Tags
# Anti Sanatan Dhrma, BJP, fake news, fake news in mahabharata, fake news in Ramayana, fake news stories, Propaganda War, Rational Thinking, RSS, Sri Krishna, Sri Rama
ఎం కోటేశ్వరరావు
రానున్న సంవత్సరాలలో ప్రపంచానికి 34 రకాల ముప్పులు ఉంటాయని, వాటిలో ఒకటైన తప్పుడు వార్తల సునామీ తొలుత మన దేశాన్నే తాకుతుందని దవోస్లో జరిగిన 54 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే నకిలీ వార్తల వరదలో నిండా తడిచిన జనం సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. అసలు మన జనం అలాంటి వార్తలను అంతగా ఎందుకు నమ్ముతున్నారు? వాటిని ఎవరు, ఎందుకు వండి వడ్డిస్తున్నారు. జనం గుడ్డిగా తాము తిని, ఇతరులకు ఎందుకు తినిపిస్తున్నారు అన్నది ప్రశ్న. ఇతిహాసాలుగా ఉన్న భారత రామాయణాలు, వాటి చుట్టూ అల్లిన పురాణాలు, వేల సంవత్సరాలుగా వాటిలోని అంశాలను ఎందుకు అని ప్రశ్నించకుండా మనల్ని మందమతులుగా, వాలునబడి కొట్టుకుపోయే వారిగా మార్చివేసిన మన పూర్వీకుల ఆచరణ- భావజాలమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఎందుకు అనటమే పెద్ద పాపం అన్నట్లుగా ప్రశ్నించే తత్వాన్నే అణచివేశారు. రావణుడికి పుష్పక విమానం ఉంది, అదే కాలంలో ఉన్న రాముడికి అదెందుకు లేదు ? ఈ ప్రశ్నవేస్తే ఉత్తిపుణ్యానికే అనేక మంది మనోభావాలను గాయపరుచుకుంటారు. సున్నా, ఇంకా ఇతర అనేక అంశాలను కనిపెట్టింది మనమే అని గొప్పగా చెప్పుకుంటాం.వాటి కొనసాగింపు నవకల్పనలు ఉంటే పారిశ్రామిక విప్లవం, తదుపరి కొనసాగింపుకు మనదేశమే కేంద్రమే అయి ఉండేది.పురాణాల్లో విమాన రూపకల్పన పద్దతి ఉందని గొప్పగా చెప్పుకుంటాం. వర్తమానంలో మన సంస్కృత పండితులు, శాస్త్రవేత్తలు వాటి ఆధారంతో ఆధునిక విమానాలను ఎందుకు రూపొందించలేకపోయారు ? ఇప్పటికైనా పైకీ, కిందికీ, ఎటుబడితే అటు, ఇంథనం లేకుండా తిరిగే పుష్పక విమానాల మాదిరి వాటిని అభివృద్ధి ఎందుకు చేయటం లేదు ? ప్రశ్న లేకుంటే మానవ జాతి ముందుకు పోయేది కాదు, ఆ ప్రశ్నకు అడ్డుగోడలు కట్టి మనువాదులు సమాజాన్ని వెనక్కు నడిపేందుకు చూశారు.ప్రశ్నించిన చార్వాకుల రచనలను సర్వనాశనం చేశారు.
వేల సంవత్సరాల క్రితమే మన దేశం సముద్రాలను దాటి విదేశీ వ్యాపారం చేసిందని చరిత్రలో చెప్పుకుంటాం. అలాంటి సమాజంలో సముద్రం దాటి విదేశాలకు వెళితే పాపం అనే సుభాషితాలు, ఆంక్షలు ఎలా వచ్చాయి. అవి రాకపోతే కొలంబస్కు బదులు అమెరికాను మనవారే ఎప్పుడో కనుగొని ఉండేవారు కదా ! అలాంటి అవకాశాలను లేకుండా చేసిందెవరు ? బౌధాయన సూత్రాల ప్రకారం విదేశీగడ్డ మీద హిందూమతానికి చెందిన వారు పవిత్రులుగా ఉండలేరు. సముద్రాలు దాటిన వారు కులాన్ని, పునర్జన్మ అవకాశం కోల్పోతారు.అందువలన సముద్రయానం నేరం, పాపం. దానికి పరిహారం కూడా చెప్పారు. అలాంటి వారు ఏం చేయాలంటే రెండు రోజులకు ఒకసారి కొద్దిగా ఆహారం తీసుకోవాలి, మూడు పూటలా స్నానం చేయాలి. పగలంతా నిల్చోవాలి, రాత్రి పూట కూర్చోవాలి. ఇలా మూడు సంవత్సరాలు చేస్తే పాపం నుంచి విముక్తి అవుతారు. ఎవరైనా అలాంటి పాపానికి, దానికి ప్రాయచిత్తానికి పూనుకుంటారా ? అందుకే నోరు మూసుకొని గిరిగీసుకొని ఉన్నారు. వాటిని ధిక్కరించిన వారు కూడా ఉన్నారు. భీమవరానికి చెందిన యార్లగడ్డ సుబ్బారావ్ వారిలో ఒకరు. ఆయన అమెరికా వెళ్లకుండా పౌరోహిత్యమో, కరణీకమో చేసుకుంటూ ఉండి ఉంటే ఫోలిక్ యాసిడ్ను కనుగొన్న ఘనత ఆయనికీ, భారతీయులుగా మనకీ దక్కేదా ?
చిత్రం ఏమిటంటే ఇప్పటికీ సముద్రాలు దాటిన వారిని తిరుమల తిరుపతి దేవుడి పూజారిగా అనుమతించటంలేదు(వికీపీడియా,ఇతర సమాచారం). బ్రిటన్లో న్యాయవాద విద్య అభ్యసించటానికి వెళ్లిన మహాత్మాగాంధీని కులం నుంచి వెలివేశారు. రాజస్థాన్ రెండవ మహారాజా సవాయి మధోసింగ్ 1901లో బ్రిటన్ వెళ్లాడు.హిందువులు విదేశీ నీటిని తాగకూడదన్న నిబంధన ఉన్న కారణంగా ఒక పాత్రలో నాలుగువేల లీటర్ల గంగా జలాన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు. ఉడిపి కృష్ట దేవాలయ పూజారిగా సుగేంద్ర తీర్ధ విధులు నిర్వహించటానికి వీల్లేదని 2007లో కొందరు స్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకటా, అతను విదేశాల్లో పర్యటించి సాగరోల్లంఘనకు పాల్పడినందుకు అని చెప్పారు. మరుసటి ఏడాది కోర్టు తీర్పు ప్రకారం పూజారిగా అనుమతి పొందారు. కేరళలోని తిరువళ్లలో ఉన్న శ్రీవల్లభ ఆలయంలోకి విష్ణునారాయణ నంబూద్రి లండన్ పర్యటించి వచ్చిన తరువాత పూజారిగా ప్రవేశించటానికి వీల్లేదని అడ్డుకున్నారు. పాపపరిహారం చేసుకోవాలని, 1008సార్లు గాయత్రీ మంత్రం పఠించి పునీతుడు కావాలని ఆంక్షలు విధించారు. దానికి అతను నిరాకరించారు.చివరికి తిరవాన్కూర్ దేవస్థానం బోర్డు జోక్యం చేసుకొని ఇద్దరు అధికారులను తొలగించింది.రాజీగా పవిత్ర జలాలను చల్లుకున్న తరువాత పూజారిగా అనుమతించారు. సనాతన ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించాలని చెబుతున్నవారు విదేశాలు తిరిగి రహస్యంగా ప్రాయచిత్తం చేసుకుంటున్న బహిరంగ రహస్యం తెలిసిందే.ఎవరైనా హేతువాదులు ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలను ప్రశ్నిస్తే సనాతన, హిందూ విరోధులు అంటూ సామాజిక మాధ్యమంలో, వెలుపలా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ అనేక దేశాలు తిరిగారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సనాతన ధర్మం ప్రకారం ఆయన ప్రాయచిత్తం చేసుకున్నట్లు ఎక్కడా వార్తలు చదవలేదు. రహస్యంగా ఏమైనా చేశారో తెలియదు.
ఇలాంటి చాదస్తాలతో మునిగి తేలుతున్న జనానికి డబ్బుకావాలి, దాంతోపాటు తరతరాలుగా గూడుకట్టుకున్న భయంతో ప్రాయచిత్తం చేసుకోవాలి. అందుకే ఒక చేత్తో డాలర్ పూజ మరో చేత్తో పోలేరమ్మకు సద్ది పెడుతున్నారు. డాలర్మే పరమాత్మాహై ! అందుకే వాటి కోసం ఎంతటి స్వదేశీ, సనాతన ధర్మ పరిరక్షకులైనా తలవంచాల్సిందే. ఇక్కడ హేతువు, ప్రశ్నను చంపేస్తున్నాం. వాలునబడి కొట్టుకుపోయేందుకు అలవాటు పడ్డాం గనుక గత తరాలు పుక్కిటి పురాణాలను నమ్మితే వర్తమానంలో వాట్సాప్ సందేశాలను మోసుకుపోయేందుకు సిద్దపడుతున్నాం. ఇక తప్పుడు వార్తల విషయానికి వస్తే అర్ధ సత్యం అనేది పూర్తి అబద్దమని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పాడు. అబద్దాలు అనేక రకాలుగా ఉంటాయి, నిజానికి అలాంటి అవకాశాలు లేవన్నది ఒక సామెత. అసత్య ప్రచారం, అబద్దాలను వాస్తవంగా చిత్రించటం మనకు వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తోంది. వర్తమానంలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్ వీడియోలు, ఆడియోలు, తప్పుడు సమాచారం జనాన్ని పక్కదారి పట్టించటంలో భాగమే. మహాభారత కథ ప్రకారం తప్పుడు వార్తలు, మాయల సృష్టికర్తగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు ఎందుకు అలాంటి పని చేశాడు అంటే యుద్ధంలో ద్రోణుడిని చంపకపోతే పాండవులకు విజయం దక్కదన్న కారణమే. ఒక ఎత్తుగడపన్ని ధర్మరాజుతో అశ్వద్దామ హతహ అని పెద్దగా పలికించిన తరువాత నారో వా కుంజరో వా (మరణించింది మనిషి లేదా ఏనుగు కావచ్చు అని అర్ధం) అని పూర్తి చేసేటపుడు వినపడకుండా బాజాలు మోగించేట్లు చేయించాడని, దాంతో అశ్వద్దామ మరణించాడనే వార్త వ్యాపించింది. అది విన్న తండ్రి ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయటం, ద్రోణుడిని చంపివేయటంతో పాండవులు ముందుకు పోయారని చెబుతున్నది తెలిసిందే. తన కుమారుడికి చావులేదని తెలిసినప్పటికీ ద్రోణుడు అలా ఎందుకు అస్త్రసన్యాసం చేశాడంటే ధర్మరాజు మీద ఉన్న తిరుగులేని విశ్వాసం.
ఎవరినైనా గుడ్డిగా నమ్మితే తప్పుడు వార్తలు ఎంతగా ప్రభావితం చేసేదీ దీనిలో మనకు కనిపిస్తుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకే హిందూ, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాలకు చెందిన వారు, వాటిని ఆశ్రయించుకున్న వారు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల యుద్ధాన్ని ఏం చేసైనా గెలవాలన్న మహాభారత నీతి సూత్రమే గత రెండు లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు వార్తల వ్యాప్తికి తెరలేపింది.నాడు మహాభారత యుద్దంలో అలాంటి వార్తలతో పాండవులు గెలిచి ధర్మాన్ని నిలబెట్టారని చెబుతుంటే నేడు అపర మహాభారతంలో కౌరవులు గెలుస్తూ రాజధర్మాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెడుతున్నారు.జనం నమ్ముతున్నారు గనుక అది సాధ్యమౌతోంది. అందుకోసం మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(పూర్వపు ట్విటర్) వంటి అస్త్రాలను వాడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక విదేశీ గడ్డ మీద మహాభారత రధం దొరికింది అని ఒక వీడియోను యూట్యూబ్లో పెడితే జనం వేలం వెర్రిగా చూశారు. నిజానికి అది 2018లో చైనా టీవీ నిర్మించిన ఒక డాక్యుమెంటరీలో చూపిన 255 సంవత్సరాల నాటి షాంగ్ రాజవంశ రధం. ఒక పురావస్తు ప్రదర్శనశాలలో చిత్రీకరించింది. అదే విధంగా భీముడి కుమారుడు ఘటోత్కచుడి భారీ కంకాళం దొరికిందని చెప్పినా జనం గుడ్డిగా నమ్మారు.
రావణుడి చెరలో ఉన్న సీత శీలం గురించి తప్పుడు వార్తల ప్రచారం కారణంగానే రాముడు ఏం చేశాడో తెలిసిందే. తాజాగా నటి రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో సంచలనం, నిందితుడి అరెస్టు తెలిసిందే. బంగరు లేడి ఉండదని తెలిసినా దాన్ని పట్టుకురమ్మని సీత కోరటం ఏమిటి ? లక్ష్మణుడిని సీతకు కాపలాగా పెట్టి రాముడు ఆ లేడి వెంట వెళ్లటం, దాన్ని చంపటం, అప్పుడు లేడి రూపంలో వచ్చిన మారీచుడు ప్రాణం కోల్పోతూ కూడా రాముడి స్వరాన్ని అనుకరించి సీతా, లక్ష్మణా అని అరవటం, సీత కంగారు పడి లక్ష్మణుడిని వెళ్లి చూడమని కోరటం, ఏం కాదు అన్న తిరిగి వస్తాడని చెప్పినా వినకపోవటం, విధిలేక ఒక గీత గీసి దాన్ని దాటి వెలుపలికి రావద్దని లక్ష్మణుడు అడవిలోకి వెళ్లగానే రావణుడు మారువేషంతో రావటం, గీత దాటిన సీతను అపహరించటం తెలిసిందే. కొద్ది సంవత్సరాల క్రితం జెఎన్యులో దేశద్రోహ నినాదాలు చేశారంటూ మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన కథకు, మాయలేడి ఉదంతానికి సంబంధం కనిపించటలేదూ ! రావణుడి ఆయుపట్టు గురించి రాముడికి చెప్పిన విభీషణుడు ధర్మం కోసం పనిచేసిన పవిత్రుడిగా ఆరాధిస్తాం. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో అలాంటి వారిని ఎదుటి పక్షం తయారు చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నది, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నవి అంటే రామాయణం నుంచే. మన సమాజ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నవారిని తప్పు పట్టాలా ? ఎలాంటి తర్క వితర్కం, హేతుబద్దత లేకుండా నమ్ముతున్నవారిని విమర్శించాలా ? కొన్ని దేశాలు ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఎందుకున్నాయి ? మనల్ని వాటిలో ముంచితేల్చుతున్నది ఎవరు ? విధి అనుకుందామా, వాట్సాప్ అందామా ? మన చేతుల్లో లేని విధి రాతగా భావించి అచేతనంగా ఉన్నా, మన ఫోన్లో ఉన్న వాట్సాప్ను అడ్డుకోకపోయినా నష్టపోయేది మనమే, కాదంటారా ?