• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: March 2021

చివరిక్షణంలో ప్రత్యర్ధుల ప్రచార బాంబు : పినరయి విజయన్‌ హెచ్చరిక !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala UDF, Narendra Modi, Priyanka gandhi, propaganda bomb in last minute


ఎం కోటేశ్వరరావు


సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రచార బాంబు ప్రయోగం కేరళ ఓటర్ల మీద జరగబోతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాసరగోడ్‌ ఎన్నికల సభలో హెచ్చరించారు. అదేమిటి ? ఎలా ఉండబోతున్నది అనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విజయన్ను ప్రశ్నించాలని, విజయన్‌ కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ కోరారు. కొంత మంది రాబోయే రోజుల్లో పెద్ద బాంబు పేలబోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి బాంబులనైనా ఎదుర్కొనేందుకు మన నేల సిద్దంగా ఉందని, అలాంటి ప్రచారాల ఉద్దేశ్యం ఏమిటో జనానికి తెలుసునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవాల ముందు ఎంత పెద్ద అబద్దమైనా నిలవదని, నిజాలేమిటో బయటకు వచ్చేంత వరకే అలాంటివి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో అబద్దాలను ప్రచారంలోకి తెస్తే జవాబు చెప్పేందుకు అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారని, సమాధానం చెప్పేందుకు తగిన వ్యవధి ఉండదు, అబద్దాలు మనల్నేమీ చేయకపోయినప్పటికీ , వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వాటి పట్ల ఎల్‌డిఎఫ్‌ కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్‌ కోరారు.


ప్రచార బాంబు ఏమై ఉంటుంది అన్న చర్చ అంశాల సారాంశం ఇలా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్దలు దొంగబంగారం, డాలర్ల కేసుల్లో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల మేరకు ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు. విచారణకు హాజరు కావాలని ఎన్నికలకు ముందు రోజు నోటీసులు జారీ చేయవచ్చు. వామపక్ష సంఘటన నేతల కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని కంపెనీలపై ఐటి, ఇతర దాడులు జరగవచ్చు. పెరియ ప్రాంతంలో జరిగిన జంట హత్యల కేసులో సిబిఐ సంచలనాత్మకంగా ఆరోపణలు చేయవచ్చు. ఇలా పరిపరి విధాల చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ అగ్రనేతలు, కార్యకర్తలు కుటుంబాల ఆత్మీయ సమావేశాలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమంలో ముమ్మరంగా నిమగమయ్యారు. ఏప్రిల్‌ ఆరవ తేదీ పోలింగ్‌ కనుక రెండు రోజుల ముందుగా బహిరంగ ప్రచార కార్యక్రమం ముగియనున్నది.


ముఖ్యమంత్రి చెబుతున్న బాంబు ఆ పార్టీలోనే పేల నున్నదని, కన్నూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను విజయన్‌ పక్కన పెట్టారని వారి కోసమైనా ఇడి అధికారులు విజయన్‌ను విచారించాలని, ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అన్నారు. ఇడి కనుక విజయన్ను ప్ర శ్నించకపోతే మోడీ-అమిత్‌ షా తమ ప్రతిష్టను కోల్పోతారని చెప్పారు.

నీమమ్‌లో తెరిచిన బిజెపి ఖాతా మూత !


గత ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గంలో విజయం ద్వారా బిజెపి తెరిచిన ఖాతా ఈసారి మూసివేయక తప్పదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గతం కంటే ఎల్‌డిఎఫ్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా వివాదాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులుగా తయారయ్యారన్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్ధలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్దంగా లేవని, వారు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అభివృద్ది గురించి జనానికి తెలుసునని, ఏప్రిల్‌ ఆరవ తేదీన తగిన జవాబు ఇస్తారని చెప్పారు. పినరయి విజయన్‌తో కేరళలో సిపిఎం అధికారం కుప్పకూలుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే త్రిపుర, బెంగాల్లో దాని ఖాతాను మూసివేశామని త్వరలో కేరళలో కూడా అదే జరుగుతుందన్నారు. దొంగబంగారం కేసులో అనుచితంగా వ్యవహరించిన ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కేసు నమోదు చేశామని, అప్రూవర్‌గా మారిన సందీప్‌ నాయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ పోలీసులు రాష్ట్ర హైకోర్టును కోరారు. ఇడి అధికారి రాధాకృష్ణన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను వ్యక్తిగతంగా వ్యహరించటం లేదని అందువలన తనపై నమోదు చేసిన కేసును తిరస్కరించాలని కోరారు.

దొంగ ఓట్లకు హైకోర్టు తెర – రమేష్‌ చెన్నితల నోటికి మూత !

దొంగ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చేసిన ఫిర్యాదులకు హైకోర్టు తెరవేసింది. అలాంటి ఓటర్లు ఎవరైనా వస్తే వారి ఫొటో, అఫిడవిట్‌ తీసుకొని నమోదు చేయాలని, వారి వేలు మీద వేసిన సిరా ఎండిపోయిన తరువాతే వారిని పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పోనివ్వాలని హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి ఓట్ల గురించి తీసుకోదలచిన చర్యల వివరాలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ తరుణంలో ఓటర్ల జాబితాలను సవరించటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. అలాంటి ఓటర్ల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రకటిస్తామని రమేష్‌ చెన్నితల చెప్పారు. కోర్టు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. రమేష్‌ చెన్నితల ఫిర్యాదు మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ఎన్నికల కమిషన్‌ చర్యకు హైకోర్టు అడ్డుకట్టవేసింది. విద్యార్దులు, ఇతరులకు ప్రత్యేక కోటా కింద బియ్యం పంపిణీ చేయవచ్చని, అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో కూడా రమేష్‌ చెన్నితలకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రధాని చౌకబారు ప్రచారం-క్రైస్తవ ఓటర్ల సంతుష్టీకరణ యత్నం !

ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారం సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి క్రైస్తవ ఓటర్లను సంతుష్టీకరించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. కొంత వెండి కోసం యూదులు ఏసు ప్రభువుకు ద్రోహం చేశారని అలాగే బంగారం కోసం ఎల్‌డిఎఫ్‌ జనాన్ని మోసం చేసిందని నరేంద్రమోడీ చెప్పారు. ఒక ఐదు సంవత్సరాలు యుడిఎఫ్‌, మరొక ఐదు సంవత్సరాలు ఎల్‌డిఎఫ్‌ రాష్ట్రాన్ని దోచుకొనే విధంగా పంచుకున్నారని ఇప్పుడు బిజెపి వచ్చినందున అదింకేమాత్రం సాగదని మోడీ అన్నారు. పాలక్కాడ్‌లో పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ శ్రీధరన్‌ అధికారం కావాలనుకుంటే రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో చేరి ఉండేవారన్నారు. శబరిమల సమస్య రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినవని , వాటిని కాపాడేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అరెస్టయ్యారని, ఆ సమయంలో యుడిఎఫ్‌ మౌనంగా ఉందని నరేంద్రమోడీ ఆరోపించారు. అనేకసార్లు వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నదని, దాని నాయకులనేక మంది గూండాల మాదిరి వ్యవహరించారని, బిజెపి అధికారానికి వస్తే వాటన్నింటికీ తెరపడుతుందని ప్రధాని అన్నారు.
కేరళలో తాము అధికారానికి వస్తే నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేదవారికి అందచేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నలభై ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రాజకీయాల్లోకి రాని కారణాన్ని వివరిస్తూ అందరు గృహిణుల్లాగే తాను కూడా పిల్లల సంరక్షణ, ఇల్లు, వంట కోసం ఇంటికే పరిమితం అయ్యానని అన్నారు. నేను ఎప్పుడూ వంట చేయలేదని ఇల్లు శుభ్రం చేయలేదని అనుకోవచ్చు, కానీ నేనా పని చేశానని నమ్మండి అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే అధికారంలో ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి చౌకబారు ప్రచారం – గడ్డి పెట్టిన వరదల హీరో !

కేరళలో సంభవించిన అసాధారణ వరదల సమయంలో అనేక మందిని రక్షించిన మత్స్యకారుడు జైసాల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇంటికి వచ్చిన బిజెపి అభ్యర్ది సత్తార్‌ హాజీ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నందుకు అభినందించాలనుకుంటున్నామని చెపితే అంగీకరించగా వారి పార్టీ కండువా కప్పి ఫొటో తీసుకున్నారని, తాను చేసిన దానికి గతంలో అనేక పార్టీలు, సంస్దలు తనను అభినందించాయని, దానిలో భాగంగానే ఇది అనుకున్నాను తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారానికి దాన్ని వినియోగించుకుంటారని తాను భావించలేదన్నారు. బిజెపిలో చేరేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. తాను సిపిఎం అభిమానినని, ఆ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తానని చెప్పారు. తన పడవ ద్వారా వరద బాధితులను రక్షించిన వీడియో పెద్ద సంచలనం కలిగించి జైసాల్‌కు ఎంతో పేరు తెచ్చింది. తాజా ఎన్నికల్లో తిరురంగడి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ది నియాల్‌ పులికలకమ్‌కు ధరావత్తు సొమ్ము చెల్లించి జైసాల్‌ తన అభిమానాన్ని ప్రదర్శించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మిలిటరీ కుట్రలు – ఐరోపా,అమెరికన్ల ద్వంద్వ ప్రమాణాలు !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups


ఎం కోటేశ్వరరావు


మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్‌ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్‌ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్‌ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్‌ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.


ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్‌ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్‌ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.


తాజా విషయాలకు వస్తే మయన్మార్‌ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్‌ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్‌, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, లావోస్‌, థారులాండ్‌ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్‌ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్‌ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్‌ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్‌ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?


దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్‌ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.


మయన్మార్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్‌ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్‌ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్‌ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్‌ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.


అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్‌ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్‌, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్‌ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్‌ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్‌ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్‌ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్‌ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్‌ సూకీ తండ్రి అంగ్‌సాన్‌ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్‌ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్‌ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్‌ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్‌ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్‌ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్‌ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్‌ సూకీకి శాంతి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్‌ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్‌ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రాజనాధ్‌ గారూ రాజ్యాంగం చదువు కోండి : సీతారామ్‌ ఏచూరి !

29 Monday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

A.K Antony, BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Rajnath Singh, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కేంద్రానికి రాష్ట్రాలు ఎంత దూరమో రాష్ట్రాలకు కేంద్రం అంతే దూరం అనే పాఠాన్ని చెప్పేందుకు కేరళ ప్రభుత్వం పూనుకుంది. గతంలో కూడా తన ఆధీనంలోని దర్యాప్తు సంస్దల ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రతిపక్షాల పాలనలోని రాజకీయ నేతలకు వ్యతిరేకంగా దాడులు చేయటం, తప్పుడు కేసుల్లో ఇరికించటం తెలిసిందే. దాన్ని విమర్శించిన బిజెపి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వాటిని దుర్వినియోగం చేస్తోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ దొంగబంగారం కేసులో ఉన్నారని వాంగ్మూలం ఇవ్వాలని లేనట్లయితే అంతు చూస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిందితులను బెదిరించినట్లు వార్తలు రావటమే కాదు స్వయంగా నిందితులే వెల్లడించారు. తప్పుడు వాంగ్మూలాలను ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా కస్టమ్స్‌, ఇడి అధికారులు కోర్టుకు సమర్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధల అధికారుల బెదిరింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో వాటి మీద న్యాయవిచారణ జరపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరింది. ఒక వేళ ఇవ్వకపోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తరువాత కమిషన్‌ తన పని చేయనుంది.


స్వతంత్ర భారత చరిత్రలో కేంద్ర సంస్ధల అధికారుల తీరుతెన్నులపై ఒక రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదులు చేయటం, కొన్ని సందర్భాలలో దర్యాప్తుకు అనుమతి నిరాకరించటం తెలుసు గానీ విచారణ జరపటం ఇదే ప్రధమంగా కనిపిస్తోంది. అనూహ్యమైన ఈ పరిణామంతో దిమ్మదిరిగిన కేంద్ర మంత్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఇది ఒక జోక్‌ అని ఒక విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అంటే ఇది దురదృష్టకరం, రాజ్యాంగంలోని ఫెడరల్‌ వ్యవస్ధకే ఇది సవాలు అని రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేంద్ర సంస్దలు చేసిన వినతిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది, నిలిపివేసేందుకు కూడా నిరాకరించింది. చివరకు ఇది ఏమౌతుందో తెలియదు గానీ కేంద్ర -రాష్ట్ర సంబంధాల సమస్యల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఈ ఉదంతం ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. వామపక్ష ప్రభుత్వ చర్య తనకు ఆశ్చర్యం కలిగించలేదని హౌం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పరువు కాపాడుకొనేందుకు ఇలా చేశారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్దలపై విచారణ జరపటం రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ భావిస్తే మంత్రి తిరిగి మరోసారి రాజ్యాంగాన్ని చదువుకోవటం అవసరం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఏ కేంద్ర సంస్ద కూడా సంబంధిత రాష్ట్ర అనుమతి లేకుండా వ్యవహరించరాదని, రాష్ట్రాలు తమ పరిధులకు లోబడి వ్యవహరిస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలో నిందితుల ప్రకటనల పేరుతో దర్యాప్తు సంస్దలు నీచస్ధాయికి దిగజారి వ్యవహరిస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్‌ శివరామకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. స్వ ప్రయోజనాల కోసం స్పీకర్‌ తన నివాసానికి తనను రమ్మన్నట్లుగా దొంగబంగారం కేసు ప్రధాన నిందితురాలు స్వప్ప సురేష్‌ చేసిందన్న ప్రకటనను ఇడి కోర్టుకు సమర్పించింది.


కేరళలో హిందూత్వ కోసం బిజెపి-కాంగ్రెస్‌ పోటా పోటీ !


కేరళలో హిందూత్వ పోటీలో కాంగ్రెస్‌-బిజెపి పోటీ పడుతూ జనాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చేందుకు దోహదం చేస్తున్నాయని, వామపక్షాలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాయని, రాజకీయాలకు-మత విశ్వాసాలను వేర్వేరుగా చూస్తాయని, విశ్వాసాలు వ్యక్తిగత అంశంగా పరిగణిస్తామన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విలేకర్లతో చెప్పారు.వివాదాలతో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌-బిజెపి ప్రయత్నిస్తున్నాయని రెండూ కుమ్మక్కుతో వ్యవహరిస్తున్నాయని లేకుంటే తమకు 34 సీట్లు వస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని బిజెపి ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కేరళ నుంచి జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటం పూర్తిగా రాజ్యంగ విరుద్దమని, రాజ్యసభలో తమ ప్రతినిధులను కలిగి ఉండటం రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. ఇలాంటి నిర్ణయాలను ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేదన్నారు.


బలంపై బిజెపి బడాయి- కాంగ్రెస్‌ పగటి కలలు !


అనేక రాష్ట్రాలలో అధికారానికి వచ్చిన మనం నేపాల్‌, శ్రీలంకల్లో కూడా విజయం సాధించాల్సి ఉందని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పినట్లు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. త్రిపుర నేతలతో మాట్లాడిన సమయంలో షా ఈ విషయం చెప్పారని అన్నారు. అమిత్‌ షాకు బెంగాలీ లేదా త్రిపుర బిజెపి నేతలకు హిందీ తెలియకపోవటం వలనగానీ ఇలా అర్ధం అయి ఇంకేముంది ఇరుగుపొరుగు దేశాల్లో కూడా మనం పాగా వేయబోతున్నామని కార్యకర్తలను ఉబ్బించేందుకు చెప్పి ఉంటారు. కానీ కేరళలో మెట్రోమాన్‌ శ్రీధరన్‌ అచ్చమైన మళయాళంలో మాట్లాడుతూ బిజెపి పూర్తి మెజారిటీ లేదా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయించే నిర్ణయాత్మక స్ధాయిలో సీట్లు సంపాదించనున్నదని చెబుతున్నారు. కేరళలో బిజెపి ఎదగకపోవటానికి ఒక కారణం అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం అని ఆ పార్టీనేత ఓ రాజగోపాల్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో చూద్దాం ! ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న పెద్దమనిషి గనుక ఏం మాట్లాడినా కేరళీయులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
పగటి కలలు కంటున్న వారిలో బిజెపి పెద్దలే కాదు కాంగ్రెస్‌ నేతలు కూడా తీసిపోలేదు. తమకు వందసీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముందస్తు ఎన్నికల సర్వేలను తాను నమ్మనని అన్నారు. సర్వేలు చేసే సంస్దల వారు కాంగ్రెస్‌ కార్యాలయానికి కూడా వచ్చి తనను కలసి కావాలంటే సర్వే చేస్తామని చెప్పారు. నాకు నమ్మకం లేదు వద్దు అన్నాను అని రామచంద్రన్‌ చెప్పారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లతికా సుభాష్‌ పిసిసి కార్యాలయంలోనే గుండు చేయించుకున్న విషయం గురించి అడగ్గా అన్ని పార్టీల్లో అలాంటివి జరుగుతుంటాయి. ఆమె సిపిఎం కుట్రకు బలైంది అన్నారు.
మరోవైపున మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ తన ఆరోపణల పరంపరను కొనసాగిస్తూ ఏడు సీట్లలో బిజెపిని గెలిపించేందుకు సిపిఎం, దానికి ప్రతిగా తిరిగి అధికారం వచ్చే విధంగా బిజెపి సహకరించేట్లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఓటమిని ఈ సాకుతో ముందే అంగీకరించారు. ఎన్నికల సిబ్బందిగా 95శాతం మందిని వామపక్ష ఉద్యోగ సంఘాలకు చెందిన వారినే రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ ఆరోపించారు. ఎవరిని ఎక్కడ నియమించిందీ ముందు రోజే పార్టీకి జాబితాలు అందుతాయని కూడా అన్నారు.క సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను సిపిఎం కార్యకర్తలు సమకూర్చుతారని ఆరోపించారు. సిపిఎంకు బలమైన కేంద్రాలుగా ఉన్నచోట కేవలం మహిళా సిబ్బందినే నియమిస్తారని, వారు ఎన్నికల అక్రమాలను ప్రతిఘటించలేరని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఎన్నికలను సిపిఎం అదుపు చేస్తున్నదని అందువలన స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. చర్యలు తీసుకుంటామంటారే తప్ప ఎన్నికల కమిషనర్‌ అలా చేయటం లేదన్నారు.

కాంగ్రెస్‌ నేతకు మార్చి-మే నెలకు తేడా కూడా తెలియదన్న విజయన్‌ !

రేషన్‌ పంపిణీ గురించి ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితలకు మార్చి-మే నెలల మధ్య ఉన్న తేడా కూడా తెలియనట్లుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవాచేశారు.అధికారపక్షానికి ఓట్ల కోసం మేనెల రేషన్‌ కూడా ముందే ఇస్తున్నారని చెన్నితల ఫిర్యాదు చేశారు. పండుగల సందర్భంగా ఆలస్యమైన మార్చి, ఏప్రిల్‌ నెలల రేషన్‌ పంపిణీ చేస్తున్నాం తప్ప మే నెలది కాదని విజయన్‌ అన్నారు. ఏప్రిల్‌ 14న ఉన్న హిందూ పండగ విషు, గుడ్‌ ఫ్రైడే, రంజాన్‌ పండుగల సందర్భంగా ఆహార కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఎన్నికల తరువాతనే వాటిని పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ కోరింది. అయితే దీని మీద ఆయా సామాజిక తరగతుల్లో వ్యతిరేకత వ్యక్తం కావటంతో తాము పంపిణీ నిలిపివేయాలని కోరలేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. బియ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటంతో ఆ సమస్యపై హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుపు, నీలి రంగు కార్డుల వారికి కిలో పదిహేను రూపాయల చొప్పున ప్రత్యేకంగా పదేసి కిలోల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం ఎన్నికల ప్రకటనకు ముందే జరిగిందని, బియ్యం రావటం ఆలస్యం కావటంతో పంపిణీ వాయిదా పడిందని ప్రభుత్వం చెబుతోంది. ఆహార కిట్లను పంపిణీ చేస్తున్నది కేంద్రం తప్ప రాష్ట్రం కాదని బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అంటున్నారు. దొంగ ఓట్ల గురించి పదే పదే ఫిర్యాదులు చేసిన రమేష్‌ చెన్నితలకు పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్వయంగా ఆయన తల్లికే రెండు చోట్ల ఓట్లు ఉన్న విషయాన్ని సిపిఎం కార్యకర్తలు బయట పెట్టారు. చిరునామా మార్పు గురించి దరఖాస్తు చేసినా ఎన్నికల సిబ్బంది మార్చలేదని చెన్నితల సంజాయిషీ చెప్పుకున్నారు. కజకోట్టమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి డాక్టర్‌ లాల్‌కు కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని బయటపడింది. స్ధానిక సంస్దల ఎన్నికలలో కూడా సిపిఎం దొంగ ఓట్లతో గెలిచిందని, పోస్టల్‌ ఓట్లలో కూగా గోల్‌మాల్‌ జరుగుతోందని రమేష్‌ చెన్నితల కొత్త ఆరోపణ చేశారు. ఒకరికి ఒక చోట కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఉదంతాలలో ఒక చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా చూడాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. దీంతో రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరపడింది.


గురువాయురూరప్ప సాక్షిగా ముస్లింలీగుకు బిజెపి ఓట్లు – ఆంటోని రంగంలోకి వస్తే బిజెపితో కుమ్మక్కే !


బిజెపి నేతలు కేరళ వచ్చినపుడల్లా గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ సిపిఎంకు వ్యతిరేకంగా ముస్లింలీగుకు, తెలిచేరిలో కాంగ్రెస్‌కు తన ఓట్లను బదలాయించేందుకు బిజెపి కుమ్మక్కు అయిందన్న విమర్శలు వచ్చాయి. కావాలనే బిజెపి తన అభ్యర్దులతో గురువాయూర్‌, తెలిచేరి నియోజకవర్గాలలో అసంపూర్ణంగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయించి తిరస్కరణకు గురయ్యేట్లు చేసిందని వార్తలు వచ్చాయి. దీన్ని బలపరుస్తూ ప్రముఖ నటుడు త్రిసూరులో బిజెపి అభ్యర్ధి సురేష్‌ గోపి ఈ రెండు చోట్లా యుడిఎఫ్‌ విజయం సాధించనున్నదని, వారికి ఓట్లు వేయాలని చెప్పారు. గురువాయూరులో యుడిఎఫ్‌లోని ముస్లింలీగు అభ్యర్ధి గెలవాలని, తెలిచేరిలో సిపిఎం అభ్యర్ధి ఓడిపోవాలని అన్నారు. అయితే బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అది సురేష్‌ గోపి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని పార్టీకేమీ సంబంధం లేదన్నారు. గోపి ప్రకటనతో ఇరుకున పడిన బిజెపి కేంద్ర మంత్రి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విషయాలనే పరిణనలోకి తీసుకోవాలన్నారు. ఇదేదో పొరపాటున నోరు జారిన వ్యవహారం కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. గురువాయూర్‌లో లీగ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని బలపరిచారని, ఇప్పుడు బిజెపి ఓట్ల కోసం వేరే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని రంగంలోకి వచ్చారంటే కాంగ్రెస్‌-బిజెపి మధ్య కుమ్మక్కు ఒప్పందం ఉన్నట్లే అని విజయన్‌ అన్నారు. తనపై ఆంటోని ఆరోపణలు చేయటం సహజమని అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం పాతిక సంవత్సరాల పాటు ఉంటుందని, సిపిఎం నాయకత్వం విజయన్‌తో ప్రారంభమై విజయన్‌తో అంతం అవుతుందని ఎకె ఆంటోని వ్యాఖ్యానించారు. ఈసారి గనుక అధికారానికి వస్తే ఆ పార్టీ అంతరిస్తుందని, తరువాత జనం కాంగ్రెస్‌కే ఓటు వేస్తారన్నారు. సిపిఎం రెండో సారి అధికారానికి రావటం ప్రమాదకరమని ఆంటోని చెప్పుకున్నారు.

మెట్రోమాన్‌కు శ్రీధరన్‌కు కోపం వచ్చింది !


నరేంద్రమోడీ ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం సానుకూలమైన ప్రశ్నలు వేసే జర్నలిస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధానిగా ఇంతవరకు ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్‌ నిజయోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌కు విలేకరి ప్రశ్నలు కోపం తెప్పించి మధ్యలోనే వెళ్లిపోయారు. న్యూస్‌ లాండ్రి ( వార్తల ఉతుకుడు ) అనే ఆంగ్లవెబ్‌సైట్‌ విలేకరి గొడ్డుమాంస నిషేధం, లవ్‌జీహాద్‌ల మీద అభిప్రాయం ఏమిటని కోరగా అవన్నీ తుచ్చమైన అంశాలు వాటి గురించి నేను మాట్లాడను అన్నారు. బిజెపి దక్షిణాది-ఉత్తరాది నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారు గనుక మీ అభిప్రాయం ఏమిటని మరోసారి అడగ్గా వాటి మీద స్పందించేంత అర్హత నాకు లేదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌పై ఉన్న కేసుల గురించి అడగ్గా దొంగబంగారం కేసులతో వాటిని పోల్చరాదన్నారు.లవ్‌జీహాద్‌ మీద చట్టం తీసుకు వస్తామని బిజెపి చెప్పిన విషయం గురించి చెప్పండి అని అడగ్గా తీసుకురాకపోతే మరో సిరియా అవుతుంది, అయినా మీరు అన్నీ ప్రతికూల ప్రశ్నలు, అడిగినవే అడుగుతున్నారు, ప్రతివారినీ అడుగుతున్నారు అని విసుకున్నారు. జర్నలిస్టుగా ప్రశ్నలు అడగటం నా పని అని విలేకరి చెబుతుండగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను అంటూ లేచి వెళ్లిపోయారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బంగ్లా విముక్తి ఉద్యమం : నగుబాట్ల పాలైన నరేంద్రమోడీ సత్యాగ్రహం !

28 Sunday Mar 2021

Posted by raomk in Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, Jan Sangh, Narendra Modi Satayagrah claim


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ విముక్తి జరిగి యాభై సంవత్సరాలు గడచిన సందర్భంగా అతిధిగా ఢాకా వెళ్లిన మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తాను బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో సత్యాగ్రహం చేసి జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. తనతో పాటు తన మిత్రులు కూడా ఉన్నారన్నారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాని అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. యాభై సంవత్సరాల నాడు జరిగిన విషయం- అది నిజమో కాదో తెలుసుకొనేందుకు ఇప్పుడున్నన్ని ఆధారాలు అప్పుడు లేవు. ప్రధాని అంతటి పెద్దాయన చెప్పారు గనుక అది పచ్చి అబద్దమని ఎవరైనా అంటే దాన్ని తేలికగా తీసిపారవేయలేము- అలాగని వాస్తవం అని కూడా చెప్పలేము. అప్పుడేం చేయాలి ? ఉన్న ఆధారాలను బట్టి ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను పాఠకుల ముందు ఉంచితే వారే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయత్నం అదే ! నరేంద్రమోడీ స్వయంగా నోరువిప్పితే తప్ప అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.


ప్రధాని ఏమి చెప్పారు ? ” అప్పుడు నాకు 20-22 సంవత్సరాలుంటాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం నేను, నా మిత్రులు సత్యాగ్రహం చేశాము, జైలుకు కూడా వెళ్లాము ” అని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. బంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో జనసంఘం 1971 అగస్టు నెలలో సత్యాగ్రహం నిర్వహించింది. అంటే అప్పటికి మోడీ వయస్సు 21 సంవత్సరాలు. ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే నరేంద్రమోడీ ఆ సమయంలో ఏమి చేస్తున్నారు ? తాను ఫలానా కాలేజీలో ఫలానా సంవత్సరంలో చదివాను అని నరేంద్రమోడీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. బిజెపి అనుకూల పత్రిక జాగరణ జోష్‌లో 2020 సెప్టెంబరు 17న షిఖా గోయెల్‌ రాసిన వ్యాసం ప్రకారం 1967లో గుజరాత్‌ ఎస్‌ఎస్‌సి బోర్డు నుంచి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పదిహేడవ ఏట తనకు వివాహం వద్దంటూ ఇల్లు వదలి రెండు సంవత్సరాలు దేశంలో వివిధ ఆశ్రమాలను సందర్శించారు. తరువాత వచ్చి అహమ్మదాబాద్‌లోని బస్టాండులో ఒక టీ దుకాణంలో పని చేశారు. 1970 ప్రారంభంలో ఏబివిపి శాఖను ఏర్పాటు చేశారు.1971లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సు ద్వారా రాజకీయ శాస్త్రంలో బిఏ డిగ్రీ పొందారు.1983లో గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పట్టా తీసుకున్నారు. స్కూలు విద్య తరువాత రెండేండ్లు అక్కడా ఇక్కడా తిరిగిన వ్యక్తి ఏ కాలేజీలో చేరకుండా ఏబివిపి విద్యార్ధి సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? వివాహం వద్దంటూ ఇల్లు వదలిన మోడీ భార్య అని స్వయంగా పేర్కొన్న యశోదాబెన్‌తో వివాహం ఎప్పుడు జరిగింది ?


అసలు మోడీ గారి డిగ్రీ పట్టా గురించి పెద్ద వివాదమే నడిచింది. ఆ వివరాల వెల్లడి దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా సమాచారహక్కు కింద అడిగిన వారికి వివరాలు ఇవ్వలేదు. వివాదం ముదరటంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ పట్టా అంటూ ఒకదానిని చూపారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా తిరస్కరించింది. ఎట్టకేలకు 1978లో నరేంద్రమోడీ పరీక్షలను పూర్తి చేశారని, 1979లో డిగ్రీ పొందారంటూ వెల్లడించింది. అదే సమయంలో డిగ్రీపరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్న సంఖ్య ” సిసి 594-74 అని పరీక్ష హాల్‌ టికెట్‌ నంబరు 16594 ” అని వెల్లడించింది. అంటే 1974లో దూరవిద్య ద్వారా డిగ్రీకోసం నమోదు చేసుకొని మూడు సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసి పాసయ్యారని అని అనుకోవాలి. మిత్రులతో కలసి బంగ్లాదేశ్‌ కోసం సత్యాగ్రహం చేశాను, జైలుకు వెళ్లాను అని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా పోలీసు లాకప్‌లో ఉన్నానంటే నమ్మవచ్చు, కానీ జైలులో ఒక రోజు కూడా ఉంచరు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారో వివరాలు వెల్లడి అయ్యేంత వరకు దాని గురించి చెప్పే మాటలను నమ్మటం ఎలా ?


పశ్చిమ దేశాల్లో ప్రధానులు, దేశాధ్యక్షుల మీద బూతులు ప్రయోగించినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో అలాంటి ప్రయోగం మీద తమకు మాత్రమే హక్కు ఉందనే శీలవంతులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించటమే దేశద్రోహం అంటున్న ఈ రోజుల్లో దేశ ప్రధాని నరేంద్రమోడీ మీద జోకులు పేలిస్తే ఏమౌతుందో నెటిజన్లు ఒక్కసారి ఆలోచించుకోవాలేమో. బంగ్లా విముక్తి ఉద్యమానికి మద్దతుగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన మోడీగారి మీద సామాజిక మాధ్యమంలో పేలిన జోకులు ఎలా ఉన్నాయో చూడండి.
” 1969లో చంద్రుడిపై కాలుమోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందంలో రహస్యంగా దూరి మోడీ గారు కూడా చంద్రుడి మీద కాలుమోపారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావటానికి ముందే పందొమ్మిదేండ్ల వయస్సులోనే మోడీ ఈ నాసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలికట్‌ స్మార్ట్‌ సిటీలో కాలుపెట్టిన వాస్కోడాగామాను స్వాగతించింది నరేంద్రమోడీ గారే. దేశ తొలి సాధారణ ఎన్నికలు 1951లోనే నరేంద్రమోడీ గారు ఓటు వేశారు. ఏడాది వయస్సులో ఆయన వేసిన ఓటు ప్రధానిగా జవహర్‌లాల్‌ ఎన్నికలో కీలకపాత్ర పోషించింది. 1942లో తన ఆరాధ్య వ్యక్తితో కాన్‌సెంట్రేషన్‌ కాంపుల గురించి చర్చిస్తున్నప్పటి చిత్రం. మోడీ తన ఎంఏ చివరి పరీక్షా పత్రాన్ని రాస్తున్న దృశ్యం ” ఇలా ఉన్నాయి. వీటన్నింటి సారం ఒక్కటే నరేంద్రమోడీ సత్యాగ్రహం గురించి అతిశయోక్తులు చెప్పారని ఎద్దేవా చేయటమే !


అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌, చరిత్రకారుడు అయిన శ్రీనాధ్‌ రాఘవన్‌ మాట్లాడుతూ మన దేశంలో ఎవరైనా బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాననటం హాస్యాస్పదం అన్నారు. అయితే నరేంద్రమోడీ జైలుకు వెళ్లానని చెప్పింది వాస్తవమేనంటూ సంఘపరివార్‌కు చెందిన వారు సమర్ధిస్తున్నారు.ఒక దేశంలోని మరో దేశంలో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించటం సహజం. కానీ సత్యాగ్రహం చేసి అరెస్టయ్యామని చెప్పటమే అతిశయోక్తి. 1971లో బంగ్లాదేశ్‌లో విముక్తి ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ విభాగమైన జనసంఘం మద్దతు ఇచ్చాయి. ఒక దేశంలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే స్పందిస్తే లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తే రాబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం తటపటాయించింది, అది సహజం. అదే ప్రభుత్వం అనువైన సమయం రాగానే మిలిటరీ జోక్యం చేసుకున్నది. అమెరికా బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ అణచివేతలకు పాల్పడం ప్రారంభమై నెలలు గడుస్తున్నా మోడీ సర్కార్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటానికి కారణం ఏమిటి ? పర్యవసానాల గురించి తటపటాయింపే.


పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ పాలకులు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా అణచివేతకు పాల్పడినా, తాజాగా పార్లమెంట్‌, ప్రభుత్వాన్ని రద్దు చేసి జనాన్ని అణచివేస్తున్నా కనీసం జనానికి సానుభూతి మిలిటరీ చర్యలను తప్పు పట్ట లేదు బిజెపి. మరోవైపు ఉన్న శ్రీలంకలో ప్రత్యేక రాజ్యం కోసం ఆయుధాలు పట్టిన తమిళులకు మద్దతుగా బిజెపి ఎన్నడైనా సత్యాగ్రహం చేసిందా ? నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా జనం ఉద్యమించినపుడు బిజెపి వైఖరి ఏమిటి ? అనేక దేశాల్లో జనసంఘ హయాంలో, బిజెపి హయాంలో విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా మద్దతు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా ? అంతెందుకు ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అది వెంటనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ ఖాళీ చేసేందుకు మొరాయిస్తోంది. పాలస్తీనా అరబ్బులకు అసలు మాత్రదేశాన్నే లేకుండా చేశారు. వారు నివశించే ప్రాంతాలను సైనికశిబిరాలుగా మార్చి వేసిన దుర్మార్గాన్ని చూస్తున్నాము. అలాంటి ఇజ్రాయెల్‌తో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోకుండా నిరసన తెలుపుతుంటే మన బిజెపి సర్కార్‌ మిత్ర దేశంగా పరిగణిస్తున్నది. ఇదేమి ద్వంద్వ వైఖరి ? అలాంటి పార్టీ బంగ్లాదేశ్‌ విముక్తి కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లామని చెప్పుకుంటున్నదంటే దాని అసలు లక్ష్యం ఏమిటి ? నిజం ఏమిటి ?

బంగ్లాదేశ్‌ విముక్తి విషయంలో జనసంఫ్‌ు మద్దతులో చిత్తశుద్ది లేదు. బంగ్లా విముక్తి కంటే పాకిస్దాన్‌ రెండు ముక్కలు అవుతున్నదనే అంశానికే అది ప్రాధాన్యత ఇచ్చి అమెరికాను సంతృప్తి పరచేందుకు, నాటి సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం వంటి హడావుడి చేసింది అన్నది స్పష్టం. నాడు బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్‌ మిలిటరీకి మద్దతుగా అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగాళా ఖాతానికి తరలించిన అమెరికా దుర్మార్గాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక స్వతంత్ర దేశ వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవాలంటే దానికి ఎంతో కసరత్తు అవసరం. అక్కడ అంతర్యుద్దం జరుగుతున్న సమయంలో ఏక్షణంలో అయినా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తవచ్చని, అందువలన దాని గురించి బహిరంగంగా చర్చించవద్దని,దాని వలన జరిగే లాభం కంటే హానే ఎక్కువ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జనసంఘంతో సహా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో చెప్పారు. అమెరికా సప్తమ నౌకాదళాన్ని దించిన నేపధ్యంలో సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. బంగ్లావిముక్తి ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటనలు చేయవద్దన్న సూచనను రాజకీయ ప్రయోజనం కోసం జనసంఘం ఉల్లంఘించింది. అది చేసిన సత్యాగ్రం బంగ్లాకు విముక్తి కంటే సోవియట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్దేశించింది అన్నది అసలు విషయం. బంగ్లాదేశ్‌ విముక్తిని గుర్తించకుండా ఉండేందుకే కుట్రతో మన ప్రభుత్వం సోవియట్‌తో రక్షణ ఒప్పందం చేసుకుందని ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ సభలో అతల్‌బిహారీ వాజ్‌పాయి ఉపన్యాసం చేశారని 1971 ఆగస్టు 12న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వార్తలో రాసింది. అందువలన బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో సత్యాగ్రహం అని చెప్పినా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక కొంత మందిని అరెస్టు చేసి ఉండవచ్చు తప్ప బంగ్లాకు మద్దతు కారణం అయితే కాదు. దానిలో నరేంద్రమోడీ పాల్గొన్నట్లు, అరెస్టయి జైలుకు పోయినట్లు ఆధారాలు అయితే లేవు.


దేశ విభజన సమయంలోనూ, బంగ్లా విముక్తి పోరాటం సమయంలో అనేక మంది అక్కడి నుంచి కాందిశీకులుగా ప్రాణాలు అరచేత పట్టుకు వచ్చిన వారిని అక్రమ చొరబాటుదారులంటూ తరువాత కాలంలో అసోం, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద రచ్చ చేసి మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది సంఘపరివార్‌ శక్తులు, వాటి రాజకీయ రూపం బిజెపి అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ దాన్ని ఎన్నికల అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందుకే మోడీ పర్యటనకు నిరసనగా అక్కడి మతశక్తులతో పాటు పురోగామి వాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మోడీ రాకను హర్షించిన వారెవరూ లేరు.


పెద్దల మాటను గౌరవించాలి. నిజమే, ఒక నాటికలో (బహుశా ‘ పంజా ‘ అనుకుంటున్నా) ఒక పాత్రధారి నేనూ స్వాతంత్య్ర సమర యోధుడనే అని చెప్పుకుంటాడు. అదెలా అంటే కొండా వెంకటప్పయ్య జెండా ఎగురవేస్తుంటే చూశా అంటాడు. అలాంటి పెద్దలను కాదు. పెద్దలనే వారు గౌరవ ప్రదంగా వ్యవహరించినపుడే మన్నించాలి. పెద్దలం కదా అని ఏది బడితే అది చెబితే నమ్మే రోజులు కావివి. కనుక పెద్దలూ మా రోజుల్లో లేదా ఆరోజుల్లో అని చెప్పేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలోనే తన ప్రకటన మీద తలెత్తిన వివాదానికి ముగింపు పలకాల్సింది కూడా నరేంద్రమోడీయే. అది వ్యక్తిగతంగా ఆయనకే గౌరవం. తాను, తనతో పాటు ఉన్న మిత్రులు ఏ తేదీల్లో ఏ జైల్లో ఉన్నారో ఆధారాలు వెల్లడించటం కష్టమేమీ కాదు. దేశభద్రతకు వచ్చే ముప్పు అసలే ఉండదు. లేనట్లయితే ఆయన డిగ్రీ వివాదం మాదిరి దేశవ్యాపితంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మచ్చగా మిగిలిపోతుంది. మీడియాలో దీని గురించి జరిగే చర్చ, సమాచారం సరిహద్దులు దాటకుండా ఉంటుందా ? ట్విటరైట్లను, ఫేస్‌బుకర్లను ఆపగలమా ? ఎవరి గడ్డిని వారికే తినిపిస్తారు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు ఈస్టిండియా అక్రమ చొరబాటు – నేడు వెస్ట్‌ ఇండియా కంపెనీలకు బిజెపి రాచబాట !

27 Saturday Mar 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Privatization, Vizag steel agitation, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూరు శాతం అమ్మేస్తాం లేదా ఫ్యాక్టరీని మూసేస్తాం అని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. సోషలిస్ట్‌, సెక్యూలర్‌ అని రాసి ఉన్న రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికార పీఠం పై కూర్చున్న మంత్రులు రాజ్యాంగం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రైవేట్‌ పరం చేయటానికి తయారయ్యారు.
ప్రభుత్వం వ్యాపారం చేయటం కోసం లేదు! కాబట్టి ప్రభుత్వ సంస్థల అన్నిటినీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? లేక తనవారైన గుజరాతీ కార్పొరేట్‌ కంపెనీలకు లేక పోస్కో కు కారుచౌకగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను హారతి పళ్లెం లో అమర్చి అందించాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ సంస్దలనేనా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేసి అమ్మ తలుచుకున్నారా?

ప్రభుత్వరంగం లో భారీ పరిశ్రమలు ప్రజల ధనంతో ఏర్పడ్డాయి

1947 నాటికి ఆంధ్ర లో భారీ పరిశ్రమలు లేవు. ఏ ప్రాంతమైనా ఎదగాలంటే పారిశ్రామికంగా అభివ ద్ధి చెందాలి. 1947 నాటికి దేశంలోనే భారీ పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కేంద్రీకరించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ అభివ ద్ధికి భారీ పరిశ్రమల అవసరాన్ని గుర్తించారు. దేశం లోని పెట్టుబడిదారులను విదేశాలలోని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సాంకేతిక, ఆర్ధిక సహకారాన్ని అర్ధించారు. స్వదేశీ, విదేశీ ప్రైవేట్‌ సంస్థలు భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు. తమ దేశాలనుండి ఉక్కు, మందులు, ఎరువులు దిగుమతులు చేసుకోమని యూరప్‌, అమెరికా దేశాలు సలహాలిచ్చాయి, సహాయ నిరాకరణ చేశాయి.
సోషలిస్ట్‌ దేశమైన సోవియట్‌ ప్రభుత్వం నిస్వా ర్ధంగా సాంకేతిక సహాయాన్నే కాకుండా ఆర్ధిక సహాయాన్ని కూడా అందించింది. వందకు పైగా భారీ పరిశ్రమల స్థాపనకు సహాయం చేసింది. మన దేశానికి పారిశ్రామిక పునాదిని కల్పించింది. మందులు, ఎరువులు, ఉక్కు, భారీ ఇంజనీరింగ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌, ఐడిపిఎల్‌, భిలారు,విశాఖ ఉక్కు కర్మాగారాలు స్థాపించారు. అప్పటికి ప్రైవేటు రంగంలో ఒక టాటా స్టీల్‌ మాత్రమే ఉండేది. ప్రభుత్వం భారీ పరిశ్రమలు స్థాపించిన తర్వాత దేశ పెట్టుబడిదారులు పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా కొన్ని పరిశ్రమలు స్థాపించడం ప్రారంభించారు. పారిశ్రామికంగా కొంత అభివ ద్ధిని సాధించిన తరువాత ఆ ఫలాలను అనుభవించటానికి దేశ, విదేశీ పెట్టుబడిదారులు తయారయ్యారు.


బ్రిటీష్‌ ఈస్డిండియా కంపెనీ మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకులను అందచేసేదిగా, తన ఉత్పత్తులకు మార్కెట్‌గా మార్చిన కారణంగా స్వాతంత్య్ర ఉద్యమం కంపెనీ, బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. ఆ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని, వ్యతిరేకించిన వారి వారసులుగా ఉన్న బిజెపి పెద్దలు ఉన్న పరిశ్రమలను, సహజ సంపదలను వెస్ట్‌ ఇండియా కంపెనీలకు కారుచౌకగా అప్పగించేందుకు పూనుకున్నారు. పరోక్షంగా పరాయి దేశాల పాలనను మన మీద రుద్దుతున్నారు. నాటికీ నేటికీ ఎంత తేడా !


ఈస్ట్‌ ఇండియా కంపెనీ తనకు తానే వస్తే రాజరిక పాలకులు ఆశ్రయం కల్పించారు. నేడు ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే పెద్దలు స్వయంగా వెస్ట్‌ ఇండియా కంపెనీలకు ఎర్ర తివాచీలు పలుకుతున్నారు. అందుకే విశాఖ ఉక్కు ఈ వెస్ట్‌ ఇండియా కొరల్లో చిక్కుకోవటం యాద చ్చికం కాదు. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి లాభాల వేటలో పడింది. వడ్డించిన విస్తరి లాగా భారత దేశ పరిశ్రమలను కారు చౌకగా కొట్టేయటానికి కాచుకొని ఉంది. మూడు లక్షల ఇరవై కోట్ల విలువ చేసే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ముప్పైరు వేల కోట్లకు అమ్మేస్తాం అంటున్నారు. కేవలం 4889కోట్ల పెట్టుబడితో ప్రారంభించి 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా?

విశాఖ ఉక్కు నష్టాలలోలేదు


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉన్నదన్న ప్రచారం వాస్తవమేనా? కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి 4889 కోట్ల రూపాయలు. హిందూ పత్రిక అంచనా ప్రకారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుత ఆస్తుల విలువ మూడు లక్షల 20 వేల కోట్ల పైనే ఉంటుంది. 4889కోట్ల పెట్టుబడితో 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా? ప్లాంట్‌ విస్తరణకు ప్రభుత్వం పౖసా ఇవ్వలేదు. ప్లాంటు విస్తరణకు కావలసిన ధనాన్ని కార్మికులు తమ కష్టంతో వచ్చిన సొంత లాభాలతో సమకూర్చుకున్నారు . ఇంకా కావలసి వస్తే బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. టాటా స్టీల్‌ కంపెనీ కి 8 శాతం వడ్డీ కి బ్యాంకు లు అప్పులు ఇచ్చాయి. విశాఖ ఉక్కుకి 14 శాతం వడ్డీ రేటు ప్రకారం అప్పులు ఇచ్చారు. పన్నెండు లక్షల నుండి 63 లక్షల ఉక్కు ఉత్పత్తిని సాధించారు.72 లక్షల టన్నులఉత్పత్తిని సాధించటానికి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి స్థాయికి చేరుకోగల సామర్ధ్యం ఉంది. దేశ అభ్యున్నతికి కి విశాఖ ఉక్కు ను వనరుగా ఉపయోగించుకుని ప్రగతి ని సాధించ వచ్చని విశాఖ ఉక్కు నిరూపించింది. ప్లాంట్‌ నష్టాల్లో కూరుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని నష్టాలలో కూరుకుపోతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో పెట్టలేమని విడ్డూ రపు ప్రకటనలు చేస్తున్నారు.5 వేల కోట్లను మించి ప్రభుత్వం ఏమాత్రం పన్ను చెల్లింపు దారుల ధనాన్ని పెట్టుబడి పెట్టిందో ప్రజలకు చెప్పాలి.

లాభాలు ఎందుకు తగ్గాయి?


హుదూద్‌ తుఫాన్‌ వలన స్టీల్‌ ప్లాంట్‌ కు 1000 కోట్ల నష్టం సంభవించింది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సహాయం చేయలేదు. రాజకీయ అవసరాల కోసం రాయబరేలీ రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో 2 వేల కోట్ల రూపాయలను పెట్టమని విశాఖ స్టీల్‌ ను ప్రభుత్వం ఆదేశించింది.ఫలితంగా 2వేల కోట్ల రూపాయల ను స్టీల్‌ ప్లాంట్‌ నష్ట పోయింది.గనుల కోసం, ఒరిస్సా మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లో 381 కోట్ల రూ.వాటాల ను ప్రభుత్వం కొనిపించింది. పర్యావరణ అనుమతుల కోసం మరో 500 కోట్లను ఖర్చు పెట్టించారు. మొత్తం 881 కోట్ల రూ. స్టీల్‌ ప్లాంట్‌ ధనం ఖర్చు పెట్టించారు. కానీ గనులు లోంచి ఇనుప ఖనిజం రాలేదు. 2010 లో బర్డ్‌ గ్రూప్‌ లో 361 కోట్లను పెట్టుబడిగా పెట్ట్టి 51 శాతం వాటాలు కొనమని కేంద్రం ఆదేశించింది.వాటాలు కొని 10 ఏళ్ళైనా, నేటికీ ఒక్క టన్ను ఇనప ఖనిజం కూడా రానివ్వలేదు.చెయ్యని నేరానికి 1400 కోట్ల అపరాధ రుసుము విధించారు. ఇప్పటికే 500 కోట్లు చెల్లించారు. 1971 లో విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థ క్రింద ప్రారంభించారు. సెయిల్‌ సంస్థకు, 200 సం.తవ్వినా తరగని ఇనప గనులున్నాయి. సెయిల్‌ సంస్థ నుండి 1982లో విశాఖ ఉక్కు ను ఎందుకు విడకొట్టారు? రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం సంస్ధను ఎందుకు ఏర్పాటు చేశారు ?సెయిల్‌ లో ఎందుకు విలీనం చేయరు? గత మూడు నాలుగు సంవత్సరాల సమస్యలను మాత్రమే చెబుతూ అంతకుముందు ప్లాంట్‌ సాధించిన అద్భుత ఫలితాలను విస్మరించడం సమంజసం కాదు. 279 కోట్ల అమ్మకాలతో మొదలై 2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లకు పైగా అమ్మకాల తో సాలీనా 14.5 శాతం వ ద్ధిరేటును సాధించింది. ఇంత వ ద్ధి రేట్ను సాధించిన మరొక ఉక్కు ఫ్యాక్టరీ ని చూపించమనండి.

స్వంత గనులు ఎందుకు కేటాయించలేదు?

ఉక్కు తయారీకి వంద రూపాయలు ఖర్చు అయితే అందులో 61% కేవలం ముడిపదార్థమైన ఇనుపఖనిజం కొనటం కోసమే ఖర్చవుతున్నది. సొంత గనులు ఉంటే ఈ ఖర్చు తగ్గటమే కాకుండా విశాఖ ఉక్కు లాభాల బాటలో ప్రయాణించేది. వివరమైన ప్రాజెక్టు రిపోర్ట్‌ ను ఏం యన్‌ దస్తూరి కం పెనీ 1971 లో తయారు చేసింది. అందులో బైలాదిల్లా ఇనుప ఖనిజ గనుల్లో 4 మరియు 5 బ్లాకులను కేటాయించాలని చాలా వివరంగా ప్రాజెక్టు రిపోర్ట్‌ లోనే నివేదించారు. అయినా ఇప్పటివరకు స్వంత గనులను ఎందుకు కేటాయించలేదు? ఇప్పటివరకు అధికారంలోఉన్న అన్ని ప్రభుత్వాల నాయకులు ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉక్కు ఉత్పత్తి ప్రారంభించిన 1991 నుంచి మార్కెట్‌ రేటుకి ఇనప ఖనిజాన్ని కొనక తప్పటంలేదు. 1991 లో టన్ను ఇనప ఖనిజం రేటు 396. రూ. ఉంటే,2004 సంవత్సరానికి 1085 రూ, 2020 కి 4779 రూ.అయింది.మధ్యలో 5424. రూ.కూడా పెరిగింది.
స్వంత గనులున్న స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతి టన్ను ఇనప ఖానిజానికి 2396 రూ ఖర్చు పెడుతూవుంటే, విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్ను ఇనప ఖనిజానికి 6584 రూ. ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే స్వంత ఇనప గనులు లేనందున విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్నుకూ అదనంగా 4188 రూ ఖర్చు పెట్టి ఉక్కు ను ఉత్పత్తి చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ లు లేని బ్రాహ్మణి స్టీల్స్‌ కు, గాలి జనార్ధనరెడ్డి కి గనులను కేటాయించారు. జిందాల్‌, ఎస్సార్‌,వంటి ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇచ్చారు. స్వదేశీ ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ కు ఇనప ఖనిజ గనులు ఇవ్వలేదు కానీ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయ ప్రభత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏం పాపం చేసింది? ఎందుకు ఇవ్వలేదు? ఉత్పత్తి పరమైననష్టం లేదు. ఆపరేషన్‌ నష్టాలు లేవు. పెట్టుబడికి అయిదు రెట్లకు మించి లాభాలను ఆర్జించింది.కేంద్ర ప్రభుత్వానికి 43 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్ల రూపాయలు పన్ను చెల్లించారు.
ఇనుప ఖనిజం బయట కొన్నా 2014- 15 వరకూ లాభల్లో నడిచింది.2020 డిసెంబర్‌ లో 212 కోట్ల లాభం వచ్చింది.2021 జనవరిలో 135 కోట్ల లాభం వచ్చింది.2021 ఫిబ్రవరి లో 165 కోట్ల లాభం వచ్చింది.2021 మార్చ్‌ లో 300 కోట్ల లాభం రావచ్చంటున్నారు. ప్రైవేట్‌ వారికీవిశాఖ ఉక్కు ను ఇవ్వటానికే స్వంత గనులను కేటాయించలేదు అని అర్ధ మౌతూనే ఉంది.నష్టాల్లో ఉన్న గుజరాత్‌ పెట్రోల్‌ కార్పొరేషన్‌ ను ఓఎన్‌జిసిలో కలిపేశారు. అలానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను సెయిల్‌ సంస్థ లో కలపవచ్చు కదా! గుజరాత్‌ కి ఒక న్యాయం!ఆంధ్ర కొక న్యాయమా? ఒకే దేశం ఒకే న్యాయం అవసరం లేదా?

కార్మికులకు జీతాలు ఎక్కువ- పని తక్కువ !

కార్మికులకు జీతాల ఖర్చులు ఎక్కువ అని, కార్మికులు సరిగ్గా పని చేయరనీ అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఖర్చులో ఉద్యోగుల వేతన ఖర్చు 15 శాతానికి ఎప్పుడూ మించలేదు. విపరీతమైన ఉష్ట్నోగ్రత లో, ప్రతికూల వాతావరణంలో కూడా కార్మికులు శ్రమించి. ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉత్పత్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రిఫరెన్షియల్‌ షేర్‌ లను ఉపహరించడం వలన షేర్‌ కాపిటల్‌ ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది. ఫలితంగా ప్లాంట్‌ పై 2930 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. గత 30 సంవత్సరాల నుండి నికర ఆస్తులు పెంచుకుంటూ, ప్రిఫరెన్సియల్‌ షేర్స్‌ డబ్బులు ఇచ్చేస్తూ, అప్పులు వడ్డీతో సహా తీరుస్తూ, ఉక్కు ఉత్పత్తిని 63 లక్షల టన్నులకు పెంచుకుంటూ అప్రతిహతంగా పురోగమిస్తున్న విశాఖ ఉక్కును అప్రతిష్ట పాలు చేయలేరు.
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఎత్తిన బావుటా దించేది లేదని ఆంధ్ర ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండి గా ఉందో కార్మికులు, ప్రజలు కూడా అంతే పట్టుదల తో ఉన్నారు. జనవరి 27న కేంద్ర క్యాబినెట్‌ కమిటీ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించిన తర్వాత కార్మికులంతా ఐక్యం అయ్యారు. కార్మిక సంఘాలన్నీ కలిసాయి.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ గా ఏర్పడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ ముందు ప్రారంభించిన నిరాహార దీక్ష శిబిరం ప్రజలతో కిక్కిరిసిపోతూ వున్నది. ”ఎవడు రా అమ్మేది? ఎవడు రా కొనేది? ” అనే నినాదంతో ప్రభుత్వాన్ని గద్ధిస్తున్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రతిధ్వనించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపించేవరకూ పోరాడాలన్న ఉక్కు సంకల్పం తో పోరాడి సాధించారు. వీధులు, గ్రామాలు, పట్టణాలు, హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశ్రమలు, పార్లమెంటు, శాసనసభ అన్నీ పోరాట వేదికలుగా మార్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ నలుమూలలకూ విస్తరించిన సమరశీల పోరాటం ప్రతిఫలమే విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల వలన రాలేదు. ప్రజా పోరాట చరిత్రను పాలకులు మరిచిపొతే చరిత్రహీనులు కాక తప్పదు. ఆ పోరాటమే తిరిగి దారిన పడుతున్నది. నూతన శక్తీతో కార్మికులు, రైతులు ఐక్యమై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎదుర్కొంటున్నారు. ప్రజా శక్తి ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు.


వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ గుంటూరు, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎల్‌డిఎఫ్‌కు అధికారం ఖాయం అన్న 16కు పదిహేను సర్వేలు !

26 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP, Kerala Assembly Elections pre-poll surveys, Kerala LDF, Kerala pre-poll surveys, UDF


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి ప్రచారం పర్వం వేడెక్కుతున్నది. రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, మరోదఫా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారంలోకి రావటంగా ఉన్న రాజకీయ ఆనవాయితీకి తొలిసారిగా ఈ సారి తెరపడనున్నది. ఈ నేపధ్యంలో దీన్ని సహించలేని హిందూత్వ, క్రైస్తవ మత శక్తులు మరోసారి తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ముందుకు తెస్తున్నాయి. ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. శబరిమల దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో ఎవరైనా దాన్ని ప్రచార అంశంగా ముందుకు తెస్తే సమస్యలను ఎదుర్కొంటారు. వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారం చేపట్టనున్నదంటూ ఇప్పటి వరకు జరిగిన పదహారు సర్వేలలో ఒకటి మాత్రమే ఏ కూటమికీ మెజారిటీ దక్కదని చెప్పగా మిగిలిన వన్నీ ఎల్‌డిఎఫ్‌కు మెజారిటీ సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. వీటిలో మొదటిది గత ఏడాది జూలైలో జరగ్గా మిగిలినవన్నీ ఈ ఏడాదిలోనే జరిగాయి. మొత్తం 140 సీట్లకు గాను అధికారం దక్కాలంటే 71 స్దానాలు తెచ్చుకోవాలి. పదహారు సర్వేల సగటు ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 76.3 సీట్లు గరిష్ట సగటు 82 రానున్నాయి. మెజారిటీలలో కనిష్టంగా 72 కాగా గరిష్టంగా 91 ఉన్నాయి. బిజెపి కూటమికి రెండు సర్వేలు 3-7 మధ్య వస్తాయని పేర్కొనగా మిగిలినవన్నీ ఒకటి రెండుగా తెలిపాయి.ఒక సర్వే మూడు వస్తాయని పేర్కొన్నది. గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్ధలలో పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఎల్‌డిఎఫ్‌కు 101 వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వెలువడింది. హంగ్‌ అని పేర్కొన్న సర్వే కూడా 68-78 మధ్య వస్తాయని పేర్కొన్నది.


ఈ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను మొత్తం 957 మంది పోటీలో ఉన్నారు. ఫ్రంట్‌లు, పార్టీల వారీగా పోటీ చేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)లో పది పార్టీలున్నాయి. సిపిఐ(ఎం) మరియు అది బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు 86, సిపిఐ 25, కేరళ కాంగ్రెస్‌(ఎం) 12, జనతాదళ్‌ (సెక్యులర్‌) 4, ఎన్‌సిపి 3, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ 3, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ 3, కాంగ్రెస్‌(సెక్యులర్‌) 1, కాంగ్రెస్‌(బి) 1, జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ 1. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 93,ముస్లిం లీగు 27, కేరళ కాంగ్రెస్‌ 10, ఆర్‌ఎస్‌పి 5, నేషనలిస్టు కాంగ్రెస్‌(కేరళ) 2, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) 1,సిఎంపి 1,ఆర్‌ఎంపిఐ 1. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఏ) బిజెపి 115, భారత ధర్మ జనసేన 21, అన్నాడిఎంకె 2, కామరాజ్‌ కాంగ్రెస్‌ 1, జనాధిపత్య రాష్ట్రీయ సభ 1, డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ 1. ఈ కూటమిలో కామరాజ్‌ కాంగ్రెస్‌, జనాధిపత్య రాష్ట్రీయ పార్టీలు రెండూ బిజెపి గుర్తుమీదే పోటీ చేస్తున్నాయి.


శబరిమలై వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నాయర్‌ సర్వీసు సొసైటీ(ఎఎస్‌ఎస్‌) ఒక వైపు నుంచి మరో వైపు నుంచి లాటిన్‌ కాథలిక్‌ చర్చి పెద్దలు ఎన్నికల్లో తామేంటో చూపుతామంటూ ఎల్‌డిఎఫ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శబరిమల వివాదం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నప్పటికీ హిందూత్వశక్తులు దాన్ని ఏదో ఒక రూపంలో ఎన్నికల అంశంగా చేసేందుకు పూనుకున్నాయి. విజయన్‌ ప్రభుత్వం జాలర్లకు హాని చేసేందుకు ప్రయత్నించిందంటూ వ్యతిరేకంగా ఓటు వేయాలన్న సందేశాలను చర్చి నేతలు ఇచ్చారు. ఈ సంస్దల యత్నాలు ఫలించబోవనే ధీమా ఎల్‌డిఎఫ్‌లో వ్యక్తమైంది. క్రైస్తవులు ప్రధానశక్తిగా ఉన్న కేరళ కాంగ్రెస్‌(ఎం) ఈ సారి ఎల్‌డిఎఫ్‌లో చేరటం మతశక్తులకు మింగుడు పడటం లేదు. మరోవైపు కొందరు బిజెపికి మద్దతు ఇస్తుండటంతో సామాన్య క్రైస్తవులలో మతాధికారులు ఇచ్చే పిలుపులకు పెద్దగా స్పందన కానరావటం లేదు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో సర్వేలు ఎల్‌డిఎఫ్‌ మెజారిటీనే సూచిస్తున్నాయి.


ఏకె ఆంటోని ముఖ్యమంత్రి విజయన్‌ పాద సేవ చేయాలి !


ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీద విరుచుకుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఏకె ఆంటోని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సిపిఎం నేత, మంత్రి ఎంఎం మణి ప్రశ్నించారు. కరోనా సమయంలో గనుక కాంగ్రెసే అధికారంలో ఉంటే ఎందరో పౌరులు మరణించి ఉండేవారని అన్నారు. తమ స్వంత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నా బిజెపి గురించి నోరెత్తని ఆంటోనికి వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించని ఆంటోని ముఖ్యమంత్రికి పాదసేవ చేయాలన్నారు. ఏ పార్టీకి ఎందరు నాయర్లను కేటాయించాలనే పంపిణీ హక్కులు ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమార్‌ నాయర్‌కు లేదని, ఆయన వాంఛలకు అనుగుణ్యంగా కొంత మంది ఓటు వేయవచ్చుగానీ మెజారిటీ నాయర్లు ఎల్‌డిఎఫ్‌ మద్దతుదార్లుగా ఉన్నారన్నారు.


బిజెపి ఓట్లు కావాలంటున్న చెన్నితల – వద్దు అంటున్న మరో కాంగ్రెస్‌ నేత !


బిజెపితో సహా తాము ఎవరి ఓట్లనూ వద్దు అనటం లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ప్రకటించగా తమకు బిజెపి ఓట్లు అవసరం లేదని యుడిఎఫ్‌ కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ చెప్పారు. కన్నూరు జిల్లా తలసెరిలో గానీ మరోచోట గాని తమకు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓట్లు అవసరం లేదని పదే పదే చెప్పామని, వెల్ఫేర్‌ పార్టీ(ముస్లిం మతతత్వ)తో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఎన్నికల జాబితా గురించి ఆరోపణలను కొనసాగిస్తున్న రమేష్‌ చెన్నితల తాజాగా మరొక చౌకబారు ఆరోపణను ఇసికి ఫిర్యాదుగా పంపారు. ఓటు వేసిన తరువాత వేలు మీద వేసే సిరాగుర్తును చెరిపివేసే రసాయనాలను అధికారపక్షం పంపిణీ చేసిందన్నది దాని సారం. ఆరోపణకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం కోరగా కొన్ని కేంద్రాల నుంచి తనకు ఫిర్యాదులందాయని చెన్నితల చెప్పారు. పలుచోట్ల దొంగ ఓట్లు చేర్పించారని సిపిఎం మీద రమేష్‌ చెన్నితల చేస్తున్న ఆరోపణలు ఆయనకే ఎదురు తగులుతున్నాయి. పెరుంబవూరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ఎల్దోస్‌ కున్నపల్లి, ఆయన భార్య మరియమ్మకు రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. కైపమంగళం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి సుబిన్‌కు మూడు చోట్ల ఓట్లు, గుర్తింపు కార్డులు ఉన్నట్లు బయటపెట్టిన సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు ఎంఎల్‌ఎ, ఆయన భార్యకు రెండు చోట్ల ఉండటం గురించి ఏమి చెబుతారంటూ దీన్ని ఒక ప్రచార అంశంగా ముందుకు తెచ్చారు. రమేష్‌ చెన్నితల ఒక మహిళకు ఐదు చోట్ల ఓట్లు ఉండటాన్ని ఉదాహరణగా మీడియా ముందు చెప్పారు. అయితే సదరు మహిళ తాను కాంగ్రెస్‌ కార్యకర్తను అని చెప్పటంతో చెన్నితల నోట్లో వెలక్కాయపడింది.

ఇడిపై కేసు గురించి కేంద్ర బిజెపి మంత్రి గగ్గోలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర ఎల్‌డిఎఫ్‌ నేతలను దొంగబంగారం కేసులో ఇరికించేందుకు నిందితులను బెదిరించి తప్పుడు ప్రకటనలు చేయించిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానినే కోర్టుకు అఫిడవిట్‌గా సమర్పించి ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు తనచేత బలవంతంగా ప్రకటన చేయించారని, ఇడి అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో తప్పుడు కేసు పెట్టిన ఇడి అధికారులపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాన్ని ఎత్తివేయాలని ఇడి చేసిన వినతిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతంపై విచారణ న్యాయవిచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇడిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు, కేసు పెట్టటం ఏమిటంటూ కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ గగ్గోలు పెట్టారు. ఇది దేశంలో ఒక వింత అన్నారు.


దొంగబంగారం కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌ను ఇడి అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకోవటాన్ని తాము విన్నామని ఆమెకు రక్షణగా ఉన్న ఇద్దరు కేరళ మహిళా పోలీసులు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయించింది. స్వప్న సురేష్‌కు రక్షణగా ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 12,13 తేదీలలో విధి నిర్వహణలో భాగంగా తాను స్వప్న వద్ద ఉన్నపుడు ఇడి అధికారులు ఆమెను బెదిరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని నమోదు చేయటాన్ని తాను విన్నానని ఆ పోలీసు అధికారిణి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచారు. దాన్నే ఒక న్యాయమూర్తి ముందు నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచికి న్యాయ విభాగం సలహా ఇచ్చింది.తమకు వ్యతిరేకంగా పోలీసు అదికారిణి ఫిర్యాదు, వాంగ్మూలం రాజకీయవత్తిడితో చేస్తున్నట్లు ఇడి ఆరోపించింది.


కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధుల సంస్ధ(కెఐఐఎఫ్‌బి)పై ఆదాయపన్నుశాఖ దాడి చేయటం దాదాగిరి తప్ప మరొకటి కాదని ఆర్ధిక మంత్రి థామస్‌ ఐజాక్‌ వర్ణించారు. అన్ని నిబంధనలను, చట్టాలను పాటిస్తున్న ఆ సంస్ధపై దాడులు చేయటం ద్వారా ఎలాంటి నష్టం చేయజాలరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో నిర్మించిన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్ధలను జనం చూస్తున్నారని, దాన్ని దెబ్బతీస్తుంటే రాష్ట్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే సంస్దను ఏర్పాటు చేశాము, రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. దాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌-కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ అడిగిన సమాచారం, పత్రాలను గతంలోనే సమర్పించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు మరోసారి దాడి చేయటం తప్ప మరొకటి కాదని చెప్పారు.ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లటానికి ఎవరు హక్కు ఇచ్చారని, దీని వెనుక కేంద్ర మంత్రుల ప్రోద్బలం తప్ప అధికారులదేమీ లేదన్నారు.


విజయాలతో మామా-అల్లుడు చరిత్రను సృష్టిస్తారా !


అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌ విజయం సాధిస్తే కేరళ అసెంబ్లీ చరిత్రలో అదొక రికార్డు అవుతుంది. విజయన్‌ అల్లుడు రియాజ్‌ అన్న విషయం తెలిసిందే. విజయన్‌ కన్నూరు జిల్లాలో పోటీ చేస్తుండగా రియాజ్‌ కోజికోడ్‌ జిల్లాలో పోటీచేస్తున్నారు. ఈ ఉదంతాన్ని మరికొన్ని చోట్ల జరుగుతున్న పోటీలలో బంధువులు పోటీ చేయటాన్ని చూపి సిపిఎంలో కూడా కుటుంబ పెత్తనం, వారసత్వం చోటు చేసుకున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనికి ప్రాధాన్యత తప్ప బంధుత్వాలకు కాదు అన్న విషయం తెలిసిందే. అనేక కుటుంబాలలో సభ్యులందరూ పార్టీ పనిలో పూర్తి కాలం పని చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రియాజ్‌ విషయానికి వస్తే విజయన్‌ అల్లుడు గాక ముందే 2009 ఎన్నికల్లోనే సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈనెల 28న ముఖ్యమంత్రి కోజికోడ్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఐదు కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొంటారు. వాటిలో రియాజ్‌ పోటీ చేసే బైపూరు ప్రత్యేకంగా లేదు. దానితో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రచారాన్ని కోజికోడ్‌లోనే ఏర్పాటు చేశారు. రియాజ్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


బంధుగణం పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ వారే ఎక్కువగా ఉన్నారు. ఒక కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ కుమారులు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా దివంగత స్వతంత్ర ఎంఎల్‌ఏ కుమారుడు ఒకరు స్వతంత్ర అభ్యర్ధిగా ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమారుడు,ఎంపీ అయిన మురళీధరన్‌, కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉన్నారు.ఎన్‌సిపి మాజీ మంత్రి సోదరుడు, ఎల్‌డిఎఫ్‌ కన్వీనరు విజయరాఘవన్‌ సతీమణి బిందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనింజన్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులుగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్‌ నేత దిగంగత మణి కుమారుడు జోస్‌ మణి ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తుండగా ఆయన బావమరిది, మాజీ అయ్యేఎస్‌ అధికారి జోసెఫ్‌ యుడిఎఫ్‌ అభ్యర్ధిగా వేరేచోట ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఒక మాజీ స్పీకర్‌ కుమారుడు కూడా యుడిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరోసారి ఎల్‌డిఎఫ్‌దే అధికారం : మనోరమ, టైమ్స్‌ నౌ సర్వేల వెల్లడి

25 Thursday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala elections 2021, Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Kerala LDF, Manorama-VMR


ఎం కోటేశ్వరరావు


ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ-విఎంఆర్‌ సర్వే , టైమ్స్‌ నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి. మనోరమ ఫిబ్రవరి 15-మార్చి 15వ తేదీల మధ్య జరిపిన సర్వే ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 77, గరిష్టంగా 82 రానున్నాయని వెల్లడించారు. ఇదే విధంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 54-59, బిజెపికి మూడు, ఇతరులకు ఒకటి వస్తాయని పేర్కొన్నది. ఎల్‌డిఎఫ్‌కు 43.65, యుడిఎఫ్‌కు 37.37, బిజెపి కూటమికి 16.46, ఇతరులకు 2.52శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రిగా తగిన వ్యక్తిగా 39శాతం మంది పినరయి విజయన్‌కు ఓటు వేయగా తరువాతి స్ధానాలలో ఊమెన్‌ చాందీ (కాంగ్రెస్‌) 26, కెకే శైలజ(సిపిఎం), రమేష్‌ చెన్నితల(కాంగ్రెస్‌) 11, కె సురేంద్రన్‌(బిజెపి) ఐదు, వి.మురళీధరన్‌(బిజెపి) మూడు శాతం చొప్పున ఉన్నారు. తిరువనంతపురం జిల్లాలో పద్నాలుగు స్ధానాలుండగా 12 ఎల్‌డిఎఫ్‌ గెలుస్తుందని, రెండు బిజెకి రావచ్చని, కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదని సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న రెండింటిలో ఒకటి గత ఎన్నికల్లో గెలిచిన నీమమ్‌ స్ధానం ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కె. మురళీధరన్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తూ బిజెపి-కాంగ్రెస్‌ కుమ్మక్కు అనే ముద్రను తొలగించుకొనేందుకు చూస్తున్నారు. ఇక్కడ బిజెపికి 41.3శాతం, సిపిఎంకు 41.2 వస్తాయని సర్వేలో తేలింది. అయితే సర్వే సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరన్నది ఖరారు కాలేదు. బలమైన మురళీధరన్‌ను ఎంపిక చేసినందున దాని ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నది. ఇలాంటి తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. బిజెపి గెలుస్తుందని అంచనా వేసిన మరొక నియోజకవర్గం తిరువనంతపురం.గతంలో ఇక్కడ యుడిఎఫ్‌ గెలిచింది. ప్రస్తుతం బిజెపి 32.5, సిపిఎం 30.4, కాంగ్రెస్‌కు 25.2శాతం వస్తాయని పేర్కొన్నది.


ఈ సర్వే సమయంలో, తరువాత జరిగిన పరిణామాలన్నీ ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం మంజేశ్వరం నియోజక వర్గంలో బిజెపికి విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలు దానికి ఎదురు తగిలి ముస్లిం లీగుకు ఉపయోగపడతాయని తాజాగా మనోరమ విశ్లేషణ పేర్కొన్నది. ఈ నియోజకవర్గంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. కాసరగోడ్‌ జిల్లాలో కర్ణాటకు దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గంలో 53శాతం ఓటర్లు ముస్లింలే ఉన్నారు. కర్ణాటక నుంచి వస్తున్న బిజెపి నేతలందరూ కేవలం హిందూ ఓటర్లనే కలుస్తూ బిజెపిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తుండటంలో మిగిలిన వారు బిజెపిని ఓడించేందుకు సంఘటితం అవుతున్నారు.గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్లతో బిజెపి సురేంద్రన్‌ ఓడిపోయారు. మరోసారి ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించనున్నదనే వాతావరణం ఎల్లెడలా ఉండటం, మీడియా సర్వేలు కూడా దానినే నిర్ధారించటంతో ఓటర్లు ముస్లింలీగు వైపు మొగ్గుతారా లేక సిపిఎం వైపు చూస్తారా అన్నది ప్రశ్నార్దకంగా మారింది.గత ఏడు దఫాలుగా ఈ నియోజకవర్గంలో బిజెపి రెండవ స్దానంలో వస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయటం వరుసగా ఇది మూడవసారి, ఇక్కడ గెలిచే నమ్మకం లేకపోవటంతో పత్తానంతిట్ట జిల్లాలోని కొన్ని నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మంజేశ్వరంలో పదివేల మెజారిటీతో గెలుస్తానని సురేంద్రన్‌ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలీగ్‌ సభ్యుడు బంగారు ఆభరణాల కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నారు. ఈ కుంభకోణంలో బాధితులు అత్యధికులు ముస్లింలే. దీంతో ఆ పార్టీ నేతలు సమర్ధించలేని స్ధితిలో పడిపోయారు. దీంతో వేరొకరిని నిలిపారు. సిపిఎంకు ఆదరణ పెరగవచ్చని భావిస్తున్నారు. టైమ్స్‌ నౌ సర్వే వివరాలు కూడా తాజాగా వెలువడ్డాయి. దాని విశ్లేషణ ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు 77, యుడిఎఫ్‌కు 62, బిజెపికి ఒక స్ధానం వస్తుందని పేర్కొన్నారు.


ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : విఎస్‌ అచ్యుతానందన్

‌
రానున్న ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ తిరిగి విజయం సాధించనున్నదని మాజీ ముఖ్యమంత్రి, 97 సంవత్సరాల సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం వరదలు, ఓఖి, నిఫా, కరోనా వైరస్‌లను తట్టుకున్నదని చెప్పారు. విజయన్‌ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల గురించి చెబుతూ తన మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని, ఏకంగా ఒక కమిటీని కూడా వేశారని గుర్తు చేశారు. వచ్చిన ఆరోపణల మీద కేంద్ర సంస్ధలు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వమే కోరిన విషయాన్ని చెబుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి దర్యాప్తు సంస్దలను వినియోగిస్తున్నారని అన్నారు. విజయం సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి వామపక్ష ప్రజాతంత్రశక్తులు ఎంత చురుకుగా ఉన్నాయో సంఘవ్యతిరేక శక్తులు కూడా అదే విధంగా ఉన్నాయని అన్నారు. కేరళలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, దేశాన్ని అమ్మివేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయ పార్టీల పని తీరుతెన్నులు మారిపోయాయని, గతంలో ఇచ్చిన నినాదాలు ఇప్పుడు పని చేయవన్నారు. ఎప్పటికైనా రాజకీయనేతలకు మౌలిక విలువలు, త్యాగం, నిజాయితీ ముఖ్యమని వాటిని కాపాడుకొంటూ పని చేయటం ద్వారా వామపక్ష శక్తులు ముందుకు పోతాయని అన్నారు.


ఇడి మీద కేసుల ఎత్తివేతకు కోర్టు తిరస్కారం !


ముఖ్యమంత్రి, ఇతర అధికారపక్ష నేతలకు వ్యతిరేకంగా బంగారం స్మగ్గింగ్‌ కేసులో ఒక నిందితుడితో బలవంతంగా ప్రకటన చేయించటం, దాన్ని కోర్టులో సమర్పించిన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కేసును ఎత్తివేయాలని, దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని ఇడి చేసిన అభ్యర్ధనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పని చేస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తీరు తెన్నుల గురించి ప్రజలూ, ప్రభుత్వమూ గమనిస్తున్న విషయాన్ని ఆ సంస్ధ కూడా గుర్తించటం అవసరం అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు. అసలు వారెందుకు అలా ఎందుకు వ్యహరిస్తున్నారో మీరైనా తెలుసుకోండని విలేకర్లతో అన్నారు. దీని మీద సొసైటీ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ తాము సమదూరం పాటిస్తున్నామని, శబరిమల ఆలయం మీద ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నామని, పదిశాతం ఇబిసి రిజర్వేషన్లు అమలు జరపాలని, సంస్ధ నేత మన్మాత్‌ పద్మనాభన్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా చెప్పారు. కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్‌, ఇతర మతశక్తులతో కలసి సాగించిన ఆందోళనలో పద్మనాభన్‌ ఒక ముఖ్యపాత్రధారిగా ఉన్నారు.


ముదిమది తప్పిన మాజీ సిఎం ఎకె ఆంటోని వ్యాఖ్యలు !

ఏడాది తరువాత తిరువనంతపురంలోని కాంగ్రెస్‌ కార్యాలయ మెట్లెక్కిన మాజీ ముఖ్యమంత్రి ఏ కె ఆంటోని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ఆయనకు గర్వం ఎక్కువ, హిందువులు, ఇతర సామాజిక తరగతులను తప్పుదారి పట్టించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో కూడా ఆయనను అదుపు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. విజయన్‌ ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రతి సర్వేలోనూ వెల్లడి అవుతోంది. రెండో సారి అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే రెండు ప్రధాన మీడియా సంస్ధలైన మాతృభూమి, మళయాల మనోరమ తమ సర్వేల్లో వెల్లడించిన నేపధ్యంలో గందరగోళ పడిన ఆంటోని సహజంగానే తమ కార్యకర్తల మనోనిబ్బరాన్నికాపాడుకొనేందుకు పూనుకున్నట్లు స్పష్టం అయింది. తమ భవిష్యత్‌ బాగుండాలంటే విజయన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వవద్దని తాను నిజమైన కమ్యూనిస్టులను కోరుతున్నట్లు ఆంటోని చెప్పారు. ఇంతకాలంగా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. ఇప్పుడు పాడిందే పాడరా అన్నట్లు అంటోని కూడా పునశ్చరణ చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


మాకు బిజెపి ఓట్లు కావాలి : కాంగ్రెస్‌ నేత చెన్నితల !


బిజెపి అభ్యర్దులు లేని గురువాయూర్‌, తెలిచేరి నియోజకవర్గాలలో తమకు బిజెపి ఓట్లు కావాలని అంటాం తప్ప వద్దు అనేది లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రకరకాల కారణాల వలన వేర్వేరు పార్టీలకు ఓటు వేస్తారు, అందువలన ఫలానా పార్టీ వారి ఓట్లు వద్దు అనేది లేదన్నారు. కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కులో భాగంగానే ఈ నియోజకవర్గాలలో బిజెపి సరిగా నామినేషన్లు దాఖలు చేయలేదని, అన్ని చోట్లా సక్రమంగా వేసిన వారు ఇక్కడ ఎలా విఫలం అవుతారని సిపిఎం ప్రశ్నిస్తోంది. ఓటర్ల జాబితాల్లో అక్రమాల గురించి తాను ఐదు సార్లు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసినా స్పందించలేదని, అందువలన ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లున్న వారిని ఓటింగ్‌కు అనుమతించరాదని కోరుతూ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల హైకోర్టును ఆశ్రయించారు.
కొడంగనల్లూరు నియోజకవర్గంలో యుడిఎఫ్‌ అభ్యర్ధి శోభా సుబీన్‌కు రెండు నియోజకవర్గాలలో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సిపిఎం కార్యకర్తలు గుర్తింపు కార్డులతో సహా వివరాలను మీడియాకు అందచేశారు. ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు ఓటేసేందుకు అర్హత లేదంటున్న రమేష్‌ చెన్నితల తమ అభ్యర్ధి అసలు పోటీకి ఎలా అర్హుడో చెప్పాలని ప్రశ్నించారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న విషయం, ఎలా జరిగిందో తనకసలు తెలియనే తెలియదని సుబీన్‌ చెబుతున్నారు. ఒక వేళ ఎన్నికల సిబ్బంది తప్పు చేస్తే వారే దాన్ని సరిదిద్దాలని సుబీన్‌ అన్నారు. అదే సూత్రం ఇతర చోట్ల వర్తించదా అని రమేష్‌ చెన్నితలను సిపిఎం ప్రశ్నిస్తోంది.


గురువాయూర్‌ అనుకున్నా , నేత త్రిసూర్‌ అన్నారు: సురేష్‌ గోపి


తాను గురువాయూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని అయితే పార్టీ నేత (నరేంద్రమోడీ) త్రిసూర్‌ లేనా హరు అన్నారు, దాన్ని మన్నించి ఇక్కడ పోటీ చేస్తున్నా , ఇక్కడ ఓటర్లేమో త్రిసూర్‌ను మీకే ఇస్తున్నాం అని చెబుతున్నారని ప్రముఖ నటుడు సురేష్‌ గోపి చెప్పుకున్నారు. గురువాయూర్‌లో నామినేషన్‌ పత్రాలు సరిగా వేయని కారణంగా అసలు అక్కడ బిజెపికి అభ్యర్దే లేకుండా పోయారు.ఈ ఎన్నికల్లో శబరిమల ఒక అంశం కాదని అయితే మనోభావాలు ఉన్నాయని అన్నారు. వామపక్షాలు గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయి. వాటిని నిలిపివేయాలని కోరుతున్నా కాని అది అసాధ్యమని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. మరోవైపు శబరిమల గురించి చర్చించకూడదని కమిషన్‌ చెబుతోంది. పౌరుల విశ్వాసాలు, సంప్రదాయాలను కాపాడాలంటే శబరిమల గురించి చర్చించాలని అన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేస్తున్న క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మాట్లాడుతూ శబరిమల ఒక ప్రధాన ప్రచారఅంశమని చెప్పారు.


ఉగ్రవాదుల ఓట్లు వద్దంటున్న ఎంఎల్‌ఏ !


గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన వారిలో కొందరు మత ఉగ్రవాదులు ఉన్నారని తరువాత తనకు తెలిసిందని ఈ ఎన్నికల్లో వారి ఓట్లు తనకు వద్దని కొట్టాయం జిల్లాలో పూంజార్‌ నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తున్న పిసి జార్జి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఎరాట్టుపేట అనే ప్రాంతంలో కొందరు జార్జి ప్రచారాన్ని అపహాస్యం చేయటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాంటి వారి ఓట్లతో తాను ఎంఎల్‌ఏ కావాలనుకోవటం లేదని మీడియాతో చెప్పారు.
తమకు అధికారమిస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు ఐదేసి ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అలాగే వృద్దాప్య పెన్షన్‌గా మూడున్నరవేల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు జరపని ఈ పధకాలను కేరళలో ఎలా అమలు జరుపుతారంటూ నెటిజన్లు స్పందించారు. ఒక వైపు కేంద్రంలో ఉన్న సర్కార్‌ ఉన్న గ్యాస్‌ సబ్సిడీనే ఎత్తివేస్తుంటే వీరు ఆరు సిలిండర్లు ఉచితం అంటే కేరళీయులు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.శబరిమలలో ఆచారాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని వాగ్దానం చేసింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మలబార్‌ తీరంలో ” ఎర్ర ” సునామీ – కాంగ్రెస్‌ గగ్గోలు – మీడియాపై ఇసికి ఫిర్యాదు !

22 Monday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#" Red " Tsunami in Malabar, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


మలబార్‌ అంటే తెలుగు ప్రాంతాలలోని పెద్ద తరాలకు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టుల అణచివేతకు వచ్చిన నాటి కాంగ్రెస్‌ పాలకులు పంపిన రిజర్వు పోలీసులే. అది గత చరిత్ర . ఇప్పుడు మలబార్‌లోని నాలుగు జిల్లాలైన కాసరగోడ్‌, కన్నూరు,వైనాడ్‌,కోజికోడ్‌ జిల్లాలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎర్ర సునామీతో కాంగ్రెస్‌ కొట్టుకుపోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ జిల్లాల్లో 27 సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 4, బిజెపికి ఒకటి దక్కనుందని కేరళలోని అగ్రశ్రేణి మీడియా సంస్ద మళయాల మనోరమ-విఎంఆర్‌ సర్వే పేర్కొన్నది. నాలుగు భాగాల సర్వేలో తొలి విడత వివరాలను ఆదివారం రాత్రి నుంచి వెల్లడించటం ప్రారంభించింది. ఫిబ్రవరి 15 మార్చి 15 మధ్య సేకరించిన అభిప్రాయాల మేరకు తమ విశ్లేషణ ఉన్నదని తెలిపింది. కోజికోడ్‌, వైనాడ్‌ జిల్లాల్లో అన్ని సీట్లు ఎల్‌డిఎఫ్‌కు రానున్నాయని, యుడిఎఫ్‌ అనేక సిట్టింగ్‌ సీట్లను కోల్పోనున్నదని పేర్కొన్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న మంజేశ్వరం ఆ పార్టీకి దక్కనున్నదని తెలిపింది. ప్రస్తుతం అక్కడ ముస్లింలీగు ప్రాతినిధ్యం వహిస్తోంది. మలబార్‌ అంటే మళయాలీలు నివసించే కొండ ప్రాంతమని అర్దం.బ్రిటీష్‌ వారి పాలనలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆ ప్రాంతాన్ని మలబార్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కోస్తా ఆంధ్ర జిల్లాలో దానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఆ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రత్యేక పోలీసు దళాన్ని ఆంధ్ర ప్రాంతానికి రప్పించి దాడులను చేయించింది, వందలాది మందిని హతమార్చింది. పాత తరాలు నేటికీ వాటి దమనకాండను తలుచుకుంటాయి.


ఎల్‌డిఎఫ్‌కు సిపిఎం నేత ఎంఎ బేబీ హెచ్చరిక !


ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నమాట నిజం. ఇప్పుడు వెలువడుతున్న అనుకూలమైన సర్వేలు మనలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇంకేముంది విజయం దక్కినట్లే అని అతివిశ్వాసానికి పోయి కార్యకర్తలు పాలుమాలుతారేమో అన్న ఆందోళన కలుగుతోంది, అలాంటి వైఖరి ఉండవద్దు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ కార్యకర్తలను హెచ్చరించారు.


ప్రతిపక్ష స్ధానం కోసం కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పోటీ !


ఎన్నికల సర్వేల పట్ల తమకు విశ్వాసం లేదని అయినా అన్ని సర్వేలు ఎల్‌డిఎఫ్‌ గెలవనున్నట్లు చెబుతున్నాయని తామైతే ఏ సర్వే నివేదిక కోసమూ ఎదురు చూడటం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ సైతం రాష్ట్రంలో వామపక్ష పాలన కొనసాగుతుందని జోశ్యం చెప్పారని గుర్తు చేశారు. సర్వేలను చూసి కాంగ్రెస్‌ కళవళ పడుతున్నదని, వచ్చే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరుండాలో తేల్చుకొనేందుకు వివాద పడుతున్నారని చమత్కరించారు.


మీడియా సర్వేలతో కాంగ్రెస్‌ గగ్గోలు !


కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల నిత్యం ప్రభుత్వం మీద ఏదో ఒక బట్టకాల్చివేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా దొంగ ఓట్లను చేర్చించారనే ఆరోపణలు ప్రారంభించారు. తాజాగా మీడియా సంస్దల మీద అక్కసు వెళ్ల గక్కుతున్నారు. సర్వేల పేరుతో ఎల్‌డిఎఫ్‌ గెలవనుంది అంటూ యుడిఎఫ్‌ ఓటమికి మీడియా పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిజానికి అదే మీడియా సహకారం, ప్రోత్సాహంతో స్ధానిక సంస్దల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై ఎంత విష ప్రచారం చేశారో, దాన్ని ఓటర్లు ఎలా తిప్పికొట్టారో తెలిసిందే. తటస్ధం, పక్షపాతరహితంగా కనిపించే మీడియా అల్పబుద్దితో వ్యవహరిస్తోందని రమేష్‌ చెన్నితల ఆరోపించారు. తమను సిపిఎమ్మే నాశనం చేయలేకపోయిందని, మీడియా సర్వేలు కూడా ఆపని చేయలేవన్నారు. బెదిరింపులు, వాణిజ్య ప్రకటనలతో సిపిఎం మీడియాను బెదిరిస్తోందన్నారు. మీడియా సర్వేలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు చెన్నితల సోమవారం నాడు ఒక ఫిర్యాదును అందచేశారు. స్వేచ్చ, న్యాయంగా జరగాల్సిన ఎన్నికలను దెబ్బతీసేందుకు సర్వేలను వెల్లడిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో కీలకమైన తరుణంలో ఇలాంటి సర్వేల ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తున్నారని, తప్పుడు సమాచారంతో తీవ్రంగా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.


ఓట్లమ్ముకొనే కాంగ్రెస్‌ నేతలు !


2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి ఓట్లను అమ్ముకున్నదని ఆ ఎన్నికల్లో యుడిఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన జెడి(యు) నేత వి. సురేంద్రన్‌ పిళ్లే చెప్పారు. తాను 1984 నుంచి యుడిఎఫ్‌ను గమనిస్తున్నానని కొన్ని సీట్ల కోసం యుడిఎఫ్‌ కొందరిని బలపశువులుగా వాడుకున్నదని వారిలో తానొకరినని చెప్పారు.భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయిస్తామని యుడిఎఫ్‌ చెబుతుందని అక్కడ ఓట్లను అమ్ముకుంటుందని అన్నారు. నీమమ్‌లో గతసారి గెలిచిన బిజెపి ఓ రాజగోపాల్‌ స్వయంగా ఈ అంశాలను చెప్పారన్నారు. ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ది కూడా దీన్ని గమనించాలని, ఆయనకు అన్నీ తెలుసు అన్నారు. ఓట్ల అమ్మకం వెనుక ఉన్న కొందరు నేతల గురించి తెలుసునని, త్రిముఖ పోటీలో సిపిఎంకు అవకాశాలు ఉన్నాయన్నారు.


మాకు గనుక అప్పుడు తెలివి ఉంటేనా…… అంటున్న కాంగ్రెస్‌ ఎంపీ !


కరోనా నిబంధనల కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో తమ కార్యకర్తలు ప్రేక్షకులుగా మిగిలిపోయారని , కానీ డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తెలివి తేటలతో కరోనా సమయంలో చురుకుగా ఉన్నారని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ కె.సుధాకరన్‌ అన్నారు. సిపిఎం తన కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి ఆహారకిట్లు, పెన్షన్లు, ఔషధాలను అందించిందని, ఈ కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ చురుకుగా ఉన్నదని, పౌరులకు సాయం చేసిందని అన్నారు.మహిళల పట్ల చిన్న చూపినందుకు నిరసగా, ముఠా తగాదాలతో విసిగిపోయి నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షురాలు, ఏఐసిసి సభ్యురాలు కె సి రోజా కుట్టి ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.


హైకోర్టులో బిజెపికి ఎదురు దెబ్బ ! అధికారానికొస్తే లవ్‌ జీహాద్‌ బిల్లు తెస్తారట !


తెలిచేరి, గురువాయూర్‌ నియోజకవర్గాలలో నామినేషన్ల తిరస్కరణకు గురైన ఉదంతంలో బిజెపికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున రిటర్నింగ్‌ అధికారుల నిర్ణయాన్ని మార్చలేమని సోమవారం నాడు కోర్టు పేర్కొన్నది. మరో ఉదంతంలో ఒక నియోజకవర్గంలో సిపిఎం బలపరుస్తున్న ఒక అభ్యర్ధి సులేమాన్‌ హాజీ దుబారులోని తన రెండవ భార్య గురించి వివరాలు పేర్కొనలేదుకనుక నామినేషన్‌ అంగీకరించరాదన్న అభ్యంతరాన్ని రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. న్యాయనిపుణుల సలహా తీసుకొన్న తరువాత నిలిపివేసిన నామినేషన్‌ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు.
తాము అధికారానికి వస్తే కేరళలో లవ్‌ జీహాద్‌ బిల్లు తీసుకువస్తామని బిజెపి కేంద్రమంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. తిరువనంతపురంలో సోమవారం నాడు ఎల్‌డిఎఫ్‌పై ఆరోపణల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ విషయాలన్నింటినీ తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని చెప్పారు.క్రైస్తవ మత పెద్దలను సంతుష్టీకరించి వారి మద్దతు పొందేందుకు బిజెపి నేత ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. కేరళలో క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్‌ జీహాద్‌ జరుగుతోందని గత ఏడాది సిరియన్‌-మలబార్‌ చర్చి పెద్దలు చేసిన ఆరోపణలను సదానంద గౌడ ప్రస్తావించటమే దీనికి నిదర్శనం. ముస్లింలు – క్రైస్తవుల మధ్య తంపులు పెట్టి క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్నది బిజెపి ఎత్తుగడ. ఇప్పటికే జాకోబిన్‌ చర్చి వివాదంలో తలదూర్చి ఒక వర్గాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుంది. కర్ణాటకకు చెందిన బిజెపినేతల సారధ్యంలో కేరళ బిజెపి నేతలు ఇటీవల అనేక మంది బిషప్పులను కలసి మద్దతు ఇమ్మని కోరిన విషయం బహిరంగమే. కొందరు క్రైస్తవ పెద్దలు బిజెపికి మద్దతు ప్రకటించారు కూడా !


బిసిలకు కాంగ్రెస్‌ మొండిచేయి-రెట్టింపు సీట్లిచ్చిన సిపిఎం !


కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు చేసిన కులపరమైన దూషణ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ వెనుకబడిన తరగతులకు మొండి చేయి చూపిందని అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణలో మీడియా పేర్కొన్నది.వెనుకబడిన తరగతులలో ఎజవాలకు 28, ఇతర వెనుకబడిన తరగతులకు 18 మొత్తంగా 46 సీట్లను ఎల్‌డిఎఫ్‌ కేటాయించింది. అదే యుడిఎఫ్‌ 14ఎజవా, 12 ఇతర వెనుకబడిన తరగతులకు కేటాయించింది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి 55 స్దానాలలో ఎజవాలకు 43, ఇతర వెనుకబడిన తరగతులకు 12 కేటాయించింది. కేరళ కౌముది పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ సామాజిక తరగతులకు మూడు ఫ్రంట్‌లు కేటాయించిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఫ్రంట్‌ ×× బిసి ×× నాయర్లు×× ముస్లిం×× క్రైస్తవ
ఎల్‌డిఎఫ్‌ ×× 46 ×× 28 ×× 29 ×× 21
యుడిఎఫ్‌ ×× 26 ×× 28 ×× 39 ×× 28
ఎన్‌డిఏ ××× 55 ×× 45 ×× 3 ×× 6


యుడిఎఫ్‌లో ముస్లింలకు కేటాయించిన 39లో ముస్లిం లీగుకు చెందిన వారు 26, కాంగ్రెస్‌ 12, ఎల్‌డిఎఫ్‌లోని 29 మందిలో సిపిఎం నుంచి 21 మంది ఉన్నారు. నాయర్లలో కాంగ్రెస్‌ 28, సిపిఎం 15, బిజెపి 44 మంది ఉన్నారు. బిజెపిని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ బలపరుస్తున్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే గణనీయ సంఖ్యలో ఆ సామాజిక తరగతికి పెద్దపీట వేశారు. క్రైస్తవుల నుంచి కాంగ్రెస్‌ 18, సిపిఎం నుంచి 8 మంది ఉన్నారు.ఎల్‌డిఎఫ్‌ భాగస్వామ్యపక్షమైన కేరళ కాంగ్రెస్‌ పది స్ధానాలను కేటాయించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత్‌ కంటే చైనా, పాక్‌లో సంతోషమెక్కువ – మోడీ భక్తులకు మింగుడు పడని వాస్తవం !

21 Sunday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

India happiness index, UN World Happiness Report 2021, World Happiness Report 2021


ఎం కోటేశ్వరరావు

గురువుగారూ నాకెందుకో భయంగా ఉంది, సెలవిమ్మంటారా ?
భయమెందుకు చెప్పు శిష్యా !
తెల్లవారు ఝామున బెడ్‌ కాఫీ, ఉదయం ఉపాహారం సమయంలో, ఇప్పుడు మధ్యాహ్నభోజన సమయం. అప్పటి నుంచి చూస్తున్నాను. కాసేపు మీలో మీరే నవ్వుతారు, అంతలోనే విషాదంగా ఉంటారు … నాకెందుకో భయంగా ఉంది…. కొంపదీసి వేయించుకున్న కరోనా వాక్సిన్‌ వికటించలేదు కదా !
వాక్సిన్‌ వికటించటమా ! అలాంటిదేమీ ఉండదని నిర్ధారించుకున్న తరువాతే కదా మన ప్రధాని నరేంద్రమోడీ వేయించుకున్నారు…. మనమేమైనా తక్కువ తిన్నామా… మరో ఇరవై రోజులు చూసి కదా వేయించుకున్నాము….. అయినా వాక్సిన్‌ ఇహలోక భక్తుల కోసం తప్ప మనకెందుకు శిష్యా ! కరోనా కాదు కదా మరే మహమ్మారి మనలను దరిచేరదు. మన మహిమ నీకు తెలియదా !
తెలుసు గురువా తెలుసు రోజూ నేను చేస్తున్న ప్రచారం అదే కదా ! అంత మహిమ ఉన్నవారికి వాక్సినెందుకు అని ఎవరైనా అంటే….. ?
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులందరూ దేవతలే అయినా అన్నీ తెలిసినా వారు కూడా మానవుల మాదిరి వ్యహరించలేదూ ! ఎందుకంటావ్‌ ! మానవుల కోసమే. ఇప్పుడు ప్రతివారూ కరోనా గురించి భయపడుతున్నారు. దేవుడే దిగివచ్చినా వాక్సిన్‌ వేయించుకోకపోయినా అనుమానంగా చూస్తారు. అందువలన మనమెంత ! భక్తుల భయం తీర్చేందుకు ఆ లీలా మానుషుడి విలాసంలో మనం కూడా పాత్రధారులమే గనుక చిన్న స్వాములమైనా పెద్ద స్వాములమైనా వేయించుకుంటున్నాం శిష్యా !
అయితే సరే గురువా ? సందేహం తీరలేదు… మరి ఆ నవ్వు….. దాని వెనుక ఆ విషాదం సంగతి సెలవిచ్చారు కాదు !
ఏం చెప్పమంటావు నాయనా ప్రపంచ సంతోష నివేదిక 2021 వివరాలు చూసిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే అలా అవుతోంది శిష్యా ! అదుపు చేసుకుందామంటే కుదరటం లేదు !
ఆ నివేదికలో ఏముంది గురువా ! నవ్వు దేనికి వస్తోంది, విషాదం దేనికి కలుగుతోంది !!
మన దేశ స్ధానం అత్యంత దిగువన ఉన్నందుకు విషాదం….మన పొరుగుదేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నందుకు సంతోషం కలుగుతోంది శిష్యా !
అదేంటి గురువా ! ఎదుటి వారు సంతోషంగా ఉంటే ఏడవటం లోకం తీరు, అందునా ఇప్పటి దేశభక్తి కదా !! మీరు దానికి భిన్నంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందే ! అసలు విషయం ఏమిటో చెప్పండి గురువు గారూ !
ప్రపంచ సంతోష నివేదిక 2021ప్రకారం 149 దేశాల్లో మనది 139వ స్దానంలో ఉంది. మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి రాకముందు 2013లో ప్రకటించిన నివేదిక ప్రకారం 156 దేశాల్లో 111వ స్ధానంలో ఉన్నాం. ఏలినాటి శని పట్టకపోతే ఏడేండ్లలో రాంకు ఇలా దిగజారటం ఏమిటి చెప్పు ! దాన్ని నాకు విషాదం గాక ఎలా వినోదించగలను ? దేన్నయినా వినోదించటానికి నేనేమీ మోడీ భక్తుడిని కాదు కదా ! పోనీ ఏ మనోభావాలు కనపడకుండా నిబ్బరంగా ఉండటానికి మనమేమన్నా ప్రధాని నరేంద్రమోడీనా నాయనా ?
మీరు, నేను సామాన్యులం గనుక మనల్ని మనం చూసుకొని భోరుమంటాం కేరు మంటాం మనిష్టం. మరి సంతోషం సంతోషంతో చిద్విలాసం సంగతేంటి గురూజీ ?
ఈ రోజుల్లో అదీ ఆలోచించాల్సిందే శిష్యా ! మనమా సర్వేజనా సుఖినోభవంతు పరంపరలో ఎదిగిన వారం. దానిలో భాగంగానే మనకు దరిద్రం పట్టుకున్నా చుట్టుపక్కల వారు సంతోషంగా ఉన్నందుకు సంతోషించాను. అంతే తప్ప వేరే దురుద్దేశ్యం లేదు !
నిజమే గురువా నేను ఎప్పటి నుంచో మీ శిష్యరికం చేస్తున్నా ! గత ఏడు సంవత్సరాల నుంచి వసుధైక కుటుంబం-అందరం ఒకటే – సర్వమతాలూ సమానమే అనే పదాలనే మీరు పక్కన పెట్టేశారు !
స్వర్గలోకంలో నరకం గురించి మాట్లాడితే ఫరవాలేదు గాని నాయనా నరకలోకంలో స్వర్గం గురించి మాట్లాడితే కుదురుతుందా చెప్పు ! మనం బాగుపడటం సంగతి పక్కన పెట్టి కాస్త ఖాళీ దొరికితే ఉన్నవాటిని తెగనమ్మటం, మిగతా సమయంలో తరువాత మన కేంద్రీకరణ అంతా ఇరుగుపొరుగు దేశాలను దెబ్బతీయటం మీదనే కదా ఉంది !
అదేమిటి గురువా మన శత్రుదేశాలను నాశనం చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉండేది… మీరేమో విదేశాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. విదేశాలు పచ్చగా నిప్పులు పోసుకోవాల్సింది పోయి సంతోషం ప్రకటిస్తున్నారు !
శిష్యా నువ్వింకా రాజకుమారి ా అర్ధరాజ్యం కథల్లోనే కాలం గడుపుతున్నట్లున్నావు.మనకు పొరుగు దేశాలు ఎంత దూరమో వాటికీ మనమూ అంతేదూరంలో ఉంటాం. ఇద్దరి దగ్గరా అణ్వాయుధాలటా మన పురాణ బ్రహ్మ అస్త్రాలనైనా వెనక్కు తీసుకోగలంగాని ఒకసారి మీట నొక్కితే అవి అంతేనట ! మన ఇరుగుపొరుగువారి దగ్గర కూడా ఉన్నాయి గనుక వాటిని నాశనం చేస్తాం అనే పిచ్చి కలలు మానుకోవాలి.
వదిలేయండి గురువా గత ఏడు సంవత్సరాలుగా మన ఇరుగుపొరుగు వారిని దెబ్బతీసేందుకు మన జనాలను ఇబ్బంది పెట్టి దేశభక్తిని నవరంధ్రాలద్వారా నింపుతున్నాం. మనం ఇబ్బంది పడటం ఏమిటి వారు సంతోషంగా ఉండటం ఏమిటి ? పొంతన కుదరటం లేదు !
గత ఏడు సంవత్సరాలలో సంతోష సూచికలో చైనా 93 నుంచి 84వ స్దానానికి మెరుగుపరచుకుంది.బంగ్లాదేశ్‌ దరిద్రం గురించి చెప్పనవసరం లేదు.2013లో 108లో ఉంది. ఇప్పుడు 101కి మెరుగుపరచుకుంది. పాకిస్దాన్‌కు అమెరికా సాయం ఆపించాం, సర్జికల్‌ దాడులు చేశాం అయినా వారు సంతోషంగా ఉంటూ మనకంటే మెరుగైన 105వ స్దానంలో ఉన్నారు.అయితే 2013లో ఉన్న 81స్ధానం నుంచి దిగజారినా మనకంటే తక్కువే. శ్రీలంక 137 నుంచి 129కి పెంచుకోగా మయన్మార్‌ 121 నుంచి 126కు పడిపోయింది. ఎలా చూసినా మనకంటే మెరుగే, అందుకే వాటిని చూసి అభిమానపూర్వకంగా సంతోషం దానికి సూచనగా నవ్వు వస్తున్నది నాయనా !
గురువుగారూ ఒకదాని మీద ఒకటి ఏమిటీ ప్రపంచ సూచికలన్నింటా గత ఏడేండ్లలో ఈ దిగజారుడును అర్ధం చేసుకోలేకపోతున్నాను తలబద్దలౌతోంది. దేశం ఎటుపోతోంది.
అందుకే వచ్చే ఎన్నికల నాటికి మంచి నినాదం తట్టకపోతుందా, ఏదో ఒక ఘటన జరగకపోతుందా అని మన ప్రధాని నరేంద్రమోడీగారు నిమురుకుంటూ మధనం చేసేందుకు గడ్డాన్ని పెంచుతున్నారు కదా త్వరలో ఫలితం వస్తుందేమో చూద్దాం.
అంతేనా ! అంతకంటే మార్గం లేదా !!
ఇదిగో శిష్యా మనం ఏకాంతంలో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం ! భక్తులు వస్తున్నట్లున్నారు. నోస్ట్రోడోమస్‌ జోశ్యాల వందవ ప్రింటు, నరేంద్రమోడీ సుభాషితాలు, ఉపన్యాసాల, పొగడ్తల వంటివి దుకాణంలో ఉన్నాయోలేదో చూడు. వెంటనే నమో మోడీ సీడి రికార్డు ఆన్‌ చేయి. ప్రతి టీవీలోనూ మోడీ బొమ్మ కనపడేట్లు చేయించు. భక్తులకు ఆగ్రహం కలిగితే మనకే నష్టం ! శుభం మధ్యలో అశుభం వినపడకూడదని శాస్త్రాలో ఘోషిస్తున్నాయి. అందుకే మంగళవాద్యాలను పెద్దగా వినిపిస్తారు. ఇప్పుడు మోడీ గారీకి అంతే ! శుభం పక్కనే అశుభం కూడా కాచుకు కూర్చుంటుంది గానీ చెప్పాల్సి వచ్చినపుడు ముందుగా చెప్పాల్సింది శుభాలే, జనానికి అశుభాలు అనుభవంలోకి వచ్చినపుడే మనం వాటి చిట్టా విప్పాలి. అందుకే కొత్తగా ప్రెస్‌ నుంచి వచ్చిన ఆ పుస్తకాలను పొరపాటున కూడా అప్పుడే బయటపెట్టవద్దు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తిరుగులేని ఎల్‌డిఎఫ్‌ – తాజా సర్వే సైతం నిర్ధారణ !

21 Sunday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala LDF, Kerala UDF, LDF is going to win


ఎం కోటేశ్వరరావు


గతంలో వెల్లడైన సర్వేలు, తాజాగా వెల్లడైన మాతృభూమి సర్వే కూడా ఎల్‌డిఎఫ్‌ విజయాన్ని నిర్ధారించిందని అయితే కార్యకర్తలెవరూ ఆదమరిచి ఉండరాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌డిఎఫ్‌కు 75-83, యుడిఎఫ్‌కు 56-64 మధ్య, బిజెపికి రెండు వస్తాయని మాతృభూమి సి ఓటర్‌ సర్వే తాజాగా పేర్కొన్నది. అన్ని సర్వేల సారం ఎల్‌డిఎఫ్‌ కొనసాగింపేనని, సిపిఎం చెప్పింది నిజమని వెల్లడిస్తున్నాయని, అయితే గట్టిపోటీ జరగనున్నందున కార్యకర్తలు జాగరూకులై ఉండాలని బాలకృష్ణన్‌ చెప్పారు.
కేరళ విభాగం పని తీరుపట్ల కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో ఎల్‌డిఎఫ్‌ ఎంతో ముందున్నదని కాంగ్రెస్‌ కిలోమీటర్ల దూరం వెనుక ఉందని, చేస్తున్న ప్రచారం కూడా క్రమశిక్షణతో లేదని పద్దతి ప్రకారం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(మణి) బయటకు పోవటాన్ని తీవ్రంగా పరిగణించలేదని, పది సీట్లలో పోటీ చేస్తూ మిగిలిన జోసెఫ్‌ వర్గానికి పోటీ చేసేందుకు అసలు గుర్తే లేకపోయినా పట్టించుకోలేదని మండిపడింది. గత మూడు ఎన్నికల్లోనూ పార్టీకి 40సీట్లకు మించి రాలేదని, ఈ సారి 50 వస్తాయని ఏవిధంగా చెబుతున్నారని అడిగింది. ఎల్‌డిఎఫ్‌ కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంటే దానికి ధీటుగా పార్టీ సమాధానం లేదని పేర్కొన్నట్లు వెల్లడైంది.ఫిరాయింపుల నిరోధక చట్టం వేటును తప్పించుకొనేందుకు నామినేషన్లు దాఖలు చేసే ముందు జోసెఫ్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఏలు పిజె జోసెఫ్‌, మనోజ్‌ జోసెఫ్‌ ఎంఎల్‌ఏలుగా రాజీనామా చేశారు.

శబరిమల వివాదాన్ని ముందుకు తెచ్చే యత్నం !


ప్రస్తుతం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్న శబరిమల అయ్యప్ప దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ సమస్యపై లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి రెండూ ప్రయత్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్నే తీసుకువస్తామని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ సమస్య ప్రస్తావనే లేకుండా అంతకు ముందు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రణాళికను వెల్లడించింది. ” మతశక్తులను ప్రతిఘటించేందుకు,ఓడించేందుకు దైవం పట్ల విశ్వాసం ఉన్నవారు కూడా ఒక ఐక్య సంఘటనగా ముందుకు రావాలి. అన్ని మతాల విశ్వాసుల నమ్మకాలను రక్షించేందుకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అన్ని చర్యలూ తీసుకుంటుంది.ఏ మతం పట్ల విశ్వాసం లేని వారు కూడా ప్రశాంతంగా జీవించేందుకు వీలుకల్పిస్తుంది. ” అని పేర్కొన్నది. తమ ప్రభుత్వం పట్ల విశ్వాసులు ఎలాంటి సందేహాలను పెట్టుకోనవసరం లేదని, శబరిమల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత దాని అమలు గురించి అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదే పదే ప్రభుత్వ, సిపిఎం వైఖరినీ స్పష్టం చేస్తున్నారు. సమస్య సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ అంశం అసలు చర్చనీయాంశమే కాదన్నారు. ఇది రాస్తున్న సమయానికి బిజెపి ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అయితే దాని అజెండా బహిరంగమే కనుక శబరిమల అంశం లేకుండా ఉండదన్నది స్పష్టం. బిజెపికి మద్దతు ఇస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ శబరిమల అంశాన్ని ఎన్నికల్లో ముందుకు తెచ్చే యత్నాల్లో భాగంగా రాజధాని తిరువనంతపురంలో నామజపం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా నామజపం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హింసాకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం జరిగిన ఉదంతాలు తనతో సహా అందరినీ బాధించాయని, జరిగి ఉండాల్సింది కాదని దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన వ్యాఖ్యలను రచ్చ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయి. సంక్షేమ-అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో అమలు జరపనున్న కార్యక్రమాలతో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం !


కమ్యూనిస్టులను రెచ్చగొట్టటం, ప్రతిఘటిస్తే తమపై దాడులు చేశారంటూ యాగీ చేయటం కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఎత్తుగడల్లో భాగం అన్నది విమర్శ. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా అమలు జరిపేందుకు పూనుకున్నారు. తిరువాన్కూర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి తిరస్కరించిన సిపి రామస్వామి అయ్యర్‌ చర్యకు నిరసనగా జరిగిన పోరు పున్నప్ర-వయలార్‌ పోరాటంగా ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. నైజాం సంస్ధానంలో దోపిడీ నుంచి విముక్తికోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడితే అదే సమయంలో కేరళలో 1946లో సంస్దాన విలీనం కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన పోరులో వెయ్యిమందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం మరణించారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అలప్పూజలో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు. దాన్ని సిపిఎం-సిపిఐ రెండూ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అలప్పూజ బిజెపి అభ్యర్ధి సందీప్‌ వాచస్పతి అక్కడికి వెళ్లి అంజలి ఘటించారు. కమ్యూనిస్టు అమరజీవులను గౌరవిస్తూ ఎవరైనా ఆపని చేస్తే అభ్యంతరం లేదు. కానీ భారతమాతాకి జై అనే నినాదాలతో కమ్యూనిస్టుల నాయకత్వాన పోరు పేరుతో అమాయక దళితుల, వెనుకబడిన తరగతుల వారి ప్రాణాలను బలిపెట్టారని, కమ్యూనిస్టునేతలు పారిపోయి అతి పెద్ద ద్రోహం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులను రెచ్చగొట్టేందుకు తప్ప మరొకందుకు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి కుట్రను గ్రహించిన కార్యకర్తలు ఎంతో సంయమనం పాటించారని అభినందించారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి మనోభావాలను బిజెపి గాయపరచిందని అన్నారు. స్మారక కేంద్రంలోకి అక్రమంగా చొరబడ్డారని సిపిఎం విమర్శించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్ధి చర్యకు నిరసనగా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన జరుపుతుండగా వారిని రెచ్చగొట్టేందుకు పక్కనే ఉన్న మరొక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ది అనూప్‌ అంటోని పనిగట్టుకొని ప్రదర్శనవైపు రాగా కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దాన్ని తనపై దాడిగా చిత్రిస్తూ ఆసుపత్రిలో చేరటం వంటి నాటకానికి తెరలేపారని విమర్శలు వచ్చాయి. ఆంటోని కారు బానెట్‌ను కొందరు కొట్టారు తప్ప అతని మీద భౌతికదాడి జరగలేదని పోలీసులు ప్రకటించారు.

పినరయి విజయన్‌ ప్రచార తీరే వేరు !


ఎన్నికలలో పినరయి విజయన్‌ ప్రచార తీరు ఎందరినో ఆకర్షిస్తున్నది. రాజకీయంగా వ్యతిరేకించే మీడియా కూడా దాన్ని గుర్తించింది. విజయన్‌ కొన్ని సెకండ్ల పాటు ఒక సారి తన చేతి వాచ్‌ను చూశారంటే కార్యక్రమం ప్రారంభం లేదా ముగిసినట్లే లెక్క. పత్రికా గోష్టి అయినా, మరొక కార్యక్రమం అయినా నిర్ణీత ప్రకారం ముగియాల్సిందే.ప్రారంభం కూడా అంతే. పత్రికా గోష్టికి 45నిమిషాలు,దానిలో ప్రశ్నలు, సమాధానాలకు పదిహేను నిమిషాలు, ఎన్నికల ప్రసంగం 45నిమిషాల్లో ముగియాల్సిందే. నలభైమూడు నిమిషాలు అభివృద్ధి, ఇతర అంశాలను మాట్లాడిన తరువాత చివరి రెండు నిమిషాల్లో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులకు ఓటు ఎందుకు వేయాలో అభ్యర్ధిస్తారు. విజయన్‌ ప్రాంగణంలోకి రాగానే నినాదాలు, ఈలలు మోతలతో హౌరెత్తుతుంది. వేదిక మీదకు వస్తుండా అప్పటికే ఉన్న నేతలు గౌరవ సూచకంగా లేచి నిలుచుంటారు. వెంటనే ఒక చిన్న పాప వచ్చి గులాబి పువ్వు అంద చేసిన తరువాత పిడికిలి బిగించి అభివాదం చేస్తుంది. ముళ్లు ఏవైనా ఉంటే గుచ్చుకోకుండా విజయన్‌ దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. విజయన్‌కు ప్రత్యేకంగా ఒక మైక్‌ను అమరుస్తారు, దాన్నే తరువాత సభలకూ తీసుకువెళతారు. సభికులు ఎంతో క్రమశిక్షణగా కూర్చుని వుపన్యాసాలను వింటారు. అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఉదయం ఒక విషయం చెబితే సాయంత్రం బిజెపి నేతలు వాటినే చెబుతారు. బిజెపి నేతలు ఉదయం చెప్పిన వాటిని కాంగ్రెస్‌ నేతలు సాయంత్రం చెబుతారు, రెండు పార్టీలు పరస్పరం ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెండు పార్టీల తీరుతెన్నులను వర్ణించారు.

మూడు చోట్ల బిజెపికి నామినేషన్ల ఎదురుదెబ్బ !


మూడు నియోజకవర్గాలలో బిజెపికి నామినేషన్ల సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక తలసెరి, గురువాయూర్‌, దేవీకుళంలో సరిగా లేని కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. మూడు చోట్లా డమ్మీ అభ్యర్దులు లేకపోవటం లేదా వారి నామినేషన్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామంపై పార్టీ కేంద్ర నేతలకు ఏ కారణం చెప్పాలా అని తలలు పట్టుకుంటున్నారు. కన్నూరు జిల్లాలో గత ఎన్నికల్లో తలసెరిలో 22వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఈనెల 25న అక్కడ అమిత్‌ షా సభ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అసలు అభ్యర్దే లేకపోవటంతో ఏమి చెయ్యాలో తోచని స్ధితిలో పడ్డారు.తలసెరి నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలుత సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన విఆర్‌ కృష్ణయ్యర్‌ సిపిఐ తరఫున 1957, 1960లో గెలిచారు. అప్పటి నుంచి మధ్యలో ఒకసారి సిపిఐ అభ్యర్ధి తప్ప ఇంతవరకు సిపిఎం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి ఇకె నయనార్‌, ఐదుసార్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియర్‌ బాలకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో సక్రమంగా నామినేషన్లు వేసిన బిజెపి తలసెరీలో తప్పులతడగా వేయటం వెనుక కాంగ్రెస్‌తో కుమ్మక్కును వెల్లడిస్తున్నదని సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ చెప్పారు. దేవీకుళంలో బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు సీటు ఇవ్వగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధిని బలపరచాలని బిజెపి నిర్ణయించింది. తలసెరి, గురువాయూర్‌ సీట్ల గురించి హైకోర్టుకు ఎక్కింది.

ప్రత్యర్ధుల వలలో పడవద్దు -సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎల్‌డిఎఫ్‌ సూచన !


ప్రత్యర్ధి పార్టీలు, వ్యక్తులు రెచ్చగొట్టేందుకు పూనుకుంటారని అందువలన వారికి సమాధానం ఇచ్చే పేరుతో వారి వలలో చిక్కుకోవద్దని ఎల్‌డిఎఫ్‌ తన సామాజిక మాధ్యమ కార్యకర్తలకు సూచింది. ప్రత్యర్ధులపై దూషణలకు పాల్పడవద్దని, అసలు వారి గురించి పట్టించుకోవద్దని, ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను గుళికలుగా విడగొట్టి సులభంగా, వెంటనే చదువుకొనే విధంగా తయారు చేసి ప్రచారం చేయాలని పేర్కొన్నది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ నీమమ్‌ నియోజకవర్గంలో పోటీ చేయకుండా పుతపల్లికే పరిమితం కావాలని కొందరు కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన విషయం తెలిసిందే. దాని మీద ఊమెన్‌ చాందీ ఇంటి మీది పెంకులను మరమ్మతు చేసేందుకు యుడిఎఫ్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తూ పెట్టిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాని ఎల్‌డిఎఫ్‌ కోరింది. అలాగే పున్నప్ర-వయలార్‌ కమ్యూనిస్టు అమరజీవుల స్మారకకేంద్రంలో ప్రవేశించిన బిజెపి అభ్యర్ధి జనం, కార్యకర్తల మనోభావాలను గాయపరచినప్పటికీ అతగాడిని తూలనాడుతూ కొందరు పోస్టులు పెట్టటం మంచిది కాదని, ప్రత్యర్ధుల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.

మైనారిటీ మతాల సంతుష్టీకరణ పనిలో బిజెపి !


మైనారిటీ మతాల వారికి పూర్తి మద్దతు ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెప్పారు. జాకోబిన్‌ చర్చి వివాదంలో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, దగ్గరిదారులు లేవని అయితే ఆర్దోడాక్స్‌ వర్గానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ముస్లింలీగు, బిజెపి కుమ్మక్కయిన మాట నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పడవేశాయి. ఆయనను విమర్శించలేని-సమర్ధించలేని స్దితిలో పడిపోయారు. తాను మాట్లాడే మాటలు వాటి విలువ ఏమిటో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో రాజగోపాల్‌ తెలుసుకోవటం లేదని బిజెపి సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ వినియోగించటాన్ని ముకుందన్‌ తప్పుపట్టారు. సురేంద్రన్‌ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగలేదు. హెలికాప్టర్‌ వినియోగాన్ని కార్యకర్తలు మెచ్చరు అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: