Tags
# Anti Sanatan Dhrma, #Hindutva, #Udhayanidhi Stalin, Anti Hindu, BJP, DMK, Dravida, Eradicate Sanatan Dharma, INDIA, Narendra Modi, RSS
ఎం కోటేశ్వరరావు
” మన సమాజానికి సనాతన ధర్మం ఒక మలేరియా, డెంగీ వంటిది, దాన్ని వ్యతిరేకించటం కాదు, రూపుమాపాలి ” అని శనివారం నాడు తమిళనాడు పురోగామి రచయితలు మరియు కళాకారుల అసోసియేషన్ సభలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించిన అభిప్రాయం దేశంలో దుమారం రేపింది.ఇది హిందూ వ్యతిరేక వైఖరి, సనాతన ధర్మాన్ని పాటించే వారిని ఊచకోత కోయాలని పిలుపు ఇచ్చారంటూ బిజెపి చిత్రించింది. మాట్లాడే స్వేచ్చ పార్టీల కుందని కాంగ్రెస్ చెప్పగా, తృణమూల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. చెన్నయి సభ సందర్భంగా నిర్వాహకులు ” సమతా ధర్మ నిర్మూలన ” అనే అంశంపై చర్చను పెట్టారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం గాక నిర్మూలించాలని నిర్వాహకులు పేరు పెట్టినందున వారిని అభినందిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.” కొన్ని అంశాలను మనం నిర్మూలించాలే తప్ప దోమలు, డెంగీ, కరోనా, మలేరియా వంటి వాటిని కేవలం వ్యతిరేకించలేం, నిర్మూలించాలి. సనాతన ధర్మం కూడా ఇలాంటిదే.వ్యతిరేకించటంగాక నిర్మూలించటం అన్నది మన తొలి లక్ష్యంగా ఉండాలి అన్నారు. సనాతనం జనాన్ని కులపరంగా చీల్చిందని చెప్పారు. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరింకేమీ కాదన్నారు. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒకదానిలో అన్నింటా మనం గెలవాలి. సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అన్నారు. ప్రతిదాన్నీ ప్రశ్నించేందుకే కమ్యూనిస్టు, ద్రవిడ ఉద్యమం పుట్టిందని అన్నారు.
సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అని చెప్పిన తన మాటలను బిజెపి వక్రీకరించిందని రద్దు లేదా రూపు మాపాలి అంటే అర్ధం సనాతన ధర్మాన్ని పాటించేవారిని అంతం చేయాలని కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వైఖరిని పదే పదే వెల్లడిస్తానని, సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, దాని మీద ఎన్నికేసులు దాఖలైనా ఎదుర్కొంటానని ఆది, సోమవారాలలో పునరుద్ఘాటించారు. కొంత మంది తీరు పిల్లచేష్టల మాదిరి ఉందంటూ ద్రావిడవాదాన్ని రద్దుచేయాలి అని చెప్పినవారి మాటలకు అర్ధం డ్రావిడులను అంతం చేయాలనా, కాంగ్రెస్ ముక్త భారత్ అని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు అంటే కాంగ్రెస్ వారిని చంపాలనా అని ప్రశ్నించారు. సనాతన అంటే దేన్నీ మార్చకూడదు, దానిలో చెప్పినవన్నీ శాశ్వతంగా ఉంటాయని అర్ధం అని ఉదయనిధి చెప్పారు. అదిఆద్యంత రహితమైనది, దాన్ని మార్చలేము, ఎవరూ దాన్ని ప్రశ్నించకూడదన్నదే దాని అర్ధం,కుల ప్రాతిపదికన సనాతనం జనాన్ని చీల్చింది అన్నారు.
సనాతన ధర్మ పునరుద్దరణ కోసమే పుట్టామని చెబుతున్న హిందూత్వశక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఆ ధర్మం పేరుతో కోట్లాది మందిని అంటరానివారిగా, విద్య, వ్యక్తిత్వాలకూ దూరం చేసిన భావజాలం మీద అంబేద్కర్ , వామపక్ష, పురోగామి, హేతువాదులు నిరంతరం పోరాడారు. దాన్ని కొనసాగించటం కోసం నేడు కోట్లాది మంది అంబేద్కర్లు తయారు కావాల్సిన అవసరం వచ్చింది.ఇది భావజాల పోరు. దానిలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ వదిలిన ఒక వాగ్బాణం దెబ్బకు విలవిల్లాడుతున్న వారు దాన్ని చిలవలు పలవలుగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వారికి పది కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య తపస్వి ఛావనికి చెందిన మహంత పరమహంస దాస్ పిలుపు నిచ్చారు. గత రెండు వేల సంవత్సరాలలో అనేక మతాలు వచ్చి అంతరించాయని సనాతన ధర్మం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే అంతు చూస్తామని అన్నారు. ఉదయనిధిని చంపివేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని బిజెపి నాగర్కర్నూల్ నియోజకవర్గ నేత దిలీపాచారి ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు మత ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కొన్ని చోట్ల కొందరు కేసులు దాఖలు చేశారు.
” భగవద్గీతలో ప్రవచించిన హిందూ సామాజిక తత్వాన్ని నేను తిరస్కరిస్తాను.అది సాంఖ్య తత్వశాస్త్రంలోని త్రిగుణాల ప్రాతిపదికన ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇది కపిలుడి తత్వశాస్త్రానికి క్రూరమైన వక్రీకరణ రూపం, అది హిందూ సామాజిక జీవన న్యాయంలో అంతరాలతో కూడిన అసమాన కుల వ్యవస్థను తయారు చేసింది. సహపంక్తి భోజనాలు లేదా అక్కడక్కడా జరిగే కులాంతర వివాహాల వలన కులం అంతరించదు. కులం ఒక మానసిక స్థితి, అది బుర్రకు పట్టిన వ్యాధి. ఈ వ్యాధికి హిందూ మతబోధనలే మూలకారణం. మనం కులతత్వాన్ని , అస్పృశ్యతను పాటిస్తున్నాం.హిందూమతం ద్వారా వాటిని చేసేందుకు ఆజ్ఞాపితులమయ్యాము.పచ్చి చేదును తీపిగా మార్చలేము. దేని రుచినైనా మార్చగలము.కానీ విషాన్ని అమృతంగా మార్చలేము.మానవులు శాశ్వతం కాదు. భావజాలం కూడా అంతే.మొక్కలకు నిరంతరం నీటిని అందించటం ఎంత అవసరమో ఒక భావజాలానికి ప్రచారం కూడా అంతే అవసరం, లేకుంటే రెండూ చచ్చిపోతాయి.నేను చివరిగా చెప్పేదేమంటే జనాలను మీరు చైతన్యపరచండి, పోరు సాగించండి, సంఘటితపరచండి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి.మన పోరు సంపద కోసమో లేదా అధికారం కోసమో కాదు. స్వేచ్చకోసం, ఇది మానవ వ్యక్తిత్వ పునరుద్దరణ పోరు. ” ఇవి వివిధ సందర్భాలలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు, చేసిన దిశానిర్దేశం.
ఉదయనిధి స్టాలిన్ చేసి వ్యాఖ్యల మీద సహజంగానే బిజెపి, దాన్ని అనుసరించేవారు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విరుచుకుపడుతున్నారు. వర్తమాన పరిస్థితుల్లో అదేమీ అనూహ్యమైంది కాదు. శాంతి, సహనాల గురించి రోజూ సుభాషితాలు చెప్పే వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మ ప్రబోధకులు, దాన్ని అమలు చేయాలని చూసే వారిని గట్టిగా విమర్శిస్తే వారు మరింత రెచ్చిపోతారు, జనం అర్ధం చేసుకోకపోతే మనకే నష్టం అని చెప్పేవారు మంచి ఉద్దేశంతోనే చెబుతున్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్ప భావజాల పోరును పక్కన పెడితే మరింతగా రెచ్చిపోతారు. దేశంలో చివరికి ఏ గల్లీ సిల్లీ స్వామీజీని కదలించినా చెప్పేవి ధర్మం కోసం దేశం, సనాతనం, హిందూత్వ పరిరక్షణ, ముస్లింలుక, కైస్తవులు దేశానికి ముప్పుగా మారారు అనే కబుర్లే కదా ! ఉదయనిధి స్టాలిన్ వంటి వారు మాట్లాడినందునే వారంతా రెచ్చిపోతున్నారా ? లేదు, ఒక అజెండా ప్రకారమే వారు మాట్లాడుతున్నారు, వామపక్ష, పురోగామి వాదులతో పాటు ఉదయనిధి మాదిరి మాట్లాడేవారు ఇతర పార్టీలలో ఇప్పుడు ఎందరున్నారు అన్నది ప్రశ్న. సనాతవాదుల మారణకాండకు పిలుపునిచ్చినట్లు అతని మాటలను వక్రీకరించిన బిజెపి తీరు దేశం చూస్తున్నది. ఒక భావజాలాన్ని మరొక భావజాలం కలిగిన వారు విమర్శించటం ప్రజాస్వామిక లక్షణం. అనేక అంశాల మీద తర్కం జరిగినట్లు మన ప్రాచీన భారత చరిత్ర కూడా చెబుతున్నది. హిందూత్వ, సనాతనం మీద విమర్శలు చేస్తే అవి ఆ శక్తులకే ఉపయోగపడతాయని, జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు.
అసలు కమ్యూనిస్టులు, ఇతర పురోగామి వాదులు గతంలో గట్టిగా పోరాడని కారణంగానే మతశక్తులు పేట్రేగిపోయారని చెప్పేవారు కూడ మనకు తగులుతారు.కానీ అసలు కారణం అది కాదు, స్వాంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉండటమేగాక ద్రోహం చేసిన శక్తులు మహాత్ముడిని హతమార్చిన తరువాత వాటిమీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మేం మారాం అని ఇచ్చిన లేఖను తీసుకొని కొనసాగనిచ్చిన వారు అసలు దోషులు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ప్రపంచవ్యాపితంగా మితవాద పిచ్చిమొక్కలు పెరగటానికి అనువైన వాతావరణం ఏర్పడిందని గ్రహిస్తే వాటిని పీకివేసేందుకు చేయాల్సిన కార్యాచరణకు ముందుకు వస్తారు. పర్యవసానాల గురించి తెలియకుండానే దేశంలో అనేక మంది మితవాదుల పట్ల ఒక సానుకూల వైఖరితో ఉన్నారు, మేథావులుగా ఉన్నవారు కొందరు మతశక్తుల చంకనెక్కుతున్నారు.చాలా మంది మౌనంగా ఉంటున్నారు. అంబేద్కర్ చెప్పినట్లు ఉదాసీనత లేదా తటస్థవాదం అత్యంత ప్రతికూల చెడు వ్యాధిగా జనాన్ని ప్రభావితం చేస్తుంది.” చెడ్డవారి అణచివేత, దుర్మార్గం కంటే మంచి వారి మౌనం చివరికి విషాదంగా మారుతుంది. మౌనం ఒకనాటికి నమ్మక ద్రోహంగా పరిణమిస్తుంది ” అని మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చెప్పిన అంశాన్ని అందరూ గుర్తించాల్సిన తరుణం వచ్చింది.
ఒక మతభావజాలం సమాజ పురోగమనానికి ఆటంకం కలిగినపుడు మరో తత్వశాస్త్రం ముందుకు వచ్చి కొత్త మతాల ఆవిర్భావానికి కారణం అన్నది ప్రతి మత చరిత్ర చెబుతున్నది. మన దేశంలో వేదమతం లేదా సనాతన ధర్మం 50 బ్రహ్మ సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్పేవారు ఉన్నారు. ఒక్కో బ్రహ్మ సంవత్సరానికి 3.1104 లక్షల కోట్ల మానవ సంవత్సరాలు అంటే సనాతన ధర్మం 155.52లక్షల కోట్ల సంవత్సరాలు సాగిందని నమ్మింప చూస్తారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు.వేద మతం మీద తిరుగుబాటుగా లేదా కొత్త ఆలోచనల నుంచి వచ్చినవే బుద్ద, జైన, అనేక సారూప్యతలు కలిగిన వివిధ హిందూ మతాలు. ఈ కాలంలోనే చార్వాకులు లేదా లోకాయతులుగా పిలిచిన భారత తొలి భౌతికవాదులు తమ తత్వశాస్త్రాన్ని ముందుకు తెచ్చినట్లు వారికి వ్యతిరేకంగా వెలువడిన రచనలను బట్టి తెలుస్తున్నది. పరలోకం లేదా మరణానంతర లోకం లేదన్న వాదనలను ముందుకు తెచ్చిన చార్వాకులను అవి ఉన్నాయని చెప్పే మతశక్తులు భౌతికంగా అంతమొందించటంతో పాటు వారి రచనలను కూడా ధ్వంసం చేసినట్లు చెబుతారు. చివరకు తమతో విబేధించిన బౌద్ద, జౌన మతాలను కూడా మన దేశంలో అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. గతంలో శైవు- వైష్ణవ మతాలను అనుసరించిన వారు మతోన్మాదంతో కొట్టుకుచచ్చినా తరువాత కాలంలో రాజీపడ్డారు. ఇప్పుడు కూడా నిఖార్సయిన శైవులుగా చెప్పుకొనేవారు వైష్ణవాలయాలను, వైష్ణవమత పరిరక్షకులమని అంటున్నవారు శివాలయాలను సందర్శించరు. ఇలాంటి వారంతా ఇప్పుడు హిందూత్వశక్తులుగా, హిందూమత పరిరక్షకులుగా ఫోజు పెడుతున్నారు. ఈ రోజు హిందూమతం అంటే సనాతనకు ప్రతిరూపంగా ముందుకు తెస్తున్నందున ఉదయనిధి స్టాలిన్ వంటి వారు విమర్శలు చేస్తున్నారు. సనాతన, హిందూత్వ లేదా హిందూ అనేది ఒక జీవన విధంగా చెబుతూ సామాన్యుల చేత తమ చేదు మాత్ర మింగించేందుకు మతశక్తులు చూస్తున్నాయి. అలాంటి జీవన విధానానికి తిరిగి వెళ్లాలని ప్రబోధిస్తున్నవారు సమాజాన్ని వెనక్కు నడపాలని చూసే వారు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే భారత్లో ఏనాడూ జనమందరి జీవన విధానం ఒక్కటిగా లేదు. అన్ని కులాలది ఒకటే జీవన విధానం కాదు. సామాజిక న్యాయం లేదు. జీవన విధానమే అసలైన అంశం అయితే హిందూ మతానికి ముప్పు వచ్చిందని ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు ? తమ మతం, జీవన విధానాలను ఎంచుకొనే స్వేచ్చ జనానికి సంబంధించిన అంశం.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ విధానం మీద విమర్శ చేయగానే బిజెపి నేతలు ధ్వజమెత్తారు. సనాతను వ్యతిరేకించటం కాదు నిర్మూలించాలని పిలుపునిచ్చారంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దేశంలోని 80శాతం మందిని ఊచకోత కోయాలని పిలుపు నివ్వటమే అని బిజెపి ఐటి విభాగ నేత అమిత్ మాలవీయ ఆరోపించారు. దీనికి ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు అంగీకరించినట్లేనా అని బిజెపి ప్రశ్నించింది. ఇదంతా మెజారిటీగా ఉన్న హిందువులతో ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. తమిళనాడు బిజెపి నేత నారాయణ తిరుపతి ధ్వజమెత్తారు. డిఎంకె ఒక కాన్సర్ వంటిది దానికి సనాతన ధర్మ సూత్రాలతో చికిత్స చేయాలన్నారు. డిఎంకెకు ఇలాంటివి కాత్త కాదు. వారికి చెడు అంశాలు మంచివిగా మంచివి చెడుగా కనిపిస్తాయి. సనాతనం ఆద్యంతరహితమైనది, డిఎంకె ఒక మత పార్టీ, అది ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల మీద బతుకుతున్నది అన్నారు.(తమిళనాడులో హిందువుల జనాభా 88శాతం వరకు ఉన్నదని లెక్కలు చెబుతున్నాయి) క్రైస్తవ మిషినరీల నుంచి అరువుతెచ్చుకున్న భావజాలంతో ఉదయనిధి స్టాలిన్ చిలుకపలుకులు వల్లించినట్లు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వర్ణించారు. రాష్ట్ర జిఎస్డిపి కంటే ఎక్కువగా గోపాలపురం కుటుంబం(స్టాలిన్ కుటుంబం నివాసం ఉండే ప్రాంతం పేరు) సంపదలను పోగేసుకుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ భిన్న స్వరాలను వినిపించింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి పార్టీకి అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని అన్నారు. తమ పార్టీ అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ టిఎంసి ప్రతినిధి విమర్శించారు. ఇండియా కూటమిలోని ఒక భాగస్వామి పార్టీ నుంచి వెలువడిన వ్యాఖ్యలపై కూటమి అభిప్రాయం ఏమిటని బిజెపి ప్రశ్నించింది. మౌనంగా ఉండటం ద్వారా సనాతనవాదుల ఊచకోత పిలుపును కాంగ్రెస్ సమర్ధించినట్లయిందని బిజెపి నేత అమిత్ మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్, డిఎంకె ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజస్థాన్ ఎన్నికల సభలో మాట్లాడుతూ మోడీ గెలిస్తే సనాతన గెలిచినట్లు కాంగ్రెస్ చెబుతోంది, లష్కరే తోయబా కంటే హిందూ సంస్థలు ప్రమాదకరమైనవని రాహుల్ గాంధీ చెప్పారని షా ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో దేశంలో తిరోగామి సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్నది. ఇది కొందరి కళ్లు తెరిపించినా మంచిదే. సనాతన ధర్మం కొనసాగాలని చెప్పేవారి వాదనలేమిటో, వ్యతిరేకించేవారి కారణాలేమిటో జనం తెలుసుకొనేందుకు ఒక అవకాశం వచ్చింది.నూరుపూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల పోరు సాగాలి.