• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

25 Wednesday Jan 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

Hijab, Iran protests, Iran Women, Islamic Revolutionary Guards Corps, Mahsa Amini, People’s Mojahedin Organization of Iran, Supreme Leader Ali Khamenei, US imperialism


ఎం కోటేశ్వరరావు


గతేడాది సెప్టెంబరు నెలలో ఇరాన్‌లో నిర్భంధ హిజాబ్‌ వద్దంటూ మహిళలతో మొదలైన ఆందోళన ఇప్పుడు కొత్త స్వభావాన్ని సంతరించుకొంటోంది. కొత్త రూపాలు, పద్దతుల్లో వందలాది పట్టణాలకు పాకింది. ప్రతి శుక్రవారం ప్రార్ధనల తరువాత నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని టెహరాన్‌తో సహా రాత్రుళ్లు సమావేశాలను ఏర్పాటు చేసి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి ప్రతిరూపంగా ఉన్న చిహ్నాలు, స్థలాల మీద దాడులు చేస్తున్నారు. దేశంలోని 282 పట్టణాలకు ఇవి పాకినట్లు వార్తలు. సెప్టెంబరు నుంచి వివిధ సందర్భాలలో భద్రతా దళాలు 750 మందిని చంపినట్లు, 30వేల మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. దేశ అధినేత అలీ ఖమేనీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జిసి), పారామిలిటరీ ”బాస్‌జీ” వీరుగాక పోలీసు ఏజంట్లు, గూఢచారులకు జనం నిరసన తెలుపుతున్నారు. ఇస్లామిక్‌ విప్లవం పేరుతో సాగిన ఆందోళనతో 1979లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. 1989లో అయాతుల్లా మరణం తరువాత అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టి అధికారంలో కొనసాగుతున్నాడు.
మహిళల ప్రతిఘటనతో హిజబ్‌ ధారణ గురించి పునరాలోచిస్తామని ప్రకటించి ఆందోళనను నీరుగార్చేందుకు చూసిన పాలకులు ఇప్పుడు కొత్త పద్దతులను ముందుకు తెస్తున్నారు. హిజబ్‌లను ధరించకుండా పనిచేసేందుకు మహిళలను అనుమతించారనే పేరుతో క్వాజ్‌విన్‌ అనే పట్టణంలో ఐదు దుకాణాలను అధికారులు మూసివేశారని వార్తలు. పార్లమెంటులోని ” సాంస్కృతిక ” కమిటీ సభ్యుడు హుసేన్‌ జలాలీ ఒక ప్రకటన చేస్తూ హిజబ్‌ ధరించని వారిని ముందుగా గుర్తించి ఎస్‌ఎంఎస్‌ పంపుతామని, తరువాత హెచ్చరించి, అప్పటికీ వినకపోతే అలాంటి వారి బాంకు ఖాతాలను మూసివేస్తామని చెప్పాడు. మరింత ఆధునిక చట్రంలో హిజబ్‌ను అమలు చేస్తామని మరొకడు,జనవరి ఒకటి నుంచి బహిరంగ స్థలాల్లో అమలు చేస్తామని పోలీసు అధికారి ఒకడు ప్రకటించాడు.


పశ్చిమాసియాలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులను వ్యతిరేకించటంలో తిరుగులేని వైఖరితో ఉన్నప్పటికీ అంతర్గతంగా మతఛాందసాన్ని మరింత పెంచేందుకు, విమర్శకులను అణచివేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు ఆర్థికంగా జనజీవితాలు ప్రభావితం కావటంతో వ్యతిరేకత పెరుగుతోంది. దానికి ఒక రూపమే డైనమెట్‌ మాదిరి పేలిన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళన. భద్రతా దళాలు హతమార్చింది వీరినే అంటూ 637 మంది పేర్లను పీపుల్స్‌ మొజాహిదిన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇరాన్‌ పార్టీ ప్రచురించింది. దేశంలో తాజా నిరసనలు ప్రారంభమై ఆదివారం నాటికి 129 రోజులు, ఆ రాత్రి, శనివారం రాత్రి కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. ” సయద్‌ అలీ (ఖమేనీ)ని గద్దె దింపే సంవత్సరమిదే, నియంతకు ఉరి, ఉరితీతల పాలనకు అంతం పలకాలి, హంతక ఐఆర్‌జిసిని శిక్షించాలి, ముల్లాల అధికారమింకేమాత్రమూ వద్దు ” వంటి నినాదాలు చేస్తున్నారు.

ఐఆర్‌జిసి మింగిన తమ సొమ్మును తిరిగి ఇచ్చివేయాలంటూ టెహరాన్‌లోని న్యాయఅధికారుల భవనం ముందు క్రిప్టోలాండ్‌ ఆన్‌లైన్‌ ఎక్సేంజ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆదివారం నాడు ప్రదర్శన జరిపారు. దాదాపు మూడులక్షల మంది దాచుకున్న పొదుపు మొత్తాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధితుల్లో పెన్షనర్లు, రిటైరైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో దిగజారుతున్న కరెన్సీ రియాల్‌ విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టటం కూడా వీరిని ఆందోళనకు పురికొల్పుతోంది. దేశ సామాజిక భద్రతా నిధి పెట్టుబడి కంపెనీ ఒక వైపు ప్రతి ఏటా లాభాలు పొందుతుండగా వాటిని పెన్షనర్లకు బదలాయించకపోవటం, పెంపుదల గురించి చేసిన వాగ్దానాలను విస్మరించటం, గత బకాయిలు చెల్లించకపోవటం కూడా అసంతృప్తికి దోహదం చేస్తోంది. తప్పుడు కేసులతో ఉరిశిక్షలు వేసిన తమ వారి విడుదల కోరుతూ రాజధాని టెహరాన్‌లో జనవరి నెలలో మూడుసార్లు కుటుంబాలు, బంధుమిత్రులు ప్రదర్శనలు జరిపారు. తమ దండ్రులను ఉరితీయ వద్దంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా పలుచోట్ల ప్రదర్శనలు జరిపి తమ ప్రభుత్వం మీద వత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇరాన్‌ రాజుగా ఉన్న రెజా షా పహ్లవీ కాలంలో ఇరాన్‌లోని చమురు సంపదను అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్ల పరం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సింహాసనాన్ని వదిలిన తరువాత అతని కుమారుడు మహమ్మద్‌ రెజా షా అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1952 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా అధికారానికి వచ్చిన మహమ్మద్‌ మొసాదిక్‌ భూ సంస్కరణలు, చమురు కంపెనీలను జాతీయం చేయటంతో అమెరికా,బ్రిటన్‌ కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొసాదిక్‌ను గృహనిర్భంధంలో ఉంచటంతో ఏడాదిలోనే అధికారం కోల్పోయాడు. రాజు షా ఎంతగా కసి పెంచుకున్నాడంటే 1967లో మరణించిన మొసాదిక్‌ను ఇంట్లోనే ఖననం చేయించాడు. తరువాత కాలంలో షాను వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించినా 1979లో మతశక్తులు అధికారాన్ని కైవశం చేసుకున్నాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలను నిషేధించాయి. పౌరహక్కులను కాలరాశాయి. షా వ్యతిరేక ఉద్యమంలో పాల్గ్గొన్నవారిలో ఒకరైన మరియం రజావీ (69) ప్రతిపక్షాల తరఫున అధ్యక్షురాలిగా ప్రకటించుకొని ఫ్రాన్స్‌లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమె, ఇతర మద్దతుదార్లను ఉగ్రవాదులుగా చిత్రించి అరెస్టుచేసిన ఫ్రెంచి పాలకులు తరువాత వదలిపెట్టారు. ముల్లాల పాలనకు చరమగీతం పాడాలన్న తమ పౌరుల డిమాండ్‌ను పశ్చిమ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తాజాగా పునరుద్ఘాటించారు.


కుర్దిస్తాన్‌ ప్రాంతం నుంచి తన కుటుంబ సభ్యులతో కలసి టెహరాన్‌ వచ్చిన మాషా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ గతేడాది సెప్టెంబరు 13న ” ఉపదేశ దళాలు ” పట్టుకొని ”నైతిక పోలీసులకు” అప్పగించాయి. వారు ఆమెను దారుణంగా కొట్టటంతో పదహారవ తేదీన మరణించింది. ఈ వార్తను విన్న మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్‌ను వదలివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కార్మికులు, ఇతరులు కూడా తమ డిమాండ్లతో వారితో కలిశారు. వందలాది మందిని భద్రతాదళాలు చంపినట్లు చెబుతున్న అంకెలను ప్రభుత్వం అంగీకరించటం లేదు. అధికారిక మీడియా రెండువందల మంది మరణించినట్లు వార్తలు ఇచ్చింది. తాజా ఆందోళన ఇరాన్‌ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర వైరుధ్యాలను వెల్లడిస్తున్నది. మొత్తంగా మత ఛాందసపాలన, పాలకులు పోవాలని కోరుకుంటున్నారు. ఇది మరొక విప్లవ పోరాటం అని కొందరు వర్ణిస్తున్నారు.


వర్తమాన ఆందోళన జిన్‌(మహిళలు), జియాన్‌(జీవితం), ఆజాదీ( స్వేచ్చ) అనే భావనలతో నడుస్తున్నది. ప్రపంచ గాస్‌లో 15శాతం, చమురు సంపదలో పదిశాతం ఇరాన్‌లో ఉంది. ఇప్పటి వరకు తోడింది పోను 2020లో వెలికి తీసిన మాదిరే తరువాత కూడా కొనసాగిస్తే మరో 145 సంవత్సరాల పాటు తోడుకోవచ్చు. ఇంత సంపద ఉండి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారంటే అంతర్గత విధానాలతో పాటు అవినీతి,అవకతవకలు, 2018 నుంచి పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.2021నాటికి జిడిపిలో అప్పు 48, నిరుద్యోగం 12, ద్రవ్యోల్బణం 30శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబరు తరువాత కరెన్సీ విలువ 20శాతం పతనమైంది. ఇలాంటి కారణాలతో 60 నుంచి 70శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. వారిలో 18.4శాతం మంది దుర్భరదారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 60శాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉంది. చట్టాలు అమలు జరిగే స్థితి లేదు, అసమానతలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం ఏడాదికి 6,700 డాలర్లు కనీసవేతనంగా ఉంది. జనాల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. నెలల తరబడి వేతనాలు ఇవ్వని స్థితి. సంఘం పెట్టుకొనే వీల్లేదు. ఇస్లామిక్‌ రిపబ్లిక్కుగా ప్రకటించిన గత 43 సంవత్సరాలుగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేవంటే నమ్మలేని నిజం. ఆర్థికంగా దిగజారుతూ వత్తిడి తట్టుకోలేక ఇటీవల అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనాతో నిమిత్తం లేకుండా పరిస్థితి దిగజారటంతో 2017, 2019 సంవత్సరాల్లో నిరసనలకు దిగిన జనాన్ని అణచివేశారు. మరోసారి ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ఇరాన్‌లోని ఇస్లామిక్‌ గార్డులు ప్రజావ్యతిరేకులు, జనాన్ని అణచివేస్తూ సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న మతోన్మాదులు అన్నది నిజం. వారు 1979 నుంచీ చేస్తున్నది అదే, కానీ ఐరోపా పార్లమెంటు ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీర్మానించటం జనం మీద ప్రేమ కంటే ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటమే అన్నది స్పష్టం. గార్డుల సంగతి జనం చూసుకుంటారు. విదేశాల జోక్యం తగనిపని. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసులు ఉన్నప్పటికీ, అదనపు సృష్టి ఇరాన్‌ గార్డులు. ఆ సంస్థకు గతంలో కమాండర్‌గా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబఫ్‌ తీర్మానానికే పరిమితమైతే సరే, అంతకు మించి ముందుకు పోతే ప్రతికూలంగా స్పందిస్తామని అన్నాడు. నవాబియాన్‌ అనే ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి సమర్ధించిన వారిని, ఆసియాలో తమను వ్యతిరేకించే వారిని కూడా ఉగ్రవాదేశాలుగా ప్రకటించి తమ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించాడు. వారి కంపెనీలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామన్నాడు. ఐరోపా దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవాలని, అమెరికాకు తోకలుగా మారవద్దని ఇరాన్‌ అధికారపక్ష పత్రిక హెచ్చరించింది.1988లో ఇరాన్‌లోని వేలాది మంది అసమ్మతి ఖైదీల ఉరితీతకు కారకుడనే పేరుతో స్వీడన్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన ఉదంతాన్ని పేర్కొంటూ స్వీడన్‌ అధికారులను తమ వారు బంధించి తీసుకువచ్చి ఇరాన్‌లో విచారణ జరుపుతామని మరొక మరొక పత్రిక సంపాదకుడు హెచ్చరించాడు. ఇటీవల కొంత మంది టెహరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రెంచి రాయబార కార్యాలయాలపై దాడి చేశారు.


గతేడాది అక్టోబరులో క్యూబా రాజధాని హవానాలో జరిగిన ప్రపంచ దేశాల, కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల మహాసభలో పాల్గొన్న సిపిఐ(ఎం), సిపిఐతో సహా 62దేశాల పార్టీలు ఒక ప్రకటనలో ఇరాన్‌ ఆందోళన కారులు, ఇరాన్‌ కమ్యూనిస్టులకు మద్దతు ప్రకటించాయి. పాలకుల అణచివేతను తీవ్రంగా ఖండించాయి. ” దేవుడిని వ్యతిరేకించారని, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇస్లామిక్‌ రాజ్యానికి, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు ” వంటి అభియోగాలను మోపి వేలాది మందిని కోర్టులలో విచారణ తతంగం జరుపుతున్నారని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇరాన్‌లో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండాలన్నది ఇరానీయులకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ పశ్చిమ దేశాలూ, మధ్య ప్రాచ్యంలోని మితవాద ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నాయి. ఇరాన్‌లో చరిత్ర పునరావృతం అవుతోందా అంటే అవకాశం ఉందని చెప్పవచ్చు. గతంలో రాజు షాను ఉరితీయాలని నినదించిన వారే నేడు సుప్రీం లీడర్‌ అలీ ఖమేని ఉరికోసం డిమాండ్‌చేస్తున్నారు. మతాధికారులు గతంలో అమెరికా,బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు మద్దతు పలికిన చరిత్ర ఉంది. ఒక వేళ వర్తమాన ఆందోళన వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తే వారు స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుంటారా ? జనాన్ని అణిచివేసేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతారా అన్నది ప్రస్తుతానికి ఊహాజనిమే కావచ్చు గానీ, జరిగినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

22 Sunday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Filims, Gujarat, INDIA, International, INTERNATIONAL NEWS, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, UK

≈ Leave a comment

Tags

BJP, block out on BBC documentary, Explosive BBC documentary, Gujarat files, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్‌ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు ” ప్రేరేపిత ఆరోపణల పత్రం ” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కనుక భాషకోసం తడుముకోవాల్సినపని లేదు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.


మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు. అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యుట్యూబును, పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్రమోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా ? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా ? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచమంతటినీ చూడకుండా ఆపలేరు కదా ! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చువేసి అనధికారికంగా పంచుతున్నవారికి ఇది తెలియదా !


హిందూ-ముస్లిం ఉద్రికత్తలను పునరుజ్జీవింప చేసేందుకు పోలీసు, జడ్జి, తలారీ ఒకరే అన్నట్లుగా భారత్‌లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు పూర్వరూపంగా బిబిసి చిత్రం ఉన్నదని 302 మంది ప్రముఖులు చెప్పారు. నల్లమందు తింటే మన్నుదిన్న పాముల్లా పడి ఉంటారు అని చెబుతారు. కానీ మత మత్తుమందు జనాలను రెచ్చగొట్టి పిచ్చివారిగా మారుస్తుంది. వర్తమానంలో దాని విత్తనాలను చల్లి, దేశమంతటా సాగు చేస్తూ ఎవరు పెంచి పోషిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ డాక్యుమెంటరీలో ఉన్న అంశాలే అవి కదా ! అందువలన 302 మంది కాదు ముప్పై రెండువేల మంది ప్రముఖులు రాసినా మన ఘనమైన చరిత్ర పుటల్లోకి ఎక్కించిన చెరగని గుజరాత్‌ మారణకాండ మచ్చను చెరిపివేయలేరు.” తోటి భారతీయుడు మరియు మన నేతకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రేరేపిత ఆరోపణల పత్రం అని, విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజ్యవిధానానికి అనుగుణంగా ఉందని ” ఆ ప్రముఖులు బిబిసి చిత్రం గురించి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు చెప్పారు. బహుశా వారికి 80-20 అంటూ బిజెపి నేతలు చేసిన ” ఐక్యత ” ప్రవచనాలు, ప్రసంగాల సారం అర్ధం కాలేదా లేక వినలేదా ? అదే బ్రిటన్‌కు సేవ చేసుకుంటామని రాసి ఇచ్చిన అపర దేశభక్తుల గురించి వేనోళ్ల పొగుడుతున్న వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ బ్రిటన్‌తోనే చెట్టపట్టాలు వేసుకొని ఊరేగుతున్నాం. ఆ ప్రముఖులు తమ ప్రకటనలో పౌరసత్వ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై రోజూ బిజెపి పెద్దలు, దాన్ని సమర్ధించేవారు చెబుతున్న అంశాలన్నింటినీ తుచ తప్పకుండా పునశ్చరణ చేశారు. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షిక బదులు ” బిబిసి : నైతిక ప్రశ్న (బిబిసి ది ఎథికల్‌ క్వొశ్చన్‌) అని పెట్టి ఉంటే బాగుండేదని ముక్తాయింపు ఇచ్చారు. ఇబ్బందేముంది ? దేనికి దాన్ని పరిగణనలోకి తీసుకొని బిబిసి కథనాలన్నింటిని పరిశీలించి బేరీజు వేద్దాం.


గుజరాత్‌ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ లింకులన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌, యుట్యూబ్‌లను ఆదేశించింది. దీని అర్ధం దాన్నింక ఎవరూ చూడలేరని కాదు. బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్‌ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి డిరెక్‌ ఓ బ్రియన్‌ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్‌ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొకమార్గం లేదని ట్విటర్‌ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమంద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు. చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్దతుల్లో దొరుకుతుంది. ” భారత తనయ ” (ఇండియాస్‌ డాటర్‌) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చింది లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్‌ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.


గతంలోనే బతకాలని భారత ముస్లింలెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పుపట్టాల్సినపని లేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని. గతాన్ని పునరుద్దరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ద హిందూత్వ దేశాన్ని పునరుద్దరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వపాలనను పునరుద్దరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్దరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేతజాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్‌ మన్సూర్‌ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు.హిందూత్వ ఉద్దారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.


ఇక తారిఖ్‌ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీం కోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు.నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్యకేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా ? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్‌ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్‌ కోర్టులు తప్పు పట్టలేదు.యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్‌ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటివారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే. తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీం కోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు.

గుజరాత్‌ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్రమోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన ? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా ? జర్మనీ, ఇటలీ,తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు. అని చెబితే మా నరేంద్రమోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వపోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారికోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్‌-2లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటిని చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.


డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ( కన్సర్వేటివ్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ( పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్‌ బిబిసి అధిపతి టిమ్‌ డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు. ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ హిందువులు-ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్‌ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్‌ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం,దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్దమనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దిమ్మ తిరిగే నరేంద్రమోడీ మంత్రాంగం : రష్యా చమురు దిగుమతి అసలు మతలబు ఇదా !

18 Wednesday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Energy Crisis, Narendra Modi, Oil Imports From Russia, Reliance, Russian oil


ఎం కోటేశ్వరరావు


2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బతీసేందుకు ప్రకటించిన ఆనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.


పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంథన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం క్రియాశీలత, వేగాన్ని ప్రదర్శించిందని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ వర్ణించారు. ఇంథన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అన్నారు.రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రు.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్రమోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?


నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా,బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్దిపొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా ? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. రోజుకు రెండులక్షల పీపాల ఎగుమతి జరుగుతున్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా చెప్పాడు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నది ఆ రెండు కంపెనీలైనప్పటికీ ప్రభుత్వ రంగంలోని ఐఓసి,బిపి, హెచ్‌పి సంస్థలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయని, ప్రతివారూ కొంటున్నారు, ఇప్పుడిది ఒక జాతీయ క్రీడగా మారిందని కాటోనా అన్నాడు.


ప్రస్తుతం రోజుకు మన దేశం 17లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరులక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ది సామర్ధ్యంలో ఇది సగం.నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ది కంపెనీలకు ఒక టాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 టాంకర్లు ఉన్నట్లు కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు.ఎక్కడైనా ఆధునిక చమురుశుద్ది కర్మాగారం ఉంటే విజివోతో రవాణా ఇంథనాల తయారు ప్రత్యేకించి డీజిల్‌, అవసరమైతే పెట్రోలుగా కూడా మార్చవచ్చన్నాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలుదువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది. 2022లో జామ్‌ నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీ 215 టాంకర్లలో చమురు దిగుమతి చేసుకుంది.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ది కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలెనెస్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ” తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంథనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ది చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే ” అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నరెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.


ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌,ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది.లేనట్లయితే ఇంథన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంథన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది.జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన,2024వరకు గాస్‌ ధరల అదుపు వంటి పధకాలను ప్రకటించినప్పటికీీ ఇంథన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14శాతం గాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15శాతం పడిపోయింది. గతంలో వెనెజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు దొడ్డిదారిన రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ది చేసిన తరువాత దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మన ప్రభుత్వం అమెరికా- రష్యాలను సంతుష్టీకరిస్తున్నట్లు భావించవచ్చా ? తటస్థ విధానం అంటే ఇదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా కంపెనీలపై జాక్‌ మా ఆధిపత్యానికి తెర !

07 Saturday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba founder Jack Ma, Ant Group, china communist party, Jack Ma, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలోని టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన యాంట్‌ గ్రూప్‌ కంపెనీలపై వివాదాస్పద జాక్‌ మా ఆధిపత్యానికి తెరపడింది.జపాన్‌లో ఉంటున్నట్లు వార్తలు రాగా చైనా నుంచి తప్పుకున్నారా లేక తాత్కాలికంగా అక్కడ ఉంటున్నాడా అన్నది స్పష్టం కాలేదు.యాంట్‌ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం యాజమాన్య వ్యవస్థలో చేసిన మార్పుల ప్రకారం ఒక వాటాదారు లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా గానీ కంపెనీని అదుపులోకి తీసుకొనేందుకు వీలు లేదు. పరోక్ష పద్దతుల్లో 53.46 శాతం వాటాలపై అదుపు ఉన్న కారణంగా జాక్‌ మా పెత్తనం ఇప్పటి వరకు కొనసాగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అతగాడికి 6.2శాతం ఓటింగ్‌ హక్కులు మాత్రమే ఉంటాయి. మన దేశంలో అదానీ, అంబానీ వంటి వారు క్రమంగా అనేక కంపెనీలను మింగివేస్తూ రోజు రోజుకూ సంపదలను మరింత పోగు చేసుకుంటున్న తీరు తెన్నులు తెలిసిందే. చైనాలో అలాంటి అవకాశం ఉండదని జాక్‌ మా ఉదంతం స్పష్టం చేసింది.

మారిన నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకుల్లో ఒకడైన జాక్‌ మా, ఇతర యాజమాన్య, సిబ్బంది ప్రతినిధులు పది మంది తమ ఓటింగ్‌ హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవచ్చు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలో మార్పు ఉండదని కంపెనీ ప్రకటన తెలిపింది.ఈ ప్రకటన తరువాత హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల వాటాల ధర తొమ్మిదిశాతం పెరిగింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు జాక్‌ మా థాయిలాండ్‌ రాజధాని బాంకాక్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. టోకియో నగరంలో తన కుటుంబంతో సహా ఉంటున్నారని, అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు వెళ్లి వస్తున్నట్లు గతేడాది నవంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. నూతన సంవత్సరం సందర్భంగా చైనాలోని కొందరు టీచర్లతో జాక్‌ మాట్లాడుతున్న వీడియో వెలువడినట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక రాసింది. తాను త్వరలోనే ప్రత్యక్షంగా దర్శనమిస్తానని దానిలో చెప్పటాన్ని బట్టి తిరిగి జాక్‌ మా తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నది.దీన్ని బట్టి జాక్‌ మా తిరిగి చైనా వచ్చాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టం కావటం లేదు. 2020లో వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటి నుంచీ జాక్‌ మా గురించి అనేక పుకార్లు వచ్చాయి. జైల్లో పెట్టారని, అసలు మనిషినే అంతం చేశారని కూడ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి బహిరంగ జీవితంలో సరిగా కనిపించటం లేదు.

ఝజియాంగ్‌ వాణిజ్య,పారిశ్రామికవేత్తల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఒక వెబ్‌సైట్‌లో వార్తను ఉటంకిస్తూ డిసెంబరు ఎనిమిదవ తేదీన చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక వార్తను ప్రచురించింది. ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న తూర్పు చైనా ఝజియాంగ్‌ ప్రాంతంలో గతేడాది ఆగస్టు నాటికి 9.06 మిలియన్ల సంస్థలు సదరు మండలిలో ఉన్నట్లు, అది ఏర్పడిన 2025 నుంచి జాక్‌ మా అధ్యక్షుడిగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.యాభై ఐదేండ్ల వయసులో జాక్‌ మా 2019 సెప్టెంబరు లోనే అధికారికంగా ఆలీబాబా కంపెనీ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగినట్లు, హరున్‌ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం చైనాలో తొమ్మిదవ పెద్ద ధనవంతుడిగా ఉన్నాడని, సెప్టెంబరు ఆఖరు నాటికి అతని సంపద విలువ అంతకు ముందుతో పోలిస్తే మూడుశాతం పెరిగి 29.124 బిలియన్‌ డాలర్లని కంపెనీ రికార్డుల ప్రకారం ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. చిన్న కంపెనీలను మింగివేసేందుకు జాక్‌ మా చూసినట్లు వెల్లడి కావటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. తాజా పరిస్థితి గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందిందన్నది స్పష్టం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఇతర దేశాల మాదిరే చైనా ఆర్థిక రంగం కూడా ప్రభావితమైంది. జాక్‌ మా, ఇతర టెక్‌ కంపెనీలపై తీసుకున్న క్రమబద్దీకరణ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడినట్లు ఎవరూ చెప్పటం లేదు.


సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప వక్రీకరించి చెప్పేవారు చెబుతున్నట్లుగా దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచాల్సి ఉంది. అది ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే చెప్పలేము. అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది తెలిసిందే.
రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా అనుమతించారు. దీంతో జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతించదని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


గ్లాస్‌నోస్త్‌ పేరుతో సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. జాక్‌ మా ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రించారు. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా 2020 అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే.


చైనా మీద వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులకు తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వారి కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.నీరు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే వరకు అంతర్గతంగా మరుగుతుంది తప్ప ఆ తరువాతనే ఆవిరిగా రూపం మార్చుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కనిపించదు. చైనా సోషలిస్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా, ఇతర దాని మిత్ర దేశాలు నిరంతరం చూస్తున్నాయి. ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. అందుకు సహకరించే శక్తులు, వ్యక్తుల కోసం అది ఎదురు చూస్తుంది. సోవియట్‌ కూల్చివేతకు ముందు కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి గా ఉన్న బోరిస్‌ ఎల్సిన్‌ ముందు రాజీనామా చేశాడు. తరువాత సిఐఏ పథకం ప్రకారం దేశాధ్యక్షుడైన చరిత్ర తెలిసిందే. అందువలన సిఐఏ ఎవరి మీద వల విసురుతుందో, ఎవరు చిక్కేదీ చెప్పలేము. దీని అర్ధం జాక్‌ మా అలాంటి వారి జాబితాలో ఉన్నాడని చెప్పటం కాదు. చరిత్ర చెప్పాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త్రాలు- హెచ్చరికగా చైనా మిలిటరీ విన్యాసాలు !

28 Wednesday Dec 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

AUKUS, china communist party, Joe Biden, PLA actions, PLA Eastern Theater Command, Quadrilateral Security Dialogue, Taiwan independence, Taiwan Next propaganda, US imperialism, US-CHINA TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

08 Thursday Dec 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Prices, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

America’s green subsidies, Inflation Reduction Act, subsidy war with America, Trade Protectionism, TRADE WAR, US-EU Trade war


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

23 Wednesday Nov 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Kim Jong-un, North Korea’s missile tests, Pyongyang, US imperialism, yankees


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

2022 అమెరికా పార్లమెంటు ఎన్నికలు : ఫాసిస్టు శక్తులకు ఎదురు దెబ్బ – పురోగామి శక్తులకు హెచ్చరిక !

16 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, fascist ideology, Joe Biden, MAGA Republicans, US 2022 midterm elections

ఎం కోటేశ్వరరావు


నవంబరు ఎనిమిదిన అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్‌ , లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువ సభలో 435 స్థానాలకు గాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్‌ పదవి దక్కుతుంది.తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువ సభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్‌ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్‌ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమాక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది. కనుక అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఇక 50 గవర్నర్‌ పదవులకు గాను ఎన్నికలు జరిగిన 36 చోట్ల రిపబ్లికన్లు రెండు కోల్పోయి 25 రాష్ట్రాలను కైవసం చేసుకోగా, డెమోక్రాట్లు అదనంగా రెండు తెచ్చుకొని 24 చోట్ల పాగావేశారు. మరొక ఫలితం తేలాల్సి ఉంది.


ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్‌ వెంటనే చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్‌ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్‌ చెప్పాడు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్‌ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్‌ పార్టీకి 220, రిపబ్లికన్‌ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్‌ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేళ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. ఈ కారణంగానే లెక్కింపు పూర్తిగాక ముందే అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడటం మొదలు పెట్టాడు. రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు నేను సిద్దపడ్డాను, రిపబ్లికన్లు నాతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు.


పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఉగ్రవాదాన్ని సమర్ధించిన అనేక మంది ” మాగా ( మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ ) ” రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీని డోనాల్డ్‌ ట్రంప్‌, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్‌ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం డెమోక్రాట్ల రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. రిపబ్లికన్‌ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.


ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలనిఎఎఫ్‌ఎల్‌-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్‌ షులర్‌ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్ధారిస్తుందని అందువలన కార్మికులు లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్‌ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్‌ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్‌ చెప్పారు. ఈ శక్తులు ఓడటం వారి పట్ల అమెరికా ఓటర్లలో ఉన్న ఆందోళన, అడ్డుకోవాలనే తపనకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఆర్థిక సవాళ్లు, గాస్‌, ఆహార అధిక ధరలు రిపబ్లికన్లవైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల అజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు.యువత, మహిళలు, ఆఫ్రికన్‌-అమెరికన్లు, మొత్తంగా కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు, ఓటింగ్‌కు ముందుకు వచ్చిన కారణంగానే రిపబ్లికన్లకు చాలా మేరకు అడ్డుకట్ట పడింది. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్దులలో 300 మందికి ట్రంప్‌ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు. బైడెన్‌ గెలుపును తాను గుర్తించనని ప్రకటించిన ట్రంప్‌ తన మాగా మద్దతుదార్లను ఉసిగొల్పి 2021 జనవరి ఆరున పార్లమెంటు భవనంపై దాడి చేయించిన సంగతి తెలిసిందే. వీరిని ఫాసిస్టులుగా వర్ణిస్తారు.


ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలో ఖర్చు అంశంలో కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్‌ సీక్రెట్స్‌ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రు.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. bుార్టీల అభ్యర్ధుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలౌతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. రకరకాల పేర్లతో ఖర్చు చేస్తారు. జనాభాలో కేవలం 0.0003 శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పదిశాతం డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా. జార్జి సోరస్‌ 12.8 కోట్ల డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98శాతం వరకు గెలిచినట్లు తేలింది. ప్రారంభంలో చేసే ఖర్చును బట్టి ఫలితాలను ఊహించుకోవచ్చు.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతి లేదు. బాలట్‌ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్‌ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది.మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బాలట్‌ మాదిరి ఏ ఓటరైనా వేయ వచ్చు. ఇమెయిల్‌ ద్వారా ఓటు వేసి తరువాత బాలట్‌ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా కౌంటీలో ఈ ఏడాది 2,90,000 పోస్టల్‌ బాలట్లు వచ్చాయి. వాటి మీద ఉన్న సంతకాలు నిజమైనవా కాదా అన్నది సరి చూసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా వచ్చే పోస్టల్‌ బాలట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. నెవడాలో పోలింగ్‌ ముగిసిన నాలుగు రోజుల తరువాత వచ్చే పోస్టల్‌ బాలట్‌ను తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల అక్రమాలకు అమెరికా అతీతమేమీ కాదు. గతంలో అలాంటి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల రాష్ట్రాల అసెంబ్లీల సెగ్మెంట్ల సరిహద్దులను అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా మార్చివేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండనవసరం లేదు, ప్రతి రాష్ట్రం తనదైన నిబంధనలు రూపొందించుకోవచ్చు.


వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చిమితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్‌ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్‌ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండువంతుల సీట్లు తెచ్చుకున్నారు.డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈ సారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. 2020 అధక్ష ఎన్నికల లెక్కింపు సందర్భంగా కుట్ర వార్తలు వచ్చాయి. తొలుత రిపబ్లికన్లకు ఎక్కువగా పడినట్లు భావిస్తున్న బాలట్‌ బాక్సులు రావటం, తరువాత డెమోక్రాట్లకు పడిన బాక్సులు రావటంతో అనుమానాలు తలెత్తాయి. కొన్ని వారాల ముందే పోస్టల్‌ బాలట్స్‌ వేయవచ్చు గానీ, వాటిని ముందుగా లెక్కించటానికి వీలులేదు.కొన్ని చోట్ల పోస్టల్‌ బాలట్లే ఎక్కువ. జార్జియాలో 50శాతం ఓట్లు రానట్లయితే, ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నవారి మధ్య రెండోసారి ఎన్నిక జరుపుతారు. అక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు డిసెంబరు 6న ఎన్నికలు జరుగుతాయి. అలాస్కా రాష్ట్రంలో పార్టీలకు గుర్తింపు లేదు. పార్టీలు కాండిడేట్లను నిలిపినా వారు స్వతంత్రులుగానే ఉంటారు. ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్నివారాలైనా పట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్‌లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలల్లో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు.1900 సంవత్సరం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ రాష్ట్రాల చట్టసభల్లో మెజారిటీ సాధించింది.


రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మికవర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయ కూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది.ఆ మెజారిటీని ఆసరా చేసుకొని బైడెన్‌, కుటుంబ సభ్యులు, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల మీద విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి తమ అజెండాను ముందుకు తీసుకుపోవచ్చు. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. ట్రంప్‌ పిలుపుతో పార్లమెంటు మీద దాడిచేసిన ఉదంతంలో ట్రంప్‌, పార్టీ వారి మీద ఉన్నకేసులను నీరుగార్చేందుకు పూనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారంలో బైడెన్‌ ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు లేకుండా పురోగామి అజెండాను అమలు జరిపే అవకాశం ఉండదు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండుశాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్ధికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. పాఠశాల కమిటీల్లో రాజకీయాలను చొప్పించిన వారిని, తిరోగామి భావాలు, పుస్తకాలను రుద్దేందుకు, ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన వారిని వారిని ఓడించారు. అమెరికాలో ఎవరు గెలిచినా తమ ప్రయోజనాల రక్షణకు కార్మికులకు పోరుబాట తప్ప మరొక మార్గం లేదు. ఫాసిస్టు, పచ్చిమితవాద శక్తులు ఓటమి చెందటం తాత్కాలిక ఊరటతప్ప పరిష్కారం కాదు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెజిల్‌ 2022 ఎన్నికలు : మూడవ సారి లూలా చారిత్రాత్మక విజయం ! ఓటమిని అంగీకరించని బోల్సనారో !!

02 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

#Lula is back, Brazil elections, Jair Bolsonaro, lula da silva, Workers’ Party


ఎం కోటేశ్వరరావు


జైల్లో 580 రోజులు గడిపిన వామపక్ష నేత లూలా రాజకీయ జీవితం ముగిసినట్లే అని ఆశించిన మితవాద శక్తులకు, వారిని బలపరిచిన అమెరికా, ఇతర దేశాలకు చెంపపెట్టు. మరోసారి అధికారపీఠాన్ని అధిరోహించేందుకు జనం ఆమోదం తెలిపారు. ఆదివారం నాడు (అక్టోబరు 30వ తేదీ) బ్రెజిల్‌ అధ్యక్షపదవికి జరిగిన తుది విడత పోరులో వర్కర్స్‌ పార్టీకి చెందిన వామపక్ష నేత లూలా డిసిల్వా మూడవ సారి అధికారానికి వచ్చారు. జనవరి ఒకటవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పొరేట్ల అనుకూల మితవాద, ప్రజాస్వామ్య విధ్వంసశక్తులు- ప్రజానుకూల వామపక్ష, ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో నిరంకుశ జైర్‌ బోల్సనారో మట్టి కరిచాడు. పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనేే ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించారు. పోలైన ఓట్లలో లూలాకు 50.9శాతం (6,03,45,499) రాగా, బోల్సనారోకు 49.1శాతం( 5,82,06,356) వచ్చాయి. లూలా మెజారిటీ 21,39,143 కాగా చెల్లని, తిరస్కరించిన ఓట్లు 57,00,443 ఉన్నాయి. బ్రెజిల్‌ నిబంధనల మేరకు అధ్యక్షపదవికి వేసిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించినప్పటికీ మంగళవారం రాత్రి రెండు నిమిషాల పాటు మాట్లాడుతూ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించకుండానే అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలని కోరాడు. తాను ఓడితే తీర్పును అంగీకరించేది లేదని ఎన్నికలకు ముందే చెప్పాడు. బోల్సనారో గట్టి మద్దతుదారైన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం బోల్సనారో కోసం వేచి చూడకుండా వెంటనే లూలాకు అభినందనలు తెలిపాడు.ఫలితాలు తెలిసిన గంటలోపే , ఎన్నికలు ” స్వేచ్చగా, న్యాయంగా, విశ్వసనీయంగా జరిగినట్లు ” బైడెన్‌ తన సందేశంలో పేర్కొన్నాడు. అమెరికాను అనుసరించే అనేక ఐరోపా, ఇతర దేశాల నేతలు కూడా అదే బాట పట్టి అభినందనలు తెలిపారు. దేశంలోని అనేక చోట్ల రోడ్ల మీద బోల్సనారో మద్దతుదార్లు ఏర్పాటు చేసిన ఆటంకాలన్నింటినీ తొలగించాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు ఆదేశించింది. మద్దతుదార్లు తమ నేత ఆదేశాల కోసం ఆదివారం నుంచి ఎదురు చూశారు.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు. రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత లూలాపై తప్పుడు కేసులు పెట్టి 2017లో తొమ్మిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు.ఆ కేసును విచారించిన జడ్జి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. లూలా 580 రోజులు జైల్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చూడగా శిక్ష పడిందనే పేరుతో అనుమతించలేదు. తరువాత జరిగిన పరిణామాల్లో 2019నవంబరులో సుప్రీం కోర్టు లూలాను జైల్లో ఉంచటం అక్రమం అంటూ విడుదలకు ఆదేశించింది.శిక్షపై అప్పీలు చేసినందున జైల్లో ఉంచకూడదని చెప్పింది. తరువాత 2021 మార్చినెలలో కేసును విచారించిస జడ్జి తీర్పు లూలా మీద కేసులను కొట్టివేశారు.అంతకు ముందు శిక్ష విధించిన జడ్జికి తగిన అధికారాలు లేవని, లూలా పౌరహక్కులను పునరుద్దరిస్తూ తీర్పు చెప్పారు. దాంతో ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది.


మిలిటరీ నిరంకుశ పాలన ముగిసిన 1980దశకం తరువాత పదవిలో ఉండి రెండవసారి పోటీ చేసిన వారిలో తొలిసారిగా ఓడిన ఘనత బోల్సనారోకు దక్కింది. తొలి దఫాలోనే ఓడిపోతాడని చెప్పిన సర్వేలు వాస్తవం కాదని తేలింది. రెండు రౌండ్లలోనూ భారీగానే ఓట్లు సంపాదించటాన్ని బట్టి బ్రెజిల్‌ సమాజంలో సమీకరణలు ఎంత బలంగా ఉన్నదీ వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో మితవాద శక్తులదే పైచేయిగా ఉంది.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. లాటిన్‌ అమెరికా వామపక్షాలు గెలిచిన ప్రతి దేశంలోనూ ఇదే విధమైన బలహీనతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నట్లు నిర్దారణ కాగానే లూలా డిసిల్వా మద్దతుదార్లతో మాట్లాడుతూ మెజారిటీ బ్రెజిలియన్లు మరింత ప్రజాస్వామ్యాన్ని, మరింత సమానత్వం, సౌభ్రాత్వత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పాడు. తన పదవీ స్వీకరణ ఉత్సవానికి రానవసరం లేదు గానీ ప్రజలిచ్చిన తీర్పును బోల్సనారో గుర్తించాలని లూలా హితవు చెప్పాడు. ప్రజలే తనకు పదవీ పట్టం గట్టారని అన్నాడు. గత ఆరు సంవత్సరాల్లో ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల బోల్సనారా ఏలుబడిలో ప్రజాస్వామిక వ్యవస్థలను, అమెజాన్‌ అడవులను ధ్వంసం చేసిన తీరు, కరోనాలో జనాన్ని గాలికి వదలివేసిన బాధ్యతా రాహిత్యాన్ని చూసిన వారు, వామపక్షాల వైఖరితో ఏకీభవించని వారు కూడా బోల్సనారో ఓడిపోవాలని కోరుకున్నారు.కరోనా వచ్చినపుడు లాక్‌డౌన్లు వద్దన్నాడు, తరువాత వాక్సిన్లను తిరస్కరించాడు, చివరికి కొనుగోలు చేసిన వాటిలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆరులక్షల 80వేల మంది ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు.


తాను ఓడితే ఫలితాలను అంగీకరించనని, అవసరమైతే వీధులకు ఎక్కుతానని బెదిరించిన బోల్సనారో రెండో విడత పోలింగ్‌ రోజు లూలా మద్దతుదార్లను ఓటింగ్‌కు రాకుండా తన మద్దతుదార్లను ఉసిగొల్పి అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రేడియోలో తన ప్రకటనలను ప్రసారం చేయకుండా అడ్డుకుంటున్నారని, తన ఫిర్యాదులపై విచారణ జరపకపోతే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించాడు. బోల్సనారో కుమారుడు,ఎంపీ ఎడ్వర్డ్‌ బోల్సనారో గురువారం నాడు ఒక టీవీలో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశాడు. మొత్తం నమోదైన ఓటర్లు 15,64,54,011 మంది కాగా తుది విడత పోలింగులో 12,42,52,716 మంది పాల్గన్నారు. ఐదువందలకు పైగా ఉదంతాల్లో బోల్సనారో మద్దతుదార్లు, వారికి మద్దతుగా కేంద్ర పోలీసులు ఓటర్లను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు రాగా వాటిలో సగం లూలాకు గట్టి పట్టున్న ఈశాన్య ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. అధ్యక్ష భవనంలో నెల రోజులకు ముందే బోల్సనారో రూపొందించిన ఒక పధకం ప్రకారమే ఇలా అడ్డుకున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఓటర్లను నిరోధించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ పోలీసులు తప్పుడు సాకులు చూపి తామెవరినీ అడ్డుకోలేదని చెప్పారు. ట్రక్కుల యజమానులు,డ్రైవర్లు బ్రెజిల్‌ రాజకీయాల్లో మితవాద శక్తుల మద్దతుదార్లుగా ఉన్నారు. వారంతా రెండవ విడత పోలింగ్‌ జరుగుతుండగా రోడ్ల మీద ట్రక్కులను అడ్డం పెట్టి లూలా మద్దతుదార్లను కదలకుండా చేశారు. గతంలో వర్కర్స్‌ పార్టీ ప్రభుత్వం మీద తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని వీరంతా వీధుల్లోకి వచ్చి బోల్సనారోకు మద్దతుగా నిలిచారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బోల్సనారో అనేక పధకాలను ప్రకటించాడు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు.

గతంలో ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో లూలా అమలు జరిపిన సంక్షేమ చర్యలతో కోట్లాది మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారు, ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ అంతకు ముందు నుంచి కొనసాగుతున్న నయా ఉదారవాద చట్రం నుంచే అమలు జరిపారు. అందువలన లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజల అసంతృప్తిని దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్నది. గత ఎన్నికలలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. తాను ఆర్ధిక రంగాన్ని చక్కదిద్దుతానని ముందుకు వచ్చిన మితవాది బోల్సనారో ప్రజలను గాలికి వదలివేయటంతో తిరిగి వర్కర్స్‌ పార్టీకి జనం పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో లూలా-బోల్సనారో ఇద్దరూ దేశ ఆర్థికపరిస్థితి గురించి ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావించారు.ఆకలి, దారిద్య్రం పెరగటానికి బోల్సనారో విధానాలే కారణమని లూలా విమర్శించాడు. ఇప్పుడు లూలా ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారనుంది.

స్పెయిన్‌ – పోర్చుగీసు వలస పాలకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 1500సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి పోర్చుగీసు పాలనలోకి బ్రెజిల్‌ వంచ్చింది. ఆ ప్రాంతంలో చెరకు తోటల్లో, ఇతరంగా పని చేసేందుకు అప్పటి నుంచి తెల్లవారి వలసలతో పాటు దాదాపు 30లక్షల మంది బానిసలను ఆఫ్రికా నుంచి రప్పించారు. దీర్ఘకాలం సాగిన పోరు తరువాత 1825 ఆగస్టు 29న స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 47.73 శాతం తెల్లవారు, 43.13శాతం బ్రెజిల్‌ స్థానిక తెగలు – సంకర వర్ణాలకు చెందిన వారు. లూలా ఈ సామాజిక తరగతికి చెందిన వారు. వీరుగాక 7.61శాతం మంది ఆఫ్రో-బ్రెజిలియన్లు ఉన్నారు. బోల్సనారో మూలాలు ఇటాలియన్‌-జర్మన్‌ జాతీయులవి. జనాభాలో ఉన్న ఈ పొందిక అక్కడ జాత్యహంకార, వివక్ష సమస్యలను కూడా ముందుకు తెస్తున్నాయి. మత రీత్యా 89శాతం మంది క్రైస్తవులు కాగా వారిలో నాలుగింట మూడు వంతులు రోమన్‌ కాథలిక్కులు.

అమెరికా, ఐరోపా దేశాలతో సత్సంబంధాలను కోరుతున్నట్లు లూలా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నాడు.ఒక ఎత్తుగడగా లేదా అనివార్యమైగానీ ఈ దేశాలు వెంటనే స్పందించి అభినందన సందేశాలు పంపాయి. చైనాతో సంబంధాల గురించి ప్రత్యేకంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బోల్సనారో పాలనలో చైనా వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగినప్పటికీ పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఇప్పుడు లూలా వాటితో పాటు ఇతర అంశాలల్లో చైనాతో సంబంధాలకు ముందుకు పోతారని చెబుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌, రష్యా,భారత్‌,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ” బ్రిక్స్‌” బృందం సంబంధాలు మరింతగా విస్తరించవచ్చు. బోల్సనారో ఎంతసేపటికీ పశ్చిమ దేశాలతో కూడిన ఓయిసిడి కూటమి వైపు మొగ్గుచూపాడు.చైనా చొరవతో అమలు జరుపుతున్న బిఆర్‌ఐ పధకంలో భాగంగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో తన పాలనా కాలంలో అమలు జరిపిన సంక్షేమ పధకాలను ఎన్నికల ప్రచారంలో లూలా మరోసారి గుర్తుకు తెచ్చారు.
ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత ఊపు,బలాన్ని ఇస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: