• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: December 2021

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బెట్టింగ్‌ బంగార్రాజులూ జాగ్రత్త !

30 Thursday Dec 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

2022 UP polls, AAP, Betting market, BJP, Congress party, five states 2022 elections, Samajwadi Party


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పని కోసం యువత రద్దీ – ఉపాధి రహిత దేశ వృద్ధి !

29 Wednesday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#India jobless growth, #India unemployment, BJP, India economy, India employment, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి నేతలు చేయని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు.ప్రయాగ సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్‌ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్‌ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్‌ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోష పడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని,2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మన దేశంలో 2020 ఏప్రిల్‌-జూన్‌లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్‌లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బేఅలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే.ఏటా రెండు కోట్ల మంది యువతీ,యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు.వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బిజెపి, అచ్చేదిన్‌ అని చెప్పినప్పటికీ పరిస్ధితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి.అచ్చేదిన్‌ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినపుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది.కరోనాకు ముందు నాలుగుశాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధిరహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది.కరోనాలో జనాల పరిస్ధితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు.అయినా అసంతృప్తి.


కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ధ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్ధితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్ధితి ఇలా ఉంది. కీలకమైన సేవా రంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్‌ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్ధితి దిగజారుతుందని కెనడా సంస్ద చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్‌(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు.2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు.వాస్తవం ఏమిటి ? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్‌పిఆర్‌) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్ధితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్‌ఓ గణాంకపద్దతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్‌పిఆర్‌ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్‌ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్‌, ఎమెన్‌ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సిఎంఐఇ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్‌ఓ కాస్త ఉదారంగా లెక్కించింది తప్ప పరిస్ధితి దారుణంగా ఉందన్నది స్పష్టం.


కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం.2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్‌ కరోనా వైరస్‌ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.


గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జిడిపి వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే.2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్ధల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ,ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్ధకం, అంతకంటే తక్కువ విద్య,నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.


ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్ధల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్‌ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జిడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్ధితులకు అనుగుణంగా పధకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్దతులను ఎంచుకున్నారట.పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా ! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది.2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు.

మనకున్న యువశ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది.సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్ధికవ్యవస్ధ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జిడిపిని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి ? 2030నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది.వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు ? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందుకనుగుణంగా మార్చాలి, అదే ఎలా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

24 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Bharatiya Kisan Sangh (BKS), BJP, farm laws, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సైన్సు పరిశోధనలు : అవని చుట్టూ ఇతర జనం – ఆవు చుట్టూ మనం !

22 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Education, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

(R&D) expenditure -India, pseudo-scientific claims, research and development (R&D) expenditure


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

21 Tuesday Dec 2021

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Apruebo Dignidad, Chile Presidential Elections 2021, Gabriel Boric, Latin American left



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బీహార్‌ ప్రత్యేక హోదాపై బిజెపి, జెడియు రాజకీయం !

19 Sunday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar, Bihar Special status politics, JDU vs BJP, Narendra Modi, Nitish Kumar


ఎం కోటేశ్వరరావు


మధ్యలో 278 రోజులు మినహా పదిహేను సంవత్సరాలకు పైగా వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న జనతాదళ్‌(యు)-జెడియు నేత నితీష్‌ కుమార్‌ పదిహేనేండ్ల నాటి బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి ముందుకు తెచ్చారు. అలాంటి హోదాను వర్తింప చేసే అధికారం నీతి అయోగ్‌కు లేనప్పటికీ ఆ డిమాండ్‌ను పరిశీలిస్తాం అన్నట్లుగా ఆ సంస్ధ అధికారి చెప్పటం, మీడియా ప్రముఖంగా ప్రచారంలోకి తేవటంతో సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోణాల్లో (ఒక చోట నిజంగానే ఇస్తే -మరో చోట వత్తిడి చేస్తే ఇస్తారేమో అన్నట్లుగా) ఆసక్తి రేపింది.బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము మరింత లోతుగా, దగ్గరగా పరిశీలిస్తామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మూడు సాగు రైతు చట్టాలను వెనక్కు తీసుకొనేది లేదంటూ ఏడాదికి పైగా భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్న తీరు చూసిన తరువాత కాస్త వత్తిడి చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు దాన్ని వర్తింపచేసే చర్యలు తీసుకోవచ్చేమో అని ఆశపడిన వారు కూడా లేకపోలేదు. మా మోడీ కారణంగా అటు సూర్యుడు ఇటు పొడిస్తే పొడవవచ్చు గాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మాత్రం ఇచ్చేది కల్ల అన్నట్లుగా బిజెపి వ్యవహరించిన తీరు, పార్లమెంటులో కూడా ప్రకటించటాన్ని చూసిన తరువాత కూడా నితీష్‌ కుమార్‌ ఎందుకు ముందుకు తెచ్చారు అన్నది ఆసక్తి కలిగించే అంశం. నీతిఅయోగ్‌ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం దరిద్రంలో బీహార్‌ అగ్రస్ధానంలో ఉంది.


2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బిజెపిని బీహార్‌లో ఇరకాటంలో పెట్టాయి. రెండువందల నలభై మూడు స్దానాలున్న సభలో ఎన్‌డిఏ కూటమిలో 74 స్ధానాలతో బిజెపి పెద్ద పార్టీగా జెడియు 43 స్దానాలతో సరిపెట్టుకుంది. మరో రెండు పార్టీలతో కలుపుకొని కూటమికి వచ్చిన వచ్చిన మొత్తం సీట్లు 125కావటం, సంపూర్ణ మెజారిటీకి కేవలం మూడు సీట్లే ఎక్కువ. దాంతో బిజెపి అనివార్యంగా నితీష్‌ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అది పెద్దన్నగా మారింది. తాము చెప్పినట్లు వినాలని మాటి మాటికీ గుర్తు చేస్తోంది. రాష్ట్ర పేదరికం, వెనుకబాటుతనంతో ఉందనే పేరుతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు పైకి చెప్పుకోవచ్చుగానీ అది అతికే వాదన కాదు. బీహార్‌కు ఆ స్ధితి ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ అసంబద్దం అని బిజెపికి చెందిన ఉప ముఖ్యమంత్రి రేణు దేవి అన్నారు. హోదాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి సమస్య అర్ధంగాక పోయి ఉండాలి అని నితీష్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అర్హతల గురించి ఒకసారి చూద్దాం.జమ్ము-కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింతో సహా ఎనిమిది ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించి నిధుల కేటాయింపు, రాయితీలు వర్తింప చేస్తున్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినందున ఏ రాష్ట్రానికి అలాంటి హోదాను కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నది. నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించినప్పటికీ 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరస్కరించిన అంశం తెలిసిందే. కొండ ప్రాంతాలు, జనాభా సాంద్రత తక్కువగా ఉండటం, వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చాలని స్ధితి, విదేశీ సరిహద్దుల్లో ఉన్న పరిస్ధితి,ఆర్ధిక వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.విదేశీ సరిహద్దుల్లో ఉన్న స్ధితి అంటే వ్యూహాత్మకంగా కీలకంగా ఉందా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కేవలం విదేశీ సరిహద్దును మాత్రమే తీసుకుంటే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు నేపాల్‌తో సరిహద్దు ఉన్నప్పటికీ గతంలో హోదాను వర్తింప చేయలేదు. అలాంటి జాబితాలో ఉన్న రాష్ట్రాలకు కలిగే లబ్దిని చూద్దాం. విదేశీ సాయంతో, కేంద్ర ప్రత్యేక సాయం, సాగునీటి సంబంధిత ఏఐబిపి ప్రాజెక్టులకు 90శాతం, కేంద్ర ప్రత్యేక పధకాలకు నూరుశాతం నిధులు కేటాయిస్తారు.ఆ పదిశాతం నిధులు కూడా వడ్డీ లేని అప్పుల రూపంలో కేంద్రం ఇవ్వవచ్చు.ఇవిగాక కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఉంటాయి.అయితే నిధుల బదలాయింపు 42శాతానికి పెరిగిన తరువాత అన్ని రాష్ట్రాలకు అనేక కేంద్ర సహాయ పధకాలను రద్దు చేశారు.విదేశీ పధకాలను కూడా పరిమితం చేశారు. ఏఐబిపి పధకాలకు 2014-15లో రు.8,992 కోట్లు ఉన్న బడ్జెట్‌ను మరుసటి ఏడాది కేవలం వెయ్యికోట్లకు పరిమితం చేశారు. అసలు మొత్తంగానే అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించటం, కేంద్రవాటా తగ్గించటం వంటి పనులతో ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకున్నట్లయింది. ఇన్ని చేసినా పరిశ్రమలకు రాయితీల వంటివి ఉన్నందున ప్రత్యేక హోదా ఇంకా ఆకర్షణీయంగానే ఉంది. కొత్తగా ఇవ్వకపోయినా పాతవాటిని కొనసాగిస్తున్నారు.రాజ్యాంగపరంగా అలాంటి హౌదా కలిగిన రాష్ట్రాలు లేకున్నా గతంలో జాతీయ అభివృద్ధి మండలికి మంజూరు అధికారం ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలచుకుంటే ఇప్పటికైనా వర్తింప చేయవచ్చు.


నితీష్‌ కుమార్‌ ఎందుకు ఈ డిమాండ్‌ను ఇప్పుడు ముందుకు తెచ్చారనే ప్రశ్నపై భిన్న కోణాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల లబ్దికోసమే రైతుల డిమాండ్‌కు నరేంద్రమోడీ తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేశారు. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను బీహార్‌లో బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు కనుక ప్రత్యేక హౌదా కోరితే కనీసం కొంత మేరకు నిధులైనా రాకపోతాయా అన్న ఆలోచన కావచ్చు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీకి కొన్ని సీట్లలో మద్దతు కోసం వత్తిడి కావచ్చు.ఇన్నేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా ఎందుకుంచారో సంజాయిషి ఇవ్వాల్సిన పెద్దమనిషి (బిజెపికి సైతం వాటా ఉంది) ఆ ప్రశ్నను పక్కదారి పట్టించేందుకా లేక బిజెపితో సంబంధాలను తెంపుకోవాల్సి వస్తే ఏదో ఒక అంశం కావాలి గనుక ఆ జాబితాలో దీన్ని కూడా చేర్చారా అన్నది చెప్పలేము.గతేడాది అధికారానికి వచ్చినప్పటి నుంచి కలసి కాపురమే గానీ ఎవరి గది వారిదే అన్నట్లుగా బిజెపి-జెడియు మధ్య సంబంధాలున్నాయి.


అనేక అంశాలపై రెండు పార్టీల మధ్య విబేధాలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. వెనుకబడిన తరగతుల కుల గణన చేపట్టాలంటూ రెండు సార్లు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బిజెపి కూడా బలపరిచనప్పటికీ కేంద్రంలోని బిజెపి తిరస్కరించింది. అవసరమైతే తమ ఖర్చుతో రాష్ట్రంలో కులగణన చేస్తామని నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. 2011లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణన వివరాలను రాజకీయ కారణాలతో బయట పెట్టలేదు. బీహార్‌కు ప్రత్యేక హోదా అర్ధం లేదు, అవసరంలేదు అన్న బిజెపి ఉపముఖ్యమంత్రి రేణు దేవీకి ఏమీ తెల్వదు, ఆమెకు తరువాత నేను చెబుతా అని నితీష్‌ మాట్లాడారు. ప్రతి సంకీర్ణ కూటమిలో చిన్న చిన్న విభేదాలుంటాయి, అవి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవని ఒక బిజెపి మంత్రి అన్నారు. 2009లో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను మౌఖికంగా సమర్దించిన బిజెపి నేడు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది.నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, నేడున్నది తమ నరేంద్రమోడీ, అప్పుడు సంకీర్ణ కూటమిలో బిజెపి తోకపక్షం ఇప్పుడు జెడియు ఆ స్ధానంలో ఉంది కనుక ఈ వైఖరి అన్నది స్పష్టం.


హర్యానాలో మాదిరి బహిరంగ స్ధలాల్లో నమాజును నిషేధించాలని బిజెపి మంత్రులు, ఎంఎల్‌ఏలు నితీషకుమార్‌ను డిమాండ్‌ చేశారు. అలాంటి పని చేస్తే బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు, తమ మీద ఆ ప్రభావం పడుతుందని జెడియు నేతలు మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. బిజెపి నేతలు తాము అసలు సిసలు దేశభక్తులమని జనం ముందు కనిపించేందుకు తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే బిజెపికి చెందిన బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ జెడియుతో సంప్రదించకుండానే ఇటీవలి శీతాకాల సమావేశాల్లో జాతీయ గీతం ఆలపించాలని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధిశాఖకు జెడియు మంత్రి ఉన్నారు. ఆ శాఖలో ఒక ఇంజనీరు అవినీతి గురించి విచారణ జరపాలంటూ స్పీకర్‌ ఒక సభాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక కొత్త సంప్రదాయం కాగా ఆ కమిటీకి నితీష్‌ కుమార్‌ మీద ఒంటికాలుతో లేచే బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి నితీష్‌ మిశ్రాను నేతగా చేశారు.పార్లమెంట్‌లో బిజెపి బీహార్‌ ఎంపీ ఒకరు తమ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ రోడ్ల నిర్మాణ పధకం సక్రమంగా జరగటం లేదంటూ విమర్శకు దిగితే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నిజమే అంటూ లెక్కలను ప్రకటించారు. బీహార్‌లోనూ కేంద్రంలోనూ ఉన్నది ఎన్‌డిఏ ప్రభుత్వమే అని బిజెపి నేతలకు గుర్తున్నట్లు లేదంటూ జెడియు నేతలు ఎద్దేవా చేశారు. మగధ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ మీద నిధుల దుర్వినియోగ విచారణ నేపధ్యంలో విసిని తొలగించాలన్న ముఖ్యమంత్రి నితీష్‌ వినతిని గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఖాతరు చేయకపోవటంతో నితీష్‌ పరువు పోయింది.


నితీష్‌ కుమార్‌కు గతంలో ఉన్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు లేవని గతేడాది ఎన్నికల్లో తేలిపోయింది. అందువలన నితీష్‌ను బలపరచటం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువని బిజెపి నేతలు లెక్కలు వేసుకున్న కారణంగానే మంత్రులు, నేతలు తరచూ బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర నాయకత్వం అదేమీ తెలియనట్లు అమాయకత్వం నటిస్తోంది. రెండు పార్టీల నేతలూ అబ్బే మాలో విబేధాలేమీ లేవంటూ సమాధానాలిస్తున్నారు. తాజా అంశానికి వస్తే రాష్ట్రానికి కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులిస్తోందని బిజెపి మంత్రి జివేష్‌ మిశ్రా అంటే నిబంధనల ప్రకారమే ఇస్తోందని ఎక్కువ ఎలా ఇచ్చారో చూపాలని జెడియు మంత్రి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ సవాలు విసిరారు.


ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల విధానాన్ని ముందుకు తెచ్చిన బిజెపి సర్కార్‌ తీరును, లౌ జీహాద్‌ ప్రచారాన్ని జెడియు విమర్శించింది. 2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేడా తెలియని స్ధితి ఏర్పడిందని ఎన్నికలు ముగిసిన తరువాత 2021జనవరి పార్టీ సమావేశంలో నితీష్‌ కుమార్‌ పరోక్షంగా బిజెపిని తప్పుపట్టారు. మొత్తం ప్రచారంలో బిజెపి-ఎల్‌జెపి భాయి భాయి అని కేంద్రీకరించారని, తమ మీద పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జిపి కంటే బిజెపి వల్లనే ఎక్కువ సీట్లను కోల్పోయినట్లు జెడియు నేతలు వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన 15 మంది ఎల్‌జెపి తరఫున పోటీకి దిగిన అంశం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ పధకం కింద బీహార్‌లో కోటీ 46లక్షల గ్రామీణ మంచినీటి సరఫరా కనెక్షన్లను అందచేసినట్లు బిజెపి చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినవి 87శాతం ఉన్నందున ఆ ఖ్యాతి నితీష్‌ కుమార్‌కు దక్కాలని జెడియు తిప్పికొట్టింది.


బిజెపి తన సైద్దాంతిక అంశాలలో భాగంగా అది రామాలయ నిర్మాణం లేదా ఆర్టికల్‌ 370 రద్దు వంటివి చేపట్టి తన మద్దతుదార్లను కాపాడుకుంటోందని, తమది ప్రత్యేక పార్టీ తప్ప బిజెపి అనుబంధ సంస్ద కాదని జెడియు ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తోంది.
సంకీర్ణ కూటమిలో నాలుగేసి స్ధానాలున్న హిందుస్తానీ అవామీ పార్టీ(హామ్‌), వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి)కూడా బిజెపి మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒక ప్రయివేటు మదర్సాలో జరిగిన పేలుడును అవకాశంగా తీసుకొని మదర్సాలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలుగా మారాయంటూ, అన్ని మదర్సాలను మూసివేయాలని బిజెపి నేతలు చేసిన ప్రకటనలను హామ్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఖండించారు. దళితులు విద్యావంతులైతే నక్సలైట్లు, ముస్లింలు చదువుకుంటే ఉగ్రవాదులని చిత్రిస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారి మద్దతు పొందే ఎత్తుగడలో భాగం, ముస్లింలపై వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ఓటుబాంకును ఏర్పాటు చేసుకొనేందుకు కూడా బిజెపి పావులు కదుపుతోంది. దశాబ్దాల తరబడి ఏదో విధంగా అధికారంలో కొనసాగినప్పటికీ తాము పెద్దపార్టీగా ఎదగలేకపోయామని, ఇప్పటికైనా అందుకు పూనుకోవాలని వారు చెబుతున్నారు.దళితులు, బిసిలపై ముస్లింలు దాడులు చేస్తుంటే నితీష్‌ కుమార్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వంలో కొనసాగుతూనే బిజెపి నేతలు విమర్శలకు దిగుతున్నారు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియును చీల్చి ఆరుగురు ఎంఎల్‌ఏలను బిజెపి తనలో చేర్చుకున్నది. దానిపైజెడియునేతలు మండి పడ్డారు. తమ నేతను స్పీకర్‌గా, ఇద్దరిని ఉపముఖ్యమంత్రులుగా చేయాలని బిజెపి ఆదేశించినట్లుగా చెప్పటం తప్ప ముందుగా నితీష్‌ కుమార్‌తో కనీసం సంప్రదించలేదని అప్పుడే వార్తలు వచ్చాయి.హౌంమంత్రిత్వశాఖను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.బీహార్‌ రాజకీయాల్లో నితీష్‌ కుమార్‌ వేసినన్ని పిల్లి మొగ్గలు మరొకరు వేసి ఉండరేమో ! అటు ఆర్‌జెడి-ఇటు బిజెపిని రెండింటినీ ఉపయోగించుకొని పదవులు పొందారు. వాటికోసం నితీష్‌ కుమార్‌ ఏమైనా చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారు. నరేంద్రమోడీని 2014లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తేనున్నారని గ్రహించి 2013లో బిజెపితో 17 సంవత్సరాల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. మొరటు లేదా విభజించే లక్షణాలు లేని ఉన్నతమైన లౌకిక భావాలు కలిగిన వారే తమకు ఆమోదయోగ్యమని జెడియు అప్పుడు చేసిన తీర్మానంలో పేర్కొన్నది. తరువాత జరిగిన పరిణామాలేమిటో తెలిసిందే. అదే నరేంద్రమోడీతో కలసి పని చేస్తున్నారు. బిజెపితో కలసి ఉంటే కలదు సుఖం అనుకున్నన్ని రోజులు ఉంటారు. లేదనుకుంటే బయటకు వస్తారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బలాబలాల ప్రకారం ఇష్టం ఉన్నా లేకున్నా బిజెపి దయాదాక్షిణ్యంతో అధికారంతో కొనసాగటం లేదా బయటకు వచ్చి ఆర్‌జెడి సర్కార్‌కు మద్దతు ఇవ్వటం మినహా మరొక మార్గం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి 40కి గాను 39 స్ధానాలు వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సెప్టెంబరులోనే ప్రతిపక్ష ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ ఇండియా : 2014 నుంచి రోజుకు 200 స్వదేశీ, ఒక విదేశీ కంపెనీ మూత !

17 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

‘Make In India’progamme, BJP, Make In India, Modi 7 years rule, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
మేకిన్‌ ఇండియా పధకాన్ని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడచింది. ఈ కాలంలో అంటే 2014 సెప్టెంబరు 25 నుంచి 2021 డిసెంబరు ఒకటవ తేదీ వరకు 8,42,710 కొత్త కంపెనీలు నమోదైనట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు. పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి వాటికి నిలయంగా, ప్రపంచ ఎగుమతి ఎగుమతి కేంద్రంగా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యం. పోటీ పడాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే, అంతకంటే కావాల్సింది ఏముంది.పైన పేర్కొన్న కంపెనీలలో పని చేస్తున్నవి 7,82,026 అని కూడా మంత్రి వెల్లడించారు. సులభతర వాణిజ్యానికి అనువైనదిగా గుర్తించటమే అత్యంత ప్రధాన కారణం అని కూడా చెప్పారు.


చిత్రం ఏమిటంటే బిజెపి లేదా నరేంద్రమోడీ విజయ గాధల్లో ఈ కార్యక్రమం లేదా చొరవ లేదు. కొండంత రాగంతో ప్రారంభించి కీచుగొంతుతో ముగిస్తున్నారు. గుజరాత్‌ ఆదర్శ నమూనాను దేశమంతటా అమలు జరుపుతానన్నది నరేంద్రమోడీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. తరువాత మోడీ నోట ఆ మాటను ఎవరైనా విన్నారా ? ప్రపంచమంతటికీ నేను ఒక వినతి చేయదలచాను. రండి భారత్‌లో తయారు చేయండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అమ్ముకోండి గానీ తయారీ మాత్రం మాదగ్గరే జరగాలి అని నరేంద్రమోడీ చెప్పారు. తరువాత జరిగిందేమిటో చూశాము. ఇంతచేసినా 2019లో దేశ జిడిపిలో వస్తుతయారీ రంగ వాటా 20 ఏండ్ల నాటికంటే తక్కువగా నమోదైంది.తరువాత స్వయం సమృద్ధి గురించి చెప్పటం ప్రారంభించారు, కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గానాలాపాన తెలిసిందే. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు,కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేశారు. ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. కనుకనే వేగంగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి మూడు దశాబ్దాల తరువాత అర్ధం కావటం ప్రారంభమైంది. కరోనా కాలంలో జనానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాలేదుగానీ కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు కట్టపెట్టారు. మేడిన్‌ ఇండియాలు కార్యక్రమం జయప్రదం కావాలంటే సులభతర వాణిజ్య సూచికను మెరుగుపరిచేందుకు కేంద్రీకరించారు. ఐదు సంవత్సరాల్లో 79 పాయింట్లను మెరుగుపడినట్లు ప్రకటించారు.వీటితో ప్రపంచబాంకును సంతృప్తి పరచారు తప్ప పెట్టుబడిపెట్టేవారికి విశ్వాసం కల్పించలేకపోయారు.


మరోవైపు జరిగిందేమిటి ? 2021 మార్చి 31 నాటికి దేశంలో నమోదైన కంపెనీలు 21,51,349, వీటికి గాను మూతపడినవి 7,58,350, ఇవిగాక నిద్రావస్ధలో 2,266, రద్దు ప్రక్రియలో 6,893, దానికి ముందు దశలో 38,983 ఉన్నాయి. సాంకేతికంగా ఏ పేరు పెట్టినా ఇవన్నీ మూతపడేవే గనుక మొత్తంగా లెక్కిస్తే 8,06,809 ఉంటాయి. పార్లమెంటులో ప్రకటించిన మేరకు ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చినవి 8,42,710, ఏతావాతా వచ్చినవాటికి సమానంగా మూతపడినవీ ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే మూతపడలేదు, సంస్కరణల మాదిరే మూతల వేగం పెరిగింది.


తొలిసారి గద్దె నెక్కినపుడు దేశం కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు నరేంద్రమోడీ. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల సాధన, పోయిన ప్రతిష్టను పునరుద్దరించేందుకు అని చెప్పారు. నిజమే కామోసు అనుకున్నారు జనం. ఆ ఊసుల మేరకు విదేశీ కంపెనీలేమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా ? ప్రస్తుతం నమోదైనవి 4,979 వాటిలో పని చేస్తున్నవి 3,334. సులభతర వాణిజ్య సూచికలు మెరుగుపడిన తరువాత 2018 -2021 మధ్య దేశంలో కొత్తగా నమోదైన విదేశీ కంపెనీలు 320 అని 2021జూలైలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. 2014 నుంచి 2021నవంబరు వరకు 2,783 విదేశీ కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోయినట్లు వాణిజ, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పారు. మన దేశంలో పర్యవేక్షక లేదా బ్రాంచిఆఫీసులు లేదా ప్రాజెక్టు ఆఫీసులు కలిగిన విదేశీ కంపెనీల సంఖ్య 10,756. కొన్ని కంపెనీల ప్రాజక్టులు ముగిసిన తరువాత వెళ్లినవి, కొన్ని విలీనాలతో మూతపడినవి రకరకాల కారణాలు వెళ్లిపోయిన వాటి వెనుక ఉన్నాయి. ఆఫీసులు కలిగిన కంపెనీలన్నీ ఉత్పాదక లేక సేవలు అందిస్తున్నవి కాదు.


2013 డిసెంబరు 31నాటికి దేశంలో నమోదైన 13,69,362 కంపెనీల్లో 19శాతం 2,67,639 మూతపడినట్లు నాటి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సచిన్‌ పైలట్‌ లోక్‌సభలో చెప్పారు. పైన పేర్కొన్న వివరాల ప్రకారం 2021మార్చి 31 నాటికి అది 37.6శాతానికి పెరిగాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వం వద్ద నమోదైనప్పటికీ పన్నుల ఎగవేత, లాభాల తరలింపు వంటి అక్రమాలకు మాత్రమే పరిమితమైనవి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. వాటిని షెల్‌ లేదా సూట్‌కేస్‌ కంపెనీలని పిలుస్తున్నాము. నిజానికి చట్టంలో కంపెనీ అంటే కంపెనీ తప్ప సూట్‌కేస్‌ అని ఉండదు. పాలకులు తమ హయాంలో సాధించిన గొప్పల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు వీటిని కూడా కలుపుకొనే చెబుతారు. అనేక అక్రమాలు బయట పడిన తరువాత అలాంటి వాటిని గుర్తించి కంపెనీల జాబితా నుంచి తొలగిస్తామని మోడీ సర్కార్‌ హడావుడి చేసింది. ఆ మేరకు 2018-21కాలంలో 2,38,223 సంస్ధలను గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటన్నింటినీ రద్దు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి.యునిటెక్‌ గ్రూపు కంపెనీ 52 సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించినట్లు తాజాగా ఇడి వెల్లడించింది. వాటిలో డైరెక్టర్లుగా ఉన్న వారికి నెలకు పది, ఇరవై వేలు చెల్లిస్తూ అవసరమైనపుడు సంతకాల కోసమే పిలిపిస్తుంటారని కూడా తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి వందల కోట్ల నిధులను సూట్‌కేసు కంపెనీల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న కార్వి కంపెనీ సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి పాల్పడిన అక్రమాలపై విచారణ, అరెస్టుల గురించి తెలిసినదే. ఇంకా ఇలాంటివి ఎన్నోఉన్నాయి. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసేందుకు వాటిని దారి మళ్లించి, విదేశాలకు తరలించి కంపెనీలను దివాలా తీయించి మూతవేసేవి కూడా ఉన్నాయి. పాతవాటిని మూసివేసి కొత్త పరిశ్రమల పేరుతో రాయితీలు పొందేందుకు కొత్త కంపెనీల సృష్టి, ఒకేచోట జరిపే ఉత్పత్తిని వేర్వేరు కంపెనీల పేరుతో లెక్కలు చూపే సంగతి తెలిసిందే. తప్పుడు మార్గాల్లో విదేశాలకు నిధులు తరలించి మారిషస్‌ మరొక దేశం పేరుతో తిరిగి వాటినే పెట్టుబడులుగా పెడుతూ లబ్దిపొందేవారు కూడా ఉన్నారు.


ఏడున్నర సంవత్సరాల పాలనలో ఎగుమతులేమన్నా పెరిగాయా ? ప్రపంచబాంకు సమాచారం మేరకు 2013లో గరిష్టంగా మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతులు 25.43శాతం ఉండగా 2020నాటికి 18.07శాతానికి తగ్గాయి. 2013-14 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల వాటా వర్తమాన ధరల్లో 18.2 -24.77-57.03 శాతాల చొప్పున ఉంది. అదే కరోనాకు ముందు 2019-20లో 20.19-25.92-53.89శాతాల చొప్పున ఉంది. ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? విదేశీ పెట్టుబడులు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పేరుతో ఆర్భాటం తప్ప పెను మార్పులేదన్నది స్పష్టం. ఎగుమతి రంగంలో చూస్తే 2014లో 468-2018లో 538, 2020లో 474 బిలియన్‌ డాలర్ల మధ్య ఉన్నాయి.ఈ ఏడాది 400 బి.డాలర్లు అంటున్నారు.నరేంద్రమోడీ గారు చెప్పిన అచ్చేదిన్‌ కనుచూపుమేరలో కనిపించటం లేదు. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారిన తరువాత కరోనా వచ్చింది. తిరిగి ఎంత మేరకు వృద్ధి ఉంటుందో చెప్పలేము. ఏడేండ్లలో జరిగిందేమిటి ?


2013 డిసెంబరు 31నాటికి దేశంలో మూతపడిన కంపెనీలు 2,67,639 కాగా 2021 మార్చి 31నాటికి మూతపడినవి 7,81,987. అంటే ఏడు సంవత్సరాల మూడునెలల్లో కొత్తగా మూతపడినవి 5,14,348. సులభంగా అర్ధం కావాలంటే రోజుకు రెండువందల కంపెనీలు మూతపడ్డాయి. మేక్‌ ఇండియా ప్రకటన తేదీ నుంచి 2021డిసెంబరు ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు నెలల ఆరు రోజుల్లో నమోదైన కొత్త కంపెనీలు 8,42,710. అంటే రోజుకు 321 కొత్త కంపెనీలు నమోదు, మూతపడిన వాటిని తీసుకుంటే నిఖరంగా పెరిగినవి రోజుకు 121. మూతపడుతున్నవాటి కంటే కొత్త కంపెనీలే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పవచ్చు. ప్రపంచంలో దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధి కల్పన వనరుగా ఉంది. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించి వస్తూత్పత్తి చేస్తామని చెప్పారు. ఆశయం మంచిదేగానీ ఆచరణేలేదు. సేవారంగం మీద ఆధారపడ్డారు. వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్‌, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్‌ ఆవరిస్తున్నది. బాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు జరుపుకోవచ్చు, సేవలకు చెల్లింపులు జరపవచ్చు. ఇవన్నీ ఉపాధిని హరించేవే. అందువలన మన అవసరాలకు అనుగుణంగా వృద్ధి లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేని పాలకులు నాటు, కోత, ఇతర యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు, ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగిపోతోంది. అసలు మొత్తంగానే వృద్ది రేటు తగ్గింది. ఉన్నమేరకు చూసినా అది ఉపాధి రహిత వృద్ధి. మోడీ సర్కార్‌ డిజిటైజేషన్‌ గురించి తాజాగా కబుర్లు చెబుతోంది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తరుగుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బీజింగ్‌ ఒలింపిక్స్‌-అమెరికా కపట రాజకీయం!

15 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Sports, UK, USA

≈ Leave a comment

Tags

Beijing Olympics, US imperialism, US-Beijing Boycott, US’s diplomatic boycott


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: