయా అధికారంలో ఉన్న 2012లో ప్రత్యర్ధి ఒకరిని కిడ్నాప్‌ చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. దాని విచారణకు కోర్టుకు హాజరు కాలేదనే పేరుతో కొరియాను అరెస్టు చేయాలని 2018 జూలై 3న న్యాయమూర్తి అదేశించాడు.అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరారు. అయితే ఆయన మీద ఉన్న కేసులు రాజకీయ అంశాలుగా ఉండటంతో తాము అరెస్టు చేయలేమని స్పష్టం చేసింది. తరువాత 2020 ఏప్రిల్‌ 7న ఈక్వెడోర్‌ సుప్రీం కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


లాటిన్‌ అమెరికాలో వామపక్షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర బహిరంగ రహస్యం. అంతర్జాతీయ వార్తా సంస్దల కట్టుకథలు వాటిలో ఒక భాగం. అక్కడ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా మీద తప్పుడువే అయినా కేసులున్నాయి గనుక ఆయనను అడ్డుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన మద్దతుదారులు కొత్త పార్టీని నమోదు చేసేందుకే అవకాశం ఇవ్వని అపర ప్రజాస్వామ్యం అక్కడ ఉంది. గతేడాది ఆగస్టులో కొరెయాకు మద్దతునిచ్చే ఒక పార్టీని ఎన్నికల సంఘం నిషేధించింది. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ను పోటీ చేయకుండా చూసేందుకు చివరి క్షణం వరకు ఒక ఎన్నికల కమిషనర్‌ ప్రయత్నించాడు. చిత్రం ఏమిటంటే ఎన్నికలలో కొరెయా చిత్రాన్ని వినియోగించి అనుకూల ప్రచారం చేయవద్దని నిషేధించిన ఎన్నికల సంఘం రాజకీయ వ్యతిరేకులు తమ ప్రచారంలో కొరెయా చిత్రాన్ని ఉంచి తప్పుడు ప్రచారం చేసేందుకు అనుమతించింది. తప్పుడు కేసులు, అరెస్టులకు సిద్దపడటంతో అనేక మంది కొరెయా మద్దతుదారులు విదేశాలకు వెళ్లిపోయారు.


2017 ఎన్నికలలో కొరెయా బలపరిచిన అభ్యర్ధిగా విజయం సాధించిన మొరెనో అమెరికా చంకనెక్కాడు, కొరెయాకే ఎసరు పెట్టాడు.పదవిలోకి వచ్చినపుడు 77శాతం మంది జనం మద్దతు ఉండగా 2019లో అది ఏడుశాతానిక పడిపోయిందంటే ఎంతగా జనానికి దూరమయ్యాడో తేలిపోయింది. అంతకు ముందు పార్లమెంటులో 74సీట్లు ఉన్న మొరెనో పార్టీ తాజా ఎన్నికలలో ఒక్క స్దానం కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్ధికి తాజా అధ్యక్ష ఎన్నికలలో 1.54శాతం ఓట్లు వచ్చాయి.


పచాకౌటిక్‌(హరిత పార్టీ) నేత యకు పెరెజ్‌ అమెరికా నాయకత్వంలో బొలీవియా, బ్రెజిల్‌, వెనెజులా, నికరాగువాలలో జరిపిన కుట్రలన్నింటినీ సమర్ధించాడు. అతని రాజకీయ చరిత్రను చూస్తే వామపక్ష ముసుగు వేసుకున్న ద్రోహిగా కనిపిస్తాడు. లాటిన్‌ అమెరికాలో అలాంటి శక్తులను అమెరికా ఎందరినో తయారు చేసింది. వారికి అవసరమైన నిధులు, జనాన్ని గందరగోళపరిచేందుకు, వామపక్ష శిబిరాల్లో అనుమానాలు రేపేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డిఐ) అనే సంస్ద ముసుగులో అవసరమైన శిక్షణ ఇచ్చింది. వారికి మద్దతుగా ప్రభుత్వేతర స్వచ్చంద(ఎన్‌జిఓ) సంస్దలను, సిఐఏ ఆధ్వర్యంలోపనిచేసే నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) సంస్ధను ఏర్పాటు చేసింది.2007 అమెరికా ఎన్‌డిఐ పత్రంలో లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చిన పార్టీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి పచాకౌటిక్‌ ఒకటి. మన దేశంలో కూడా అలాంటి ఎన్‌జిఓ శక్తులను చూడవచ్చు. 2016-19 మధ్య ఈక్వెడోర్‌లో ఎన్‌జిఓలకు 50లక్షల డాలర్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఎన్‌ఇడి జాబితా వెల్లడించింది. రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచాకౌటిక్‌ పార్టీ ఆందోళనలు నిర్వహించింది.2010లో కొరెయాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రపోషించింది.

ఒక రెడ్‌ ఇండియన్‌ తెగకు చెందిన యకు పెరెజ్‌ లాటిన్‌ అమెరికా ఐదువందల సంవత్సరాల చరిత్రలో తొలి రెడ్‌ ఇండియన్‌ తెగనేతగా బొలీవియాలో అధికారానికి వచ్చిన ఇవో మొరేల్స్‌ను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదుల బంటు. అనేక మంది కుహనా వామపక్ష వాదుల మాదిరి పెరెజ్‌ సాధారణ జీవనం గడుపుతున్నట్లు కనిపించినా అమెరికా అజెండాలో భాగం తప్ప నిజాయితీతో కూడింది కాదు. ఈక్వెడోర్‌లో ఎక్కువ సంఖ్యలో కార్లు నడపకూడదని, గనులు తవ్వకూడదని, చమురు తీతను పరిమితం చేయాలంటూ కొరెయా పాలనా కాలంలో ఆందోళనలు నిర్వహించాడు. అక్కడ ఉన్న చమురు, ఖనిజ నిల్వలను వెలికి తీసి పేద దేశంగా ఉన్న ఈక్వెడోర్‌ను అభివృద్ది చేసేందుకు పూనుకున్న కొరెయా మీద కుట్రలో పెరెజ్‌ భాగస్వామి. ఇలాంటి తమ బంటును గద్దెనెక్కించేందుకు చేస్తున్న కుట్రను ఈక్వెడోరియన్లు సాగనిస్తారా ?
” ఎవరైనా కొరెయా తరఫున అభ్యర్ధులుగా పోటీ చేసేట్లయితే వారు పెద్ద ముప్పుకొని తెచ్చుకున్నట్లే ఇంకా దేశం విడిచిపోకపోయినా, కేసుల్లో శిక్షలు పడకపోయినా వ్యవస్ధ వారి మీద కన్నేసి ఉంచుతుంది అని కేంద్ర కాబినెట్‌ కార్యదర్శి స్వయంగా బెదిరింపులకు దిగాడు. అనివార్య పరిస్ధితుల్లో ఒక వేళ వామపక్ష అభ్యర్ధి అభ్యర్ధి ఎన్నికైనా పై బెదిరింపులను చూసినపుడు ఏదో ఒక సాకుతో అధికారంలో కొనసాగనిచ్చే అవకాశం ఉంటుందా ?చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రియాంక చోప్రా మీద మౌనం – దియా మీర్జా, రీఆనె ట్వీట్లపై రచ్చ ! బిజెపికి ఎందుకు మండింది ?

11 Thursday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

#Farmers Protest, #Priyanka Chopra, #Rehne, Dia mirza, Narendra Modi, Priyanka Chopra, Rehne, tweets war on farmers agitation


ఎం కోటేశ్వరరావు


” మన రైతులు భారత ఆహార సైనికులు.వారి భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది. వారి ఆశలను నెరవేర్చాల్సి ఉంది.వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్ధగా తరువాత అని కాకుండా త్వరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించేట్లు చూడాలి ” 2020 డిసెంబరు ఆరవ తేదీన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్‌.
” మనం దీన్ని గురించి ఎందుకు మాట్లాడ కూడదు ” అని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎన్‌లో మన రైతు ఉద్యమం గురించి వచ్చిన ఒక వ్యాసాన్ని, దానిలో చిత్రాన్ని ఉటంకిస్తూ హాలీవుడ్‌ నటి, గాయని రీఆనె 2021 ఫిబ్రవరి రెండున చేసిన ట్వీట్‌. రెండింటికీ నాలుగు రోజులు తక్కువగా రెండు నెలల తేడా !


ప్రియాంక ట్వీట్‌ అసలు చర్చనీయాంశమే కాలేదు. రీఆనె వ్యాఖ్య మీద ఇంత రచ్చ ఎందుకో తెలియదు. మొదటి దానిలో లేని అభ్యంతరం రెండవ ట్వీట్‌లో ఏముందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే. ప్రియాంక ట్వీట్‌ మీద వివాదం రేగలేదు. పోనీ ఆమె కోరినట్లుగా సమస్యను పరిష్కరించారా అంటే అదీ లేదు. స్వయం కృతం- మేకులు కొట్టి, కాంక్రీటు పోసి మరింతగా గబ్బు పట్టారు. ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? సుదీర్ఘకాలం ఉద్యమం సాగిన తరువాతనే కదా ప్రపంచ మీడియా కేంద్రీకరించి వార్తలు రాసింది, ఢిల్లీ రోడ్ల మీద మేకుల ఫొటోలు, వీడియోలు చూపింది. విదేశాల్లోని సెలబ్రిటీలు వాటిని చదవరా ? స్పందించరా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు అన్నట్లుగా సిఎన్‌ఎన్‌ రాసిన దాని మీద చేయని రచ్చ దాన్ని ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌ మీదకు మళ్లించటం ఏమిటి ? ఒక మహిళ అన్న చులకనా ? భారత్‌లో ఉన్నారు కనుక, ఇక్కడ జరుగుతోంది ఏమిటో, దాని తీవ్రత ఏమిటో ప్రత్యక్షంగా చూశారు కనుక ప్రియాంక వెంటనే స్పందించారు. సుదూరంగా ఉన్నారు గనుక రీఆనె ఆలస్యంగా ట్వీట్‌ చేశారు. నిజంగా సచిన్‌ టెండూల్కర్‌ వంటి వారికి రైతుల మీద ఆసక్తి ఉంటే ప్రియాంక మాదిరి ఎందుకు స్పందించలేదు? పరిష్కరించమని కోరితే వారి సొమ్మేమైనా పోతుందా ? నోటి ముత్యాలు రాలతాయా ? వారికి సామాజిక బాధ్యత లేదా ?

ట్విటర్‌ కంపెనీ మీద వత్తిడి, బెదిరింపు !


రైతు ఉద్యమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నిర్ధారించుకోకుండా అవాస్తవ సమచారంతో దేశద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక మంది జర్నలిస్టుల మీద బిజెపి ప్రభుత్వాలు, అనుయాయులు కేసులను దాఖలు చేశారు. వాటి మీద సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. మరోవైపు ప్రభుత్వం సామాజిక మాధ్యమ సంస్ద అయిన ట్విటర్‌ కంపెనీకి 1,178 ఖాతాలను ఇచ్చి వాటిని మూసివేస్తారా మీ మీద చర్య తీసుకోమంటారా అని కత్తి పెట్టి కూర్చుంది. ఇవన్నీ పాకిస్దాన్‌, ఖలిస్తాన్‌ మద్దతుదారులకు చెందినవని చెబుతోంది. మా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 500 ఖాతాలను నిలిపివేశాము, ఈ విషయం గురించి మాట్లాడదాము అంటే ససేమిరా కుదరదు, ముందు మేము చెప్పిన ఖాతాలను నిలిపివేయాల్సిందే అని చెబుతోంది. మాట్లాడితే పోయేదేముంది ? ట్విటర్‌ కంపెనీ తీసుకున్న చర్యల ప్రకారం కొన్ని ఖాతాల ట్వీట్లు మన దేశంలో కనిపించవు, ఇతర దేశాల వారికి అందుబాటులో ఉంటాయి. వార్తా సంస్దలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలకు సంబంధించి ఇంతవరకు ఎవరివీ నిలిపివేయలేదని, అలా చేయటం భారత చట్టాల ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చను ఉల్లంఘించటమే అవుతుందని, అందువలన దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని ట్విటర్‌ పేర్కొన్నది. మన చట్టాల గురించి మన పాలకులకే విదేశీ కంపెనీ గుర్తు చేయాల్సిన దుస్ధితి ఎందుకు దాపురించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీన్నే మరో విధంగా చెప్పాలంటే భావ ప్రకటనా స్వేచ్చను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ రోజు రైతు ఉద్యమం సాకు అయితే రేపు మరొక సాకు చూపుతారు. ప్రభుత్వ ప్రసార సాధనాలను ఆదేశాలతో, ప్రయివేటు మీడియాను పాకేజ్‌లు, అదిరింపులు బెదిరింపులతో ఇప్పటికే భజన కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు సామాజిక మాధ్యమం మీద కేంద్రీకరించారు. తమ ఆదేశాలను ధిక్కరించినట్లయితే జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్లను ఉటంకిస్తూ ట్విటర్‌ కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

బేటీల ఉద్యోగాలను పోగొట్టిన బిజెపి !

పాలకపార్టీని సంతృప్తి పరచేందుకు ట్విటర్‌ కంపెనీ భారత విధాన డైరెక్టర్‌గా ఉన్న మహిమా కౌల్‌ను ఇంటికి పంపింది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు తప్ప తాజా వివాదానికి సంబంధం లేదని కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఖాతాల తొలగింపు లేదా ప్రభుత్వ ఆదేశాల విషయంలో ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి ఉండాలి. బిజెపికి లొంగని కారణంగా మహిమా కౌల్‌ ఉద్యోగాన్ని కోల్పోతే ఫేస్‌బుక్‌లో బిజెపికి తోడ్పడిన విషయం బహిర్గతం కావటంతో అంఖీదాస్‌ అనే బిజెపి మద్దతుదారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బిజెపి కార్యకర్తల విద్వేష పూరిత ప్రచారాన్ని నిరోధించాలనే అంశం ముందుకు వచ్చినపుడు మోడీ పార్టీ, హిందూత్వ ముఠాల ఖాతాలపై చర్యలు తీసుకుంటే కంపెనీ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని అంఖీదాస్‌ అడ్డుపడ్డారని వెల్లడైంది. ముస్లింలు, ఇతర మైనారిటీల మీద విద్వేష పూరిత ప్రచారాన్ని అనుమతించారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ పరువు మురికి గంగలో కలిసింది. ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

లతా మంగేష్కర్‌, సచిన్‌ పరువు కంటే తన బండారం గురించే బిజెపి భయం !

వివిధ ట్విటర్‌ ఖాతాలలో ఒకే విధమైన మాటలు, సమాచారంతో ట్వీట్లు వెలువడటం తెలిసిందే. అవి భజన లేదా విద్వేష ప్రచారానికి సంబంధించినవి ఏవైనా కావచ్చు. సరిగ్గా అలాంటి ట్వీట్లే రైతు ఉద్యమానికి సంబంధించి భారత రత్నలు లతా మంగేష్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ మరికొందరు ప్రముఖుల పేరుతో వెలువడ్డాయి. తొంభై ఒక్క సంవత్సరాల వృద్ధాప్యంతో ఉన్న లతా మంగేష్కర్‌ పనిగట్టుకొని ట్వీట్‌ చేశారంటే నమ్మటం కష్టమే. ఒక వేళ ట్వీట్లు చేసిన వారందరూ దాదాపు ఒకే పదజాలాన్ని వారంతా ఎలా వినియోగించారన్నది ఆసక్తి కలిగించే అంశం. వాటిని బలవంతంగా వారి చేత ఇప్పించారనే అభిప్రాయం వెల్లడి కావటంతో దాని గురించి విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేముంది భారత రత్నలనే అవమానిస్తున్నారు కనుక కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి రంగంలోకి వచ్చింది.


విదేశీ తారల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తున్నాయంటూ రుసురుసలాడుతూ బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు బజారుకెక్కారు. కాంగ్రెస్‌ తరఫున తాను భారత రత్నలకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. మన నేల గురించి ఏమాత్రం తెలియని వారు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే ప్రముఖులు ఏకోన్ముఖ వైఖరి తీసుకొనేందుకు ముందుకు వచ్చారన్నారు. ముందే చెప్పుకున్నట్లు నిజానికి దేశానికి మాయని మచ్చ ఢిల్లీ శివార్లలో రోడ్ల మీద పాతిన ఇనుప మేకులు, కాంక్రీటుతో ఏర్పాటు చేసిన ఆటంకాల చిత్రాలు, వీడియోలు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే కదా ! భారత్‌లో ప్రజాందోళనల అణచివేతకు ఇలాంటి అనాగరిక ఏర్పాట్లు చేస్తారా అని సభ్యసమాజం యావత్తూ విస్తుపోతోంది.
కాంగ్రెస్‌ గానీ, మరొకరు గానీ లతా మంగేష్కర్‌ సంగీతం గురించి లేదా సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌, ఇతర రంగాలలో అనేక మంది చేసిన కృషికి గుర్తింపుగా భారత రత్నలుగా ప్రకటించటాన్ని ఎవరూ తప్పుపట్టలేదు, పట్టాల్సిన అవసరమూ లేదు. ప్రముఖులందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రకమైన పదజాలాలను తమ ట్వీట్లలో ఎలా వినియోగించారన్నదే బయటకు రావాల్సిన అంశం.

నరేంద్రమోడీ బ్రాండ్‌ సృష్టికి ఎన్ని వందల కోట్లు వెచ్చించారు ?

ఎవరైనా తమను విమర్శిస్తే వారి వ్యక్తిగత, సంస్దల లోపాలు, తప్పులు వెతికి వాటిని ఆయుధాలుగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. లేకపోతే కల్పిత ఆరోపణలతో అదే పని చేస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులిచ్చి ఉద్యోగులను పెట్టుకొని పేరు, ప్రతిష్టలను తయారు చేయించుకొనే పెద్ద మనుషుల గురించి తెలిసిందే. రైతులకు మద్దతుగా, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేసిన వారందరూ డబ్బు తీసుకొన్నారనే నిందలను మోపారు. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచం నరేంద్రమోడీ నాయకత్వం ఎదురు చూస్తోందన్న ట్వీట్ల వెనుకు ఎంత డబ్బు చేతులు మారి ఉండాలి? అసలు ప్రపంచ నాయకులు ఎవరూ లేరు. లేని గొప్పను ఆపాదిస్తూ ప్రచారం చేసుకోవటమే కదా ! ఆర్ధికవేత్తగా మన్మోహన్‌ సింగ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీగారు ఏమి చదివారో, ఆయన డిగ్రీ ఏమిటో తెలియదు. మా మోడీ ఎంత సాధారణ వ్యక్తో తెలుసుకోండి అంటూ మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేస్తున్న చిత్రాలంటూ సామాజిక మాధ్యమంలో తిప్పిన వారెవరో తెలుసు. చైనాలో కూడా నరేంద్రమోడీకే ఎక్కువ ఆదరణ ఉందని ఆ దేశ పత్రిక సర్వే వెల్లడించిందనే తప్పుడు ప్రచారం చేసింది ఎవరు ? దానికి ఎంత సొమ్ము చెల్లించారు? ఎవరు చెల్లించారు ?
2014లోక్‌ సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి ఒక ప్రతిష్టను సృష్టించేందుకు ఎన్ని సంస్దలను వినియోగించారో, ఎందరు నిపుణులు దానివెనుక ఉన్నారో ? అందుకు మోడీ టీమ్‌ ఎంత ఖర్చు చేసిందో అంచనా వేయలేము. ఇప్పుడు ప్రశాంత కిషోర్‌ వివిధ పార్టీలకు పని చేస్తున్నట్లుగానే మోడీ గారు కూడా అనేక సంస్ధలతో ఆపని చేయించారు. ఆసక్తి ఉన్నవారు దిగువ లింక్‌లోని విశ్లేషణ చదవ వచ్చు.https://www.businesstoday.in/magazine/case-study/case-study-strategy-tactics-behind-creation-of-brand-narendra-modi/story/206321.html


రైతుల ఉద్యమానికి మద్దతుగా పాప్‌ సంగీత గాయని రీఆనె ఇచ్చిన ట్వీట్‌తో దిమ్మ తిరిగింది. దాంతో ఒక సంస్ధ నుంచి ఆమె డబ్బు తీసుకుందనే ప్రచారం చేశారు. దానికి రుజువులు చూపాలంటూ ఆ సంస్ధ సవాలు చేసింది. ఇంతవరకు నోరు మెదపలేదు. బట్టకాల్చి ఎదుటి వారి వేయటమే అసలు లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వినరు జోషీ లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ పేరుతో ఒక స్వచ్చంద సంస్దను ఏర్పాటు చేశారు. కేసులు వేయటమే దాని పని. దాని లక్ష్యం ఏమిటన్నది తెలిసిందే.రీఆనె ట్వీట్‌ చేయగానే ఆ సంస్ధను రంగంలోకి దించారు. ఆమె కంపెనీ ఒకటి 2017 నుంచి తయారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులలో ఝార్కండ్‌లోని గనుల నుంచి సేకరిస్తున్న మైకా(అబ్రకం)కు అవసరమైన నిర్ధారణ పత్రాలు ఉన్నాయా, గనుల్లో బాల కార్మికుల వినియోగం గురించి దర్యాప్తు జరపాలంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు లేఖ రాయించారు. ఒక వేళ నిజంగానే అదే జరుగుతోందని అనుకుందాం ! ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్ధ ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నది ? ఇతర అనేక రంగాలలో బాలకార్మికులను వినియోగిస్తున్న ఉదంతాలపై సదరు సంస్ధ ఎన్ని ఫిర్యాదులు చేసింది? ఇలాంటి వివాదాలను రేపటం వెనుక జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప బాలకార్మికుల మీద ప్రేమ కాదు. మన దేశంలో సరైన తిండి లేక మరణిస్తున్న బాలలు, ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న తల్లులు, ఆకలి, వ్యాధులు, దిగజారుతున్న ప్రజాస్వామ్య సూచికల గురించి ప్రపంచ సంస్ధలు ఇస్తున్న నివేదికల కంటే ఎక్కువగా రైతు ఉద్యమం మీద చేసిన ట్వీట్లు మన దేశ పరువును తీశాయా ? వాటి గురించి భారత రత్నలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ? ట్వీట్లతో దేశ పరువు కంటే కృత్రిమంగా తయారు చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరువు పోతోందన్నదే అసలు దుగ్ద !

యూ ట్యూబ్‌ మీద వత్తిడి, కమలా హారిస్‌ సోదరి కుమార్తె చిత్ర పటాల దగ్దం !

కేంద్ర ప్రభుత్వం ఒక్క ట్విటర్‌ మీదనే కాదు యూ ట్యూబ్‌ మీద కూడా వత్తిడి తెచ్చింది. రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన పాటలను తీసివేయించింది. అసీ వాద్దేంగే అనే గీతాన్ని తొలగించటానికి ముందు కోటీ 30లక్షల మంది చూశారు. అయిలాన్‌ అనే మరో పాటను కోటి మంది చూశారు. యూట్యూబ్‌ నుంచి అయితే తీసివేయించగలిగారు గానీ రైతుల హృదయాల నుంచి ఎలా తొలగిస్తారని రైతు నేతలు ప్రశ్నించారు. ఈ పాటలను ఎందుకు తొలగించారో యూట్యూబ్‌ ఒక్క ముక్క కూడా చెప్పలేదు.


అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌. ఆమె చెల్లెలు మాయ కుమార్తె మీనా హారిస్‌. ఆమె కూడా రైతుల ఉద్యమానికి సానుకూలంగా స్పందించారు. ఆమె మీద కాషాయ మరుగుజ్జులు దాడి చేశారు. బూతులు తిట్టారు, అనేక చోట్ల ఆమె ఫొటోలను తగులబెట్టారు.ఒక వేళ మేము భారత్‌లో ఉండి ఉంటే వారేమి చేసేవారో తగులబెట్టిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అయినా నన్నెవరూ బెదరించలేరు, నోరు మూయించలేరు. ధైర్యవంతులైన భారత పురుషులు రైతులకు మద్దతుగా మాట్లాడిన ఒక మహిళ చిత్రాలను తగులబెట్టారు. అది వారికి సర్వసాధారణం అనుకుంటున్నాను అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్‌ కౌర్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి లైంగికంగా దాడి చేశారు అని కూడా మీనా ట్వీట్లు చేశారు. కమలా హారిస్‌ కుమార్తె వరుస కావటంతో సహజంగానే మీనా ట్వీట్లకు కూడా పెద్ద స్పందన వెల్లడైంది.భారతీయ వారసత్వం ఉండి కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తుందా అన్న ఉక్రోషం తప్ప మరొకటి కాదు. ఎంత మంది నోరు మూయిస్తారు. అలాంటి చర్యల వలన మరింత మంది నోళ్లలో నానుతారనే విషయం పట్టించుకొనే స్ధితిలో లేరు.

వ్యవసాయం గురించి మాట్లాడే నరేంద్రమోడీ ఎప్పుడైనా మేడి పట్టారా -కాడి మోశారా !

సెలబ్రిటీలు నోరు తెరిస్తే మాకు భజన చేయాలి లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి అన్నట్లుగా ఉంది కాషాయ మరుగుజ్జుల తీరు. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది చమోలీ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు తీసింది. నదిపై నిర్మించిన అనేక ఆనకట్టల నిర్మాణం వరదలకు దారి తీసిందని, చమోలీ పౌరుల కోసం ప్రార్ధనలు జరపాలని బాలీవుడ్‌ నటి దియా మీర్జా ట్వీట్‌ చేసింది. దానిలో తప్పేముంది, నిజం అదిగాకపోతే కారణాలు వెల్లడైన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. దేశానికి జరిగిన నష్టం ఏముంది ? అయినా ఎందుకు ఆమె మీద దాడి చేశారు ? నాలుగు పదుల వయస్సున్న దియా మీర్జా తండ్రి జర్మన్‌-తల్లి బెంగాలీ. హైదరాబాదులో పుట్టి పెరిగింది. తలిదండ్రులు విడిపోయిన తరువాత దియా తల్లి హైదరాబాదుకు చెందిన అహమ్మద్‌ మీర్జాను వివాహం చేసుకుంది. దియా తన మారు తండ్రి ఇంటి పేరునే తాను స్వీకరించింది.


దియా నటి, పర్యావరణ రక్షణ ఉద్యమ కార్యకర్త. గత పది సంవత్సరాలుగా దానికి సంబంధించిన అంశాల మీద ఆమె మాట్లాడుతోంది. ఆమె కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నిర్దేశించిన నిరంతర అభివృద్ది లక్ష్యాల రాయబారిగా ఆమెను నియమించారు. ఇంతకంటే ఆమె కృషికి గుర్తింపు ఏమి కావాలి. మియా ఖలీఫా ఒక రైతు అయినట్లుగానే దియా ఒక పర్యావరణ వాది అంటూ హేళన చేశారు. మియా ఖలీఫా గానీ మరొక సినిమా నటిగానీ తాము రైతులమని ఎక్కడా చెప్పలేదు, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు తప్ప మరొకటి కాదు. రైతుల గురించి మాట్లాడిన వారందరూ రైతులే కానవసరం లేదు. ఆమాటకు వస్తే నరేంద్రమోడీ రోజూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా మేడి పట్టారా – కాడి మోశారా ? వేరుశనగ కాయలు ఎక్కడ కాస్తాయో తెలుసా ? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? టీ అమ్మాను అని ఆయన చెప్పుకోవటమే గాక నేను చూశాను అని ఇంతవరకు ఒక్కరూ చెప్పలేదు. మోడీ గారు ఏమి చదువుకున్నారో తెలియదు గానీ, ఆయన మాట్లాడుతున్న ఆర్ధిక విషయాలకు మోడినోమిక్స్‌ అని పేరు పెట్టారు. అలాంటి ఆర్ధిక నిపుణుడి ఏలుబడిలో దేశం ఇంతగా ఎందుకు దిగజారినట్లు ? ఒక అంశం గురించి మాట్లాడాలంటే దాని డిగ్రీ కలిగి ఉండాలా ? పాలకులకు నచ్చని విషయాలను రాస్తే లేదా వ్యతిరేకంగా మాట్లాడిన మహిళల మీద నోరుబట్టని బూతులతో దాడి జరగటం చూస్తున్నాం. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. రేప్‌ చేస్తామని బెదరిస్తారు. అవే నోళ్లు మహిళలను గౌరవించాలని, పూజించాలని మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటోందో !


నాడు ఇందిరే ఇండియా – నేడు బిజెపి ప్రభుత్వమే దేశం !

గతంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసిన డికె బారువా ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అని సెలవిచ్చి వ్యక్తి పూజకు తెరలేపి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వమంటే దేశం- దేశమంటే ప్రభుత్వం అనే పద్దతిలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే రైౖతు ఉద్యమం గురించి ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తే అది దేశ భక్తి- విమర్శిస్తే అది దేశద్రోహం అంటూ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం వేరు-దేశం వేరు అని కాషాయ దళాలకు తెలియకనా ? కానే కాదు. తమను గుడ్డిగా నమ్మే వారి మెదళ్లను తప్పుడు అవగాహనతో నింపే పెద్ద పధకంలో భాగమే అది.


రైతు ఉద్యమం గురించి తెలియని వారికి తెలియ చెప్పటంలో ఆ ఉద్యమాన్ని సమర్ధిస్తున్న పార్టీలు లేదా సంస్ధలు ఎంతవరకు జయప్రదమయ్యాయో తెలియదు గానీ బిజెపి మాత్రం ఇప్పుడు నిరంతరం అదే కార్యక్రమంలో ఉంది. అందుకు గాను ఆ పార్టీని ”అభినందించక ” తప్పదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం మీద ప్రధాని మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం మరింత గట్టిగా సాగేందుకు అవసరమైన పునాది వేశారు. ఆందోళనా జీవి అనే కొత్త పదాన్ని ప్రయోగించారు.సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణాలో ఒక కంపెనీ కొనుగోలు చేసిన భూ వివాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును ఆందోళనా జీవి ఆవహించింది. హైదరాబాద్‌ నగరపాలక సంస్ధ ఎన్నికల సందర్భంగా రోహింగ్యాల మీద మెరుపుదాడులు చేస్తామని ఆ పెద్దమనిషి ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లాలో గిరిజనుల కోసం ” కరసేవ ” చేస్తానంటూ రెచ్చగొడుతూ కంపెనీకి చెందిన ఒక షెడ్డును ధ్వంసం చేయించిన దృశ్యాలను చూశాము. భక్తి శివుడి మీద చిత్త బయట ఉన్న చెప్పుల మీద అన్నట్లుగా గుర్రంపోడు గిరిజనుల మీద కంటే సాగర్‌ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేశారన్నది స్పష్టం. నిజానికి ప్రధాని లేదా బిజెపికి ఆందోళనలతో పనిలేకపోతే లేదా పట్టకపోతే ఆ పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? నిత్యం అవి ఏదో ఒక ముట్టడి పేరుతో ఆందోళనలకు ఎందుకు దిగుతున్నట్లు ? వాటిని రద్దు చేస్తారా ?


పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా అతి చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న గ్రేటా టన్‌బెర్జ్‌ ఇలా చెప్పింది.” సైన్సు మరియు ప్రజాస్వామ్యం ఒకదానితో ఒకటి బలమైన సంబంధం కలిగినవి.అవి భావ ప్రకటనా స్వేచ్చ, స్వాతంత్య్రం, వాస్తవాలు మరియు పారదర్శకత మీద నిర్మితమౌతాయి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే బహుశా మీరు సైన్సుకూ గౌరవం ఇవ్వరు. మీరు సైన్సును గౌరవించపోతే ప్రజాస్వామ్యాన్నీ గౌరవించరు ”.
గ్రేటా టన్‌బర్జ్‌ చెప్పిందే దేశంలో నేడు జరుగుతోం సైన్సును గౌరవిస్తున్నామని ఒక నోటితో చెబుతూ అదే నోటితో మహాభారత కాలంలోనే మన దేశంలో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని పుట్టించే ప్రక్రియ తెలుసనీ, పురాణ కాలంలోనే ఏనుగు తలను మనిషికి అంటించే ప్లాస్టిక్‌ సర్జరీ పరిజ్ఞానం ఉందనీ, ఎలాంటి ఇంధనం లేకుండానే ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలు మన దేశంలో ఉండేవని చెబుతున్న వారెవరో మనకు తెలుసు. అలా చెప్పటం సైన్సును అవమానించటం తప్ప గౌరవించటం కాదు. దాన్ని గౌరవించని అధికారంలో ఉన్న ఆ పెద్దలు ప్రజాస్వామ్య వ్యవస్దను కరిమింగిన వెలగ పండులా మారుస్తున్న తీరూ తెలుసు ? ముసురుతున్న చీకట్లు, వేసుకున్న ముసుగులు తొలుగుతాయి. దేనికైనా తగు సమయం రావాలి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కులం పేరుతో కేరళ ముఖ్యమంత్రిని అవమానించిన కాంగ్రెస్‌కు బిజెపి మద్దతు !

07 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF


ఎం కోటేశ్వరరావు


ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్‌ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.

ఏప్రిల్‌ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్‌ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్‌ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్‌ నోరు పారవేసుకున్నారు.


కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్‌ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ ఘాటుగా సురేంద్రన్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్‌ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్‌ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్‌ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.

” సురేంద్రన్‌ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ మీద సుధాకరన్‌ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్‌ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్‌ విలేకర్లతో చెప్పారు.

బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్‌ ?

సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్‌ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్‌ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్‌ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్‌ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్‌ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్‌ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్‌ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.

మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌ !

స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్‌ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్‌ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్‌ అన్నారు.


శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్‌ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కుమారుడు చాండీ ఊమెన్‌ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్‌ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.


బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్‌) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్‌) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్‌ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్‌ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్‌ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !

18 Monday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Science

≈ Leave a comment

Tags

BJP pseudoscience, false scientific claims, Glorification of Narendra modi, Hindu Fundamentalism, pseudoscience, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము
అని ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రాసిన జన్మభూమి గీతాన్ని ఎవరు మరచి పోరు.మేరా భారత్‌ మహాన్‌, నిజమే ! నా దేశం గొప్పది. అందులో ఎలాంటి సందేహం లేదు. నా దేశమే గొప్పది, తరువాతే మిగతావి అంటేనేే తేడా వస్తుంది. వసుధైక కుటుంబం అన్న మహత్తర భావన మన దేశంలో తరతరాలుగా జనంలో నాటుకుపోయింది. అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే వారితో ఎలాంటి పేచీ లేదు. ఒకవైపు ఆ మాట చెబుతూనే మరోవైపు దానికి విరుద్దమైన ఆచరణతోనే అసలు సమస్య.


తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుస్తుగా కోవాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం, నరేంద్రమోడీగారికే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్దాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకూ అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాదు కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరుతో ఒక దాన్ని తయారు చేస్తున్నది.


ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ వేయాలని జపాన్‌ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు.ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ , నార్వే వంటి అనేక దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటి కంటే చైనాలో ఉచితంగా, ప్రయోగాత్మకంగా వాక్సిన్‌ ఇవ్వటం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండూతి లేదని ఒక వైపు చెప్పుకుంటూనే బిజెపి తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది. గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు.

మరో పోస్టు కూడా తిరుగుతోంది. ప్రపంచానికి అమెరికా ఆయుధాలు ఇచ్చింది చంపుకోమని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఇచ్చింది చంపమని,చైనా కరోనాను ఇచ్చింది అందరూ చావాలని, నా భారత దేశం మాత్రమే మెడిసిన్‌ ఇస్తుంది అందరూ బతకాలని, అని దానిలో రాశారు. ఇది కాషాయ దళాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని వేరే చెప్పనవసరం లేదు. 2010-14 సంవత్సరాలతో పోల్చితే 2015-19 మధ్య (ట్రంప్‌ ఏలుబడి) అమెరికా అమ్మిన ఆయుధాలు 23శాతం పెరిగాయి. అనేక దేశాల మీద యుద్దాలు చేస్తూ, చేయిస్తూ ఆయుధ పరిశ్రమలకు లాభాల పంట పండిస్తున్న అమెరికా మనల్ని కూడా వదల్లేదు. చైనా మీదకు మనల్ని ఉసిగొల్పటం, చైనాను బూచిగా చూపి దాని ఆయుధాలను మనకూ అంటగడుతోంది. తన దగ్గర కాకుండా రష్యా దగ్గర కొనుగోలు చేస్తామంటే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది.అలాంటి ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన పెద్దమనిషి నరేంద్రమోడీ, అలాంటి అమెరికా మనకు భాగస్వామి అని, ఎలా కౌగిలింతలతో గడిపారో తెలిసిందే. మన అదృష్టం కొద్దీ ట్రంప్‌ ఓడిపోయాడు గానీ లేకుంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే !


ప్రపంచానికి భారత్‌ మాత్రమే మెడిసిన్స్‌ ఇస్తుందా ? 2019లో బ్లూమ్‌బెర్గ్‌ అనే అమెరికా కార్పొరేట్‌ సంస్ధ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల సూచిక అంటూ 169 దేశాల జాబితా ఇచ్చింది. దానిలో మన స్ధానం 2017తో పోల్చితే 119 నుంచి 120కి పడిపోయింది. ఈసూచికకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశం ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నది అని కాదు, మోడీ పాలనలో జనాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచారో అని గర్వపడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది బిజెపినే కనుక ఆ ఖ్యాతి కూడా మోడీగారి ఖాతాకే జమకావాలి !


ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనా మూడు స్ధానాలను పెంచుకొని 52వ స్ధానంలో ఉంది. మన పక్కనే ఉన్న శ్రీలంక 66, బంగ్లాదేశ్‌ 110 స్ధానాల్లో ఉండగా మన 120వ స్ధానానికి దగ్గరగా పాకిస్ధాన్‌ 124లో ఉంది. ఆరుదశాబ్దాలకు పైగా అష్టదిగ్బంధనలో ఉన్న క్యూబా 31 నుంచి 30వ స్ధానానికి ఎదగ్గా, దాన్ని నాశనం చేయాలని చూస్తున్న అమెరికా 34నుంచి 35కు పడిపోయింది. జనం ఆరోగ్యానికి తోడ్పడని ఔషధాలు ఎన్ని తయారు చేస్తే ప్రయోజనం ఏముంది ?అదేదో సినిమాలో అన్నట్లు దీనమ్మ జీవితం ఏది మాట్లాడినా నరేంద్రమోడీకే తగులుతోంది.


ఇక నరేంద్రమోడీ గారి ఖాతాలో జమ కావాల్సిన మరో ఘనత కూడా ఉంది. 1995 నుంచి నేటి వరకు గుజరాత్‌ బిజెపి ఏలుబడిలో ఉంది.దానిలో సగం కాలం నరేంద్రమోడీ గారు పన్నెండు సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ప్రధాని అయ్యారు. 1990-2016 సంవత్సరాల మధ్య వ్యాధుల భారం గురించి ఒక విశ్లేషణ జరిగింది.దాని ప్రకారం 1990లో గుజరాత్‌లో వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు కారణాలలో ప్రధమ స్ధానంలో 36.1శాతం పోషకాహార లేమిగా తేలింది.2016 నాటికి 14.6శాశాతానికి తగ్గినా ప్రధమ స్ధానం దానిదే. ఇదే సమయంలో కేరళ వ్యాధుల భారం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా ప్రధమ స్ధానంలో ఉంది. అక్కడ పైన పేర్కొన్న విశ్లేషణ కాలంలో మరణాల కారణాలలో ప్రధమ స్ధానంలో ఉన్న పోషకాహార లేమి 17.4 నుంచి 4.4శాతానికి, ప్రధమ స్దానం నుంచి తొమ్మిదికి తగ్గింది. మందులు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నది కాదు, వాటి అవసరం లేకుండా ఏ చర్యలు తీసుకున్నారన్నది ముఖ్యం.


మన దేశం ఔషధాల ఉత్పత్తిలో ముఖ్యంగా వాక్సిన్లు, జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో అగ్రస్ధానంలో ఉన్నమాట వాస్తవం. అదేదో ఆరున్నరేండ్ల నరేంద్రమోడీ పాలనలోనే సాధించినట్లు చిత్రిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఔషధాల ప్రయోగాలకు దొరికే వలంటీర్ల ఖర్చు మన దగ్గర చాలా తక్కువ, సకల రోగాలకు నిలయంగా ఉంది గనుక ప్రయోగాలూ ఇక్కడ ఎక్కువే. నిపుణులు ఉండటం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వంటి అంశాలు మన దేశంలో ఔషధ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడ్డాయి.అయితే ప్రపంచంలో మన స్ధానం ఎక్కడ అని చూస్తే మొదటి 15దేశాలలో 2018 సమాచారం ప్రకారం 16.8శాతంతో జర్మనీ ప్రధమ స్ధానంలో ఉండగా 12.2, 7.5 శాతాలతో స్విడ్జర్లాండ్‌, బెల్జియం తరువాత ఉన్నాయి. మన దేశం 3.8శాతంతో 12పన్నెండవ స్ధానంలో ఉంది. మొదటి స్ధానంలో ఉన్న జర్మనీ ఎగుమతుల విలువ 62.3 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ 14.5బి.డాలర్లు. మన ఈ స్ధానానికి చైనా కూడా ఒక కారణం. మన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ముడి సరకుల్లో చైనా నుంచి 60నుంచి 70శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాము. మిగతా దేశాలతో పోలిస్తే అవి చౌక గనుకనే ఆ దిగుమతులు అన్నది గమనించాలి. అందువలన గొప్పలు చెప్పేవారు ఇంటా బయటా నిజంగా నరేంద్రమోడీ పరువు పెంచాలనుకుంటున్నారా తుంచాలనుకుంటున్నారో ఆలోచించుకుంటే మంచిది. ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుంటే నరేంద్రమోడీ గారికి గౌరవం, మర్యాద మిగులుతాయి.ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. భక్తులే వాటిని సమర్పించుకుంటుంటే ?

మన గతం ఘనమైనదా కాదా ? దాన్ని అంగీకరిస్తారా లేదా ? గతం, వర్తమానం దేనిలో అయినా ఘనమైనవే కాదు, హీనమైనవి కూడా ఉంటాయి. కులాల కుంపట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనం వంటివి ఎన్నో ! రెండోవాటిని ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే ఘనత పాతాళానికి పోతుంది.మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భిన్న భావజాలాలను సహించటంలో మన గతం ఘనమైనదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా ? ప్రపంచంలో ఫాసిస్టు శక్తుల చరిత్రను చూసినపుడు ఊహాజనిత లేదా కల్పితమైన వాటిని రాబట్టేందుకు ప్రయత్నించటం, విభజన తీసుకురావటం, ఆధారాలు లేని వాటిని కీర్తించటం, లేనిగొప్పలు వర్తింప చేయటం, వైఫల్యాలకు కొందరిని బూచిగా చూపటం, వ్యక్తుల మీద కేంద్రీకరించటం ఒక లక్షణం.


కరోనా వాక్సిన్‌ మన దేశంలో తయారు చేసినా మరో దేశంలో రూపొందించినా అది శాస్త్రీయ ప్రాతిపదికన తయారు చేస్తున్నది తప్ప మాయలు మంత్రాలతో కాదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని గతంలో చెబితే ఇప్పుడు ఆవు మూత్రం-పేడలో లేనిదేమీ లేదు అని చెప్పటాన్ని చూస్తున్నాము. మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ముంచుకువచ్చినా దాన్నుంచి రక్షించేందుకు వాటినేవీ బయటకు తీయలేదంటే ఉన్నాయని చెబుతున్నవారినేమనాలి ? నిజంగా అవి ఉండీ ఉపయోగం ఏముందీ !


ఊహలను వాస్తవాలుగా సాక్షాత్తూ నరేంద్రమోడీయే చెప్పటాన్ని చూశాము.వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఏనుగుతల అంటించటం,కృత్రిమ గర్భం ద్వారా కర్ణుడిని కనటం వేల సంవత్సరాల క్రితమే ఉందని నరేంద్రమోడీయే సెలవిచ్చారు. గురుత్వాకర్షణ, అణు సిద్దాంతం అన్నీ పాతవే, మనవే అని చెప్పిన తీరు చూశాము. ఇన్ని చెప్పిన వారు ఆవు మూత్రంలో ఏమున్నాయో తెలుసుకొనేందుకు పరిశోధనలు జరపమని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటాన్ని ఏమనాలి. వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అన్నింటి గురించీ చెప్పారు గానీ ఆవు మూత్రంలో ఏమున్నాయో చెప్పలేదా ! పోనీ ఆవు మూత్రం నుంచి కరోనా వాక్సిన్నూ రూపొందించలేదూ ?

ప్రపంచమంతా కరోనా కల్లోలం గురించి ఆందోళన పడుతుంటే బిజెపి, ఇతర కాషాయ పెద్దలు చెప్పిందేమిటి ? గతంలో ఆవు మూత్రం తాగితే క్యాన్సరే మాయం అవుతుందన్నారు, తాజాగా దాన్ని కరోనా వైరస్‌కు ఆపాదించారు. దీపాలు వెలిగిస్తే వైరస్‌ భస్మం అవుతుందన్నారు. జనం అవన్నీ మరచిపోయారని కాబోలు ఇప్పుడు తమ నరేంద్రమోడీయే దగ్గరుండి వాక్సిన్‌ తయారు చేయిస్తే ఓర్చుకోలేకపోతున్నారని ఎదురుదాడికి దిగారు. ” ఆర్ధికంగా, వైద్యపరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు, శానిటైజర్లు వాడని హిందూ వ్యతిరేక మతాల మధ్య భారత్‌ కరోనా భరతం పట్టిందని, రెండు టీకాలు కనిపెట్టిందని ” తిప్పుతున్న పోస్టులో మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అనుమతించిన రెండింటిలో భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ మాత్రమే మనది. మన దేశంలో సీరం సంస్ధ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రజెనికా తయారు చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా కొరవడిన పోస్టు అది.


ముస్లిం మత పెద్దలు కూడా తక్కువ తినలేదు. ఐదుసార్లు కడుక్కుంటే కరోనా అంటుకోదన్నారు. మసీదులను మూసివేస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందన్నారు.మహిళల చెడునడత కారణంగా దేవుడికి కోపం వచ్చి కరోనా రూపంలో శిక్షిస్తున్నాడన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు చైనా వారే వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలారని చెప్పారు.మనుషుల బుర్రలను నియంత్రించేందుకు యూదులు కరోనా వాక్సిన్‌ ఉన్న చిప్స్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారని ముస్లిం మతోన్మాదులు చెబుతున్నారు.


ఇంటా బయటా మతశాస్త్రాల బోధన – విద్యాలయాల్లో విజ్ఞానశాస్త్ర బోధన జరుగుతున్నా మూఢత్వం వదలని కారణంగా మొదటిదాని మీద ఉన్న విశ్వాసం రెండవదాని మీద లేదు. ఒక వేళ ఉంటే మోడీ వంటి పెద్దలు ఆశాస్త్రీయ, ఊహాజనిత అంశాలను ప్రచారం చేయగలరా ? ఆవు చేలో ఉంటే దూడలు గట్టున ఉంటాయా ? బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల కేసు ముద్దాయి ప్రజ్ఞాసింగ్‌ ఒక టీవీలో మాట్లాడుతూ ఆవు మూత్రం కలిపినదానిని తాగితే తన రొమ్ముక్యాన్సర్‌ నయమైనట్లు చెప్పారు. పాలకులకు తాన తందాన పలికే ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు కొన్నివేల సంవత్సరాల క్రితమే కణ పరిశోధనలు జరిపారని, వంద మంది కౌరవులు ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుట్టారని సైన్స్‌ కాంగ్రెస్‌ సభలోనే సెలవిచ్చారు. అంతటితోనే ఆగలేదు నియంత్రిత క్షిపణులంటే వేరే ఏమీ కాదు విష్ణు చక్రం అన్నారు, రావణుడు24 రకాల విమానాలను వివిధ విమానాశ్రయాలకు నడిపినట్లు చెప్పారు. రాముడు-రావణుడు ఒకే కాలం నాటి వారు రావణుడికి విమానాలు ఉంటే రాముడికి లారీలు, జీపులు కూడా ఎందుకు లేవు ? రావణుడిని చంపే రహస్యాన్ని తెలుసుకున్న రాముడి పరివారం విమానాల టెక్నాలజీ గురించి తెలుసుకోలేకపోయిందా ? బ్రహ్మ డైనోసార్లను కనుగొన్నట్లు చెబుతారు. త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ అయితే మహాభారత కాలం నాడు ఇంటర్నెట్‌ ఉండబట్టే యుద్ధంలో ఏం జరిగిందో ఎప్పటి కప్పుడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకోగలిగినట్లు చెప్పారు.నెమళ్లు ఎన్నడూ జతకూడవని, మగనెమలి కన్నీటితో ఆడనెమలి పునరుత్పత్తిలో భాగంగా గుడ్లు పెడుతుందని ఒక న్యాయమూర్తి సెలవిచ్చిన విషయం తెలిసిందే. పురాతన భారత్‌ను పొగిడే పేరుతో మత రాజ్యాలవరకు జనాన్ని తీసుకుపోవటమే లక్ష్యం. కాలుష్య నివారణకు యజ్ఞాల గురించి చెప్పేవారిని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, లక్ష సంవత్సరాల నాడే హిందూ రుషులు అణుపరీక్షలను జరిపారని చెప్పే శాస్త్రవేత్తలను, అప్పడాలు తింటే కరోనా పోతుందని చెప్పిన వారినీ చూశాము. కరోనా దెబ్బతో అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవారి నోళ్లు కొంత మేరకు మూతపడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకినపుడు ఆసుపత్రుల్లో చేరి ఉపశమనం పొందారు తప్ప ఆవు మూత్రం, అప్పడాల మీద ఆధారపడలేదు.


ప్రతిదానికి ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిలో రెండు రకాలు అసలు మోడీ ఏం చేసినా విమర్శించకూడదు అనే ఒక ప్రమాదకరమైన ధోరణితో కావాలని అడిగేవారు ఒక తరగతి. ఏదో చేస్తున్నారు కదా కాస్త సమయం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలెందుకు అని అడిగేవారు మరికొందరు.రెండో తరగతి కల్మషం లేని వారు. విమర్శకు పెద్ద పీట వేసేది ప్రజాస్వామ్యం. నియంతృత్వ లక్షణాల్లో భజనకు అగ్రపీఠం ఉంటుంది. అన్నీ నెహ్రూ, కాంగ్రెసే చేసింది అని కాషాయ దళాలు ఎలా విమర్శిస్తున్నాయో, వారు చేసిన తప్పిదాలను సరిచేసే పేరుతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ, బిజెపి అంతకంటే దారుణంగా వ్యవహరించింది అనే రోజులు రావని ఎవరు చెప్పగలరు? ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించటమే దేశద్రోహం అయితే మొదటి ద్రోహి బిజెపినే అని చెప్పాలి. ఎవరైనా అవ్వతో వసంతమాడతారా ? ప్రయోజనం ఏముంది, అందుకే అధికారంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని గాక ఇతరులను విమర్శిస్తే అర్ధం ఏముంది ? ఏమైనా సరే మా మోడీని విమర్శిస్తే సహించం అంటే కుదరదు. గతంలో ఇందిరే ఇండియా – ఇండియా ఇందిర అన్న కాంగ్రెస్‌ భజన బృందం కంటే ఇప్పుడు మోడీ దళం ఎక్కువ చేస్తోంది. అది మోడీకే నష్టం కాదంటారా ? కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినన్ని దశాబ్దాలు బిజెపికి జనం ఇవ్వరు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

14 Thursday Jan 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti-Communist, Anti-Communist Playbook, communism, communist-themed restaurant, Penang restaurant, specter of communism


ఎం కోటేశ్వరరావు


ఐరోపాను ఒక భూతం వెన్నాడుతున్నది. ఆ భూతమే కమ్యూనిజం అంటూ 1848లో కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తొలిసారిగా వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక రచన ప్రారంభం అవుతుంది. ప్రచ్చన్న యుద్దంగా వర్ణించిన సమయంలో అది తీవ్రమైంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు కమ్యూనిజంపై విజయం సాధించాం అని ప్రకటించారు. అలా చెప్పిన వారే ఇప్పుడు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాల పుస్తకాల దుమ్ము దులిపి మరోసారి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. ఎరుపును భూతంగా చూపిన తొలి రోజుల్లోనే ఎరుపంటే భయం భయం కొందరికి-పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్న కవిత్వం తెలుగునాట వచ్చింది. వర్తమానంలో కవులు ఎలా స్పందిస్తారో చూద్దాం.


ఇప్పుడు అమెరికాలో ఇంకా అనేక చోట్ల ప్రతిదీ ఎరుపుమయంగా కనిపిస్తోంది, అనేక మంది కలవరింతలతో ఉలిక్కిపడుతున్నారు. వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి పుంఖాను పుంఖాలుగా సినిమాలు, సీరియల్స్‌, రచనలను జనం మీదకు వదులుతున్నారు. సామాజిక మాధ్యమం, వాట్సాప్‌ ఫేక్‌ యూనివర్సిటీ బోధన ఎలాగూ ఉంది.
అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన డెమోక్రటిక్‌ పార్టీని సోషలిస్టులు, కమ్యూనిస్టులు నడుపుతున్నారని ముద్రవేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాను ఆక్రమించినట్లు చెబుతున్నారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కమ్యూనిస్టులంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీకీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ పార్టీలో ఇప్పుడు సోషలిస్టులు, కమ్యూనిస్టులు నిండిపోయారని, దానిలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన బెర్నీశాండర్స్‌ చివరికి అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీ పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ డెవిన్‌ న్యూన్స్‌ ఒక రాజకీయ కరపత్రంలో పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక చైనా నుంచి నిధులు పొందుతూ 2011 నుంచి నెలకు ఒక అనుబంధం ప్రచురిస్తున్నదని ( అది డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే పత్రిక) ఆరోపించాడు. నల్లజాతీయుల విషయాల ఉద్యమానికి గతేడాది జూన్‌లో పది కోట్ల డాలర్లు విరాళంగా వచ్చాయని, వారి హింసాకాండలో ఎందరో మరణించగా వంద నుంచి రెండువందల కోట్ల డాలర్ల ఆస్ధి నష్టం జరిగిందన్నాడు. ఎన్నికలలో అక్రమాల గురించి ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నింటినీ పునశ్చరణ కావించాడు. రిపబ్లికన్లు లేదా మితవాదులెవరూ ప్రధాన స్రవంతి మీడియాతో మాట్లాడవద్దన్నాడు. డెమోక్రాట్లు అధ్యక్ష భవనం, పార్లమెంట్‌ ఉభయసభలను అదుపులోకి తెచ్చుకున్నారని వాపోయాడు.


ఈనెలలో జార్జియా రాష్ట్ర సెనెట్‌కు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఇద్దరూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులే ఎన్నికయ్యారు. దాంతో సెనెట్‌పై ఆధిపత్యం వహించి జో బైడెన్‌కు ఆటంకాలు కల్పించాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సెనెటర్లిద్దరూ కమ్యూనిస్టులే అని సౌత్‌ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టి నియోమ్‌ (రిపబ్లికన్‌) వర్ణించారు. గత 33 సంవత్సరాలుగా రిపబ్లికన్లు తప్ప మరొకరు అక్కడి నుంచి ఎన్నిక అవలేదు. జార్జియా నుంచి ఇద్దరు కమ్యూనిస్టులు సెనెట్‌కు ఎన్నిక అవుతారని ఊహించుకోవటమే పరిహాసాస్పదంగా ఉంది అని ఆమె ఒక వ్యాసంలో వాపోయింది.
అమెరికా మీడియాలో, రిపబ్లికన్‌ పార్టీలో, ఇతర మితవాద శక్తులలో ఈ ధోరణి పెరిగిపోయింది కనుకనే పార్లమెంట్‌, దేశ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై దాడికి తన అనుచరులను డోనాల్డ్‌ ట్రంప్‌ పురికొల్పాడు. అలాంటి శక్తులు రేపు సైనిక తిరుగుబాటును ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.


మలేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ఉలికిపాటు !
మలేసియాలోని పదమూడింటిలో ఒక రాష్ట్రం పెనాంగ్‌, దాని జనాభా పద్దెనిమిది లక్షలు.ఆ దీవిలోని పులావ్‌ టైకుస్‌ మరియు జురు అనే రెండు చోట్ల ఓ 40 ఏండ్ల వ్యక్తి చిన్న రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మలేసియా బహుళ జాతుల నిలయం. ఆ రెస్టారెంట్‌ యజమాని చైనా జాతీయుడు. ఆహార పదార్దాలకు హాస్యం పుట్టించే విధంగా చైనా పేర్లతో పాటు మావో, ఇతర కమ్యూనిస్టు బొమ్మలను కూడా వాల్‌ పేపర్ల మీద ముద్రించి అందంగా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది మలేసియాలో తిరిగి కమ్యూనిస్టులు తలెత్తారు, లేకపోతే ఆ గుర్తులతో హౌటల్‌ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులు గగ్గోలు పెట్టారు. జనవరి మొదటి వారంలో పోలీసులు దాని మీద దాడి చేసి పోస్టర్లన్నీ చింపివేశారు. కమ్యూనిజానికి-యజమానికి సంబంధం ఏమిటి ? దీని వెనుక కమ్యూనిస్టులున్నారా అంటూ పరిపరివిధాలా బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు సరేసరి. పెనాంగ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఉందనటానికి హౌటలే నిదర్శనం అని కమ్యూనిస్టు వ్యతిరేక ”ఉమనో ” గా పిలిచే ఒక పార్టీ నేత బహిరంగ ప్రకటన చేశాడు. చైనాతో మలేసియాకు సంబంధం ఉన్న కారణంగానే ఇది జరిగిందని ఆరోపించాడు. ఇది అత్యంత బాధ్యతా రహిత ప్రకటన అంటూ ప్రత్యర్ధి పార్టీలు రంగంలోకి దిగాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ అలంకరణ చేసిన హౌటల్‌ యజమాని కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. కమ్యూనిజమూ లేదు ఏమీ లేదు, అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని అలా చేశానని మొత్తుకున్నాడు. అతడు చైనా జాతీయుడు కనుక ఇంత రచ్చ చేశారన్నది స్పష్టం.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్న వస్తుంది. జనవరి 13వ తేదీన పోలీసులు రెస్టారెంట్ల యజమానిని విచారించగా తాను ఒక చోట రెండు సంవత్సరాల క్రితం మరోచోట నాలుగేండ్ల నుంచి ఆ అలంకరణలతో నడుపుతున్నానని అప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడేమిటని అడిగాడట.


మలేసియా, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాలలో గణనీయ సంఖ్యలో చైనా జాతీయులున్నారు.ఉడిపి హౌటల్‌, ఆంధ్రా భోజన హౌటల్‌ పేరుతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మావో జన్మించిన చైనాలోని హునాన్‌ రాష్ట్రంలో మావో జియా కారు లేదా మావో కుటుంబ వంటలు అంటే ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆపేరుతో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.దానిలో భాగంగానే పెనాంగ్‌ రెస్టారెంట్‌ అన్నది స్పష్టం.దీన్ని వివాదాస్పదం చేసిన వారు బుద్ధిహీనులు అని అనేక మంది నిరసించారు.జపనీస్‌ రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన జపాన్‌ ఆక్రమణను ప్రోత్సహించినట్లు, పశ్చిమ దేశాల రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన ఆ దేశాల అలవాట్లను ప్రోత్సహిస్తున్నట్లా అని గడ్డి పెట్టారు. మలేసియాలో చైనా యాత్రీకులు మావో చిత్రం ఉన్న కరెన్సీ యువాన్లు ఇస్తే తీసుకోవటం లేదా ? అది కమ్యూనిజాన్ని ప్రోత్సహించినట్లా? దాడి చేయబోయే ముందు పోలీసులు ఇలాంటివన్నీ ఆలోచించరా అన్నవారూ లేకపోలేదు. హౌటల్‌ అలంకరణలో కమ్యూనిస్టు సిద్దాంతాలేవీ లేవని, ఒకవేళ ఉన్నా కూడా తప్పేమిటి, కమ్యూనిస్టు చైనా నుంచి అనేకం నేర్చుకోవటం లేదా దానితో వాణిజ్యం చేయటం లేదా అని ప్రశ్నించిన విశ్లేషకులూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కమ్యూనిజాన్ని ముందుకు తెచ్చే చౌకబారు ఎత్తుగడ అన్న వ్యాక్యానాలు వెలువడ్డాయి. 1930లో ఏర్పడిన మలయా కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దురాక్రమణకు,తరువాత బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసింది.1957లో స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా బ్రిటీష్‌ పాలనలో విధించిన నిషేధం కొనసాగటంతో సాయుధపోరాటాన్ని కొనసాగించింది.1989లో సాయుధ పోరాటాన్ని విరమించింది.ఈకాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన నేపధ్యంలో రెస్టారెంట్‌ అలంకరణ వివాదాస్పదమైంది.


ఇండోనేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత !
కొద్ది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు టీ షర్టులు అమ్ముతున్నవారిని కమ్యూనిస్టులని, కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నారని ఇండోనేసియాలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి పశ్చిమ జావా ప్రాంతంలో సుత్తీ కొడవలి చిహ్నాలతో నిర్మించిన ఒక బస్టాప్‌ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఇంకే ముంది ఇండోనేసియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. తీరా చూస్తే ఇదే చిత్రాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అనేక మంది సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారని తేలింది. అసలు విషయం ఏమంటే 2015లో కేరళలోని కొల్లం జిల్లాలో ఒక చోట ఏర్పాటు చేసిన బస్టాప్‌ చిత్రం అది. అంటే కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వ్యతిరేకులు ప్రతి అవకాశాన్ని ఎంతగా ఎలా వినియోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కమ్యూనిస్టులు పనిగట్టుకొని ఓడించారని కాషాయ దళాలు చేసే ప్రచారం ఇలాంటిదే. అంబేద్కర్‌ బొంబాయిలోని ఒక రిజర్వుడు-జనరల్‌ ద్వంద్వ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేశారు. జనరల్‌ సీటులో నాటి కమ్యూనిస్టు నేత ఎస్‌ఏ డాంగే, రిజర్వుడు సీటులో అంబేద్కర్‌ పోటీ చేశారు.

రైతులకు కమ్యూనిస్టు ముద్రవేసిన హర్యానా బిజెపి సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ !
రైతాంగ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కిసాన్‌ మాహాపంచాయత్‌ పేరుతో కేంద్ర చట్టాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గనాల్సి ఉంది. అయితే రైతులు ఆ సభను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా వెళ్లి సభా స్ధలిని, హెలిపాడ్‌ను ఆక్రమించుకోవటంతో ఆ సభ రద్దయింది. దాంతో ముఖ్యమంత్రి ఆరోపణలకు దిగారు. నిజంగా రైతులు ఆ పని చేయరని వారి ముసుగులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారే చేశారన్నారు.


కాపిటల్‌ హిల్‌ దాడిలో కమ్యూనిస్టు వ్యతిరేకులు !
అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్‌ డిసిలోని కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన దుండగులందరూ పచ్చిమితవాద, కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులే.వారిలో కొందరు లాయర్లు,ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఒకడి పేరు మెకాల్‌ కాల్‌హౌన్‌. మూడు దశాబ్దాలుగా లాయర్‌గా పని చేస్తున్నాడు. అతగాడి ట్విటర్‌ వివరాల్లో తాను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకిని అని చచ్చేంత వరకు డెమోక్రాట్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తా అని రాసుకున్నాడు. అమెరికా మీద ప్రేమతో తామీ చర్యకు పాల్పడ్డామని, దానిని దాడి అనకూడదు, అక్రమంగా ప్రవేశించటం అనాలి, నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు.


ఒక వస్తువును నాశనం చేయగలరు గానీ ఒక భావజాలాన్ని పాతిపెట్టి విజయం సాధించిన వారెవరూ లేరు. అది కష్టజీవులకు సంబంధించింది అయితే ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా తిరిగి లేస్తుంది.శక్తి రూపం మార్చగలం తప్ప నశింపచేయలేము. కమ్యూనిజమూ అంతే. ప్రచ్చన్న యుద్దంలో కమ్యూనిస్టులను ఓడించామని చెప్పిన తరువాత అమెరికాలో సోషలిజం పట్ల మక్కువ పెరిగింది. కమ్యూనిస్టులు లేదా సోషలిస్టులుగా ముద్రపడిన అనేక మంది స్ధానిక, జాతీయ ఎన్నికలలో విజయం సాధించారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగినదే అయినప్పటికీ మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఒక వైపు యువత కమ్యూనిస్టు పుస్తకాల దుమ్ముదులిపి అధ్యయం చేసేందుకు ఆసక్తి చూపుతుంటే మరోవైపు దానికి ప్రతిగా దోపిడీదారులు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార పుస్తకాల దుమ్ముదులుపుతున్నారు. 1996 తరువాత అమెరికాలో పుట్టిన వారిలో పెట్టుబడిదారీ విధానం మీద ఆసక్తి తగ్గిపోతుండగా సోషలిజం మీద పెరుగుతున్నది. గతంలో కమ్యూనిజం విఫలం అయిందనే మాటే వినిపించేది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయం పెరుగుతోంది. సోషలిస్టుచైనా ఆర్ధిక రంగంలో అనేక విజయాలు సాధిస్తుండగా అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎందుకు వెనుకబడుతున్నాయన్న మధనం ఆ సమాజాల్లో ప్రారంభం కావటం దోపిడీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: