• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Latin America

వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌లో సరికొత్త కుట్ర ?

17 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

#Ecuador's presidential election, #Rafael Correa, Andres Arauz, Ecuador left wing


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా ! సామ్రాజ్యవాదుల ప్రయోగశాల !! వలసల నుంచి ప్రజాస్వామ్య ఖూనీ- ప్రహసనం వరకు జరగని ప్రయోగాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈక్వెడోర్‌లో ఫిబ్రవరి ఏడవ తేదీన అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు తొలి దఫాలో 50శాతానికి పైగా తెచ్చుకోవాలి, లేదా 40శాతానికి మించి తెచ్చుకొంటే సమీప ప్రత్యర్ధికంటే పదిశాతం ఆధిక్యతలో ఉండాలి. జనవరిలో చేసిన సర్వేల ప్రకారం ఆండ్రెస్‌ అరౌజ్‌కు 43శాతంతో ముందుండగా సమీప ప్రత్యర్దులు 25,19శాతాలతో ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నారు.


అధ్యక్ష పదవి ఎన్నికలలో ఎన్నికలలో మొత్తం పన్నెండు మంది పోటీ చేశారు. నలుగురు రెండంకెలకుపైగా ఓట్లు సాధించారు. వామపక్ష ఆండ్రెస్‌ అరౌజ్‌కు 32.7, మితవాద పార్టీ గులెర్మో లాసోకు 19.74, హరిత వామపక్షం అని చెప్పుకొనే యకు పెరెజ్‌కు 19.38, మరో అభ్యర్ధి గ్జేవియర్‌ హెరవాస్‌కు 15.69శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మొరెనా పార్టీ అభ్యర్ధికి కేవలం 1.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీతో ఉన్నట్లు తేలింది. దాంతో తాను విజయం సాధించినట్లు ప్రకటించారు కూడా. ఆ తరువాతే ” లెక్క ” మారిపోయింది.


అక్రమాలు జరిగాయంటూ పచాకుటిక్‌ పార్టీ అభ్యర్ధి యకు పెరెజ్‌ రాజధాని క్విటోలోని కేంద్ర ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశాడు.తనను రెండవ స్ధానానికి చేరకుండా రాఫెల్‌ కొరెయా, ఎన్నికలలో మరో ప్రత్యర్ధి లాసో, మరొక పార్టీనేతలు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించాడు. తనకు 35శాతం రావాల్సి ఉండగా పదిహేనుశాతమే వచ్చేట్లు, తనకు వచ్చే వాటిని ఇతరులకు బదలాయించారని ఆరోపించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరే ఓట్లను అపహరించారని చిందులు వేశాడు.నిజానికి రెండవ స్దానంలో ఉన్న లాసో ఎన్నికల ఫలితాల మీద తనకెలాంటి సందేహం లేదని, అయితే యకు పెరెజ్‌ కోర్కెకు మద్దతుగా తాను కూడా తిరిగి ఓట్ల లెక్కింపు కోరుతున్నట్లు చెప్పాడు.నిజానికి ఈ ఇద్దరూ ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకున్నారు. బ్యాంకరు లాసోకు ఓటు వేయటం కంటే ఒక నియంతకు వేయటం మంచిదని పెరెజ్‌ వర్ణించాడు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే ధోరణి మారిపోవటంతో అక్రమాలు జరిగాయని బెల్జియంలో ఉన్న రాఫెల్‌ కొరెయా ట్వీట్‌ చేశారు. తమ అభ్యర్ధికి 38శాతంపైగా రావాల్సి ఉండగా 31శాతం అని ప్రకటిస్తున్నారన్నారని ఇది అబద్దం అని అందరికీ తెలుసన్నారు.
పార్లమెంట్‌లోని 137 స్ధానాలను మూడు తరగతులుగా విభజించారు. పదిహేను స్దానాలను జాతీయ ప్రాతిపదికన, ఆరింటిలో రెండేసి చొప్పున అమెరికా-కెనడా, లాటిన్‌ అమెరికా, ఐరోపా- ఆసియా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస ఈక్వెడోరియన్లకు, 116 స్దానాలను రాష్ట్రాలలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో అండ్రెస్‌ అరౌజ్‌ నాయకత్వంలోని వామపక్ష పార్టీకి 5,4,40 చొప్పున మొత్తం 49 వచ్చాయి.


అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తగినన్ని ఓట్లు రానందున రెండవ దఫా ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగాల్సి వుంది. ప్రధమ స్దానంలో వామపక్ష అభ్యర్ధి వచ్చినా రెండవ స్ధానంలో తన మద్దతు ఉన్న యకు పెరేజ్‌ రెండవ స్ధానంలో ఉంటారని, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించి గెలిపించవచ్చని అమెరికన్లు తలచారు. అయితే అదికూడా సాధ్యమయ్యేట్లు కనిపించకపోవటంతో సరికొత్త కుట్రకు తెరలేపారు. రెండవ దఫా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేదాని కంటే ఎన్నికలను ఎలా బూటకంగా మార్చుతారనే చర్చ ఇప్పుడు ముందుకు వచ్చింది.

కొన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని మొదట ఆరోపించారు. పెద్ద రాష్ట్రమైన గుయాస్‌లో మొత్తం, మిగిలిన 16 రాష్ట్రాలలో సగం ఓట్ల లెక్కింపు జరపాలని తాజాగా నిర్ణయించారు. ఇక్కడే ప్రహసనానికి నాంది పడింది. మొదటి స్ధానంలో ఉన్న అభ్యర్ధి అభిప్రాయం, అనుమతి, సంప్రదింపులు కూడా లేకుండానే రెండవ, మూడవ స్దానాల్లో ఉన్న అభ్యర్ధులు ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరపటం, వెంటనే ఓట్లను మరోసారి లెక్కించాలని నిర్ణయించటం వెంటవెంటనే జరిగిపోయాయి. దేనికి రెండవ సారి లెక్కింపు జరుపుతున్నారో, ఎంత వ్యవధిలో జరుపుతారో కూడా వెంటనే ప్రకటించలేదు. మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని అసలు ఎన్నికలలోనే పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొరెయాను ఒక తప్పుడు కేసులో ఇరికించి ఆయన పరోక్షంలో ఏకపక్షంగా శిక్ష విధించారు. దాన్ని సాకుగా చూపి కొరెయా, ఆయన నాయకత్వంలోని పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే నామినేషన్లకు మరో 48 గంటల సమయం ఉందనగా కొరెయా మినహా ఇతరులు పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ 3-2 ఓట్ల మెజారిటీతో అనుమతి ఇచ్చింది.


మరోసారి ఓట్ల లెక్కింపు పేరుతో ఏ అక్రమాలకు తెరతీయనున్నదీ చెప్పలేము. అక్రమాల పేరుతో మొత్తం ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించటం, రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని ఏదో ఒక సాకుతో పోటీలో లేకుండా చేయటం. బహుశా దీనికోసమే కొరెయా బలపరిచిన అభ్యర్ది అరౌజ్‌ విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన నిధులను ప్రచారంలో వినియోగించారని కట్టుకధలను మీడియాలో రాయించారు. లెక్కింపును తారుమారు చేసి అమెరికా బలపరచిన యకు పెరేజ్‌ను రెండవ స్దానంలోకి తెచ్చి, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేకులందరనీ వీలైతే ఏకం చేయటం, సాధ్యంగాకపోతే పెరెజ్‌ను అడ్డగోలు పద్దతిలో గెలిచినట్లు ప్రకటించటం. ఇవన్నీ సాధ్యంగాకపోయినా, ప్రజాప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని భావించినా బొలివీయాలో మాదిరి వెనక్కు తగ్గటం, ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. గుయాస్‌ రాష్ట్రంలో ఆండ్రెజ్‌ అరౌజ్‌కు 41.82శాతం ఓట్లు రాగా లాసోకు 25.27, గ్జేవియర్‌ హెరవాస్‌కు 9.94, పెరెజ్‌కు 8.73శాతమే వచ్చాయి. ఇక్కడ మొత్తం ఓట్లను లెక్కించటం ద్వారా కొన్ని ఓట్లను పెరెజ్‌కు బదలాయించినా రెండవ స్ధానంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదూ మొత్తంగా తొత్తడం చేస్తే రెండు మూడు స్దానాల్లో ఉన్నవారు తొలి రెండు స్ధానాల్లోకి వస్తే అరౌజ్‌ అసలు పోటీలో ఉండరు. మొదటి ఇద్దరులో ఎవరు గెలిచినా అమెరికాకు, వామపక్ష వ్యతిరేకులకు ఇబ్బంది లేదు.


ఈక్వెడార్‌ పరిణామాలు వామపక్ష శక్తుల ముందు మరో కొత్త సవాలను ముందుకు తెచ్చాయి. అనేక దేశాలలో పర్యావరణం లేద హరిత ఉద్యమ కార్యకర్తలు, కొన్ని చోట్ల పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడాలని కోరటం ఒక పురోగామి భావన అనటంలో ఎలాంటి సందేహం లేదు, అవసరం కూడా ఉంది.సాధారణంగా ఇలాంటి శక్తులన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి, పర్యావరణం రక్షణ విషయంలో వామపక్షాలు కూడా సానుకూలమే.అందువలన వారితో చేతులు కలపటం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పశ్చిమ దేశాల మీడియా వీరిని హరిత లేదా హరిత వామపక్షాలు అని వర్ణిస్తోంది. ఈక్వెడార్‌లో స్దానిక తెగల నేత కూడా అయిన యకు పెరేజ్‌ను ఈ కారణంగానే హరిత వామపక్ష వాది అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడి నాయకత్వంలోని పార్టీ తీరు తెన్నులను చూసినపుడు వామపక్షాలకు బద్దశత్రువు అయిన అమెరికా పాలకవర్గ ఒళ్లో కూర్చున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


వామపక్ష వాది, ఆర్ధికవేత్త అయిన రాఫెల్‌ కొరెయా 2007 నుంచి 2017వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు.వామపక్ష విధానాలను అమలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పాలకుల హయాంలో చేసిన అప్పు అక్రమం అని మూడు బిలియన్‌ డాలర్లమేరకు చెల్లించేది లేదని ప్రకటించాడు.దాని మీద అంతర్జాతీయ కోర్టుల్లో విచారణ జరిగింది.పర్యవసానంగా అప్పులో 60శాతం పైగా తగ్గింది. రాజ్యాంగ సవరణల కారణంగా 2009లో తిరిగి 2013లో కొరెయా విజయం సాధించారు. లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష నేతలతో చేతులు కలిపారు.2006-16 మధ్య దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 36.7శాతం మందిని 22.5కు తగ్గించారు. అంతకు ముందు రెండు దశాబ్దాలలో జిడిపి వృద్ధి రేటు 0.6శాతంగా ఉన్నదానిని 1.5శాతానికి పెంచాడు. అసమానతలను కొలిచే గిని కోఎఫిసియెంట్‌ 0.55 నుంచి 0.47కు తగ్గింది. 2016లో వచ్చిన భూకంపంలో 650 మంది మరణించారు. ఆస్దినష్టం జిడిపిలో మూడుశాతం ఉంది. దాంతో దేశం మాంద్యంలోకి దిగజారి ప్రభుత్వ ఖర్చులో కోత పెట్టాల్సి వచ్చింది.

రెండు సార్లు అధ్యక్ష పదవిని స్వీకరించిన కారణంగా 2017ఎన్నికలలో కొరెయా పోటీ చేసేందుకు అవకాశం లేకపోయింది.పార్టీ అభ్యర్ధిగా 2007-13 మధ్య ఉపాధ్యక్షుడిగా పని చేసిన లెని(మ్‌)న్‌ మోరెనో పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా అంతకు ముందు అనుసరించిన వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి తిరోగమన విధానాల అమలుకు పూనుకోవటంతో పార్టీలో విబేధాలు వచ్చాయి. కొరెయాను పక్కకు నెట్టి ఆయన మీద అవినీతి కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసేందుకు కుట్ర చేశారు. దాన్ని గమనించి అదే ఏడాది తన భార్యతో కలసి బెల్జియం వెళ్లి తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేశారు. కొరెయా ఉన్నత విద్య అక్కడే జరగటం, ఆయన భార్య బెల్జియం పౌరురాలు కావటంతో అక్కడే ఉండిపోయిరు. కొరెయా అధికారంలో ఉన్న 2012లో ప్రత్యర్ధి ఒకరిని కిడ్నాప్‌ చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. దాని విచారణకు కోర్టుకు హాజరు కాలేదనే పేరుతో కొరియాను అరెస్టు చేయాలని 2018 జూలై 3న న్యాయమూర్తి అదేశించాడు.అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరారు. అయితే ఆయన మీద ఉన్న కేసులు రాజకీయ అంశాలుగా ఉండటంతో తాము అరెస్టు చేయలేమని స్పష్టం చేసింది. తరువాత 2020 ఏప్రిల్‌ 7న ఈక్వెడోర్‌ సుప్రీం కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


లాటిన్‌ అమెరికాలో వామపక్షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర బహిరంగ రహస్యం. అంతర్జాతీయ వార్తా సంస్దల కట్టుకథలు వాటిలో ఒక భాగం. అక్కడ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా మీద తప్పుడువే అయినా కేసులున్నాయి గనుక ఆయనను అడ్డుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన మద్దతుదారులు కొత్త పార్టీని నమోదు చేసేందుకే అవకాశం ఇవ్వని అపర ప్రజాస్వామ్యం అక్కడ ఉంది. గతేడాది ఆగస్టులో కొరెయాకు మద్దతునిచ్చే ఒక పార్టీని ఎన్నికల సంఘం నిషేధించింది. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ను పోటీ చేయకుండా చూసేందుకు చివరి క్షణం వరకు ఒక ఎన్నికల కమిషనర్‌ ప్రయత్నించాడు. చిత్రం ఏమిటంటే ఎన్నికలలో కొరెయా చిత్రాన్ని వినియోగించి అనుకూల ప్రచారం చేయవద్దని నిషేధించిన ఎన్నికల సంఘం రాజకీయ వ్యతిరేకులు తమ ప్రచారంలో కొరెయా చిత్రాన్ని ఉంచి తప్పుడు ప్రచారం చేసేందుకు అనుమతించింది. తప్పుడు కేసులు, అరెస్టులకు సిద్దపడటంతో అనేక మంది కొరెయా మద్దతుదారులు విదేశాలకు వెళ్లిపోయారు.


2017 ఎన్నికలలో కొరెయా బలపరిచిన అభ్యర్ధిగా విజయం సాధించిన మొరెనో అమెరికా చంకనెక్కాడు, కొరెయాకే ఎసరు పెట్టాడు.పదవిలోకి వచ్చినపుడు 77శాతం మంది జనం మద్దతు ఉండగా 2019లో అది ఏడుశాతానిక పడిపోయిందంటే ఎంతగా జనానికి దూరమయ్యాడో తేలిపోయింది. అంతకు ముందు పార్లమెంటులో 74సీట్లు ఉన్న మొరెనో పార్టీ తాజా ఎన్నికలలో ఒక్క స్దానం కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్ధికి తాజా అధ్యక్ష ఎన్నికలలో 1.54శాతం ఓట్లు వచ్చాయి.


పచాకౌటిక్‌(హరిత పార్టీ) నేత యకు పెరెజ్‌ అమెరికా నాయకత్వంలో బొలీవియా, బ్రెజిల్‌, వెనెజులా, నికరాగువాలలో జరిపిన కుట్రలన్నింటినీ సమర్ధించాడు. అతని రాజకీయ చరిత్రను చూస్తే వామపక్ష ముసుగు వేసుకున్న ద్రోహిగా కనిపిస్తాడు. లాటిన్‌ అమెరికాలో అలాంటి శక్తులను అమెరికా ఎందరినో తయారు చేసింది. వారికి అవసరమైన నిధులు, జనాన్ని గందరగోళపరిచేందుకు, వామపక్ష శిబిరాల్లో అనుమానాలు రేపేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డిఐ) అనే సంస్ద ముసుగులో అవసరమైన శిక్షణ ఇచ్చింది. వారికి మద్దతుగా ప్రభుత్వేతర స్వచ్చంద(ఎన్‌జిఓ) సంస్దలను, సిఐఏ ఆధ్వర్యంలోపనిచేసే నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) సంస్ధను ఏర్పాటు చేసింది.2007 అమెరికా ఎన్‌డిఐ పత్రంలో లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చిన పార్టీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి పచాకౌటిక్‌ ఒకటి. మన దేశంలో కూడా అలాంటి ఎన్‌జిఓ శక్తులను చూడవచ్చు. 2016-19 మధ్య ఈక్వెడోర్‌లో ఎన్‌జిఓలకు 50లక్షల డాలర్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఎన్‌ఇడి జాబితా వెల్లడించింది. రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచాకౌటిక్‌ పార్టీ ఆందోళనలు నిర్వహించింది.2010లో కొరెయాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రపోషించింది.

ఒక రెడ్‌ ఇండియన్‌ తెగకు చెందిన యకు పెరెజ్‌ లాటిన్‌ అమెరికా ఐదువందల సంవత్సరాల చరిత్రలో తొలి రెడ్‌ ఇండియన్‌ తెగనేతగా బొలీవియాలో అధికారానికి వచ్చిన ఇవో మొరేల్స్‌ను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదుల బంటు. అనేక మంది కుహనా వామపక్ష వాదుల మాదిరి పెరెజ్‌ సాధారణ జీవనం గడుపుతున్నట్లు కనిపించినా అమెరికా అజెండాలో భాగం తప్ప నిజాయితీతో కూడింది కాదు. ఈక్వెడోర్‌లో ఎక్కువ సంఖ్యలో కార్లు నడపకూడదని, గనులు తవ్వకూడదని, చమురు తీతను పరిమితం చేయాలంటూ కొరెయా పాలనా కాలంలో ఆందోళనలు నిర్వహించాడు. అక్కడ ఉన్న చమురు, ఖనిజ నిల్వలను వెలికి తీసి పేద దేశంగా ఉన్న ఈక్వెడోర్‌ను అభివృద్ది చేసేందుకు పూనుకున్న కొరెయా మీద కుట్రలో పెరెజ్‌ భాగస్వామి. ఇలాంటి తమ బంటును గద్దెనెక్కించేందుకు చేస్తున్న కుట్రను ఈక్వెడోరియన్లు సాగనిస్తారా ?
” ఎవరైనా కొరెయా తరఫున అభ్యర్ధులుగా పోటీ చేసేట్లయితే వారు పెద్ద ముప్పుకొని తెచ్చుకున్నట్లే ఇంకా దేశం విడిచిపోకపోయినా, కేసుల్లో శిక్షలు పడకపోయినా వ్యవస్ధ వారి మీద కన్నేసి ఉంచుతుంది అని కేంద్ర కాబినెట్‌ కార్యదర్శి స్వయంగా బెదిరింపులకు దిగాడు. అనివార్య పరిస్ధితుల్లో ఒక వేళ వామపక్ష అభ్యర్ధి అభ్యర్ధి ఎన్నికైనా పై బెదిరింపులను చూసినపుడు ఏదో ఒక సాకుతో అధికారంలో కొనసాగనిచ్చే అవకాశం ఉంటుందా ?చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పార్లమెంట్‌లోనూ ఆధిపత్యం- వెనెజులా సంక్షోభాన్ని మదురో నివారిస్తారా !

15 Tuesday Dec 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), Venezuela Elections 2020


ఎం కోటేశ్వరరావు


మూడు వందల మంది అంతర్జాతీయ పరిశీలకులు 34దేశాల నుంచి వచ్చారు, దేశీయంగా వివిధ పార్టీలు, సంస్ధలకు చెందిన వారు వెయ్యి మంది పరిశీలకులు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. అయినా సరే డిసెంబరు ఆరున జరిగిన వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికలను తాము గుర్తించేది లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాల నేతలు ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ వారసులు అంతకంటే ఏమి చెబుతారు ! వెనెజులా జాతీయ అసెంబ్లీ( పార్లమెంట్‌)లోని 277 సీట్లకు గాను దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో నాయకత్వంలోని వామపక్ష కూటమి 253 స్ధానాలను గెలుచుకుంది. దీనిలో ఐక్య సోషలిస్టు పార్టీ ప్రధాన పక్షం కాగా మరో తొమ్మిది చిన్న పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పాల్గొన్న ప్రతిపక్షాలకు 21, మరోమూడు స్ధానాలు స్ధానిక తెగలకు వచ్చాయి. ఈ ఫలితాలు అమెరికా కుట్ర విఫలం అయిందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఎన్నికల వరకు అధికార సోషలిస్టు పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ తాజా ఎన్నికలలో విడిగా పోటీ చేసి 2.73శాతం ఓట్లు, ఒక స్ధానాన్ని పొందింది.ఈ ఎన్నికలలో 107 పార్టీలు, 14వేల మంది అభ్యర్దులు పాల్గొన్నారు. పోటీ చేసిన 107లో మదురోను వ్యతిరేకించే పార్టీలు 97 ఉన్నాయి.


మదురో నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలోని శక్తులు చేయని కుట్ర లేదు. మదురో ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదన్న విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో ఉన్న ప్రతిపక్షం తాజా ఎన్నికలలో తమకు ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.ఫలితాలను తాము గుర్తించేది లేదని చెప్పింది. డిసెంబరు తొమ్మిదిన అమెరికా దేశాల సంస్ద (ఓయేఎస్‌) సమావేశంలో వెనెజులా ఎన్నికలను గుర్తించరాదని బ్రెజిల్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా, కెనడా, చిలీ, ఈక్వెడోర్‌ తదితర దేశాలు సమర్దించగా అర్జెంటీనా, మెక్సికో, బొలీవియా దూరంగా ఉన్నాయి.
లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, తదితర దేశాలలో వామపక్ష శక్తులు గత రెండు దశాబ్దాల కాలంలో సంక్షేమ చర్యలను అమలు జరిపి విజయాలతో పాటు వాటికి ఉన్న పరిమితుల కారణంగా తలెత్తే అసంతృప్తి వలన పరాజయాలను చవిచూస్తున్నాయి. తమ దోపిడీ నిరాఘాటంగా కొనసాగేందుకు అమెరికా తదితర ధనిక దేశాలు లాటిన్‌ అమెరికా సమాజాల మీద మిలిటరీ, నిరంకుశ శక్తులను రుద్దాయి. వాటికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో ఆ శక్తులను వ్యతిరేకించే కమ్యూనిస్టు, వామపక్ష, ఇతర శక్తులన్నీ ఏకమైన కారణంగానే అడ్డుకోగలిగాయి. ఆ క్రమంలోనే ఎన్నికల విజయాలు పొందాయి. జనానికి అనేక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుస విజయాలు సాధించాయి. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల హర్షామోదాలు పొందాయి. వాటిని కూడా అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాల వెన్నుదన్ను ఉన్న కార్పొరేట్‌ శక్తులు సహించలేదు. అందుకే ఆ ప్రభుత్వాలను కూలదోసేందుకు చేయని యత్నం లేదు. ఆ క్రమంలో ఛావెజ్‌ వంటి వారు ఆ కుట్రలకు వ్యతిరేకంగాలాటిన్‌ అమెరికాలో కలసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టేందుకు ప్రయత్నించి కొంత మేర సఫలం అయ్యారు.


అయితే ఛావెజ్‌ లేదా ఇతర దేశాల్లోని నాయకత్వం అమలు జరిపిన చర్యలన్నీ నయా ఉదారవాద విధానాల పునాదుల మీద నిర్మితమైన పెట్టుబడిదారీ వ్యవస్ధల పరిధిలోనే అన్నది గమనించాలి.వాటికి ఉన్న పరిమితుల కారణంగా జనంలో తలెత్తే అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు, దాని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టేందుకు అమెరికా పెద్ద ఎత్తున వామపక్ష వ్యతిరేకశక్తులకు అన్ని విధాలా సాయం అందించింది. గతంలో మాదిరి మిలిటరీ నియంతృత్వాన్ని రుద్దే అవకాశాలు లేకపోవటంతో అధికారానికి వచ్చిన మితవాదశక్తులు వామపక్ష, ప్రజాతంత్ర పాలకుల కంటే మెరుగైన చర్యలు తీసుకోవటంలో విఫలం కావటంతో అర్జెంటీనా వంటి చోట్ల తిరిగి వామపక్ష శక్తులు అధికారానికి రాగలిగాయి. బొలీవియాలో ఎన్నికైన సోషలిస్టు ఇవోమొరేల్స్‌ను పదవి చేపట్టకుండా అడ్డుకొని అంతం చేస్తామని బెదిరించి విదేశాలకు వెళ్లేట్లు చేశారు. అయితే అధికారాన్ని ఆక్రమించుకున్న శక్తులు ఏడాది పాలనలో మొరేల్స్‌ కంటే మెరుగైన పాలన అందించలేవని రుజువు కావటంతో జనం తిరిగి మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ పార్టీకి పట్టం కట్టారు.

వెనెజులాలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. మదురో ఏలుబడిలో అనేక తీవ్ర సమస్యలను జనం ఎదుర్కొంటున్నా, ప్రతిపక్ష మితవాద శక్తులు అధికారానికి వస్తే తమపరిస్ధితి మరింత దిగజారుతుందనే భయం జనంలో ఉంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు పొందిన ప్రతిపక్ష పార్టీ నేత జువాన్‌ గురుడో 2018లో జరిగిన ఎన్నికలలో విజేత అయిన మదురోను తాను గుర్తించనని, పార్లమెంట్‌ తననే అధ్యక్షుడిగా ఎన్నుకున్నదని 2019లో ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా మరికొన్ని దేశాలు ప్రకటించాయి. అనేక రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడినా జనంలో ఎలాంటి మద్దతు కనిపించలేదు. మరింత పరాభవం తప్పదని గ్రహించిన కారణంగానే ఈ నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో పోలింగ్‌ 30.5శాతం అని అధికారికంగా ప్రకటించారు. మదురో నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ కూటమికి 277కు గాను 253, డెమోక్రటిక్‌ యాక్షన్‌ పార్టీకి 11, మరో రెండు పార్టీలకు మూడేసి చొప్పున ఒక పార్టీకి రెండు, కమ్యూనిస్టు పార్టీ, మరొక పక్షానికి ఒక్కొక్కటి వచ్చాయి.ఓటర్లు ఇంత తక్కువగా ఎందుకు పాల్గ్గొన్నారనేది ఒక ప్రశ్న. ఓటర్లలో ఉత్సాహం లేకపోవటానికి ఒక ప్రధాన కారణం ప్రతిపక్షం బహిష్కరణ ప్రకటనతో ఎలాగూ గెలిచేది అధికార పక్షమే అన్న నిర్లిప్తత ఒకటి. దీనితో పాటు మదురో సర్కార్‌ మీద అసంతృప్తి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే దేశంలో పరిస్ధితి ఆర్ధికంగా దిగజారటంలో లక్షలాది మంది దేశం వదలి వెళ్లారు. వారి పేర్లు కూడా జాబితాలో ఉంటాయి. మొత్తంగా చూసినపుడు తాత్కాలికంగా అయినా సామ్రాజ్యవాదుల కుట్రలు విఫలం అయ్యాయి.అమెరికా కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మదురోను హత్య చేసిన వారికి 15మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా సంస్ధలు ప్రకటించాయి. ఈ కారణంగా తాజా ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆయన ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకొనేదీ రహస్యంగా ఉంచారు.

ఎన్నికలు సక్రమంగా జరగలేదనేందుకు ఓటర్లు తక్కువగా పొల్గొనటమే నిదర్శనమని సాకులు చెబుతున్నారు. వెనెజులా తరువాత రోజు జరిగిన ఎన్నికలలో రుమేనియాలో 33, ఇటీవలి కాలంలో ఇతర దేశాలలో ఈజిప్టులో 28, మాలీ 35, జమైకా 38, జోర్డాన్‌ 30, జార్జియాలో 26శాతం చొప్పున నమోదైంది. వీటికి లేని అభ్యంతరం వెనెజులాకు ఎందుకు ? 2005 వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికల్లో కనిష్టంగా 25శాతమే నమోదైన రికార్డు ఉంది. అంతెందుకు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎన్నడూ నలభై శాతానికి అటూఇటూగానే ఉంటున్నది. వెనెజులాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే 50లక్షల మంది(నాలుగోవంతు) జనం కనీస సౌకర్యాలు లేక విదేశాలకు వెళ్లారని గతంలో చెప్పారు. అది కూడా ఓటింగ్‌ తగ్గటానికి ఒక ప్రధాన కారణమే కదా !


ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసిందన్న సందేహం సహజంగానే కలుగుతుంది. దాని మంచి చెడ్డల చర్చను పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ మాటల్లోనే కొన్ని అంశాలను చూద్దాం. డిసెంబరు 14వ తేదీ పార్టీ పత్రిక ” పాపులర్‌ ట్రిబ్యూన్‌ ”లో కొన్ని ముఖ్య అంశాల సారాంశం ఇలా ఉంది. వెనెజులాలో ప్రజాబాహుళ్య విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ, ఇతర రాజకీయ, సామాజిక శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను జనం ముందుంచటానికే ప్రాధాన్యత ఇచ్చింది.2018లో అధ్యక్ష ఎన్నికల సమయంలో మదురో నాయకత్వంలోని ఐక్య సోషలిస్టు పార్టీ-కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి దాని ప్రాతిపదికగా పోటీ చేయాలన్నది సారాంశం. అయితే ఆ ఒప్పందంలోని అవగాహన అంశాలకు విరుద్దంగా మదురో ప్రభుత్వం వ్యవహరించింది. యజమానులతో కార్మికులు చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వ ఉత్తరువు ద్వారా రద్దు చేసింది. దాంతో కార్మికులు అనేక సంక్షేమ చర్యలను కోల్పోయారు. కార్మిక సంఘాలు నిరసన తెలిపటాన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నారు. అణచివేత చర్యలకు అనుమతించారు. ప్రయివేటీకరణలకు పెద్ద పీటవేశారు. భూములను యజమానులకు తిరిగి ఇచ్చివేశారు. రైతులను భూముల నుంచి తొలగించి యజమానులకు అనుకూలంగా కేసులలో ఇరికిస్తున్నారు. ఈ నేపధ్యంలో కార్మికులు-రైతాంగ ప్రయోజనాల రక్షణకు పోరాడేందుకుగాను పాలక సోషలిస్టు పార్టీ కూటమితో విడగొట్టుకొని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసింది.అనేక అననుకూలతలు, అధికార మీడియాలో తగిన అవకాశాలు ఇవ్వకపోవటం, ప్రయివేటు మీడియాలో, ఇతరంగా ప్రచారానికి నిధుల కొరత వంటి సమస్యలను కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొన్నది. పోలైన ఓట్లలో 2.73శాతం పొందింది. సీట్ల కోసమే కమ్యూనిస్టు పార్టీ పని చేసినట్లయితే సోషలిస్టు పార్టీ కూటమిలో ఉంటే ఎక్కువ సీట్లు పొంది ఉండేవారమని,వాటికోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టదలచ లేదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. దామాషా ప్రాతికన సీట్లు కేటాయించే పద్దతి అవలంభించి ఉంటే 277 స్ధానాల్లో ఇప్పుడు వచ్చిన ఒకటికి బదులు తమకు ఏడు లేదా ఎనిమిది వచ్చి ఉండేవని, అధికార సోషలిస్టు పార్టీ 69శాతం ఓట్లు తెచ్చుకొని 91శాతం సీట్లు పొందిందని కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగేరా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికలను గుర్తించేది లేదని ప్రకటించిన అమెరికా, దాని నాయకత్వంలోని దుష్ట కూటమి రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలకు తెరలేపనుందో చూడాల్సి ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు వెనెజులాను ఇబ్బందుల పాలు చేస్తున్నది వాస్తవం. దాని వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కుట్రలను అధిగమించే క్రమంలో గత పార్లమెంటులో ప్రతిపక్షం మెజారిటీలో ఉండి అనేక చర్యలకు ఆటంకాలు కలిగించింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించినందున మదురో జనానికి ఉపశమనం కలిగించే చర్యలు ఏ మేరకు తీసుకుంటారు, పరిస్దితిని ఎలా చక్కదిద్దుతారు అన్నది ఆసక్తి కలిగించే అంశం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బొలీవియా మాస్‌ విజయం 2.0 – ప్రభుత్వం ముందు పెను సవాళ్లు !

25 Sunday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Bolivia’s 2020 election, Evo Morales, Luis Arce, MAS-Bolivia


ఎం కోటేశ్వరరావు


అనేక అనుమానాలు, సందేహాలకు తెరదించుతూ శుక్రవారం(అక్టోబరు 23వ తేదీ) రాత్రి లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియా ఎన్నికల సంఘం అధ్యక్ష, పార్లమెంట్‌ ఉభయ సభల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీనేత ఇవోమొరేల్స్‌ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారణ అయింది. అమెరికా పన్నిన కుట్రలో భాగంగా నానా యాగీ, ఆరోపణలు చేసిన అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) పరువుపోయింది. దాని ప్రధాన కార్యదర్శి ఆల్‌మాగ్రో రాజీనామా చేయాలనే వత్తిడి పెరిగింది. తమ మద్దతుదార్లను అడుగడుగునా రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన వలలో చిక్కకుండా మాస్‌ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అనేక చోట్ల కార్యకర్తలు, నేతలపై దాడులు, తప్పుడు కేసులతో వేధించటం, ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిని సరిగా సరఫరా చేయకపోవటం వంటి అనేక అక్రమాలకు తాత్కాలిక ప్రభుత్వం పాల్పడింది.


మాస్‌ పట్ల జనంలో తిరుగులేని విశ్వాసం వ్యక్తం కావటం ప్రపంచంలోని యావత్‌ వామపక్ష శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది, బాధ్యతను మరింతగా పెంచింది. మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్‌సికి పోలైన ఓట్లలో 55.1శాతం, ప్రత్యర్ధి కార్లోస్‌ మెసాకు 28.83, మూడవ అభ్యర్ధి ఫెర్నాండో కామ్చోకు 14శాతం వచ్చాయి. పార్లమెంట్‌ దిగువ సభలోని 130 స్ధానాల్లో మాస్‌ పార్టీకి 73, మిగతా రెండు పార్టీలకు 41,16 చొప్పున వచ్చాయి. ఎగువ సభలోని 36 స్ధానాలలో మాస్‌కు 21, రెండు, మూడు స్ధానాల్లో ఉన్న పార్టీలకు 11,4 చొప్పున వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చేనెల మధ్యలో ప్రమాణస్వీకారం చేయనుంది. దేశంలో 73లక్షల మంది ఓటర్లలో 60ఏండ్ల లోపు వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది, ఈసారి 88శాతం పోలింగ్‌ జరిగింది.


గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మితవాదశక్తులు హింసాకాండకు పాల్పడ్డాయి. అసలు గత ఏడాది ఎన్నికలు జరగ ముందే బొలీవియా ఎన్నికలను తాము గుర్తించబోమని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదని అమెరికా, బ్రెజిల్‌, కొలంబియా మరికొన్ని దేశాల మితవాద పాలకులు ప్రచారం ప్రారంభించారు. అనివార్యమై జరిపిన ఈ ఎన్నికల్లో మితవాద శక్తులు ఒకే అభ్యర్ధిని నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అయితే వాటి మధ్య ఉన్న అధికార యావ కారణంగా సాధ్యం కాలేదు. మాస్‌ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించనుందని సర్వేలు వెల్లడించినా తగినన్ని ఓట్లు రాక రెండవదఫా ఎన్నికల్లో పోటీలో నిలిచే మితవాద అభ్యర్ధి విజయం సాధిస్తాడనే అంచనాతో ఈ సారి ఆశక్తులు ఉన్నాయి. మరొక ప్రధాన కారణం తటస్ధ ఓటర్లకు ఆగ్రహం తెప్పించకుండా వారి ఓట్లను ఆకర్షించాలనే ఎత్తుగడ కూడా దాడులకు పాల్పడకుండా నిలువరించిందని చెబుతున్నారు. గత ఏడాది కుట్రదారులు గద్దెనెక్కిన తరువాత తమకు ప్రత్యర్ధులు అనుకున్నవారి మీద పెద్ద ఎత్తున దాడులు చేయటంతో భయవాతావరణం ఏర్పడి ఎన్నికల ముందు 20శాతం ఓటర్లు తామెవరికి ఓటు వేసేది నిర్ణయించుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తప్పించుకొనేందుకే వారలా చెప్పారని, చడీచప్పుడు లేకుండా పోలింగ్‌లో తమ నిర్ణయాన్ని మాస్‌కు అనుకూలంగా తీసుకున్నారని నిర్ధారణ అయింది. ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు ఎదురుకావటంతో కొన్ని చోట్ల ఈ శక్తులు విధ్వంసకాండ సృష్టించేందుకు అక్రమాలు జరిగాయంటూ ప్రదర్శనలు చేశాయి. అయితే అమెరికా దేశాల సంస్ధ, ఇతర పరిశీలకులు అలాంటివేమీ లేవని ప్రకటించటంతో వెనక్కు తగ్గాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయం సాధించినట్లు ప్రకటించగానే పోలీసు, మిలిటరీ కుట్రచేసి అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించేందుకు అనేక చోట్ల బ్యాలట్‌ బాక్సులు, ఎన్నికల కార్యాలయాలను దగ్దం చేసి ఇవో మొరేల్స్‌ మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. అది కుట్ర అని, మాస్‌ పార్టీకి జనంలో మద్దతు ఉందని ఈ ఎన్నికలు నిర్ధారించాయి. మితవాదులు వెనక్కు తగ్గటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


దిగజారిన ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరుస్తామని మాస్‌ వాగ్దానం చేసింది. అయితే దాని ప్రత్యర్ధి పార్టీలు మెజారిటీగా ఉన్న రెడ్‌ ఇండియన్‌ తెగల పట్ల అనుసరించే దురహంకార ధోరణులు, ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రకటించలేకపోవటం, శ్వేత జాతి, మిశ్రమ రంగు జాతీయుల ఓట్లకోసం వెంపర్లాడటం తప్ప మెజారిటీ జనాన్ని పట్టించుకోకపోవటం మితవాద శక్తుల ఓటమికి దోహదం చేసిన కారణాలలో కొన్ని. మితవాద పార్టీలు రెండూ అమెరికా అనుకూలశక్తులుగా జనం గుర్తించటం, అమెరికా,ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందటం, ఇవోమొరేల్స్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్ర వెనుక వారి హస్తం ఉందన్న అంశాలు కూడా మాస్‌ విజయానికి దోహదం చేశాయి. కరోనా కేసులు విపరీతంగా ఉండటం, ఆరోగ్యశాఖ మంత్రి మెర్సిలో వెంటిలేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిదొరికిపోయి అరెస్టు కావటం వంటి పరిణామాలు కుట్రదారుల ప్రభుత్వం అంటే ఏమిటో జనానికి స్పష్టమైంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటం తప్ప ఉపాధి కోల్పోయిన వారికి ఎలాంటి సాయం అందించకపోవటంతో కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొలీవియా ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ, మితవాద శక్తుల దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, వారు అధికారానికి వస్తే ఉన్న సంక్షేమ చర్యలను కూడా తిరగదోడతారనే విషయం ఓటర్లకు స్పష్టమైంది.


కొత్త ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనాను అదుపు చేయటం వాటిలో ఒకటి. ఈ ఏడాది జిడిపి 6.2శాతం తిరోగమనంలో ఉంటుందని అంచనా. అందువలన దిగజారిన ఆర్దిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం, సామాన్యులకు ఉపశమనం కలిగించటం, జాత్యహంకార శ్వేతజాతి, పచ్చి మితవాద శక్తులను అదుపు చేయటం, అన్నింటికీ మించి అమెరికా కుట్రలను ఎదుర్కోవటం వంటి అంశాలున్నాయి. పద్నాలుగు సంవత్సరాల ఇవో మొరేల్స్‌ పాలనలో గ్యాస్‌, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్‌, గనులను జాతీయం చేయటం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రయివేటు రంగానికి లోబడే చేశారు. ఈ పరిమిత చర్యల కారణంగా కూడా దేశ ఆదాయం పెరిగింది. ఇవో మొరేల్స్‌ అధికారానికి రాక ముందు ప్రయివేటు రంగంలోని పెట్రోలియం, గ్యాస్‌ క్షేత్రాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన వార్షిక ఆదాయం 73 కోట్ల డాలర్లు కాగా వాటిని జాతీయం చేసిన తరువాత 495 కోట్లకు పెరిగింది.దాంతో చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా 60శాతంగా ఉన్న పేదరికం 35కు తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా కారణంగా తిరిగి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. స్దానిక తెగల భాషలతో స్కూళ్లలో బోధన ప్రారంభించారు. బొలీవియాలో పండించే కోకాతో ఔషధాలతో పాటు కొకెయిన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే మాస్‌ ప్రభుత్వం రాక ముందు మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో యంత్రాంగం కోకా రైతుల జీవితాలను నాశనం చేసింది. మొరేల్స్‌ అధికారానికి వచ్చాక కోకా సాగును చట్టబద్దం చేశాడు.మాదక ద్రవ్యాల నిరోధానికి తగుచర్యలు తీసుకున్నారు.


గత పదకొండు నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఆర్ధికరంగం దిగజారింది. నిరుద్యోగం 4.2 నుంచి 12శాతానికి చేరింది, నిర్మాణ రంగం వంటి వాటిలో 30శాతం ఉంది. ఉత్పత్తి 16శాతం పడిపోయింది. ద్రవ్యలోటు ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. దారిద్య్రం, సంపద కేంద్రీకరణ పెరిగింది.ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుకు బహుళజాతి కంపెనీల హస్తం ఉంది. మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిల్వలకు బొలీవియా కేంద్రం. ప్రపంచ మొత్తం నిల్వల్లో అక్కడ 25 నుంచి 45శాతం వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయటం కంటే బ్యాటరీలు తయారు చేసి ఎగుమతి చేయటం మరింత లాభసాటిగా ఉంటుందని, ఆ వచ్చే సొమ్ముతో దారిద్య్రనిర్మూలనతో పాటు సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. అక్కడ ఉన్న ఖనిజంతో ఏడాదికి నాలుగు లక్షల బ్యాటరీలను తయారు చేయవచ్చని అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్ధ ఒక ప్రకటన చేసిన తరువాత ఎన్నికలు జరగటం, ఇవోమొరేల్స్‌ ఘనవిజయం సాధించటం, కుట్ర చేసి తొలగించటం తెలిసిందే. అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల కుట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లిథియం శుద్దికి మొరేల్స్‌ సర్కార్‌ జర్మనీతో కుదుర్చుకున్న సంయుక్త పధకాన్ని రద్దుచేయటం ఒకటి.
లూయీస్‌ ఆర్‌సి నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆచితూచి ప్రకటన చేశారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన హింసాకాండ, హత్యలకు బాధ్యులైన వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? 36 మంది మరణించగా 800మందికి పైగా గాయపడ్డారు. మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గుతేలుస్తారా ? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మితవాదశక్తులు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. దాన్నెలా ఎదుర్కొంటారు ? ఇవో మొరేల్స్‌ అర్జెంటీనా ప్రవాసం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.కుట్రదారులు మోపిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందా లేక విచారణ కొనసాగించి నిజం లేదని నిగ్గుతేలుస్తుందా అన్నది స్పష్టం కాలేదు.


ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు తాజా ఎన్నికల్లో విజయం లభించినప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాలలో మాస్‌ ప్రభుత్వ నడక నల్లేరు మీద బండిలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పలేము. పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాస్‌ పార్టీ ఆర్ధిక రంగంలో లాటిన్‌ అమెరికాలోని మిగతా వామపక్ష పాలిత దేశాలలో మాదిరి నయాఉదారవాద పునాదులను కదిలించలేదు. కొన్ని సంక్షేమ చర్యలు తీసుకొని ఉపశమనం కలిగించటం తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధ ముందుకు తెచ్చిన అసమానత, దోపిడీలను అవి నివారించలేవు. వాటికి ఉన్న పరిమితులు కూడా ఏమిటో గత రెండు దశాబ్దాల అనుభవం వెల్లడించింది. అమెరికాతో కుమ్మక్కయిన పోలీసు, మిలిటరీ, మితవాద శక్తుల కుట్రలకు బొలీవియాలో తాత్కాలికంగా తెరపడింది. అవి తిరిగి మరోమారు తలెత్తలేవని చెప్పలేము. దానికి గాను పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంది.అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆదమరవకుండా అమెరికా కుట్రలను నిరంతరం కనిపెట్టటంతో పాటు విధానపరమైన మార్పులను చేపట్టి పురోగమించటం ఎలా అనే అతిపెద్ద సవాలు ఆ పార్టీ ముందు ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా కుట్రలకు చెంపదెబ్బ – బొలీవియా వామపక్ష జయకేతనం !

20 Tuesday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia Election 2020, Evo Morales, Jallalla Bolivia, Luis Arce, Movement toward Socialism-MAS


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 18, ఆదివారం నాడు జరిగిన బొలీవియా అధ్యక్ష, పార్లమెంట్‌ ఎన్నికల్లో వామపక్ష ” మాస్‌ ” పార్టీ విజయం సాధించింది. పోలింగ్‌ అనంతర సర్వేలో 53శాతం ఓట్లతో వామపక్ష అభ్యర్ధి లూయిస్‌ ఆర్‌సి విజయం సాధించనున్నట్లు వెల్లడైంది. ఇది రాస్తున్న సమయానికి 40శాతం ఓట్ల లెక్కింపు జరిగినట్లు ఆర్‌సి 45శాతంతో ముందుండగా 35శాతం సాధించిన ప్రత్యర్ధి మాజీ అధ్యక్షుడు కార్లోస్‌ మెసా తన ఓటమిని అంగీకరించినట్లు వాయిస్‌ అమెరికా తెలిపింది. ఎన్నికలలో విజేతను గుర్తిస్తానని, విజయాన్ని గుర్తించటమే ప్రజాస్వామ్యానికి తగినదన్నారు. ఎన్నికలలో లూయీస్‌ ఆర్‌సి విజయాన్ని ఇరాన్‌ అభినందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. బొలీవియాలో సంబంధాలను పునరుద్దరించి పటిష్ట పరుచుకొనేందుకు సిద్దమని చెప్పాడు.


పట్టణ ప్రాంతాల ఓట్లు తొలుత లెక్కించగా ఇద్దరూ పోటా పోటీగా ఉన్నారని, ఇవో మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ (మువ్‌మెంట్‌ ఫర్‌ సోషలిజం-సోషలిజం కోసం ఉద్యమం) పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని పట్టు ఉన్నందున మెజారిటీ పెరగనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం తొలి దఫాలోనే యాభైశాతంపైగా తెచ్చుకున్నా లేదా నలభైశాతంపైగా తెచ్చుకొని ప్రత్యర్ధికంటే పదిశాతం కంటే మెజారిటీలో ఉన్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే తొలి రెండు స్ధానాల్లో ఉన్న అభ్యర్ధుల మధ్య రెండవ దఫా ముఖాముఖీ పోటీ నిర్వహిస్తారు.
అనేక కుట్రలు, కరోనా కారణంగా మూడు సార్లు వాయిదా పడి చివరకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 25నాటికి పూర్తై ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఏడాది క్రితం పోలీసులు, మిలిటరీ, మితవాద రాజకీయశక్తులు కలసి పన్నిన కుట్ర కారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన మాస్‌ నేత ఇవోమొరేల్స్‌ పదవికి రాజీనామా చేసి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే రోజు వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నందున అధికారికంగా ప్రకటించే వరకు ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఇతరంగా కుట్రలు జరిపి ఫలితాలను తారు మారు చేసే అవకాశాలను ఇప్పటికీ తోసి పుచ్చలేము. ఎగ్జిట్‌ పోల్స్‌ కార్యరూపం దాల్చితే గతేడాది ఇవో మొరేల్స్‌ కంటే ఎక్కువ ఓట్లతో మాస్‌ పార్టీ విజయం సాధించనుంది.


ఆదివారం నాడు ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే ఫలితాలను వెల్లడించేందుకు పౌర సమాజం, కాథలిక్‌ చర్చి ఏర్పాటు చేసిన స్వతంత్ర సర్వే సంస్ధలు, మీడియాకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవటం, తొలి లెక్కింపు వివరాలను వెల్లడించకపోవటం అనేక అనుమానాలకు దారితీసింది. అక్రమ పద్దతుల్లో గద్దెనెక్కిన అమెరికా అనుకూల తాత్కాలిక అధ్యక్షురాలు జీనీ అనెజ్‌ బలపరచినట్లు ప్రచారం జరిగిన అభ్యర్ధికి కేవలం 14శాతమే వస్తాయని తేలటంతో ఆమె ఓటమిని అంగీకరించటం, ఇతర ప్రతికూల పరిణామాలేవీ లేకపోవటంతో మాస్‌ తిరిగి అధికారాన్ని చేపట్టటం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా అనుకూల శక్తుల కుట్రలను ఊహించలేము.


కొన్ని చోట్ల తగిలిన ఎదురు దెబ్బల తరువాత ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులకు వచ్చిన అతిపెద్ద విజయం, మితవాద శక్తులకు, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాకూ పెద్ద ఎదురుదెబ్బ. అంతే కాదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వామపక్ష శక్తులకు ఎంతో ఉత్తేజమిచ్చే పరిణామం. ఈ ఫలితాలు అమెరికా పెత్తందారీ పోకడలకు చెంపదెబ్బ. నవంబరు మూడవ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడిని మరింతగా దెబ్బతీస్తాయి. ఎగ్జిట్‌, ఓట్ల లెక్కింపు తొలి ఫలితాలు వెలువడగానే రాజధాని లాపాజ్‌లో మాస్‌ పార్టీ మద్దతుదారులు సంబరాలను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని గమనంలో ఉంచుకొని జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాస్‌ అభ్యర్ధి ఆర్‌సి ప్రకటించారు. పార్టీ మద్దతదారులు, ఇతరులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.


కోటీ పదహారు లక్షల మంది జనాభా ఉన్న బొలీవియాలో స్ధానిక గిరిజన తెగల జనాభా మెజారిటీ ఉన్నప్పటికీ, స్పెయిన్‌ వలస, స్వతంత్ర పాలన ఐదువందల సంవత్సరాలలో 2006లో ఇవోమొరేల్స్‌ విజయం సాధించే వరకు మెజారిటీ సామాజిక తరగతికి చెందిన వారు పాలనా పగ్గాలు చేపట్టలేకపోయారు. మొరేల్స్‌ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలో కుట్ర చేసి ఎన్నికల ఫలితాలను గుర్తించేందుకు నిరాకరించటంతో పాటు పార్లమెంట్‌ ద్వారా తాత్కాలిక అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. తాను తిరిగి ఎన్నికలను నిర్వహిస్తానని, కొత్త ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని మొరేల్స్‌ చెప్పినా అంగీకరించలేదు. రాజీనామా చేయాలని, తదుపరి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనేందుకు వీల్లేదని మిలిటరీ అధికారులు ఆదేశించారు. చివరకు అరెస్టు చేసి జైలు పాలు చేసే కుట్రను గ్రహించి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందారు. మొరేల్స్‌ అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్‌ అభ్యర్ధిగా కూడా పోటీ చేయకూడదని కుట్రదారుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలలో ఆయన ప్రభుత్వంలో పదేండ్లకు పైగా ఆర్ధిక మంత్రిగా పని చేసిన లూయీస్‌ ఆర్‌సి అభ్యర్ధిగా ఎంపికయ్యాడు. ఎన్నికల ఫలితాల సరళి వెలువడగానే తాను స్వదేశానికి రానున్నట్లు మొరేల్స్‌ ప్రకటించాడు. మొరేల్స్‌ మీద చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి.


వామపక్షాల స్ధానంలో అధికారానికి వచ్చిన మితవాద శక్తులు అంతకు ముందు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు ఎలా గండికొడుతున్నారో చూసిన తరువాత బొలీవియన్లు మితవాదుల ప్రచారాన్ని పట్టించుకోలేదన్నది స్పష్టం అవుతోంది. అయితే నయావుదారవాద పునాదులను బద్దలు చేయకుండా వాటి మీద ఆధారపడి తీసుకొనే సంక్షేమ చర్యలకు పరిమితులు ఏర్పడి జనంలో అసంతృప్తి తలెత్తుతున్నట్లు అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. బొలీవియాలో ఏర్పడనున్న నూతన మాస్‌ ప్రభుత్వం ప్రతిపక్షం, అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రల మధ్య ఆ సవాళ్లను ఎలా స్వీకరించనున్నది చూడాల్సి ఉంది.
ఇవో మొరేల్స్‌ను ఆధికారం నుంచి తొలగించటం లాటిన్‌ అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మూలమలుపు అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించిన విషయం తెలిసిందే. కానీ అదే ట్రంప్‌ హయాంలో మాస్‌ ప్రతినిధి తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాడు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుడిగా అదే ట్రంప్‌ చరిత్ర చెత్తబుట్టకు ఎక్కనున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఎలాంటి పరిహాస ప్రాయమైన వాదనలతో కుట్రదారులు వ్యవహరిస్తారో బొలివీయా పరిణామం స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో లెక్కింపు ప్రారంభంలో ప్రత్యర్ధికంటే ఇవోమొరేల్స్‌ మెజారిటీ 7.87శాతమే ఉందని, తరువాత 10.15శాతంగా ప్రకటించారని, తరువాత దాన్ని 10.52కు పెంచి మొరేల్స్‌ గెలిచినట్లు ప్రకటించారని ఆక్రమాలకారణంగానే ఇలా జరిగిందని అమెరికా కనుసన్నలలో నడిచే అమెరికా దేశాల సంస్ధ (ఓఏఎస్‌) ఆరోపించింది. ఎన్నికలకు ముందే ఈ సంస్ధతో పాటు ఐరోపా దేశాల ప్రతినిధులు అక్రమాల గురించి ప్రచారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీకారణంగానే గత ఎన్నికలలో చివరిలో మోరెల్స్‌ అవసరమైన మెజారిటీ సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా అదే ధోరణి వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది మాస్‌కు మెజారిటీ వస్తున్న సమయంలో వివరాలను వెల్లడించకుండా నిలిపివేసి తరువాత ప్రకటించటంతో పెద్ద తేడా రావటాన్ని కూడా ఎన్నికల అక్రమంగానే కుట్రదారులు ఆరోపించారు. అయితే తరువాత వాటికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు.


తాజా ఎన్నికలో మాస్‌ పార్టీ విజయం సాధించనుందని తొలి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. మితవాద శక్తుల మధ్య ఉన్న వివాదాలను సర్దుబాటు ఒకే అభ్యర్ధిని పోటీకి నిలపాలని ప్రయత్నించారు. అయితే రెండవ అభ్యర్ధి రంగంలోకి దిగాడు. తొలి విడత ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాతో దిగిన మితవాద శక్తులకు మలివిడత ఎన్నికలతో పని లేకుండానే బొలీవియన్లు నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేల ప్రకారం ఆర్‌సికి 42.3, మెసాకు 33.1, మూడవ అభ్యర్ధికి 16.7శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. మెసాకు మద్దతుగా అనెజ్‌ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది మొరేల్స్‌కు 47శాతం వచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం లూయీస్‌ ఆర్‌సికి 52.4శాతం, కార్లోస్‌ మెసాకు 31.5, మూడవ పార్టీకి 14.1శాతం వస్తాయని వార్తలు వెలువడ్డాయి.
గతంలో తాము నడచిన బాటనే ముందుకు పోవాలని దేశ ప్రజలు ఈ తీర్పు నిచ్చారని ఆర్‌సి వర్ణించారు. ఇవో మొరేల్స్‌ మాదిరి ప్రజా ఉద్యమాల నుంచి నేతగా ఆవిర్భవించనప్పటికీ ఒక మేథావిగా మాస్‌ ఎత్తుగడలు, విధానాలను నిర్ణయించటంలో ఆర్‌సి కీలకపాత్ర వహించారు. అనేక సంస్కరణలకు కీలకవ్యక్తిగా మారటమే కాదు మొరేల్స్‌ తరువాత ప్రజల అభిమానం పొందారు. గత ఏడాది కాలంలో కుట్రదారుల ప్రభుత్వం అనుసరించిన అక్రమాలు, అవినీతి కారణంగా బొలివీయన్లు రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించారు. 2002 నుంచి జరిగిన బొలీవియా ఎన్నికలు, అనంతర పరిణామాలను చూసినపుడు రెండు శిబిరాలుగా రాజకీయ సమీకరణలు జరిగాయి. తాము వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చినపుడు వారికి సమస్యలు సృష్టించేందుకు మితవాదులు చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఇవో మొరేల్స్‌ను అడ్డుకోవటం పరాకాష్ట. ఈ కారణంగానే ఈ సారి కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని, ఏదో ఒకసాకుతో మిలిటరీ రంగంలోకి దిగవచ్చని జోశ్యం చెప్పిన వారు కూడా ఉన్నారు.


మాస్‌ పార్టీ నేతగా ఇవో మొరేల్స్‌ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన కొచబాంబా ప్రాంతం ఉన్న చపారే రాష్ట్రంలో, ఇతర చోట్ల పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గత ఏడాది కాలంలో తాత్కాలిక ప్రభుత్వం పాల్పడని తప్పుడు పని లేదు. సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించి మాస్‌ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద దాడులు చేయించారు. చమురు ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం కలిగించారు. మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో పోలీసులతో గ్రామాల మీద దాడులు చేయించారు. మిలిటరీని ప్రయోగించి భయపెట్టారు. మొరేల్స్‌ వ్యతిరేకులకు పెద్ద ఎత్తున నిధులు అందచేసి తప్పుడు ప్రచారం చేయించారు. ఈ ఎన్నికల్లో అనేక మంది మాస్‌ అభ్యర్దులను పోటీకి అనర్హులుగా ప్రకటించారు. పోటీలో ఉన్నవారి మీద పోలీసు దాడులు చేయించారు. అంతెందుకు అధ్యక్ష పదవికి పోటీపడిన ఆర్‌సిని అనేక సార్లు అనర్హునిగా ప్రకటిస్తామని బెదరించారు. మితవాద శక్తులు ఎన్నికల సంఘం మీద వత్తిడి తెస్తూ నిరసన ప్రదర్శనలకు దిగాయి. మీడియా సంగతి చెప్పనవసరం లేదు. మాస్‌ పార్టీకి వ్యతిరేకంగా మితవాదశక్తులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఉన్నది ఉన్నట్లు రాస్తారు, చూపుతారు అని అనుమానం వచ్చిన స్దానిక, విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు. టెలిసుర్‌, ఆర్‌ టీవీ ఛానల్స్‌ ప్రసారాల అనుమతులను రద్దు చేశారు.పదిహేను సామాజిక రేడియోలను మూయించారు. కొందరు జర్నలిస్టుల మీద కుట్ర అనుకూల మూకలను ఉసిగొల్పారు.
అన్నీ సక్రమంగా జరిగితే కొత్తగా తిరిగి ఏర్పడే మాస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున జరిపే అవకాశాలున్నాయి. క్యూబా,వెనెజులా, నిగరాగువా మరికొన్ని దేశాల ఆధినేతలు అతిధులుగా అర్జెంటీనా ప్రవాసం నుంచి తిరిగి వచ్చే ఇవోమోరేల్స్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చునని చెబుతున్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదులు ఈ పరిణమాన్ని సహిస్తారా ? మాస్‌ విజయాన్ని వమ్ము చేయకుండా ఉంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా సాయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మోడీ తక్కువ ఇచ్చారా ?

20 Wednesday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Greek, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic package, imran khan, Narendra Modi, narendra modi vs imran khan, World Bank on covid-19 packages

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సోషలిస్టు తాతయ్యకే మద్దతు అంటున్న అమెరికా మనవళ్లు !

19 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, capitalism or socialism, chin peng, Nicolás Maduro, Pedro Sanchez, Venezuela, Young People Embracing Socialism

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉరుగ్వే ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ !

28 Thursday Nov 2019

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Uncategorized

≈ Leave a comment

Tags

Daniel Martínez, Luis Lacalle Pou, the Uruguay runoff election results, Uruguay runoff election results

Image result for great eagerness about the Uruguay run-off election results

డేనియల్‌ మార్టినెజ్‌                                    లూయీస్‌ లాసలే

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాల దేశమైన ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠనెల కొన్నది. అక్టోబరు27నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమెజారిటీ ఓట్లు రాకపోవటంతో ఈనెల 24న అత్యధిక ఓట్లు తెచ్చుకున్న రెండు పార్టీల మధ్య అంతిమ పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 49.38శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష మితవాద నేషనల్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 51.62శాతం ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఓట్ల పరంగా తేడా 28,666 మాత్రమే. ఇవిగాక మరో 34,500 నిర్ణయాత్మక ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీంతో తుది ఫలితాన్ని వెల్లడించటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఉరుగ్వే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఓటరు నిర్ణీత పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయలేని పక్షంలో సరైన కారణాలు చూపి మరొక చోట ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సాధారణంగా గత ఎన్నికలలో అలాంటి ఓట్ల లెక్కింపుతో పని లేకుండానే స్పష్టమైన మెజారీటీ తెచ్చుకోవటంతో అభ్యర్ధుల అంతిమ ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు పైన చెప్పుకున్నట్లుగా మెజారిటీ కంటే నిర్ణయాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిని కూడా లెక్కించిన తరువాత గానీ ఫలితం తేలదు. ఇటువంటి పరిస్దితి ఏర్పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
అక్టోబరు 27న జరిగిన తొలి దఫా ఓటింగ్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.49, ప్రతిపక్ష సమీప అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 29.70, మరో రెండు మితవాద పార్టీలకు 12.80, 11.46శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మొత్తం 11 పార్టీలు పోటీ చేశాయి. రాజ్యాంగాన్ని సవరించి నూతన ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెచ్చిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలో బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలి సారి మాత్రమే తొలిదఫాలోనే మెజారిటీ తెచ్చుకొని విజయం సాధించింది. గత రెండు ఎన్నికలలో రెండవ దఫా జరిగిన ఎన్నికలలోనే ఆ పార్టీ అభ్యర్దులు , జోస్‌ ముజికా, డేనియల్‌ మార్టినెజ్‌ విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో డేనియల్‌ మార్టినెజ్‌కు తొలి దఫా ఎన్నికల్లో 49.45శాతం ఓట్లు రాగా తుది ఎన్నికల్లో 56.63శాతం వచ్చాయి. 2009 ఎన్నికల్లో మాజీ గెరిల్లా దళనేత జోస్‌ ముజికా తొలిదశలో 49.36 శాతం, రెండవ సారి 54.63శాతం ఓట్లతో విజయం సాధించారు. బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలిసారిగా అధికారానికి వచ్చిన 2004ఎన్నికల్లో అభ్యర్ధిగా ఉన్న తబరే వాజ్‌క్వెజ్‌ తొలిసారే 51.67శాతం ఓట్లతో విజయం సాధించారు.
గత మూడు ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలిదఫా ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 50శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు అంకెలు వెల్లడించాయి. రెండవ దఫా ఎన్నికల్లో మితవాత శక్తులను వ్యతిరేకించే శక్తులు బ్రాడ్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వటంతో గత రెండు సార్లు విజయం సాధించారు. ఈ సారి తొలి దఫా ఎన్నికల్లోల్లోనే బ్రాడ్‌ ఫ్రంట్‌కు గతంతో పోల్చితే తొమ్మిదిశాతం వరకు ఓట్లు తగ్గాయి. ఈ సారి మితవాద శక్తులను ్యవతిరేకించే ఓట్లను పెద్దగా రాబట్టలేకపోయిందని స్పష్టమైంది. ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు జోస్‌ అరోసియేనా ఒక ప్రకటన చేస్తూ నిర్ణయాత్మక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఈనెల 28 లేదా 29న ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. అయితే వచ్చిన ఓట్లను బట్టి తాను విజయం సాధించినట్లు ప్రతిపక్ష అభ్యర్ధి లూయీస్‌ లాసలే ప్రకటించారు. అధికారిక ప్రకటన వరకు వేచి చూడాలని తన అభిమానులతో చెప్పారు. ‘మనలను భూ స్ధాపితం చేయాలని వారు చూశారు, అయితే మనం గరిక వంటి వారమని వారికి తెలియదు. దేశంలో అసాధారణ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. అంతిమ ఫలితం వెలువడే వరకు వేచి చూద్దాం ‘ అన్నారు.
అధ్యక్ష ఎన్నికలతో పాటు 30 స్ధానాలున్న సెనెట్‌, 90 స్ధానాలున్న పార్లమెంట్‌కు కూడా పోలింగ్‌ జరిగింది. రద్దయిన సెనెట్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు 15 సీట్లు ఉండగా ఇప్పుడు 13కు తగ్గాయి. పార్లమెంట్‌లో 90కి గాను 50 స్ధానాలుండగా ఇప్పుడు 42 సీట్లతో పెద్ద పార్టీగా ముందుంది. గతంలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని కొలరాడో పార్టీ ఈ సారి 13, కొత్తగా ఏర్పడిన ఓపెన్‌ కాబిల్డో పార్టీ 11 స్ధానాలను తెచ్చుకుంది. ఈ సమీకరణాలను బట్టి మితవాద శక్తులు పార్లమెంట్‌ రెండు సభల్లోనూ మెజారిటీ సాధించినట్లయింది.
రెండవ దఫా ఎన్నికలకు ముందు మితవాద శక్తులన్నీ ఏకం కావటం, సామాజిక మాధ్యమం, సంప్రదాయ మీడియాలో పెద్ద ఎత్తున వామపక్ష, ప్రజాతంత్ర బ్రాడ్‌ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా విషప్రచారాన్ని సాగింది. వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని సైనిక, పోలీసు బలగాలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారంటే ప్రచారం ఏ తీరున సాగిందో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మరో దే శమైన బొలీవియాలో మిలిటరీ, పోలీసు బలగాలు అక్కడి వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ను రాజీనామా చేయాల్సిందిగా వత్తిడి, తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావంతో పాటు అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో మితవాద శక్తులు పై చేయి సాధిస్తున్న అంశాలు, కుట్రలు కూడా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
గత పదిహేను, ఇరవై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాలు అనేక విజయాలు సాధించాయన్నది నిర్వివాదాంశం. అయినా ఇటీవల కొన్ని దేశాలలో ఎదురు దెబ్బలు కూడా తిన్నాయి. పదిహేను సంవత్సరాల పాటు బ్రాడ్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉండి అస్తవ్యస్ధంగా ఉన్న దేశ పరిస్ధితులను చక్కదిద్దటంలో ఎంతో కృషి చేసింది. విద్య, ఆరోగ్య, గృహరంగాలలో, దారిద్య్ర నిర్మూలనలో ఎన్నో విజయాలు సాధించింది. ద్రవ్యోల్బణానికి మించి వేతనాలు, పెన్షన్లను పెంచటంతో పాటు కార్మికులకు అనేక హక్కులను కలిగించింది. క్రైస్తవమతం వైపు నుంచి ఎంతగా వ్యతిరేకత వెలువడినా స్వలింగ వివాహాలను అనుమతించటంతో పాటు స్త్రీ పురుషులు కాని వారికి హక్కులను వర్తింప చేయటం, కొన్ని ప్రత్యేక పరిస్దితులలో అబార్షన్లను అనుమతించటం, వివాహసమానత్వాన్ని గుర్తించటం వంటి పురోగామి చర్యలు అమలు జరిపింది.
లాటిన్‌ అమెరికాలో నియంతలు, నిరంకుశపాలనతో పాటు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలుగా అక్కడి దేశాలను మార్చారు. ఫలితంగా జనం ముఖ్యంగా కార్మికవర్గం అనేక విధాలుగా దోపిడీకి గురైంది. నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తిన పూర్వరంగంలో తలెత్తిన సామాజిక ఉద్యమాలు అనేక చోట్ల వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటానికి దోహదం చేశాయి. ఉన్నంతలో సంక్షేమ పధకాలను అమలు జరిపి ఎంతో స్వాంత్వన చేకూర్చాయి. అందువల్లనే పదిహేను, ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో మనగలిగాయి. అయితే నయా ఉదారవాద విధానాల నుంచి సంపూర్ణంగా వెనక్కు మళ్లకుండా, అదే వ్య వస్ద మీద సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యం కాదు అనే అంశం ఇప్పుడు ప్రతి చోటా వ్యక్తం అవుతోంది.
ఉరుగ్వేలో 175 సంవత్సరాల పాటు మితవాద కొలరాడో లేదా నేషనల్‌ పార్టీలు, మిలిటరీ అధికారులు అధికారంలో ఉన్నారు. తొలిసారిగా 2004లో బ్రాడ్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఉరుగ్వేలో 2015వరకు ఆర్ధిక వృద్ధిసాగింది. దారిద్య్రం 39.9 నుంచి 9.7శాతానికి పడిపోయింది. దుర్భరదారిద్య్రం 4.7 నుంచి 0.3శాతానికి తగ్గింది. తరువాత కాలంలో ఇంకా తగ్గింది. లాటిన్‌ అమెరికా మొత్తంగా చూస్తే అత్యంత తక్కువ స్ధాయికి గినీ కోఎఫిసియెంట్‌ సూచిక 0.46 నుంచి 0.38కి పడిపోయింది. అయినప్పటికీ నయా వుదార విధాన పునాదులు అలాగే ఉన్న కారణంగా సంపద కేంద్రీకరణ పెరిగింది. ఆఫ్రో-ఉరుగ్వేయన్లు, యువతలో దారిద్య్ర పెరుగుదల కనిపించింది.శ్వేత జాతీయుల కంటే పదిశాతం ఎక్కువ మంది ఈ సామాజిక తరగతిలో దారిద్య్రంతో ఉన్నారు.లాటిన్‌ అమెరికా దేశాలను ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మార్చివేసిన పూర్వరంగాన్ని చూస్తేనే అక్కడి సమస్యలను అర్ధం చేసుకోగలం.2017లో మాడ్రిడ్‌ నుంచి వెలువడే ఎల్‌ పాయిస్‌ అనే పత్రిక వివేచన గల ఉరుగ్వే వామపక్ష అద్భుతం పేరుతో అక్కడి బ్రాడ్‌ ఫ్రంట్‌ సర్కార్‌ సాధించిన విజయాలను పేర్కొన్నది.
అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు కొనసాగుతున్న పూర్వరంగంలో ఎగుమతి ఆధారిత వ్యవస్దలు గల దేశాలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉరుగ్వేలో కొన్ని దశాబ్దాల తరువాత ఎనిమిది సంవత్సరాల క్రితం 6.3శాతానికి నిరుద్యోగం పడిపోయిన తరువాత ఇటీవలి కాలంలో తిరిగి ఎనిమిది శాతానికి పెరిగింది. అనేక సంస్ధలు ఉద్యోగులను తీసుకోవటం గణనీయంగా తగ్గించాయి. సంక్షేమ పధకాలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఇటీవలి కాలంలో అనేక తరగతుల్లో అసంతృప్తి పెరిగింది. పదిహేను సంవత్సరాల తరువాత తొలిసారిగా మితవాద నేషనల్‌ ఫ్రంట్‌ వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ విధానాల కారణంగానే నిరుద్యోగం, ప్రతికూల ఆర్ధిక సమస్యలు పెరుగుతున్నాయనే దాడి ప్రారంభించింది. దీనికి మీడియా కూడా తోడైంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తొలిసారిగా అసమానతలు, దారిద్య్రం పెరుగుతున్నట్లు వెల్లడైంది. సామాజిక వ్యవస్ధల నిర్మాణమే దీనికి కారణమని తేలింది. బ్రాడ్‌ ఫ్రంట్‌లో ఉన్న పార్టీలకు చెందిన కొందరు అవినీతికి పాల్పడటం కూడా ఫ్రంట్‌ ప్రభ మసకబారటానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. 2017లో రావుల్‌ సెండిక్‌ జూనియర్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి అవినీతి కేసులలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసిన తరువాత కొందరు మేధావులు చేస్తున్న సూచనలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. వామపక్షాలు స్వల్పకాలిక కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడా ఒకే సమయంలో పని చేయాల్సి ఉంది. ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత ప్రతి నెలాఖరుకు కార్మికులు, ఇతర పేదలకు ఏమి కావాలో సమకూర్చటం మీదే కేంద్రీకరించి దీర్ఘకాలిక లక్ష్యా లను మరవకూడదన్నదే వాటి సారాంశం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలు-పర్యవసానాలు !

30 Wednesday Oct 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Argentina elections, Bolivarian Revolution, Latin America, Lenín Moreno, neoliberalism, Neoliberalism in Latin America

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: