• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

31 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CEPR, China, Donald trump, Economic Sanctions, imperialism, Joe Biden, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు ఎలా దారికి రారో చూద్దాం అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ” ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు ” అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.మానవహక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలుదువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికిలోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.


ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్దమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగుశాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆప్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవహక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.


ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల వత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి. డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది.భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1లక్షల కోట్ల నష్టం జరిగింది.


ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది.2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020నాటికి దేశ దిగుమతులు 91శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.


అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని.అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దెదింపాలని అమెరికా చూసింది.వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది.వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.


ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు.రష్యా ఐటి,ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42,ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి.ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి.హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్నకారణం కావచ్చు ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి.వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా ఉంది.
దేశం ×× మొత్తం ××2022, ఫిబ్రవరి×× 2022 ఫిబ్రవరి తరువాత
రష్యా ×× 14,081 ××× 2,754 ××× 11,327
ఇరాన్‌ ×× 4,191 ××× 3,616 ××× 575
సిరియా ×× 2,644 ××× 2,598 ××× 46
ఉ.కొరియా ×× 2,133 ××× 2,052 ××× 81
బెలారస్‌ ×× 1,154 ××× 788 ××× 366
వెనెజులా ×× 651 ××× ××××× ××× ×××


చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్గుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది.వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది.2023తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది.తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వుబాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వుబాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.


.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెల్ల బంగారం లిథియంపై బహుళజాతి గుత్త కంపెనీల కన్ను !

03 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Australia, Chile, China, Lithium, Multinationals, white gold Lithium


ఎం కోటేశ్వరరావు
పెట్టుబడిదారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.కొలంబస్‌ అమెరికాను కనుగొనటంలోనే అది తొలిసారిగా స్పష్టమైంది. ఆ పరంపరలో ఓడలు, సముద్ర మార్గాలు,దేశాల ఆక్రమణ, వలసపాలన, ముడి చమురు, విలువైన ఖనిజ సంపదలను ఆక్రమించుకొనేందుకు, వాటినుంచి లాభాలను పిండుకొనేందుకు జరిపిన దాడులు, యుద్ధాల చరిత్ర తెలిసింది. ఆ జాబితాలో ఇప్పుడు తెల్లబంగారంగా భావిస్తున్న లిథియం అనే ఖనిజం చేరనుందా ? రానున్న రోజుల్లో చమురుతో పాటు అది కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాలుష్య ఉద్గారాలను 2050నాటికి సున్నా స్థాయికి తగ్గించే విధంగా శుద్దమైన ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలనేది ఒక లక్ష్యం.తద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు పూనుకోవాలని ప్రపంచం చూస్తోంది.దీనికి గాను వాహన రంగంలో రెండువందల కోట్ల ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రిక్‌తో పాటు అవసరమైతే చమురు ఇంథనాన్ని వినియోగించే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైది పెద్ద మొత్తంలో విద్యుత్‌ నిలువ చేయగలిగిన బ్యాటరీలు.వాటికి అవసరమైనది లిథియం. ఇప్పటివరకు కనుగొన్నమేరకు ఆ ఖనిజ నిల్వలు 250 కోట్ల బ్యాటరీల తయారీకి మాత్రమే సరిపోతాయట. సముద్రాల్లో , రాతి శిలల ప్రాంతాల్లో కూడా ఇది భారీగా దొరుకుతుంది.


ఈ పూర్వరంగంలో ఎంతో విలువైన లిథియం నిల్వలను కొత్తగా కనుగొనేందుకు, ఉన్న వాటిని తమ స్వంతం చేసుకొనేందుకు బహుళజాతి గుత్త కంపెనీలు చూస్తున్నాయి. వాటికి అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించేందుకు పూనుకున్నాయి. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా అందుకోసం కుట్రలు ఉంటాయని చెప్పనవసరం లేదు. బహుళజాతి కంపెనీల కోసం పని చేసే పత్రికల్లో ఒకటైన టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ చివరి వారంలో ” లిథియం కోసం ఒకవేళ దక్షిణ అమెరికా ఒక ఓపెక్‌ను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ” అంటూ ఒక విశ్లేషణా హెచ్చరికను ప్రచురించింది. ఒపెక్‌ అంటే చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ. అలాంటి దానినే లిథియం ఖనిజానికీ ఏర్పాటు చేస్తే అనేది దాని భయం. ప్రపంచంలో 2020 నాటికి కనుగొన్న మేరకు ఉన్న నిల్వలు రెండు కోట్ల పదిలక్షల టన్నులు. ఈ మొత్తంలో ఒక్క చిలీలోనే 92లక్షల టన్నులు ఉంది. తరువాత మన దేశంలోని జమ్మూ-కాశ్మీరు ప్రాంతంలో 59లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 47, అర్జెంటీనా 19, చైనా 15, అమెరికాలో 7.5, కెనడాలో 5.3లక్షల టన్నుల నిల్వలున్నాయి. వీటి నుంచి 82వేల టన్నులు అదే ఏడాది వెలికి తీయగా ఒక్క ఆస్ట్రేలియాలోనే 40,చిలీ 18, చైనా 14, అర్జెంటీనా 6.2 వేల టన్నులు వెలికి తీశారు.మరుసటి ఏడాది లక్ష టన్నులకు పెరిగింది.దీనిలో అమెరికా వాటా కేవలం ఒక్కశాతమే ఉంది.


గతంలో గ్లాసును కరిగించే ఉష్టోగ్రతలను తగ్గించేందుకు, అల్యూమినియం ఆక్సైడ్‌ కరిగింపు,సిరామిక్స్‌ వంటివాటిలో లిథియంను వాడేవారు. రెండువేల సంవత్సరం తరువాత బ్యాటరీల తయారీకి ఉపయోగించటంతో దాని డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది భౌగోళిక రాజకీయాలనే ప్రభావితం చేసేదిగా మారుతోందంటే అతిశయోక్తి కాదు.2020లో ప్రపంచమంతటా 30లక్షల విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తే మరుసటి ఏడాదికి 66లక్షలకు పెరిగాయి.మార్కెట్‌లో వీటి వాటా 9శాతం.రానున్న పది సంవత్సరాల్లో పెట్రోలు, డీజిలు మోటారు వాహనాల కొనుగోలును క్రమంగా తగ్గిస్తామని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చమురు ధరలు పెరగటంతో సాధారణ పౌరులు కూడా వాటివైపే మొగ్గుతున్నారు. మోటారు వాహనాలు, ఇతర రంగాల్లో చిప్స్‌ ప్రాధాన్యత ఎలా పెరిగిందో లిథియ బ్యాటరీలు కూడా అంతే ప్రాధాన్యవహించనున్నాయి. అందుకే ఆరు దశాబ్దాల క్రితం చమురు దేశాలు మార్కెట్‌ను అదుపు చేసేందుకు ఒపెక్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా లిథియం ఖనిజం ఉన్న దేశాలు కూడా ఒక్కటైతే అమెరికా,జపాన్‌,ఐరోపాలోని వాహన తయారీ కంపెనీలు విద్యుత్‌ వాహన రంగంలో అడుగుపెట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. టైమ్‌ పత్రిక విశ్లేషణలో వెల్లడించిన భయమదే.


లాటిన్‌ అమెరికా దేశాల్లో లిథియం నిల్వలున్నాయి.పెరూ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష నేత పెడ్రో కాస్టిలో ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల ప్రభుత్వం ఏప్రిల్‌ 10న ఒక ప్రకటన చేస్తూ అమెరికా లిథియం కంపెనీ అనుబంధ కెనడా కంపెనీకి లిథియం ఖనిజ గనులను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెరూవియన్లు ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.కుట్ర పూరితంగా అధికారానికి వచ్చిన ప్రభుత్వానికి తెలుపుతున్న నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ను కూడా చేర్చారు. కార్పొరేట్ల లాభాలు, ఇతర లబ్ది గురించి చూపుతున్న శ్రద్ద ఆ ప్రాంత పౌరుల పట్ల లేదని, తమ డిమాండ్లను విస్మరిస్తే ఖనిజతవ్వకాలను అనుమతించేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఖనిజమున్న పూనో ప్రాంతంలోని స్థానిక తెగలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు సమావేశమై ఆ ఖనిజం మీద సంపూర్ణ హక్కు తమదేనని, తమ సంక్షేమానికే వనరులను వినియోగించాలని, తమను సంప్రదించకుండా నిర్ణయాలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ముడిసరకులను ఎగుమతి చేసే ప్రాంతంగా, దేశంగా మారిస్తే సహించేది లేదని పరిశ్రమలను పెట్టి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.


నిజానికి ఇది ఒక్క పెరూ సమస్యమాత్రమే కాదు, ప్రపంచంలో సహజ సంపదలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. లిథియంను కార్పొరేట్ల పరం చేసేందుకు పెరూ కుట్రదారులు చూస్తున్నారు, ప్రజల పరం చేయాలని తాను కోరుతున్నట్లు పెడ్రో కాస్టిలో చెప్పారు. దీనిలో భాగంగానే బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సీ లాటిన్‌ అమెరికా లిథియం ఉత్పత్తి, ఎగుమతులకు ఓపెక్‌ మాదిరి సంస్థ ఏర్పాటును ప్రతిపాదించినట్లు చెప్పాడు. అర్జెంటీనా సర్కార్‌ కూడా దీనిపట్ల ఆసక్తి వెల్లడించింది. మెక్సికో, చిలీ అధినేతలు కూడా ఇటీవల లిథియం గనులను జాతీయం చేయాలని ప్రకటించారు. తమ ప్రాంత సంపదలను తమ పౌరుల సంక్షేమానికే అన్న అంశం దీనివెనుక ఉంది. పెరటిగా తోటగా చేసుకొని నిరంకుశ, మిలిటరీ పాలకులను గద్దె మీద కూర్చోపెట్టిన అమెరికా ముడిసరకుల ఎగుమతి ప్రాంతంగా దీన్ని చూసింది తప్ప పరిశ్రమలను వృద్ది చేయలేదు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఈ పరిస్థితిని మార్చాలని చూస్తున్నాయి.


టైమ్‌ వంటి కార్పొరేట్‌ మీడియాకు జన ఆకాంక్షలు పట్టవు. కొద్ది రోజుల క్రితం చిలీ ప్రభుత్వం లిథియం గనులను ప్రభుత్వ అదుపులోకి తేవాలని ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు సాగిస్తున్న రెండు అమెరికన్‌ కంపెనీలను కొన్ని సంవత్సరాల తరువాత అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించటం, కొత్తగా జరిపే తవ్వకాలను ఆధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అనేక దేశాల్లో ఈ పాక్షిక జాతీయకరణ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. చమురు దేశాల్లో ఒపెక్‌ ఏర్పాటును కూడా నాడు బహుళజాతి గుత్త సంస్థలు అంగీకరించలేదు, విఫలం చేసేందుకు చూశారు. మన దేశంతో సహా అనేక దేశాలు చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఒపెక్‌ ఇప్పుడు రష్యాతో సహా 40శాతం చమురు సరఫరాను అదుపు చేస్తున్నది.లిథియం అంశంలో కూడా అదే జరిగితే లాభాలు తెచ్చే మరో గంగిగోవు తమకు దక్కదని బహుళజాతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.2010లో కేవలం 23,500 టన్నుల డిమాండ్‌ మాత్రమే ఉన్న ఈ ఖనిజం 2030నాటికి 40లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. లాటిన్‌ అమెరికాలోని ఉప్పునీటి కయ్యలలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే శుద్ధి ఎంతో సంక్లిష్టమైనదిగా, ఖర్చుతో కూడినదిగా మారటంతో అనేక దేశాల్లో వినియోగంలోకి రాలేదు. లాటిన్‌ అమెరికా దేశాలకు పెట్టుబడులు సమస్య కూడా ఉంది. సంయుక్తరంగంలో తామెందుకు పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్లు పెదవి విరుస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియాలలో కఠిన శిలలు ఉండే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి. పాక్షిక జాతీయం, ప్రయివేటు రంగ భాగస్వామ్యం అన్న తమ విధానం పెట్టుబడులకు దోహదం చేస్తుందని చిలీ వామపక్ష అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెబుతున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా, కాలుష్యం పెంచని ఆధునిక పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టే వారికి 49.99 శాతం వాటా ఇస్తామని చెప్పాడు. ఖనిజ తవ్వకం స్థానికులకు, దేశ పౌరులకు లబ్ది కలిగించేదిగా ఉండాలన్నాడు.


1995లో ప్రపంచ లిథియం ఉత్పత్తిలో మూడో వంతు వాటా కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. దాని గనుల్లో ఉన్న నిల్వలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.ఈ ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతున్న దశలో తమ ఆటో రంగానికి అవసరమైన దానిని చేజిక్కించుకొనేందుకు అక్కడి కంపెనీలు తప్పకుండా చూస్తాయి.చైనాలో ఉన్న గనులతో పాటు విదేశాల్లో కూడా దాని కంపెనీలకు 5.6బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బాటరీలకు అవసరమైన ప్రపంచ ముడి ఖనిజంలో 60శాతం మేరకు చైనాలో శుద్ది చేస్తున్నారు. డిమాండ్‌ పెరిగే కొద్దీ చిలీ ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో 60శాతం చిలీ, బొలీవియా, అర్జెంటీనా త్రికోణ ప్రాంతంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక చెబుతున్నది. ఫోన్లు, కార్లకు అవసరమైన బాటరీలకు ఇది అనువుగా ఉండటంతో ఒక దశంలో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబరులో టన్ను ధర 14 నుంచి 80వేల డాలర్లకు చేరి తరువాత తగ్గింది. 2040 నాటికి ఇప్పుడున్న డిమాండ్‌ 40 రెట్లు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న చిలీ అమెరికన్‌ కంపెనీల అనుమతి గడువు 2030లో ముగియనున్నది.దానిని పొడిగిస్తారా లేక సంయుక్త భాగస్వామ్యంలోకి మారుస్తారా అన్న అనుమానాలతో ఆ కంపెనీల వాటాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని చిలీ రాగి కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదే మాదిరి లిథియం కంపెనీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ఈ పూర్వరంగంలో అది తెచ్చే లాభాల కోసం సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉంది. చిలీ రాగి గనులకూ ప్రసిద్ది అన్నది తెలిసిందే.ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమను అక్కడ 1973లో అధికారానికి వచ్చిన వామపక్ష నేత సాల్వెడార్‌ అలెండీ జాతీయం చేయటాన్ని అమెరికా, కార్పొరేట్‌ సంస్థలు సహించలేక కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మిలిటరీ తిరుగుబాటుతో అలెండీని హత్య చేశారు. ఇప్పుడు లిథియం పాక్షిక జాతీయకరణ నిర్ణయం నాటి పరిణామాలను గుర్తుకు తెచ్చిందని కొందరు పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

22 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's peace plan, Donald trump, imperialism, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping, Xi Jinping-Vladimir Putin summit : west in a tight spot on China's peace plan


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

22 Wednesday Feb 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Modani, BJP, Gautam Adani, George Soros, Hindenburg effect, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !

08 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BALLOON MANEUVERS, China's balloon over America, Joe Biden, Joseph Stalin, spying history, surveillance balloon


ఎం కోటేశ్వరరావు


తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. జనవరి 28న బెలూన్ను అమెరికా గుర్తించింది. అమెరికా గగనతలంలోని ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు స్వంత యుద్ద విమానాన్ని విని యోగించటం ఇదే ప్రధమం.


ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది.దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం !


ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిని చిత్రాల సంగతి తెలిసిందే. ఆగ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.


ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.


వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హౌవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్దించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి.

స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది.అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్‌ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు.యుద్ద విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.


పరస్పర విశ్వాసం లేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ.మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్‌-చైనా యుద్దం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.


సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్‌ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్‌ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్‌ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్‌ కూల్చివేత, మంత్రి బ్లింకన్‌ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.


చైనా బెలూన్‌ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులను నిలువ చేసే 150 సిలోస్‌( పురులు లేదా పాతర్ల వంటివి ) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్‌ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు.వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన.రేడియో, సెల్యులర్‌, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా ? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి.చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం,బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

25 Wednesday Jan 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

Hijab, Iran protests, Iran Women, Islamic Revolutionary Guards Corps, Mahsa Amini, People’s Mojahedin Organization of Iran, Supreme Leader Ali Khamenei, US imperialism


ఎం కోటేశ్వరరావు


గతేడాది సెప్టెంబరు నెలలో ఇరాన్‌లో నిర్భంధ హిజాబ్‌ వద్దంటూ మహిళలతో మొదలైన ఆందోళన ఇప్పుడు కొత్త స్వభావాన్ని సంతరించుకొంటోంది. కొత్త రూపాలు, పద్దతుల్లో వందలాది పట్టణాలకు పాకింది. ప్రతి శుక్రవారం ప్రార్ధనల తరువాత నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని టెహరాన్‌తో సహా రాత్రుళ్లు సమావేశాలను ఏర్పాటు చేసి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి ప్రతిరూపంగా ఉన్న చిహ్నాలు, స్థలాల మీద దాడులు చేస్తున్నారు. దేశంలోని 282 పట్టణాలకు ఇవి పాకినట్లు వార్తలు. సెప్టెంబరు నుంచి వివిధ సందర్భాలలో భద్రతా దళాలు 750 మందిని చంపినట్లు, 30వేల మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. దేశ అధినేత అలీ ఖమేనీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జిసి), పారామిలిటరీ ”బాస్‌జీ” వీరుగాక పోలీసు ఏజంట్లు, గూఢచారులకు జనం నిరసన తెలుపుతున్నారు. ఇస్లామిక్‌ విప్లవం పేరుతో సాగిన ఆందోళనతో 1979లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. 1989లో అయాతుల్లా మరణం తరువాత అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టి అధికారంలో కొనసాగుతున్నాడు.
మహిళల ప్రతిఘటనతో హిజబ్‌ ధారణ గురించి పునరాలోచిస్తామని ప్రకటించి ఆందోళనను నీరుగార్చేందుకు చూసిన పాలకులు ఇప్పుడు కొత్త పద్దతులను ముందుకు తెస్తున్నారు. హిజబ్‌లను ధరించకుండా పనిచేసేందుకు మహిళలను అనుమతించారనే పేరుతో క్వాజ్‌విన్‌ అనే పట్టణంలో ఐదు దుకాణాలను అధికారులు మూసివేశారని వార్తలు. పార్లమెంటులోని ” సాంస్కృతిక ” కమిటీ సభ్యుడు హుసేన్‌ జలాలీ ఒక ప్రకటన చేస్తూ హిజబ్‌ ధరించని వారిని ముందుగా గుర్తించి ఎస్‌ఎంఎస్‌ పంపుతామని, తరువాత హెచ్చరించి, అప్పటికీ వినకపోతే అలాంటి వారి బాంకు ఖాతాలను మూసివేస్తామని చెప్పాడు. మరింత ఆధునిక చట్రంలో హిజబ్‌ను అమలు చేస్తామని మరొకడు,జనవరి ఒకటి నుంచి బహిరంగ స్థలాల్లో అమలు చేస్తామని పోలీసు అధికారి ఒకడు ప్రకటించాడు.


పశ్చిమాసియాలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులను వ్యతిరేకించటంలో తిరుగులేని వైఖరితో ఉన్నప్పటికీ అంతర్గతంగా మతఛాందసాన్ని మరింత పెంచేందుకు, విమర్శకులను అణచివేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు ఆర్థికంగా జనజీవితాలు ప్రభావితం కావటంతో వ్యతిరేకత పెరుగుతోంది. దానికి ఒక రూపమే డైనమెట్‌ మాదిరి పేలిన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళన. భద్రతా దళాలు హతమార్చింది వీరినే అంటూ 637 మంది పేర్లను పీపుల్స్‌ మొజాహిదిన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇరాన్‌ పార్టీ ప్రచురించింది. దేశంలో తాజా నిరసనలు ప్రారంభమై ఆదివారం నాటికి 129 రోజులు, ఆ రాత్రి, శనివారం రాత్రి కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. ” సయద్‌ అలీ (ఖమేనీ)ని గద్దె దింపే సంవత్సరమిదే, నియంతకు ఉరి, ఉరితీతల పాలనకు అంతం పలకాలి, హంతక ఐఆర్‌జిసిని శిక్షించాలి, ముల్లాల అధికారమింకేమాత్రమూ వద్దు ” వంటి నినాదాలు చేస్తున్నారు.

ఐఆర్‌జిసి మింగిన తమ సొమ్మును తిరిగి ఇచ్చివేయాలంటూ టెహరాన్‌లోని న్యాయఅధికారుల భవనం ముందు క్రిప్టోలాండ్‌ ఆన్‌లైన్‌ ఎక్సేంజ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆదివారం నాడు ప్రదర్శన జరిపారు. దాదాపు మూడులక్షల మంది దాచుకున్న పొదుపు మొత్తాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధితుల్లో పెన్షనర్లు, రిటైరైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో దిగజారుతున్న కరెన్సీ రియాల్‌ విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టటం కూడా వీరిని ఆందోళనకు పురికొల్పుతోంది. దేశ సామాజిక భద్రతా నిధి పెట్టుబడి కంపెనీ ఒక వైపు ప్రతి ఏటా లాభాలు పొందుతుండగా వాటిని పెన్షనర్లకు బదలాయించకపోవటం, పెంపుదల గురించి చేసిన వాగ్దానాలను విస్మరించటం, గత బకాయిలు చెల్లించకపోవటం కూడా అసంతృప్తికి దోహదం చేస్తోంది. తప్పుడు కేసులతో ఉరిశిక్షలు వేసిన తమ వారి విడుదల కోరుతూ రాజధాని టెహరాన్‌లో జనవరి నెలలో మూడుసార్లు కుటుంబాలు, బంధుమిత్రులు ప్రదర్శనలు జరిపారు. తమ దండ్రులను ఉరితీయ వద్దంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా పలుచోట్ల ప్రదర్శనలు జరిపి తమ ప్రభుత్వం మీద వత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇరాన్‌ రాజుగా ఉన్న రెజా షా పహ్లవీ కాలంలో ఇరాన్‌లోని చమురు సంపదను అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్ల పరం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సింహాసనాన్ని వదిలిన తరువాత అతని కుమారుడు మహమ్మద్‌ రెజా షా అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1952 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా అధికారానికి వచ్చిన మహమ్మద్‌ మొసాదిక్‌ భూ సంస్కరణలు, చమురు కంపెనీలను జాతీయం చేయటంతో అమెరికా,బ్రిటన్‌ కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొసాదిక్‌ను గృహనిర్భంధంలో ఉంచటంతో ఏడాదిలోనే అధికారం కోల్పోయాడు. రాజు షా ఎంతగా కసి పెంచుకున్నాడంటే 1967లో మరణించిన మొసాదిక్‌ను ఇంట్లోనే ఖననం చేయించాడు. తరువాత కాలంలో షాను వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించినా 1979లో మతశక్తులు అధికారాన్ని కైవశం చేసుకున్నాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలను నిషేధించాయి. పౌరహక్కులను కాలరాశాయి. షా వ్యతిరేక ఉద్యమంలో పాల్గ్గొన్నవారిలో ఒకరైన మరియం రజావీ (69) ప్రతిపక్షాల తరఫున అధ్యక్షురాలిగా ప్రకటించుకొని ఫ్రాన్స్‌లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమె, ఇతర మద్దతుదార్లను ఉగ్రవాదులుగా చిత్రించి అరెస్టుచేసిన ఫ్రెంచి పాలకులు తరువాత వదలిపెట్టారు. ముల్లాల పాలనకు చరమగీతం పాడాలన్న తమ పౌరుల డిమాండ్‌ను పశ్చిమ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తాజాగా పునరుద్ఘాటించారు.


కుర్దిస్తాన్‌ ప్రాంతం నుంచి తన కుటుంబ సభ్యులతో కలసి టెహరాన్‌ వచ్చిన మాషా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ గతేడాది సెప్టెంబరు 13న ” ఉపదేశ దళాలు ” పట్టుకొని ”నైతిక పోలీసులకు” అప్పగించాయి. వారు ఆమెను దారుణంగా కొట్టటంతో పదహారవ తేదీన మరణించింది. ఈ వార్తను విన్న మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్‌ను వదలివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కార్మికులు, ఇతరులు కూడా తమ డిమాండ్లతో వారితో కలిశారు. వందలాది మందిని భద్రతాదళాలు చంపినట్లు చెబుతున్న అంకెలను ప్రభుత్వం అంగీకరించటం లేదు. అధికారిక మీడియా రెండువందల మంది మరణించినట్లు వార్తలు ఇచ్చింది. తాజా ఆందోళన ఇరాన్‌ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర వైరుధ్యాలను వెల్లడిస్తున్నది. మొత్తంగా మత ఛాందసపాలన, పాలకులు పోవాలని కోరుకుంటున్నారు. ఇది మరొక విప్లవ పోరాటం అని కొందరు వర్ణిస్తున్నారు.


వర్తమాన ఆందోళన జిన్‌(మహిళలు), జియాన్‌(జీవితం), ఆజాదీ( స్వేచ్చ) అనే భావనలతో నడుస్తున్నది. ప్రపంచ గాస్‌లో 15శాతం, చమురు సంపదలో పదిశాతం ఇరాన్‌లో ఉంది. ఇప్పటి వరకు తోడింది పోను 2020లో వెలికి తీసిన మాదిరే తరువాత కూడా కొనసాగిస్తే మరో 145 సంవత్సరాల పాటు తోడుకోవచ్చు. ఇంత సంపద ఉండి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారంటే అంతర్గత విధానాలతో పాటు అవినీతి,అవకతవకలు, 2018 నుంచి పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.2021నాటికి జిడిపిలో అప్పు 48, నిరుద్యోగం 12, ద్రవ్యోల్బణం 30శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబరు తరువాత కరెన్సీ విలువ 20శాతం పతనమైంది. ఇలాంటి కారణాలతో 60 నుంచి 70శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. వారిలో 18.4శాతం మంది దుర్భరదారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 60శాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉంది. చట్టాలు అమలు జరిగే స్థితి లేదు, అసమానతలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం ఏడాదికి 6,700 డాలర్లు కనీసవేతనంగా ఉంది. జనాల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. నెలల తరబడి వేతనాలు ఇవ్వని స్థితి. సంఘం పెట్టుకొనే వీల్లేదు. ఇస్లామిక్‌ రిపబ్లిక్కుగా ప్రకటించిన గత 43 సంవత్సరాలుగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేవంటే నమ్మలేని నిజం. ఆర్థికంగా దిగజారుతూ వత్తిడి తట్టుకోలేక ఇటీవల అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనాతో నిమిత్తం లేకుండా పరిస్థితి దిగజారటంతో 2017, 2019 సంవత్సరాల్లో నిరసనలకు దిగిన జనాన్ని అణచివేశారు. మరోసారి ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ఇరాన్‌లోని ఇస్లామిక్‌ గార్డులు ప్రజావ్యతిరేకులు, జనాన్ని అణచివేస్తూ సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న మతోన్మాదులు అన్నది నిజం. వారు 1979 నుంచీ చేస్తున్నది అదే, కానీ ఐరోపా పార్లమెంటు ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీర్మానించటం జనం మీద ప్రేమ కంటే ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటమే అన్నది స్పష్టం. గార్డుల సంగతి జనం చూసుకుంటారు. విదేశాల జోక్యం తగనిపని. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసులు ఉన్నప్పటికీ, అదనపు సృష్టి ఇరాన్‌ గార్డులు. ఆ సంస్థకు గతంలో కమాండర్‌గా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబఫ్‌ తీర్మానానికే పరిమితమైతే సరే, అంతకు మించి ముందుకు పోతే ప్రతికూలంగా స్పందిస్తామని అన్నాడు. నవాబియాన్‌ అనే ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి సమర్ధించిన వారిని, ఆసియాలో తమను వ్యతిరేకించే వారిని కూడా ఉగ్రవాదేశాలుగా ప్రకటించి తమ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించాడు. వారి కంపెనీలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామన్నాడు. ఐరోపా దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవాలని, అమెరికాకు తోకలుగా మారవద్దని ఇరాన్‌ అధికారపక్ష పత్రిక హెచ్చరించింది.1988లో ఇరాన్‌లోని వేలాది మంది అసమ్మతి ఖైదీల ఉరితీతకు కారకుడనే పేరుతో స్వీడన్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన ఉదంతాన్ని పేర్కొంటూ స్వీడన్‌ అధికారులను తమ వారు బంధించి తీసుకువచ్చి ఇరాన్‌లో విచారణ జరుపుతామని మరొక మరొక పత్రిక సంపాదకుడు హెచ్చరించాడు. ఇటీవల కొంత మంది టెహరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రెంచి రాయబార కార్యాలయాలపై దాడి చేశారు.


గతేడాది అక్టోబరులో క్యూబా రాజధాని హవానాలో జరిగిన ప్రపంచ దేశాల, కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల మహాసభలో పాల్గొన్న సిపిఐ(ఎం), సిపిఐతో సహా 62దేశాల పార్టీలు ఒక ప్రకటనలో ఇరాన్‌ ఆందోళన కారులు, ఇరాన్‌ కమ్యూనిస్టులకు మద్దతు ప్రకటించాయి. పాలకుల అణచివేతను తీవ్రంగా ఖండించాయి. ” దేవుడిని వ్యతిరేకించారని, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇస్లామిక్‌ రాజ్యానికి, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు ” వంటి అభియోగాలను మోపి వేలాది మందిని కోర్టులలో విచారణ తతంగం జరుపుతున్నారని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇరాన్‌లో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండాలన్నది ఇరానీయులకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ పశ్చిమ దేశాలూ, మధ్య ప్రాచ్యంలోని మితవాద ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నాయి. ఇరాన్‌లో చరిత్ర పునరావృతం అవుతోందా అంటే అవకాశం ఉందని చెప్పవచ్చు. గతంలో రాజు షాను ఉరితీయాలని నినదించిన వారే నేడు సుప్రీం లీడర్‌ అలీ ఖమేని ఉరికోసం డిమాండ్‌చేస్తున్నారు. మతాధికారులు గతంలో అమెరికా,బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు మద్దతు పలికిన చరిత్ర ఉంది. ఒక వేళ వర్తమాన ఆందోళన వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తే వారు స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుంటారా ? జనాన్ని అణిచివేసేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతారా అన్నది ప్రస్తుతానికి ఊహాజనిమే కావచ్చు గానీ, జరిగినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

22 Sunday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Filims, Gujarat, INDIA, International, INTERNATIONAL NEWS, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, UK

≈ Leave a comment

Tags

BJP, block out on BBC documentary, Explosive BBC documentary, Gujarat files, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్‌ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు ” ప్రేరేపిత ఆరోపణల పత్రం ” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కనుక భాషకోసం తడుముకోవాల్సినపని లేదు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.


మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు. అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యుట్యూబును, పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్రమోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా ? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా ? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచమంతటినీ చూడకుండా ఆపలేరు కదా ! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చువేసి అనధికారికంగా పంచుతున్నవారికి ఇది తెలియదా !


హిందూ-ముస్లిం ఉద్రికత్తలను పునరుజ్జీవింప చేసేందుకు పోలీసు, జడ్జి, తలారీ ఒకరే అన్నట్లుగా భారత్‌లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు పూర్వరూపంగా బిబిసి చిత్రం ఉన్నదని 302 మంది ప్రముఖులు చెప్పారు. నల్లమందు తింటే మన్నుదిన్న పాముల్లా పడి ఉంటారు అని చెబుతారు. కానీ మత మత్తుమందు జనాలను రెచ్చగొట్టి పిచ్చివారిగా మారుస్తుంది. వర్తమానంలో దాని విత్తనాలను చల్లి, దేశమంతటా సాగు చేస్తూ ఎవరు పెంచి పోషిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ డాక్యుమెంటరీలో ఉన్న అంశాలే అవి కదా ! అందువలన 302 మంది కాదు ముప్పై రెండువేల మంది ప్రముఖులు రాసినా మన ఘనమైన చరిత్ర పుటల్లోకి ఎక్కించిన చెరగని గుజరాత్‌ మారణకాండ మచ్చను చెరిపివేయలేరు.” తోటి భారతీయుడు మరియు మన నేతకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రేరేపిత ఆరోపణల పత్రం అని, విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజ్యవిధానానికి అనుగుణంగా ఉందని ” ఆ ప్రముఖులు బిబిసి చిత్రం గురించి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు చెప్పారు. బహుశా వారికి 80-20 అంటూ బిజెపి నేతలు చేసిన ” ఐక్యత ” ప్రవచనాలు, ప్రసంగాల సారం అర్ధం కాలేదా లేక వినలేదా ? అదే బ్రిటన్‌కు సేవ చేసుకుంటామని రాసి ఇచ్చిన అపర దేశభక్తుల గురించి వేనోళ్ల పొగుడుతున్న వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ బ్రిటన్‌తోనే చెట్టపట్టాలు వేసుకొని ఊరేగుతున్నాం. ఆ ప్రముఖులు తమ ప్రకటనలో పౌరసత్వ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై రోజూ బిజెపి పెద్దలు, దాన్ని సమర్ధించేవారు చెబుతున్న అంశాలన్నింటినీ తుచ తప్పకుండా పునశ్చరణ చేశారు. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షిక బదులు ” బిబిసి : నైతిక ప్రశ్న (బిబిసి ది ఎథికల్‌ క్వొశ్చన్‌) అని పెట్టి ఉంటే బాగుండేదని ముక్తాయింపు ఇచ్చారు. ఇబ్బందేముంది ? దేనికి దాన్ని పరిగణనలోకి తీసుకొని బిబిసి కథనాలన్నింటిని పరిశీలించి బేరీజు వేద్దాం.


గుజరాత్‌ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ లింకులన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌, యుట్యూబ్‌లను ఆదేశించింది. దీని అర్ధం దాన్నింక ఎవరూ చూడలేరని కాదు. బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్‌ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి డిరెక్‌ ఓ బ్రియన్‌ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్‌ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొకమార్గం లేదని ట్విటర్‌ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమంద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు. చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్దతుల్లో దొరుకుతుంది. ” భారత తనయ ” (ఇండియాస్‌ డాటర్‌) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చింది లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్‌ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.


గతంలోనే బతకాలని భారత ముస్లింలెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పుపట్టాల్సినపని లేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని. గతాన్ని పునరుద్దరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ద హిందూత్వ దేశాన్ని పునరుద్దరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వపాలనను పునరుద్దరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్దరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేతజాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్‌ మన్సూర్‌ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు.హిందూత్వ ఉద్దారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.


ఇక తారిఖ్‌ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీం కోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు.నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్యకేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా ? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్‌ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్‌ కోర్టులు తప్పు పట్టలేదు.యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్‌ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటివారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే. తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీం కోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు.

గుజరాత్‌ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్రమోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన ? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా ? జర్మనీ, ఇటలీ,తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు. అని చెబితే మా నరేంద్రమోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వపోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారికోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్‌-2లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటిని చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.


డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ( కన్సర్వేటివ్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ( పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్‌ బిబిసి అధిపతి టిమ్‌ డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు. ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ హిందువులు-ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్‌ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్‌ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం,దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్దమనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దిమ్మ తిరిగే నరేంద్రమోడీ మంత్రాంగం : రష్యా చమురు దిగుమతి అసలు మతలబు ఇదా !

18 Wednesday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Energy Crisis, Narendra Modi, Oil Imports From Russia, Reliance, Russian oil


ఎం కోటేశ్వరరావు


2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బతీసేందుకు ప్రకటించిన ఆనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.


పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంథన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం క్రియాశీలత, వేగాన్ని ప్రదర్శించిందని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ వర్ణించారు. ఇంథన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అన్నారు.రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రు.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్రమోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?


నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా,బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్దిపొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా ? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. రోజుకు రెండులక్షల పీపాల ఎగుమతి జరుగుతున్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా చెప్పాడు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నది ఆ రెండు కంపెనీలైనప్పటికీ ప్రభుత్వ రంగంలోని ఐఓసి,బిపి, హెచ్‌పి సంస్థలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయని, ప్రతివారూ కొంటున్నారు, ఇప్పుడిది ఒక జాతీయ క్రీడగా మారిందని కాటోనా అన్నాడు.


ప్రస్తుతం రోజుకు మన దేశం 17లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరులక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ది సామర్ధ్యంలో ఇది సగం.నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ది కంపెనీలకు ఒక టాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 టాంకర్లు ఉన్నట్లు కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు.ఎక్కడైనా ఆధునిక చమురుశుద్ది కర్మాగారం ఉంటే విజివోతో రవాణా ఇంథనాల తయారు ప్రత్యేకించి డీజిల్‌, అవసరమైతే పెట్రోలుగా కూడా మార్చవచ్చన్నాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలుదువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది. 2022లో జామ్‌ నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీ 215 టాంకర్లలో చమురు దిగుమతి చేసుకుంది.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ది కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలెనెస్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ” తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంథనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ది చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే ” అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నరెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.


ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌,ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది.లేనట్లయితే ఇంథన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంథన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది.జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన,2024వరకు గాస్‌ ధరల అదుపు వంటి పధకాలను ప్రకటించినప్పటికీీ ఇంథన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14శాతం గాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15శాతం పడిపోయింది. గతంలో వెనెజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు దొడ్డిదారిన రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ది చేసిన తరువాత దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మన ప్రభుత్వం అమెరికా- రష్యాలను సంతుష్టీకరిస్తున్నట్లు భావించవచ్చా ? తటస్థ విధానం అంటే ఇదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా కంపెనీలపై జాక్‌ మా ఆధిపత్యానికి తెర !

07 Saturday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba founder Jack Ma, Ant Group, china communist party, Jack Ma, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలోని టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన యాంట్‌ గ్రూప్‌ కంపెనీలపై వివాదాస్పద జాక్‌ మా ఆధిపత్యానికి తెరపడింది.జపాన్‌లో ఉంటున్నట్లు వార్తలు రాగా చైనా నుంచి తప్పుకున్నారా లేక తాత్కాలికంగా అక్కడ ఉంటున్నాడా అన్నది స్పష్టం కాలేదు.యాంట్‌ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం యాజమాన్య వ్యవస్థలో చేసిన మార్పుల ప్రకారం ఒక వాటాదారు లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా గానీ కంపెనీని అదుపులోకి తీసుకొనేందుకు వీలు లేదు. పరోక్ష పద్దతుల్లో 53.46 శాతం వాటాలపై అదుపు ఉన్న కారణంగా జాక్‌ మా పెత్తనం ఇప్పటి వరకు కొనసాగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అతగాడికి 6.2శాతం ఓటింగ్‌ హక్కులు మాత్రమే ఉంటాయి. మన దేశంలో అదానీ, అంబానీ వంటి వారు క్రమంగా అనేక కంపెనీలను మింగివేస్తూ రోజు రోజుకూ సంపదలను మరింత పోగు చేసుకుంటున్న తీరు తెన్నులు తెలిసిందే. చైనాలో అలాంటి అవకాశం ఉండదని జాక్‌ మా ఉదంతం స్పష్టం చేసింది.

మారిన నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకుల్లో ఒకడైన జాక్‌ మా, ఇతర యాజమాన్య, సిబ్బంది ప్రతినిధులు పది మంది తమ ఓటింగ్‌ హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవచ్చు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలో మార్పు ఉండదని కంపెనీ ప్రకటన తెలిపింది.ఈ ప్రకటన తరువాత హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల వాటాల ధర తొమ్మిదిశాతం పెరిగింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు జాక్‌ మా థాయిలాండ్‌ రాజధాని బాంకాక్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. టోకియో నగరంలో తన కుటుంబంతో సహా ఉంటున్నారని, అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు వెళ్లి వస్తున్నట్లు గతేడాది నవంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. నూతన సంవత్సరం సందర్భంగా చైనాలోని కొందరు టీచర్లతో జాక్‌ మాట్లాడుతున్న వీడియో వెలువడినట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక రాసింది. తాను త్వరలోనే ప్రత్యక్షంగా దర్శనమిస్తానని దానిలో చెప్పటాన్ని బట్టి తిరిగి జాక్‌ మా తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నది.దీన్ని బట్టి జాక్‌ మా తిరిగి చైనా వచ్చాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టం కావటం లేదు. 2020లో వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటి నుంచీ జాక్‌ మా గురించి అనేక పుకార్లు వచ్చాయి. జైల్లో పెట్టారని, అసలు మనిషినే అంతం చేశారని కూడ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి బహిరంగ జీవితంలో సరిగా కనిపించటం లేదు.

ఝజియాంగ్‌ వాణిజ్య,పారిశ్రామికవేత్తల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఒక వెబ్‌సైట్‌లో వార్తను ఉటంకిస్తూ డిసెంబరు ఎనిమిదవ తేదీన చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక వార్తను ప్రచురించింది. ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న తూర్పు చైనా ఝజియాంగ్‌ ప్రాంతంలో గతేడాది ఆగస్టు నాటికి 9.06 మిలియన్ల సంస్థలు సదరు మండలిలో ఉన్నట్లు, అది ఏర్పడిన 2025 నుంచి జాక్‌ మా అధ్యక్షుడిగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.యాభై ఐదేండ్ల వయసులో జాక్‌ మా 2019 సెప్టెంబరు లోనే అధికారికంగా ఆలీబాబా కంపెనీ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగినట్లు, హరున్‌ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం చైనాలో తొమ్మిదవ పెద్ద ధనవంతుడిగా ఉన్నాడని, సెప్టెంబరు ఆఖరు నాటికి అతని సంపద విలువ అంతకు ముందుతో పోలిస్తే మూడుశాతం పెరిగి 29.124 బిలియన్‌ డాలర్లని కంపెనీ రికార్డుల ప్రకారం ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. చిన్న కంపెనీలను మింగివేసేందుకు జాక్‌ మా చూసినట్లు వెల్లడి కావటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. తాజా పరిస్థితి గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందిందన్నది స్పష్టం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఇతర దేశాల మాదిరే చైనా ఆర్థిక రంగం కూడా ప్రభావితమైంది. జాక్‌ మా, ఇతర టెక్‌ కంపెనీలపై తీసుకున్న క్రమబద్దీకరణ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడినట్లు ఎవరూ చెప్పటం లేదు.


సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప వక్రీకరించి చెప్పేవారు చెబుతున్నట్లుగా దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచాల్సి ఉంది. అది ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే చెప్పలేము. అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది తెలిసిందే.
రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా అనుమతించారు. దీంతో జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతించదని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


గ్లాస్‌నోస్త్‌ పేరుతో సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. జాక్‌ మా ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రించారు. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా 2020 అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే.


చైనా మీద వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులకు తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వారి కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.నీరు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే వరకు అంతర్గతంగా మరుగుతుంది తప్ప ఆ తరువాతనే ఆవిరిగా రూపం మార్చుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కనిపించదు. చైనా సోషలిస్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా, ఇతర దాని మిత్ర దేశాలు నిరంతరం చూస్తున్నాయి. ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. అందుకు సహకరించే శక్తులు, వ్యక్తుల కోసం అది ఎదురు చూస్తుంది. సోవియట్‌ కూల్చివేతకు ముందు కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి గా ఉన్న బోరిస్‌ ఎల్సిన్‌ ముందు రాజీనామా చేశాడు. తరువాత సిఐఏ పథకం ప్రకారం దేశాధ్యక్షుడైన చరిత్ర తెలిసిందే. అందువలన సిఐఏ ఎవరి మీద వల విసురుతుందో, ఎవరు చిక్కేదీ చెప్పలేము. దీని అర్ధం జాక్‌ మా అలాంటి వారి జాబితాలో ఉన్నాడని చెప్పటం కాదు. చరిత్ర చెప్పాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త్రాలు- హెచ్చరికగా చైనా మిలిటరీ విన్యాసాలు !

28 Wednesday Dec 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

AUKUS, china communist party, Joe Biden, PLA actions, PLA Eastern Theater Command, Quadrilateral Security Dialogue, Taiwan independence, Taiwan Next propaganda, US imperialism, US-CHINA TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: