• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

16 Saturday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

FIMI, iron ore, Iron Ore Exports, ISA, steel companies, steel prices in India, Trading with China



ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

11 Monday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనవరి 26 ఢిల్లీ : ఒకవైపు రిపబ్లిక్‌ డే కవాతు మరోవైపు రైతన్నల ట్రాక్టర్ల ప్రదర్శన !

02 Saturday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi protest, India Republic Day, Indo-US trade agreement, Kisaan tractor parade


ఎం కోటేశ్వరరావు


రైతుల న్యాయమైన డిమాండ్లపై సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న యత్నాలను చూస్తున్నాము. అవి ఫలించకపోతే ఉక్కు పాదంతో అణచివేస్తారా ? ఇప్పటికి ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు గానీ, ఏం జరుగుతుందో చెప్పలేము.డిసెంబరు 30న జరిగిన చర్చలలో ముసాయిదా విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఎత్తివేస్తామని, పంజాబ్‌, హర్యానా, మరికొన్ని ప్రాంతాలలో పనికిరాని గడ్డిని తగులబెడుతున్న కారణంగా పర్యావరణానికి హాని పేరుతో శిక్షించే ఆర్డినెన్స్‌ నుంచి రైతులను మినహాయిస్తామని కేంద్ర ప్రభుత్వం నోటి మాటగా అంగీకరించింది. ఇతర ముఖ్యమైన డిమాండ్ల విషయంలో అదే మొండి పట్టుదల కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను అంగీకరించటానికి(అమలు జరుపుతారో లేదో ఇంకా తెలియదు) ప్రభుత్వానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఎంత మొండిగా, బండగా ఉందో అర్ధం అవుతోంది.


మిగిలిన తమ డిమాండ్ల పట్ల రైతన్నలు పట్టువీడే అవకాశాలు కనిపించటం లేదు.జనవరి నాలుగవ తేదీన జరిగే చర్చలలో ఎలాంటి ఫలితం రానట్లయితే తదుపరి కార్యాచరణను రైతు సంఘాల కార్యాచరణ కమిటీ శనివారం నాడు ప్రకటించింది. జనవరి ఐదవ తేదీన సుప్రీం కోర్టు రైతుల ఆందోళన సంబంధిత కేసుల విచారణ జరపనున్నది. ఆరవ తేదీన హర్యానాలోని కుండిలి-మనేసర్‌-పాలవాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు మీద ట్రాక్టర్లతో ప్రదర్శన, 15 రోజుల పాటు నిరసన, జనవరి 23న సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా హర్యానా గవర్నర్‌ నివాసం ఎదుట నిరసన, ఆందోళనకు రెండు నెలలు పూర్తయ్యే సందర్భంగా 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరుపుతామని, అదే రోజు రాష్ట్రాల రాజధానులన్నింటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతుల కార్యాచరణ కమిటీ నేతలలో ఒకరైన డాక్టర్‌ ధర్నన్‌పాల్‌ విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. తమ ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని, మేము చాలా రోజుల క్రితమే చెప్పినట్లు ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మూడు చట్టాలను వెనక్కు తీసుకోవటం లేదా బల ప్రయోగంతో మమ్మల్ని ఖాళీ చేయించటం అని దర్శన్‌ పాల్‌ చెప్పారు.


ఇది రాస్తున్న సమయానికి రైతుల నిరసన 38వ రోజు నడుస్తున్నది. ఇప్పటికీ సామాన్యులకు అంతుబట్టని-బిజెపి లేదా ఆందోళనను తప్పు పడుతున్న వారు వివరించేందుకు సిద్దపడని అంశం ఏమంటే, మూడు చట్టాలకు ముందు ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన, తెచ్చినదాని మీద పార్లమెంట్‌లో తగిన చర్చకూడా లేకుండా ఆదరాబాదరా ఆమోద ముద్ర వేయాల్సినంత అత్యవసరం ఏమి వచ్చింది అన్నది. ఇవేమీ కొత్తవి కాదు, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాలని చెబుతున్నవారు ఆర్డినెన్స్‌ అవసరం గురించి మాత్రం చెప్పరు. బహుశా వారి నోటి వెంట ఆ వివరాలు రావనే చెప్పవచ్చు. మూడు చట్టాలవలన రైతాంగానికి హాని ఉందంటూ వాటిని వెనక్కు తీసుకోవాలని కొందరు మేథావులు ప్రకటనలు చేశారు. దానికి పోటీగా మేలు జరుగుతుంది, కొనసాగించాల్సిందేనంటూ అంతకంటే ఎక్కువ మంది మేథావుల సంతకాలతో ఒక ప్రకటన చేయించారు. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు చెప్పినా వినాల్సిందే, ఆలోచించాల్సిందే. క్షీరసాగర మధనం మాదిరి మధించి ఎవరు చెప్పిన దానిలో హాలాహలం ఉంది, ఎవరు చెప్పినదానిలో అమృతం ఉందన్నది తేల్చుకోవాలి.శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు కనుక విషాన్ని పక్కన పెట్టేసి దాన్ని తాగించ చూసిన మేథావులెవరైతే వారికి స్ధానం లేదని చెప్పాలి.

జరిగిన పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే మాలల్లో బయటకు కనిపించని దారం మాదిరి సంబంధాన్ని చూడవచ్చు. అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరువాత మిగిలింది వ్యవసాయమే. కరోనా సమయంలో అన్ని రంగాలు కుప్పకూలిపోగా మూడుశాతంపైగా వృద్ధి రేటు నమోదు చేసింది ఇదే. అందువలన దాన్నుంచి కూడా లాభాలు పిండుకోవాలని స్వదేశీ-విదేశీ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. అందుకు గాను వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగించటం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులను గుమ్మరించేందుకు అనుమతించటం ఒకటి. మూడు చట్టాల ద్వారా మొదటి కోరికను తీర్చారు. ఇప్పుడు రెండవ కోర్కెను తీర్చాలని విదేశాలు ముఖ్యంగా అమెరికా వత్తిడి చేస్తోంది.
అమెరికన్‌ కార్పొరేట్లు మన వ్యవసాయరంగంలో రెండు రకాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాయి. ఒకటి ఉత్పత్తుల కొనుగోలు వ్యాపారంలో గణనీయమైన వాటాను దక్కించుకోవటం. రెండవది తమ ఉత్పత్తులను గుమ్మరించటం. రైతుల ప్రతిఘటన ఎలా ముగుస్తుందో తెలియదు, దాన్నిబట్టి కార్పొరేట్లు తమ పధకాలను రూపొందించుకుంటాయి. మొదటిది ఎంత సంక్లిష్ట సమస్యో రెండవది కూడా అలాంటిదే. అందుకే గతంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌-ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా గుంజాటనలో ఉన్నాయి.


అమెరికాలో నవంబరు ఎన్నికల్లోపే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ తెగ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు ఎలాంటి పాత్ర లేని, చైనా, ఇతర ఆసియా దేశాలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం నుంచి అమెరికా వత్తిడి మేరకు మన దేశం వెనక్కు తగ్గిందన్నది ఒక అభిప్రాయం. అయితే దానిలో చేరితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాలకు ముప్పు కనుక ఆ రంగాల నుంచి వచ్చిన తీవ్రమైన వత్తిడి కూడా వెనక్కు తగ్గటానికి ప్రధాన కారణం గనుక అమెరికా పాత్ర కనిపించలేదని చెబుతారు.
తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకోకపోయినా చిన్న ఒప్పందం అయినా చేసుకోవాలని అమెరికా వత్తిడి తెచ్చింది. దానిలో భాగంగానే 2019 ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ పర్యటన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్లుగా ఏడాది ముగిసేలోగా మొదటి దశ ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనాను కూడా లెక్క చేయకుండా ట్రంప్‌ రావటానికి ఇదొక కారణం. ఎన్నికల్లోగా అనేక దేశాలతో చిన్న వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్నది ట్రంప్‌ దూరాలోచన.(హౌడీమోడీ కార్యక్రమం కూడా దానిలో భాగమే). చిన్న ఒప్పందాలకు అక్కడి పార్లమెంట్‌ ఆమోదం అవసరం ఉండదు. ఎన్నికల తరువాత రాజెవరో రెడ్డెవరో అప్పుడు చూసుకోవచ్చు అన్నది ట్రంప్‌ దురాలోచన.


పది సంవత్సరాల క్రితం 2010లో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్‌ కిర్క్‌ అమెరికా సెనెట్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి.” మనం తీవ్ర ఆశాభంగం చెందాం. సాధారణంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎక్కడా బయటకు చెప్పం. కానీ వ్యవసాయ అంశాలలో వారి మార్కెట్‌ను తెరిచే అంశంపై భారత్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అన్నాడు. పది సంవత్సరాల తరువాత జరిగిందేమిటి ? 2019లో నరేంద్రమోడీ సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు భారత్‌కు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రంప్‌ ప్రకటించారు. నవంబరులో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్‌సిఇపి నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.

అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు-పర్యవసానాలను క్లుప్తంగా చూద్దాం.ఎవరో అమెరికాతో కలసి తొడ కోసుకున్నారని మనం మెడకోసుకోలేము. ఒప్పందాలు కూడా అంతే. అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించదు.అమెరికాతో చైనా ఒప్పందం చేసుకుంటే లేని తప్పు మనం చేసుకుంటే ఉంటుందా అని కాషాయ దళాలు వెంటనే దాడికి దిగుతాయి. త్వరలో అమెరికా జిడిపిని అధిగమించే దిశ, దశలో చైనా ఉంది, మనం ప్రస్తుతానికి పగటి కలలో కూడా ఆ పరిస్ధితిని ఊహించుకోలేమని గ్రహించాలి. ఆర్‌సిఇపి ఒప్పందం కటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు ప్రపంచంలో మరే దేశమూ ఇవ్వటం లేదు.
మన దేశంలో ఒక కమతపు సగటు విస్తీర్ణం ఒక హెక్టారు. అదే అమెరికాలో 176 ఉంటుంది, అంటే ఆ రైతులతో మనం పోటీ పడాలి. అక్కడ మొత్తం కమతాలు 21లక్షలు, వ్యవసాయం మీద ఆధారపడే జనం కేవలం రెండుశాతం. అదే మన దేశంలో 14 కోట్ల 60లక్షలు. సగం మంది జనం వ్యవసాయం మీదే బతుకు. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ 2018లో పాడి ఉత్పత్తుల మీద ప్రమాణాలను సడలించి అమెరికా నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 30 నుంచి 60శాతం వరకు ఉన్న దిగుమతి పన్నును ఐదుశాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వెయ్యి ఆవుల లోపు డైరీల నుంచి 45శాతం, రెండున్నరవేల ఆవులకు పైగా ఉన్న డైరీల నుంచి అమెరికాలో 35శాతం పాల ఉత్పత్తి ఉంది. పెద్ద డైరీల్లో 30వేల వరకు ఉన్నాయి. అక్కడి డైరీ యాజమాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాడి ఉత్పత్తుల మీద 15, 20 సంవత్సరాల వ్యవధిలో 40శాతంగా ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గిస్తామని 2019లో జపాన్‌ ఒప్పందం చేసుకుంది. దేశంలో పాడి పరిశ్రమలో కార్పొరేట్‌ శక్తులు గుత్తాధిపత్యం వహించటం మీరెక్కడైనా చూశారా అని ఇటీవల రైతులతో సమావేశం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఇప్పుడు లేదు, రేపు విదేశీ ఉత్పత్తులను అనుమతిస్తే పరిస్ధితి ఏమిటి ?


కోడి కాళ్ల దిగుమతులకు మన దేశం మీద అమెరికా తీవ్ర వత్తిడి తెస్తోంది. అది కోరుతున్నట్లుగా పదిశాతం పన్నుతో దిగుమతులకు అనుమతిస్తే 40లక్షల మందికి ఉపాధి ఉండదు. అది ఒక్క కోళ్ల పరిశ్రమనే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్‌ పండిస్తున్న రైతులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో కోళ్ల పరిశ్రమను ఐదు బడా కార్పొరేషన్లు అదుపు చేస్తున్నాయి.2016లో కోడి, గొడ్డు, పంది మాంస మార్కెట్లో సగం వాటా వాటిదే. అక్కడి రైతులతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. బ్రెజిల్‌ తరువాత కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండవ దేశం అమెరికా. ఆ రెండు ప్రపంచంలో సగం కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి.

అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. విద్యుత్‌ సంస్కరణలకు ముసాయిదా బిల్లును రూపొందించి విడుదల చేశారు, అభిప్రాయాలను కోరారు. అదే మాదిరి ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి వ్యవసాయ బిల్లులకు తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం.


అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు(2034వరకు) 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మెక్సికోతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న అమెరికా తన సబ్సిడీ మొక్కజొన్నలను అక్కడ గుమ్మరించటంతో 20లక్షల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు.
2016 డిసెంబరులో మోడీ పభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ? పంజాబ్‌, హర్యానా, ఇతరంగా గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాల రైతాంగం ఆందోళనలో ముందు ఉన్నదంటే ఇలాంటి అనుభవాలే కారణం.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ధాన్య సేకరణ వివరాల ప్రకారం డిసెంబరు 30 నాటికి 479.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా వాటిలో 42.3శాతం పంజాబ్‌, 11.7శాతం హర్యానా నుంచే ఉన్నాయి. అక్కడి రైతాంగం ఎందుకు ముందుగా స్పందించిందో ఇవి కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే. మన ప్రధాని నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నప్పటికీ ట్రంప్‌ మనకు చేసిన మేలేమీ లేదు. ఇప్పుడా పెద్దమనిషి ఇంటిదారి పట్టాడు. త్వరలో అధికారం చేపట్టనున్న జో బైడెన్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనలను మరింత ఇరకాటంలో పెట్టేందుకు అమెరికన్లకు అవకాశాలు పెరిగాయి. వారి వత్తిడికి లొంగి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ చట్టాల వలన వచ్చే ముప్పు మరింత పెరుగుతుంది. కోళ్లు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావటం అనివార్యం. మన పాడి పరిశ్రమ సమస్యలను పట్టించుకోని కారణంగానే ఆర్‌సిఇపిలో చేరలేదని మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే పెద్దలు ఇప్పుడు ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనను పట్టించుకొనేందుకు, వద్దంటున్న చట్టాలను వెనక్కు తీసుకొనేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ? రేపు ఏదో ఒకసాకుతో అమెరికాకు, ఇతర ధనిక దేశాలకు లొంగిపోరన్న హామీ ఏముంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా ఐదేండ్లు ముందుకు, భారత్‌ వెనక్కు – మోడినోమిక్సు నిర్వాకం !

27 Sunday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

China vs India GDP, modinomics, Modinomics a farce


ఎం కోటేశ్వరరావు


చప్పట్లు కొట్టించి – దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. పోనీ మోడినోమిక్స్‌తో అయినా దేశం ముందుకు పోతోందా ? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించామని కరోనాను అధిగమించి ఆర్ధికంగా ముందుకు పోతామని చెప్పారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్న విజయగానాలు మూగపోయాయి. ఈ మధ్యకాలంలో కొత్తవేమీ దొరక్క వంది మాగధులకు ఉపాధిపోయింది. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. కానీ వారి వెన్ను విరిచే వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో నెల రోజులకు పైగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సరైన సమాధానం లేక ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పిల్లిమొగ్గలు వేస్తూ రైతులను బదనాం చేసేందుకు పూనుకున్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఐదేండ్లు ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనోమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. జిడిపి ముందుకు పోవటానికి తమ గొప్ప అన్నవారు వెనక్కు పోయినందుకు బాధ్యత ఎవరిదో చెబుతారో కరోనా మీద నెడతారో చూద్దాం. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం ? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం ఒక కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది. దీనికి తోడు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌ మధ్య పెద్ద తేడాలు లేకపోవటమే దీనికి కారణం. 2017వ సంవత్సర వివరాల ప్రకారం భారత్‌ జిడిపి విలువ 2.651లక్షల కోట్ల డాలర్లు కాగా బ్రిటన్‌ 2.638, ఫ్రాన్స్‌ 2.583 లక్షల కోట్ల డాలర్లు.


సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని 2025లో పొందనుందని అంచనా వేసింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుందో తెలియదు. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఆరవ స్ధానానికి దిగజారిందని,2025లో తిరిగి ఐదవ స్ధానం, 2030 నాటికి మూడవ స్దానంలోకి రావచ్చని సిఐబిఆర్‌ వార్షిక నివేదికలో జోశ్యం చెప్పింది. ఆ సంస్ధ చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. భారత ఆర్దిక వ్యవస్ధ 2021లో తొమ్మిది, 2022లో ఏడుశాతం చొప్పున విస్తరిస్తుంది. ఆర్ధికంగా పురోగమించే కాలదీ సహజంగానే వేగం తగ్గి 2035నాటికి వృద్ది రేటు 5.8శాతానికి పడిపోతుంది. 2025 నాటికి బ్రిటన్‌, 2027నాటికి జర్మనీ, 2030నాటికి జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్‌ మూడవ స్ధానానికి చేరుతుంది.


గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.జపాన్‌ 2030వరకూ మూడవ స్ధానంలో ఉండి, అప్పటికి నాలుగవ స్దానంలో ఉన్న జర్మనీని దిగువకు నెట్టి నాలుగవ స్ధానంలో ఉంటుంది.కరోనాతో నిమిత్తం లేకుండానే దానికి ముందే భారత ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని కోల్పోతున్నది. 2016లో 8.3శాతం, 2018లో 6.1శాతం కాగా 2019లో పదేండ్ల కనిష్టమైన 4.2శాతం నమోదైంది.


దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జన జీవితాల నాణ్యత ఎంత పెరిగిందన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. అందువలన ఒక దేశాన్ని వెనక్కు నెట్టేశామా, ఏ దేశం మీద ఎన్ని గంతులు వేశామన్నది ముఖ్యం కాదు. వెనకటికి ఎవడో బజార్లో మాది 101 అరకల వ్యవసాయం అని కోతలు కోశాడట. మీది అంటున్నావు, ఎంత మంది ఉన్నారు, నీది ఎంత అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్దాలకు వెళ్లిన వలస కార్మికులను మరోవైపు కరోనా కాలంలో చూశాము. అందువలన అంబానీలుాఅభ్యాగ్యులను కలిపి చెబితే పైన చెప్పిన కోతలరాయుడి మాదిరి గొప్పగానే ఉండవచ్చు. 138 కోట్లు దాటిన మన జనాభా జీవితాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021-25 మధ్య చైనా వార్షిక వృద్దిరేటు 5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022-24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వృద్దిరేటు ఉంటుంది.

చైనా వృద్ధి రేటు పైన చెప్పిన మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వృద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. దీన్నే అంటే అభివృద్దినే తనకు ముప్పుగా అమెరికా ప్రపంచానికి చూపుతోంది. కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్ధలు చెబుతున్నట్లు చైనా నిజానికి అమెరికాను అధిగమించటం అంత తేలిక కాదు. వైఫల్యంతో అమెరికా దిగజారితే అది అసాధ్యమూ కాదు. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు జనజీవితాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరణ ఉంది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.


ఇదే సమయంలో తమ వృద్ది రేట్లను ఎలా పెంచుకోవాలా అన్నదాని కంటే అమెరికా, ఇతర దేశాలు, వాటితో కలసి మన పాలకులు చైనాను ఆర్దికంగా, ఇతర విధాలుగా దెబ్బతీసేందుకు ఏమి చేయాలా అన్నదాని మీద ఎక్కువ కేంద్రీకరించారు. చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివృద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినోమిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివృద్దికి చేసిన కృషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు. బయట పల్లకీ మోతను చూసి మోడీ గొప్ప అని చెప్పిన వారు ఇంట్లో ఈగల మోతకు కారణం ఏమిటో చెప్పరు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటాన్ని ఊహించలేకపోయినట్లుగా మోడీ పాలనలో దేశ ఆర్ధిక వృద్ది దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.

జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015-20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు. లక్ష్యం ఎంత ? సాధించింది ఎంత ? ఈ పరిస్ధితికి కారణం ఏమిటో కనీసం ఏకపక్ష ప్రసంగమైన మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పారు.అదే చేశారు. ఏమైంది ?


తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతులుాదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతం ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేసినా వారి ఎగుమతుల మీద పెద్ద ప్రభావం చూపలేదు. నవంబరు నెలలో ఎగుమతులు 21.1శాతం పెరిగితే దిగుమతులు 4.5శాతం పెరిగాయి.(చైనా చెప్పేది ఎలా నమ్మగలం అనేవారికి సమాధానం లేదు) కరోనా వైరస్‌ తొలుత బయట పడింది చైనాలో అన్నది తెలిసిందే. దాన్ని నిర్ణయాత్మకంగా నిరోధించింది కూడా అక్కడే. నిర్లక్ష్యం చేసి ఇప్పటికి కోటీ 85లక్షల మందికి అంటించిన అమెరికా, కోటి మంది దాటిన మన దేశం, ఇతర ధనిక దేశాలూ వైఫల్యానికి నిదర్శనాలు. మిగిలిన అగ్రశ్రేణి దేశాలన్నీ మాంద్యంలో కూరుకుపోతే రెండుశాతం వృద్దితో చైనా తన ప్రత్యేకతను ప్రదర్శించింది.

మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ విస్మరించింది. పేదలకు డబ్బు ఇవ్వకూడదన్నవారు చెప్పిన తర్కం ఏమిటి ? జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదు. జనం ఇప్పటికీ దేనికి ఖర్చు చేయాలో చేయకూడదో అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఇస్తే రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి డబ్బూపోయి, జనం ఖర్చు చేయక దగ్గర దాచుకుంటే కొనుగోళ్లు పెరగ ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలా సాగింది.


దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు( ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేండ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తయారు చేసింది. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.


అంతా ముగిసిపోయింది, మామూలు పరిస్ధితులు ఏర్పడ్డాయి అని చెబుతున్నవారికి రిజర్వుబ్యాంకు సమాచారం రుచించకపోవచ్చు. నవంబరు ఆర్‌బిఐ సర్వేలో 63శాతం మంది తమ ఆదాయాల్లో ఈ ఏడాది కోతపడిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే తమ ఉపాధి పరిస్ధితి దిగజారిందని 80శాతం చెప్పారు. ఏడాది క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు పెరిగాయని 90శాతం చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందు తాము వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తామని 25ా30శాతం మంది గృహస్తులు చెబితే, మేనెలలో అది 1.25శాతానికి పడిపోతే అక్టోబరులో 7.4శాతానికి పెరిగింది తప్ప కరోనా ముందు స్ధాయికి రాలేదు. ఉన్న పొదుపును తప్పని సరి అవసరాలకే వినియోగిస్తారు. ఆదాయం లేక పోయినా వినిమయ వస్తువుల కొనుగోలు రద్దు లేదా వాయిదా వేసుకుంటారు. ధరలు పెరిగితే అంతకు ముందు పొదుపు చేసుకున్న మొత్తాలు హరించుకుపోతాయి లేదా అప్పులపాలు అవుతారు.

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? అంతసీన్‌ లేదు. పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గృహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు. దీనికి ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలు ఒక కారణం. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాపితంగా వివిధ ముడివస్తువులు, ఇతర పారిశ్రామిక వినియోగ వస్తువుల ధరలు పడిపోయి, ఉత్పాదక ఖర్చు తగ్గటం. ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, ఇతర ఖర్చుల తగ్గుదల అందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించేది లేదని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అలాంటపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్దలు ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిని తగ్గించి లేదా పని భారం పెంచి వేతన బిల్లును తగ్గించుకుంటారు. అది మరొక ఆర్ధిక దిగజారుడుకు నాంది అవుతుంది.


2021-25 మధ్య బ్రిటన్‌ నాలుగుశాతం వృద్ది రేటుతో అభివృద్ది చెందనుందనే అంచనాతో అప్పటికి మన దేశం దాన్ని అధిగమిస్తుందని సిఇబిఆర్‌ విశ్లేషకులు చెప్పారు. అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద చెప్పిన జోస్యం ప్రకారం మన ఆర్ధిక వ్యవస్ధ 2021 నుంచి 2025 మధ్య 8.8 నుంచి 7.2శాతం వృద్ది రేటుతో అభివృద్ధి చెందుతుంది. ఒక వేళ అదే నిజమైతే కోల్పోయిన మన జిడిపి ఇంకా ముందుగానే పెరగవచ్చు. మరి సిఇబిఆర్‌ నిపుణులకు ఐఎంఎఫ్‌ అంచనాలు తెలియవా? వాటిని పరిగణనలోకి తీసుకోలేదా ? అంతకంటే తక్కువ వృద్ధి రేటు అంచనా ఎందుకు వేసినట్లు ? కోల్పోయిన ఐదవ స్దానాన్ని సాధించటానికే ఐదేండ్లు పడుతుందని జోస్యం చెబుతుంటే మరి రెట్టింపుతో 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెప్పిన మాటల సంగతి ఏమిటి ? మోడినోమిక్స్‌ విఫలమైందని అనేక మంది విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు ఎప్పుడో చెప్పారు. కరోనా నుంచి దేశం బతికి బట్ట కట్టగలదని రుజువైంది గానీ మోడినోమిక్స్‌తో కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్ల రద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. కనుక ఏడు సంవత్సరాల క్రితం అచ్చే దిన్‌ గురించి నరేంద్రమోడీ చెప్పిన అంశాలను జనం మరచిపోయారు. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. నిజానికి మన బడా ప్రయివేటు రంగం ఎంత అసమర్ధంగా ఉందో జనానికి తెలియదు. యాభై కోట్ల డాలర్లకు పైబడి ఆదాయం వచ్చే పెద్ద కంపెనీలు తత్సమానమైన చైనా, మలేసియా వంటి దేశాల్లోని కంపెనీలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, దక్షిణ కొరియా వాటితో పోల్చితే మూడున్నర రెట్లు తక్కువగా జిడిపికి జమ చేస్తున్నాయి. అదే విధంగా ఉత్పాదకత స్దాయిలు చూస్తే 10-25శాతం మధ్య ఉన్నాయి. కేవలం 20శాతం కంపెనీలు మాత్రమే 80శాతం లాభాలను సమకూర్చుతున్నాయి.


జిడిపిలో ఐదవ స్ధానాన్ని తిరిగి సంపాదించటం గురించి లండన్‌ సంస్ద చెప్పిన అంశం ఒకటైతే అంతకంటే ముఖ్యమైనవి ఉన్నాయి.2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. వాటిలో ఆరు కోట్ల కొత్త వారికైతే, మూడు కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మారే వారికోసం సృష్టించాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే నిఖర ఉపాధిని కల్పించే అభివృద్ధి రానున్న పది సంవత్సరాలలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరశాతం చొప్పన అభివృద్ధి రేటు ఉండాలి. చైనా జిడిపితో పాటు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నది తిరుగులేని సత్యం. కనుక మోడినోమిక్స్‌ అన్నా మరొకటి అన్నా జిడిపి పెరుగుదల జనానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో వీటి జాడలు లేవు. సంపదల పంపిణీ అసమానత పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎండమావుల వెంట పరుగుపెడుతున్నట్లుగా జనం ఉన్నారు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డిసెంబరు 27: నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ -నిరసనగా రైతుల తాలీ బజావ్‌ !

25 Friday Dec 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi on Farmers


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బడా కంపెనీలకు తిరిగి బ్యాంకుల అప్పగింత స్వాతంత్య్రానికే ముప్పు !

10 Thursday Dec 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Corporate banks, Private banks in India, RBI


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


గతంలో బ్యాంకింగ్‌ అనుభవం ఉన్నవారికే బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే వారు. ఇప్పుడు దానితో పని లేదు. బడా కంపెనీయా కాదా అన్నదే గీటు రాయిగా మారనుంది? కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకుల ఏర్పాటు పై మార్గదర్శకాలను సూచించమని కోరుతూ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీ.కే మహంతి ఆధ్వర్యాన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఒక అంతర్గత వర్కింగ్‌ గ్రూపు ని 2020 జూన్‌ 20 న నియమించింది. ఈ బ ందం చేసిన సూచనలు దేశంలో ఒక తీవ్ర చర్చను లేపాయి.

కార్పోరేట్‌ పారిశ్రామిక సంస్ధలు స్వంతంగా బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతించాలని,పెద్ద కార్పోరేట్‌ కంపెనీలను బ్యాంకులను ప్రమోటర్లుగా అనుమతించాలని గ్రూప్‌ ప్రతిపాదించింది. ఇవి అమలైతే బడా కార్పోరేట్‌ కంపెనీలన్నీ స్వంత బ్యాంకులను ప్రారంభించుటకు అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బ్యాంకులలో ప్రమోటర్ల వాటా పరిమితి ని 15 శాతంనుండి 26 శాతానికి పెంచాలని, 50 వేల కోట్ల పైన ఆస్దులు వున్నకంపెనీలకు బ్యాంకింగ్‌ లైసెన్సులను మంజూరు చేయాలనిసూచించింది. దీనికి చెప్పిన కారణాల సారాంశం ఇలా ఉంది. (1) బ్యాంకులు ప్రారంభించటానికి కార్పోరేట్‌ కంపెనీలకు లైసెన్సులు ఇస్తే పెట్టుబడుల లభ్యత పెరుగుతుంది. (2) పరిపాలనాఅనుభవం తోపాటుగా నైపుణ్యం కలిగిన వ్యూహాత్మక కార్పోరేట్‌ మేనేజ్‌ మెంటు లభిస్తుంది.

భారీ మొత్తాలలో రుణాలకోసం బ్యాంకుల చుట్టూ తిరిగే కార్పోరేట్లకు బ్యాంకులను ఇవ్వటం సరికాదని ఆర్ధికవేత్తలు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్ధకే ప్రమాదం అన్నారు.
ఈ సూచనలు అమలైతే టాటా, బిర్లా, అంబానీ, అదానీ, యల్‌ అండ్‌ టీ, వంటి దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలు భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగంలో కీలకంగా మారనున్నాయి. దేశ ఆర్ధికవ్యవస్ద తమ చేతిలో వుంచుకుని లాభాలే ధ్యేయంగా క షిచేస్తారు. బ్యాంకులను తమ ఆదాయ వనరుగా మారుస్తారు.కరోనా మహమ్మా రి వలన సామాన్యప్రజలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోగా కార్పోరేట్‌ కంపెనీలకు లాభాలపంటపండింది. 2020 మూడవ త్రైమాసికంలో భారత్‌ లోని కార్పోరేట్‌ కంపెనీలు రికార్డు స్ధాయిలో 1.33 లక్షల కోట్లు ఆర్జించాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీ యమ్‌ ఐ ఈ )తెలిపింది. ఇదే సమయంలో కొత్తగా బిలియనీర్లయినవారి సంఖ్య కూడా పెరిగింది. అట్టి చరిత్ర కలిగిన కార్పోరేట్‌ కంపెనీలకు బ్యాంకులు అప్పగిస్తే డిపాజిటర్ల డబ్బులకు భధ్రత గురించి కూడా ఆలోచించాలి. బ్యాంకు లో భవిష్యత్‌ అవసరాలకు దాచుకున్నసామాన్యులు, మధ్యతరగతి ప్రజల గతిఏమవుతుందో వూహించటంకష్టం. ఈ ప్రమాదకరమయిన ప్రతిపాదనలు ప్రజల పొదుపుమొత్తాలను ముప్పులో పడేస్తాయి. ఆర్ధికవ్యవస్ధకు తీవ్రమైన హానికలిగిస్తాయి.

భారతీయ రెగ్యులేటరీ ఏజన్సీలను మోసంచేయడం-రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ లోపంవలన , కంపెనీ అధిపతుల అనుకూల ప్రభుత్వవిధానాలవలన, మొండి బాకీలు, అవినీతి పెచ్చుమీరటంవలన బ్యాంకులు కుంటుతున్నాయి. పడిలేస్తున్నాయి. ఎన్నో లోపాలున్నాయి. అయినా రైతులకు, చిరువ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు కొంతవరకయినా రుణాలివ్వక తప్పటంలేదు. ప్రజలకు లభించిన ఈవెసులుబాటును కూడా ప్రజలకు దక్కకుండా చేయాలని కార్పోరేట్‌ రంగం క షిచేస్తున్నది. 2018సం. మార్చి నాటికి భారతీయ బ్యాంకులలో మొండి బాకీలు రు. 9.62 లక్షల కోట్లు అందులో 73.2 శాతం కార్పోరేటు కంపెనీల బాకీలే అన్నది గమనించాలి. వ్యవసాయ సంబంధిత అప్పులు రూ . 85,344 కోట్లు మాత్రమే.

బ్యాంకులపై పర్యవేక్షణ ఎట్లా వుంది
2014 లో ఆర్భాటంగా ప్రారంభించిన యస్‌ బ్యాంకు 2020 కల్లా దివాళా తీసింది. 2,41,000 కోట్ల బకాయీలలో 1,45,000 కోట్లు పారుబకాయిలు, అంటే తిరిగి రానివి. అందులో ముఖ్యబాకీదారుడు అనిల్‌ అంబానీ. రిజర్వు బ్యాంకు యస్‌ బ్యాంకును రక్షించింది. ప్రభుత్వ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాచేత 49 శాతం వాటాలను కొనిపించి యస్‌ బ్యాంక్‌ ను కాపాడింది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ను నీరవ్‌ మోడీ 13,800 కోట్లకు ముంచాడు. 2018 లో ఐ డీ బీ ఐ , 2019 లో లక్ష్మీవిలాస్‌ బ్యాంకు,2019 లో పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకులు వరసగా దివాళాతీశాయి.
రమేష గెల్లీ నాయకత్వాన మోడల్‌ బ్యాంకుగా పేరుపొందిన గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు 1994 లో సికిందరాబాద్‌ లో ప్రారంభమయింది. పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి 2004 సం.లో దివాళాతీసింది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డిపాజిటర్లను, ఉద్యోగస్తులను, బ్యాంకును కాపాడింది. ప్రభుత్వ సంస్ధ అయిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స లో విలీనంచేశారు. బ్యాంకును దారితప్పించి మోసంచేసిన వారికి లాభం చేకూరింది. చివరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు క ట్టే సామాన్య ప్రజలే మరొక సారి మోసంచేయబడ్డారు.
ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ వీడియోకాన్‌ గ్రూపుకి 1875 కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారని ఒక విజిల్‌ బ్లోయర్‌ అరవింద్‌ గుప్తా ప్రధానమంత్రికి, ఆర్ధికమంత్రి అరుణజైట్లీగార్లకు ఎన్నో లేఖలు వ్రాశారు. ఆర్ధికమంత్రి అరుణజైట్లీగారికి ఈ కుంభకోణంలో పాత్ర వుందని ఆరోపణలు కూడా వున్నాయి. ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ నిబంధనలకు విరుద్ధంగా తన భర్త వ్యాపార భాగస్వామి ఐన వేణుగోపాల్‌ ధూత్‌ కి అప్పు సాంక్షన్‌ చేశారు. వేణుగోపాల్‌ ధూత్‌ వీడియోకాన్‌ కంపెనీ అధినేత. అప్పులను మొండిబాకీలుగా (%చీూA%) ప్రకటించారు. వీడియోకాన్‌ గ్రూపునకు రూ.1,875 కోట్ల రుణాల మంజూరులో అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై గతంలో మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ అభియోగాల నేపథ్యంలో చందా కొచ్చర్‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. జస్టిస్‌ బీఎన్‌ శ్రీక ష? నేత త్వంలో కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించింది. ఆ తర్వాత ఎండీ, సీఈవో పదవుల నుంచి చందా కొచ్చర్‌ను తొలగించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ కొచ్చర్‌ను అరెస్టు చేసింది.


లక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం
94 ఏళ్ళ చరిత్ర వున్నలక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం లో చిక్కుకున్నది. 19 రాష్ట్రాలలో 566 బ్రాంచీలతో పేరుపొందింది. మందుల పరిశ్రమ లో కార్పోరేట్‌ సంస్ద అయిన రాన్‌ బాక్సీ సంస్ధకు ఒక్కదానికే 720 కోట్లు అప్పు ఇచ్చారు. ఇంకా మొండిబాకీలు ఎక్కువయి బ్యాంకు దివాళాతీసింది. డిబిఎస్‌లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. డీ బీ ఎస్‌. బ్యాంకు సింగపూర్‌ కేంద్రంగా 18 దేశాల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్న విదేశీ సంస్థ. ఈ విధంగా ఒక విదేశీ బ్యాంకు లక్ష్మీవిలాస్‌ బ్యాంకును మింగేసింది.
ఈ కార్పోరేటు బ్యాంకులు దివాళా తీసినా, వారి పరిశ్రమలు దివాళా తీసినా మొత్తం ఆర్ధికవ్యవస్ధ కుప్పకూలే ప్రమాదం వున్నది. 8లక్షల 80 వేల కోట్ల మొండి బాకీలున్నాయి. వేల కోట్ల రూపాయల బ్యాంకు బాకీలున్నవారందరూ కార్పోరేట్‌ యజమానులే . అందులో 12 మంది బాకీలు 4వ వంతు వున్నాయి. విజయమాల్యా, నీరవ్‌ మోడీ, అనిల్‌ అంబానీ, అదానీ లాంటి మహామహులు ఎంతోమంది వున్నారు.
కార్పోరేట్‌ కంపెనీల చేతులలో బ్యాంకులు వుంటే ఎటువంటి నిబంధనలు లేకుండా నిధులను వారే మంజూరు చేసుకుంటారు. ఇపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయనాయకులకు, పార్టీలకు డొనేషన్లు ఇవ్వటంలో ముందున్నాయి. ఇక బ్యాంకులు , కంపెనీలు కలిపి నిర్వహిస్తున్నబ్యాంకులలో డబ్బులకు కొదవవుండదు. దేశరాజకీయం డబ్బుల చుట్టూతిరుగుతున్నపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయాలను ఇంకా క్రియాశీలంగా నిర్వహిస్తాయి. నీతి నియమాలగురించి పెద్దపట్టింపు లేని కార్పోరేటుకంపెనీల చేతిలో ప్రజల ధనాన్ని వుంచటం పెను ప్రమాదాన్ని సూచిస్తున్నది. గత కొద్ది సంవత్సరాలలో కనీసం 15-20 లక్షల కోట్ల రూపాయలను కార్పోరేటు పారిశ్రామిక వర్గాలు బాకీపడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం కావాలని ఎగగొట్టారు.

బ్యాంకుల జాతీయకరణకు ముందు ఎలా వుండేది.
1969 సం.లో 14 ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ ముందున్న పరిస్ధితిని గుర్తుతెచ్చుకొంటే రాబోయే రోజులలో కార్పోరేటు బ్యాంకులు ఏంచేస్తాయో వూహించవచ్చు. స్వంత ప్రయోజనాలను పెంచుకోవటానికే ఆనాటి బ్యాంకులు పనిచేశాయి. వ్యవసాయంచేసుకునే రైతులకు 2 శాతం అప్పులు కూడా ఇవ్వలేదు. గొర్రెలకు, బర్రెలకు, చేతివ త్తిదారులకు, మహిళలకు, ఇంటికి , చదువులకు,స్కూటర్‌ , చిన్నపరిశ్రమలకు,వ్యాపార రుణాలు బ్యాంకులు జాతీయం చేసినతరువాతనే అందుతున్నాయి. గ్రామీణప్రాంతప్రజలకు, సమాజంలోని బలహీనవర్గాలకు కొంతవరకయినా సంస్ధాగత రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నిలోపాలున్నా ప్రభుత్వబ్యాంకులు కాబట్టి కొంతలోకొంత చిన్నవారికి అవసరానికి అప్పుదొరికింది. బ్యాంకుల కుంభకోణాలను, వైఫల్యాలను, అవినీతిని నివారించి బ్యాంకింగ్‌ వ్యవస్ధకు స్ధిరత్వాన్నికల్పంచి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే వుద్దేశంతో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. బ్యాంకుల జాతీయకరణ హఠాత్తుగా జరగలేదు. ప్రజల త్యాగాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా నే బ్యాంకుల జాతీయకరణ, ఇన్స్యూరెన్సు కంపెనీల జాతీయకరణ , భారీ పరిశ్రమలు, సమాజంలో కొన్ని అభివ ధికర మార్పులు జరిగాయి. జాతీయకరణకు ముందు బ్యాంకులు పూర్తిగా ప్రైవేటురంగంలో వుండేవి. బ్యాంకుల చరిత్ర చాలా ఆందోళనకరంగా వుండేది. బడా పారిశ్రామికవేత్తలు వారికి వారే అప్పులిచ్చుకునేవారు. ఆర్దిక శాఖ సలహాదారైన వీ.ఏ. పాయి పనానడికర్‌ 1967 లో ఇలా అన్నారు.’బ్యాంకుల అంతర్గత వ్యవహారాలన్నీ డైరక్టర్ల చేతిలోవుండేవి. అప్పుల వ్యవహారాల విచక్షణాధికారం డైరక్టర్లకే వుండేది.”
1969 సం.జులై 19 న జాతీయకరణ జరిగింది. 50 కోట్లకు మించి డిపాజిట్లువున్న 14 బ్యాంకు లను, 1980 లో 200 కోట్లు డిపాజిట్లు వున్న 6 బ్యాంకులను జాతీయంచేశారు. ఆనాటికి డిపాజిట్లు 4646 కోట్లు వుంటే ఇపుడు 125 లక్షలకోట్లున్నాయి. అపుడు 3599 కోట్లరూపాయలను రుణాలుగా ఇస్తే 96.5 లక్షలకోట్లను అప్పులు ఇస్తున్నారు. వ్యవసాయానికి 2.2 శాతం అప్పులిస్తే ఇపుడు 18 శాతం ఇవ్వమని ఆదేశాలున్నాయి. 1969 లో వ్యవసాయానికి మొత్తం 162 లక్టల రూ.ను ఇస్తే , 2011 సం.లో 4లక్షల కోట్ల రూ.లను ఇచ్చారు. ప్రాధాన్యతారంగాలకు అప్పులు15 శాతంనుండి 41 శాతానికి పెరిగాయి. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ వ్యవస్ధ విస్తరించింది. బ్యాంకు శాఖలు 8262 సంఖ్య నుండి 1,41,756 కు పెరిగాయి.
చరిత్ర లో తనకు సంబంధాలున్నవారికే అప్పులివ్వటం అనివార్యంగా వినాశనానికే దారితీసింది. అప్పుతీసుకునేవాడు యాజమాన్యంలో వుంటే, బ్యాంకు వసూలు చేయగల్గిన రుణాలు ఎలా ఇవ్వగలుగుతుంది. ఫలితంగా నిరర్ధక ఆస్ధులు అలవికాని స్ధాయికి చేరుకున్నాయి. తాజా ఉదాహరణలు యస్‌ బ్యాంకు, లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ఐ.ఎల్‌.ఎఫ్‌.ఎస్‌ బ్యాంకులు – దివాళాతీసిన తీరు ఆర్బీఐ నియంత్రణా వైఫల్యాలను సూచిస్తున్నది..

ప్రస్తుతం కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు కొన్ని బాగా నడుస్తూ వుండవచ్చు. వారి స్వంత క్రమశిక్షణ పాత్ర చాలా ఎక్కువగా వుంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణ వలన బాగున్నాయనుకోవటానికి వీలులేదు.చిన్నమొత్తంలో పొదుపుచేసుకునే సామాన్యప్రజానీకాన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల కు అప్పచెప్పటంవలన జరిగిన కంపెనీల ఎగవేతలూ, పొదుపుదారుల ఆక్రందనలూ, ఆత్మహత్యలూ అందరికీ తెలిసినవే. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలపైన పర్యవేక్షణ బలహీనంగా వుంది. కొంతమంది వ్యాపార సామ్రాజ్యాధిపతులు రాజకీయనాయకుల అండదండలతో సామాన్యప్రజలపొదుపు సొమ్ముతో ఆటలాడుకుంటున్నారు.
మన దేశంలో ఇపుడు వున్న బ్యాంకులు చాలవా మళ్ళీ కార్పోరేట్‌ బ్యాంకులెందుకు అనే ప్రాధమిక ప్రశ్నను కొంతమంది లేవనెత్తుతున్నారు. కార్పోరేట్‌ కంపెనీలు ప్రజల సొమ్ముతోనే వ్యాపారాలు చేస్తాయి. స్వంత పెట్టుబడితో వ్యాపారాలు చేయటం చాలా అరుదు. ప్రజల వద్దనుండి నిర్దిష్ట పనులకు తీసుకున్న పెట్టుబడులు ఆయా పనులకు వినియోగించటం వుండదు. బడా కార్పోరేట్‌ సంస్ధలను బ్యాంకులకు దూరంగా వుంచకపోతే మొత్తం ఆర్ధిక వ్వవస్ధనే మింగేస్తారు.

పారిశ్రామిక సంస్ధలకు పెట్టుబడులు కావాలి. వారి చేతిలో బ్యాంకు వుంటే సునాయాసంగా ప్రశ్న లేకుండా డిపాజిట్ల రూపంలో పెట్టుబడులను పొందగలరు. ఆ డబ్బులను స్వంత కంపెనీలలోకి , మళ్ళించటం సహజ ప్రక్రియ. పరిశ్రమ దివాళా తీస్తే బ్యాంకు కూడా దివాళా తీయక తప్పదు. మొండి బాకీలు నిరర్ధక ఆస్ధులయి బ్యాంకు దివాళాతీస్తుంది. బ్యాంకు దివాళా ప్రభావం పరిశ్రమ మీద పడుతుంది. ఈ గొలుసుకట్టు పరిణామాలలో మొదటి బాధితుడు బ్యాంకు లో డబ్బులు దాచుకున్న సామాన్య డిపాజిట్‌ దారుడు. తరువాత ఉద్యోగాలు కోల్పోయే బ్యాంకు ఉద్యోగులు. అసలైన బాధితులు పన్నులు కట్టే సామాన్య పౌరులు .


ప్రయోజనాల మధ్య సంఘర్షణ
స్వంత ప్రయోజనాలకూ తన వ త్తి ధర్మాలకూ సంఘర్షణ సంభవించినపుడు, ఎటువైపు వుంటారనేది ముఖ్యసమస్య. కార్పోరేట్‌ బ్యాంకు రైతులకు, సామాన్యప్రజలకు అప్పులు ఇవ్వాలా లేక తన పరిశ్రమకు అప్పులిచ్చి, స్వంత లాభాలు పెంచుకోవాలా అనే ప్రయోజనాల మధ్య ఘర్షణ వచ్చినపుడు అనివార్యంగా తనపరిశ్రమవైపే మొగ్గుచూపుతున్నారనేది చారిత్రక సత్యం. అదానీ గారు బ్యాంకు పెట్తే, తనకు కొత్తగా కేటాయించిన విమానాశ్రయాలకు అప్పులు ఇస్తాడా లేక రైతులకు అప్పులు ఇస్తాడా? హిందూ వ్యాస రచయిత గోపీనాధ్‌ గారికధలో..ఎట్టిపరిస్ధితులలోనూ కోడిని తినను అని ప్రతిజ్ఞ చేసిన ఒక నక్కను కోళ్లఫారం వద్ద కాపలాపెట్టారు. ఆకలి అయినపుడు నక్కఏంచేస్తుందో-అదే విధంగా కార్పోరేట్‌ కంపెనీలు చేస్తాయని గోపీనాధ్‌ చెప్పారు. సెబీ నిపుణుడు హేమీంద్ర హజారీ ‘ నక్కలను కోళ్ళకు ఇన్‌ఛార్జిగా కాపలా ఉంచాలని, ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక పాలనలో కూడా, ప్రారంభ దశలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వంటి పెద్ద నియంత్రిత ఆర్థిక సంస్థల అనుసంధాన రుణాలను ఆర్‌బిఐ గుర్తించలేకపోయింది.” అన్నారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాశారు. కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకులు పెట్టడానికి అనుమతివ్వాలంటూచేసిన ప్రతిపాదన పిడుగుపాటు లా అనిపించిందన్నారు.” చరిత్ర చూసుకుంటే రుణాలు ఇవ్వటమనేది ఇప్పటికీ సరిగ్గా జరగని ప్రక్రియే. అటువంటిది ఒక రుణగ్రహీత చేతిలో బ్యాంకు వుంటే..రుణాల జారీ సక్రమంగా ఉంటుందని ఎలా ఆశించగలం. ఒక స్వతంత్ర నియంత్రణసంస్ధఉన్నా ..దాని చేతిలో ప్రపంచంలోని మొత్తం సమాచారంఉన్నా ..ఆర్ధికవ్యవస్ధలో ఎక్కడో ఏమూలో చోటు చేసుకునే అసమంజస రుణాన్ని ఎలా కనిపెట్టగలదు” అని ప్రశ్నించారు. గత కొన్నేళ్ళుగా కార్పోరేట్‌ ఎగవేతలు మనముందుకనిపిస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా వారికి ప్రమోటర్లుగా అవకాశమిచ్చి బ్యాంకులు పెట్టుకోమని లైసెన్సులు ఇవ్వాలనటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కార్పోరేట్‌ గ్రూపులు ఆర్ధికంగా మరింత బలపడటానికి బ్యాంకు లైసెన్సులు దోహదపడతాయన్నారు.

బలహీనమైన నియంత్రణ , పర్యవేక్షక సామర్థ్యం లేవి ఆర్బిఐ యొక్క రికార్డును చూస్తే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ కార్పోరేట్‌ బ్యాంకుల రుణాలను పర్యవేక్షించగలదా అని ప్రముఖ ఆర్ధిక వేత్త, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇలాపట్నాయక్‌ అన్నారు.ఇలా పట్నాయక్‌, రాధికాపాండే అనుమానించారు. రెగ్యులేటరీ వ్యవస్ధను అదనంగా అభివ ధి చేసి పర్యవేక్షించాలని శంకర ఆచార్య, విజయ కేల్కర్‌, అరవింద్‌ సుబ్రమనియన్‌, ఇండిన్‌ ఎక్సప్రెస్‌ పత్రిక లో సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాస్తూ, ‘పారిశ్రామిక సంస్ధలకు స్వంత బ్యాంకులను అనుమతించటం ఆర్ధిక వ ద్ధిని , ప్రజాస్వామ్యాన్నీ దెబ్బతీయడమే అన్నారు.భారత పెట్టుబడిదారీ విధానం కళంకం కలిగి వుంది. ఎందుకంటే ప్రభుత్వానికీ పారిశ్రామిక పెట్టుబడికీ దుష్ట సంబంధాలున్నాయి. పారిశ్రామిక పెట్టుబడి కి ఫైనాన్స్‌ కేపిటల్‌ కీ మధ్య అడ్డంగా వున్న రేఖను చెరిపేస్తే ఈ కళంకం మరింత ఘోరంగా వుంటుంది.” అన్నారు. కార్పోరేట్లకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వటం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి బాటలు వేయటమేనని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు అన్నారు. ప్రభుత్వ చర్యలు ఆర్ధిక అస్ధిరత్వానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు.

ప్రభుత్వ రంగం బ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధల స్వంతం చేసే కుట్ర

ప్రస్తుతం రిజర్వ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రప్రభుత్వ కనుసన్నలలో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఏమికావాలంటే ఆర్బీఐ అది చేస్తున్నది. కేంద్రప్రభుత్వం కార్పోరేట్‌ సంస్ధల ప్రయోజనాలను నెరవేరుస్తున్నది. ప్రభుత్వ రంగం లోని బ్యాంకులను కైవసం చేసుకోవడానికి ఇదొక కొత్త వ్యూహం.
నయాఉదార వాదవిధానాల పిదప జాతీయబ్యాంకులను మూసివేసి ప్రయివేటు బ్యాంకులుగా మార్చమని భారత్‌ ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్నది. ప్రభుత్వ బ్యాంకుల పని తీరు అధ్వాన్నంగా వున్నందున జాతీయకరణ రద్దుచేసి మొత్తం బ్యాంకులనన్నిటినీ ప్రయివేటు చేయాలన్నది బలమైన ప్రజాభిప్రాయంగా మలుస్తున్నారు. జాతీయ బ్యాంకులలో ప్రయివేటువ్యక్తుల మూలధనాన్ని పెంచుకోవటానికి అనుమతించి ఆతరువాత పెట్టుబడుల ఉపసంహరణపేరున షేర్లను అమ్మేసి బ్యాంకులను కార్పోరేట్‌ పరిశ్రమాధిపతులకు అప్పచెప్పేందుకు జరుగుతున్నకుట్ర లో భాగమే ఈ సూచనలు. అంతర్జాతీయద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం పెరిగే కొద్దీ బ్యాంకులన్నిటినీ కార్పోరేట్‌ కంపెనీలే స్వంతం చేసుకుంటాయి. మన స్వాతంత్య్రం, జాతీయ సార్వభౌమత్వం దెబ్బతినటమేకాక రైతాంగం, చిన్నఉత్పత్తిదారులు,చిరువ్యాపారులు రుణ సౌకర్యంలేక కష్టాలపాలవుతారు. కొద్దిమంది కార్పోరేట్‌ అధిపతుల వద్ద అనూహ్యమైన సంపద పోగుపడుతుంది. పెట్టుబడి పోగుపడే ప్రక్రియ వేగవంతమయి అసమానతలు పెరిగి దారిద్య్రం తాండవిస్తుంది. ప్రభుత్వబ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధలకు కట్టబెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు,ఫోన్‌. 9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రైతుల ఆందోళన – వెనక్కు తగ్గేది లేదంటున్న బిజెపి !

10 Thursday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, indian farmers


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

26 Thursday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China BRI, China goods boycott, narendra modi cock and bull stories, RCEP INDIA


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: