ఎం కోటేశ్వరరావు
ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్ ఆన్ ఎకౌంట్ తప్ప దాన్ని బడ్జెట్గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్ బడ్జెట్ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్ రామ్ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్ రామ్ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.
గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్ స్టేటస్ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !
ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్సైట్ 2023 జూన్ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్ఓ నివేదిక ప్రకారం భారత్లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.
అరబ్బు, ఇస్లామిక్ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా. అది 2023 ఏప్రిల్ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్ మహేష్ వ్యాస్ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్ట్రిక్స్ డాట్కామ్ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.
ఇక లక్షాధికారి అక్క (లక్పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2023 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్ వాడీలను జగన్ సర్కార్ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.
ఆంధ్రప్రదేశ్లో సర్వేచేసిన యాంకర్ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !