• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: September 2022

చైనా నేత షీ జింపింగ్‌ నిర్బంధం వార్త : మీడియాను వెర్రి వెంగళప్పలను చేసిన ఫాలున్‌ గాంగ్‌ మహిళ !

28 Wednesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, cia, Coup Attempt in China, fake stories in media, Falun Gong, Jennifer Zeng, Propaganda War, RSS Duplicity, saffron trolls lies- facts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనా నేత షీ జింపింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు, అధికారాలన్నీ లాగేసుకున్నారంటూ మన దేశంలోని కొన్ని మీడిియా సంస్థలు, సామాజిక మాధ్యమంలోని కాషాయ మరుగుజ్జులు (ట్రోల్స్‌), వారిని గుడ్డిగా నమ్మే వారు చేసిన ప్రచారం వామపక్ష శ్రేణుల్లో అనేక మందిని గందరగోళానికి గురిచేసింది. ఈ వార్తలను చూసి అనేక మంది కమ్యూనిస్టు అభిమానులు ఆందోళన చెందారు. చైనా వ్యతిరేకులైతే ఇంకే ముంది జింపింగ్‌ శకం ముగిసింది, చైనా పతనం మన దేశానికి శుభసూచకం అంటూ సంబరపడ్డారు.సామాజిక, సంప్రదాయ మీడియా సంస్థలలో ఉన్న అలాంటి వారంతా వండి, వార్చి, వడ్డించిన దాన్ని తిన్నవారు పండగ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఉత్తిదే అని తేలటంతో వారంతా మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అసలీ వదంతి ఎలా పుట్టింది, మన దేశంలోని వారు వాటిని ఎందుకు భుజాన వేసుకున్నారు, వారి మానసిక స్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా ముందుకు వచ్చింది. వాట్సప్‌ పండితులు వండి వారుస్తున్న కుహనా వార్తలను ప్రధాన స్రవంతి మీడియా జనాలకు అందించటం ఒక ప్రధాన పరిణామంగా ఉన్నట్లు గత కొంత కాలంగా తెలుస్తున్నప్పటికీ ఈ ఉదంతం మరింతగా నిర్ధారించింది.


అసలే కోతి, దానికి పిచ్చి ఎక్కింది, దొరికిన కల్లుతాగింది,ఆపై నిప్పు తొక్కింది అన్న కథ తెలిసిందే. కొంత మందికి చైనా అంటే అసలే ద్వేషం, అందునా అక్కడి సోషలిస్టు వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ అంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. గాల్వన్‌ ఉదంతంతో మానసికంగా చికిత్సలేని వ్యాధికి గురైన వారికి అధ్యక్షుడు షీ జింపింగ్‌ గృహ నిర్బంధం, పదవి నుంచి తొలగింపు వార్తలంటే స్టెరాయిడ్స్‌ వంటివి. ఇంకేముంది అలాంటి వారంతా రెచ్చిపో యారు. ఇంతకీ వారికి వాటిని ఇచ్చిందెవరో తెలుసా ? ఉల్లాసయువతుల( ఛీర్‌ గరల్స్‌ ) పెద్దక్క లేదా అమెరికా సిఐఏ ఒళ్లో కూర్చుని చెప్పమన్న కబుర్లు చెప్పే జెన్నిఫర్‌ జెంగ్‌ అనే మహిళ.ఆమె చైనాలో అసంతృప్తవాదిగా మారి అమెరికా చేరుకొని అక్కడి నుంచి పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతోంది.ఆమెతో సహా అనేక మంది ఫాలున్‌ గాంగ్‌ (ధర్మ చక్రం ) పేరుతో ధ్యానంతో కొన్ని క్రీడలను ప్రచారం చేస్తున్నామనే పేరుతో తలెత్తిన కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా. చైనా ప్రభుత్వం తొలుత వారిని ఉపేక్షించినప్పటికీ వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించిన తరువాత కత్తెర వేసింది. దాని నేతతో సహా అందరూ ఇప్పుడు అమెరికాలో కొలువుదీరారు. వారి చెత్తను ప్రచారం చేసేందుకు ఎపోచ్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికను కూడా సిఐఏ ఏర్పాటు చేసింది. అదిగాక ఇతర పత్రికల్లో కూడా రాస్తుంటారు, స్వంతంగా దుకాణాలు కూడా తెరిచారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు సరేసరి. వారు సముద్రం ఉందన్న చోట ఎడారి తప్ప నీటి చుక్క కనిపించదు.


దేశభక్తి గురించి మన జనానికి ఎవరూ కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో తమ మాన ప్రాణాలను,సంపదలను తృణ ప్రాయంగా అర్పించిన వారు వేగుచుక్కలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక వైపు ఉంటే అసలు ఉద్యమంతో ఎలాంటి సంబంధాలు లేని, బ్రిటీష్‌ వారికి లొంగి ప్రేమలేఖలు రాసి తెరవెనుక పడి ఉంటామని చెప్పిన వారి వారసులు ఇప్పుడు జనాలకు దేశభక్తి గురించి బోధలు చేస్తున్నారు. వారికైనా ఎవరికైనా దేశభక్తి గురించి చెప్పే అర్హత లేదని ఎవరూ అనటం లేదు. అసలైన దేశభక్తులం మేమే, మేము చెప్పేదే సిసలైన దేశభక్తి అంటున్నందునే కాదన్నవారిది దేశద్రోహం అన్న దగ్గరే సమస్య మొదలౌతున్నది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.చైనాతో సరిహద్దు వివాదానికి బ్రిటీష్‌ వారు కారకులు, కాశ్మీరు సమస్యకు అమెరికా,బ్రిటన్‌, వారికి మద్దతు ఇస్తున్నదేశాలు బాధ్యులు. వాటి పరిష్కారం కంటే ఆ దేశాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని, వ్యతిరేకతను నూరిపోయటం, దాన్ని బుర్రల నిండా ఎక్కించుకోవటమే దేశభక్తి అని చెబుతున్నారు. తప్పన్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు.ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవారి మాదిరి సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే ఆ పేరుతో ఓట్లు దండుకోవచ్చని చూస్తున్నారు. పరిష్కారానికి పూనుకోవటం లేదు.


పశ్చిమ దేశాల్లో కూడా జనాలను చైనా వ్యతిరేక వార్తలతో అలరించినప్పటికీ మన దేశంలో మాదిరి జనాల్లో విద్వేషాన్ని ఎక్కించలేదు. రెండవది గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా ఫాలున్‌ గాంగ్‌ చెప్పే కబుర్ల బండారం ఏమిటో మనకంటే ఎక్కువగా వారికి తెలిసి ఉండటం కూడా షి జింపింగ్‌పై పుకార్ల గురించి సంయమనం పాటించటానికి కారణంగా కనిపిస్తున్నది. కాషాయ దళాలు ఒక పధకం ప్రకారం వివిధ సంస్థల్లోకి తమ భావజాలం ఉన్నవారిని పంపటమే గాక వాట్సాప్‌ ఉన్నవారి బుర్రలను చాలావరకు ఖరాబు చేశాయి. పిచ్చి మొక్కలు మొలిచేందుకు అనువైన వాతావరణం ఉంది గనుక షీ జింపింగ్‌ నిర్బంధం అనగానే దున్నఈనిందంటే దూడను కట్టివేయమన్నట్లుగా తాము అనుకుంటున్నదీ లేదా కోరుకుంటున్నది జరిగింది అనగానే వెనుకా ముందూ చూడకుండా ఎలాంటి నిర్ధారణలకు పూనుకోకుండా మీడియాలో ఉన్నవారు రెచ్చిపోయారు. తామే కాదు, తమ వార్తలను గుడ్డిగా నమ్మేవారిని కూడా వెర్రి వెంగళప్పలుగా మార్చివేశారు. ఇప్పటికే మీడియా సంస్థలు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటుండగా తాజా వార్తను పతాక శీర్షికలకు ఎక్కించి మరింత ప్రశ్నార్ధకంగా మార్చివేశారు,ప్రతిష్టను దిగజార్చారు.


ప్రపంచంలో కొందరు ప్రధానులు, అధ్యక్షుల మాదిరి కొత్త చొక్కాలు వేసుకొని ప్రతిరోజూ కెమెరాల ముందు చైనా నేతలు ఎప్పుడూ నిలవలేదు. ప్రతి రోజూ టీవీల్లో ఫోజులు కొట్టరు. షి జింపింగ్‌ కూడా అంతే. సామరకండ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన తరువాత కరోన జాగ్రత్తల్లో భాగంగా కొద్ది రోజులు కనిపించలేదు. అదే సమయంలో కొందరు ప్రముఖ మాజీల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావటం.ఆరుగురు మాజీ మంత్రులు లేదా ఉన్నతాధికారుల అవినీతి రుజువు కావటంతో ఇటీవలనే వారికి శిక్షలు వేశారు.వారు తిరుగుబాటుకు పూనుకున్నారని చిత్రించారు. గత కొద్ది నెలలుగా జింపింగ్‌ మీద కుట్ర, ప్రత్యర్ధులు సవాలు చేస్తున్నారు, జీరో కరోనా పేరుతో లాక్‌డౌన్లు విధించి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప దేశ ఆర్ధిక వృద్ధి పట్టలేదు వంటి అంశాలతో కుట్ర విశ్లేషణలను ఒక పధకం ప్రకారం రాస్తున్నవారు ఇప్పుడు చెబితే జనం కచ్చితంగా నమ్ముతారు అంటూ ఏకంగా జింపింగ్‌ను నిర్బంధించారని సృష్టించారు. చైనా గురించి రాసే నిపుణుడిగా పేరున్న మనోజ్‌ కేవల్‌రమణి ఈ తప్పుడు వార్త గురించి చెబుతూ ” భారత మీడియా దాన్ని అందిపుచ్చుకొని పరుగెత్తుతూ దాన్ని టాంటాం వేసింది. ఒక్క తూటా కూడా పేలకుండా ఇలాంటిది జరిగే అవకాశం ఉందని అనుకోవటం విడ్డూరంగా ఉంది. బీజింగ్‌ ఉత్తర కొరియా కాదు, అక్కడ విదేశీ విలేకర్లు జీవిస్తున్నారు. భారత్‌లో చైనా వ్యతిరేకత విశేషంగా ఉంది. అది లడఖ్‌లో రెండు దేశాలు ఘర్షణ పడక ముందునుంచీ ఉంది ” అన్నారు. ” భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ పుకార్లపై స్పందన వారు కోరుకుంటున్నదానికి ప్రతిబింబం, షీ జింపింగ్‌ను అరెస్టు చేశారు అన్న పుకారు షికారు చేసేందుకు కారణం బీజింగ్‌లో సున్నితమైన రాజకీయ కదలికలు ఉండటమే ” అని సింగపూర్‌లోని చైనా అంశాల నిపుణుడు డ్రా థాంప్సన్‌ చెప్పాడు. ” చైనా రాజకీయాలు బ్లాక్‌బాక్స్‌(విమానాల్లో జరిగేవాటిని రికార్డు చేసే ఒక పరికరం. విమానం మొత్తం ధ్వంసమైనా అది చెక్కుచెదరదు. దాన్ని విప్పిచూస్తే జరిగిందేమిటో తెలుస్తుంది) కంటే కఠినంగా ఉంటాయి . సామాజిక మాధ్యమంలోని పుకార్లను ధృవీకరించేందుకు ఈ రోజు బీజింగ్‌లో ఎలాంటి óఆధారం దొరకలేదు ” అని హిందూ పత్రిక బీజింగ్‌ విలేకరి అనంత కృష్ణన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం(23వ తేదీ) ప్రారంభమైన వదంతులు శనివారం నాటికి పతాకస్థాయికి చేరాయి. అమెరికాలో ఫాలున్‌ గాంగ్‌ పేరుతో తిష్టవేసిన చైనా అసంతృప్త జీవులు, సిఐఏ కిరాయి మనుషులు సృష్టించిన ఈ పుకారును వారు నడిపే ఎన్‌టిడిటివి అనే మీడియా వదిలింది, దాన్ని ట్విటర్‌, యు ట్యూబ్‌లో ఆ ముఠావారే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాన్ని మన దేశంలోని సామాజిక మాధ్యమంలోని చైనా వ్యతిరేకులు మరింత పెద్దగా వ్యాపింప చేశారు.చైనాలో ఈ ఏడాది లాక్‌డౌన్లు లేనపుడు మార్చి నెలలో రోజుకు ఆరువేల విమానాలు ఎగిరేవి, లాకడవున్ల కారణంగా తగ్గాయి .అలాంటిది బీజింగ్‌ గగనతల మీద రోజుకు 16వేలు ఎగురుతాయని వాటిలో తొమ్మిదివేలను రద్దు చేశారని ప్రచారం జరిగింది.చైనా నుంచి పారిపోయి జర్నలిస్టుగా చెప్పుకొనే ఝావో లాంజియాన్‌ అనే వాడు విమానాల రద్దు ఈ కథను అల్లాడు. ఆ మేరకు ఉపగ్రహాల చిత్రాలంటూ కొన్నింటిని చూపారు. అదంతా వట్టిదే అని తరువాత కొందరు స్పష్టం చేశారు. శనివారం నాడు అమెరికాలో స్థిరపడిన చైనా మహిళ జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేస్తూ బీజింగ్‌ వైపుకు కదులుతున్న 80కిలోమీటర్ల పొడవైన మిలిటరీ దళాల బారు అంటూ ఒక వీడియోను జత చేసింది. సంచలనం కోసం ఎదురు చూసే మీడియా దున్న ఈనిన దూడను మనకు చూపెట్టింది. మన దేశంలో జరిగిన ప్రచారాన్ని చూసి బీజింగ్‌లో ఉన్న డెర్‌ స్పీగల్‌ అనే జర్మన్‌ పత్రిక విలేకరి జార్జి ఫారియన్‌ ఒక సైకిల్‌ రిక్షాలో కూర్చున్న ఒక మహిళ, తియనన్‌మెన్‌ మైదానం దగ్గర ఉన్న కొందరు సందర్శకుల చిత్రాలను పోస్టు చేస్తూ వాటి కింద ” ఆశ సన్నగిల్లుతున్నది, కుట్రదారుల అదనపు బలాలు సాయుధశకటాల్లో వచ్చాయని ” అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్‌ను కొన్ని టీవీ ఛానళ్లు మరోరకంగా చెప్పాయి. చైనా మిలిటరీ రకరకాల వేషాల్లో రూపంలో ఉంటుందన్నాయి .

అధికారాలన్నీ లాగేసుకొని వేరేవారికి అప్పగించారంటూ వచ్చిన ఆధారం లేని వార్తలను సరి చూసుకోకుండా రెచ్చిపోయిన వారు అది అవాస్తవం అని తేలిన తరువాత ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కొందరు తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మూసుకుంటే, కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ఉత్తిదే అని ప్రశ్నార్ధకమిచ్చిన వారు కొందరు. సిద్దాంతం పట్ల స్థిరత్వం లేని వారు, అవినీతి అక్రమాల పట్ల చూసీ చూడనట్లు ఉన్నవారు, ప్రధాన అంశాల మీద స్పష్టత లేని వారిని అక్టోబరు 16 నుంచి జరగనున్న కమ్యూనిస్టు పార్టీ మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకోలేదని వార్తలు. ఈ సభకు ఎన్నికైన మొత్తం ప్రతినిధులు 2,296 కాగా వారిలో లడఖ్‌ సరిహద్దులలో పని చేస్తున్న 13 మందితో సహా పిఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌కు చెందిన 30 మంది మిలిటరీ అధికారులు, ఇతర కమాండ్‌ల నుంచి మొత్తంగా మిలిటరీ నుంచి 304 మంది ఎన్నికైనట్లు వచ్చిన వార్తలు. పుకార్ల గురించి ప్రస్తావించకుండా చైనాలో ఎలాంటి పరిణామాలూ జరగలేదని అర్ధం వచ్చేలా వాటికి తెరదించుతూ షీ జింపింగ్‌ నేతృత్వంలోని పార్టీ మార్గదర్శకాల మేరకు ఎన్నికైన ప్రతినిధులందరూ పార్టీ మహాసభకు సిద్దమౌతున్నారంటూ కమ్యూనిస్టు పార్టీ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పాపాయి విల విల – డాలరు నిల్వలు వెల వెల ! నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి!!

25 Sunday Sep 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు


చైనాను వెనక్కు నెట్టి అమెరికాతో పోటీ పడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోగల సమర్ధుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. దాని వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా వారి మనోభావాలను గౌరవిద్దాం, అదే సమయంలో ప్రపంచం, దేశంలో జరుగుతున్నదాన్ని గురించి కూడా చెప్పుకుందాం. వారు వింటారా లేదా అన్నది వారికే వదలివేద్దాం. శుక్రవారం నాడు (2022 సెప్టెంబరు 23) ప్రధాని నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. లండన్‌లోని ఎక్సేంజ్‌ రేట్స్‌ . ఓఆర్‌జి.యుకె సమాచారం ప్రకారం శుక్రవారం నాడు మన దేశంలో రాత్రి ఎనిమిది గంటలు, లండన్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలపుడు డాలరుకు రూపాయి విలువ రు.81.4101గా ఉంది.( అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం రేట్లు మారుతూ ఉంటాయి .) సహజంగా ఏ దేశంలో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం-ముగింపు సమయాల్లో ఎంత ఉంటుందో ఆ రోజుకు ముగింపు విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మన దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రు.81.11 ఉంది. అంతకు ముందు 81.23కు పతనమైంది. శనివారం నాడు లండన్‌లో తెల్లవారు ఝామున 3.20కి (మన దగ్గర 7.50) రు.81.2485 దగ్గర ఉంది. రానున్న మూడు నాలుగు నెలల్లో అది రు.82- 83 మధ్య ఉంటుందని, తరువాత 85-86కు దిగజారవచ్చని కొందరి అంచనా.

తరలిపోతున్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు నిలిచినా, తిరిగి వచ్చినా రు.81-82 దగ్గర స్థిరపడవచ్చని, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మిగిలిన రోజుల్లో 79-83 మధ్య ఉండవచ్చని, పరిపరి విధాల ఎవరి జోశ్యం వారిది. ఎవరు చెప్పినా 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పిన రు.38-48కి పెరగటం గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. ఆర్‌బిఐ ఇప్పటికే రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్‌బిఐ 80బి.డాలర్లను విక్రయి ంచిందని, రూపాయి పతనమైతే దాన్ని వదలివేయటం తప్ప ఆర్‌బిఐకి మరొక మార్గం లేదని కొందరు చెబుతున్నారు. గత ఏడు నెలల కాలంలో గురువారం నాడు ఒక్కరోజే 83పైసలు పతనమైంది. ఎవరేం చెప్పినప్పటికీ ప్రపంచీకరణతో బంధం వేసుకున్నందున మన చేతుల్లో అనేక అంశాలు ఉండవు. ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పినా అయితే లేదా కాకుంటే అన్న జాగ్రత్తలతో చెప్పేవే తప్ప మరొకటి కాదు. కొద్ది వారాలుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినందున కొంత మేర ఒకవైపు ఊరట కలుగుతున్నది.మరోవైపు కరెన్సీ విలువ పతనంతో హరించుకుపోతున్నది.


ఆర్‌బిఐ శుక్రవారం నాడు విడుదల చేసిన సమాచారం ప్రకారం గత ఏడు వారాలుగా వరుసగా మన విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోతూ సెప్టెంబరు 16 నాటికి 545.652 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.2020 అక్టోబరు రెండవ తేదీ తరువాత ఇంత తక్కువగా ఎన్నడూ లేవు. తగ్గటానికి కరెన్సీ మారకపు విలువలో మార్పులు కొంత మేరకు కారణం కాగా రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కొందరి అభిప్రాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నెలలో రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ 35 బి.డాలర్లను, ఈ మొత్తంలో జూలై నెలలో 19బి.డాలర్లను విక్రయించింది. సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఒక్క రోజే రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు వార్తలు. 2021 సెప్టెంబరు మూడవ తేదీన 642.45బి.డాలర్లు మన దగ్గర ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లటం, మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరగటంతో పాటు మన కరెన్సీ విలువ తగ్గినందువలన కూడా డాలరు నిల్వ కరిగిపోతున్నది.


ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రూపాయికి ఏం జరిగితే అది జరుగుతుందని(పాత సినిమాల్లో డాక్టర్లు ఇక ఆ దేవుడిదే భారం అన్నట్లు) వదలి పెట్టటం తప్ప అక్టోబరు-మార్చి నెలల్లో ఆర్‌బిఐ అరకొర తప్ప తీసుకొనే పెద్ద రక్షణ చర్య లేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న జోక్యం ఫలితాలనివ్వలేదని పతన తీరు సూచిస్తున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెబుతున్న మొత్తంలో అన్నీ డాలర్లే ఉండవు. ఆర్‌బిఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్న 545.652 బిలియన్‌ డాలర్లలో నగదు 484.901 బి.డాలర్లు కాగా బంగారం రూపంలో 38.186, ఎస్‌డిఆర్లు 17.686, ఐఎంఎఫ్‌ వద్ద 4.880బి.డాలర్లు ఉన్నాయి . ప్రస్తుతం దిగుమతులు-ఎగుమతుల అంతరం పెరిగి జిడిపిలో 4శాతానికి కరెంటు ఖాతాలోటు పెరిగినా మొత్తం నిల్వలు 510 బి.డాలర్లకు తగ్గవచ్చని, 2013 మే నెలలో ఉన్న 300 బి.డాలర్లతో పోలిస్తే పరిస్థితి మెరుగేనని కొందరి అభిప్రాయం. పది సంవత్సరాల క్రిందట ఆ నిల్వలు 4.1నెలల దిగుమతులకు సరిపోగా ఇప్పుడున్న నిల్వలు 8.9 నెలలకు వస్తాయని అంచనా. రూపాయి విలువ పతనమైతే మన దేశం నుంచి డాలర్లు వెలుపలికి పోతే విదేశాల్లో ఉన్న మన జాతీయులు డాలర్లను మన దేశానికి పంపుతారు. వాటికి గతం కంటే ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను క్రమంగా తగ్గించటమే తప్ప స్థిరంగా ఉంటుందని ఏ సంస్థా చెప్పటం లేదు. ప్రస్తుతం ఏడు శాతంగా చెబుతున్నారు, వచ్చే ఏడాది 6.4శాతానికి తగ్గుతుందని అంచనా. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను ఇంకా పెంచనుందనే వార్తల పూర్వరంగంలో వృద్ధి రేటు ఇంకా తగ్గేందుకే అవకాశం ఉంది. డాలరు రేటు పెరిగింది తప్ప మన కరెన్సీ విలువ తగ్గలేదని కొందరు వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద అమెరికా కూటమి దేశాలు అనేక ఆంక్షలు విధించినా దాని కరెన్సీ రూబుల్‌ విలువ పెరిగింది. మన జిడిపి ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంటే దాని జిడిపి పదకొండవదిగా ఉంది. అలాంటపుడు మన కరెన్సీ విలువ ఎందుకు పెరగలేదు ? జపాన్‌ ఎన్‌ విలువ పెరిగింది, దక్షిణ కొరియా కరెన్సీ వన్‌ పెరిగింది. అందువలన పతనమైన వాటితో చూపి మనదీ అలాగే ఉందని చెబుతామా, మెరుగ్గా ఉన్నవాటితో పోల్చుకుంటామా ? మనకు పతనం కావటమా, పెరగటమా ఏది లాభం. దిగుమతులు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మందికి పెరగటం లాభం. ఎగుమతులు తక్కువగా ఉన్నందున కొందరికి తగ్గటం లాభం.


మన కరెన్సీతో దిగుమతులు చేసుకొనేందుకు కొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.దీంతో డాలర్లకు గిరాకీ తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప మనకు కలిగే లబ్ది ఏముంటుంది. ఏ దేశమైనా డాలరుతో పోల్చి దాని బదులు దాని విలువకు సమానమైన రూపాయలు అడుగుతుంది తప్ప రోజు రోజుకు దిగజారుతున్న మన కరెన్సీని స్థిర విలువకు ఎవరూ అంగీకరించరు. మనం ఇతర దేశాల కరెన్సీ తీసుకున్నప్పటికీ ప్రాతిపదిక అదే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు గనుక అక్కడ పెట్టుబడులు పెట్టినా లేదా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినా మదుపుదార్లకు లాభం కనుక ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా చేరుతున్నాయి. వడ్డీ రేటు తగ్గితే అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే దేశాలకు తిరిగి దారిపడతాయి . మన ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచటం వెనుక మతలబు ఇదే. అయి తే అది మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు, రుణాలు తీసుకొని ఇండ్లు, వాహనాలు కొనుగోలు చేసిన వారి మీద అదనపు భారం మోపుతుంది. డాలర్లు కొని విదేశాల్లో చదువుకొనే వారికి, టూర్లకు వెళ్లే వారికి భారం పెరుగుతుంది. మంచి పనితీరును కనపరచిన ఎనిమిది కరెన్సీలలో మనది ఒకటని విశ్లేషణలు వెల్లడించాయి.దాన్ని పట్టుకొని మన సామర్ధ్యానికి భంగం కలగలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. నిజం కావచ్చు, దాని వలన మనకు ఒరిగేదేమిటి ? కేసుపోతేనేం గానీ మన ప్లీడరు భలేవాదించాడు అన్నట్లుగా ఉంది.


ప్రపంచంలో తమ వద్ద డిపాజిట్‌ చేసిన మదుపుదార్లకు బాంకులు వడ్డీ చెల్లించటం తెలిసిందే. కానీ ఐదు దేశాల్లోని బాంకులు తమ వద్ద డబ్బుదాచుకున్న వారి నుంచి ఎదురు వడ్డీ వసూలు చేస్తున్నాయి, వినటానికి చిత్రంగా ఉన్న అది నిజం. పెట్టుబడిదారులు ఏది చేసినా తమ లాభాలకే అన్నది గ్రహిస్తే ఇది కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. బహిరంగ మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల కంటే మన దేశంలో బాంకుల వడ్డీ రేటు తక్కువ. పెట్టుబడిదార్లకు చవకగా రుణాలు కావాలంటే బాంకులు కావాలి. వాటి దగ్గర డిపాజిట్లు ఉండాలి కనుక మన బాంకులు డిమాండ్‌ను బట్టి వడ్డీ రేట్లను ఖరారు చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు అక్కడి వారికి లబ్ది చేకూర్చేందుకే. వడ్డీ తక్కువ ఉంటే వారి వస్తువుల తయారీ ఖర్చు తక్కువగా ఉండి ప్రపంచ మార్కెట్లో పోటీ పడవచ్చు.ఐదు దేశాల బాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారే అవి నిర్ణయించిన మేరకు ఎదురు వడ్డీ చెల్లించాలి. డబ్బు వచ్చేకొద్దీ అవి కూడా రేట్లు మారుస్తూ ఉంటాయి. ఎదురు వడ్డీ స్విడ్జర్లాండ్‌లో 0.75, డెన్మార్క్‌ 0.60, జపాన్‌ 0.1, స్వీడన్‌ 0.25, స్పెయిన్‌0.0 శాతం ఉంది. అనేక ఐరోపా ధనిక దేశాల్లో వడ్డీ రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఇలా ఎందుకు అంటే పొదుపు వద్దు- ఖర్చే ముద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా కార్పొరేట్ల వస్తువులు, సేవలకు గిరాకీ ఉండేది, లాభాలు వచ్చేది. జపాన్‌లో ఎలాంటి వడ్డీ లేకుండా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, బాంకులు రుణాలు ఇస్తాయి. డాలరు దెబ్బకు జపాన్‌ ఎన్‌ కూడా ప్రభావితమైంది. దాంతో 1998 తరువాత తొలిసారిగా గతవారంలో జపాన్‌ రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగి తమ కరెన్సీ విలువ పడిపోకుండా, పెరిగేందుకు జోక్యం చేసుకుంది.2011లో ఎన్‌ విలువ పెరగటంతో తగ్గేందుకు లేదా స్థిరంగా ఉండేందుకు చూసింది. ఎగుడు దిగుడులు సహజం, ఇబ్బందులు, పతనాలు తాత్కాలికం అంటూ కొందరి నోట ఉపశమనాలు వినిపిస్తున్నాయి , మంచిదే అంతకంటే కావాల్సింది ఏముంది ? అందుకోసం సమర్ధుడైన నరేంద్రమోడీ చేస్తున్నదేమిటి అన్నదే ప్రశ్న.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వద్దకు కేరళ గవర్నర్‌ : పదవి గౌరవాన్ని మంటకలిపిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ! అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !!

21 Wednesday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Kerala BJP, Kerala Governor Arif Mohammed Khan, Kerala LDF, Pinarai Vijayan, RSS



ఎం కోటేశ్వరరావు


తన ఆహ్వానాన్ని మన్నించి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి రాలేదని, తనను కలవటం లేదని, ప్రోటోకాల్‌ మర్యాదలను మంట గలుపుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళశై వాపోవటం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి, ఆమె రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చారనే విమర్శలకు గురైన అంశం తెలిసినదే. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మరొక అడుగు ముందుకు వేసి స్వయంగా ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను 2022 సెప్టెంబరు 17న ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. అంతే కాదు, మరీ ఎక్కువ మాట్లాడితో మరోసారి వెళ్లి కలుస్తా, నా ఇష్టం అంటూ చిందులు వేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే త్రిసూర్‌లో పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గవర్నర్‌ కలిసినట్లు అధికారులు చెప్పారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. తరువాత గవర్నర్‌ విలేకర్లతో మాట్లాడుతూ 2019లో కన్నూరులో తనపై దాడికి యత్నించినవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని గవర్నర్‌ ఆరోపించారు.


రాజభవన్‌ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్‌ రాజభవన్లో నాటి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను కలిశారు. వేరే చోట కలిసిన కేరళ గవర్నర్‌ సోమవారం నాడు(19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకోవటమే కాదు, మోహన్‌ భగవత్‌ రాష్ట్రానికి వస్తే మరోసారి వెళ్లి కలుస్తా అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్‌ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్‌ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారు అనేక రాజభవన్ల పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురుదాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు. సిపిఎం హింసాత్మక భావజాలంతో పని చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గవర్నర్‌ చెప్పుకున్నారు. వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర కూడా ఉందని విలేకర్లు చెప్పగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ అధికారంలో లేదు, ప్రభుత్వం అలాంటి హింసాకాండను అదుపులో పెట్టాలి అన్నారు.


ఈ పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని కూడా వద్దంటారు : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై పినరయి విజయన్‌


కమ్యూనిజం విదేశీ సిద్దాంతమంటున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్‌ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిపరుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీ, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు గవర్నర్‌ విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.దాన్ని ప్రస్తావించిన విజయన్‌ ఇటలీలోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం, క్రైస్తవం, ముస్లిం వ్యతిరేకతను హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ రోజు కమ్యూనిజం విదేశీ అంటున్న గవర్నర్‌ రేపు ప్రజాస్వామ్యం కూడా అలాంటిదే వద్దంటారని ధ్వజమెత్తారు.


గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసన ప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది.చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ(సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్రనిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్‌ వాదులాటకు దిగారు.ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్‌ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్‌ విలేకర్లకు అందచేశారు.


ఆ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రాగేష్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం,భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు.ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్‌ రవీంద్రన్‌ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్‌ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్‌ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్‌ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్‌ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయరోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్‌ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్‌ హబీబ్‌ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు.అయితే దాన్ని చూసినపుడు గవర్నర్‌ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది.మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్‌ హబీబ్‌ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్‌ ఆరోపణలు పసలేని, కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ఆ సభలో సంబంధం లేని అంశాలను గవర్నర్‌ మాట్లాడతారని ఎవరికైనా ముందుగా ఎలా తెలుస్తుంది. ఈ పత్రికా గోష్టిలోనే గవర్నర్‌ కమ్యూనిజం మీద, పాలకపార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.


వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్‌ అదే చేశారు.అసెంబ్లీ ఆమోదించిన పదకొండింటికి గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్‌ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.


కాంగ్రెస్‌ జోడో యాత్రలో సావర్కర్‌ చిత్రం !
తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి లొంగి వారి సేవ చేసుకుంటానంటూ లేఖలు రాసి జైలు నుంచి బయపడిన వివాదాస్పద హిందూత్వ నేత విడిసావర్కర్‌ చిత్రాన్ని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల సరసన బానర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ నిర్వాకం కేరళలో జరిగింది.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం నాడు ఎర్నాకుళం జిల్లా ఆలువలో ప్రవేశించినపుడు ఏర్పాటు చేసిన బానర్లలో ఇది ఒకటి. ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌ నేతలు సావర్కర్‌ బొమ్మ మీద మహాత్మా గాంధీ చిత్రాన్ని అంటించారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగింది. దీనికి చెంగన్మాడ్‌ నియోజకవర్గ ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సురేష్‌ కారకుడంటూ అతడిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌కు లేదా జోడో యాత్ర నిర్వాహకులకు సంబంధం లేదని, స్థానిక కార్యకర్తలు చేసినపని అని కాంగ్రెస్‌ సంజాయి షి చెప్పుకుంది.


అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !
ఆదివాసి గోత్ర మహాసభ నేతగా కేరళలో ప్రాచుర్యం పొందిన సికె జాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బిజెపి కూటమిలోకి వచ్చేందుకు గాను లంచం ఇచ్చిన కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అడ్డంగా దొరికారు. జనాధిపత్య రాష్ట్రీయ సభ పేరుతో 2016లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ పేరుతో బిజెపితో కలసి పోటీ చేసింది.ఎన్‌డిఏ నుంచి విడిపోతున్నట్లు 2018లో ప్రకటించింది. తిరిగి 2021 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేయాలని కోరిన బిజెపి ఆమెకు డబ్బు ఇచ్చింది. మంతన్‌వాడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తొలి విడతగా పది లక్షలు ఇచ్చారు. ఫోన్లో మాట్లాడారు. మరో పాతిక లక్షలు ఇస్తానని చెప్పారు. ఈ అంశాన్ని జాను సహచరిగా ఉన్న ప్రసీత చెప్పటమే గాక ఆధారంగా ఫోన్‌ సంభాషణ రికార్డులను వెల్లడించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సురేంద్రన్‌, ఇతరుల గళాలను రికార్డు చేసి ఫోరెన్‌సిక్‌ లాబ్‌ పరీక్షకు పంపారు. బుధవారం నాడు వెలువడిన పరీక్ష నివేదికలో ప్రసీత విడుదల చేసిన రికార్డుల్లో ఉన్న గళం సురేంద్రన్‌ గళం ఒక్కటే అని నిర్ధారణైంది. ఇప్పుడు పోలీసులు చార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉంది. సురేంద్రన్‌పై మరొక అవినీతి కేసు ఉంది. 2016 ఎన్నికల్లో మంజేశ్వరమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిఎస్‌పి తరఫున కె సుంద్ర పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఒకే విధంగా ఉండటంతో తనకు పడాల్సిన ఓట్లు సుంద్రకు పడి తాను ఓడినట్లు బిజెపి నేత భావించారు.తిరిగి 2021 ఎన్నికల్లో కె సుంద్ర పోటీకి దిగారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటే కొంత డబ్బుతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇల్లు, ఒక వైన్‌ షాపు ఇప్పిస్తానని బిజెపి నేత ప్రలోభపెట్టారు. ఆ ఎన్నికల్లో 1,143 ఓట్ల తేడాతో ఓడారు. తనకు కేవలం రెండున్నర లక్షల నగదు, పదిహేను వేల విలువ గల సెల్‌ ఫోన్‌ మాత్రమే ఇచ్చారని, వాగ్దానం మేరకు ఇతరంగా ఏమీ ఇవ్వలేదని కె సుంద్ర వెల్లడించాయి .దాంతో పోలీసులు అవినీతితో పాటు ఎస్‌సి,ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

షాంఘై సహకార సంస్థ భేటీ : ఉక్రెయిన్‌పై చైనా వైఖరి కూడా మారితే మోడీతో షీ జింపింగ్‌ను కలిపి అమెరికా మీడియా ఎందుకు పొగడలేదు ?

21 Wednesday Sep 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, US Media, US Media Praises PM Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాను సంతుష్టీకరించిన నరేంద్రమోడీ ! అందుకే అక్కడి మీడియా పొగడ్తలా !!

18 Sunday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, Ukraine-Russia crisis, US Media Praises PM Modi, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికన్‌ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్‌ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీ-రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విడిగా భేటీ అయ్యారు.


సదరు భేటీలో ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్‌ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్‌ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వం-జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.


” అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్‌, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చర్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్‌ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్‌ టైమ్స్‌, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్‌ ట్రిబ్యూన్‌, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్‌ వంటి పత్రికలు విమర్శించాయి. పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శలు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.


మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది. అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్‌ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.
ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 2017-18 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్‌, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్‌, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్‌ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్‌ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధైర్యవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్‌ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అందువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాకు మన భూమి అప్పగించారంటున్న సుబ్రమణ్యస్వామి – బిజెపి వ్యూహాత్మక మౌనం ! నిజమేమిటి !!

15 Thursday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Gogra-Hot Springs, Ladakh border clash, Ladakh Pullback, Ladakh stand off, Narendra Modi Failures, Rahul gandhi, RSS, Shanghai Cooperation Organisation, Subramanian Swamy, winter palace

ఎం కోటేశ్వరరావు


” భారత్‌ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ ” అనే శీర్షికతో డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో ఈ వార్తను ఇచ్చాయి. లడఖ్‌ సరిహద్దులోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ లేదా పెట్రోలింగ్‌ పాయింట్‌-15(పిపి15) ప్రాంతంతో పాటు పిపి-16 నుంచి రెండు వైపుల చైనా-భారత్‌ మిలిటరీని ఉపసంహరించుకున్నాయి. అంగీకృత ప్రాంతంలోని తాత్కాలిక కట్టడాలు, మిలిటరీ మౌలిక సదుపాయాలను తొలగించారా లేదా అని మిలిటరీ సంయుక్త బృందాలు ఈ మేరకు తనిఖీ పూర్తి చేసినట్లు వార్తలు రాగా అధికారికంగా మన దేశం నిర్ధారించలేదు. ఒప్పందం ప్రకారం రెండు పక్షాలు ఇప్పటి వరకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి సమానదూరం వెనక్కు తగ్గాలి. ఆ ప్రాంతాలలో మిలిటరీ ఉండకూడదు. దానికి వెలుపల ఉండవచ్చు. గతంలో గాల్వన్‌ లోయ నుంచి 2020జూన్‌లో, పాంగాంగ్‌ సో సరస్సు ఉత్తర గట్టు నుంచి 2021 ఫిబ్రవరిలో, ఆగస్టులో గోగ్రా పోస్టు నుంచి ఉపసంహరించుకోవటంతో పాటు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి)కు ఇరువైపులా ఎలాంటి తనిఖీలు లేని ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.


తాజా ఉపసంహరణ గురించి చుషుల్‌ నుంచి లడఖ్‌ స్వయంపాలిత కాండ ప్రాంతాల అభివృద్ధి మండలి(ఎల్‌ఏహెచ్‌డిసి)కి ఎన్నికైన సభ్యుడు కాంచోక్‌ స్టాంజిన్‌ అసమ్మతిని వెల్లడించారు. మంగళవారం నాడు డెక్కన్‌ హెరాల్డ్‌ ప్రతినిధితో మాట్లాడుతూ రెండు మిలిటరీ దళాలు మోహరించిన పిపి-15 నుంచే గాక పిపి-16 నుంచి కరమ్‌ సింగ్‌ కొండవరకు మన ప్రాంతాన్ని తనిఖీలు లేని బఫర్‌ జోన్‌గా మన దేశం అంగీకరించిందని ఆరోపించారు. దశాబ్దాల తరబడి పిపి-16 వద్ద ఉన్న శాశ్వత పోస్టును ఎత్తివేసేందుకు మన దేశం అంగీకరించిందని, దాంతో స్థానికులు పశువులను మేపుకొనే క్రుగాంగ్‌ లోయను వివాదాస్పద ప్రాంతంగా అంగీకరించిందని, స్థానికుల అభిప్రాయాలను ఎవరు పట్టించుకుంటారని నిర్వేదాన్ని వెల్లడించారు. తాజా పరిణామాలపై బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ట్విటర్‌లో స్పందించారు.” వాస్తవాధీన రేఖ వెంబడి రెండు వైపులా చైనా-భారత్‌ మిలిటరీ ఉపసంహరణ జరిగిందని మోడీ ప్రభుత్వ ప్రకటనను ఉటంకిస్తూ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చైనీయులు నవ్వుతున్నారు. నిజం ఏమంటే, భారత్‌ వైపు ప్రాంతం నుంచి చైనా, భారత ప్రాంతం నుంచి భారత్‌ ఉపసంహరించుకుంది. ” మాది ఏదైతే ఉందో అది మాదే, మీది ఏదైతే ఉందో అది కూడా మాదే ” అని దీని అర్ధంగా చైనా చెబుతోందని” పేర్కొన్నారు. తమ పార్టీ ప్రముఖుడే ఆరోపించినందున కేంద్ర ప్రభుత్వం, బిజెపి దీని మీద స్పందించి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. వాస్తవాలకు భిన్నంగా స్వామి ప్రకటనలు, ప్రచారం ఉన్నట్లయితే తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు స్వామి మీద చర్య తీసుకుంటుందా ?


గాల్వన్‌ వివాదం గురించి గతేడాది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు స్వామి అడిగిన ప్రశ్నను స్వీకరించేందుకు రాజ్యసభ ఆఫీసు తిరస్కరించింది. లడఖ్‌లో వాస్తవాధీన రేఖను చైనా అతిక్రమించిందా అన్న స్వామి ప్రశ్నలో సున్నితమైన సమస్యలు ఇమిడి ఉన్నందున సంబంధిత మంత్రిత్వశాఖ సిఫార్సు మేరకు సదరు ప్రశ్నను అంగీకరించటం లేదని పేర్కొన్నారు. గాల్వన్‌ ఉదంతం తరువాత ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ ఎవరూ మన ప్రాంతంలోకి ప్రవేశించలేదు, ఆక్రమించలేదు అని ప్రకటించారు. జాతీయ ప్రయోజనాల రీత్యా తన ప్రశ్నను ఆమోదించటం లేదని రాజ్యసభ సచివాలయం చెప్పటం విషాదం గాకపోతే హాస్యాస్పదం అని స్వామి స్పందించారు. తైవాన్‌, టిబెట్‌ ప్రాంతాలు చైనావే అని అంగీకరించటం నెహ్రూ, వాజ్‌పాయి తెలివి తక్కువ తనమని వారి కారణంగానే మనం జనం కూడా ఆమోదించారన్నారు.లడఖ్‌లో చైనా అక్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్లు నరేంద్రమోడీ చెప్పటం లేదని కూడా కొద్దివారాల క్రితం స్వామి సెలవిచ్చారు. ఎవరూ ఆక్రమించలేదని చెప్పే మూర్ఖస్థితిలో ఉన్నారని అన్నారు.


గతంలో ఉపసంహరించుకున్న ప్రాంతాలలో కూడా మన దేశం కొంత ప్రాంతాన్ని కోల్పోయినట్లు కొందరు మాజీలు చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది. లడఖ్‌ ప్రాంతంలో ఘర్షణ ఉన్న వివిధ ప్రాంతాల్లో మిలిటరీ ఉండని లేదా గస్తీ లేని ప్రాంతాలను ఏర్పాటు చేయటం పరిష్కారం కాదని, చైనా షరతులకు మనం అంగీకరిస్తున్నామని ఒక మాజీ లెప్టినెంట్‌ జనరల్‌ అన్నట్లు రాసింది. సేనల ఉపసంహరణల క్రమంలో భారత భూభాగంలో బఫర్‌జోన్లకు ఎందుకు అంగీకరిస్తున్నట్లు అని ప్రశ్నించినట్లు పేర్కొన్నది. గతంలో సేనల ఉపసంహరణజరిగినచోట్ల కూడా బఫర్‌జోన్లను ఏర్పాటు చేశారు. రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతాలను బఫర్‌ జోన్లు అని పిలుస్తున్నారు. ప్రాంతాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. డెప్సాంగ్‌ మైదానాల నుంచి రెండు వైపులా సేనల ఉపసంహరణ జరగాల్సి ఉంది. బఫర్‌ జోన్లను అంగీకరించటం అంటే అది వాస్తవాధీన రేఖకు రెండు వైపులా జరుగుతుంది. దాని అర్ధం ఆ ప్రాంతంపై సదరు దేశం హక్కును వదులుకున్నట్లు ఎలా అవుతుంది.

ఎలాంటి పోరు లేకుండానే వెయ్యి చదరపు కిలోమీటర్లమేర మన ప్రాంతాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ చైనాకు అప్పగించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.2020 ఏప్రిల్‌ నాటి స్థితిని పునరుద్దరించేందుకు చైనా తిరస్కరిస్తోందని, అప్పగించిన ప్రాంతాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారని ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఒక సమస్య పరిష్కారమైందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. సుబ్రమణ్య స్వామి, రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణల మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదు. మహమ్మద్‌ ప్రవక్త గురించి బిజెపి నేత నూపుర్‌ శర్మ నోటి దూల మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటిని మన దేశం ఖండించటమే గాక వాటితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ పరంగా ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు బిజెపి ప్రకటించింది.నూపుర్‌ శర్మ మాటలు మత ఉద్రిక్తతలకు దారితీసేవిగానూ, ముస్లిం దేశాలతో మన సంబంధాలు దెబ్బతినేవిగా ఉండటంతో ప్రభుత్వమూ, బిజెపి అలా స్పందించింది. ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణ జవాబుదారీతనంతో కూడుకున్నది కాదు.ఈ మేరకు వచ్చిన వార్తల మీద నిలదీసే హక్కు రాహుల్‌కు వుండవచ్చు తప్ప నిర్ధారించి చెప్పటం ఏమిటి ? సుబ్రమణ్యస్వామి వ్యవహారం అది కాదు, అధికారపార్టీలో ఉంటూ మన విదేశాంగ విధానాన్ని తప్పుపట్టటం ఏమిటి ? పోనీ స్వామి చెప్పిన అంశాలు, వైఖరి పార్టీ విధానం కాదని బిజెపి ప్రకటించాలి కదా ! దాని మౌనానికి అర్ధం ఏమిటి ? స్వామి వంటి వారు చేస్తున్న వాదనలు, విమర్శలు సామాజిక మాధ్యమం, మీడియా, వివిధ సంస్థలలో తిష్టవేసిన బిజెపిని బలపరిచే కాషాయ దళాలు చేస్తున్నవే. పార్టీ నుంచి వెలుపలికి వచ్చి స్వామి తనకు తోచిందాన్ని మాట్లాడితే అదొక తీరు.


భారత్‌ – చైనా సరిహద్దులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా కాగితాల మీద బ్రిటీష్‌ వారు గీచిన రేఖ వలన వివిధ ప్రాంతాలు తమవంటే తమవని రెండు దేశాలూ చెబుతున్నాయి. రెండు దేశాలకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదని చెబుతున్న ఆక్సాయిచిన్‌ చైనా ఆధీనంలో, తమది అని చైనా చెబుతున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉన్నది. ఇంకా ఇలాంటివి ఉన్నాయి. వీటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదు. ప్రస్తుతం డెప్సాంగ్‌ మైదానాల్లో మనది అని చెబుతున్న చోట్ల పద్దెనిమిది కిలోమీటర్ల లోపలికి చైనా మిలిటరీ వచ్చిందని చెబుతున్నారు. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మన ప్రాంతాల ఆక్రమణ జరగలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పటాన్ని బట్టి ఆ ప్రాంతం ఎప్పటి నుంచో చైనా ఆధీనంలో ఉన్నదని భావించాల్సి ఉంటుంది. మాజీ మిలిటరీ అధికారులు, నిపుణులు అని చెప్పుకుంటున్నవారు, కొందరు రాజకీయనేతలు, దేశభక్తుల ముసుగులో ఉన్నవారు చెప్పే భాష్యాలు జనంలో మనోభావాలను రగిల్చేందుకు తప్ప ఇతరంగా పనికి రావు. చైనాతో అధికారిక చర్చల్లో పాల్గొనే పౌర, మిలిటరీ ఉన్నతాధికారులకు ఇవేమీ తెలియవని, వారికి దేశభక్తి లేదని, మన భూభాగాన్ని రక్షించుకోవాలనే తపన లేని వారని అనుకోవాలా ? గత 28 నెలలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ, పరస్పర అనుమానాలు తొలగాలంటే సంప్రదింపులు తప్ప మరొక మార్గం లేదు. ఇప్పటి వరకు 16దఫాల చర్చలు జరిగాయి.


దాదాపు ఏడాది పాటు స్థంభించిన చర్చలు ఆకస్మికంగా ఫలించి మరొక అడుగు ముందుకు పడి మరొక ప్రాంతం నుంచి సేనలు వెనక్కు తగ్గటం వెనుక కారణాల గురించి చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ఇప్పట్లో ముగిసేట్లు కనిపించకపోవటం,ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. సోవియట్‌ విచ్చిన్నం తరువాత ఏర్పడిన మధ్య ఆసియా రిపబ్లిక్‌లతో సరిహద్దుల్లో మిలిటరీల మధ్య విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు కుదిరిన అవగాహనను మరింత ముందుకు తీసుకుపోవటానికి ఏర్పడినదే షాంఘై సహకార సంస్థ.అమెరికా, మరికొన్ని పశ్చిమ దేశాల కుట్రలో భాగంగా చైనాలో ఉన్న ఏకైక రాష్ట్రం షింజియాంగ్‌లో ఉగ్రవాదులను రెచ్చగొట్టేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు మధ్య ఆసియా రిపబ్లిక్‌లను కేంద్రాలుగా చేసుకున్నాయి. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదాల పరిష్కారం కూడా ఎస్‌సిఓ ఏర్పాటు వెనుక ఉంది.తొలుత షాంఘై ఐదు అని పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది. తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది,2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్‌ పరిశీలక దేశాలు, బెలారస్‌, శ్రీలంక, టర్కీ, కంపూచియా,నేపాల్‌,ఆర్మీనియాలు సంప్రదింపుల భాగస్వాములుగా ఉన్నాయి. బెలారస్‌కు కొన్ని సంవత్సరాల తరువాత పరిశీలక హౌదా ఇచ్చారు. ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లను ఏ దేశమూ గుర్తించని కారణంగా అక్కడి నుంచి ప్రతినిధులెవరూ ఉండరు. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. పరిశీలక దేశంగా ఉన్న ఇరాన్‌కు సామరకండ్‌లో జరిగిన ఎస్‌సిఓ-2022 భేటీలో తొమ్మిదవ పూర్తి సభ్య దేశంగా తీసుకున్నారు.దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా ఇప్పటికే ఉంది. ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు జరుపుతారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధినేత షీ జింపింగ్‌ భేటీ కావచ్చని వార్తల నేపధ్యం లడక్‌ ప్రాంతంలో సేనల ఉపసంహరణకు దారితీసిందని కొందరు భావిస్తున్నప్పటికీ ఇదే ప్రధాన కారణంగా చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ది ” ప్రచార విజయమా ” !

14 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Germany, NATO, Propaganda “Victory”, Ukraine war, Ukraine-Russia crisis, Ukraine’s counteroffensive, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు

రష్యా సైనిక చర్యలో కోల్పోయిన ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు, పుతిన్‌ సేనలను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరుసటి రోజు దాన్ని ఆరువేలని, మంగళవారం నాడు ఎనిమిది వేలని చెప్పారు. నిజమే, ఇదిగో చూడండి పారిపోతున్న రష్యా సేనలు అంటూ పశ్చిమ దేశాల టీవీలు కొన్ని దృశ్యాలను చూపటం, విశ్లేషణలు, వాటి ప్రాతిపదికగా అనేక దేశాల వారు స్పందించటం, వాటిని మన దేశంలోని మీడియా ఎప్పటికప్పుడు అందించటం చూస్తున్నాము.ఖారకైవ్‌ ప్రాంతం నుంచి తమ సేనలను వెనక్కు మళ్లించినట్లు మాస్కో అధికారులు ప్రకటించారు. అందువలన ఆప్రాంతం ఎంతైతే అన్ని వేల కిలోమీటర్లను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పుకోవటంలో తప్పులేదు, ఆశ్చర్యమూ ఉండదు. దాని నేత జెలెనెస్కీ అధికారానికి రాక ముందు సినిమాల్లో విదూషక పాత్రధారి. గత ఆరున్నర నెలలుగా అనేక ప్రకటనలు చేశాడు. తమ మూలనున్న ముసలమ్మలు ఊతకర్రలు పట్టుకొని, పాలుతాగే పసివాళ్లు కూడా ఉయ్యాళ్ల నుంచి దూకి దేశ రక్షణకు వచ్చినట్లుగా గతంలో చెప్పిన కబుర్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.


మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఒక ఎత్తుగడగా మాస్కో సేనలు భారీ దాడులకు సిద్దం కావటంలో భాగంగా వెనక్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అందువలన ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నదా ? నాలుగు నెలలుగా సాధ్యం కానిది ఈనెల మొదటి వారంలో ఆకస్మికంగా నాలుగు రోజుల్లో రష్యా సేనలను తరిమికొట్టే శక్తిని జలెనెస్కీ ఎలా సంపాదించినట్లు ? పశ్చిమ దేశాలు జనాల ప్రాణాలు తీసే లేదా ఆస్తులను విధ్వంసం చేసే అస్త్ర శస్త్రాలే కాదు జనాల మెదళ్ల మీద దాడి చేసే ప్రచార ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి. ప్రాణాంతక అస్త్రాలను దాడులు జరిగే చోటనే ప్రయోగిస్తే ప్రచారదాడికి ఎల్లలు లేవు. తాజాగా ఉక్రెయిన్‌ ప్రతిఘటన అనేది ఒక ప్రచార ” విజయం ” గా కొందరు వర్ణించారు. జరిగిన దాన్ని తమ వైఫల్యాలు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో తలెత్తిన ఆర్ధిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇంకొక్క ఊపు ఊపితే పుతిన్‌ పతనం ఖాయం అనే అభిప్రాయాన్ని, వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది.


తాము జరుపుతున్నది దురాక్రమణ దాడి కాదని రష్యా చెబుతున్నది, కాదు అదేనని దాన్ని వ్యతిరేకించే దేశాలు వర్ణిస్తున్నాయి. ఏ కారణంతో పశ్చిమ దేశాలు చెప్పినప్పటికీ 1,27,484 చదరపు కిలోమీటర్ల మేర జెలెనెస్కీ సర్కార్‌ ఏలుబడిలో లేదు, దీనిలో ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని పెద్ద విజయంగా చిత్రించుతున్నారు. ఒక పోరు జరుగుతున్నపుడు ఇలాంటివి సాధారణం. ఇదేమీ నిర్ణయాత్మక పరిణామం కాదు. దీంతోనే ముగిసేది లేదు. అందుకే దీన్ని ప్రచార ” విజయం ” అంటున్నారు. దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికన్లు అక్కడ సాధించిన విజయ గాధలను ప్రపంచానికి ఎలా వినిపించారో, తప్పుదారి పట్టించారో, చివరికి తాలిబాన్ల కాళ్లు పట్టుకొని ప్రాణాలతో స్వదేశానికి పారిపోయారో తెలిసిందే. ఖార్‌కైవ్‌ ప్రాంతం నుంచి రష్యా సైనికులు టాంకులు, వాహనాలు, తుపాకులను ఎక్కడి వక్కడ వదిలేసి ఉక్రేనియన్లు దాచుకున్న సైకిళ్లను అపహరించి వాటి మీద పారిపోయారట. మరి జెలెనెస్కీ సేనలు వారిని ఎందుకు బందీలుగా చేయలేదు. ఎవడైనా పారిపోవటానికి ఉన్న వాహనాలను వదలి సైకిళ్లెందుకు ఎక్కుతారు?


మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకోవటం గొప్పే అనేవారిని కాసేపు సంతృప్తిపరుద్దాం. ఐరాస కాందిశీకుల సంస్థ వివరాల ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత మంది కాందిశీకులు ఏ సంక్షోభంలోనూ రాలేదు. ఆగస్టు 30 నాటికి 70లక్షల మంది కాందిశీకులు వివిధ దేశాల్లో ఉన్నారు. అత్యధికంగా 24లక్షల మంది రష్యాకే వెళ్లారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, నాజీ కిరాయి మూకలు జరిపిన దాడుల కారణంగా వారు వలస పోవాల్సి వచ్చింది. మిగిలిన వారు రష్యా మిలటిరీ దాడుల కారణంగా ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. వీరు గాక అంతర్గతంగా మరో 80లక్షల మంది తమ నెలవులు తప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు, వారికి ఎందరికి తిరిగి పూర్వపు జీవనాన్ని కల్పించారన్నది ముఖ్యం. ఆ వివరాలు మనకు ఎక్కడా కనపడవు, వినపడవు.తామే ఇంథన కొరతతో ఇబ్బందులు పడుతుంటే కాందిశీకులకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ అనేక దేశాల్లో గుసగుసలు.


ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఉక్రెయిన్‌ మిలిటరీ, ఆర్ధిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా దాడులను జరుపుతున్నది. జన నష్టం జరగకుండా ఎంపిక చేసుకున్న వాటి మీదనే దాడులు చేస్తోంది. రెండు వైపులా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. చెబుతున్నది నమ్మదగినవిగా లేవు. దాడుల్లో జననష్టం జరిగితే దాన్ని చూపి రష్యాను మరింత ఒంటరి చేసి ఎండగట్టాలన్న అమెరికా ఎత్తుగడ పారలేదు. అదే విధంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున జెలెనెస్కీ సేనలకు ఆయుధాలు అందిస్తాయనే అంచనా ఉన్నప్పటికి ఆధునిక అస్త్రాలతో తమను ఎదుర్కొంటారని పుతిన్‌ ఊహించినట్లు కనపడదు. ఇలా ఊహించనివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంథనాన్ని ఆయుధంగా మలచాలని చూసిన అమెరికాకు అది ఎదురుతన్నటమే కాదు మాస్కోకు అదనపు రాబడి తెచ్చిపెడుతున్నది. ఇంథన సంక్షోభంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అది ఏ రూపంలో జనంలో ఆగ్రహం కలిగిస్తుందో చెప్పలేము. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్య ముప్పు పొంచి ఉంది. మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోవాలని అమెరికా విసిరిన మతిమాలిన సవాలు దానికే ఎదురుతన్నింది. డాలరును పక్కన పెట్టి తమ కరెన్సీలతో లావాదేవీలు జరుపుకోవాలని మరింతగా గట్టిగా చెప్పేందుకు ఈ సంక్షోభం అవకాశం ఇచ్చింది. పెద్దన్న ప్రాభవం తగ్గుతున్నదని లోకానికి స్పష్టం చేసింది. చివరికి ప్రతిదానికి అమెరికా నేతలను కావలించుకున్న నరేంద్రమోడీ ఈ అంశంలో మాత్రం దూరంగా ఉన్నారు. గొంతు కలిపేందుకు వెనుకాడుతున్నారు.

రెండవ ప్రపంచయుద్దంలో జర్మనీ,జపాన్‌ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సోవియట్‌తో భుజం కలిపి పోరాడిన అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్సులు తరువాత దాన్నే బూచిగా చూపి ప్రపంచానికే శత్రువులుగా రుజువైన జర్మనీ,జపాన్‌లను చంకనెత్తుకున్నాయి. అన్నింటికంటే విపరీతం ఏమంటే నాటో పేరుతో జర్మనీని, రక్షణ ఒప్పందం పేరుతో జపాన్ను కాపాడేందుకు పూనుకున్నాయి. అన్నీ కలసి ప్రపంచానికి ముప్పు తలపెట్టాయి. గతంలో ఐరోపాలో యుద్దానికి జర్మనీ కారణమైతే ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఉక్రెయిన్‌ యుద్దానికి అమెరికా కారణమైంది. ఏదో ఒకదాన్ని బూచిగా చూపకపోతే తమ దుష్టపధకాలను జనం ప్రశ్నిస్తారు గనుక ఊహాజనిత బూచిని చూపుతున్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం రష్యాను, దానికి మద్దతు ఇస్తున్నదంటూ చైనాను బూచిగా చూపుతున్నారు. చివరికి స్విడ్జర్లాండ్‌, ఫిన్లాండ్‌ వంటి తటస్థ దేశాలను కూడా తమ కూటమిలోకి లాగాయి. లాటిన్‌ అమెరికాలో నియంతలను ప్రోత్సహించి ప్రజా ఉద్యమాలను అణచేందుకు పూనుకుంటే అక్కడా ఎదురుతన్నింది.వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ముందుకు వస్తుండగా మితవాద శక్తులను జనం ఛీకొడుతున్నారు.


అమెరికా డాలరు దెబ్బకు తమ కరెన్సీ యురో, బ్రిటీష్‌ పౌండ్‌ కూడా విలవిల్లాడుతున్నాయి. వాటి పర్యవసానాలు ఇప్పుడే తెలియదు. ఇంథనాన్ని ఆయుధంగా మార్చాలని చూసిన అమెరికా ఎత్తుగడకు విరుగుడుగా దాన్నే తన అస్త్రంగా మార్చుకున్న రష్యా ప్రయోగానికి ఐరోపా గింగిరాలు తిరుగుతోంది. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సిద్దము సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. ఈ పధకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్ధించే ఏ దేశానికి తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ తెగేసి చెప్పాడు. ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్‌ స్రీమ్‌ ఒకటవ సహజవాయు సరఫరాను రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా గుండెలు బాదుకుంటోంది.

ఆంక్షలు అమల్లోకి రాక ముందే రష్యా నుంచి అందినంత మేరకు ఇంథనాన్ని కొని నిలువ చేసుకోవాలని ఐరోపా దేశాలు చూశాయి. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు కోతలు, పరిశ్రమల మూతలు ప్రారంభించి పొదుపు మంత్రాన్ని జనాలకు ప్రవచిస్తున్నాయి.చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని తలలు పట్టుకుంటున్నాయి. సిగ్గువిడిచి రష్యాను అడగలేవు, జనానికి సంతృప్తి కలిగించలేని స్థితి. ఇంథన బ్లాక్‌మెయిల్‌, తమను చీల్చేందుకు కుట్ర అంటూ ఐరోపా సమాఖ్య మండిపడుతోంది. నీవు నేర్పినే విద్యే కదా అన్నట్లుగా పుతిన్‌ ఉన్నాడు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు వద్దు అన్న జర్మనీ ఇప్పుడు తమకు అవే ముద్దు అన్నట్లుగా తిరిగి తెరుస్తున్నది. జర్మనీతో సహా అనేక దేశాలజనం పెరిగిన ఇంథన ధరలను తాము తట్టుకోలేమంటూ వీధులకు ఎక్కుతున్నారు.మన ఆర్‌బిఐ మాదిరే ఐరోపా బాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నది.1970దశకం తరువాత ఇలాంటి తీవ్ర పరిస్థితిని ఐరోపా ఎన్నడూ ఎదుర్కోలేదు, ఈ స్థితి ఎంతకాలం ఉంటుందో అంతుబట్టటం లేదు.రెండు సంవత్సరాల పాటు సాధారణ జనానికి, ఆరునెలల పాటు వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ చార్జీలను పెంచబోమని బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జి, ఇతర ఇంథనం అందుబాటులో ఉన్నా ఐరోపా దేశాలకు నిల్వచేసుకొనే ఏర్పాట్లు లేవు. ఇంతకాలం రష్యా నుంచి నిరంతర సరఫరా ఉండటంతో నిల్వ అవసరం లేకపోయింది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కుదిరేవి కాదు. జర్మనీలో రసాయనకర్మాగారాల మూత లేదా విద్యుత్‌ లేక కోతలుండటంతో చైనా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.


ఖారకైవ్‌ ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాం,మిగతా ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలు, డబ్బు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కోరుతున్నాడు. ఇచ్చినడబ్బులో కొంత నొక్కేశాడని వార్తలు. మా సమస్యలు మాకుంటే ఇదేమి గొడవ అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. తాము ఇస్తున్న వాటిని పెంచే అవకాశం లేదని జర్మన్‌ రక్షణ మంత్రి క్రిస్టిని లాంబ్రెచెట్‌ అన్నారు. మా దగ్గర ఉన్న ఆయుధాలు నిండుకుంటున్నాయి, మా అవసరాలకే మేము కొనుక్కోవాలి అన్నారామె. మరొక ముఖ్య దేశమైన ఫ్రాన్స్‌ అంటీముట్టనట్లుగా నాకేంటి అన్నట్లుగా ఉంది. బ్రిటన్‌, జర్మనీ, పోలెండ్‌, ఇస్తోనియా, డెన్మార్క్‌ తరువాతే అది ఇస్తున్న సాయమొత్తం ఉంది. గొడవలెందుకు అన్న ధోరణితో ఫ్రాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. మీరు తలచుకుంటే అందరికంటే ఎక్కువ సాయం చేయగలరంటూ జర్మనీని మునగ చెట్టు ఎక్కించేందుకు అమెరికా పూనుకుంది. మొత్తం మీద రానున్న కొద్ది రోజులు లేదా చలికాలంలో లేదా ముగిసిన తరువాత కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గోధుమలు, బియ్యం ఎగుమతుల నిషేధం : దేశ రైతాంగంపై కత్తి గట్టిన నరేంద్రమోడీ !

11 Sunday Sep 2022

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, indian farmers, Narendra Modi Failures, Rice export Ban, Wheat export Ban, WTO-India


ఎం కోటేశ్వరరావు


వెనుకటికి ఒక తుపాకి రాముడు లేదా పిట్టల దొర మీ ఊళ్లో ఉన్న కొండను ఎవరైనా మోయ గలరా అని సవాల్‌ చేశాడట. మా వల్లకాదు గానీ మీరు మోస్తారా అంటే సై అని పందెం కాశాడట. ఎంతసేపు ఉన్నా కొండ చుట్టూ పదే పదే తిరగటం తప్ప చేసిందేమీ లేకపోవటంతో గ్రామస్తులు నిలదీశారు.నేను మోస్తా, మీరంతా దాన్ని ఎత్తి నాతల మీద పెట్టండి, అలా చేసేందుకు మీకు ఎటు నుంచి వీలవుతుందా అని చుట్టూ తిరిగి చూస్తున్నా అన్నాడట. అసలు కథేమిటో అర్ధం అయిందిగా. ఇక విషయంలోకి వద్దాం.
2022 ఏప్రిల్‌ 13న గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్‌ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. కరోనా కాలంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను భారత్‌ ఉచితంగా ఎలా ఇచ్చిందబ్బా అని ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూస్తున్నదన్నారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు.( అదే తేదీతో ఉన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త)


విశ్వగురువు నరేంద్రమోడీకి ప్రతి అంశం కరతలామలకము(అరచేతిలో ఉసిరి కాయ వంటిది ). ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, ఒప్పందాలు తెలియవని అనుకోలేము. తెలిసీ అలా మాట్లాడారంటే ఏమనుకోవాలి? నిబంధన ఏమిటంటే ప్రభుత్వాల దగ్గర ఉన్న ధాన్యాల నిల్వలు ఆహార భద్రతకు సంబంధించినవి, వాటిలో ప్రభుత్వ సబ్సిడీ ఇమిడి ఉంటుంది గనుక వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఉండదు. అలా జరగాలంటే సంస్థ నిబంధనావళిని మార్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా మోడీ ఎగుమతిని కోరుకుంటే ముందు మన దేశం తరఫున నిబంధనలను సడలించేందుకు అధికారికంగా ప్రతిపాదనలు పంపాలి, ఆమోదం తీసుకోవాలి. మరి అది చేశారా ? లేకుండా మాట్లాడటం అంటే కొండను ఎత్తి తన తలమీద పెట్టమన్న పిట్టల దొరను గుర్తుకు తెచ్చినట్లు కాదా ! నిబంధనలను సడలించాలని కోరటం ప్రపంచ ఆహార ఆహార కార్యక్రమానికి విరుద్దం. ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి మానవతా పూర్వక సాయంగా అనుమతించాలని మన అధికారులు వాదిస్తున్నారు. దానికి ఎప్పుడైనా అవకాశం ఉంది. కరువులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రతిదేశమూ తనకు తోచినది చేస్తూనే ఉంది.
మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌ నగరంలో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్‌ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు మన దేశం ముందుకు వచ్చిందని చెప్పారు. ఇది కూడా అంతే, మోడీగారికి తెలియంది కాదు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్‌ 49, పాకిస్తాన్‌ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి.నరేంద్రమోడీ ఎనిమిదేండ్ల పాలన తరువాత 2021లో 116 దేశాలకు గాను 101వ స్థానంలో దేశాన్ని ఉంచారు. శ్రీలంక 65, మయన్మార్‌ 71, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76, పాకిస్తాన్‌ 92 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?


మన జనానికి కావాల్సిన ఆహారం పుష్కలంగా సరిపడా ఉంది అని ఏప్రిల్‌ 13న, స్వయం సమృద్ధి సాధించామని మే నాలుగున చెప్పిన ప్రధాని మాటల కొనసాగింపుగా గతేడాది చేసిన 20లక్షల టన్నులను 2022-23లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు పూనుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్‌,టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం, అల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, చైనా, ఈజిప్టు, సూడాన్‌, నైజీరియా,బోస్నియా, ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు.పార్‌బాయిల్డ్‌ రైస్‌పై ఆంక్షలు, ఎగుమతి పన్నులు లేవు. ఇరవై శాతం దిగుమతి పన్ను చెల్లించి మన దగ్గర కొనేవారెవరూ ఉండరు. పొమ్మన కుండా పొగబెట్టటమే ఇది. స్వేచ్చా మార్కెట్‌ను సొమ్ము చేసుకోవటం ప్రపంచం, మానవత్వం వంటి సుభాషితాలను విశ్వగురువు ఎలా దిగమింగినట్లు ?


ప్రభుత్వ మాటలు నమ్మి గోధుమ ఎగుమతులకు పూనుకున్న వారికి నిషేధం పెద్ద షాక్‌. విధానాలను తగినంత ముందుగా ప్రకటిస్తే దానికి అనుగుణంగా ఎగుమతిదారులు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పది-పదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులపై నిషేధం వరి రైతాంగంపై ఎలా ఉంటుందో కొత్త పంట వచ్చిన తరువాత గానీ తెలియదు.


ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతుల ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ పెద్దలు, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ప్రభుత్వం కంటే ఎక్కువగా సాగు చట్టాలను సమర్ధించి రైతులను తప్పు పట్టిన పెద్దలు గోధుమ, బియ్యం ఎగుమతులపై ఆంక్షల గురించి నోరు విప్పటం లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, బట్టలు చించుకొని మరీ చెప్పారు. మరి ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ? సరఫరా సమస్యల కారణంగా మనం దిగుమతి చేసుకొనే చమురును చివరికి రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాము. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, రంగురాళ్లు, ఇతర సరకులేవీ ఆగలేదు. ఎరువులకు కొరత లేదని ప్రభుత్వమే చెబుతున్నది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆ దేశాల రేవుల నుంచి గోధుమల ఓడలు బయలు దేరినట్లు వార్తలు వచ్చిన తరువాత గోధుమల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయకపోగా కొత్తగా బియ్యాన్ని కూడా అడ్డుకున్నారు. మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. రైతులపై ఎందుకీ కత్తి ?


చైనా నుంచి మనం దిగుమతులు , ఎగుమతులు నిలిపివేస్తే షీ జింపింగ్‌ మన కాళ్ల దగ్గరికి వస్తాడని ప్రచారం చేసిన దేశభక్తుల గురించి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతాల తరువాత అది మరీ ఎక్కువైంది. దిగుమతులను నిషేధించాలని దేశభక్తిని చూపాలని గగ్గోలు పెట్టారు. నిజానికి తమ ఉత్పత్తులను తీసుకోవాలని మన దేశాన్ని చైనా ఎప్పుడూ కోరలేదు, అడిగితే విక్రయించింది, మన ఎగుమతుల పట్ల కూడా అదే పద్దతి.ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉండి, అది లేకపోతే చైనాకు రోజు గడవదు అనుకుంటే పరిస్థితి వేరు. అలాంటిదేమీ లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 91.2బిలియన్‌ డాలర్లకు చేరినట్లు చైనా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 16శాతం ఎక్కువ. ఆగస్టులో మన దిగుమతులు 9.95 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 1.49 బి.డాలర్లు మాత్రమే. ఇప్పటికిప్పుడు దిగుమతులను నిలిపివేస్తూ మోడీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఇంకా నాలుగు నెలలు ఉన్నందున మోడీ సర్కార్‌ మరోకొత్త రికార్డును సృష్టించినా ఆశ్చర్యం లేదు.
ఇక చైనా వ్యతిరేకత,కాషాయ దళాల అపర దేశ భక్తిని పక్కన పెడితే మన దేశ దిగుమతులు-ఎగుమతుల తీరు తెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టు నెలలో దిగుమతులు 37శాతం పెరగ్గా ఎగుమతులు ఒకటిన్నర శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టులో వాణిజ్యలోటు 11.6 బి.డాలర్లు ఉండగా ఈ ఏడాది 28.7బి.డాలర్లకు పెరగటం అసాధారణ పరిణామం. ఇదే తీరు గనుక కొనసాగితే మన దగ్గర వున్న డాలర్లు హరించుకుపోయి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చు. రూపాయి విలువ మరింత పతనం కావచ్చు. రష్యా నుంచి చౌకధరలకు ముడిచమురును ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే వచ్చే రాయితీ ప్రభుత్వానికి లేదా వినియోగదారులకు దక్కుతుంది. కానీ రిలయన్స్‌ వంటి ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని మరమ్మతులను కూడా వాయిదా వేసి సొమ్ము చేసుకుంటున్నాయి.


ఇటీవలి సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నులను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరాలు గుర్తుకు వస్తున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా గత ప్రభుత్వ లోపాలను జనం ముందుంచి విజయవంతంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరివారాలు ఇప్పుడు తమ భవిష్యత్‌ను ఊహించుకొని జాగ్రత్త పడుతున్నాయి. అదే అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ముడి చమురు ధరలు.ద్రవ్యోల్బణ అదుపు చర్యల్లో భాగంగానే గోధుమ, బియ్యం ఎగుమతుల నిషేధం, మరికొన్నింటి ఎగుమతులపై ఆంక్షలు. ఇవి స్వయంగా ఇబ్బందులు తెచ్చుకోవటం లేదా చేతులు కాల్చుకోవటమే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మానవాభివృద్ధిలో కేరళ కంటే గుజరాత్‌ ఎందుకు వెనుకబడి ఉందో నరేంద్రమోడీ గారు చెప్పగలరా ?

10 Saturday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, HDI India Report, Human Development, India HDI, Kerala HDI, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది.(దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సగటు జీవితకాలం, పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు, స్థూల జాతీయ ఆదాయ(జిడిపి కాదు-జిఎన్‌ఐ) సంబంధిత అంశాలను బట్టి మార్కులు వేస్తారు.2030నాటికి నిరంతర అభివృద్ధి,పర్యావరణంపై పారిస్‌ ఒప్పందం కుదిరిన తరువాత తొలిసారిగా వరుసగా రెండు సంవత్సరాలు ప్రపంచ మానవ వృద్ధి సూచిక తగ్గింది.తొంభైశాతం దేశాలు 2020 లేదా 2021లో ఏదో ఒక సంవత్సరం విలువను కోల్పోయాయి. 2020లో పరిగణనలోకి తీసుకున్న 189 దేశాల్లో భారత్‌131వ స్థానంలో ఉంది. దేశాలను 800 పాయింట్లు అంతకు మించి వచ్చిన వాటిని అత్యధిక వృద్ధి,700-800 మధ్య వచ్చిన వాటిని అధిక వృద్ధి, 550 నుంచి 700వరకు వచ్చిన వాటిని మధ్య రకం, అంతకు లోపు వచ్చిన వాటిని తక్కువ వృద్ధి చెందిన తరగతులుగా విభజించారు. మనకు 2020లో 0.645 రాగా 2021కి 0.633కు తగ్గాయి. సగటు జీవిత కాలం 69.7 నుంచి 67.2కు తగ్గింది. చైనాలో 78.5 సంవత్సరాలుంది.( చెవులప్పగించేవారుంటే మనది ప్రజాస్వామ్యం గనుక స్వేచ్చగా చావనిస్తారు, చైనాలో కమ్యూనిస్టు పాలన గనుక బలవంతంగా బతికిస్తారు అని చెప్పే ప్రబుద్దులు కూడా తారసపడవచ్చు) పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు 12.2 నుంచి 11.9కి, పాఠశాలకు వెళ్లే సగటు సంవత్సరాలు 6.7నుంచి6.5కు తగ్గాయి. ఇక మన ఇరుగు పొరుగు దేశాలను చూస్తే మన కంటే ఎగువన శ్రీలంక 73, చైనా 79, భూటాన్‌ 127, బంగ్లాదేశ్‌ 129 స్థానాల్లో ఉండగా మన కంటే దిగువన నేపాల్‌ 143, మయన్మార్‌ 149, పాకిస్తాన్‌ 161లో ఉన్నాయి. జిడిపిలో మనం వెనక్కు నెట్టేసిన బ్రిటన్‌ 18, జపాన్‌ 19, అమెరికా 20వ స్థానంలో ఉంది.


ఈ వివరాలను చూసిన తరువాత కరోనా రాకపోతేనా మా నరేంద్రమోడీ గారు…. అని గొప్పలు చెప్పేవారు మనకు తారసపడతారు. వారికి ఒక్కటే ప్రశ్న అంతకు ముందు ఉన్న సూచికకు ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది? అంతకు ముందు అంత అధ్వాన్నంగా ఎందుకున్నది అన్నది ప్రశ్న. 2014కు ముందు గుజరాత్‌ తరహా అభివృద్ధి అని బిజెపి పెద్దలు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.1990 నుంచి ఇప్పటి వరకు అక్కడ బిజెపి భాగస్వామిగా లేదా పూర్తిగా అధికారంలో ఉంది.2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ ఒక కొత్త రికార్డును సృష్టించారు. సందర్భం గనుక మానవ అభివృద్ది సూచికల్లో గుజరాత్‌ను బిజెపి-మోడీ ఎక్కడ ఉంచారు అన్న ప్రశ్నకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిందే. మోడీని అడిగే వారు లేరు, అడగకుండా తనంతట తాను నోరు విప్పరు. అడగ్గలిగే విలేకర్లున్నా వారితో సమావేశం పెట్టరు గనుక అది జరిగేది కాదు. 2019 సంవత్సరంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల మానవాభివృద్ది సూచికలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దేశ సగటు మార్కులు 0.646 కాగా ఏడు వందల పాయింట్లకు పైగా తెచ్చుకొని అధిక వృద్ధి జాబితాలో ఉన్న పధ్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 0.782తో కేరళ ప్రధమ స్థానంలో తరువాత వరుసగా చండీఘర్‌,గోవా, లక్షద్వీప్‌, ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి, హిమచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, డామన్‌ డయ్యు, హర్యానా, మిజోరాం ఉన్నాయి. తరువాత మధ్య తరహా వృద్ధి చెందిన మిగతా వాటిలో 0.697తో మహారాష్ట్ర, తరువాత వరుసగా మణిపూర్‌, జమ్ము-కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, గుజరాత్‌, తెలంగాణా, దాద్రా నాగర్‌హవేలీ,అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, అసోం, చత్తీస్‌ఘర్‌,ఒడిషా, మధ్య ప్రదేశ్‌, ఝార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహారు ఉన్నాయి.


మానవాభివృద్ధిలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు తేడా ఉంది, కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కొన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌,అసోంలకు బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాది మంది శరణార్ధులుగా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సమస్యలు లేని రాష్ట్రాలు కూడా పురోగమించలేదు. కానీ గుజరాత్‌ తరహా అభివృద్ది నమూనా పేరుతో జరిగిన పెద్ద ప్రచారం వెనుక ఉన్న లక్ష్యం నరేంద్రమోడీని గొప్ప నేతగా చిత్రీకరించేందుకే అన్నది స్పష్టం. అందుకే దాని అభివృద్ధి బండారాన్ని గురించి చర్చ, మోడీ గొప్పతనం గురించి ప్రశ్నించటం. గతంలో కాంగ్రెస్‌, వామపక్షాలు లేదా వివిధ ప్రాంతీయ పార్టీలు తమ పాలనలో సాధించిన ప్రగతి గురించి మిగతా రాష్ట్రాలతో పోల్చి చెప్పుకున్నాయి తప్ప తమ రాష్ట్రం దేశానికి ఒక అభివృద్ధి నమూనాగా చెప్పుకోలేదు. అలా చెప్పుకోవటం జనాలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. కొన్ని రాష్ట్రాలు కొన్ని రంగాల్లో ముందున్నంత మాత్రాన దాన్నే నమూనాగా చెప్పలేము.


పోనీ నరేంద్రమోడీ దగ్గర మంత్రదండం ఉంది గనుక గుజరాత్‌ను అలా రూపొందించారని అనుకుందాం. రాజకీయంగా మోడీ పుట్టక ముందే గుజరాత్‌ పారిశ్రామికంగా, వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో మోడీ అధికారానికి వచ్చాక విదేశాల్లో విశ్వసనీయత పెరిగిందని చెప్పారు, విదేశీ పెట్టుబడులకోసమే విమానాల్లో లోకం చుట్టిన వీరుడిగా చెప్పారు. అంగీకరిద్దాం, గుజరాత్‌ మాదిరి దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మాట మాట్లాడితే ఒట్టు. మోడీ పలుకుబడితోనే విదేశీ పెట్టుబడులు వస్తున్నట్లు అంగీకరిస్తూ ఆ ఘనతను కూడా ప్రధాని ఖాతాలోనే వేద్దాం. గుజరాత్‌ నమూనా గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే ఆర్‌బిఐ లేదా కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2021 మార్చి నెల వరకు వివిధ రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) మొత్తంలో గుజరాత్‌కు 30, మహారాష్ట్రకు 28, కర్ణాటకకు 14, ఢిల్లీకి 11 శాతం అంటే 83శాతం ఈ నాలుగు రాష్ట్రాలకే వెళ్లింది. విదేశీ పెట్టుబడులతో దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు, వారిని సమర్ధిస్తున్నవారు గానీ దీన్ని ఎలా సమర్ధిస్తారు ? దేశమంటే ఈ నాలుగు రాష్ట్రాలేనా ? విశ్వగురువుగా పిలిపించుకుంటున్నవారికి ఇది తగినదేనా ? దేశం సంగతి వదలివేద్దాం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు తెచ్చింది కేవలం ఒకశాతమే. దీనికి మోడీ లేదా సిఎం ఆదిత్య నాధ్‌ ఏ భాష్యం చెబుతారు. లోగుట్టు ఏమంటే లాభాల కోసం పెట్టుబడులు పెట్టేవారు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ పెడతారు తప్ప ప్రధాని లేదా సిఎంల గొప్పచూసి పెట్టరు. డబుల్‌ ఇంజన్లు ఉంటే (కేంద్రం – రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) అభివృద్ది పరుగుపెట్టిస్తాం అన్నారుగా, మరి దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు ఎఫ్‌డిఐలు ఎందుకు రావటం లేదు ? బిజెపి అధికారంలోని రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్ల గురించి ఆ పార్టీ నేతలు చెప్పే మాటలను నమ్మటం ఎలా ? డబుల్‌ ఇంజన్లు ఉన్న రాష్ట్రాలు మానవాభివృద్ది సూచికల్లో అట్టడుగున ఎందుకున్నట్లు ? కేరళ, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల స్థాయికి గుజరాత్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారు.


రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, దేశం మొత్తం మానవాభివృద్ది సూచికలో వెనుక బడిందంటే రాష్ట్రాలు కారణం తప్ప నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా ! నరేంద్రమోడీని ఎలా తప్పు పడతాం !! మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పదిహేను సంవత్సరాలు, అంతకు మించి ఆ పార్టీ అధికారంలో ఉంది. అవన్నీ మానవాభివృద్దిలో ముందు వరుసలో ఉండి ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉంటే మోడీని, బిజెపిని తప్పుపట్టలేము, కానీ దానికి విరుద్దంగా ఉన్నపుడు ఎవరిని తప్పు పట్టాలి? రాష్ట్రాల్లో అధికారం కోసం పడుతున్న తిప్పలు రాష్ట్రాల అభివృద్ధి మీద చూపి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా ? కేంద్రం-రాష్ట్రాలు ఎవరు ఖర్చు చేసినా అది మానవాభివృద్ధి సూచికల్లో మన దేశ స్థానాన్ని సూచించేదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2002 నుంచి 2018 వరకు కొన్ని దేశాలు వెచ్చిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. పిపిపి పద్దతిలో అమెరికన్‌ డాలర్లలో విలువలు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2019లో వివిధ దేశాలు చేసిన ఖర్చు విలువ డాలర్లలో ఉంది.
దేశం పేరు ××× 2002××2010 ××2018×× ప్రపంచ బాంకు
భారత్‌ ××× 102 ×× 145 ×× 275 ×× 63.75
చైనా ××× 152 ×× 381 ×× 935 ×× 535.13
శ్రీలంక ××× 228 ×× 322 ×× 517 ×× 160.70
బంగ్లాదేశ్‌ ××× 33 ×× 66 ×× 110 ×× 45.86
పాకిస్తాన్‌ ××× 86 ×× 104 ×× 178 ×× 39.50
క్యూబా ×××711 ××2,042 ×× 2,519 ×× 1,032
వియత్‌నాం ×××108 ×× 259 ×× 440 ×× 180.72
బ్రిటన్‌ ×××2,338 ××3,645 ×× 4,620 ××4,312.89


పిండి కొద్దీ రొట్టె, తిండి కొద్దీ పిల్లలు అన్నట్లుగా మానవాభివృద్ధికి అవసరమైన రంగాలకు తగినన్ని నిధులు కేటాయించకుండా, ప్రపంచ కుబేరుల్లో మనకూ స్థానం వచ్చిందని సంబరపడ్డా, ఫలానా దేశాన్ని వెనక్కు నెట్టి జిడిపిలో ముందుకు పోయినట్లు ఛాతీని ఉప్పొంగించినా, మన జబ్బలు మనమే చరుచుకుంటే చాలదు.సరైన పారిశుధ్య పరిస్థితులు లేని కారణంగా మన దేశ జిడిపిలో 6.4శాతం (2006లో 53.8 బిలియన్‌ డాలర్లు లేదా రు.2.4లక్షల కోట్లు నష్టపోతున్నట్లు ప్రపంచబాంకు చెప్పింది.ఈ మొత్తం 2016 నాటికి జిడిపిలో 5.2 శాతం, డాలర్లలో 106.7 బి.డాలర్లుగా అంచనా. గాలి కాలుష్యం కారణంగా జిడిపికి 7శాతం లేదా 14లక్షల కోట్ల రూపాయల నష్టం. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా 2012-2030 మధ్య మన దేశం 6.2 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోతామని 2015లో హెల్త్‌కేర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ఆరోగ్య భారత్‌ అనే నివేదికలో పేర్కొన్నది. అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రజారోగ్య ఖర్చు జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా ఉండటం మినహా మించటం లేదు. 2004లో నాటి సర్కార్‌ ఐదు సంవత్సరాల కాలంలో జిడిపిలో కనీసం 2-3శాతానికి ఖర్చు పెంచుతామని చెప్పింది. ఆ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించిన నేటి పాలకులు 2017లో జాతీయ ఆరోగ్య విధాన ప్రకటన చేస్తూ 2025 నాటికి జిడిపిలో ఖర్చును 2.5శాతానికి పెంచుతామని చెప్పారు. వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరేమీ కనిపించటం లేదు. దేశంలో మానవాభివృద్ధి మెరుగ్గా లేదని నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడే తెలుసు. అన్ని రాష్ట్రాలను మెరుగుపరిచేందుకు ఒక జాతీయ విధానాన్ని ఎనిమిదేండ్లవుతున్నా ఎందుకు తీసుకురాలేదు. కాంగ్రెస్‌ ఐదు సంవత్సరాల్లో చేయలేని వాటిని తొలి ఐదేండ్లలోనే తాము చేశామని మోడీ గణం చెప్పుకుంది. అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎలా విస్మరించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తీర్చేదెవరు ? విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెడితే అప్పులు తీసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తాం అని రాష్ట్రాలకు చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానవాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రోత్సాహకాలిస్తాం అని చెప్పలేదేం ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమ్మో భయంకరి : బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌పై జనం !

07 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Boris Johnson, Liz Truss, Rishi Sunak, Tory party, UK Conservative party, UK Prime Minister, UK Tory party


ఎం కోటేశ్వరరావు


సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధానిగా మంగళవారం నాడు గద్దెనెక్కిన కన్సర్వేటివ్‌ పార్టీ(టోరీ) నాయకురాలు లిజ్‌ ట్రస్‌ తక్షణమే రంగంలోకి దిగుతారు అంటూ అక్కడి మెజారిటీ పత్రికలు, ఆమె గెలిచారు గానీ రానున్న సంక్షోభాన్ని నివారించగలరా అన్న సందేహాలతో కొన్ని ఆమె గురించి శీర్షికలు పెట్టాయి. ద్రవ్యోల్బణం ఇతర ఆర్ధిక దిగజారుడు కారణంగా జీవితాలు గడపటం కష్టమైన కార్మికులు సమ్మెలకు దిగిన నేపధ్యంలో ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడవచ్చని భావిస్తున్నారు. బ్రిటన్‌ తదుపరి ఎన్నికలు 2025 జనవరి 28న జరగాల్సిన పూర్వరంగంలో లేబర్‌ పార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎలాంటి చర్యలతో కార్యాచరణకు పూనుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. జీవన వ్యయ పెరుగుదల నుంచి బ్రెక్సిట్‌ అనంతర పరిస్థితి, ఉక్రెయిన్‌ సంక్షోభం వరకు అనేక అంశాలు ఆమె ముందున్నాయి. గతంలో ఉక్కు మహిళగా పేరు గాంచిన మార్గరెట్‌ థాచర్‌ తరువాత ఇన్ని సమస్యలతో గద్దె నెక్కిన వారు మరొకరు లేరు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను పార్టీ ఎన్నికల్లో ఓడించిన లిజ్‌ ఆరు సంవత్సరాల్లో నాలుగవ ప్రధాని. అక్కడి సంక్షోభానికి ఇన్ని ప్రభుత్వాలు మారటం ఒక సూచిక. ఆమె ఏలుబడిలో 1970 మాదిరి మరోసారి చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని డచ్‌బాంక్‌ సోమవారం నాడు హెచ్చరించింది. పౌండ్‌ విలువను 30శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థితిలో బ్రిటన్‌ లేదని పేర్కొన్నది.వచ్చే ఏడాది 30 బిలియన్‌ పౌండ్ల మిగులు బడ్జెట్‌ బదులు 60 బిలియన్ల లోటు ఉండే విధంగా లిజ్‌ ఆలోచనలు ఉన్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.మార్గరెట్‌ థాచర్‌, థెరెస్సా మే తరువాత లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌కు మూడవ మహిళా ప్రధాని, ముగ్గురూ కన్సర్వేటివ్‌ పార్టీకి చెందినవారే.


లిజ్‌ ట్రస్‌ గురించి దేశ ప్రజల్లో 52శాతం మంది ఆమెను ఒక భయంకర మనిషిగా భావిస్తున్నారు.యు గవ్‌ విశ్లేషణా సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం కేవలం పన్నెండుశాతం మంది మాత్రమే ఆమె మీద విశ్వాసం ప్రకటించారు.ఆమె ఒక భయంకరి అని 52శాతం భావిస్తున్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ను భయంకరుడిగా 55శాతం భావించారని వెల్లడైంది. ఈ సర్వే ఆమె ఎన్నికకకు వారం రోజుల ముందు జరిగింది. లిజ్‌ ట్రస్‌ గొప్ప అన్న వారు రెండుశాతం, మంచిది అన్నవారు పదిశాతం, ఫరవాలేదని 20శాతం, అధ్వానం అని 17శాతం, భయంకరమని 35, తమకు తెలియదని 16శాతం మంది చెప్పారు.


జనానికి ఉపశమనం కలిగిస్తే తమ వాటా తగ్గుతుందని కార్పొరేట్లకు ఆగ్రహం, లేకపోతే జనాందోళనలు మరింత ఉధృతం కావటం తధ్యం. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంథన ఛార్జీల విధానాన్ని స్థంభింపచేసి 2,300 డాలర్లు. అంతకు లోపు చెల్లిస్తున్న గృహ వినియోగదారులకు వచ్చే ఎన్నికల వరకు బిల్లులు పెరగకుండా చేసేందుకు 130 బిలియన్‌ డాలర్లతో ఒక పధకాన్ని రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. తొలిసారిగా బ్రిటన్‌ చరిత్రలో శ్వేతజాతికి చెందిన వారినెవరినీ ప్రధాన మంత్రి పదవుల్లోకి తీసుకోకూడదని లిజ్‌ భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. జాత్యహంకార పార్టీ అన్న ముద్రను తొలగించుకొనేందుకు, శ్వేతేతర జాతుల వారి ఓట్ల కోసం ఇదంతా అన్నది స్పష్టం. లిజ్‌-సునాక్‌ మధ్య పోటీలో కూడా శ్వేతజాతి ఆధిపత్య భావజాలం పని చేసిందన్నది స్పష్టం. మంత్రులుగా ఎవరున్నారన్నది ప్రధానం కాదు, ప్రభుత్వ విధానాలు ఏమిటన్నదే గీటురాయి. మరో టోరీ ప్రధాని అని తప్ప లిజ్‌ ట్రస్‌ విధానాల మీద కార్మికుల్లో ఎలాంటి భ్రమలు లేవు.


ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమె ధనికులకు అనుకూలమైన అంశాల గురించి స్పష్టంగా చెప్పారు. అధికాదాయం ఉన్నవారికి పన్నులు తగ్గించటం న్యాయం అన్నారు. వచ్చే ఏడాది కార్పొరేట్‌ పన్నును 19 నుంచి 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చు. బీమా పధకాల్లో ఆమె ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం పేదలకు ఏడాది 7.66 పౌండ్లు మాత్రమే లబ్ది కాగా ధనికులకు 1,800 పౌండ్లు మిగులుతాయి. బ్రిటన్‌లో కార్మికవర్గంతో పాటు పెట్టుబడిదారీ విధానం కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నది. దాని భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు పూనుకుంది.ఐరోపా సమాఖ్యలో కొనసాగటం కంటే వెలుపల ఉంటేనే తమకు ఎక్కువ లబ్ది అని అక్కడి కార్పొరేట్‌లు భావించిన కారణంగానే దాన్నుంచి వెలుపలికి వచ్చింది. వాటికి మార్కెట్‌ను సంపాదించి పెట్టటం లిజ్‌ సర్కార్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఇదే తరుణంలో కరోనా, ఉక్రెయి, తదితరాల కారణంగా తలెత్తిన సమస్యల నుంచి బయటపడటం అంత తేలికేమీ కాదు. గత దశాబ్దన్నర కాలంగా బ్రిటన్‌ పెట్టుబడిదారులు ప్రభుత్వం మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు.


రష్యా, చైనాల పట్ల రిషి సునాక్‌ మెతకగా ఉంటారంటూ ఎన్నిక ప్రచారంలో లిజ్‌ ట్రస్‌ విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్‌ రాజీని చెడగొట్టటంలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు అతని బూట్లలో కాళ్లు పెట్టిన లిజ్‌ ఎలా నడుస్తారో చూడాల్సి ఉంది. నిజానికి రిషికి చైనా అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. ఒక పెట్టుబడిదారుగా చైనాతో వచ్చే లబ్దిపొందాలన్నదే తప్ప మరొకటి కాదు. లిజ్‌ ట్రస్‌తో ఎన్నికల పోటీలో భాగంగా చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు. ఇప్పుడు ట్రస్‌ ఈ అంశాల గురించి ఎలా స్పందిస్తారు, ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.పార్టీ సభ్యులలో 81,326 ఓట్లు లిజ్‌కు రాగా 60,399 రిషి సునాక్‌ పొందారు. బిబిసి పేర్కొన్నదాని ప్రకారం 82.6శాతం మంది ఎన్నికలో పాల్గొన్నారు.


నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగానే బ్రిటన్‌లో వివిధ రంగాల్లోని కార్మికులు సమ్మెలకు పూనుకున్నారు.ఈ నెల 15న పన్నెండు కంపెనీలకు చెందిన 40వేల మంది రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పొదుపు పేరుత ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా, ప్రభుత్వ సేవలను పరిరక్షించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. తరువాత కూడా వివిధ తేదీలలో రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. రైల్వే కార్మికులకు వేతన స్థంభన లేదా వేతన కోతల ప్రతిపాదనలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో బ్రిటన్‌లో కార్మికుల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏప్రిల్‌ నాటికి ఇంథన బిల్లులు 50శాతం పెరిగ్గా, అక్టోబరు నాటికి 80శాతానికి చేరనున్నాయి. గత వేసవిలో సగటున 1,277 పౌండ్ల మేర బిల్లులు రాగా ఈ ఏడాది 3,549 పౌండ్లకు పెరగనున్నాయి. ఇవి ముందుగా బిల్లు చెల్లించేవారికి, తరువాత కట్టే పేదవారికి 3,608 పౌండ్లకు పెరుగుతాయి. గృహస్తులకే గాక స్కూళ్లు, సంరక్షణ కేంద్రాలు, చిన్న దుకాణాలు అన్నింటికీ పెరగనున్నాయి. వచ్చే జనవరి తరువాత మరింతగా పెరుగుతాయి.మొత్తం 70లక్షల పేద కుటుంబాల మీద దీని ప్రభావం పడనుంది. ఇంథన దారిద్య్రాన్ని అంతమొందించాలనే ఉద్యమ సంస్థ అంచనా ప్రకారం రాబడిలో పదిశాతాన్ని ఖర్చు చేస్తున్నారని,105లక్షల కుటుంబాల మీద ప్రభావం ఉందని పేర్కొన్నది. మరొక అంచనా ప్రకారం 2023 జనవరి నాటికి ఇంథన దారిద్య్రంలో మూడింట రెండు వంతుల కుటుంబాలు కూరుకుపోతాయి. ప్రభుత్వం జనం కంటే ఇంథన కంపెనీల లాభాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. ఒక వైపు జనం ఇబ్బందులు పడుతుంటే బోరిస్‌ జాన్సన్‌ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు ఆగస్టు పదిహేను నాటికి 2.3బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.


రానున్న రోజుల్లో ఆహార, ఆరోగ్య సంక్షోభం కూడా పెరగనుంది. 2009-10లో బ్రిటన్‌లోని స్వచ్చంద సంస్థలు ఆహారాన్ని అందచేసేవి నామమాత్రం. వాటిలో ఒకటైన ట్రస్సెల్‌ట్రస్టు 35 కేంద్రాలను నిర్వహించి 61వేల ఆహార పొట్లాలను అందచేసింది. తరువాత 2019-20 నాటికి కేంద్రాలు 1,400కు పెరగ్గా పది లక్షల 90వేలకు, 2020-21లో 26లక్షలు, 2021-22లో 22లక్షల ఆహార పొట్లాలు అందచేసింది. కరోనాకు ముందు దేశంలోని నాలుగు శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార భద్రత సమస్యను, మరో నాలుగుశాతం పరిమితమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడించాయి.ఆహార కేంద్రాలు ఎక్కువ భాగం చర్చ్‌లలో ఉండటంతో కొంత మంది ఆకలిని భరించటానికి ఇష్టపడ్డారు తప్ప అక్కడికి వెళ్లేందుకు సిగ్గుపడ్డారని, దూరంగా ఉండటం, అవి తెరిచే సమయాల వలన కూడా కొందరు వెళ్లటం లేదని కూడా వెల్లడైంది. గత పన్నెండు నెలల్లో సర్వే చేసి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారినట్లు తేలి ఉండేదని అమెరికా సర్వే సంస్థ ఒకటి పేర్కొన్నది. జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ ఈ కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది.
లిజ్‌ ట్రస్‌ సారధ్యంలో భారత్‌-బ్రిటన్‌ సంబంధాలు ఎలా ఉంటాయని కొందరు చర్చ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పెద్ద మార్పులు ఉండే అవకాశాలు లేవు. తమ వస్తువులకు మన మార్కెట్‌ను తెరవాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న వత్తిడి కొనసాగనుంది. ద్రవ్యోల్బణం దాని తరువాత మాంద్యంలోకి జారనుందనే పరిస్థితిలో మన ఎగుమతులైన వస్త్రాలు,దుస్తులు, ఆభరణాల వంటి వాటికి ఏ మేరకు డిమాండ్‌ ఉంటుందో చెప్పలేము.2020-21లో ఇరు దేశాల లావాదేవీలు 13.2 నుంచి మరుసటి ఏడాది 17.5 బి.డాలర్లకు పెరిగాయి. మన ఎగుమతులు 10.5 బి.డాలర్లు కాగా దిగుమతులు ఏడు బిలియన్‌ డాలర్లు. రెండు దేశాల మధ్య కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి. దీపావళి నాటికి రెండు దేశాలూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్ధికంగా ఐరోపా సమాఖ్య నుంచిదూరమైన బ్రిటన్‌ అంతర్జాతీయ మార్కెట్ల వేటలో అమెరికాతో జతకట్టటం తప్ప మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: